breaking news
Protective equipment
-
హాకీలో కొత్త నిబంధన అమల్లోకి..
అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్(ఎఫ్ఐహెచ్) హాకీలో కొత్త నిబంధన అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై పెనాల్టీ కార్నర్ను అడ్డుకునే సందర్భంలో ఆటగాళ్లు ఫేస్గేర్(హెల్మెట్లు) ధరించేందుకు అనుమతి ఇచ్చింది. అయితే బంతి 23 మీటర్ల దూరం దాటిన తర్వాత ఆటగాళ్లు ఫేస్గేర్ను తప్పనిసరిగా తొలగించాలని రూల్లో పేర్కొంది. అంతకుముందు పెనాల్టీ కార్నర్లను డిఫెండ్ చేసే ఆటగాళ్ళు బంతి ఫ్లిక్ అయిన వెంటనే సర్కిల్ లోపలే ఫేస్గేర్ను తీసేయాల్సి ఉండేది. తాజాగా హాకీ నిబంధనలోని రూల్ 4.2 ప్రకారం నిబంధనను సవరించినట్లు హాకీ ఫెడరేషన్ సంఘం ట్విటర్లో పేర్కొంది. కాగా డిసెంబర్ 2021లో భువనేశ్వర్లో జరిగిన జూనియర్ హాకీ మెన్స్ వరల్డ్కప్లో పెనాల్టీ కార్నర్ రూల్లో ఆటగాళ్లకు ఫేస్గేర్ను ట్రయల్గా అమలు చేశారు. దీనిపై హాకీ కోచ్లు, క్రీడాకారులు, ఇతర అధికారుల నుంచి మంచి ప్రయత్నమంటూ విశేష స్పందన రావడంతో అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ ఈ నిబంధనను కొనసాగిస్తూ తాజాగా అమల్లోకి తెచ్చింది. -
నరకానికి నకలు!
రక్షణ పరికరాలు ఇవ్వరు చావబాది పని చేయిస్తారు తాజాగా ఓ కార్మికుడి మృతితోవెల్లడవుతున్న వాస్తవాలు ఇబ్రహీంపట్నం, న్యూస్లైన్ : ఇబ్రహీంపట్నంలోని ఎన్టీటీపీఎస్ కోల్ విభాగంలో కాంట్రాక్టు కార్మికులు ఎంత దీనావస్థలో పనిచేస్తున్నారో పై అంశాలు తేటతెల్లం చేస్తున్నాయి. అక్కడి పని ప్రదేశంలో అధికారులు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో వెల్లడవుతోంది. కార్మికులను గొడ్డుల్లా పనిచేయించుకోవడం.. కనీస విలువ కూడా ఇవ్వకపోవడం.. రక్షణ చర్యలు తీసుకోకపోవడం.. రక్షణ పరికరాలు కూడా అందించకపోవడం బట్టి చూస్తే అక్కడి పని పరిస్థితులు ఎంత ఆందోళనకరస్థితిలోఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రమాదం అంచున విధినిర్వహణ... స్థానిక ఎన్టీటీపీఎస్లోని కోల్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు నిత్యం ప్రమాదం అంచున విధులు నిర్వహిస్తున్నారు. ఒకవైపు అధికారుల నుంచి మానసిక ఒత్తిళ్లు, మరోవైపు ప్రమాదాల నడుమ దినదినగండంగా రోజులు వెళ్లదీస్తున్నారు. ఎన్టీటీపీఎస్ కోల్ విభాగంలో 200 మంది వరకు కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. రక్షణ పరికరాలు లేకపోవడంతో నిత్యం ప్రమాదాలతో వారు సహవాసం చేస్తున్నారు. మూడేళ్ల క్రితం కన్వేయర్ బెల్టుకు మరమ్మతులు నిర్వహిస్తున్న పామర్తి వెంకటేశ్వరరావు (40) మృతి చెందాడు. 1995లో వసంతరావు (30) అనే కార్మికుడు వ్యాగన్ గూడ్స్ బోగీ ఢీకొని చనిపోయాడు. 500 మెగావాట్ల యూనిట్ నిర్మాణంలో పనులు నిర్వహిస్తూ నలుగురు కార్మికుల వరకు ప్రమాదాలకు గురై మృతిచెందారు. మూడో దశలో కోల్ విభాగంలో పనిచేస్తున్న మాబూ (50) అనే మహిళ మూడు నెలల క్రితం గాయాలపాలైంది. వారికి నష్టపరిహారం మాత్రం సక్రమంగా ఇవ్వలేదు. తాజాగా శుక్రవారం సందిపాము రవికుమార్ (34) అనే కార్మికుడు యంత్రంలో పడి నలిగి మృతిచెందాడు. కార్మికులపై కొరడా... కొందరు అధికారులు కార్మికులపై కొరడా ఝుళిపిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నిరోజులైనా ఎన్టీటీపీఎస్లో కార్మికుల హక్కులను కాలరాస్తున్నారు. పనికి తగ్గ వేతనం ఇవ్వకపోగా తమకు నచ్చినవిధంగా పనిచేయించుకోవడం కోసం చేయిచేసుకోవడానికీ తెగబడుతున్నారని పలువురు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం తాను చెప్పిన విధంగా చేయలేదన్న కోపంతో ఏడీఈ భాష్కరరావు మృతుడు రవిని చితకబాది పనిచేయించాడని కార్మిక సంఘాలే ఆరోపించాయి. అప్పటికే మానసిక స్థైర్యాన్ని కోల్పోయిన రవి ఆ ఒత్తిడిలో ప్రమాదానికి గురై చనిపోయాడని తెలిపారు. గత మూడు రోజులుగా వేధింపులకు గురిచేస్తున్న ఏడీఈ భాస్కరరావే బలవంతంగా ప్రమాదంలో చనిపోయేలా చేశారన్న ఆరోపణలు కూడా కార్మికుల నుంచి వినవస్తున్నాయి. ప్రమాదం జరగ్గానే చల్లగా జారుకున్న ఏడీఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ఇంజినీర్ల అసోసియేషన్ నుంచి రూ.5 లక్షలు చొప్పున ఇవ్వడానికి అంగీకరించారు. ఈ విధంగా కొందరు అధికారుల తీరుతో కార్మికులు బలైపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా తమ సంక్షేమం పట్టించుకోవాలని కార్మికులు కోరుతున్నారు. అధికారులు పక్షపాత ధోరణి వీడాలి కోల్ విభాగంలో అనేక మంది కార్మికులు ప్రమాదాలబారిన పడుతున్నారు. ఎన్టీటీపీఎస్లో ప్రమాద కేంద్రాలను గుర్తించి పటిష్టమైన రక్షణ చర్యలు తీసుకోవాలి. రక్షణ పరికరాలు ఇవ్వడంపై దృష్టిపెట్టాలి. - చింతా శ్రీకృష్ణబాబు, కార్మిక నాయకుడు తప్పకుండా చర్యలు తీసుకుంటా.. ఎన్టీటీపీఎస్లో ప్రమాదాలు జరగకుండా ఇక మీదట ప్రత్యేక దృష్టి పెడతాం. అన్ని పని ప్రదేశాలనూ పరిశీలించి రక్షణ చర్యలపై అడిగి తెలుసుకుని అందుకనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం. - జె.సమ్మయ్య, చీఫ్ ఇంజినీర్ రక్షణ పరికరాలేవీ? కార్మికులకు రక్షణ పరికరాలు సరిగా ఇవ్వడం లేదనేది ప్రధాన ఆరోపణ. నిబంధనల ప్రకారం బొగ్గు విభాగంలో పనిచేసే కార్మికులకు తలకు హెల్మెట్, చేతులకు గ్లౌజ్లు, కాళ్లకు బూట్లు, ముక్కుకు మాస్క్ వంటి పరికరాలు ఇవ్వాల్సి ఉంది. కార్మికులు ప్రమాదాలకు గురవకుండా ఆయా ప్రదేశాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. పని ప్రదేశంలో రక్షణ చర్యల గురించి ఆరా తీయాలి. ప్రస్తుతం కార్మికులకు ఇవ్వాల్సిన రక్షణ పరికరాలు ఇస్తున్నారా లేదా అనేదానిపై కూడా అధికారులు ఆరా తీయడం లేదు.