sellar
-
సెల్లార్ జాగ్రత్త!
సాక్షి, సిటీబ్యూరో: సెల్లార్ల తవ్వకాలపై ఇప్పటికే నిషేధం విధించిన జీహెచ్ఎంసీ.. రానున్న రోజుల్లో కురిసే వర్షాలు, షేక్పేట వద్ద ఫ్లై ఓవర్ పనుల్లో క్రేన్ బోల్తాపడటం తదితర పరిణాలను దృష్టిలో ఉంచుకొని సెల్లార్లు తవ్వే యజమానులు నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందిగా హెచ్చరికలు జారీ చేసింది. నిబంధనలను ఉల్లంఘించే వారికి హెచ్ఎంసీ(హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) యాక్ట్ మేరకు నోటీసులు జారీ చేయడమే కాక క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు చీఫ్ సిటీప్లానర్ ఎస్.దేవేందర్రెడ్డి తెలిపారు. పాటించాల్సిన నియమ, నిబంధనలను మరోసారి వెల్లడించారు. వచ్చే మూడు నాలుగు రోజుల్లో భారీ వర్షాలొస్తాయనే సూచనలున్నందున అన్ని సర్కిళ్లలోని ఏసీపీలు తగిన చర్యలు తీసుకోవాలి. విధుల్లో నిర్లిప్తత, నిర్లక్ష్యంగా ఉన్నవారిపై కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. జోనల్ సీపీలు తమ జోన్లో పరిస్థితులను పర్యవేక్షిస్తూ, నివేదికలు అందజేయాలని సూచించారు. ♦ వర్షాకాలం ముగిసేంత వరకు కొత్తగా గ్రేటర్లో సెల్లార్ల తవ్వకాలు చేపట్టరాదు. ♦ ఇప్పటికే సెల్లార్లు తవ్వి పనులు పురోగతిలో ఉన్నవారు తగిన భద్రత చర్యలు తీసుకోవాలి. అందులో భాగంగా నేల బలంగా ఉన్నదీ లేనిదీ పరిశీలించాలి. పనులు చేసే చోట రిటైనింగ్వాల్, బారికేడింగ్ తదితర ఏర్పాట్లు చేయాలి. ♦ సెల్లార్ తవ్వి వదిలేసిన ప్రాంతాల్లో పరిసరాల్లోని నిర్మాణాలు పటిష్టంగా ఉన్నదీ లేనిదీ పరిశీలించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతోపాటు సెల్లార్ గుంతను నిర్మాణ వ్యర్థాలతో నింపేయాలి. ఇందుకుగాను జీహెచ్ఎంసీ అండ్ డీ వేస్ట్ వింగ్ సహకారం తీసుకోవచ్చు. ♦ ఈ నిబంధనలు పాటించకుంటేనోటీసులతో పాటు క్రిమినల్ కేసులనమోదు తప్పవు. ♦ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి కొండ ప్రాంతాలు, నేల స్లోపుగా ఉన్న ప్రాంతాల్లోని భవనాల పక్కన, దిగువన, రిటైనింగ్వాల్స్ వెంబడి తాత్కాలిక నివాసాల్లో ఉంటున్న వారిని వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయించాలి. ♦ అధికారులందరూ అప్రమత్తంగా ఉండి వాతావరణశాఖ, కంట్రోల్ రూమ్స్ నుంచి వెలువడే సూచనల కనుగుణంగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా వెంటనే రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉండాలి. కొనసాగుతున్నశిథిల భవనాల తొలగింపు నగరంలో శిథిల భవనాల తొలగింపు స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోందని దేవేందర్రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అత్యంత ప్రమాదకర భవనాలకు సంబంధించి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నివాసితులను ఖాళీ చేయించడంతో పాటు బిల్డింగ్కు సీలు వేయడం, బారికేడింగ్ చేయడం వంటి పనులు చేయాలని టౌన్ప్లానింగ్ అధికారులకు సూచించారు. ♦ ప్రజలు సదరు భవనాల సమీపంలోకి వెళ్లకుండా ప్రమాద హెచ్చరిక నోటీసులుప్రదర్శించాలని ఆదేశించారు. -
సెల్లార్ ఫిల్లింగ్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో వర్షాలు మొదలయ్యాయి. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో రోడ్లు చెరువులుగా మారుతున్నాయి. బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం కోసం సెల్లార్లు తవ్వి పనులు అర్ధాంతరంగా నిలిపివేయడంతో అవి వర్షపు నీటితో నిండిపోతున్నాయి. ఫలితంగా పరిసరాల భవనాలకు ముప్పు పొంచి ఉంది. దీనిపై నగరవాసులు సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి కార్యాలయం, జీహెచ్ఎంసీ కమిషనర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితరులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకముందే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ నిర్మాణ, కూల్చివేతల (సీఅండ్డీ) వ్యర్థాలతో సదరు సెల్లార్లను పూడ్చాలని నిర్ణయించింది. సెల్లార్లు తవ్వి నిర్మాణ పనులను మధ్యలో నిలిపేసిన అన్నింటినీ సీఅండ్డీ వ్యర్థాలతో పూడ్చివేయనుంది. వర్షాకాల ప్రమాద నివారణ చర్యల్లో భాగంగా ఇలాంటి వాటిని గుర్తించి పూడ్చివేయనున్నట్లు టౌన్ప్లానింగ్ అధికారులు తెలిపారు. ఎక్కడైనా ఇలాంటివి ఉంటే ప్రజలు సమాచారం అందించాలని కోరారు. అనుమతి పొందినా... సెల్లార్ల తవ్వకాల కోసం జీహెచ్ఎంసీ నుంచి అనుమతి పొందినప్పటికీ, ఇంకా పనులు చేపట్టనివారు సెప్టెంబర్ 30 వరకు తవ్వకాలు ప్రారంభించరాదని సిటీ చీఫ్ ప్లానర్ దేవేందర్రెడ్డి స్పష్టం చేశారు. అప్పటి వరకు సెల్లార్ల తవ్వకాలపై నిషేధం ఉంటుందన్నారు. అనుమతులు పొంది ఇప్పటికే సెల్లార్ల తవ్వకాలు చేపట్టినవారు తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలి. వారు పటిష్ట భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నదీ? లేనిదీ? అధికారులు తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగితే నిర్మాణదారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. వర్షం కురుస్తున్నప్పుడు ఎలాంటి తవ్వకాలు జరపరాదని అధికారులు హెచ్చరించారు. జీహెచ్ఎంసీలో సెల్లార్ల తవ్వకాలకు అనుమతి పొందిన భవనాలు దాదాపు 200 ఉండవచ్చని అంచనా. నిబంధనల మేరకు 750 చ.మీ.ల స్థలముంటే ఒక సెల్లార్, 1000 చ.మీ.ల స్థలముంటే రెండు సెల్లార్లు తవ్వవచ్చు. కానీ అనుమతులు లేకుండానే తక్కువ స్థలంలో అక్రమంగా సెల్లార్లు తవ్వుతున్నవారు కూడా ఉన్నారు. ఇలాంటి వారిపై జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. నగరంలో నాలుగు సెల్లార్ల వరకు అనుమతులిస్తున్నారు. ఒక్కో సెల్లార్ను దాదాపు మూడు మీటర్ల లోతుతో తవ్వుతున్నారు. గతేడాది సెల్లార్ల తవ్వకాలతో ప్రమాదాలు జరగడంతో వీలైనంత వరకు సెల్లార్ల తవ్వకాలను నివారించాలని యోచించారు. సెల్లార్లకు బదులు పైఅంతస్తుల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేసుకునే వారికి ఆ మేరకు అదనపు అంతస్తులకు అనుమతిస్తామని కూడా గతంలో ప్రకటించారు. జాగ్రత్తలు అవసరం.. సెల్లార్ల తవ్వకాల పనులు సగంలో ఉన్నవారు పటిష్ట భద్రత చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. సెల్లార్ల తవ్వకాలు జరిపేవారు, ముఖ్యంగా వాలు ప్రాంతాల్లో నేల జారిపోకుండా ఇసుక బస్తాలు వినియోగించాలి. దాంతో పాటు నైలింగ్, గ్రౌటింగ్లు కూడా చేయాలని స్పష్టం చేశారు. సెల్లార్ల తవ్వకాలకు చుట్టూ 3 మీటర్ల సెట్బ్యాక్ వదలాలి. ఇది పైలెవెల్ సెల్లార్కు కాగా, దిగువ లెవెల్స్కు వెళ్లే కొద్దీ అదనంగా మరో 0.5 మీటర్ల చొప్పున వదలాలి. తాత్కాలిక రిటైనింగ్ వాల్ నిర్మించాలి. సెల్లార్ ప్రాంతాల్లో అధిక బరువులుండే వస్తువులు, నిర్మాణ సామగ్రి ఉంచరాదు. భారీ వాహనాలు సెల్లార్ల సమీపంలోకి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పనుల్ని నిత్యం పరిశీలిస్తూ ఎక్కడైనా నేల వదులుగా జారిపోయేలా ఉంటే వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సెల్లార్ తవ్వుతున్న చోట గానీ, పరిసరాల్లోని భవనాల్లో గానీ భూమి కదులుతున్నట్లు గ్రహిస్తే యుద్ధప్రాతిపదికన అవసరమైన చర్యలు చేపట్టాలి. -
‘గాంధీ’ సెల్లార్లో పాపను వదిలేసిన మహిళ
గాంధీ ఆస్పత్రి: ఏడాదిన్నర వయసుగల పాపను సెల్లార్లో వదిలి వెళ్లిన ఘటన ఆదివారం గాంధీ ఆసుపత్రిలో జరిగింది. ఆస్పత్రి అధికారులు, పోలీసుల కథనం ప్రకారం... గాంధీ ఆస్పత్రిలో లిఫ్ట్ సూపర్వైజర్గా పని చేసే భరత్ ఆదివారం ఉదయం 10 గంటలకు తన బైక్ను పార్కింగ్ చేసేందుకు సెల్లార్లోకి వెళ్లాడు. అక్కడ చిన్నారి గుక్కపెట్టి ఏడుస్తూ కనిపించింది. చుట్టుపక్కల పాప సంబంధీకులెవరూ కనిపించకపోవడంతో ఆస్పత్రి అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఆర్ఎంఓ బబిత నేతృత్వంలో చిన్నారిని పీఐసీయూకు తరలించి వైద్యసేవలందించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రిలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా.. ఓ మహిళ ఈ చిన్నారిని ఎత్తుకొని ప్రధాన భవనంలోకి ప్రవేశించి మెట్లు మీదుగా సెల్లార్లోకి దిగినట్లు నమోదైంది. అయితే దృశ్యాల్లో స్పష్టత లేకపోవడంతో మహిళను గుర్తించలేకపోయారు. చిన్నారికి కాళ్లు, చేతులు వంకరగా ఉన్నాయి. పోలియో సోకిందనే కారణంతో చిన్నారిని ఇక్కడ వదిలేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా పాపను గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.