పాతిపెట్టిన తర్వాత ఏడుపు.. బతికిన శిశువు..!
బర్వానీ: పసికందు చనిపోయాడనుకుని స్మశానంలో పాతిపెట్టారు. సమీపంలో ఆడుకునే పిల్లలు శిశువు ఏడుపు విని గ్రామస్తులకు చెప్పడంతో ఆ చిన్నారి బతికి బట్టకట్టింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని బర్వానీ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఘస్ గ్రామ స్మశాన వాటికలో పది రోజుల మగశిశువును అడుగు లోతు గుంతలో పాతిపెట్టి వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం కొందరు పిల్లలు ఆ సమీపంలో ఆడుకుంటుండగా శిశువు రోదన వినిపించింది. దీంతో వారు వెంటనే గ్రామస్తులకు తెలిపారు. షేర్ సింగ్(32) అనే వ్యక్తి భార్య సునీతతోపాటు అక్కడికి చేరుకుని మట్టిని తొలగించి శిశువును తమ ఇంటికి తీసుకెళ్లారు.
పోలీసులకు సమాచారం అందించటంతో వారు ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పది రోజుల శిశువు చీమలు కుట్టడంతో కొద్దిగా గాయాలపాలయ్యాడని, ప్రస్తుతం జలుబుతో బాధపడుతున్నాడని.. అయితే ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. కాగా, తమకు ముగ్గురు అమ్మాయిలున్నారని, ఈ పరిస్థితుల్లో ఆ దేవుడే ఈ శిశువును తమకిచ్చాడని షేర్సింగ్ దంపతులు ఆస్పత్రి వద్దే పడిగాపులు కాస్తున్నారు. తామే పెంచుకుంటామంటూ అధికారులను ప్రాధేయపడుతున్నారు.