మీ స్మార్ట్ఫోన్ స్క్రీన్ ఎప్పటికీ పగలదు.. ఎలా?
సాక్షి, హైదరాబాద్: వేలాది రూపాయిలు పోసి స్మార్ట్ఫోన్ కొంటాం. ఒక్కోసారి ప్రమాదవశాత్తూ కింద పడితే పగిలితే అంతే సంగతులు. వాటికి కొత్త స్క్రీన్ వేయించాలంటే వేలాది రూపాయలు చేతి చమురు వదిలించుకోవాల్సిందే. ఇప్పుడు అలాంటి పరిస్థితి మారనుంది. 'షేప్ మెమోరీ పాలిమర్' అనే సరికొత్త టెక్నాలజీని మొబైల్ దిగ్గజం మోటొరోలా అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో ఉంది.
మొటోరోలా తన మొబైల్ స్క్రీన్ తయారీలో ఈనూతన టెక్నాలజీని ఉపయోగించే పనిలో ఉంది. ఇందులో ఫోన్ కిందపడి స్క్రీన్ పగిలిపోయినా, గీతలు పడినా ఆటోమేటిక్గా బాగుచేసుకొనే విధంగా ఈ కొత్త మొబైల్స్ను తీసుకురానుంది. స్క్రీన్ పగిలిపోయినా, గీతలు పడిన వెంటనే వాటిని మాయం చేయడానికి అవసరమైన వేడిని పుట్టించడం ద్వారా మొబైల్ స్క్రీన్ తనంతట తానుగా మరమ్మత్తులు చేసుకొని సాధారణ స్థాయికి చేరుకుంటుంది. ప్రస్తుతం ఈటెక్నాజిని వాడే పేటెంట్ హక్కులు మోటారోలాకు మాత్రమే ఉన్నాయి. ఈ తరహా స్మార్ట్ఫోన్లను త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది.