Shenzhou-1
-
అంతరిక్ష నడకల్లో చైనా రికార్డు
బీజింగ్: అంతరిక్ష పరిశోధనల్లో చైనా దూసుకెళ్తోంది. చైనా వ్యోమగాములు 16 స్పేస్వాక్లు నిర్వహించి సరికొత్త రికార్డు సృష్టించారు. భూదిగువ కక్ష్యలోని చైనా అంతరిక్ష కేంద్రం(సీఎస్ఎస్) ‘తియాన్గాంగ్’లో షెన్జౌ–18 మిషన్లో భాగంగా బుధవారం ముగ్గురు వ్యోమగాములు యె గాంగ్ఫు, లీ కాంగ్, లీ గాంగ్సూ దాదాపు 6.5 గంటలపాటు స్పేస్వాక్ చేశారు. అంతరిక్ష కేంద్రం నుంచి బయటకు వచి్చ, శూన్య వాతావరణంలో విహరించడమే స్పేస్వాక్. సీఎస్ఎస్ అప్లికేషన్, డెవలప్మెంట్ దశలో ఇది 16వ స్పేస్వాక్ అని చైనా అంతరిక్ష పరిశోధకులు తెలిపారు. సంబంధిత వీడియోలను విడుదల చేశారు. ఇందులో వ్యోమగామి లీ కాంగ్ తెల్లరంగు స్పేస్ సూట్ ధరించి చేసిన తొలి స్పేస్ వాక్ కనిపిస్తోంది. లీ కాంగ్ వెనుక భూగోళం స్పష్టంగా దర్శనమిస్తోంది. షెన్జౌ–18 మిషన్లో ఇది రెండో స్పేస్వాక్. ఇదే మిషన్లో మే 28వ తేదీన వ్యోమగాములు 8.5 గంటలపాటు స్పేస్వాక్ నిర్వహించారు. చైనా అంతరిక్ష పరిశోధనల్లో అత్యంత సుదీర్ఘకాలం జరిగిన స్పేస్వాక్ ఇదే కావడం విశేషం. సీఎస్ఎస్ నుంచి మొట్టమొదటి అంతరిక్ష నడక 2021 జూలై నెలలో జరిగింది. షెన్జౌ–12 మిషన్ వ్యోమగాములు 7 గంటలపాటు స్పేస్వాక్ చేశారు. షెన్జౌ–13 మిషన్లో మొట్టమొదటిసారిగా ఓ మహిళా వ్యోమగామి స్పేస్వాక్లో పాల్గొన్నారు. షెన్జౌ–14 మిషన్ అస్ట్రోనాట్స్ మూడు స్పేస్వాక్లు నిర్వహించారు. షెన్జౌ–15 మిషన్లో భాగంగా ఒకే వ్యోమగామి ఆరు నెలల వ్యవధిలో నాలుగు స్పేస్వాక్లు చేశారు. ప్రస్తుతం షెన్జౌ–18 మిషన్ కొనసాగుతోంది. మరికొన్ని స్పేస్వాక్లు చేసే, కొత్త రికార్డులు నెలకొల్పే అవకాశం కనిపిస్తోంది. భూదిగువ కక్ష్యలో పరిశోధనల విషయంలో చైనా ముందంజలో ఉంది. స్పేస్వాక్లు సునాయాసంగా చేయడం అనేది సాంకేతిక నైపుణ్యాలను నిరూపించుకోవడంతోపాటు భవిష్యత్తులో మరిన్ని సంక్లిష్టమైన అంతరిక్ష పరిశోధనలకు నాంది అని చెప్పొచ్చు. -
చైనా అంతరిక్ష కేంద్రానికి మరో ముగ్గురు
బీజింగ్: చైనా తన సొంత అంతరిక్ష కేంద్రం నిర్మాణ పనుల్లో భాగస్వాములను చేసేందుకు మరో ముగ్గురు వ్యోమగాములను ఆదివారం నింగిలోకి పంపనుంది. తియాంగాంగ్ స్పేష్ స్టేషన్కు వ్యోమగాములు చెన్ డాంగ్, లీయాంగ్, కాయ్ క్సుజీలను షెంజూ–14 వ్యోమనౌక ద్వారా నింగిలోకి పంపుతున్నట్లు చైనా మానవసహిత స్పేస్ ఏజెన్సీ(సీఎంఎస్ఏ) శనివారం పేర్కొంది. గన్సులోని జిక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి జరిగే ఈ ప్రయోగం ద్వారా రెండు ల్యాబ్ మాడ్యుల్స్ వెంటియాన్, మెంగ్టియాన్లను నింగిలోకి పంపుతారు. అక్కడికి వీటిని తీసుకెళ్లాక వాటిలో డజనుకుపైగా శాస్త్రీయ ప్రయోగ క్యాబినెట్లను అమర్చుతారు. వచ్చే ఆరు నెలలపాటు వారు చైనా స్పేస్స్టేషన్(సీఎస్ఎస్)లోనే గడుపుతారు. ఇప్పటికే ముగ్గురు వ్యోమగాములు అక్కడికి వెళ్లగా ఏప్రిల్లో ఒక మహిళా వ్యోమగామి తిరిగి భూమిని చేరుకుంది. ఈ ఏడాది చివరికల్లా మొత్తం అంతరిక్ష కేంద్రం నిర్మాణాన్ని పూర్తిచేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. ముందుగా వెళ్లిన ఆ ముగ్గురు అక్కడ కీలక స్పేస్ టెక్నాలజీల పనితీరును పునఃపరీక్షించారు. రష్యా సాయంతో నిర్మితమైన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) భవిష్యత్లో నిర్వీర్యమైతే చైనా స్పేస్ స్టేషన్(సీఎస్ఎస్) ఒక్కటే మానవనిర్మిత కేంద్రంగా రికార్డులకెక్కనుంది. ఈ ఏడాది మొత్తంగా సీఎస్ఎస్కు 140 ఉపకరణాలు పంపేందుకు 50 అంతరిక్ష ప్రయోగాలు చైనా చేపట్టనుంది. -
అంతరిక్షంలో చైనా పాగా: చరిత్రాత్మక ప్రయోగం
-
అంతరిక్షంలో చైనా పాగా: చరిత్రాత్మక ప్రయోగం
బీజింగ్: సొంత అంతరిక్ష కేంద్రం నిర్మించే దిశగా చైనా కీలక ముందడుగు వేసింది. గోబీ ఎడారిలోని జిక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి సోమవారం ఉదయం మానవ సహిత షెంజో-1 స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్షనౌకను విజయవంతంగా ప్రయోగించింది. తద్వారా జింగ్ హైపింగ్(50), చెండ్ డాంగ్(37) అనే ఇద్దరు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపింది. లాంగ్ మార్చ్-2ఎఫ్ వాహక రాకెట్ ద్వారా కక్షలోకి ప్రవేశించే ఈ ఇద్దరు వ్యోమగాములు..24 గంటల తర్వాత చైనా సొంత అంతరిక్ష కేంద్రం తియాంగాంగ్-2కు చేరుకుంటారు. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ అంతరిక్ష కేంద్రంలో 30 రోజులు ఉండనున్న జింగ్, డాంగ్ లు రకరకాల ప్రయోగాలు చేయనున్నారు. ఈ చరిత్రాత్మక ప్రయోగం ద్వారా చైనా.. మానవసహిత అంతరిక్ష పరిశోధన చేపట్టిన మూడో దేశంగా నిలిచింది. ఇంతకు ముందు ఆ జాబితాలో అమెరికా, రష్యాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం మనుగడ ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) మరో ఏడేళ్లలో.. అంటే 2024 నాటికి రిటైర్ కానుంది. అమెరికా, రష్యా, కెనడా, జపాన్, 11 దేశాల యురోపియన్ స్పేస్ ఏజెన్సీ సంయుక్తంగా నిర్మించిన ఐఎస్ఎస్ కు దీటుగా కొత్త కేంద్రాన్ని నిర్మించాలనుకున్న చైనా.. 2011లో తియాంగాగ్-1 అంతరిక్ష కేంద్రాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. గత నెలలో(సెప్టెంబర్ 15న) తియాంగాగ్- 2 కేంద్రాన్ని కూడా ఏర్పాటుచేసుకుంది. సోమవారం నాటి ప్రయోగంలో అంతరిక్షంలోకి వెళ్లిన ఇద్దరు వ్యోమగాములు తియాంగ్-2కు చేరుకుంటారు. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో నిర్ణీత కక్ష్యలో పరిభ్రమించే ఈ ప్రయోగశాలలో సాగు,ప్రాథమిక చికిత్స, ఇతర ప్రయోగాలు చేపట్టనున్నారు. 2022 నాటికి (కనీసం 10 ఏళ్లు పనిచేయగల) పూర్తిస్థాయిలో పనిచేసే అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనున్నారు. అక్కడి నుంచి మార్స్, మూన్ లకు సంబంధించి అనేక పరిశోధనలు చేస్తారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రస్తుతం భారత్ కు వచ్చిన చైనై అధ్యక్షుడు జిన్ పింగ్ స్పేస్ మిషన్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన సైంటిస్టులకు అభినందనలు తెలిపారు. తమ దేశం చేపట్టిన అంతరిక్ష ప్రయోగాల్లో దీనికొక మైలురాయిగా అభివర్ణించారు. ఈ మేరకు చైనా సెంట్రల్ మిలటరీ కమిషన్(సీఎం సీ) ముఖ్య అధికారి చాంగ్ లాంగ్ అధ్యక్షుడి సందేశాన్ని చదివి వినిపించారు. ఇద్దరు వ్యోమగాముల్లో జింగ్ హైపింగ్ కు ఇప్పటికే పలుమార్లు అంతరిక్షయానం చేసిన అనుభవం ఉండగా, చెండ్ గాండ్ కు మాత్రం ఇదే మొదటి ప్రయాణం. ప్రమాదకరమే అయినా అంతరిక్షంలో ప్రయోగాలు నిర్వహించడానికి ఉవ్విళ్లూరుతున్నట్లు చెప్పారాయన. ఇక ఐఎస్ఎస్ స్థానంలో అమెరికా, రష్యా, జపాన్, కెనడా, యురోపియన్ దేశాలు నిర్మించతలపెట్టిన ఐఎస్ఎస్2.0పై ఇంకా స్పష్టతరావాల్సిఉంది.