Sri Thirupathamma Amman
-
‘శ్రీతిరుపతమ్మ’ చైర్మన్గిరీ దక్కేదెవరికో?
పెనుగంచిప్రోలు : రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటిగా ప్రాచూర్యం పొందిన పెను గంచిప్రోలు శ్రీతిరుపతమ్మ అమ్మవారి ఆలయ ధర్మకర్తల మండలి నియామకం అధికార పార్టీ నాయకులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఆలయ ధర్తకర్తల నియామకానికి సంబంధించి దేవాదాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేయడంతో చైర్మన్ పదవి కోసం పార్టీ సీనియర్ నాయకుల నుంచే కాక యువ నాయకుల నుంచి కూడా తీవ్ర పోటీ ఎదురౌతోంది. ఎవరికి వారు నియోజకవర్గ, జిల్లా నాయకులతో తమ అనుయాయులతో కలసి చైర్మన్ పదవి ఇప్పించాలని కోరుతున్నారు. దీంతో పార్టీ అగ్రనాయకత్వం ఏమి చేయాలో తెలియక తికమక పడుతోంది. చైర్మన్ రేసులో గ్రామ టీడీపీ, నీటి సంఘం మాజీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు కర్ల వెంకటనారాయణ, తెలుగు యువత నాయకుడు నీరుకుండ మృత్యంజయరావు, మరో సీనియర్ నాయకుడు వూట్ల నాగేశ్వరరావు, గ్రామ టీడీపీ అధ్యక్షుడు నల్లపునేని కొండ, నల్లూరి శ్రీను, లింగగూడెం మాజీ సర్పంచి మురుకుట్ల రామారావు పోటీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ పోటీ మరీ ఎక్కువగా ఉండి, పార్టీ అధిష్టానానికి ఇబ్బందిగా మారిన పక్షంలో అందరికీ అమోద యోగ్యంగా ఉండే ఓ సీనియర్ నాయకున్ని చైర్మన్ పదవి వరించే అవకాశం ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు. మొత్తం మీద నియోజకవర్గంలో ఎమ్మెల్యే తరువాత అంతటి ప్రాధాన్యం ఉన్న చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందోననే ఉత్కంఠ నెలకొంది. -
తిరుపతమ్మ ఆలయ చైర్మన్ పదవి కోసం ‘తెలుగు తమ్ముళ్ల’ ఆరాటం
రేసులో 13మంది ! ప్రజాప్రతిధుల ద్వారా ప్రయత్నాలు ముమ్మరం రెండుగా చీలిన టీడీపీ నాయకులు? పెనుగంచిప్రోలు : రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయ పాలకవర్గ చైర్మన్ పదవి కోసం ‘తెలుగు తమ్ముళు’్ల ఆరాట పడుతున్నారు. ఈ పదవిపై ఎప్పటి నుంచో అధికార పార్టీకి చెందిన పలువురు నాయకులు కన్నేశారు. ఇప్పటి వరకు ఉన్న పాలకవర్గాలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. అనంతరం రెండు వారాల్లో ఆలయాలకు నూతన పాలవర్గాలను నియమిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ప్రకటించడంతో చైర్మన్ పదవి ఆశిస్తున్న స్థానిక నాయకులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన పదవి కావడంతో తీవ్ర పోటీ నెలకొంది. సుమారు 13 మంది రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, మరికొందరు మాజీ మంత్రి నెట్టెం రఘురాం ద్వారా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఒకరిద్దరు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ఆశ్రయించినట్లు సమాచారం. చైర్మన్ పదవి రేసులో నీటి సంఘం మాజీ అధ్యక్షులు, టీడీపీ సీనియర్ నాయకులు, యువ నాయకులు, పార్టీ గ్రామ అధ్యక్షుడు, ఇటీవలనే పార్టీలోకి వచ్చిన వారు ఉన్నారు. దీంతో చైర్మన్ పదవి విషయంలో గ్రామంలో టీడీపీ నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద పదవి ఎవరికి లభిస్తుందనే విషయంపై ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.