విద్యాభ్యాసంతోనే గ్రామాభివృద్ధి
టీడీపల్లి(మడకశిర రూరల్):
విద్యాభ్యాసంతోనే గ్రామాభివృద్ధి సాధ్యమని విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని స్పెయిన్ దేశస్థులు పేర్కొన్నారు. మండల పరిధిలోని టీడీపల్లి ఎస్సీ కాలనీలో విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళల్లో ట్యూషన్ చెప్పడానికి నూతనంగా నిర్మించిన పాఠశాల భవనాన్ని ఆదివారం ఆర్డీటీ ఆర్డీ కృష్ణవేణి, స్పెయిన్ దేశస్తులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ గాయత్రీమంజునాథ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్పెయిన్ దేశస్తులు పారాదాన్, షబ్బీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోడానికి తమ వంతు కృషి చేస్తామని తెలియజేశారు. అదేవిధంగా హరిజన కాలనీలో విద్యార్థులు చదువుకు దూరం కాకూడదని కాలనీలోని పాఠశాల భవనం నిర్మించి వారికి ఉదయం సాయంత్రం విద్యను బోధించడానికి ఉపాధ్యాయుడిని నియమించామన్నారు. ఆర్డీ కృష్ణవేణి మాట్లాడుతూ దళిత కాలనీలో విద్యార్థుల విద్యాభివృద్ధే ధ్యేయంగా సంస్థ కృషి చేస్తోందని, అదేవిధంగా ఇళ్లులేని నిరుపేదలను గుర్తించి వారికి ఇళ్ల సౌకర్యం కల్పిస్తామన్నారు. సర్పంచ్ మాట్లాడుతూ ఆర్డీటీ సంస్థ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.అనంతరం సర్పంచ్ ఆర్డీ, స్పెయిన్ దేశస్తులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీటీ ఏరియా టీఎం లీడరు వన్నూరుస్వామి, ఎస్టీఎల్ తిప్పమయ్య, మధుసూధన్, కోఆర్డినేటర్ సత్యనారాయణరెడ్డి, ఇంజినీరు రాజశేఖర్, టీటీ మేఘనాథ్, సీడీసీ సభ్యులు రంగనాథ్, రంగప్ప, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.