కల్నల్పై సీబీఐ కేసు..రూ.కోటి అక్రమాస్తి
పుణె: పెద్ద మొత్తంలో అక్రమాస్తులు కూడబెట్టిన విధుల్లో ఉన్న కల్నల్, ఆయన భార్యపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కేసు నమోదు చేసింది. వారి వద్ద లెక్కచూపనీ ఆస్తులు రూ.కోటి వరకు గుర్తించింది. జనవరి 1, 2008 నుంచి మార్చి 27, 2017 మధ్య ఆ అధికారి పుణె, జమ్ము, రాజస్థాన్లో విధులు నిర్వర్తించాడని ఈ కాలంలోనే దాదాపు రూ.1కోటి వెనుకేసినట్లు సీబీఐ తన ఎఫ్ఐఆర్లో పేర్కొంది.
ప్రస్తుతం ఆ అధికారి 516 ఆర్మీ సర్వీస్ కార్ప్స్ (ఏఎస్సీ) బెటాలియన్ 16లో విధులు నిర్వహిస్తున్నాడని, ఆ విభాగం సౌత్ వెస్ట్రన్ కమాండ్ లో భాగంగా ఉందని పేర్కొంది. సీబీఐ వివరాల ప్రకారం 2009లో నేషనల్ డిఫెన్స్ అకాడమీలోలో(ఎన్డీఏ) క్యాటరింగ్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఆయన జమ్ముకు బదిలీ అయ్యాడు. ఆ తర్వాత రెండేళ్లు అక్కడ పనిచేసి శ్రీగంగనగర్కు బదిలీ అయ్యాడు. అతడికి పెద్ద మొత్తంలో బ్యాంకు ఖాతాలు వివిధ బ్యాంకుల్లో భార్య పేరిట, తన పేరిట ఉన్నట్లు గుర్తించి ఆ మొత్తం సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో లెక్కలు చెప్పకపోవడంతో కేసు నమోదు చేశారు.