breaking news
province status
-
గిల్గిత్ బాల్టిస్తాన్పై పాక్ పన్నాగం
నక్కజిత్తుల మారి పాకిస్తాన్ మరోసారి భారత్పై కయ్యానికి కాలు దువ్వుతోంది. గిల్గిత్ బాల్టిస్తాన్ను ప్రావిన్స్గా మార్చి ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమవుతోంది. ఆ ప్రాంత ప్రజలు పాక్ పాలన మాకొద్దు మొర్రో అన్నా వినిపించుకోవడం లేదు. చైనా అండదండలతో రెచ్చిపోతూ ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి కొత్త ఎత్తులు వేస్తోంది. భారత్ సార్వభౌమత్వానికే సవాల్ విసురుతోంది. దీంతో ఏడు దశాబ్దాల నాటి వివాదం మళ్లీ రాజుకుంది. చుట్టూ పచ్చని కొండలు, గలగల పారే సెలయేళ్ల మధ్య ఉన్న అందాల లోయ గిల్గిత్ బాల్టిస్తాన్. హాలీవుడ్ థ్రిల్లర్ వెర్టికల్ లిమిట్ వంటి సినిమా షూటింగ్లు జరిగిన భూతల స్వర్గం లాంటి ప్రాంతం. జమ్మూకశ్మీర్లో అంతర్భాగం. కానీ 1947 దేశ విభజన సమయంలో పాకిస్తాన్ ఆక్రమించిన 78,114 చదరపు కిలోమీటర్ల కశ్మీరంలో ఉత్తరాన ఈ భూభాగం ఉంది. వివాదాస్పదమైన ఈ ప్రాంతాన్ని ఇన్నాళ్లూ పాకిస్తాన్ పాలనాపరమైన అవసరాల కోసం వాడుకుంది. ఇప్పుడు ఏకంగా ఆ ప్రాంతాన్ని సంపూర్ణ ప్రావిన్స్గా మార్చి (పూర్తి స్థాయి రాష్ట్ర హోదా) నవంబర్ 15న ఎన్నికల్ని నిర్వహించడానికి సిద్ధమవు తోంది. సిం«ధ్, పంజాబ్, బలూచిస్తాన్, ఖైబర్ ఫంక్తున్వా తర్వాత అయిదో ప్రావిన్స్గా గిల్గిత్ బాల్టిస్తాన్ను ప్రకటించడం కోసం త్వరలోనే పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్ ఆ ప్రాంతంలో పర్యటించనున్నారు. భారత్పై ఆధిపత్యం కోసం ఆ ప్రాంత ప్రజల మనోభావాలను కూడా లెక్కచేయకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోనున్నారు. ఇలా చేయడంవల్ల పాక్కి లాభం కూడా లేదు. భారత్తో తగాదాల కోసం చైనాతో చేతులు కలిపిన పాక్ అంతర్జాతీయ నిబంధనల్నీ తుంగలో తొక్కుతోంది. గత ఏడాది ఆగస్టులో జమ్మూకశ్మీర్ స్వయంప్రతిపత్తిని నిర్వీర్యం చేస్తూ మోదీ సర్కార్ నిర్ణయం తీసుకు న్నాక గిల్గిత్ బాల్టిస్తాన్ను లద్దాఖ్లో అంతర్భాగంగా చూపిస్తూ మ్యాప్లు విడుదల చేసింది. అప్పట్నుంచి కడుపు మంటతో రగిలిపోతున్న పాక్ గిల్గిత్ బాల్టిస్తాన్ను దురాక్ర మణ చేయాలన్న దుస్సాహసానికి దిగుతోంది. చైనా చెప్పు చేతల్లో... చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) ఈ ప్రాంతం మీద నుంచే వెళుతుంది. ఓ రకంగా చెప్పాలంటే సీపీఈసీకి గేట్ వేలాంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతానికి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించి రాజకీయంగా, చట్టపరంగా పాక్ పట్టు బిగిస్తే, చైనా ఈ ప్రాంతంలో బలపడడానికి అవకాశం వస్తుంది. వాస్తవాధీన రేఖ వెంబడి కర్కోరమ్ పాస్ చేరుకోవడానికి భారత్ నిర్మించిన డర్బక్–షయోక్–డీబీఓ రహదారికి గిల్గిత్ బాల్టి స్తాన్తో సంబంధం ఉంది. పాకిస్తాన్, గిల్గిత్ బాల్టిస్తాన్లకి చైనా చేరుకోవాలంటే కరకోరమ్ మార్గం అత్యంత కీలకం. అందుకే ఆ రహదారి నిర్మాణం పూర్తయిన దగ్గర్నుంచి వాస్తవాధీన రేఖ వెంబడి ఘర్షణలకు తెరతీసిన చైనా ఇప్పడు పాక్ వెనకాలే ఉండి గిల్గిత్ కుంపటిని రాజేస్తోంది. పీఓకే అంతా మాదే: భారత్ గిల్గిత్ బాల్టిస్తాన్ను ప్రావిన్స్గా మార్చి రాజకీయంగా పట్టు సాధించడానికి పాక్ చేస్తున్న కుయుక్తుల్ని ఎట్టి పరిస్థితిల్లోనూ సహించబోమని భారత్ ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు పంపింది. అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా పాక్ అడుగు ముందుకు వేసినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని విదేశాంగ శాఖ హెచ్చరికలు చేసింది. పీఓకేలోని ప్రతీ అంగుళం భూమి భారత్కే చెందుతుందని స్పష్టం చేసింది. అదో బంగారు గని గిల్గిత్ బాల్టిస్తాన్ అందాలు కనువిందు చేసే పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు అదొక ఖనిజాల గని. బంగారం, పచ్చలు వంటివి పుష్కలంగా లభించే ప్రాంతం. అయినప్పటికీ ఆ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. అనునిత్యం మిలటరీ ఉక్కు పాదాల కింద నలిగిపోతూ పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ది చెందలేకపోయింది. ప్రపంచంలోనే రెండవ ఎత్తయిన పర్వత శిఖరం కె–2 ఇక్కడే ఉంది. బౌద్ధ శిల్పాలకు నిలయం. జనాభా 12 లక్షల మంది వరకు ఉంటారు. షియా కమ్యూనిటీకి చెందినవారు ఎక్కువ. చరిత్రలోకి చూస్తే.. గిల్గిత్ బాల్టిస్తాన్కి మొదట్నుంచి ఒక దశ, దిశ లేదు. పాక్ తాను ఆక్రమించుకున్న కశ్మీర్ నుంచి 1949లో ఈ ప్రాంతాన్ని వేరు చేసి పాలనాపరమైన అవసరాల కోసం వాడుకుంది. 1963 మార్చిలో ఈ ప్రాంతంలో 5,180 చదరపు కి.మీ భూభాగాన్ని చైనాకి ధారాదత్తం చేసింది. 2009లో మళ్లీ గిల్గిత్ బాల్టిస్తాన్కు స్వయంపాలనాధికారం కల్పించింది. అప్పట్లోనే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిబంధనల మేరకు కార్యనిర్వాహక తరహా ప్రభుత్వ ఏర్పాటు కావాలన్న డిమాండ్లు వినిపించాయి. కానీ పాక్ ఆ ప్రాంతంలో చైనా సహకారంతో భారీ ఎత్తున హైడల్ పవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి దిగింది. ఆ నిర్మాణాలను స్థానికులు వ్యతిరేకించడంతో ఆ ప్రాంతంపై తన పట్టును వదలకుండా ఉంచుకుంది. -
పీఓకేకు ప్రావిన్సు హోదా.. భారత్లో కలవరం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)కు పాకిస్తాన్ ప్రావిన్సు హోదాను ఇవ్వనుంది. పీఓకేను పాకిస్తాన్లో గిల్గిత్-బాల్టిస్ధాన్గా పిలుస్తారు. హోదాను కల్పిస్తే పాకిస్తాన్లో ఐదో ప్రావిన్సుగా అవతరిస్తుంది గిల్గిత్-బాల్టిస్ధాన్. ఈ మేరకు పాకిస్తాన్ మంత్రి రియాజ్ హుస్సేన్ జియో టీవీకి ఇచ్చిన ఇంటర్వూలో ప్రకటన చేశారు. పీఓకేను ప్రావిన్సుగా మార్చాలని కొద్ది రోజుల క్రితం విదేశాంగ శాఖ సలహాదారు సర్తాజ్ అజీజ్ సూచించినట్లు చెప్పారు. చైనా-పాకిస్తాన్ స్నేహమే పీఓకేను ప్రత్యేక ప్రావిన్సుగా ప్రకటించడం వెనుక ఉన్న ప్రధాన కారణంగా తెలుస్తోంది. పాకిస్తాన్లో చైనా చేపట్టిన చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడర్(సీపీఈసీ) పీఓకే గుండా పోతుంది. భారత్-పాకిస్తాన్లకు స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి పీఓకేపై మనస్పర్దలు ఉన్నాయి. సమస్యాత్మక ప్రాంతంలో బిలియన్ల డాలర్లు కుమ్మరించడానికి చైనా సంశయించింది. దీంతో పెట్టుబడులు కావాలంటే ప్రత్యేక ప్రావిన్సుగా గిల్గిత్-బాల్టిస్ధాన్ను ప్రకటించాలని చైనా పాక్పై ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలిసింది. కాగా, పీఓకేను ప్రావిన్సుగా చేసేందుకు రాజ్యాంగ సవరణ కూడా చేస్తామని రియాజ్ హుస్సేన్ పేర్కొన్నారు. పాక్లో ప్రస్తుతం బలూచిస్ధాన్, ఖైబర్ ఫక్తూఖ్వా, పంజాబ్, సింధ్లు ప్రావిన్సులుగా ఉన్నాయి. భారత్ పాకిస్తాన్లు రెండుగా విడిపోవడానికి ముందు కశ్మీర్ను రాజా హరిసింగ్ పాలించేవారు. ఇరు దేశాలు స్వతంత్రం పొందిన తర్వాత కశ్మీర్ పాక్లో అంతర్భాగమేనని ఆ దేశం అంటుండటంతో కశ్మీర్ను భారత్లో విలీనం చేస్తున్నట్లు అప్పటి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూతో ఒప్పందంపై సంతకం చేశారు. దీంతో కశ్మీర్లోకి దూసుకువచ్చిన పాక్ సైన్యాలు వాయువ్య కశ్మీర్ను ఆక్రమించాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న యుద్ధవాతావరణ పరిస్ధితిని సరిదిద్దాలంటూ నెహ్రూ ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించారు. కశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిపి ప్రజల నిర్ణయం మేరకు నడుచుకోవాలని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో కాకుండా మిగిలిన ప్రాంతంలో ప్రజలు తాము భారత్లోనే ఉంటామంటూ ఓటు వేశారు. కాగా, ఉద్దేశపూర్వకంగా స్వలాభం కోసం సమస్యాత్మక ప్రాంతంగా ఉన్న భాగాన్ని ప్రత్యేక ప్రావిన్సుగా మార్చడం భారత్కు కలవరం కలిగించే అంశమే. మరోవైపు పాకిస్తాన్లో చైనా నిర్మిస్తున్న సీపీఈసీని వ్యతిరేకిస్తున్నట్లు బుధవారం పార్లమెంటులో కేంద్ర రక్షణ శాఖ ఓ రిపోర్టును దాఖలు చేసింది. భారత్లో ఉగ్రదాడులకు పాకిస్తాన్ ప్రేరేపిస్తుందని పునరుద్ఘాటించింది. భారతదేశ సార్వభౌమత్వాన్ని సీపీఈసీ ప్రశ్నిస్తుందని పేర్కొంది. అయితే, గతేడాది హంగ్జౌలో జరిగిన జీ-20 దేశాల సమావేశంలో సీపీఈసీకి సంబంధించిన అంశాలను చైనా అధ్యక్షునితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చించారు. ఇరుదేశాలకు ఉన్న సెన్సిటివ్ అంశాలతో ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆ సమావేశం తర్వాత చైనా చర్యలు భారత్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఉన్నాయి. పాకిస్తాన్ తన మిత్ర దేశమని దాన్ని కూడా అణు శక్తి సరఫరా బృందంలోకి చేర్చుకోవాలని తాజాగా చైనా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.