Revanth Reddy
-
కేంద్రం.. ఆమోదమా? తిరస్కారమా?
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రెండోదశ పై మరోసారి ఉత్కంఠ నెలకొంది. కేంద్రం అనుమతి కోసం ఇప్పటికే సీఎం రేవంత్ సహా అధికారుల బృందం కేంద్రంతో సంప్రదింపులు జరిపింది. ఆ తర్వాత సీఎం మరోసారి ప్రధాని మోదీతో మెట్రో అంశాన్ని ప్రస్తావించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ 4 రోజుల వ్యవధిలో రెండోసారి కేంద్ర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఏడాది కాలంగా ఈ భేటీలు, సంప్రదింపులు సాగుతూనే ఉన్నాయి.. .. సీఎం సహా అధికారుల బృందాలు ఢిల్లీకి వెళ్తూనే ఉన్నారు. ఇటీవలి సమావేశాలు మెట్రో రెండో దశపై ఆశలు రేకెత్తిస్తున్నాయి. కేంద్రం ప్రతిపాదించినట్లుగా తొలి దశను రాష్ట్ర ప్రభుత్వం ఎల్అండ్టీ నుంచి టేకోవర్ చేసింది. రుణాల రీఫైనాన్సింగ్తో పాటు ఎల్అండ్టీ బకాయిల చెల్లింపు జూన్తో పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం రెండో దశపై కేంద్రం నుంచి ఆమోదం పొందేందుకు కార్యాచరణను వేగిరం చేసింది.ఇంకా ఎన్నాళ్లు..?రెండోదశకు ప్రణాళికలను రూపొందించి, కేబినెట్ ఆమోదంతో దాదాపు 18 నెలల క్రితమే కేంద్రం అనుమతి కోసం డీపీఆర్లను అందజేశారు. ఇటీవల పలు నగరాల్లో మెట్రో నిర్మాణానికి కేంద్రం అనుమతులను అందజేసింది. హైదరాబాద్లో రెండో దశను మాత్రం పెండింగ్లో పెట్టింది. ఇప్పటికే రెండో దశలో పేర్కొన్న ‘ఏ’, ‘బి’ విభాగాల కోసం డీపీఆర్లను అందజేయగా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ఎలాంటి డీపీఆర్లు అందలేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పేర్కొనడం గమనార్హం. ఈ క్రమంలోనే మొదటి దశ స్వాధీనంతో పాటు వివిధ అంశాలపై కేంద్రానికి స్పష్టమైన నివేదిక అందజేశారు. రెండో దశలో మొత్తం 8 కారిడార్లలో మెట్రో నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సమర్పించింది. దాదాపు రూ.48 వేల కోట్లతో అంచనాలను రూపొందించారు. మొదట.. రెండో దశలోనే ఈ కారిడార్లన్నీ పూర్తిచేయాలని ప్రతిపాదించారు. కానీ, ఇటీవల సీఎం రేవంత్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో సమావేశమైన సందర్భంగా ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్సిటీకి మూడో దశలో చేపట్టాలని కోరారు. మరోపు మెట్రో నిర్మాణానికి జైకా, ఏడీబీ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు రుణాలు అందజేసేందుకు ఏడాది క్రితమే సంసిద్ధత వ్యక్తం చేసినా కేంద్రం నుంచి సావరిన్ గ్యారెంటీ లభించక ప్రతిష్ఠంభన నెలకొంది. గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా.. మెట్రో రెండో దశ పనులతో పాటు మూసీ ప్రక్షాళనను ప్రారంభించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించడంతో ఎన్నికలు సవాల్గా మారాయి. పాతబస్తీలో మెట్రో విస్తరణకు భూ సేకరణతో పాటు, రోడ్డు విస్తరణ చేపట్టారు. కేంద్రం నుంచి అనుమతి రాగానే ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ. మార్గాన్ని మొదట పూర్తి చేయనున్నారు. కానీ, రెండో దశపై కేంద్రం స్పష్టమైన వైఖరి వెల్లడించడం లేదు. దీంతో హెచ్ఎంఆర్ఎల్ అధికారులు ఢిల్లీకి ప్రదక్షిణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. -
ఖమ్మం, వరంగల్, కరీంనగర్కు 'ఔటర్ రింగ్ రోడ్డు'
సాక్షి, హైదరాబాద్: ప్రధాన నగరాలు, పట్టణ ప్రాంతాలను వృద్ధి కేంద్రాలుగా మార్చడంలో భాగంగా మెగా గ్రోత్ కారిడార్ ప్రణాళికపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం అధికారులతో సమీక్షించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పట్టణ కేంద్రంగా అభివృద్ధికి బాటలు వేసేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఇందుకు అవసరమైన ఎస్టీపీలు డిజైన్ చేయాలని సీఎం ఆదేశించారు. రాబోయే ఎయిర్పోర్టులను దృష్టిలో ఉంచుకొని రోడ్లు నిర్మించాలన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణంలో సాంకేతికతను వినియోగించుకోవాలని సీఎం తెలిపారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో జరిగిన ఈ సమావేశంలో సీఎంఓ కార్యదర్శి మాణిక్రాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ డాక్టర్ టి.కె.శ్రీదేవి, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ దేవేందర్రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈవీలే లీజుకు తీసుకోవాలి.. ఖర్చు తగ్గించుకోవడానికి ఈవీ వాహనాలను ప్రవేశపెట్టాలని, లీజుకు తీసుకునే వాహనాలు కూడా ఈవీలే ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ప్రతి చోట పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీలలో సోలార్ ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, పట్టణ కేంద్రంగా డెవలప్మెంట్ ప్లానింగ్ ఉండాలన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్స్, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు అర్బన్ ప్లానింగ్లో తప్పనిసరిగా ఉండాలని అధికారులను ఆదేశించారు. టెంపుల్ కారిడార్.. నల్లగొండ, యాదగిరిగుట్ట మధ్య టెంపుల్ కారిడార్ ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆదిలాబాద్, నాగోబా, బాసర, కడెం ప్రాజెక్ట్లను కలుపుతూ టూరిజం కారిడార్ ఏర్పాటు చేయాలన్నారు. కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని అలంపూర్ జోగులాంబ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పారు. మహబూబ్నగర్, భూత్పూర్, జడ్చర్లలను కలిపి కారిడార్ ఏర్పాటు చేయాలని సూచించారు. కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్ కలిపి కారిడార్ ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. – వరంగల్, కరీంనగర్, ఖమ్మం కారిడాడ్ భవిష్యత్ తెలంగాణకు చాలా కీలకం అని సీఎం అన్నారు. ఎయిర్పోర్ట్ రాకతో ఈ ప్రాంతం రూపు రేఖలు మారనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణం.. జూన్ 2 నుంచేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణం దిశగా ఇప్పటివరకు అడుగు ముందుకు పడలేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 నుంచి గ్రేటర్లో ఎంఎంటీఎస్ రైళ్లలో అన్ని వర్గాల ప్రయాణికులకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించనున్నట్లు సీఎం రేవంత్రెడ్డి ఇటీవల ప్రకటించారు. ప్రజారవాణా వ్యవస్థను బలోపేతం చేసేదిశగా ఉచిత సేవలను అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. ఇందుకోసం దక్షిణ మధ్య రైల్వేకు ఏటా రూ.10 కోట్లు అందజేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రతిపాదనపైన దక్షిణమధ్య రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించినప్పటికీ రైల్వేబోర్డు ఆమోదిస్తే తప్ప తాము ఈ సదుపాయాన్ని కల్పించలేమని, రాష్ట్ర ప్రభుత్వం, రైల్వేబోర్డు మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదరాల్సి ఉంటుందని చెబుతున్నారు. రైల్వే బోర్డుకు సమాచారం లేదు! ప్రస్తుతం నగరంలోని వివిధ మార్గాల్లో ప్రతిరోజు సుమారు 75 ఎంఎంటీఎస్ సర్వీసులు నడుస్తున్నాయి. 35 వేల మందికి పైగా ప్రయాణిస్తున్నారు. ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో వ్యక్తిగత వాహనాల వినియోగం కొంత మేరకు తగ్గవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు ఆచరణాత్మకంగానే ఉన్నప్పటికీ రైల్వేబోర్డుకు ఇంకా సమాచారం అందజేయలేదు. ఇప్పటికిప్పుడు ప్రతిపాదనలు సిద్ధం చేసి అందజేసినా రైల్వేబోర్డు పరిశీలించి నిర్ణయం తీసుకొనేందుకు కొంత సమయం పట్టవచ్చు. పైగా ఎంవోయూ కూడా కుదుర్చుకోవలసి ఉంటుంది. జూన్ 2 లోపు ఇదంతా సాధ్యం కాకపోవచ్చుననిపిస్తోంది..’అని దక్షిణమధ్య రైల్వే అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. పైగా ఎంఎంటీఎస్ రెండో దశకు సంబంధించి రాష్ట్రం నుంచి రావలసిన రూ.460 కోట్లకు పైగా బకాయీలపైనా స్పష్టత రావలసి ఉందని ఆయన అన్నారు. రెండోదశ నిధులే ఇవ్వలేదు..! హైదరాబాద్లో లోకల్ ట్రైన్ సదుపాయాన్ని కల్పించే లక్ష్యంతో ఎంఎంటీఎస్ ప్రాజెక్టును 2003లో స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ)గా ఏర్పాటు చేశారు. దీని నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2/3 వంతు, రైల్వేశాఖ 1/3 వంతు చొప్పున భరించాలని అప్పట్లో నిర్ణయించారు. ఈ మేరకు మొదటి దశ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. 2013లో ఇదే ఒప్పందం ఆధారంగా రెండోదశను ప్రారంభించారు. కానీ ప్రభుత్వం తన వాటా నిధులను పూర్తిగా చెల్లించలేదు. దీంతో ఈ ప్రాజెక్టును దక్షిణ మధ్య రైల్వే సొంతంగా పూర్తి చేయవలసి వచ్చింది. ప్రస్తుతం ఘటకేసర్ నుంచి రాయగిరి వరకు చేపట్టిన యాదాద్రి ఎంఎంటీఎస్ పనులను కూడా దక్షిణ మధ్య రైల్వే సొంత నిధులతో చేపట్టింది. ఇదిలావుండగా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని తెరపైకి తేవడంతో..ఇప్పటివరకు రెండో దశ నిధులను చెల్లించకపోవడాన్ని రైల్వే అధికారులు ప్రధానంగా ఎత్తిచూపుతున్నారు. సమయ పాలన మెరుగుపరచాలి ఎంఎంటీఎస్ రైళ్లలో సమయ పాలన మెరుగుపడి, సర్వీసులు పెంచితేనే ప్రయాణికులకు ఉచిత సదుపాయం సద్వినియోగమవుతుందని హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ (హుమ్టా) అధికారులు భావిస్తున్నారు. ప్రతి 15 నిమిషాలకు ఒక సర్వీసు చొప్పున అందుబాటులో ఉండాలని, అన్ని ఎంఎంటీఎస్ స్టేషన్లకు సిటీబస్ కనెక్టివిటీ కల్పించాలని సూచిస్తున్నారు. ఎంఎంటీఎస్, మెట్రో, ఆర్టీసీ బస్ సేవలను సమన్వయం చేయడంపై సంస్థ ప్రణాళికలను రూపొందించింది. -
ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పనితీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. రేవంత్రెడ్డి రెండున్నరేళ్ల పాలనపై జనంలో తీవ్ర అసంతృప్తి ఉందని చెప్పారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని, పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో వంద శాతం తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని, పార్టీ నేతలు ఇంటికి పరిమితం కాకుండా నిరంతరం ప్రజాక్షేత్రంలో జనంతో మమేకమవ్వాలని పిలుపునిచ్చారు. మంగళవా రం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్ష తన పార్టీ కీలక సమావేశం జరిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీమంత్రి హరీశ్రావుతో పాటు శాసనసభ, శాసన మండలిలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. సుమారు 7 గంటల పాటు సాగిన సమావేశంలో కేసీఆర్ కేంద్ర, రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులను విశ్లేషించారు. పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణానికి సంబంధించి నేతలకు దిశా నిర్దేశం చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం భేటీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నేతల పనితీరును గమనిస్తున్నాం ‘క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి మంచి ఆదరణ లభిస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిల పనితీరును నిశితంగా గమనిస్తున్నాం. పనిచేయని వారిని పక్కన పెడతాం. ప్రజా సమస్యలపై స్పందిస్తూ కష్టపడి పనిచేసే వారికే భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయి. సీఎం రేవంత్ గుజరాత్ మోడల్ను పదే పదే వల్లె వేస్తున్నాడు. తెలంగాణలో బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో గుజరాత్ మోడల్ను మించి ఫలితాలు సాధించాం. జాతీయ స్థాయిలో అనేక సూచీల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ప్రభుత్వానికి నిధుల సమీకరణ, వనరుల వినియోగం వంటి అంశాలపై ఏ మాత్రం అవగాహన లేదు. పాలన చేతకాక కాంగ్రెస్ క్రమంగా కనుమరుగవుతోంది..’ అని కేసీఆర్ చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి సమన్వయకర్త రాజకీయ విమర్శల జోలికి వెళ్లకుండా పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణం, కార్యకర్తలకు శిక్షణ వంటి అంశాలపైనే కేసీఆర్ ఎక్కువగా మాట్లాడినట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఆయా అంశాలపై నేతల అభిప్రాయాలు ఆయన అడిగి తెలుసుకున్నారు. డిజిటల్ పద్ధతిలోనే పార్టీ సభ్యత్వ నమోదు చేయాలని ఆదేశించారు. ‘ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టిన ‘సర్’ ప్రక్రియతో పాటు, ఓటర్ లిస్టు సవరణ తదితర కార్యాచరణ మొత్తం డిజిటల్ ప్రక్రియలో జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ సభ్యత్వం కూడా డిజిటల్ పద్ధతిలోనే జరపాలి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి, రాష్ట్ర కమిటీ నుండి సభ్యత్వ నమోదు సమన్వయకర్తను నియమించాలి. కార్యకర్తలకు శిక్షణ అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం సజావుగా నిర్వహిచేందుకు ‘సభ్యత్వ సమన్వయ కమిటీ’లను రెండుమూడు రోజుల్లో నియమించాలి. డిజిటల్ పద్ధతిలో సభ్యత్వ నమోదు చేస్తున్నందున రాష్ట్రంలో ఉన్న 35,655 పోలింగ్ బూత్లకు బూత్కు ఇద్దరు కార్యకర్తల చొప్పున మొత్తం 71,310 మంది పార్టీ కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహించాలి. పార్టీ ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో ఈ శిక్షణా శిబిరాలు కొనసాగుతాయి..’ అని కేసీఆర్ తెలిపారు. సభ్యత నమోదు కోసం ఇన్చార్జిలను ప్రకటించారు. సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నేతలు పలువురు కూడా పాల్గొన్నారు. -
కలెక్టర్లపైనా చర్యలకు వెనుకాడం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను మిషన్ మోడ్లో పనిచేసి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి కొనుగోళ్ల తీరును పరిశీలించాలని సూచించారు. సమస్య తీవ్రతను గుర్తించి జిల్లా కలెక్టర్లు సరైన చర్యలు తీసుకోవాలని, ప్రతి అధికారి జవాబుదారీతనంతో వ్యవహరించాలని చెప్పారు. కలెక్టర్లు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని, ఏ సమస్య వచ్చినా కలెక్టర్లు బాధ్యత తీసుకుని పరిష్కరించాలని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహిస్తే కలెక్టర్లపై చర్యలకూ ప్రభుత్వం వెనకాడదని హెచ్చరించారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ, పురోగతిపై జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో తలెత్తిన ఇబ్బందులు, సమస్యలపై రేవంత్ ఆరా తీశారు. ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలి ‘గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చూసుకోవాలి. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలి. రవాణా శాఖ కమిషనర్ ధాన్యం తరలింపునకు అవసరమైన వాహనాలు అందుబాటులో ఉండేలా చూడాలి. ఒప్పందం మేరకు సరిపడా లారీలను అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులకూ వెనకాడొద్దు. అవసరమైతే స్థానికంగా ట్రాక్టర్లు, ఇతర వాహనాలను వినియోగించాలి. మొక్కజొన్న పంట ఎక్కువగా వచ్చే జిల్లాల కలెక్టర్లు కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడా రైతులకు ఇబ్బందులు కలగకూడదు. ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్లపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు సీఎస్కు నివేదికలు పంపాలి. రైతుబజార్లు, ఫంక్షన్ హాళ్లను వాడుకోండి సేకరించిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు మిల్లుల్లో స్థలం సరిపోవడం లేదని అంటున్నారు. చాలా ప్రాంతాల్లో గోదాముల సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. అలాంటి ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలి. రైతుబజార్లు, ఫంక్షన్ హాళ్లను తీసుకుని ధాన్యాన్ని అక్కడికి తరలించాలి. తర్వాత పరిస్థితిని బట్టి గోడౌన్లకు తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి..’అని సీఎం ఆదేశించారు. అకాల వర్షాల నష్టాన్ని తగ్గించేందుకు ప్రత్యేక వ్యవస్థ ‘అకాల వర్షాలతో రైతులు నష్టపోకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారం దిశగా కలెక్టర్లు ప్రణాళికలు సిద్ధం చేయాలి. కల్లాల వద్ద ధాన్యం తడవకుండా ఉండేందుకు అవసరమైన టార్పాలిన్లను రైతులకు అందుబాటులో ఉంచాలి. వాతావరణ శాఖ సూచనల ఆధారంగా ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేసేందుకు మండల స్థాయిలో ఒక అధికారిని నియమించాలి. వాతావరణ సూచనలను రైతులకు చేరవేసేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి మిల్లు వద్ద ఒక అధికారి ఉండాల ప్రతి ఐకేపీ సెంటర్కు ఒక అధికారిని నియమించి కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలు తలెత్తకుండా చూడాలి. ప్రతి రైస్ మిల్లు దగ్గర ఒక బాధ్యతాయుతమైన అధికారిని నియమించి పర్యవేక్షించాలి. ధాన్యం లోడింగ్లో జాప్యం జరగకుండా స్థానికంగా ఉన్న హమాలీలను గుర్తించి వారితో పని చేయించుకోవాలి. ధాన్యం లోడ్ చేసిన వెంటనే రైతులకు రశీదు ఇవ్వాలి. అలా చేస్తే తాలు, తరుగు పేరుతో అక్రమాలు జరగకుండా చూడొచ్చు..’అని ముఖ్యమంత్రి అన్నారు. సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురండి: మంత్రి ఉత్తమ్ ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో జిల్లాల్లో ఎక్కడ సమస్యలున్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. ధాన్యం సేకరణ విషయంలో ఎలాంటి సహకారం అందించేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. పొరుగు రాష్ట్రాల ధాన్యంతో సమస్యలు: మంత్రి తుమ్మల సరిహద్దు రాష్ట్రాల రైతులు కొంతమంది ధాన్యాన్ని తెలంగాణలో కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారని, దీంతో కొన్నిచోట్ల సమస్యలు తలెత్తుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. అలా ధాన్యం రాకుండా కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ నెలాఖరులోగా ధాన్యం సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్కుమార్, వాకిటి శ్రీహరి, సీఎస్ రామకృష్ణారావు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
సీనియర్ మహిళా ఐపీఎస్తో విచారణ
సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడి కేసు వ్యవహారంపై డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సోమవారం ఉదయం సమీక్షించానని, ఈ కేసు సున్నితమైనందున మహిళా ఐపీఎస్ అధికారితో విచారణ జరిపించాలని ఆదేశించినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. సోమవారం మీడియాతో చిట్చాట్ సందర్భంగా ఆయన ఈ విషయం ప్రస్తావించారు. ఈనెల 8వ తేదీన మైనర్ బాలిక తల్లి పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారని, అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాక సందర్భంగా 9, 10 తేదీల్లో దాదాపు 10 వేల మంది పోలీసు యంత్రాంగం బందోబస్తు విధుల్లో నిమగ్నమైందని సీఎం తెలిపారు. మైనర్ బాలిక తల్లి ఫిర్యాదు చేయడానికి ముందే.. బండి సంజయ్ కుమారుడు కరీంనగర్లో వాళ్లపై వేరే ఫిర్యాదు చేశారని అన్నారు. సోమవారం ఉదయమే ఈ కేసులో విచారణ ప్రారంభమైందన్నారు. బీఆర్ఎస్ వాళ్లు కోరుకున్నట్లు క్షణాల మీద ఏవీ జరగవని, వారు పనిలేకుండా ఉన్నంత మాత్రాన ఎవరూ పనిలేకుండా ఉన్నారను కోవడం సరికాదని వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తాను మాజీ పోలీసు అధికారినన్న విషయం మరిచిపోవద్దని సూచించారు. బాధితులను కలిసి స్టేట్మెంట్ తీసుకుని చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని, దోషుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని చెప్పారు. కేటీఆర్ బావమరిది ఫాంహౌస్లో డ్రగ్స్ పార్టీ జరిగితే కేసులు నమోదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మైనర్ బాలికకు సంబంధించిన అంశంలో అంతా బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దగ్గర ఆధారాలు ఉంటే పోలీస్ కమిషనర్కు ఇవ్వొచ్చని సూచించారు. -
ప్రజా జీవనంపై మోదీ అప్రకటిత నిషేధం
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ తన అసమర్థ పాలన, విదేశాంగ విధానంలో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజల జీవనంపై అప్రకటిత నిషేధం ప్రకటించారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. ‘బంగారం కొనొద్దు.. వెకేషన్కు వెళ్లొద్దు.. నూనె తినడం తగ్గించాలంటూ ప్రధాని ప్రజలకు పిలుపునివ్వడం బాధ్యతా రాహిత్యం. మోదీ ప్రభుత్వ వైఫల్యం, అసమర్థ విధానాలే ఇందుకు కారణం. విదే శాంగ విధానంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది. అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి, వారి సూచనలు సలహాలు తీసు కోకుండా ఏకపక్ష నిర్ణయాలు సరికాదు. దేశంలో సంక్షోభం తలెత్తే అంశాలపై రాహుల్గాంధీ ఆరు నెలల నుంచే చెబుతున్నా అంతా సవ్యంగా ఉందంటూ చెప్పుకొచ్చారు. కేంద్రానికి ఓ స్పష్టమైన విధానం లేదు. దశ, దిశ లేదు. అనుభవ రాహిత్యం, అహంకారంతో దేశాన్ని సంక్షోభంలోకి నెడుతున్నారు. గాలి తిని, గాల్లో బతకమని చెప్పి మోదీ వెళ్లిపోయారు. పశ్చిమాసియా యుద్ధంలో మనమేమీ ప్రత్యక్షంగా పాల్గొనడం లేదు..’ అంటూ సీఎం విమర్శించారు. సోమవారం తన నివాసంలో ఆయన మీడియాతో సుదీర్ఘంగా చిట్చాట్ చేశారు. మావోయిస్టులను చంపడమే బీజేపీ ఎజెండా ‘బీజేపీ విధానాలను వ్యతిరేకించే వారిని ఖతం చేయడమే ఆ పార్టీ విధానం. ముస్లింలు, మావోయిస్టులు, కమ్యూనిస్టులు ఈ దేశ పౌరులు కారా? వారికి తమ సిద్ధాంతాలను చెప్పుకునే స్వేచ్ఛ లేదా? మావోయిస్టులను చంపడమే బీజేపీ ప్రభుత్వం ఎజెండాగా పెట్టుకుంది. మేము ప్రాణాలు తీయడానికి వ్యతిరేకం. మా సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన వాళ్లను కూడా ఒప్పించి జనజీవన స్రవంతిలోకి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తాం. మనుషుల ప్రాణాలకు మా ప్రభుత్వం విలువ ఇస్తుంది. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన పార్టీ మాది. మనషులను చంపడం పరిష్కారం కాదు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు అత్యధికంగా తెలంగాణలోనే లొంగిపోయారు. 818 మంది మావోయిస్టులు రాష్ట్రంలో సరెండర్ అయ్యారు. వందలాది ఆధునాతన ఆయుధాలను అప్పగించారు. అందుకోసం మేం ప్రత్యేక చొరవ తీసుకున్నాం. మేం బుల్లెట్ కాదు బ్యాలెట్ అన్నాం.. లొంగిపోయిన వారికి రక్షణ, వైద్యం, ఆర్థికపరమైన సాయం ప్రభుత్వం అందిస్తుంది. మావోయిస్టుల విధానాలనే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది. భూ పంపణీ, ఉపాధి హామీ పథకాల అమలుతో వారి ఉద్యమాలు తగ్గాయి. గణపతి కూడా జనజీవన స్రవంతిలో కలవాలి. ప్రధానమంత్రి రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసులను అభినందించకపోగా విమర్శించడం దురదృష్టకరం. బుల్లెట్ కాదు బ్యాలెట్ అని మేం అన్నాం. చివరకు మావోయిస్టులు మా లైన్కు వచ్చారు. ముస్లింలను వేరే చేసి చూపించడం మంచిది కాదు. కలిసి ఉండాలని ప్రధాని మాట్లాడాలి కానీ విడగొట్టాలని మాట్లాడం దురదృష్టకరం. బీజేపీ బ్రిటిష్ జనతా పార్టీ.. విభజించు, పాలించు అన్నదే వాళ్ల సిద్ధాంతం..’ అని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. నేను అడిగిన అంశాలకు మోదీ అంగీకరించారు.. ‘ఆదివారం అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా నేను అడిగిన అంశాలకు ప్రధాని అంగీకరించారు. అందులో ఎలాంటి రాజకీయాలు లేవు. మన్మోహన్సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్కు సాయం చేసిన విధంగానే తెలంగాణకు కూడా మీరు సహకరించాలని కోరా. అందుకు ప్రధాని స్పందిస్తూ.. ‘నీవొక్కడివే చేస్తే అనుకున్న లక్ష్యాలను (3 ట్రిలియన్ ఎకానమీ) సాధించలేవు. నీ కలలు నిజం అవ్వాలంటే మాతో కలిసి వస్తే.. అది సాధ్యం అవుతుంది’ అనే విధంగా అన్నారు. అయితే ఆయన మాటలను ఎవరికి తోచిన విధంగా వారు అర్థం చేసుకుంటున్నారు. నేను బీజేపీని ఓడించే ముఖ్యమంత్రి అయ్యా. నన్ను కాదు..రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తానని మోదీ అన్నారు. ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదు.. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ సమన్వయంపై మేం చర్చించాం.. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాల్సిందే..అది హక్కు. వాటిని సాధించుకుంటాం. కేంద్రంతో సత్సంబంధాలు లేకుండా నిధులు అడగకుండా ఉంటే రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్తుంది? కానీ కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించడం లేదు. కొన్ని అంశాల్లో సహకరిస్తున్నా.. మంత్రులను కలిసి ఎన్నిసార్లు అడిగినా అనుమతులు రావడం లేదు. రాష్ట్రాల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు ప్రధాని కార్యాలయంలో సింగిల్విండో ఏర్పాటు చేయాలి..’ అని రేవంత్ విజ్ఞప్తి చేశారు. కేంద్రం విధానంపైనే అభ్యంతరాలు ‘చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలు, నియోజకవర్గాల పునర్విభజన, జమిలి ఎన్నికలకు ఎలాంటి అడ్డంకి లేదు. నియోజకవర్గాల పెంపునకు సంబంధించి కేంద్రం అనుసరించే విధానంపైనే ప్రతిపక్ష పార్టీలన్నింటికీ అభ్యంతరాలు ఉన్నాయి. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు, నియోజకవర్గాల పెంపునకు ముడిపెట్టడంతోనే బిల్లు వీగిపోయింది. 50 శాతం సీట్ల పెంపునకు ఎలాంటి ఫార్ములా లేదు. 2029లో జమిలి ఎన్నికలు, మహిళా రిజర్వేషన్లు అమలు కావొచ్చు. అయితే బీజేపీ ఎన్నికల విధానం అంతా జెమినీ సర్కస్లా ఉంటుంది. తెలంగాణలో అధికారంలోకి వస్తామని ప్రధాని అన్నారు. వారిష్టం.. అనందపడనివ్వండి. రెండు సీట్లతో ప్రస్థానం ప్రారంభించిన బీజేపీ భవిష్యత్తులో మళ్లీ ఆదే రెండు సీట్లకు పరిమితం అవుతుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా మాకు ఒక రాష్ట్రం వస్తే.. వారికి ఒక రాష్ట్రం అదనంగా వచ్చింది అంతే. కేరళలో 3 సీట్లు ,తమిళనాడులో 2 సీట్లు మాత్రమే బీజేపీ గెలుచుకుంది..’ అని సీఎం వ్యాఖ్యానించారు. పాఠశాలల్లో యాంటీ డ్రగ్ ప్రమాణం ‘రాష్ట్రంలో పాఠశాలల ప్రారంభోత్సవం రోజున పిల్లలతో యాంటీ డ్రగ్ ప్రమాణం చేయించనున్నాం. అందుకోసం రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ఆహ్వానిస్తున్నాం. నిపుణులు, విద్యావంతులతో పూర్తిస్థాయిలో చర్చించిన తర్వాతే పాఠశాల విద్యాశాఖలో ఇంటర్ విలీనంపై ఒక నిర్ణయం తీసుకుంటాం. తుమ్మిడిహెట్టిపైన ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశాం. ఇంకా స్పందన రాలేదు. రెండు రాష్ట్రాల మధ్య సమస్య వచ్చినప్పుడు ప్రధానమంత్రి పెద్దరికం వహిస్తే బావుంటుంది. ధాన్యం సేకరణలో సమస్యలు ధాన్యం సేకరణలో కొన్ని సమస్యలు వస్తున్నాయి. ధాన్యం దిగుబడి విపరీతంగా వచ్చింది. ప్రకృతి కారణంగా కూడా సమస్యలు ఉన్నాయి. అన్నింటినీ పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాం. గత ఎక్సెస్ టెండర్లపై సీబీఐ విచారణకు సిద్ధమా? హామ్ రోడ్ల టెండర్లలో అన్నీ ఎక్సెస్ అని హరీశ్రావు వ్యాఖ్యానిస్తున్నారు. 26 శాతం లెస్కు వచ్చిన విధంగానే అందరికీ ఇవ్వాలని అంటే.. గతంలో వారు ఎక్సెస్కు ఇచ్చిన టెండర్లన్నింటిపై సీబీఐ విచారణకు సిద్ధమా? నాకు ఎవరిపైనా కక్ష లేదు. తప్పు చేసిన వారిని న్యాయస్థానాలు శిక్షిస్తాయి..’ అని సీఎం వ్యాఖ్యానించారు. మీ విషయంలో అలా జరగలేదు కదా అని ఓ విలేకరి ప్రశ్నించగా.. అడవికి రాజునని, వేటాడి చంపే మృగం బలం ఉన్నప్పుడు అలా వ్యవహరించినా.. శక్తి లేనప్పుడు పొదల మాటున, రాళ్ల మాటున దాగి మరణిస్తుందని అంటూ ఇది ఎవరినీ ఉద్దేశించి తాను వ్యాఖ్యానించడం లేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. -
విద్యకు బడ్జెట్లో 15 శాతం నిధులిస్తాం
సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని సీఎం రేవంత్రెడ్డి ఉద్ఘాటించారు. విద్య కోసం రాష్ట్ర బడ్జెట్లో 15 శాతం నిధులు కేటాయించాలని రాష్ట్ర విద్యా కమిషన్ సిఫారసు చేసిందని, అయితే ఒక్కరోజులో ఈ కేటాయింపులను పెంచే పరిస్థితి ఉండదన్నారు. కేటాయింపులను ప్రతి ఏటా బడ్జెట్లో క్రమంగా పెంచుతూ పోతామని, 15 శాతానికి పెరిగే వరకు ఇది కొనసాగుతుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం నుంచి ఈ నెల 17 వరకు విద్యా వారోత్సవాలను నిర్వహిస్తోంది. సోమవారం ఎల్బీ స్టేడియంలో విద్యా వారోత్సవాల కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించి టీచర్లు, విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. ‘విద్యాశాఖకు ఈ ఏడాది రూ.26,674 కోట్లు కేటాయించాం. రాష్ట్ర బడ్జెట్లో 8.22 శాతం కేటాయింపులు జరిపాం.గతేడాది కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేటాయింపులు పెంచాం. ఇదేవిధంగా ఏటా పెంచుతాం. ఓఆర్ఆర్ లోపల క్యూర్ ప్రాంతంలో రూ.1,700 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈ రోజు శంకుస్థాపన చేయడం శుభపరిణామం. వర్సిటీలు, విద్యను నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ సమాజం బలహీనపడుతుంది. పేదలకు న్యాయమైన విద్య, సాంకేతిక నైపుణ్యాన్ని అందించడం మా ప్రభుత్వ బాధ్యత. రాష్ట్రంలోని తండాలు, గూడేలు, మారుమూల గ్రామాల్లోని పేదలు, దళితులు, గిరిజనులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో విద్యాశాఖను నేనే నిర్వహిస్తూ అడుగులు ముందుకు వేస్తున్నాం.ప్రజాప్రభుత్వంలో కేవలం 60 రోజుల వ్యవధిలో 11 వేల మంది టీచర్లను నియమించడం చరిత్రాత్మక అంశం. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా 22 వేల టీచర్లకు పదోన్నతులు, 36 వేల మంది టీచర్లకు బదిలీలు పూర్తి చేశాం. నీతిఆయోగ్ నివేదికలో విద్యలో రాష్ట్రం సాధించిన విజయాలను అభినందించింది. ఇందుకు విద్యాశాఖ ఉద్యోగులు, టీచర్లను అభినందిస్తున్నాను. 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 19 లక్షలకు పైగా పేద విద్యార్థులు చదువుకుంటున్నారు.1.05 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. రాష్ట్రంలో 17 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నాడు. విదేశాల్లో విద్యాబోధన, అభ్యసన కార్యక్రమాల పరిశీలనకు టీచర్లను పంపుతాం దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది. ప్రపంచ దేశాల్లో విద్యావిధానాన్ని కూడా మనం అధ్యయనం చేయాలి. మంత్రులు, ఉన్నతాధికారులే కాదు.. క్షేత్రస్థాయిలో బోధించే టీచర్లు ఈ అధ్యయనంలో భాగం కావాలి. అందుకే ఇటీవల 25 మంది ప్రభుత్వ టీచర్ల బృందాన్ని ఫిన్లాండ్కు పంపించాం. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే ఉపాధ్యాయులను ఎంపిక చేసి 500 మందిని విదేశాలకు పంపించాలనుకుంటున్నాం. విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాలను గుర్తించే టీచర్లను అభినందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున లేదా మరో ప్రత్యేక దినాన టీచర్లకు సన్మానం చేస్తాం.దేశానికి ఆదర్శంగా నూతన విద్యా విధానం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి నర్సరీ టు 12 వ తరగతి వరకు ప్రవేశపెడుతున్నాం. పదోతరగతి పాసైన తర్వాత ఇంటర్లో డ్రాపౌట్స్ను అరికట్టేందుకే ఈ నిర్ణయం. వర్సిటీలల్లో సదుపాయాల కల్పనకు భారీగా నిధులు ఖర్చు పెడుతున్నాం. 100 నియోజకవర్గాల్లో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను రూ.20 వేల కోట్లతో నిర్మిస్తున్నాం. పాఠశాల ప్రారంభమయ్యే రోజే విద్యార్థులకు ఒక జత స్కూల్ డ్రెస్, మరో జత జూన్ నెలాఖరున ఇస్తాం.ఎడ్యుకేషన్ కిట్ కోసం రూ.1,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ప్రభుత్వ టీచర్లకు ఉద్యోగం కాదు భావ్వోదేగం. పేద తల్లిదండ్రుల కళ్లలో ఆనందం చూడాలంటే టీచర్లు ఒక గంట అదనంగా పని చేయాలి. విద్యాశాఖకు మంత్రి లేడని కొందరు బుర్ర లేకుండా మాట్లాడుతున్నారు. సమీక్ష సమయంలో నన్ను ముఖ్యమంత్రిగా కాకుండా విద్యాశాఖ మంత్రిగా చూడండి. కావాలనే నేను విద్యా శాఖను నా దగ్గర పెట్టుకున్నాను’అని సీఎం స్పష్టం చేశారు. అనంతరం అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యార్థులకు నగదు బహుమతులను సీఎం అందజేశారు. ఈ సమావేశంలో మంత్రులు డి.శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మహ్మద్ అజహరుద్దీన్, జి.వివేక్ పాల్గొన్నారు. -
‘ప్రభుత్వ పాఠశాలలే దేశ భవిష్యత్కు వేదికలు’
హైదరాబాద్: విద్యాశాఖను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని నిర్ణయించామన్నారు రేవంత్. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా నగరంలోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన విద్యా వారోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ ప్రసంగించారు. ‘రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీలను అభివృద్ధి చేస్తున్నాం. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని నిర్ణయించాం. విద్యాశాఖ పనితీరు నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకూ పేదవారికి విద్యను అందిస్తాం. ప్రైవేటు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారుచేస్తాం. విద్యాశాఖకు అంచెలంచెలుగా 15 శాతం నిధులు కేటాయిస్తాం. ప్రభుత్వ పాఠశాలలే దేశ భవిష్యత్కు వేదికలు. తెలంగాణ కల సాకారంలో విద్యార్థుల కృషి వెలకట్టలేనిది. 22వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చాం.’ అని రేవంత్ పేర్కొన్నారు.విద్య మూలంగానే కుటుంబాలు ఉన్నత శిఖరాలకు..మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రసంగిస్తూ.. ‘ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ లో బాగంగా ఈరోజు ముఖ్యమంత్రి విద్యా వారోత్సవాలు ప్రారంభించారు. అందులో భాగంగా దాదాపు 1100 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలతో పాటు ,క్యూర్ ప్రాంతంలో నిర్మించే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. సీఎం రేవంత్ చెప్తుంటారు..విద్యార్థి సంఘ్ రాజకీయాల నుండి వచ్చిన వ్యక్తిగా అనేక సమావేశాల్లో వేదికలపై చెప్పడం జరిగింది.. ఒక వ్యక్తి అభివృద్ధి వెనుక కులం , మతం డబ్బు కారణం కాదు ,విద్య మూలంగానే కుటుంబాలు ఉన్నత శిఖరాలకు చేరుతాయి’ అని తెలిపారు. -
బండి సంజయ్ కుమారుడి వ్యవహారంపై సీఎం రేవంత్ సీరియస్
-
అందుకే మోదీ బంగారాన్ని కొనొద్దన్నారు: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: బంగారం కొనొద్దని, విమానాల్లో ప్రయాణించొద్దని చెప్పడం ప్రధాని మోదీ వైఫల్యాన్ని సూచిస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం సికింద్రాబాద్లోని పరేడ్గ్రౌండ్స్లో సభ నిర్వహించిన మోదీ దేశ ప్రజలకు పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే. సోమవారం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్లో దీనిపై స్పందించారు.‘‘విదేశాంగ విధానంలో మోదీ ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వ అసమర్థ విధానాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఇది బాధ్యతారాహిత్యమైనది. రాహుల్ గాంధీ మొదటి నుంచి అదే చెబుతున్నారు. ప్రతిపక్షాల సూచనలను తీసుకోవాలి.. అఖిలపక్షాలను పిలిచి మాట్లాడాలి. కేంద్రానికి స్పష్టమైన విధానం లేదు. అనుభవరాహిత్యం, అహంకారం వల్లనే దేశాన్నిసంక్షోభంలోకి నెడుతున్నారు. యూరియాను కేంద్రం ఇవ్వాలి.. రాష్ట్ర ప్రభుత్వం పంచాలి’’ అని విమర్శించారు.2029లో జమిలి ఎన్నికలు కేరళలో 3 సీట్లు ,తమిళనాడులో 2 సీట్లు మాత్రమే బీజేపీ గెలుచుకుందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ‘‘ఎస్ఐఆర్ను బీజేపీ ఆయుధంగా ఉపయోగిస్తోంది. పశ్చిమ బెంగాల్లో 90 లక్షల ఓట్లను తొలగించారు. ఏ రాష్ట్రంలో గెలవాలంటే అక్కడ ఎస్ఐఆర్ ను ప్రయోగిస్తున్నారు.జూబ్లీహిల్స్ లో బీజేపీకి డిపాజిట్ రాలేదు.. మున్సిపాలిటీల్లో బీజేపీ పరిస్థితి ఏమిటి? జమిలి ఎన్నికలు 2029లో పెట్టడానికి ఆస్కారం ఉంది. బీజేపీకి ప్రజాస్వామ్యంపైన నమ్మకం లేదు. అతి పెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ ఆహ్వానించాలి. గవర్నర్ చెప్పిన తేదీన బలనిరూపణ చేయించుకుంటే సరిపోతుంది. బండి సంజయ్ కొడుకు అంశంపైన డీజీపీ, ఇతర అధికారులతో సమీక్ష చేశాను. విచారణ ప్రారంభమైంది.. పోలీసులు చర్యలు తీసుకుంటారు. బీఆర్ఎస్ వాళ్లు కోరుకున్నట్లు క్షణాల మీద జరగదు. బాదితులను కలిసి స్టేట్ మెంట్ తీసుకుని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. మైనర్ బాలిక కు సంబంధించిన అంశంలో అంతా భాద్యతాయుతంగా ఉండాలి. తుమ్మడి హట్టి పైన ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశాం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించేలా చూడాలని ప్రధాని మోదీకి నేను లేఖ రాశాను.తెలంగాణకు కేంద్రం నుంచి ఆశించిన మేరకు సహకారం లేదు. రీజనల్ రింగ్ రోడ్డు నార్డ్ ఫార్ట్ , కాకాతీయ మెగా టెక్స్ టైల్స్, ఎయిర్ పోర్టులు క్లియర్, డిఫెన్స్ ల్యాండ్స్, మూసీ కోసం ఏడీబీ నిధులు, నేషనల్ హై వేలు వచ్చాయి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇవి ముందుకు సాగలేదు. మేం వచ్చాక క్లియర్ చేయిస్తున్నాం. మెట్రో, సదరన్ పార్టు రీజనల్ రింగ్ రోడ్డు ఇలా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. సింగిల్ విండో విధానం తీసుకువచ్చి పరిష్కరించమని ప్రధానిని కోరాం. అధికారిక కార్యక్రమంలో రాజకీయాలు లేవు. రాజకీయ అంశాలకు తావు లేదు. నేను, మోదీ ప్రస్తావించింది అభివృద్ధిని మాత్రమే. అభివృద్ధి విషయంలో కలిసి పనిచేద్దామని ఆయన చెప్పారు’’ అని తెలిపారు. తమ ఇద్దరి మధ్య జరిగిన ప్రస్తావన అభివృద్ధికి చెందినది మాత్రమేనని.. అందులో రాజకీయాలకు తావులేదని చెప్పారు. -
బండి తనయుడి కేసుపై సీఎం రేవంత్ ఆరా!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడి వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడడంతో భగీరథ్పై పోక్సో కేసు నమోదైంది కూడా. అయితే.. ఈ వ్యవహారంలో పోలీస్ శాఖ నుంచి సరైన స్పందన కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కేసుపై స్పందించినట్లు సమాచారం అందుతోంది. సోమవారం డీజీపీ సీవీ ఆనంద్తో భేటీ అయ్యి ఈ కేసుపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. ‘‘ఈ నెల 8వ తేదీన ఫిర్యాదు వస్తే..ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదు?’’ అని డీజీపీని సీఎం ప్రశ్నించారు. అయితే.. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లలోనే పోలీసులంతా నిమగ్నమయ్యారని ఆయన వివరణ ఇచ్చినట్లు సమాచారం. దీంతో.. తక్షణమే విచారణ మొదలు పెట్టాలని సీఎం డీజీపీని ఆదేశించినట్లు సమాచారం అందుతోంది. మైనర్ బాలిక వేధింపులకుగానూ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్ పైన నమోదు కేసు అయ్యింది. అయితే బాలిక కుటుంబంపై సంచలన ఆరోపణలు చేస్తూ భగీరథ్ కూడా ఫిర్యాదు చేసినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే పోలీసు వర్గాలు ఆ ప్రచారాన్ని కొట్టిపారేశాయి. తాజా విమర్శల నేపథ్యంలో కేసు సమగ్ర విచారణ కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి డీజీపీని ఆదేశించినట్లు తెలుస్తోంది. -
రేవంత్ కు మోదీ ఓపెన్ ఆఫర్
-
ఇంటర్ అడ్మిషన్లు పాత పద్ధతిలోనే..
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్లో ప్రవేశాలు 2026–27 విద్యా సంవత్సరానికి పాత పద్ధతిలోనే చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ప్రవేశాలకు సమయం తక్కువగా ఉందని, ఇంటర్మీడియట్ను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రక్రియకు పలు సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉండటంతో విద్యార్థుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా వెంటనే ప్రవేశాల ప్రక్రియను చేపట్టాలని స్పష్టం చేశారు. ఇంటర్మీడియట్ను రద్దు చేసి సీబీఎస్ఈలో తరహాలో 11, 12 తరగతులను పాఠశాల విద్యలోనే కొనసాగించాలని, ఫలితంగా డ్రాపౌవుట్స్ సంఖ్య గణనీయంగా తగ్గుతుందని తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి వరకు చదివిన విద్యార్థుల్లో అత్యధికులు ఆ తర్వాత ఇంటర్మీడియట్కు వేరుగా ఉన్న కళాశాలల్లో చేరడం లేదు. అక్కడితోనే చదుకు ఆపేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ను వేరుగా కాకుండా 11, 12 తరగతులుగా కొనసాగించాలని ముఖ్యమంత్రి గతంలో అధికారులకు సూచించారు. ఇదే అంశాన్ని తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ కూడా తన నివేదికలో పేర్కొంది. ఇటీవల ఇంటర్మీడియట్లో ప్రవేశాలు నిలిపివేస్తూ అధికారులు ప్రకటన విడుదల చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. జూనియర్ కాలేజీల యాజమాన్యాలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో సీఎం, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి వి.వి.శేషాద్రి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, విద్యాశాఖ కమిషనర్ యోగితా రాణాలతో ఆదివారం సమీక్షించారు. ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయడంతో ముడిపడిన పలు సాంకేతిక సమస్యలను క్షుణ్నంగా అధ్యయనం చేయాల్సి ఉన్నందున ఈ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించారు. విలీన ప్రక్రియకు సంబంధించి భాగస్వాములతో విస్తృతంగా సంప్రదింపులు నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై నియమించిన కమిటీ అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సూచించారు. అనంతరం శాసనసభలో చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. సీఎం తాజా ఆదేశాలతో అతి త్వరలో ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసే అవకాశం ఉంది. -
సంపూర్ణంగా సహకరిస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాష్ట్ర అభ్యున్నతికి అవసరమైన ప్రాజెక్టులు, నిధుల విషయంలో కేంద్రం ఎలాంటి వివక్ష చూపదని హామీ ఇచ్చారు. తెలంగాణ వికసిస్తేనే దేశం వికసిస్తుందనే నినాదంతో రాష్ట్ర అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన మోదీ.. హెచ్ఐసీసీ వేదికగా రూ.9,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తెలంగాణను దేశ ఆర్థిక వృద్ధికి కీలక శక్తిగా అభివర్ణించిన ఆయన ఇవి కేవలం ప్రాజెక్టులు కాదు.. తెలంగాణ ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు అని పేర్కొన్నారు. అంతకు ముందు నిధుల కేటాయింపు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రధాని ఛలోక్తులు విసిరారు.‘సీఎం రేవంత్ రెడ్డి గారూ.. ఇది వింటున్నారా?‘ అంటూ తెలంగాణకు కేంద్రం ఇస్తున్న భరోసాను ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎదుర్కొన్న అనుభవాలను మోదీ గుర్తు చేశారు. ‘పదేళ్లుగా గుజరాత్కే ఎక్కువ నిధులు ఇచ్చారని అంటున్నారు. కేంద్రం పదేళ్లలో గుజరాత్కు ఎంత ఇచ్చిందో రేవంత్రెడ్డి చెప్పాలి. ఆ రాష్ట్రంతో సమానంగా తెలంగాణకు నిధులు ఇచ్చేందుకు సిద్ధం. గుజరాత్తో సమానంగా నిధులిస్తే ఇప్పుడు వచ్చే దాంట్లో మీకు సగమే వస్తాయి. అన్ని రాష్ట్రాలను కేంద్రం ఐక్యంగా ముందుకు తీసుకెళ్తోంది.తెలంగాణ ప్రజల కలలు నెరవేర్చేందుకు కట్టుబడి ఉంది’అని మోదీ అన్నారు. అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలని ముఖ్యమంత్రికి సూచించారు. మౌలిక సదుపాయాలు, హైవేల అభివృద్ధి కోసం కేంద్రం లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని, దీనివల్ల తెలంగాణకు భారీ లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ‘నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమాఖ్య స్ఫూర్తితో కేంద్రం నుంచి సహకారం లభించింది. ఇప్పుడు అదే భావనతో తెలంగాణకు కూడా సహకరిస్తున్నాం. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు స్థానం ఉండకూడదు’అని స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ను వికసిత్ భారత్లో భాగం చేద్దామంటూ పిలుపునిచ్చారు. ఎన్నికలు ముగిశాయి.. ఇప్పుడు అభివృద్ధే ఎజెండా ‘ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా.. అభివృద్ధి కోసం కేంద్రం ఎప్పుడూ భేదభావం చూపలేదు. గత పదేళ్లలో తెలంగాణలో నిర్మించిన జాతీయ రహదారులు, రైల్వే మార్గాలు, మౌలిక సదుపాయాలే ఇందుకు నిదర్శనం’అని ప్రధాని పేర్కొన్నారు. ఎన్నికల రాజకీయాలు ముగిశాయని.. ఇక రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి ప్రజల అభ్యున్నతిపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో భుజం భుజం కలిపి నడిస్తే తెలంగాణ అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందన్నారు. సైబరాబాద్ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని, ఇది దేశంలోనే అతిపెద్ద ఉపాధి కేంద్రంగా మారిందని ప్రశంసించారు.వరంగల్లో ఏర్పాటవుతున్న పీఎం మిత్ర పార్క్ (కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్) తెలంగాణ పారిశ్రామిక రంగానికి గేమ్ చేంజర్గా మారుతుందని అభిప్రాయపడ్డారు. ‘తెలంగాణ చేనేత కళాకారుల ప్రతిభ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ పార్క్ ద్వారా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. స్థానికంగా తయారయ్యే వస్త్రాలు అంతర్జాతీయ మార్కెట్లకు చేరతాయి’అని చెప్పారు. దీంతో తెలంగాణ టెక్స్టైల్ రంగంలో ప్రధాన హబ్గా ఎదుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ పాత్ర అత్యంత కీలకం హైదరాబాద్–పనాజీ కారిడార్, జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి వంటి ప్రాజెక్టులను ప్రస్తావించిన ప్రధాని.. ‘ఇవి కేవలం రోడ్లు కాదు.. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపే ఇంజిన్లు’అని వ్యాఖ్యానించారు. మౌలిక సదుపాయాలు మెరుగుపడితే పెట్టుబడులు పెరుగుతాయని.. తద్వారా యువతకు రాష్ట్రంలోనే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంలో తెలంగాణ పాత్ర అత్యంత కీలకమని మోదీ అన్నారు.మాటకు మాట... సీఎం రేవంత్రెడ్డి: మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ సహకారంతో గుజరాత్ మోడల్ను అభివృద్ధి చేశారు. తెలంగాణ ప్రజలు కూడా రాబోయే పదేళ్లలో మీ సహకారంతో మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు. నాటి మన్మోహన్ సింగ్ ఇచ్చిన స్ఫూర్తితో మీరు నాకు పూర్తి సహకారం అందిస్తారని విశ్వసిస్తున్నా..’ప్రధాని మోదీ: పదేళ్లుగా గుజరాత్కే ఎక్కువ నిధులు ఇచ్చారని అంటున్నారు. కేంద్రం పదేళ్లలో గుజరాత్కు ఎంత ఇచ్చిందో రేవంత్రెడ్డి చెప్పాలి. ఆ రాష్ట్రంతో సమానంగా తెలంగాణకు నిధులు ఇచ్చేందుకు సిద్ధం. గుజరాత్తో సమానంగా నిధులిస్తే ఇప్పుడు వచ్చే దాంట్లో మీకు సగమే వస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైల్వే బడ్జెట్ రూ. 1,000 కోట్లు కూడా దాటేది కాదు, కానీ ఇప్పుడు ఒక్క తెలంగాణకే రూ.5,500 కోట్లు కేటాయించాం. మీరు కంటున్న కలలు చేరుకోవాలంటే మాతో కలసి రండి.. లేకపోతే ఎప్పటికీ అది సాధ్యం కాదు. -
‘‘రాజకీయాలు మాట్లాడబోనని రేవంత్ అన్నారు.. నేను కూడా..’’
హైదరాబాద్: ‘‘రాజకీయాలు మాట్లాడబోనని రేవంత్రెడ్డి అన్నారు. నేను కూడా రాజకీయాలు మాట్లాడబోను’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చమత్కరించారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా హెచ్ఐసీసీలో నిర్వహించిన సభలో మోదీ పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. మోదీ ప్రసంగానికి ముందు రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. ఆ సమయంలో రేవంత్ చేసిన వ్యాఖ్యను గుర్తు చేస్తూ మోదీ పై విధంగా వ్యాఖ్యానించడంతో అక్కడున్న వారంతా చిరునవ్వులు చిందించారు.కాగా, మోదీ ప్రసంగిస్తూ.. ‘‘గుజరాత్కు యూపీఏ హయాంలో ఎన్ని నిధులు ఇచ్చారో తెలంగాణకు అంతే నిధులు ఇస్తాం. దీంతో తెలంగాణకు అందుతున్న నిధుల్లో సగం కోత పడుతుంది. కాబట్టి మీరు ఎక్కడికైతే చేరుకోవాలనుకుంటున్నారో అది సాధ్యం కాదు. మీరు కూడా నాతో కలిసి రండి సైబరాబాద్ అభివృద్ధికి వేల కోట్లు రూపాయలు కేటాయించాం. తెలంగాణలో జాతీయ రహదారులు రెట్టింపు అయ్యాయి. ఇప్పుడు బడ్జెట్లో తెలంగాణకే రూ.5,500 కోట్లు రైల్వే పనులకు కేటాయించాం. దేశంలో టెక్స్టైల్ రంగానికి ఊతమిచ్చేలా నిర్ణయాలు తీసుకున్నాం. వరంగల్ పీఎం మిత్ర పార్కు ద్వారా దేశంలో టెక్స్టైల్స్ రంగానికి ఊతమిస్తుంది.అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలతో ఉద్యోగ కల్పన జరుగుతుంది. ఉద్యోగ అవకాశాలకు హైదరాబాద్ కేంద్రంగా మారింది. ఇప్పుడు తెలంగాణ రైల్వే బడ్జెట్ ఎన్నో రెట్లు పెరిగింది. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోంది. 2014లో ఉమ్మడి ఏపీలో రైల్వే బడ్జెట్ రూ.1000 కోట్లు మాత్రమే. హైదరాబాద్ అభివృద్ధికి వేలాది కోట్లు కేటాయించాం. రోడ్లు, రైల్ కనెక్టివిటీని పెంచాం. తెలంగాణ అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది.’’ అని చెప్పారు. -
అదే మా లక్ష్యం.. హైదరాబాద్లో మోదీకి చెప్పిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్: దేశ ఎకానమీని 2047 నాటికి 30 ట్రిలియన్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా హెచ్ఐసీసీలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టారు. ఇందులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణను నంబర్ 1గా చేయడమే తమ లక్ష్యమని తెలిపారు.పెండింగ్ ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరారు. ఫ్యూచర్సిటీ, మూసీనది అభివృద్ధికి ప్రధాని మోదీ సహకారం అవసరమని అన్నారు. రాజకీయాలను పక్కనబెట్టి అభివృద్ధిపై దృష్టిపెడతామని చెప్పారు. తెలంగాణను నంబర్ 1 చేయడానికి రైజింగ్ పాలసీ తీసుకొచ్చామని తెలిపారు.మరోవైపు, గతంలో ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలకు వస్తే అప్పుడున్న ముఖ్యమంత్రి రాలేదని కిషన్ రెడ్డి చెప్పారు. 2014కు ముందు రోడ్లు ఎలా ఉండేవి?ఇప్పుడు ఎలా ఉన్నాయి? అని అన్నారు. త్వరలోనే రీజనల్ రింగ్రోడ్ పనులను ప్రారంభిస్తామని తెలిపారు. -
‘బండి సంజయ్ కుమారుడి ఎపిసోడ్.. 36 గంటలైనా కేసు లేదా?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడిపై కేసు విషయంలో రాజకీయం హీటెక్కింది. బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై పోక్సో కేసు నమోదు చేయడంలో పోలీసుల జాప్యంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం కోసం బాధితురాలు పోలీస్ స్టేషన్కు వెళ్తే.. కేసు నమోదు చేయడానికి 8 గంటల సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నించారు.మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా..‘బాధితురాలు న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే.. కేసు నమోదు చేయడానికి 8 గంటల సమయం ఎందుకు పట్టింది?. కేసు నమోదై 36 గంటలు గడుస్తున్నా నిందితులపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్ర హోంమంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య చీకటి ఒప్పందానికి, కుమ్మక్కు రాజకీయాలకు ఇంతకంటే నిదర్శనం వేరే ఏమైనా ఉంటుందా? పోలీసులు వెంటనే నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.బాధితురాలు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్తే.. కేసు నమోదు చేయడానికి 8 గంటల సమయం ఎందుకు పట్టింది?కేసు నమోదై 36 గంటలు గడుస్తున్నా నిందితులపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.హోం మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి @revanth_anumula దీనికి సమాధానం చెప్పాలి.రాష్ట్రంలో కాంగ్రెస్,…— Harish Rao Thanneeru (@BRSHarish) May 10, 2026 డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తతబండి సంజయ్ కుమారుడిని అరెస్టు చేయాలని బీఆర్ఎస్వీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ కార్యాలయం ముందు ఆదివారం మెరుపు ధర్నా చేశారు. అలాగే కేంద్రమంత్రి బండి సంజయ్ను వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపైనా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ను పలువురు మహిళలు ముట్టడించారు. బండి సంజయ్ కుమారుడు భగీరథ్ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ను ముట్టడించిన మహిళలుబండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ను ముట్టడించిన మహిళలు.#pocso #bandisanjaypic.twitter.com/8akltWzosD— ఉప్పిడి పిండి (@bharathbunny27) May 10, 2026 -
సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ను సిగ్నల్ ఫ్రీ నగరంగా మార్చాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణకు కేవలం రహదారుల విస్తరణ ఒక్కటే సరిపోదని, బహుళ విధానాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచాల్సి ఉంటుందన్నారు. పెరుగుతున్న నగరీకరణతో సమీప భవిష్యత్తులో మరిన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని, అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. శనివారం సచివాలయంలో గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో రేవంత్ పాల్గొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ(క్యూర్) ప్రాంతం మొత్తంగా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తూ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నట్లు వెల్లడించారు. ‘హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ నగ రంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. కీలకమైన ప్రాంతాల్లో అండర్పాస్లు, ఉపరితల రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్ వంటి మూడు విధానాల్లో సులభతరమైన రవాణా మార్గాలను కల్పించే విధానాన్ని ఎంచుకున్నాం. పార్కింగ్ ఇబ్బందులను అధిగమించేందుకు నగరంలో మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నాం’అని వివరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ విభాగాలుగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. కాలుష్య కోరల నుంచి హైదరాబాద్ను కాపాడటానికి మూసీ రివర్ ఫ్రంట్ను అభివృద్ధి చేయడంతో పాటు నగర సంస్కృతికి అనుసంధానించబోతున్నట్లు వివరించారు. నగర తాగునీటి సరఫరా, పట్టణాభివృద్ధి, మూసీ పునరుజ్జీవం తదితర అంశాలపై ప్రభుత్వ ప్రణాళికలను సమావేశంలో ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్టాండింగ్ కమిటీకి వివరించారు. నగర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కేంద్రం సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. పునరుజ్జీవ ప్రాజెక్టు దేశంలోనే మొదటిది: స్టాండింగ్ కమిటీ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ మాగుంట శ్రీనివాసులరెడ్డితోపాటు ఇతర సభ్యులు మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును విప్లవాత్మక నిర్ణయంగా అభివర్ణించారు. హైదరాబాద్ నగర జీవన స్థితిగతులను మెరుగుపరిచే మూసీ పునరుజ్జీవ తరహా ప్రాజెక్టు దేశంలోనే మొదటిదని అభిప్రాయపడ్డారు. ఎంతో కీలకమైన ఈ ప్రాజెక్టును చేపట్టడంపై కమిటీ ముఖ్యమంత్రిని అభినందించింది. దీంతోపాటు రాష్ట్రంలో మహిళాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను కొనియాడింది. అంతకుముందు స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్తోపాటు సభ్యులను ముఖ్యమంత్రి సత్కరించారు. తెలంగాణ రైజింగ్ –2047 విజన్ డాక్యుమెంట్ను కమిటీ సభ్యులకు అందజేశారు. సమావేశంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఈ ఘోరమైన కేసుల్లో చర్యలేవీ?: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్: తెలంగాణలో గత 15 రోజులుగా లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లో మాజీ ఐపీఎస్ భార్య హత్య జరిగినా, కరీంనగర్ గోల్డ్ షాపులో భారీ చోరీ జరిగినా ఇప్పటికీ నిందితులను పట్టుకోలేదని విమర్శించారు.మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ను 40 మంది ఆకతాయిలు వేధించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి చిన్న విషయానికి 'సిట్' వేస్తారని, మరి రాష్ట్రంలో పెరుగుతున్న ఈ నేరాల పరంపరపై ఎందుకు ప్రత్యేక విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ పోలీసు శాఖ తూతూ మంత్రంగా పనిచేస్తోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు.‘‘రేవంత్ రెడ్డి నిజంగా మీకు, బండి సంజయ్ కు మధ్య ఎలాంటి దోస్తానా లేకుంటే, మీ కాంగ్రెస్, బీజేపీ ఒక్కటి కాకపోతే బండి సాయి భగీరథ్ ను వెంటనే జైలుకు పంపండి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తున్నాడు. అమ్మాయి తల్లితండ్రులకు ఎలాంటి హాని జరిగినా దానికి రేవంత్ రెడ్డి, పోలీసులే బాధ్యత వహించాలి. బండి సంజయ్ కొడుకు బాలికపై అఘాయిత్యానికి పాల్పడితే చర్యలేవీ? రేవంత్ రెడ్డి, బండి సంజయ్ స్నేహితులు కాబట్టే చర్యలు లేవు’ అని అన్నారు. -
బంగారు తునకలా మార్చుకుందాం
వికారాబాద్: దశాబ్దాల తరబడి అన్యాయానికి గురైన కొడంగల్ను బంగారు తునకగా మార్చుకుందామని సీఎం రేవంత్రెడ్డి ప్రజలు, ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ కాదు అనేలా నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకుందామని, దేశంలోని గొప్ప గొప్ప పరిశ్రమలు కొడంగల్ బాట పట్టాయని తెలిపారు. శుక్రవారం కొడంగల్లో మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు రామ్మోహన్రెడ్డి, మనోహర్రెడ్డితో కలిసి రూ.110 కోట్లతో కొడంగల్ వెంకటేశ్వరస్వామి, రూ.2 కోట్లతో కోస్గి వేణుగోపాలస్వామి, రూ.2.5 కోట్లతో దౌల్తాబాద్ వెంకటేశ్వరస్వామి ఆలయాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి సీఎం ప్రసంగించారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే...‘నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకాన్నిఏడాదిన్నరలోపు పూర్తి చేసి కృష్ణా జలాలు అందిస్తాం. దీనికి సంబంధించిన భూసేకరణ బాధ్యతలను మంత్రి శ్రీహరికి అప్పగిస్తే నెల రోజుల్లో పూర్తి చేశారు. ఎత్తిపోతల పథకానికి ఇక ఏ అడ్డంకులూ లేవు. ఎప్పుడంటే అప్పుడు నిధులు మంజూరు చేస్తాం. ఏడాదిన్నర లోపు పనులు పూర్తి చేసి లక్షన్నర ఎకరాలకు నీరందిస్తాం. రైల్వేలైన్ కోసం పరిగి ఎమ్మెల్యే ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది. వికారాబాద్– కృష్ణా రైల్వే మంజూరు పనులు ఇప్పటికే తొంభై శాతం పూర్తయ్యాయి.మిగిలిన పనులను త్వరలోనే పూర్తి చేసి పరిగి, కొడంగల్లో రైలు కూత వినిపిస్తాం. సుద్ద గనులు మన దగ్గర ఉంటే సిమెంటు కంపెనీలు కర్ణాటకలో ఉండేవి. మన ఖనిజ సంపదంతా అక్కడకు తరలివెళ్లేది. ఇప్పుడు పరిస్థితి మారింది. వచ్చే ఆరు నెలల్లో నియోజకవర్గంలో సిమెంటు పరిశ్రమ నిర్మాణం జరుగుతుంది. స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయి.మెడికల్, ఇంజనీరింగ్, ఏటీసీ సెంటర్, నర్సింగ్ కాలేజీ, పాలిటెక్నిక్, సైనిక్ స్కూల్ ఇలా అన్ని విద్యా సంస్థలు ఇప్పుడు కొడంగల్లో ఏర్పాటు అవుతున్నాయి. ఏడాదిన్నరలోపు ఎడ్యుకేషన్ హబ్ పనులు పూర్తవుతాయి. ఉపాధి అవకాశాలు లేక పేదలు పూణే, బాంబేలకు వలసలు వెళ్లేవారు.. నేడు మన దగ్గరే పరిశ్రమలు నెలకొల్పి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పింస్తున్నాం. పేదల తిరుపతిగా కొడంగల్ వెంకటేశ్వరాలయం తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలకు కూడా పేదల తిరుపతిగా విరాజిల్లుతోంది. ఇప్పుడు పునరి్నర్మాణ పనులు చేపట్టి తిరుపతి స్థాయిలో అభివృద్ధి చేస్తాం. ఈ ప్రాంతానికి చెందిన ఆగమ శాస్త్ర పండితులు సుందర వరదాచార్యుల సలహా ప్రకారమే తిరుపతిలో అన్ని కార్యక్రమాలు జరిగేవి. ఇప్పుడు ఇక్కడ భూమి పూజ కూడా ఆయన పెట్టిన ముహూర్తానికే చేశాం. కానీ ప్రస్తుతం ఆయన మన మధ్యలేకపోవటం ఎంతో లోటు. ఈ ప్రాంత ప్రజలు ఆయనను ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకునేలా ఆలయంలోని ఓ విడిదికి వరదాచార్యుల పేరు పెడతాం. వెనుకబాటుకు గురయ్యాం.. గురునాథ్రెడ్డి కొడంగల్ నుంచి అనేకసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి కాలేకపోయారు. కొడంగల్ అభివృద్ధికి ఆనాడు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. దశాబ్దాలుగా ఈ ప్రాంతం నుంచి గెలిచిన వారెవరూ మంత్రి కాలేకపోయారు. దీంతో అభివృద్ధిలో వెనుకబాటుకు గురయ్యాం. ప్రజల ఆశీర్వాదంతో ఇప్పుడు ముఖ్యమంత్రిగా నిలబడ్డా. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ కాదు అన్న తరహాలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. అభివృద్ధిలో కలిసిసాగాలి పార్టీలకతీతంగా నాయకులు, సర్పంచ్లు కలిసొచ్చి అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేస్తున్నాం. రాష్ట్రంలోనే కొడంగల్ ఎత్తయిన ప్రాంతం. నీరు వచ్చే అవకాశం లేకపోయింది. కందులు తప్ప వడ్లు పండించే పరిస్థితి లేదు. ఈ రోజు ప్రతి తండా, ప్రతీ పంచాయతీకి రోడ్డు నిర్మించుకున్నాం. ఇంకా ఎక్కడ ఏం అవసరం ఉన్నా చేసుకుందాం. కార్యకర్తలు, నాయకుల కష్టంతోనే నేను ఈ స్థాయికి వచ్చా.. కొడంగల్ కార్యకర్తల ఆశీర్వాదంతో ముఖ్యమంతి పదవి వచ్చింది.. దేశానికే ఆదర్శ నియోజకవర్గంగా కొడంగల్ను తీర్చిదిద్దుకుందాం. ఏది కావాలన్నా చేసుకుందాం.. 2,300 ఎకరాల్లో ఇండ్రస్టియల్ పార్కు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎయిర్పోర్టు నుంచి కోస్గి వరకు 300 ఫీట్ల వెడల్పుతో రోడ్డు నిర్మించుకుంటున్నాం. 2009లో మీరు నాటిన మొక్క నేడు చెట్టుగా మారింది. సీఎంగా మీముందు కూర్చుంది.. ఏది కావాలన్నా కొదవ లేకుండా చేసుకుందాం’అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యార్, కార్పొరేషన్ల చైర్మన్లు గురునాథ్రెడ్డి, కల్వ సుజాత, కలెక్టర్ దీపక్తివారి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణలో ఇలా... ఆంధ్రప్రదేశ్లో అలా!
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవడం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతిష్ట తెస్తుందా? లేక ఇందులో ఏమైనా రిస్క్ ను ఫేస్ చేయవలసి ఉంటుందా? రేవంత్ గురువుగా భావించే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేమో గత సీఎం జగన్ ప్రభుత్వ రంగంలో తీసుకువచ్చిన కొత్త మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిలో ప్రైవేటు పరం చేయడానికి యత్నిస్తున్నారు. రేవంత్ మాత్రం ప్రైవేటు రంగంలో ఉన్న మెట్రో రైల్ను రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తూ ప్రభుత్వ పరిధిలోకి తీసుకు వస్తున్నారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం కేవలం రూ.ఐదు వేల కోట్లతో కోట్లాది ప్రజలకు మంచి చేయగల వైద్య కళాశాలల ప్రారంభానికి వెనుకాడుతోంది. ఈ మధ్యకాలంలో ప్రైవేటు సంస్థ నుంచి ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సందర్భం ఇదే కావచ్చు. దీనిని బట్టి ప్రైవేటు సంస్థలు ప్రభుత్వాల కన్నా బాగా పని చేస్తాయన్నది ఒక అపోహ మాత్రమే అన్నది స్పష్టమవుతోంది. రేవంత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎల్ అండ్ టీకి మేలు చేస్తోందన్న భావన కలిగినా, మెట్రో రైలు ఆస్తులు అన్ని ప్రభుత్వపరం అవుతాయి కనుక భవిష్యత్తులో వాటికి మంచి విలువ రావచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం అంతగా స్వాగతించడం లేదన్న వార్తలు కూడా వస్తున్నాయి. మెట్రో రైలు స్వాధీనం చేసుకోవడం కన్నా, ప్రత్యామ్నాయ మోడల్లో రాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ను అమలు చేయవచ్చని కేంద్రం సూచిస్తోందంటూ ఒక ఆంగ్ల పత్రిక కథనాన్ని ఇచ్చింది. బహుశా ఇది భవిష్యత్తులో రాజకీయ వివాదంగా మారొచ్చు. మెట్రో రైల్ నష్టాలపై ఆందోళన వ్యక్తం చేసిన ఎల్ అండ్ టీ రెండో దశ విస్తరణకు కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సర్కారు చర్చోపచర్చల తరువాత ప్రాజెక్టును తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. నష్టాల నుంచి గట్టెక్కడానికి ఇది మేలైన మార్గం కావడంతో ఎల్ అండ్ టీ కూడా అంగీకరించింది. ఇందుకోసం సుమారు రూ. 1461 కోట్ల విలువైన షేర్లను రాష్ట్ర ప్రభుత్వం బదలాయించుకుంటుంది. దాంతోపాటు ఈ ప్రాజెక్టుకు ఉన్న సుమారు రూ.13538 కోట్ల మొత్తాన్ని రీఫైనాన్స్ కు అంగీకారం కుదిరింది. అంటే ఈ అప్పు భారం అంతా తెలంగాణ ప్రభుత్వానిదే. రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న రూ.ఎనిమిది లక్షల కోట్ల అప్పుకు ఇది అదనమన్నమాట. అయితే ఈ అంశంపై ప్రతిపక్ష పార్టీలేవీ పెద్దగా విమర్శలు చేయకపోవడం గమనార్హం. అయితే... ప్రముఖ ఆంగ్ల పత్రిక హిందూకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు చూస్తే తెలంగాణ నిర్ణయం భవిష్యత్తులో వివాదమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్రం మెట్రో రైల్ ఫేజ్ 2, ఫేజ్ 2ఎ మ కింద సుమారు 162 కిలో మీటర్ల దూరం వరకు విస్తరించడానికి రాపిడ్ ట్రాన్సిట్ మోడల్ మంచిదని రాష్ట్రానికి సూచించిందట. దీనికి మెట్రో మోడల్ కన్నా తక్కువ వ్యయం అవుతుందని చెబతున్నారు. పటాన్ చెరు,ఆరామ్ఘఘర్, కోకాపేట, హయత్ నగర్, చాంద్రాయణగుట్ట, ఫ్యూచర్ సిటీ, రాజివ్ గాంధీ విమానాశ్రయం, మేడ్చల్, షామీర్ పేట ప్రాంతాలకు మెట్రో విస్తరించాలని తలపెట్టారు. ప్రస్తుతం భరిస్తున్న రుణంతో కలిపి ఈ రెండో దశకు 58 వేల కోట్ల రూపాయలు వ్యయం అవతుందని అంచనా వేస్తున్నారు.అదే కేంద్రం ప్రతిపాదిస్తున్న రాపిడ్ ట్రాన్సిట్ రైల్ వల్ల రూ.48 వేల కోట్లే ఖర్చు అవుతుందట.ఢిల్లీ-మీరట్ రూట్ లో ఈ తరహా విధానం అమలులో ఉందని చెబుతున్నారు.ఆరున్నర కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ రైల్ వస్తుందని అధికారులు అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం తన ఒరిజినల్ స్కీమ్ కే కట్టుబడి ఉంటే బీజేపీ, బీఆర్ఎస్లు అదనపు భారంపై విమర్శలు చేయవచ్చు. కొత్త ప్రాజెక్టుపై అధిక వ్యయం చేయబోతున్నారని ఆరోపణలు గుప్పించవచ్చు. అలాగని ఇంత జరిగాక మెట్రో రైల్ మోడల్ కాకుండా రాపిడ్ రైల్ కు వెళ్లడం కూడా కష్టం కావచ్చు. ఏపీలో ప్రభుత్వం మెడికల్ కాలేజీలను సొంతంగా నడపలేదని, అవసరమైన పెట్టుబడులు పెట్టలేదని చంద్రబాబు సర్కార్ చెబుతోంది.ఒక పక్క అమరావతి పేరుతో వేల కోట్ల అప్పులు చేసి భారీ వ్యయం చేస్తున్న ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరికి ఉపయోగపడే మెడికల్ కాలేజీలను నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.చంద్రబాబు ఎంతసేపు ప్రైవేటువారికి సంపద కట్టబెట్టాలని చూస్తారన్న విమర్శలను విపక్షం చేస్తోంది.అయినా ఆ ప్రైవేటు సంస్థలు ఎంతవరకు బాధ్యత తీసుకుని ఆ మెడికల్ కాలేజీలను సమర్ధంగా నిర్వహిస్తాయో చెప్పలేం.దానివల్ల ప్రజలపై అదనపు భారం పడదన్న గ్యారంటీ లేదు.తెలంగాణలో మాత్రం ప్రజల ప్రయోజనాల కోసమే ప్రైవేటు కంపెనీని తప్పించి ప్రభుత్వమే మెట్రోని చేపడుతోందని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. రేవంత్ సర్కార్ నిర్ణయం వల్ల భవిష్యత్తులో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున సంపద సమకూరవచ్చు.ఎందుకంటే ఇప్పటికే నిర్మాణం అయిన మెట్రోలో రియల్ ఎస్టేట్ మోడల్, మాల్స్ వంటివాటికి ఏర్పాట్లు, ప్రచార ప్రకటనల ద్వారా ఆదాయ ఆర్జన వంటివి ఉన్నాయి. ఇప్పటికైతే అవన్ని లాభసాటిగా ఉన్నాయని చెప్పలేం కాని, హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ది చెందినందున ఫ్యూచర్ లో ఇది మెరుగైన ఫలితాలు ఇవ్వవచ్చేమో!కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మెట్రో ఫేజ్–2కు ఆమోదం తెలపండి
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ మెట్రో ఫేజ్–2కు ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏడు కారిడార్లతో కూడిన మెట్రో ఫేజ్–2 సమగ్ర ప్రణాళికను రూపొందించి ఇప్పటికే డీపీఆర్ను సమర్పించినట్లు తెలిపారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో సీఎం సమావేశమయ్యారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్–2, ఫేజ్–3పై చర్చించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రోను విస్తరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఫేజ్–2, ఫేజ్–3 విస్తరణ సజావుగా సాగాలనే ఉద్దేశంతో మెట్రో ఫేజ్–1ను ఎల్అండ్టీ ఎంఆర్హెచ్ఎల్ను ప్రభుత్వం స్వా«దీనం చేసుకుందని వివరించారు. ఈ నేపథ్యంలో ఫేజ్–2ను భారత ప్రభుత్వం – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్గా చేపట్టేందుకు త్వరగా ఆమోదం తెలపాలని రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే హైదరాబాద్ నగర భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆర్జీఐ ఎయిర్పోర్ట్ – భారత్ ఫ్యూచర్ సిటీ కారిడార్ను మెట్రో ఫేజ్–3గా చేపట్టాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. దీనికి సంబంధించిన డీపీఆర్ను కూడా ఇప్పటికే సమర్పించామని తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి కె.శ్రీనివాస్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్రెడ్డి, హెచ్ఎంఆర్ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (పట్టణ రవాణా) ఎన్వీఎస్ రెడ్డి, ఢిల్లీ తెలంగాణ భవన్ ప్రత్యేకాధికారి సంజయ్కుమార్, కేంద్ర ప్రభుత్వ పథకాల సమన్వయ కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. కేరళలో మోదీ, అమిత్షాలను ఓడించాం: సీఎం – వాళ్లకు ఒక్క సీటే దక్కింది తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా కేరళలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాను ఓడించామని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీకి వచ్చిన ఆయన విమానాశ్రయంలో విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు స్పందించారు. ‘కేరళలో కాంగ్రెస్ విజయం సాధించింది. అక్కడ రాహుల్, ప్రియాంకా గాం«దీ, మల్లికార్జున ఖర్గేలు నరేంద్ర మోదీ, అమిత్షాలను ఓడించారు. వాళ్లకు అక్కడ ఒక్క స్థానం మాత్రమే దక్కింది. అదీ వాళ్ల పనితీరు..’అంటూ ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. -
లైవ్ లో రేవంత్ పరువు తీసిన కేటీఆర్
-
వాళ్లను పెద్దలు అనేకంటే.. దొంగలు అనొచ్చు
సాక్షి, వరంగల్: కాంగ్రెస్ పార్టీ అనేది మోసాలకు, కుట్రలకు కేరాఫ్ అని.. ఆ విషయం తెలిసి కూడా నమ్మి తెలంగాణ రైతులు దారుణంగా మోసపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. రైతు డిక్లరేషన్ పేరిట ఒక్క హామీ అమలు చేయకపోవడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేటీఆర్ చురకలు అంటించారు. బుధవారం వరంగల్లో జరిగిన బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ‘‘నేటితో నయవంచనకు నాలుగేళ్లు. కాంగ్రెస్ పార్టీ నుంచి కొందరు పెద్దలు వరంగల్కు వచ్చారు. వాళ్లను పెద్దలు అనేకంటే దొంగలు అనొచ్చు. రాహుల్గాంధీ రైతు డిక్లరేషన్ పేరిట రైతులకు గాలం వేశారు. రైతుల రక్తం తాగిన పార్టీ.. రైతుల నెత్తినకిరీటం పెడతుందని మభ్యపెట్టింది. కాంగ్రెస్ కుట్రలు తెలిసి కూడా ఆ హామీలను నమ్మారు. కానీ, ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. రైతుల తరఫున కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక పంపేందుకే ఇవాళ రైతు సంగ్రామ సభ పెట్టాం.. .. రైతుల డిక్లరేషన్ పేరిట లక్షల మంది రైతులను కాంగ్రెస్ మోసం చేసింది. వంద రోజుల్లో హామీలను నెరవేరుస్తామని చెప్పి.. రెండున్నరేళ్లు గడిచింది. రైతు డిక్లరేషన్ గురించి అడిగితే ఎవరూ మాట్లాడడం లేదు. రాహుల్ గాంధీ ఎక్కడున్నావ్?.. రైతు డిక్లరేషన్ ఏమైంది? అని కేసీఆర్ ఈ సందర్భంగా అన్నారు. రాహుల్ గాంధీ ఫొటోలను బస్టాండ్లలో.. రైల్వే స్టేషన్లలో అంటించాలి. దాని కింద దొంగలున్నారు జాగ్రత్త అని రాయలాలి. కాంగ్రెస్ హయాంలో పంటలకు గిట్టుబాటు ధరల్లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో క్రమం తప్పకుండా పథకాలు అందేవి. తెలంగాణ తెచ్చిన రైతు భరోసాను 12 రాష్ట్రాల్లో అమలు చేశారు. 11 విడతల్లో కేసీఆర్ రూ.73 వేల కోట్లు ఇచ్చారు. కానీ, మూడు పంటలకు రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసింది. కాంగ్రెస్ నేతలు చెడ్డీగ్యాంగ్ కంటే డేంజర్....రైతు డిక్లరేషన్ అనేది ఒక బోగస్ పత్రం. 34 హామీలు ఇచ్చారు. ఏ ఒక్కటి అమలు చేయలేదు. రైతులకు నాగలితో దున్నడం తెలుసు.. మోసం చేసిన కాంగ్రెస్ వాళ్లను ఉరికించి కొట్టడమూ తెలుసు. ఆయన ఎనుముల రేవంత్రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్రెడ్డి. హామీలు అమలు చేసేంత వరకు కాంగ్రెస్పై బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని కేటీఆర్ ఉద్ఘాటించారు. -
తుమ్మిడిహెట్టి కోసం.. మళ్లీ సంప్రదింపులు
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర–తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై 150 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణానికి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం వేగిరం చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 148 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. 150 మీటర్లకు ఎత్తును పెంచి తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మించుకోవడానికి మహారాష్ట్ర అంగీకారం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో తక్షణమే సంప్రదింపులను ప్రారంభించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి వారం రోజుల్లో మహారాష్ట్రకు వెళ్లి ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో సమావేశమై చర్చలు జరపనున్నారు. ఇందుకోసం ఫడ్నవీస్ అపాయింట్మెంట్ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా లేఖ రాసింది. 150 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మిస్తే లిఫ్టు అవసరం లేకుండానే గ్రావిటీ కాల్వ ద్వారా గోదావరి జలాలను ఎల్లంపల్లి ప్రాజెక్టుకి తరలించవచ్చు. దీంతో ప్రాజెక్టు వ్యయం సైతం భారీగా తగ్గనుంది. ఫడ్నవీస్ మహారాష్ట్రలో విపక్షనేతగా ఉన్నప్పుడు తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. బరాజ్ నిర్మాణంతో మహారాష్ట్రలో ముంపునకు గురికానున్న రైతుల ఆందోళనలకు సైతం ఆయన మద్దతు తెలిపారు. ఆ తర్వాత ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎం అయ్యాక ఆయనతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. 2016 మార్చి 8న నాటి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు మహారాష్ట్రకు వెళ్లి 148 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణానికి ఫడ్నవీస్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మించి 165 టీఎంసీల జలాలను తరలించడానికి 2015 ఫిబ్రవరి 13న కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)తోపాటు పలు అనుమతులు సైతం వచ్చాయి. పర్యావరణ అనుమతుల కోసం తెలంగాణలో 2011 ఏప్రిల్లో బహిరంగ విచారణ నిర్వహించగా, మహారాష్ట్రలో చేపట్టలేకపోయారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదన్న కారణంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పక్కనపెట్టి దాని స్థానంలో కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లను నిర్మించింది. ప్రస్తుతం ఈ మూడు బరాజ్లు విఫలమై కొన్నేళ్లుగా నిరుపయోగంగా మారాయి. ఎల్ నినో ప్రభావంతో వచ్చే 2–7ఏళ్ల పాటు తీవ్ర వర్షాభావం నెలకొనే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణం ప్రక్రియను వేగవంతం చేసింది. 150 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే గ్రావిటీతో నీళ్లను తరలించుకోవచ్చని, కనీసం 129.23 టీఎంసీల నీటి లభ్యత ఉండనుందని ప్రభుత్వం అంచనాకు వచి్చంది. ఆ మేరకు ఎత్తు పెంచినా మహారాష్ట్రలో పెద్దగా ముంపు పెరగదని భావిస్తోంది. -
కరెంట్ అక్రమాలపై సీబీఐ!
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో తీవ్ర అక్రమాలు చోటుచేసుకున్నాయని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ మదన్ బి.లోకూర్ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా..వీటిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ కోరాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. జస్టిస్ లోకూర్ నివేదికను సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది. మరోవైపు రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచాలని కూడా కేబినెట్ తీర్మానించింది. సీఎం ఎ.రేవంత్రెడ్డి అధ్యక్షతన సోమవారం సచివాలయంలో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా 9 నెలల క్రితం సీబీఐ విచారణను కోరిన రాష్ట్ర ప్రభుత్వం..తాజాగా విద్యుత్ రంగ నిర్ణయాలపై సైతం సీబీఐతో విచారణ జరిపించాలని నిర్ణయించడం గమనార్హం. మంత్రివర్గ భేటీ అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి..మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరితో కలిసి విలేకరులకు వివరాలను వెల్లడించారు. కొనుగోళ్లు, నిర్మాణం పేరిట నిధుల దుర్వినియోగం ‘తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏర్పడిన విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్లకు దీర్ఘకాలిక ఒప్పందం చేసుకుంది. అలాగే 4000 మెగావాట్ల యాదాద్రి, 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..ఈ వ్యవహారాల్లో తీవ్ర అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ కోసం 2024 మార్చి 14న కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టం కింద జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ను ఏర్పాటు చేసింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో అదే ఏడాది జూలైలో ఆయన విచారణ నుంచి వైదొలిగారు. ఆయన స్థానంలో జస్టిస్ లోకూర్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించగా, అదే ఏడాది అక్టోబర్లో ప్రభుత్వానికి 114 పేజీల నివేదికను సమర్పించారు. దీనిపై అడ్వకేట్ జనరల్ సూచనలు, సలహాలు తీసుకున్న ప్రభుత్వం.. తాజాగా మంత్రివర్గ సమావేశంలో చర్చించింది. కాగా నిష్పాక్షిక దర్యాప్తు కోసం సీబీఐ విచారణ కోరాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన తదుపరి ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూరితంగా పక్క రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ కేంద్రాల నిర్మాణం పేరుతో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు..’ అని మంత్రి పొంగులేటి ఆరోపించారు. ఆదాయ వనరుల నివేదికపై చర్చ ‘ఆదాయ వనరుల సమీకరణపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికపై కేబినెట్ విస్తృతంగా చర్చించింది. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచి 4 ఏళ్లు పూర్తి అయిన నేపథ్యంలో ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణ్యం సిఫారసుల మేరకు శాస్త్రీయ విధానంలో భూముల ధరలు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచాలని నిర్ణయించింది. ఈ నెల 26వ తేదీలోగా ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసి కొత్త ధరలు, చార్జీలను ప్రకటించాలని అధికారులను ఆదేశించింది. పరిహారం రేట్లపై అసంతృప్తి వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు, రోడ్ల విస్తరణలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు ఇప్పుడు ప్రభుత్వం చెల్లించే పరిహారం రేట్లపై అసంతృప్తి ఉంది. మార్కెట్ ధరలతో పోలిస్తే ప్రభుత్వం నిర్ణయించిన భూముల పరిహారం ధరలు భారీగా వ్యత్యాసమున్నాయి. అందువల్ల శాస్త్రీయ పద్ధతిలో ఈ ధరలను సవరించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జిల్లాల్లో ఉండే మార్కెట్ విలువల రివిజన్ కమిటీలు అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని విలువలను సవరించనున్నాయి. హిల్ట్ పీ దరఖాస్తుదారులకు అవకాశం రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచేలోపు హైదరాబాద్ ఇండ్రస్టియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హిల్ట్ పీ) కింద దరఖాస్తు చేసుకునే వారికి కూడా ఒక అవకాశం ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. భూముల ధరలు పెరిగేలోపు దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా పది శాతం చెల్లించేలా వెసులుబాటు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. మిగతా 90 శాతం 90 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది. వారికి ఇప్పుడున్న భూముల ధరలే వర్తిస్తాయి..’ అని మంత్రి చెప్పారు. ఎన్డీడీబీకి నార్మాక్ ‘నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల పాల సహకార సంస్థ (నార్మాక్)ను నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డుకు అప్పగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఎంఓయూను ఆమోదించింది. – యాసంగిలో పండిన ధాన్యం, మక్కలను కొనుగోలు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రైతులు ఎవరూ అభద్రతకు లోనుకావద్దని సూచించింది. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి యుద్ధ ప్రాతిపదికన ప్రతి జిల్లా నుంచి ఇన్చార్జి మంత్రి ఆధ్వర్యంలో పంట నష్టం అంచనాలను తెప్పించాలని ఆదేశించింది. – 9 జిల్లాల్లో 33/11 కేవీ సబ్స్టేషన్ల వద్ద సోలార్ పవర్ జనరేషన్ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పైలెట్ పద్ధతిన 18 చోట్ల దాదాపు రూ.66.50 కోట్లతో 19 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. బకాయిల వసూళ్లకు ఓటీఎస్ – క్యూర్ పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లకు వివిధ ప్రభుత్వ కార్యాలయాలు బకాయిపడిన పన్నుల వసూళ్లకు వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) వెసులుబాటు కల్పించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు రూ.5,864 కోట్ల బకాయిలుండగా.. జరిమానాలు, వడ్డీలన్నీ మినహాయించి ఓటీఎస్ ద్వారా రూ.1686 కోట్లు వస్తాయని అంచనా వేసింది. హైదరాబాద్ జల మండలికి ప్రభుత్వ కార్యాలయాలు చెల్లించాల్సి ఉన్న నీటి బకాయిలపై వడ్డీలు, జరిమానాలు రద్దు చేయాలని నిర్ణయించింది. – రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ అజీజ్నగర్లో అధునాత కూరగాయల మార్కెట్ ఏర్పాటుకు గాను 42 ఎకరాలను అప్పగించాలని తీర్మానించింది. ‘స్కిల్స్’ పరిధిలోకి ఐటీఐలు, పాలిటెక్నిక్లు – రాష్ట్రంలోని అన్ని ఐటీఐలు (అడ్వాన్సుడ్ ట్రైనింగ్ సెంటర్లు), పాలిటెక్నిక్లు, టీ శాట్ను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువచ్చి, ఒకే గొడుగు కింద ఉంచాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. – ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద బుగ్గవాగు నుంచి లెఫ్ట్ ఫ్లడ్ ఫ్లో కాలువ నిర్మాణానికి ఆమోదం తెలిపింది..’ అని పొంగులేటి తెలిపారు. -
ఆదాయం పెంపు ఎజెండాగా..
సాక్షి, హైదరాబాద్: అనివార్య ఖర్చులు, నెలనెలా పెరుగుతున్న ఆర్థిక భారాన్ని తట్టుకుని నిలబడేందుకు అవసరమైన ఆదాయ మార్గాలపై చర్చ ఎజెండాగా రాష్ట్ర మంత్రివర్గం సోమవారం భేటీ కానుంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈసారి కేబినెట్ సమావేశంలో ఆదాయ వనరుల సమీకరణపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే నివేదికపైనే చర్చ జరుగుతుందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. అందులో భాగంగానే రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువల పెంపునకు గ్రీన్సిగ్నల్ లభించనుందని సమాచారం.భూముల విలువల సవరణకు సంబంధించిన ప్రక్రియను రిజిస్ట్రేషన్ల శాఖ పూర్తి చేసిన నేపథ్యంలో మంత్రివర్గం ఆమోదిస్తే ఈనెలలోనే, లేదంటే జూన్1వ తేదీ నుంచి సవరించిన విలువలు అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీంతో పాటు రుణాల రీస్ట్రక్చర్ కోసం కేంద్రానికి చేయాల్సిన ప్రతిపాదనలు, రాబడి శాఖల్లో లీకేజీలను అరికట్టడం లాంటి అంశాలపై కూడా మంత్రివర్గం చర్చించి తగు నిర్ణయాలు తీసుకోనుంది.అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన దాదాపు రూ.14 వేల కోట్ల బకాయిల విషయంలోనూ ఓ రోడ్మ్యాప్ తయారు చేయనున్నట్టు సమాచారం. ముఖ్యంగా రిటైరయిన ఉద్యోగులకు సంబంధించిన రూ.8 వేల కోట్ల బకాయిలను 100 రోజుల్లో చెల్లించే విషయంలో ఏం చేయాలన్న దానిపై మంత్రివర్గం ఓ కార్యాచరణ రూపొందించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీంతో పాటు తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణం.. తదితర అంశాలపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. -
100 రోజులు.. 6 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రిటైరైన ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను రానున్న వందరోజుల్లో కల్పిస్తామని ముఖ్యమంత్రి ఏ.రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. దీనికోసం రూ.6వేల కోట్లు చెల్లిస్తామని చెప్పారు. రాష్ట్రంలో కొనసాగుతున్నది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. శనివారం జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ, తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డితోపాటు టీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, ఉద్యోగ జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి, టీఈజేఏసీ నేతలు బి.శ్యామ్, ముజీబ్ హుస్సేన్, జి.సదానందంగౌడ్, చావ రవి, వి.రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యలను జేఏసీ నేతలు ముఖ్యమంత్రి ముందు ప్రస్తావించారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు నాలుగు అంశాలపై స్పష్టత ఇచ్చారు. ‘వందరోజుల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద రూ.6 వేల కోట్లు చెల్లిస్తాం. రెండో పీఆర్సీపై తక్షణమే నివేదిక ఇవ్వాలని అధికారుల కమిటీని ఆదేశించా. అధికారుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటాం. జూన్ 1లోగా ఉద్యోగులందరికీ ఆరోగ్య భద్రత కార్డులను అందిస్తాం. ప్రతీ రెండు నెలలకోసారి గుర్తింపు సంఘాలు సమావేశమై సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక అందించాలి’ అని చెప్పారు. ఉద్యోగుల కోసం చేస్తున్నాం... ‘ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రకటించినా ఉద్యోగులు భుజాన వేసుకుని పనిచేశారు. ఉద్యోగుల సహకారంతోనే ప్రభుత్వ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేయగలు గుతున్నాం. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగుల కోసమే మొదటి నిర్ణయం తీసుకున్నాం. ఉద్యోగులకు ప్రతి నెలా మొదటి తారీఖున వేతనాలు అందేలా చర్యలు తీసుకున్నాం. ఉద్యోగ సంఘాలు స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించుకునేలా అవకాశం కల్పించాం. ఉద్యోగుల బదిలీల విషయంలో గందరగోళం తలెత్తకుండా ప్రణాళిక బద్ధంగా నిర్వహించాం. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల బదిలీలను ఎలాంటి వివాదం లేకుండా పూర్తిచేశాం. ఉద్యోగుల ఆరోగ్య భద్రత కార్డుల ప్రతిపాదనపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. రెండేళ్లలో ప్రజా ప్రభుత్వం 67,760 ఉద్యోగ నియామకాలు చేపట్టింది’ అని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ప్రభుత్వ చిత్తశుద్ధి ఇదీ: ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ‘దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలను ప్రజాప్రభుత్వం చాలా వరకు పరిష్కరించింది. రాష్ట్ర ఆవిర్భావం నాటికి ఉద్యోగుల పెండింగ్ బిల్లులు ఉండకుండా చేస్తాం. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో రూ.వేల కోట్ల బిల్లులు చెల్లించకపోవడంతో అవి భారీగా పేరుకుపోయాయి. దీనిపై కసరత్తు చేసి సమస్యలను పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నాం. 100 రోజుల్లో రూ.6 వేల కోట్లు పెన్షన్ బకాయిలు క్లియర్ చేయాలని ప్రయత్నిస్తున్నాం. ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదీ. ఉద్యోగుల హెల్త్ కార్డులపై ముఖ్యమంత్రి మానవీయ దృక్పథంతో ఆలోచించారు. మీ సమస్యల పరిష్కారం కోసం సీఎం ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నారు’ అని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. సీఎంకు నాయకుల కృతజ్ఞతలు సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయాల పట్ల టీఈజేఏసీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం గతంలో చాలావరకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించిందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ నెల 5న నిర్వహించనున్న నిరసన కార్యక్రమంతోపాటు అన్ని రకాల నిరసన కార్యక్రమాలను ఉపసంహరించుకుంటున్నట్లు ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్, టీజీఈజేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. -
నమ్మించి మోసం చేయడం కాంగ్రెస్ నైజం
-
‘జాబ్ క్యాలెండర్ ప్రకారం ఒక్క ఉద్యోగమైన భర్తీ చేశారా?’
సిద్దిపేట: కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందంటూ ధ్వజమెత్తారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్రావు. నిరుద్యోగులు నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తుంటే.. సీఎం రేవంత్ మాత్రం ఆ నోటిఫికేషన్ వద్దంటున్నారని మండిపడ్డారు. ఈరోజు(శనివారం, మే 5వ తేదీ) సిద్ధిపేట జిల్లా జిల్లా గ్రంధాలయంలో ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులతో ఇంటరాక్ట్ అయ్యారు హరీష్రావు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘ నిరుద్యోగులు నోటిఫికేషన్ వద్దంటున్నారని సీఎం రేవంత్ చెబుతున్నారు. కానీ నిరుద్యోగులు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. రాహుల్ గాంధీని అశోక్ నగర్ తీసుకువచ్చి మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలని నమ్మించారు. ఆనాడు నమ్మించి..నేడు వంచించడం కాంగ్రెస్ నైజం. సెంట్రల్ లైబ్రరీలో పోలీసులతో నిరుద్యోగులపై రేవంత్ దాడి చేయిస్తున్నారు. BRS హయాంలో 1.60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం. కాంగ్రెస్ వచ్చాక భర్తీ చేసింది కేవలం 16 వేల ఉద్యోగాలని సీఎం రేవంత్ అసెంబ్లీలో చెప్పారు. మిగిలిన 1.84 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో సీఎం సమాధానం చెప్పాలి. పోలీస్ శాఖలో 19 వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని డీజీపీ చెప్పారు. మరి 5 వేల ఉద్యోగాలకే ప్రభుత్వం అనుమతి ఇచ్చి..మిగతా 14 వేల పోస్టులను ఎందుకు ఆపుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో 40 వేల పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేశాం. విద్యా కమిషన్ రిపోర్ట్ని సీఎం రేవంత్ ఎందుకు బయటపెట్టడం లేదు. రాష్ట్రంలో 30 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నాయి. మెగా డీఎస్సీసీ కాస్త దగా డీఎస్సీ అయిపోయింది. రేవంత్ నీ డ్రామాలు బంద్ చేయి. చిల్లర మాటలు కాదు కావాల్సింది...జాబ్ నోటిఫికేషన్ కావాలి. జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ అయి చిత్తు కాగితం అయింది. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఒక్క ఉద్యోగమైన భర్తీ చేశారా?, నీ కోసం పని చేసిన నిరుద్యోగులే రేపు రేవంత్ని బొందపెడతారు. తక్షణమే జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. లేదంటే నిరుద్యోగులతో సెక్రటేరియట్ ని ముట్టడిస్తాం’ అని హెచ్చరించారు. -
సబ్స్టేషన్ల పక్కనే సౌర విద్యుత్ ప్లాంట్లు
సాక్షి,హైదరాబాద్: సబ్స్టేషన్ల పక్కనే సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విద్యుత్ అధికారులను ఆదేశించారు. పైలెట్ ప్రాజెక్టు కింద భూమి అందుబా టులో ఉన్న చోట ఉమ్మడి జిల్లాలో రెండు సబ్స్టేషన్ల పక్కన సోలార్ పవర్ ప్లాంట్లు నెలకొల్పాలని స్పష్టం చేశారు. విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి అధికారులతో శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకు ఎంసీహెచ్ఆర్డీలో సమీక్షించారు. విద్యుత్ శాఖలో సరఫరా లోపాలు, మెరుగైన విద్యుత్ సరఫరాకు ఏఐ సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు.ట్రాన్స్ఫార్మర్లపై ఓవర్లోడ్ పడకుండా చూడాలని ఆదే శించారు. రాష్ట్రంలో నూతన పారిశ్రామిక వాడ లు, హైస్పీడ్ రైల్ కారిడార్లు, ట్రిపుల్ ఆర్ వంటి అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో డిమాండ్కు తగిన విద్యుత్ సరఫరాకు అవసరమైన సబ్స్టేషన్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలన్నారు. తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (రైతు డిస్కం)లో చేరికపై ఉద్యోగులు, సిబ్బందికి ఉన్న అపోహలు తొలగించాలని అధికారులకు సూచించారు. గ్రీన్ఎనర్జీ పాలసీలో భాగంగా ప్రాధాన్య క్రమంలో దరఖాస్తులు పెట్టుకున్న వారికి అనుమతులు వెంటనే ఇవ్వాలని చెప్పారు.భారీ డేటా సెంటర్లకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని, సోలార్ పవర్పై స్వయం సహాయక సంఘాల మహిళలకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టే 18 సోలార్ పవర్ ప్లాంట్ల (హైదరాబాద్ మినహా ఉమ్మడి తొమ్మిది జిల్లాల్లో.. జిల్లాకు రెండు చొప్పున) నిర్మాణానికి నోడల్ అధికారులను నియమించాలని సీఎం ఆదేశించారు. సోలార్ స్టవ్ల వినియోగంపై కూడా అవగాహన కల్పించాలని చెప్పారు. సమీక్షలో ఎంపీ వేం నరేందర్రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్మిట్టల్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్రెడ్డి, ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్, జెన్కో సీఎండీ ఎస్.హరీశ్, ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్.వి.పాటిల్, మూడో డిస్కం సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ పాల్గొన్నారు . -
ఇది మోదీ మేడే గిఫ్ట్, కుంభకర్ణుడిలా రేవంత్..: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్లు కార్మికుల సంక్షేమాన్ని విస్మరించాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. మే డే సందర్బంగా శుక్రవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీటింగ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రూపాయి విలువ పాతాళానికి.. గ్యాస్ సిలిండర్ ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. హోటల్ కార్మికులకు మే డేన మోదీ ఇచ్చిన గిఫ్ట్ ఇది. 80 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కమర్షియల్ సిలిండర్ల ధరలు పెంచారు. ఎన్నికలయ్యాక ధరలు పెంచడం మోదీ ప్రభుత్వానికి అలవాటేనని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కార్మికుల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టడం లేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల కోసం మంచి చేయాలనే ఆలోచన రేవంత్ రెడ్డికి ఏ కోశాన కనిపించడం లేదు. ఎన్నికలకు ముందు దానవీర శూరకర్ణ.. ఎన్నికల తర్వాత కుంభకర్ణ. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి మొద్దునిద్ర పోతున్నారు. సిగాచి ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగి కార్మికులు చనిపోతే.. బాధిత కుటుంబాలకు ఇప్పటికీ పరిహారం అందలేదు. హామీలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నిస్తే.. దిగజారి బూతులు మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు జేమ్స్ బాండ్ లెక్క బాండు పేపర్లు ఎందుకు రాశారు? అంటూ రేవంత్ సర్కార్పై కేటీఆర్ ధ్వజమెత్తారు. -
గిగ్ వర్కర్లకు తెలంగాణ సర్కార్ శుభవార్త
కార్మికుల దినోత్సవం సందర్భంగా.. గిగ్ వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించబోతోంది. గిగ్ సెక్టార్లో ఉద్యోగ భద్రత కోసం తెచ్చిన తెలంగాణ ఫ్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ లేబర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్) బిల్లు 2026 చట్టరూపం దాల్చింది. గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ఈ చారిత్రక బిల్లుకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. మే 1న తెలంగాణ గిగ్ వర్కర్ల చట్టం గెజిట్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే చట్టానికి సంబంధించిన గైడ్లైన్స్పై స్పష్టతకు మరో రెండు వారాల టైం పట్టొచ్చు. తాజా పరిణామంతో గిగ్ వర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గిగ్ వర్కర్ అసోషియేషన్లు రేవంత్ సర్కార్కు కృతజ్ఞతలు తెలియజేశాయి. ఒక అంచనా ప్రకారం.. తెలంగాణలో డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు.. ఇలా సుమారు ఐదు లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నారు. ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టం వాళ్లందరికీ పని భద్రత(గిగ్ వర్కర్లను రిజిస్టర్ చేయడం, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు), ప్రమాద, ఆరోగ్య బీమా, ఇతర సామాజిక భద్రతా పథకాలు వర్తింపు ఇలా సమగ్ర రక్షణ కల్పిస్తుంది. అయితే.. ఈ చట్టంలో కొన్ని అంశాలపై ప్లాట్ఫారమ్ కంపెనీల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం లేకపోలేదు. గిగ్ వర్కర్ల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కేలా కనీస వేతనాన్ని నిర్ణయించడం, ప్లాట్ఫామ్ కంపెనీలు వచ్చే ఆదాయంలో కనీసం 50% వాటాను వర్కర్లకు ఇవ్వాలని నిబంధనలతో పాటు ఇక మీదట సరైన కారణం లేకుండా వర్కర్లను పనిలో నుంచి తొలగించడం కుదరదని తెలంగాణ గిగ్ వర్కర్ల చట్టం చెబుతోంది. అలాగే గిగ్ వర్కర్లను కూడా గ్రాట్యుటీ, కాంట్రాక్ట్ రక్షణ కల్పించేలా నిబంధనలు రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ నిబంధనలకు కంపెనీలు ఎలా స్పందిస్తాయో చూడాలి. దేశంలో గిగ్ వర్కర్ల కోసం చట్టం చేసిన రెండో రాష్ట్రం తెలంగాణ నిలవనుంది. గతంలో రాజస్థాన్ గిగ్ వర్కర్ల కోసం ఈ తరహా చట్టం(రాజస్థాన్ ఫ్లాట్ఫారమ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ (Registration and Welfare) యాక్ట్ 2023 తెచ్చింది. ఈ చట్టానికి అదే ఏడాది జులైలో శాసనసభ ఆమోదం కూడా తెలిపింది. అయితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసినా.. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఫలితం లేకపోయింది. ఇప్పటికీ ఆ చట్టం అమల్లోకి రాకపోవడంతో అక్కడ లక్షలాది మంది గిగ్ వర్కర్లు ఆర్థిక, సామాజిక భద్రతా ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. -
విద్యార్థుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోండి
హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవసరమైన యూనిఫామ్లు, స్కూల్ బ్యాగ్లు, ఐడీ కార్డులు, నోటు పుస్తకాలు, ఇతర సామగ్రి అంతా నాణ్యమైనవే అయ్యుండాలని.. అవన్నీ జూన్ 15లోగా స్కూళ్లకు అందేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు సామగ్రి అందాక వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని సూచించారు. విద్యాశాఖతోపాటు బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖలు, ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలోని విద్యాసంస్థల్లోని విద్యార్థులకు అందించే సామగ్రి కేంద్రీకృత సేకరణ విధానంపై సీఎం రేవంత్రెడ్డి గురువారం సమీక్షించారు. గతంలో ఏ శాఖకు ఆ శాఖ సేకరణ, సరఫరా చేపట్టడంతో నాణ్యత లోపంతోపాటు అక్రమాలు జరిగేవని.. వాటిని అరికట్టేందుకే కేంద్రీకృత సేకరణ విధానాన్ని తెచ్చినట్లు తెలిపారు. ఈ విధానం వల్ల అధికారుల్లో జవాబుదారీతనం పెరుగుతుందని చెప్పా రు. విద్యార్థులకు అవసరమైన సామగ్రి గడువులోగా అందగానే సరఫరాదారులకు చెల్లింపులు పూర్తి చేస్తామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. మండలానికో నోడల్ అధికారి... విద్యార్థులకు అందజేసే వస్తువులకు సంబంధించి మండల స్థాయిలో ఒక నోడల్ అధికారిని నియమించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. అక్కడి నుంచి క్షేత్రస్థాయిలో గ్రామాల్లోని పాఠశాలలు, హాస్టళ్లకు వస్తువులు సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని.. సరఫరాకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీయించాలని అన్నారు. ప్రతి విద్యార్థికి అవసరమైన సామగ్రి అందిందా లేదా అనే విషయాన్ని సరిచూసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విద్యాశాఖల మధ్య సమన్వయానికి ఒక కమిటీని నియమించాలని సీఎం ఆదేశించారు. సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్రెడ్డి, ఎంపీ వేం నరేందర్రెడ్డి, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి షఫీఉల్లా, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బాల మాయాదేవి, సెర్ప్ సీఈవో దివ్య, ఉన్నత విద్యా శాఖ కమిషనర్ శ్రీదేవసేన, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి సంతోష్, గురుకులాల కార్యదర్శి బి.సైదులు తదితరులు పాల్గొన్నారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల పరిస్థితి హృదయ విదారకంగా ఉందని.. కేసీఆర్ సీఎంగా ఉంటే ఢిల్లీ మెడలు వంచే వారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నాయకులను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పోలీసు అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా విచారణ చేయాలి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును ఇరికించాలని రెండో సిట్ వేశారు’’ అంటూ ప్రవీణ్కుమార్ ఆరోపించారు.‘‘ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టబద్ధంగా దేశ భద్రత కోసం జరుగుతుంది. ఏ ప్రభుత్వం ఉన్నా ట్యాపింగ్ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నేతలను ఇరికించే ప్రయత్నం జరుగుతుంది. 350 మంది సాక్షులను విచారించి ఇప్పటి వరకు ఛార్జ్షీట్ దాఖలు చేయలేదు. ప్రభాకర్రావును 18 రోజులు జైల్లో కరుడుగట్టిన నేరస్తుడిలా ట్రీట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఛార్జ్ షీట్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పేర్లు పెట్టాలని అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నారు. సంధ్య శ్రీధర్ రావుపై 26 కేసులు ఉన్నాయి. అతనితో ఎమ్మెల్సీ నవీన్రావు పేరు చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సీనియర్ జర్నలిస్టును ఇరికించి అతను సుప్రీంకోర్టులో బెయిల్ పిటీషన్ వేస్తే హరీష్ రావు పేరు చెప్తారా లేదా అని బెదిరిస్తున్నారు..కేసీఆర్ ఇంటి గోడలపై నోటీసులు అంటించి ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించారు. ఫోన్ ట్యాపింగ్ అనేది రహస్యంగా ఉంటుంది. బాధ్యత లేని హోంమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో పోలీసు డిపార్ట్మెంట్ బలైంది. రేవంత్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు తప్పులు చేస్తున్నారు. ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణన్పై అక్రమ కేసు మోపినందుకు విచారణ చేసిన వాళ్లను కోర్టు దోషులుగా ప్రకటించింది. క్రిశాంక్పై కేసు పెట్టి జైలుకు పంపారు.కేటీఆర్, హరీష్ రావు ఇళ్ల ముందు ఉన్న సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారు. బెంగుళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను తీసుకువచ్చి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. దీనిపై సిట్ వేసి విచారణ జరపాలి. రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఎంత మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలు డైరెక్టర్లుగా ఉన్నారు. ఐపీఎస్ అధికారులు సీఎం ఆదేశాలను పాటించవద్దు. కేసులను దైర్యంగా ఎదుర్కొంటాము. గతంలో నాకు యాపిల్ ఫోన్ నుంచి వచ్చిన మెసేజ్ను సెంట్రల్ క్రైం పోలీసులకు ఇచ్చాను’’ అని ప్రవీణ్కుమార్ తెలిపారు. -
మాజీ డీజీపీ శివధర్ రెడ్డికి కీలక బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ డీజీపీ శివధర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ వి. హనుమంత రావుకు రేవంత్ ప్రభుత్వం కీలక పదవులను అప్పగించింది. తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారుగా హనుమంత రావును, తెలంగాణ స్టేట్ సెక్యూరిటీ అడ్వైజర్గా మాజీ డీజీపీ శివధర్ రెడ్డిని నియమించింది. ఈ మేరకు తాజాగా జీవోను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో శివధర్ రెడ్డి.. మూడు సంవత్సరాల పాటు రాష్ట్ర భద్రతా సలహాదారుగా సేవలు అందించనున్నారు. చట్టం, శాంతి భద్రతలు, అంతర్గత భద్రతపై ప్రభుత్వానికి శివధర్ రెడ్డి సలహాలు ఇవ్వనున్నారు. ఆయనకు చీఫ్ సెక్రటరీ హోదాతో పాటు నెలకు రూ.2.25 లక్షల వేతనం ఉంటుంది. -
కిషన్ రెడ్డికి లేఖ రాయాలని తెలంగాణ సర్కారు నిర్ణయం
హైదరాబాద్: ఇరిగేషన్ శాఖపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణ కార్యాచరణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మిస్తే 100 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చని నిపుణులు వెల్లడించారు. ముంపు ప్రభావం తక్కువగా ఉండేలా మహారాష్ట్ర ప్రభుత్వంతో వెంటనే చర్చలు జరపాలని సీఎం ఆదేశించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై ఇప్పటికే 11 వేల కోట్లు ఖర్చు చేశామని, 71.5 కిలోమీటర్ల మేర కాలువల పనులు పూర్తయ్యాయని సమీక్షలో చర్చించారు. 150 మీటర్ల ఎత్తున నిర్మిస్తే తక్కువ ఖర్చుతో గ్రావిటీ ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్కు నీటిని తరలించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మహారాష్ట్రలో ఎక్కడైనా ముంపు వాటిల్లితే పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమని సీఎం స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేలా చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాయాలని నిర్ణయించారు. రేపు కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ తీసుకొని ప్రత్యక్షంగా చర్చించాలని మంత్రి ఉత్తమ్ కుమార్కు సీఎం సూచించారు. మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన జియో టెస్టింగ్ పనులను వర్షాల కంటే ముందే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ బ్యారేజ్ పూర్తయితే ఆదిలాబాద్తో పాటు తెలంగాణలోని మెట్ట ప్రాంత రైతులకు సాగు, తాగునీరు అందుతుందని ధీమా వ్యక్తం చేశారు. -
ఏ ఒక్క ఐపీఎస్ అధికారిని వదిలిపెట్టం: హరీష్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ ఆదేశాల మేరకే తమ ఫోన్లు ట్యాపింగ్, తమ ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలు హ్యాకింగ్ చేస్తున్నారని అన్నారు. హ్యాకింగ్కి పాల్పడుతున్న ఏ ఒక్క ఐపీఎస్ అధికారిని వదిలిపెట్టమని హరీష్ హెచ్చరించారు.మాజీ మంత్రి హరీష్ రావు తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లీగల్గా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడుతోంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తున్నందుకు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చాకా విచారణ జరిపిస్తాం. హ్యాకింగ్కి పాల్పడుతున్న ఏ ఒక్క ఐపీఎస్ అధికారిని వదిలిపెట్టం. చట్టానికి లోబడి ఫోన్ ట్యాపింగ్ చేయండి. కొంతమంది పోలీసు అధికారులు ముఖ్యమంత్రికి దగ్గర అవ్వాలని, పదోన్నతులు పొందాలని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రధాని మోదీ ఇక్కడ సభలు పెట్టడం కాదు.. తెలంగాణకు జాతీయ ప్రాజెక్టులను ప్రకటించాలి’ అని డిమాండ్ చేశారు.ఇక, అంతకుముందు.. తెలంగాణలో పంటల కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ బహిరంగ లేఖ రాశారు. అందులో..‘ఎన్నికల వేళ చెప్పిందొకటి.. అధికారంలోకి వచ్చాక చేసేదొకటి. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్. తాలు పేరిట తరుగు తీస్తే తోలు తీస్తా అన్న సీఎం రేవంత్ రెడ్డి.. వడ్ల కొనుగోలు కేంద్రాల్లోకి వెళ్లి చూడు. కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యం కుప్పలు తెప్పలుగా వస్తున్నా ఇంకా కొనుగోళ్లు ఎందుకు మొదలుపెట్టలేదు?. మిల్లుల దగ్గర కూడా బస్తాకు కిలో, రెండు కిలోల తరుగు తీస్తూ రైతులను దోచుకుంటున్నారు. ఎండలో రైతులు మాడిపోతున్నా ప్రభుత్వానికి సోయి లేదా?. మాట ఇచ్చిన ప్రకారం సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ వెంటనే ధాన్యం డబ్బులతో పాటే ఇవ్వాలి అని పేర్కొన్నారు. -
పెట్టుబడికి 'ఫ్యూచర్'
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భారత్ ఫ్యూచర్సిటీ అంతర్జాతీయ పెట్టుబడులకు స్వర్గధామంగా నిలవబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నియుద్ధాలు వచ్చినా.. ఇక్కడ ఎలాంటి నష్టం ఉండదు. అన్ని రకాలుగా రక్షణతో కూడిన ప్రదేశం ఇదే. పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయి. భవిష్యత్తులో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది. న్యూయార్క్, టోక్యో వంటి ప్రపంచస్థాయి నగరాలతో పోటీపడుతుంది’అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి చెప్పారు. మీర్ఖాన్పేటలో ఫ్యూచర్సిటీ పోలీసు కమిషనరేట్ భవనానికి మంగళవారం ఆయన భూమిపూజ, శంకుస్థాపన చేశారు. మల్కాజ్గిరి కమిషనరేట్ భవనం సహా ఆక్టోపస్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, కుత్బుల్లాపూర్ డీసీపీ కార్యాలయ భవనాలకు సంబంధించిన శిలాఫలకాలనూ ఆవిష్కరించారు. గిరిదర్శక్ పథకంలో భాగంగా 20 మంది మాజీ మావోయిస్టులు, సానుభూతిపరులకు నియామక పత్రాలను అందజేశారు. అనంతరం రేవంత్రెడ్డి మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. తీర్మానం చేసి పంపండి.. మూసీనది పునర్నిర్మాణం, రీజినల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్సిటీ అభివృద్ధిలో ఏమాత్రం వెనక్కితగ్గం. శంషాబాద్ కేంద్రంగా అమరావతి మీదుగా చెన్నై వరకు, అటు బెంగళూరు, ఇటు పుణే నుంచి ముంబై ఇలా మూడు బుల్లెట్ రైళ్లు రాబోతున్నాయి. ఇక్కడే అతిపెద్ద బస్ టెర్మినల్ రాబోతోంది. అభివృద్ధిలో మనం స్ఫూర్తిగా తీసుకుంటున్న నగరాలతో పోటీగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయబోతున్నాం. 160 కి.మీ. ఔటర్ రింగ్రోడ్డు దేశంలో ఏ నగరానికీ లేదు. అదేస్థాయిలో రీజినల్ రింగ్రోడ్డును అందుబాటులోకి తేనున్నాం. కొంతమంది ప్రజాప్రతినిధులు తమ గ్రామాలను కూడా ఫ్యూచర్సిటీలో కలపాలని కోరుతున్నారు. తీర్మానం పంపితే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధుల సహకారంతోనే ఫ్యూచర్సిటీ అభివృద్ధి చెందుతుంది. ఫ్యూచర్ సిటీ కార్యాలయంలో కూర్చొని ఒప్పందాలు చేసుకోవాలి. జూన్ 2లోపే ఆ కార్యక్రమం కూడా పూర్తవుతుంది. మీరు ఏడ్చుకుంటూ ఉండండి... శంషాబాద్, ఔటర్ రింగ్రోడ్డు, హైటెక్ సిటీలను నాడు అవహేళన చేశారు. ఊహాచిత్రంగా భావించి, అనుమానించారు. అదేవిధంగా నేడు కొంత మంది ఫ్యూచర్ లేని సీఎం ఫ్యూచర్ సిటీ కడతాడట అని విమర్శిస్తున్నారు. మీరు ఏడ్చుకుంటూ ఉండండి. నేను చేయాల్సింది చేసుకుంటూ పోతుంటా. మీ ఏడుపు నాకు శంకరాభరణంలోని సంగీతం విన్నట్లు ఉంటుంది. వారిది అసురజాతి. వాళ్లు పోయినా నష్టం లేదు. మీరు ఎన్ని కుట్రలు చేసినా.. రైతులను ఎంత రెచ్చగొట్టినా అభివృద్ధి విషయంలో వెనక్కి తగ్గం. లీగల్ చిక్కులకు అవకాశం లేకుండా పక్కాగా నోటిఫికేషన్లు ఇచ్చి, రైతులను ఒప్పించి, మెప్పిస్తాం. వారికి నచ్చిన విధంగా ఆర్థిక సహాయం అందించిన తర్వాతే ముందుకెళ్తాం. అభివృద్ధి పనుల కోసం ఈ రోజు కాకపోయినా రేపైనా భూసేకరణ తప్పదు. ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారాన్ని తీసుకుని వేరేచోట పెట్టుబడి పెట్టుకోండి. మీ పిల్లల భవిష్యత్తుకు, ఉద్యోగ అవకాశాలకు సహకరించండి. జనజీవన స్రవంతిలో కలవండి.. అన్నలూ అడవిని వీడి జనజీవన స్రవంతిలో కలవండి. మీ ప్రాణాలకు పూర్తి రక్షణ, ఆరోగ్య బాధ్యత మాది. ఆశయ సాధన పేరుతో అడవుల్లో ఉండి అసువులు బాసే కన్నా జనారణ్యంలో భాగస్వాములు కావడం ఉత్తమం. ఇటీవల లొంగిపోయిన గణపతి ఆరోగ్యం దెబ్బతిన్నట్లు తెలిసింది. ఆయన ప్రాణాలకు పూర్తి రక్షణ కల్పించడంతోపాటు మంచి వైద్యం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గిరిజన, ఆదివాసీ బిడ్డలను అభివృద్ధిలో భాగస్వాములను చేయాలనే ఆలోచనతోనే గిరిదర్శన్ పథకాన్ని తీసుకొచ్చాం’అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు డి.శ్రీధర్బాబు, జూపల్లి కృష్ణారావు, ఎంపీ అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, అరికెపూడి గాం«దీ, డీజీపీ బి.శివధర్రెడ్డి, ఫ్యూచర్సిటీ సీపీ సుదీర్బాబు, మల్కాజ్గిరి సీపీ సుమతి తదితరులు పాల్గొన్నారు. అన్ని హంగులతో ఫ్యూచర్సిటీ: మంత్రి శ్రీధర్బాబు 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీయే తెలంగాణ లక్ష్యం. అన్ని హంగులతో భారత్ ఫ్యూచర్సిటీని తీర్చదిద్దబోతున్నాం. పరిశ్రమలు, వాణిజ్యం ముందంజలో ఉండటానికి పోలీసుల కృషి అభినందనీయం. డ్రగ్స్రహిత సమాజం కోసం పోలీసు శాఖ ఎంతగానో కృషిచేస్తోంది. సాంకేతిక వినియోగంలోనూ ముందంజలో ఉంది. 20 మంది గిరిదర్శక్ల నియామకం: డీజీపీ శివధర్రెడ్డి తెలంగాణలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అద్భుత అడ్వెంచర్లు ఉన్నాయి. పర్యాటకులకు వీటిని చూపించేందుకు ప్రభుత్వం గిరిదర్శన్ పేరుతో ప్రత్యేక గైడ్లను నియమించింది. అడవిబాటను వీడి జనం బాటపట్టిన గిరిజన, ఆదివాసీ యువకులను ఇందుకు ఎంచుకుంది. ఎత్తైన కొండలు, గుట్టలు, లోయలు, జలపాతాలను చూపించనుంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం నుంచి 20 మంది ఆదివాసీలను గిరిదర్శక్లుగా నియమించి శిక్షణ ఇచ్చాం. ఉపాధి కల్పించి, వారి జీవితాల్లో వెలుగులు పూయిస్తాం. ప్రత్యేక యూనిఫాంలో ఉండే వీరు.. పోలీసులు, ఫారెస్ట్, టూరిజం శాఖల సమన్వయంతో పనిచేస్తారు. మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోవాలి. ప్రభుత్వం వారికి అన్నివిధాలా అండగా ఉంటుంది. -
రేవంత్.. వారితో ఫోన్లు హ్యాక్ చేయిస్తున్నావా?: హరీష్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రశ్నించే గొంతులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూర్ఖత్వం హిట్లర్ను మించిపోయిందని ఎద్దేవా చేశారు. కొంత మంది ఐపీఎస్లు తమ ఫోన్లను హ్యాక్ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి హరీష్ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రైతులు, రాష్ట్ర ప్రజల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదు. ఎవరు మాట్లాడితే వాళ్లపై కేసులు పెడుతున్నారు. మన్నే క్రిశాంక్తో పాటు ఏడుగురిపై అక్రమ కేసు పెట్టారు. ప్రశ్నించే గొంతులపై కాంగ్రెస్ అక్రమ కేసులు పెడుతుంది. ఓ కేసులో అనుముల హనుమంత రెడ్డి అనే వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అడిగితే కేసు పెడతారా?. రేవంత్ రెడ్డి అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. కేసులతో గొంతు నొక్కలేవు. కొంత మంది ఐపీఎస్లు మా ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారు. బెంగళూరు నుంచి హ్యాకర్లను తెచ్చి మాపై నిఘా పెడుతున్నారు. అలాంటి అధికారులు జాగ్రత్త. మీరు రిటైర్డ్ అయిన మిమ్మల్ని వదలం. రేవంత్ సగం కాలం పూర్తయ్యింది. ఇంకా మిగిలి ఉన్న సగ కాలం అయిన మంచిగా పని చేయాలి. రైతుల సమస్యలను రాష్ట్రంలో పట్టించుకునే నాధుడే లేడు. ఆనాడు తాలు తీస్తే తోలు తీస్తా అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎటు పోయాడు?. యాసంగి పంటకు బోనస్ ఇస్తారా లేదా రేవంత్ సమాధానం చెప్పాలి. రైతుల కష్టాలు ఈ ప్రభుత్వానికి పట్టవా?. జూబ్లీహిల్స్ ప్యాలెస్ ఏసీలో కూర్చుంటే సమస్యలు ఎలా తెలుస్తాయి?. రేవంత్ మళ్ళీ గెలిచేది లేదు. ఉన్నన్ని రోజులు అయిన మంచిగా పని చేయాలి’ అని వ్యాఖ్యలు చేశారు. -
‘కోత’ల డ్రామాలతో సమస్య గట్టెక్కగలరా?
తెలంగాణలో మంత్రుల జీతాలు సగానికి కోశారు. రాజకీయ డ్రామానా? ఆదర్శంగా నిలిచే ప్రయత్నమా? ఎమ్మెల్యేల జీతాల్లోనూ కోతలు పెట్టి తద్వారా మిగిలిన డబ్బును రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు వాడతారని సమాచారం. మామూలుగానైతే ఈ చర్యలను అందరూ ప్రశంసించాల్సిందే కానీ... రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు, ఎమ్మెల్యేల జీతాల్లో కోతతో మిగిలే డబ్బును పరిగణలోకి తీసుకుంటే దీన్ని డ్రామా అనే అనాల్సి వస్తుంది. బకాయేమో కొండంత.. మిగిలేది పిసరంత మాత్రమే మరి. దేశంలోని పలు రాష్ట్రాలు ఇప్పుడు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ వంటి చోట్ల అప్పు చేయకపోతే రోజు గడవని స్థితి. అదే సమయంలో అధికారం కోసం ఇచ్చిన అడ్డమైన హామీల అమలు బరువూ ఆయా ప్రభుత్వాలపై పడుతోంది. ప్రజలను ఏమార్చి అధికారం సాధించిన తర్వాత అనేక పిల్లిమొగ్గలు వేయాల్సి వస్తోంది. తెలంగాణలో రిటైర్డ్, సాధారణ ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించవలసిన బకాయి సుమారు రూ.14 వేల కోట్లు మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు నెలకు రూ.పది కోట్లు కూడా కాకపోవచ్చు. ఇందులో సగం ఆపుకుని ఉద్యోగులకు చెల్లిస్తామని చెబితే హాస్యాస్పదం అనిపించదా? పోనీ వీరు పూర్తిగా తమ జీతాలు తగ్గించుకుంటే అది వేరే విషయం. అభినందించవచ్చు. కాని హిమాచల్ ప్రదేశ్ లో ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారుల జీతాలు ఆరు నెలలపాటు సగం తీసుకకోకుండా ఆగుతారట. అంటే ఆ తర్వాత మొత్తం బకాయిలతోసహా తీసుకుంటారనే కదా?. ఏపీలో తెలుగుదేశం తరపున భజన చేసే ఎల్లో మీడియాకు అక్కడి ప్రభుత్వం ఒక లీకు ఇచ్చింది. హిమాచల్లో మాదిరి సంక్షోభం రాకుండా ఉండాలంటే ఆర్థిక క్రమశిక్షణ అవసరమని ఆ మీడియా పేర్కొంది. ఇందుకోసం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, సంక్షేమ స్కీములలో అనర్హుల ఏరివేత, దుబారా వ్యయం నియంత్రణ ఆవశ్యం అంటూ ఆ మీడియా ప్రచారం చేసింది. బహుశా ఆ మీడియా వారిని సంతోషపరచడానికో ఏమో కాని, ఏపీ కన్నా ముందుగా తెలంగాణలో దానిని పాటించడానికి రేవంత్ సర్కార్ సిద్దం అయిందన్న భావన కలుగుతోంది. అందులో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు కొంతకాలం సగం చొప్పునే తీసుకుంటారట. ఇతర ఆదాయ మార్గాలు కూడా అన్వేషించాలని తలపెట్టారు. అది తప్పు కాదు. కాని అసలు సమస్య తెలంగాణ లో కాంగ్రెస్, ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఇచ్చిన హామీల భారం అన్నది వాస్తవం కాదా? దానిని కప్పిపుచ్చుకోవడానికి తమకు మద్దతు ఇచ్చే మీడియాను అడ్డుపెట్టుకుని ప్రభుత్వాలు కొత్త డ్రామా నడపాలని చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. తెలంగాణ తర్వాత ఏపీలో కూడా ఈ తరహా సీన్ ను చూస్తామేమో తెలియదు. ఏపీలో ప్రభుత్వం సుమారు రూ.40 వేల కోట్ల మేరకు ఉద్యోగులకు బకాయిపడినట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో రిటైరైన వారికి రావల్సిన ఫైనల్ మొత్తాలు సకాలంలో చెల్లించకపోవడంపై హైకోర్టు కూడా పలుమార్లు ప్రభుత్వాన్ని ఆక్షేపించింది. అయినా ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో తెలియని స్థితిలో ప్రభుత్వం ఉందనిపిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ సిబ్బందికి, అలాగే అన్ని వర్గాల ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. ఉదాహరణకు వృద్దాప్య ఫించన్ను రూ.రెండు వేల నుంచి రూ.నాలుగు వేలు చేస్తామని, ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.2500 చొప్పున చెల్లిస్తామని.. ఇలా అనేక వాగ్దానాలు చేసింది.పైగా ఇవన్ని వంద రోజుల్లో నెరవేర్చుతామని కూడా ప్రజలను నమ్మించే యత్నం చేసింది. ప్రజలు విశ్వసించారా? లేక ఇతర కారణాల వల్లనా అన్నది చెప్పలేం కాని, కాంగ్రెస్ అధికారంలోకి అయితే రాగలిగింది. ఆ తర్వాత అసలు కథ ఆరంభమైంది. గత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, మిగులు రాష్ట్రాన్ని లోటు రాష్ట్రంగా చేశారని, కాళేశ్వరంపై రూ.లక్ష కోట్లు వృథా చేశారని ఇలా పలు విధాలుగా సమస్యలను డైవర్ట్ చేయడానికి యత్నించారు. ఇవన్నీ తెలియకుండానే ఎన్నికల వాగ్దానాలు చేశారా? ఎల్ల కాలం అది సాగదు కదా? సడన్ గా ఆర్టీసీ సిబ్బంది రియాక్ట్ అయ్యారు. సమ్మెకు దిగారు. ఒక కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదంతా ప్రభుత్వానికి పెద్ద కళంకంగా మారింది.దాంతో రేవంత్ ప్రభుత్వం వేగంగా స్పందించాల్సి వచ్చింది. ప్రస్తుతానికి ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఒక పరిష్కారం కనుక్కున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి కమిటీ వేస్తామని చెప్పారు. ఇది కొంత సమయం తీసుకునే కసరత్తు తప్ప ఇంకొకటి కాకపోవచ్చు. ఇలాగే ఆయా వర్గాల వారు తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ ఆందోళనలకు దిగితే ప్రభుత్వానికి మరింత ఇరకాట పరిస్థితి ఏర్పడుతుంది. రైతులలో ఏర్పడిన అసంతృప్తిని కొంతైనా పొగొట్టాలని రేవంత్ సర్కార్ దశల వారిగా రైతు బంధు స్కీమ్ ను అమలు చేస్తోంది.రుణమాఫీని కొంత మేర చేశారు. అయినా ఇతర సమస్యలు వెంటాడుతూనే ఉంాయి. ఫీజ్ రీయింబర్స్ మెంట్ గురించి ప్రైవేట కాలేజీల వారు కొన్ని నెలల క్రితం ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. అక్కడికి హైదరాబాద్లో భూముల అమ్మకం వంటివాటి ద్వారా కొంత డబ్బు సంపాదిస్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు, వస్తున్న ఆదాయానికి సంబంధం ఉండడం లేదు. దానివల్లే ప్రభుత్వం వేల కోట్ల అప్పులు చేయవలసి వస్తోంది.ఈ ఏడాది కొత్త ఆర్థిక సంవత్సరంలో అంటే ఏప్రిల్ నుంచి జూన్ మధ్య రూ.18900 కోట్ల అప్పు చేయాలని ప్రబుత్వం నిర్ణయించుకుంది. ప్రతి నెల సగటున రూ.6300 కోట్ల అప్పు చేయాలన్నమాట. అంటే రోజుకు రూ.210 కోట్ల రుణం! రాష్ట్రం అప్పు ఇప్పటికే సుమారు రూ.ఎనిమిది లక్షల కోట్లకు చేరింది. ఈ ఏడాది ఇది ఇంకా పెరుగుతుంది.అయినా ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చడం అసాధ్యం అని చెప్పక తప్పదు. ఒకప్పుడు ప్రధానిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి పాకిస్తాన్తో యుద్దం నేపథ్యంలో ‘‘జై జవాన్, జై కిసాన్’’ అన్న నినాదం ఇచ్చి ప్రజలు ఒక పూట ఉపవాసం ఉండి ,ఆ డబ్బును సైనికుల నిధి ఇవ్వాలని కోరారు. దానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. కోట్లాది మంది దానిని ఆచరించారు. ఆ రోజుల్లో ఆయన పాటించిన నిరాడంబరత, చిత్తశుద్ధి, దేశ భక్తి మొదలైనవి కారణాలుగా ఉన్నాయి. కాని ప్రస్తుతం ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వాలు విలాసవంతమైన రీతిలో ఖర్చులు చేస్తున్నాయి. అవినీతికి కొదవే లేదు. ప్రజలను మభ్య పెట్టడానికి ఇష్టారీతిన ఎన్నికల ప్రణాళికలను ప్రకటించడం వంటివి చేస్తున్నాయి. అధికారంలోకి వచ్చాక చేతులు ఎత్తేస్తున్నాయి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చాలా ఏళ్ల క్రితం అమెరికాలో చేసిన ఒక వ్యాఖ్య అర్థవంతమైందే అనుకోవాలి. మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నప్పుడు రాజకీయ నేతలుగా మేము చేయకుండా ఉంటామా? అని అన్నారు. చమత్కారం కోసం ఆ మాట చెప్పినా,అది అక్షరసత్యం!కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బీజేపీతో కలవబోనని దేవుడిపై ఒట్టేస్తారా?
సాక్షి, హైదరాబాద్: బీజేపీతో భవిష్యత్తులో కలవబోమని తాను నమ్మే దేవుడిపై ఒట్టేసి కేసీఆర్ చెప్పగలరా అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ప్రశ్నించారు. అసలు బయటకే రాకుండా ఫామ్హౌస్లో ఉన్న వ్యక్తికి రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుందని ఎద్దేవా చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం లేకపోతే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయడం గురించి ఎందుకు చర్చ జరుగుతోందని, ఈ విలీనం గురించి కవిత మాటలకు కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. సోమవారం మండలి కాన్ఫరెన్స్ హాల్ లో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... అంతా ఆ తానులోని ముక్కలే... ‘బీఆర్ఎస్కు గతం మాత్రమే... భవిష్యత్తు లేదు. అసలు పార్టీ ఉంటుందో, మూసేస్తారో... కొత్తగా వచ్చే పార్టీ గురించి మనకెందుకు? ప్రతి కదలికకు ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం నెరవేరిన తర్వాత ఆ కదలిక నిస్తేజం అయిపోతుంది. తెలంగాణ ఏర్పాటు కోసం శ్రీకృష్ణ కమిటీ, రాష్ట్రానికి చెందిన మంత్రుల కమిటీలు కూడా అలాగే నిస్తేజం అయిపోయాయి. ఇప్పుడు బీఆర్ఎస్ది కూడా అదే పరిస్థితి. బీఆర్ఎస్ చచ్చిన శవంతో సమానం. శవానికి ఎంత అలంకరణ చేసినా లేచి వచ్చేది ఉండదు. 2001–14 వరకు ఆ పార్టీని ఉద్యమం, ఆ తర్వాత పదేళ్లు అధికారం బతికించాయి. ప్రజలు భరించలేనంత స్థాయికి వారి చెలాయింపు చేరుకున్నప్పుడు ఆ కుటుంబం, పార్టీ వద్దని ప్రజలు నిర్ణయించుకున్న తర్వాత 2023లో అధికారం నుంచి దించారు. కేసీఆర్ కుటుంబానికి ప్రజలతో సంబంధాలు తెగిపోయాయి. పంపకాల్లో తేడాలతోనే కుటుంబ కుంపటి వచ్చింది. వాళ్లంతా ఒకటే. ఆ తానులోని ముక్కలే. వాళ్ల దగ్గరున్న అధికారాన్ని గుంజుకున్నా... కేసీఆర్ కిందపడి దెబ్బతగిలితే గ్రీన్చానెల్ ఏర్పాటు చేసి ఆసుపత్రికి పంపించా. నేనే వెళ్లి పరామర్శించా. ఆయన అసెంబ్లీకి వస్తే వెళ్లి యోగక్షేమాలు కనుక్కున్నా. హిందూ సమాజంలో కుటుంబ పెద్ద చనిపోతే వారసులకు అధికార వారసత్వం వస్తుంది. కేసీఆర్ కుటుంబానికే ఆయన చావు అవసరం ఉంటుంది. కేసీఆర్ పోతే ఆయన ఆస్తి, పార్టీ, పార్టీ పేరిట ఉన్న ఆస్తులు, ఫామ్హౌజ్లు నాకు రావు. వాళ్ల దగ్గర ఉన్న అధికారాన్ని గుంజుకున్నా. ఇంకా ఆయన చావుతో నాకేం సంబంధం? కొడుక్కో, అల్లుడికో, కూతురికో ఉండొచ్చు. ఆయన బతికుంటే అధికారం రాదని, ఏదైనా చేద్దామని వారు అనుకుంటారేమో? ఆయన నాకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే. శత్రువు కాదు. ఆయన ఆరోగ్యంగా ఉంటేనే మాకు ఈజీ. ఆయన విశ్రాంతి తీసుకుంటున్న ఓ ప్రజాప్రతినిధి. విశ్రాంతి తీసుకునే వారి చావును కోరుకునే మూర్ఖులు కాంగ్రెస్లో లేరు. కేసీఆర్కు మందులిచ్చే ఆయన సంతకం పెట్టించుకుంటే మిగిలిన ముగ్గురి ఆశలు గల్లంతే అవుతాయి. అందుకే వారిలో ఎవరితో ఎక్కువ ప్రమాదమన్నది కేసీఆరే విశ్లేషించుకోవాలి. కోర్టు ఏం చెప్పింది..? కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్పై కేసీఆర్, హరీశ్రావులు కమిషన్ ఏర్పాటు చట్టబద్ధం కాదని ప్రకటించాలని కోర్టును అడిగారు. కానీ కోర్టు చట్టబద్ధమేనని చెప్పింది. నోటీసులివ్వకుండా అభియోగాల నిర్ధారణ సరైంది కాదని, సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ విషయంలో మాత్రం సాంకేతికంగా వారికి సింఫుల్ రిలీఫ్ వచ్చింది. ఈ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టును అడిగారు. మా అడ్వొకేట్ జనరల్ స్వయంగా ఇదే విషయాన్ని కోర్టుకు చెప్పారు. ఇందులో వారికి లభించిన ఊరట ఏంటో అర్థం కాలేదు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పీసీ ఘోష్ కమిషన్ నివేదికల ఆధారంగా బాధ్యులెవరో విచారించాలని మేం సీబీఐని అడిగాం. వెంటనే విచారణ కోరుతూ నేను, మంత్రి ఉత్తమ్ సీబీఐ డైరెక్టర్ను కలుస్తాం. కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. సీబీఐ విచారణ వద్దని బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు హరీశ్రావు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మేడిగడ్డ బరాజ్ సందర్శన అధికారిక కార్యక్రమం. దీంతో సంబంధమున్న అధికారులంతా వస్తారు. కేంద్ర మంత్రులు పాల్గొనే అధికారిక కార్యక్రమాలకు రాష్ట్ర అధికారులు కూడా వెళ్తారు. అలా వెళ్లారని మేం కూడా సస్పెండ్ చేయాలా? ఫార్ములా–ఈ రేస్ కేసులో ఏసీబీ చార్జిషీట్ దాఖలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు తొందరలోనే ఓ కొలిక్కి వస్తుంది. ఎలిమినేషన్ జరుగుతోంది రాష్ట్రంలో మాకు రాజకీయ ప్రత్యర్థి ఎవరన్నది ఇప్పుడే చెప్పలేం. ఎలిమినేషన్ ప్రాసెస్ జరుగుతోంది. వాళ్లలో కొట్టుకుని ఎవరు బయటకు వస్తారో రమ్మనండి. అప్పుడే మేం వారిని ఢీ కొంటాం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి, ఇంకో కూటమి మధ్యనే పోటీ ఉంటుంది. మా కూటమిలో సీపీఐ, సీపీఎం, కోదండరాం పార్టీలుంటాయి. వాళ్ల కూటమిలో ఎవరుంటారో తెలియదు. మాది కార్మిక, కర్షక కూటమి. వాళ్లది ధృతరాష్ట్ర కూటమి. ఆ నాలుగు వేటికవే..! దేశంలో ఇప్పుడు నాలుగు అంశాలు చర్చలో ఉన్నాయి. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల డీలిమిటేషన్, లోక్సభ సీట్ల పెంపు, జమిలి ఎన్నికలపైనే అందరి దృష్టి ఉంది. మహిళా రిజర్వేషన్లు ఇప్పుడున్నది ఉన్నట్టు అమలు చేస్తే ఆరు నెలల్లో అమల్లోకి వస్తాయి. 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు వర్తింపచేయొచ్చు. జనాభాను క్రమబదీ్ధకరిస్తూ ఆయా రాష్ట్రాల్లో ఇప్పుడున్న పార్లమెంటు స్థానాల పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ కూడా ఏడాదిన్నరలో చేయొచ్చు. ఇక, లోక్సభ స్థానాల పెంపుపై కూడా ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ పెంపునకు ఎంచుకున్న విధానానికే మేం వ్యతిరేకం. విధివిధానాలు ఖరారు చేసి రాష్ట్రాల మధ్య అంతరం రాకుండా అన్ని రాజకీయ పక్షాలతో చర్చించాలి. శిఖండి రాజకీయాలు చేయొద్దు. లోక్సభలో 2/3 వంతు మెజార్టీ లేదని, రాదని తెలిసి కూడా బిల్లులు పెట్టి మా నెత్తిమీద టెంకాయలు కొడదామనుకున్నారు. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఐదు రాష్ట్రాల ఎన్నికలు దీనికి రిఫరెండం అని చెప్పమనండి. అసలు 50 శాతం సీట్లు పెంచాలని కిషన్రెడ్డి, మోదీలకు ఏ దేవుడు చెప్పాడు. జమిలి ఎన్నికల విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. రాజ్యసభలో మాట్లాడొచ్చు కదా? బీజేపీ ఎంపీ తేజస్వీ వ్యాఖ్యలపై మా పార్టీ ఎంపీలు మాట్లాడింది బీఆర్ఎస్ వారికి కనిపించలేదా? వినిపించలేదా? మా ఎంపీలు చామల కిరణ్, కావ్య, మల్లురవి మాట్లాడారు. లోక్సభలో కుస్తీలు పట్టలేరు కదా? తేజస్వీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎంపీలు రాజ్యసభలో మాట్లాడారు. మీ మధ్య చీకటి ఒప్పందం లేకుంటే విలీనం గురించి చర్చలు ఎందుకు చేస్తున్నారు? విలీనం గురించి కవిత చెప్పిన విషయాలపై ఎప్పుడైనా మాట్లాడారా? కేసీఆర్ మాటలు, చేతల గురించి కవిత లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పండి. మన మనిషి కాదు, మర మనిíÙ, ఆయన చుట్టూ పందికొక్కులు, దోపిడీ దొంగలున్నారన్న దానికి సమాధానం చెప్పండి. కవిత ఇంటిగుట్టు కుండబద్దలు కొట్టింది. తొలుత దానికి సమాధానం చెబితే కేసీఆర్ నిజాయితీ ఏంటో బయటపడుతుంది’ అని రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. -
డ్రగ్స్ కేసుల్లో ఎవర్నీ వదలొద్దు
సాక్షి, హైదరాబాద్: ‘మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసు ల్లో ఎంత పెద్ద సెలబ్రిటీలు ఉంటే అంత వేగంగా స్పందించండి. ఈ రకమైన వ్యవహారాల్లో ఎంత పెద్ద వారున్నా, ప్రముఖులు ఉన్నా డోంట్ కేర్ ఎనీ వన్ (ఎవర్నీ ఖాతరు చేయకండి).. డోంట్ స్పేర్ ఎనీ వన్ (ఎవర్నీ వదిలిపెట్టకండి). సామాన్యులు వెయ్యి మందిని అరెస్టు చేయడం కన్నా ప్రముఖులు ఇద్దరిని జైల్లో వేస్తే ప్రజలకు బలమైన సందేశం ఇచ్చినట్లు అవుతుంది..’ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. హైదరాబాద్ పోలీసు విభాగం కొత్తగా అమల్లోకి తీసుకు వచ్చిన ‘స్పందన’ బృందాలను సీఎం సోమవారం బంజారాహిల్స్లోని ఐసీసీసీ వద్ద ప్రారంభించి మాట్లాడారు.మహిళల భద్రతకు పెద్దపీట వేస్తే అభివృద్ధి: ‘వివిధ కేసుల్లో బాధిత మహిళలు, చిన్నారులకు సహాయ సహకారాలు అందించడానికి హైదరాబాద్ నగర పోలీసులు ఈ స్పందన బృందాలను ఏర్పాటు చేశారు. నేరగాళ్ల గుర్తింపు, వారికి శిక్ష పడేలా చేయడం కాలక్రమంలో జరిగినా.. బాధితులకు తక్షణ భద్రత కల్పించడానికి ఈ బృందాలు పని చేస్తాయి. మహిళా భద్రతకు సంబంధించిన ప్రతి కార్యక్రమానికీ నేను వస్తున్నానంటే..అది మహిళల భద్రతకు ప్రభుత్వం ఎంత ప్రాధాన్యం ఇస్తోందనే సందేశం, ఆదేశం అన్ని స్థాయిల అధికారులకు ఇవ్వడమే.ఏ దేశంలో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తారో ఆయా దేశాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. తొలి ప్రధాని నెహ్రూ దేశ అభివృద్ధిలో మహిళలకు కీలక ప్రాధాన్యం ఇచ్చారు. అమెరికాకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అక్కడి మహిళలు ఓటు హక్కు సాధించుకోవడానికి 150 ఏళ్లు పట్టింది. కానీ మన దేశంలో రాజ్యాంగంలోనే మహిళలకు ఓటుహక్కు సంబంధిత అంశాలన్నీ పొందుపరిచాం. విద్యా, ఉద్యోగాలతో పాటు చట్ట సభల్లోనూ వారికి రిజర్వేషన్లు కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ 2013 లోనే బిల్లు ప్రవేశపెట్టింది..’ అని రేవంత్ చెప్పారు. పీస్ కమిటీలకు డ్రగ్స్ నియంత్రణ బాధ్యతలు: మత కలహాల సమయంలో పోలీసులకు సహకరించడానికి పీస్ కమిటీలు ఏర్పాటు చేశారు. అవి అద్భుతమైన పనితీరుతో పోలీసులకు చేదోడువాదోడుగా నిలిచాయి. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేకపోవడంతో వీరికి చేతి నిండా పని లేకుండా పోయింది. దీంతో వీరిని డ్రగ్స్, గంజాయి నియంత్రణకు వినియోగించుకోవాలని పోలీసు విభాగాన్ని ఆదేశిస్తున్నా. ఆయా ప్రాంతాల్లో జరిగే అంశాలపై సమాచారం సేకరణ, కొన్ని నిర్ణయాలను అమలు చేయడానికీ వీరి సహాయం తీసుకోండి. డీసీపీ, ఏసీపీ స్థాయిల్లో సమన్వయ సమావేశాలు పెట్టి ముందుకు వెళ్లండి. మహిళలపై జరిగే దారుణమైన నేరాల్లో అనేకం డ్రగ్స్, గంజాయి మత్తులో జరిగేవే. రాష్ట్రం నుంచి డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలి.దీనికోసమే ఈగల్ ఫోర్స్ ఏర్పాటు చేశాం. ఇటీవల అనేక మంది ప్రముఖులు, ప్రజా ప్రతినిధులను కూడా అరెస్టు చేశాం. ఈ అంశంలో తల్లిదండ్రుల సహకారం కూడా కావాలి. పాఠశాలల్లో అడ్మిషన్ సమయంలోనే ఎలాంటి డ్రగ్స్ తదితరాలను తీసుకోమనే అండర్టేకింగ్ ఇచ్చేలా అప్లికేషన్లో కాలమ్ ఉండాలని ఇటీవల గవర్నర్ సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేస్తాం. రాష్ట్రంలో పెద్ద ఎత్తున రీహ్యాబ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం..’ అని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, ఎంపీలు వేం నరేందర్రెడ్డి, అనిల్కుమార్ యాదవ్, డీజీపీ బి.శివధర్రెడ్డి, నగర కొత్వాల్ వీసీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు. -
శవాన్ని ఎంత అలంకరించినా లేచి నిలబడదు..!
-
కవిత కొత్త పార్టీపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్ : కొత్త పార్టీని పక్కన పెట్టండి. ఉన్న పార్టీ ఉంటుందో.. ఊడుతుందో. బీఆర్ఎస్కు గతం ఉంది.. భవిష్యత్తు లేదు. కేసీఆర్ నా రాజకీయ ప్రత్యర్థి.. నాకు శత్రువు కాదు’ అని అన్నారు సీఎం రేవంత్రెడ్డి. రాష్ట్రంలో ఇటీవల రాజకీయ పరిణామాలపై ఆయన సోమవారం మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఆ చిట్చాట్లో మాజీ ఎమ్మెల్సీ కవిత ఏర్పాటు చేసిన కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్), బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కొత్త పార్టీ పక్కన పెడితే.. ఉన్న పార్టీ ఉంటుందో.. ఊడుతుందో. బీఆర్ఎస్కు గతం ఉంది. భవిష్యత్తు లేదు. ఇప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్ నడుస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నా రాజకీయ ప్రత్యర్ధి. శత్రువు కాదు’ అని వ్యాఖ్యానించారు. ప్రతి పనికి పర్సస్ ఉంటుంది.. పర్పస్ అయిపోయాక దాంతో పనేముండదు. కేసీఆర్ పార్టీ మనుగడ ముగిసింది. చనిపోయిన శవానికి ఎంత అలంకరణ చేసినా మనిషి లేచి రాడు. బీఆర్ఎస్ పార్టీ చనిపోయిన శవంతో సమానం. బీఆర్ఎస్కు గతం ఉంది.. భవిష్యత్ లేదు.. ఉండదు. తెలంగాణ ఉద్యమంలో ఏం చేసినా చెల్లింది. దాడులు చేసినా, అవమానించినా పడ్డారు.. ఇప్పుడు కూడా అలా ఉంటామంటే కుదరదు. పదేళ్ల అధికారంలో ఆహంభావం, అధికారం తలకెక్కింది.అహంకారం పెరగడంతో 2023లో బీఆర్ఎస్ను ఓడగొట్టారు. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చారు. కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్తో ప్రజలకు సంబంధాలు తెగిపోయాయి. ఇప్పుడు పడే తాపత్రయం అంతా కుటుంబం కోసమే. కుటుంబ పంచాయితీల్లో వచ్చిన కొత్త సంస్థలను మాపై రుద్దకండి. ఒక్క చెరువు నుంచి వచ్చిన నీటికి రంగు రుచి మారదు. కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు అనగానే పరామర్శించా. అసెంబ్లీకి కేసీఆర్ వస్తే యోగక్షేమాలు కనుక్కున్నది నేను. హిందూ సమాజంలో కుటుంబ పెద్ద చనిపోతే వారసులకు వారసత్వం వస్తుంది. ఔరంగజేబు వారసత్వం కోసమే అందరినీ చంపేశాడు. ఒకరు చనిపోవాలని నేను ఎందుకు కోరుకుంటా. వాళ్లు చనిపోతే ఆ పార్టీ, ఆపార్టీ ఆస్తులు నాకు రావు. కేసీఆర్ నా రాజకీయ ప్రత్యర్థి. నాకు శత్రువు కాదు. 2023 నుంచి అన్నీ ఎన్నికల్లో కేసీఆర్ను ఓడించాను. కేసీఆర్ మీద నాకు గెలుపు కొత్తకాదు’అని అన్నారు. -
ముఖ్యమంత్రి అయితే.. వారానికి మూడుసార్లు ఇదేనా?
హైదరాబాద్: మండిపోతున్న ఎండలు.. ఆపై మిట్టమధ్యాహ్నం.. ఔటర్ రింగ్ రోడ్డుపై అర్ధగంటకు పైగా వాహనాలను నిలిపివేయటంతో ప్రయాణికుల సహనం నశించింది. కొందరు కార్లలోంచి దిగి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అసలు విషయం ఏంటంటే.. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జన్వాడలో ఓ వివాహానికి హాజరై తిరిగి వెళ్తున్న క్రమంలో పుప్పాలగూడ ఔటర్ టోల్గేట్తో పాటు మైహోం అవతార్ సర్కిల్లోనూ పోలీసులు ట్రాఫిక్ను నిలిపివేశారు. పది నిముషాల్లోనే వేలాది వాహనాలు బారులుతీరాయి. అర్ధగంట పాటు నిలిపివేయడంతో కొందరు కార్లలోంచి దిగి వచ్చి వాగ్వాదానికి దిగారు. ‘ముఖ్యమంత్రి అయితే వారంలో మూడు, నాలుగు సార్లు తమను ఇబ్బందులకు గురిచేస్తారా? హెలికాప్టర్లో తిరగమనండి. లేదంటే సామాన్యుడిలా ట్రాఫిక్లో వెళ్లాలని చెప్పండి. మండుతున్న ఎండలో మమ్మల్ని ఇంతసేపు నిల్చోపెడతారా’? అంటూ నిలదీశారు. అంతలోనే సీఎం కాన్వాయ్ వస్తుండగా ఒక్కసారిగా హారన్లను మోగించి ఆయనకు వినిపించేలా నిరసన తెలిపారు. అనంతరం సీఎం కాన్వాయ్ వెళ్లిపోవటం, ట్రాఫిక్ జాం సమస్య సమసిపోయింది. ఈ తతంగాన్ని మొత్తం ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో వైరల్ అయ్యింది. View this post on Instagram A post shared by Hyderabad Mail (@hyderabadmail) -
ప్రజా‘వాణి’ వినాలి
సాక్షి, హైదరాబాద్: ‘ప్రజలకు నమ్మకంగా ఉండేలా ప్రజావాణి సేవలు అందించాలి. ప్రతి ఫిర్యాదును నమోదు చేయాలి. సంబంధిత విభాగాలకు పంపించాలి. పరిష్కార పురోగతిని అర్జీదారునికి తెలియజేయాలి’అని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారానికి నిర్ణీత గడువు ఉండాలని, ఆలస్యం జరగకూడదని చెప్పారు. ఫిర్యాదుల నమోదు, ట్రాకింగ్, పరిష్కారానికి ఏకీకృత డిజిటల్ ప్లాట్ఫాం అభివృద్ధి చేయాలన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో రియల్ టైమ్ మానిటరింగ్ ఉండాలని సూచించారు. డ్యాష్బోర్డ్ ద్వారా పరిష్కార పురోగతి తెలుసుకునే వీలుండాలని, ఎక్కడైనా ఆలస్యం జరిగితే సంబంధిత అధికారులను బాధ్యులను చేయాలని చెప్పారు. ఎంసీఆర్హెచ్ఆర్డీలో ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సీఎంఓ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ప్రజల అర్జీలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత పకడ్బందీగా అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ఇకపై రెవెన్యూ డివిజన్ స్థాయికి, తర్వాత దశలో మండల స్థాయికి విస్తరించాలన్నారు. దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు, జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని చెప్పారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి అన్ని స్థాయిల్లో అధికారులకు పూర్తి అధికారాలు ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన మరుసటి రోజు 2023 డిసెంబర్ 8న మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్లో రాష్ట్ర స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. నాటి నుంచి ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. అన్ని శాఖల అధికారులు అక్కడికక్కడే ప్రజల అర్జీలు, దరఖాస్తులను స్వీకరించి వేగవంతంగా వాటిని పరిష్కరించే చర్యలు చేపడుతున్నా రు. జిల్లా స్థాయిలోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతివారం ప్రజావాణి నిర్వహిస్తున్నారు. పైఅధికారికి ఫిర్యాదు ఆటో ఎస్కలేషన్.. ప్రతిస్థాయిలో ప్రజావాణికి ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ప్రతి జిల్లాలోనూ, ప్రతి శాఖలో ప్రత్యేక ప్రజావాణి విభాగాలు ఏర్పాటు చేయాలన్నారు. ఒకస్థాయిలో పరిష్కారం కాకపోతే, పైస్థాయి అధికారికి అర్జీ అందేలా ఆటో ఎస్కలేషన్ వ్యవస్థను అమలు చేయాలని చెప్పారు. అవసరమైతే అప్పీల్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. పెండింగ్ ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఆలస్యమైతే అధికారులదే బాధ్యత అని చెప్పారు. ప్రజావాణి సేవలను వికేంద్రీకరించటంతో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో పెండింగ్ అర్జీల సంఖ్య తగ్గుతుందని, కింది స్థాయిలోనే కొన్ని పరిష్కరించే వీలుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. -
‘రేవంత్ పేరు చెప్పాలంటేనే మొహం తిప్పుకుంటున్నారు’
సాక్షి,హైదరాబాద్: దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు అంతా ముందుకు వస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆదివారం హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి పలువురు తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో హుజూర్ నగర్లో భారీగా ఓట్లు వచ్చాయి. దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు అంతా ముందుకు వస్తున్నారు. హుజూర్నగర్లో గతంలో ఎమ్మెల్యే పార్టీ మారినా కార్యకర్తలు మారలేదు. కేసీఆర్ నాయకత్వంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిన నాయకుడు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. హుజూర్ నగర్ నియోజకవర్గంలో అనామకుడైన సైదిరెడ్డిని గెలిపించాం. 2023 శాసన సభ ఎన్నికల్లో ఓడిపోగానే పార్టీని వదిలిపెట్టి పోయారు. హుజూర్ నగర్లో దుర్మార్గమైన కాంగ్రెస్ వైఖరీని బీఆర్ఎస్ శ్రేణులు పోరాట స్పూర్తితో ఎదుర్కొంటున్నారు. సైదిరెడ్డి ఆయన సొంత ఊరులో సర్పంచ్ని గెలిపించుకోలేక పోయారు. ఆనాడు జలదృశ్యంలో గులాబీ జెండా ఎగిరింది. తెలంగాణ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగిరి 25 యేండ్లు పూర్తి చేసుకొని 26 వసంతంలోకి అడుగుపెడుతోంది. దేశంలో ఏ పార్టీకి లేని విశిష్టత ఒక్క బీఆర్ఎస్ పార్టీకే ఉంది.సీఎం రేవంత్రెడ్డికి ఐడెంటిటీ క్రైసిస్ ఉంది.. అందుకే కేసీఆర్ను విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి పేరును ఎవరూ గుర్తు పెట్టుకోవడం లేదు. రేవంత్ పేరు చెప్పాలంటేనే మొహం తిప్పుకుంటున్నారు. గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది. ఒక్కొక్క కాంగ్రెస్ నేత కమల్హాసన్ను మించి యాక్టింగ్ చేస్తున్నారు. వంద రోజుల్లోనే గ్యారెంటీలు అమలు చేస్తామని నమ్మించారు. బాండ్లు పేపర్లు రాసి, దేవుడి మీద ఒట్టు వేశారు. 420హామీలు, 13 డిక్లరేషన్లు ఏమయ్యాయి?. మాటలు ఆకాశన్నంటాయి.. చేసింది మాత్రం సున్నా.. కాంగ్రెస్కు ఓటేసి తప్పు చేశామని నల్గొండ రైతులు చెబుతున్నారు’అని తెలిపారు. -
స్కై రూట్ ఏరో స్పేస్ కార్యక్రమంలో సీఎం రేవంత్
హైదరాబాద్: శంషాబాద్లోని జీఎంఆర్ ఏరోస్పేస్ పార్క్లో స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీకి చెందిన విక్రం-1 రాకెట్ ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు పాల్గొన్నారు. దీనిలో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ఆనంద్ మహీంద్రా బోర్డు చైర్మన్గా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఏరో స్పేస్ విభాగం లో కూడా స్కిల్ యూనివర్సిటీ సేవలను వినియోగించుకోవాలి. ఏరో స్పేస్ రంగానికి కావాల్సిన మనవరులను యూనివర్సిటీ ద్వారా అందిస్తాం. స్కిల్స్ కు సంబంధించిన అన్ని విభాగాలను స్కిల్స్ యూనివర్సిటీ పరిధి లోకి తీసుకువస్తాం. స్కిల్స్ యూనివర్సిటీ ని అద్భుతం గా తీసుకువస్తున్నాం. మల్లేపల్లి ఏటీసీ సెంటర్ ని సందర్శించాలి. ఐటీఐలను టాటా గ్రూప్ సహకారం తో ఏటీసీలు గా మారుస్తున్నాం. సిలబస్ను కూడా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మారుస్తున్నాం. విద్యా వ్యవస్థను సమూలం గా మారుస్తున్నాం. విద్యా ప్రమాణాలతో పాటు మహులిక సదుపాయాలు పెంచబోతున్నాం. ప్రతి విద్యార్థి పైన లక్షా 8 వేల రూపాయలను ప్రభుత్వం ఖర్చు పెడుతోంది’ అని పేర్కొన్నారు. -
అధికారంపై కవిత ధీమా, సీఎం కర్కోటకుడు అంటూ విమర్శలు
-
శంకర్ గౌడ్ ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే..
-
హైదరాబాద్లో కొత్త పార్క్.. ఈ వేసవి సెలవుల్లో ఓ లుక్కేయండి (ఫొటోలు)
-
శంకర్గౌడ్ కుటుంబాన్ని ఆదుకుంటాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ బలవన్మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని.. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని.. కుటుంబ సభ్యులకు ధైర్యం, మనోబలం కలగాలని ప్రార్థించారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబాన్ని దు:ఖసాగరంలో ముంచిందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని, వారి సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు.కాగా, వరంగల్ జిల్లా నర్సంపేట డిపోలో ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్గౌడ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమ్మెలో భాగంగా రెండో రోజు డిపో వద్ద కార్మీకులు చేస్తున్న ఆందోళన వద్ద గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.గమనించిన తోటి ఉద్యోగులు మంటలను ఆర్పారు. అప్పటికే తీవ్రగాయాలు కావడంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి అంబులెన్స్లో తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని కంచన్బాగ్ డీఆర్డీఓ అపోలో ఆసుపత్రికి తరలించారు. 80 శాతానికిపైగా కాలిన గాయాలతో చికిత్స పొందుతు మృతిచెందారు. -
100 రోజుల్లో ‘రిటైర్డ్’ బకాయిలు!
సాక్షి, హైదరాబాద్: రిటైర్డ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడిన రూ.8 వేల కోట్ల పైచిలుకు పదవీ విరమణ ప్రయోజనాలను వచ్చే 100 రోజుల్లోగా ఎలా చెల్లించాలనే అంశంపై ప్రణాళిక సిద్ధం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వనరుల సమీకరణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘానికి ఈ బాధ్యతను అప్పగించింది. వచ్చే నెల 4న జరగనున్న తదుపరి మంత్రివర్గ సమావేశంలో మంత్రివర్గ ఉప సంఘం సిఫారసులపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని తీర్మానించింది. గురువారం సచివాలయంలో సీఎం ఎ.రేవంత్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. రిటైర్డ్ ఉద్యోగులకు రూ.8 వేల కోట్లు, ఇన్ సర్వీస్ ఉద్యోగులకు మరో రూ.6,200 కోట్లు కలిపి మొత్తం రూ.14,200 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని అధికారులు నివేదించారు. దీంతో పాటు ఇతర అంశాలు చర్చించిన మంత్రివర్గం పలు నిర్ణయాలు తీసుకుంది. భేటీ అనంతరం రాష్ట్ర సమాచార, ప్రజాసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి..సహచర మంత్రులు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, వాకిటి శ్రీహరితో కలిసి వివరాలు వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బకాయిలు మిగిల్చిపోయింది.. ‘ఉమ్మడి ఏపీలో ఉద్యోగులు రిటైరైన కొన్ని నెలలకే పదవీ విరమణ ప్రయోజనాలను చెల్లించే వారు. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లు పాలించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.వేల కోట్ల బకాయిలను మిగిల్చిపోయింది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది రిటైర్డ్ ఉద్యోగులకు బిల్లులు చెల్లించలేకపోయాం. కానీ గత 14 నెలలుగా ప్రతి నెలా రూ.750 కోట్ల నుంచి రూ.800 కోట్లను చెల్లించుకుంటూ వస్తున్నాం. అయితే రిటైర్డ్ ఉద్యోగులు ఆఫీసులు, సచివాలయం చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతుండటంపై మంత్రివర్గం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే రెగ్యులర్ ఉద్యోగుల బకాయిలను సైతం సత్వరమే చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలనే ఆలోచన చేసింది. ప్రజా ప్రతినిధుల జీతాల నుంచి 50% కోత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా బకాయిలను వెంటనే చెల్లించలేని పరిస్థితి ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాలన్నీ అన్వేషించి, అవసరమైన నిధులు సర్దుబాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. సీఎం, మంత్రులతో పాటు ప్రజా ప్రతినిధుల జీతాల నుంచి 50 శాతం నిధులను కోత పెట్టి రిటైర్డ్ ఉద్యోగుల బిల్లుల చెల్లింపులకు వినియోగించాలని తీర్మానించింది. బకాయిల చెల్లింపులపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘాలతో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి సూచనలు చేయాలని వనరుల సమీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘానికి కేబినెట్ సూచించింది..’ అని పొంగులేటి తెలిపారు. బరాజ్లపైనే సీబీఐ విచారణ కోరుతున్నాం: మంత్రి ఉత్తమ్ సీఎం రేవంత్తో పాటు త్వరలో సీబీఐ డైరెక్టర్ను కలిసి కాళేశ్వరం బరాజ్ల నిర్మాణంలో అవకతవకతలపై విచారణ చేపట్టాలని కోరతామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్, ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ నివేదికలను ఇప్పటికే సీబీఐకు పంపించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని కోరి 9 నెలలు గడుతుస్తున్నా స్పందన లేదు. మళ్లీ త్వరలోనే ఈ నివేదికలను సీబీఐ డైరెక్టర్కు కూడా అందజేస్తాం..’ అని అన్నారు. కేవలం బరాజ్లపై మాత్రమే విచారణ కోరుతున్నామంటూ మంత్రి ఓ ప్రశ్నకు బదులిచ్చారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై సీబీఐ విచారణ చేస్తే చేయమనండి అని అన్నారు. వారి ఆరోపణలతో కోర్టు ఏకీభవించలేదు.. కాళేశ్వరంపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై తాజాగా రాష్ట్ర హైకోర్టు వెలువరించిన తీర్పు సారాంశాన్ని అడ్వకేట్ జనరల్ సుదర్శన్రెడ్డి మంత్రివర్గానికి వివరించినట్టు ఉత్తమ్ తెలిపారు. ఘోష్ కమిషన్ నియామకాన్ని, కమిషన్ ఇచ్చిన నివేదికను కూడా హైకోర్టు తప్పు బట్టలేదని అన్నారు. కేసీఆర్, హరీశ్రావు, ఎస్కే జోషి, స్మిత సబర్వాల్ తమ పిటిషన్లలో చేసిన ఆరోపణలతో న్యాయస్థానం ఏకీభవించలేదని చెప్పారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టంలోని సెక్షన్ 8బీ కింద పిటిషనర్లకు నోటీసులు ఇవ్వలేదనే సాంకేతికపర అంశాన్నే తప్పు బట్టిందని, నివేదికలో చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మాత్రమే ఆదేశించిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ కేసును వాదించిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో అడ్వకేట్ జనరల్ సమావేశమై హైకోర్టు తీర్పు నేపథ్యంలో తీసుకోవాల్సిన తదుపరి కార్యాచరణను ఖరారు చేస్తారని వెల్లడించారు. హైకోర్టు సూచించిన రీతిలో మళ్లీ సెక్షన్ 8బీ కింద నోటీసులు ఇచ్చిన విచారించడానికి వీలుగా ఘోష్ కమిషన్ గడువును పొడిగించాలా? లేక హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలా? అన్న అంశంపై న్యాయ నిపుణులతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇతర కీలక నిర్ణయాలు..ఆమోదాలు – పదవీ కాలం ముగిసిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలకు త్వరలో నామినేషన్ పద్ధతిన పాలకవర్గాలను నియమించాలని మంత్రివర్గం నిర్ణయించింది. – గచ్చిబౌలి స్టేడియాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్íÙప్ (పీపీపీ) పద్ధతిలో అభివృద్ధి చేయాలని నిర్ణయం. స్టేడియం 76 ఎకరాల్లో విస్తరించి ఉండగా, రతన్ టాటా పేరుతో రూ.700 కోట్ల సీఎస్ఆర్ నిధులతో 64 ఎకరాల్లో స్టేడియం అభివృద్ధి బాధ్యతలను టాటా గ్రూప్కు అప్పగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. – మంథని నియోజకవర్గ ప్రాంత ప్రజల చిరకాల కోరిక చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు దాదాపు 2,427 ఎకరాల భూమి అవసరం. ఇప్పటివరకు 1,020 ఎకరాలు సేకరించారు. మిగిలిన భూసేకరణకు అవసరమయ్యే రూ.166.67 కోట్ల ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. – శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిసరాల్లో మంచిర్యాల జిల్లా హాజీపూర్ రెవెన్యూ పరిధిలో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. -
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై రాష్ట్ర మంత్రి వర్గంలో చర్చ జరిగింది. ఈ చర్చలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఆర్టీసీ కార్మికులు ఎలాంటి తొందర పాటు నిర్ణయాలు తీసుకోద్దు. ప్రాణాలు తీసుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో దృష్టి పెట్టింది’ అని వ్యాఖ్యానించారు.కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని స్పష్టం చేసిన సీఎం రేవంత్.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు రేపు ఆర్టీసీ కార్మిక సంఘాలను పిలిచి మాట్లాడాలని చెప్పారు. -
పెట్టుబడులను పట్టాలెక్కించండి
సాక్షి, హైదరాబాద్: వివిధ వేదికలపై ప్రముఖ కంపెనీలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) వేగంగా అమల్లోకి వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే భూముల కేటాయింపుతోపాటు ఇతర అనుమతులు ఇచ్చిన కంపెనీలు త్వరగా పనులు ప్రారంభించేలా చూడాలన్నారు. దావోస్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్తో పాటు ఇతర వేదికలపై వివిధ సంస్థలతో కుదుర్చుకున్న ఎంవోయూలపై పురోగతిపై రేవంత్రెడ్డి.. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో కలిసి బుధవారం రాత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు సంబంధించి పనులు ప్రారంభమైన కంపెనీలు, అనుమతుల దశలో ఉన్న కంపెనీలతో పాటు సాంకేతిక, ఇతర సమస్యలతో పనులు పెండింగ్లో ఉన్న సంస్థల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. ఫ్యూచర్ సిటీతోపాటు వివిధ ప్రాంతాల్లో ఆయా సంస్థలకు కేటాయించిన భూములు, స్థానిక మార్కెట్ ధరలు, ఆయా కంపెనీలు చెల్లించేందుకు ఆసక్తి చూపుతున్న మొత్తాన్ని అధికారులు వివరించారు. ప్రభుత్వ విధానం ప్రకారం క్యూర్, ఫ్యూర్, రేర్ ప్రాంతాల్లో ఆయా సంస్థలకు భూములు కేటాయించాలని రేవంత్ సూచించారు. పెట్టుబడులకు సంబంధించిన అనుమతులు వేగంగా ఇవ్వాలని, అదే సమయంలో ఆయా కంపెనీలు పనులు త్వరగా ప్రారంభించేలా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఆయా కంపెనీలకు కేటాయించాల్సిన భూములకు సంబంధించి పెండింగ్ భూసేకరణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. డేటా సెంటర్లపై... డేటా సెంటర్లకు ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని వినియోగించుకునే అవకాశం ఉన్నందున అందుకు తగినవిధంగా ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలను మూడు కేటగిరీలుగా విభజించాలన్నారు. మల్టీ నేషనల్, మార్కెట్లో పేరు ప్రతిష్టలున్న కంపెనీలకు మొదటి ప్రాధాన్యం ఇచ్చి ఆయా సంస్థలు త్వరగా పనులు ప్రారంభించేలా చూడాలన్నారు. వేగంగా ఎదుగుతున్న కంపెనీలు, భవిష్యత్లోనూ మంచి ప్రతిభ కనబర్చుతాయనుకునే సంస్థలకు తర్వాత ప్రాధాన్యం ఇవ్వాలని, మిగతా కంపెనీలను మూడో ప్రాధాన్యంగా ఎంచుకొని వాటి పెట్టుబడులు పట్టాలెక్కేలా ప్రేరణ కల్పించాలన్నారు. ఫ్యూచర్ సిటీ కార్యాలయ పనులు ఫ్యూచర్ సిటీలో కార్యాలయం పనులు త్వరగా పూర్తి చేసి అక్కడే ఎంవోయూల అమలు, పురోగతిపై నిరంతరం పర్యవేక్షించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పనులు పూర్తయిన కంపెనీల ప్రతినిధులతో చర్చించి వాటి ప్రారం¿ోత్సవానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. వీటిపై ఆయా శాఖల మంత్రులు తెలుసుకునేలా డ్యాష్ బోర్డు ఏర్పాటు చేసి రియల్ టైం అప్డేట్ ఉండాలన్నారు. పెట్టుబడులకు సంబంధించి ఒక పూర్తిస్థాయి మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో అది పని చేసేలా చూడాలన్నారు. టైర్–2, టైర్–3 సిటీల్లో ఏర్పాటు చేసిన ఐటీ టవర్లలో కొనసాగుతున్న కార్యకలాపాలపై సీఎం ఆరా తీశారు. ఆయా టవర్లను పూర్తి స్థాయిలో సది్వనియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం స్పెషల్ సెక్రటరీ బి.అజిత్ రెడ్డి, టీజీఐఐసీ ఎండీ కె.శశాంక, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి భవేష్ మిశ్రా, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి, పాల్గొన్నారు. మెట్రోపై సమీక్ష హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మెట్రో పనులకు సంబంధించి మిగిలిన కొంత భూ సేకరణను వేగంగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పరిశ్రమల శాఖపై సమీక్షకు ముందు హైదరాబాద్ మెట్రో రైలు పనులపై సీఎం సమీక్షించారు. రెండేళ్లలోనే చాంద్రాయణగుట్ట వరకు మెట్రో పనులు పూర్తి కావాలని ఆదేశించారు. రెండో దశ మెట్రో అనుమతులు, బహదూర్గూడ వద్ద హైస్పీడ్ కారిడార్ వద్దకు మెట్రో విస్తరణ తదితర అంశాలపైనా చర్చించారు. సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, మెట్రో సలహాదారు ఎన్వీఎస్ రెడ్డి పాల్గొన్నారు. -
కుట్రలు కూలిపోయాయి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉన్నంత కాలం కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటుందని, భూమిపై గోదావరి నది పారినంత కాలం ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన కేసీఆర్ పేరు నిలిచి ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. అభాండాలు, అబద్ధాలతో దుష్ప్రచారం చేసి, రాహుల్గాందీని మేడిగడ్డకు తెచ్చి సీఎం రేవంత్ గోబెల్స్ను మించి చిల్లర ప్రచారం చేసినా రాష్ట్ర హైకోర్టు చెంపపెట్టులాంటి తీర్పును ఇచ్చిందని చెప్పారు. కేసీఆర్పై చేసిన కుట్రలు, కుతంత్రాలు కోర్టు తీర్పుతో కూలిపోయాయన్నారు. తెలంగాణ రైతులు, ప్రజలు విజయం సాధించారని పేర్కొన్నారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పీసీసీ నివేదిక అని తేటతెల్లమైంది.. ‘కాళేశ్వరం ప్రాజెక్టు మహత్యాన్ని కనిపించకుండా చేయాలనే కుట్రలు వీగిపోయాయి. కాళేశ్వరం కూలేశ్వరం అంటూ మాట్లాడిన వారి గూబ గుయ్యిమంది. నిజం బయట పడింది. ఘోష్ కమిషన్ ట్రాష్ (చెత్త) కమిషన్ అని తేలిపోయింది. మేము గతం నుంచీ చెప్తున్నట్లుగానే ఇది పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కాదు.. పీసీసీ నివేదిక అని తేటతెల్లమైంది. కోర్టు తీర్పుతో బుద్ధి తెచ్చుకుని చిల్లర ప్రచారం ఆపి మేడిగడ్డ బరాజ్కి మరమ్మతులు చేయాలి. నటించడం మానుకుని నీటిని ఎత్తిపోయాలి. మేడిగడ్డ పేల్చివేతపై విచారణ జరపాలి మేడిగడ్డ బరాజ్ పేల్చివేతపై నెలకొన్న అనుమానాల విషయంలో బీజేపీ స్వతంత్ర విచారణ జరపాలి. నిక్షేపంగా ఉన్న బరాజ్ పిల్లర్లు అసెంబ్లీ ఎన్నికలకు నెల రోజుల ముందు ఎలా కూలిపోయాయో తేలాల్సి ఉంది. మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై ఆగమేఘాల మీద స్పందించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ).. ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదం ఘటన, సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలడం, చెక్డ్యామ్ల పేల్చివేతపై స్పందించకుండా ఎక్కడ చచ్చింది? కేసీఆర్ మీద కక్షతో రెండున్నరేళ్లు కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతు చేయకుండా రాష్ట్ర రైతాంగాన్ని రాచి రంపాన పెట్టారు. ఇప్పటికైనా ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందనే వార్తల నేపథ్యంలో కారుకూతలు, బూతులకు స్వస్తి చెప్పి ప్రాజెక్టును వినియోగంలోకి తేవాలి. రేవంత్ ఇకనైనా గాసిప్స్ మీద కాకుండా గవర్నెన్స్ మీద దృష్టి పెట్టాలి..’అని కేటీఆర్ హితవు పలికారు. ఘోష్ కమిషన్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కోట్ల రూపాయలు వృథా చేసిందని, సుప్రీంకోర్టులో ఏదో చేస్తామని ప్రభుత్వం అనుకోవడం వృథా ప్రయాస అని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ జాయింట్ వెంచర్ సర్కార్ ‘పగలు కాంగ్రెస్తో ఉంటూ రాత్రి బీజేపీతో అంటకాగుతున్న రేవంత్రెడ్డి ఒక హైబ్రిడ్ సీఎం. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుస్తోంది. చీకటి, దొంగ ఒకటి అయినట్లుగా వ్యవహారం కొనసాగుతోంది. కేంద్రమంత్రి బండి సంజయ్ ఒక్కసారి కూడా రేవంత్ను విమర్శించడం లేదు. కాంగ్రెస్ పెద్దలకు రాష్ట్రం నుంచి మూటలు వెళ్తుంటే, సంజయ్ స్పందించకుండా కరీంనగర్ కార్పొరేటర్లా మాట్లాడుతున్నాడు. రేవంత్రెడ్డి అక్రమాలకు రక్షణ గోడలా నిలుస్తున్నాడు. అమృత్ స్కీమ్, సింగరేణి కుంభకోణాలపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఎందుకు విచారణ జరపడం లేదు? రేవంత్ను ఎవరు కాపాడుతున్నారు? కెమెరాలకు చిక్కిన ఉగ్రవాది అజ్మల్ కసబ్లా రేవంత్ కూడా ఓటుకు నోటు కేసులో కెమెరాలకు చిక్కాడు. అయినా ఆయనను ఎవరు కాపాడుతున్నారో బీజేపీ నేతలు చెప్పాలి. రేవంత్ భవిష్యత్తులో కాంగ్రెస్ను బొందపెట్టి బీజేపీలో చేరడం ఖాయం..’అని కేటీఆర్ అన్నారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ నైతిక మద్దతు ఇస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. -
‘కుంగింది కాళేశ్వరం కాదు.. కేసీఆర్పై చేసిన కుట్రలు’
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాలు చేసిన వారికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు’’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇవాళ గెలిచింది తెలంగాణ ప్రజలు, రైతులు.. కుంగింది కాళేశ్వరం కాదు.. కేసీఆర్పై చేసిన కుట్రలు. కక్ష కట్టినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర ప్రచారం చేసింది. ఎన్ని కమిషన్లు వేసి కుట్రలు చేసినా, ఎన్నిక అబద్ధాలు చెప్పినా.. తెలంగాణలో పారుతున్న ప్రతి నీటి చుక్క కేసీఆర్ ఇచ్చిందే’’ అని కేటీఆర్ తేల్చి చెప్పారు.‘‘అది పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కాదు.. పీసీసీ ఇచ్చిన రిపోర్ట్. కాళేశ్వరం మహత్యాన్ని కనబడకుండా దాచలేరు. మాపై బురదచల్లారు కానీ.. నిప్పులాంటి నిజం బయటకు వచ్చింది. మేడిగడ్డపై కూడా సీఎం రేవంత్రెడ్డి కుట్ర చేశారు. రెండేళ్లలో ఎన్నో డైవర్షన్ పాలిటిక్స్ చేశారు. 2014లో ఆనాడు సాగునీటి విస్తీర్ణం ఎంత? ఇప్పుడు ఎంత?. ఎల్అండ్టీపై కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నం చేశారు. ఆగమేఘాల మీద ఎస్ఎల్బీసీ పనులు చేపట్టడం నిజం కాదా?. కమీషన్లకు కక్కుర్తిపడి ఎస్ఎల్బీసీ పనులు చేపట్టారు...ఎస్బీసీ కూలి.. కార్మికులు చనిపోతే ఇప్పటివరకు బయటకు తీయలేదు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోతే మాట్లాడరు?. కరీంనగర్లో చెక్డ్యాంలు పేలిస్తే ఎందుకు చర్యలు ఉండవు. కేసీఆర్పై కోపంతో రైతులను తీవ్ర ఇబ్బందులు పెట్టారు. రైతులకు కరెంట్, రైతుబంధు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం మంచిది కాదు’’ అని కేసీఆర్ హితవు పలికారు. -
చిల్లర రాజకీయాలు మానుకో.. రేవంత్ పై హరీష్ ఘాటు వ్యాఖ్యలు
-
సీఎం రేవంత్ పాటలు పై సింగర్ మధుప్రియ కామెంట్స్
-
చంద్రబాబు, రేవంత్ మధ్య చీకటి ఒప్పందం: కాకాణి
సాక్షి, నంద్యాల జిల్లా: సీమకు నీటి కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి నెలకొందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ముందు చూపుతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఏర్పాటు చేస్తే.. చంద్రబాబు తన స్వార్థం కోసం ఆపేసారంటూ మండిపడ్డారు. ఇక్కడ ఇంత పోరాటం చేస్తుంటే.. చంద్రబాబు మాత్రం కాసేపట్లో మమ్మల్ని టీడీపీ నాయకులతో తిట్టించే పని మొదలు పెడతారు’’ అంటూ కాకాణి ధ్వజమెత్తారు.చంద్రబాబు, రేవంత్ మధ్య చీకటి ఒప్పందం జరిగింది. ప్రతి విషయంలో ఇంతకన్నా దిగజారుడు అనుకున్న ప్రతి సారి చంద్రబాబు ఇంకా దిగజారి వ్యవహరిస్తున్నారు. ఏ రోజు చంద్రబాబు అధికారంలోకి వస్తాడో ఆ రోజు నుంచి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. రైతుల పేరుచెప్పుకొని నీరు-చెట్టు పేరుతో టీడీపీ నాయకులు దోచుకుంటున్నారు. రైతుల పేరుతో దోచుకోవడం తప్ప సాయం చేయడం చంద్రబాబుకు తెలియదు. ఏ ప్రాంత ప్రజల ఆత్మభిమానం కోసం చంద్రబాబు పని చేయడు ఆయనకు ఆత్మభిమానం లేదు..చంద్రబాబు కన్ను అర్పకుండా చెబుతాడు రాయలసీమను సస్యశ్యామలం చేస్తానంటాడు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గాలికి వదిలేసి కల్లబొల్లి మాటలు చెప్పడంలో దిట్ట. చంద్రబాబు మెడలు వంచి రాయలసీమ ప్రాజెక్టులను సాధించుకుందాం అందరూ సిద్ధం కావాలి’’ అంటూ కాకాణి పిలుపునిచ్చారు. -
కాళేశ్వరంపై తీర్పు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరం విషయంలో జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టును హైకోర్టు నిలిపివేసింది. రిపోర్టు ఆధారంగా చర్చలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ కక్ష సాధింపులు ఆపాలి అంటూ మండిపడ్డారు. సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు.మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా..‘ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ధర్మం జయించింది. కాంగ్రెస్ కుట్రలు బయటపడ్డాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలు పక్కనపెట్టి డ్రామాలాడారు. హైకోర్టు తీర్పుతో రేవంత్ నిజ స్వరూపం బయటపడింది. ఇప్పటికైనా కాంగ్రెస్ కక్ష సాధింపులు ఆపాలి. పిల్లర్ల మరమ్మత్తులు చేసి రైతుల ప్రయోజనాలు కాపాడాలి. ముమ్మాటికీ కాళేశ్వరం.. తెలంగాణకు ప్రాణేశ్వరమే’ అంటూ కామెంట్స్ చేశారు. సత్యమేవ జయతే..ఎవరెన్ని కుట్రలు చేసినా న్యాయస్థానాల్లో అంతిమంగా ధర్మం జయిస్తుందని, సత్యం నినదిస్తుందని ఈరోజు మరోసారి నిరూపితమైంది.ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ నడిపిన విచారణను ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా కమిషన్…— Harish Rao Thanneeru (@BRSHarish) April 22, 2026 -
అదే కాంగ్రెస్కు పెద్ద శాపంగా మారనుందా?
తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కె.చంద్రశేఖరరావులు ఇద్దరూ ఒకే రోజున బహిరంగ సభలు నిర్వహించి మాటా మాటా అనుకోవడంతో రాష్ట్రం మొత్తమ్మీద రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనతోపాటు రైతు భరోసా నిధుల విడుదల సందర్భంలో రేవంత్ రెడ్డి.. సీనియర్ కాంగ్రెస్ నేత, టి.జీవన్రెడ్డి బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా రేవంత్, కేసీఆర్లు ఇద్దరూ ఈ బహిరంగ సభలు నిర్వహించారు. ఎన్నికల సమయంలో మినహా ఇద్దరు ప్రధాన నేతలు ఒకే రోజు బహిరంగ సభలు పెట్టుకోవడం చాలా అరుదు. దీన్నిబట్టి చూస్తే వీరి మనసుల్లో ఏదో తెలియని ఆందోళన, సందేహాలు నిండి ఉండాలని అనిపిస్తుంది. అదే సమయంలో ఇరువురు నేతల ప్రసంగాల్లో స్పష్టమైన తేడా ఒకటి కనిపిస్తుంది. ఒకరు సెంటిమెంట్ రేకెత్తిస్తే.. ఇంకొకరు ఎదుటి పక్షాన్ని రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించారు. కాళేశ్వరం వెళుతున్నానని తెలిసి జీవన్ రెడ్డి సభ పెట్టుకున్నాడని, రేవంత్.. జగిత్యాలలో తమ సభ ఉందని తెలిసి రేవంత్ కాళేశ్వరం వెళ్లాడని జీవన్ రెడ్డి ఆరోపణలు చేసుకున్నారు. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేత పార్టీని వీడటం కాంగ్రెస్కు నష్టమే. బహశా అందుకే రేవంత్ ఆయన పేరు ప్రస్తావించి ఉండాలి. ‘‘బానిస బతుకు బతికేందుకు బీఆర్ఎస్లోకి వెళ్లాడు’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. 1984లో ఎన్టీఆర్కు నమ్మక ద్రోహం చేశారని, దళితుడికి మంత్రి పదవి ఇస్తే ఓర్వలేకపోయాడని, పాపాల భైరవుడి పార్టీలో చేరారని రేవంత్ ద్వజమెత్తారు. జీవన్ రెడ్డి కూడా తక్కువేమీ మాట్లాడలేదు. రేవంత్ను ఏకంగా తెలంగాణకు పట్టిన శని అని ఆరోపించారు. విశేషం ఏమిటంటే నలభై ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ మద్దతుతో టీడీపీ ప్రభుత్వాన్ని కూల్చి నాదెండ్ల భాస్కరరావు ఏర్పాటు చేసిన కేబినెట్లో జీవన్రెడ్డి మంత్రిగా పనిచేయడం. రేవంత్ ఇప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేసి ఉండవచ్చు. కానీ ఈ క్రమంలో అప్పట్లో కాంగ్రెస్ చేసిన పనిని కూడా తప్పు పట్టినట్లు అయ్యింది. ఆ మాటకు వస్తే టీడీపీలో ఉండగా రేవంత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఎంత తీవ్రంగా దుయ్యబట్టింది అందరికి తెలిసిందే. జీవన్ రెడ్డి కాంగ్రెస్లో చేరి ఐదుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. మంత్రి అయ్యారు. లోక్సభ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పక్షాన రెండుసార్లు కేసీఆర్పైనే పోటీ చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమిపాలైనా ఆ తర్వాత గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై కాంగ్రెస్కు ఊపిరి పోశారు.ఈ మధ్య జరిగిన మున్సిపల్ ఎన్నికలలో సొంతంగా తన కేడర్ను రంగంలో దింపి సత్తా చాటుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆయనతోనే అవగాహనకు వచ్చి మున్సిపాల్టీని కైవసం చేసుకుంది. ఆ సందర్భంలో తన అభ్యర్ధికి అవకాశం ఇవ్వకపోవడం జీవన్ రెడ్డిలో మరింత అసంతృప్తి రాజేసింది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్కు ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆవేదన ఆయనలో ఉంది. అయినా ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికలలో జీవన్ రెడ్డికి అవకాశం ఇచ్చి ఉంటే ఈ వివాదం ఉండకపోయేదేమో!. రేవంత్ తన సన్నిహితుడు వేం నరేంద్రరెడ్డికి ఇచ్చారు. దాంతో తనను అవమానిస్తున్నారని భావించిన జీవన్ రెడ్డి కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. దీని ప్రభావం పార్టీపై పెద్దగా పడకుండా ఉండడానికి రేవంత్ ఆయనపై విమర్శలు చేసినట్లు అనిపిస్తుంది. అయితే.. ఈ పరిణామం బీఆర్ఎస్కు మాత్రం కొంత ఉత్సాహం తెచ్చే విషయమే. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల గడువు ఉండగానే జీవన్ రెడ్డి లాంటి సీనియర్ కాంగ్రెస్ను వీడడం కార్యకర్తలలో ఆలోచనకు దారి తీస్తుంది. అలాగే ప్రజలలో కాంగ్రెస్ దెబ్బతింటున్నదేమో అనే భావన కలగవచ్చు. ఈ నేపథ్యంలో అటు కేసీఆర్ను, ఇటు జీవన్ రెడ్డిని కలిపి రేవంత్ విమర్శించారని చెప్పాలి. ఆ క్రమంలో రేవంత్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు ప్రయోజనమో చెప్పలేం. కాంగ్రెస్ కేడర్ లో అపనమ్మకం కలగకుండా ఉండడానికి రేవంత్ ఇలా చేసి ఉండవచ్చు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని కేసిఆర్ ధీమా వ్యక్తం చేస్తే 2029లో ఆ పార్టీకి విపక్ష హోదా దక్కనివ్వబోమని రేవంత్ అన్నారు. గత లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇది వాస్తవమే అయినప్పటికీ దానినే ప్రమాణికంగా తీసుకోలేం. ఉదాహరణకు రేవంత్ 2018 శాసనసభ ఎన్నికలలో ఓటమి చెంది, 2019 లోక్సభ ఎన్నికలలో మేడ్చల్ నుంచి విజయం సాధించారు. అదే ఆయన రాజకీయ జీవితంలో పెద్ద మలుపు అయింది. కేసీఆర్ను పాపాల భైరవుడని.. ఆయన చేసిన తప్పులకు ఉరి వేయాలని.. దమ్ముంటే రా కేసిఆర్ ..ఇలాంటి డైలాగులు చెప్పడం కేవలం రెచ్చగొట్టడమే అనిపిస్తుంది.రాజకీయాలలో ఇదొక వ్యూహంగా చెప్పవచ్చు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలాగే తన రాజకీయ ప్రత్యర్దులపై పరుష వ్యాఖ్యలు చేస్తుంటారు. ఆయనకు శిష్యుడుగా భావించే రేవంత్ కూడా దానినే ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. ఇక కేసీఆర్ ప్రసంగం చూస్తే ఆయన ఒకటిరెండు అభ్యంతరకర పదాలు వాడినా సెంటిమెంట్ పండించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఎక్కడా రేవంత్ పేరు కాని, ఇతర కాంగ్రెస్ నేతల పేర్లు కాని తీయకుండా విమర్శలు చేయడం ప్రత్యేకతగా కనిపిస్తుంది. కాంగ్రెస్ గత ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రస్తావించి వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం అయిందని,కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని, తాను ఆనాడే ఈ విషయం చెప్పానని, గోసపోతారని హెచ్చరించానని చెప్పడానికి యత్నించారు. పెన్షన్లు నాలుగు వేలు చేస్తామని, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ చేసిన వాగ్దానాలను ఆయన గుర్తు చేసి అవి అమలు అయ్యాయా? అని ప్రజలను అడిగారు. తాను సీఎంగా ఉండగా కరెంటు సరఫరాలో కాని, రైతులకు మేలు చేయడంలో కాని, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో కాని ఎక్కడా అశ్రద్ద చేయలేదని, అలాంటిది ఇప్పుడు ఏమి రోగం వచ్చిందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ హామీల గురించి కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు రేవంత్ జవాబు ఇచ్చినట్లు అనిపించదు. కాళేశ్వరం లోని మూడు పిల్లర్లు కుంగిన అంశానికే ఎక్కువగా పరిమితం అయినట్లు అనిపిస్తోంది. రేవంత్ తీసుకువచ్చిన ఈ ప్రస్తావనకు కేసీఆర్ జవాబు ఇవ్వలేదు. ఇది ఈయన బలహీనత అయితే హామీల అమలులో వైఫల్యాలు రేవంత్ వీక్నెస్గా కనిపిస్తుంది. తెలంగాణలో కలకలం రేపుతున్న హైడ్రా ను తాము అధికారంలోకి రాగానే ఎత్తివేస్తామని కేసీఆర్ ప్రకటించడం కొత్త విషయంగా ఉంది. హైడ్రా వల్ల కాంగ్రెస్కు కొంత లాభం, మరికొంత నష్టం కలుగుతోంది. చెరువులలో నిర్మాణాలు, ఆక్రమణలు తొలగించినప్పుడు ప్రభుత్వానికి మంచిపేరే వస్తోంది. కాని అదే టైమ్ లో పేదల ఇళ్లు కూల్చుతున్నారన్న విమర్శ, రాజకీయ ప్రేరేపితంగా ఇది పనిచేస్తోందన్న డౌట్లు రేవంత్ సర్కార్ ను ఆత్మరక్షణలో నెడుతున్నాయి. హైకోర్టు కూడా ఈ హైడ్రా పనితీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసి, కూల్చివేతలకు అడ్డుపడడం ప్రభుత్వానికి మైనస్ కింద లెక్క. ఉదాహరణకు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నంతకాలం ఆ ప్రాంతంలో కూల్చివేతలు పెద్దగా జరగలేదట. ఆయన తిరిగి బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపగానే హైడ్రాను ప్రయోగించారన్నది ఒక విమర్శగా ఉంది. ఇందులో నిజంగానే ఆక్రమణలు ఉండవచ్చు. కానీరాజకీయ లక్ష్యాలతో పనిచేసినట్లు,బ్లాక్ మెయిల్ కు వాడుతున్నారన్న భావన జనంలో కలిగితే.. అన్యాయంగా తమ ఇళ్లను కూల్చారన్న అభిప్రాయం పెరిగితే.. అది కాంగ్రెస్కు పెద్ద శాపంగా మారే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ తగ్గుముఖం పట్టడం తదితర విషయాలు కూడా కేసీఆర్ లేవనెత్తారు. కాగా కేసీఆర్ రాజకీయ పునరేకీకరణ అనే వ్యాఖ్య చేయడం విశేషం. భవిష్యత్తులో బీజేపీతో పొత్తు కుదుర్చుకునే అవకాశం ఉందా? అనే చర్చకు అవకాశం ఇచ్చారు. అయితే కాంగ్రెస్,ఇతర పార్టీల నుంచి పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరడానికి సిద్దంగా ఉన్నారని.. అదే పునరేకీకరణ అని బీఆర్ఎస్ నేతలు వివరణ ఇస్తున్నారు. ఏది ఏమైనా కేసీఆర్ నిజానికి తన పూర్తి స్థాయి స్టైల్ లో ప్రసంగించలేదు. అయినా లాగూలు పగిలేదాక.. అంటూ కొన్ని పదాలు వాడకుండా ఉంటే బాగుండేది. తన చావు ను కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారంటూ ప్రజలలో సెంటిమెంట్ ను తీసుకురావడానికి కేసీఆర్ యత్నించారు. తన ప్రభుత్వం ఓడిపోయాక ,తెలంగాణ ఆగమైందని చెప్పడానికి కేసీఆర్ కృషి చేస్తే, తనది ప్రజాపాలన అని నమ్మించడానికి రేవంత్ ప్రయత్నించారు. రెండు సభలను పోల్చి చూస్తే కేసీఆర్ కొంతమేర పైచేయి అయినట్లు అనిపిస్తుంది. ఈ సభ ప్రభావం పరిమితం చేయడానికి రేవంత్ కాళేశ్వరం యాత్రను పెట్టుకున్నారన్న అభిప్రాయం కలుగుతోంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
కేసీఆర్ స్టేట్స్మన్.. రేవంత్ స్ట్రీట్మన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రయోజనాల కోసం జగిత్యాల సభలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్రావు రాజనీతిజు్ఞడి (స్టేట్స్మన్)లా ప్రసంగిస్తే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాటారం బహిరంగ సభలో చిల్లర మనిషి (స్ట్రీట్మన్)లా మాట్లాడారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్లో మంగళవారం హరీశ్రావు బీఆర్ఎస్ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు కేసీఆర్ ప్రసంగించే సమయానికే మైకు పట్టుకొని రేవంత్ తన సంకుచిత బుద్ధిని బయటపెట్టుకున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా 36 లక్షల మంది వీక్షిస్తే రేవంత్రెడ్డి ప్రసంగాన్ని 4 లక్షల మందే చూడటం బీఆర్ఎస్ అధినేతకు ఉన్న ప్రజాభిమానానికి అద్దం పడుతోందన్నారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ప్రస్తుతం సీఎం రేవంత్రెడ్డి పేరును కూడా ప్రస్తావించకుండా హుందాగా రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడితే రేవంత్ మాత్రం రంకెలు వేస్తూ బీఆర్ఎస్పై ఏడవడమే పనిగా పెట్టుకున్నాడని విమర్శించారు. కేసీఆర్ సూచనలు స్వీకరించి తప్పులు సరిదిద్దుకుంటే వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు దక్కుతాయన్నారు. రేవంత్రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకే ఢిల్లీకి ‘కేసీఆర్ ఆదేశాల మేరకు సీనియర్ న్యాయవాదులను కలిసేందుకే నేను, ఎంపీ రవిచంద్ర, మాజీ ఎంపీ వినోద్ కుమార్ బహిరంగంగా శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు, మే 6న హైకోర్టులో జరిగే ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు కోసం సీనియర్ లాయర్లను సంప్రదించాం. అందులో దాపరికం లేకున్నా రేవంత్ మీడియాలో లీకులిస్తూ డ్రామాలు ఆడాడు. రేవంత్రెడ్డి ముద్దాయిగా ఉన్న ఓటుకు నోటు కేసు బుధవారం మధ్యాహ్నం 3:30కు సుప్రీంకోర్టులో విచారణకు వస్తోంది. హోంమంత్రిగానూ ఉన్న రేవంత్ ప్రభుత్వం తరఫున నామమాత్రపు లాయర్లను పెట్టి వ్యక్తిగతంగా తన తరఫున ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ్ లూత్రా లాంటి ఖరీదైన లాయర్లను పెట్టుకున్నాడు. ఈ కేసులో బీఆర్ఎస్ తరఫున జగదీశ్రెడ్డి, డాక్టర్ సంజయ్, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ ఇంప్లీడ్ అయ్యారు. నాలుగున్నర ఏళ్లుగా రేవంత్ స్టేను అడ్డుపెట్టుకొని కాలం గడుపుతున్నారు. స్టే వెకేట్ అయితే సీఎం సీటు ఊడటంతోపాటు జైలుకు వెళ్లడం ఖాయం’అని హరీశ్రావు చెప్పారు. కేసీఆర్ గర్జిస్తారనే భయంతో రైతు భరోసా ‘రెండు వ్యవసాయ సీజన్లలో రైతు భరోసా ఎగవేసిన రేవంత్.. జగిత్యాల సభలో కేసీఆర్ గర్జిస్తారనే భయంతో ఒక ఎకరం కిస్తీ రైతుల ఖాతాల్లో వేశాడు. రైతులకు ఇంకా రూ. 4 వేల కోట్లు రావాలి. వచ్చే ఏడాది కరువు వస్తుందనే హెచ్చరికల నేపథ్యంలో కాళేశ్వరం కూలిపోయిందని ప్రచారం చేసిన రేవంత్.. ఇప్పుడు మేడిగడ్డ మరమ్మతు గురించి మాట్లాడుతున్నాడు. ఎల్లంపల్లి ప్రాజెక్టు శంకుస్థాపన శిలాఫలకంపై నా పేరు ఉందనే విషయం తెలియక వారే కట్టినట్లు రేవంత్ చెబుతున్నాడు. మళ్లీ గెలుస్తామని ప్రచారం చేసుకుంటున్న రేవంత్రెడ్డి.. ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలో జవాబు చెప్పాలి. ఎన్ని డ్రామాలాడినా రేవంత్కు రాజకీయంగా నూకలు చెల్లాయి’అని హరీశ్రావు అన్నారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీలు ఎల్. రమణ, దేశపతి శ్రీనివాస్, మాజీ మంత్రి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, పార్టీ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవీ ప్రసాద్రావు పాల్గొన్నారు. -
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో, ప్రభుత్వోద్యోగుల బదిలీలకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ క్రమంలో మే ఒకటో తేదీ నుంచి 31 వరకు ఉద్యోగుల బదిలీకి అనుమతి ఇచ్చింది. ఒకేచోట మూడేళ్లు దాటిన వారు బదిలీ కావడానికి అనుమతిని మంజూరు చేసింది. కాగా, రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియపై సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ఈ ఫైల్పై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించడంతో బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు వెల్లడించింది. ఇక, 2024లో చివరిసారిగా ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు జరిగాయి. -
రేవంత్ రాహువు.. కేసీఆర్ కేతువు: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహువు అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేతువు అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అభివర్ణించారు. నువ్వు చావాలంటే నువ్వు చావాలంటూ ఒకరికొకరు పైకి తిట్టుకుంటూ ఇద్దరూ కలిసి తెలంగాణ ప్రజలను చంపుకుతింటున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం సహా కేసీఆర్ కుటుంబం చేసిన అవినితిని కప్పిపుచ్చేందుకు రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు.కరీంనగర్లోని రేకుర్తి చెరువు సుందరీకరణ పనులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. అనంతరం మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు గుగ్గిళ్ల రమేశ్, బోయినిపల్లి ప్రవీణ్ రావు, బండ రమణారెడ్డి తదితరులతో మీడియాతో రేవంత్ రెడ్డి, కేసీఆర్పై నిప్పులు చెరిగారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ..‘కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధిలో భాగంగా అమృత్- 2 పథకంలో భాగంగా 3 చెరువుల పునరుజ్జీవం కోసం 5 కోట్ల 82 లక్షల రూపాయల నిధులను కేంద్రం మంజూరు చేసింది. అందులో భాగంగా 1 కోటి 98 లక్షల రూపాయలతో ఈరోజు రేకుర్తి చెరువు పునరుజ్జీవ పనులకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉంది. డ్రైనేజీ నీరు చెరువులోకి రాకుండా చర్యలు తీసుకోవడంతోపాటు రేకుర్తి చెరువును అందంగా తీర్చిదిద్ది కరీంనగర్ ప్రజలు కుటుంబాలతో కలిసి వచ్చి సేద తీరేలా మినీ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా. దీంతోపాటు కరీంనగర్ గల్లీలోని రోడ్లను నిర్మించాలని నిర్ణయించాం. రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ లో గుంతలు పడ్డ అన్ని గల్లీల్లో రోడ్లను నిర్మిస్తాం.రేవంత్ రాహువు.. కేసీఆర్ కేతువు..ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్, రేవంత్ రెడ్డి ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. నువ్వు చావాలని ఒకరు, నేను చావాలని కోరుకుంటావా? అని ఇంకొకరు చావుల గురించి మాట్లాడుకుంటున్నారు. నిజానికి వీళ్లిద్దరూ కలిసి తెలంగాణ ప్రజలను సంపుకొనితింటున్నారు. కాళేశ్వరం విషయంలో లక్ష కోట్ల రూపాయల స్కాం జరిగిందని గత ఎన్నికల్లో పదేపదే చెప్పిన రేవంత్ రెడ్డి.. సీఎం అయ్యాక అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీ అక్రమాలపైనే విచారణ జరపాలని సీబీఐకి లేఖ రాశారు. నిజానికి వాటి విలువ రూ.9 వేల కోట్లు మాత్రమే. డిజైన్ లోపాలవల్లే ఆయా బ్యారేజీలు డ్యామేజీ అయ్యాయని అందరికీ తెలుసు. అయినా లక్ష కోట్ల ధనం వృథాపైనా, అవినీతిపైన సీబీఐ విచారణ జరపాలని ఎందుకు కోరడం లేదు? కేసీఆర్ కుటుంబాన్ని కాపాడటానికే రేవంత్ రెడ్డి చాలా తెలివిగా 9 వేల కోట్లపైనే విచారణ జరపాలని సీబీఐ లేఖ రాస్తున్నారు. మోటార్ల కొనుగోలులోనే పెద్ద అవినీతి చేశారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి వ్యవహారంపై కాళేశ్వరం విషయంలో వీళ్లు ఆడుతున్న డ్రామాలపై తెలంగాణ ప్రజలకు త్వరలోనే లేఖ రాస్తాం.జీవన్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద విధానాలను పాటిస్తోంది. జీవన్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం ఇష్టం లేక అలిగి ఢిల్లీ పోయారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. వాళ్లే బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు కోసం పోయారని అంటున్నారు. అన్నీ అబద్దాలే. బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తే ఉండదు. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ దే. భవిష్యత్తులో జరిగేది కూడా అదే. బీజేపీ ఎన్నడూ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలొస్తే బీజేపీ గెలుస్తుంది. తన సీటు ఖాళీ అవుతుందనే భయంతోనే రేవంత్ రెడ్డి ఏకంగా రాహుల్ గాంధీ సీటుకు ఎసరు పెట్టారు. తెలంగాణలో బీజేపీ గెలిచే అవకాశాల్లేవని జీవన్ రెడ్డి అన్నంత మాత్రాన నిజం కాబోదు. ఆ మాటకొస్తే నిజామాబాద్ లో ఎవరు గెలిచారు. తెలంగాణలో 8 ఎంపీ సీట్లు బీజేపీ గెలుచుకుంది.తేజస్వీ సూర్య కామెంట్స్పై.. తేజస్వీ సూర్య వ్యాఖ్యలను కాంగ్రెస్, బీఆర్ఎస్ వక్రీకరించాయి. తెలంగాణ ఉద్యమకారులను దేశ భక్తులతో పోల్చారని తేజస్వీ నాతో చెప్పారు. దేశ విభజన సమయంలో కాంగ్రెస్, బ్రిటీషర్ల విధానాల వల్ల లక్షలాది మంది చనిపోయారు. తెలంగాణ విషయంలోనూ కాంగ్రెస్ చేసిన తప్పిదాల వల్ల 1400 మంది బలిదానమయ్యారని తేజస్వీ చెప్పారు. ఈ విషయాన్ని వక్రీకరించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. నిజానికి పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎంపీలే తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తే.. అడ్డుకుని తెలంగాణ బిల్లును ఆమోదించి సుష్మాస్వరాజ్ ఆధ్వర్యంలో బీజేపీ ఎంపీలే కదా. ఆనాడు సోనియాగాంధీని బలిదేవత అని రేవంత్ రెడ్డే చెప్పారు కదా. అట్లాంటి వ్యక్తి కేబినెట్ లో మంత్రులుగా ఉన్న వాళ్లు బీజేపీని విమర్శించడం హాస్యాస్పదం అంటూ వ్యాఖ్యలు చేశారు. -
కేసీఆర్ కాస్కో..
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘కేసీఆర్ కాస్కో.. 2029 ఎన్నికల్లో నువ్వో నేనో తేల్చుకుందాం. నీకున్న ఈ ప్రతిపక్ష హోదా కూడా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా. రాష్ట్రంలో 2034 వరకు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుంది. అసలు ఈ చట్టాలే లేకుంటే, అటవిక రాజ్యమే అయితే మిమ్మల్ని చెట్టుకు ఉరేసినా తప్పులేదు. కాంగ్రెస్ కార్యకర్తల తరఫున సవాల్ చేస్తున్నా..వచ్చే ఎన్నికల్లో వంద మీటర్ల లోతున పాతరేస్తాం..’అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. కొందరు స్వార్థపర నాయకులు ప్రజాపాలన పోయి పాపాల భైరవుల పాలన రావాలని కోరుకుంటున్నారని, అలాంటి వారికి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సోమవారం సీఎం.. మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, డి.శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్కుమార్ గౌడ్ తదితరులతో కలిసి జేఎస్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. కాళేశ్వర ముక్తేశ్వరస్వామి ఆలయంలో పూజలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపన, మేడిగడ్డ బరాజ్ పరిశీలన తర్వాత కాటారం మండలం నస్తూరిపల్లిలో మంత్రి శ్రీధర్బాబు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. రెండో విడత రైతుభరోసా రూ.5,700 కోట్లు ఆన్లైన్లో విడుదల అనంతరం మాట్లాడారు. జై కాంగ్రెస్ అంటూ ప్రసంగాన్ని మొదలెట్టిన ఆయన ‘తోడేలు బయటకు వెళ్లింది. ఈ సభ చూసి వారి గుండెలు అదరాలి..’అంటూ మాజీమంత్రి జీవన్రెడ్డి, జగిత్యాలలో కేసీఆర్ సభను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఎవరి పాలన కావాలో ప్రజలు ఆలోచించాలి ‘రైతు ఆత్మగౌరవం కోసం, ప్రజా సంక్షేమం కోసం పథకాలు అమలు చేసిన కాంగ్రెస్ ప్రజాపాలన కావాలో.. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన పాపాల భైరవుడు కేసీఆర్ పాలన కావాలో పార్టీ మారిన ఆ పెద్దమనిషితో పాటు తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ఈ దేశానికి వెన్నెముకైన రైతును ఆదుకోవాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ముందుకు పోతోంది. రైతు సంక్షేమం అనేది కాంగ్రెస్ నినాదం కాదు విధానం. ఆ దిశలోనే ఆనాడు శాశ్వత ప్రాతిపదికన నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, శ్రీశైలం వంటి ప్రాజెక్టులను కట్టి సాగునీరు అందించడం చరిత్ర పుటల్లో లిఖితమయ్యింది. నాడు వ్యవసాయం దండగ అన్న ప్రభుత్వాలకు చరమగీతం ఆత్మహత్యల వైపు పయనిస్తుంటే వారి ఆత్మగౌరవం నిలబెట్టాలని గిట్టుబాటు ధర కల్పన చట్టం తీసుకరావడమేగాక పంటల అధిక ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నిలిచేలా కాంగ్రెస్ ప్రభుత్వాలు దోహదపడ్డాయి. వ్యవసాయం దండగ అని కరెంటు ఇవ్వని ప్రభుత్వాలకు చరమగీతం పాడుతూ వైఎస్సార్ పాదయాత్ర చేసి దేశంలోనే మొదటిసారి చేవెళ్ల వేదికగా ఉచిత కరెంటు అమలు చేసి రైతుకు బాసటగా నిలిచారు. రైతులు అప్పులు తీర్చలేక ఆత్మహత్యల వైపు పయనిస్తున్నారని నాటి పీఎం మన్మోహన్సింగ్ 72 వేల కోట్ల రైతులకు రుణమాఫీ చేసి వారిని రుణ విముక్తుల్ని చేసిన ఘనత చరిత్రలో నిలిచింది. దండగ కాదు పండగ అని నిరూపిస్తున్నాం.. తెలంగాణలో ప్రజాపాలన ఏర్పాటు కోసం రాష్ట్రంలో ఇరువైపులా నేను, సమ్మక్క సారలమ్మ సాక్షిగా బాసర టు భద్రాది వరకు భట్టి విక్రమార్క పాదయాత్ర చేసి ఇచ్చిన మాట మేరకు రూ.2 లక్షల రుణమాఫీని దశల వారీగా నేరవేరుస్తున్నా ప్రతిపక్షాలు ఉనికి కోసం రాద్ధాంతం చేస్తున్నాయి. నాడు తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం. 25.35 లక్షల మంది రైతులకు రుణ విముక్తి కలిగించాం. నేడు రైతు భరోసా కింద రూ.5,300 కోట్లు ఖాతాల్లో వేస్తున్నాం. వ్యవసాయం దండగ కాదు పండుగ అని నిరూపించుకునే దిశలో సాగునీటి ప్రాజెక్టుల పునర్నిర్మిస్తున్నాం. 3.15 కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తున్నాం. ఇలాంటి తరుణంలో ప్రజాపాలన పోవాలో.. పాపాల భైరవుడు కేసీఆర్ పాలన కావాలో పార్టీ మారుతున్న పెద్దమనిషి ఆత్మవిమర్శ చేసుకోవాలి..’అని సీఎం అన్నారు. జీవన్రెడ్డి అర్హత ఏంటో తేలింది.. ఫామ్హౌస్లో పడుకున్న పెద్దాయనకు పాలన మళ్లీ ఎందుకని ప్రశ్నించకుండా, కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం రక్తమోడ్చి జెండాలు మోసిన కార్యకర్తలు, నాయకుల శ్రేయస్సు విస్మరించి ప్రజాపాలన వచ్చే ముందు జగిత్యాలో ఓడిన జీవన్రెడ్డి అర్హత ఏంటో తేలింది. ఇక ఆ పెద్దమనిషి పుట్టు పూర్వోత్తరాలు చెప్పక తప్పదు. 1983లో తుమ్మల నాగేశ్వర్రావు సాక్షిగా ఎన్టీఆర్ ఎమ్మెల్యేగా టికెట్టు ఇచ్చి గెలిపించడమే గాక ఎక్సైజ్ మంత్రి పదవి ఇస్తే ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి నాదెండ్లతో జట్టు కట్టినా దిక్కులేక కాంగ్రెస్లో చేరడం నిజం కాదా? కాంగ్రెస్లో 14 సార్లు ఎమ్మెల్యే బీఫామ్ ఇస్తే, ఓడినా గెలిచినా మద్దతు పలికితే సంయమనం పాటించకపోవడం అప్రజాస్వామికం కాదా? జగిత్యాల ప్రజలు నీకు ఊడిగం చేసింది వాస్తవం కాదా? ఈ వయస్సులో రాజకీయ నీతి విస్మరించి శత్రువు చేతిలోచేరి ప్రజాపాలన పోవాలి...పాపాల భైరవుడు కేసీఆర్ పాలన రావాలనడం సిగ్గు చేటు..’అంటూ సీఎం ధ్వజమెత్తారు. కుట్ర రాజకీయాలకు తావు లేదు.. ‘గతంలో వైఎస్సార్, డీఎస్ కాంబినేషన్ మాదిరి నేను, మహేశ్కుమార్గౌడ్ కలిసి పార్టీని అధికారంలోకి తెస్తాం. దళిత బిడ్డలు, బీసీలు, ఆదివాసీలను మంత్రులు చేసిన ప్రజాపాలన పోవాలనే కుట్ర రాజకీయాలకు తెలంగాణలో తావులేదు. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ రాజ్యమే తప్ప మరొకటి రాదు. చరిత్ర పునరావృతం చేసేలా హైదరాబాద్ను మహానగరం చేస్తూ, పాలమూరు వంటి ప్రాజెక్టులకు పూర్తి చేస్తూ ఎవరు అడ్డొచ్చినా తొక్కుతూ ముందుకు పోతాం..’అని రేవంత్ అన్నారు. దేశంలో అత్యధిక మెజారిటీతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే గాక రాహూల్ను ప్రధాని చేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్రావు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ఎంపీలు వంశీకృష్ణ, వేం నరేందర్రెడ్డి, బలరాంనాయక్, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘మేడిగడ్డ లోపాలపై ఎలా ముందుకెళ్లాలో క్లారిటీ వచ్చింది’
భూపాలపల్లి: మేడిగడ్డ బ్యారేజ్ లోపాలపై ఎలా ముందకెళ్లాలో క్లారిటీ వచ్చిందన్నారు సీఎం రేవంత్. దీనికి సంబంధించి సాంకేతిక నిపుణులు, నిర్మాణ సంస్థలతో చర్చించిన తర్వాత దీనిపై ఒక అంచనా వచ్చిందన్నారు. ఎన్డీఎస్ఏ గైడ్లైన్స్ అనుగుణంగా ముందుకెళ్తామన్నారు సీఎం రేవంత్. మేడిగడ్డ బ్యారేజీని సీఎం రేవంత్తో పాటు మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, శ్రీధర్బాలులు సందర్శించారు. వీరితో పాటు ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్తో పాటు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలోనే కాళేశ్వరం కూలిందని, ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారన్నారు. ఢిల్లీలో హరీష్ ఎవరెవర్ని కలిశారో చెప్పాలని డిమాండ్ చేశారు. -
నేడు రెండో విడత ‘రైతు భరోసా’ విడుదల
కాళేశ్వరం: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైతుల సమక్షంలో రెండో విడత రైతు భరోసా పథకంకింద రాష్ట్రవ్యాప్తంగా సోమవారం రూ. 5,563 కోట్లు విడుదల చేస్తారని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరుపల్లి గ్రామంలో రైతు భరోసా నిధుల విడుదల బహిరంగ సభను సహచర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా ఉన్నతాధికారులు, నేతలతో కలిసి ఆదివారం ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి దేశంలో రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పేదళ్లలో రూ. లక్షల కోట్లు దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ఇచ్చిన మాటకు అనుగుణంగా ప్రతి ఎకరాకు ఏటా రెండు దఫాలుగా రూ.12 వేలు రైతు భరోసా విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం నాణ్యతలేని బరాజ్ నిర్మించగా వినియోగించేందుకు వీలుపడకపోవడంతో కేంద్ర ప్రభుత్వ అధికారులు పుణే అధికారులతో పరీక్షలు చేస్తున్నారని తెలిపారు. ప్రాజెక్టును తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
అబద్ధాల పునాదులపైనే రేవంత్ సీఎం అయ్యారు
సాక్షి, హైదరాబాద్: అబద్దాల పునాదులపైనే రేవంత్రెడ్డి రాష్ట్రానికి సీఎం అయ్యారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. మహిళలందరికీ ప్రతినెలా రూ.2500 ఇస్తానని మోసం చేశారని, తులం బంగారం, స్కూటీ పేరుతో నిలువునా ముంచారని, మహిళా బిల్లును అడ్డుకుని దక్షిణాదికి తీరని ద్రోహం చేస్తున్నారన్నారు. కేసీఆర్ తరహాలోనే అబద్దాలు, మోసాలతోనే పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు.నిజాయితీగా పనిచేసే నాయకులపై బురద చల్లడం సీఎం రేవంత్రెడ్డికి అలవాటుగా మారిందన్నారు. ప్రతి రాష్ట్రానికి 50 శాతం ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు పెంచి దక్షిణాదికి న్యాయం చేయాలని మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెడితే ఇండియా కూటమి నేతలు బిల్లును అడ్డుకున్నారన్నారు. మహిళా బిల్లును అడ్డుకోవడంలో రేవంత్ కీలక పాత్ర పోషించారన్నారు. -
నేడు మేడిగడ్డకు సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్ /సాక్షిప్రతినిధి, వరంగల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి సీఎం మధ్యాహ్నం 1.45 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం చేరుకుంటారు. ముందుగా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వరస్వామి వారిని దర్శించుకున్న అనంతరం కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ చేస్తారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా మేడిగడ్డ బరాజ్కు చేరుకొని పునరుద్ధరణ పనుల్లో పురోగతిని సమీక్షిస్తారు.అంబట్పల్లిలోని అతిథి గృహంలో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షించిన అనంతరం విలేకరులతో మాట్లాడతారు. అక్కడి నుంచి నేరుగా కాటారం మండలం నస్తుర్పల్లికి చేరుకొని అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. బహిరంగసభ వేదికగా రైతు భరోసా రెండో విడత నిధులను విడుదల చేస్తారు. అనంతరం రాత్రి 7.45 గంటలకు నస్తుర్పల్లి నుంచి రోడ్డు మార్గాన హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతారు.అబద్ధాల పునాదులపైనే రేవంత్ సీఎం అయ్యారు -
హిట్టా.. వికెట్టా?
సాక్షి, హైదరాబాద్: మైనార్టీ సంక్షేమం, ప్రభుత్వరంగ సంస్థల మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ భవితవ్యం ఏంటన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అటు అసెంబ్లీ, ఇటు మండలిలో సభ్యుడు కాని ఆయన మంత్రిగా ప్రమాణం చేసి ఈనెలాఖరుతో ఆరు నెలలు పూర్తి కానుంది. చట్టసభల నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోగా ఆయన రెండు సభల్లో ఏదో ఒక సభ సభ్యునిగా నియామకం కావాల్సి ఉంది. కానీ, ఏప్రిల్ 30తో ఆరు నెలల గడువు ముగుస్తున్నప్పటికీ ఆయనను ఎమ్మెల్సీగా సిఫారసు చేస్తూ పంపిన ప్రతిపాదనకు ఇంకా గవర్నర్ ఆమోదం లభించలేదు. దీంతో ఈ నెలాఖరులోగా గవర్నర్ నిర్ణయం రాకపోతే ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడనున్నాయి. అదే జరిగితే రాష్ట్ర రాజకీయాలు, కాంగ్రెస్ చరిత్రలో ఈ పరిణామం నిలిచిపోతుందని రాజకీయ వర్గాలంటున్నాయి. గవర్నర్పై గంపెడాశలు వాస్తవానికి, రాష్ట్రంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ వివాదాస్పదమైంది. గత ప్రభుత్వ హయాంలో దాసోజు శ్రవణ్, కె. సత్యనారాయణ (జూలై, 2023లో)ను ఈ కోటాలో ఎమ్మెల్సీలుగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించి ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు పంపింది. కానీ, ఈ ప్రతిపాదనలను ఆమె తిరస్కరించారు. ఈలోపు ప్రభుత్వం మారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జనవరిలో ప్రొ.కోదండరాం, ఆమేర్ అలీఖాన్లను ప్రతిపాదిస్తూ మంత్రివర్గం సిఫారసు చేసింది. దీన్ని దాసోజు శ్రవణ్ హైకోర్టులో సవాల్ చేయడంతో ఈ ఇద్దరి ప్రతిపాదనలను కోర్టు కొట్టివేసింది. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చి ఆ ఇద్దరు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసేందుకు వెసులుబాటు కల్పించింది. కానీ, తుది తీర్పునకు అనుగుణంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఆ ఇద్దరు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. అయితే, ఈ కేసులో 2025, ఆగస్టు 13న తుది తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు కోదండరాం, ఆమేర్ అలీఖాన్ సభ్యత్వాలను రద్దు చేసింది. అనంతరం ఆగస్టు 30న మళ్లీ మంత్రివర్గం సమావేశమై కోదండరాంతోపాటు ఆమేర్ అలీ ఖాన్ స్థానంలో ప్రస్తుత మంత్రి అజహరుద్దీన్ పేర్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో గత అక్టోబర్ 31న (జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందు) అజహరుద్దీన్ రాష్ట్రమంత్రిగా ప్రమాణం చేశారు. కానీ, ఆయన మండలి సభ్యత్వానికి గవర్నర్ ఆమోదం లభించలేదు. ఈ నేపథ్యంలో ఆయన 2026 మే 1వ తేదీలోపు ఆయన ఎమ్మెల్సీగా నియామకం కాకుంటే మంత్రివర్గంలో స్థానాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. దీంతో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తీసుకునే సానుకూల నిర్ణయంపై అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కాంగ్రెస్ పార్టీ గంపెడాశలు పెట్టుకున్నాయి. నిర్ణయం తీసుకోండి... ఈ అంశంలో గవర్నర్ నిర్ణయం తీసుకునేందుకు గత ఫిబ్రవరిలోనే సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. కానీ ఆ తర్వాత జిష్ణుదేవ్వర్మ బదిలీ కావడంతో మార్చిలో శివప్రతాప్ శుక్లా గవర్నర్గా వచ్చారు. ఇప్పుడు ఈ పది రోజుల్లోపు శుక్లా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆదివారం అనూహ్యంగా గవర్నర్ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మూడు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ శనివారం ఆలస్యంగా హైదరాబాద్కు చేరుకున్నారు. ఉదయాన్నే లోక్భవన్కు వెళ్లి గవర్నర్ను కలిశారు. వీరి భేటీలో అనేక అంశాలతోపాటు అజహరుద్దీన్, కోదండరాంలను ఎమ్మెల్సీలుగా నియమించే అంశం చర్చకు వచ్చినట్టు గాం«దీభవన్ వర్గాలంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వీలైనంత త్వరగా ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ శుక్లాను రేవంత్ కోరారని, క్షుణ్ణంగా పరిశీలించి వీలున్నంత త్వరగా నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ హామీ ఇచ్చారని ఆ వర్గాలు చెబుతున్నాయి. కాగా, శనివారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి గవర్నర్ను కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పరిపాలన, న్యాయ అంశాలపై జరిగిన చర్చలో భాగంగా అజహరుద్దీన్ ఫైలు గురించి కూడా వీరు చర్చించినట్టు తెలుస్తోంది. వెంటనే సీఎం రేవంత్ కూడా గవర్నర్ను కలిసి కోరడంతో అజహరుద్దీన్ విషయంలో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. గవర్నర్ సానుకూల నిర్ణయం తీసుకుంటే అజహరుద్దీన్ యథాతథంగా మంత్రిగా కొనసాగనుండగా, ఏ నిర్ణయం తీసుకోకపోయినా, ప్రతికూల నిర్ణయం తీసుకున్నా ఆయన మంత్రి పదవిని కోల్పోనున్నారు. ఒకవేళ అదే జరిగితే మంత్రిగా అజహరుద్దీన్ మరోమారు ప్రమాణం చేయాల్సి ఉంటుందని, మళ్లీ ఆయన పేరును మంత్రివర్గం సిఫారసు చేయాల్సి ఉంటుందని రాజకీయ వర్గాలంటున్నాయి. మరి ఏం జరుగుతుందో... అజహరుద్దీన్ భవితవ్యం ఏమవుతుందో వేచి చూడాల్సిందే! -
తెలంగాణ ప్రాజెక్టులపై రేవంత్ నీళ్లు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం /గుర్రంపోడు: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను పక్కనపెట్టి, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు కొమ్ముకాస్తున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆరోపించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి బీఆర్ఎస్ అత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు సరికాదని నిప్పులు చెరిగారు. గోదావరి నీటిని నల్లమల సాగర్ పేరుతో ఆంధ్రప్రదేశ్ తరలించేందుకు భారీ కుట్ర జరుగుతోందని, ఇందులో రేవంత్రెడ్డి భాగస్వామిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో టిఫిన్ రాజకీయం..ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఒక కేంద్ర మంత్రి ఇంట్లో టిఫిన్ చేసి వచ్చారని హరీశ్రావు అన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన తెలంగాణ ప్రజల కోసమా, లేక పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసమా అని నిలదీశారు. రైతు రుణమాఫీ వంద శాతం పూర్తయిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ‘సిద్దిపేటకు వస్తావా.. రఘునాథపాలెం నన్ను రమ్మంటావా.. రుణ మాఫీ అయిందని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా’అని హరీశ్రావు తుమ్మలకు సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు.మొనగాడనుకుంటే మోసగాడయ్యాడు‘రేవంత్రెడ్డి మాయమాటలు నమ్మిన ప్రజలు పెద్ద మొనగాడు అనుకున్నారు.. కానీ రెండున్నరేళ్ల పాలనలో పెద్ద మోసగాడని స్పష్టంగా అర్థమైందని’హరీశ్రావు పేర్కొన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం తానేదార్పల్లి వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అనేక సమస్యలతో రైతులు సతమతమవుతుంటే.. సీఎం రేవంత్రెడ్డి ఎక్కే విమానం.. దిగే విమానం అన్నట్లు 70 సార్లు ఢిల్లీకి వెళ్లడం, కప్పం కట్టుకుని కుర్చీ కాపాడుకోవడం తప్ప ఒక్కసారి ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శించే సమయం ఉండటం లేదా? అని ప్రశ్నించారు. -
తూర్పున సీఎం.. పశ్చిమాన మాజీ సీఎం
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలంగాణ ఉద్యమానికి కేంద్రబిందువు. ఈ ప్రాంతంలో రాజకీయ చైతన్యం ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ జరిగే ప్రతీ చిన్న పరిణామం రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా కేంద్రంగా తెలంగాణ రాజకీయాల్లో ఈనెల 20న సోమవారం ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లా పర్యటనలు కేవలం స్థానిక రాజకీయాలకే పరిమితం కాకుండా, రాష్ట్ర రాజకీయ దిశను ప్రభావితం చేసే అవకాశముంది. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తూర్పు ప్రాంతాల్లో పర్యటిస్తూ పాలన, ప్రాజెక్టుల స్థితిగతులను పరిశీలించనుండగా, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పశ్చిమ ప్రాంతమైన జగిత్యాలలో జరిగే పార్టీ బహిరంగసభలో రాజకీయంగా కీలకమైన సందేశం ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఈ సమాంతర పర్యటనలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నాయి.రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి...సీఎం, మాజీ సీఎం పర్యటనలు ఒకేరోజు ఉండడంతో ప్రజల దృష్టి పూర్తిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాపైనే ఉంది. ఇది రాజకీయంగా శక్తి ప్రదర్శనగా మారింది. ఒకవైపు అధికార పార్టీ తన పరిపాలనను సమర్థించుకుంటూ, గత ప్రభుత్వాన్ని విమర్శించేందుకు సిద్ధమవుతుండగా, ప్రతిపక్షంగా బీఆర్ఎస్ తన బలాన్ని చాటుకునేందుకు ప్రయత్నించే అవకాశముంది. ఇద్దరు నేతల పర్యటన భవిష్యత్ ఎన్నికలకు పునాదులు వేసుకునేందుకేనని స్పష్టమవుతోంది. జీవన్రెడ్డి లాంటి సీనియర్ నేత బీఆర్ఎస్లో చేరిక ఆ పార్టీకి మోరల్ బూస్ట్, కాంగ్రెస్కు పరీక్షగా మారనుంది. ఒక్కటవుతున్న ప్రత్యర్థులుతెలంగాణ మలి దశ ఉద్యమం కరీంనగర్ నుంచే ప్రారంభమైంది. కరీంనగర్ నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచిన కేసీఆర్.. తనపై రెండుసార్లు పోటీ చేసిన జీవన్రెడ్డిని బీఆర్ఎస్లో చేర్చుకోవడానికి ఈనెల 20న సోమవారం జగిత్యాలకు వస్తున్నారు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న కేసీఆర్ ఈసారి తనదైన శైలిలో రాష్ట్రపరిస్థితులపై మాట్లాడే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో జగిత్యాలలో కేసీఆర్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత అయిన జీవన్రెడ్డిని బీఆర్ఎస్లో చేర్చుకునే ప్రయత్నం రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశముంది. కాంగ్రెస్లో నాలుగు దశాబ్దాల పాటు పనిచేసిన నాయకులు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపడంతో పార్టీలో కొంత కలకలం రేపుతోంది. కేసీఆర్ జగిత్యాలలో చేసే ప్రసంగం, పార్టీ భవిష్యత్ వ్యూహాన్ని వెల్లడించే అవకాశముంది. ఆయన ప్రభుత్వం మీద చేసే విమర్శలు, కాంగ్రెస్ పాలనలో లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తారని అంచనా.ఆసక్తికరంగా సీఎం పర్యటనఉమ్మడి జిల్లా పరిధిలోని మంథని నియోజకవర్గంలో ఉన్న మేడిగడ్డ బారేజ్ అంశం ఇప్పుడు కేవలం ఇంజినీరింగ్ సమస్య కాదు.. రాజకీయ ఆయుధంగా మారింది. మేడిగడ్డ బారేజ్ కుంగిన ఘటనను పరిశీలించడానికి సీఎం రేవంత్రెడ్డి వెళ్లున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుపై విమర్శలు గుప్పించనున్నారు. మేడిగడ్డ బారేజ్, కాలేశ్వరం ప్రాజెక్టులో కీలక భాగం కావడం 2023 ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా అది కుంగిన విషయం బయటకు రావడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ల కోసమే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందని కాంగ్రెస్ ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందింది. కాటారం సభలో రేవంత్ రెడ్డి ప్రసంగం కీలకంగా మారనుంది. ఆయన బీఆర్ఎస్పై మాటల దాడి చేయడం, అవినీతి ఆరోపణలను పునరుద్ఘాటించడం, అభివృద్ధి వాగ్దానాలను ముందుకు తెచ్చే అవకాశముంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రజల ముందు తీసుకెళ్లి, బీఆర్ఎస్ పాలనలో జరిగిన లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తోంది. -
అజారుద్దీన్కు కష్ట కాలం. మంత్రి పదవి ఉంటుందా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మాజీ క్రికెటర్, ప్రస్తుత మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఆయన మంత్రి పదవికి సంకట పరిస్థితి వచ్చింది. మంత్రి పదవి ఇప్పుడు ఒక రాజ్యాంగపరమైన గడువుపై ఆధారపడి ఉంది. ఈనెల 30తో అజారుద్దీన్ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి ఆరు నెలలు కానుంది. దీంతో ఈనెల 30 లోపు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అజారుద్దీన్ కాకుంటే.. మంత్రి వర్గం నుంచి ఆయనను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.ఈ నేపథ్యంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం ఫైల్పై గవర్నర్ను సంతకం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరనున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఈరోజు ఉదయం 11 గంటలకు లోక్భవన్కు వెళ్లి గవర్నర్తో భేటీ కానున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై చర్చించనున్నారు. ఈ క్రమంలో గవర్నర్, సీఎం భేటీపై ఉత్కంఠ నెలకొంది. గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.అయితే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(4) ప్రకారం ఒక వ్యక్తి ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కాకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆరు నెలల లోపు అసెంబ్లీ లేదా మండలికి ఎన్నిక కావాలి. అత్యవసర పరిస్థితుల్లో లేదా పరిపాలనా సౌలభ్యం కోసం, అనుభవజ్ఞులను ప్రభుత్వంలోకి తీసుకోవడానికి ఈ వెసులుబాటు కల్పించబడింది. కాగా, అంతకుముందు అజారుద్దీన్ అక్టోబర్ 31, 2025న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఆయన ఆరు నెలల గడువు ఈ నెల 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 30వ తేదీలోపు ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణం చేయకపోతే, సాంకేతికంగా ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.ఎందుకు ఈ పరిస్థితి.. కాగా, రేవంత్ ప్రభుత్వం ఆయన పేరును గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవికి ప్రతిపాదించింది. అయితే.. గతంలో గవర్నర్ కోటా నామినేషన్లపై కోర్టులో వివాదాలు నడవటం, ఆ తర్వాత కొత్త గవర్నర్ రాక వంటి పరిణామాల వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్తో చర్చలు జరిపి ఈ అడ్డంకిని తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ గవర్నర్ కోటా క్లియర్ కాకపోతే.. ఖాళీగా ఉన్న ఏదైనా ఇతర ఎమ్మెల్సీ స్థానం.. స్థానిక సంస్థలు లేదా ఎమ్మెల్యే కోటా ద్వారా ఆయన్ని మండలికి పంపాల్సి ఉంటుంది. ఇది కూడా ఫలించని నేపథ్యంలో అజారుద్దీన్ మంత్రి బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. -
పాత చట్టం అయితే ఓకే
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్లో 2023లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లును సోమవారం తిరిగి సభలో ప్రవేశపెడితే తమకు ఆమోదమే అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. అవసరమైతే ప్రస్తుతం లోక్సభలో ఉన్న 543 సీట్లలో 1/3 వంతు సీట్లు, రాష్ట్రాల శాసనసభల్లో 1/3 వంతు సీట్లు మహిళలకు కేటాయించేలా బిల్లులో మార్పులు చేసి ప్రవేశపెట్టినా ఇండియా కూటమితో సహా తాము మద్దతు ఇస్తామని చెప్పారు. సోమవారం బిల్ పాస్ చేసుకుని, మంగళవారం నుంచే ఈ చట్టాన్ని అమలు చేయవచ్చని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ‘ఒక గంట సమయం ఇస్తే బిల్లులో మార్పులు చేసి తెస్తామని కేంద్రమంత్రి అమిత్షా చెప్పారు. చిత్తశుద్ధి ఉంటే సోమవారం వరకు ప్రస్తుతమున్న 543 సీట్లతోనే మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకు రావాలి..’అని ముఖ్యమంత్రి అన్నారు. మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టి రాజ్యాంగాన్ని మార్చుతామంటే దేశ ప్రజలు ఒప్పుకోరని అన్నారు. పార్లమెంట్లో ఓడిపోయింది మోదీ అహంకారమేనని వ్యాఖ్యానించారు. శనివారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సీఎం విలేకరులతో మాట్లాడారు. అలాగైతే నేను దక్షిణాది రాష్ట్రాల సీఎంల మద్దతు కూడగడతా.. ‘నియోజకవర్గాల పునర్విభజనకు అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయాలి. నిపుణులతో చర్చించాలి. ప్రతి రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం తెలుసుకోవాలి. ప్రతి లోక్సభ నియోజకవర్గం పరిధిలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి జాతీయ ఏకాభిప్రాయ సాధనకు కృషి చేయాలి. ఆయా రాష్ట్రాలతో సంప్రదించి శాసనసభల్లో స్థానాల సంఖ్య పెంచవచ్చు. 2011 జనాభా లెక్కలు, ఇతర డేటా ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్నాయి. 2009లో డీలిమిటేషన్ జరిగింది. ఆ లెక్కలతో ఆగస్టు 15, 2026 లోపు మహిళలకు 33% రిజర్వేషన్లను కల్పించవచ్చు. ఆ రిజర్వేషన్లను ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లో 2027లో జరిగే ఎన్నికల్లో అమలు చేయవచ్చు. ఆ విధంగా రిజర్వేషన్లు అమలు చేస్తే... తెలంగాణ సీఎంగా నేను బాధ్యత తీసుకుని దక్షిణాది రాష్ట్రాల సీఎంలు స్టాలిన్, పినరయి విజయన్, సిద్ధరామయ్య, చంద్రబాబునాయుడు, రంగసామిలతో చర్చలు జరుపుతా. ఇండియా కూటమి నేతల మద్దతు కూడగతా. 2023లో పాస్ అయిన బిల్లుకు ఒక చిన్న మార్పు చేసి రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉంది. కానీ బీజేపీ ఉద్దేశం రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్లు ఎత్తివేయడమే..’అని రేవంత్ స్పష్టం చేశారు. ప్రమాదకరమైన పునర్విభజనను అడ్డుకున్నాం.. ‘దేశ భవిష్యత్తును, సమగ్రతను బలహీనపర్చేలా దేశ రాజకీయ చిత్రపటాన్నే మార్చే బిల్లును కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తీసుకువచ్చింది. దానిని ప్రతిపక్ష పార్టీలు ఓడించాయి. కేవలం ప్రమాదకరమైన నియోజకవర్గాల పునర్విభజననే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాన్ని, మోదీ అహంకారాన్ని నిలువరించాయి. వాస్తవానికి ఎంపీ సీట్ల పెంపుతో ఎలాంటి లాభం లేదు. కేవలం పాలసీలు రూపొందించేందుకే రెండు సభలు ఉన్నాయి. దీనికన్నా రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచడం ఉత్తమం. ఇందుకోసం 2026 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలి. మహిళా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని ఏ ఒక్కరూ ప్రశ్నించలేరు. దేశానికి కాంగ్రెస్ మహిళా రాష్ట్రపతి, ప్రధానమంత్రిని అందించింది. లోక్సభ స్పీకర్గా, అనేక రాష్ట్రాల్లో గవర్నర్లు, ముఖ్యమంత్రులుగా మహిళలను కాంగ్రెస్ పార్టీ చేసింది. కానీ 1980లో ఏర్పడిన బీజేపీకి ఇప్పటివరకు 15 మంది అధ్యక్షులైతే అందులో ఒక్కరూ కూడా మహిళ లేరు. అడ్వాని, మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్లు రెండు మూడు సార్లు అధ్యక్షులయ్యారు. కానీ ఒక్క మహిళకు అవకాశం ఇవ్వలేదు..’అని సీఎం చెప్పారు. తాను సూచించిన విధానం బీజేపీ నేతలు కిషన్రెడ్డి, కె.లక్ష్మణ్కు నచ్చకపోతే ప్రత్యామ్నాయం ఏమిటో చెప్పాలని అన్నారు. ‘తల్లిని చంపి.. బిడ్డను రక్షించారు..’అని మోదీ రాష్ట్ర విభజనపై పలుమార్లు ద్వేషం చూపారని, ఇప్పుడు ఆయన బాటలోనే ఎంపీ తేజస్వీ సూర్య పయనిస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో ఎంపీలు మల్లు రవి, సురేష్ షెట్కార్, బలరాం నాయక్, విప్లు యెన్నం శ్రీనివాస్రెడ్డి, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, మనోహర్రెడ్డి, మేఘారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బలహీనంగా ఉన్నప్పుడు కబ్జా చేస్తారు.. విలేకరుల సమావేశం అనంతరం సీఎం మీడియాతో చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా.. ‘బిల్లులకు టీడీపీ మద్దతు ఇచ్చింది. దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఆ పార్టీకీ రాజకీయంగా నష్టం చేకూరుతుందా?’అనే ప్రశ్నకు.. ‘ప్రభావం ఏమీ ఉండదు. సభలో నీళ్లకు నీళ్లు.. పాలకు పాలు తేలిపోయాయి. అదొక ముగిసిన అధ్యాయం. బీజేపీతో ఎవరు కలిసినా వారికి ఏదో ఒకరోజు వాళ్లే (బీజేపీ) నష్టం చేస్తారు. అందుకు నితీశ్కుమార్, ఏక్నాథ్ షిండే, నవీన్ పట్నాయక్లే ఉదాహరణ. వాళ్లు బలహీనంగా ఉన్నప్పుడు వీళ్లు కబ్జా చేస్తారు. మనం బలహీనపడ్డప్పుడు వాళ్లు మనల్ని తినేస్తారు..’అని రేవంత్ వ్యాఖ్యానించారు. -
రెండో విడత రైతు భరోసా రేపు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా రెండో విడత నిధులను ప్రభుత్వం ఈనెల 20వ తేదీన పంపిణీ చేయాలని నిర్ణయించింది. సోమవారం రెండో విడత నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ పథకం కింద ప్రభుత్వం రాష్ట్రంలో 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందిస్తోంది. ఎకరానికి రూ. 6 వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తుంది. 20వ తేదీన భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి, మంత్రుల సమక్షంలో ఈ నిధులను విడుదల చేస్తారు. తెలంగాణలో మొత్తం 73 లక్షల మంది రైతులున్నారు. వీరందరికీ ప్రభుత్వం గత నెల 23వ తేదీన మొదటి విడత రైతు భరోసా సాయాన్ని పంపిణీ చేసింది. ప్రతి రైతుకు ఒక ఎకరానికి సరిపడే పెట్టుబడి సాయాన్ని ముందుగా విడుదల చేసింది. ఇలా దాదాపు రూ.3,590 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది. రెండో విడతలో 45,11,947 మంది రైతులు రైతుభరోసా కింద రూ.2,063 కోట్ల సాయం అందుకుంటారు. దీంతో రూ.5,653 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లవుతుందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. రెండో విడత నిధుల పంపిణీ అనంతరం, మూడో విడత నిధులను వీలైనంత తొందరగా విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది. -
మహిళలకు కాంగ్రెస్ వెన్నుపోటు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్, పునర్వీభజన బిల్లులను అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు చారిత్రక తప్పిదానికి పాల్పడ్డాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. మహిళలకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని అన్నారు. కేంద్రాన్నో, బీజేపీనో కాంగ్రెస్ ఓడించలేదని, 70 కోట్ల మంది మహిళలను ఓడించిందని చెప్పారు.మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కళ్లలో ఆనందం చూసేందుకే రాహుల్గాందీ, రేవంత్రెడ్డి ఈ బిల్లులను అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. శనివారం ఢిల్లీలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ఇలా చేయడం కొత్తేమీ కాదని, గతంలో ఏడుసార్లు కుట్రలు చేసి మహిళా బిల్లును అడ్డుకున్నారని విమర్శించారు. దేవెగౌడ, వాజ్పేయి ప్రభుత్వాల హయాంలో బిల్లు పేపర్లు చించి స్పీకర్, ప్రధానిపై వేశారని, మన్మోహన్సింగ్ హయాంలో మిత్రపక్షాలను ఉసిగొల్పి అడ్డుకునేలా నాటకాలాడారని మండిపడ్డారు. దక్షిణాదికి తీరని ద్రోహం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని మొన్నటిదాకా గగ్గోలు పెట్టిన విపక్షాలు, ఇప్పుడు సీట్లు పెంచుకునే అవకాశం వస్తే అడ్డుకోవడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని కిషన్రెడ్డి అన్నారు. మోదీ ప్రభుత్వం డీలిమిటేషన్ ద్వారా తెలంగాణలో ఎంపీ స్థానాలను 17 నుంచి 26కు, ఏపీలో 25 నుంచి 38కి, అలాగే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ స్థానాలను పెంచే ప్రయత్నం చేసిందని అన్నారు.ఈ సువర్ణ అవకాశాన్ని చేజార్చినందుకు రాహుల్గాంధీ 30 కోట్ల మంది దక్షిణాది ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సైనికులు చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్లను మాయాజాలంగా అభివర్ణించడం ద్వారా 140 కోట్ల మంది ప్రజలను, సైనికులను రాహుల్ అవమానించారన్నారు. బీజేపీకి మహిళను అధ్యక్షురాలిగా చేశారా అని ప్రశ్నించే నైతిక హక్కు రేవంత్రెడ్డికి లేదన్నారు. దశాబ్దాల పాటు ఉమ్మడి ఏపీని, తెలంగాణను పాలించిన కాంగ్రెస్ ఏనాడైనా బీసీని లేదా మహిళను సీఎం చేసిందా? అని నిలదీశారు. -
‘మహిళా రిజర్వేషన్ బిల్లును రాహుల్, రేవంత్లు అడ్డుకున్నారు’
ఢిల్లీ: మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ ఎంపీ కిషన్రెడ్డి ధ్వజమెత్తారు. మహిళా బిల్లును ఓడించామని కాంగ్రెస్ నాయకులు సంబరపడుతున్నారని, ఇది మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ మోసపూరిత చర్య అని మండిపడ్డారు. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీలే ఈ బిల్లును అడ్డుకున్నారన్నారు. రాహుల్ గాంధీ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ చేసిన సైనికులను రాహుల్ అవమానించారని కిషన్రెడ్డి పేర్కొన్నారు. బిల్లును అడ్డుకోవడం చారిత్రాత్మక తప్పిదమని, రాష్ట్రాల్లో 50 శాతం సీట్ల పెంపుపై కేంద్ర క్లారిటీ ఇచ్చిందన్నారు. ఇప్పటివరకూ 7 సార్లు మహిళా బిల్లును అడ్డుకున్నారన్నారు కిషన్రెడ్డి. -
‘రేవంత్తో టీడీపీ ఎంపీల భేటీ ఆంతర్యం ఏమిటి?’
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బంధాలు, అనుబంధాలు అందరికీ తెలిసినవే అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు పగలు బీజేపీతో.. సాయంత్రం కాంగ్రెస్తో దోస్తీ చేస్తూ ఉంటారని ఎద్దేవా చేశారు. ఇలాంటి ద్వంద్వ వైఖరి వలన రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. ఈ రోజు(శనివారం, ఏప్రిల్ 18వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన లేళ్ల అప్పిరెడ్డి.. చంద్రబాబు తన రాజకీయాలతో తీవ్ర అప్రతిష్టను తెచ్చారని విమర్శించారు. టీడీపీ ఎంపీలు రేవంత్రెడ్డిని కలవడానికి కారణం ఏంటని ఆయన ప్రశ్నించారు. మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్తో టీడీపీ ఎంపీలు కలవడానికి కారణం ఏంటని నిలదీశారు. చంద్రబాబుకు, రేవంత్కు ఉన్న లోపాయికారీ ఒప్పందం ఏంటో ప్రజలకు చెప్పాలన్నారు.‘టీడీపీ మహిళా నేతలు కాంగ్రెస్ నేతలను ఎందుకు కలిశారు?, రేవంత్ రెడ్డితో కలిసి టీడీపీ ఎంపీలు ఎందుకు ఫోటోలు తీసుకున్నారు. బీజేపీ ఎంపీ వర్మ రేవంత్ కి బ్రేక్ ఫాస్ట్ ఇవ్వటం ఏంటి? టీడీపీ నేతలు కూడా వెళ్లటం ఏంటి?, అసలు ఏం రాజకీయాలు చేస్తున్నారు?మీ లోపాయికారి ఒప్పందాలు ఏంటో బయట పెట్టాలి. రాష్ట్ర ప్రయోజనాలకు ఎందుకు విఘాతం కలిగిస్తున్నారు?, చంద్రబాబు బీజేపీతో పొత్తులో ఉంటూ కాంగ్రెస్తో బంధాన్ని కొనసాగిస్తున్నారు. యువత, విద్యార్థులకు ఏం మెసేజ్ ఇస్తున్నారు?, అసలు వెన్నుపోటు రాజకీయాలు చేసేదే చంద్రబాబు’ అంటూ ధ్వజమెత్తారు. పార్లమెంట్లో మహిళా బిల్లు వీగిపోవడాన్ని తమ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందని, దీనికి కారకులను మహిళా లోకం కచ్చితంగా శిక్షిస్తుందన్నారు. -
చంద్రబాబుపై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్
-
బిల్లు వీగిపోవడమంటే బీజేపీ ఓడిపోవడమే: రేవంత్ రెడ్డి
సాక్షి, ఢిల్లీ: విపక్షాల ఐక్యతతో కేంద్రం ఓడిపోయిందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిన్న సవరణతో మహిళా రిజర్వేషన్లు పెంచవచ్చు. సీట్లు పెంచడానికి మహిళా రిజర్వేషన్లు ముసుగు వేశారని మండిపడ్డారు. బీజేపీ విధానాలకి ఓటమి ఇది అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు.సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘దక్షిణ భారతానికి జరిగే అన్యాయాన్ని అడ్డుకున్నాం. మహిళా బిల్లు చాటున డీలిమిటేషన్ బిల్లును తెచ్చారు. ఎన్డీయే నిజాయితీగా బిల్లును తీసుకురాలేదు. బిల్లు వీగిపోవడం అంటే బీజేపీ ఓడిపోవడమే. బీజేపీ సర్కార్ రాజ్యాంగాన్ని కాలరాయాలని చూసింది. ప్రధాని మోదీ కుట్రలను కాంగ్రెస్ సమర్థవంతంగా అడ్డుకుంది. దేశవ్యాప్తంగా బీజేపీ విధానాలను కాంగ్రెస్ ఎండగట్టింది. ఇది రాజకీయ విధానాల ఓటమి కాదు.. బీజేపీ విధానాల ఓటమి. రాజ్యాంగం మార్చడానికి, రిజర్వేషన్లు రద్దు చేసేందుకు అబ్ కీబార్ చార్ సౌ అన్నారు బీజేపీకి 400 సీట్లు ఇచ్చి ఉంటే రాజ్యాంగాన్ని మార్చేవారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకువస్తే రేపే మద్దతు ఇస్తాం. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ కోటా పెట్టాలి. హైబ్రిడ్ మోడల్లో డీలిమిటేషన్ జరగాలి అని వ్యాఖ్యలు చేశారు. 2023 మహిళా బిల్లును యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, ఎంతో మంది మహిళా నేతలను కాంగ్రెస్ తయారుచేసింది’ అని చెప్పుకొచ్చారు. -
బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పండి
ఢిల్లీ: బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ (ఉక్కు పరిశ్రమ) ఏర్పాటు చేయాలని ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గ్రీన్స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ఉక్కు కొరత తగ్గడంతో పాటు పర్యావరణానికి మేలు కలుగుతుందని తెలిపారు. ఢిల్లీలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామి, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మలతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శనివారం ఉదయం సమావేశమయ్యారు.ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్–2047 విజన్లో భాగంగా రూపొందించిన పారిశ్రామిక ప్రతిపాదనలను సీఎం కేంద్ర మంత్రులకు వివరించారు. తెలంగాణలో పాత వాహనాల స్క్రాప్తో ఉక్కును రీసైక్లింగ్ చేసే పరిశ్రమ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రులను సీఎం కోరారు. అందుబాటులో ఉన్న సాంకేతికత, భారీ పరిశ్రమలు, పారిశ్రామిక ఉత్పత్తికి ఉన్న అనుకూలతల వలన దేశ పారిశ్రామిక ఉత్పత్తి లక్ష్యాలకు హైదరాబాద్ కేంద్రంగా నిలవగలదని కేంద్ర మంత్రులకు సీఎం వివరించారు.హైదరాబాద్లో హైడ్రోజన్ టెక్నాలజీతో గ్రీన్ స్టీల్ క్లస్టర్, ఆటో, రక్షణ రంగాలకు అవసరమైన ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు, ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈవీ బ్యాటరీల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాసవర్మలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. అలాగే మెషిన్ టూల్స్, రోబోటిక్స్ వంటి ఆధునిక పరికరాల తయారీకి ప్రత్యేక పార్క్ను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రులకు సీఎం విజ్ఞప్తి చేశారు.హైదరాబాద్ను 2034 నాటికి కాలుష్యం లేని నగరంగా మార్చే లక్ష్యంతో వాహనాలను ఈవీలుగా మార్చేందుకు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఆధునిక పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు నేర్పే జాతీయ స్థాయి సంస్థలను హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రులకు సీఎం విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, కేంద్ర ప్రాజెక్టుల సమన్వయ ప్రత్యేక కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. -
సీఎం రేవంత్ ఇంటి వద్ద ఉద్రిక్తత..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు భారీ ఎత్తున తరలి రావడంతో టెన్షన్ వాతవరణం నెలకొంది. మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి నాయకత్వంలో వందలాది మంది మహిళా కార్యకర్తలు నిరసన ప్రదర్శనగా రేవంత్ రెడ్డి ఇంటి వైపు దూసుకెళ్లారు.ఈ క్రమంలో బీజేపీ మహిళా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, అక్కడ స్వల్ప తోపులాట జరిగింది. అనంతరం, మహిళా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు జూబ్లీహిల్స్ రోడ్లన్నీ బారికేడ్లతో మూసివేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విడతల వారీగా వచ్చిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.మరోవైపు.. బీజేపీ నేతలను అడ్డుకోవడంపై రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మండిపడ్డారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..‘పక్ష నేతల తీరుకు నిరసనగా సీఎం ఇంటి ముట్టడికి బయలుదేరితే అడ్డుకున్నారు. మహిళా రిజర్వేషన్ అడ్డుకున్నారు. మా ముట్టడి అడ్డుకున్నారు. నిన్న దేశానికి ఎమర్జెన్సీ కంటే చీకటి రోజు. ఇండియా కూటమి మహిళలకు వ్యతిరేకం. కేవలం మైనార్టీ, కుటుంబ ప్రాతినిధ్యం కోసమే తప్ప సామాన్య మహిళ కోసం కాంగ్రెస్ మాట్లాడదు. కామన్ ఉమెన్ చట్ట సభలోకి రావొద్దని కాంగ్రెస్ తీరు ఉంది. రిజర్వేషన్ రాబోతుందని మహిళలు ఎంతో సంతోషపడ్డారు. హైబ్రిడ్, ఉత్తరాది, దక్షిణాది కేవలం మహిళ రిజర్వేషన్ వ్యతిరేకించే అంశాలు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు అన్యాయం చేసింది. కాంగ్రెస్ పార్టీ చేసిన పని క్షమించరానిది. మహిళా రిజర్వేషన్ అడ్డుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీనే. మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు అంటూనే.. వ్యతిరేకంగా ఓట్లు వేశారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
30 ఎల్ఎంటీ బాయిల్డ్ రైస్ సేకరించండి
సాక్షి, న్యూఢిల్లీ: యాసంగి పంటకు సంబంధించి తెలంగాణ నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) బాయిల్డ్ రైస్ సేకరించాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రల్హాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ధాన్యం యాసంగి పంట బాయిల్డ్ రైస్ మిల్లింగ్కు అనుకూలమని కేంద్ర మంత్రికి తెలియజేశారు. గత ఆరు యాసంగి సీజన్లలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సరఫరా గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని వివరించారు.ఢిల్లీలో జోషిని ఆయన నివాసంలో సీఎం, రాష్ట్ర మంత్రి శుక్రవారం ఉదయం కలిశారు. దేశవ్యాప్తంగా బాయిల్డ్ రైస్కు భారీ డిమాండ్ ఉన్నందున సరఫరా పెంచాలని ఇటీవల కేంద్రం సూచించిన విషయాన్ని కేంద్ర మంత్రికి గుర్తు చేశారు. తెలంగాణలో ఈ యాసంగి సీజన్లో 90 ఎల్ఎంటీ ధాన్యం ఉత్పత్తి అవుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో యాసంగి పంటకు సంబంధించిమొత్తం 30 ఎల్ఎంటీ బాయిల్డ్ రైస్ (5 శాతం నూకతో), 5 ఎల్ఎంటీ రా రైస్ (10 శాతం నూకతో) సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రేవంత్ కేంద్ర మంత్రికి తెలియజేశారు. బాయిల్డ్ రైస్ సరఫరాకు సంబంధించి సీఎం, మంత్రి చేసిన ప్రతిపాదనకు కేంద్ర మంత్రి సూత్రప్రాయంగా అంగీకరించారు. బకాయిలు విడుదల చేయండి 2014–15 వర్షాకాలం పంట అదనపు లెవీ సేకరణకు సంబంధించిన రూ.1,468.94 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి ప్రల్హాద్ జోషికి రేవంత్, ఉత్తమ్ విన్నవించారు. దేశంలోనే వరి ధాన్యం ఉత్పత్తి, సేకరణలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు తాము చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు. దేశంలోనే ధాన్యం ఉత్పత్తి, సేకరణలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మీద ఉన్న ఒత్తిడిని గుర్తించి వెంటనే బకాయిలు విడుదల చేయాలని కోరారు.పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపాల నివారణకు గానూ పోషకాహార బియ్యాన్ని పాఠశాలలు, వసతిగృహాలు, ఐసీడీఎస్ల పరిధిలో పంపిణీ చేసేవారని... ఇటీవల దానిని నిలిపివేసినందున వెంటనే దానిని పునఃప్రారంభించాలని సీఎం, మంత్రి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, సెక్రటరీ కోఆర్డినేషన్ అద్వైత్ సింగ్, కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీ శాఖ అధికారులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి సానుకూలం: ఉత్తమ్ ప్రస్తుత యాసంగి సీజన్కు సంబంధించి 30లక్షల బాయిల్డ్ రైస్, 5లక్షల మెట్రిక టన్నుల రారైస్ సేకరణకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. భేటీ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో ప్రస్తుత యాసంగిలో 1.48కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి జరుగుతోందని, ఇందులో 90లక్షల మెట్రిక టన్నుల మేర కొనుగోలు చేయనున్నట్లు వివరించామన్నారు. కాగా, మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి సందర్భంగా.. ఢిల్లీలోని అధికారిక నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి రాధాకృష్ణన్ చిత్రపటం వద్ద నివాళులరి్పంచారు. -
రేవంత్ హైబ్రిడ్ ఫార్ములా.. ఎంఐఎం ప్లాన్: కిషన్ రెడ్డి
సాక్షి, ఢిల్లీ: డీలిమిటేషన్పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్పై తెలంగాణ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. మహిళల రిజర్వేషన్లకు మజ్లిస్ వ్యతిరేకం అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా.. అసదుద్దీన్ చెప్పినది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘డీలిమిటేషన్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తున్నారు. నార్త్, సౌత్ మధ్య యుద్ధం వస్తుందని మాట్లాడుతున్నారు. ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారు. అన్ని రాష్ట్రాలకు సమ న్యాయం చేస్తామని ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పారు. రెవెన్యూ ఎక్కువగా వస్తుందని హైదరాబాద్లోనే రేవంత్ అసెంబ్లీ సీట్లు పెంచుతారా?. డబ్బు ఎక్కువగా ఉన్న వారికి ఎక్కువ ఓటు విలువ ఇస్తారా? అని ప్రశ్నించారు.మహిళల రిజర్వేషన్లకు మజ్లిస్ వ్యతిరేకం. హైదరాబాద్లో తమ సీట్లు పోతాయని మజ్లిస్ భయం. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు కుమ్మకై తెలంగాణలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తన ఫార్ములాను రేవంత్ రెడ్డి ద్వారా అసదుద్దీన్ చెప్పించారు. నియోజకవర్గాలు పెరిగితే మహిళలు, యువతకు కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త నాయకత్వం వస్తే తమ పీఠాలు కదులుతాయని మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ సహా విపక్షాలు అడ్డుకుంటున్నారు. ఎంఐఎం మహిళలకు వ్యతిరేక రాజకీయాలు చేస్తోంది. మహిళా రిజర్వేషన్కు అడ్డుపడాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ను ఎంఐఎం కలిపింది. మహిళలను అనగదొక్కే పార్టీ మజ్లిస్ పార్టీ’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతీ రాజకీయ పార్టీ ప్రధాని మోదీ ఫొటోను వాళ్ల ఆఫీసుల్లో పెట్టుకోవాలి. ఏపీలో లోక్సభ సీట్లు 25 నుంచి 38కి పెరుగుతాయి. తమిళనాడులో లోక్సభ సీట్లు 39 నుంచి 59కి పెరుగుతున్నాయి. సౌత్లో పెరిగినట్టుగానే నార్త్లో కూడా లోక్సభ సీట్లు పెరుగుతాయి. దేశమంతా ఒకే నిష్పత్తిలో సీట్లు పెరుగుతున్నప్పుడు వచ్చిన నష్టమేంటి?. సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని అడ్డుకోవాలి. గెజిట్ నోటిఫై కాకుండా రాజ్యాంగ సవరణ చేయలేం. అన్ని పార్టీలతో మాట్లాడినప్పుడు ఒప్పుకుని పార్లమెంట్కు వచ్చాక అడ్డుకోవడమేంటి? అని ప్రశ్నించారు. -
తేజస్వీ వ్యాఖ్యలను తిప్పికొట్టండి
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్లో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య రాష్ట్ర విభజనపై చేసిన వ్యాఖ్యలను గట్టిగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆదేశించినట్లు తెలిసింది. తేజస్వీ వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయంటూ, బీజేపీ నేతల తీరును ప్రజల్లో ఎండగట్టాలని సూచించినట్లు సమాచారం. కాగా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడకుండా, పార్లమెంట్లో తెలంగాణ గళాన్ని బలంగా వినిపించాలని ఆయన చెప్పారు. గురువారం సీఎం ఢిల్లీ తుగ్లక్రోడ్డులోని తన అధికారిక నివాసంలో పలువురు పార్టీ ప్రజా ప్రతినిధులతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, పార్లమెంట్లో రాష్ట్ర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తేజస్వీ వ్యాఖ్యలపై స్పందిస్తూ గట్టిగా తిప్పికొట్టాలని ఆదేశించినట్లు తెలిసింది. కాగా, తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రొద్భలంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. గతంలో ‘తల్లిని చంపి, బిడ్డను బతికించారు’ అంటూ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలే... తాజాగా తేజస్వీ విమర్శలకు దోహదం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఢిలీల్లోని తెలంగాణ భవన్లో ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, యెన్నెం శ్రీనివాస్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు, మాజీమంత్రి బసవరాజు సారయ్య విలేకరులతో మాట్లాడారు. -
సౌత్ స్టేట్స్ కు అన్యాయం జరిగితే నేనే కేంద్రాన్ని ప్రశ్నిస్తా:ఎంపీ తేజస్వీ
-
నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు, కేడర్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నామినేటెడ్, పార్టీ పదవుల భర్తీపై ముఖ్య నేతల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. సీఎం రేవంత్రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్కుమార్గౌడ్లు బుధవారం సమావేశమయ్యారు. ఉదయం 11 గంటల నుంచి నాలుగున్నర గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లాల వారీగా నేతల పేర్లను వడబోసిన ముగ్గురు నేతలు.. పలు కీలక పదవుల విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. ముఖ్యంగా కుల సమాఖ్యలకు చైర్మన్లు, పాలకవర్గం నియామకాల విషయంలో ఏకాభిప్రాయానికి రావడంతో రజక, నాయీ బ్రాహ్మణ, వడ్డెర, సగర, వాల్మీకిబోయ, కృష్ణ బలిజ (పూసల), భట్రాజ, కుమ్మరి శాలివాహన, విశ్వబ్రాహ్మణ, మేదరి, గీత, గొర్రెలు, మేకల తదితర పారిశ్రామిక ఫెడరేషన్లకు చైర్మన్లు, పాలకవర్గాలను నియమిస్తూ రెండు, మూడురోజుల్లో ఉత్తర్వులు విడుదల కానున్నాయి. మరోవైపు ఖాళీగా ఉన్న పలు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం, జిల్లా స్థాయి నేతలకు కార్పొరేషన్ డైరెక్టర్ పదవుల గురించి కూడా చర్చించిన నేతలు ఆయా పోస్టులను ఎవరికి కేటాయించాలి? ఏయే సామాజిక వర్గాలకు ఎలా ప్రాతినిధ్యం ఇవ్వాలి? ఏ జిల్లాకు ఎన్ని పదవులు ఇవ్వాలనే దానిపై కూడా ఓ అంగీకారానికి వచ్చారని, అయితే ఆ పోస్టులను జూన్ నెలలో ప్రకటించాలని నిర్ణయించినట్టు సమాచారం. కార్పొరేషన్లను ఎమ్మెల్యేలకు కేటాయించే విషయంలో కూడా ఏకాభిప్రాయం కుదిరిందని తెలిసింది. నాలుగు వర్కింగ్, ప్రచార కమిటీపై కూడా పార్టీ పదవులపై కూడా రేవంత్, మీనాక్షి, మహేశ్గౌడ్లు చర్చించారు. ముఖ్యంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎవరన్న దానిపై చర్చ ఓ కొలిక్కి వచ్చిందని, ఈసారి పీసీసీకి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తారని, రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ జాబితాలో వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, అదే ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ ఎంపీ, ఓ ఏఐసీసీ కార్యదర్శి, అదే జిల్లాకు చెందిన మహిళా నేత ఉన్నట్టు తెలుస్తోంది. ప్రచార కమిటీ చైర్మన్ పేరుపై కూడా ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. పార్టీ కోశాధికారిగా ఉమ్మడి హైదరాబాద్ పరిధిలోని సీఎం సన్నిహితుడిని నియమించే అంశంపైనా చర్చ జరిగినట్టు తెలిసింది. అలాగే పెండింగ్లో ఉన్న ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కొత్త అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, పెండింగ్లో ఉన్న సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా«ల అధ్యక్షులు, పలు జిల్లా కమిటీలపై కూడా చర్చ జరిగిందని, అన్ని పదవుల విషయంలో ముగ్గురు నేతలూ ఒక అభిప్రాయానికి వచ్చారని గాం«దీభవన్ వర్గాల ద్వారా తెలిసింది. పదవుల జాబితాకు అధిష్టానం ఆమోదం పొందిన తర్వాత అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించారు. మంత్రులపై ఆరోపణల గురించి చర్చ? రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై కూడా నేతలు చర్చించారని తెలుస్తోంది. ముఖ్యంగా జీవన్రెడ్డి ఎపిసోడ్తో పాటు ఇటీవలి కాలంలో రాష్ట్ర మంత్రివర్గ సభ్యులపై వస్తున్న ఆవినీతి ఆరోపణల గురించి చర్చించినట్టు సమాచారం. మరోవైపు డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ పక్షాన ప్రత్యేక వాదన తెరపైకి తెచ్చిన నేపథ్యంలో ఈ బిల్లు గురించి అవసరమైతే క్షేత్రస్థాయి ఆందోళనకు పార్టీ కేడర్ను సిద్ధం చేయాలని కూడా నిర్ణయించారు. టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం వీలైనంత త్వరగా నిర్వహించాలని నిర్ణయించారు. డీసీసీ అధ్యక్షుల నేతృత్వంలో పీఏసీలు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో మరో కొత్త కమిటీ చేరనుంది. రాష్ట్ర స్థాయిలో ఉన్న రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) తరహాలోనే జిల్లా స్థాయిలోనూ ఏర్పాటు చేస్తున్నారు. డీసీసీ అధ్యక్షుల నేతృత్వంలో ఏర్పాటు కానున్న ఈ పీఏసీల్లో జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అనుబంధ సంఘాల అధ్యక్షులను సభ్యులుగా నియమించనున్నారు. ఆయా జిల్లాల్లో జరిగే ముఖ్య రాజకీయ పరిణామాలు, ఎన్నికల సందర్భంగా తీసుకునే నిర్ణయాల్లో పీఏసీలు కీలకంగా వ్యవహరించనున్నాయి. అయితే,ఆయా జిల్లాల పీఏసీల్లో తమకు స్థానం కల్పించకపోవడంపై పలువురు రాష్ట్ర కమిటీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. -
దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తే ఊరుకోం
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్లో 50 శాతం సీట్లు పెరుగుతాయని కేంద్రం చెబుతున్న ప్పటికీ నియోజకవర్గాల పునర్విభజన బిల్లు లో మాత్రం ఆ ప్రస్తావన ఎక్కడా లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన అంశంపై 2022–23 నుంచే బీఆర్ఎస్ గళమెత్తుతోందని, జనాభా ప్రాతిపదికన పార్లమెంటు సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రా లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పున రుద్ఘాటించారు. పార్లమెంటులో ప్రవేశ పెట్టి న ఈ బిల్లులో ఉన్న అస్పష్టతపై ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం నగరంలోని పీర్జాదిగూడలో కేటీఆర్ మీడియాతో మాట్లా డుతూ.. 1971లో పార్లమెంటు సీట్లపై విధించిన స్తంభన జనాభా నియంత్రణ ప్రాతిపది కన జరిగిందని గుర్తు చేశారు. ఐదు దశాబ్దా లుగా దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ చర్యలను విజయవంతంగా అమలు చేశాయని తెలిపారు. జాతీయ జనాభా విధానాన్ని తూ.చ. తప్పకుండా పాటించినందుకు ఇప్పుడు మమ్మల్ని శిక్షిస్తారా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రస్తుతం లోక్సభ లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం సుమారు 24 శాతం ఉందని, దాన్ని ఏ స్థితిలోనైనా కాపాడాలని చెప్పారు. ‘0.01 శాతం తగ్గుదల కూడా మాకు ఆమోదయోగ్యం కాదు. ఆరు దక్షిణాది రాష్ట్రాల లోక్సభ సీట్లు 24శాతం కొనసాగాలి. దీనిని మార్చే ప్రయత్నం చేస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదు. మీరు నిప్పుల కుంపటి మీద కూర్చున్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంతో ఆడుకుంటే తీవ్రమైన తిరుగుబాటు వస్తుంది‘ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి చర్యలను అడ్డుకునేందుకు ఇతర రాజకీయ పార్టీలతో కలిసి పనిచేస్తామని చెప్పారు. మహిళా బిల్లుకు మద్దతుమహిళా రిజర్వేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మొదటి నుంచి చిత్తశుద్ధితో సంపూర్ణ మద్దతు ఇస్తోందని, తమ ప్రభుత్వ హయాంలో మహిళా సాధికారత కోసం అనేక చర్యలు అమలు చేసిన రికార్డు తమకు ఉందని కేటీఆర్ చెప్పారు. మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజన, రాజ్యాంగ సవరణలతో ముడిపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అత్యంత సరళమైన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు సంక్లిష్టం చేస్తోందని ప్రశ్నించారు. ‘మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలి, పార్లమెంటులో 543 సీట్లు ఉన్నాయి, అక్కడ వర్తింపజేయండి. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, ఇక్కడ కూడా అమలు చేయండి. సీట్ల పెంపు, పునర్విభజనతో ముడిపెట్టి ఎందుకు అయోమయాన్ని సృష్టిస్తున్నారు?‘ అని కేటీఆర్ నిలదీశారు.రేవంత్ వైఖరిలో స్థిరత్వమేదీ?సీఎం రేవంత్ రెడ్డిని ‘హైబ్రిడ్ ముఖ్యమంత్రి‘గా కేటీఆర్ అభివర్ణించారు. రేవంత్ రాజకీయ వైఖరిలో స్థిరత్వం లేదని ఆరోపించారు. ‘ఉద యం ఆయన కాంగ్రెస్కు ప్రతినిధిగా ఉంటారు, సాయంత్రానికి బీజేపీతో కలిసిపోతారు. సహజంగానే ఇలాంటి హైబ్రిడ్ విధానం ఆయన పాలనలో కూడా కనిపిస్తోంది‘ అని వ్యాఖ్యానించారు. సీఎం ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నారని విమర్శించారు. ఇతరుల నుంచి నిబంధనలు కోరుతున్న ముఖ్యమంత్రి, హైదరాబాద్ను మూడు కార్పొరేషన్లుగా విభజించే ప్రతిపాదన విషయంలో జీహెచ్ఎంసీ ప్రతినిధులు, జెడ్పీటీసీ సభ్యులు లేదా ఎమ్మెల్యేలను ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించారు. మీకో విధానం, ఇతరులకో విధానమా అని నిలదీశారు. -
కేసీఆర్కు సమకాలికుడినే.. చేతులు కట్టుకోను
సాక్షి, జగిత్యాల: తనపై వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేసిన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి సీనియర్ నేత జీవన్రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ముందు చేతులు కట్టుకుని నిలబడతానన్న వ్యాఖ్యలను బుధవారం ఆయన ఖండించారు. ‘‘కేసీఆర్ ముందు నేను చేతులు కట్టుకుని నిలబడతానంటూ సీఎం రేవంత్ మాట్లాడడం సరికాదు. విభేదాల పేరుతో వ్యక్తిగతంగా కించపరచడం సరికాదు. నేను ఎవరి ముందు చేతుల కట్టుకుని నిలబడను. కేసీఆర్కు నేను సమకాలికుడినే. ఇద్దరం కలిసే రాజకీయ ప్రయాణం చేశాం. ..తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర గొప్పది. ఆయన సమాజాన్ని గౌరవించే నాయకుడు. వ్యక్తిని గౌరవించే సంస్కారం నాది. నేను ఎవరి ముందు చేతులు కట్టుకోను. రాజకీయాల్లో నాకు ఆత్మగౌరవం ముఖ్యం. కాంగ్రెస్ పార్టీలో అది దెబ్బతింది కాబట్టే బయటకు వచ్చా అని జీవన్రెడ్డి చెప్పారు. -
ప్రొరాటా వద్దు.. హైబ్రిడే కావాలి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘ప్రొరాటా (దామాషా) పద్ధతిలో లోక్సభ సీట్ల సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుంచి 850కి పెంచితే జనాభా నియంత్రణను పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా తీవ్ర అన్యాయం జరుగుతుంది. కేంద్ర నిధుల కేటాయింపుల్లో ఇప్పటికే వివక్షకు గురవుతున్న దక్షిణాది రాష్ట్రాలకు ఇది మరో ఎదురుదెబ్బ అవుతుంది. దేశ ఆర్థిక వికాసానికి గణనీయంగా సహకారం అందించే దక్షిణాదికి ప్రాధాన్యం, ప్రాతినిధ్యం పార్లమెంటులో తగ్గిపోతుంది. జనాభా విస్ఫోటనం ఉన్న ఉత్తరాది–మధ్యభారత రాష్ట్రాలు లాభపడతాయి’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ప్రొరాటాకు బదులు హైబ్రిడ్ మోడల్లో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ విషయంలో దక్షిణాదికి అన్యాయం జరగకుండా జాతీయ స్థాయిలో విస్తృత చర్చల కోసం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలు, ఏకాభిప్రాయ సాధనతోనే ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుతోపాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లు–2026ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి మంగళవారం ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు. దేశ ప్రజాస్వామ్య భవిష్యత్తుపై ప్రభావం కలిగించే అంశమైనందున బాధ్యతతో అత్యవసరంగా ఈ లేఖ రాసినట్లు పేర్కొన్నారు.దక్షిణాది రాష్ట్రాలు బలహీనపడతాయి..‘లోక్సభ స్థానాల పెంపుతో దక్షిణ రాష్ట్రాలపై పడే ప్రభావాన్ని కేంద్రం పూర్తిగా విశ్లేషించలేదు. తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, కేరళ దశాబ్దాలుగా జనాభా నియంత్రణ, ఆరోగ్యం, మానవ అభివృద్ధి రంగాల్లో కృషి చేశాయి. జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నాయి. ప్రొరాటా పద్ధతిలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలనే ప్రతిపాదనతో ఈ రాష్ట్రాలన్నీ నిర్మాణాత్మకంగా నష్టపోయి రాజకీయంగా బలహీనపడతాయి. ప్రొరాటా మోడల్ కేవలం గణాంకాల మార్పుగా కాకుండా రాజకీయ అసమతుల్యతకు దారితీస్తుంది. ప్రొరాటా మోడల్ను దక్షిణాది రాష్ట్రాలు అంగీకరించవు. ఈ అంశంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉత్పన్నమవుతుంది. అందుకే అందరికీ న్యాయం జరిగేలా ఒక స్థిరమైన పరిష్కారం అవసరం. ఈ విషయంలో హైబ్రిడ్ మోడల్ ఒక ప్రత్యామ్నాయంగా ఉంటుంది. అందరి ప్రాతినిధ్యంతోపాటు అన్ని రాష్ట్రాల సహకారాన్ని ఈ మోడల్ సమతౌల్యం చేస్తుంది’ అని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సూచించిన 50 శాతం– 50 శాతం విధానాన్ని ఉదాహరణగా ప్రస్తావించారు. హైబ్రిడ్ మోడల్ ప్రకారం కొత్తగా పెంచే సీట్లలో సగాన్ని ప్రొరాటా పద్ధతిలో... మిగతా సగం సీట్లను రాష్ట్రాల ఆర్థిక భాగస్వామ్యం (జీఎస్డీపీ), అభివృద్ధి ప్రమాణాల ఆధారంగా కేటాయించాలని సూచించారు.ప్రస్తుత సీట్లలోనే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలిమహిళా రిజర్వేషన్ బిల్లుకు ఏఐసీసీ సంపూర్ణ మద్దతిస్తోందని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ సీట్లతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను యథాతథంగా వెంటనే అమలు చేయాలని ప్రధాని మోదీని సీఎం కోరారు. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి గతంలో సీట్ల సంఖ్య పెంచకుండా కేవలం నియోజకవర్గాల సరిహద్దులను మారుస్తూ డీలిమిటేషన్ నిర్వహించినట్లు గుర్తుచేశారు. ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా అలాంటి ప్రక్రియను చేపట్టవచ్చని.. అందుకు పూర్తి మద్దతు ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. హైబ్రిడ్ మోడల్పై ద్వారా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు నష్టపోకుండా ఉండటంతోపాటు ప్రజాస్వామ్య ప్రాతినిధ్య సూత్రం అమలవుతుందన్నారు. ఈ అంశంపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపి అన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీలతో కలిసి ఏకాభిప్రాయానికి రావాలని కోరారు. దేశ బలం భిన్నత్వంలో ఏకత్వమని.. ఇలాంటి కీలక నిర్ణయాలు ఆ ఐక్యతను చాటేలా ఉండాలని సూచించారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ అందరికీ న్యాయం చేసే పరిష్కారాన్ని కనుగొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.దక్షిణాది రాష్ట్రాల సీఎంలకు రేవంత్ లేఖలోక్సభ సీట్లను ప్రొరాటా పద్ధతిలో పెంచే ప్రతిపాదనను దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాలని సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్, ఏపీ సీఎం చంద్రబాబు, కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, పుదుచ్చేరి సీఎం ఎన్.రంగస్వామిలకు వేర్వేరుగా బహిరంగ లేఖలు రాశారు. లోక్సభ సీట్లను 850కి ప్రొరాటా పద్ధతిలో పెంచితే దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గిపోతుందని.. దేశాభివృద్ధిలో భాగం పంచుకుంటున్న రాష్ట్రాలు నష్టపోతూ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు లాభపడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే అన్ని రాష్ట్రాలకు న్యాయం జరిగేలా హైబ్రిడ్ మోడల్ను పరిశీలించాలని.. ఈ అంశంపై రాష్ట్రాలు ఐక్యంగా ముందుకు రావాలని రేవంత్ కోరారు. -
ప్రధాని మోదీకి సీఎం రేవంత్ బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: డీలిమిటేషన్పై ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. లోక్సభ సీట్ల పెంపుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లేఖలో మూడు అంశాలను రేవంత్రెడ్డి ప్రస్తావించారు. మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ను సీట్ల పెంపుతో కలపడం సరికాదన్న రేవంత్.. జనాభా ఆధారంగా సీట్లు పెంచితే దక్షిణాదికి నష్టం అన్నారు.ఆర్థిక, అభివృద్ధి ప్రమాణాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని రేవంత్ సూచించారు. హైబ్రిడ్ మోడల్ను అనుసరించాలన్నారు. అన్ని పార్టీలతో చర్చలు జరపాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. దేశ ఐక్యతకు న్యాయమైన ప్రతినిధిత్వం కీలకమన్న రేవంత్.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు పూర్తి మద్దతు ఇస్తామని చెప్పారు. ప్రస్తుత 543 సీట్లతోనే మహిళా రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్, సీట్ల పెంపు మూడు వేర్వేరు అంశాలు. డిలిమిటేషన్ను సీట్ల పెంపుతో కలపడం సరైంది కాదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.జనాభా ఆధారంగా సీట్లు పెంచితే దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని.. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలు నష్టపోతాయని రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తర రాష్ట్రాలకు అధిక రాజకీయ శక్తి వెళ్తుంది. దక్షిణ రాష్ట్రాల వాణి పార్లమెంట్లో తగ్గే ప్రమాదం ఉంది. ఆర్థికంగా ఎక్కువగా దేశానికి తోడ్పడుతున్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది. హైబ్రిడ్ మోడల్ ద్వారా సమతౌల్యం సాధించవచ్చు. సీట్లలో సగం జనాభా ఆధారంగా, మిగతా సగం ఆర్థిక ప్రమాణాల ఆధారంగా ఇవ్వాలి. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలతో చర్చలు జరపాలి. న్యాయం, సమాన ప్రతినిధిత్వం లేకపోతే దేశ ఐక్యత దెబ్బతింటుంది’’ అని సీఎం రేవంత్ లేఖలో పేర్కొన్నారు.తమిళనాడు సీఎంకు లేఖ: తమిళనాడు సీఎంకు కూడా రేవంత్రెడ్డి లేఖ రాశారు. లోక్సభ సీట్లను ప్రోరాటా పద్ధతిలో పెంచే ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాలు దీనికి వ్యతిరేకంగా నిలబడాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్కు లేఖ రాశారు సీఎం. మహిళల రిజర్వేషన్, డిలిమిటేషన్, లోక్సభ సీట్ల పెంపు అనే మూడు వేర్వేరు అంశాలను కలిపి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు.లోక్సభ సీట్లను 543 నుంచి 850కు పెంచి ప్రోరాటా పద్ధతిలో పంచితే దక్షిణ రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గిపోతుందని అప్రమత్తం చేశారు. దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకునే రాష్ట్రాలు నష్టపోతూ, జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు లాభపడే పరిస్థితి వస్తుందని అన్నారు. అందుకే అన్ని రాష్ట్రాలకు న్యాయం జరిగేలా హైబ్రిడ్ మోడల్ను పరిశీలించాలని, ఈ అంశంపై రాష్ట్రాలు ఐక్యంగా ముందుకు రావాలని ఆయన కోరారు. -
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లపై సంచలన వ్యాఖ్యలు
-
హైబ్రిడ్గా సీట్లు పెంచాలి
సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపు బిల్లులపై కేంద్ర ప్రభుత్వం హడావుడి చేస్తోందని.. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన రెండు వేర్వేరనే విషయాన్ని మరుగున పెట్టి, రెండింటినీ జనాభా లెక్కల తర్వాత ఆమోదింప చేసుకోవాలని ప్రధాని మోదీ యోచిస్తున్నారని విమర్శించారు. మహిళా రిజర్వేషన్, పునర్విభజన బిల్లుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని.. ప్రపంచంలోనే భారత్లో మహిళలకు ఓటు హక్కు కల్పించిన పార్టీ కాంగ్రెస్ అని రేవంత్ గుర్తుచేశారు. నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపు కేవలం జనాభా ప్రాతిపదికన చేయడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థిక నిర్మాణం, రాష్ట్రాల భాగస్వామ్యాన్ని పరిగణనలోకి తీసుకొని సీట్ల పెంపు జరగాలని డిమాండ్ చేశారు. అందుకోసం ‘హైబ్రిడ్ మోడల్’ అవసరమని రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. పెంచబోయే 272 లోక్సభ స్థానాల్లో 136 సీట్లను జనాభా ప్రాతిపదికన మరో 136 సీట్లను జీఎస్డీపీ ఆధారంగా ఆయా రాష్ట్రాలకు కేటాయించాలని సీఎం ప్రతిపాదించారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్పై ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన మంత్రివర్గ సహచరులు, ఎంపీలతో కలిసి సచివాలయంలో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...హైబ్రిడ్ విధానంతో సమన్యాయానికి అవకాశం‘దక్షిణాది రాష్ట్రాలు దేశానికి ఆదాయం, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. జాతీయ స్థూల ఉత్పత్తి జీఎస్డీపీలో దక్షిణాది రాష్ట్రాలే ముందున్నాయి. అలాంటి రాష్ట్రాలను శిక్షించడం తగదు. పన్నులు కట్టడం, సలాం కొట్టడం అనే దానికి మేం వ్యతిరేకం. అందుకే హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదిస్తున్నాం. లోక్సభలో ప్రస్తుతమున్న 543 సీట్లను 50 శాతం మేర పెంచితే సీట్లు 816కు చేరుతాయి. పెరిగే 272 సీట్లలో 136 దామాషా (ప్రొరాటా) ప్రకారం పెంచుకొని మరో 136 సీట్లను ఆర్థికంగా దేశానికి అందిస్తున్న సేవల ఆధారంగా పెంచాలి. ఈ సీట్ల పునర్విభజనపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలి. అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో చర్చించాలి. పార్లమెంటులో సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలి. 2028 మార్చి వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. 2027 మార్చి 31లోగా జనగణన, 2028 మార్చిలోగా పునర్విభజన పూర్తి చేసి 2029లో పెరిగిన సీట్లతో ఎన్నికలకు వెళ్లవచ్చు’అని రేవంత్ సూచించారు.మహిళా బిల్లు, పునర్విభజన బిల్లును కలపడం రాజకీయ కుట్ర‘నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లును ఒకటిగా చూపిస్తూ కేంద్రం హడావుడి చేస్తోంది. ఈ రెండింటికీ ఎలాంటి సంబంధం లేదు. వేర్వేరుగా చర్చించి అమలు చేయాలి. మహిళల రిజర్వేషన్ బిల్లు విషయంలో ఆలస్యం చేయడానికి ఈ పద్ధతి ఉపయోగిస్తున్నారు. దేశంలో ప్రధానిగా, రాష్ట్రపతిగా, స్పీకర్గా, ముఖ్యమంత్రులుగా మహిళలకు అవకాశాలు కల్పించింది కాంగ్రెస్. రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు తీసుకొచ్చారు. సోనియా గాంధీ నాయకత్వంలో మహిళా రిజర్వేషన్ బిల్లు–2013లో రాజ్యసభలో ఆమోదం పొందింది. కానీ బీజేపీ సహకరించకపోవడంతో లోక్సభలో నిలిచిపోయింది. 2023లో మహిళా రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటులో చర్చకు వచ్చినప్పుడు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. 2024 ఎన్నికల్లోనే 33% రిజర్వేషన్లు అమలు చేసి ఉంటే 181 మహిళలు లోక్సభలో ఉండేవారు. 2026 జనాభా లెక్కల తర్వాత అంటే మహిళల హక్కులను వాయిదా వేయడమే. నియోజకవర్గాల పునర్విభజనతో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో పెట్టి ఆమోదించాలి’అని సీఎం సూచించారు.జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపుతో దక్షిణానికి అన్యాయం‘దేశంలో 1970 ప్రాంతంలో కుటుంబ నియంత్రణ అమలు చేయాలని కేంద్రం నిర్ణయించినప్పుడు దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను కట్టుదిట్టంగా అమలు చేశాయి. అందుకే జనాభా తగ్గింది. ఉత్తరాదిలో నియంత్రణ లేకపోవడంతో జనాభా పెరిగింది. ఇప్పుడు జనాభా ఆధారంగా సీట్లు పెంచితేం మంచి పనిచేసిన రాష్ట్రాలను శిక్షించినట్లే అవుతుంది. ఇందిరాగాంధీ ఈ విషయాన్ని గమనించి లోక్సభ సీట్ల ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 25 ఏళ్ల వరకు సీట్ల పెంపును ఇందిరాగాంధీ నిషేధించారు. 2001లో వాజ్పేయి పునర్విభజన బిల్లుపై చట్ట సవరణ చేశారు. చట్టపరంగా సీట్ల పెంపుపై నిషేధం విధించారు. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన సీట్ల పునర్విభజనకు ఒప్పుకోబోమని దక్షణాది రాష్ట్రాలు నిరసన తెలపడంతోపాటు ప్రధానికి లేఖ రాశాయి. దాంతో దామాషా ప్రకారం 50 శాతం సీట్లు పెంచుతామంటున్నారు. 20 సీట్లు ఉన్న కేరళకు, 80 సీట్లు ఉన్న యూపీకి ఉన్న అంతరం ప్రస్తుతం 60 సీట్లు మాత్రమే. కానీ 50 శాతం పెంచితే 90 సీట్లకు అంతరం పెరుగుతుంది. తెలంగాణకు, యూపీకి 94 సీట్ల అంతరం పెరుగుతుంది. దక్షణాదిలో 130 సీట్లు ఉన్నాయి. 50 శాతం పెరిగితే 195 అవుతాయి. 413 సీట్లున్న ఉత్తరాదిలో 621 సీట్లు అవుతాయి. దక్షణాది, ఉత్తరాద మధ్య అంతరం 412 సీట్ల నుంచి 620 సీట్లకు పెరుగుతుంది. దీనివల్ల ఒక్క తెలంగాణకే కాదు... దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాలతోపాటు గోవా, పంజాబ్, ఢిల్లీ వంటి రాష్ట్రాలకు కూడా అన్యాయమే జరుగుతుంది. తద్వారా దక్షిణాది, ఉత్తరాది మధ్య వ్యత్యాసం మరింత పెరుగుతుంది. ఇది దేశ సమతౌల్యానికి ప్రమాదకరం’అని సీఎం రేవంత్ హెచ్చరించారు.బండి సంజయ్, కిషన్రెడ్డి మోదీ ఇంటి ముందు బంట్రోత్తులుగానే..‘50 శాతంతో సీట్ల పునర్విభజన జరిగితే కిషన్రెడ్డి, బండి సంజయ్ ప్రధాని మోదీ ఇంటి ముందు బంట్రోతులుగా నిలబడాల్సి వస్తుంది. వాళ్ల అవసరం ఇకపై ఉండదు. ఉత్తరాది రాష్ట్రాల్లో గెలిచే ఎంపీలతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. మోదీ గుజరాత్ వదిలి యూపీ నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారంటే అక్కడ 80 సీట్లు ఉన్నాయి కాబట్టి. అందుకే హైబ్రిడ్ విధానంలో దేశానికి ఆర్థిక పరిపుష్టిని అందిస్తున్న రాష్ట్రాలకు 50 శాతం కేటాయించాలి. రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. 50 శాతం మెరిట్, 50 శాతం రిజర్వేషన్ అని. దానినే కేంద్రం ఉపయోగించాలి’అని సీఎం సూచించారు.మహిళలకు బీజేపీ అన్యాయం చేసింది‘బీజేపీ 1980 ఏప్రిల్ 6న ఏర్పాటైంది. ఇప్పటివరకు 15 మంది బీజేపీ అధ్యక్షుల నియామకం జరిగితే ఆ పార్టీ అధ్యక్షురాలిగా ఒక్క మహిళను కూడా నియమించలేదు. జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ పదవి కూడా ఇవ్వలేదు. దీన్నిబట్టే బీజేపీకి మహిళలపై గౌరవం, చిత్తశుద్ది ఎంత ఉందో అర్థమవుతుంది. బీజేపీకి మహిళను అధ్యక్షురాలిగా నియమించుకున్న తర్వాత బండి సంజయ్ మాట్లాడాలి. బండి సంజయ్ వ్యాఖ్యలు దక్షణాది రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ, మహిళలకు వ్యతిరేకం. మా ఎంపీలు తెలంగాణను సాధించారు. ఇప్పుడు పునర్విభజనపైనా పోరాడుతారు. దక్షణాది రాష్ట్రాలతోపాటు చిన్న రాష్ట్రాలను కూడా ఐక్యం చేస్తాం. పార్లమెంటులో బిల్లును ఎలా ఆమోదిస్తారో చూస్తాం. అన్ని దక్షణాది రాష్ట్రాలతోపాటు ఢిల్లీ, పంజాబ్ లాంటి చిన్న రాష్ట్రాలకు దీనిపై లేఖ రాస్తా’అని సీఎం రేవంత్ చెప్పారు. -
మహిళా రిజర్వేషన్లు తీసుకొచ్చిందే కాంగ్రెస్.. ఫిట్టింగ్ పెట్టింది ఎన్డీయే: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: పురుషులతో పాటు మహిళలకు సమాన ఓటు హక్కు కల్పించిందే కాంగ్రెస్ పార్టీ అని.. అలాంటి పార్టీ మహిళా రిజర్వేషన్ల బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహిళలకు రిజర్వేషన్లు ఇంతకాలం అడ్డుకుంది ఎన్డీయేనేనని ఆరోపించారాయన. మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో బీజేపీ చేస్తున్న ప్రచారంపై సోమవారం సెక్రటేరియట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్పై చర్చ కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసింది. అయితే.. ఈ రెండింటినీ ఒకేలా చూపించే ప్రయత్నం చేస్తోంది. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమనట్లు బీజేపీ ప్రచారం చేస్తోంది. బిల్లుకు విపక్షాలు సహకరించడం లేదని అపవాదు వేస్తోంది. మహిళలకు అన్ని రంగాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇచ్చింది. రాజ్యాంగబద్ద పదవుల్లోనూ మహిళకు అవకాశం ఇచ్చింది. మహిళలకు రిజర్వేషన్ల బిల్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలని సోనియా భావించారు. గతంలో కాంగ్రెస్ బిల్లు పెడితే బీజేపీ పార్లమెంట్ను స్తంభింపజేసింది. 2013లో బిల్లు తీసుకొస్తే బీజేపీ సహకరించలేదు. అందుకే మహిళా బిల్లు ఆగింది. గత పదేళ్లుగా బీజేపీ ఈ బిల్లు ఊసే ఎత్తలేదు. చట్టంలో ఫిట్టింగ్ పెట్టి మహిళలకు రిజర్వేషన్లను దూరం చేసిందే ఎన్డీయే అని సీఎం రేవంత్ ఆరోపించారు.2024లోనే రిజర్వేషన్లు వర్తింపజేసి ఉంటే మహిళలకు లాభం జరిగేదన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు చర్చే అవసరమే లేదన్న ఆయన.. అయినా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు.శిక్షించే హక్కు ఎవరిచ్చారు?మహిళా బిల్లు, డీలిమిటేషన్కు లింకు పెడుతున్నారు. ఇక్కడే అసలు కుట్ర ఉంది. డీలిమిటేషన్పై కేంద్రం హడావిడి చేస్తోంది. 50 శాతం సీట్లు పెంచాలని మోదీకి ఏ దేవుడు చెప్పారు. జనాభా ప్రతిపాదికన డీలిమిటేషన్ను గతంలో ఇందిరా గాంధీ నియంత్రించారు. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను పాటించాయి. అందుకే ఇక్కడ జనాభా తగ్గింది. మోదీ చర్యలతో ఉత్తరాదిలో సీట్లు పెరుగుతాయి.. దక్షిణాదిలో తగ్గుతాయి. ఇది ఉత్తరాది, దక్షిణాది మధ్య తీవ్ర అంతరాన్ని పెంచుతుంది.జనాభా ప్రతిపాదికన డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయమే జరుగుతుంది. చిన్న రాష్ట్రాలు మనుగడ కోల్పోతాయి. రాజకీయంగా దక్షిణాది వాళ్లను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూసే ప్రయత్నం జరుగుతోంది. సీట్లు పెంచాలనుకుంటే ముందు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలి. ఎక్స్పర్ట్ కమిటీ వేయండి.. అసెంబ్లీల అభిప్రాయం తెలుసుకోండి. జనగణన పూర్తయ్యే లోపు పూర్తి చేయండి. మేం హైబ్రిడ్ మోడల్ను ప్రతిపాదిస్తున్నాం. పెంచాలనుకున్న 272 సీట్లలో 136 ప్రొరేటా ప్రకారం చేయండి. మిగిలిన 136 సీట్లను జీఎస్డీపీ ప్రకారం చేయండి. స్థూల ఉత్పత్తిలో అత్యధిక భాగస్వామ్యం చేస్తున్న రాష్ట్రాలకు సీట్లు పెంచండి. దేశానికి మేం అత్యధిక ఆదాయం అందిస్తున్నాం. అత్యధిక ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాం. అలాంటి రాష్ట్రాలను శిక్షించే హక్కు మీకెవరు ఇచ్చారు?’’ అని కేంద్రాన్ని సీఎం రేవంత్ నిలదీశారు. -
మహిళా రిజర్వేషన్లు, డీ లిమిటేషన్పై మోదీని ప్రశ్నించిన రేవంత్
సాక్షి, హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ల పెంపు, డీ లిమిటేషన్ వేరువేరు అంశాలు అంటూ ప్రధాని మోదీకి ప్రశ్నలు సంధించారు సీఎం రేవంత్. మహిళా రిజర్వేషన్ను అంశాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా..‘మహిళా రిజర్వేషన్ల పెంపు, డీ లిమిటేషన్ వేరువేరు అంశాలు. మహిళా రిజర్వేషన్లకు దేశమంతా మద్దతు ఇస్తుంది. కానీ, లోక్సభ సీట్ల పునర్విభజనపై అనేక సందేహాలు ఉన్నాయి. రాష్ట్రాల వారీగా అసెంబ్లీ సీట్లకు మహిళా కోటాను వెంటనే అమలు చేయాలి. మహిళా రిజర్వేషన్ను అంశాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. జనాభా ఆధారంగా లోక్సభ పునర్విభజనను ముందుకు తెచ్చే ప్రయత్నాలు ఆపాలి. బీజేపీ చేసే ప్రయత్నం బీజేపీకి మాత్రమే లాభం. బీజేపీ కుట్రతో దక్షిణాది రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. బీజేపీ చర్య దేశాన్ని బలహీనపరుస్తుంది. పార్టీ ప్రయోజనాల కన్నా జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలి’ అంటూ వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. ఢిల్లీలో నారీ శక్తి వందన్ సమ్మేళన్ కార్యక్రమం మోదీ ప్రసంగిస్తున్న సమయంలో సీఎం రేవంత్ ఇలా వ్యాఖ్యలు చేయడం విశేషం. పార్లమెంటు కొత్త చరిత్ర లిఖించడానికి చేరువలో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 21వ శతాబ్దం మహిళలకు చెందిందని చెప్పారు. 21వ శతాబ్దంలో అతి కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నామని పేర్కొన్నారు. కేంద్రం తీసుకునే నిర్ణయం మహిళలకు అంకితం చేస్తున్నామని తెలిపారు. -
ఓయూ విద్యార్థి నాయకుని వివాహానికి సీఎం
ఉస్మానియా యూనివర్సిటీ: వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్లో జరిగిన ఓయూ విద్యార్థి నాయకుడు రెడ్డి శ్రీనివాస్, మమత వివాహానికి సీఎం రేవంత్రెడ్డి ఆదివారం హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. విద్యార్థి నేతగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన శ్రీనివాస్ సీఎం రేవంత్రెడ్డికి 15 సంవత్సరాలుగా అనుచరుడిగా కొనసాగుతున్నారు. వివాహానికి రేవంత్రెడ్డి విచ్చేసి ఆశీర్వదించినందుకు నూతన దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. సమగ్ర కులగణనతోనే సామాజిక న్యాయం సాక్షి, హైదరాబాద్: జాతీయస్థాయిలో సమగ్ర కులగణన జరిగితేనే దేశంలో సామాజిక న్యాయం సాధ్యమవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. త్వరలోనే చేపట్టే జనగణనలో అన్ని కులాల సామాజిక, ఆర్థిక, విద్య స్థాయిలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివారం ఆయన ప్రజాభవన్లో ‘క్యాస్ట్ సెన్సెస్ డీపెనింగ్ ఆఫ్ సోషల్ జస్టిస్’అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభు త్వం నిర్వహించిన సమగ్ర కుల సర్వే దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. -
కేసీఆర్ తో దోస్తీ...రేవంత్ తో కటీఫ్.. పొలిటికల్ ఫ్యూచర్పై క్లారిటీ..
-
‘తెలంగాణలో రేవంత్ పని అయిపోయింది’
జగిత్యాల: సీఎం రేవంత్రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డిలపై కాంగ్రెస్ మాజీ నేత జీవన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఇక రేవంత్ పని అయిపోయిందంటూ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో తదుపరి వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేని జీవన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇక తాను పీసీసీ ప్రెసిడెంట్ కాకుండా అడ్డుకున్నది జానారెడ్డినే అంటూ మండిపడ్డారు. ఈరోజు(శనివారం, ఏప్రిల్ 11వ తేదీ) జగిత్యాల నుంచి మీడియా మాట్లాడిన జీవన్రెడ్డి.. ‘ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి విఫలమైంది. ప్రస్తుతం ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు.. తెలంగాణ రాష్ట్రానికి షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ షాడో సీఎం చంద్రబాబు..కాంగ్రెస్లో చేరేటప్పుడు టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న రేవంత్ శానసమండలి చైర్మన్కు రాజీనామా లేఖ పంపకుండా చంద్రబాబుకు పంపినప్పుడే ఆయన విధేయత అర్థమైంది. ఇప్పుడున్నది ఒర్జినల్ కాంగ్రెస్ కాదు. దానికి ప్రధాన కారకుడు సీఎం రేవంత్. మల్కాజిగిరి ఎంపీగా ఉన్నప్పుడు ఏడు శాసనసభ స్థానాల్లో ఎక్కడా గెలిపించుకోలేని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశారు. ముఖ్యమంత్రి అయినాక కూడా మహబూబ్ నగర్ లో వంశీచంద్ రెడ్డిని ఎంపీగా గెలిపించుకోలేని అసమర్థ నాయకుడు రేవంత్. నేను పార్టీ నుంచి వెళ్లిపోవడానికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ని ఓ టూల్గా వాడారు. నేను పీసీసీ ప్రెసిడెంట్ కాకుండా అడ్డుకున్నది జానారెడ్డి. ఉప ఎన్నిక నేపథ్యాన్ని ముందుపెట్టి జానారెడ్డి నన్ను అడ్డుకున్న కుట్రదారులు. కేసీఆర్ దగ్గరకు వెళ్లితే ఏమవుతుందో తెలుసానని చాలామంది మాట్లాడుతున్నారు. కడియం శ్రీహరిని డిప్యూటీ సీఎం చేశాడు, తుమ్మలను ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేశాడు, కేకేను సెక్రటరీ జనరల్ చేశాడు, ఆయన కూతురికి మేయర్ ఇచ్చాడు. ఇంకేం కావాలి..?, ప్రజల్లో బీఆర్ఎస్ రావాలనే చర్చ ఉధృతంగా జరుగుతోందికాంగ్రెస్పై సమరశంఖం పూరిస్తా..రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీపై సమరశంఖం పూరిస్తానని జీవన్రెడ్డి తెలిపారు. జీవన్ రెడ్డి ఎవరో సంధించే అస్త్రం కాదు.. జీవన్ రెడ్డే అస్త్రాలు సంధించే నాయకుడన్నారు. ఈనెల ఏప్రిల్ 20వ తేదీన కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకుంటా. భారీ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతారు’ అని పేర్కొన్నారు. చిన్నారెడ్డికి టిక్కెట్ ఇస్తానని మొండిచేయి చూపించారని. రాజ్యసభ ఇస్తానని చెప్పి రేవంత్ అనుచరుడికి కట్టబెట్టారన్నారు. ఇవన్నీ కాంగ్రెస్ దృష్టికి తీసుకెళ్లానని, లేఖలు రాశానన్నారు. కాంగ్రెస్ వైఖరితో తీవ్రంగా కలత చెందే రాజీనామా చేశాననన్నారు. -
పునర్విభజనతో ప్రజా ఉద్యమం!
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ నియోజకవర్గాల పెంపు (పునర్విభజన)తో రాష్ట్రాల మధ్య వివక్ష, అంతరాలు పెరుగుతాయని, ఫలితంగా ప్రజా ఉద్యమాలు తప్పవని సీఎం రేవంత్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చిరించారు. రైతు చట్టాల్లాగే డీలిమిటేషన్ బిల్లును కూడా వెనక్కి తీసుకోకతప్పదని స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర ద్రోహం చేస్తోందని అన్నారు. ఈ రాష్ట్రాలను రాజకీయంగా అణగదొక్కే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. ఇది పార్టీల సమస్య కాదని, ప్రాంతాల సమస్య అని చెప్పారు. ‘ఇప్పటికే మేము తీవ్రమైన బాధతో ఉన్నాం.. గాయపడి ఉన్నాం.. మమ్మల్ని ఇంకా రెచ్చగొట్టొద్దు’ అని హెచ్చరించారు. శుక్రవారం ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరైన అనంతరం.. రాత్రి తన అధికారిక నివాసంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. అప్పుడు బండి, కిషన్రెడ్డిలకు చప్రాసీ పదవి కూడా దొరకదు‘నియోజకవర్గాలను ఏ ప్రాతిపదికన, ఎలా పెంచాలి అనే దానిపై కనీస చర్చ లేకుండా ఎందుకింత అర్జెంటుగా? దేశంలో 50 శాతం నియోజకవర్గాల పెంపు జరిగితే ఉత్తరాదికే పూర్తి అడ్వాంటేజ్గా మారుతుంది. కేవలం ఉత్తరాది రాష్ట్రాలతోనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే దుస్థితి వస్తుంది. చిన్న రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరగడమే కాకుండా ప్రాముఖ్యత కోల్పోతాయి. చిన్న రాష్ట్రాలు మరింత చిన్నగా, పెద్ద రాష్ట్రాలు మరీ పెద్దగా మారిపోతాయి. ఆర్థిక ప్రాతిపదికన, మెరిట్ డిజబిలిటీ విధానంలో అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల పెంపు ఉండాలి.చిన్న రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాల మధ్య ఇప్పుడున్న గ్యాప్ అలాగే కొనసాగాలి. ప్రస్తుతం కేరళ, యూపీ మధ్య 60 సీట్ల తేడా ఉంది. పునర్విభజన జరిగితే అది ఏకంగా 99కి పెరుగుతుంది. ఇది ముమ్మాటికీ చిన్న రాష్ట్రాలకు ఉరితాడు లాంటిదే. భవిష్యత్తులో ఉత్తరాది సీట్లు పెరిగితే.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో చోటు దక్కించుకున్న బండి సంజయ్, కిషన్రెడ్డి లాంటి దక్షిణాది బీజేపీ నేతలకు కనీసం చప్రాసీ పదవి కూడా దొరకదు..’ అని సీఎం అన్నారు.అందమైన ముసుగులో మోసం‘నియోజకవర్గాల పెంపు అనేది అందమైన ముసుగులో చేస్తున్న మోసం. బీజేపీ పెడుతున్న ఈ మెలికల్లో వారి రాజకీయ స్వార్థం దాగుంది. గతంలో ఇలాగే హడావుడి చేసి రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చారు. రైతుల ఆందోళనతో మళ్లీ వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు ఈ బిల్లుపై సౌత్లో రియాక్షన్ వస్తే, బీజేపీ పాలిత చిన్న రాష్ట్రాలు సహా.. ఇతర చిన్న రాష్ట్రాలు వ్యతిరేకిస్తే కేంద్రం ఏం చేస్తుంది? ఈ బిల్లును అడ్డుకోవాల్సి వస్తే నేను కాదు ప్రజలే తిరగబడతారు.మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు..మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు. స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లను దివంగత ప్రధాని రాజీవ్గాంధీ అమలు చేశారు. సోనియాగాంధీ గతంలోనే మహిళా రిజర్వే షన్ బిల్లును పెట్టారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ల కోసం సీట్లు పెంచాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడున్న 543 లోక్సభ స్థానాల్లోనే 181 సీట్లను మహిళలకు కేటాయించి రిజర్వేషన్లు అమలు చేయొచ్చు కదా? కేంద్రం లీకులు ఇస్తున్న ఇతర సవరణలపై ఇండియా కూటమితో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయించాం..’ అని రేవంత్ తెలిపారు.కేటీఆర్ వ్యాఖ్యలు సిగ్గుచేటు కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు అవమానం జరిగిందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ మాట్లాడటం సిగ్గుచేటని రేవంత్రెడ్డి విమర్శించారు. ‘గతంలో బీఆర్ఎస్లో సీనియర్లుగా ఉన్న ఆలె నరేంద్ర, దేశిని చిన్న మల్లయ్య, ఈటల రాజేందర్, విజయశాంతి లాంటి ఎంతోమందికి ఏం జరిగిందో, వారిని ఎలా గెంటేశారో అందరికీ తెలుసు..’ అని వ్యాఖ్యానించారు. -
‘మీరు చేస్తే తప్పుకాదు.. మేము చేస్తే తప్పా?’
హైదరాబాద్: డీలిమిటేషన్ పై సీఎం రేవంత్రెడ్డి అభ్యంతరాలేంటని ప్రశ్నించారు కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ కిషన్రెడ్డి. యూపీఏ హయాంలో పునర్విభజన చేస్తే తప్పు కాదు,, తాము చేస్తే తప్పా?, SIR ప్రక్రియ గతంలో వాళ్ళు చేస్తే తప్పు కాదు.. తాము చేస్తే తప్పా? అని కిషన్రెడ్డి ప్రశ్నించారు. ‘మూసీ ప్రక్షాళన కోసం రంలో ట్రీట్ మెంట్ ప్లాంట్లకి కేంద్రం నిధులు ఇస్తుంది. రాష్ట్రం అడిగిన రుణాలను ఇతర సంస్థల ద్వారా ఇప్పించే ప్రయత్నం చేస్తోంది. మూసీ ప్రక్షాళన చేయండి. మూసీ డెవలప్మెంట్ చేయండి. కానీ పేదల ఇళ్లను కూల్చొద్దు. డీలిమిటేషన్ పై రేవంత్ రెడ్డి అభ్యంతరాలు ఎంటి..?, వాళ్ళకి ఎం కావాలో పార్లమెంట్ లో వాళ్ళ ఎంపీలను మాట్లాడమనండి. చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్లను అమలు చేయబోతున్నాం. నియోజకవర్గాల పునర్విభజన చేయకుండా మహిళా రిజర్వేషన్లు అమలు చేయలేం. ఏది పెట్టిన కావాలని వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ కోడి గుడ్డు మీద ఈకలు పీకాలని చూస్తుంది. ప్రజలు, అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని డీలిమిటేషన్ జరుగుతుంది. ఆర్ఎస్ఎస్పై మాట్లాడే అర్హత కాంగ్రెస్కు లేదు’ అని కిషన్రెడ్డి స్పష్టం చేశారు. -
రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందంపై.. దిమ్మతిరిగే కౌంటర్
-
సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పాల్సిందే బాబు బండారం మొత్తం బయటపెట్టి
-
కాళేశ్వరం బరాజ్లకు వెంటనే మరమ్మతులు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బరాజ్లకు సత్వరమే మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచనల మేరకు పనులను పూర్తి చేయాలన్నారు. గురువారం జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డితో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆయన సమీక్ష నిర్వహించారు. మరమ్మతుల కోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించి నిరంతరం పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు.దీనికి సంబంధించిన ఏజెన్సీలన్నింటినీ అప్రమత్తం చేసి పనుల్లో వేగం పెంచాలని సూచించారు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్(సీడబ్ల్యూపీఆర్ఎస్) ఆధ్యర్యంలో జరుగుతున్న పరీక్షలు, నమూనాల సేకరణను వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖ, సీడబ్ల్యూపీఆర్ఎస్, బరాజ్ల నిర్మాణ సంస్థలు, డిజైన్ కన్సల్టెంట్తో టీమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి పనిలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సభ్యులు ఉండేలా చూడాలన్నారు.మేడిగడ్డ పనులపై పూర్తి షెడ్యూల్ రూపొందించండిమేడిగడ్డ బరాజ్ దగ్గర 500 బోరు హోల్స్ తవ్వాల్సి ఉందని, ఇందుకోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకు కావాల్సిన యంత్రాలను సమకూర్చుకుని వీలైనంత త్వరగా ఈ పని పూర్తి చేయాలని చెప్పారు. మరమ్మతులకు సంబంధించి డిజైన్లు సిద్ధం చేయాలని సూచించారు. డిసెంబర్ వరకు చేయాల్సిన పనులపై పూర్తి షెడ్యూల్ సిద్ధం చేయాలని, నిధుల సమస్య లేకుండా చూస్తామని తెలిపారు. బరాజ్ వద్ద బేస్ క్యాంపు ఏర్పాటు చేయాలని చెప్పారు. కాగా 1.6 కిలోమీటర్ల మేడి గడ్డ బరాజ్ పటిష్టతపై అధ్యయనం చేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఇంజనీర్లు సీఎం దృష్టికి తీసుకువ చ్చారు. సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, సీఎం కార్యదర్శి మాణిక్రాజ్ పాల్గొన్నారు. -
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయం ఢిల్లీకి బయలు దేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఉదయం 10 గంటలకు శంషాబాద్ విమానాశ్ర యం నుంచి బయలుదేరు తారు.సీఎంతో పాటు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్గౌడ్, మంత్రులు దామో దర రాజ నర్సింహ, ఉత్తమ్కుమార్ రెడ్డి కూడా వెళ్లే అవకాశం ఉంది. -
కేసీఆర్ పాలనే బెస్ట్...సీఎం రేవంత్ పై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
సీఎస్ఆర్ను ఖర్చులా కాదు.. భాగస్వామ్యంగా చూడండి
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద సమాజాభివృద్ధికి చేసేది ఖర్చులా కాకుండా భాగస్వామ్యంగా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోరారు. ప్రభుత్వం విద్య, వైద్యం, జల వనరుల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తుందని.. కంపెనీలు వీటితో పాటు తమకు ఇష్టమైన ఏ రంగాన్నైనా ఎంచుకొని సీఎస్ఆర్ నిధులు వినియోగించాలని సూచించారు. అయితే కంపెనీలు సీఎస్ఆర్ కింద చేస్తున్న వ్యయం వంద శాతం సత్ఫలితాలు ఇచ్చేలా ఉండాలన్నారు. ప్రభుత్వంతో పాటు కంపెనీలు కలిపి చేసే వ్యయంతో తెలంగాణ విద్యార్థులను ప్రపంచ స్థాయి నైపుణ్యం ఉన్న వారిగా తీర్చిదిద్ది భవిష్యత్ అవకాశాలను అందిపుచ్చుకునేలా తయా రు చేయగలమన్నారు. విద్యపై పెట్టే వ్యయాన్ని తాము భవిష్యత్ తరాలపై పెట్టే పెట్టుబడిగా భావిస్తున్నామని తెలిపారు. బుధవారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో వివిధ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. నిధులు స్థానికంగానే వినియోగించాలి రాష్ట్రంలోని మొత్తం విద్యార్థుల సంఖ్యలో 44 శాతం హైదరాబాద్ నగరంలోనే ఉన్నారని.. వారికి నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందని సీఎం అన్నారు. కంపెనీలు స్థానికంగా ఉన్న అన్ని మౌలిక వసతులను వినియోగించుకుంటున్నందున తమ సీఎస్ఆర్ నిధుల్లో ఎక్కువ మొత్తాన్ని అదే ప్రాంత అభివృద్ధికి కేటాయించాలని చెప్పారు. సీఎస్ఆర్ నిధుల వినియోగంలో ఇప్పటి వరకు సరైన విధానం లేనందున తాము ఒక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఇందుకోసం నియమించామని తెలిపారు. కంపెనీల ప్రతినిధులు ఆయనతో సమన్వయం చేసుకొని తమకు ఆసక్తి ఉన్న విద్య, వైద్యం, జల వనరులు, నైపుణ్య శిక్షణ, వారసత్వ కట్టడాల పరిరక్షణ, అడవుల సంరక్షణ ఇలా దేనికైనా సీఎస్ఆర్ నిధులు వినియోగించవచ్చని సూచించారు. రహేజా గ్రూప్ రూ.50 కోట్లు, రాంకీ గ్రూప్ రూ.50 కోట్లు, యశోద ఫౌండేషన్ రూ.10 కోట్లు విద్యాభివృద్ధికి కేటాయించేందుకు ఇప్పటికే ముందుకు వచ్చాయంటూ ముఖ్యమంత్రి వారికి అభినందనలు తెలిపారు. మమ్మల్ని ఇలా ఎవరూ సంప్రదించలేదు.. సీఎస్ఆర్ నిధుల విషయంలో ఇప్పటివరకు ఇలా ఎవరూ తమను సంప్రదించలేదని కంపెనీల ప్రతినిధులు చెప్పారు. ఈ విషయంలో చొరవ తీసుకున్న సీఎంకు అభినందనలు తెలిపారు. పాఠశాల విద్య, ఆసుపత్రులు, వారసత్వ కట్టడాల పరిరక్షణపై వారు ఆసక్తి చూపారు.. సమావేశంలో రహేజా ఫౌండేషన్ నుంచి శ్రావణ్ కుమార్, రాంకీ ఫౌండేషన్ నుంచి దాక్షాయణి ఆళ్ల, యశోద ఆసుపత్రి నుంచి డాక్టర్ గోరుకంటి సురేందర్ రావు, గోరుకంటి ఫల్గుణ్ రావు, మేఘా నుంచి సుధారెడ్డి, అపోలో ఆసుపత్రి నుంచి అపర్ణారెడ్డి, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి శేఖర్రెడ్డి, నాదం ఫౌండేషన్ నుంచి పగిడిపాటి దేవయ్య, రుద్రమదేవి, కామినేని భాస్కర్రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, ప్రత్యేక కార్యదర్శి వెంకటేష్ ధోత్రే, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ శ్రీదేవసేన, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికొలస్ తదితరులు పాల్గొన్నారు. -
రేవంత్ ఆలోచనలన్నీ పేదల భూములపైనే
సాక్షి, హైదరాబాద్: సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్లు సీఎం రేవంత్రెడ్డి ఆలోచనలన్నీ పేదల భూములపైనే ఉన్నాయని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. దళిత, గిరిజన, బలహీనవర్గాల భూములపై గద్దల్లా వాలుతూ ఇందిరమ్మ పాలనలో ఇచ్చిన పట్టాలను లాక్కుంటున్నారని మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కాళ్లాపూర్, రాపోల్లో పారిశ్రామిక పార్కు మూలంగా భూములు కోల్పోతున్న రైతులను పరామర్శించేందుకు మంగళవారం కోకాపేటలోని తన నివాసం నుంచి హరీశ్ బయలుదేరి వెళ్లారు.ఈ సందర్భంగా హరీశ్రావు మీడియాతో మాట్లాడుతూ పచ్చటి పొలాల్లో పరిశ్రమల పేరిట రైతుల జీవితాలతో రేవంత్ ప్రభుత్వం ఆడుకుంటోందన్నారు. రేవంత్ రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నారని, ఇది గడీల పాలన, బేడీల పాలన, నిర్బంధాల పాలన, దుర్మార్గపు పాలన అని, రైతులను పరామర్శించడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. తాము అరెస్టులు చేయమని,, తమది ప్రజాపాలన అని ఆదిలాబాద్ జిల్లా సభలో సీఎం చెప్పి 24 గంటలు కాకముందే ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులను అరెస్టు చేయడం దౌర్జన్యమన్నారు. ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఒక్కటి కూడా అమలు చేయకుండా అన్యాయంగా పేద రైతుల భూములు లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, పరిశ్రమల పేరిట 40 వేల ఎకరాలు లాక్కునేలా ప్రణాళికలు చేస్తోందని హరీశ్రావు ఆరోపించారు.ప్రభుత్వానికి ఎందుకంత భయం?భూములు కోల్పోతున్న రైతులను పరామర్శించేందుకు వెళ్తుంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని హరీశ్ ప్రశ్నించారు. రేవంత్ పాలనలో ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పి నేడు ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తున్నారన్నారు. ప్రజా సమస్యలు మాట్లాడితే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తున్నారని, రాష్ట్రంలో నడుస్తున్న పోలీసు రాజ్యం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. రెండు మూడు పంటలు పండే పచ్చని భూముల్లో పరిశ్రమలు పెట్టాలనుకోవడం దారుణమని, కాళ్లాపూర్, రాపోలులో భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసేంత వరకు పోరాటం ఆగదన్నారు. రేవంత్ పాలన అంతా బోగస్ మాటలు, బోగస్ గ్యారంటీలు. రేవంత్ను మించిన రావణాసురుడు రాష్ట్రంలో మరొకరు లేరన్నారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ గెలిచే పరిస్థితి లేదని, కాంగ్రెస్కు సింగిల్ డిజిట్ సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. రేవంత్ మళ్లీ గెలవడం పగటి కల అని, వచ్చేది రామరాజ్యం, కేసీఆర్ రాజ్యమేనని హరీశ్రావు వ్యాఖ్యానించారు.హరీశ్రావు తదితరులు అరెస్టు..విడుదలపరిగి ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు బయల్దేరిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్ రావును నార్సింగి అప్పా జంక్షన్ వద్ద పోలీసులు అడ్డగించి అదుపులోకి తీసుకున్నారు. ఆయన వెంట బయలుదేరిన మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి తదితరులను లారీలు అడ్డుపెట్టి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అరెస్టు చేసిన నేతలను ఔటర్ రింగు రోడ్డు మీదుగా శంషాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. మంగళవారం ఉదయం నుంచే హరీశ్రావు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో ఆయన నివాసానికి పెద్ద ఎత్తున చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. శంషాబాద్ పోలీసు స్టేషన్ ఎదుట కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు బైఠాయించారు. మంగళవారం మధ్యాహ్నం హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి తదితరులను పోలీసులు విడుదల చేశారు. -
కేరళ, తెలంగాణ మధ్య ఎన్నికలు కావివి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు కేరళ, తెలంగాణల మధ్య కాదని, కేరళలోని యూడీఎఫ్, ఎల్డీఎఫ్ల మధ్య జరుగుతున్నాయన్న వాస్తవాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్ గ్రహించాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను విజయన్ ఎప్పుడైనా వచ్చి పరిశీలించవచ్చని పేర్కొన్నారు. ‘పినరయి విజయన్తో పాటు కేరళ కమ్యూనిస్టు మహిళా నేతలను కూడా నేను తెలంగాణకు ఆహా్వనిస్తున్నా. రాష్ట్రంలోని ఏ మూలకైనా వెళ్లి మేం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించవచ్చు. అతిథులుగా మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఎప్పుడైనా వచ్చి మా రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు..’అంటూ సవాల్ విసిరారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చివరి రోజు మంగళవారం..కోవలం, మాలవిక్కర, పతానపురం నియోజకవర్గాల్లో యూడీఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ రేవంత్ రోడ్షోలు నిర్వహించారు. ఈ రోడ్షోల్లో అలాగే అక్కడి మీడియాతో ముఖ్యమంత్రి మాట్లాడారు. విజయన్ హయాం ముగిసింది..: ‘కేరళలో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసిన ఘనత కాంగ్రెస్ సీఎంలు కరుణాకరన్, ఉమెన్ చాందీలదే. పినరయి విజయన్ హయాం ముగిసింది. ఆయన 120 నెలల పాలన వైఫల్యానికి ప్రతీకగా నిలిచింది. ఆయన వైదొలిగే సమయం ఆసన్నమైంది. మూడింట రెండొంతుల మెజార్టీతో కేరళలో యూడీఎఫ్ పాలన రాబోతోంది. విజయన్ గాడ్ఫాదర్ నరేంద్ర మోదీ ఢిల్లీలో ఉన్నారు. ఆయనే విజయన్ను కేసుల నుంచి ర క్షిస్తున్నారు. దేశం కోసం జీవితాలు, ఆస్తులను త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని, కేజ్రీవాల్తో సహా అనేక మంది నేతలను వేధిస్తున్న కేంద్రం.. విజయన్ జోలికి ఎందుకు వెళ్లడం లేదు? మోదీ, విజయన్ల మధ్య అవగాహనతోనే కేసులు, అరెస్టులు లేవు. వారిద్దరి బంధాన్ని కేరళ ప్రజలు అర్థం చేసుకున్నారు. పోలింగ్ బూత్కు వెళ్లి సరైన నిర్ణయం చెపుతారు..’అని సీఎం రేవంత్ అన్నారు. కొనసాగుతున్న లేఖల యుద్ధం కేరళ సీఎం విజయన్, తెలంగాణ సీఎం రేవంత్ల మధ్య మాటల యుద్ధం లేఖల రూపంలో సాగుతూనే ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ కేరళ వెళ్లి చేసిన వ్యాఖ్యలకు ‘ఎక్స్’వేదికగా విజయన్ కౌంటర్ ఇవ్వగా, విజయన్కు లేఖ రాస్తూ రేవంత్ అంతే ధీటుగా స్పందించారు. దీనికి మరోమారు విజయన్ లేఖ రూపంలో స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వగా రేవంత్ మరోసారి ప్రతి లేఖ రాశారు. ‘కేరళ ప్రభుత్వ పనితీరుపై నేను గౌరవంగా, హుందాగా స్పందించాలని అనుకున్నా. కానీ మీ ప్రతిస్పందనలో అభ్యంతరకరమైన భాషను వాడారు. నేనెప్పుడూ ప్రత్యర్థుల తొందరపాటు వ్యాఖ్యలపై ఆవేశపూరితంగా స్పందించను. అయితే మీరు నీతి ఆయోగ్ ఇచ్చిన 2023–24 నివేదికను ఉదహరిస్తున్నారు. ఆ సమయంలో మేం అధికారంలో లేము. అది బీఆర్ఎస్, బీజేపీల పదేళ్ల దుష్పరిపాలనలో చివరి దశ. మేం అధికారంలోకి వచ్చిన 28 నెలల్లో ఏం జరిగిందనే దాన్ని ఆధారంగా చేసుకుని మమ్మల్ని అంచనా వేయండి. తలసరి ఆదాయం, జీఎస్డీపీ తదితర ఆర్థిక సూచీల్లో ఆర్బీఐ హ్యాండ్బుక్ 2024–25 గణాంకాల ప్రకారం కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలను తెలంగాణ అధిగమించింది. దేశంలోనే ముందు స్థానంలో నిలిచింది. బంగారం స్మగ్లింగ్ కేసు ఏమైంది? నీతి ఆయోగ్ ఇచ్చిన అవినీతి ర్యాంకులను కూడా నేను గౌరవిస్తాను. కానీ మీ ప్రభుత్వం స్వచ్ఛమైనది అయితే బంగారం స్మగ్లింగ్ కేసు ఎందుకు అపరిష్కృతంగా మిగిలిపోయింది. మీ కార్యాలయంలోని ఉన్నతాధికారులు, కీలక వ్యక్తులకు సంబంధాలున్నాయని ఆధారాలతో సహా బయటపడినా చర్యలేవి? శబరిమల అయ్యప్ప ఆలయం నుంచి 4.5 కిలోల బంగారం అక్రమ తరలింపు ఆరోపణలకు ఎందుకు జవాబు చెప్పడం లేదు? మా ప్రభుత్వం తెలంగాణ రైజింగ్–2047 దార్శనికతతో ముందెకెళుతోంది. అలాగే కేరళలో రాబోయే కొద్ది రోజుల్లో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం ’నవ కేరళ’దార్శనికతను అమలు చేస్తుందని నేను బలంగా విశ్వసిస్తున్నాను. కేరళ ప్రజలు త్వరలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకుంటారు. జరగాల్సింది కూడా అదే..’అని రేవంత్ ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా కేరళ ఎన్నికల ప్రచారం ముగించిన సీఎం హైదరాబాద్ చేరుకున్నారు. -
రేవంత్ సర్కార్పై IASల అసహనం
-
‘రేవంత్.. మళ్లీ గెలవడం కాదు.. సింగిల్ డిజిటే మీకు’
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి హరీష్రావు ధ్వజమెత్తారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటూ సీఎం రేవంత్ చేసే వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించారు హరీష్రావు. కాంగ్రెస్ మళ్లీ గెలవడం కాదు.. సింగిల్ డిజిట్కే పరిమితం అంటూ ఎద్దేవా చేశారు. ఈరోజు(మంగళవారం, ఏప్రిల్ 7వ తేదీ) పరిగి పర్యటనకు వెళ్తున్న హరీష్రావును పోలీసులు అరెస్ట్ చేసి శంషాబాద్ పీఎస్కు తరలించారు. దీనిలో భాగంగా ఆయన్ను విడుదల చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు హరీష్. ‘మీరు మళ్లీ గెలవడం కాదు కదా.. ఈసారి సింగిల్ డిజిటే మీకు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ సింగిల్ డిజిట్కే పరిమితం అవ్వడం ఖాయం. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా?, పరిగిలో రైతులను పరామర్శించేందుకు వెళ్తుంటే మమ్మల్ని అరెస్టు చేశారు. రేవంత్ రెడ్డి పాలన.. గడీల పాలన... బేడీల పాలన గుడ్డి పాలన. సాగుకు పనికిరాని భూముల్లో పరిశ్రమలు పెట్టండి. ఎస్సీ ఎస్టీ రైతులు సాగు చేసుకుంటున్నా భూములను ఎందుకు లాక్కుంటున్నారు. మీ పాలన అంతా బోగస్ మాటలు బోగస్ పాలన. రేవంత్ రెడ్డికి మించిన రావణాసురుడు ఎవరైనా ఉన్నారా?, పరిగిలో భూముల లాక్కొని తన అన్య కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 6 గ్యారెంటీలు 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు 900 రోజులైనా ఎందుకు పూర్తి చేయలేదు?, వచ్చే ఎన్నికల్లో రాబోయే కేసీఆర్ రాజ్యమే’ అని హరీష్ స్పష్టం చేశారు. -
మీ డేటా పాతది
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి, కేరళ సీఎం విజయన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ చేసిన వ్యాఖ్యలకు ఎక్స్ వేదికగా విజయన్ ఘాటుగా స్పందించగా, ఆ వ్యాఖ్యలకు దీటుగా బదులిస్తూ రేవంత్ మరింత ఘాటైన లేఖ రాశారు. అను భవజ్ఞులైన రాజకీయ నాయకుడనే గౌరవంతో ఎక్స్ వేదికగా మీ స్పందనను చదివానని, అందులో తప్పుదారి పట్టించే అంశాలతోపాటు ముఖ్యాంశాల్లో లోపాలు కనిపించాయని, రెండు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల దృష్ట్యా నిజాలను తెలియజేయడం తన బాధ్యతగా భావిస్తూ ఈ లేఖ రాస్తున్నట్టు పేర్కొన్నారు. అన్ని అంశాలపై చర్చించేందుకు ఈనెల 7న త్రివేండ్రంకు వస్తానని, అన్ని విషయాలపై గణాంకాలతో సహా చర్చ జరుపుదామని విజయన్ను ఆహ్వానించారు. లేఖలో ఏముందంటే...⇒ నేను కేరళ వ్యవస్థలను ఎక్కడా తప్పుపట్టలేదు. మీ ఎల్డీఎఫ్ పాలనలోని లోపాలను మాత్రమే ఎత్తిచూపాను. ⇒ మీరు నీతిఆయోగ్ ఇచ్చిన ఎస్డీజీ 2023–24 గురించి మాట్లాడారు. కానీ ఆ డేటా పాతది. తెలంగాణను వినాశనం చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాలన చరమాంకంలో ఇచ్చిన గణాంకాలను పట్టుకుని మా ప్రభుత్వం గురించి చెబుతున్నారు. 2023, డిసెంబర్లో ఆ పాలన అయిపోయింది. ⇒ 2025 తర్వాతి కాలంలో దేశంలోనే సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా కేరళ నిలుస్తుందని మీ పోస్ట్లో చెప్పారు. మరి ఇప్పుడు 2026, ఏప్రిల్ నడుస్తోంది. మీ రాష్ట్రం 100 శాతం అక్షరాస్యత సాధించిందా? ⇒ కేరళలో పేదరికం తెలంగాణ కంటే తక్కువ స్థాయిలో ఉందన్నది వాస్తవమే. కానీ అది 60 కంటే ఎక్కువ సంవత్సరాల ప్రగతిశీల పాలన ద్వారా సాధ్యమైంది. గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన గణనీయ సంపద ద్వారా జరిగింది. 12 ఏళ్ల తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ–బీఆర్ఎస్ ద్వారా వారసత్వంగా పేదరికం వచ్చింది. అయితే, 60 ఏళ్ల తర్వాత మీరెక్కడున్నారు... అధికారంలోకి వచ్చిన 28 నెలల్లో మేమేం సాధించామన్నది ప్రశ్న.⇒ కాంగ్రెస్ పార్టీనే బీజేపీకి బీ–టీం అని అసంబద్ధ ఆరోపణ చేశారు. 2020లో జరిగిన కేరళ బంగారం కుంభకోణంలో స్వయంగా మీ ముఖ్య కార్యదర్శిని ఈడీ అరెస్టు చేసింది. కీలక నిందితుడు నేరుగా మీ కార్యాలయ ప్రమేయం గురించి దర్యాప్తు సంస్థలకు చెప్పాడు. ఈ విషయంలో ఈడీ జరిపిన సోదాలు, సీబీఐ విచారణలో ఎక్కడా కేరళ సీఎం కార్యాలయానికి ఉన్న లింకుల గురించి ప్రస్తావనకు రాలేదు. కానీ గాంధీ కుటుంబాన్ని మాత్రం ఢిల్లీ పెద్దలు నిత్యం వేధిస్తున్నారు. ఎవరు ఎవరికి బీ–టీం అనేది కేరళ ప్రజల విజ్ఞతకు వదిలేస్తున్నా. ⇒ మా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తున్నాం. బీజేపీ–బీఆర్ఎస్ల వాట్సాప్ అభిప్రాయాలను వల్లించకుండా మేం జీతాలు ఇస్తున్నామో లేదో తెలుసుకునేందుకు ఓ బృందాన్ని పంపి స్వతంత్రంగా విచారించుకోండి. ⇒ తలసరి ఆదాయంలో మాది దేశంలోనే రెండో స్థానం. దక్షిణాదిలోనే కాదు పెద్ద రాష్ట్రాల్లోనూ మేమే నంబర్వన్. దేశంలో భౌగోళికంగా 3.5 శాతం, జనాభా పరంగా 3 శాతం కూడా లేని తెలంగాణ జీడీపీలో 5 శాతం పాలుపంచుకుంటోంది. ⇒ మీ రాష్ట్రంలో చురుకైన యువత ఉండటం మీకు అదనపు వనరు. సుమారు 35 లక్షల మంది కేరళీయులు విదేశాల్లో ఉంటున్నారు. ఏటా 1.5 లక్షల కోట్లు వారి ద్వారా వస్తున్నాయని అంచనా. పశ్చిమాసియా భగ్గుమంటున్నా గల్ఫ్ దేశాల్లో ఉన్న మలయాళీల్లో ఒక్కరూ తిరిగి రాష్ట్రానికి రాలేదంటే కారణం మీ రాష్ట్రంలో ఉద్యోగాలు లేకపోవడమే.⇒ మీరు ఆరోపించినట్టు బుల్డోజర్లు ఏ పేద కుటుంబాన్నీ నష్టపర్చలేదు. బుల్డోజర్ బాధితులంటూ మీరు ఆరోపణలు చేసిన వారికి డబుల్బెడ్రూం ఇళ్లు, ఆర్థిక సాయం, మార్కెట్విలువ కంటే ఎక్కువ పరిహారం చెల్లించాం. ⇒ చివరగా మీ పాలన వద్దని,∙కాంగ్రెస్ మోడల్ను కేరళ ప్రజలు కోరుకుంటున్నారు. -
రూ.3 వేల కోట్ల విలువైన భూములను కొల్లగొట్టే కుట్ర
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘అసైన్డ్ భూములకు పట్టాలిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ తర్వాత కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చి.. సెటిల్మెంట్లకు దిగుతోంది. ఇప్పటికే నాదర్గుల్లోని రూ.7 వేల కోట్ల విలువైన భూములను కొల్లగొట్టేందుకు యత్నించిన ప్రభుత్వ పెద్దలు.. తాజాగా కోహెడలోని మరో రూ.3 వేల కోట్ల విలువ చేసే 200 ఎకరాల పండ్ల మార్కెట్ భూములను కూడా తమ అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు’అని మాజీమంత్రి హరీశ్రావు ఆరోపించారు. ఎమ్మెల్యేలు పి.సబితారెడ్డి, దేవిరెడ్డి సుధీర్రెడ్డి, కాలేరు వెంకటేశ్, బండారు లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నేత క్యామ మల్లేశ్తో కలిసి సోమవారం ఆయన కోహెడలో పర్యటించారు. అనంతరం హరీశ్రావు మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. భూములను కొల్లగొట్టేందుకే‘కొత్తపేటలోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోహెడలో అంతర్జాతీయ ప్రమాణాలతో పండ్ల మార్కెట్ను కట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ఆ మేరకు 2020లో జీఓ నంబర్ 11 తీసుకొచ్చి మార్కెట్ను నోటిఫై చేశాం. భూములు కోల్పోయిన రైతులకు రూ.10 కోట్ల నష్టపరిహారం కూడా చెల్లించాం. జీఓ నంబర్ 216 ద్వారా మార్కెట్ ఖాతాలో రూ.350 కోట్లు జమ చేశాం.రూ.1,000 కోట్ల అంచనాలతో అత్యాధునిక మార్కెట్ యార్డ్కు డీపీఆర్ కూడా సిద్ధం చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటింది. ఇప్పటి వరకు తట్టెడు మట్టి తీయలేదు. టీజీఐఐసీ పేరుతో విలువైన ఈ భూములను తమ అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇది పూర్తిగా రైతుల సమస్య. ఏ ప్రభుత్వమైనా రైతుల కోసం పని చేయాలి. కానీ సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కమీషన్ల కోసం పనిచేస్తోంది. ‘దిల్’భూములను మార్కెట్కెలా కేటాయిస్తారు?ఇక్కడ భూములకు ప్రత్యామ్నాయంగా దిల్ భూముల్లో మార్కెట్ కట్టిస్తాం అంటున్నారు. ఏపీ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలోని డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(దిల్) భూములపై అనేక వివాదాలు ఉన్నాయి. వీటిలో ఏపీ వాటా అడుగుతోంది. ఈ భూములపై కోర్టు కేసులు కూడా ఉన్నాయి. పలువురు పేద రైతులు ఈ భూములపై ఆధారపడి ఉన్నారు. ఎలాంటి వివాదాలు లేని భూములను అనుయా యులకు అప్పగించి.. వివాదాస్పద దిల్ భూములను మార్కెట్కు ఎలా కేటాయిస్తారు? రేవంత్రెడ్డి ప్రభుత్వం కన్ను కోహెడ భూములపై పడింది. ఇప్పటికే లీలా హోటల్ కేంద్రంగా కేరళకు చెందిన నలుగురు దళారులు వీటిని కొల్లగొట్టే ప్రయత్నం మొదలు పెట్టారు. 30 వేల మంది రైతులు కావాలో? లేక ముగ్గురు దళారులు కావాలో? ప్రభుత్వమే తేల్చుకో వాల్సి ఉంది. ఇక్కడ మార్కెట్ నిర్మించకపోతే ఎంత దూరమైనా పోరాడుతాం. రైతుల పక్షాన కొట్లాడుతాం’అని హరీశ్రావు స్పష్టం చేశారు. -
కేరళకు సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి కేరళ వెళ్లారు. ఆయన మంగళవారం మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.ఉదయం 8.30 గంటలకు కోవలం నియోజకవర్గంలో రోడ్ షో, 10.30 గంటలకు మావెలికరలో రోడ్ షో, మధ్యాహ్నం 2 గంటలకు పతానపురం రోడ్ షోలో రేవంత్ పాల్గొంటారని ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. -
‘భవ్య బాసర’కు భూమిపూజ
నిర్మల్: దేశంలోని ఏకైక సరస్వతీ క్షేత్రమైన బాసరను భవ్యమైన ఆలయంగా పునరాభివృద్ధి చేసేందుకు రూ.225 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ఆ పనులకు సోమవారం భూమిపూజ నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్, బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అలాగే ముధోల్ నియోజకవర్గంలో రూ.200 కోట్లతో నిర్మించే యంగ్ ఇండియా స్కూల్కు సీఎం శంకుస్థాపన చేశారు.కుటుంబసభ్యులు, మంత్రులతో కలిసి..ముఖ్యమంత్రి ఉదయం 11.42 గంటలకు సతీమణి గీతారెడ్డి, కుమార్తె, అల్లుడు, మనవడు రియాన్ష్ , మంత్రులతో కలిసి రెండు హెలికాప్టర్లలో బాసరకు చేరుకున్నారు. ముందుగా ఆలయంలో అమ్మవారి ఎదుట వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య రియాన్ష్ కు తన సతీమణితో కలిసి అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం సరస్వతీ, మహాలక్ష్మీ, మహంకాళీ అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ అర్చకుల నుంచి వేద ఆశ్వీరచనం, దేవాదాయ శాఖ అధికారుల సత్కారం స్వీకరించారు. తర్వాత మంత్రులతో కలిసి ఆలయ ప్రాంగణంలో తూర్పు ముఖద్వారం పక్కన మాస్టర్ప్లాన్ ప్రకారం చేపట్టనున్న విశాలమైన నూతన ఆలయానికి భూమిపూజ నిర్వహించారు.అక్కడే యంగ్ ఇండియా స్కూల్కు కూడా శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీలు గొడం నగేశ్, వేం నరేందర్రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, ఖానాపూర్ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్, ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్సీలు దండె విఠల్, చిన్నమైల్ అంజిరెడ్డి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీ షర్మిల, ఆలయ ఇన్చార్జి ఈవో విజయరామారావు తదితరులు పాల్గొన్నారు.ముఖ్యమంత్రి మౌనంబాసర పర్యటనలో సీఎం రేవంత్రెడ్డి ఎక్కడా మాట్లాడలేదు. మీడియాను ఆలయంలోకి అనుమతించలేదు. బాసరలోనే ఉన్న ట్రిపుల్ ఐటీ సమస్యలపై స్పందిస్తారని, నిర్మల్ జిల్లాలో ఏర్పాటు చేస్తానన్న యూనివర్సిటీ గురించి ముఖ్యమంత్రి మాట్లాడతారని భావించినా భూమిపూజ, మనవడి అక్షరాభ్యాస కార్యక్రమాలకే పరిమితమయ్యారు. లంచ్ టైమ్లో కాసేపు నిర్మల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో మాట్లాడారు. -
2034 వరకు మా సర్కారే: సీఎం రేవంత్
సాక్షి, ఆదిలాబాద్: ‘మళ్లీ వచ్చేది మా ప్రభుత్వమే.. 2034 వరకు ప్రజా ప్రభుత్వమే కొనసాగుతుంది.. మీ బాగోతం ప్రజలు చూశారు.. మళ్లీ గడీల పాలన కావాలని ఎవరూ కోరుకోరు. పదేళ్లలో మీరు చేయ లేని ఎన్నో గొప్ప పనులు మా ప్రభుత్వం చేసింది.. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి..’ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ‘అడ్డు పడడానికి ఊరూరా తిరగడం కాదు.. ఎంతసేపూ లొల్లి పెట్టాలి.. యాగీ చేయాలనే దృక్పథంతోనే వెళ్తున్నారు..’ అంటూ విపక్ష బీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పదేళ్లలో ఇలాంటి సంప్రదాయం చూశారా? ‘పీసీసీ అధ్యక్షుడిగా అప్పట్లో నిర్మల్లో నిరసన తెలిపినా, ఇంద్రవెల్లిలో దండోరా పెట్టినా.. భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నిర్వహించినా.. ప్రజా సమస్యలను పరిష్కరించాలనే ఉక్కు సంకల్పంతోనే పోరాటం కొనసాగించాం. ఎన్ని కేసులు పెట్టినా కొట్లాడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాం. ఎన్నికలప్పుడే రాజకీయాలు.. అభివృద్ధి విషయంలో అందరినీ కలుపుకొని ముందుకెళ్తాం. అందుకే పార్టీలకు అతీతంగా ఈ సభలకు ఆహ్వానించాం. గత పదేళ్లలో తెలంగాణలో ఇలాంటి సాంప్రదాయం ఎప్పుడైనా చూశారా?. ఇక్కడ కాంగ్రెస్ శాసనసభ్యులు లేకపోయినా బోథ్లో, నిర్మల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను మంజూరు చేశాం. మా ఎమ్మెల్యేలు లేకపోయినా ప్రజలు నష్టపోకూడదని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నాం. పార్టీలు చూడకుండా, ప్రజల కష్టాలు చూసి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. జూన్ 2 నాటికి ఎయిర్పోర్టుకు శంకుస్థాపన బాసర జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు మంజూరు చేశాం. అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేస్తాం. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తాం. త్వరలోనే వీలైతే జూన్ 2 నాటికి ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణానికి శిలాఫలకం వేసేలా చూస్తాం. ఆదిలాబాద్ ప్రాంతాన్ని పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. ఆదిలాబాద్లో యూనివర్సిటీకి సంబంధించి భూసేకరణ చేపట్టాం. త్వరలోనే శంకుస్థాపన చేస్తాం. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు అభ్యర్థన మేరకు గూడెం సత్యనారాయణస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. డిసెంబర్లో ఇందిరమ్మ చీరలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఏమేం కావాలో అంచనాలు సిద్ధం చేస్తున్నాం. తెలంగాణ ఆడపడుచులకు వచ్చే డిసెంబర్లో ఇందిరమ్మ చీరలు అందజేస్తాం.. చిలుకపచ్చ రంగు చీరలు అందిస్తాం. పేదల కళ్లల్లో ఆనందం చూడాలన్నదే మా ప్రయత్నం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సన్న బియ్యం పంపిణీ ‘రాష్ట్రంలో రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. ఇప్పటివరకు దాదాపు రూ.5,400 కోట్లు ఆ ఇళ్లు కట్టుకునే పేదల ఖాతాల్లో వేశాం. ఎన్నడైనా గత ప్రభుత్వం ఇలాంటి ఆలోచన చేసిందా?. సన్న బియ్యంతో పేదల కడుపు నింపాలనే ఆలోచన ఎప్పుడైనా చేసిందా?. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మా ప్రభుత్వం సన్న బియ్యం అందిస్తోంది. మా ఆడబిడ్డల ఉచిత బస్సు ప్రయాణానికి రూ.10 వేల కోట్లు ఖర్చు చేశాం. మహిళా స్వయం సహాయక సంఘాలు (ఎస్హెచ్జీలు) తయారు చేసిన ఉత్పత్తుల మార్కెటింగ్కు హైటెక్ సిటీలో షాపులు కేటాయించాం..’ అని సీఎం తెలిపారు. పిప్రిలో సభ సీఎం ఆలోచనే: డిప్యూటీ సీఎం ‘పిప్రిలో బహిరంగ సభ నిర్వహించాలన్నది సీఎం రేవంత్రెడ్డి ఆలోచనే.. నా ఆలోచన కాదు..’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలకు సంబంధించి చర్చిస్తున్న క్రమంలో.. ప్రభుత్వం నిర్వహిస్తున్న 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా భారీ బహిరంగ సభ నిర్వహిద్దామని సీఎం అన్నారని చెప్పారు. పిప్రి నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేపట్టి ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు వాటిని మంజూరు చేసి అమలు చేయాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారని వెల్లడించారు. ఆనాడు మండుటెండలో తనతో నడిచి పాదయాత్రను విజయవంతం చేశారని, ఈరోజు కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారని అన్నారు. ఇది రాజకీయ సభ కాదని ఆనాడు ప్రజలతో ఏర్పర్చుకున్న అనుబంధానికి నిదర్శనం ఈ సభ అని భట్టి చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో మంత్రులందరం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని, అంతరాలు లేని సమాజ నిర్మాణమే తమ లక్ష్యమని చెప్పారు. ఆనాడు టీపీసీసీ అధ్యక్షుడిగా సీఎం రేవంత్రెడ్డి, సీఎల్పీ నేతగా మల్లుభట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రలు, బహిరంగ సభలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి దోహద పడ్డాయని ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ అన్నారు. అప్పట్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ తెలంగాణను మేటి రాష్ట్రంగా నిలుపుతున్నారని అభినందించారు. వచ్చే ఎన్నికల్లో వందకు పైగా సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. భట్టి పాదయాత్రకు మూడేళ్లు పూర్తి ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క, సీఎల్పీ నేతగా రాష్ట్రంలో చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని.. ఆనాడు భట్టి పాదయాత్ర ప్రారంభించిన పిప్రిలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక బహిరంగ సభను ప్రభుత్వం నిర్వహించింది. కాగా అప్పట్లో ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి రూ.614 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఎస్హెచ్జీల మహిళలకు వడ్డీలేని రుణాలు పంపిణీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ ఎంపీ వేం నరేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రేమ్సాగర్రావు, వెడ్మ బొజ్జు, మాలోత్ రాందాస్, ఎమ్మెల్సీ దండే విఠల్, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, విజయరమణారావు, బీజేపీ ఎంపీ గొడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి, కేంద్ర మాజీమంత్రి వేణుగోపాలచారి తదితరులు పాల్గొన్నారు. -
బాసరలో రేవంత్ ప్రత్యేక పూజలు.. మనవడికి అక్షరాభ్యాసం
సాక్షి, నిర్మల్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్మల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబంతో కలిసి బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు సీఎంకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం దంపతులు తమ మనవడు రియాన్ష్కు అక్షరాభ్యాసం చేయించారు.ఇక, దర్శనం అనంతరం బాసర ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి భూమి పూజ చేయనున్నారు. బాసర పుణ్యక్షేత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూ.225 కోట్లతో పునర్ నిర్మాణ పనులకు నేడు శ్రీకారం చుట్టనుంది. ప్రాచీన ఆలయం కావడం, ఏటేటా పెరుగుతున్న భక్తుల సంఖ్యకు తగినట్లు అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో బాసర ఆలయ అభివృద్ధి చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి పనులు చేపట్టేందుకు అధికారులు మాస్టర్ ప్లాన్ రూపొందించారు.బాసర పర్యటన ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పిప్రి చేరుకోనున్నారు. భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా పిప్రిలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగిస్తారు. -
కాంగ్రెస్ పెద్దల చెరలో 373 ఎకరాలు: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లో రూ.7 వేల కోట్ల విలువైన భారీ భూ కుంభకోణం జరుగుతోందని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఆరోపించారు. ప్రభుత్వ భూమిపై కన్నేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కుటుంబం 373 ఎకరాల భూమిని ఆక్రమించిందన్నారు. తెలంగాణభవన్లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్రావు మాట్లాడారు. నాదర్గుల్లోని సర్వే నంబర్ 613 (కొత్త సర్వే నంబర్ 119)లో ఉన్న 373 ఎకరాల భూమి ప్రభుత్వానికి చెందినదేనని గతంలోనే స్పష్టమైందన్నారు. ఈ భూములను ప్రభుత్వ భూములుగా డిక్లేర్ చేయాలని ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు లేఖ రాయగా, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో వీటిని ప్రభుత్వ భూములుగా అసెంబ్లీలో ప్రకటించి ఏపీఐఐసీకి అప్పగించారని తెలిపారు.2022 అక్టోబర్ 13న హైకోర్టు సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ కూడా ఈ భూముల క్రయవిక్రయాలు చెల్లవని స్పష్టం చేశాయని వివరించారు. విక్రయాల్లో పాల్గొన్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించిందన్నారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో జస్టిస్ పంకజ్మిట్టల్, జస్టిస్ ప్రసన్న ధర్మాసనం ముందు ఈనెల 7న విచారణకు ఉందని తెలిపారు. సుప్రీంకోర్టులో ఎలాంటి స్టే లేదని, కాబట్టి హైకోర్టు తీర్పే అమల్లో ఉందని చెప్పారు. ల్యాండ్ సీలింగ్ చట్టానికి విరుద్ధంగా విక్రయాలు ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం ఒక వ్యక్తికి 373 ఎకరాలు ఉండే అవకాశం లేదని, అయినా శివరాజ్ బహదూర్ 2016లో ఈ భూములను ఆల్ఫా, ఒమేగా, యునిటెక్ కంపెనీలకు విక్రయించాడని ఆరోపించారు. సెక్షన్ 8, 17 ప్రకారం డిక్లరేషన్ లేకుండా విక్రయం చెల్లదని, సెక్షన్ 22ఏ కింద ఈ భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయని కందుకూరు ఆర్డీఓ స్పష్టం చేశారని చెప్పారు. ఈ భూముల్లో సుమారు 600 మంది పేద రైతులు తాతముత్తాతల కాలం నుంచి సాగు చేస్తున్నారని వివరించారు. ప్రస్తుతం వారిని భూముల్లోకి రానివ్వకుండా బౌన్సర్లు, రౌడీలను పెట్టి దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. మహిళా రైతులు కౌసల్య, మమతలను బెదిరిస్తూ, రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు ఆఫర్ చేసి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, బోర్లు, కంచెలను ధ్వంసం చేశారని చెప్పారు. మంత్రి పొంగులేటి కుటుంబ హస్తం ఈ కబ్జాల వెనుక సాక్షాత్తూ మంత్రి పొంగులేటి కుటుంబం ఉందని హరీశ్రావు ఆరోపించారు. శిల్పా ఇన్ఫ్రా, శిల్పా రాఘవ ఎల్ఎల్పీ, ఎక్యూ స్కై్వర్ రియల్టర్స్ వంటి సంస్థల్లో మంత్రి కుమారుడు హర్షారెడ్డి తదితరులు డైరెక్టర్లుగా ఉన్నారన్నారు. కోహినూర్ గ్రూప్, శిల్పా ఇన్ఫ్రా, మెగా కంపెనీ పేర్లతో బోర్డులు మారుస్తూ భూములను ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. ‘చెరువులను కాపాడుతున్నానని చెప్పే సీఎం రేవంత్రెడ్డికి ఈ ఆక్రమణలు కనిపించవా? ప్రతిపక్షాలపై సిట్లు వేస్తారు కానీ ఇక్కడ ఎందుకు స్పందించరు’అని ప్రశ్నించారు. తక్షణమే హైడ్రా ద్వారా అక్రమ కాంపౌండ్ వాల్ను కూల్చాలని, ఆక్రమణదారులను అరెస్ట్ చేయాలని, రైతులను తిరిగి భూముల్లోకి అనుమతించాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. రేపు ఉదయం వరకు హైడ్రా కమిషనర్ చర్యలు తీసుకోకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి నాదర్గుల్కు వెళ్లి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. -
రాజ్యాంగం సజీవం
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగం సజీవంగా ఉండాలంటే న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు ఒకే లక్ష్యంతో పనిచేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో నిర్మించే నూతన హైకోర్టు జోన్–2 భవన నిర్మాణ పనులకు ఆదివారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితోపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్వీ భట్టి, జస్టిస్ అలోక్ అరాధే, హైకోర్టు సీజే జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్తో కలసి భూమిపూజ నిర్వహించారు. అనంతరం సీజేఐ మాట్లాడారు. ఈ కార్యక్రమం లాంఛనం కాదని.. రాజ్యాంగ విధి అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దశాబ్ద కల కార్యరూపం దాలుస్తోందని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వ సహకారం అభినందనీయమన్నారు. మౌలిక సదుపాయాల కల్పన తప్పనిసరి..: ‘న్యాయవ్యవస్థలో నా సుదీర్ఘ వృత్తి జీవితంలో నేను ఒకటి నమ్ముతాను. ప్రతి కార్యానికి మూడు దశలు ఉంటాయి. ప్రారంభం ఉద్దేశాన్ని వెల్లడిస్తుంది. మధ్యభాగం పట్టుదలను ప్రదర్శిస్తుంది. ముగింపు వాగ్దానం నెరవేరిందా లేదా అనేది తెలియజేస్తుంది. ప్రజలంతా న్యాయపీఠం, చిహ్నం, కార్యకలాపాలను మాత్రమే చూస్తారు. అదే మనకు కనిపించే న్యాయవ్యవస్థ. కానీ ప్రతి కోర్టు గది వెనుక దాన్ని నడిపించే ఓ ప్రపంచం ఉంటుంది. అక్కడే న్యాయమూర్తులు నివసిస్తారు.. శిక్షణ పొందుతారు.. తీర్పులు భద్రపరుస్తారు.. ఈరోజు దానికి మనం పునాది వేస్తున్నాం. మనం ఇక్కడికి రావడం లాంఛనం కాదు.. రాజ్యాంగ విధి. న్యాయం అందరికీ అందుబాటులో ఉండాలన్న సూత్రాన్ని రాజ్యాంగ నిర్మాతలు విశ్వసించారు. ప్రతి రాష్ట్రంలో ఓ హైకోర్టు ఏర్పాటు చట్టపరమైన అవసరమే కాకుండా గణతంత్ర రాజ్య నిబద్ధతగా ఎప్పుడూ భావిస్తాను. అలాంటి నిబద్ధతకు.. అందుకు ఆధారమైన మౌలిక సదుపాయాలు ఉన్నంత వరకే అర్థం ఉంటుంది. అది లేకుంటే కేవలం కాగితాల్లోనే మిగిలిపోతుంది. తెలంగాణలో అది నిర్ధిష్ట రూపాన్ని సంతరించుకుంటోంది. జోన్–1లో పనులు చురుగ్గా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ భవనాలు ఓపక్క రూపుదిద్దుకుంటుండగానే జోన్–2 మొదలవుతోంది. న్యాయవ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వం సమాంతరంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాయి. అది సరైనదే. ప్రస్తుత భవనం చారిత్రాక కట్టడం అయినప్పటికీ ప్రస్తుత అవసరాలకు సరిపోవడం లేదు. రాబోయే వందేళ్ల అవసరాలు తీర్చే మౌలిక సదుపాయాలను కల్పించడం ఓ లక్ష్యం మాత్రమే కాదు.. తప్పనిసరి. కోర్టు గదులతోపాటు జోన్–2 కూడా అంతే ముఖ్యం. చెట్టులో మనకు కొమ్మలు, ఎత్తు మాత్రమే కనిపిస్తాయి. కానీ తుపాను వచ్చినప్పుడు వేర్లు మాత్రమే దాన్ని కాపాడతాయి. జోన్–2 న్యాయవ్యవస్థకు వేర్లలాంటింది’అని పేర్కొన్నారు. దశాబ్దం తర్వాత కార్యరూపం.. ‘హైకోర్టు రోజువారీ కార్యకలాపాలు తన నియంత్రణలో లేని ఏర్పాట్లపై ఆధారపడి ఉంటుంది. ఈ 100 ఎకరాల ప్రాంగణం ఆ పరిస్థితిని మారుస్తుంది. సంస్థాగత స్వయం సమృద్ధిని సిద్ధాంతం నుంచి ఆచరణలోకి తీసుకొచ్చినప్పుడు అది ఇలానే కనిపిస్తుంది. ఇక్కడ నిర్మించబోయే ఆడిటోరియంలో న్యాయవ్యవస్థకు శిక్షణా కార్యక్రమాలు, పౌరుల కోసం న్యాయ అవగాహన శిబిరాలు నిర్వహించడం శుభ పరిణామం. సెంట్రల్ రికార్డ్ రూమ్.. తీర్పులను భద్రపర్చడం అత్యంత ప్రాధాన్యం. ప్రస్తుత హైకోర్టులో 2009లో చోటుచేసుకున్న ఓ అగ్నిప్రమాదం కొత్త భవన నిర్మాణానికి బీజం వేసింది. ఫుల్ కోర్టు ఆమోదం, హైకోర్టు చీఫ్ జస్టిస్ల ప్రస్తావనతో దశాబ్దం తర్వాత కార్యరూపం దాల్చింది. తెలంగాణతోపాటు పలు రాష్ట్రాలు న్యాయ వ్యవస్థకు సదుపాయాల కల్పనకు ముందు వస్తున్నాయి. అత్యంత అవశ్యకం అని గుర్తిస్తున్నాయి. ఇది గొప్ప విషయం. రూ. 2,583 కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వ సహకారాన్ని అభినందిస్తున్నా. న్యాయవ్యవస్థ, కార్యనిర్వహక వ్యవస్థ ఒకే లక్ష్యంతో పనిచేస్తే రాజ్యాంగం నిజంగా సజీవంగా నిలుస్తుంది. ఇక్కడి నుంచి తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్తుకు మార్గదర్శకం కావాలి’అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆకాంక్షించారు. రాబోయే వందేళ్లకు న్యాయ వేదిక: సీఎం రేవంత్రెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడుతూ ‘ఇదో ప్రత్యేకమైన రోజు. మన దేశంలో దేవాలయం, మసీదు, చర్చి, గురుద్వారా నిర్మించడం గొప్ప విషయం. కానీ న్యాయం కోసం ఓ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడమంటే అన్ని మతాల ప్రజల కోసం ఓ పవిత్ర స్థలాన్ని నిర్మించినట్లే. మన ప్రజాస్వామ్యంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు పరస్పర ఆధారితంగా, గౌరవంగా పనిచేస్తాయి. సామాన్య పౌరుడికి కోర్టు ఓ చివరి ఆశ. తెలంగాణ కోసం కొత్త హైకోర్టు నిర్మాణాన్ని ప్రారంభించడం మా ప్రభుత్వానికో గొప్ప అవకాశం. ఈ భవనం సమాజానికి, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. రాబోయే వందేళ్లపాటు పేదలు, బలహీనులు న్యాయం కోసం వచ్చే వేదికగా సేవలందిస్తుంది. ఇది మా ప్రభుత్వ ప్రజాస్వామ్య విలువలకు ప్రతిబింబం. వ్యవస్థలు పరస్పర గౌరవంతో, సహకారంతో పనిచేయాలి. ఈ భవనం దేశంలోని అతిపెద్ద హైకోర్టు సముదాయాల్లో ఒకటి మాత్రమే కాదు.. అత్యాధునిక, మౌలికవసతుల ప్రమాణంగా ప్రఖ్యాతి చెందుతుంది. అందుకే ప్రభుత్వం ఏర్పడగానే రాజేంద్రనగర్లో 100 ఎకరాల భూమిని కేటాయించాం. జోన్–1 పనులు శరవేగంగా సాగుతున్నాయి. జోన్–2 పనులను కూడా 2027 డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేస్తాం. తీర్పులకే కాదు.. న్యాయ వ్యవస్థ అభిప్రాయాలకూ అత్యున్నత గౌరవం ఇస్తాం’అని వెల్లడించారు. ప్రతి వ్యక్తికి భరోసా కల్పించాలి: జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్ మాట్లాడుతూ ‘ప్రధాన కోర్టు సముదాయం, కార్యాలయ భవనాల జోన్–1 ఇప్పటికే ప్రారంభమైంది. ఇప్పుడు నివాస బంగళాలు, అనుబంధ నిర్మాణాలు, ఆడిటోరియం, సెంట్రల్ రికార్డ్ రూమ్.. జోన్–2ను ఇప్పుడు ప్రారంభించుకుంటున్నాం. కోర్టులు ఆస్పత్రుల్లా పనిచేయాలని సీజేఐ ఇటీవల చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యం. అక్కడికి వచ్చే ప్రతి వ్యక్తికీ భరోసా, విశ్వాసం కల్పించే ప్రదేశాలుగా ఉండాలి. న్యాయం అందించడమే కాదు.. దాన్నిపౌరులు అనుభూతి పొందాలి’అని అభిలíÙంచారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా తమ అనుభవాలను వివరించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్టార్లు, ఏజీ సుదర్శన్రెడ్డి, పీపీ పల్లె నాగేశ్వర్రావు, హెచ్సీఏఏ అధ్యక్షుడు ఎస్.సురేందర్రెడ్డి, ఏఏజీలు ఇమ్రాన్ఖాన్, తేరా రజనీకాంత్రెడ్డి, హెచ్సీఏఏ ఉపాధ్యక్షుడు డీఎల్ పాండు, కార్యదర్శులు శ్రావణ్కుమార్గౌడ్, నిరంజన్రెడ్డి, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
కొత్త వెలుగుల వ్యాసపురి
సాక్షి, హైదరాబాద్: వేదవ్యాసుడు స్వయంగా ప్రతిష్ఠించారని భక్తులు భావించే జ్ఞాన సర స్వతీ దేవాలయం పూర్తి కొత్తరూపు సంతరించుకోబోతోంది. వ్యాసుడి పేరుతో వ్యాసపురిగా మొదలై ప్రస్తుతం బాసరగా పిలుచుకుంటున్న సరస్వతీ దేవాలయానికి దేశవ్యాప్తంగా ఖ్యాతి ఉంది. దక్షిణ భారతదేశంలో ఇదే అతిపెద్ద సరస్వతీ దేవాలయం. చిన్నారులకు ఇక్కడ అక్షరాభ్యాసం చేయిస్తే చదువులో రాణిస్తారన్న నమ్మకంతో దేశవ్యాప్తంగా భక్తులు ఇక్కడ పిల్లలకు ఓనమాలు దిద్దిస్తా రు. క్రమంగా భక్తుల రాక పెరుగుతుండటంతో దేవాలయం ఇరుకుగా మారింది.గర్భాలయం పురాతనమైంది కావటంతో మండపంలోని భక్తులకు అమ్మవారి విగ్ర హం పూర్తిస్థాయిలో కనిపించటం లేదు. చిన్న తలుపు ఉండటమే దీనికి కారణం. గర్భాలయం కూడా చిన్నదిగా ఉంది. దీంతో ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయా లని ప్రభుత్వం నిర్ణయించింది. గత బీఆర్ ఎస్ ప్రభుత్వం తొలుత ఆలయ పునరి్నర్మాణానికి నిర్ణయించి రూ.50 కోట్లు మంజూరు చేసింది. కానీ, పనులు మొదలు కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా రూ.225 కోట్లతో ఈ ఆలయానికి కొత్తరూపు ఇవ్వనుంది. తొమ్మిదంతస్తుల భారీ రాజగోపురం, కోనేరు పునరుద్ధరణ, ధ్యాన మందిరం... ఇలా కొంగొత్త ఆకర్షణలతో చదువులతల్లి కోవెల భక్తులను ఆకట్టుకోబోతోంది. దేవాలయ పనులను సీఎం రేవంత్రెడ్డి సోమ వారం భూమిపూజ చేసి ప్రారంభిస్తారు. భక్త పారవశ్యం... చెంతనే విశాల గోదావరి ప్రవాహం... చుట్టూ దట్టమైన అడవితో కూడిన ప్రకృతి శోభ..తీరంలో చిన్న గ్రామం.. స్వయంగా వ్యాసమహర్షి తపస్సు చేశారని చెప్పుకొనే గుట్ట.. దాని దిగువనే దేవాలయం.. వెరసి ఈ ప్రాంతానికి వస్తే భక్తులు ఆనందపారవశ్యంలో మునిగితేలుతారు. వ్యాస మహర్షితో అనుబంధం ఉందన్న గాథ వారిలో భక్తి భావాన్ని నింపుతుంది. అందుకే ఇక్కడ అక్షరాభ్యాసాలకు అంత ప్రాధాన్యం.వసంత పంచమి లాంటి ప్రత్యేక సందర్భాల్లో దేశ నలుమూలల భక్తులు వస్తుంటారు. కొంతమంది భక్తులు అక్కడ మూడు, ఐదు, ఏడు, తొమ్మిదిరోజులపాటు ఉండి ధ్యానం చేసుకుంటూ మాధవ కవలం రూపంలో బాసరలోని భక్తులు పంచే అన్నప్రసాదం స్వీకరిస్తూ గడిపే ఆనవాయితీ ఉంది. గతంలో ఆలయం పూర్తి రాతి నిర్మాణంతో అలరారేది. ఆలయం పక్కనే భారీ కోనేరు.. సమీపంలో మంచినీళ్లు తోడుకునే పెద్ద బావి ఉండేది. ఆ తర్వాత అభివృద్ధి పనుల్లో్ల భాగంగా అవి కాలగర్భంలో కలిసి పోయాయి. ఇప్పుడు మళ్లీ కోనేరును పునరుద్ధరించనున్నారు. శృంగేరీ పీఠాధిపతుల ఆధ్వర్యంలో... ఈ ఆలయ పునరి్నర్మాణానికి ప్రభుత్వం ముందుగా శృంగేరీ పీఠాధిపతులను సంప్రదించింది. పునరి్నర్మాణంలో చేపట్టే పనులు, వాటి ప్రత్యేకతలను వారికి వివరించి సూచనలు తీసుకుంది. వారి సూచనల ఆధారంగానే ఇప్పుడు పనులు జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. గర్భాలయం, అర్ధ మండపం, రాజ గోపురం, ఇతర గోపురాలు, మాడ వీధులు, కోనేరు, ఉత్తర ద్వారాల నిర్మాణాలకు సంబంధించి పీఠాధిపతుల అనుమతులు తీసుకున్నారు. వారి సూచనలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. మూడు రెట్లు పెరగనన్న ఆలయ ప్రాంగణం ప్రస్తుతం ఆలయ గర్భాలయం, అర్ధమండపం కేవలం 2 వేల చదరపు అడుగుల్లోనే ఉంది. వాటిని 5 వేల చదరపు అడుగులకు విస్తరిస్తారు. 9 అంతస్తుల ఉత్తర రాజగోపురం, మిగిలిన మూడు దిక్కుల్లో 7 అతంస్తుల గోపురాలు, 33 అడుగుల వెడల్పుతో నాలుగు దిక్కుల మాడ వీధులు, ఉత్తర ద్వారం నిర్మిస్తారు. ప్రస్తుతం ఆలయం మొత్తం విస్తీర్ణం 20 వేల చదరపు అడుగుల మేర ఉండగా, ఇప్పుడు దాన్ని ఏకంగా 62 వేల చదరపు అడుగులకు పెంచనున్నారు. ఆలయ పునర్నిర్మాణంలో సిమెంటు బదులు శిలనే వాడుతారు.ఆరువేల మంది భక్తులకు సరిపడా అన్ని వసతులతో (ఫీడింగ్ రూమ్, ఫుడ్ స్టాల్స్, టాయిలెట్స్ తదితరాలతో) 70 వేల చదరపు అడుగులతో క్యూ కాంప్లెక్స్లు నిర్మిస్తారు. 200 మంది ఏకకాలంలో కూర్చుని ధ్యానం చేసుకునేలా ధ్యాన మందిరం, 20 వేల చదరపు అడుగుల వైశాల్యంతో వంటశాల, భోజన శాలలు, ప్రసాద పంపిణీ కేంద్రం, ఈశాన్య దిక్కున కోనేరు... తూర్పు దిక్కున ఆధ్యాత్మికత పరిఢవిల్లేలా అద్భుతమైన తోరణాలు, సమాచార కేంద్రం, దేవాలయానికి ఉత్తర, తూర్పు దిక్కుల్లో వీధుల అభివృద్ధి, దేవాలయం నుంచి ఆవతలి వైపు వెళ్లేందుకు అండర్ పాస్, ఆవతలి వైపున సోలార్ రూప్టాప్తో వాహనాల పార్కింగ్, దేవాలయ ప్రాంగణంలో ఆహ్లాదకరమైన మొక్కలతో పుష్పవనం... ఇలా ఎన్నో నిర్మాణాలు కొలువు దీరనున్నాయి. ఆలయ ప్రాంగణం ఆవల హెల్త్సెంటర్ ఏర్పాటు చేస్తారు. భవిష్యత్లో ఆలయం వెనుక భాగం భారీ వృక్షాలతో ఆలరారేలా మొక్కలు నాటుతారు. . పుష్కరాలకు వచ్చే వారికి... వచ్చే ఏడాది జూన్లో జరిగే గోదావరి పుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు రానున్నందున, బాసరలో వారి కోసం భారీగా వసతులు కల్పించాలని నిర్ణయించారు. ఆ పనులను కూడా ఇప్పుడు మాస్టర్ ప్లాన్లో చేర్చటం విశేషం. భక్తులు ఏ స్థాయిలోనూ ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. -
యువతను తిరిగి క్రీడలవైపు రప్పించాలి
సాక్షి, హైదరాబాద్: క్రీడామైదానం వదిలి దేశ యువత పెద్ద తప్పు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు. మైదానం వదిలి పబ్లు, డ్రగ్స్ సంస్కృతి వైపు వెళ్తున్న యువతను తిరిగి క్రీడా మైదానాల్లోకి రప్పించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడుతున్న వారిలో చదువుకున్న యువతే ఎక్కువ ఉంటోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు వీరుల భూమి అయిన పంజాబ్లో ఇప్పుడు డ్రగ్స్ పెరిగాయని.. పంజాబ్లా మరే రాష్ట్రం కావొద్దన్నారు. యువతను సరైన దారిలో పెట్టకపోతే దేశ భవిష్యత్తుకు ప్రమాదమని హెచ్చరించారు.ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన బీఎన్ ముల్లిక్ స్మారక అఖిల భారత పోలీసు ఫుట్బాల్ చాంపియన్ షిప్–2026 పోటీల ముగింపు వేడుకలో సీఎం రేవంత్రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం తన ఆటతో ఆకట్టుకున్నారు. సీఐఎస్ఎఫ్, గోవా జట్ల మధ్య జరిగిన ఎగ్జిబిషన్ ఫుట్బాల్ మ్యాచ్లో గోవా టీం తరఫున రేవంత్రెడ్డి వరుసగా మూడు గోల్స్ కొట్టి జట్టును గెలిపించారు.అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ భారత ఫుట్బాల్ చరిత్రలో హైదరాబాద్కు గొప్ప పేరుందన్నారు. 1950 నుంచి 1960ల వరకు నర్సరీ ఆఫ్ ఇండియన్ ఫుట్బాల్గా హైదరాబాద్ను పిలిచేవారని.. భారత ఫుట్బాల్ జట్టుకు అగ్రశ్రేణి క్రీడాకారులను ఈ నగరం అందించిందని సీఎం గుర్తుచేశారు. స్పై మాస్టర్గా పేరుగాంచిన బీఎన్ ముల్లిక్ పేరిట నిర్వహించిన ఈ టోర్నమెంట్తో దేశంలోని వివిధ పోలీసు బలగాల మధ్య సమన్వయం పెంచడం అభినందనీయమన్నారు. జాతీయ స్థాయిలో ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన తెలంగాణ పోలీసులను అభినందిస్తున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ క్రీడల్లో దేశం పేరు నిలబెట్టాలి నాలుగు కోట్ల మంది జనాభా ఉన్న దక్షిణ కొరియా ఒలింపిక్స్లో 30కిపైగా పతకాలు సాధిస్తే 140 కోట్లకుపైగా కోట్ల జనాభాగల భారత్ నుంచి ఒక్క పతకం రాకపోవడం బాధాకరమని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో దేశం పేరు నిలబెట్టేలా క్రీడాకారులను తయారు చేసేందుకు తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని చెప్పారు ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంలో ఏర్పాటు చేసిన ఈ యూనివర్సిటీలో పుల్లెల గోపీచంద్, కపిల్దేవ్ వంటి ఎందరో గొప్ప క్రీడాకారులు బోర్డు సభ్యులుగా ఉన్నారన్నారు.‘మహిళా బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్కు డీఎస్పీ ఉద్యోగంతోపాటు రూ. 2 కోట్ల నగదు పురస్కారం ఇచ్చాం. టీం ఇండియా క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ 12వ తరగతి తప్పినా నిబంధనలు పక్కనపెట్టి అతన్ని డీఎస్పీని చేశాం. చదువుకుంటే జాబ్లు వస్తాయో లేదో కానీ మీరు క్రీడాకారులుగా రాణిస్తే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా’అని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.తెలంగాణ యువతకు మార్గదర్శనం చేసేందుకే దిగ్గజ ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీని తెలంగాణకు తీసుకువచ్చానని తెలిపారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ను అరికట్టేందుకు పోలీసులు కృషి చేయాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ అందరూ క్రికెట్ క్రేజ్తో ఫుట్బాల్ను మరిచిపోతున్న తరుణంలో భారీ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహణతో తెలంగాణ పోలీసులు గర్వపడేలా చేశారన్నారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన సీఎం 12 రోజులపాటు జరిగిన మ్యాచ్లలో 34 జట్లు పాల్గొన్నాయని డీజీపీ శివధర్రెడ్డి తెలిపారు. విజేతలను, మ్యాచ్ నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన అధికారులను ఆయన అభినందించారు. ఈ టోర్నమెంట్ విజేతలుగా పురుషుల జట్టు నుంచి సీఐఎస్ఎఫ్, మహిళల జట్టు నుంచి అస్సాం రైఫిల్స్ నిలిచాయి. విజేత జట్లతోపాటు మహిళల నుంచి గోల్డెన్ బూట్ గెలుచుకున్న క్రీడాకారిణి ప్రియా సాసా, పురుషుల నుంచి గోల్డెన్ బూట్ గెలుచుకున్న క్రీడాకారుడు విజయ్ బెహారేలకు సీఎం రేవంత్రెడ్డి ట్రోఫీలను బహూకరించారు. కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్ స్వప్న తివారీ, సైబరాబాద్ సీపీ డా. రమేశ్రెడ్డి, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్, సాట్ చైర్మన్ శివసేనారెడ్డి, పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. -
నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం పర్యటన
భైంసా/బాసర/కైలాస్నగర్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. మొదట ఆయన బాసర శ్రీజ్ఞాన సరస్వతి ఆలయానికి రానున్నారు. ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం పర్యటనను విజయవంతం చేయడానికి అన్నిశాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేసినట్లు నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. బాసర మాస్టర్ ప్లాన్లో భాగంగా రూ.225 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. తర్వాత మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలో బహిరంగసభలో పాల్గొంటారు. సీఎం పర్యటన షెడ్యూల్ ఇలా.. ⇒ ఉదయం 10:20 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బాసరకు బయల్దేరతారు. ⇒ ఉదయం 11 గంటలకు బాసర హెలీప్యాడ్కు చేరుకుని అక్కడ నుంచి రాజన్న గెస్ట్హౌస్కు వెళతారు. ⇒11:10 నుంచి 12:10 వరకు బాసర శ్రీజ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ⇒మధ్యాహ్నం 12:15 నుంచి 12:30 వరకు ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమిపూజ చేస్తారు.⇒ మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 వరకు రిజర్వ్ టైమ్ ⇒ మధ్యాహ్నం 1:45 గంటలకు బాసర నుంచి ఆదిలాబాద్ జిల్లాకు వెళ్తారు. ⇒ మధ్యాహ్నం 2.15 గంటలకు పిప్పిరికి చేరుకుంటారు. ⇒ 2.20 నుంచి 2.30 వరకు వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ⇒ 2.30 నుంచి సాయంత్రం 4.10 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు.⇒ సభ అనంతరం ఐఎస్వో సరి్టఫికెట్లు, వడ్డీలేని రుణాల చెక్కులను లబి్ధదారులకు అందజేస్తారు. అలాగే సీఎం కప్ విజేతలకు ట్రోఫీని బహూకరిస్తారు. ⇒ 4.20 గంటలకు హైదరాబాద్కు తిరిగి పయనమవుతారు. -
లచ్చమ్మ కుంట చెరువు.. హైడ్రాకు హరీష్ సవాల్
సాక్షి, హైదరాబాద్: భూముల విషయంలో పెద్దలే గద్దలుగా మారితే ఎలా అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. నాదర్గూల్ భూముల ఆక్రమణ వెనుక మంత్రి పొంగులేటి సభ్యులే ఉన్నారని ఆరోపించారు. హైదరాబాద్ నడిబొడ్డున 7000 కోట్ల భూ కుంభకోణం జరుగుతోందని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి హరీష్ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘దళితుల భూములను కాంగ్రెస్ భక్షించే ప్రయత్నం జరుగుతోంది. నాదర్గూల్ భూముల కుంభకోణం జరిగింది. పేదల భూముల్లోకి వారిని పోకుండా అడ్డుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. నాదర్గూల్ భూముల కోసం చాలా ఏళ్లుగా పోరాటం జరుగుతుంది. ఈ భూమి తనదేనని రాజ్ బహుదూర్ కోర్టులో పోరాటం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ భూములను నిషేధిత జాబితాలో చేర్చడం జరిగింది. ప్రస్తుతం ఈ భూముల వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది.రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూ భారతి పోర్టల్లో ఈ ల్యాండ్ ప్రభుత్వ భూమిగా పేర్కొంది. ఈ భూములను కాపాడాల్సిన బాధ్యత ఆర్డీవోది. దీనిపై అక్కడి రైతులు రెవెన్యూ అధికారులకి, హైడ్రా కమిషనర్కి ఫిర్యాదు చేసినా ఎందుకు స్పందించడం లేదు. నాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన భూమిని రేవంత్ రెడ్డి లాకుంటున్నారు. స్వయంగా రెవెన్యూ మంత్రే ఈ భూముల ఆక్రమణ వెనుక ఉంటే అధికారులు ఎలా చర్యలు తీసుకుంటారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో భూములను ఆక్రమిస్తే ఎవర్ని వదలను అన్న సీఎం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఈ భూములపై హైడ్రా ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు.లచ్చమ్మ కుంట చెరువును అక్కడ పెద్దలు ఆక్రమిస్తుంటే హైడ్రా కమిషనర్ ఏం చేస్తున్నారు?. చెరువులను కాపాడుతా అనే హైడ్రాకు కళ్లు కనబడటం లేదా?. హైడ్రా కమిషనర్కి సవాల్ చేస్తున్నా. రేపు హైడ్రా కమిషనర్ రావాలి లేదా మా ఎమ్మెల్యేలతో నేనే వెళ్తాను. మరోవైపు 80 ఎకరాల గుట్టలు మాయం చేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ నెల 7న ఈ భూములపై సుప్రీంకోర్టులో విచారణ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వారంలోనే ఈ భూమి కోహినూర్కి చెందింది అని బోర్డు పెట్టారు. శిల్పా ఇన్ఫ్రా పొంగులేటి కుమారుడిది. ఈ భూముల వెనుక పొంగులేటి కుటుంబ సభ్యులే ఉన్నారు అంటూ’ వ్యాఖ్యలు చేశారు. -
వాళ్లు పెట్టారు.. వీళ్లు తీశారు
గజ్వేల్/సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మాజీ సీఎం, స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ కార్యాలయాన్ని కాంగ్రెస్ నేతలు ముట్టడించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫొటో పెట్టడంపై వివా దం రేగింది. ఆగ్రహించిన బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్కు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టారు. దీంతో శనివారం పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రధాన రహదారి గుండా కేసీఆర్ క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి లోపలికి ప్రవేశించారు. ఈ సందర్భంగా కార్యాలయం ప్రధాన ద్వారం అద్దాలు పగిలిపోయాయి. కాంగ్రెస్ శ్రేణులు వారి వెంట తెచ్చుకున్న రేవంత్రెడ్డి చిత్రపటాన్ని అక్కడ పెట్టి కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గజ్వేల్ సమస్యలను పట్టించుకోని కేసీఆర్కు ఒక్క నిమిషం కూడా పదవిలో కొనసాగే అర్హత లేదంటూ ఆంక్షారెడ్డి ధ్వజమెత్తారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని కాంగ్రెస్ శ్రేణులను అక్కడి నుంచి పంపించారు. సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అక్కడికి చేరుకొని కాంగ్రెస్ వైఖరిపై విరుచుకుపడ్డారు. అనంతరం బీఆర్ఎస్ శ్రేణులతో ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పోలీస్స్టేషన్లో కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతలు క్యాంపు కార్యాలయంలో రేవంత్రెడ్డి ఫొటోను తొలగించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కార్యాలయం వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అధికార మదంతోనే దాడి: హరీశ్రావు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే గజ్వేల్లోని కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార మదంతో విర్రవీగుతూ ప్రజాస్వామ్యంపై దాడి చేస్తూ కాంగ్రెస్ నాయకులు బిహార్ గ్యాంగ్ను తలపిస్తున్నారన్నారు. ఓ వైపు విద్వేష ప్రసంగాల బిల్లు పేరిట ప్రజలు, ప్రతిపక్షాల నోర్లు మూయిస్తూ మరోవైపు గూండా రాజ్యం నడుపుతున్నారని మండిపడ్డారు. ‘సీఎం, మంత్రులు పొలిటికల్ టూర్లు చేస్తూ ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కార్యాలయాలపై దాడులు చేస్తూ ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నారు. దాడులు ఆపకపోతే ప్రజలే వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి వస్తుంది’అని హరీశ్రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ దాడిని బీఆర్ఎస్ మాజీ మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఖండించారు. -
‘బాసర’కు రూ. 225 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానాల తరహాలో నియమ నిబంధనలు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. రాజకీయ పార్టీల సభలు, జెండాలు, ఎలాంటి ప్రదర్శనలు లేకుండా కేవలం ఆధ్యాత్మీకతకు పెద్ద పీట వేయాలని స్పష్టం చేశారు. రూ. 225 కోట్లతో బాసర దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. బాసర జ్ఞాన సరస్వతి దేవాలయ అభివృద్ధికి సంబంధించి శనివారం ఆయన తన నివాసంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, సీఎస్ రామకృష్ణారావు, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తొలుత బాసర ఆలయ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ను అధికారులు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి వివరించారు. ఆలయ అభివృద్ధి పనులకు రూ.225 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు తెలియజేశారు. మాస్టర్ ప్లాన్ను పరిశీలించిన సీఎం పలు మార్పులు సూచించారు. సంప్రదాయాలు, శాస్త్రాలను పరిగణనలోకి తీసుకొని భక్తుల విశ్వాసాలకు పెద్దపీట వేస్తూ.. బాసర ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎం సూచించారు. భవిష్యత్ అవసరాలు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాలమైన రోడ్లు నిర్మించాలని ఆదేశించారు. ఆలయ ప్రాంగణం భవిష్యత్లో భారీ వృక్షాలతో అలరారేలా అవసరమైన మొక్కలను నాటాలని సూచించారు. ఆలయం సమీపంలో హెల్త్ సెంటర్ నిర్మించాలని, పుష్కరాలు, ఇతర ఉత్సవాల రోజుల్లో అక్కడ తగిన సంఖ్యలో వైద్యులు, వైద్య సిబ్బంది ఉండి భక్తులకు సేవలు అందించేందుకు అనువుగా దానిని నిర్మించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కాగా, ఎంతటి ప్రముఖుల వాహనాలైనా ఆలయ ప్రాంగణానికి బయటే నిలిచిపోవాలని, ఆలయ ప్రాంగణంలోకి కేవలం ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ద్వారానే చేరుకునేలా చూడాలని సీఎం చెప్పారు. వాహనాల పార్కింగ్ ప్రదేశంలో సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు చేయాలన్నారు. అభివృద్ధి పనుల సమయంలో ఆలయ పవిత్రతకు ఎటువంటి భంగం కలగకుండా జాగ్రత్త పడాలని సీఎం చెప్పారు. అభివృద్ధి పనుల నాణ్యతలో రాజీపడితే ఏమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల కోసం అసెంబ్లీ నక్సలైట్ అవుతా
-
అబద్దాలు చెప్పడంలో రేవంత్కు ఆస్కార్: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్కు అబద్దాలు చెప్పడంలో ఆస్కార్ ఇవ్వొచ్చని అన్నారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలపై చర్యలు సిద్ధమా అని బండి సంజయ్ సవాల్ విసిరారు.కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హుజురాబాద్లో డంపింగ్ యార్డ్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..‘సెంట్రల్ యూనివర్సిటీలో అరాచకం చేశారు. అలా ఇక్కడ చేయవద్దు. నెమళ్లు, పక్షులు, ఉన్నాయి పర్యావరణాన్ని రక్షించాలి. డంప్ యార్టుకు బీజేపీ వ్యతిరేకం కాదు.. ప్రజలకు దూరంగా ఉన్న దగ్గర నిర్మించాలి. హుజురాబాద్లో డంపింగ్ యార్డ్ గురించి సీఎంకు తెలిసే మాట్లాడాడు. ఓసారి డంపింగ్ యార్డ్ నిర్మాణ స్థలాన్ని సీఎం పరిశీలించాలి లేదా నివేదిక తెప్పించుకోవాలి. లాఠీ దెబ్బలు అయినా తింటాం కానీ హుజురాబాద్లో డంప్ యార్డును అడ్డుకుంటాం.బీహార్, మహారాష్ట్ర, హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కారణం. కేరళంలో కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఆరు గ్యారంటీలు తెలంగాణలో అమలు కావడం లేదు. నిరుద్యోగ భృతి, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు డబ్బులు ఇవ్వడం లేదు. హామీలు అమలవుతున్నాయని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా లేదంటే సీఎం రాజీనామా చేయాలి. ఢిల్లీకి పోయి డబ్బు మూటలు స్పెషల్ ఫ్లైట్లలో ఇచ్చారు. కేరళ మీడియా వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమలు గురించి తెలుసుకోవాలి. ఆరు గ్యారంటీలపై చర్చకు సవాలు చేస్తున్నా.. నా సవాలుకు సీఎం సిద్ధమా?’ అని ప్రశ్నించారు. -
గ్రీన్ టెక్స్టైల్ హబ్లు
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ గ్రీన్ టెక్స్టైల్ హబ్లను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ప్రకటించారు. 2047 నాటికి తెలంగాణను దక్షిణ ఆసియాకు టెక్స్టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. యువత, మహిళలను లక్ష్యంగా చేసుకొని సంప్రదాయ వస్త్రోత్పత్తికి ఆధునికతను జోడించి డిజైన్, కుట్టు పని తదితరాల్లో శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. ప్రపంచానికి ఔషధాలు, వ్యాక్సి న్లు అందిస్తున్న తెలంగాణలో తయారయ్యే దుస్తులను ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ధరించేలా వస్త్ర పరిశ్రమను తీర్చిదిద్దడం లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు.హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో శుక్రవారం ‘ఏషియన్ టెక్స్టైల్స్ కాన్ఫరెన్స్– 2026’(ఎటెక్స్కాన్)ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ‘శతాబ్దాలుగా కళలు, సంస్కృతి, సాంప్రదాయాల కలబోతగా తెలంగాణ వస్త్ర పరిశ్రమ నిలుస్తోంది. మన జీవన విధానంలో వస్త్ర పరిశ్రమ అంతర్భాగంగా ఉంది. నిజాం కాలంలోనే ప్రపంచం నలుమూలల నుంచి హైదరాబాద్కు వచ్చే వ్యాపారులు ముత్యాలు, వస్త్రాలు కొనుగోలు చేసేవారు. పోచంపల్లి ఇక్కత్ మొదలుగద్వాల చీరలు, వరంగల్ డర్రీలు, నారాయణపేట చేనేత వరకు అనేక రకాలైన వ్రస్తోత్పత్తుల్లో తెలంగాణకు ఎంతో పేరు ఉంది’అని సీఎం పేర్కొన్నారు. పత్తి ఉత్పత్తి నాణ్యతలో అగ్రగామి ‘భారత్తోపాటు ప్రపంచ వ్యాప్తంగా పత్తి ఉత్పత్తి, నాణ్యతలోనూ తెలంగాణ అగ్రగామిగా ఉంది. వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ప్రపంచస్థాయిలో పేరొందిన సంస్థలు దుస్తుల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేశాయి. నైపుణ్యం, సంకల్పం, అత్యుత్తమ మానవ వనరులు, ప్రపంచానికి సరితూగే విధానాలతోపాటు వస్త్ర పరిశ్రమపై తెలంగాణకు దూరదృష్టి కూడా ఉంది. తెలంగాణ పత్తి చేల నుంచి లండన్, న్యూయార్క్, పారిస్, మిలాన్, టోక్యో, దుబాయ్ ఫ్యాషన్ షోల వరకు అనేక అంశాల్లో మేం కలిసి పనిచేస్తున్నాం.హైదరాబాద్ భారతదేశానికి మాత్రమే కాదు..ప్రపంచానికి కూడా సినిమా నిర్మాణ కేంద్రంగా ఎదుగుతూ హాలీవుడ్ స్థాయికి చేరింది. టాలీవుడ్, బాలీవుడ్ ఇప్పటికే హైదరాబాద్ను తమ నిర్మాణ కేంద్రంగా ఉపయోగిస్తున్నాయి. సినిమా రంగం ద్వారా కూడా ఫ్యాషన్ రంగాన్ని ప్రోత్సహిస్తాం. పెట్టుబడులతో వచ్చే వారికి మౌలిక సదుపాయాలు, భూమి, విద్యుత్, నీరు, ఇతర ప్రోత్సాహకాలతోపాటు వేగంగా అనుమతులు మంజూరు చేస్తాం. ప్రపంచాన్ని మార్చగలిగే స్థాయిలో తెలంగాణలో వ్రస్తోత్పత్తి పరిశ్రమ వాతావరణాన్ని నిర్మిద్దాం’అని సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. నేతన్నకు అందించే సామాజిక న్యాయం : శ్రీధర్బాబు ప్రభుత్వం దృష్టిలో వస్త్రోత్పత్తి అంటే అట్టడుగున ఉన్న నేతన్నకు అందించే సామాజిక న్యాయమని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. ‘స్వాతంత్య్రం చరఖా, మగ్గం ద్వారా కూడా వస్తుందని మహాత్మాగాంధీ నిరూపించారు. అంతర్జాతీయ సరఫరా గొలుసులో నేతన్నలు కూలీగానే మిగిలిపోకుండా యజమానిగా ఎదగాలనే సంకల్పంతో నేత కార్మికులను ప్రోత్సహిస్తూ అండగా నిలుస్తున్నాం. ఆధునిక సాంకేతికతతో మేడిన్ తెలంగాణ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేసేందుకు ‘న్యూ స్వదేశీ విజన్’కు శ్రీకారం చుడుతున్నాం. డిజిటల్ డిజైన్లు, అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం ద్వారా తెలంగాణ నేతన్నల నైపుణ్యాన్ని మిలాన్, న్యూయార్క్ వంటి అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికలపైకి చేర్చాలని లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళ్తున్నాం’అని శ్రీధర్బాబు ప్రకటించారు. వేలాది కుటుంబాలకు జీవనాధారం : మంత్రి తుమ్మల ‘తెలంగాణలో టెక్స్టైల్ రంగం కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదు. వేలాది కుటుంబాల జీవనాధారం. మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతిబింబం. చేనేత రంగం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి పొందుతున్న కుటుంబాల సంఖ్య అధికంగా ఉంది. ప్రభుత్వం టెక్స్టైల్ రంగాన్ని కేవలం ఆర్థిక ప్రగతిగా కాకుండా, ఒక సామాజిక బాధ్యతగా భావిస్తోంది. ‘తెలంగాణ విజన్ 2047’లో టెక్స్టైల్ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం కల్పించాం. దీని ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది’అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. – ఎటెక్స్ కాన్ 2026లో భాగంగా ‘రీమేజినింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ గ్లోబల్ టెక్స్టైల్స్’పై రూపొందించిన నివేదికను సీఎం రేవంత్ విడుదల చేశారు. సదస్సులో టెక్స్టైల్ రంగంలోని తాజా ధోరణులు, సాంకేతిక పరిణామాలు, అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలపై పలు సెషన్లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేనేత, వస్త్ర పరిశ్రమ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, శశాంక, టీజీఐఐసీ ఛైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నారు. -
గత పాలకుల తప్పిదాలను సరిచేస్తాం.. ఆర్థిక సవాళ్లను అధిగమిస్తాం: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ’లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పలు పంచాయతీలు, మున్సిపాలిటీల్లో అధికారులు గురువారం గ్రామసభలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన సందేశాన్ని అన్ని సభల్లోనూ అధికారులు చదివి వినిపించారు. ⇒ ‘ప్రజాప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి రెండు సంవత్సరాల మూడునెలలు పూర్తయ్యింది. ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ, గత పాలకుల తప్పిదాలను సరిచేస్తూ... సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీపడకుండా మన ప్రభుత్వం పనిచేస్తోంది. మేం పాలకులం కాదు..సేవకులం అన్న భావనతో ప్రజల ఆకాంక్షలు, అవసరాలే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నాం. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుంటున్నాం. ⇒ ఉప ఎన్నికలు, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రజాపాలనకు మీ ఆమోదం, మద్దతు ప్రకటించారు. మీరు ఇచ్చిన ఈ ఫలితాలు మా బాధ్యతను మరింత పెంచాయి. ⇒ ప్రభుత్వ పథకాలు అంటే కాగితాలపై కాదు.. ప్రజల జీవితాల్లో స్పష్టమైన మా ర్పు తేవాలన్నది మా సంకల్పం. ఆ ఉద్దేశంతోనే ‘ప్రజాపాలన– ప్రగతిప్రణాళిక’ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. మార్చి 6 నుంచి 99 రోజులపాటు, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగాలి. ఊరూవాడ స మస్యల పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారి పనిచేయాలి. వేగంగా ఫైళ్ల క్లియ రెన్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలి. ⇒ మహాలక్ష్మి ఉచిత బస్సు సౌకర్యం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేష న్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇ ళ్లు, మహిళా సాధికారత వంటి పథకాలు అర్హులకు చేరేలా ఈ కార్యక్రమం జరగాలి. ⇒ ‘తెలంగాణ రైజింగ్–2047’విజన్తో ఆర్థికంగానే కాక, అన్నిరంగాల్లో తెలంగాణను ప్రపంచంలో నంబర్వన్గా నిలపాలన్నది మన సంకల్పం. ఈ సంకల్పంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. క్యూర్, ప్యూర్, రేర్గా రాష్ట్రాన్ని వర్గీకరించుకున్నాం. వాటి పరిధిలో సేవా, తయారీ, వ్యవసాయ రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా మనం ఎదగాలి. ⇒ ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధా రణ కార్యక్రమం కాదు..ఒక దీక్ష. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఒక్కటై... దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలి. ఇదే నా కల. ఆ కలను సాకారం చేయడంలో ప్రతి తెలంగాణ బిడ్డ భాగస్వామి కావాలి’అని సీఎం సందేశం ఇచ్చారు. -
పనుల నాణ్యతలో రాజీ పడొద్దు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఫ్యూచర్ సిటీ పనుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని సీఎం రేవంత్రెడ్డి అధికారులకు సూచించారు. కేరళ పర్యటన ముగించుకుని గురువారం మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న సీఎం నేరుగా ఫ్యూచర్ సిటీకి చేరుకున్నారు. తొలుత ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ) భవనాన్ని, ఆ తర్వాత స్కిల్స్ యూని వర్సిటీ భవనాన్ని సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు. మే నాటికి ఎఫ్సీడీఏ పనులు, జూన్ చివరి నాటికి స్కిల్స్ యూనివర్సిటీ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.అక్కడి నుంచి పవర్గ్రిడ్ సెంటర్కు చేరుకున్నారు. కొంగరకలాన్ నుంచి మీర్ఖాన్పేట్, అక్కడి నుంచి ఆకుతోటపల్లి వరకు ఏర్పాటు చేస్తున్న 330 అడుగుల విస్తీర్ణంలోని గ్రీన్ఫీల్డ్ రోడ్డు పనులు సహా రేడియల్ రోడ్డు పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఫ్యూచర్ సిటీలోని ఓవర్ హెడ్ విద్యుత్ లైన్లను తొలగించి ఖర్చుకు వెనుకాడకుండా భూగర్భ విద్యుత్ కేబుళ్లను వేయాలని ఆదేశించారు. భారత్ ఫ్యూచర్ సిటీ భవిష్యత్తు పెట్టుబడులకు స్వర్గధామమని, ఇక్కడ అనేక జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు రాబోతున్నాయని, త ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. అధికారుల ఉరుకులు, పరుగులు మధ్యాహ్నం 3.55కు ఇక్కడికి చేరుకున్న సీఎం..సాయంత్రం 5.10 గంటల సమయంలో తిరుగు ముఖం పట్టారు. సీఎం పర్యటన ఆఖరి నిమిషంలో ఖరారు కావడంతో అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టారు. సీఎం వస్తున్న సమాచారం అధికార పార్టీ నేతలకు కూడా లేకపోవడం విశేషం. సీఎం వెంట సీఎస్ రామకృష్ణారావు, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, ట్రాన్స్కో సీఎండీ కృష్ణభాస్కర్, ఎఫ్సీడీఏ కమిషనర్ శశాంక, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఉన్నారు. సీఎం రాకకు ముందే పవర్ గ్రిడ్ కేంద్రానికి చేరుకున్న సీఎస్.. విద్యుత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. -
తెలంగాణే 'గ్యారంటీ'!
సాక్షి హైదరాబాద్: కేరళలో యూడీఎఫ్ గ్యారంటీల అమలు సాధ్యమా అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారని.. దానికి సమాధానం తెలంగాణ రాష్ట్రమే అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. యూడీఎఫ్ మేనిఫెస్టోపై విమర్శలు చేసేవారు.. ఆ హామీలు తెలంగాణలో ఎలా అమలు అవుతున్నాయో వచ్చి చూడాలని, వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. విజయన్, ఆయన మంత్రులు కూడా ప్రత్యక్షంగా వచ్చి పరిశీలించుకోవచ్చని సవాల్ విసిరారు. గురువారం కొచ్చిలో ఐదు ఇందిరమ్మ గ్యారంటీలతో కూడిన యూడీఎఫ్ మేనిఫెస్టోను ఆవిష్కరించిన అనంతరం రేవంత్ మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, మొదటి కేబినెట్ సమావేశం నుంచే గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తున్నా మని ముఖ్యమంత్రి చెప్పారు. రుణమాఫీ, రైతు భరోసా, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం గురించి వివరించారు. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ –2047 మేరకు తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలపనున్నామని చెప్పారు. తమ రాష్ట్రం వృద్ధిరేటు 10.8%గా ఉందని, పన్నులు పెంచకుండానే అభివృద్ధి సాధ్య మని తాము నిరూపించామని రేవంత్ పేర్కొన్నారు. యూడీఎఫ్ స్వర్ణయుగ పాలన ఖాయం అవినీతి, కుటుంబ పాలన అంశంలో కేరళ సీఎం పినరయి విజయన్, మాజీ సీఎం కేసీఆర్ల మధ్య అనేక పోలికలు ఉన్నాయని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. కేరళలో పదేళ్లుగా విజయన్ ప్రభుత్వం కొనసాగుతుంటే 2014 నుంచి సుమారు పదేళ్లపాటు కేసీఆర్ తెలంగాణను పాలించారని చెప్పారు. కుటుంబ పాలన, అవినీతి, అసమర్థ పాలన విషయంలోనూ ఇద్దరి మధ్య పోలికలు ఉన్నా యన్నారు. దేశాన్ని, కేరళనూ మోదీ బ్రదర్స్ పాలిస్తున్నారని మోదీ.. విజయన్ను ఉద్దేశించి విమర్శించారు. దేవుడి సొంత రాష్ట్రంలో ఆయన ఆస్తికే రక్షణ లేకుండా పోయిందంటూ పరోక్షంగా శబరిమల బంగారం ఉదంతాన్ని ప్రస్తావించారు. వచ్చే ఎన్నికలతో కేరళలో విజయన్ పాలన ముగిసి యూడీఎఫ్ స్వర్ణ యుగ పాలన మొదలవుతుందని చెప్పారు. కార్యక్రమంలో కేరళ కాంగ్రెస్ నేతలతోపాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ పాల్గొన్నారు. -
కేరళ ఎన్నికలు.. UDF మేనిఫెస్టో విడుదల చేసిన రేవంత్
కొచ్చి: కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం యూడీఎఫ్ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేనిఫెస్టోను ప్రతిపక్ష నాయకుడు వి.డి. సతీశన్కు అందజేశారు. రాహుల్ గాంధీ గతంలో ప్రకటించిన ఐదు హామీలతో పాటు, అనేక ఇతర వాగ్దానాలతో కూడిన ఈ మేనిఫెస్టోను యూడీఎఫ్ తాజాగా విడుదల చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ అందిస్తున్న పథకాలు, నిర్ణయాలను సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మేనిఫెస్టో ప్రకారం.. మహిళలకు KSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణం, కళాశాల విద్యార్థులకు నెలకు రూ. 1,000 ఆర్థిక సహాయం అందజేత. అలాగే, యువత వ్యాపారాలు ప్రారంభించడానికి రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు. రూ. 3,000 సంక్షేమ పింఛను, ఊమెన్ చాందీ పేరుతో అన్ని కుటుంబాలకు రూ. 25 లక్షల వరకు ఉచిత బీమా పథకం. వృద్ధుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక శాఖ ఏర్పాటు వంటి ఆరు 'ఇందిరా హామీలు' మేనిఫెస్టోలో పొందుపరిచారు. వీటితో పాటు, 'జాబ్ వాచ్ టవర్ల' ఏర్పాటు, వయనాడ్లో ఒక గిరిజన విశ్వవిద్యాలయం, అలాగే కోజికోడ్ మరియు తిరువనంతపురం నగరాల్లో మెట్రో/లైట్ మెట్రో ప్రాజెక్టులను అమలు చేస్తామని కూడా యూడీఎఫ్ హామీ ఇచ్చింది.మేనిఫెస్టోలోని వాగ్దానాలు-ఇందిరా హామీలు:మహిళలకు KSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణంకళాశాల విద్యార్థులకు నెలకు రూ. 1,000 ఆర్థిక సహాయంసంక్షేమ పింఛన్లు రూ. 3,000కు పెంచబడతాయిఅన్ని కుటుంబాలకు రూ. 25 లక్షల వరకు ఉచిత 'ఊమెన్ చాందీ ఆరోగ్య బీమా'యువత వ్యాపారాలు ప్రారంభించడానికి రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణంవృద్ధుల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు ఆరోగ్య రంగం:'కారుణ్య బెనివలెంట్ ఫండ్' మరియు 'శృతి రంగం' వంటి పథకాలు తిరిగి ప్రారంభించబడతాయిBPL కుటుంబాలకు చెందిన రోగులకు డయాలసిస్ ఉచితం చేయబడుతుందిమహిళలు మరియు పిల్లల కోసం 'She Hospitals' (షీ హాస్పిటల్స్) ప్రారంభించబడతాయిJIPMER నమూనాలో 'బిల్లు లేని ఆసుపత్రులు' (No-bill hospitals) స్థాపించబడతాయిఆసుపత్రులకు వచ్చే రోగులకు పడక (బెడ్) పొందడం వారి హక్కుగా పరిగణించబడుతుందివ్యవసాయం మరియు మత్స్య రంగం:వ్యవసాయం కోసం ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టబడుతుందిరబ్బరుకు రూ. 300 కనీస మద్దతు ధర (Floor Price) కల్పించబడుతుంది.అలాగే CIAL నమూనాలో ఒక రబ్బరు కంపెనీ ప్రారంభించబడుతుందివరి ధాన్యానికి రూ. 35, కొబ్బరికి అధిక కనీస ధర ఇవ్వబడుతుందిమత్స్యకారులకు మరియు కేఎస్ఆర్టీసీ, ఆటో, టాక్సీ యజమానులకు ఇంధన రాయితీ ఇవ్వబడుతుంది విద్య మరియు ఉపాధి:వయనాడ్లో ఆధునిక సౌకర్యాలతో 'గిరిజన విశ్వవిద్యాలయం' స్థాపించబడుతుందిక్యాంపస్లలో ర్యాగింగ్ను నివారించడానికి 'సిద్ధార్థన్ స్టూడెంట్ డిస్ట్రెస్ యాప్' ప్రవేశపెట్టబడుతుంది'సిద్ధార్థన్ యాంటీ-ర్యాగింగ్ చట్టం' అమలు చేయబడుతుందివిద్యా సంస్థలలో వివక్షను అంతం చేయడానికి 'రోహిత్ వేముల చట్టం' అమలు చేయబడుతుందిఅంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్లోని మార్పులను అధ్యయనం చేయడానికి 'జాబ్ వాచ్ టవర్' ఏర్పాటు చేయబడుతుంది10,000 కొత్త ఎంఎస్ఎంఈ సంస్థలను ప్రారంభించడానికి సహాయం అందించబడుతుంది సంక్షేమ ప్రాజెక్టులు:ఆకలి రహిత కేరళ కోసం ఇందిరా క్యాంటీన్లు ప్రారంభించబడతాయిఐదేళ్లలో 5 లక్షల మందికి ఇళ్లు అందించబడతాయిసామాజిక భద్రతా పింఛనులో దివ్యాంగులకు 25% అదనంగా ఇవ్వబడుతుందిఆశా కార్యకర్తల కనీస వేతనాన్ని రూ.700కి పెంచనున్నారుపేదల వివాహాలను తక్కువ ఖర్చుతో జరిపించడానికి 'స్నేహ సుమంగళి' వివాహ మందిరాలను నిర్మించనున్నారుపరిపాలన మరియు అభివృద్ధి:అవినీతిని అరికట్టడానికి రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ను ఏర్పాటు చేయనున్నారుమత సామరస్యాన్ని నిర్ధారించడానికి 'సహన మంత్రిత్వ శాఖ'శాంతి కోసం 'శాంతి మరియు సామరస్య' శాఖను ఏర్పాటు చేయనున్నారునదులను అనుసంధానించడం ద్వారా కేరళ తీరప్రాంతంలో 'మిషన్ సముద్ర' ప్రాజెక్టును అమలు చేయనున్నారుతిరువనంతపురం మరియు కోజికోడ్ నగరాల్లో మెట్రో/లైట్ మెట్రో ప్రాజెక్టులను అమలు చేయనున్నారుమాదకద్రవ్య రహిత కేరళ కోసం 'బ్రేక్ ది డ్రగ్ చైన్' ప్రాజెక్టును ప్రారంభించనున్నారు -
త్రివేండ్రం కమ్యూనిస్టు, ఢిల్లీ కమ్యూనలిస్టు
సాక్షి, హైదరాబాద్: కేరళలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్)కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీ కమ్యూనలిస్టు ప్రధాని నరేంద్ర మోదీ, తివేండ్రం కమ్యూనిస్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్ను ఓడగొడితేనే కేరళకు మంచి రోజులు వస్తాయన్నారు. మోదీ–విజయన్లవి విభిన్న భావజాలాలైనా, భావాలొక్కటేనని, ఎల్డీఎఫ్– బీజేపీ మధ్య ఒప్పందాలు ఉన్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా ఉన్న రేవంత్ రెడ్డి కేరళలో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. త్రివేండ్రం, నేమం, భరతన్నూర్, అలెప్పీ, కాయకుళం నియోజకవర్గాల్లో రోడ్షోలు, కార్నర్ మీటింగ్లలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ కేరళ సీఎం పినరయి విజయన్ను ప్రధాని మోదీతో పోల్చారు. ప్రధాని మోదీకి, కేరళ సీఎం విజయన్కు తేడా ఏమీ లేదని, విజయన్ ద్వారా కేరళ భవిష్యత్తును అపహరించాలని మోదీ చూస్తున్నారని పేర్కొన్నారు. అందులో భాగంగానే బీజేపీ ఓటు బ్యాంకు విజయన్కు బదిలీ అయ్యేలా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లను కేరళలోకి రానీయకుండా లక్ష్మణ రేఖ గీసింది యూడీఎఫ్ మాత్రమేనని అన్నా రు. కేరళ ప్రజలు బీజేపీ, ఎల్డీఎఫ్కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎవరినైనా బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐతో వేధిస్తుందని, విజయన్సర్కారుపై ఈగ కూడా వాలనీయదని ఆరోపించారు. కేరళ సమగ్రాభివృద్ధి యూడీఎఫ్ లక్ష్యమన్నారు. మలయాళంలో పలకరింపు గత పన్నెండేళ్లుగా ఢిల్లీలో... పదేళ్లుగా కేరళలో పరిస్థితులు పూర్తిగా దిగజారాయని సీఎం రేవంత్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో మోదీ, కేరళలో విజయన్ డబుల్ ఫెయిల్యూర్గా నిలిచారని ధ్వజమెత్తారు. ఇరువురి సిద్ధాంతాలు వేరైనా వైఫల్యాలు మాత్రం ఒకేలా ఉన్నాయని మండిపడ్డారు. నిరుద్యోగంతో ఇక్కడి యువత ఇబ్బంది పడుతోందని, అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని విమర్శించారు. సోనియా గాంధీ దత్తత తీసుకున్న తెలంగాణ అభివృద్ధి మార్గంలో పయనిస్తోందని.. కేరళ కూడా అలానే ముందుకు వెళ్లాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. కేరళ అభివృద్ధికి రాహుల్ గాం«దీ, ప్రియాంక గాంధీ నాయకత్వం వహిస్తారని, వారిద్దరూ కేరళ కుటుంబ సభ్యుల్లా మారారని తెలిపారు. ప్రముఖ మలయాళ నటుడు మోహన్లాల్ ఓ సినిమాలో చెప్పిన ’నీ పో మోనే.. దినేశా..’ తరహాలో ’నీ పో మోనే విజయన్, యువర్ టైమ్ ఈజ్ ఓవర్’ (విజయన్ నీ సమయం అయిపోయింది.. వెళ్లిపో) అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. రేవంత్ మలయాళంలో పలకరించడంతో ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. రాత్రికి ఎర్నాకులంలో బస చేసిన రేవంత్ గురువారం కూడా కేరళ ప్రచారంలో పాల్గొననున్నారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కూడా రేవంత్తో కలిసి రోడ్షోలకు హాజరయ్యారు. కూనంనేని ఆక్షేపణ కేరళ సీఎం, మార్క్సిస్టు నేత పినరయి విజయన్ను ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న సీపీఐ తప్పుపట్టింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా విధానాలపై రేవంత్ విమర్శలు చేయొచ్చు కానీ, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం సరైంది కాదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆక్షేపించారు. మోదీని విమర్శించవచ్చు కానీ, విజయన్ను మోదీతో పోల్చడం కూడా సరైంది కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తున్న ఇండియా కూటమిలో వామపక్షాలు కూడా కీలక భాగస్వాములనే విషయాన్ని రేవంత్ గుర్తు పెట్టుకోవాలని కూనంనేని వ్యాఖ్యానించారు. -
చర్చించకుండా పారిపోయారు: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం సభా సాంప్రదాయాలను తుంగలో తొక్కిందని శాసనసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ టి.హరీశ్రావు ఆగ్ర హం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా సీఎం రేవంత్రెడ్డి తొండలు, కండల భాష వాడారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిన ప్రతీసారి ప్రతిపక్షంపై ఎదురుదాడి చేస్తూ గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తోందన్నారు. ప్రతిపక్ష పాత్రను బీఆర్ఎస్ సమర్థవంతంగా నిర్వహిస్తుంటే కాంగ్రెస్ తట్టుకోలేకపోతున్నదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, డాక్టర్ సంజయ్, బండారి లక్ష్మారెడ్డి, విజయుడు, పాడి కౌశిక్రెడ్డితో కలిసి అసెంబ్లీ మీడియా హాల్లో మంగళవారం హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత సహాఅనేక అంశాలపై ఎలాంటి దిశా నిర్దేశం లేకుండానే ముగిశాయన్నారు. బడ్జెట్, బిల్లులను ఆమోదించుకోవాలనే రాజ్యాంగ అనివార్యత వల్లే సభను తూతూ మంత్రంగా నడిపారన్నారు. 19 అంశాలపై బీఆర్ఎస్ స్వల్పకాలిక చర్చల కోసం నోటీసులు ఇచ్చినా ప్రభుత్వం ముందుకు రాలేదని, ప్రశ్నోత్తరాల్లో బీఆర్ఎస్ లేవనెత్తిన ప్రశ్నలు చర్చకు రాకుండా సాగదీత ధోరణిలో సభ జరిగిందన్నారు. సీఎం ఢిల్లీ పర్యటనలు, డిప్యూటీ సీఎం సన్నద్ధత పేరిట, విరామం పేరిట గంటల కొద్దీ సభ వాయిదా వేశారని, కేరళ ఎన్నికల కోసం అసెంబ్లీ సమావేశాలను 30వ తేదీన హడావుడిగా ముగించారని హరీశ్రావు మండిపడ్డారు. అవినీతి మంత్రిని కాపాడేందుకు డైవర్షన్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అవినీతిని సాక్ష్యాధారాలతో సహా సభలో బయటపెడితే డైవర్షన్ రాజకీయాలు చేశారని హరీశ్రావు మండిపడ్డారు. అవినీతి మంత్రిని కాపాడేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రెండు రోజుల పాటు సస్పెండ్ చేసి బిల్లులు, పద్దులు ఆమోదించుకున్నారన్నారు. కత్తుల కోలాటం ఆడుతాం.. తలలు తీస్తాం.. సామాజిక బహిష్కరణ చేస్తాం.. అంటూ కాంగ్రెస్ సభ్యుల మాటలను సీఎం పక్కన కూర్చుని ప్రోత్సహించారన్నారు. ఎమ్మెల్యేల వ్యాఖ్యలతో పాటు రేవంత్ రెండేండ్లుగా సభలో వాడుతున్న భాషను కూడా ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇచ్చినా రూ.లక్ష కోట్లు కొట్టుకు పోయాయని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ పార్లమెంటులో కామెంట్లు చేస్తున్నారని, కేంద్ర మంత్రి వ్యాఖ్యలు అచ్చం రేవంత్ మాటల తరహాలోనే ఉండడం కాంగ్రెస్, బీజేపీ నడుమ ఉన్న ఫెవికాల్ బంధానికి నిదర్శనమన్నారు. -
తెలంగాణ కాంగ్రెస్ పాలకులకు కంట్లో నలుసులా మారిన రాజగోపాల్ రెడ్డి
-
తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా...మొత్తం 10 బిల్లులకు ఆమోదం
-
కల్తీపై కొరడా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆహార పదార్థాలు, వస్తువుల కల్తీపై హైడ్రా, ఈగల్ తరహా పకడ్బందీ నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో ప్రస్తుతమున్న వ్యవస్థలను, చట్టాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆహారంతో పాటు వివిధ రూపాల్లో కల్తీ వల్ల కేన్సర్, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ కేన్సర్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా..సోమవారం శాసనమండలి కాన్ఫరెన్స్ హాలులో టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్కుమార్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో కలిసి సీఎం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వ్యవసాయం, పౌష్టికాహారంపై కమిటీ.. ‘ఆహార భద్రత కల్పనలో భాగంగా అందరికీ నాణ్యమైన ఆహారాన్ని అందించాల్సి ఉంది. నాణ్యమైన ఆహారంతోనే బాధ్యత తీరిపోయిందనుకోకుండా..వ్యవసాయం, పౌరసరఫరాలు, సంబంధిత ఇతర శాఖలతో కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసి పౌష్టికాహారం అందించేందుకు, జబ్బులు రాకుండా నివారించేందుకు ఏం చేయాలి అని దానిపై చర్యలు తీసుకుంటాం. విద్యలో నాణ్యత, సాంకేతిక నైపుణ్యాలతో పాటు విద్యార్థులకు భోజనం, పౌష్టికాహారం అందించడం మా ప్రభుత్వ తదుపరి లక్ష్యం. అలాగైతే మోదీ ఫొటో పెడతాం.. సన్న బియ్యం పథకం అమలు కోసం ఏడాదికి రూ.14,560 కోట్లు ఖర్చు చేస్తున్నాం. రాష్ట్రంలోని 86 శాతం మందికి అంటే.. 3.39 కోట్ల మందికి (గతంలోని 2.80 కోట్ల మంది నుంచి 3.39 కోట్లకు పెరుగుదల) సన్న బియ్యం పథకం అందుతోంది. రేషన్కార్డుల పంపిణీ కూడా సంతృప్త స్థాయి (సాచురేషన్ లెవల్)లో వందశాతం పూర్తి చేస్తాం. కేంద్ర ప్రభుత్వం వంద శాతం సన్న బియ్యం ఇస్తే ప్రధాని మోదీ ఫొటో పెడతాం. దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ చేపడితే బాగుంటుందని కేంద్రానికి సూచిస్తున్నాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. పంటల మార్పిడి జరగాలి ‘ప్రస్తుతమున్న పరిస్థితుల్లో లాభసాటి పంట వరి ఒక్కటే కాదన్న విషయాన్ని రైతులు గ్రహించాలి. రాష్ట్ర భూమి, నైసర్గిక స్వరూపం, తదితరాలకు అనుగుణంగా పంటల మార్పిడి జరగాలి. ప్రభుత్వం కూడా వాణిజ్య పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తోంది. అయితే ఈ విషయంలో రైతుల్ని ఒత్తిడి చేయం. వారికి తగిన అవగాహన కల్పిస్తాం. వరి వేస్తే ఉరేనంటూ గతంలో మాజీ సీఎం కేసీఆర్ బెదిరించారు. ఈ విషయంలో ఆయనకు, నాకు ఎలాంటి పోలిక లేదు. మేము బోనస్ కూడా ఇస్తున్నాం. పంటల మార్పిడిపై వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలు, ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు, మేధావులతో టాస్్కఫోర్స్ కమిటీ వేస్తాం. వారిచ్చే నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. రవాణా, కోల్డ్ స్టోరేజీలు, నిల్వ చేసే వ్యవస్థ తదితరాలపైనా సమగ్ర విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఏదైనా పరిస్థితి ఎదురైతే ప్రభుత్వం జోక్యం చేసుకుని ఓ నిధి ఏర్పాటు చేసేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం..’ అని సీఎం వెల్లడించారు. బ్రూటల్ మెజారిటీతో నియంతృత్వం ‘నియోజకవర్గాల పునర్విభజనను 50 శాతం సీట్ల పెంపు ప్రాతిపదికన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ద్వితీయ శ్రేణి రాష్ట్రాలుగా మిగిలిపోతాయి. దక్షిణాదిలో ఒక్క సీటు కూడా గెలవకుండానే ఉత్తరాది, ఇతర ప్రాంతాల్లో గెలిచే సీట్లతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వీలవుతుంది. ఈ విధంగా లభించే ‘బ్రూటల్ మెజారిటీ’ నియంత పాలనకు, నియంతృత్వానికి దారితీస్తుంది. కాబట్టి పునర్విభజన జనాభా ప్రాతిపదికన చేయకూడదు. ఉత్తరాది రాష్ట్రాలకు మరి ముఖ్యంగా యూపీ, మధ్యప్రదేశ్, తదితర రాష్ట్రాలకు, దక్షిణాది రాష్టాలకు మధ్య ప్రస్తుతం ఎంపీ సీట్ల సంఖ్యలో తేడా ఎంత ఉందో అంత స్థాయిలోనే సీట్లు పెంచాక కూడా తేడా ఉండేలా చూడాలి. దీనిపై ఇప్పటికే కేంద్రానికి నిరసన తెలిపాం. లక్ష్మణ్ రాజీనామా చేయాలి దక్షిణాదికి జరిగే అన్యాయం సరిదిద్దకపోతే ఇతర రాష్ట్రాలతో కలిసి ఉమ్మడి కార్యాచరణ చేపట్టి ఉమ్మడిగా పోరాడుతాం. బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ ఏవేవో లెక్కలు చెబుతున్నారు. దక్షిణ భారత ప్రజల కోసం ఆయన తన పదవికి రాజీనామా చేయాలి. ఉత్తరం, దక్షిణం మధ్య అంతరం పెరగకుండా చూడాలి..’ అని రేవంత్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం నుంచి రెండురోజుల పాటు కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్టు తెలిపారు. శకుని వల్లనే శ్రీకృష్ణుడి గొప్పదనం తెలిసొచ్చింది ‘మాజీ సీఎం కేసీఆర్ చెప్పిన దానికి చేసిన దానికి సంబంధం లేదు. కేసీఆర్ ఉండటం వల్లే రేవంత్రెడ్డికి పేరు, గుర్తింపు వచ్చింది. ఆయన లేకపోతే నేను చేసిన మంచి పనులు తెలిసేవి కావు. సన్న బియ్యం ఇస్తున్నాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్కార్డులు ఇలా అన్నీ చేస్తున్నాం. మరి కేసీఆర్ చెప్పినవి చేశారా? డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చారా? మేము చేసేదే చెబుతున్నాం. రావణుడి చెడు వల్లే రాముడి గొప్పతనం తెలిసింది. శకుని చేసిన పనుల వల్లనే శ్రీకృష్ణుడి గొప్పదనం తెలిసొచ్చింది. కేసీఆర్ ఫామ్హౌస్లో రెస్ట్ తీసుకుంటున్నారని బీఆర్ఎస్ వాళ్లు చెబుతున్నారు. కానీ కేసీఆర్ను బావా, బావమరుదులు కలిసి (హరీశ్, కేటీఆర్) గృహ నిర్బంధంలో ఉంచారేమోనన్నది నా అనుమానం..’ అని సీఎం వ్యాఖ్యానించారు. -
ఉద్యమకారులు లేకపోతే సీఎంలు, మంత్రులు లేరు..
-
కాంగ్రెస్ అక్రమ మైనింగ్ పై హౌస్ కమిటీ వేయాలి
-
కేసీఆర్ లేకపోతే నేను లేను: సీఎం రేవంత్
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కారణంగానే తన గొప్పతనం ఏమిటో తెలంగాణ సమాజానికి తెలిసిందని అంటున్నారు సీఎం రేవంత్రెడ్డి. అసలు కేసీఆర్ లేకపోతే తాను లేనంటూ చెప్పుకొచ్చారు రేవంత్. మీడియాతో చిట్చాట్లో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ కేసీఆర్ వల్లే నాకు ఈ గుర్తింపు వచ్చింది. కేసీఆర్ లేకపోతే నేను లేను. రావణుడి చెడువల్లే రాముడి గొప్పతనం తెలిసింది. కేసీఆర్ రెస్ట్ తీసుకుంటున్నారని అంతా అనుకుంటున్నారు. కేసీఆర్ను గృహనిర్బంధం చేశారని నాకు అనుమానంగా ఉంది. కాలనాగు కంటే హరీష్రావు ప్రమాదం’ అని పేర్కొన్నారు. -
సిట్టింగ్ జడ్జితో ఓకే: హరీశ్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోదరులు, బావమరిదితోపాటు తన సోదరుడు, బావమరిది, కుటుంబ సభ్యులపై సీబీసీఐడీ, హౌస్ కమిటీతో కాకుండా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమని అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు ప్రకటించారు. సీఎం సోదరుల టీడీఆర్ కుంభకోణం, బావమరిది అమృత్ కుంభకోణంతోపాటు ఇతర అక్రమాలపై రేవంత్రెడ్డి కూడా విచారణకు సిద్ధమా అని సవాల్ చేశారు. తాను చేసిన సవాల్పై తోక ముడిచి పారిపోకుండా, చెంచాలతో తిట్టించకుండా సీఎం రేవంత్రెడ్డి దమ్ముంటే స్పందించాలన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, కొత్త ప్రభాకర్రెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్తో కలిసి హరీశ్రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నడుమ రాష్ట్రంలో భూముల సెటిల్మెంట్తోపాటు అనేక కుంభకోణాల్లో వాటాలు ఉన్నాయని ఆరోపించారు. మంత్రి పొంగులేటి అక్రమ మైనింగ్ వ్యవహారంపై అసెంబ్లీ సభా సంఘం ఏర్పాటు చేసే దమ్ము సీఎంకు లేదని విమర్శించారు. మంత్రి పొంగులేటి అక్రమాలు బయటపడటంతో అసెంబ్లీ వేదికగా తనపై బురదచల్లే ప్రయత్నం జరుగుతోందన్నారు. ‘కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టి సెటిల్మెంట్కు వచ్చిన వారికి క్లియర్ చేస్తున్నారు. సెటిల్మెంట్లకు ముందుకు రాని వారిని బెదిరిస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి భూ కుంభకోణాలను త్వరలో ఆధారాలతో సహా బయట పెడతాం. సీఎం, మంత్రి కుంభకోణాలపై విచారణ చేసేంత వరకు బీఆర్ఎస్ వదిలిపెట్టదు’అని హరీశ్రావు తేల్చిచెప్పారు. సొంత ప్రయోజనాల కోసం మంత్రి పొంగులేటి తాను ఎన్నడూ ఫోన్ చేయలేదని.. గృహలక్ష్మి పథకం బిల్లుల విడుదల కోసం ఒకట్రెండు సార్లు మంత్రితో ఫోన్లో మాట్లాడినట్లు హరీశ్రావు వెల్లడించారు. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలి.. ‘సీబీసీఐడీ సీఎం రేవంత్రెడ్డి జేబు సంస్థ. మైనింగ్ అక్రమాలపై నిష్పాక్షిక విచారణ కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి లేదా మంత్రివర్గం నుంచి ఆయన్ను బర్తరఫ్ చేయాలి. సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి నడుమ ఫెవికాల్ బంధం ఉండటం వల్లే కొడంగల్, నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్ అప్పగించడంతోపాటు మూసీ సుందరీకరణ ప్రాజెక్టు రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి ఇస్తున్నారు. మంత్రి పొంగులేటి అక్రమ మైనింగ్ వ్యవహారం బయటపడటంతో ఆత్మరక్షణలో పడిపోయిన రేవంత్రెడ్డి.. దృష్టి మళ్లింపు రాజకీయాలకు పాల్పడుతున్నాడు. అసెంబ్లీలో మాకు మైకు ఇవ్వకుండా హౌస్ కమిటీ వేయాలనే మా డిమాండ్పై దళితులంటూ రాజకీయం చేస్తున్నాడు. ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపైనా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడిని ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడిగా భావిస్తున్నాం. గతంలో సీఎం రేవంత్ వాడిన భాషను కూడా ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలి. దళితులపై కాంగ్రెస్ మాటలో ప్రేమ చూపిస్తే బడ్జెట్లో కేటాయింపులు, సంక్షేమ పథకాల ఆచరణలో మేము చూపించాం. దళితులపై రేవంత్రెడ్డి కపట ప్రేమ చూపుతూ మొసలి కన్నీరు కారుస్తున్నాడు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కంపెనీ అవినీతికి పాల్పడిందని స్వయంగా రేవంత్రెడ్డే చెప్పాడు. మంత్రి తప్పు చేస్తే సీబీసీఐడీ విచారణ నిష్పాక్షికంగా జరుగుతుందా? పొంగులేటిని కాపాడే క్రమంలో ప్రభుత్వం మరో 100 అబద్ధాలు చెప్పింది. అక్రమ మైనింగ్లో రూ. వందల కోట్లు రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగింది’అని హరీశ్రావు పేర్కొన్నారు. తాము సీఎంకు అందజేసిన 20 అంశాలపై సిట్టింగ్ జడ్జిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పొంగులేటి అంశంపై భవిష్యత్తులో ఏం చేయాలో తమకు తెలుసని.. సోమవారం ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్ నుంచి తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హరీశ్రావు తెలిపారు. ముఠా నాయకుడిలా రేవంత్: వేముల ప్రశాంత్రెడ్డి మంత్రి పొంగులేటి అక్రమాలను బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్రావు ఆధారాలతో సహా బయటపెడితే సీఎం రేవంత్రెడ్డి డైవర్షన్ రాజకీయాలకు తెరలేపాడని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. ‘రేవంత్ ఎదురుదాడికి దిగి మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తూ మా నేతలను బెదరిస్తున్నాడు. రేవంత్ సభా నాయకుడిలా కాకుండా ముఠా నాయకుడిలా కనిపిస్తున్నాడు. రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కుటుంబానికి చెందిన కంపెనీ అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, అవినీతి ఆరోపణలపై హౌస్ కమిటీ డిమాండ్ నిరాకరించడం సరికాదు. రేవంత్ వ్యాఖ్యలను కూడా ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలి. ‘మిమ్మల్ని తొక్కుతా’అని మాట్లాడినందుకు సీఎంపై చర్యలు తీసుకోవాలి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మేధావి అయితే ఆయన్ను సీఎం చేయాలి. ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డా బీఆర్ఎస్ భయపడదు. అవినీతిపై ప్రశి్నస్తూనే ఉంటాం’అని వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టం చేశారు. -
కేటీఆర్తో రేవంత్ కుమ్మక్కు..: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కు అయ్యారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అందుకే కేటీఆర్పై ఉన్న అవినీతి కేసుల జోలికి పోవడం లేదన్నారు. కేవలం హరీశ్రావును టార్గెట్ చేస్తూ కాళేశ్వరంలోని కొంత భాగం అవినీతిపై మాత్రమే మాట్లాడుతున్నారన్నారు. కాళేశ్వరంలో జరిగిన రూ.లక్ష కోట్ల అవినీతిపై విచారణ జరిపితే మొత్తం బండారం బయటపడుతుందనే భయంతోనే అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ అవినీతిపైనే విచారణకు పరిమితమయ్యారని చెప్పారు. ఆదివారం బీజేపీ కార్యాలయంలో మీడియాతో సంజయ్ ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ... ‘కేటీఆర్ అతిపెద్ద అవినీతిపరుడు. బీఆర్ఎస్ పాలనలో జరగని అవినీతి ఏమైనా ఉందా? కేటీఆర్ సంగతి తెలిసినా రేవంత్ ఎందుకు కాపాడుతున్నారు? కేటీఆర్, రేవంత్ మధ్య ఉన్న ఒప్పందం ఏమిటి’అని నిలదీశారు. ‘కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు నడిపిస్తున్నాయి. హరీశ్తో జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్కు సీఎం సలహా ఇస్తున్నారు. రేవంత్కు కాళేశ్వరం, హరీశ్పై ఉన్నంత పగ కేటీఆర్పై లేదు. ఎందుకంటే ఫార్ములా–ఈ కేసు, డ్రగ్స్, ఫాంహౌజ్ కేసులపై మాట్లాడటం లేదు. కేటీఆర్, కవిత మధ్య సంధి కుదుర్చేందుకు రేవంత్ యతి్నస్తున్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్తో కలిసి పోటీ చేయాలని రేవంత్ భావిస్తున్నారు’అని అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్కు రేవంత్ డబ్బులు సమకూరుస్తున్నారని, కర్ణాటక నుంచి డబ్బులు వెళ్లడం లేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్తో పొత్తు జరగని పని ‘కేసీఆర్పై ఉన్న కోపం కూడా రేవంత్కు పోయింది. ఇద్దరి మధ్య డీల్ కుదిరింది. ఆనాడు తనను జైలుకు పంపించిన సంగతి రేవంత్ మర్చిపోయిండు. ఆ పౌరుషం, రోషం కూడా పోయింది. ఇకపై కేసీఆర్, కేటీఆర్ అవినీతిపై రేవంత్ విచారణ జరిపే అవకాశమే లేదు’అన్నారు. ‘బీఆర్ఎస్, బీజేపీ పొత్తు జరగని పని. కుటుంబ పాలనకు బీజేపీ వ్యతిరేకం. కేసీఆర్ కుటుంబ అవినీతిని భూస్థాపితం చేయాలనే ఉద్దేశంతోనే మేం పోరాడాం. ఆ పార్టీని ఓడించాం. మోదీ ఇటీవల జరిగిన సమావేశంలో రాజకీయ కుటుంబ వారసులకు టిక్కెట్లు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. అలాంటప్పుడు అవినీతి కుటుంబ పార్టీతో మేం పొత్తు ఎందుకు పెట్టుకుంటాం’అని సంజయ్ పేర్కొన్నారు. -
ఎంతో కొంత కళా పోషణ ఉండాలి
గన్ ఫౌండ్రీ (హైదరాబాద్): మనిషన్నాక ఎంతో కొంత కళాపోషణ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉద్ఘాటించారు. రెండు రోజులపాటు నిర్వహించిన శాసన సభ్యుల క్రీడా సాంస్కృతిక పోటీల ముగింపు సభ ఆదివారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... చాలామంది ప్రజా ప్రతినిధులు తమలో ఉన్న ప్రతిభను మర్చిపోయారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో శాసనసభ్యులకు క్రీడా పోటీలు నిర్వహించే వారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ సంప్రదాయాన్ని కొనసాగించలేదన్నారు. శాసనసభ్యుల క్రీడా పోటీలను కొందరు రాజకీయం చేసి బహిష్కరించారని, కనీసం వచ్చే సంవత్సరమైనా పాల్గొనాలని సూచించారు. క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. విద్యార్థులు మత్తు పదార్థాల వైపు వెళ్తూ.. తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిలిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పోటీల్లో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, పలువురు శాసన సభ్యులు, కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. విజేతలు వీరే.. : క్రికెట్లో మంత్రి శ్రీహరి జట్టు విజయం సాధించగా.. బ్యాడ్మింటన్లో రాందాస్ నాయక్, ఆదినారాయణ జోడి విజయం సాధించింది. టేబుల్ టెన్నిస్లో మంత్రి జూపల్లి కృష్ణారావు గెలుపొందారు. పవర్ లిఫ్టింగ్ 63 కేజీల విభాగంలో శంకర్ నాయక్, 93 కేజీల విభాగంలో మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, 105 కేజీల విభాగంలో అనిరుధ్ రెడ్డి విజయం సాధించారు. ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు శాసనసభ్యుల కోసం రవీంద్ర భారతిలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అట్టహాసంగా జరిగాయి. దుర్యోధనుడి వేషధారణలో మంత్రి వాకిటి శ్రీహరి పలికిన డైలాగులు, గంభీరమైన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. కట్టప్ప పాత్రలో శంకర్ నాయక్ ఒదిగిపోగా, ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు గిరిజన సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించారు. వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ గిరిజన పాటలకు హుషారుగా డ్యాన్స్ చేయగా.. రామచంద్రనాయక్ తనదైన స్టెప్పులు వేశారు. -
తల్లిదండ్రులకు తోడుగా..
సాక్షి, హైదరాబాద్: ‘బాధ్యతా రహితంగా వ్యవహరించే కొడుకులను నియంత్రించడంతో పాటు తల్లిదండ్రుల్లో విశ్వాసం పెంచేందుకే సామాజిక బాధ్యతగా.. ‘తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ, జవాబుదారీతనం, పర్యవేక్షణ బిల్లు’తీసుకువచ్చాం. తల్లిదండ్రులకు ఈ చట్టం ఒక మంత్రదండం. తల్లిదండ్రులను చూసుకోని వారిని సమాజం బహిష్కరించాలి. అలాంటి వారిని చట్టపరిధిలోకి తెచ్చి దారిలో పెట్టడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం.అయితే దీనితోనే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని కాదు.. వృద్ధ తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగించేందుకే మా ప్రయత్నం. ఏ తల్లిదండ్రులు అనాథలుగా ఉండకూడదు, చివరిరోజుల్లో ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో ఈ బిల్లును తెస్తున్నాం..’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. ఆదివారం అసెంబ్లీలో ఈ బిల్లు’పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. బాధ్యత, భావోద్వేగంతో.. ‘పురాణాలలో శ్రవణ కుమారుడి కథ మాతృ పితృ భక్తికి అద్దం పడితే..అత్యంత విలాసవంతమైన జీవితం గడిపిన రేమండ్స్ మాజీ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మభూషణ్ అవార్డు గ్రహీత విజయ్పథ్ సింఘానియా చివరకు కొడుకు చేసిన ద్రోహంతో అనామకుడిగా తనువు చాలించాల్సి వచ్చింది. పిల్లలకు సర్వస్వం ఇచ్చి పెద్ద తప్పు చేశానంటూ.. తన ఆత్మకథ ‘యాన్ ఇన్కంప్లీట్ లైఫ్’పుస్తకంలో సింఘానియా తన చేదు అనుభవాలను వివరించారు. కొందరు ప్రజాప్రతినిధులు సైతం ఇదే రకమైన ధోరణితో ఉన్నారు. ఒక మాజీమంత్రి తండ్రి సైతం ఇదే విధంగా సరిగా చూసుకోని పరిస్థితుల్లో క్యాన్సర్తో చనిపోయారు. భవిష్యత్తులో తల్లిదండ్రులకు ఆ పరిస్థితి రావొద్దనే ప్రభుత్వం.. బాధ్యత, భావోద్వేగంతో ఈ బిల్లును తీసుకువచ్చింది. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. తల్లిదండ్రులను సంతానంలో ఎవరో ఒకరు చూసుకునేవారు. కానీ ఇప్పుడు మేం ఇద్దరం మాకు ఒక్కరన్న పరిస్థితి వచ్చింది. వృద్ధ తల్లిదండ్రులకు రక్షణ మనిషి బంధాలు, అనుబంధాలను మర్చిపోయి చివరికి పేగు బంధాలను కూడా విస్మరించి భౌతిక సుఖాలు, ఆర్థిక ప్రయోజనాలు, సంపద కోసం పాకులాటల్లో మునిగిపోయాడు. బతికున్నప్పుడు గుప్పెడు మెతుకులు పెట్టని బిడ్డలు, చనిపోయాక ఆస్తుల కోసం కొట్లాడుకోవడం అత్యంత విషాదకరం. తల్లిదండ్రులపై ఒకవేళ కూతురికి ప్రేమ ఉన్నా పెళ్లి తర్వాత వారిని చూసుకోలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం మహిళలు, చిన్నారులను కాపాడేలా ఎన్నో చట్టాలు ఉన్నాయి. పిల్లలు తమ తల్లిదండ్రులను చూసుకోవడం చట్టబద్ధ బాధ్యత అని చెబుతూ ఇప్పటికే చట్టాలున్నా సమాజంలో తల్లిదండ్రుల సంరక్షణ విషయంలో జరుగుతోన్న వివక్ష, నిర్లక్ష్యం గమనిస్తూనే ఉన్నాం. ఈ విధంగా నిర్లక్ష్యానికి గురవుతున్న తల్లిదండ్రుల్లో విశ్వాసాన్ని పెంచేందుకు తీసుకువచ్చిన ఈ బిల్లుకు సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలపాలి. తల్లిదండ్రుల పట్ల భక్తి లేనివారికి భయం కలిగించేందుకే ఈ చట్టం తెచ్చాం. వృద్ధ తల్లిదండ్రులకు రక్షణ కల్పించే దిశగా ఇది ఒక కీలక అడుగు అవుతుంది..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ‘అమ్మా.. నీకు వందనం’ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ఈ బిల్లు పెట్టాల్సి రావడం దురదృష్టకరమన్నారు. సమాజం మారాలని, విలువలు పెరగాలని ఆకాంక్షించారు. కన్నబిడ్డలు నిర్ల క్ష్యం చేసిన ఓ ముస్లిం మహిళను తాను చేరదీసి అనాథా శ్రమంలో చేర్చిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. ఎంతో మానవత్వంతో ఆలోచించి ఈ బిల్లును ప్రవేశపెట్టిన సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఎమ్మెల్యే ఆదినారాయణ అన్నారు. ఈ సందర్భంగా ‘అమ్మా.. నీకు వందనమే..’అనే పాట ఎమ్మెల్యే పాడారు. గతంలో కుటుంబ అనుబంధాలు చాటిచెప్పే సినిమాలు వచ్చేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఎమ్మె ల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను భయపెట్టే స్థితిలో కొందరు కొడుకులు, కోడళ్లు ఉన్నారన్నారు. బిల్లుకు ఎమ్మెల్యేలు పాయల్శంకర్, జాఫర్ హుస్సేన్ మద్దతు తెలిపారు. చర్చ అనంతరం బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ సమాజంలో ఏ కుటుంబంలోనూ తల్లిదండ్రులు అనాథలుగా మిగిలిపోకూడదన్న సంకల్పంతోనే ప్రభుత్వం తల్లిదండ్రుల రక్షణ కోసం చట్టం తీసుకొస్తుందని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు చెప్పారు. శాసనసభలో మంత్రి @minister_adluri గారు ప్రవేశపెట్టిన “తెలంగాణ ఎంప్లాయిస్ అకౌంటబిలిటీ, మానిటరింగ్ ఆఫ్… pic.twitter.com/F1JJLwwWsp— Telangana CMO (@TelanganaCMO) March 29, 2026 -
రేవంత్ పాలనలో 19 ప్రధాన స్కామ్లు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రెండేళ్ల మూడు నెలల పాలనలో 19 ప్రధాన కుంభకోణాలు జరిగాయని, వీటిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో లేదా హౌజ్ కమిటీ వేసి విచారణ జరపాలని బీఆర్ఎస్ శాసనసభా పక్షం డిమాండ్ చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పీకర్కు అందజేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీ అక్రమ మైనింగ్పై హౌజ్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ సభ్యులు సభలో నినాదాలు చేస్తున్న సమయంలోనే ఈ లేఖను అందజేశారు. తాము ఇచ్చిన లేఖను సీఎం రేవంత్రెడ్డికి పంపాలని కోరారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్లలో రాష్ట్రం అవినీతి, కుంభకోణాలకు కేంద్రంగా మారిపోయింది. దాదాపు అన్ని శాఖల్లో అవినీతి, అక్రమాలు, అధికార దురి్వనియోగం యథేచ్ఛగా సాగుతోంది. వాటిని అడ్డుకోవాల్సిన వారే ఈ దోపిడీకి మూలస్తంభాలుగా మారిన పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. బాధ్యత వహించాల్సిన మంత్రులకు ఈ కుంభకోణాల్లో నేరుగా ప్రమేయం ఉందనే ఆరోపణలు రావడం ప్రజాస్వామ్య వ్యవస్థకు అవమానం. ఈ కుంభకోణాల ఫలితంగా రూ.వేల కోట్ల ప్రజా ధనం కొద్దిమంది చేతుల్లోకి మళ్లిపోతోంది. నియంత్రణ లేకుండా సాగుతున్న ఈ దోపిడీని చూస్తే ఇది నిర్లక్ష్యమా లేక మీ ప్రోత్సాహమా అన్న అనుమానం ప్రజల్లో బలపడుతోంది’అని లేఖలో బీఆర్ఎస్ శాసనసభాపక్షం పేర్కొంది. అడ్డుకోవడం సీఎంగా మీ బాధ్యత ‘అవినీతి, కుంభకోణాలపై లేఖ రాస్తే విచారణ జ రుపుతామని శాసనసభలో స్వయంగా మీరే ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ పాలనలో జరిగిన కుంభకోణాల వివరాలు అందిస్తున్నాం. ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ కుంభకోణాలపై సిట్టింగ్ జడ్జితో విచా రణ జరిపి బాధ్యులపై కఠినచర్యలు తీసుకుని, ప్రజా ధనాన్ని రికవరీ చేయాలి.పౌర సరఫరాలు, అమృత్ టెండర్లు, కేఎల్ఎస్ఆర్, నైనీ కోల్ బ్లాక్, సింగరేణి స్కామ్, సోలార్ పవర్స్కామ్, ఎన్టీపీసీ థర్మల్ పవర్ స్కామ్, హెచ్సీయూ, లగచర్ల భూ స్కామ్, కోటి ఎకరాల భూమి నిషేధిత జాబితా కుంభకోణం, హ్యామ్ రోడ్లు, ఫోర్త్ సిటీ, హిల్ట్–పీ, అక్రమ మైనింగ్ వంటి కుంభకోణాలపై విచారణ జరపాలి. నిష్పక్షపాత విచారణ కోసం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు వెంటనే పదవులకు రాజీనామా చేయాలి. ప్ర జాధనాన్ని రక్షించడం, అవినీతి అక్రమాలను అడ్డు కోవడం రాజ్యాంగబద్ధమైన సీఎంగా మీ బాధ్యత’అని లేఖలో బీఆర్ఎస్ శాసనసభాపక్షం పేర్కొంది. -
సీఐడీ వద్దంటే సీబీఐ
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన మైనింగ్ లావాదేవీలపై సమగ్ర విచారణను సీబీసీఐడీకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చాం. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీబీసీఐడీ విచారణ సక్రమంగా జరగదనే అనుమానం వారికి (ప్రతిపక్షం) ఉంటే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీబీఐ విచారణ కావాలా? సీబీఐ విచారణ కావాలని వారిని అడగమనండి. అడిగితే వేస్తాం’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. మైనింగ్ అక్రమాలపై సభాసంఘం వేయాలని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలోని పోడియం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆదివారం సైతం ఆందోళనకు దిగిన నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ తీరును తూర్పారపట్టారు. సభలో బీఆర్ఎస్ పప్పులు ఉడకవని... వారి మంత్రాలకు చింతకాయలు రాలవని ధ్వజమెత్తారు. పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి చెందిన వారు గానీ, తన కుటుంబంగానీ ఏమైనా అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం ఉంటే సీబీసీఐడీకి ఆధారాలు సమర్పించాలని అన్ని పార్టీల సభ్యులకు సీఎం సూచించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సంబంధించిన మైనింగ్ లావాదేవీల్లో అక్రమాలు చేసినట్లు ఆధారాలున్నా సీబీసీఐడీకి ఇవ్వాలని.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన మైనింగ్ లావాదేవీలపైనా విచారణ జరుపుతామని అన్నారు. కేటీఆర్, హరీశ్రావు సీబీసీఐడీకి సహకరించాలన్నారు. హరీశ్రావు కారణంగా ఇరుకునపడ్డానని కేటీఆర్ ఆగ్రహంగా ఉన్నారంటూ చురకలంటించారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... రాఘవ కన్స్ట్రక్షన్స్ నుంచి పన్నులు రాబట్టింది మేమే ‘రాఘవ కన్స్ట్రక్షన్స్ విషయంలో 2025లో వాస్తవ పరిస్థితులు తెలుసుకొని మైనింగ్ శాఖ పన్నులు రాబట్టుకుంది. ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చర్యలు తీసుకున్నాం. ఇంత పారదర్శకంగా మేం తీసుకున్న చర్యలను అభినందిస్తే మా అధికారులు మరింత ఉత్సాహంగా పనిచేసేవారు. మా ప్రభుత్వం ఇచ్చిన నోటీసు తీసుకొచ్చి వాళ్లేదో కనిపెట్టినట్లు మాట్లాడుతున్నారు. దానిపై సభాసంఘం వేయాలని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ల ప్రభుత్వంలో మూడు సభాసంఘాలు వేసి బ్లాక్మెయిల్ చేసి ఆస్తులు గుంజుకున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి రాజకీయ లబ్ధి పొందారు. వారిలా హౌస్ కమిటీ వేసి రాజకీయ లబ్ధి పొందాలని మేం చూడలేదు. హౌస్ కమిటీ వేసినా నివేదికను మళ్లీ ఏదో ఒక ప్రభుత్వ విచారణ సంస్థకు ఇవ్వాల్సిందే. అందుకే మేం నేరుగా సీబీసీఐడీ విచారణకు ఆదేశించాం’అని సీఎం రేవంత్ చెప్పారు. దళితులను అవమానించేలా బీఆర్ఎస్ తీరు ‘తెలంగాణ సాధిస్తే దళితుడిని సీఎం చేస్తానని నాడు కేసీఆర్ చెబితే ప్రజలు నమ్మి ఓట్లేశారు. కానీ దళితులకు సీఎం పదవి చేతకాదు.. దొర మాత్రమే సీఎం కావాలని దళితులను నట్టేట ముంచాడు. 2018 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక కేవలం కొప్పుల ఈశ్వర్కు మంత్రి పదవి ఇచ్చాడు. విద్యావంతుడైన భట్టి విక్రమార్కను కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నేతను చేస్తే సంవత్సరం తిరగకముందే ఎమ్మెల్యేలను లాక్కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. అయినా సహనం కోల్పోకుండా ఆయన పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. అలాంటి ఆయన్ను డిప్యూటీ సీఎంగా, ఆర్థిక మంత్రిగా చేస్తే దాన్ని కూడా సహించట్లేదు. దొరలు మాత్రమే పాలించే తెలంగాణలో దళితుడు బడ్జెట్ ప్రవేశపెడతాడా అని ఉప ముఖ్యమంత్రిని అవమానించేలా వ్యవహరిస్తున్నారు. దళితులపై ప్రేమ కాదు.. కనీసం మానవత్వం కూడా చూపట్లేదు’అని సీఎం రేవంత్ మండిపడ్డారు. దళితుడు పైన కూర్చుంటే కింద కూర్చోవాలా అని కేసీఆర్ సభకు రావట్లేదు ‘గతంలో దళితులు, గిరిజనులకు జరిగిన అవమానాలను గుర్తించే మేం అధికారంలోకి రాగానే పాలనలో వారికి పెద్దపీట వేశాం. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు, దయాకర్రావు, కవితారావు, సంతోశ్రావు, వినోద్రావులు రాజ్యమేలారు. కానీ మా టీంలో భట్టి, దామోదర రాజనర్సింహ, వివేక్, అడ్లూరి, సీతక్క, రామచంద్ర నాయక్, వేముల వీరేశం, అద్దంకి దయాకర్ మొదలైన వారున్నారు. ఇన్నాళ్లూ చేసిన పాపాలకు అనుభవిస్తారని స్పీకర్గా దళితుడిని కూర్చోబెడితే ఒక దళితుడి ముందు మైక్ అడగడమా? దళితుడు పైన కూర్చొంటే నేను కింద కూర్చోవాలా? అని కేసీఆర్ సభకు రావట్లేదు. కేసీఆర్ అలా వ్యవహరించగా ఆ పారీ్టలోని ఇతర సభ్యులు సభను నడవనివ్వట్లేదు. స్పీకర్ ఎన్నిసార్లు సభను సజావుగా సాగనీయాలని కోరినా వినట్లేదు. సభాపతిని అవమానించారు. దళితులు మంత్రులుగా ఉండకూడదన్నట్లుగా కుట్రలు చేస్తున్నారు. కుల వివక్షను బహిరంగంగా ప్రదర్శిస్తున్నారు. దళితులను అవమానించే రాజకీయ సంస్కృతి ఇక నడవదు. వారికి గౌరవం, అవకాశాలు కలి్పంచడం మా ప్రభుత్వ బాధ్యత’అని రేవంత్రెడ్డి చెప్పారు. కేసీఆర్తో రాజీనామా చేయించండి ‘సభలో ఒకట్రెండు కోతులు సభను అపహాస్యం చేస్తున్నాయి. రెవెన్యూ శాఖలో సంస్కరణలు తెచ్చి లక్షలాది కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్న పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని రాజీనామా చేయాలంటున్నారు. వారికి సిగ్గుంటే సభకు రాని కేసీఆర్తో రాజీనామా చేయించాలి. రూ. కోటీ పది లక్షల జీతం తీసుకొని సభకు రాడట, జీతం వెనక్కు ఇవ్వడట. ఆయన రాజీనామా చేయవద్దట. గురివింద గింజ సామెతలా వ్యవహరిస్తున్నారు. సభ్యులుగా ఏ అంశమైనా వారు లేవెనెత్తొచ్చు. కానీ మేం చెప్పినట్టే ఈ ప్రభుత్వం నడవాలనే విధానం దుర్మార్గం. స్పీకర్ను నిర్దేశించే ఈ విధానం ఎక్కడిది? కడియం శ్రీహరి కేసీఆర్కు సమానంగా ప్రజాజీవితం నుంచి వచ్చిన వ్యక్తి. నిబద్ధత, నిజాయితీతో కూడిన నాయకుడు. అవినీతి మచ్చలేని సీనియర్ నాయకుడిపై కౌశిక్రెడ్డి వ్యవహరించిన తీరు సరైనదేనా అని కేటీఆర్, హరీశ్ చెప్పాలి. అసభ్యకరంగా, అసహ్యకరంగా సభలో వ్యవహరిస్తే మీరు ఒప్పుకుంటారా? మా దగ్గర కూడా కండలు తిరిగిన రాజ్ ఠాకూర్ (రామగుండం ఎమ్మెల్యే) లాంటి వాళ్లు ఉన్నారు. ఇలాగే ఉంటే అసెంబ్లీలో కత్తిపోట్లు, కుస్తీపోట్లకు పోటీలు జరగాల్సి ఉంటుంది. సభ్యులు సభను సజావుగా జరగనివ్వకపోతే సభా వ్యవహారాల మంత్రి సస్పెన్షన్కు సిఫారసు చేస్తారు. పాడి కౌశిక్రెడ్డి వ్యవహారంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి’అని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. -
‘మంత్రి అవినీతికి పాల్పడినట్లు రేవంతే ఒప్పుకున్నారు’
హైదరాబాద్: మంత్రి పొంగులేటి కంపెనీ అవినీతిక పాల్పడిందనే విషయం ప్రజలకు అర్థమైందని బీఆర్ఎస్ నేత హరీష్రావు పేర్కొన్నారు. కాకపోతే డైవర్షన్ కోసం రేవంత్ ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. మంత్రిని కాపాడటానికే సీబీసీఐడీ విచారణ వేశారని, హౌస్ కమిటీ గానీ, సిట్టింగ్ జడ్జితో గానీ విచారణ చేయించాలని హరీష్ డిమాండ్ చేశారు. ఈరోజు(ఆదివారం, మార్చి 29వ తేదీ) ప్రెస్మీట్లో హరీష్రావు మాట్లాడుతూ.. ‘ పొంగులేటి కంపెనీ అవినీతికి పాల్పడిందని ప్రజలకు అర్థమైంది. తప్పు జరిగిందని రేవంత్ స్వయంగా ఒప్పుకున్నారు. మంత్రి అవినీతికి పాల్పడినట్లు రేవంతే ఒప్పుకున్నారు. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి పది తప్పులు చేస్తున్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది’ అని విమర్శించారు.సీఎం రేవంత్కు హరీష్ సవాల్సీఎం రేవంత్రెడ్డికి హరీష్రావు సవాల్ విసిరారు. ‘మీ తమ్ముడు చేసిన అవినీతిపై విచారణకు సిద్ధమైతే.. హౌస్ కమిటీ విచారణకు నేను సిద్ధం. హౌస్ కమిటీ విచారణ.. సీఐడీ విచారణ కాకుండా, ఇద్దరం కలిసి సిట్టింగ్ జడ్జితో విచారణకు వెళ్దాం.. సీఎం రేవంత్ సిద్ధంటే.. నేను సిద్ధం’ అని చాలెంజ్ చేశారు. నిన్న(శనివారం, మార్చి 28వ తేదీ) అసెంబ్లీలో హరీష్ మాట్లాడుతూ.. నగరం నడిబొడ్డను అక్రమ మైనింగ్ జరుగుతుందని ధ్వజమెత్తారు. కంచె చేనుమేసినట్లు.. రక్షకుడే భక్షకుడిలా మారినట్లు అక్రమ మైనింగ్ జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాఘవ కన్స్ట్రక్షన్స్ నడుపుతున్న క్రషర్స్ కు ఎలాంటి అనుమతులు లేవని,. జీవో త్రిబుల్ వన్ వైలెట్ చేస్తూ ఆక్రమణ జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? అని ప్రశ్నించారు, క్రషర్ నడపాలంటే 8 రకాల అనుమతులు కావాలని, నిబంధనలను పాటించకుండా క్రషర్ నడుపుతున్నారని మండిపడ్డారు. -
TG: తల్లిదండ్రుల చట్టానికి ఆమోదం
సాక్షి,హైదరాబాద్: తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీలో అధికారికంగా ప్రకటన చేశారు. ‘తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగి జీతంలో 15శాతం కోసం కోత విధించి ఆ మొత్తాన్ని నేరుగా ఉద్యోగి తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసేలా చట్టాన్ని రూపొందించామని తెలిపారు. పిల్లల్ని కనగలం..వారి బుద్ధుల్ని మనం కనలేం అన్నట్లుగా ఉంది కొందరి వ్యవహారం. సామాజిక బాధ్యతగా మా ప్రభుత్వం తల్లిదండ్రుల కోసం ఈ చట్టం తెచ్చింది. భక్తితో లేదా భయంతో తల్లిదండ్రుల్ని చూసుకోవాలన్నదే మా ఆలోచన. ప్రేమలు పంచాల్సి చోట చట్టం తేవడం బాధగా ఉంది. తల్లిదండ్రుల్ని పట్టించుకోని ప్రతి కుమారికి బుద్ధి చెప్పే చట్టం ఇది. ఉద్యోగులే కాదు ప్రజా ప్రతినిధులు సైతం ఈ చట్టం కిందకి వస్తారు. తల్లిదండ్రుల్ని పట్టించుకోని కుమారులను సామాజిక బహిష్కరణ చేయాలి’అని సూచించారు.


