రుణమాఫీ జాబితా అస్పష్టం
- ఆదివారం రాత్రి బ్యాంకులకు సమాచారం
- పబ్లిక్ వెబ్సైట్లో అరకొర వివరాలు
- నేడు తెలిసే అవకాశం
సాక్షి, చిత్తూరు: రైతుల రుణమాఫీ మొదటి విడత జాబితా బ్యాంకులకు ప్రభుత్వం అందించింది. ఆ మేరకు ఆదివారం సాయంత్రం బ్యాంకు అధికారులకు సమాచారం అందింది. ఆదివారం బ్యాం కులకు సెలవు కావడంతో అధికారులు జాబితాలను చూసే అవకాశం లేదు. సోమవారం రుణ మాఫీ జాబితాలను వెల్లడించనున్నారు. మొదటి విడతలో జిల్లాలో ఎంతమంది రైతులకు మాఫీ వర్తింప చేశారనే విషయంలో స్పష్టత లేదు. కాగా అధికారికంగా ఎటువంటి సమాచారం లేదని లీడ్ బ్యాంకు అధికారుల పేర్కొంటున్నారు.
ఇక పబ్లిక్ వెబ్సైట్ను పరిశీలిస్తే జాబితా, సమాచారం వి వరాలు కనిపించడం లేదు. రైతు ఆధార్ నంబర్, రేషన్కార్డు, రుణ అకౌంట్ నంబర్ ఎంటర్ చేస్తే ఆ రైతు వివరాలు మాత్రమే కనిపిస్తున్నాయి. కొంతమంది రైతులు వివరాలను పబ్లిక్ వెబ్సైట్లో ఎంటర్ చేసి చూడగా రుణమాఫీ అయిందీ, లేనిదీ స్పష్టంగా చూపడంలేదు. వివరాలు పూర్తిగా అందలేదని సమాచారం వస్తోంది.
జిల్లాలో 1.98 లక్షల మంది రైతుల కు మొదటి విడత రుణమాఫీ ఉంటుందని బ్యాంకు అధికారులు అంచనా వేస్తున్నారు. తప్పించి స్పష్టంగా రుణమాఫీ ఎంతమందికి వచ్చిందనే విషయంలో స్పష్టత లేదు. ఇక జిల్లాలో సీఎం చంద్రబాబు హామీ మేరకు 2013 డిసెంబర్ 31 నాటికి 8,70,321 మంది రైతులు వివిధ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు. అధికారం చేపట్టిన తరువాత ఎన్నికల హామీని తుంగలో తొక్కిన బాబు ఒక్కోరైతు కుటుంబానికి కేవలం 1.5 లక్షలు రుణాన్ని మాత్రమే మాఫీ చేస్తానని మాటమార్చారు. ఈ మేరకు ఆగస్టు రెండున మార్గదర్శకాలు విడుదల చేశారు.
ఆధార్కార్డ్, రేషన్కార్డ్, బ్యాంకు ఖాతా నంబర్, పట్టాదారు పాసుపుస్తకం, పంటల సాగు తదితర వివరాలు పరిగణలోకి తీసుకొని లబ్ధిదారుల జాబితా రూపొందించాలని ఆదేశించారు. 30 అంశాలను ప్రాతిపదికగా బ్యాంకర్లు జాబితాను రూపొందించారు. స్కేల్ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణం తీసుకోని రైతులను అనర్హులుగా ప్రకటించాలని సూచించారు. మొత్తంగా జిల్లాలో 4.73 లక్షలమంది మాత్రమే రుణమాఫీకి అర్హులుగా తేల్చారు.
ఈ లెక్కన జిల్లాలో సగంమంది రైతులను రుణమాఫీ నుంచి తప్పించారు. ఆ తరువాత కూడా జాబితాలోనూ కోత పెట్టింది ప్రభుత్వం. తొలుత 50 వేలలోపు రుణం తీసుకున్న వారికే మాఫీ వర్తిస్తుందని సీఎం ప్రకటించారు. ఈ మార్గదర్శకాల కనుగుణంగా జిల్లాలో తొలివిడతలో కేవలం 1.98 లక్షల మంది మాత్రమే రుణమాఫీ జాబితాలో ఉండే అవకాశముందని బ్యాంకు అధికారులు అంచనా వేశారు.
రైతుసాధికార సంస్థలో కేవలం 5 వేలకోట్లు మాత్రమే కేటాయించిన నేపథ్యంలో రూ.50 వేల ప్రకారం కూడా ప్రభుత్వం రైతు ఖాతాల్లో డబ్బు జమవేసే పరిస్థితి లేదనేది బ్యాంకర్ల అభిప్రాయం. మరోవైపు వడ్డీ ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. మొత్తం 939 కోట్ల మేర వడ్డీలు పెరిగాయి. ప్రభుత్వం ఇచ్చే నామమాత్రపు నిధులు వడ్డీలకు కూడా జమయ్యే పరిస్థితి కానరావడంలేదు.