గవర్నర్ సీరియస్.. పెట్రోలు బంకుల సమ్మె విరమణ
పెట్రోలు బంకుల మూసివేతపై గవర్నర్ సీరియస్గా స్పందించారు. తక్షణం వాటిని తెరిపించేలా చర్యుల తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజాజీవితానికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, పౌరసరఫరాల శాఖకు ఆయన ఆదేశాలిచ్చారు. దీంతో బంకుల యాజమాన్యాలు దెబ్బకు దిగొచ్చాయి. సమ్మెను ఉపసంహరించుకుంటున్నట్లు పెట్రోలు బంకుల డీలర్ల సంఘం తెలిపింది.
మరోవైపు పెట్రోల్బంకుల్లో వాడుతున్న రెండు కంపెనీల తూనిక యంత్రాల కారణంగా అవకతవకలకు ఆస్కారం ఉందని తూనికలు, కొలతల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ భాస్కర్ తెలిపారు. వాటిని రిమోట్తో ఆపరేట్ చేస్తున్నారని, రిమోట్ ఆధారంతో నేరుగా ధర, పరిమాణాన్ని కావాల్సిన విధంగా ఆపరేట్ చేస్తున్నారని వివరించారు. అనేక బంకులపై దాడులు చేసి కేసులు నమోదు చేశామని, రిమోట్లు వాడటం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు.
ట్రస్సర్వీన్ కంపెనీ తూనిక యంత్రాలు వాడుతున్న బంకులను సీజ్చేశామని, చైనా నుంచి ఈ యంత్రాలను దిగుమతిచేసుకుని వినియోగదారులను మోసం చేస్తున్నారని భాస్కర్ చెప్పారు. కంపెనీ పాస్వర్డ్ను అధికారులకు అందుబాటులో ఉంచడంలేదని, సికింద్రాబాద్లో ట్రస్సర్వీన్ కార్యాలయంపై దాడులు చేసినప్పుడు ఈ విషయాలన్నీ బయటపడ్డాయని ఆయన తెలిపారు.