breaking news
solo woman traveler
-
Sudha Mahalingam: 70 ఏళ్ల డాక్టర్.. ఇప్పటికి 70 దేశాలు చుట్టారు.. ఇంకా
70 ఏళ్లు డాక్టర్ సుధా మహాలింగంకు. ఇప్పటికి దాదాపు 70 దేశాలు చుట్టేసిందామె. భయం లేదు.. గియం లేదు... బ్యాగ్ సర్దుకుని పదండి అంటోందామె. మరి తోడు? ఎవరూ అక్కర్లేదు.. మీరు ఎక్కడకు వెళితే అక్కడి మనుషులే తోడు అంటుంది. నిజానికి మన దేశాన్ని పూర్తిగా చూడటానికే ఒక జీవిత కాలం సరిపోదు. ఉన్న ఆయుష్షులో ఇంత పెద్ద ప్రపంచం చూడాలంటే ఎంత వేగిర పడాలి. అందుకే సుధా మహాలింగం భ్రమణకాంక్ష కొందరికి ఈర్ష్య పుట్టిస్తోంది... కొందరిచే టికెట్లు బుక్ చేయిస్తోంది. ‘వీలున్నప్పుడు మంచి ప్రయాణం చేయాలి అని మీలో చాలామంది అనుకుంటూ ఉంటారు. నామాట నమ్మండి. వీలు ఎప్పుడూ ఉండదు. వీలు చేసుకోవాలి’ అంటుంది సుధా మహాలింగం. ఆమె కథ కొంచెం అసూయ పుట్టించేదే. ‘చాలామంది మేగజీన్లలో మంచి మంచి ట్రావెల్ ఫొటోలు చూసి అంతటితో సంతృప్తి పడతారు. నా అదృష్టం... నేను ఆ చోట్లకంతా వెళ్లాను’ అంటుందామె. బెంగళూరుకు చెందిన సుధా మహాలింగంకు చెన్నైతో కూడా అనుబంధం ఉంది. ఆమె భర్త సివిల్ సర్వీసెస్లో పని చేసి రిటైర్ అయ్యాడు. 25 ఏళ్లకు పెళ్లి చేసుకున్న సుధ ‘అందరూ చెప్పేటటువంటి తీర్చిదిద్దేటటువంటి’ జీవితాన్నే ఆ తర్వాతి 25 ఏళ్లు జీవించింది. 50వ ఏట వరకూ ఆమె కూడా ట్రావెల్ మేగజీన్లు చూస్తూ గడిపింది. అదనంగా చేసిన పని ఏదైనా ఉంటే భర్త టూర్లు వెళ్లినప్పుడు తోడు వెళ్లడమే. కాని ఒకసారి ఒక విశేషం జరిగింది. భర్తకు ఆఫీస్ పని మీద స్వీడన్లో రెండు నెలలు ఉండాల్సి వచ్చింది. తోడు వెళ్లిన సుధకు అక్కడ ఖాళీగా ఉండటం బోరు కొట్టింది. ‘నేను ఒక్కదాన్నే ఫిన్లాండ్కు ఒక షిప్లో వెళ్లాను. అక్కడి నుంచి నార్వేకు ట్రైన్లో వెళ్లాను. అక్కడి నుంచి డెన్మార్క్, బెర్లిన్ తిరిగి మళ్లీ స్వీడన్ చేరుకున్నాను. భలే అనిపించింది’ అంటుంది సుధ. కాని ఆమె కాలి కింద చక్రాలు ఏర్పడటానికి 2003 రావాల్సి వచ్చింది. అంతకు రెండేళ్ల ముందు ఆమె ఎనర్జీ రంగాన్ని అధ్యయనం చేసి ఎనర్జీ (ఇంధన శక్తి) ఎక్స్పర్ట్గా మారింది. ‘ఆ సమయంలో ఆ రంగంలో ఎవరూ ఎక్స్పర్ట్లు లేరు. దాంతో నాకు దేశవిదేశాల నుంచి కాన్ఫరెన్స్లకు ఆహ్వానాలు రాసాగాయి. 2003లో కిర్గిస్తాన్ వెళ్లాను ఒక్కదాన్నే. అక్కడి నుంచి ఉజ్బెకిస్తాన్ వెళ్లాను. ఒక్కదాన్నే తిరగడంలో ఆనందం అర్థమైంది. ఇక నేను ఆగలేదు. నా భ్రమణ జీవితం నా 50వ ఏట మొదలైంది’ అంటుంది సుధా నాగలింగం. సుధకు ఇద్దరు కొడుకులు. వాళ్లు ఎప్పుడూ తల్లికి మద్దతే. ‘నీ ఇష్టం వచ్చినట్టు లోకం చూడమ్మా. కాని సేఫ్గా ఉండు’ అంటారు. కాని భర్త సంప్రదాయవాది. ‘ఆయన నేను ఎక్కడకు వెళ్లానో తెలిస్తే కంగారు పడతారు. అందుకని ఎక్కడికో చెప్పను. వచ్చాక నా ప్రయాణ అనుభవాలు బ్లాగ్లో రాస్తే చదువుకుంటారు. వచ్చేశాక ఏం భయం’ అని నవ్వుతుందామె. స్త్రీగా ఉంటూ ఒంటరిగా తిరుగుతూ 50 ఏళ్లు పైబడ్డాక ఇన్ని పర్యటనలు చేయడం సుధా నాగలింగంకే చెల్లిందా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఆమె నేపాల్ మీదుగా ఎవరెస్ట్ బేస్క్యాంప్ వరకూ అధిరోహణ చేసింది. ఆస్ట్రేలియాలో డీప్ సీ డైవింగ్ చేసింది. ఆ దేశంలోని ‘ఉలురు’లో స్కైడైవింగ్ కూడా చేసింది. ఆకాశంలో ఇన్స్ట్రక్టర్ సహాయంతో దూకినప్పుడు ఆమె వయసు 66 సంవత్సరాలు. ‘నా ప్రయాణాల్లో అనుకోనివి ఎన్నో జరిగాయి. నైరోబీ ఎయిర్పోర్ట్ లో ఎల్లో ఫీవర్ వాక్సినేషన్ లేదని నన్ను ఆపేశారు. చైనాలో వెజిటేరియన్ రెస్టరెంట్ వెతకలేక ఆకలి తో నకనకలాడాను. చెక్ రిపబ్లిక్ లో వాలిడ్ వీసా లేదని చాలా హంగామా చేశారు. ఇరాన్లో ఒక చారిత్రక కట్టడం చూస్తుంటే నేను లోపల ఉన్నానన్న సంగతి మరచి సిబ్బంది తాళం వేసుకు వెళ్లిపోయారు. ఇన్ని జరిగినా చివరకు మనుషులు తోడు నిలిచారు. ప్రయాణాలు సాటి మనుషుల మీద విశ్వాసాన్ని పెంచుతాయి అని తెలుసుకున్నాను’ అంటుందామె. ‘నేను తిరిగిన అన్నీ దేశాల్లోకెల్లా ఇరాన్లో స్త్రీలు ఒంటరిగా చాలా సేఫ్గా తిరగొచ్చు అని తెలుసుకున్నాను.’ అంటుందామె. ఇరాక్ను కూడా చుట్టేసింది. ‘సాధారణంగా కొత్త ప్రాంతాల్లో తిరుగుతుంటే స్థానికులు ఆకర్షణీయంగా ఉండే స్త్రీలను చూస్తారు. గమనిస్తారు. కాని నా వయసు, మామూలు దుస్తులు నా మీద అటెన్షన్ పడేలా చేయవు. అందుకే నేను స్వేచ్ఛగా అన్నీ ఆస్వాదిస్తాను’ అంటుందామె. ‘ఇండోనేషియాలో రెయిన్ ఫారెస్ట్లో పది రోజులు ఉన్నాను. అక్కడ మోకాలు లోతున ఆకులు రాలిపడి ఉంటాయి. వాతావరణం అనూహ్యంగా ఉంటుంది. వేరెవరైనా సరే భయపడతారు. కాని నేను మాత్రం ప్రకృతి ఎంత చిక్కగా ఉంటుందో అక్కడే చూడగలిగాను. ఏ మలినం లేని ప్రకృతి అది’ అంటుంది సుధ. ఆమె ఇకపై ఆఫ్రికా ఖండం చుట్టాలనుకుంది. అక్కడ ఏ అనుభవాలు మూటకట్టుకోనుందో. ‘పెళ్లి.. పిల్లలు.. కెరీర్– ఉంటాయి. కాని ఇవి మాత్రమే జీవితం కాదు. మన జీవితంలో ఎన్నో జీవితాలు జీవించాలి. ప్రయాణాలు ఒక అవసరమైన జీవితం. అద్భుత జీవితం. జీవిస్తేనే అందులోని గొప్పతనం తెలుస్తుంది’ అంటుందామె. ఆమె మాటలు విని, కదిలే అదృష్టం ఎందరిదో. -
ట్రావెల్ క్వీన్స్
ప్రయాణం.. పుస్తకాన్ని మించి జ్ఞానాన్ని పంచుతుంది. జీవితాన్ని చదవడంలో ప్రయాణం కూడా ఓ చాప్టరే. ఇక, సోలో జర్నీ అయితే నీలోకి నిన్ను తీసుకెళ్తుంది. మనసుకి రెక్కలు కట్టి ప్రకృతి రాజ్యానికి క్వీన్ను చేస్తుంది!. అందుకే ప్రయాణానికి మజిలీలే కాని లక్ష్యం ఉండకూడదంటారు!. ఆ లస్ట్ని శ్వాసిస్తున్న భాగ్యవంతుల్లో మన భాగ్యనగర మహిళలూ ఉన్నారు!!. కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా, ఇండియాలో ఈస్ట్ టు వెస్ట్కి వరల్డ్లో హాయిగా విహరిస్తున్న ఆ క్వీన్స్ పరిచయం.. ..:: సరస్వతి రమ సోలో ఉమన్ ట్రావెలర్కు మెట్రో కల్చర్ ఇప్పుడిస్తున్న పర్యాయపదం.. క్వీన్! కారణం.. బాలీవుడ్ ‘క్వీన్’ మూవీ. పెళ్లిరోజు పెళ్లికూతురికి పెళ్లికొడుకు ‘నీకు, నాకు సరిపడదు’ అని షాక్ ఇస్తాడు. బ్యాండ్, బాజా, బారాత్ ఆగిపోతాయ్. కానీ పెళ్లికూతురు అక్కడే ఆగిపోదు.. లండన్కు సాగిపోతుంది మొండిగా.. సోలో హానీమూన్ కోసం! ఆత్మవిశ్వాసంతో తిరిగొస్తుంది. ఇదీ ఆ సినిమా లైన్. ‘సోలో ఉమన్ ట్రావెలింగ్’ అనే ఈ లైనే ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టొస్తున్న మహిళలను మహారాణుల్ని చేస్తోంది. ఈ అడ్వంచర్, సెల్ఫ్కాన్ఫిడెన్స్ జర్నీ నగరంలోనూ టేకాఫ్ అవుతోంది. హైదరాబాద్ వాండరర్స్లో గరిమెళ్ల గౌరి, అనూషా తివారి ఉన్నారు. సింగిల్ జర్నీలో ఉన్న మజా.. ప్రయాణం వీళ్లకు ప్రహసనం కాదు.. ఉల్లాసం, ఉత్సాహం. గరిమెళ్ల గౌరి వారం కిందటే రాజస్థాన్లోని బార్మేర్కి వెళ్లారు కేర్ఇండియాలో ప్రాజెక్ట్ ఆఫీసర్గా కొలువులో చేరడానికి. తన సోలో ట్రావెల్ హాబీ గురించి చెప్తూ ‘నేను డిగ్రీ నాటి నుంచే సోలో ట్రావెల్ చేస్తున్నాను. బేసిగ్గా నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. కొత్త ప్రదేశాలు చూడటం, కొత్తవాళ్లతో పరిచయాలు, భిన్న సంస్కృతుల అధ్యయనం అంటే పిచ్చి. నా ఫస్ట్ సోలో జర్నీ డిగ్రీ సెకండియర్లో ఉన్నప్పుడు హైదరాబాద్ టు షిరిడీ. ఫ్యామిలీతో వెళ్లాల్సిన నేను ఏవో అవాంతరాల వల్ల ఒక్కదానినే మొండిగా షిరిడీ ప్రయాణమై.. హ్యాపీగా తిరిగొచ్చాను. ఆ జర్నీ నాకు బోలెడంత కాన్ఫిడెన్స్ ఇచ్చింది’ అని గతాన్ని గుర్తుచేసుకున్నారు గౌరి. ఒంటరి ప్రయాణంలో మజా తెలిశాక నా ప్రయాణాల పరంపర ఆగలేదు. పీజీలో ఉండగా సౌతిండియా టూర్ మొత్తం ఒంటరిగానే చేశాను. ఇది ఎండాఫ్ నైంటీస్ విషయం. అప్పట్లో ఇన్ని ట్రావెల్ ఏజెన్సీలు లేవు. ఫ్లయిట్ జ ర్నీ లగ్జరీగానే ఉండేది. ఇప్పటికీ ఒకరోజు హాలిడే దొరికినా, రొటీన్ వర్క్ నుంచి బ్రేక్ కావాలనుకున్నా నచ్చినప్లేస్కి వెళ్లిపోతాను. వెళ్లేటప్పుడు కొన్ని సేఫ్టీ మెథడ్స్ తీసుకుంటాను. నా బడ్జెట్లో హోటల్ను బుక్ చేసుకుంటాను. ఆ ఏరియా పోలీస్ స్టేషన్ నెంబర్లు, ఇతర అధికారుల నంబర్లు తీసుకుంటాను. ఫ్యామిలీతో టచ్లో ఉంటాను. కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా, ఇటు వెస్ట్ టు ఈస్ట్ ఇప్పటి దాకా కనీసం నాలుగుసార్లయినా టూర్ చేసి ఉంటాను. ఈ జర్నీలో ఎన్నో ఎక్స్పీరియెన్స్.. వెంట ఎవరూ ఉండరు కాబట్టి నాపై ఎవరో అటెన్షన్ పే చేస్తున్నారనే భావన ఉండదు. ఇప్పుడు మా అక్కయ్య పిల్లలూ నాలా సోలో ట్రిప్స్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సమ్మర్లో యూరప్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నాను’ అన్నారు గౌరి. జర్నీ టు కాన్ఫిడెన్స్ అనూషా తివారి.. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పట్టభద్రురాలు. తర్వాత ఏంబీఏ చేసి ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తోంది. తన సోలో జర్నీ అభిరుచిని అభివర్ణిస్తూ ‘ఇంజనీరింగ్ తరువాత సడెన్గా డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. ఒంటరిగా లాంగ్ జర్నీ చేయాలనిపించేది. అప్పుడే ఎమ్మెస్ కోసం యూఎస్ వెళ్లిన నా ఫ్రెండ్కి మెయిల్ పెట్టాను నా పరిస్థితి గురించి. ఆమె తన అంకుల్ వాళ్ల ద్వారా నాకు టూరిస్ట్ వీసా వచ్చేలా హెల్ప్ చేసింది. ఇంట్లో వద్దన్నా వినకుండా యూఎస్ వెళ్లాను. పేరుకే ఫ్రెండ్ దగ్గర అకామిడేషన్ కానీ దాదాపు ఫార్టీ డేస్ ఒక్కదాన్నే న్యూయార్క్, న్యూజెర్సీ, లాస్వెగాస్, బోస్టన్, నయాగరా, గ్రాండ్కెన్యన్, ఆరిజోనా, ఫ్లోరిడా.. వంటి ప్లేసెస్కి వెళ్లాను. కొత్త మనుషులు, కొత్త విషయాలు నా పర్సెప్షన్ను మార్చేశాయి. లైఫ్పై ఇంట్రెస్ట్ పెరిగింది. సోలో జర్నీ అప్పట్నుంచి హాబీ అయింది. సిటీకొచ్చాక ఆరు నెలలు ఇండియాలో డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్లాను. వారం రోజులున్నా అక్కడ ఏదో ఒక జాబ్ చేసేదాన్ని. ఆ చిన్న, షార్ట్టైమ్ ఉద్యోగాలు నాలో కాన్ఫిడెన్స్ పెంచాయి. శ్రమ విలువను తెలిపాయి. ఆ సిక్స్ మంత్స్ పీరియడ్ నాకు చాలా క్రూషియల్. తిరిగొచ్చాకే ఎంబీఏ చేశాను. మంచి జాబ్ సంపాదించుకున్నాను. ఇప్పుడు టెక్సాస్లో బీఎండబ్ల్యూ కంపెనీలో జాబ్ వచ్చింది. వచ్చే నెల వెళ్తున్నా. అయిదేళ్లుగా ప్రతి ట్రిప్ని సోలోగానే ఎంజాయ్ చేస్తున్నా. లాస్ట్ సమ్మర్ స్విట్జర్లాండ్ వెళ్లా. అబ్రాడ్లో సేఫ్టీ కూడా ఎక్కువ. నాకు స్విట్జర్లాండ్, అరిజోనా బాగా నచ్చే ప్లేసెస్. ఐ లవ్ టు బీ దేర్.. ఆరిజోనాను అందరూ ఎడారి అంటారు కానీ ఆసమ్ ప్లేస్. ఆ దారి ఎప్పుడు మొదలవుతుందో.. ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు. అంతలా ఆ నేచర్లో ఇన్వాల్వ్ అవుతాం’ అంటుంది అనూషా తివారి. సెర్చ్ అండ్ గైడ్.. ‘ఈ రోజుల్లో చాలా సమాచారం ఇంటర్నెట్లో దొరుకుతుంది. అందువల్ల ఆ ప్రాంతం, అక్కడి పరిస్థితులు, తిండి గురించి ముందే తెలుసుకోవచ్చు. అందుకే వెళ్లే ముందు రీసెర్చ్ చెయ్యాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్లాక మన ఇన్స్టింక్ట్ మనని గైడ్ చేస్తూనే ఉంటుంది. అవసరమైన చోట ఆ ప్రాంతం వాళ్ల హెల్ప్ తీసుకోవాలి’ అని చెబుతున్నారు 50 దేశాలు చుట్టొచ్చిన ప్రముఖ సోలో ట్రావెలర్ అంశుగుప్త. ప్రతి ప్రయాణం నూతనం.. క్వీన్ సినిమా ముంబైలో చూసిన ఒక మిత్రుడు ‘నువ్వూ, నీ కథలో అమ్మాయిలు గుర్తొచ్చారు’ అని ఫోన్లో చెప్పినప్పుడు, ఆ కథని చెప్పమని అడిగితే అతను చెప్పారు. థ్రిల్డ్. తర్వాత క్వీన్ చూసి సంబరపడి ఫేస్బుక్లో పోస్ట్ చేశాను. కంగనాని అనుపమా చోప్రా చేసిన ఇంటర్వ్యూ చూశాను. జీవితంలో మనం ఎన్నో ప్రయాణాలు చేస్తాం. అనేక పాత్ర ల్లో ప్రయాణిస్తాం. నాకు గుర్తున్నంత వరకు పదమూడేళ్లప్పుడు ఒక్కదాన్నే చేసిన మొదటి ప్రయాణం గోదావరిపై పడవలో ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి చేరుకుని, లంకలోకి వెళ్లటం, లంకలో ఒక్కదాన్నే తిరగటం పూర్తిగా సరికొత్త అనుభవం. ఆ తర్వాత ఒంటరిగా నా 19వ ఏట ముంబైకి వెళ్లాను. ఆ ప్రయాణం ఎన్నడూ మరువలేను. ఒంటరి ప్రయాణాలెన్నో చేశాను. ఈ పయనంలో ఎదురైన రకరకాల మనుషులు, పచ్చని ప్రకృతి నాలో ఉత్తేజాన్ని నింపుతాయి. ప్రతి జర్నీ నూతన జీవన సౌందర్యాన్ని పరిచయం చేస్తుంది. - కుప్పిలి పద్మ, రచయిత్రి