Sabita Indra
-
రాష్ట్రంలో కుటుంబ పాలనకు చెక్
బోథ్ నుంచే ఉద్యమం రాష్ట్ర మాజీ హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి నేరడిగొండ : రాష్ట్రంలో టీఆర్ఎస్ కుటుంబ పాలనకు చెక్పెట్టేలా బోథ్ నుంచే ఉద్యమాన్ని చేపడుతామని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. రైతులు, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే వరకూ ఉద్యమిస్తామని తెలిపారు. శనివారం నేరడిగొండలోని గార్డెన్స్లో బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి జాదవ్ అనిల్కుమార్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం అబద్దాల కుటుంబమని విమర్శించారు. నాయకుడంటే వైఎస్.రాజశేఖరరెడ్డిలా ఉండాలని, మాటపై నిలబడాలని సీఎం కేసీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, కూతరు కవిత, మేనల్లుడు హరీష్రావ్ అందరూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలకు గమ్యాలు ఉండవని, టీఆర్ఎస్ చేతిలో తెలంగాణ సమాజం మోసపోయిందని అన్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, కార్యకర్తలు, నాయకులు అధైర్య పడవద్దని అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి గండ్రత్ సుజాత మాట్లాడుతూ పాలక పక్షాన్ని గల్లీ నుంచే ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ 2019లో జరిగే ఎన్నికల్లో బోథ్ ఎమ్మెల్యేగా అనిల్జాదవ్ ఎన్నికవుతారని జోస్యం చెప్పారు. 33 ఏళ్ల నుంచి బోథ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరకపోవడానికి గ్రూపు విబేధాలే కారణమని, ఇక నుంచి అందరినీ కలుపుకొని పోతామని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్రెడ్డి ఏ కార్యక్రమం చేపట్టిన చేవేళ్ల నుంచే ప్రారంభించే వారని, ఇప్పుడు ఇక్కడికి చేవేళ్ల చెల్లమ్మగా పిలువబడుతున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రావడం మన అదృష్టమని పేర్కొన్నారు. జిల్లాల పునర్విభజనలో శాస్త్రీయత లేదని విమర్శించారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు రవీందర్రావు, గంగాభవాని, ప్రేమలత అగర్వాల్, జిల్లా నాయకులు సాజిద్ఖాన్, మల్లెపూల సత్యనారాయణ, తిరుమల్గౌడ్, రాజుయాదవ్, నేరడిగొండ సర్పంచ్ విజయలక్ష్మి, రోల్మామడ ఎంపీటీసీ తొడసం గోదావరి, కార్యకర్తలు పాల్గొన్నారు. సబితాఇంద్రారెడ్డి సమక్షంలో నియోజకవర్గంలోని సుమారు 200 మంది వరకు టీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. తెలంగాణ హైకోర్టును వెంటనే ఏర్పాటు చేయాలి నిర్మల్టౌన్ : తెలంగాణ హైకోర్టును వెంటనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్చార్జి సబితాఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. నిర్మల్లోని డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్రెడ్డి నివాస భవనంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో న్యాయవ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, ఆందోళన చేస్తున్న న్యాయమూర్తులను సస్పెండ్ చేయడం అన్యాయమని అన్నారు. కక్షిదారులకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా న్యాయమూర్తులను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెండ్ చేయలేదని గుర్తు చేశారు. హైకోర్టు ఏర్పాటు దిశగా తెలంగాణ ప్రభుత్వం ఏ విధమైన చర్యలు చేపట్టడం లేదన్నారు. 10 మంది ఎంపీలు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేయలేకపోతుందని విమర్శించారు. హైకోర్టు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్పై సాకులు చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చోకుండా తగిన ప్రయత్నం చేయాలన్నారు. పార్లమెంట్ను స్తంభింపజేసి తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసే విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు సత్యంచంద్రకాంత్, తక్కల రమణారెడ్డి, సాద సుదర్శన్, వెంకట్రారాంరెడ్డి, సుజాత, మేర్వాన్, దినేష్, లింగారెడ్డి పాల్గొన్నారు. అంతా వైఎస్ నామస్మరణే నియోజక వర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో కార్యకర్త నుంచి నాయకుల వరకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి చేసిన పనులను కొనియాడారు. రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, విద్యార్థులకు కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం, తదితర అంశాలపై ప్రస్తావించారు. వేదికపై ఉన్న నాయకులు వైఎస్ పేరు చెప్పడంతో అందరూ కరతాళ ధ్వనులు చేశారు. నాయకుడంటే వైఎస్లా ఉండాలని, ఇప్పుడు మాయమాటలు చెప్పి కేసీఆర్ ఇప్పటికీ రుణమాఫీ సరిగా చేయలేదని వివరించారు. వైఎస్సార్ చేసిన అభివృద్ధి పనులే ఇప్పుడు జరుగుతున్నాయని తెలిపారు. -
ప్రాధాన్యం దక్కింది!
♦ పీసీసీలో జిల్లాకు పెద్దపీట ♦ సబిత, ప్రసాద్, చంద్రశేఖర్లకు చోటు ♦ డీసీసీ ఆశావహులకు ప్రమోషన్ ♦ పీసీసీ కార్యవర్గంలోకి క్యామ మల్లేశ్ ♦ కొత్త నేతకు డీసీసీ పగ్గాలు అప్పగించే అవకాశం మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గడ్డం ప్రసాద్కుమార్, మాగం రంగారెడ్డి సహా డీసీసీ పీఠాన్ని ఆశిస్తున్న డాక్టర్ ఏ చంద్రశేఖర్, క్యామ మల్లేష్కు పీసీసీ కార్యవర్గంలో స్థానం దక్కింది. ఉపాధ్యక్షులుగా సబితా ఇంద్రారెడ్డి, ప్రసాద్కుమార్, పి.నరసింహారెడ్డి, ఎం.రంగారెడ్డి.. ప్రధాన కార్యదర్శిగా జెట్టి కుసుమ కుమార్కు మళ్లీ అవకాశం కల్పించారు. కార్యనిర్వాహక కమిటీ సభ్యులుగా కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, ఎమ్మెల్యే టి.రామోహ్మన్రెడ్డిలను నియమించారు. శాశ్వత ఆహ్వానితులుగా మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, క్యామ మల్లేష్, డాక్టర్ చంద్రశేఖర్ స్థానం దక్కింది. ఇక పీసీసీ సమన్వయ కమిటీలో జిల్లా నుంచి సర్వే, మాగంకు మాత్రమే అవకాశం లభించింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : రాష్ట్ర కాంగ్రెస్ కార్యవర్గంలో జిల్లాకు ప్రాధాన్యందక్కింది. శనివారం ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ జంబో కార్యవర్గంలో మాజీ మంత్రులు, సీనియర్లకు అవకాశం కల్పించింది. నాయకుల అంతర్గత విభేదాలకు చెక్ పెడుతూ అధిష్టానం వ్యూహాత్మకంగా పదవుల పంపకం చేపట్టింది. డీసీసీపై పంతాలకు పోతున్న రెండు గ్రూపుల ముఖ్యనేతలకు పీసీసీ కార్యవర్గంలో చోటు కల్పించడం ద్వారా.. డీసీసీ పీఠంపై నెలకొన్న వివాదానికి చెక్ పెట్టింది. సరికొత్త నేతకు డీసీసీ పీఠం జిల్లా కాంగ్రెస్ పీఠంపై నెలకొన్న ఉత్కంఠకు అధిష్టానం తెరదించింది. పదవుల పంపకంలో సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకున్న అధినాయకత్వం డీసీసీ రేసులో ఉన్న మల్లేశ్, చంద్రశేఖర్, ప్రసాద్ను కూడా పీసీసీలోకి తీసుకోవడం ద్వారా ఈ పదవి కోసం పట్టుబడుతున్నవారిని వ్యూహాత్మకంగా తప్పించింది. ఈ క్రమంలోనే ఈ డీసీసీ పగ్గాలను కొత్త నేతకు కట్టబెట్టే దిశగా పావులు కదుపుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ క్యామ మల్లేశ్ రాజీనామా చేశారు. ఈ రాజీనామాను ఆమోదించకుండా హైకమాండ్ పెండింగ్లో పెట్టింది. మల్లేశ్ను తప్పించాలని ఒకవర్గం.. మళ్లీ ఆయననే కొనసాగించాలని మరోవర్గం ఒత్తిడి తో రాజీనామా విషయంలో నిర్ణయం తీసుకునే విషయంలో ఒత్తిడికి గురవుతోంది. ఈ క్రమంలోనే మల్లేశ్ స్థానే చంద్రశేఖర్ పేరును పరిశీలించాలని మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి ఢిల్లీస్థాయిలో లాబీయింగ్ నెరిపారు. చంద్రశేఖర్ వైపు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ కూడా మొగ్గు చూపారు. అయితే, జిల్లాలోని ముఖ్యనేతలు చంద్రశేఖర్ సారథ్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మాజీ మంత్రి సబిత ఈ వ్యవహారంలో తటస్థ వైఖరినే అవలంబిస్తున్నా.. మిగతా నేతలు మాత్రం గత ఎన్నికల వేళ పార్టీలో చేరిన చంద్రశేఖర్కు పార్టీ పగ్గాలు అప్పగించడమేమిటనీ.. కాంగ్రెస్ భావజాలంలేని వ్యక్తికి డీసీసీ ఇస్తే సహించేదిలేదని ఏఐసీసీ పెద్దలకు తేల్చిచెప్పారు. ఒకవేళ సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకుంటే మాజీ మంత్రి ప్రసాద్కుమార్ పేరును పరిశీలించాలని సూచించారు. దీంతో డీసీసీ అధ్యక్ష పదవి ప్రకటనను పక్కనపెట్టిన అధిష్టానం.. కొత్త ఎత్తుగడ వేసింది. ఇరు గ్రూపులకు ఆమోదయోగ్యుడైన మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి పేరును తెరమీదకు తెస్తోంది. ఈ క్రమంలోనే డీసీసీ పోస్టుకోసం పోటీపడ్డ ముగ్గురిని తప్పించినట్లు తెలుస్తోంది. ఇటీవల రాష్ట్ర పర్యటనకొచ్చిన దిగ్విజయ్సింగ్ కూడా సుధీర్రెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడారు. సున్నిత మనస్కుడైన సుధీర్.. ఈ పదవిని చేపట్టేందుకు ముందుకు రాకపోతే సబిత తనయుడు కార్తీక్రెడ్డికి చాన్స్ ఇచ్చే అవకాశంలేకపోలేదు. అదేసమయంలో జిల్లా పీఠం కావాలని కోరిన ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి పేరును పరిగణనలోకి తీసుకునే వీలుందని పార్టీ వర్గాలు తెలిపాయి. -
'కండువాలు కప్పే శ్రద్ధ పాలనపై ఏది'
ఇతర పార్టీల నాయకులకు కండువాలు కప్పడంలో ఉన్న శ్రద్ధ టీఆర్ఎస్ ప్రభుత్వానికి పాలనపై లేదని మాజీ మంత్రులు విమర్శించారు. సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి, సునీతా లకా్ష్మరెడ్డి బృందం బుధవారం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో అత్యాచార బాధితురాలిని వీరు పరామర్శించారు. తిరుగు ప్రయాణంలో జమ్మికుంటలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఓ యువతిపై అత్యాచారం జరిగినా ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని, కేసును పక్కదారి పట్టించే యత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బాధితురాలికి రూ.కోటి రూపాయల పరిహారం, పోలీసు ఉద్యోగంతోపాటు ఐదెకరాల భూమి పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.