కంధమాల్ ఉప ఎన్నికల్లో బీజేడీ ఘన విజయం
భువనేశ్వర్: రాష్ట్రంలోని కంధమాల్ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార బీజేడీ అభ్యర్థి ప్రత్యుష రాజేశ్వరి సింగ్ ఘన విజయం సాధించారు. ఆమె తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి రుద్రమదేవి రాయ్పై దాదాపు 2 లక్షల ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. ప్రత్యుష రాజేశ్వరి సింగ్ 422, 286 ఓట్లు సాధించగా... రుద్రమదేవికి 162,352 ఓట్లు పడ్డాయి. ఆ తర్వాత స్థానంలో కాంగ్రెస్ పార్టీ నిలిచింది. ఆ పార్టీ అభ్యర్థి అభిమన్యు బెహరాకి 77, 802 ఓట్లు పోలైయ్యాయి.
గతంలో కంధమాల్ లోక్సభ స్థానం నుంచి బీజేడీ అభ్యర్థిగా గెలుపొందిన హేమేంద్ర నారాయణ సింగ్ ఇటీవల మరణించారు. ఈ నేపథ్యంలో ఆ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ సందర్భంగా తమ పార్టీ అభ్యర్థిగా హేమేంద్ర భార్య ప్రత్యుష రాజేశ్వరి సింగ్ని బీజేడీ నిలబెట్టింది. దాంతో ఈ నెల 15న మహారాష్ట్ర, హర్యానా శాసనసభ స్థానాలతోపాటు మహారాష్ట్రలోని బీడ్, ఒడిశాలోని కంధమాల్ లోక్సభ స్థానాలకు ఉప ఎన్నికల నిర్వహించారు.