breaking news
Srikakulam District News
-
పండ్ల ధరలు ౖపైపెకి..!
మెళియాపుట్టి: ప్రస్తుతం మార్కెట్లో పండ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అయ్యప్ప మాలధారణలు, ఈరోజు నుంచి కార్తీకం మొదలవ్వనుంది. ప్రతీరోజూ భక్తులు పండ్లు కొనుగోలు చేస్తారు. దీంతో ఇదే అదునుగా హోల్సేల్ వ్యాపారులు ధరలు పెంచుకుంటూ పోతున్నారు. ఫలితంగా ఇటు ప్రజలు.. అటు సామాన్య భక్తులు, రోగులు కొనలేక, తినలేక అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో పండ్ల ధరలు సామాన్యులకు దడపుట్టిస్తున్నాయి. ముఖ్యంగా యాపిల్, జామ, డ్రాగన్, నారింజ, కమలా, ద్రాక్ష, అరటి, దానిమ్మ, కివీ రకాల పండ్ల ధరలకు రెక్కలొచ్చాయి. వీటిలో ఏది చూసుకున్నా కిలో రూ.150లు దాటి రూ.300 వందలకు పైచిలుకు ధర పలుకుతుండడంతో సామాన్యులు కొనలేకపోతున్నారు. కాగా ఈ ఏడాది ప్రతికూల వాతావరణ పరిస్థితులు పంటల దిగుబడిపై ప్రభావం చూపాయి. దీంతోనే డిమాండ్ వలన అధిక ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. అందువలన కొనుగోళ్లు మందగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలతో మేము కూడా అధిక ధరలకే పండ్లను కొనుగోలు చేస్తున్నాం. దీనివలన నిత్యం మా దగ్గర కొనుగోలు చేసేవారికి కూడా తగ్గించి అమ్మలేని పరిస్థితి నెలకొంది. తగ్గించి అమ్మితే నష్టపోతాం. అలాగని అమ్మకాలు మానేయలేం. ఎన్నో ఏళ్లుగా పండ్ల వ్యాపారం మీదే బతుకుతున్నాం. ధరలు తగ్గితే మా వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి. – కె.సంజీవరావు, పండ్ల వ్యాపారి, మెళియాపుట్టి -
మంత్రి అచ్చెన్న ఆగ్రహం
శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్ వైద్య కళాశాల అడ్మినిస్ట్రేటర్ రాజశేఖర్రెడ్డి, ఏవో ప్రదీప్లపై మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మంగళవారం ఆయన రిమ్స్ను ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్యులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్యం, నిఘా, మెస్ పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై వైద్యాధికారులను ప్రశ్నించగా ప్రస్తుతం జాబ్ చార్ట్ మారిందని, మెగా పారిశుద్ధ్యం, మెస్ నిర్వహణ అన్ని అడ్మినిస్ట్రేటర్ పరిధిలో ఉన్నాయని మంత్రికి చెప్పారు. దీంతో అడ్మినిస్ట్రేటర్ను ప్రశ్నించగా ఆయన సరైన సమాధానాలు చెప్పలేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు తెలియజేయాలని కోరగా.. ఆ పుస్తకం తీసుకు రాలేదని అడ్మినిస్ట్రేటర్, ఏవోలు చెప్పడంతో అసహనం వ్యక్తం చేశారు. మంత్రి సమీక్షకు వస్తున్నారని తెలిసిన తర్వాత కూడా ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని ప్రశ్నించారు. ఇద్దరూ విధుల్లో చేరి ఆరు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు తనను కలవకపోవడమేంటని నిలదీశారు. ఆస్పత్రుల్లో నియామకాలు జరుగుతున్నప్పుడు ఆ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురాకపోవడాన్ని కూడా తప్పుపట్టారు. ఇకనైనా తీరు మార్చుకోవాలని సూచించారు. అనంతరం గైనిక్ విభాగానికి వెళ్లి ఇటీవల సమకూర్చిన యంత్రాలను ప్రారంభించారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ సైతం అడ్మినిస్ట్రేటర్, ఏవోల పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ, అవసరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో అధికారులు విఫలమవుతున్నారని మండిపడ్డారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ ఇకమీదట తాను ఎప్పటికప్పుడు రిమ్స్ను తనిఖీ చేస్తానని చెప్పారు. సమావేశంలో నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, ఇన్చార్జి సూపరింటెండెంట్ రమేష్ నాయుడు, ఆర్ఎంవో డాక్టర్ సుభాషిణి, డిప్యూటీ ఆర్ఎంవో డాక్టర్ సీపీ శ్రీదేవి, వైద్యులు సనపల నరసింహమూర్తి, డాక్టర్ సురేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. నోటిఫికేషన్ రద్దు చేయండి రిమ్స్ వైద్య కళాశాలలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ రద్దు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు రిమ్స్ అధికారులను ఆదేశించారు. ప్రతీ నియామకానికి సంబంధించి రోస్టర్ విధానం అమలు చేయాలని, ఆ విధంగా చేశారా.. లేదా అని మంత్రి ప్రశ్నించగా అడ్మినిస్ట్రేటర్, ఏవోలు తమకు గుర్తు లేదని, పరిశీలించాల్సి ఉందని వింత వింత సమాధానాలు చెప్పడంతో మంత్రి అవాక్కయ్యారు. తక్షణం నోటిఫికేషన్ను రద్దు చేయాలని ఆదేశించారు. ఇకమీదట పనితీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
కూటమి పాలనా వైఫల్యాలపై గళమెత్తాలి
● నవంబర్ 20లోగా మండల, గ్రామ, వార్డు స్థాయి కమిటీలు పూర్తి చేయాలి ● వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర యువజన విభాగం సమీక్షలో నేతల పిలుపు సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యాలపై గళమెత్తాలని వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఉత్తరాంధ్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార దిశగా యువజన విభాగం పోరాడాలని, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ ప్రతి ఒక్కరూ తమ పరిధిలో ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఎండాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో అదీప్రాజ్ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర యువజన విభాగం సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి యువజన విభాగం ఉత్తరాంధ్ర జోనల్ ఇన్చార్జి అంబటి శైలేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్, ఉత్తరాంధ్ర జిల్లాల యువజన విభాగం అధ్యక్షులు హాజరయ్యారు. తొలుత మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదీప్రాజ్ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలో యువజన విభాగాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. రానున్న రోజుల్లో గ్రామ, మండల యువజన విభాగం కమిటీలను త్వరితగతిన పూర్తి చేసి, పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మీ నియోజకవర్గ సమన్వయకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని.. వారి సూచనలు, సలహాల మేరకు యువజన విభాగ కమిటీలను వేగంగా పూర్తిచేయాలని సూచించారు. అంబటి శైలేష్ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మండల, గ్రామ, వార్డు స్థాయిలో యువజన విభాగ కమిటీలను నవంబర్ 20 లోపు పూర్తి చేయాలన్నారు. రానున్న స్థానిక ఎన్నికలే లక్ష్యంగా మీ పరిధిలో సమస్యలు, ప్రజా సమస్యలపై పోరాడి.. వాటిని ప్రభుత్వం పరిష్కరించే వరకూ శాంతియుతంగా ఆందోళనలు, నిరసనలు కొనసాగించాలని తెలిపారు. రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందిందని, ప్రధానంగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి, యువతకు ఉద్యోగాలు ఇస్తామంటూ మోసం చేసిందని ఆరోపించారు. వీటిపై పోరాటం చేయడంలో యువజన విభాగం ఎప్పుడూ ముందుండాలని సూచించారు. విశాఖ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు, కార్పొరేటర్ ఉరుకూటి చందు మాట్లాడుతూ.. రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి అనుబంధ కమిటీల్లో అత్యంత ప్రధానమైనది యువజన విభాగం.. అలాంటి విభాగంలో ఉన్న మనమందరం పార్టీ బలోపేతంలో ముఖ్య భూమిక పోషించాలన్నారు. మన రాజకీయ భవిష్యత్తులో ముందుకు దూసుకెళ్లడానికి ప్రధాన మార్గం కూడా ఇదే అవుతుందని, పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొని విజయవంతం చేసే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షులు పుల్లేటి వెంకటేష్(అనకాపల్లి), శరత్బాబు(పార్వతీపురం), పృథ్వీరాజ్(శ్రీకాకుళం), అల్లు అవినాష్(విజయనగరం), గాబడి శేఖర్(అల్లూరి), రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి, కార్పొరేటర్ ఇమ్రాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పాలిశెట్టి సురేష్ రాజ్, దొడ్డి కిరణ్, కార్యదర్శులు చింతకాయల వరుణ్, జగుపిల్ల నరేష్, కనకాల ఈశ్వర్ రావు, సత్యం నాయుడు, శివాజీ చక్రవతి, వివిధ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
షార్ట్ సర్క్యూట్తో విద్యుత్ ప్రమాదం
ఇచ్ఛాపురం: పట్టణంలోని బెల్లుపడ కాలనీలో మంగళవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఫైర్ సిబ్బంది తెలిపిన వివరాల మేరకు.. బెల్లుపడ కాలనీలో నివాసముంటున్న ఆటో డ్రైవర్ సీహెచ్ అనిల్ మేడ పైగదిలో పొగలు రావడం గమనించి స్థానికులు అతనికి తెలియజేశారు. వెంటనే పై గదిలోకి వెళ్లి తలుపు తీసి చూడగా గది మొత్తం మంటలు, పొగ వ్యాపించి ఇంట్లోని గృహోపకరణాలు కాలిపోతున్నాయి. వెంటనే విద్యుత్, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. విద్యుత్ సరఫరాని నిలిపి వేయడంతో స్థానికుల సహకారంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న విద్యుత్, ఫైర్ సిబ్బంది ఇంటిని పరిశీలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయని, సుమారుగా రూ.2 లక్షల ఆస్థి నష్టం జరిగి ఉంటుందని ఫైర్ ఆఫీసర్ ప్రశాంత్కుమార్ తెలిపారు. సమాచారం అందుకున్న వార్డు కౌన్సిలర్ జి.ప్రదీప్ కుటుంబ సభ్యులను పరామర్శించి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. -
ఘనంగా క్విసిక్ఫాల్ ఫెస్ట్ ప్రారంభం
ఎచ్చెర్ల: రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో (ఐఐఐటీ) శ్రీకాకుళం క్విసిక్ ఫాల్ ఫెస్ట్ మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. అమరావతి క్వాంట్ం వ్యాలీ సలహాదారులు, నిపుణులు డాక్టర్ వెంకటసుబ్రమణ్యం ముఖ్య అతిథిగా పా ల్గొని ప్రసంగించారు. విద్యార్థులు ఈ ఫెస్ట్ను ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా 55 విద్యా సంస్థలను ఈ ఫెస్ట్కు ఎంపికచేయగా వాటిలో శ్రీకాకుళం ట్రిఫుల్ఐటీ ఒకటిగా నిలిచిందన్నారు. విద్యార్థులు కాటం నిఖిల్తేజ, దూదేకుల కాసింవలి, చెరుకూరి ప్రవీణ్ కుమార్, చదువుల జాన్బాబు, కిమిడి గుణశ్రీల ప్రజెంటేషన్ ఈ ఘనత తీసుకువచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వర్క్షాప్లు, గైడెడ్ జూపిటర్ నోట్బుక్లు, క్యాంపస్ హ్యకథాన్లు, క్వాంటమ్ రీసెర్చ్పై నిపుణుల ప్రసంగాలు ఉంటాయని అన్నారు. కా ర్యక్రమంలో వైజాగ్ ఎంపీ, గీతం విద్యాసంస్థల అధినేత శ్రీభరత్ మాట్లాడుతూ ఆర్టీయూకేటీ ఎంపికపై ప్రశంసలు కురిపించారు. డైరెక్టర్ కేవీజీ బాలాజీ మాట్లాడుతూ ఇది మన క్యాంపస్కు వ చ్చిన మంచి అవకాశమని, విద్యార్థులు వినియోగించుకోవాలని అన్నారు. -
27 నుంచి మల్లన్న సన్నిధిలో కార్తీక సోమవారాలు
టెక్కలి: కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 27 నుంచి టెక్కలి మండలం రావివలస శ్రీ ఎండల మల్లికార్జునస్వామి సన్నిధిలో కార్తీక సోమవారాలు పూజలు నిర్వహించనున్నారు. 27న మొ దటి సోమవారం, నవంబర్ 3న రెండో సోమవారం, 11న మూడో సోమవారం, 17న నాల్గో సోమవారాల ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శీర్షాభిషేకం టికెట్ ధర రూ.40, ప్రత్యేక దర్శనం టికెట్ ధర రూ.20, కేశఖండన రూ.40, రుద్రాభిషేకం రూ.58 చొప్పున దేవ స్థానంలో టికెట్ ధరలు నిర్ణయించారు. అలాగే ఆన్లైన్ ద్వారా స్వామికి సేవలు చేయవచ్చునని దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఆర్టీసీలో 23 కేటగిరీల్లో పదోన్నతులు శ్రీకాకుళం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీ శ్రీకాకుళంలోని ఆర్టీసీ సంస్థలో 23 కేటగిరీలకు చెందిన వివిధ ఉద్యోగులకు త్వరలో పదోన్నతి ఉత్త ర్వులు ఇస్తామని జిల్లా ప్రజా రవాణా అధికా రి సీహెచ్ అప్పల నారాయణ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నా రు. అర్హత కలిగిన ఉద్యోగులకు నియమ,నిబంధనల మేరకు పదోన్నతులు ఇచ్చే ప్రక్రియపై జిల్లా పదోన్నతుల కమిటీ ఆధ్వర్యంలో పూర్వపు ప్రాంతీయ మేనేజర్ కార్యాలయం విజయనగరంలో పూర్తి కసరత్తు జరుగుతుందన్నారు. సుమారు 264 మందితో పాటు మరో 38 మంది (10 శాతం రిజర్వ్) మొత్తం 302 మంది ఉద్యోగులకు రెండు లేదా మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘సహకార’ ఉద్యోగులకు శిక్షణ శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం డీసీసీబీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం సహకార శిక్షణ కార్యక్రమం జరిగింది. జిల్లాలోని సహకార శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ సర్చార్జి, అవార్డు, ఈపీలపై ఒక రోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి జిల్లా సహకార అధికారి బి.మురళీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రామదాసు సహకార శిక్షణ కేంద్రం, రాజమహేంద్రవరం ప్రిన్సిపాల్ గండేపల్లి శ్రీనివాసరావు శిక్షణ విశిష్టతను వివరించారు. శ్రీకాకుళం నగరంలో.. -
ఇలా వెళ్లాలి...
● నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభం ● ఈ ఏడాది నాలుగు సోమవారాలు ఆధ్యాత్మిక సౌరభం శ్రీముఖలింగం జలుమూరు: ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రం శ్రీముఖలింగం దక్షిణ కాశీగా పేరొందింది. ఎక్కడైనా శివుడు లింగాకారంలో ఉంటాడు. కానీ ఈ క్షేత్రంలో మాత్రం ముఖం దాల్చి ఆవిర్భవించాడు. అందుకే ఈ క్షేత్రానికి శ్రీముఖలింగమని, ఇక్కడ కొలువైన శివుడుని ముఖలింగేశ్వరుడని పిలుస్తారు. కాశీలో లింగం, గంగలో సాన్నం, శ్రీశైలంలో శిఖరం, శ్రీముఖలింగంలో ముఖ దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ జరిగే కార్తీక సోమవారాల ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు దేశం నలుమూలలు నుంచి తండోపతండాలుగా వస్తారు. ఈ ఏడాది కార్తీక మాసం నాలుగు సోమవారాలుగా పడ్డాయి. ఈ క్షేత్రం కాశీకి తల్యమైనదిగా అభివర్ణిస్తున్నారు. కృతయుగంలో గోవిందేశ్వరుడు అనే నామంతో కనకాకృతిలోను, త్రేతాయగంలో మధుకేశ్వరుడనే నామంతో రజితాకృతిలోను, ద్వాపర యగంలో జయంతేశ్వరుడనే నామంతో కాంస్యాకృతిలోను, కలియుగంలో ముఖలింగేశ్వరుడనే పేరుతో ముఖం దాల్చి శిలాకృతిలో శివుడు శ్రీముఖలింగం క్షేత్రంలో దర్శనమిస్తున్నాడు. కోరిన కోర్కెలు తీరుతాయి శ్రీముఖలింగంలో మూడు ప్రధాన ఆలయాలతో పాటు ఎన్నో శివలింగాలు ఉన్నాయి. కోటికి ఒక్కటి తక్కువగా ఉండడం వల్ల కాశీగా పేరొందాల్సిన శ్రీముఖలింగం దక్షిణ కాశీగా మిగిలి పోయిందని అర్చకులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఆలయ గర్భగుడిలో ఉన్న గోలెంను ముట్టుకొని మనస్సులో కోర్కెలు తల్చుకొని మొక్కితే ఆ న్యాయమైన కోర్కెలు తీరుతాయని శ్రీముఖలింగేశ్వర క్షేత్ర మహత్యంలో ఉంది. ప్రధాన ఆలయానికి తూర్పు దిక్కున ఉన్నది భీమేశ్వరాలయం కాగా.. దక్షిణ దిశలో ఉన్నది సోమేశ్వరాలయం. ఈ ఆలయాల్లో కూడా సాధారణ రోజలతోపాటు కార్తీక, శివరాత్రి పుణ్య దినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే శ్రీముఖలింగేశ్వరునికి క్షేత్ర పాలకుడుగా విష్ణుమూర్తి వ్యవహరిస్తున్నట్లు చరిత్ర వివరిస్తోంది. కరకవలస గ్రామ సమీపాన రత్నగిరి కొండమీద కృష్ణార్జునులు ఉంటారు. అలాగే ఈ క్షేత్రాన్ని ఆశ్రయించి చాలా తీర్థాలు ఉన్నాయి. ఆలయం మొత్తం ఇండో –అర్బన్ శిల్ప కళతో ఎరుపు రాతితో చెక్కారు. అక్టోబర్ 22 నుంచి కార్తీక ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ ఈవో ఏడుకొండలు తెలిపారు. శ్రీకాకుళం కాంప్లెక్స్ నుంచి శ్రీముఖలింగంనకు సుమారు 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ క్షేత్రం చేరుకునేందుకు శ్రీకాకుళం నుంచి రెండు రూట్లు ఉన్నాయి. ఒకటి నరసన్నపేట నుంచి చల్లవానిపేట మీదుగా, మరొకటి కోమర్తి నుంచి ఉర్లాం మీదుగా శ్రీముఖలింగం చేరుకోవచ్చు. బస్సు, ప్రైవేటు వాహనాలు ఉంటాయి. ఒకవేళ ట్రైన్లో వెళ్తే శ్రీకాకుళం రోడ్డులో దిగాలి. ఆలయం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. -
ఈదురుగాలులతో తీరని నష్టం
హిరమండలం: ఇటీవల కురిసిన వర్షాలకు, ఈదురుగాలులకు వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రస్తుతం వరి పొట్ట దశకు మించి పక్వానికి వచ్చింది. ఈ క్రమంలో చేను బరు వెక్కి నేలవాలింది. దీంతో మట్టిలో, నీటిలో కంకులు నానుతున్నాయి. దీంతో మొలకలు వస్తాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్ఎన్పేట మండలం దబ్బపాడు, తురకపేట సమీపంలో వరికి నష్టం ఎక్కువగా వాటిల్లుతోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. దళితులపై వివక్ష.. త్రిసభ్య కమిటీ విచారణ కంచిలి: మండలంలోని జిల్లుండ గ్రామంలో నివసిస్తున్న దళిత కుటుంబాల పట్ల అదే గ్రామంలో ఉన్న అగ్రకులాల వారు వివక్ష ప్రదర్శిస్తున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు మండల త్రిసభ్య కమిటీ అధికారులు మంగళవారం గ్రామంలో విచారించారు. గ్రామంలో గల దేవాలయానికి రానివ్వడం లేదని, అంగన్వాడీ కేంద్రంలోను, మంచినీటి బోరు వద్ద దళితుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని ఆరోపించడంపై, రెండు వర్గాలను ఒక చోట కూర్చోబెట్టి సమన్వయం చేశారు. ఇకముందు ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకూడదని హెచ్చరించారు. విచారణలో స్థానిక తహసాల్దార్ ఎన్.రమేష్కుమార్, ఎంపీడీఓ వి.తిరుమలరావు, ఎస్ఐ పి.పారినాయుడు, అంగన్వాడీ సూపర్వైజర్ ధనలక్ష్మి, దళిత సంఘాల నేతలు నగిరి మోహనరావు, గుండ్ర జగ్గారావు, సిర్ల మాధవరావు, డొప్ప వెంకటరావు, రుక్మంగధరావు, బడియా నాగరాజు పాల్గొన్నారు. ఇచ్ఛాపురం రూరల్: స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడు నర్తు రామారావు యాదవ్ 23వ సారి యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీ యాదవ సంఘం అధ్యక్షుడు లాకా వెంగళరావు, యానాం రాష్ట్ర అధ్యక్షుడు మట్ట సురేష్ యాదవ్ అధ్యక్షతన సోమవారం యానాంలో జరిగిన ఏపీ, పుదుచ్ఛేరి రాష్ట్రాల సంయుక్త అఖిల భారతీయ యాదవ మహాసభలో శ్రీకాకుళం జిల్లా యాదవ సంఘం నూతన కార్యవర్గాన్ని జాతీ య ప్రధాన కార్యదర్శి నర్తు నరేంద్ర యాదవ్ ప్రకటించారు. జిల్లా యాదవ యువజన అధ్యక్షుడిగా నర్తు ప్రేమ్కుమార్ యాదవ్, జాతీయ యువజన కార్యదర్శిగా కొర్రాయి వాసుదేవ్, జి ల్లా మహిళా అధ్యక్షురాలిగా బద్రి సీతమ్మ, ఉ పాధ్యక్షుడిగా రాపాక చిన్నారావు, ప్రధాన కా ర్యదర్శిగా వంజరాపు కసవయ్య, గజ్జి షణ్ముఖరావు, మడ్డు వెంకటరావు, చిన్ని జోగారావు, లింగమూర్తి తదితరులను ఎన్నుకున్నారు. -
భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
● శ్రీకాకుళం ఆర్డీవో సాయి ప్రత్యూష జలుమూరు: కార్తీక మాసంలో శ్రీముఖలింగం స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో బందోబస్తు నిర్వహించాలని శ్రీకాకుళం ఆర్డీవో సాయి ప్రత్యూష అధికారులను ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. నెల రోజుల పాటు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారని, అందువలన ఉచిత ప్రసాదం, తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాట్లపై గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీ విస్తరణ అధికారులు, ఎంపీడీవోలకు పలు సూచనలు చేశారు. అలాగే క్యూలో భక్తులు ఎండలో ఉండకుండా నీడ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా భక్తులు ఈ ఏడాది అధిక సంఖ్యలో రానున్నారని, వీరి ప్రయాణానికి బస్సుల ఏర్పాట్లు చూడాలన్నారు. పారిశుద్ధ్య లోపం లేకుండా చూడడంతో పాటు మెడికల్ క్యాంప్లు ఏర్పాటు చేయాలని తహసీల్దార్ను అదేశించారు. సమావేశంలో ఎంపీడీవో చిన్నమ్మడు, ఈవోపీఆర్డీ ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడదాం
● వైఎస్సార్సీపీ నాయకుల పిలుపు మెళియాపుట్టి: కోటి సంతకాల సేకరణతో ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడదామని మాజీ డిప్యూటీ సీఎం కృష్ణదాస్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పిలుపునిచ్చారు. మండలంలోని కరజాడ, ముక్తాపురం, మురికింటిభద్ర తదితర గ్రామాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి మాజీ సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారని, దీనికి ప్రతీ కార్యకర్త నడుం బిగించాలని సూచించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతీ పల్లెలో చంద్రబాబు మోసాలు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. కార్యక్రమంలో కరజాడ సర్పంచ్ బమ్మిడి పున్నయ్య, ముక్తాపురం సర్పంచ్ అలికాన జయప్రద, మర్రిపాడు.కె సర్పంచ్ పైల దివ్య, హరి, మాజీ ఎమ్మెల్యే చుక్క పగడాలమ్మ, మండల కన్వీనర్ పోలాకి జయమునిరావు, సీనియర్ నాయకులు ఉర్లాన బాలరాజు, బమ్మిడి ఖగేశ్వరరావు, బైపోతు ఉదయ్కుమార్, భాస్కర దాస్, అలికాన మాధవరావు, లింగాల సంజీవరావు, కరణం శశిభూషణరావు తదితరులు పాల్గొన్నారు -
చెస్ పోటీల పోస్టర్ ఆవిష్కరణ
టెక్కలి: ఆలిండియా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 26న టెక్కలిలో నిర్వహించనున్న జిల్లాస్థాయి చెస్ పోటీల పోస్టర్ను ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి ఆధ్వర్యంలో మంగళవారం ఆవిష్కరించారు. స్థానిక ఆల్ఫాజెన్ పాఠశాలలో నిర్వహించనున్న పోటీలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని ఆలిండియా చెస్ ఫెడరేషన్ సభ్యుడు ఎస్.భీమారావు, జిల్లా సభ్యుడు ఐ.అవినాష్ కోరారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద స్పృహ లేకుండా పడివున్న వ్యక్తిని రిమ్స్లో చేర్పించగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు రెండో పట్టణ సీఐ ఈశ్వరరావు తెలిపారు. ఈనెల 19న ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద ఎటువంటి గాయాలు లేకుండా స్పృహ లేకుండా శృంగవరపు సూర్యనారాయణ (55) పడి ఉండటాన్ని చూసిన స్థానికులు రిమ్స్కు తరలించారన్నారు. ఏ గ్రామస్తుడో తెలియనందున తెలిసినవారు స్టేషన్కు సమాచారమివ్వాలని, లేదంటే 63099 90824 నంబర్కు డయల్ చేసి తెలియజేయాలన్నారు. -
అమరులకు అశ్రు నివాళి
● ఘనంగా పోలీసు అమరవీరుల స్మారకోత్సవాలు ● పోలీసుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం: మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం క్రైమ్ : పోలీసులు సమర్థంగా పనిచేస్తే సమాజానికి మేలు జరుగుతుందని, ఎందరో పోలీసులు విధుల్లో అసువులు బాసి అమరులయ్యారని, వారిని నివాళులర్పించడం మన బాధ్యత అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. పోలీసు అ మరవీరుల స్మారకోత్సవం తొలిరోజు మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ముందుగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీలతో కలసి అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లి పూలమాలలతో నివాళుర్పించారు. అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలు అందజేశారు. ఏఆర్ దళాల పరేడ్ ఆకట్టుకుంది. మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి.. అనంతరం మంత్రి మాట్లాడుతూ మహిళలపై అ త్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయని, గంజాయి, డ్రగ్స్మత్తులో యువత చెడిపోతున్నారని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి కృషి చేయాలన్నారు. సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం బాధితులుగా మారుతున్నారని, వారికి అవగాహన కల్పించాలని సూచించారు. పోలీస్ క్వార్టర్లు, స్టేషన్లు పోలీస్ హౌసింగ్ కా ర్పొరేషన్ ద్వారా నిర్మించేలా నివేదిస్తానన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ పోలీసుల త్యాగాలు, సేవలు మరువలేనివన్నారు. ఎస్పీ మాట్లాడుతూ ఈ ఏడాది దేశంలో 191 మంది పోలీసులు విధుల్లో మరణించారని, ఏపీలో ఇద్దరు మరణించారన్నారు. జిల్లాలో అమరులైన ఆరు కుటుంబాలకు కారుణ్య నియామకాల్లో కొనసాగుతున్నారని, మరణించిన హోంగార్డు కుటుంబాల్లో ఒకరికి ఔట్సోర్సింగ్ జాబ్ వచ్చే లా కార్యాచరణ చేస్తున్నామన్నారు. విధుల్లో భాగంగా అసాంఘిక శక్తుల నడుమ ఉండేటప్పుడు జాగ్రత్తలు వహించాలని, శాఖాపరంగా మద్దతిస్తామన్నా రు. ఆరోగ్య భద్రత పరంగా పెండింగ్ బిల్లులు లేవని, ఐదు కుటుంబాలకు రూ. 25 లక్షలు ఇస్తామన్నా రు. ప్రమాద ఇన్స్యూరెన్సులు, బ్యాంకులతో టైఅప్ ఇన్స్యూరెన్సులు చేయిస్తున్నామన్నారు. -
మా సొమ్ము ఇచ్చేదెప్పుడు..?
ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం పోస్టాఫీస్లో జరిగిన భారీ స్కామ్తో 34 మంది ఖాతాదారుల రూ.2.78 కోట్ల సొమ్ము మాయమైన సంగతి తెలిసిందే. మూడు నెలలుగా దీనిపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో మంగళవారం బాధితులంతా పోస్టల్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ గేటు బయట టెంట్లు వేసి సుమారుగా నాలుగు గంటల పాటు కార్యాలయ సిబ్బందిని కార్యాలయంలోనికి వెళ్లనీయకుండా అడ్డుపడ్డారు. పోస్టాఫీస్లో దాచుకొన్న సొమ్ముని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. స్థానిక పోస్టుమాస్టర్ షణ్ముఖరావు బాధిత ఖాతాదారులకు ఎంతగానో నచ్చచెప్పినప్పటికి ఖాతాదారులెవరూ వినలేదు. దీంతో చేసేదేమీ లేక పోస్టల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ సోంపేట నుంచి స్థానిక పోస్టల్ కార్యాలయానికి చేరుకున్నారు. పోస్టల్ ఇన్స్పెక్టర్ కూడా బాధితులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికి స్పష్టమైన హామీ లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వాలని బాధితులు కోరడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. ఈ క్రమంలో పోస్టల్ ఇన్స్పెక్టర్, పోస్టల్ అసిస్టెంట్ డెరెక్టర్ రాజు, పోస్టల్ సూపరిండెంట్ హరిబాబుకి ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. దీంతో పోస్టల్ ఉన్నతాధికారులు బాధిత ఖాతాదారులతో ఫోన్లో మాట్లాడారు. 15 రోజుల్లో అందరికీ న్యాయం చేస్తామని వాయిస్ మెసేజ్ పంపించారు. దీంతో ఖాతాదారులంతా తాత్కాలికంగా నిరసనను విరమిస్తున్నట్లు తెలిపారు. 15 రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే నిరసనలు ఉద్ధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో బాధిత ఖాతాదారులు చాట్ల లోహిదాస్, బాలరాజు, కిరణ్మయి, శ్రీను, మమాపాత్రో తదితరులు పాల్గొన్నారు. -
ఆ ఊళ్లే దీపావళి
గార, టెక్కలి: జిల్లాలో దీపావళి పేరిట రెండు గ్రామాలు ఉన్నాయి. గార మండలంలోని ఓ గ్రామం ఉంటే.. టెక్కలి మండలంలో మరో గ్రామం ఉంది. గార మండలంలోని దీపావళి గ్రామానికి ఆ పేరు రావడానికి ఓ కథ ప్రచారంలో ఉంది. దాని ప్రకారం.. ఓ కళింగ రాజు ఇటుగా వస్తూ ఈ గ్రామానికి దీపావళి అనే పేరు పెట్టారు. అప్పటి వరకు ఈ ప్రాంతాన్ని గూడెం అని పిలిచేవారట. ఆ రాజు ప్రతి రోజూ శ్రీకాకుళం నుంచి శ్రీకూర్మం వరకు గుర్రంపై వెళ్లేవారట. మార్గం మధ్యలో లక్ష్మీనారాయణ స్వామి ఆలయం వద్ద ఆగి స్వామిని దర్శించుకునేవారు. ఒక రోజు శ్రీకూర్మం వెళ్లి వస్తూ ఇక్కడ సొమ్మసిల్లి పడిపోయారు. ఇక్కడి వారు ఆయనకు సాయం చేయగా కోలుకున్నారు. ఊరి వారిని గ్రామం పేరు అడగ్గా పేరేమీ లేదని చెప్పారు. ఆ రోజు దీపావళి కావడంతో ఆ ఊరికి దీపావళి అనే పేరును పెట్టారు. రెవెన్యూ రికార్డుల్లోనూ ఈ పేరే ఉంది. టెక్కలి మండలం అయోధ్యపురం పంచాయతీ పరిధిలో ‘దీపావళి’ గ్రామం ఒకటి. టెక్కలి నుంచి బన్నువాడ గ్రామం మీదుగా సుమారు 7 కిలోమీటర్ల దూరంలో మారుమూల ప్రాంతంలో ఈ దీపావళి గ్రామం ఉంది. పండగ పేరుతో ఉన్న ఈ గ్రామంలో మొత్తం 50 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. దీపావళి పేరుతో గ్రామానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. -
అవగాహనే వెలుగు
● జిల్లావ్యాప్తంగా 100 దుకాణాలకు తాత్కాలిక లైసెన్సులు ● దీపావళికి జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ సూచన శ్రీకాకుళం క్రైమ్ : ప్రశాంత వాతావరణంలో, ప్రమాదాలకు తావివ్వకుండా జిల్లా ప్రజలు దీపావళి పండగ జరుపుకోవాలని, తక్కువ కాలుష్యం ఉన్న గ్రీన్ క్రాకర్స్ మాత్రమే వినియోగించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సూచించారు. ఇళ్లలో, దుకాణాల్లో లైసెన్సు లేకుండా బాణసంచా నిల్వలు ఉంటే దా డులు నిర్వహించి కేసులు పెడతామన్నారు. బహిరంగంగా మద్యం సేవించి న్యూసెన్సు చేసినా, వాహనాలు నడిపినా, పేకాట నిర్వహించినా జైలు కు వెళ్లడం ఖాయమన్నారు. జిల్లాలో వంద దుకాణాలకు బాణసంచా సామగ్రి విక్రయించేందుకు తాత్కాలిక అనుమతి ఇచ్చారు. పర్మినెంట్ షాపులు 12 ఉన్నాయి. హద్దులు దాటితే అనర్థమే.. ● టపాసుల్లో టాక్సిక్ కారకాలైన రాగి, కాడ్మియం, సీసం, మెగ్నీషియం, జింక్, సోడియం, పొటాషియం, గంథఽకం వంటివి ఉండటంతో శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతాయి. ముఖ్యంగా భూచక్రాలు, పాము మాత్రలు, మతాబులు, చిచ్చుబుడ్లు వల్ల అధికంగా పొగ వ్యాపిస్తుంది. ● టపాసులు పేల్చినప్పుడు వెలువడే ధ్వని అపరిమితంగా ఉంటుంది. బాణసంచా కాల్చేటప్పు డు 125 నుంచి 130 డెసిబుల్స్ శబ్దం వెలువడుతుంది. సాధార ణ మనిషి వినికిడి శక్తి 50 డెసిబుల్స్ మాత్ర మే. అంతకు మించి శబ్దాలను వింటే వినికిడి సమస్యల బారినపడ్తారు. అనర్థాలే అధికం.. భారీ శబ్దాలు, రసాయనాలు వెలువరించే బాణసంచా స్థానంలో మట్టి దీపాలు, కొవ్వొత్తులు, విద్యుత్ దీపాలను వెలిగించాలి. గాలి, శబ్ద కాలుష్యం నివారించేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయి. టపాసుల త యారీలో కాపర్, కాడ్మియం, లెడ్, అమ్మోనియం, నైట్రోజన్ ఆకై ్సడ్, సల్ఫర్ డయాకై ్సడ్, సోడియం, మెర్క్యురీ, లిథియం, పొటాషియం వంటి అనేక మిశ్రమాలతో తయారు చేస్తారు. వీటి నుంచి వచ్చే వెలుగులతో కన్ను, ఘాటు వాసనతో ఊపిరితిత్తుల సమస్యలు ఏర్పడతాయి. ప్రమాదాలు సంభవిస్తే.. ● టపాసులు కాల్చినప్పుడు అగ్నిప్రమాదం సంభవిస్తే తక్షణమే దగ్గరలో ఉన్న అగ్నిమాపక కేంద్రాలకు లేదా 101 నంబర్కు డయల్ చేసి సమాచారమివ్వాలి. 100, 108 నంబర్లనూ సంప్రదించాలి. -
పరమ పవిత్రం.. కార్తీకం
● 22 నుంచి కార్తీక మాసం ఆరంభం ● ముస్తాబవుతున్న దేవాలయాలు హిరమండలం: పరమ పవిత్రమైన కార్తీక మాసం రానే వస్తోంది. ఈ నెల రోజులూ దైవ భక్తిలో ఉంటే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషా లు కలుగుతాయన్నది భక్తుల ప్రగాడ విశ్వాసం. ఈ మాసంలో దీపారాధనకు అనేక శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. దీపాన్ని దైవ స్వరూపంగా భావించి పూజలు చేస్తారు. కార్తీక సోమవారాల్లో చేసే దీపారాధన, ఉసిరి చెట్టు కింద పూజలు, వనభోజనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పండితులు చెబుతున్నారు. అక్టోబర్ 22 నుంచి ప్రారంభమయ్యే కార్తీక మాసంలో నాలుగు వారాలు ఈ పూజలు కొనసాగుతాయి. దీపారాధన ప్రత్యేకత కార్తీక మాసంలో ఒక్కో రకమైన ప్రమిదలో దీపం వెలిగిస్తే ఒక్కో రకమైన మంచి జరుగుతుందని నమ్ముతారు. మట్టి ప్రమిదలో వెలిగిస్తే దైవానుగ్రహం కలుగుతుందని, పింగాణి ప్రమిదలో దీపం వెలిగిస్తే ఆ ఇంటి వారికి అలంకరణ వస్తువులు సమకూరుతాయని, ఇత్తడి ప్రమిదలో దీపాలు వెలిగిస్తే ఆ ఇంట్లో దైవశక్తి అధికవవుతుందని, కంచు ప్రమిదలో వెలిగిస్తే ఆయుష్సు పెరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. నిమ్మ ప్రమిదల్లో వెలిగిస్తే అన్ని కార్యాల్లోని విజయం సిద్ధిస్తుందని, అరటి దోనెలో దీపం వెలిగించి నీటిలో వదిలితే మానసిక సంతృప్తి, ధన రక్షణ కలుగుతుందని, ఉసిరికాయల దీపం వెలిగిస్తే పాపాలు తొలగిపోతాయని కూడా చాలా మంది విశ్వసిస్తారు. శివకేశవులకు సమప్రాధాన్యం కార్తీకమాసం శివుడికి, విష్ణువుకి ప్రతీకరమైంది. అందుకే ఈ మాసం ప్రతి సోమవారం శివుడికి, ప్రతి శుక్ర, శని వారాల్లో విష్ణుమూర్తికి ప్రత్యేక పూజ లు చేస్తారు. శివపార్వతుల పుత్రుడైన అయ్యప్ప దీక్షలు ఈ మాసంలోనే ప్రారంభమవుతాయి. శివుడికి రుద్రాబిషేకం, బిళ్వార్చన, విష్ణువుకి తులసీ దళార్చన ఈ మాసంలోనే అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహిస్తారు. లక్ష్మీదేవి, కార్తికేయుడు, చంద్రుడు, ఇంద్రుడు, తులసిమాత, ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు చేయడం కూడా ఆనవాయితీగా వస్తోంది. -
కొనకుండానే పేలుతున్నాయ్!
నరసన్నపేట, శ్రీకాకుళం కల్చరల్: తగ్గిన జీఎస్టీలతో బాణసంచా ధరలు తగ్గుతాయని భావించిన వారికి మందుగుండు ధర దడ పుట్టిస్తోంది. ధరలు గత ఏడాది కంటే ఎక్కువ ఉండడం గమనార్హం. జిల్లాలో శనివారం నుంచి వి క్రయాలు ప్రారంభించారు. శాశ్వత దుకాణాల్లో ముందు నుంచే విక్రయాలు ఉన్నా తాత్కాలిక లైసెన్సులు పొందిన దుకాణాల వద్దనే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. అధికంగా సేల్ అయ్యే అగ్గిపెట్టెలు, తారా జువ్వలు, మతా బులు, క్రాకర్లు, భూచక్రాలు, చిచ్చుబుడ్డీలు, థౌజెండ్ వాలా వంటి సామగ్రి ధరలు అధికంగా ఉన్నాయి. గత ఏడాది కంటే 20 శాతం వరకూ ధరలు అధికంగా ఉన్నాయని వినియోగదారులు అంటున్నారు. -
పుట్టినరోజు నాడే విషాదం
● మొగదాలపాడు బీచ్లో యువకుడు గల్లంతు ● కింతలి ఖాజీపేటలో విషాదఛాయలు గార/పొందూరు: పుట్టిన రోజు వేడుకల కోసం స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వచ్చిన యువకుడు గల్లంతైన ఘటన మొగదాలపాడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొందూరు మండలం కింతలి ఖాజీపేట గ్రామానికి చెందిన అలబాన జగదీష్కుమార్ విశాఖపట్నంలోని ఐటీఐ చదువుతున్నాడు. దీపావళి సెలవులకు ఇంటికి వచ్చిన జగదీష్కు ఆదివారం పుట్టిన రోజు కావడంతో మరో నలుగురి స్నేహితులతో కలిసి గార మండలం వత్సవలస పంచాయతీ మొగదాలపాడు వచ్చారు. సాయంత్రం బీచ్లో స్నానానికి దిగిన ఐదుగురు కేరింతల్లో ఉండగా భారీ అలకు జగదీష్ గల్లంతయ్యాడు. వెంటనే గాలించినా జాడ దొరకలేదు. మైరెన్ సీఐ బి.ప్రసాదరావు ఘటనా స్థలానికి వెళ్లి సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. జగదీష్ స్నేహితులతో మాట్లాడి వివరాలు సేకరించారు. జగదీష్ తండ్రి గోవిందరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు, గాలింపు చర్యలు చేపట్టామని ఏఎస్ఐ తెలుగు చంద్రశేఖర్ తెలిపారు. -
డీఏ ప్రకటన కంటితుడుపు చర్య
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ఎన్నికల ముందు అన్ని వర్గాల ప్రజలతో పాటు ఉద్యోగులకు అనేక అమలు చేయలేని హామీలిచ్చిన చంద్రబాబునాయుడు 16 నెలల తరువాత ఒక్క డీఏ మాత్రమే ప్రకటించడం భావ్యం కాదని వైఎస్సార్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుక్కూరు ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ఉద్యోగులకు ఆశ కల్పించి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక ముఖం చాటేయడం సిగ్గుచేటన్నారు. పీఆర్సీ, ఐఆర్ కాకుండా ఒక్క డీఏ ఇవ్వడం దారుణమన్నారు. సీఎం, డిప్యూటి సీఎం, విద్యాశాఖ మంత్రులు సొంత పనులకోసం కోట్లాది రూపాయిలు ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న కూటమి సర్కారుకు పెన్షనర్లు, ఉద్యోగుల సంక్షేమం పట్టడం లేదని దుయ్యబట్టారు. ఇదే వైఖరి కొనసాగిస్తే భవిష్యత్లో తగిన మూల్యం చెల్లంచుకోక తప్పదన్నారు. శ్రీకాకుళం: రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు కంటితుడుపు చర్యగా రాష్ట్ర ప్రభుత్వం ఒక డీఏ మాత్రమే ప్రకటించడం సరికాదని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పేడాడ కృష్ణారావు, పూజారి హరిప్రసన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయులకు, విశ్రాంత ఉద్యోగులకు కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నా వాటిని చెల్లించకుండా బకాయిపడిన నాలుగు డీఏలలో కేవలం డీఏ చెల్లించడం ప్రభుత్వ ఉదాసీన వైఖరికి నిదర్శనమన్నారు. మధ్యంతర భృతి ప్రకటన చేయకుండా, మూడేళ్లుగా ఉద్యోగుల సంపాదిత సెలవుల డబ్బులు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఒకవైపు చెబుతూనే, మరోవైపు విశాఖపట్నంలో ప్రతిపాదిత గూగుల్ డేటా సెంటర్కు సంవత్సరానికి 22 వేల కోట్ల రూపాయలు రాయితీని ప్రకటించడం దేనికి నిదర్శనమో ముఖ్యమంత్రి సమాధానం చెప్పకుండా, ఉద్యోగ వర్గాలను నిర్లక్ష్యం చేయడం భావ్యం కాదన్నారు. బుక్కూరు ఉమామహేశ్వరరావు పేడాడ కష్ణారావు -
రాష్ట్రంలో నిర్బంధ పాలన
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, పార్టీ నాయకులు, అనుకూల మీడియాపై అక్రమ కేసులు బనాయించి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమితులైన చల్ల శ్రీనివాసరావు అభినందన సభ శ్రీకాకుళం టౌన్హాల్లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో పార్టీలు, కులాలు, మతాలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించామన్నారు. పేదవాడు అభివృద్ధి చెందాలంటే విద్య ఒక్కటే ఆయుధమని నమ్మిన వైఎస్సార్, జగన్మోహన్రెడ్డిలు తమ పాలనలో అధిక ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. అటువంటి ఇంగ్లిష్ మీడియం విద్యపై కక్షగట్టి చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు. రాజకీయాలంటే డబ్బు సంపాదన కాదు.. కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకుండా పేదవాడికి వైద్యం అందకుండా చేయడం సరికాదని ధర్మాన అన్నారు. ఎంతోమంది జీవితకాలం సంపాదించుకున్న డబ్బులు ఒక్క అనారోగ్యంతో మొత్తం కోల్పోతున్నారని చెప్పారు. రాజకీయాల్లో పదవులు చేపట్టడం అంటే డబ్బులు సంపాదించుకోవచ్చన్న అపోహ చాలా మందిలో ఉందని, అలాకాకుండా సమాజానికి సేవ చేసే అదృష్టంగా భావించాలన్నారు. రాజకీయ పార్టీ కోసం కష్టపడి పనిచేసి న్యాయం చేయగలిగితేనే పదవులకు సార్ధకత చేసినట్టవుతుందన్నారు. పార్టీలో కష్టాలు, గుర్తింపు ఉంటాయని, అన్నింటినీ ఒకేలా స్వీకరిస్తేనే రాజకీయాల్లో రాణించగలమన్నారు. ప్రతిపక్షంలో వచ్చే అవకాశాలు ఒక్కొక్కరికి ఒక్కో సమయంలో పదవులొస్తాయని వాటిని సక్రమంగా వాడుకుని నాయకుడిగా ఎదిగేందుకు అవకాశాల్ని అందిపుచ్చుకోవాలన్నారు. గత వైఎస్సార్సీపీ పాలనలో అనేక మార్పులు, సంస్కరణలు తీసుకొచ్చామని గుర్తు చేశారు. పరిపాలన ప్రజల వద్దకు తీసుకొచ్చేందుకు రెండు వేలు మంది జనాభా ఉన్న ప్రతిగ్రామంలో సచివాలయాలు నిర్మించి అనేక సేవలు అందించగలిగామన్నారు. చంద్రబాబు 40 ఏళ్లలో చేయలేనివి జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలనలో చేసి చూపించారన్నారు. అన్యాయాలను ప్రశ్నిస్తే కేసులా? అధికార పార్టీ నాయకులు ఎంతోమంది అర్హులకు పథకాలు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టే పరిస్థితి ప్రతిగ్రామంలో ఉందని, వైఎస్సార్సీపీ హయాంలో అవేమి లేకుండా పాలన సాగిందని ధర్మాన అన్నారు. ఏ పోలీస్స్టేషన్కు వెళ్లినా వైఎస్సార్సీపీ నాయకులపై కేసులు చిట్టానే కనిపిస్తుందని, ప్రజాస్వామ్యంలో ఇలాంటివి ఎంతకాలమూ సాగవన్నారు. బీదలకు అనుకూలంగా అనేక యాక్ట్లపై చంద్రబాబు దుష్ప్రచారం చేసి వాటిని నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. అధికార పార్టీ నేతలు చేసే అరాచకాలు, అన్యాయాలు ప్రశ్నించడమే నిజమైన ప్రతిపక్షమన్నారు. విజిలెన్స్, ఏసీబీ వంటి అవినీతి నిర్మూలన శాఖల్ని వాడుకుని అవినీతిలేని సమాజాన్ని తయారుచేసేందుకు ప్రతిపక్ష నాయుకులు కృషి చేయాలన్నారు. కూటమి ప్రభుత్వ పాలన అధ్వానంగా ఉండబట్టే ప్రజల్లో అతివేగంగా బలహీనపడిందన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేలు గొండు నర్శింగరావు, తంగి సత్యనారాయణ, అంధవరపు తవిటయ్య, పసగాడ సూర్యనారాయణ, గుండ అప్పలసూర్యనారాయణ, గుండ లక్ష్మిదేవితో పాటు తాను అవినీతిరహిత పాలన అందించాం కాబట్టే ప్రజల్లో మంచి గుర్తింపు పొందగలిగామన్నారు. ప్రజలు నాయకుల వద్ద నుంచి డబ్బులు ఆశిస్తే ప్రభుత్వ ఫలాలు సక్రమంగా తీసుకోలేరన్నారు. అధికార పార్టీ నాయకులు అధికంగా డబ్బు ఖర్చుపెట్టి గెలిచాక ఆ డబ్బులు ఎలా వసూలు చేయాలనే తాపత్రయంతో పాలన చేస్తారే తప్ప నీతివంతంగా చేయలేరన్నారు. పేదల కోసం చంద్రబాబు ఏనాడైనా ఎకరం భూమి అయినా సేకరించి పంచిపెట్టగలిగారా అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ హయాంలో నగరంలో 25 వేల మందికి ఇళ్ల స్థలాలతో పాటు నిర్మాణం పూర్తిచేసి ఇచ్చామన్నారు. శ్రీకాకుళం నగరానికి ఇప్పటికే చాలా చేశానని, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని, ప్రజల ఆశీర్వాదంతో మిగిలిన పనులు పూర్తిచేసేందుకు అవకాశం కల్పించాలన్నారు. కలిసికట్టుగా పనిచేస్తేనే విజయం సులువుగా సాధించుకోగలమన్నారు. అందరినీ చైతన్యవంతులు చేసి వైఎస్సార్సీపీ ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన మంచి పనుల్ని అందరికి తెలియజేయాలని కోరారు. జిల్లాకు ఇప్పటికే తీవ్ర అన్యాయం జరుగుతుందని మౌనంగా ఉంటే పనులు జరగవన్నారు. సౌమ్యుడైన చల్ల శ్రీనును వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తించి బాధ్యతాయుతమైన పదవిని అప్పగించడం సంతోషమన్నారు. పార్టీకోసం మరింత కష్టపడి పనిచేసి సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ 30 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం చల్ల శ్రీనివాసరావుదని పేర్కొన్నారు. జగన్మోహన్రెడ్డి నమ్మకాన్ని వమ్ముచేయకుండా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ●వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమితులైన చల్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ తన తండ్రి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, న్యాయవాదిగా మంచి గుర్తింపు ఉందని, ఆయన ఆశయాల కోసం పనిచేస్తానన్నారు. సమాజంలో గౌరవంగా బతకాలన్నదే తన లక్ష్యమని, తనకు అప్పగించిన బాధ్యతలను విధిగా నిర్వర్తిస్తానన్నారు. తనకు పదవిని అప్పగించిన మాజీ సీఎం జగన్మోహన్రెడ్డికి, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్కు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ తూర్పుకాపు, కళింగ వైశ్య, పోలినాటి వెలమ కుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, అంబటి శ్రీనివాసరావు, గొండు రఘురాం, ముంజేటి కృష్ణ, పొన్నాడ రుషి, శిమ్మ రాజశేఖర్, ఎన్ని ధనుంజయరావు, మండవల్లి రవి, చిట్టి జనార్ధనరావు, టి.కామేశ్వరి, అంబటి నిర్మల, కోణార్క్ శ్రీనివాసరావు, తంగుడు నాగేశ్వరరావు, వైశ్యరాజు మోహనరావు, మూకళ్ళ తాతబాబు, యజ్జల గురుమూర్తి, డాక్టర్ ధర్మాన లక్ష్మీనారాయణ, డాక్టర్ అమ్మన్నాయుడు, చల్ల రవి, బొడ్డేపల్లి పద్మజ, గంగు శారద తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో పార్టీలకతీతంగా పథకాల వర్తింపు వైఎస్సార్ సీపీపై అక్కసుతో మంచి పథకాలను సైతం ఆపేస్తున్నారు సాగునీటి ప్రాజెక్టులకు ఏళ్లు గడిచినా మోక్షం కలగడం లేదు చల్ల శ్రీను సన్మాన సభలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు -
హోటల్ రంగంతో ఉపాధి అవకాశాలు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): హోటల్ రంగం ఎంతోమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రయివేటు ఫంక్షన్ హాల్లోజిల్లా హోటల్స్, రెస్టారెంట్స్, బేకర్స్, ఫంక్షన్ హాల్స్ అసోసియేషన్, టౌన్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం శనివారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు మెట్ట నాగరాజు నాయకత్వంలో ప్రధాన కార్యదర్శిగా కెల్ల కిశోర్ కుమార్, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా అంధవరపు సతీష్, కోశాధికారిగా అంధవరపు తిరుమలరావు ప్రమాణస్వీకారం చేశారు. టౌన్ అధ్యక్షుడిగా అరవల సతీష్, జనరల్ సెక్రటరీగా తుంబలి సుదర్శన్ పట్నాయక్, కోశాధికారిగా టంకాల కృష్ణ, ఎగ్జిక్యూటివ్ కార్యదర్శిగా ఏ.సతీష్ ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు, శ్రీకాకుళం జిల్లా సెంట్రల్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు వి.ఆనంద్, ఎస్.వి.డి మురళీ తదితరులు పాల్గొన్నారు. -
కొండ దగ్గర కాపుకాసి..
విజయనగరం జిల్లా డెంకాడ మండలం గునపురం పేట గ్రామానికి చెందిన ఎస్.బంగారునాయుడు శ్రీకాకుళం జిల్లాలో పలు పోలీస్స్టేషన్లలో పనిచేశారు. 1992 మార్చి 24న కాశీబుగ్గ ఎస్హెచ్వోలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో మందస మండలం భేతాళపురంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో స్పెషల్ బ్రాంచి ఎస్ఐ జగన్మోహనరావు, ఏడుగురు రిజర్వ్ సిబ్బందితో కలిసి రైడ్కు వెళ్లారు. ఇద్దరు నిందితులను పట్టుకుని వస్తున్న సమయంలో రట్టికొండ దగ్గర కొండచాటు నుంచి నాగావళి దళం కాల్పులు జరిపారు. ఎదురు కాల్పులు జరిగినా.. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో వీరోచితంగా పోరాడి అదే రోజున బంగారునాయుడు వీర మరణం పొందారు. -
సలామ్
త్యాగాలకు వీరోచితంగా పోరాడి.. కోటబొమ్మాళి మండలం జర్జంగి గ్రామానికి చెందిన ఎ.పాపారావు 1971లో పోలీస్ కానిస్టేబుల్గా విధుల్లో చేరారు. వజ్రపుకొత్తూరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సమయంలో పలాస మండలం నీలిభద్రలో కంబిరిగాం చౌదరి అనేవ్యక్తిని హతమార్చి ఆస్తిని దోచుకునేందుకు నక్షలైట్లు ప్రణాళిక రచించారు. విషయం తెలుసుకున్న పోలీసులు నలుగురు కానిస్టేబుళ్లతో పికెట్ ఏర్పాటుచేసి హెడ్ కానిస్టేబుల్ పాపారావును ఇన్చార్జిగా నియమించారు. 1997 జులై 17న అర్ధరాత్రి మావోయిస్టులు ఆ ఇంటిపై తుపాకుల గుళ్లతో దాడికి ఎగబడ్డారు. చౌదరిని రక్షించే క్రమంలో వీరోచితంగా పోరాడిన పాపారావు వీరమరణం పొందారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్లో పనిచేస్తూ.. పొందూరు మండలం లోలుగు గ్రామానికి చెందిన మజ్జి వెంకటరమణ 1998లో కానిస్టేబుల్గా చేరారు. జిల్లా స్పెషల్ టాస్క్ఫోర్స్లో విధులు నిర్వర్తిస్తూ ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. బత్తిలి పీఎస్ పరిధిలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో అక్కడి ఎస్ఐ, ఆర్ఎస్ఐ వెంకునాయుడు, 27 మంది స్పెషల్ టాస్క్ఫోర్స్ సిబ్బందితో కలిసి నులకజోడు గ్రామానికి చేరుకున్నారు. 16 మంది మావోయిస్టులు ముందుగా ఐదుచోట్ల పాతిపెట్టిన మందుపాత్రలను పేల్చి పోలీసులపై కాల్పులు జరిపారు. వెంకటరమణ వీరోచితంగా పోరాడి కాల్పుల్లో మరణించారు. శ్రీకాకుళం క్రైమ్: లక్షలాది జనాభా పాల్గొనే సమావేశాలు.. ఇసుకేస్తే రాలనంత రద్దీగా ఉన్న దేవాలయాలు.. మండుతున్న ఎండల్లో భోజనం లేకపోయినా బందోబస్తు కాయాల్సిందే. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో విధులంటే కత్తిమీద సామే. అలా నక్సలైట్ల దాడుల్లో అశువులు బాసిన పోలీసులు ఎందరో అమరులయ్యారు. ప్రతీ ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. వారిని స్మరిస్తూ జిల్లాలో ఈ నెల 21 నుంచి 31 వరకు స్మారకోత్సవాలను ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించేందుకు పోలీసులు సన్నద్ధమయ్యారు. స్మారకోత్సవం ఎందుకంటే.. 1959 అక్టోబరు 21న దేశ సరిహద్దులో చైనా రక్షణ బలగాలు సియాచిన్ భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించడంతో సీఆర్పీఎఫ్ దళం దీటుగా ఎదురొడ్డి పోరాడింది. జవాన్లు పది మంది ప్రాణాలను కోల్పోవడమే కాక ఎంతోమంది పోలీసులు సైతం వివిధ ఘటనల్లో ప్రాణాలు సైతం కోల్పోయారు. వీరి సేవలకు గుర్తుగా ఏటా అక్టోబర్ 21న పోలీసుల అమరవీరులు సంస్మరణ దినాన్ని ఏటా నిర్వహిస్తున్నారు. జిల్లాలో పలువురు అమరులైన పోలీసులను, వారి త్యాగాలను స్మరించుకుందాం. పీపుల్స్ గ్రూప్ చేతిలో బలి.. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని సంతకవిటి మండలం వాల్టేరు గ్రామానికి పి.కృష్ణమూర్తి 1988లో పోలీస్ కానిస్టేబుల్గా చేరారు. మావోయిస్టుల కార్యకలాపాల సమాచార సేకరణలో కీలకంగా వ్యవహరించడంతో ఇతన్ని మట్టుబెట్టేందుకు నక్షక్సల్స్ పథక రచన చేశారు. మందస పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న సమయంలో 2000 జూన్ 5న పీపుల్ గ్రూప్ నక్సలైట్లు మాటువేసి హరిపురం కూడలికి చేరుకున్న కృష్ణమూర్తి, పీసీ కె.రమేష్లపై దాడిచేశారు. ఆ దాడిలో కృష్ణమూర్తి నేలకొరిగారు.సమాచార సేకరణలో దిట్ట .. టెక్కలి గ్రామానికి చెందిన ఎం.నరేంద్రదాస్ 1976లో పోలీస్ కానిస్టేబుల్గా విధుల్లో చేరారు. మావోయిస్టుల సమాచార సేకరణలో దిట్టగా పేరుగాంచారు. వారి ఉద్యమాలను నీరుగార్చేందుకు విశేష కృషి చేశారు. మావోయిస్టుల కదలికలను గమనించి వారి ఆకృత్యాలను నిరోధించడంలో నరేంద్రదాస్ సఫలమవుతుండటాన్ని వారు సహించలేకపోయారు. 1997 మార్చి 17న కాశీబుగ్గ పోలీస్స్టేషన్కు వెళ్లే సమయంలో దారిలో దైవ దర్శనానికి ఆగి ఉన్న సమయం చూసి మావోయిస్టులు కాల్పులు జరపగా దాస్ వీరమరణం పొందారు. రేపు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం జిల్లాలో అమరులైన ఐదుగురు పోలీసులు స్మారకోత్సవాలకు సన్నద్ధమైన పోలీసు అధికారులు -
మందుగుండు సామగ్రి సీజ్
పొందూరు: పొందూరులో ఎటువంటి లైసెన్సు లేకుండా మందుగుండు సామగ్రి విక్రయిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని సామగ్రి సీజ్ చేసినట్లు ఎస్సై వి.సత్యనారాయణ తెలిపారు. ఆదివారం మార్కెట్ వీధిలో దీపావళి సామాన్లు విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించగా రూ.1,09,623 విలువైన మందుగుండు గుర్తించామన్నారు. పొట్నూరు వెంకటరావు వద్ద రూ.40,088, జామి మణికంఠ వద్ద రూ.59,717, గుడ్ల రవి వద్ద రూ. 9,818 విలువైన సామగ్రి స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ‘నాభూమి..నాదేశం’ స్మారక శిలాఫలకం కూల్చివేత టెక్కలి: గత వైఎస్సార్సీపీ హయాంలో ఆజాదీకా అమృత మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా టెక్కలి మండలం విక్రంపురం వద్ద ఎర్ర చెరువు గట్టుపై ఏర్పాటు చేసిన ‘నాభూమి నాదేశం’ స్మారక శిలా ఫలకాన్ని కూల్చివేశారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగానికి గుర్తుగా.. భావి తరాలకు పుడమితల్లి విలువను తెలియజేసే విధంగా.. మాతృభూమి రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వీరులకు గుర్తుగా ప్రతి పంచాయతీలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో వీటిని నిర్మించారు. దీనిలో భాగంగా టెక్కలి మండలం బొప్పాయిపురం పంచాయతీ విక్రంపుర వద్ద స్మారక శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు దానిని కూల్చివేసి ఒక వైపు కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని.. మరో వైపు స్వాతంత్య్ర సమరయోధులు, వీరుల త్యాగాన్ని నేలమట్టం చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి కంచిలి: బూరగాంలో జాతీయ రహదారి పక్కన ఇటీవల మతిస్థిమితం లేని వ్యక్తి ఫిట్స్వచ్చి పడి ఉండగా శ్రీకాకుళం రిమ్స్లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 17న మృతిచెందాడు. మృతుడి వయసు సుమారు 45 ఏళ్లు ఉండవచ్చని, గోధుమ రంగు టీ షర్టు, నలుపు ప్యాంట్ ధరించి ఉన్నాడని, వివరాలు తెలిస్తే కంచిలి పోలీస్స్టేషన్లో సమాచారం అందించాలని పోలీసులు కోరారు. -
బస్సు ఆపలేదని నిరసన
పోలాకి : బస్సు ఆపడం లేదంటూ బెలమర జంక్షన్ సమీపంలో జీడిపప్పు ఫ్యాక్టరీ వద్ద మహిళలు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ప్రతిరోజూ సాయంత్రం 5.30 సమయంలో గుప్పెడుపేట–నరసన్నపేట ఆర్టీసీ బస్సు ఫ్యాక్టరీ వద్ద ఆగడంతో మహిళా కార్మికులు ఎక్కేవారు. ఉచిత బస్సు పథకం వచ్చిన తర్వాత డ్రైవర్ బస్సు ఆపడంలేదు. ఇదేంటని మహిళలు ప్రశ్నిస్తే అక్కడ స్టాప్లేదని, ముందున్న స్టాప్ దగ్గరకు రావాలని దురుసుగా సమాధానం చెప్పడంతో మహిళలు ఆగ్రహించి బస్సును రోడ్డుమీదే ఆపేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రంజిత్ డ్రైవర్, మహిళలతో మాట్లాడారు. రిక్వెస్ట్ స్టాప్గా పరిగణించాలని సూచించడంతో వివాదం సద్దుమణిగింది. దాదాపు 20 మంది మహిళలు నిత్యం బస్సుకోసం వేచి ఉన్నచోట కాదని, ఇంకోచోట స్టాప్ ఉందని తప్పించుకుంటే ఊరుకునేది లేదని మహిళలు స్పష్టం చేశారు. టికెట్ తీసుకున్నపుడు ఉన్న స్టాప్, ఉచితం అన్నప్పుడు ఎందుకుండదని నిలదీయటం గమనార్హం. వృద్ధుడు ఆత్మహత్య రణస్థలం: లావేరు మండలం బెజ్జిపురం గ్రామానికి చెందిన గురజాపు అప్పలనాయుడు (69) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అప్పలనాయుడు ఈ నెల 10న సాయంత్రం మద్యం సేవించి కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. భార్య మందలించడంతో మనస్థాపం చెంది పురుగుల మందు తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించాడు. కుమారుడు దుర్గారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లావేరు హెచ్సీ ఎం.విజయానంద్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పాములు వద్దు.. పాఠశాల ముద్దు
● పాములు పట్టేందుకు వెళుతున్న పిల్లల్ని గమనించిన ఎంఈఓ, హెచ్ఎం ● తల్లిదండ్రులను ఒప్పించి బడిలో చేర్పించిన వైనం కంచిలి : ఇటీవల కంచిలి మండలం చొట్రాయిపురం పాఠశాలకు సందర్శనకు వచ్చిన ఎంఈఓ ఎస్.శివరాంప్రసాద్కు.. పాములు పట్టేందుకు వెళుతున్న రాఘవ అనే బడిఈడు పిల్లాడు కనిపించాడు. వెంటనే ప్రధానోపాధ్యాయుడు మడ్డు తిరుపతిరావుతో కలిసి బాలుడి తల్లిదండ్రులు గురించి వాకబు చేశారు. అక్కడ సమీపంలో కొండపై నివసిస్తూ పాములు పట్టుకొని జీవనోపాధి సాగిస్తున్న దంపతులు చెరుకూరి రమేష్, లక్ష్మీల వద్దకు వెళ్లారు. వారి పిల్లలు రాఘవ, దీప్తిలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించమని చెప్పి ఒప్పించారు. దీంతో వారు తమ ఇద్దరు పిల్లలను శనివారం పాఠశాలకు తీసుకొచ్చారు. అబ్బాయి రాఘవను ప్రాథమిక పాఠశాలలో, బాలిక దీప్తిని అంగన్వాడీ కేంద్రంలో చేర్పించారు. కార్యక్రమంలో సీఆర్పీ యారడి దీనబంధు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
భారీగా మందుగుండు నిల్వలు సీజ్
కంచిలి: మండలంలో అనుమతి పొందిన నాలుగు మందుగుండు దుకాణాల్లో అధిక మొత్తంలో టపాసులు నిల్వలు ఉన్నాయనే కారణంతో పోలీసులు ఆ సరుకును సీజ్ చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటనలో వివరాలు తెలియజేశారు. కంచిలిలో బలియాపుట్టుగ వద్ద తెల్లి వైకుంఠరావుకు చెందిన రూ.2,69,470ల సరుకు, అంపురం వద్ద సుంకర మణికంఠకు చెందిన రూ.1,71,900ల సరుకు, జాడుపూడిలో దూపాన సునీల్కు చెందిన రూ. 1,16,497లు విలువ కలిగిన సరకు, అదే గ్రామంలో దూపాన శ్రీనివాసరెడ్డికి చెందిన రూ.1,15,300 లు విలువ గల సరకును సీజ్ చేసినట్లు వెల్లడించారు. సారవకోట: మండలంలోని కొమ్ముసరియాపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి టాస్క్ఫోర్స్ సిబ్బంది రూ.50 వేలు విలువ కలిగిన బాణసంచా స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన పైల సుశీల, లుకలాపు తిరుపతిరావు బాణసంచాతో పాటు బాణసంచా తయారు చేయడానికి కావాల్సిన ముడి సరుకులు కలిగి ఉండడంతో టాస్క్ఫోర్స్ సిబ్బంది వారి ఇళ్లపై దాడిచేసి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బాణసంచాను సారవకోట పోలీసుస్టేషన్కు అప్పగించారు. దీంట్లో పైల సుశీల వద్ద నుంచి రూ.30 వేలు విలువ కలిగిన బాణసంచా, లుకలాపు తిరుపతిరావు నుంచి రూ.20 వేలు విలువ కలిగిన బాణసంచా స్వాధీనం చేసుకుని ఇరువురిపై కేసు నమోదు చేశారు. -
పరేషన్..!
జలుమూరు: అక్టోబర్ నెలకు సంబంధించి నిత్యావసర సరుకుల దుకాణాల ద్వారా పంపిణీ చేసే బియ్యం తక్కువగా రావడంతో రేషన్ బియ్యం అందక వందల సంఖ్యలో లబ్ధిదారులు నష్టపోయారు. ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద ఉన్న వే బ్రిడ్జి పాడైపోవడంతో బియ్యం బ్యాగుల్లో నాలుగు కేజీల వరకూ తరుగుతో తూకం వేయడం వలనే ఈ సమస్య వచ్చిందని డీలర్లు చెబుతున్నారు. దీంతో రేషన్ కార్డుదారులకు ఇవ్వాల్సిన బియ్యం సరిపోలేదు. ఫలితంగా రేషన్ దుకాణాల్లో బియ్యం లేకపోవడంతో డీలర్లు లబ్ధిదారులను తిప్పి పంపారు. మండలవ్యాప్తంగా 53 రేషన్ డిపోలకు 18,583 రేషన్ కార్డులు ఉన్నాయి. దీనికి సంబంధించి 450 టన్నుల బియ్యం రావడంతో వాటిని ఆయా డీలర్లకు పంపించడం జరిగిందని ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జి కోటేశ్వరరావు తెలిపారు. ఇంతవరకూ బాగున్నా ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద వే బ్రిడ్జి పాడైపోవడంతో బస్తాల్లో రెండు నుంచి నాలుగు కేజీల వరకూ తరుగు వస్తోందని దీనివల్ల అర్హులైన లబ్ధిదారులు నష్టపోతున్నారని సీఎస్డీటీ షరీప్ చెబుతున్నారు. వీటితోపాటు కొత్త రేషన్ కార్డుదారులకు బియ్యం ఇవ్వాలని నిబంధన ఉన్నా.. వాటికి సంబంధించిన అలాట్మెంట్ పౌర సరఫరా అధికారులు ఇవ్వకపోవడంతో బియ్యం సరిపోలేదని డీలర్లు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈనెల బియ్యం 955 కార్డుదారులకు ఇంకా అందలేదు. దీనిపై సీఎస్డీటీ షరీఫ్ మాట్లాడుతూ ఎవరెవరికి బియ్యం అందలేదో ఆయా డీలర్ల ద్వారా అడిగి వారికి బియ్యం అందేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. నాకు ఈనెల బియ్యం ఇంకా ఇవ్వలేదు. అలాగే ఇంటికి వచ్చి వేలిముద్రలు తీసుకుంటామన్నారు. డీలర్లను అడితే పక్క గ్రామం వెళ్లమన్నారు. ఇదెక్కడ న్యాయం. నేను 75 ఏళ్ల ముసలిదానిని. నేను కిలోమీటర్ల దూరం ఎలా వెళ్లగలను. అధికారులు స్పందించి నా బియ్యం నాకు ఇప్పించాలి. – మెట్ట చిన్నమ్మి, వృద్ధురాలు, గంగాధరపేట రేషన్ పంపిణీలో వృద్ధులకు అవస్థలు తప్పడం లేదు. జగన్ ప్రభుత్వంలో వలంటీర్లతో ఇంటికి తెచ్చి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ప్రతినెలా ఇబ్బంది అవుతోంది. ఈనెల ఏకంగా బియ్యమే లేవంటున్నారు. మా పరిస్థితి ఏంటి. – మామిడి మల్లమ్మ, వృద్ధురాలు, గంగాధరపేట -
మధ్యాహ్న భోజనం అపహాస్యం
కొత్తూరు: మండలంలోని కర్లెమ్మ పంచాయతీ మహాసింగిగూడ ఆర్ఆర్ కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం అపహ స్యం చేసేవిధంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏకోపా ధ్యాయ పాఠశాలలో 18 మంది విద్యార్థులు చదువుతున్నారు. 18 మంది పిల్లలకు పాఠశాల అవరణలో వంట చేయడం లేదు. ఇంటి వద్ద వంట చేసి పాఠశాలకు వంట ఏజెన్సీ సభ్యురాలికి బదులు ఆమె భర్త ప్రతిరోజూ తీసుకొచ్చి విద్యార్థులకు వడ్డన చేస్తుంటారు. శనివారం మధ్యాహ్నం భోజనా న్ని పాఠశాలలో కేవలం నలుగు విద్యార్థులు మాత్ర మే చేశారు. అయితే నలుగు విద్యార్థులకు కేవలం అన్నం, కూర పెట్టారు తప్ప, చారు మాత్రము తీసుకు రాలేదు. చారులేక పోవడంతో విద్యార్థులు భోజనం చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. మిగిలిన 14 మంది విద్యార్థులు గ్రామంలో జరిగిన అన్నదా న కార్యక్రమానికి హాజరైనట్లు పాఠశాల ఉపాధ్యాయుడు తెలిపారు. పాఠశాల వద్ద గదులు సక్రమంగా లేకపోవడం వలన ఇంటి వద్ద వంట చేయిస్తున్నట్లు చెప్పారు. -
అనుమతులెలా ఇచ్చారు..?
టెక్కలి: జనావాసాలు, విద్యా సంస్థలు ఉన్న ప్రాంతాల్లో బాణసంచా విక్రయాలకు ఎలా అనుమతులిచ్చారని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ టెక్కలి అగ్నిమాపక అధికారి సూర్యారావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్కలిలో ప్రత్యేక పారిశుద్ధ్య పనుల పరిశీలన కోసం విచ్చేసిన ఆయన ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఎదురుగా ఏర్పాటు చేసిన బాణసంచా విక్రయ దుకాణాలను చూసి అసహనం వ్యక్తం చేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఎటువంటి పరిశీలన, స్థానిక అభ్యంతరాలు చూడకుండా కేవలం పత్రాలు చూసి అనుమతులు ఇచ్చారా అని నిలదీశారు. తక్షణమే అభ్యంతరకంగా ఉన్న దుకాణాన్ని మార్పు చేయాలని ఆదేశించారు. ఆయనతో పాటు టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, తహసీల్దార్ బి.సత్యం, డీఎల్పీవో ఐ.వి.రమణ తదితరులు పాల్గొన్నారు. -
అమోనియా కంటైనర్ బోల్తా
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలంలోని జర్జంగి గ్రామ సమీప జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఒక భారీ కంటైనర్ బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఒడిశా నుంచి శ్రీకాకుళం వైపు అమోనియా లోడ్తో వెళ్తున్న భారీ కంటైనర్ జర్జంగి గ్రామ సమీపంలోకి రాగానే అదుపు తప్పి డివైర్ను ఢీకొని బోల్తాపడింది. సమాచారం అందుకున్న కోటబొమ్మాళి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు జరుగకుండా చర్యలు తీసుకున్నారు. అరసవల్లి: రాష్ట్రంలో మన జిల్లాను స్వచ్ఛంగా మార్చుకుందామని కేంద్రమంత్రి కె.రామ్మోహన్నాయుడు పిలుపునిచ్చారు. మూడో శనివారం పురస్కరించుకొని వాయు కాలుష్య నివారణ థీమ్తో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని అరసవల్లి ఇంద్ర పుష్కరిణి వెనుక భాగంలో కాజీపేట కూడలి వద్ద చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యకర సమాజాన్ని రూపొందించవచ్చన్నారు. అనంతరం కార్పొరేషన్ అధికారుల ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎమ్మెల్యే గొండు శంకరరావు, కార్పొరేషన్ కమిషనర్ ప్రసాదరావు, అరసవల్లి ఆలయ ఈవో కేఎన్వీడీవీ ప్రసాద్, జిల్లా పర్యాటక శాఖాధికారి ఎన్.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ఆమదాలవలస: ఇటీవల కొన్ని పత్రికలు, ఛానళ్లలో వచ్చిన వార్త కథనాలు పూర్తి అవాస్తవమని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. తనకు ఎటువంటి గ్యాంగ్లు లేవని, తన బలం ప్రజలేనని తెలిపారు. తప్పుడు ప్రచారాలను ప్రజలు ఎవరు నమ్మవద్దని కోరారు. కొంతమంది వ్యక్తులు బాధితులను ఉసుగొల్పి తప్పుడు ఆరోపణలు చేయించారన్నారు. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులకు తన సాను భూతి తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుపై పోలీసు అధికారులు సమగ్ర విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. వార్తలు ప్రచురించే ముందు ధ్రువీకరించుకోవాలని మీడియా ప్రతినిధులకు సూచించారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
ఇచ్ఛాపురం రూరల్: భార్యతో కలిసి విహార యాత్రకు వెళ్తున్న యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో స్వగ్రామం లొద్దపుట్టిలో విషాదచాయలు అలముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని లొద్దపుట్టి గ్రామం అంబుగాం వీధికి చెందిన పిట్ట మోహనరావు, కుమారీల కుమారుడు పిట్ట వసంత్(32) కాకినాడలో చార్టర్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం తండ్రి మోహనరావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ భారాన్ని మోస్తున్న వసంత్, ఈ ఏడాది మార్చి 7న ఇచ్ఛాపురం బెల్లుపడకు చెందిన సంధ్య ఉరఫ్ ఇందును వివాహం చేసుకున్నాడు. శనివారం అరకు విహార యాత్ర కోసం తన ద్విచక్ర వాహనంపై భార్య సంధ్యను తీసుకొని వెళ్తుండగా, ప్రత్తిపాడు మండలంలోని ధర్మవరం గ్రామ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంజరిగింది. ఈ ప్రమాదంలో వసంత్ అక్కడికక్కడే మృతి చెందగా, భార్య తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలై చికిత్స పొందుతోంది. జాతీయ రహదారిపై ధర్మవరం గ్రామ సమీపంలో రొయ్యల మేత తీసుకెళ్తున్న వ్యాన్ మరమ్మతులకు గురికావడంతో నిలిపివేశారు. ఆగి ఉన్న వ్యాన్ను వసంతకుమార్ బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. నవ దంపతులను మృత్యువు విడగొట్టిందని బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు. -
దీపావళిజాగ్రత్తలతోనే ఆనంద కేళీ..!
●ఏమరుపాటుగా ఉంటే ప్రమాదాలు ●21 ఏళ్ల క్రితం జిల్లాలో భారీ విషాదం ●జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణుల సూచనలుశ్రీకాకుళం క్రైమ్: దీపావళి అంటే పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఆనందంగా జరుపుకునే పండగ. ప్రతి ఒక్కరూ టపాసులు కాల్చుతూ.. మిఠాయిలు పంచుకుంటూ కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. అయితే దీపావళి ఆనందంగా జరుపుకోవాలంటే జాగ్రత్తలు పాటించాలి. ఏమాత్రం నిర్లక్ష్యం, అలసత్వం వహించినా ఆస్తి, ప్రాణ నష్టం జరిగి విషాదం మిగులుతుంది. అలాంటి చీకటి రోజును జిల్లా 21 ఏళ్ల క్రితం చూసింది. 2004వ సంవత్సరం నవంబర్ 4వ తేదీన జిల్లా కేంద్రంలో చిన బజారులోని ఒక నివాస గృహం గ్రౌండ్ ఫ్లోర్లో అక్రమ పేలుడు పదార్థాల నిల్వలు పేలడంతో ఘటనా స్థలంలో 8 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మృత్యువాత పడ్డారు. ఆనాటి ఘటన తలచుకుంటే ఇప్పటికీ జిల్లా ప్రజలకు ఒళ్లు గగుర్పొడుస్తుంది. పేలుళ్లు జరిగిన మరుసటి రోజు జరిగిన ప్రాంతమంతా క్లీన్ చేశారు. ఆ మరుసటి రోజు నిల్వల డంప్ అంతా (కాలిపోయినవే అని) డే అండ్ నైట్ సమీప నాగావళి నది వద్ద పారబోసేందుకు వ్యాన్లో వెళ్లారు. ప్రమాదవశాత్తు అక్కడ కూడా ఆ చెత్తలో కొన్ని పేలుడు పదార్థాలు పేలడంతో అక్కడికక్కడే డ్రైవర్, క్లీనర్, మరో హెల్పర్ మృత్యువాత పడ్డారు. నువ్వలరేవులో సైతం.. వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవులో దాదాపు 25 ఏళ్ల క్రితం శ్రీరామనవమి ఉత్సవాల్లో బాణాసంచా పేల్చేందుకు కొందరు అక్రమంగా భారీ ఎత్తున పేలుడు పదార్థాలు నిల్వలు ఉంచారు. ప్రమాదవశాత్తు అవి కూడా పేలడంతో అప్పట్లో అధిక సంఖ్యలో మృత్యువాత పడినా.. నలుగురైదుగురే చనిపోయినట్లు రికార్డులకెక్కించారు. మృతదేహాలను సమీప ఇసుక దిబ్బల్లో పాతివేసినట్లు ఇప్పటికీ ఆ ప్రాంతంలో ప్రచారం జరుగుతూనే ఉంటుంది. ఈ ఘటనకు సంబంధించి అప్పటి ఎస్ఐ కృష్ణ సస్పెండయ్యారు. నాణ్యమైన కంపెనీలు తయారు చేసిన బాణసంచాను వినియోగించాలి. వేగంగా కాలే స్వభావం ఉన్నవి ఇళ్లల్లో నిల్వ ఉంచరాదు. కిరోసిన్, గ్యాస్ నిల్వ చేసే గదుల్లో, వంట గదుల్లో బాణసంచా ఉంచరాదు. చిన్నపిల్లలను దూరంగా ఉంచాలి. కాల్చేటప్పుడు పొడుగాటి కర్రకు కాకర్లు, వగైరా కట్టి కాల్చాలి. చేతిలో గానీ, దగ్గరలో గానీ బాంబులు కాల్చకూడదు. సగం కాలిన మందుగుండుని నిర్లక్ష్యం చేయరాదు. బాణసంచా కాల్చేటప్పుడు సమీపంలో నీళ్లు, ఇసుక ఉంచుకోవాలి. బిగుతుగా ఉండే దుస్తులు ధరించాలి. రోగులు, వృద్ధులు, పసిపిల్లలు, గర్భిణులు దూరంగా ఉండాలి. రాకెట్లు, ఫైర్ క్రాకర్లు వంటి క్షిపణులను టిన్ బాటిళ్లలో పెట్టి వెలిగించకూడదు. గుడిసెలు, గడ్డివాములు, పెట్రోల్ బంకులకు దూరంగా రాకెట్లను, పటాకులు కాల్చాలి. అగ్నిప్రమాదం సంభవిస్తే తక్షణమే దగ్గరలో ఉన్న అగ్నిమాపక కేంద్రం లేదా 101కి ఫోన్ ద్వారా సమాచారమివ్వాలి. తాత్కాలిక షాపులకు లైసెన్సులను ఆయా పరిధి ఆర్డీవోనే అందజేస్తారు. పోలీస్, ఫైర్, రెవెన్యూ, పంచాయతీ (లేదా) వార్డు అన్ని అనుమతులు అందులోనే ఉంటాయి. క్వాలిటీ అయినవి, నిబంధనలకు అనుగుణంగా ఉన్నవి కాల్చి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. – జడ్డు మోహనరావు, జిల్లా అగ్నిమాపక అధికారి అక్రమంగా మందుగుండు సామాగ్రి తయారు చేసినా, నిల్వలు కలిగి ఉన్నా, అమ్మినా కఠిన చర్యలు తప్పవు. లైసెన్సులు లేకుండా మందుగుండు అమ్మితే కేసులు నమోదు చేస్తాం. ఇప్పటికే దాడులు చేస్తున్నాం. ఎవరైనా లైసెన్సులు లేకుండా అమ్మినా నేరుగా ప్రజలు సమాచారమివ్వవచ్చు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు వహించి ప్రజలు దీపావళి జరుపుకోవాలి. – కేవీ మహేశ్వరరెడ్డి, ఎస్పీ, శ్రీకాకుళం -
మోసం చంద్రబాబు నైజం
జలుమూరు: ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా మోసం చేయడమే చంద్రబాబు నైజమని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ధ్వజమెత్తారు. మండలంలోని కరవంజ – టెక్కలిపాడు క్లస్టర్ సమావేశంలో శనివారం మాట్లాడారు. పేదలకు వైద్యం దూరం చేయడమే చంద్రబాబు ధ్యేయమన్నారు. అందుకు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నాడన్నారు. దీనికి వ్యతిరేకంగా కోటి సంతకాలు కార్యక్రమం తలపెట్టామని తెలియజేశారు. అన్నమయ్య జిల్లాలోని మునకల చెరువుతో పాటు నరసన్నపేట నియోజకవర్గంలో బుడితి వద్ద అవలింగి గ్రామంలో మినీ పరిశ్రమ పెట్టి టీడీపీ నాయకులు మద్యం కల్తీ చేస్తున్నారని మండిపడ్డారు. నరసన్నపేటలో ఎమ్మెల్యే రమణమూర్తిదే సిండికేట్ అని, వారి కుటుంబ సభ్యుల పేరిట మద్యం షాపులు ఉన్నాయని వివరించారు. అవలింగిలో కల్తీ జరిగిన మద్యం పట్టుకున్న అధికారులు ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో వివరించాలన్నారు. రాష్ట్రంలో 62 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, రైతు పండించిన పంటలకు మద్దతు ధర లేదని మండిపడ్డారు. అనంతరం డిజిటల్ బుక్ పోస్టర్ ఆవిష్కరించి, కోటి సంతకాల సేకరణ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ వాన గోపి, జిల్లా కార్యదర్శి ఎం.శ్యామలరావు, సర్పంచ్ జుత్తు నేతాజీ, గొల్లంగి జగన్నాథరావు, జిల్లా బూత్ లెవెల్ అధ్యక్షుడు దామ మన్మథరావు, రకావాడ చందనబాబు, ధర్మాన జగన్, ధర్మాన బువాజీ, తర్ర జీవరత్నం, కె.కూర్మారావు, బండి ఎర్రన్న, బలగ లక్ష్మీ, అర్జున్, ఎస్వీ రమణ తదితరులు పాల్గొన్నారు. -
పంచారామాలకు ప్రత్యేక బస్సులు
శ్రీకాకుళం అర్బన్: కార్తీక మాసం సందర్భంగా ప్రసిద్ధ శైవ క్షేత్రాలైన పంచారామాలను దర్శించుకునేందుకు వీలుగా ఆర్టీసీ సంస్థ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులను ప్రయాణికులు, భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ జిల్లా ప్రజారవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణ పిలుపునిచ్చా రు. శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో కార్తీకమాసంలో శైవ క్షేత్రాలకు నడుపు ప్రత్యేక బస్సులకు సంబంధించిన కరపత్రాలను శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక మాసంలో పంచారామాలను దర్శించుకునేందుకు వీలుగా ఈ నెల 26వ తేదీన, అక్టోబరు 2వ తేదీన, అక్టోబరు 9వ తేదీన అక్టోబరు 16వ తేదీల్లో జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి పంచారామాలకు బయల్దేరుతాయని పేర్కొన్నారు. ప్రయాణికులకు ఒక్కొక్కరికి ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సునకు రూ.2,400గాను, అల్ట్రా డీలక్స్ బస్సునకు రూ.2,350గా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయాణీకులు, భక్తులందరూ ఉపయోగించుకోవాలని కోరారు. -
టపాసుల విక్రయాలకు అనుమతులు తప్పనిసరి
శ్రీకాకుళం పాతబస్టాండ్: దీపావళి టపాసుల విక్రయాలు జరిపేందుకు అనుమతులు తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లతో కలసి సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షాపుల వద్ద అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 11 అర్జీల స్వీకరణ శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన స్వాభిమాన్ దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్పుండ్కర్తో పాటు జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ వినతులు స్వీకరించారు. 11 శుక్రవారాల్లో 169 అర్జీలు వచ్చాయన్నారు. ప్రతి నెలా జాబ్మేళాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ట్రై సైకిల్స్, బ్యాటరీ ట్రై సైకిల్స్ మరమ్మతులకు గురైతే వాటి మరమ్మతులకు జిల్లా పరిషత్లో ఒక రూం కేటాయించి అక్కడే మరమ్మతులు చేపడతారని చెప్పారు. ఈ వారం స్వాభిమాన్కు 11 అర్జీలు అందాయి. అర్జీల స్వీకరణలో జెడ్పీ సీఈఓ సత్యనారాయణ పాల్గొన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లకు పోలీసులు బలికావద్దు
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పలాస: రాజకీయ ఒత్తిళ్లకు పోలీసులు బలి కావద్దని, శాంతిని కోరుకునే జిల్లాలో హింసను ప్రోత్సహించవద్దని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు కోరారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును శుక్రవారం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. కల్తీ మద్యం నిరసనకు సంబంధించి జరుగుతున్న వ్యవహారంపై ఆరా తీశారు. పోలీసులు వైఎస్సార్ సీపీ శ్రేణులను రెచ్చగొడుతున్నారని, ఇది సరికాదన్నారు. ప్రభు త్వం ఇలాంటి చర్యలకు పాల్పడడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, త్వరలో గుణపాఠం చెబుతారని అన్నారు. అప్పలరాజును పరామర్శించిన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు, మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్, ఇచ్ఛాపురం మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి, స్థానిక వైఎస్సార్ సీపీ నేతలు తదితరులు ఉన్నారు. -
చెరువులో ఆక్రమణలు కూల్చివేత
పొందూరు: లోలుగు గ్రామంలో చెరువు గర్భంలో ఆక్రమణలను రెవెన్యూ అధికారులు శుక్రవారం కూల్చివేశారు. ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లోలుగు గ్రామంలోని 111 సర్వే నంబర్లో 5.44 ఎకరాల్లో కూర్మగుండం చెరువు ఉంది. అందులో సుమారు 25 సెంట్లలో 17 మంది షెడ్డ నిర్మాణంతో పాటు కొంతభాగం ఇళ్ల నిర్మాణం చేపట్టారు. చెరువు గర్భం ఆక్రమణపై కొందరు గ్రామస్తులు పొందూరు తహసీల్దార్ కార్యాలయంతో పాటు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో ఆరు నెలలు క్రితం పొందూరు రెవెన్యూ అధికారులు, సర్వే అధికారులు సర్వే నిర్వహించారు. ఇందులో 17 మంది 25 సెంట్ల స్థలం ఆక్రమించినట్లు గుర్తించారు. ఆక్రమణలు తొలగించాలని రెండు నెలల క్రితం పొందూరు తహసీల్దార్ ఆర్.వెంకటేష్ నోటీసులు జారీ చేశారు. దీనిపై స్పందన లేకపోవడంతో శుక్రవారం పోలీసుల సమక్షంలో ఆక్రమణలను తొలగించారు. ఈ సమయంలో బాధితులు మాట్లాడుతూ తాము ఈ స్థలాలను 15 ఏళ్ల క్రితం కొనుగోలు చేశామని, వాటిని ఎలా తొలగిస్తారంటూ అధికారులను నిలదీశారు. సంబందిత స్థలాన్ని కొనుగోలు చేసి షెడ్డును నిర్మించుకుని పిండిమిల్లు పెట్టుకుని జీవనం సాగిస్తున్నామని అధికారులకు పిసిని శ్యామలరావు తెలిపారు. ఇదే షెడ్డును తొలగించాలని తమకు ఇబ్బంది పెడుతూ, దౌర్జన్యం చేస్తున్నారని, కలెక్టర్ గ్రీవెన్సులో సైతం ఫిర్యాదు చేశానని చెప్పారు. తొలగింపుల్లో వివక్షత చూపుతున్నారంటూ బాధితులు వాదించారు. చెరువు గర్భాలలో చాలా అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, వాటిని తొలగించారా అని నిలదీశారు. ఈ సమయంలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. తమ విధులకు అడ్డుపడితే చర్యలు తప్పవని తహశీల్దార్ వెంకటేష్, సీఐ సత్యనారాయణలు ఆక్రమణదారులను హెచ్చరించారు. ఎస్సై వి.సత్యనారాయణ, జి.బాలరాజు, సర్వేయర్ గణపతి, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. -
దాతలే దిక్కు..!
అరసవల్లి: ఆరేళ్ల క్రితం జరిగిన బస్సు ప్రమాదం ఆ ఇంటి యజమాని కాళ్లను చచ్చుబడేలా చేసి మంచానికే పరిమితం చేసింది. అలాంటి స్థితిలో ఉన్న భర్త, పిల్లల బాగోగులు చూసుకుంటూ కుట్టుమిషనే ఆధారంగా జీవనం కొనసాగిస్తున్న ఆ ఇల్లాలికి విధి మరో సమస్యను తెచ్చిపెట్టింది. దీంతో దాతల సాయం కోసం ఆమె ఎదురుచూస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. అరసవల్లి ఆదిత్యనగర్ కాలనీలో పేద కుటుంబానికి చెందిన కళ్లేపల్లి రమేష్, సుజాత దంపతులు. రమేష్ ఓ ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్గా పనిచేసేవారు. ఆరేళ్ల క్రితం ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడటంతో రెండు కాళ్లకు ఆపరేషన్ చేశారు. సుమారు రూ.15 లక్షల వరకు వైద్యానికి ఖర్చు అయినప్పటికీ నడవలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యారు. ఇక ఇంటర్ చదువుతున్న కుమారుడు లీలా సాయికృష్ణకు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ స్థాయి అధికమవ్వడంతో రక్తవాంతులతో బాధపడుతున్నాడు. ఈ కుర్రాడికి బ్రాన్కోసిస్ సమస్య ఉండటంతో బ్రాన్కోస్రోప్ పరీక్షలు చేయించాల్సి ఉంది. ఈ పరీక్షలకు విశాఖపట్నం ఆసుపత్రిలో సుమారు రూ.లక్ష వరకు అవుతుందని.. అంతటి ఆర్ధిక స్థోమత తమకు లేదని వాపోతున్నారు. భార్య కళ్లేపల్లి సుజాత ఎంతో కష్టపడి లేడీస్ టైలరింగ్ నేర్పిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఇంతటి దీన పరిస్థితిలో ఉన్న తమను దాతలెవరైనా ఆదుకుని (ఫోన్పే నంబర్ 9381442744) కాపాడాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. అరసవల్లిలో దయనీయ స్థితిలో పేద కుటుంబం మంచానికే పరిమితమైన తండ్రి ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న కుమారుడు వైద్యఖర్చులకు సాయం కోసం ఎదురుచూపులు రమేష్కు సదరం సర్టిఫికెట్ ద్వారా 66 శాతం అంగవైకల్యం ఉన్నట్లు వైద్యులు ధృవీకరించినప్పటికీ.. ప్రభుత్వం మాత్రం ఇంతవరకు పింఛన్ మంజూరు చేయలేదు. రెండు కాళ్లకు ఆపరేషన్ జరిగి మంచానికే పరిమితమైనప్పటికీ సర్కార్ పెద్దలు దృష్టి సారించడం లేదు. నెలనెలా పింఛన్ వస్తేకుటుంబానికి కొంత భరోసా దక్కుతుందని, ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి పింఛన్ మంజూరు చేయాలని రమేష్ కోరుతున్నారు. -
తప్పులతడకగా రీ సర్వే
● నరసన్నపేటలో తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు నరసన్నపేట: భూ సమస్యలను పరిష్కరించేందుకు గత ప్రభుత్వం చేపట్టిన రీ సర్వేను కూటమి ప్రభుత్వం సక్రమంగా నిర్వహించడం లేదని, ఇప్పుడు కూడా భూములపై తమకు హక్కులు కల్పించరా.. అంటూ చెన్నాపురం, నడగాంకు చెందిన రైతులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నరసన్నపేట తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి లోపల బైఠాయించారు. ఎన్నో ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న రీ సర్వేలో కూడా హక్కులు కల్పించకపోతే ఎలా అని అధికారులను నిలదీశారు. వెబ్ల్యాండ్ ప్రకారం, అడంగల్ ప్రకారమే మళ్లీ పేర్లు వస్తున్నాయని, ఒకరి పొలం మరొకరి పేరున వస్తుందని.. అసలు పొలమే లేని వారిపేరున ఎకరాలు చూపుతున్నారని ఆందోళన చెందారు. భూములు అమ్ముకున్న వారి పేరిటే మళ్లీ భూమి హక్కులు కనిపిస్తున్నాయని, ఇష్టానుసారంగా రైతుల పేర్లు మార్చేశారని రైతులు కె.రమణమూర్తి, గొనపు బాబూరావు, సనపల సూరిబాబు, దుప్పట్ల రాజశేఖర్, ధర్మారావు, రమణ, బాబ్జీ, కొంక్యాన నర్శింహమూర్తి, చిట్టిబాబు తదితరులు వాపోయారు. రికార్డులు సక్రమంగా తీర్చిదిద్దాలని, మళ్లీ రీ సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు. కాగా, నిబంధనల మేరకే రీ సర్వేలో భూహక్కులు కల్పిస్తున్నామని, మీరు అనుకున్న విధంగా హక్కులు కల్పించమంటే తమవల్ల కాదని తహసీల్దార్ సత్యనారాయణ, సూపరింటెండెంట్ పి.శ్రీనివాసరావులు చెప్పడంతో రైతులు వాగ్వాదానికి దిగారు. గ్రామానికి వస్తామని, తప్పులుంటే నిబంధనల మేరకు సరిచేస్తామని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో రైతులు వెనుదిరిగారు. -
వసతిగృహాల పనులు వేగవంతం చేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో అత్యవసరంగా చేయాల్సిన పనులు వేగవంతం చేయాలని, నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ విద్య, సంక్షేమ, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, కార్పొరేషన్ ద్వారా జరుగుతున్న పనుల ప్రగతిపై శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని తొమ్మిది గురుకులాలకు అత్యవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, నిర్మాణాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దుప్పలవలస (మైదానం పాత నిర్మాణాలు, రోడ్లు), శ్రీకాకుళం పెదపాడు (దోమతెరలు, డ్రైనేజీ, లీకేజీలు), ఆమదాలవలస (కొల్లివలస డార్మిటరీ, ప్రహరీ, శానిటేషన్, విద్యుత్), తామరపల్లి (ఆధునీకరణ, నీటి సరఫరా) హాస్టళ్లలో ఉన్న సమస్యలు, వాటి పరిష్కారానికి అవసరమైన నిధులపై చర్చించారు. కొల్లివలసలో మోడ్రన్ కిచెన్ కోసం రూ.15 లక్షలు, పలాసలో మరమ్మతులకు రూ.10 లక్షలు అవసరమని అధికారులు తెలియజేశారు. నందిగాం హాస్టల్లో రూ.1.79 కోట్లతో జరుగుతున్న డైనింగ్ కం కిచెన్ హాల్, తరగతి గదుల నిర్మాణాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని గడువు విధించారు. మరుగుదొడ్ల నిర్మాణం కోసం స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ నుంచి నిధులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొన్ని హాస్టల్స్లో పారిశుధ్యం, మంచినీటి సౌకర్యం సరిగా లేదని ఫిర్యాదులు రావడంతో, ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించి, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని ఆదేశించారు. ఈ విషయంలో జాప్యం, నాణ్యతలో రాజీ అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. సమావేశంలో ఈఈ బి.రామకృష్ణ, డీఈఈ బి.శ్రీరాములు, జిల్లా కో ఆర్డినేటర్ వై.యశోద లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
షిర్డీసాయిబాబా మందిరంలో చోరీ
పాతపట్నం: పాతపట్నం ఆల్ఆంధ్ర రోడ్డు సమీపంలోని షిర్డీగిరిపై షీర్డీ సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి చోరీ జరిగింది. ఎస్ఐ కె.మధుసూదనరావు తెలిపిన వివరాల ప్రకారం.. పాతపట్నం షిర్డీసాయి బాబా మందిరం వెనుక పక్క ఉన్న వెంటిలేటర్ రంధ్రం ద్వారా దొంగలు లోపలికి వెళ్లి 500 గ్రాముల వెండి పల్లెం, పెట్టెలో రూ.23,150 నగదు, హుండీ కానుకలను చోరీ చేశారు. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు భక్తులు వచ్చి చూసేసరికి చోరీ జరిగిందని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్ టీం వచ్చి మందిరం, హుండీని పరిశీలించారు. సీసీ కెమెరాల వైర్లు తెంచినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
సెమినార్ విజేతలకు ప్రశంసాపత్రాలు
శ్రీకాకుళం: నగరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన జిల్లా స్థాయి సైన్స్ సెమినార్లో విజేతలకు డీఈఓ రవిబాబు ప్రశంసాపత్రాలను అందజేశారు. క్వాంటం ఏజ్ బిగిన్స్ పొటెన్షియల్స్ అండ్ చాంలెంజర్స్ అనే అంశంపై జిల్లాస్థాయి సెమినార్ నిర్వహించారు. ఇందులో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి 30 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మోడల్ స్కూల్ విద్యార్థి పి.అభిషేక్ కుమార్ రెడ్డి, హయాతినగరం ఎంజేపీబీఎస్ పాఠశాల విద్యార్థి పి.హేమలత ద్వితీయ స్థానాన్ని సాధించారు. వీరు ఈ నెల 18న విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారు. వీరిని డీఈఓతో పాటు ఉప విద్యాశాఖ అధికారి ఆర్.విజయ్కుమారి, సైన్స్ ఆఫీసర్ ఎం.కుమారస్వామి, ప్రధానోపాధ్యాయులు పి.సతీష్కుమార్, సూర్యప్రకాష్ తదితరులు అభినందించారు. -
కొర్ని కుర్రాడి ‘పవర్’
● పవర్ లిఫ్టింగ్ పోటీల్లో రాణిస్తున్నరాజశేఖరరావు ● జాతీయ స్థాయి పోటీల్లో పతకాల కై వసం గార : సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన కుర్రాడు జాతీయ స్థాయిలో ‘పవర్’ చూపిస్తున్నాడు. ఓవైపు ఉద్యోగ సాధనలో నిమగ్నమవుతూనే.. మరోవైపు ఎక్కడ పోటీలు జరిగినా పతకం రావాల్సిందే అన్నట్లుగా ప్రతిభ కనబరుస్తున్నాడు. గార మండలం కొర్ని గ్రామానికి చెందిన చమల్ల రాజశేఖరరావు జిల్లాలో విద్యాభ్యాసం పూర్తి చేసి ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలలో భాగంగా రాజమండ్రిలో కోచింగ్ తీసుకుంటున్నాడు. ఓవైపు చదువుతూనే, మరోవైపు వ్యాయామం పట్ల ఆసక్తి ఉండటంతో అక్కడే భారతీయ వ్యాయామ కళాశాలకు వెళ్లి రెండు పూటలా వ్యాయామం చేసేవాడు. అక్కడ వివిధ రకాలైన కోచ్ల పరిచయంతో క్రీడాపోటీలకు కూడా శిక్షణ తీసుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగాలకు స్పోర్ట్సు కోటా కూడా ఉండటంతో ఆసక్తి మరింతగా పెరిగింది. రెండు సంవత్సరాలుగా పలు పోటీల్లో పాల్గొన్న రాజశేఖర్ జాతీయ స్థాయి పోటీల్లో మెరిసాడు. ఇటీవల బెంగళూరులో జరిగిన నేషనల్ పవర్లిఫ్టింగ్ చాంపియన్షిప్–2015 పోటీల్లో ఫుల్పవర్ లిఫ్టింగ్, ఫుష్పుల్, బెంచ్ప్రెస్ మూడు విభాగాల్లో స్వర్ణ పతాకాలు సాధించాడు. గతంలోనూ జంషెడ్పూర్లో ఇండియన్ పవర్లిప్టింగ్ ఫెడరేషన్ నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించాడు. తూర్పుగోదావరి జిల్లా స్థాయి పోటీలు, రాష్ట్ర చాంపియన్షిప్ పోటీల్లో మూడు సార్లు పాల్గొని ప్రథమ స్థానం సాధించాడు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం.. చంద్రశేఖర్ పదో తరగతి వరకు కొర్ని హైస్కూల్, ఇంటర్మీడియెట్ గురజాడ, డిగ్రీ ఆదిత్య కళాశాలలో చదివాడు. మావయ్యలు మళ్ల యేగీశ్వరరావు, మళ్ల లక్ష్మీనారాయణల ప్రోత్సాహం, అన్నయ్య చమల్ల కృష్ణారావు, సుమలత ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తూ సూచనలు చంద్రశేఖర్కు ఉపయోగపడ్డాయి. గ్రామీణ ప్రాంతం నుంచి జాతీయ స్థాయి పోటీల్లో రాణించడంపై గ్రామస్తులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఫుల్ పవర్లిఫ్టింగ్ రాణించడమే లక్ష్యం. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మరువలేనిది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యమైనా, జాతీయ స్థాయి పోటీలతో పాటు అంతర్జాతీయ పోటీల్లో కూడా రాణించాలన్న కోరిక ఉంది. అసోషియేషన్లు సహకారం అందించాలి. – చమల్ల రాజశేఖరరావు, కొర్ని, గార మండలం -
యూకే స్కాలర్షిప్కు అనూష ఎంపిక
పాతపట్నం: బూరగాం గ్రామానికి చెందిన పోలాకి అనూష యునైటెడ్ కింగ్డమ్లోని చెస్టర్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ హెల్త్ సర్వీసెస్ మేనేజ్మెంట్లో చదివేందుకు వైస్ చాన్స్లర్ స్కాలర్షిప్కు ఎంపికై ంది. దీనిలో భాగంగా మొదటి ఏడాది 6,500 పౌండ్లు (రూ.7,67 లక్షలు), రెండో ఏడాదికి ప్లెస్మెంట్ పొందింది. ఐఈఎల్టీఎస్ పరీక్షలో మంచి స్కోర్ సాధించింది. అనూష తండ్రి పోలాకి గణపతి రైతు, తల్లి పోలాకి వరలక్ష్మి గృహిణి. అనూష జెమ్స్లో బీఎస్సీ నర్సింగ్, నాగార్జున యూనివర్సిటీలో డిప్లమా ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చదివింది. అర్జీల పరిష్కారానికి సత్వర చర్యలు పలాస: ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా అర్జీలు పరిష్కారానికి పోలీసు అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి చెప్పారు. కాశీబుగ్గ పోలీసుస్టేషన్లో శుక్రవారం ప్రజాగ్రీవెన్స్ నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని కాశీబుగ్గ, టెక్కలి సబ్ డివిజన్ పరిధిలోని ప్రజల కోసం ప్రత్యేకంగా ఈ గ్రీవెన్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. పౌర సంబంధాలు, కుటుంబ, ఆస్తి గొడవలు, మోసపూరితమైనవి ఇతరత్రా అంశాలపై పలు ఫిర్యాదులు వచ్చాయని, వాటిని పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించామని తెలిపారు. 300 గ్రాముల వెండి చోరీ శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని చినబొందిలీపురం సమీపంలో బాయన్నతోటలో నివాసముంటున్న రిటైర్డ్ డైట్ లెక్చరర్ ఇంట్లో 300 గ్రాముల వెండి చోరీకి గురైంది. రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 8న సంపతి పురుషోత్తం తన పెద్ద బావమరిది ఇంట్లో జరిగే శుభకార్యానికి భార్యతో కలిసి విశాఖపట్నం వెళ్లారు. కుమార్తె, కుమారులు పుణేలో జాబ్ చేస్తున్నారు. శుక్రవారం ఉదయం వీరి నివాసగృహం మేడ మీద అద్దెకుంటున్న వ్యక్తి కిందకొచ్చి చూడగా తలుపుల తాళాలు పగలగొట్టడాన్ని గమనించి పురుషోత్తంకు ఫోన్లో సమాచారమందించారు. ఇంటికి చేరిన పురుషోత్తం బీరువా అరలో వెండి పోవడాన్ని గమనించాడు. లోపలి లాకర్లలో బంగారు వస్తువులు, నగదు భద్రంగానే ఉన్నాయి. కాగా ఈ చోరీ గురువారం అర్ధరాత్రి 1:30 నుంచి 4:20 గంటల మధ్య జరిగినట్లు సమీప సీసీ ఫుటేజీలో దృశ్యాలు కనిపించాయని స్థానికులు అనుకుంటున్నారు. పక్కనే మరో రెండు గృహాల్లోనూ చోరీకి యత్నించి విఫలమైనట్లు తెలుస్తోంది. సీఐ ఈశ్వరరావు, హెచ్సీ శివాజీ, క్లూస్టీమ్ ఘటనా స్థలికి చేరి పరిసరాలను పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నగరపాలక సంస్థలో విజిలెన్స్ తనిఖీలు శ్రీకాకుళం : శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు రెండు రోజుల పాటు తనిఖీలు చేపట్టారు. గుంటూరు నుంచి వచ్చిన ప్రత్యేక బృందం గురువారం నగరపాలక సంస్థ కార్యాలయంలో పలు ఫైళ్లను తనిఖీ చేసిన అధికారులు, శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా చేపట్టిన వేస్ట్ మేనేజ్మెంట్కు సంబంధించి రికార్డులు, కొనుగోలు చేసిన సామగ్రి బిల్లులను పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి తనిఖీలు జరుగుతున్నాయని, అందులో భాగంగానే శ్రీకాకుళం నగరపాలక సంస్థలో కూడా తనిఖీలు జరుగుతున్నాయని నగరపాలక సంస్థ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ పనుల్లో కొన్ని అవకతవకలు జరిగాయని, రాష్ట్రస్థాయికి ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో దీనికి సంబంధించి కూడా పరిశీలన చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కొనుగోలు జరిగినప్పుడు పని చేసిన ఇంజినీరింగ్ అధికారులను, గుమస్తాలను రప్పించి వారి నుంచి వివరాలు సేకరించినట్లు సమాచారం. వివరాలు వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. -
ట్యాంకర్ షిప్లో పనిచేసేందుకు వెళ్తూ..
గార: ట్యాంకర్షిప్లో విధుల్లో చేరేందుకు వెళ్తూ బోటు బోల్తా పడిన ఘటనలో గార మండలం కె.మత్స్యలేశం గ్రామానికి చెందిన మైలపిల్లి తారకేశ్వరరావు గల్లంతయ్యాడు. ఈ మేరకు షిప్పింగ్ సంస్థ కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చింది. స్కార్పియో షిప్పింగ్ సంస్థ, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. సంస్థలో ట్యాంకర్షిప్లో బూసన్ (సూపర్వైజర్)గా పనిచేస్తున్న తారకేశ్వరరావు ఈ నెల 12న స్వగ్రామం నుంచి బయలుదేరాడు. గురువారం మోజాంబికా సముద్రతీరంలో ఉన్న ట్యాంకర్ షిప్లో డ్యూటీ ఎక్కేందుకు గానూ 12 మంది బృందంతో కలసి లాంచ్ బోటులో ప్రయాణం చేస్తుండగా బోల్తాపడింది. ఈ ఘటనలో ఐదుగురు సురక్షితంగా కాగా, ఇద్దరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. గల్లంతైన ఐదుగురిలో తారకేశ్వరరావు ఒకరు. దీంతో భార్య లక్ష్మీకాంతమ్మ, ఇద్దరు కుమారులు, కుటుంబసభ్యుల్లో విషాదఛాయలు అలముకున్నాయి. మత్స్యకార సామగ్రి దగ్ధం రణస్థలం: కొవ్వాడ గ్రామంలో బడె మహందాతకు చెందిన కమ్మల షెడ్ శుక్రవారం తెల్లవారుజామున అగ్నికి ఆహుతైంది. తహసీల్దార్ సనపల కిరణ్ కుమార్, బాధితుడు మహందాతకు తెలిపిన వివరాల ప్రకారం.. కొవ్వాడ తీరంలోని సముద్రం ఒడ్డున తాటి, కొబ్బరి కమ్మలతో షెడ్ ఉంది. అందులో మత్స్యకారులకు చెందిన 12 పెద్ద వలలు, మర బోటు, ఇంజన్ బోటు, తాళ్లు ఉన్నాయి. ఈ షెడ్కు విద్యుత్ సరఫరా లేదు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు గ్రామస్తులు చూసేసరికి కమ్మల షెడ్ కాలిపోయి కనిపించింది. గుర్తు తెలియని వ్యక్తులు షెడ్ కాల్చి వేసి ఉంటారని బాధితుడు అనుమానిస్తున్నాడు. సుమారు రూ.25 లక్షలు వరకు నష్టం చేకూరిందని, ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. ఘటనా స్థలాన్ని ఎఫ్డీవో గంగాధర్, జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి పరిశీలించారు. -
వైఎస్సార్ సీపీలో పలువురి చేరిక
కవిటి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుచేయడం మరెవ్వరికీ సాధ్యం కావని కొత్తగా పార్టీలో చేరిన పలువురు కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. శుక్రవారం కవిటి మండలం కొత్తపుట్టుగలో ఎమ్మెల్సీ నర్తు రామారావు నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో టీడీపీ నుంచి పలువురు కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. శావసానపుట్టుగకు చెందిన వీరికి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజల్లో ఉన్న ఆదరణ, తమకున్న నమ్మకానికి భరోసా పెరిగి వైఎస్సార్సీపీలో చేరినట్టు వారు తెలిపారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ వైఎస్సార్సీపీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల కార్యదర్శులు సాడి శ్యాంప్రసాద్రెడ్డి, నర్తు నరేంద్రయాదవ్, పిలక రాజలక్ష్మి, ఉలాల భారతీదివ్య, కడియాల ప్రకాష్, ఇప్పిలి కృష్ణారావు, పూడి నేతాజీ, నర్తు ప్రేమ్కుమార్, నర్తు శివాజీ, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. -
ఒడిశా ఉత్తరప్రదేశ్
● 208.7 కిలోల గంజాయితో పట్టుబడిన ఉత్తరప్రదేశ్ వాసులు ● రూట్ మార్చి తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు ● గంజాయి తరలిస్తున్న కారు అద్దాలపై ఢిల్లీ హైకోర్టు అడ్వకేట్ ట్యాగ్స్ వయా శ్రీకాకుళం శ్రీకాకుళం క్రైమ్ : ఉత్తరప్రదేశ్లో ఉన్న ఓనరు ఆదేశిస్తాడు.. వీరు పాటిస్తారు. ఎవరి దగ్గరకు వెళ్లాలి.. ఎక్కడ గంజాయి కొనాలి.. ఎలా తిరిగి రావాలి.. చెక్పోస్టులు ఉంటే ఎలా తప్పించుకోవాలి.. ఇలా అన్ని ప్లాన్లు ఓనరే వేస్తాడు. అతను చెప్పింది చెప్పినట్లు వీరు పాటిస్తారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా వీరు ఖాకీల నుంచి తప్పించుకోలేకపోయారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్, మీరట్లకు చెందిన సునీల్ (38), విశాల్ (28)లు ఒడిశాలోని కొరా పుట్ నుంచి టొయోటో కారులో 208.7 కిలోల గంజాయిని చెక్పోస్టులు తప్పించి.. రూట్ మార్చి మళ్లించే యత్నంలో చిలకపాలెం వద్ద ఎచ్చెర్ల పోలీ సులకు పట్టుబడ్డారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఎప్పటి నుంచో.. మీరట్లోని డౌట్లో స్పై హోటల్ నడుపుతున్న గౌర వ్ వద్ద సునీల్, విశాల్లు కొంతకాలంగా పనిచేస్తున్నారు. ఎప్పటి నుంచో వీరు గంజాయి క్రయవిక్రయాల్లో సిద్ధహస్తులు. ఈ క్రమంలో ఒడిశాలోని కొరాపుట్ జిల్లా దంతపురి సమీప లంపటాఫుట్ గ్రామానికి చెందిన సమర మాటం అలియాస్ డొంబురు వద్ద ఈనెల 14న 40 ప్యాకెట్లలో 208.7 కిలోల గంజాయిని తీసుకున్నారు. శ్రీకాకుళం చెక్పోస్టులను తప్పించి దారి మళ్లించి విశాఖ చేరేందుకు వీరు టొ యాటో కారులో కొరాపుట్ నుంచి బయల్దేరారు. కారుపై ఢిల్లీ హైకోర్టు అడ్వకేట్ స్టిక్కర్లు వీరు ప్రయాణిస్తున్న కారుపై ఢిల్లీ హైకోర్టు బార్ కౌన్సిల్, జాతీయ చిహ్నం గుర్తుతో అడ్వకేట్ 2019, అడ్వకేట్ 2021 స్టిక్కర్లు ఉండటంతో అనుమానం వచ్చి లోపల తనిఖీ చేయగా 40 ప్యాకెట్లలో గంజా యి పట్టుబడింది. వీరు చిలకపాలెం నుంచి విశాఖ చేరి అక్కడి నుంచి విజయవాడ, ఖమ్మం, వరంగల్ మీదుగా నాగపూర్ హైవేకు చేరి అక్కడి నుంచి మీర ట్ వెళ్లి తమ ఓనరుకు అప్పగిస్తామని విచారణలో పేర్కొన్నారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు. ప్రస్తుతం గంజాయిని వీరికి అందించిన ఒడిశా సమరమాటం, అతనికి సహకరించిన మరో వ్యక్తి పరారీలో ఉన్నారని, మీర ట్ ఓనర్ అయిన గౌరవ్ వద్దకు పోలీసులను పంపించామని, వీరేకాక మరో ముగ్గురిని నిందితులుగా గుర్తించామని ఎస్పీ పేర్కొన్నారు. చాకచక్యంగా కేసును ఛేదించిన పోలీసులను అభినందించారు. రూట్ మార్చారిలా.. ఒడిశా కొరాపుట్ నుంచి చత్తీస్గఢ్ రాష్ట్ర బోర్డర్ ఆనుకొని ఉన్న సిమిలిగుండ మీదుగా పొత్తంగి వద్ద అడ్డుదోవ తీసుకుని సమీపంలోని ఒడిశా సుంకి చెక్పోస్టును తప్పించారు. అక్కడి నుంచి సాలూరు, రామభద్రాపురం, రాజాం, పొందూరులు దాటి చిలకపాలెం జంక్షన్ వద్దకు వచ్చి పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. అప్పటికే ఎచ్చెర్ల ఎస్ఐ కు ఈగల్టీమ్ సమాచారం ఉండటంతో కారును తనిఖీ చేశారు. -
దివ్యాంగుల ఫిర్యాదుల పరిష్కారానికి ‘స్వాభిమాన్’ నేడు
శ్రీకాకుళం పాతబస్టాండ్: దివ్యాంగుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రతి నెల మూడో శుక్రవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తున్నారు. ఈ నెల ప్రత్యేక కార్యక్రమం ‘స్వాభిమాన్’ శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరగనుంది. డైస్ సెంటర్ ఆకస్మిక తనిఖీ శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని మెంటల్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్ సెంటర్ (డైస్)ను గురువారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదరి కె.హరిబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. 0–6 ఏళ్ల లోపు అంగవైకల్య ప్రమాదం ఉన్న పిల్లలకు సమగ్రమైన సమగ్ర సేవలను అందించాలని సూచనలు ఇచ్చారు. వైకల్యాన్ని ముందుగానే గుర్తిస్తే వ్యాధి నయం చేసే వీలుంటుందని పేర్కొన్నారు. తలసేమియా వంటి వ్యాధులను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి మెరుగైన సేవలు అందించాలని సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో భాగంగా డాక్టర్ ఎన్ చైతన్య, మేనేజర్ అప్పలనాయుడు, ఇతర వైద్య నిపుణులు ఉన్నారు. ‘మహిళా హోంగార్డుపై అనుచితంగా ప్రవర్తించినందుకే’ శ్రీకాకుళం క్రైమ్ : కాశీబుగ్గ కేంద్రంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు కల్తీ మద్యంపై ఇటీవల జరిపిన నిరసన ఘటనకు సంబంధించి ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి గురువారం విలేకరులతో మా ట్లాడారు. అనుమతి లేని ర్యాలీలు, ధర్నాలకు గుంపులుగా రావడమే కాక విధుల్లో ఉన్న ఓ మహిళా హోంగార్డుపై అనుచిత ప్రవర్తనకు వేణు గోపాలరెడ్డిపై వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టినట్లు తెలిపారు. ప్రోత్సహించిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కూడా కేసులు పెట్టామన్నారు. ఇటీవల జిల్లాకేంద్రంలో జరిగిన నకిలీ స్టాంపుల వ్యవహారంపై విలేకరులు ఎస్పీ వద్ద ప్రస్తావించగా.. కేసుకు సంబంధించి ఫేక్ రబ్బరు స్టాంపుల తయారీదారులిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్కు తరలించా మని, పక్కా ఎవిడెన్సులతో కొన్ని నకిలీ డాక్యుమెంట్లను గుర్తించామన్నారు. ఇంకా విచారణ పూర్తి కాలేదని, ఎవరున్నా వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు. నవంబర్ 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మె శ్రీకాకుళం (పీఎన్కాలనీ): రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ నవంబర్ 3 నుంచి మున్సిపల్ కార్మికుల సమ్మె చేయనున్నట్లు ఏఐటీయూసీ కౌన్సిల్ సభ్యులు టి.తిరుపతిరావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కళ్యాణి.అప్పలరాజు తెలిపారు. ఈ మేర కు గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, మున్సిపల్ కార్మికులకు ఇల్లు, స్థలాలు కేటాయించి మున్సిపల్ కాలనీలు నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు జె.గురుమూర్తి, ఎన్. పార్థసారథి, ఆర్. గణేష్, పి.సురేష్, రామచంద్ర, రసూల్, తంగి.నారాయణరావు, పుష్ప ,సీతయ్య, ప్రతినిధి అరుగుల రమణ తదితరులు పాల్గొన్నారు. దళిత చట్టాలపై అవగాహన శ్రీకాకుళం పాతబస్టాండ్: దళితులు సమాజంలో గౌరవం పొందేందుకు, వారు ఆత్మాభిమానంతో మెలిగేందుకు ప్రభుత్వం, చట్టాలు రక్షణగా ఉంటాయని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఆర్.గడ్డెమ్మ తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ సమావేశ మందిరంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్సీ సంక్షేమ పథకాలపై గురువారం అవగాహన కార్యక్రమం జరిగింది. లీడ్ జిల్లా మేనేజర్ పేడాడ శ్రీనివాసరావు, యూనియన్ బ్యాంక్ మేనేజర్ లలిత కుమారిలు మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలో ఎస్సీలకు ప్రత్యేక రుణాలు, రాయితీలు ఉన్నాయని, వీటిని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పొందవచ్చని తెలిపారు. -
ఎచ్చెర్ల ఎంపీపీపై పీడీ యాక్ట్
● విజయవాడలో ఎచ్చెర్ల ఎంపీపీ ఎం.చిరంజీవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ● ఖాకీల తీరును ఖండించిన ఎంపీపీ వర్గీయులు ● ఫరీద్పేటపై నిఘా పెట్టాం: ఎస్పీ మహేశ్వర రెడ్డి శ్రీకాకుళం క్రైమ్, ఎచ్చెర్ల : ఎచ్చెర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవిని మంగళవారం రాత్రి జిల్లా పోలీ సులు విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. పీడీ యాక్ట్ కింద అరెస్టు చేస్తున్నట్లు చెప్పి విశాఖ కారాగారానికి తరలించారు. దీంతో ఎంపీపీ వర్గీయులు, ఫరీద్పేట గ్రామస్తులు పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు. గ్రామంలో హత్యలు జరిగాయని, లెక్కకు మించి కేసుల్లో నిందితులుగా ఉన్న వారిని వదిలేసి ఒక్క ఎంపీపీ చిరంజీవి పైనే పీడీ యాక్టు పెట్టడం సరికాదని అన్నారు. అయితే శాంతిభద్రతలకు ఆటంకం కలిగించే వారు కావ డం వల్లనే ఎంపీపీపై పీడీ యాక్టు నమోదు చేసినట్లు ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి చెబుతున్నారు. ఇది అన్యాయం ఎంపీపీ చిరంజీవిని పీడీ యాక్ట్పై పోలీసులు అరెస్టు చేయడం అన్యాయం. టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఫరీద్పేటలో ఇద్దరు వైఎస్సార్ సీపీ కార్యకర్తలను చంపేశారు. మళ్లీ ఇప్పుడు అదే వర్గానికి చెందిన ఎంపీపీ చిరంజీవిని ఊరి నుంచి తరిమేందుకే చూస్తున్నారు. ఇది న్యాయమా..? – మొదలవలస సతీష్, ఫరీద్పేట చంపిన వారిని అరెస్టే చేయలేదు వైఎస్సార్ సీపీకి చెందిన కూన ప్రసాద్ని గత ఏడాది చంపేశారు. అందులో ఇద్దరు ముద్దాయిలను ఇప్పటివరకు అరెస్టు చేయలేదు. నాలుగు నెలల కిందట మరో వైఎస్సార్ సీపీ కార్యకర్త గోపిని చంపేశారు. అదే కేసులో బెయిల్పై వచ్చి న ముద్దాయిలు రోజూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మా నాయకుడు చిరంజీవిని ఇలా ఇరికించడం అన్యాయం. – మొదలవలస ఫాల్గుణ, ఫరీద్పేట రాజకీయం చేస్తున్నారు.. వైఎస్సార్ సీపీ వాళ్లని చంపేసి.. తిరిగి అదే వర్గానికి చెందిన మా నాయకుడిని అన్యాయంగా పోలీసులు అరెస్టు చేశారు. చంపిన వారిని విడిచిపెట్టి ఎంపీపీని అక్రమ అరెస్టు చేశారు. ఒక వైపే ఇలా చేస్తూ రాజకీయం చేస్తున్నారు. న్యాయపరంగా ఎదుర్కొంటాం. – కూన కిరణ్, ఫరీద్పేట అన్ని గ్రామాలపై దృష్టి పెట్టాం ఎచ్చెర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవిపై 14 కేసులు ఉన్నాయి. ఫరీద్పేటలో గడిచిన రెండు హత్యాఘటనల నాటి నుంచి నిఘా పెట్టాం. 33 మందిని గుర్తించాం. ఒక్క ఫరీద్పేటలోనే కాదు జిల్లాలో ప్రతి చోటా శాంతి భద్రతలకు, ప్రజాశాంతికి భంగం కలిగించేలా వ్యవహరించేవారి లి స్టు మా వద్ద ఉంది. అలాంటి వారిపై ఒక్కొక్కరి గా రౌడీ షీట్లు, సస్పెక్టు షీట్లు, ఆపై పీడీయాక్టులు పెడుతున్నాం. నిఘాలో ఎంపీపీ శాంతిభద్రతలను విఘాతపరిచే వ్యక్తిగా నిర్ధారణ కావ డంతో కలెక్టర్కు నివేదిక పంపి ఆయన ఉత్తర్వులతోనే పీడీ యాక్టు పెట్టాం.– మహేశ్వర రెడ్డి, ఎస్పీ -
ప్రమాద స్థలం పరిశీలన
నరసన్నపేట: మేజరు పంచాయతీ నరసన్నపేటలోని భవానీ పురంలో బుధవారం రాత్రి సంభవించిన ప్రమాదంపై టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు ఆరా తీశారు. ప్రమాద సంఘటన స్థలాన్ని గురువారం పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి ప్ర మాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఈ ప్రమాదం దురదృష్టకరమని, ఇందులో ఏడుగురు గాయపడ్డారని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన అగనంపూడి రాధ, ఆమె కుమార్తె సోనియాలు విశాఖలో చికిత్స పొందుతున్నారు. రాధ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు అంటున్నారు. అలా గే బండి బాలకృష్ణ, బండి పూర్ణ, పన్నీరు చిరంజీవిలు శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బండి సంతు, అమృతలు నరసన్నపేటలో చికిత్స పొందుతున్నారు. ఒకే కుటుంబంలో ఉన్న ముగ్గురు వ్యక్తులకు ఈ ప్రమాదంలో గాయాలు కావడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. -
శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ పరిశీలన
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్లో 20 ఏళ్లుగా వరద నీటి సమస్య ఉంద ని జనసేన నేత, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు అన్నారు. శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ను ఆయన గురువారం పరిశీలించారు. అధికారులతో మాట్లాడి సమస్య తెలుసుకున్నారు. ఇంటిగ్రేటెడ్ బస్టాండ్ అవసరం ఉందని తెలిపారు. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ పర్యటనకు వచ్చిన నాగబాబు వెంట జనసేన పార్టీకి సంబంధించిన శ్రీకాకుళం సమన్వయకర్త కోరాడ సర్వేశ్వరరావు, పాతపట్నం సమన్వయకర్త గేదెల చైతన్య వర్గాల మధ్య పోరు కనిపించింది. ఆర్టీసీ అధికారులతో నాగబాబు మాట్లాడుతుండగా చైతన్య లోపలకు వెళ్లారు. సర్వేశ్వరరావు కూడా వెళ్లేందుకు ప్రయత్నించగా గేదెల చైతన్య వర్గం అడ్డుకుంది. దీంతో కొంతసేపు ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా నాన్స్టాప్ కౌంటర్ వద్ద నాయకులు కార్లు ఉంచడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. -
అధికారుల తనిఖీలు.. బెంబేలెత్తిన వ్యాపారులు
సారవకోట: మండల కేంద్రంలో గురువారం విశాఖపట్నం నుంచి ఫుడ్ కంట్రోలర్ ఎస్.ఈశ్వరి, జిల్లాకు చెందిన ఫుడ్ ఇన్స్పెక్టర్ లక్ష్మి కిరాణా దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. దీంతో వ్యాపారులంతా బెంబేలెత్తారు. రోడ్డు పక్కనే ఉన్న దుకాణాల్లో తనిఖీలు చేస్తున్నారని తెలిసి అందరూ దుకాణాలు మూసివేశారు. తాము పరిశీలించిన దుకాణాల్లో తేదీల లేపా లు లేవని వారు తెలిపారు. వ్యాపారాలు చేసుకునే వారు స్వలాభం తగ్గించుకుని ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు. ఎక్కువ కాలం నిల్వ ఉన్న వస్తువులు అమ్మితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. -
సేన.. జగడాలేనా
అరసవల్లి: జనసేన పార్టీలో కుమ్ములాటలు తప్పడం లే దు. పార్టీ బలపడేందుకు ఓ వైపు మంత్రి నాదెండ్ల మనోహర్, మరోవైపు ఎమ్మెల్సీ, ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యుడు కొణిదెల నాగబాబు వరుసగా జిల్లాలో పర్యటిస్తున్నా పార్టీ శ్రేణుల్లో మాత్రం సంతృప్తి కనిపించడం లేదు. పైగా వీరు ఉంటున్న వేదికల్లోనే వర్గ విబేధాలు, కుమ్ములాటలు కనిపిస్తున్నాయి. ఇటీవల మంత్రి మనోహర్ జిల్లా పర్యటనలో కార్యకర్తల సమావేశంలో కొందరు నియోజకవర్గ ఇన్చార్జిలను అగౌరవ పరిచారని స్థానిక కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. తాజాగా ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనలో కూడా శ్రీకాకుళం నియోజకవర్గ ఇన్చార్జి సర్వేశ్వరరావుకు తెలియకుండానే పాతపట్నం నేతలు అన్నీ తామై కార్యక్రమాలను జిల్లా కేంద్రంలో నిర్వహిస్తుండడం వివాదాన్ని సృష్టించింది. శ్రీకాకుళం నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యేగా పోటీ చేసిన కోరాడ సర్వేశ్వరరావుకు వ్యతిరేకంగా పాతపట్నం నియోజకవర్గం నుంచి గేదెల చైతన్య వర్గం పట్టు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుందనే వాదన ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనలో తేటతెల్లమైంది. ఈ రెండు వర్గాలు దాదాపుగా బాహాబాహీ దిశగా తోపులాటలకు దిగారు. ఎమ్మెల్సీ నాగబాబు ఆర్టీసీ కాంప్లెక్స్ పరిశీలన అనే కార్యక్రమం వేదికగా వర్గాల పోరు బయటపడింది. సుడా చైర్పర్సన్గా ఉన్న జనసేన నేత కొరికాన రవికుమార్ అండదండలతోనే సొంత నియోజకవర్గానికి చెందిన పాతపట్నం నేత గేదెల చైతన్య దూసుకుపోతున్నారని స్థానికంగా చర్చనీయాంశమైంది. అలాగే మరోవైపు ఆమదాలవలస నియోజకవర్గ ఇన్చార్జి, సీనియర్ నేత పేడాడ రామ్మోహనరావును కూడా ప్రధాన వేదికలపై పిలవకుండా ఓ వర్గం కుట్ర పన్నుతుందనే వాదనను ఆ నియోజకవర్గ క్యాడర్ తెరపైకి తెస్తోంది. ఇక జిల్లాకు జనసేన అగ్రనేతలొస్తే స్వాగతం నుంచి సాగనింపు వరకు ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్చార్జి విశ్వక్సేన్ అంతా తానై వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం అధిష్టానం దృష్టిలో ఉంది. ఇచ్ఛాపురం నియోజకవర్గానికి చెందిన రాజు ఇటీవలే కుటుంబ వ్యవహారాల్లో పోలీసు కేసుల్లో ఇరుక్కున్న సంగతి విదితమే. మిగిలిన నియోజకవర్గాల్లో ఇన్చార్జిలైతే టీడీపీకి అనుబంధంగా వ్యాపారాల్లో భాగస్వామ్యులవుతూ ఉన్నారంటే ఉన్నారనేలా వ్యవహరిస్తున్నారు. ఇక పార్టీ జిల్లాకు అధ్యక్షుడిగా ఉన్న చంద్రమోహన్ పనితీరుపై జిల్లా వ్యాప్తంగా అసంతృప్తి ఉందన్న సంగతి విదితమే. కూటమి ప్రభుత్వంలో భాగంలో ఉన్నామనే ధీమాలో జనసేన నేతలు చాలా చోట్ల నామినేటెడ్ పోస్టులకు, మరికొందరు త్వరలో జరగనున్న ‘స్థానిక’ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. అయితే ఎవ్వరూ పదవులు అడగొద్దని, మనకు అంత అనుభవాలు లేవని, అర్హతలు లేవంటూ అగ్రనేతలు వ్యాఖ్యానించడం పార్టీ శ్రేణులను దిక్కుతోచని ఆలోచనలో పడేసింది. పార్టీ ఎమ్మెల్సీగా వరుసగా రెండు సార్లు జిల్లాలో పర్యటించిన నాగబాబు పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ అధినేత పవన్ కల్యాణ్ కోరిక మేరకు మరో 15 ఏళ్ల వరకు కూటమి ప్రభుత్వం ఉంటుందని, మనం కూడా ఇలాగే టీడీపీకి మద్దతివ్వాలని చెప్పడంపై కార్యకర్తలు మండిపడుతున్నారు. అలాగే కార్యకర్తలకు దిశానిర్దేశం చేయకపోగా కసుర్లు, విమర్శలు, ఆగ్రహాన్ని ప్రదర్శించడం కూడా కొందరికి మింగుడు పడలేదు. తాజాగా మంత్రి మనోహర్ కూడా జిల్లాలో కార్యకర్తలు, నేతలతో మాట్లాడుతూ అదే 15 ఏళ్ల జపం చేశారు. దీంతో జనసేన శ్రేణులు ఆలోచనలో పడ్డాయి. -
గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో సంస్కృతం సబ్జెక్టు లో బోధనకు గెస్ట్ ఫ్యాకల్టీ నియామకం కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.శ్రీరాములు తెలిపారు. సంస్కృతం సబ్జెక్టు లో పోస్ట్ గ్రాడ్యుయేషన్తోపాటు పీహెచ్డీ, నెట్/ఏపీ సెట్ అర్హతలు కలిగిన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందన్నారు. బోధన నైపుణ్యం, మౌఖిక పరీక్ష, ఉన్న త అర్హతల వెయిటేజీ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుందన్నారు. బయోడేటా, విద్యార్హతల తో కూడిన దరఖాస్తులను నేడు (17న) సాయంత్రంలోగా కళాశాలలో సమర్పించాలని, ఇంటర్వ్యూ శనివారం ఉదయం 10 గంటల కు కళాశాలలో జరుగుతుందని, అన్ని ఒరిజిన ల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని ప్రిన్సిపాల్ శ్రీరాములు కోరారు. పలాస: పలాస మండ లం బొడ్డపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని రాపాక ఝాన్సీ రాష్ట్ర స్థా యి స్కూలు గేమ్స్ పోటీలకు 14 ఏళ్ల విభాగంలో ఎంపికై ంది. అథ్లెటిక్స్లో లాంగ్జంప్, హైజంప్, 200 మీటర్ల పరుగుపందెంలో జిల్లా ఎంపిక లో మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఆమె రాష్ట్ర స్థాయిలో శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం గోవిందపురం జిల్లా పరిష త్ ఉన్నత పాఠశాలలో నవంబరు 8, 9, 10 తేదీల్లో జరుగునున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో ఝాన్సీ పాల్గొనున్నారని బొడ్డపాడు హైస్కూ లు పీడీ పద్మలోచన్ చెప్పారు. ఆమె రాష్ట్ర స్థా యికి ఎంపిక కావడంపై బొడ్డపాడు ఉపాద్యాయులు ఆమెను అభినందించారు. సారవకోట: మండలంలోని మహాశింగి పంచా యతీ కన్నయ్యగూడ గ్రామానికి రోడ్డు నిర్మించాలని ఆ గ్రామస్తులు ఎస్టీ కమిషన్కు కొన్ని రోజుల కిందట విన్నవించారు. ఎస్టీ కమిషన్ సూచనల మేరకు సర్వే విభాగం ఏడీ వెంకటరా వు, డీఐఓ జనార్ధనావులతో స్థానిక తహసీల్దార్ విజయలక్ష్మి మహాశింగి నుంచి కన్నయ్యగూడ కు రోడ్డు నిర్మాణం కోసం పరిశీలన చేశారు. 15 ఏళ్ల కిందట సీతంపేట పరిసర ప్రాంతాల నుంచి కొన్ని కుటుంబాలు వచ్చి ఇక్కడ పోడు వ్యవసాయం చేస్తూ బతుకుతున్నాయని, వీరు పంచాయతీ కేంద్రానికి రావాలంటే సరైన దారి లేదు. మండల, జిల్లాస్థాయి అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయింది. దీంతో ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం (పీఎన్కాలనీ): సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేకపోవడం దారుణమని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఎం నగర కన్వీనర్ ఆర్.ప్రకాశరావు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నగరంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లను సీపీఎం ప్రతినిధి బృందం గురువారం పరిశీలించింది. ఈ సందర్భంగా విద్యార్థులు అనేక సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు. జిల్లాలో ఎస్సీ హాస్టల్స్ 31, బీసీ హాస్టల్స్ 78, ఎస్టీ హాస్టల్స్ 60 ఉన్నాయని, వీటిల్లో కనీస వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించని వారు జిల్లాలో విమానాశ్రయాలు నిర్మిస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తక్కువ మెనూ చార్జీలతో అరకొర భోజన సదుపాయాలు అందుతున్నాయన్నారు. సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యలు జిల్లా మంత్రులకు పట్టవా అని ప్రశ్నించారు. వర్షం పడితే ఎస్సీ హాస్టల్ మొత్తం నీటితో నిండిపోతుందని, ఎస్సీ హాస్టల్ విద్యార్థులు ఎస్టీ హాస్టల్కి వెళ్లి తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఎస్టీ హాస్టల్లో గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్లో ఒక్కో హాల్ ఉన్నాయని, అందులోనే 200 మంది విద్యార్థులందరూ సామూహికంగా నిద్రించడం, భోజనం చేయడం, చదువుకోవడం చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం ప్రతినిధి బృందం నాయకులు ఎం.గోవర్ధనరావు, పి.సుధాకర్, కె.సూరయ్య, ఎల్.మహేష్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
‘విద్యా ప్రమాణాల పెంపునకు కృషి’
కంచిలి: గురుకుల విద్యాలయాల్లో విద్యా ప్రమాణా లు మునుపటి కంటే పెంచడానికి ఉపాధ్యాయులు, అధ్యాపకులు కృషి చేయాలని జిల్లా గురుకుల విద్యాసంస్థల సమన్వయకర్త వై.యశోదలక్ష్మి పేర్కొన్నారు. మండల కేంద్రం కంచిలిలో గల డాక్టర్ బీఆ ర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాన్ని ఆమె గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సంద ర్భంగా ఆమె పాఠశాల భవనాలను, డార్మిటరీ భవనా న్ని పరిశీలించారు. పిల్లలతో మాట్లాడి, వారి అవసరాలను తెలుసుకొన్నారు. అనంతరం గురుకులంలో సేవలందిస్తున్న అధ్యాపకులు, ఉపాధ్యాయు లు, ప్రిన్సిపాల్ పి.శ్రీనివాసరావుతోనూ మాట్లాడా రు. గురుకుల సమస్యలను కలెక్టర్కు నివేదిస్తానని తెలిపారు. భోజనశాలలో పనిచేస్తున్న సిబ్బందికి పలు సూచనలిచ్చారు. ఆమెకు గురుకుల ప్రిన్సిపా ల్ పి.శ్రీనివాసరావు సహకరించారు. -
‘మౌలిక వసతులు కల్పించాకే తరలిస్తాం’
సంతబొమ్మాళి: పోర్టు నిర్వాసిత కాలనీలో మౌలిక వసతులు కల్పించిన తర్వాతే మూలపేట గ్రామం ఖాళీ చేయించి మిమ్మల్ని తరలిస్తామని టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి అన్నారు. గురువారం పోర్టు నిర్వాసితులకు నౌపడలో కేటాయించిన ఆర్అండ్ ఆర్ కాలనీలో నిర్వహించిన లాటరీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 506 పీడీఎఫ్లకు గా ను ప్రతి పీడీఎఫ్కు 5 సెంట్లు ఇంటి స్థలం ప్రభు త్వం కేటాయించిందన్నారు. ఆ స్థలం ఎక్కడ, మీ స్థలం ఏదీ అని తెలుసుకోవడానికి మాత్రమే లాటరీ తీస్తున్నామని అన్నారు. లాటరీ ద్వారా తీసిన నంబ ర్ ప్రకారం మీకు ఐదు సెంట్లు స్థలం చూపించడానికి 15 రోజుల సమయం పడుతుందన్నారు. సుడా అనుమతి పొందిన తర్వాతే లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయిస్తున్నామని, ఇది మార్చే అధికారం తనకు గానీ తహసీల్దార్కు గానీ లేదన్నారు. 586 ప్లాట్లను ఆరు బ్లాక్లుగా విభజించి ఎర్త్ ఫిల్లింగ్ ఇతర పనులు చేపడుతున్నామని అన్నారు. ఐదుకోట్ల 50 లక్షల రూపాయిలతో మరో రెండు అడుగులు ఎత్తు చేయడానికి ఎర్త్ ఫిల్లింగ్ పనులు చేపడుతున్నామని తెలిపారు. మౌలిక వసతులన్నీ కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గుడి నిర్మాణానికి కూడా అన్ని చర్య లు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఆయనతో పాటు తహసీల్దార్ హేమసుందరరావు, స్థానిక సర్పంచ్ జీరు బాబురావు, మాజీ సర్పంచ్ జీరు భీమారావు, కోట నారం నాయుడు, జీరు శివ, రోహిణీరావ్, జీరు రాంబాబు తదితరులు ఉన్నారు. -
ముగిసిన జిల్లాస్థాయి స్కూల్ క్రికెట్ పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: పది రోజుల పాటు కన్నుల పండువలా సాగిన జిల్లాస్థాయి అంతర్ పాఠశాలల క్రికెట్ పోటీలు ముగిశాయి. శ్రీకాకుళం జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో జెడ్సీఎస్ స్కూల్గేమ్స్ హర కేశవ మెమోరియల్ జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ 2025 సీజన్–1 చాంపియన్ ట్రోఫీని ఏపీ మోడల్ స్కూల్ పురుషోత్తపురం కై వసం చేసుకుంది. రన్నరప్గా శ్రీకాకుళంలోని మహాలక్ష్మినగర్కాలనీలో ఉన్న శ్రీచైతన్య (బ్రాంచ్–1) నిలిచింది. శ్రీకాకుళం నగరంలోని కోడిరామ్మూర్తి స్టేడియం మైదానం వేదిక గా జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు పీవైఎన్ శాస్త్రి, కార్యదర్శి హసన్రాజా షేక్, మెంటార్ ఇలియాస్ మహ్మద్ పర్యవేక్షణలో ఈ నెల 8వ తేదీన ఈ పోటీ లు మొదలయ్యాయి. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీచైతన్య స్కూల్ 66 పరుగులు మాత్రమే చేయగా, ప్రతిగా బ్యాటింగ్ మొదలుపెట్టిన ఏపీఎంఎస్ పురుషోత్తపురం మూడు వికెట్లు కోల్పోయి విజ యం సాధించింది. ఫైనల్ మ్యాచ్లో రాణించిన శ్యామ్సుందర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపిక య్యాడు. అలాగే టోర్నీలో అత్యద్భుతమై ఆటతీరు తో రాణించినవారిలో బెస్ట్ బౌలర్గా హరికృష్ణ, బెస్ట్ బ్యాటర్గా సాత్విక్, బెస్ట్ ఫీల్డర్గా లిలిత్, మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా శ్రీరామ్ ప్రత్యేకంగా బహుమతులు అందుకున్నారు. విజేతలకు ట్రోఫీలు, బహుమతులను జిల్లా క్రికెట్ సంఘ అధ్యక్షుడు పీవైఎన్ శాస్త్రి, విద్యుత్ట్రాన్స్కో అధికారి రామకృష్ణ, ప్రసన్నకుమార్ బహూకరించారు. -
భూమి లాక్కుంటున్నారు..
ఆమదాలవలస: తన భూమిని లాక్కునేందుకు జనసేన పార్టీ ఎంపీటీసీ అంపిలి విక్రమ్ అనే వ్యక్తి నాలుగేళ్లుగా తనను వేధిస్తున్నారని ఆమదాలవలస పట్టణానికి చెందిన మహిళ చింతు విజయ ఆరోపించారు. ఆమె గురువారం ఆమదాలవలసలో విలేకరులతో మాట్లాడారు. తాను బూర్జ మండలం కొల్లివలస గ్రామంలో 20 సెంట్ల భూమిని కొనుగోలు చేశానని, అదే భూమిని చేజిక్కించుకోవాలని అంపిలి విక్రమ్, వాళ్ల బావ పాండ్రంకి తారక్లు నాలుగేళ్లుగా తనను, తన కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆమె చెప్పారు. సరుబుజ్జిలి తహసీల్దార్ రమణారా వు భూమి కొలతలకు వచ్చినప్పుడు కూడా వారిద్ద రూ పెట్రోలు పోసి సైట్ ఖాళీ చేయాలని బెదిరించా రని పేర్కొన్నారు. కారుతో వెంబడించడం, రాత్రిళ్లు ఇంటి వద్ద రాళ్లు వేయించడం వంటి పనులు చేశార ని ఆరోపించారు. తాను కోర్టును ఆశ్రయించగా, కోర్టు తనకు అనుకూలంగా ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చిందని, ఆ ఆర్డర్ను తహసీల్దార్ కార్యాలయానికి, పోలీస్ స్టేషన్కు సమర్పించానన్నారు. అయినా వేధింపులు ఆగడం లేదని చెప్పారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు. -
ఖాకీ మార్క్ కుట్రలు!
రెడ్బుక్ రాజ్యంలోపక్కచిత్రంలో నకిలీ మద్యంకు వ్యతిరేకంగా పలాస–కాశీబుగ్గలో వైఎస్సార్సీపీ శ్రేణులు, మహిళలు నిరసన ర్యాలీ చేస్తుండగా దూసుకొస్తున్న మహిళలను రోప్తో పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్త పైల వేణుగోపాల్రెడ్డిని పిలిచి, రోప్ పట్టుకోమని చెప్పి, ఎలా గట్టిగా పట్టుకోవాలో భుజం తట్టి కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ చెప్పారు. దానికి సంబంధించిన విజువల్స్ స్పష్టంగా ఉన్నాయి. పోలీసుల సూచనలు పాటించి, తోపులాట జరగకుండా నివారించిన వేణుగోపాల్రెడ్డిని అభినందించాల్సింది పోయి ఆయనపైనే అక్రమ కేసు పెట్టి, నిర్బంధించారు. మహిళా పోలీసు సిబ్బందిపై అనుచితంగా ప్రవర్తించారని కేసు పెట్టి, హైడ్రామాకు తెరలేపారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పలాసలో పోలీసులు హైడ్రామా నడిపారు. మహిళా హోంగార్డులతో వైఎస్సార్సీపీ కార్యకర్త పైల వేణుగోపాల్రెడ్డి అనుచితంగా ప్రవర్తించారని వాదన తెరపైకి తెచ్చిన పోలీసు అధికారులు నిన్నంతా ఒక మహిళా హోంగార్డుతో ఫిర్యాదు చేయించేందుకు తీవ్రంగా యత్నించారు. కానీ ఆమె ఎంతకీ ఒ ప్పుకోలేదు. రోజంతా ఒత్తిడి చేసినా ఫిర్యాదు చే సేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో అదే రోజు డ్యూ టీలో ఉన్న మరో మహిళా కానిస్టేబుల్ చేత ఫిర్యా దు చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. రెడ్బుక్ రాజ్యాంగంలో భాగమే.. పలాస నియోజకవర్గంలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై పథకం ప్రకారం కక్ష సా ధింపు చర్యలు చేపడుతున్నారు. అందుకు పోలీసు అధికారులు వత్తాసు పలుకుతున్నారు. పలాస ని యోజకవర్గంలో వైఎస్సార్సీపీ శ్రేణులపై వరుస పెట్టి కేసులు పెడుతున్నారు. ఏదో ఒక ఘటనలో ఇరికించి జైలుకు పంపించాలని చూస్తున్నారు. అందులో భాగంగా కుట్రలు పన్నుతున్నారు. తాజాగా కల్తీ మద్యంకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ర్యాలీ చేపట్టినందుకు న్యూసెన్స్ కింద 23 మందిపై కేసు పెట్టారు. ఆ తర్వాత ర్యాలీలో మహిళా పోలీసు సిబ్బందితో వైఎస్సార్సీపీ కార్యకర్త పైల వేణుగోపాల్రెడ్డి అనుచితంగా ప్రవర్తించారని, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రోద్బలంతో ఇదంతా చేశారని ఆయనపై కేసు పెట్టారు. మంగళవారం రాత్రి వేణుగోపాల్రెడ్డిని ఎందుకు అక్రమ అరెస్టు చేశారని డిమాండ్ చేసేందుకు పోలీసు స్టేషన్కు వచ్చి, బైఠాయించిన వారిపై కూడా కేసులు పెట్టారు. ఈ ఘటనలో 15 మందిపై కేసు పెట్టినట్టు సమాచారం. పలాసలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని ప్రజాస్వామ్యవాదులు అంటున్నారు. పచ్చనేతలు పథక రచన చేస్తే.. అధికారులు కుట్రలు అ మలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. నిరసన ర్యాలీ చేస్తే.. హత్యాయత్నం కేసులు ఈ మొత్తం ఘటన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రోద్బలంతో జరిగిందని ఆయనతో పాటు మరో 14 మందిపై కేసులు పెట్టారు. 132,74,79, ఆర్/డబ్ల్యూ 3(5), 109(1), 49 బీఎన్ఎస్ సెక్షన్లు పెట్టి కేసు నమోదు చేశారు. దీంట్లో మంగళవారం నిర్బంధంలోకి తీసుకున్న పైల వేణుగోపాల్రెడ్డి అనే కార్యకర్తను అరెస్టు చూపించి, బుధవారం కోర్టులో ప్రవేశపెట్టారు. మిగతా వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా, ర్యాలీ జరిగిన రోజు న్యూసెన్స్ కింద 23మందిపై కేసు పెట్టారు. పైల వేణుగోపాల్రెడ్డిని ఎందుకు అరెస్టు చేశారని పోలీసు స్టేషన్లో డిమాండ్ చేసినందుకు, బైఠాయించినందుకు 15మందిపైన కేసు పెట్టారు. ప్రజా వ్యతిరేక చర్య నిరసన తెలిపితే హత్యాయత్నం కేసులు పెడతారా? ఇదెక్కడి సంప్రదాయం. పోలీసులు వైఖ రి దారుణంగా ఉంది. టీడీపీ నాయకులు చెప్పినట్టు గానడుస్తున్నారు. తప్పుడుకేసులు సరికాదు. పోలీసు అధికారులు ఇబ్బందులు పడతారు. తప్పుడు ఫిర్యా దులు, తప్పుడు మార్గాలు ఎంచుకుంటే తగిన మూ ల్యం చెల్లించుకుంటారు. –తమ్మినేని సీతారాం, మాజీ స్పీకర్, పార్టీ పార్లమెంట్ సమన్వయ కర్త -
బుల్లెట్ బైకులే టార్గెట్
● ముగ్గురు బైక్ దొంగల అరెస్టు ● రూ.14 లక్షలు విలువ చేసే ఏడు బుల్లెట్ బైక్లు చోరీ ● వివరాలు వెల్లడించిన అదనపు ఎస్పీ శ్రీనివాసరావు శ్రీకాకుళం రూరల్: జల్సాలకు అలవాటు పడ్డారు. సులువుగా డబ్బు సంపాదించాలని మార్గాలు వెతికారు. బైక్ హ్యాండిల్ లాక్లను అన్లాక్ చేయడం నేర్చుకున్నారు. బైక్లను దొంగిలించి తక్కువ ధర కు అమ్మడం అలవాటు చేసుకున్నారు. చివరికి పోలీసుల చేతికి చిక్కారు. బుధవారం రూరల్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ ( క్రైం) శ్రీనివాసరావు కేసు వివరాలు వెల్లడించారు. శ్రీకాకుళం రూరల్ పరిసర ప్రాంతంలో 5 బుల్లెట్ బైక్లు, ఆమదాలవలస ప్రాంతంలో 2 బుల్లెట్ బైక్లు పోయినట్లు రూరల్ స్టేషన్లో కేసు నమోదైందన్నారు. రెండు రోజుల కిందట రాగోలు దూసి ప్రాంతంలో రూరల్ ఎస్ఐ రాము వాహనా లు తనిఖీలు చేస్తుండగా రెండు బుల్లెట్లపై వస్తున్న ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా వ్యవహరించడంతో ఆరా తీశామని, అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. ఖరీదైన వాహనాలే ఆదాయ వనరులు.. బుల్లెట్ దొంగతనాలకు పాల్పడిన ఎ–1 దండు రిషివర్ధన్ స్వస్థలం విశాఖపట్నం. విశాఖ కమిషనరేట్లో పీఎం పాలెం పోలీస్స్టేషన్లో ఓ వివాహిత హత్య కేసులో ప్రధాన నిందితుడు. పార్వతీపురం రూరల్ పోలీస్టేషన్లో ఒక చీటింగ్ కేసులో ముద్దాయిగా ఉన్నాడు. ఎ–2 రాయిపల్లి వినోద్ స్వస్థలం సాలూరు కాగా.. అక్కడి పోలీస్స్టేషన్లో ఐదు సా రా కేసులు, సాలూరు ఎకై ్సజ్ పోలీస్స్టేషన్తో పాటు గంట్యాడ పోలీస్స్టేషన్లో ఒక డెకాయిటీ కేసు, అలాగే పార్వతీపురం రూరల్ పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసులతో పాటు ఏడు కేసులు నమోదై ఉన్నాయి. ఇతనిపై పార్వతీపురం జిల్లా కలెక్టర్ పీడీ యాక్ట్ కూడా ఓపెన్ చేశారు. జైలులో పరిచయం.. దండు రిషివర్దన్, రాయిపల్లి వినోద్లు ఇద్దరూ జైలులో ఒకరికి ఒకరు పరిచయమయ్యారు. విలు వైన బైక్లు దొంగతనం చేసి నంబర్ మారిస్తే ఎవ రూ పట్టుకోలేరని ప్లాన్లు గీశారు. గడిచిన మూడు నెలలుగా ఏడు బైక్లు దొంగిలించారు. దొంగిలించిన బైక్లను మూడో నిందితుడు, బైక్ మెకానిక్ కొత్తూరుకు చెందిన చిట్టి సంతోష్ సెకండ్ హ్యాండ్ బైక్ షోరూమ్ నిర్వాహకుడి సాయంతో విక్రయించారు. వీరి వద్ద నుంచి ఏడు బైక్లను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. కేసులో ప్రతిభ కనబరిచిన కాని స్టేబుళ్లు బాబురావు, నారాయణరావు, సురేష్, కృష్ణ లకు ఎస్పీ మహేశ్వరరెడ్డి చేతులమీదుగా ప్రశంసాపత్రాలను అందించారు. -
పురపాలికల్లో.. పడకేసిన పారిశుద్ధ్యం
● పేరుకుపోతున్న చెత్త కుప్పలు ● పలుచోట్ల తూతూమంత్రంగా చెత్త సేకరణ ● పట్టణవాసులకు తప్పనిపాట్లు పురపాలక సంస్థల పరిధిలో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. శ్రీకాకుళం కార్పొరేషన్తో పాటు ఇచ్ఛాపురం, పలాస, ఆమదాలవలస మున్సిపాలిటీల్లో చెత్తాచెదారాలు ఎక్కడికక్కడ పేరుకుపోతున్నాయి. రోజుల తరబడి ఇదే పరిస్థితి ఉండటంతో కుక్కలు, పశువులు, పందువులు చేరి పరిసరాలను చిందరవందరగా మార్చుతున్నాయి. చెత్త సేకరణకు సంబంధించి డంపర్ బిన్లు పాడైపోవడంతో నిర్వహణ కష్టంగా మారిందని సిబ్బంది చెబుతుండగా.. దుర్వాసన భరించలేకపోతున్నామని స్థానికులు, అటువైపుగా వెళ్లే వాహనచోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని పురపాలక సంస్థల పరిధిలో పారిశుద్ధ్యంపై ‘సాక్షి’ ఫోకస్.. శ్రీకాకుళం కార్పొరేషన్లో.. శ్రీకాకుళం (పీఎన్కాలనీ): నగరంలో పారిశుద్ధ్యం పడకేసింది. ఎక్కడికక్కడ చెత్తకుప్పులు పేరుకుపోతుండటంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. కార్పోరేషన్ పరిధిలో విలీన పంచాయతీలతో కలిపి 50 డివిజన్లు ఉన్నాయి. అందులో 1.85లక్షలు మంది జనాభా ఉన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో క్లీన్ఆంధ్రప్రదేశ్ వాహనాలు 50 ఉండేవి. వీటికి అదనంగా రెండు వాహనాలు అందుబాటులో ఉండేవి. ప్రతిరోజూ తెల్లవారుజామున 5గంటలకే ఇంటి ముంగిటకు వాహనాలు వచ్చి చెత్త సేకరించేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. వాహనాలు 40 కంటే తక్కువగానే ఉన్నాయి. అందులో కొన్ని రిపేర్లుకు గురికావడం, డ్రైవర్లు సరిగా లేకపోవడం, వాహనాలకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వంటి ఇబ్బందు వల్ల పారిశుద్ధ్యం పడకేసింది. తడి చెత్తకు వేరేగా...పొడి చెత్తకు వేరేగా డస్ట్బిన్లు కార్పొరేషన్ సరఫరా చేసేది. ఇప్పుడా పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర అంటూ ప్రజాప్రతినిధులు, అధికారులు ఫోటోలకు ఫోజులిచ్చి మమా అనిపించేస్తున్నారు తప్ప పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు తీసుకోవడం లేదని నగరవాసులు మండిపడుతున్నారు. -
పుస్తెలతాడు చోరీ
సంతబొమ్మాళి: బోరుభద్ర గ్రామంలో మార్పు అప్పన్నమ్మకు చెందిన రెండు తులాల బంగారు పుస్తెలతాడు చోరీకి గురైనట్లు సంతబొ మ్మాళి ఎస్ఐ వై.సింహాచలం తెలిపారు. బుధవారం ఉదయం అప్పన్నమ్మ తన కన్నవారిల్లు ఉన్న నగిరిపెంట గ్రామానికి వెవెళ్లింది. తిరిగి బోరుభద్ర వచ్చేందుకు నగిరిపెంట జంక్షన్ వద్ద బస్సు కోసం వేచి ఉండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి ఆమె మెడలో పుస్తెలతాడు తెంచుకుని పారిపోయా రు. బాధితురాలు కేకలు వేసినా చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఫలితం లేకపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. పారా లీగల్ వలంటీర్లకు శిక్షణ శ్రీకాకుళం పాతబస్టాండ్ : ప్రజల్లో న్యాయవిజ్ఞానం విస్తృతంగా వ్యాప్తి చెందడానికి, చట్టాలపై అవగాహన పెంచడానికి పారా లీగల్ వలంటీర్లకు సమగ్ర శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన పారా లీగల్ వలంటీర్లకు మ జిల్లా న్యాయ సేవా సదన్లో నాలుగు రోజుల ప్రత్యేక శిక్షణ బుధవారం ప్రారంభించారు. వివిధ పథకాలు, చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు, న్యాయవాదులు అన్నెపు భువనేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. బైక్ అదుపుతప్పి యువకుడు మృతి బూర్జ: ఆమదాలవలస–పాలకొండ ప్రధాన రహదారిలో నీలాదేవిపురం మలుపు వద్ద ద్విచక్ర వాహనం ముందుగా వెళ్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి గోతులో పడటంతో యువకుడు దుర్మరణం చెందాడు. మృతుడు విజయనగరం జిల్లా గరివిడి మండలం చేరిపేటకు చెందిన కె.సంతోష్గా గుర్తించారు. అదే బైక్పై వెనుక కూర్చున్న నమ్మి కనకరాజు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వీరు బుధవారం సాయంత్రం పార్వతీపురంలో ఓ శుభకార్యం ఫొటోషూట్ తీసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. హెచ్సీ ఉమామహేశ్వరరావు దర్యాప్తు చేస్తున్నారు. సిక్కోలు పుస్తక మహోత్సవం లోగో ఆవిష్కరణ శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో నవంబర్ 11 నుంచి 20 వరకు జరగనున్న సిక్కోలు పుస్తక మహోత్సవం సాహిత్య సాంస్కృతిక వైజ్ఞానిక సంబరాలు విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ ఆకాంక్షించారు. ఈ మేరకు తన చాంబర్లో సిక్కోలు పుస్తక మహోత్సవం లోగోను బుధవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో మహోత్సవం కన్వీనర్ కె.శ్రీనివాసు, సాంస్కతిక వైజ్ఞానిక కన్వీనర్లు పి.సుధాకరావు, గొంటి గిరిధర్, కామినాయుడు, దొంతం పార్వతీశం, కె.కూర్మారావు, పి.గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. చెకుముకి సైన్స్సంబరాలు పోస్టర్ ఆవిష్కరణ శ్రీకాకుళం: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న చెకుముకి సైన్స్ సంబరాలకు మంచి ఆదరణ లభిస్తోందని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ అన్నారు. జేవీవీ ఆధ్వర్యంలో వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు రూపొందించిన 8వ తరగతి ఎన్ఎంఎంఎస్ పరీక్షల స్టడీ మెటీరియల్, చెకుముకి సైన్స్ పోస్టర్ను జేసీ బుధవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ గొంటి గిరిధర్, ఉపాధ్యక్షుడు పి.కూర్మారావు, జిల్లా కార్యదర్శి పి.గోవిందరావు, జిల్లా ఆడిట్ కన్వీనర్ బి.ఉమామహేశ్వరరావు, డి.పార్వతీశం పాల్గొన్నారు. -
నాచు పెంపకంపై అవగాహన
ఎచ్చెర్ల : బుడగట్లపాలెం సముద్రతీరంలో కఫ్పా ఫైకాస్ జాతి సముద్ర నాచు పెంపకంపై స్థానిక మత్స్యకార స్వయం సహాయక సంఘాల మహిళలకు బుధవారం మత్స్యశాఖ అధికారులు శిక్షణ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్గా ఎంపికచేసి నాచు పెంపకం చేపడుతున్నట్లు మత్స్యశాఖ సంయుక్త సంచాలకుడు వై.సత్యనారాయణ తెలిపారు. 50 మంది మహిళలకు 10 మంది మత్స్యకారులు శిక్షణ పొందుతున్నారని చెప్పారు. నాచు కొనుగోలు చేసే బాధ్యత మత్స్యశాఖ తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అల్లుపల్లి రాంబాబు, మత్స్యశాఖ ఎఫ్డీవో రవి, జీఎఫ్ ప్రతినిధి శామ్యూల్, మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు చీకటి శ్రీరాములు, మహిళలు, మత్స్యకారులు పాల్గొన్నారు. -
ఎన్నాళ్లీ ఎదురుచూపులు?
● మంజూరుపత్రాలు ఇచ్చినా అందని పింఛన్ ● ఆందోళనలో వితంతు పింఛన్ లబ్ధిదారులు మంచానికే పరిమితం.. ఈ చిత్రంలో మంచానికే పరిమితమైన వృద్ధురాలి పేరు శిగిలిపల్లి ఆదిలక్ష్మి. టెక్కలి మండలం తలగాం గ్రామం. 2024 మార్చిలో ఈమె భర్త మరణించారు. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2024 జూన్లో ఈమెకు వితంతు పింఛన్ మంజూరైంది. అప్పటికే ఆమె మానసిక పరిస్థితి సక్రమంగా లేకపోవడంతో మంచానికే పరిమితమైంది. పింఛన్ మంజూరైనా ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. కక్షతో ఆపేశారు.. ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు శిగిలిపల్లి తులసమ్మ. స్వగ్రామం టెక్కలి మండలం తలగాం. ఈమె భర్త 2024లో మరణించారు. జూన్లో వితంతు పింఛన్ మంజూరైంది. అయితే కుటుంబ సభ్యులు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నారనే కారణంగా మంజూరైన పింఛన్ డబ్బులు ఇవ్వకుండా అవస్థలకు గురి చేస్తున్నారు. ఇదే గ్రామంలో మానసిక పరిస్థితి సక్రమంగా లేని శిగిలిపల్లి ఆదిలక్ష్మి భర్త, తులసమ్మ భర్త ఇద్దరూ అన్నదమ్ములు. ఒకరు మార్చి నెలలో మరణిస్తే.. మరొకరు జనవరిలో మరణించారు. ఈ రెండు కుటుంబాలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నాయనే కక్షతో పింఛన్లు ఇవ్వడం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెక్కలి: కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త పింఛన్లకు మోక్షం కలగడం లేదు. అన్ని రకాల అర్హతలు, ధ్రువపత్రాలు ఉన్నా పింఛన్లు అందక అర్హులు ఆవేదన చెందుతున్నారు. సాంకేతిక కారణాలు, ఉన్నతాధికారులపై నెపం నెట్టేస్తూ పంపిణీలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. కొన్నిచోట్ల పింఛన్లు మంజూరైనా వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉన్నారనే కక్షతో లబ్ధిదారులకు పెన్షన్ అందజేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
తపాలా ఉద్యోగుల నిరసన
శ్రీకాకుళం అర్బన్: కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఉద్యోగం నుంచి తొలగించిన తపాలా ఉద్యమ జాతీయ నాయకుడు మహాదేవయ్యను వెంటనే తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని ఽతపాలా ఉద్యోగుల సంఘ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శ్రీకాకుళం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద జిల్లా నలుమూలల నుంచి దాదాపు 300 మంది పోస్టల్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి నందికేశ్వరరావు, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయిస్ రాష్ట్ర అధ్యక్షులు గణపతి, పోస్టల్ ఉద్యమ జిల్లా నాయకులు యు.వి.రమణ, బాబురావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
దివ్వైమెన ప్రతిభ
● ప్రమిదలు తయారు చేస్తున్న విభిన్న ప్రతిభావంతులు ● బెహరా మనోవికాస కేంద్రంలో ప్రదర్శన శ్రీకాకుళం కల్చరల్: దీపావళి సమీపిస్తోంది. ప్రతి ఇంటా వెలుగులు నింపేందుకు ప్రమిదలు తయారవుతున్నాయి. జిల్లా కేంద్రంలోని బెహరా మనోవికాస కేంద్రంలోని మానసిక దివ్యాంగులు అందమైన దివ్వెలు తయారు చేసి విక్రయిస్తున్నారు. వినూత్నమైన ఆలోచనలతో ఎవరికీ తీసిపోని విధంగా ఈ ప్రమిదలు తయారు చేస్తున్నారు. పండగ సందర్భంగా వీటిని చక్కటి రంగులు వేసి విక్రయానికి సిద్ధం చేస్తున్నారు. ఎగ్జిబిషన్ ఏర్పాటు మల్టీకలర్లో తయారు చేస్తున్న ఈ ప్రమిదలతో హౌసింగ్ బోర్డులో ఉన్న బెహరా మనోవికాస కేంద్రంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ప్రమిదలను 74 మంది మానసిక దివ్యాంగులు కలిసి తీర్చి దిద్దుతున్నారు. తన వంతుగా నిర్వాహకురాలు శ్యామల వారిని ప్రోత్సహిస్తున్నా రు. ఈ సారి మల్టీకలర్స్తో తీర్చిదిద్దుతున్నారు. వీటిలో ఒక రకం ధర 12 ప్రమిదలు రూ.60లు, అలాగే మరోరకం 12 ప్రమిదలు రూ.100లు అమ్మకానికి ఉన్నాయి. ప్రోత్సహించండి దివ్యాంగులు తయారు చేస్తున్న మల్టీకలర్ ప్రమిదలను కొనుగోలు చేసి అందరూ సహకరించాలి. ఎవరైనా కొనుగోలు చేయాలంటే 9848868960 ను సంప్రదించాలి. – శ్యామల, నిర్వాహకురాలు, బెహరా మనోవికాస కేంద్రం, శ్రీకాకుళం -
ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు నష్టం
బూర్జ: పేదలకు, విద్యార్థులకు తీరని నష్టం కలిగించే ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రయివేటీకరణను తిప్పికొట్టాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. ఆమదాలవలస నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ సమక్షంలో బూర్జ మండలం లక్కుపురం, అల్లెన, డొంకలపర్త గ్రామాల్లో బుధవారం కోటి సంతకాల మహా ఉద్యమం, రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ విద్య, వైద్యం పేదలకు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేశారని, ఆ గొప్ప ఆశయానికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
పోలీసుల తీరు సరికాదు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రెడ్బుక్ రాజ్యాంగంలో భాగంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని, పలాస నియోజకవర్గంలో మరింత ఎక్కువగా పోలీసు అధికారులు చేస్తున్నారని వైఎస్సార్సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆరోపించారు. తప్పకుండా న్యాయపరమైన పోరాటం చేస్తామన్నారు. టీడీపీ నేతలు చెప్పినట్టు ఆడుతున్న అధికారులపై తప్పకుండా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త సంప్రదాయాన్ని తీసుకొచ్చారని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కూడా అక్రమ కేసు పెట్టడం దారుణమన్నారు. ర్యాలీ చేస్తే తప్పుడు కేసులు పెట్టడమేంటని ప్రశ్నించారు. తప్పుడు ఫిర్యాదులు చేయించి, హత్యాయత్నం కేసులు కూడా పెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. కేసు లు ఎదుర్కొంటున్న వారికి, పోలీసుల వేధింపులకు గురవుతున్న వారికి వైఎస్సార్సీపీ పార్టీ అండగా నిలుస్తుందని కన్నబాబు భరోసానిచ్చారు. ● న్యాయపోరాటం చేస్తాం ● వైఎస్సార్సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు -
మహిళలపై నేరాలు అరికట్టలేకపోతున్నాం
● ప్రజల అభిప్రాయం కూడా ఇలాగే ఉంది ● మహిళా పోలీసులతో ఎస్పీ మహేశ్వరరెడ్డి శ్రీకాకుళం క్రైమ్ : ‘మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టలేకపోతున్నాం.. ప్రజల అభి ప్రాయం అదే’ అంటూ ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి కుండబద్దలుగొట్టారు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నట్లు ఆమదాలవలస మండలం కొర్లకో ట సచివాలయ పరిధిలో 67 శాతం ప్రజలు ఐవీఆర్ఎస్లో ఓటింగ్ చేశారని, ఎచ్చెర్ల మండలం కుప్పిలి–2 సచివాలయ పరిధిలోనూ 60 శాతం మంది ఇలాగే చెప్పారని ఉదాహరణలతో సహా ఎస్పీ వెల్లడించారు. మహిళా పోలీ సులతో జిల్లా కేంద్రంలోని బృందావనం ఫంక్షన్ హాల్ వార్షిక సమావేశంలో బుధవారం సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. సమావేశం ప్రారంభంలో కొందరు సమస్యలు చెప్పడంతో ఆయన వాస్తవాలు బయటపెట్టారు. ‘దాదాపు 800 మహిళా పోలీసుల్లో ఎంతమంది బాగా పనిచేస్తున్నారు..? ఎంతమంది సక్రమంగా లీవ్లు వాడుతున్నారు’ అంటూ చురకలంటించారు. పనిచేసే పోలీసులందరికీ ఆయా సందర్భాల్లో అవార్డులు ఇస్తున్నామని, ఆఖరికి హోంగార్డులు కూడా అందుకుంటున్నారని, మీరు ఏ స్థానంలో ఉన్నారో ఆలోచించుకోవాలన్నారు. హోంగార్డుల నుంచి అడిషనల్ ఎస్పీల వరకు తన వద్ద ఫీడ్ ఉందని, వారి మంచి చెడు రెండూ తనకు తెలుసని, ఇక మీ మహిళా పోలీసులపై దృష్టిపెడతానని, మైండ్సెట్ మార్చుకోవాల్సిందే అంటూ హెచ్చరించారు. జీరో వైలెన్సే లక్ష్యం.. రానున్నది స్థానిక సంస్థల ఎన్నికల సీజన్ అని, గ్రా మాల్లో ట్రబుల్మాంగర్స్, షీటర్లు, రౌడీషీటర్లను గుర్తించాలని, ఎప్పుడో జరిగిన గొడవలను ఎన్నికల రోజు, ప్రచారాలు చేసే సమయంలో రాజేసే వారుంటారని అలాంటి లిస్టంతా నవంబర్ 15 కల్లా సిద్ధంగా ఉంచాలని మహిళా పోలీసులకు డెడ్లైన్ పెట్టారు. లాఅండ్ఆర్డర్ పోలీసులకు ఇప్పటికే అక్టోబర్ 15కల్లా లిస్ట్ సిద్ధం చేయమని చెప్పామన్నారు. ఎన్నికల్లో తన టార్గెట్ జీరో వైలెన్స్ అని స్ప ష్టం చేశారు. ఉమెన్హెల్ప్డెస్క్, శక్తియాప్, నారీ శక్తి వంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. గతంలో కంటే క్రైమ్ రేట్ తగ్గిందని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ డి.సత్యనారాయణ, టౌన్ డీఎస్పీ వివేకానంద పాల్గొన్నారు. -
పీపీపీ అంటే ప్రైవేటుపరం చేయడమే..
నరసన్నపేట: మెడికల్ కాలేజీలకు సంబంధించి పీపీపీ అంటే ప్రైవేటుపరం చేయడమేనని, కూటమి ప్రభుత్వం తీరును ప్రతీ ఒక్కరూ వ్యతిరేకించాలని మాజీ స్పీకర్, వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ సమన్వయకర్త తమ్మినేని సీతారాం పిలపునిచ్చారు. నరసన్నపేట మండలం మడపాంలో బుధవారం నిర్వహించిన రచ్చబండలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రయివేటు వ్యక్తులకు ఇచ్చి స్వప్రయోజనాలకు వాడుకోవాలని, కొందరికి కట్టబెట్టాలని చూస్తోంన్నారు. ఆ పార్టీలో కొన్నాళ్లు కొనసాగిన తనకు వారి పన్నాగం అంతా తెలుసునని వివరించారు. కల్తీ మద్యం వ్యవహారంపై తప్పు కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ కింజరాపు సోదరులు వల్ల జిల్లాకు ఒరిగిందేమీ లేదన్నారు. పోలాకి జెడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య మాట్లాడుతూ కూటమి పాలనలో జరుగుతున్న అన్యాయాలు, కార్యకర్తలు పడుతున్న బాధలు వివరించారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం మండలస్థాయిలో వివిధ అనుబంధ సంఘాలకు అధ్యక్షులుగా ఎంపికై న నాయకులను సత్కరించారు. కార్యక్రమంలో మడపాం ఎంపీటీసీ రువ్వ వాసు, మడపాం, దేవాది సర్పంచ్లు రాపర్తి ఎరుకోడు, మంతిన రాము, ఎంపీపీ ఆరంగి మురళి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు చింతు రామారావు తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు పరిహారం ఇప్పించాలని వినతి
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గాలులు, వరదలకు పాతపట్నం నియోజకవర్గంలో సుమారు 5250 ఎకరాల్లో వరి, ఇతర పంటలకు నష్టం వాటిల్లిందని, ఆ పంటలకు ప్రభుత్వం తరఫున పరిహారం ఇప్పటించాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు రెడ్డి శాంతి కోరారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ వద్ద కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ని కలిసి వినతిపత్రం అందజేశారు. అన్నదాత సుఖీభవ కింద రెండేళ్లకు రూ.40 వేలు బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. అనంతరం నియోజకవర్గంలోని పలు సమస్యలను విన్నవించారు. కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు. -
‘డిసెంబర్ నాటికి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ పూర్తి’
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదే శించారు. బుధవారం ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ను ఆయన జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మ ద్ ఖాన్తో కలిసి సందర్శించారు. ప్రభుత్వ శాఖలన్నీ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లోనే ఉండాలన్నారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ అన్ని ఫ్లోర్లలోని గదులను క్షుణ్ణంగా పరిశీలించి జేసీతో చర్చించారు. బయట చిన్న షాప్స్ పెట్టుకునే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేయాలని ఎస్ఈని ఆదేశించారు. వెనుక వైపు పార్క్ లేదా ఆడుకునేందుకు వీలుగా చేయాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, ఆర్ అండ్ బీ ఎస్ఈ పి.సత్యనారాయణ, ఆర్ అండ్ బి ఈఈ ఎ.తిరుపతిరావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి జీఏ సూర్యనారాయణ, కాంట్రాక్టర్ శ్రీరాం పాల్గొన్నారు. నవంబర్ 2న ఆదిత్యుని హంసనావికోత్సవం అరసవల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూ ర్యనారాయణ స్వామి ఆలయ ఇంద్రపుష్కరిణిలో నవంబర్ 2న హంస నావికోత్సవం (తెప్పోత్సవం) జరుగుతుందని ఆలయ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ తెలియజేశారు. కార్తీక శుద్ధ ద్వాదశి పర్వదినం సందర్భంగా ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఇంద్రపుష్కరిణిలో ప్రత్యేకమైన హంస వాహనంపై స్వామి వారి ఉత్సవమూర్తులు విహరించనున్నారని, ఈ మేరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయనున్నామని వివరించారు. ఆల య ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ సూచనల మేరకు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని జరిగేలా అలాగే వేలాది మంది భక్తులు రానున్న దృష్ట్యా పక్కా ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు. ముఖ్య ప్రజాప్రతినిధులు హాజరుకానున్న నేపథ్యంలో పుష్కరిణికి తూర్పు భాగంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ప్రత్యేక హంసవాహనం తయారీ కోసం టెండర్లు కూడా ఈ నెల 18న పిలుస్తున్నామని తెలిపారు. కేసులు వేగంగా పరిష్కరించాలిశ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా జైళ్లలో ఉన్న ముద్దాయిల కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జునైద్ అహ్మద్ మౌలానా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ మార్గదర్శకాల మేరకు అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ (యూఆర్టీసీ) సమావేశం బుధవారం స్థానిక జిల్లా కోర్టులో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా మాట్లాడుతూ.. బెయిల్ మంజూరై నా విడుదల కానివారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, మహిళా ముద్దాయిల కేసులను యూఆర్టీసీలో చర్చించి, వారికి బెయిల్పై త్వరితగతిన విడుదల చేయించాలన్నారు. జిల్లాలో క్రైమ్ రేటును తగ్గించేందుకు పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూ చించారు. జేజేఎం లక్ష్యాలు పూర్తి చేయాలి: కలెక్టర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: జల జీవన్ మిషన్ (జేజేఎం) కింద చేపట్టిన పనులను, ఇంటింటికీ కుళాయి కనెక్షన్ల లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. గ్రామీణ నీటి సరఫరా అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ 15, 2025 నాటి గణాంకాల ప్రకారం, జిల్లాలో మొత్తం 4,87,307 ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 2,29,649 కనెక్షన్లు పూర్తయ్యాయి. ఇంకా 2,57,658 కనెక్షన్లు పూర్తి చేయాల్సి ఉంది. పనుల పురోగతి సంతృప్తికరంగా ఉన్నప్పటికీ, మిగిలిన లక్ష్యాన్ని చేరుకోవడానికి మండలాల వారీగా కార్యాచరణ ప్ర ణాళికను అమలు చేయాలని ఆయన సూచించారు. ఇప్పటివరకు జిల్లాలో 29 గ్రామాలు ‘హర్ ఘర్ జల్’ డిక్లరేషన్ సాధించాయి. డిసెంబర్ 2025 నాటికి మరింత మందికి తాగునీరు అందించే లక్ష్యంతో నవంబర్ నుంచి మార్చి 2026 వరకు మరో 178 గ్రామాలను డిక్లేర్ చేయడానికి లక్ష్యం పెట్టుకున్నట్లు అధికారులు వివరించారు. -
వేధింపుల పర్వం
మరో అంకం సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కూటమి ప్రభుత్వ వేధింపుల పర్వం కొనసాగుతోంది. కల్తీ మద్యంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసనలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా సోమవారం పలాస–కాశీబుగ్గలో మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ సెల్ కన్వీనర్ డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాయి. పెద్ద ఎత్తున నాయకులు, మహిళలు హాజరు కావడంతో అధికార నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఈ నిరసనలో వేణుగోపాల్ రెడ్డి అనే వైఎస్సార్ సీపీ కార్యకర్త.. మహిళా పోలీసును తోసేశారంటూ ఓ పస లేని ఆరోపణను తెరపైకి తెచ్చారు. మంగళవారం సాయంత్రం టౌన్ సీఐ సూర్యనారాయణ.. వేణుగోపాల్ రెడ్డిని స్టేషన్కు పిలవడంతో వాతావరణం వేడెక్కింది. ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు స్టేషన్కు వెళ్లారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి డాక్టర్ అప్పలరాజు స్టేషన్కు వెళ్లి పోలీసులతో మాట్లాడారు. ఇంతలోనే వేణుని సెల్లో బంధించారు. వేణుగోపాల్పై ఎవరు ఫిర్యాదు చేశారు? ఏయే సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయన్నది పోలీసులు బహిర్గతం చేయడం లేదు. వేణుపై మహిళా పోలీసు ఫిర్యాదు చేయలేదని, ఆమైపె పోలీసు ఉన్నతాధికారులు ఫిర్యాదు కోసం ఒత్తిడి చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. పెద్ద ఎత్తున పోలీసులు మోహరింపు.. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్టేషన్కు వస్తారని పోలీసులు ముందుగానే ఊహించారు. దీంతో కాశీబుగ్గ సబ్ డివిజన్తో పాటు పక్కనే ఉన్న టెక్కలి సబ్ డివిజన్కు సంబంధించిన ఎస్ఐలు, పోలీస్ సిబ్బందిని కూడా కాశీబుగ్గ టౌన్ స్టేషన్లో మోహరించారు. అవసరమైతే లాఠీచార్జి చేయాలని ఒత్తిళ్లు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పోలీసులంతా టౌన్ స్టేషన్ బయట ఉంటూ, ఎప్పటికప్పుడు స్థానిక అధికార పార్టీ నాయకులకు పరిస్థితిని చేరవేశారు. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. సీదిరి ఆందోళన.. పార్టీ కార్యకర్త వేణును పోలీసులు టౌన్ స్టేషన్లో అక్రమంగా నిర్బంధించిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి డాక్టర్ అప్పలరాజు మంగళవారం రాత్రి తన అనుచరులతో ఠాణాకు వెళ్లారు. ఎందుకు వేణుగోపాల్ రెడ్డిని నిర్బంధించారో చెప్పాలని పోలీసులను నిలదీశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న టెక్కలి డీఎస్పీ, కాశీబుగ్గ ఇన్చార్జి డీఎస్పీ లక్ష్మణరావు అప్పలరాజుతో మాట్లాడారు. మహిళా పోలీసును నెట్టడంపైనే కేసు నమోదు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదును చూపించాలని మాజీ మంత్రి కోరడంతో పోలీసులు నీళ్లు నమిలారు. ఫిర్యాదు లేకుండా తమ కార్యకర్తను అదుపులోకి ఎందుకు తీసుకున్నారో తమకు తెలుసునని, వీటన్నిటికీ పోలీసులు భవిష్యత్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అప్పలరాజు హెచ్చరించారు. మహిళా కార్యకర్తలను నెట్టారు కల్తీ మద్యంపై పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో పలువురు మహిళా కార్యకర్తలను కాశీబుగ్గ టౌన్ సీఐ సూర్యనారాయణ, పలువురు పోలీస్ సిబ్బంది ఇష్టారీతిన నెట్టి, తాకరానిచోట తాకారని, వారి పైన కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించాలని మాజీ మంత్రి అప్పలరాజు డిమాండ్ చేశారు. చేయని తప్పును సృష్టించి తమ పార్టీ కార్యకర్తపై అక్రమ కేసు బనాయించడం తగదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా కార్యకర్తలను టౌన్ సీఐ సూర్యనారాయణ నెట్టి వేస్తున్న దృశ్యాలను ఈ సందర్భంగా మీడియాకు చూపించారు. దీనిపై చర్యలు తీసుకోకుంటే తమ పార్టీ అధికారంలోకి వచ్చాక లెక్కలు తేలుస్తామని హెచ్చరించారు. అక్రమంగా అదుపులోకి తీసుకున్న వేణుగోపాల్ను విడిచిపెట్టాలని కోరారు. అయినా పోలీసులు వదలలేదు. స్టేషన్ ఎదుట బైఠాయింపు పోలీసుల తీరుకు నిరసనగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తన అనుచరులతో కలిసి స్టేషన్ ఎదుట బైఠాయించారు. తమ కార్యకర్తను విడిచి పెట్టేవరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని నిరసనకు దిగారు. రాత్రి 12 గంటలు దాటినా నిరసన కొనసాగించారు. మీడియాకు నో ఎంట్రీ స్టేషన్ వద్ద గొడవ జరుగుతోందని మీడియా ప్రతినిధులు స్టేషన్లోనికి వచ్చేందుకు ప్రయత్నించగా టౌన్ సీఐ సూర్యనారాయణ తన ప్రతాపం చూపారు. మీడియా ప్రతినిధులు స్టేషన్లోకి రాకుండా అడ్డుకున్నారు. దీంతో మీడియా ప్రతిని పోలీసుల అదుపులో వైఎస్సార్ సీపీ కార్యకర్త మహిళా పోలీస్ సిబ్బందిని తోశారని ఆరోపణ ఫిర్యాదు లేకుండానే అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం ఎందుకు అదుపులోకి తీసుకున్నారో చెప్పాలని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు డిమాండ్ ఎంతకీ వదలకపోవడంతో స్టేషన్ ఎదుట మాజీ మంత్రి బైఠాయింపు ధులంతా కాశీబుగ్గ టౌన్ స్టేషన్ ఆవరణలో ధర్నాకు దిగారు. పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమను సీఐ సూర్యనారాయణ స్టేషన్లోకి అనుమతించకపోగా, దుర్భాషలాడటం తగదని వాపోయారు. -
ముమ్మాటికీ వైఎస్ జగనే కిడ్నీ బాధితుల బాంధవుడు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ఉద్దానం ప్రాంతంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఆదుకున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళంలోని ప్రైవేటు హొటల్లో ధర్మాన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. అనేక దశాబ్దాలుగా ఏ ఒక్కరూ శాశ్వత పరిష్కారం ఆలోచన చేయలేదని, ఉద్దానం కిడ్నీ సమస్యను అన్ని రాజకీయ పార్టీలు వాడుకుని లబ్ధి పొందాయే కానీ, సమస్య మూలాల్లోకి వెళ్లి పరిష్కారం కోసం ఏ ప్రభుత్వాలు ప్రయ త్నించలేకపోయాయని ధర్మాన తెలిపారు. వైఎస్ జగన్ మొదటిసారి సీఎం అయినా కూడా సమస్యను అర్థం చేసుకుని వంద కోట్లతో పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశారన్నారు. తానే భూమి పూజ చేసి ప్రారంభించి, నిర్మాణం చేసి, ఆస్పత్రిని ప్రారంభించడం వైఎస్ జగన్ ఘనత అన్నారు. భూగర్భ జలా లు తాగడం వల్లే కిడ్నీ సమస్య వస్తుందన్న వైద్యుల సూచనతో మంచినీటి సమస్య పరిష్కారం కోసం రూ.800 కోట్లతో హిరమండలం రిజర్వాయర్ నుంచి నీరు తీసుకొచ్చారని తెలిపారు. దివంగత వైఎస్సార్ కూడా ఉచిత విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత కల్పించారని, ఆయన తనయుడు మరో పదడుగులు ముందుకేసి మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టి 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేశారని చెప్పారు. మిగిలిన వాటిని ప్రైవేటీకరించేందుకు చంద్రబాబు ఆలోచన చేయడం సరికాదన్నారు. పీపీపీ విధానాన్ని కట్టిపెట్టి ఉచిత వైద్యవిద్యకు కట్టుబడి ఉండాలని, లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్ప దని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హ యాంలో విద్య, వైద్య రంగాలకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారో శత్రువులైనా అంగీకరించక తప్పదన్నారు. నాడు–నేడు ద్వారా కొత్త పీహెచ్సీల నిర్మాణం, పాత ఆస్పత్రుల ఆధునికీకరణ, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ఆరోగ్య ఆసరా, గ్రామాల్లో హెల్త్ క్లినిక్ల నిర్మాణం వంటి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. ప్రైవేటుకు అప్పగిస్తే జనం ప్రాణాలకు డబ్బుతో విలువ కడతారని అన్నారు. శవాలకి సైతం వైద్యం చేసి డబ్బులు దోచుకుంటున్న పరిస్థితులు ఇప్పుడున్నాయన్నారు. ఓ నిరుపేద కుటుంబానికి అనారోగ్యం వస్తే ఆయన జీవితకాలంలో సంపాదించినసొమ్ముతో పాటు ఆస్తుల్నికోల్పోయి రోడ్డు న పడుతున్నారన్నారు. అలాంటి పరిస్ధితి లేకుండా ఉండేందుకే ప్రభుత్వం ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారని వివరించారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి పేద ప్రజల ఆరోగ్యాలు అవసరం లేద ని కేవలం కార్పోరేట్లకు దోచిపెట్టడమే వారికి తెలిసిన పాలన అని అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగిస్తే పేదోడి గొంతుకై వైఎస్సార్సీపీ ఆగ్రహానికి కూటమి ప్రభుత్వం గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. -
ప్రైవేటీకరణ కుట్రలు అడ్డుకోండి
రణస్థలం: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేసేందుకు సీఎం చంద్రబాబునాయుడు చేస్తున్న కుట్రలను ప్రజలంతా ఐక్యంగా తిప్పికొట్టాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న కోటి సంతకాల మహా ఉద్యమం, రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్ సమక్షంలో లావేరు మండలం తామాడ గ్రామంలో మంగళవారం రచ్చబండ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్య, వైద్యం పేదలకు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్త మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసిందని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ గొప్ప ఆశయానికి తూట్టు పొడిచి, వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.ప్రైవేటీకరణ వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్యకు దూరమయ్యే అవకాశం ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్ మాట్లాడుతూ ఉచిత విద్యుత్ మొదలుకొని అమ్మ ఒడి వరకు కూటమి ప్రభుత్వం అన్నింటినీ రద్దు చేసే కుట్ర చేస్తోందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వైఎస్సార్సీపీకి మద్దతుగా సంతకాల సేకరణలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పరిశీలకుడు కె.వి.జి.సత్యనారాయణ, లావేరు మండల ప్రత్యేక ఆహ్వానితుడు రొక్కం బాలకృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు దన్నాన రాజినాయుడు, వ్యవసాయ సలహా మండలి కార్యవర్గ సభ్యులు గొర్లె అప్పలనాయుడు, జెడ్పీటీసీ సభ్యులు మీసాల సీతంనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
టీచర్లు, పోలీసులే ఎక్కువ..
ఫేక్ లోన్లు పొందిన వారిలో ఎక్కువగా టీచర్లు, పోలీసులే ఉన్నారు. వీరంతా గతంలో హౌసింగ్ లోన్ కోసం వివిధ బ్యాంకులు చుట్టూ తిరిగి మంజూరుకానివారే. శివకుమార్ కన్సల్టెన్సీగా ఉండటం.. అందునా అతని తండ్రి రిటైర్డ్ ఏఆర్ ఎస్ఐగా ఉండటంతో నమ్మారు. శివకుమార్ సైతం వారి నుంచి ఒరిజినల్ సేల్ డీడ్ తప్ప మిగతా లింక్ డాక్యుమెంట్లు, అడంగల్, 1బీ, ఇంటి పన్ను ఒకటేమిటి అన్ని ఫోర్జరీ సంతకాలతో అధికారుల రబ్బరు స్టాంపులను దుర్వినియోగపర్చి చేశాడు. వాస్తవానికి కొన్ని బ్యాంకులు సుడా పర్మిషన్, నాలా పర్మిషన్ లేనిదే లోన్ ఇవ్వవు. ఇవి వర్తించని బ్యాంకులను గుర్తించి పని చేసుకున్నారు. రెవెన్యూ విభాగం నుంచి కూడా రిజిస్ట్రేషన్ అయిన వాటికే లింక్ డాక్యుమెంట్లు, ఇతరత్రా సంతకాలు చేస్తారు. ఐదారేళ్లుగా జరుగుతున్న ఈ కుంభకోణంలో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల పాత్ర ఏంటి..? సంతకాల ఫోర్జరీపై ఆ విభాగాల అధికారులు సైలెంట్గా ఉండటం ఏంటన్నది తెలియాల్సి ఉంది. -
భరతజాతి ముద్దుబిడ్డ అంబేడ్కర్
సరుబుజ్జిలి: భరతజాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ, రాజ్యాంగా సృష్టికర్త డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అని మాజీ స్పీకర్, వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు తమ్మినేని సీతారాం అన్నారు. పాలవలసలో ఏర్పాటుచేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. అనంతరం దంతపురి బౌధ్దక్షేత్రంలో 69వ దమ్మదీక్ష దినోత్సవ బౌద్ధ సమ్మేళనంలో స్పీకర్ పాల్గొన్నారు. బుద్ధుడి ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో అంబేడ్కర్ ఇండియన్ మిషన్ రాష్ట్ర అధ్యక్ష ఉపాధ్యక్షులు కంఠ వేణు, తైక్వాండో శ్రీను, పీఎస్ఎన్ మూర్తి, కె.కె.రాజా, బుద్ధిస్ట్ సొసైటీ అధ్యక్షుడు హరిబాబు, సామాజిక పోరాట సమితి అధ్యక్షుడు కల్లేపల్లి రాంగోపాల్, గొల్లపల్లి సురేష్, యడ్ల ఈశ్వరరావు, అదపాక గౌరినాయుడు, ఇల్లాకుల సూర్యప్రకాశరావు, కొంచాడ సూర్యనారాయణ,గొల్లపల్లి నందేష్,, బొత్స వెంకటరమణ పాల్గొన్నారు. -
ఓడీల కోసం పాట్లు
● ఇంకా అందని డిగ్రీ ఓడీలు ● పైచదువులకు ఇబ్బంది పడుతున్న విద్యార్థులు ఎచ్చెర్ల: డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు తమ ఒరిజినల్ డాక్యుమెంట్ల కోసం నానా పాట్లు పడుతున్నారు. వీరు ఉత్తీర్ణత సాధించి నెల దాటినప్పటికీ వీరికి ఇప్పటికీ సర్టిఫికెట్లు అందించలేదు. జిల్లాలో మొత్తం మొత్తం 15 ప్రభుత్వ కళాశాలలు, 84 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలలకు సంబంధించి విద్యార్థులు డిగ్రీ ఉత్తీర్ణత సాధించి పై చదువుల కోసం ఎదురుచూస్తున్నారు. వీరికి అవసరమైన ప్రొవిజనల్స్, ఓడీ సర్టిఫికెట్లు ఎచ్చెర్ల లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం అందిస్తోంది. గతంలో ఏ కళాశాలకు సంబంధించి ఆ కళాశాలకు సర్టిఫికెట్లను పంపించేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జిల్లాలోని డిగ్రీ విద్యార్థులంతా వర్సిటీకి వచ్చి సర్టిఫికెట్లు తీసుకోవాల్సి ఉంది. వీరికి ఎలాంటి ఫీజు బకాయిలు లేవని సంబంధిత కళాశాల నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకువస్తే వర్సిటీ వారు విద్యార్థికి ప్రొవిజినల్స్, ఓడీ అందిస్తారు. అయితే ఈ ప్రక్రియ జాప్యం కావడంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. డిగ్రీ అనంతరం చదవాల్సిన ఏపీ పీజీ–సెట్, లా–సెట్, ఐ–సెట్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు కౌన్సిలింగ్లు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిగ్రీ విద్యార్థులు తమ వద్ద సర్టిఫికెట్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి రోజూ వర్సిటీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. -
హెవీ డ్రైవింగ్ లైెసెన్స్కు 32 మంది దరఖాస్తు
శ్రీకాకుళం పాతస్టాండ్: హెవీ డ్రైవింగ్ లైసెన్స్కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు సూ చించారు. మంగళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఆయన దరఖాస్తులను పరిశీలించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నా రు. మొత్తం 32 దరఖాస్తులు వచ్చాయి. వీరిలో పది మందిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఎచ్చెర్లలోని ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్ పీవీ గంగాధర్ అభ్యర్థులకు ఉన్న డ్రైవింగ్లో వారి నైపుణ్యాన్ని పరిశీలించారు. సర్టిఫికెట్ల పరిశీలనలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు తో పాటు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఆర్.గడ్డెమ్మ, మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ పీవీ గంగాధర్, ఆర్టీసీ డిపో – 1 డీఎం అమర సింహులు, ఆర్టీసీ పీఆర్ఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఎట్టకేలకు సత్యవరానికి తాగునీరు నరసన్నపేట: మేజర్ పంచాయతీ పరిధిలోని సత్యవరానికి ఎట్టకేలకు తాగునీటి సరఫరా పునరుద్ధరించారు. ట్యాంకు వద్ద మరమ్మతునకు గురైన పైపువాల్స్ను మార్చి మంగళవారం కొత్తవి అమర్చారు. ఈ పనులను ఈఓ ద్రాక్షాయిని పర్యవేక్షించారు. దీంతో సాయంత్రం సత్యవరానికి తాగునీటిని కుళాయిల ద్వారా పంపిణీ చేశారు. ‘సమ్మె జయప్రదం చేయండి’శ్రీకాకుళం (పీఎన్కాలనీ): విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడుదామని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ అమ్మన్నాయు డు, పి.తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. అక్టోబర్ 15 నుంచి జరిగే విద్యుత్ కార్మికుల సమ్మైపె సీఐటీయూ జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మా ట్లాడారు. ప్రైవేటీకరణ విధానాల నుంచి సంస్థను రక్షించుకోవాలని, విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే బిల్లును వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. మేధావులంతా విద్యుత్ సమ్మెకు మద్దతు తెలపాలని కోరారు. సమావేశంలో సీఐటీయూ సీనియర్ నాయకులు ఎం.ఆదినారాయణమూర్తి, శ్రీకాకుళం టౌన్ కన్వీనర్ ఆర్.ప్రకాష్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు శంకర్, రమణ తదితరులు పాల్గొన్నారు. -
మెరుపుల సమయంలో గ్రానైట్ బ్లాస్టింగ్లు వద్దు
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో గ్రానైట్ బ్లాస్టింగ్ చేయకూడదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చెప్పారు. గ్రానైట్ యాజమాన్యాలతో మంగళవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రానైట్ ఇండస్ట్రీలో భద్రత, రక్షణ ముఖ్యమన్నారు. కార్మికుల భవిష్యత్కు భరోసాగా గ్రూపు ఇన్సూరెన్సు ఉండాలన్నారు. బ్లాస్టింగ్ చేసే సమయంలో నిబంధనలు పాటించాలన్నారు. గ్రానైట్ ఇండస్ట్రీస్పై ట్రైనింగ్ సెంటర్కు భూమి కేటాయిస్తానన్నారు. ఈఎస్ఐలో ఉంటే అంతా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ దినేష్ కలెక్టర్కు వివరించారు. ఈఎస్ఐ పెట్టుకునేందుకు డిసెంబర్ 31 వరకు సమయం ఉన్నట్టు చెప్పారు. గ్రానైట్ కార్మికుల కోసం వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు 10 సెంట్లు భూమి కావాలని గ్రానైట్ అసోసియేషన్ కోరగా భూమి ఇవ్వాలని టెక్కలి ఆర్డీఓను కలెక్టర్ ఆదేశించారు. లైసెన్సులు లేని క్రషర్స్ ఉంటే ఆపివేయాలన్నారు. వాతావరణ కేంద్రం జారీ చేసిన వాతావరణ పరిస్థితుల ఆధారంగా తక్షణమే సైరన్ వేయాలని చెప్పారు. భూ గర్భ గనుల శాఖ ఉప సంచాలకులు మోహనరావు మాట్లాడుతూ గ్రానైట్ కార్మికులకు కార్మిక శాఖ బీమా కల్పించాలని, అన్ని అనుమతులు తప్పనిసరిగా ఉండాలన్నారు. గుర్తింపు పొందిన లైసెన్సు ఉన్న వారితోనే బ్లాస్టింగ్ చేయించాలన్నారు. బ్లాస్టింగ్ చేసే ముందు పోలీస్ వారికి, తహసీల్దార్, రెవెన్యూ డివిజనల్ అధికారికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. సమావేశంలో శ్రీకాకుళం జిల్లాలోని క్వారీల యజమానులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ కరుణ శ్రీ, అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి మోహనరావు, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ దినేష్, శ్రీకాకుళం, టెక్కలి, పలాస ఆర్డీఓలు కె.సాయి ప్రత్యూష, కష్ణమూర్తి, వెంకటేష్, డీఎస్పీ వివేకానంద తదితరులు పాల్గొన్నారు. -
నేను సైతం
శ్రీకాకుళం న్యూకాలనీ: సమాజంలో కోసం ఏదైనా మంచి పని చేయాలని ఉందా ? సేవా కార్యక్రమాలను నిర్వహించాలనే ఆసక్తి ఉందా ? అయితే కేంద్ర ప్రభుత్వం మీకు చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది. నేషనల్ యూత్ వలంటీర్గా సమాజ సేవ చేసేందుకు ఆసక్తి గల యువత నుంచి దరఖాస్తులను ఆహానిస్తోంది. ఒకవైపు సేవ చేస్తూనే మరోవైపు ప్రతినెలా పారితోషికాన్ని పొందవచ్చు.అక్టోబర్ 15లోగా ‘ఎన్వైకెఎస్.ఎన్ఐసీ.ఇన్’ వెబ్పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపిక విధానం ఇలా.. దరఖాస్తుదారులకు శ్రీకాకుళం జిల్లాలోని మేరా యువభారత్ (నెహ్రూ యువకేంద్రం) కార్యాలయంలో ఇంటర్వ్యూ ఉంటుంది. అభ్యర్థుల వయస్సు అక్టోబర్ ఒకటి నాటికి 18 నుంచి 29 ఏళ్ల మధ్య ఉండాలి. కనీసం పదో తరగతి ఉత్తీర్ణత కలిగినవారు అర్హులు. డిగ్రీ అర్హతను కలిగి కంప్యూటర్ అప్లికేషన్స్, ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు, ఈ–బ్యాంకింగ్, డిజిటల్ వంటి వివిధ యాప్లలో సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. మై భారత్ అనుబంధ యువజన సంఘాల సభ్యులు, మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వివరాలకు 08942–222028, 9133095646 నంబర్లను సంప్రదించవచ్చు. ఎంపికై తే స్టైఫండ్ ఇలా.. వలంటీరుగా ఎంపికై నవారు ఏడాది కాలం పనిచేయాల్సి ఉంటుంది. ఎంపికై నవారికి నెలకు రూ.5వేల స్టైఫండ్ చెల్లిస్తారు. విధులు ఇలా.. వలంటీర్లకు ప్రత్యేకంగా బ్లాకులను కేటాయిస్తారు. రెండు మండలాలను కలిపి ఒక బ్లాక్గా గుర్తిస్తారు. వలంటీర్లు యువజన, మహిళా సంఘాలను స్థాపించడం, సంఘాలను సమన్వయం చేసుకుని క్రీడలు, ఆరోగ్యం, అక్షరాస్యత, పారిశుద్ధ్యం, పచ్చదనం–పరిశుభ్రత, మహిళా సాధికారిత, లింగవివక్ష, ఇతర సామాజిక అంశాలపై ప్రజలను చైతన్యపరచడం, తదితర అంశాలో ప్రగతి సాధన కోసం పనిచేయాల్సి ఉంటుంది. సమాజ సేవ చేయాలన్న ఆసక్తి కలిగినవారు మాత్రమే దరఖాస్తులు చేయండి. ఎంపికై నవారు తమకు అప్పగించిన బ్లాకుల్లో సామాజిక, చైతన్య కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది. బుధవారం సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవాలి. – కె.వెంకట్ ఉజ్వల్, మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీకాకుళం -
బురద నీరే.. తాగునీరు
కళింగపట్నం పంచాయతీ నగరాలపేట ఎస్సీ కాలనీలో బురద నీరు సరఫరా కావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం సాయంత్రం గార వద్దనున్న రక్షిత పథకం నుంచి నీరు సరఫరా కాగా బురదనీరే వచ్చింది. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పందించి శుద్ధి చేసిన తాగునీరు సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలని వారంతా కోరుతున్నారు. – గార గంజాయితో ఇద్దరు అరెస్టు ఇచ్ఛాపురం: స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో సుమారు 30 కేజీల గంజాయితో ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. ఇచ్ఛాపురం సీఐ కార్యాలయంలో మంగళవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. రైల్వేస్టేషన్ తనిఖీలు నిర్వహిస్తుండగా కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన అంబరేష్, ఆర్.వెంకటసాయిలు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు తనిఖీ చేశారు. బ్యాగ్లో 29.150 కేజీల గంజాయిని గుర్తించారు. వీరు ఒడిశాలోని ఖనుచరణ్ వద్ద నుంచి గంజాయిని కొనుగోలుచేసి బళ్లారిలో గంజాయి వ్యాపారం చేస్తున్న రాముకి ఇచ్చేందుకు బరంపురం రైల్వేస్టేషన్ చేరుకున్నారు. అక్కడ పోలీసులు తనిఖీలు ఎక్కువగా ఉండగా బస్సు ద్వారా ఇచ్ఛాపురం చేరుకున్నారు. ఇక్కడి రైల్వేస్టేషన్కి వెళ్తుండగా పట్టణ పోలీసులకు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి గంజాయి, సెల్ఫోన్ని స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. పట్టణ పోలీస్స్టేషన్ ఇన్చార్జి ఎస్ఐ వి.రవివర్మ, సిబ్బంది పాల్గొన్నారు. -
ఓడీల కోసం పాట్లు
ఎచ్చెర్ల: డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు తమ ఒరిజినల్ డాక్యుమెంట్ల కోసం నానా పాట్లు పడుతున్నారు. వీరు ఉత్తీర్ణత సాధించి నెల దాటినప్పటికీ వీరికి ఇప్పటికీ సర్టిఫికెట్లు అందించలేదు. జిల్లాలో మొత్తం మొత్తం 15 ప్రభుత్వ కళాశాలలు, 84 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలలకు సంబంధించి విద్యార్థులు డిగ్రీ ఉత్తీర్ణత సాధించి పై చదువుల కోసం ఎదురుచూస్తున్నారు. వీరికి అవసరమైన ప్రొవిజనల్స్, ఓడీ సర్టిఫికెట్లు ఎచ్చెర్ల లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం అందిస్తోంది. గతంలో ఏ కళాశాలకు సంబంధించి ఆ కళాశాలకు సర్టిఫికెట్లను పంపించేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జిల్లాలోని డిగ్రీ విద్యార్థులంతా వర్సిటీకి వచ్చి సర్టిఫికెట్లు తీసుకోవాల్సి ఉంది. వీరికి ఎలాంటి ఫీజు బకాయిలు లేవని సంబంధిత కళాశాల నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకువస్తే వర్సిటీ వారు విద్యార్థికి ప్రొవిజినల్స్, ఓడీ అందిస్తారు. అయితే ఈ ప్రక్రియ జాప్యం కావడంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. డిగ్రీ అనంతరం చదవాల్సిన ఏపీ పీజీ–సెట్, లా–సెట్, ఐ–సెట్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు కౌన్సిలింగ్లు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిగ్రీ విద్యార్థులు తమ వద్ద సర్టిఫికెట్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి రోజూ వర్సిటీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. -
థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు సరికాదు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ఆదివాసీల సంస్కృతి, పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీసే థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు సరికాదని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర అన్నారు. నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని సరుబుజ్జిలి, బూర్జ మండలాల పరిధిలో వెన్నెలవలసలో 3,200 మెగావాట్స్ సామర్ధ్యంతో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏపీ జెన్కో నిర్మాణ ప్రతిపాదనను కూటమి ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు జరిగితే రెండు మండలాల్లోని 20 గిరిజన గ్రామాల్లో ఉన్న సుమారు 5 వేల మంది గిరిజనుల జీవనాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తుందన్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణం వలన హిరమండలం వంశధార ప్రాజెక్ట్ పరిధిలో ఆధారపడిన వేల మంది రైతులు సాగునీరు అందక పంటపొలాలు బీడు భూములుగా మారిపోయే ప్రమాదముందని హెచ్చరించారు. చుట్టుపక్కల నీరు, గాలి కాలుష్యానికి గురవుతాయన్నారు. ఆదివాసీ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలు షెడ్యూల్ ఏరియాలో కలపాలని డిమాండ్ చేశారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని కోరారు. ఆయనతో పాటు జిల్లా ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఎన్.అప్పన్న, జిల్లా కమిటీ సభ్యులు ఎస్.జైరాం, మండల నాయకులు ఎస్.ప్రసాద్, ఎస్.శంకయ్య తదితరులు ఉన్నారు -
లారీని ఢీకొన్న టాటా మ్యాజిక్
నందిగాం: మండల పరిధిలోని నర్సిపురం సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని టాటా మ్యాజిక్ వ్యాన్ ఢీకొనడంతో వ్యాన్లో ఉన్న తొమ్మిది మంది గాయాలపాలయ్యారు. నందిగాం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఇచ్ఛాపురం మండలం ధర్మపురం గ్రామానికి చెందిన పిట్ట చంద్రశేఖర్తో పాటు మరో 8 మంది టాటా మ్యాజిక్ వ్యాన్లో ఆదివారం ఉదయం ఒడిశా రాష్ట్రంలోని రాయగడలో మజ్జిగౌరి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం తిరిగి గ్రామానికి వస్తుండగా ఆదివారం రాత్రి మండల పరిధిలోని నర్సిపురం సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుకనుంచి ఢీ కొట్టారు. దీంతో వ్యాన్లో ఉన్న 9 మందికి చిన్న, చిన్న గాయాలయ్యాయి. ప్రమాదం విషయం తెలుసుకున్న నేషనల్ హైవే అంబులెన్స్ సిబ్బంది అక్కడకు చేరుకొని క్షతగాత్రులను టెక్కలి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. చంద్రశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగాం ఎస్ఐ షేక్ మహ్మద్ ఆలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యాధుల కాలం... జీవాలు భద్రం..!
సరుబుజ్జిలి: ఇటీవల జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలుచోట్ల వర్షపు నీరు చేరింది. మనుషులు మాదిరిగా పశువులకు కూడా అనేక రకాల అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అందువలన సీజనల్గా వచ్చే వ్యాధులపై పాడి రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. పలు ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పశువులకు వచ్చే సీజనల్ వ్యాధులను పరిశీలిస్తే... చిటుకు వ్యాధి వర్షాకాలంలో గొర్రెలకు చిటుకు వ్యాధి బాక్టీరియా వలన అధికంగా వస్తుంది. దీనివలన ఉన్నటుండి గాలిలో ఎగిరి గొర్రెలు చనిపోతాయి. దీనికోసం ముందుగా నీరసంగా ఉన్న గొర్రెలను మంద నుంచి వేరుచేయాలి. వ్యాధి నివారణకు పెన్సిలిన్ వేయించాలి. వ్యాధిసోకని వాటికి వ్యాక్సిన్ వేయించాలి. నీలి నాలుక నీలి నాలుక గొర్రెలు, మేకల్లో వస్తుంది. ఈ వ్యాధి సోకిన జీవాలకు జ్వరంగా అధికంగా వస్తుంది. నోటి నుంచి చొంగ కారుస్తూ, గిట్టలకు పుండ్లు ఏర్పడతాయి. ఈ వ్యాధి నివారణకు యాంటీ బయాటిక్స్, లివర్ టానిక్ ఉపయోగించి జీవాలను మంద నుంచి వేరు చేయాలి. గొంతువాపు వ్యాధి ఈ వ్యాధి అన్ని వయస్సుల ఆవులు, గేదెల్లో కనిపిస్తుంది. 105 నుంచి 108 డిగ్రీల జ్వరం వస్తుంది. నోటి నుంచి చొంగలు కారుస్తూ.. నోటి నుంచే గాలి పీల్చుకుంటాయి. గొంతవద్ద వాపు వలన మేత తీసుకోలేవు. నివారణకు సల్పాడిమిడిన్ వాడుతూ, 4 నెలలు దాటిన జీవాలకు వ్యాక్సినేషన్ చేయించాలి. గాలికుంటు వ్యాధి ఇది అన్ని జీవాల్లో కనిపిస్తుంది. నోరు, గిట్లలో పుండ్లు ఏర్పడి ఎక్కువగా జ్వరం ఉంటుంది. నివారణకు బోరిక్ గ్లిజరిన్ ఆయింట్మెంట్ను నోటిలో పూత పూయాలి. పీపీ ద్రావణంతో కాలిగిట్ల మధ్య శుభ్రం చేయాలి. ప్రతిఏటా ముందస్తుగా ఏప్రిల్, మే నెలల్లో వ్యాక్సిన్ వేయించాలి. పశుసంవర్ధక శాఖ అధికారులు దిగువ స్థాయిలో సిబ్బందిపై పశువైద్య సేవల బాధ్యతలు పెట్టకుండా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తే సమస్యలు గుర్తించవచ్చు. సీజనల్గా వచ్చే వ్యాధులు గురించి పాడి రైతులకు గ్రామాల్లో అవగాహన కల్పించాలి. సిబ్బంది పనితీరు మెరుగుపరచాలి. – పైడి మోహనరావు, మతలబుపేట, సరుబుజ్జిలి పశువైద్య శాఖ అధికారులు అడపాదడపా పశువైద్య శిబిరాలు పెట్టి తమ బాధ్యత తీరిందన్న చందంగా వ్యవహరిస్తున్నారు. పశువుల పెంపకం, సంక్రమించే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించాలి. లంపిస్కిన్ వ్యాధితో అప్పట్లో చాలావరకు పశు నష్టాలు చవిచూశాం. – చల్ల యర్రయ్య, చిగురువలస, సరుబుజ్జిలి -
అధికారులందరూ హాజరవ్వాలి
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ● పీజీఆర్ఎస్కు 92 వినతులు శ్రీకాకుళం పాతబస్టాండ్: అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు తప్పనిసరిగా ప్రజా సమస్యల నమోదు మరియు పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)కు ప్రతి సోమవారం హాజరవ్వాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పలువురు క్రిందిస్థాయి అధికారులు వస్తూ సమస్యలకు సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారన్నారు. అందువలన ప్రతీశాఖ నుంచి బాధ్యతాయుతమైన, సమాధానం తెలిసిన అధికారి హాజరవ్వాలని స్పష్టం చేశారు. పీజీఆర్ఎస్లో వచ్చిన ఫిర్యాదుల తక్షణ పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. అనంతరం కొన్ని వినతులు స్వీకరించి కలెక్టరేట్ కార్యాలయంలో జరిగే సమావేశానికి వెళ్లారు. ఆయనతో పాటు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. మొత్తం 92 వినతులు స్వీకరించినట్లు అధికారులు తెలియజేశారు. వినతులు పరిశీలిస్తే.. ● సీజేఐ గవాయ్పై దాడికి యత్నించిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రతినిధులు టి.శ్రీనివాస్, ఎల్.తేజేశ్వరరావు, డి.తిరుపతి తదితరులు ఫిర్యాదు చేశారు. ● ఆక్రమణదారుల నుంచి రక్షించి తమ భూములు ఇప్పించాలని ఆమదాలవలస మండలంలోని దూసి గ్రామానికి చెందిన దళితులు కోరారు. కొన్ని సంవత్సరాలుగా ఆక్రమణదారుల కబ్జాకు గురైన డీ–పట్టా భూములను ఇప్పించాలని 17 దళిత కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారుల్లో ఎడ్ల కల్యాణి, బొంతల లత, ఎం.లక్ష్మి, యారబాటి పార్వతి, కలివరపు శ్రీలత, యారబాటి రాములమ్మ, అన్ను లక్ష్మి, బొడ్డేపల్లి లక్ష్మీ భవానీ, బొడ్డేపల్లి లక్ష్మి, మన్యాల రామారావు తదితరులు ఉన్నారు. ●శ్రీకాకుళం నగరంలోని బాదుర్లుపేట దరి వాంబే కాలనీకి చెందిన మెండ రాములు తనకు ప్రభుత్వం నుంచి ఇంటి స్థలం ఇప్పించాలని కోరారు. ● లావేరు మండలంలోని చిన్నయ్యపేట గ్రామానికి చెందిన కలిశెట్టి రాములు తనకు, తన కుటుంబానికి తన కోడలు మరికొంతమంది కలిసి వేధిస్తున్నారు. తన ఆస్తిని, ఇతర వస్తువులను తీసుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. ● తమను డీఎస్సీ ద్వారా నిబంధన మేరకు ఉద్యోగ నియమకాలు చేసినప్పటికీ, సుమారుగా 12 వందల మందిని విధుల నుంచి తొలగించారని, తిరిగి జీవో 12–7 ప్రకారం విధుల్లోకి తీసుకోవాలని హెల్త్ అసిస్టెంట్లు కోరారు. -
నవంబర్ 3 నుంచి మున్సిపల్ కార్మికుల సమ్మె
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): నవంబర్ 3వ తేదీ నుంచి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) అనుబంధ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేపడతామని ఏఐటీయూసీ కౌన్సిల్ సభ్యుడు టి.తిరుపతిరావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కల్యాణి అప్పలరాజు తెలిపారు. కార్మికుల సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ పి.వి.వి.డి.ప్రసాదరావుకు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు పరష్కరించాలని కోరారు. రాష్ట్రంలోని వివిధ మున్సిపల్ కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో గత రెండు సంవత్సరాలుగా చనిపోయిన, రిటైరైన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు తిరిగి ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉపాధి కల్పించాలని కోరారు. 12వ పీఆర్సీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. మధ్యంతర భృతి 30 శాతం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు డి.రమణ, ఆర్.గణేష్, సీతమ్మ, రామచంద్ర, ఢిల్లి తదితరులు పాల్గొన్నారు. -
‘సీబీఐతోనే దర్యాప్తు చేయించాలి’
నరసన్నపేట: కల్తీ మద్యం వ్యవహారంపై ప్రభు త్వం వేసిన సిట్ బృందం దర్యాప్తులో నిజాలు నిగ్గు తేలే పరిస్థితి లేదని, ప్రభుత్వం సీబీఐ తోనే దర్యాప్తు చేయించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మరోసారి డిమాండ్ చేశారు. కల్తీ మద్యం తీరు, కూటమి ప్రభుత్వం వ్యవహారంపై పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, ర్యాలీలు విజయవంతం అయ్యాయన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులు, సామాన్య ప్రజలు అధిక సంఖ్య లో పాల్గొన్నారని ఇప్పటికై నా ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని కోరారు. కల్తీ మద్యం వ్యవహారాన్ని వెనకేసుకు రాకుండా నిందితు లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. మంగళవారం ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం లక్ష్మీపురంలో రచ్చ బండ కార్యక్రమంలో పాల్గొంటానని, కోటి సంతకాలు త్వరిత గతిన పూర్తి చేయాలని కార్యకర్తలను కోరారు. ‘ధాన్యం రవాణా వాహనాలకు జీపీఎస్ తప్పనిసరి’ శ్రీకాకుళం పాతబస్టాండ్: ఖరీఫ్ సీజన్కు సంబంధించిన ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల నుంచి మిల్లులకు తరలించేందుకు కొత్త వాహనాల నమోదు ప్రక్రియ ప్రారంభమైందని, ధా న్యం రవాణా చేసే ప్రతి వాహనానికి కచ్చి తంగా జీపీఎస్ పరికరం అమర్చుకోవాలని జా యింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ స్పష్టం చేశారు. దీనికోసం ఆసక్తి ఉన్న వాహనదారులు ముందుగా రూ.3,068లు, (జీఎస్టీతో కలిపి) చెల్లించి, జీపీఎస్ అమర్చుకోవాలని ఆ తర్వాతే జిల్లాలోని ఆయా మండలాల్లో ఉన్న రైతు సేవా కేంద్రాల వద్ద తమ వాహన వివరాలను నమో దు చేసుకోవాలని సూచించారు. జీపీఎస్ లేకుండా రిజిస్ట్రేషన్ సాధ్యం కాదని తేల్చి చెప్పారు. రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకున్న వాహనాలకు మాత్రమే రవాణా ఖర్చులను ప్రభుత్వ నిబంధనల మేరకు చెల్లిస్తుందని, రవాణా కాంట్రాక్టు ఆశించే వాహనదారులు ఆలస్యం చేయకుండా, వెంటనే జీపీఎస్ అమర్చుకొని, ఆయా రైతు సేవ కేంద్రాలకు వెళ్లి వాహనాల వివరాలను తక్షణమే నమోదు చేసుకోవాలని జేసీ కోరారు. కళింగపట్నం పీహెచ్సీ ఆకస్మిక తనిఖీ గార: కళింగపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రా న్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్గౌర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాకు వచ్చిన ఆయన సోమవారం సాయంత్రం పీహెచ్సీకి వచ్చి స్టాఫ్ నర్సు డి.శాంతామణి నుంచి వివరాలు సేకరించారు. వైద్యులు సమ్మె చేయటం వల్ల ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోర్టు కళింగపట్నంకు చెందిన కెప్టెన్ మైలపిల్లి జనార్ధన్ మాట్లాడుతూ తీర ప్రాంతంలోని మత్స్యకారులకు ఆరోగ్య ఉపకేంద్రాల్లో 24 గంటలు వైద్య సేవలందేలా చూడాలని కోరారు. చేతికొచ్చిన 1010 రకం ధాన్యం సారవకోట: మండలంలోని వెంకటాపురం, గొర్రిబంద, అడ్డపనస, అంగూరు, వడ్డినవలస తదితర గ్రామాల్లో సాగు చేసిన 1010 రకం ధాన్యం పంట చేతికొచ్చింది. సుమారు 100 ఎకరాల్లో మండలంలో ఈ రకం వరి సాగు చేయగా ప్రస్తుతం కోత యంత్రాలతో కోతలు చేపట్టి పచ్చి ధాన్యంను వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేసి లారీలలో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ‘పక్కా ప్రణాళికతో ధాన్యం కొనుగోలు’ శ్రీకాకుళం పాతబస్టాండ్: రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగా పక్కా ప్రణాళికతో ధాన్యం సేకరణ ప్రక్రియను సమర్థంగా చేపట్టాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉన్నతాధికారులు, పౌరసరఫరాల శాఖ మంత్రి ఇచ్చిన సూచనలను వివరించారు. -
● ఆంక్షల నడుమ..
ధర్మాన రామ్ మనోహార్ నాయుడు ఆధ్వర్యంలో సూర్య మహల్ జంక్షన్ నుంచి ఎకై ్సజ్ సీఐ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని, ఎక్కడిడక్కడ కార్యకర్తలను, మహిళలను నిలువరించారు. అయినప్పటికీ ముందుకు సాగి సీఐకి వినతి పత్రం అందజేశారు. అంతకు ముందు ప్లకార్డులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వెలమ విభాగం అధ్యక్షుడు అంబటి శ్రీనివాసరావు, తూర్పు కాపు రాష్ట్ర విభాగం అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్, రాష్ట్ర మహిళా కార్యదర్శి కామేశ్వరి, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు చల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
రైతు ఖాతాకు ఐదారు గంటల్లోనే ధాన్యం సొమ్ము
● మంత్రి నాదెండ్ల మనోహర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో కాకుండా, కేవలం ఐదు నుంచి ఆరు గంటల్లోనే వారి ఖాతాల్లో సొమ్ము జమ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో రైస్ మిల్లర్స్, వివిధ రైతు సంఘాలు, అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. తేమ శాతం పరీక్షల్లో ఏకరూపత కోసం రైతు సేవా కేంద్రాలు, రైస్ మిల్లుల వద్ద ఒకే కంపెనీకి చెందిన యంత్రాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాలలో గతంలో 11.45 లక్షల టన్నులు కొనుగోలు చేయగా, ఈసారి లక్ష్యాన్ని 13 లక్షల టన్నులకు పెంచినట్లు తెలిపారు. రైతులు నమ్మకం ఉన్న చోట ధాన్యం విక్రయించే వెసులుబాటు తీసుకువచ్చిందన్నారు. అలాగే నూరు శా తం సబ్సిడీతో రైతులకు టార్పాలిన్లను అందిస్తామని, శ్రీకాకుళంలో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపా రు. ఉత్తరాంధ్రలో వారం రోజుల్లోపే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారు. సమావేశంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్, చైర్మన్, ఎండీ మనజీర్ జిలానీ సమూన్, డైరెక్టర్ గోవిందరావు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆర్.బెలగాం యువకుడి ప్రతిభ
కవిటి: ఆర్థిక రాజధాని ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్లో భారత్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ క్వెస్ట్–2025లో కవిటి మండలం ఆర్.బెలగాం గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ రత్నాల సుమిత్కుమార్ సత్తాచాటాడు. దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఈ పోటీలో బ్యాంక్ లావాదేవీలు, పేమెంట్ డేటా, రియల్ టైమ్ ఫ్రాడ్ డిటెక్షన్ తదితర సమస్యల పరిష్కారంపై ఆన్లైన్ టెస్ట్, కోడ్ అండ్ డేటా సైన్స్ చాలెంజ్, అడ్వాన్స్డ్ ఏఐ వర్క్ షాప్ తదితర విభాగాల్లో సుమిత్కుమార్ ప్రథమ స్థానంలో నిలిచాడు. ఈ సందర్భంగా మహరాష్ట్ర సీఎం చేతుల మీదుగా రూ.5 లక్షల నగదు, అవార్డు శనివారం అందుకున్నారు. రత్నాల కామేశ్వరరావు, ప్రమీల దంపతుల కుమారుడు సుమిత్కుమార్ ప్రస్తుతం హైదరాబాద్లోని కేఎంఐటీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. యువకుడి విజయం పట్ల కవిటి మండల సొండికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పాండవ రామారావు హర్షం వ్యక్తం చేశారు. -
కాసులు కురిపిస్తున్న పీచు
● టన్ను పీచు ధర రూ.10 వేలు నుంచి రూ.20 వేలు ● ఉద్దానం నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతులు ● కొబ్బరి పీచు, తాళ్లకు డిమాండ్ వజ్రపుకొత్తూరు: కోనసీమ తర్వాత కొబ్బరి చెట్లకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే ఉద్దానంలో ఉత్పత్తి అవుతున్న కొబ్బరిపీచుకు మంచి గిరాకీ ఉంటోంది. ఇక్కడి పరిశ్రమల్లో తయారైన పీచు, తాడు ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు భారీ ఎత్తున ఎగుమతి అవుతోంది. పొరుగునే ఉన్న విజయనగరంతో పాటు హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు వంటి రాష్ట్రాలకు పీచు, తాడు ఉత్పత్తులు పంపిస్తున్నారు. జిల్లాలో అటు రణస్థలం నుంచి ఇటు ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, వజ్రపుకొత్తూరు, మందస, సంతబొమ్మాళి, పలాస తదితర 29 మండలాల్లో 15 వరకు పీచు పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడ రోజుకు 120 టన్నుల వరకు పీచు ఉత్పత్తి జరుగుతోంది. తయారీ ఇలా.. జిల్లాలో 32,602 ఎకరాల్లో కొబ్బరి సాగు చేస్తుండగా నెలకు సరాసరి 32,60,000 కాయలు దిగుబడి వస్తున్నాయి. కొబ్బరికాయల డొక్కలు 30 శాతం వృథాగా పోతుండగా.. పరిశ్రమ నిర్వహకులు అవసరమైన డొక్కలను రైతుల నుంచి కొనుగోలు చేసి లారీలతో తరలిస్తున్నారు. వీటిని పరిశ్రమల్లో పెద్ద లాట్లుగా కట్టి పది, పదిహేను రోజులు నీటితో తడుపుతారు. అనంతరం డీసెండికేటర్లో కొబ్బరి డొక్కలు వేస్తే పీచులా మారుతుంది. దానిని ఎండబెట్టి ఎగుమతులకు సిద్ధం చేస్తారు. కర్లింగ్ పీచు కొనుగోలు చేసుకుని కర్లింగ్ మెషీన్ల ద్వారా రెండు రకాల తాడును తయారు చేస్తారు. ప్రస్తుతం పీచు ధర టన్ను రూ.10వేలు ఉంది. కర్లింగ్ పీచుకు రూ.20 వేలు ధర లబిస్తోంది. 2014 వరకు కొబ్బరి పీచును చైనాకు అధికంగా ఎగుమతి జరిగేది. ఐతే పరుపుల తయారీకి ఫోం అందుబాటులోకి రావడంతో పీచుకు డిమాండ్ తగ్గింది. దేశీయంగా మాత్రం వినియోగం పెరిగింది. వినాయకుడు, దేవీ విగ్రహాల తయారీలో దేశ వ్యాప్తంగా కొబ్బరి పీచునే వినియోగిస్తుండటంతో గిరాకీ పెరుగుతోంది. బోట్లు, ఇటుకలు తయారీకిలోనూ.. ప్రధానంగా బోట్లు తయారీలో కొబ్బరి పీచు వినియోగిస్తున్నారు. ప్లాస్టిక్, కొబ్బరి పీచును వినియోగించి బోట్లు రూపొందిస్తారు. విశాఖ, కాకినాడ, చైన్నె, ముంబై, కోల్కత్తా, కేరళ తదితర ప్రాంతాల్లో చేపల బోట్లతో పాటు రవాణా, టూరిజం బోట్ల తయారీలో కొబ్బరి పీచు వినియోగిస్తారు. పీచు తయారీలో పొట్టు కూడా వస్తుంది. దీనిని కంపోస్టు, ఇటుకల తయారీలో వినియోగిస్తున్నారు. ఫాక్టరీల వద్దే నేరుగా కంపోస్టు ఎరువు తయారు చేసి నర్సరీలకు ఎగుమతి చేస్తున్నారు. కంపోస్టు ఎరువు టన్ను రూ.5వేలు ధర పలుకుతోంది. ఇటుకల బట్టీల్లోనూ పొట్టు వినియోగిస్తున్నారు. దీని వల్ల ఇటుక తేలికగా ఉంటోంది. ఈ ఇటుక అపార్టుమెంట్ల నిర్మాణంలో బాగా ఉపయోగపడుతోంది. ట్రాక్టర్ లోడుకు రూ.7వేలు ధర లభిస్తోంది. ఉద్దానం ప్రాంతంలో పెద్ద ఎత్తున కొబ్బరి డొక్కలు ఉత్పత్తి అవుతున్నా అందుకు తగ్గస్థాయిలో పరిశ్రమలు లేవు. ఔత్సాహికులు ముందుకు వచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేస్తే కాయిర్ బోర్డు ద్వారా 35 శాతం సబ్సిడీతో రుణాలు పొందే అవకాశం ఉంది. నిరుద్యోగ యువత ఈ పరిశ్రమలపై దృష్టి సారించాలి. ఇచ్చాపురం కొబ్బరి పొట్టుతో ఇటుకలు తయారు చేసే పరిశ్రమ సైతం ఉంది. మంచి లాభాలు సైతం ఆర్జిస్తున్నారు. కాయిర్ బోర్డు, మా సహకారం తీసుకుని ముందుగా దీనిపై అవగాహన పెంచుకుని నాబార్డు, ఇతర సంస్థలు ద్వారా రుణాలు పొంది పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాలి. – సీహెచ్.శంకర్దాసు, ఉద్యానవన శాఖ అధికారి , పలాసఇటీవలే పీచు పరిశ్రమ ప్రారంభించాను. కర్లింగ్ పీచుకు డిమాండ్ ఉంది. అయితే మార్కెట్పై పూర్తి స్థాయిలో అవగాహన లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాయిర్ బోర్డుపీచు పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి మార్కెట్ సౌకర్యం మార్గాలను చూపించాలి. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రుణాలు ఇవ్వాలి. – కె.దేవదాసు, పీచు పరిశ్రమ నిర్వాహకుడు, పెద్దమురహరిపురం -
డిజిటల్ మారథాన్కు రెడీ
● ‘ఆంధ్రా యువ అంబాసిడర్’ ఎంపికలకు పోటీలు ● షార్ట్వీడియోలకు ఆహ్వానం ● విజేతలకు భారీగా నగదు బహుమతులు శ్రీకాకుళం న్యూకాలనీ : వికసిత్ భారత్ – 2047 లక్ష్యాలను సాధించేలా యువతను ఆకర్షించేందుకు యువజన సర్వీసుల శాఖ నడుంబిగించింది. దీనిలో భాగంగా సామాజిక, కుటుంబ సంబంధాలతోపాటు ఆరోగ్యకరమైన జీవన వైవిధ్యాన్ని తెలియజేస్తూ డిజిటల్ ఆవిష్కరణల విలువలను ప్రోత్సహించి ప్రజలను మేల్కొలిపేలా షార్ట్వీడియోను తయారుచేసేందుకు యువతకు అవకాశం కల్పించారు. ఇందులో విజేతలకు ఆంధ్ర యువత అంబాసిడర్గా ప్రకటించడంతో పాటు భారీగా నగదు ప్రోత్సాహకాలను అందజేయనున్నారు. ఈ మేరకు ‘ఆంధ్ర యువ సంకల్ప్ 2కే25 (ఆంధ్ర యువ 2కే25 అంబాసిడర్)’ డిజిటల్ మారథాన్లో యువత భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిస్తున్నారు. ఎలా పాల్గొనాలంటే.. ● ఆంధ్ర యువ అంబాసిడర్ పోటీల్లో పాల్గొనేందుకు 18 నుంచి 35 ఏళ్ల యువతీ యువకులు అర్హులు. ● ‘ఆంధ్రాయువసంకల్ప్.కామ్’ వెబ్సైట్లో రిజిస్టర్ చేరుకోవాలి. ఇందుకు ఈ నెల 15తో గడువు ముగియనుంది. ● పోటీల్లో పాల్గొనేవారు 120 సెకన్ల నిడివిగల వీడియో/షార్ట్ను తయారుచేసి, నిర్దేశిత అధికారిక హ్యాష్ట్యాగ్లతో వారి సొంత సోషల్ మీడియా ఖాతాలలో (ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్, యూట్యూబ్ షార్ట్స్ మొదలైనవి) పోస్ట్ చేయాలి. ● జ్యూరీ కమిటీ తమకు వచ్చిన ఎంట్రీలను సమీక్షించి విజేతలను ప్రకటిస్తుంది. అంబాసిడర్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచినవారికి రూ.1,00,000, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి రూ.75,000, తృతీయ స్థానంలో నిలిచినవారికి రూ.50,000 నగదు బహుమతులు అందజేస్తారు. మొదటి తొమ్మిది మంది విజేతలకు ‘ఆంధ్ర యువ సంకల్ప్ 2కే25 అంబాసిడర్‘గా గౌరవ సత్కారం అందజేస్తారు. పోటీలలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికీ డిజిటల్ క్రియేటర్ ఏపీ 2కే25 పేరిట సర్టిఫికెట్ ప్రదానం చేస్తారు. యువత తమలో ఉండే సృజనాత్మకతను నిరూపించుకునేందుకు చక్కటి అవకాశం. వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా వివిధ అంశాల్లో ప్రజలను మేల్కొలిపేలా వీడియోను సోషల్మీడియాలో అప్లోడ్ చేయాలి. రిజిస్ట్రేసన్ చేసుకున్నవారి వీడియోలను జ్యూరీ కమిటీ పరిశీలించి ఎంపికచేస్తుంది. – వావిలపల్లి వెంకటప్పలనాయుడు, సెట్శ్రీ సీఈఓ జిల్లా యువత అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. టాలెంట్ నిరూపించుకునేందుకు ఇదొక చక్కటి అవకాశం. డిజిటల్ మారథాన్లో పాల్గొని ప్రతిభ చాటుకోవాలి. అత్యధిక మంది భాగస్వాములై శ్రీకాకుళం జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలి. – కె.వెంకట్ ఉజ్వల్, మేరాభారత్ డిప్యూటీ డైరెక్టర్ -
వైఎస్సార్ సీపీ పాలనలోనే కళింగవైశ్యులకు గుర్తింపు
● చంద్రబాబువి ఓటుబ్యాంకు రాజకీయాలు: కరిమి రాజేశ్వరరావు ● గత ప్రభుత్వంలోనే ప్రశాంతంగా వ్యాపారాలు: అంధవరపు సూరిబాబు శ్రీకాకుళం (పీఎన్కాలనీ): సీఎం చంద్రబాబు కళింగవైశ్యుల్ని ఓటుబ్యాంకుగానే వాడుకుంటున్నారు తప్ప కళింగవైశ్య కులంలో ఏ ఒక్కరికి చెప్పుకోదగ్గ పదవిని ఇచ్చిన సందర్భాలు లేవని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, శ్రీకాకుళం, ఆమదాలవలస నియోజకవర్గాల పరిశీలకుడు, డీసీసీబీ మాజీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఓ కల్యాణ మండపంలో కళింగవైశ్య కుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంధవరపు సూరిబాబు ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్ర కళింగ వైశ్య వైఎస్సార్సీపీ బీసీ విభాగం సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాజేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కళింగవైశ్యులకు జిల్లా నుంచి సుడా చైర్మన్, కళింగవైశ్యకుల కార్పొరేషన్ చైర్మన్, 10 మంది డైరెక్టర్లు, ఏఎంసీ చైర్మన్, ఎంపీటీసీ వంటి అనేక పదవులిచ్చి తగిన గుర్తింపునిచ్చారన్నారు. గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్రలో నిలిచిపోయేలా జిల్లాలో పలు అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు. కళింగ వైశ్యులంతా వైఎస్సార్సీపీ వెంటే ఉంటారని, మోసకారి టీడీపీని పక్కనపెట్టాలని పిలుపునిచ్చారు. – వైఎస్సార్ సీపీ కళింగ వైశ్య కుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంధవరపు సూరిబాబు మాట్లాడుతూ కళింగవైశ్యులంతా ఏకతాటిపైకి వచ్చి వైఎస్సార్సీపీ గెలుపునకు సైనికుల్లా పనిచేద్దామన్నారు. దివంగత రాజశేఖరరెడ్డి, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిలతోనే కళింగవైశ్యులకు తగిన గుర్తింపు లభించిందన్నారు. 56 కార్పొరేషన్లు ఏర్పాటుచేసి చైర్మన్ పదవులిచ్చి బీసీలకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. పేదలకు నాణ్యమైన వైద్యవిద్య నందించాలన్న ఆలోచనలతో జగన్మోహన్రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలకు నిర్ణయించి 5 కాలేజీలు ప్రారంభిస్తే మిగిలిన వాటిని చంద్రబాబునాయుడు ప్రయివేటువ్యక్తులకు అప్పగించడం సరికాదన్నారు. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో ఏ ఒక్క వ్యాపారికీ ఇబ్బందులు కలగలేదన్నారు. ప్రజలందరి వద్ద డబ్బులు ఉండటంతో వ్యాపారాలు సక్రమంగా జరిగేవన్నారు. ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. కళింగవైశ్యులంతా చాలా శక్తివంతులని, ప్రతి ఒక్కరు బాగా పనిచేసి భవిష్యత్లో వైఎస్సార్సీపీ గెలుపులో కీలకపాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. పార్టీకోసం పనిచేసే ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. – వైఎస్సార్సీపీ కళింగవైశ్య కుల ఉత్తరాంధ్ర నాయకులు సకలాభక్తుల ప్రసాదరావు, తంగుడు నాగేశ్వరరావు, పి.వి.మల్లా గుప్తా, ఎరుకోల వెంకటరావు, తండుగు జోగారావు, యుగంధర్, తాళాసు సాయిమోహన్, కొంచాడ రాజాశ్రీకాంత్, గుడ్ల శ్రీనివాసరావు, కింతలి తిరుమలకుమార్, పొట్నూరు సాయిప్రసాద్, పి.వి.సతీష్, సూరు సాయిరాం, అంధవరపు బాలకృష్ణలు మాట్లాడుతూ ఒక్కో కళింగవైశ్యుడు వంద మంది ఓటర్లని తయారు చేయగలిగేలా సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కాళింగ కుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దుంపల లక్ష్మణరావు, వెలమ కుల రాష్ట్ర అధ్యక్షుడు అంబటి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ గ్రీవెన్స్సెల్ జిల్లా అధ్యక్షుడు రౌతు శంకరరావు, కళింగవైశ్యకుల నాయకులు అంధవరపు రమేష్, బరాటం సంతోష్, వడ్డి ఉదయ్, గుడ్ల దామోదరరావు, ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. -
కనపడవా?
మా కష్టాలు.. హిరమండలం: కల్లట పంచాయతీ పరిధిలోని జిల్లోడిపేట, కల్లట గ్రామాల మధ్య మహేంద్రతనయ నదిపై పడవ ప్రయాణాలు ప్రమాదకరంగా సాగుతున్నాయి. జిల్లోడిపేట గ్రామస్తులు పనులపై ఎక్కడికి రాకపోకలు సాగించాలన్నా నాటుపడవపై నది దాటాల్సిందే. మండలకేంద్రానికి వెళ్లాలన్నా, బడికి వెళ్లాలన్నా రోజూవారీ పడవ ప్రయాణం తప్పదు. ప్రస్తుతం గ్రామంలో పదుల సంఖ్యలో విద్యార్థులు 6 నుంచి ఇంటర్ వరకూ చదువుతున్నారు. వీరంతా పడవలోనే అవలంగి, హిరమండలం, పాతపట్నం వెళ్తుంటారు. వంతెన లేకపోవడంతో ప్రమాదకర పరిస్థతుల్లో పడవపై ప్రయాణించి గమ్యస్థానాలకు చేరుతుంటారు. వంతెనకేదీ మార్గం? ఇక్కడ వంతెన నిర్మించాలని దశాబ్దాలుగా జిల్లోడిపేట గ్రామస్తులు పోరాడుతున్నా కార్యరూపం దాల్చడం లేదు. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి శత్రుచర్ల విజయరామరాజు వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అది ఎన్నికల స్టంట్గా మిగిలిపోయింది. అటు తరువాత 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం కూడా మరోసారి వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి హడావుడి చేసింది. తర్వాత పనులు చేయకుండా చేతులెత్తేసింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. ఇంతలో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. గత అనుభవాల దృష్ట్యా , ముందున్న ప్రభుత్వ చర్యలు పుణ్యమా అని కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో నిధులు మంజూరు చేసినా ఫలితం లేకపోయింది. తాము అధికారంలోకి వస్తే జిల్లేడుపేట వద్ద వంతెన నిర్మాణం చేపడతామని స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రమాదకర స్థితిలో మహేంద్రతనయా నదిని దాటుతున్నాం. నదిలో నీటి ఉధృతి అధికంగా ఉండే సమయంలో ఇబ్బందులు తప్పడం లేదు. ఆ సమయంలో గ్రామానికే పరిమితం కావాల్సి ఉంటోంది. – రావాడ అమ్మన్న, జిల్లోడిపేట వర్షాకాలంలో మా అవస్థలు వర్ణించలేనివి. ఒక్కోసారి మూడు నెలలకోసారి రేషన్ తీసుకోవాల్సిన పరిస్థితులు దాపురిస్తాయి. ఇప్పటికై నా పాలకులు స్పందించి వంతెన నిర్మాణం పూర్తిచేయాలి. – కొర్ను ధనుంజయరావు, జిల్లోడిపేట -
ట్రిపుల్ ఐటీలో ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభం
ఎచ్చెర్ల : విద్యార్థుల్లో సృజన్మాతకత, ఆవిష్కరణ, సాంకేతిక ప్రతిభను పెంపొందించేందుకు స్థానిక రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ అండ్ ఇన్కుబేషన్ సెంటర్ను ఆదివారం ప్రారంభించారు.ఆప్షన్మేట్ రీసెర్చ్ అండ్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భాగస్వామ్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో డైరెక్టర్ ప్రొఫెసర్ కె.వి.జి.డి.బాలాజీ, ఆప్షన్మేట్ మేనేజింగ్ డైరెక్టర్ పి.శశికుమార్, పరిపాలనాధికారి డాక్టర్ మునిరామకృష్ణ, ఫైనాన్స్ అధికారి సీహెచ్ వాసు, డీన్ ఆఫ్ స్టూడెంట్ వెల్ఫేర్ గేదెల రవి, అసోసియేషన్ డీన్ కె.రమణ, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి సి.ప్రకాశ్, ఎంట్రప్రెన్యూర్షిప్ అండ్ ఇంక్యూబేషన్ ఎస్.సతీష్ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేడు పొందూరులో విద్యుత్ అదాలత్ అరసవల్లి: ఎచ్చెర్ల సబ్ డివిజన్ పరిధిలోని పొందూరు విద్యుత్ ఏఈ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి విద్యుత్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సబ్ డివిజన్ డిప్యూటీ ఈఈ ఎస్.శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను ప్రస్తావించి పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. -
అత్తమామలపై జనసేన నేత దాడి
ఇచ్ఛాపురం: పిల్లనిచ్చిన అత్తమామలపై దాడికి పాల్పడిన జనసేన నేతపై కేసు నమోదైంది. ఇచ్ఛాపురం నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ దాసరి రాజుకు పట్టణంలోని అప్పన్నపేటకు చెందిన మోహినితో 2018లో వివాహమైంది. రూ.5 లక్షల కట్నమిచ్చి పెద్దల సమక్షంలో వివాహం జరిపించారు. 2023లో మోహినిని రాజు అదనపు కట్నంతో పాటు ఆమె తల్లిదండ్రుల ఆస్తిలో వాటా తీసుకురావాలని మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టా డు. వాటిని తీసుకొచ్చేవరకు ఇంటికి రావద్దని ఇద్దరు ఆడపిల్లలతోపాటు భార్యను పుట్టింటికి పంపించేశాడు. ఈ క్రమంలో తనకు భార్య నుంచి విడాకులు కావాలని కోరుతూ ఈ ఏడా ది సోంపేట కోర్టులో రాజు కేసు వేశాడు. ఇది విచారణలో ఉండగా రాజు, అతని అన్నయ్య కుమారుడు దీపక్, అతని చెల్లి రోజా, తల్లి ఆదిలక్ష్మితో కలిసి శనివారం తన ఇంటికి వచ్చి తన తల్లిదండ్రులు కాళ్ల అప్పారావు, రవణమ్మతో వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడి, తనను కొట్టాడని పోలీసులకు మోహిని ఫిర్యాదు చేశారు. దీంతో ఇచ్ఛాపురం పోలీస్స్టేషన్లో దాసరి రాజు తదితరులపై కేసు నమోదైంది. అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం విశేష పూజలు, అర్చ నలు జరిగాయి. ప్రత్యేకంగా ఆదివారం ఉద యం 6 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనాలకు అనుమతి ఇవ్వడంతో ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆదిత్యుడిని దర్శించుకున్నారు. అనంతరం ఆరోగ్యం కోసం మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ ఆధ్వర్యంలో భక్తులకు మంచినీరు, ఉచిత ప్రసాదాలు పంపిణీ చేశారు.13 నుంచి ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్‘ ఉత్సవాలు శ్రీకాకుళం (పీఎన్కాలనీ): జీఎస్టీ 2.0 విజయోత్సవాలను పురస్కరించుకుని ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్’ పేరుతో నెల రోజు ల ఉత్సవాలను జిల్లాలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశా రు. ఇందులో భాగంగా అక్టోబర్ 13 నుంచి 19 వరకు ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్స్, ఏడు రోడ్ల జంక్షన్ వద్ద ప్రత్యేక ప్రదర్శనలు జరగనున్నట్లు తెలిపారు. ప్రజలకు జీఎస్టీ వల్ల కలిగిన సేవింగ్స్ను చూపించడానికి ప్రతి స్టాల్లో ప్రీ జీఎస్టీ ధర, పోస్ట్ జీఎస్టీ ధర, సేవింగ్స్ శాతం వివరాలు చూపించనున్నారు. ఆటోమొబైల్స్ స్టాళ్ల ఏర్పాటుకు రవాణా శాఖ, ఎలక్ట్రానిక్స్, కిచెన్ వస్తువులు, మొబైల్ ఫోన్ల స్టాళ్లకు కమర్షియల్ టాక్స్ విభాగం, మున్సిపల్ కమి షనర్, ‘ఒక జిల్లా ఒక ఉత్పత్తి’ కింద ఏపీసీఓ, లేపాక్షి సంస్థలు, పొందూరు చేనేత, ఇత్తడి, హస్త కళల వస్తువులు ప్రదర్శించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పర్యటన నేడు శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో పౌర సరఫరాల శాఖపై ప్రాంతీయ సమావేశం సోమ వారం ఉంటుందని పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ వేణుగోపాల్ ఆదివారం వెల్లడించారు. ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఏఎస్ఆర్, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు వివరించారు. సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్, మేనేజింగ్ డైరెక్టర్ పాల్గొంటారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సాయంత్రం 3 గంటలకు మిల్లర్స్ అసోసియేషన్, ధాన్యం సేకరణ సంస్థలు, రైతు సంఘాలతో సమావేశాల్లో మంత్రి పాల్గొంటారని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు పొందూరు: లోలుగు గ్రామానికి సమీపంలో ద్విచక్రవాహనం, ఆటో ఢీకొన్న సంఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న లోలుగు గ్రామానికి చెందిన లోలుగు హరికృష్ణ, చోల్ల ప్రసాద్తో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం అలజంగి గ్రామానికి చెందిన ఎం.జగన్మోహనరావులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపారు. -
పగలు డంప్.. రాత్రి జంప్!
● దర్జాగా కూటమి నేత ఇసుక దందా ● నది పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ డంప్ ● అధికారులు తనిఖీ చేసినా ఫలితం శూన్యం ఇచ్ఛాపురం రూరల్: బాహుదా నది పరివాహక గ్రామాల్లో ఇసుక అక్రమ దందా దర్జాగా సాగుతోంది. రాత్రికి రాత్రి ట్రాక్టర్లలో ఊరు దాటించి విక్రయిస్తున్నారు. అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో ఇసుకాసురుల దందాకు అడ్డే లేకుండా పోతుంది. మశాఖపురం గ్రా మానికి చెందిన ఓ కూటమి నాయకుడు వారం రోజుల పాటు సుమారు నాలుగు వందల ట్రాక్టర్ల లోడుల ఇసుకను బాహుదా నది నుంచి డంప్ చేసి నదీ పరివాహక ప్రాంతంలో భద్రపరిచాడు. ఒక్కో ట్రాక్టర్ లోడును రూ.1500 నుంచి రూ.2వేల వరకు అమ్మకానికి బేరం కుదిర్చారు. ఈ విషయమై గ్రామస్తులు తహసీల్దార్కు ఫిర్యాదు చేయడంలో శనివారం మండల రెవెన్యూ అధికారి చిరంజీవి సాహు, వీఆర్వో పటాన తారకేశులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇసుక రీచ్ను పరిశీలించి కూటమి నాయకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజిలెన్స్ అధికారులు సోమవారం వస్తారని, అ ప్పటి వరకు ఇసుక రీచ్లను ముట్టుకోవద్దని ఆ దేశాలు జారీ చేశారు. కానీ కూటమి నాయకుడు దౌర్జన్యంగా ఆదివారం సాయంత్రం నుంచి ట్రా క్టర్ల ద్వారా ఇసుకను రహస్య ప్రాంతానికి తరలించడంతో గ్రామస్తులు మరోమారు తహసీల్దార్ కా ర్యాలయానికి ఫోన్ ద్వారా సమాచారం అందించినప్పటికీ ఫలితం కనిపించలేదు. అధికారులకు సమాచారం అందించాం స్థానికుల ఫిర్యాదు మేరకు మశాఖపురం గ్రామంలో అనధికారికంగా సుమారు 400 ట్రాక్టర్ల లోడుల అక్రమ ఇసుక ఉన్నట్లు స్వయంగా గుర్తించాం. ఇప్పటికే సంబంధిత విజిలెన్స్ మైన్స్ అధికారులకు సమాచారం అందించాం. ఇసుక రీచ్లను ముట్టుకోవద్దని సంబంధిత వ్యక్తికి హెచ్చరించాం. ఇసుకను తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – చిరంజీవి సాహు, మండల రెవెన్యూ అధికారి, ఇచ్ఛాపురం -
మద్యం దుకాణాల్లో ఎకై ్సజ్ తనిఖీలు
శ్రీకాకుళం క్రైమ్ : శ్రీకాకుళం ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో 34 మద్యం దుకాణాలను ఆదివారం అధికారులు తనిఖీ చేశారు. దుకాణాల్లో కొన్ని మద్యం బ్రాండ్లను స్పాట్ కెమికల్ టెస్టు నిర్వహించి వాటిని ఎనాలసిస్ చేసేందుకు విశాఖపట్నం ల్యాబ్నకు తరలించారు. ఈ మేరకు సీఐ ఎం.వి.గోపాలకృష్ణ వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది జనవరి నుంచి 367 శాంపిల్స్ ల్యాబరేటరీకి పంపి వాటి నివేదికలను తెప్పించామని, వాటి ఆధారంగా ఏపీఎస్బీసీఎల్ నుంచి సరఫరా అవుతున్న మద్యం పూర్తి నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉన్నట్లుగా నిర్ధారణ అయ్యిందన్నారు. మద్యం అమ్మకాల్లో ఎలాంటి తప్పిదాలు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నౌకరీనామాదారులను హెచ్చరించామన్నారు. అక్రమ మద్యం విక్రయాల గురించి సమాచారం తెలిస్తే 14405కి ఫిర్యాదు చేయాలన్నారు. -
మేఘ సందేశం.. మృత్యు సంకేతం
● జనాలను బలికొంటున్న పిడుగులు ● జాగ్రత్తలు పాటిస్తే మేలంటున్న నిపుణులు సరుబుజ్జిలి: వర్షాలు తగ్గి చలి పెరిగే కాలం వచ్చేసినా.. జిల్లాకు తుఫాన్లు, పిడుగుల భయం వీడడం లేదు. వర్షాల సమయంలో ఇదివరకు ఎన్నడూ లేనంతగా పిడుగులు పడుతున్నాయి. పొలం పనులకు వెళ్తున్న వారు, పశువులను మేతకు తీసుకెళ్తున్న వారు దీని వల్ల ప్రమాదాల బారిన పడుతున్నారు. విలువైన పశు సంపదను కూడా నష్టపోతున్నారు. సరుబుజ్జిలి పాలవలస గ్రామానికి చెందిన గొర్రెల కాపరి దాసరి అప్పన్న చిగురువలస సమీపంలో పిడుగుపాటుకు మృతిచెందాడు. గతంలో బూర్జ మండలం లక్కుపురం పంచాయితీ పణుకుపర్త గ్రామానికి చెందిన 8వ తరగతి చదువుకున్న బాలిక కొండ్రోతు మేఘన పిడుగుకు బలైపోయింది. అదే గ్రామానికి చెందిన మహిళలు మక్క కళ్యాణి, అడపా సుగుణ అస్వస్థతతకు గురయ్యారు. కాసిన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ వైపరీత్యం నుంచి బయటపడగలమని నిపుణులు సూచిస్తున్నారు. సూచనలివే.. వర్షం కురిసేటపుడు చెట్ల కింద చేరకూడదు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వచ్చినప్పుడు పొలం పనులు చేయకపోవడం ఉత్తమం. మెరుపు కనిపించిన తర్వాత 30 సెకన్లలో లేదా అంతకన్న తక్కువ సమయంలో ఉరుము వినిపిస్తే మనకు 10 కిలోమీటర్ల దూరంలోపు పిడుగుపడే అవకాశం ఉంటుంది. మెరుపు కనపడిన తర్వాత 30 నిమిషాల పాటు బయటకు వెళ్లే ప్రయత్నం చేయరాదు. గొడుగులపై లోహపు బోల్టులు, చేతుల్లో సెల్ఫోన్లు లేకుండా చూసుకోవాలి. సెల్ఫోన్ ఉంటే స్విచ్ఛాఫ్ చేయాలి. వర్షం పడే సమయంలో విద్యుత్ తీగల కింద, ట్రాన్స్ఫార్మర్ సమీపంలో ఉండకూడదు. ఆ సమయంలో చెప్పులు లేకుండా బయటకు వెళ్లరాదు. ప్రథమ చికిత్స చేయాలి పిడుగుపాటుకు గురైన వ్యక్తిని వెంటనే పొడి ప్రదేశంలో పడుకోబెట్టాలి. తడిబట్టలు తీసివేయాలి. తలను ఒక పక్కకు తిప్పాలి. రెండు కాళ్లను ఒక అడుగుపైకి ఎత్తాలి. గాలి తగిలే ప్రదేశంలో ఉంచి అవసరమైతే నోటి ద్వారా గాలి ఊది ప్రథమచికిత్స చేయాలి. సకాలంలో ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించాలి. – యండ భవ్యశ్రీ, వైద్యాధికారి, సరుబుజ్జిలి -
చందా.. దందా!
రణస్థలం: దసరా చందా పేరుతో రణస్థలం ఎకై ్సజ్ శాఖలో జరిగిన వసూళ్ల పర్వంపై సర్వత్రా తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఈ వసూళ్లు లావేరు, రణస్థలం మండలాల్లోని మందుబాబుల నోళ్లలో టాక్ ఆఫ్ ది ఎకై ్సజ్ శాఖలా మార్మోగుతున్నాయి. ఏ బెల్ట్ షాపునకు వెళ్లినా క్వార్టర్ బాటిల్పై రూ.50 అదనంగా వసూలు చేసే నిర్వాహకులు ప్రస్తుతం రూ.60 నుంచి రూ.వంద వరకు పెంచారు. ఎందుకీ పెంపు అని అడిగితే ఎకై ్సజ్ అధికారులకు మామూలిచ్చాం అని చెబుతున్నారు. రణస్థలం, లావేరు మండలాల పరిధిలోని రణస్థలం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో ఈ కలెక్షన్ల పర్వం జోరుగా సాగింది. గత ప్రభుత్వంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడపడం వల్ల వసూళ్లు పెద్దగా ఉండేవి కావు. కానీ కూటమి పాలన రావడంతో మళ్లీ మద్యం దుకాణాలు ప్రైవేటుపరమయ్యాయి. దీంతో ఎకై ్సజ్ శాఖకు నూతనోత్సాహం వచ్చింది. గత ఏడాది దసరా ముందే బదిలీలపై వచ్చిన అధికారులు బెల్ట్ షాప్నకు వెయ్యి రూపాయల చొప్పున దండుకుని సరిపెట్టుకున్నారు. కానీ ప్రస్తుతం ఒక్కొక్క బెల్ట్ షాపు నుంచి రూ.6వేల నుంచి రూ.10వేలు వరకు వసూలు చేయడంతో విషయం రెండు మండలాల్లో టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయింది. ఇలా రూ.6లక్షలకు పైగా వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. విచ్చలవిడిగా బెల్ట్ దుకాణాలు రణస్థలం ఎక్సైజ్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఒక ప్రైవేటు ఆస్పత్రికి ఇరువైపులా ఉన్న కిరాణా షాపుల్లో బెల్టు నడుస్తోంది. అలాగే రామ తీర్థాలు కూడలికి సమీపంలో రెండు బెల్టు దుకాణాలు ఉన్నాయి. తహసీల్దార్ కార్యాలయం సమీపంలోనూ బెల్టు షాపు ఉంది. వీటన్నంటి దగ్గరా వసూళ్లు జరిగాయి. కమ్మసిగడాం, పైడిభీమవరం, కోష్ట, కోటపాలెం, మత్స్యకార గ్రామాలతో పాటు లావేరు మండలంలోని బుడుమూరు సంత, లావేరు, బెజ్జిపురం, కొత్తకుంకాం, తామా డ, వెంకటాపురం గ్రామాల్లో ఉన్న బెల్ట్ షాపుల నిర్వాహకుల నుంచి రూ.4వేలు నుంచి రూ.10వేలు వరకు తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రణస్థలం ఎకై ్సజ్ శాఖ పరిధిలో చందా పేరున భారీగా దందా ఒక్కో బెల్ట్ షాప్ నుంచి రూ.6వేలకు పైచిలుకు వసూలు రణస్థలం ఎకై ్సజ్ శాఖలో దుమారం అలాంటిదేమీ లేదు బెల్టు, మద్యం షాపుల వద్ద దసరా వసూళ్లు వంటివేవీ లేవు. దీనిపై విచారణ చేస్తాను. అలాంటిదేమీ ఉండదు. – ఎల్.అనురాధదేవి, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ, రణస్థలం -
శోక గీతిక
● అరుదైన వ్యాధితో అవస్థ పడుతున్న చిన్నారి ● ఆదుకోవాలని కుటుంబ సభ్యుల విన్నపం కంచిలి: మండలంలోని కుంబరినౌగాం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జగన్నాథ బెహరా చిన్న మనవరాలు మూడేళ్ల బేబీ గీతిక బెహరా అరుదైన వ్యాధితో బాధ పడుతోంది. అత్యంత అరుదైన ఈ వ్యాధి పుట్టినప్పుడే చిన్నారికి సంక్రమించింది. పాప ఆరోగ్యం నానాటికీ క్షీణిస్తుండడంతో వైజాగ్ లో ఆస్పత్రుల్లో చూపించగా ఎస్ఎంఏ అనే వ్యాధి గా నిర్ధారించారు. ఇది పదివేల మంది పిల్లల్లో ఒకరికి మాత్రమే వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి నివా రణకు అతి ఖరీదైన ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. కోట్లలో ఖర్చు కావడంతో దాతలు స్పందించాలని జగన్నాథ్ బెహరా కోరుతున్నారు. పాప ఆరోగ్య ప్రస్తుత పరిస్థితి తెలుసుకునేందుకు స్థానిక ఎంపీపీ పైల దేవదాస్రెడ్డి మండల పార్టీ నేతలతో కలిసి శనివారం పరిశీలించారు. ఆరోగ్య వివరాలు తెలుసుకొని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఆయనతోపాటు పార్టీ నేతలు దుర్గాసి ధర్మారావు, లడ్డుకేశవపాత్రో, కొణపల సురేష్, స్థానిక సర్పంచ్ హరిబంధు జన్ని, రంగాల శ్రీనివాస్లు ఉన్నారు. -
ఆస్పత్రి వ్యవహారంపై డీసీహెచ్ విచారణ
నరసన్నపేట: స్థానిక ఏరియా ఆస్పత్రిలో శుక్రవారం గర్భిణి బంధువులు వైద్యునికి మధ్య జరిగిన వివాదంపై జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి కల్యాణ్ బాబు శనివారం విచారణ చేపట్టారు. గర్భిణితో పాటు సంబంధిత సీ్త్ర వైద్య నిపుణురాలితో మాట్లాడి వారి అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ కృషి మాట్లాడుతూ గర్భిణి తరఫున వచ్చిన కొందరు దూషిస్తూ మాట్లాడారని వీడియో చూపించారు. దీంతో డీసీహెచ్ స్పందిస్తూ ఇలా దూషిస్తూ మాట్లాడడం సరికాదన్నారు. రోగుల పట్ల వైద్యులు, సిబ్బంది బాధ్యతగా ఉండాలని సూచించారు. దీనిపై నివేదిక కలెక్టర్కు పంపుతున్నట్లు తెలిపారు. -
డీఆర్ఓల సంఘం కార్యవర్గ ఎన్నిక
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అడ్హక్ అధ్యక్షుడిగా డి.రాజేష్ ఎన్నికయ్యారు. శనివారం శ్రీకాకుళంలోని రెవెన్యూ గెస్ట్ హౌస్లో గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోన అంజనీకుమార్ (చంటి) అధ్యక్షతన వీఆర్ఓల సమావేశం నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న గ్రామ రెవెన్యూ అధికారులు ( గ్రేడ్–1, 2, ప్రమోటీ, నామినీ) హాజరయ్యారు. జిల్లా అధ్యక్షుడిగా డి.రాజేష్, సహాధ్యక్షుడిగా ప్రవీ ణ్, జనరల్ సెక్రటరీగా బి.రాంజీ, ట్రెజరర్గా జి. డిల్లేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్లుగా ఎన్.అప్పలనా యుడు, పి.శ్రావణి, జాయింట్ సెక్రటరీలుగా ఎస్. కొండలరావు, ధనలక్ష్మి, వెబ్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ సెక్రటరీగా మనోజ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా విశ్వనాథం, స్పోర్ట్సు అండ్ కల్చరల్ సెక్రటరీగా నాగరాజు, స్టేట్ ఈసీ సభ్యులుగా గణేష్ ప్రసాద్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఏపీఆర్ఎస్ ఏ స్టేట్ సెక్రటరీ పి.శ్రీనివాస్, జిల్లా జనరల్ సెక్రట రీ బి.వి.వి.ఎన్.రాజు, ఏపీవీఆర్ఏ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మయ్య, గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ అనుపమ, అసోసియేట్ ప్రెసిడెంట్ బొమ్మిరెడ్డిపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా పద్యకవితల పోటీలు
శ్రీకాకుళం కల్చరల్: జిల్లా కేంద్ర గ్రంథాలయంలో యువ రచయితల వేదిక అధ్యక్షురాలు తంగి ఎర్రమ్మ ఆధ్వర్యంలో జరిగిన నెలవారీ సమావేశంలో శనివారం పద్యకవితల పోటీలు ఉత్సాహంగా సాగాయి. బొంతు సూర్యనారాయణ, బోకర శ్రీనివాసరావు, రోణంకి విశ్వేశ్వరరావులు తొలి మూడు స్థానాల్లో నిలవగా.. రెడ్డి పద్మావతి, కుప్పిలి వెంకటరమణలకు కన్సోలేషన్ బహుమతులు లభించాయి. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడ రవికుమార్, విశ్రాంత అధ్యాపకులు పిలకా శాంతమ్మ, డి.పార్వతీశం చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం భాషాభివృద్ధిపై ఆర్.ఢిల్లీశ్వరరావు, ఆర్.విశ్వేశ్వరరావు, ఆర్.పద్మావతి, జి.గోపాలకృష్ణ, కె.జనార్దనరావు, డి.పార్వతీశం, డి.ఈశ్వరరావులు కవితల్ని వినిపించారు. కార్యక్రమంలో డాక్టర్ పి.మాలతి, జి.సునీత, శివతేజ, ఆర్.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
దళితుల భూముల్లో బోర్డులు
టెక్కలి: అన్ని రకాల భూమిపత్రాలతో సాగు చేస్తున్న భూములను ఇప్పటికిప్పుడు ప్రభుత్వ భూమి అంటూ బోర్డులు ఏర్పాటు చేసి తమను అన్యాయం చేస్తున్నారని కోటబొమ్మాళి మండలం పెద్దబమ్మిడి గ్రామానికి చెందిన దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు అధికార పార్టీ నాయకుల ప్రోద్బ లంతో అధికారులు తమను ఇబ్బందులు గురి చేస్తున్నారని వాపోయారు. వివరాల్లోకి వెళితే.. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో పెద్దబమ్మిడి సర్పంచ్ మెండ తాతయ్య సహకారంతో గ్రామంలోని పోరంబోకు భూమిని సుమారు 38 మంది నిరుపేద దళితులకు ఒక్కొక్కరికి 26 సెంట్లు చొప్పున కేటాయించారు. భూ పట్టాలతో పాటు పాస్ పుస్తకాలు, ఇతర భూపత్రాలు అందజేశారు. గత ప్రభుత్వంలో రైతు భరోసా పథకం, ఇటీవల అన్నదాత సుఖీభవ పథకం కూడా వర్తింపజేశారు. ప్రస్తుతం ఆయా భూముల్లో వ్యవసాయం, ఇతర పంటలను పండిస్తూ జీవనోపాధి కొనసాగిస్తున్నారు. ఇప్పుడు హఠాత్తుగా శుక్రవారం రాత్రి సమయంలో రెవెన్యూ అధికారులు బోర్డులు ఏర్పాటు చేయడంతో దళితులంతా ఆందోళన చెందుతున్నారు. కొంత మంది కూటమి నాయకుల ఒత్తిడితో మా భూముల్లో అధికారులు బోర్డులు ఏర్పా టు చేశారు. దశాబ్దాలుగా అన్ని రకాల పత్రాలతో సాగు చేస్తున్నాం. మాకు జరిగిన అన్యాయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. –తోట వెంకటరమణ, బాధితుడు -
రైల్లో ప్రయాణికుడికి అస్వస్థత
ఆమదాలవలస : రైల్వే ప్రయాణికుడికి ఛాతినొప్పి రావడంతో 108లో హుటాహుటిన చికిత్స అందించారు. శనివారం గుణుపూర్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న గుణుపూర్ పాసింజిర్లో పర్లాకిమిడి సమీపంలోని కాజీపేటకు చెందిన ఎం.దిలీప్కుమార్ ప్రయాణిస్తున్నాడు. ఉర్లాం సమీపంలోకి వచ్చేసరికి ఛాతిలో నొప్పి వస్తుందని తోటి ప్రయాణిలకు చెప్పాడు. దీంతో వారు 108కు ఫోన్చేసి శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్కు రావాలని తెలియజేశారు. రైలు చేరుకునే సమయానికి 108 సిబ్బంది మూడో నంబ ర్ ప్లాట్ఫాం వద్దకు చేరుకొని బాధితునికి ప్రథమచికిత్స అందించారు. తీవ్రత ఎక్కువగా ఉండటంతో అదే అంబులెన్సులో శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇంతలో దిలీప్కుమార్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు ఆస్పత్రికి చేరుకున్నారు. -
18న చెకుముకి సైన్స్ సంబరాలు
శ్రీకాకుళం: చెకుముకి సైన్స్ సంబరాలను విజయ వంతం చేయాలని జన విజ్ఞాన వేదిక ఎడ్యుకేషన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గొంటి గిరిధర్ పిలుపునిచ్చా రు. శ్రీకాకుళంలోని యూటీఎఫ్ భవనంలో చెకుము కి సైన్స్ సంబరాల కన్వీనర్ పి.కూర్మారావు అధ్యక్షతన పోస్టర్లు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గిరిధర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చెకుముకి సైన్స్ సంబరాలు పాఠశాల స్థాయిలో అక్టోబర్ 18న, మండల స్థాయిలో నవంబర్ 1న, జిల్లా స్థాయిలో నవంబర్ 23న, రాష్ట్ర స్థాయిలో డిసెంబర్ 12 నుంచి 14 తేదీల్లో జరుగుతాయని వివరించా రు. విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయు లు, విద్యార్థులు, సైన్స్ అభిమానులు హాజరై విజ యవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి కె.కామేశ్వరరావు, జి.వాసుదేవరావు, ఎస్.సాయి శ్రీనివాస్ శ ర్మ, యూటీఎఫ్ జిల్లా నాయకులు బి.శ్రీరామ్మూర్తి, పి.అప్పారావు, బి.ధనలక్ష్మి, ఎస్.స్వర్ణకుమారి, బి. మోహనరావు, ఎస్.సంజీవరావు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు నియామకం
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ౖవెఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పుక్కళ్ల గురయ్యనాయుడును నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి శనివారం ప్రకటన విడుదల చేశారు. పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండల కేంద్రానికి చెందిన ఈయన రెండుసార్లు సర్పంచ్గా, మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తూ వైఎస్సార్ వీరాభిమానిగా పార్టీలో విధేయతతో సేవలందిస్తున్నారు. గురయ్యనాయుడు నియామకం పట్ల నియోజకవర్గం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కవిటి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతు విభాగం జాయింట్ సెక్రటరీగా ఇచ్ఛాపురం నియోజకవర్గం కవిటి మండలం డిగొనపపుట్టుగకు చెందిన బెందాళం జయప్రకాష్ను నియమిస్తూ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ పార్టీ పటిష్టతకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని తిలక్నగర్లో మహిళా యాంకర్ మీనా ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్కు తరలించారు. రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం..మీనా గత నెల 21న బీరువాలో భద్రపరిచిన బంగారు వస్తువులు చోరీకి గురవ్వడంతో ఈ నెల 10న పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు చోరీకి పాల్పడిన ది సీపన్నాయుడుపేటకు చెందిన బెండి అజ య్గా గుర్తించారు. ఈయనపై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి. అజయ్ నుంచి ఐదు తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
నైపుణ్య శిక్షణతో.. భవిష్యత్తుకు భరోసా
డిగ్రీ పూర్తి చేశాను. ప్రస్తు తం ఏ ఉద్యోగానికి వెళ్లినా కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలని, నైపుణ్యత ఉండాలని అంటున్నారు. ఇక్కడ ఫొటోగ్రఫీతో కంప్యూటర్ పరిజ్ఞానం కల్పిస్తున్నారు. అన్ని అంశాలు అర్ధమయ్యేలా నేర్పిస్తున్నారు. ఉద్యోగం సాధించగలననే నమ్మకం పెరిగింది. – వి.మహేష్, శ్రీకాకుళం పీజీ చదివాను. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు ఫొటోగ్రఫీలో మెలకువలు నేర్పిస్తున్నారు. మంచి నైపుణ్యం సాధిస్తే కెరీర్కు ఉపయోగంగా ఉంటుందని చేరాను. అన్ని అంశాలు బాగా నేర్పిస్తున్నారు. ఉపాధిలో స్థిరపడతాననే నమ్మకం కుదిరింది. – సీహెచ్ చిరంజీవి, కొర్లకోట ఎచ్చెర్ల : నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించ డమే లక్ష్యంగా ఎచ్చెర్లలో పలు రంగాల్లో ఉచిత శిక్ష ణ ఇస్తున్నారు. ఎచ్చెర్ల మండల కేంద్రంలోని యూ నియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో యువతకు పలు విభాగాల్లో నైపుణ్య శిక్షణ అందిస్తున్నారు. నెలకు రెండు ట్రేడులకు శిక్షణ చొప్పున ఏర్పాటుచేసి మెలకువలను నేర్పించడంతో పాటు ఉపాధి కల్పనకు చేయూతనందిస్తున్నారు. ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, మొబైల్ సర్వీసింగ్, బ్యూటీపార్లర్, అల్లికలు, ఎలక్ట్రికల్ హౌ స్ వైరింగ్ వంటి 18 ట్రేడుల్లో ఇక్కడ యువత శిక్షణ పొందుతున్నారు. డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ చదివినా సరైన నైపుణ్యాలు లేకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగం లభించడం కష్టం. దీనిని గుర్తించిన అధికారులు నేటి యువత కు ఉద్యోగానికి అవసరమైయ్యే నైపుణ్యాలు పెంచుకునేందుకు వివిధ రంగాల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఉన్నత చదువులు పూర్తి చేసిన వారితో పాటు ఇంట ర్, డిగ్రీ, చదువుతున్న విద్యార్థులు నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు. ప్రస్తుతం ఎచ్చెర్లలో యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలో ఫొటోగ్రపీ, మొబై ల్ రిపెయిరింగ్ విభాగంలో పలువురు యువత చేరి తమ నైపుణ్యాలకు పదును పెట్టుకుంటున్నారు. ఇంటర్, డిగ్రీ, పీజీ చదువుతున్న 60 మంది విద్యా ర్థులు శిక్షణ పొందుతున్నారు. ఉచిత వసతి, భోజన సౌకర్యాలతో 30 రోజుల పాటు శిక్షణ అందిస్తున్నా రు. శిక్షణ అనంతరం యూనియన్ బ్యాంక్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ క్షేత్ర స్థాయిలో పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి ధ్రువపత్రాలను అందిస్తోంది. అవసరమైన వారికి బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేసి ఆర్థిక తోడ్పా టు అందిస్తున్నారు. శిక్షణా కాలంలో కంప్యూటర్ ప్రాథమిక అంశాలు, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, పేజ్మేకర్, తెలుగు, ఇంగ్లిష్ టైప్రైటింగ్ వంటి అంశాలపైనా అవగాహన కల్పిస్తున్నారు. బ్యాచ్కు 30 మంది చొప్పున నెలకు రెండు బ్యాచ్ల కు శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం ఫొటోగ్రఫీ, మొబైల్ సర్వీసింగ్ ట్రేడుల్లో శిక్షణ పొందుతున్నారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందించడంతో పాటు సంబంధిత కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. శిక్షణ సమయంలో ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. వివిధ కారణాలతో చదువు మధ్యలోనే మానేసి ని వారికి ఈ శిక్షణలు ఆపన్నహస్తంగా మారా యి. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ వర కూ చదువుకుని ఇంటి వద్ద పరిస్థితులు బాగాలేక చదువుకోని నిరుపేదలకు ఈ శిక్షణలు తోడుగా ఉంటున్నాయని చెబుతున్నారు. 18 ఏళ్లు నిండి పదో తరగతి వరకూ చదువుకున్న యువత అందరూ అర్హులే. ఇక్కడ విద్యార్థులకు అన్ని విధాలా సౌకర్యాలతో కూడి న శిక్షణ అందిస్తున్నాం. ఉచిత భోజన, వసతి సౌకర్యాలతో కూడిన శిక్షణ అందిస్తున్నాం. శిక్షణ అనంతరం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. – రామ్జీ, యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ, ఎచ్చెర్ల -
సిక్కోలు పుస్తక మహోత్సవానికి ఆహ్వానం
శ్రీకాకుళం కల్చరల్: వచ్చే నెలలో జరగనున్న సిక్కో లు పుస్తక మహోత్సవానికి రచతయిలకు, అభిమానులకు ఆహ్వానం పలుకుతున్నామని కమిటీ చైర్మన్ డాక్టర్ కె.సుధీర్ కోరారు. జిల్లా కేంద్రంలోని యూ టీఎఫ్ భవనంలో సిక్కోలు పుస్తక మహోత్సవ కమి టీ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు విజ యవాడ, హైదరాబాద్ వంటి ప్రదేశాల్లోనూ భారీ ఎత్తున పుస్తక ప్రదర్శనలు జరిగాయని, మన జిల్లాలో తొలిసారి నిర్వహిస్తుండటం శుభ పరిణామమన్నారు. కమిటీ కో–చైర్మన్ అట్టాడ అప్పలనాయుడు మాట్లాడుతూ సాంస్కృతిక వేదికపై జిల్లా సంస్కృతిని ప్రతిబింబించే తప్పెటగుళ్లు, జముకుల పాట, కోలాటం, పగటి వేషాలు, నాటికలు, డ్యా న్సులు, సంగీత ప్రదర్శనలు, ఏకపాత్రాభినయాలు తదితర ప్రదర్శనలు జరగనున్నాయని వివరించా రు. విద్యార్థులతో సైన్స్ఫెయిర్ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. కమిటీ కన్వీనర్ కేతవరపు శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీకాకుళం ఏడురోడ్ల కూడలి వద్ద ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో నవంబరు 11 నుంచి 20 వరకు జరిగే సిక్కో లు పుస్తక మహోత్సవం–2025, సాహిత్య, సాంస్కృతిక వైజ్ఞానిక సంబరాల్లో 100 ప్రచురణకర్తలు బుక్ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారని వివరించారు. సాహిత్య, సాంస్కృతిక, విజ్ఞాన ఆహార, మీడియా, ప్రచార, శానిటేషన్, సెక్యూరిటీ, ఆర్థిక సబ్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో వివిధ ప్రజాసంఘాలు, సాహిత్య సంస్థల సభ్యులు కంచరాన భుజంగరావు, చీకటి దివాకర్, గొంటి గిరిధర్, పి.సుధాకర్, కొత్తకోట అప్పారావు, ఎల్.రామలింగస్వామి పాల్గొన్నారు. -
నిబంధనలకు నీళ్లు!
● పెట్రోల్, డీజిల్లో నీరు కలుస్తోందంటూ వినియోగదారుల గగ్గోలు ● బంకుల్లో కానరాని సౌకర్యాలు ● తనిఖీలు చేయని అధికారులు సంతబొమ్మాళి మండలం బోరుభద్ర పెట్రోల్ బంక్లో గొదలాం గ్రామానికి చెందిన పాలిన శ్రీనివాసరావు వంద రూపాయల పెట్రోల్ కొట్టించాడు. రెండు రోజుల వ్యవసాయ పనుల తర్వాత వాహనాన్ని స్టార్ట్ చేయాలని చూడాగా అవ్వకపోవడంతో మెకానిక్కు చూపించాడు. పెట్రోల్లో నీరు కలవడం వల్ల బండి స్టార్ట్ కావడం లేదని చెప్పడంతో విషయాన్ని బంకు యజమాని దృష్టికి తీసుకెళ్లాడు. ఆయన పట్టించుకోకపోవడంతో తహసీల్దార్ హేమసుందర్రావుకు ఫిర్యాదు చేశాడు. గత నెలలో ఈ ఘటన జరిగింది. ఇలాంటివి తరచూ ఎక్కడో ఓ చోటు జరుగుతున్నా అధికారులు దృష్టి సారించడం లేదు. శ్రీకాకుళం: పెట్రోల్, డీజిల్ కల్తీ జరుగుతోందంటూ ఇటీవల కాలంలో పలువురు వాహనచోదకులు ఆందోళనకు దిగుతున్నారు. పలువురు నిర్వాహకులు కొలతల్లో వ్యత్యాసం, కల్తీకి పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెట్రోల్ బంకులపై ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సిన అధికారులు మౌనముద్రలో ఉండిపోవడంపై పలువురు ఆక్షేపిస్తున్నారు. పెట్రోల్ డీజిల్ నాణ్యత లేకపోవడం వల్ల వాహనాలు తరచూ మరమతులకు గురవుతున్నాయి. వాస్తవానికి బంకు నిర్వహించే డీలర్లకు ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు యాజమాన్యాలు కమిషన్ సక్రమంగానే చెల్లిస్తున్నా కొందరు యజమానులు అత్యాశకు పోయి కల్తీలకు, కొలతల్లో వ్యత్యాసాలకు పాల్పడుతున్నారు. జిల్లాలో 149 పెట్రోల్ బంకులు ఉండగా, వీటి ద్వారా రోజుకు పెట్రోల్ ,డీజిల్ కలసి మూడు లక్షల లీటర్ల వరకు విక్రయిస్తున్నారు. కనీస సౌకర్యాలు కరువు.. నిబంధనల మేరకు ప్రతి పెట్రోల్ బంక్లోనూ ఉచితంగా గాలిని నింపే యంత్రాలతో పాటు వినియోగదారులకు తాగునీరును అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. బంక్ ఆవరణలో మరుగుదొడ్లు కచ్చితంగా ఉండాలి. గాలి యంత్రాలు ఉన్నప్పటికీ అవి అలంకారప్రాయంగానే దర్శనమిస్తున్నాయి. ఎవరైనా గాలి కోసం అడిగితే దానిని నిర్వహించే వ్యక్తి సెలవులో ఉన్నాడనో మరేదో కారణం చెప్పి పంపించేస్తున్నారు. మరుగుదొడ్లు ఉన్నట్లు బోర్డులు ఉన్నా వాటికి తాళాలు వేసి ఉంచుతున్నారు. దాదాపుగా 90 శాతం బంకుల్లో మంచినీటి సౌకర్యమే ఉండడం లేదు. ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్న బంకుల్లోనే కాకుండా ప్రభుత్వ శాఖల ఆధీనంలో ఉన్న బంకుల్లో సైతం దాదాపు ఇదే పరిస్థితి. ఇప్పటికై నా అధికారులు స్పందించి బంకులపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.. పెట్రోల్ బంకులపై దృష్టి సారిస్తాం. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటాం. త్వరలోనే పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టి కేసులు నమోదు చేస్తాం. – చిన్నమ్మలు, తూనికలు కొలతల శాఖ అధికారి -
చైన్స్నాచింగ్ ముఠా అరెస్టు
● నిందితులంతా ట్రాన్స్జెండర్లే ● 38 గ్రాముల బంగారు గొలుసులు స్వాధీనం నరసన్నపేట: ఉత్తరాంధ్రతో పాటు పలుచోట్ల ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న పురుషులే లక్ష్యంగా చేసుకొని చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న ట్రాన్స్జెండర్స్ ముఠాను నరసన్నపేట పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ మేరకు టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు శుక్రవారం నరసన్నపేటలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఇటీవల నరసన్నపేట మండలం ఉర్లాం సమీపంలో నడగాంకు చెందిన దొంపాక ఆనందరమణను కొందరు ట్రాన్స్జెండర్ల అడ్డగించి చైన్స్నాచింగ్కు పాల్పడ్డారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేయగా ముఠా పట్టుబడింది. ఉర్లాంతో పాటు ఇచ్ఛాపురం, జి.సిగడాం మండలం ఉల్లివలస జంక్షన్, పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబల్లి మండలం సంకిలిలో చైన్ స్నాచింగ్లకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించారు. బైక్లపై వచ్చిన వారి మెడలో నుంచి బంగారు చైన్లు లాక్కోని సమీపంలో ఉన్న కారులో వీరు పారిపోతుంటారు. ఈ కేసులో తెర్లాం మండలం పిరిడి గ్రామానికి చెందిన నందిగామ నేహా, కాకినాడ జిల్లా రేచర్లపేటకు చెందిన మండల శ్రావణి, పార్వతీపురం జిల్లా వీరఘట్టంకు చెందిన అలుబిల్లి ప్రియ, రంపచోడవరం ప్రాంతానికి చెందిన బేదంపూడి సాయిపల్లవి, పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన నాగిరెడ్డి సుష్మలతో పాటు వీరికి సహాయకారిగా ఉన్న కారు డ్రైవర్ తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం వేమగిరికి చెందిన సేలం రాంప్రవీణ్ను పోలీసులు అరెస్టు చేశారు. వీరందరినీ మడపాం టోల్గేట్ వద్ద శుక్రవారం పట్టుకొని విచారించగా చోరీలకు పాల్పడుతున్నట్లు అంగీకరించారు. వీరి వద్ద నుంచి 38 గ్రాముల బరువున్న మూడు బంగారు చైన్లు రికవరీ చేశారు. నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు, నరసన్నపేట, పోలాకి ఎస్ఐలు సీహెచ్ దుర్గాప్రసాద్, రంజిత్లు కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్నందుకు డీఎస్పీ అభినందించారు. -
అంతేనా మా గతి!
ఒకే గది.. టెక్కలి: పాలకుల నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. టెక్కలి ఆదిఆంధ్రా వీధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకే గదిలో భోదన.. వసతితో అవస్థలు పడుతున్నారు. పాఠశాలలో 3 నుంచి 10వ తరగతి వరకు సుమారు 141 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాల వేళల్లో తరగతి గదిలో పాఠాలు నేర్చుకుంటూ.. రాత్రి వేళల్లో అదే గదిలో నిద్రపోతున్నారు. అసంపూర్తిగా భవనాలు.. గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థుల కోసం అంజనాపురం సమీపంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో సుమారు 8.75 కోట్ల రూపాయలతో అదనపు భవనాలకు నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం అవి అసంపూర్తిగా ఉండడంతో విద్యార్థులకు వసతి గదుల కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి అసంపూర్తి నిర్మాణాలను పూర్తి చేయాలని విద్యార్థులు వేడుకుంటున్నారు. పాఠశాల తరగతి గదుల్లోనే రాత్రి వేళల్లో నిద్రిస్తున్నాం. చాలీచాలని గదులతో ఒక్కోసారి ఇబ్బందులు పడుతున్నాం. పాఠశాలకు సమీపంలో చేపట్టిన భవనాల నిర్మాణం పూర్తి చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. – జి.యశ్వంత్, విద్యార్థి, గిరిజన ఆశ్రమ పాఠశాల, టెక్కలి పాఠశాలలో పూర్తి స్థాయిలో తరగతి గదులు లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను ఇప్పటికే అధికారులకు తెలియజేశాం. అసంపూర్తి భవనాల విషయమై ఐటీడీఏ ఇంజినీరింగ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. – నందీశ్వరరావు, హెచ్ఎం, గిరిజన ఆశ్రమ పాఠశాల, టెక్కలి బోధన, వసతికి ఒకే భవనం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల అవస్థలు అసంపూర్తి భవనాలు పూర్తి చేయాలని వేడుకోలు -
పంచాయతీలపై బకాయిల పిడుగు
● ఆరేళ్ల కిందటి బకాయిలు చెల్లించాలని నోటీసులు ● ఇబ్బందులు పడుతున్న పంచాయతీ పాలకులు సోంపేట: సచివాలయాలతో మొదలుపెట్టి స్థానిక పాలనను నిర్వీర్యం చేస్తూ వస్తున్న కూటమి ప్రభుత్వం కన్ను ఇప్పుడు పంచాయతీలపై పడింది. ఇప్పటికే నిధుల లేమితో ఇబ్బంది పడుతున్న పంచాయతీల నెత్తిన సర్కారు పిడుగు వేసింది. 2016 నుంచి 2019 కాలంలో ఈఈఎస్ఎల్ సంస్థకు బకాయి ఉన్న విద్యుత్ బల్బుల నిర్వహణ నిధులు చెల్లించాలని మండల అధికారులకు నోటీసులు జారీ చేశారు. 2024 ఆగస్టు నుంచి సెప్టెంబరు 2025 వరకు ఒక్క రూపాయి కూడా పంచాయతీల్లో కూటమి ప్రభుత్వం నిధు లు జమచేయలేదు. అయితే సెప్టెంబరు 2025 లో మండలంలోని 23 పంచాయతీలకు సుమారు రూ.1.50 కోట్లు నిధులు జమ చేసింది. దీంతో ఆ నిధులు ఎటూ చాలక పంచాయతీ సర్పంచ్లు, కార్యదర్శులు ఇబ్బందులు పడుతున్నారు. క్లాప్ మిత్ర వేతనాలు, విద్యుత్ బల్బుల నిర్వహణ, తాగునీటి పథకాల నిర్వహణ, పారిశుద్ధ్యం గత ఏడాదిగా చేసిన పనులకు ఆ బిల్లులు సరిపోలేదు. దీంతో ప్రస్తుతం పంచాయతీలు నిధులు లేక ఖాళీగా ఉన్నాయి. బకాయిలు చెల్లించాలని నోటీసులు 2016 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో పంచాయతీల్లో విద్యుత్ బల్బుల నిర్వహణ చేపట్టాలని ఈఈఎస్ఎల్ సంస్థకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. అప్పట్లో ఆ సంస్థ విద్యుత్ బల్బుల నిర్వహణ చేపట్టింది. కానీ అప్పట్లో ఆ సంస్థకు బకాయిలు చెల్లించలేదు. ఆ బకాయిలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారం రావడంతో ఈఈఎస్ఎల్ సంస్థ తమ బకాయిల గురించి ప్రభుత్వాన్ని అడిగింది. దీంతో ప్రభుత్వం ఆదేశాల మేరకు అప్పటి బకాయిలు ఇప్పుడు చెల్లించాలని పంచాయతీలకు మండలస్థాయి అధికారులు గత నె ల రోజులుగా నోటీసులు అందజేస్తున్నారు. కానీ పంచాయతీ సర్పంచ్లు బకాయిలు చెల్లించడానికి ససేమిరా అంటున్నారు. అప్పటి బకాయిలు ఇప్పుడు ఎలా చెల్లిస్తామని ప్రశ్నిస్తున్నారు. సుమారు కోటి యాభైలక్షల రూపాయల నిధులు పంచాయతీ ఖాతాల్లో జమచేసి ప్రస్తుతం రూ.60 లక్షల నిధులు చెల్లించాలని సోంపేట మండలంలో 23 పంచాయతీలకు నోటీసులు అందజేశారు. దీంతో సగం నిధులు బకాయిలు చెల్లించడానికి, మరో సగం నిధులు సెస్ చార్జీలు చెల్లించడానికి సరిపోతాయని వాపోతున్నారు. ఇలా నిధులన్నీ అయిపోతే పంచాయతీల్లో అభివృద్ధి పనులెలా అని ప్రశ్నిస్తున్నారు. ఇబ్బంది పెడుతున్నారు పంచాయతీల్లో అప్పులు చేసి పనులు చేస్తున్నాం. ఇప్పుడు కొంత నిధులు ఇచ్చి పాత బకాయిలు చెల్లించమని నోటీసులు అందజేస్తున్నారు. పంచాయతీ సర్పంచ్లను ఇబ్బందులకు గురిచేయడమే కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. – పాతిన శేషగిరి, మామిడి పల్లి సర్పంచ్ పాతబకాయిలు చెల్లించాలి 2016–19 మధ్య కాలంలో ఈఈఎస్ఎల్ సంస్థ పంచాయతీల్లో విద్యుత్ బల్బులు నిర్వహణ చేపట్టింది. నేడు కేవలం విద్యుత్ బల్బులు వేసిన ఖర్చులు మాత్రమే సంస్థ అడుగుతోంది. పంచాయతీ సర్పంచ్లు సహకరించి బకాయిలు చెల్లించాలి. – సీహెచ్ ఈశ్వరమ్మ, ఎంపీడీఓ బకాయిలు చెల్లించాలనడం దారుణం కూటమి ప్రభుత్వం మాటలకు చేతలకు పొంతన లేదు. పంచాయతీలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. కూటమి పాలనలో పంచాయతీలకు నిధులు లేక సర్పంచ్లు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పడు కొంత జమ చేసి పాత బకాయిలు చెల్లించమనడం దారుణం. – శిలగాన భాస్కరరావు, సుంకిడి సర్పంచ్ -
● ఉద్యమానికి శ్రీకారం
విజయవంతం చేయాలి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మంజూరు చేసిన మెడికల్ కాలేజీలు అన్నీ ప్రభుత్వమే పూర్తి చేయాలి. పీపీపీ పద్ధతిలో ప్రైవేటుకు అప్పగిస్తే పేదలకు వైద్యం అందదు. కూటమి ప్రభుత్వ విధానం తప్పు. పేద విద్యార్థులు డాక్టర్లు అయ్యే అవకాశం కోల్పోతారు. కూటమి ప్రభుత్వం తీరుకు నిరసనగా వైఎస్సార్సీపీ కోటి సంతకాల ఉద్యమంతో పాటు వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలి. – వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చింది. అందులో భాగంగా శుక్రవారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మొదలుపెట్టడంతో పాటు ఉద్యమానికి సంబంధించిన పోస్టర్లను కూడా నాయకులు ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వ దుర్నీతిని దునుమాడాలని జనాలకు పిలుపునిచ్చారు. ప్రైవేటువాళ్లకు అప్పగిస్తే పేదలకు వైద్య విద్య పూర్తిగా దూరమవుతుందని హెచ్చరించారు. –సాక్షి నెట్వర్క్ -
పారదర్శకంగా పన్ను చెల్లింపు
ఎచ్చెర్ల: విద్యార్థులు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించగలరని, ఆర్థిక అవగాహనతో జీఎస్టీ పన్ను చెల్లింపుల్లో పారదర్శకత పాటించి దేశాభివృద్ధికి తోడ్పడాలని విశాఖపట్నం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటిలిజెన్స్ విభాగం, సీనియర్ ఇంటిలిజెన్స్ అధికారి డాక్టర్ కేవీ మోహనరావు అన్నారు. మండలంలోని కుశాలపురంలోని శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన సూపర్ జీఎస్టీ 2.0–సూపర్ సేవింగ్స్ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎస్టీ వ్యవస్థ, దీని ప్రాముఖ్యత, పన్ను చెల్లింపులో పారదర్శకత యువతలో ఆర్థిక అవగాహన తదితర అంశాలను వివరించారు. బయాలజీ కిట్లు అందజేత శ్రీకాకుళం: జిల్లాలో 2025 డీఎస్సీ నుంచి బయాలజీ టీచర్లుగా ఎంపికైన వారికి బయాలజీ మెటీరియల్ కిట్లను జిల్లా జీవశాస్త్ర ఉపాధ్యాయ ఫోరం అందజేసింది. డీఈఓ ఎ.రవిబాబు చేతుల మీదుగా ఈ మెటీరియల్ను పంపిణీ చేశారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో డీఈఓ మాట్లాడుతూ శాసీ్త్రయ దృక్పథంతో మంచి బోధన చేయాలని సూచించారు. పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ చంద్రభూషణం మాట్లాడుతూ బయోలాజికల్ సైన్స్ ఎడ్యుకేషనల్ బ్యాక్ గ్రౌండ్ కలిగిన తాను జీవశాస్త్ర ఉపాధ్యాయ ఫోరం, జన విజ్ఞాన వేదికల నిర్వహించే సైంటిఫిక్ టెంపర్ క్యాంపస్లో భాగస్వామి అవుతానని పేర్కొన్నారు. దూడల అక్రమ రవాణా అడ్డగింత నరసన్నపేట: జాతీయ రహదారిపై అక్రమంగా లగేజీ వాహనంలో తరలిస్తున్న 16 దూడలను టాస్క్ఫోర్స్ పోలీసులు మడపాం టోల్గేట్ వద్ద శుక్రవారం సాయంత్రం పట్టుకున్నా రు. తిలారు నుంచి అలమండకు అక్రమంగా ఈ దూడలను తీసుకువెళ్తున్నట్లు గురించారు. వీటిని నరసన్నపేట పోలీసులకు అప్పగించగా ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి గోశాలకు పంపించారు. రాత్రిపూట రేషన్ కోసం పాట్లు ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణంలోని గేటులో గల రేషన్ దుకాణం వద్ద శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల తర్వాత కూడా రేషన్ కోసం లబ్ధిదారులు వేచి ఉండడం కనిపించింది. ఒకప్పుడు ఇంటి ముంగిటకే సరుకులు వచ్చేవని, ఇప్పుడు రాత్రి సమయాల్లో ఇలా వేచి ఉండాల్సి వస్తోందని అన్నారు. అంత్యోదయ చూపలేరా..? చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు జన్ని గౌరమ్మ. దివ్యాంగురాలైన గౌరమ్మకు 2006లో అప్పటి ప్రభుత్వం అంత్యోదయ కార్డు మంజూరు చేసింది. హిరమండలం మండలం లోకొండ గ్రామానికి చెందిన గౌరమ్మకు తల్లిదండ్రులు లేరు. వివాహం కూడా జరగలేదు. ఒంటరిగానే జీవిస్తున్నారు. ఈ కార్డే ఆమెకు ఆధారం. కానీ కొన్నాళ్ల కిందట ఆమెకు అంత్యోదయ కార్డు తొలగించారు. అప్పటి నుంచి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఆమైపె ఎవరూ దయ చూపడం లేదు. ఇప్పటికై నా తన బాధను గమనించి కార్డు పునరుద్ధరించాలని ఆమె కోరుతున్నారు. – హిరమండలం -
డయాలసిస్ సేవలు సకాలంలో అందాలి
● జెడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ శ్రీకాకుళం: జిల్లాలోని కవిటి, సోంపేట మండలా ల్లో కిడ్నీ వ్యాధి బారిన పడిన వారికి డయాలసిస్ సేవలు సకాలంలో అందించాలని జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ అన్నారు. శుక్రవారం జిల్లా పరిష త్ కార్యాలయంలో పలు స్థాయీ సంఘ సమావేశా లు ఆమె అధ్యక్షతన జరిగాయి. ఆమె మాట్లాడు తూ జిల్లా పరిషత్ సాధారణ సభ్య సమావేశాలు, స్థాయీ సంఘ సమావేశాలకు జిల్లా అధికారులు రాకుండా వారి ప్రతినిధులను పంపుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా అధికారులు రాని పరిస్థితుల్లో ముందస్తు అనుమతులు పొందాలని సూచించారు. 4వ స్థాయీ సంఘ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్షలో డయాలసిస్ బెడ్లు పెంచాలని అధికారులను కోరారు. 2వ స్థాయీ సంఘ సమావేశంలో జిల్లాలో చాలా మంది అర్హుల పింఛనుల జాబితాలు ఎంపీడీఓల లాగిన్లో పెండింగ్లో ఉన్నాయని సభ్యులు తెలపడంతో వాటిని క్లియర్ చేయడంతో పాటు ప్రభుత్వ నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. 2వ స్థాయీ సంఘ సమావేశంలో డీడబ్ల్యూఎంఏ చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించేలా చర్యలు చేపట్టాలన్నారు. 7వ స్థాయీ సంఘ సమావేశంలో పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్ పనులు నిర్దేశించిన కాలంలో చేయకుండా కాలం చెల్లిన, మొదలు పెట్టని పనుల వివరాలు ఇవ్వాలని తెలిపారు. ఉద్దానం ప్రాజెక్టు పైప్లైనులు ఎక్కువగా లీక్లు అవుతున్నాయని, సత్వరమే మరమ్మతులు చేపట్టి నీటి వృధాను అరికట్టాలన్నారు. ఉదయం 3, 5, 6 వ స్థాయీ సంఘ సమావేశాల్లో ప్రగతి నివేదికలను అధికారులు తెలియజేశారు. కార్యక్రమంలో ఆమదాలవలస ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్, సీఈఓ డి.సత్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యులు ధర్మాన కృష్ణచైతన్య, జంపు కన్నతల్లి, సురవరపు నాగేశ్వరావు, కె.త్రినాఽథ్, టొంపల సీతారాముడు, కాయల రమణ, కామాక భాగ్యవతి, మీసాల సీతం నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం
నరసన్నపేట: ౖవెద్య కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా వైఎస్సార్సీపీ కోటి సంతకాలను సేకరించడానికి ప్రజా ఉద్యమాన్ని నిర్వహి స్తోంది. ఇందులో భాగంగా పార్టీ శ్రేణులు ఏయే తేదీల్లో ఏయే కార్యక్రమాలు చేపట్టాలో వివరిస్తూ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ గురువారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీనికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణలు చేపట్టాలని సూచించా రు. అలాగే అక్టోబరు 10 నుంచి నవంబర్ 22 వరకూ రచ్చబండ, సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించాలన్నారు. అక్టోబరు 28న అన్ని నియోజవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించాలన్నారు. నవంబర్ 12న జిల్లా కేంద్రం శ్రీకాకుళంలో ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు. నవంబర్ 23న సేకరించిన సంతకాల పత్రాలు నియోజకవర్గాల నుంచి జిల్లా పార్టీ కార్యాలయానికి చేర్చాలన్నారు. 24న ఈ సంతకాల పత్రాలు జిల్లా కేంద్రం నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలిస్తామన్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా మొత్తం కోటి సంతకాలతో పత్రాలు గవర్నర్కు ఇవ్వనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు సురక్షిత నీరు అందించాలి : కలెక్టర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: పిల్లల ఆరోగ్యంపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని, హాస్టళ్లలో విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడారు. హాస్టళ్లలో నీటి నాణ్యత పరీక్షించాలని సూచించారు. సమావేశం అనంతరం జీఎస్టీ తగ్గింపుతో ఇంటింటికి లబ్ధి అనే గోడ పత్రికలను, డీఆర్డీఏ రూపొందించిన సీ్త్ర నిధి కి సంబంధించిన బ్రోచర్లను కూడా ఆవిష్కరించారు. జాతీయ స్థాయి గట్కా పోటీలకు సత్యవరం విద్యార్థులు నరసన్నపేట: సత్యవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు జాతీయ స్థాయి గట్కా పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 11, 12 వ తేదీల్లో చత్తీస్గఢ్ రాష్ట్రం దుర్గ్లో జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తున్నారు. దీంట్లో రాష్ట్రం తరఫున సత్యవ రం స్కూల్ విద్యార్థులు టెంక జానకీరాం, పాసి పుష్ప, పాసి రాఘవేంద్ర, ఎ.శరత్కుమార్, దర్శినిలు ఎంపికయ్యారని హెచ్ఎం వకులా రత్నమాళ తెలిపారు. ఈ మేరకు విద్యార్థులను స్కూల్ హెచ్ఎం వకులా రత్నమాళ, పీఈఓ జ్యోతి రాణితో పాటు ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. శ్రీముఖలింగం ఆలయం ఈఓగా ఏడు కొండలు జలుమూరు: శ్రీముఖలింగం ఆలయ ఈఓగా కె.ఏడుకొండలు గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈయన విజయనగరం జిల్లా పైడితల్లి అమ్మవారి దేవస్థానంలో పనిచేసి పదోన్నతిపై ఇక్కడకు వచ్చారు. ఇక్కడ ఇన్చార్జిగా ఉన్న వాసుదేవరావు పాతపట్నం నీలమణి అమ్మ వారి దేవస్థానానికి వెళ్లారు. నేటి నుంచి విద్యాశక్తి కార్యక్రమాల బహిష్కరణ శ్రీకాకుళం: ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ తప్ప మరే బోధనేతర కార్యక్రమాలు ఉపాధ్యాయులు చేయబోరని జిల్లా ఫ్యాప్టో చైర్మన్, సెక్రటరీలు బమ్మిడి శ్రీరామమూర్తి, పడాల ప్రతాప్ కుమార్లు తెలిపారు. రాష్ట్ర ఫ్యాప్టో శాఖ పిలుపు మేరకు జిల్లా ఫ్యాప్టో శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డీఈఓ ఎ.రవిబాబులకు మెమొరాండం అందజేశారు. కా ర్యక్రమంలో బి.రవి కుమార్, బి.వెంకటేశ్వర్లు, హెచ్ఎం అసోసియేషన్ వి.సత్యనారాయణ, జి.రమణ, ఎస్ రమేష్ బాబు, బి.రవి, సూర్యప్రకాష్ తదితరలు పాల్గొన్నారు. -
సారాపై ఉక్కు పాదం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో నాటుసారా తయారీ విక్రయాన్ని పూర్తిగా అరికట్టడానికి ‘నవో దయం 2.0‘ కార్యక్రమం కింద కఠిన చర్యలు తీసుకుంటున్నామని, సారా రహిత జిల్లా లక్ష్యం సాధించే వరకు దాడులు, నిఘా కొనసాగుతాయని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఎకై ్సజ్, పోలీస్, రెవె న్యూ, అటవీ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎల్ఫోర్స్మెంట్ విభాగం ఫిబ్రవరి నుంచి తీసుకున్న చర్యల వివరాలను కలెక్టర్కు సమర్పించారు. ఇప్పటివరకు 179 ఐడీ లిక్కర్ కేసులు నమో దు చేయగా, 221 మందిని అరెస్టు చేశామని, 3477.8 లీటర్ల ఐడీ మద్యం స్వాధీనం చేసుకోగా, 27,790 లీటర్ల జేఎఫ్ (ఎఫ్జె) వాష్ను ధ్వంసం చేశామని వివరించారు. 75 కిలోల బెల్లం, 17 వాహ నాలను అధికారులు సీజ్ చేశామన్నారు. బెల్లం సరఫరాదారులపైనా దృష్టి సారించి, ఆరుగురు వ్యాపారులను కూడా అరెస్టు చేసినట్టు వెల్లడించారు. సా రా గురించి సమాచారం తెలిస్తే 14405 టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలని కోరారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్విరాజ్ కుమార్, ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ పి.రామచంద్రరావు, జిల్లా ఎకై ్సజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ తిరుపతినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
‘నష్టపరిహారం అందించాలని ధర్నా’
టెక్కలి రూరల్: మెళియాపుట్టి మండలం గంగరాజపురం సమీపంలో గల రాజయోగి గ్రానైట్ క్వారీలో మంగళవారం పిడుగుపడి మృతి చెందిన, తీవ్రంగా గాయపడిన వారి కుటుంబాలను ప్రభుత్వం అదుకోవాలని కోరుతూ.. గురువారం జిల్లా గ్రానైట్ వర్కర్స్ యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో టెక్కలి జిల్లా ఆస్పత్రి వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా జనరల్ సెక్రటరీ పి.తేజేశ్వరరావు మాట్లాడుతూ పిడుగుపాటుతో పాటు ఎలక్ట్రికల్ షాక్ తగలడం వల్లనే ముగ్గురు మృతి చెందారని ఆరోపించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు క్వారీ యాజమాన్యం రూ.50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారికి రావాల్సిన బీమాలన్నీ ఇప్పించాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి హెచ్.ఈశ్వరరావు, గ్రానైట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు చింతాడ తేజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి నంబూరి షణ్ముఖరావు, క్వారీ కార్మీకులు తదితరులు పాల్గొన్నారు. -
వేడుకేదైనా.. వేదిక వెలిగిపోవాల్సిందే..!
● ప్రత్యేక అలంకరణకు ప్రాధాన్యమిస్తున్న జనం ● వేడుకను బట్టి అలంకరణ సామగ్రి అలంకరణలకు ప్రాధాన్యత పెరిగింది మార్కెట్లో అలంకరణ వస్తువులకు గిరాకీ పెరిగింది. దేవుడి పూజలకు కూడా అలంకరణ వస్తువులు కొంటున్నారు. – దాస్యం రాంబాబు, అలంకరణ సామగ్రి షాపు యజమాని ఫంక్షన్లకు పిలుస్తారు.. పుట్టిన రోజులు, పూజలు తదితర ఫంక్షన్లకు నన్ను పిలుస్తారు. కొన్ని బెలూన్లతో, మరికొన్ని అలంకరణ వస్తువులతో డెకరేషన్ చేస్తుంటాను. ఇటీవల వినాయక చవితికి వైకుంఠద్వారం తయారు చేశాను. – దాకోజు లాల్ ప్రసాద్, డెకరేటర్, కంపోస్టు కాలనీ భారీస్థాయిలో కూడా చేస్తాం మేము భారీ స్థాయి నుంచి చిన్న స్థాయి వరకు ఎవరికి ఏ విధంగా కావాలో వాటిని తయారు చేస్తాం. అవుట్ డోర్, ఇండోర్లో కూడా డెకరేషన్ చేస్తాం. – గోపి, ఎంజీఆర్ క్లాత్ డెకరేటర్, శ్రీకాకుళం శ్రీకాకుళం కల్చరల్: వేడుక ఏదైనా జిల్లా వాసులు వేదికలను మాత్రం అదరగొడుతున్నారు. సాదా సీదా అలంకరణలకు టాటా చెప్పేసిన జిల్లా వాసులు ప్రత్యేక థీమ్లతో పండుగలు, ఉత్సవాలకు కొత్త సొబగులు అద్దుతున్నారు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఈ అలంకరణల అలవాటు బాగా పెరిగింది. వీరి అభిరుచికి తగ్గట్టు మార్కెట్లోనూ కొత్త దుకాణాలు వెలిశాయి. మార్కెట్లో పెరిగిన డిమాండ్ జిల్లా కేంద్రంలోని పెట్రోమాక్సు వీధిలో ఒకే చోట సుమారుగా 10 షాపులు ఉన్నాయి. వీటిలో అన్ని శుభకార్యాలకి సంబంధించిన వస్తువులను షాపుల్లో అమ్ముతున్నారు. వినియోగదారులు వీటిని కొనుగోలు చేసి తమ ఇళ్లన్లు తామే అలంకరించుకుంటున్నారు. తాము చేసిన డెకరేషన్ను ఫేస్బుక్లలో, ఇన్స్ట్రాగ్రామ్ తదితరమై వాటిలో పెడుతూ వైరల్ చేస్తున్నారు. స్థాయిని బట్టి ఖర్చు సందర్భానికి తగ్గట్టుగా అలంకరణలను ప్లాన్ చేస్తున్నారు. గోడ సైజును బట్టి పెట్టేందుకు కర్టెన్లు, ఆకులు, పుష్పాల పెయింటింగ్లతో అమ్ముతున్నారు. పేద, మధ్య తరగతి వారు కూడా ప్రతి చిన్న కార్యక్రమానికి అలంకరణలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత ప్రతి కార్యక్రమాన్ని పండగలా జరుపుకుంటున్నారు. పెద్ద పెద్ద పెళ్లిళ్లు, పుట్టిన రోజులు, షష్టిపూర్తి, బారసాల, పెద్దపూజలు వంటి సయంలో డెకరేటర్లను పిలిపించుకుని మరీ అలంకరణలు చేయించుకుంటున్నారు. -
‘కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే థర్మల్ ప్లాంట్’
బూర్జ: బడా కార్పొరేట్ సంస్థలకు భూములు కట్టబెట్టేందుకే థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మించ తలపెడుతున్నారని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి అన్నారు. గురువారం మండలంలో గల అన్నంపేట పంచాయతీ మసానపుట్టి గ్రా మంలో ఆదివాసీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీల జీవితాలతో పాటు పర్యావరణాన్ని నాశనం చేసే క్రిటికల్ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఈప్రాంతంలో నిర్మాణం చేపట్టవద్దని ఆయన ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. సభకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీ, మాజీ మంత్రి వర్యులు వడ్డే శోభనా ద్రీశ్వరరావు మాట్లాడుతూ పచ్చని ప్రకృతిని, సంప్రదాయాలను కాపాడాల్సిన పాలకులు ఆదివాసీలు జీవించే హక్కు లేకుండా చేస్తున్నారని మండి పడ్డా రు. 32 వేల మెగా వాట్స్ సామర్థ్యంతో ఇక్కడ పవర్ ప్లాంట్ నిర్మిస్తే ఆదివాసీలతో పాటు రైతులు జీవిస్తున్న ఈ ప్రాంతమంతా శ్మశానంగా మారుతుందన్నారు. పవర్ ప్లాంట్ నిర్మాణం ప్రతిపాదన తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశా రు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి సలహాదారుడు మహదేవ్, సీపీఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి గోవిందరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, నూ డెమొక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, లిబరేషన్ రాష్ట్ర నాయకులు మరనాథ్, అఖిల భారత రైతుకూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంకల మాధవరావు, రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి డి.వర్మ పోరాట కమిటీ అధ్యక్షుడు సురేష్ దొర, కార్యదర్శి సవర సింహాచలం, కోశాధికారి రవికాంత్, అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కృష్ణవేణి, కుసుమ, ప్రజాసంఘాల నాయకులు, కె.మోహనరావు, ఆదివాసీలు, దళితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
చినుకు పడితే చెరువే
● జలమయమవుతున్న రహదారులు ● రోజుల తరబడి నీరు నిలిచిపోవడంతో వాహనచోదకులకు ఇక్కట్లు ● పల్లె నుంచి పట్టణం దాకా ఇదే పరిస్థితి ఆమదాలవలస/ఆమదాలవలస రూరల్: కొద్దిపాటి వర్షమొచ్చినా రహదారులు ముంపునకు గురవుతున్నా యి. రోజుల తరబడి నీరు రోడ్లపైనే నిలిచిపోవడంతో వాహనచోదకులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఆమదాలవలస నియోజకవర్గంలో అన్నిచోట్లా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. పట్టణంలో ప్రజలకు పూర్తి స్థాయిలో మౌలి క వసతులు కల్పిస్తున్నామని స్టేజీలపై ప్రసంగాలు గుప్పిస్తున్న కూటమి నాయకుల మాటలకు క్షేత్రస్థాయి లో పరిస్థితికి పొంతన కుదరడం లేదు. ఆమదాలవలస పలు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ మురుగు నీరు, వరదనీరు నిలిచిపోతోంది. సీసీ రోడ్లు, కాలువలు లేక ఇబ్బందులు తప్పడం లేదు. వెంగళరావు కాలనీ, ఐ.జె.నాయు డుకాలనీ, కాలేజీ ఎదురు వీధి, చంద్రయ్యపేట, మెట్టక్కివలస, పూజారిపేట, పారిశ్రామికవాడలో కొన్ని వీధుల్లో సీసీ రహదారులు నిర్మించి కాలువలు నిర్మా ణం చేపట్టకపోవడంతో చినుకుపడితే ఆయా ప్రాంతా లు చిత్తడిగా మారుతున్నాయి. కలివరం గ్రామ మార్కెట్కు వెళ్లే రహదారి ఎప్పుడు వర్షం పడినా చెరువును తలపిస్తుంటుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ ఉపాధి హామీ పథకం కింద రహదారులు నిర్మాణానికి మంజూరైన నిధులతో కొందరు పాలకులు ఇళ్లముందు రహదారులు నిర్మించుకుంటున్నారే పత్ప నిత్యం ప్రజలు రాకపోకలు సాగించే రోడ్లను పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ నగర్ ప్రాంతంలో సు మారు 200 కుటుంబాలు నివాసముంటున్నాయి. రైల్వే ట్రాక్ ఇవతల వైపు ఉండటంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు మున్సిపల్ అధికారులు గాని, పాలకులు గాని ముందడుగు వేయడంలేదు. రోడ్లు లేక వర్షం పడితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కొందరు తమ వాహనాలను దూరప్రాంతాల్లో పార్కింగ్ చేసి ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. – జి.కృష్ణమూర్తి, విశ్రాంత ఉపాధ్యాయుడు, బి.ఆర్.నగర్, ఆమదాలవలస మున్సిపాలిటీ -
చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి
● నాలుగు నెలల కిందటే వివాహం ● దేవునల్తాడలో విషాదఛాయలు వజ్రపుకొత్తూరు: దేవునల్తాడ గ్రామానికి చెందిన బుడగల్ల చినబాబు(42) సముద్రంలో చేపల వేట కు వెళ్లి మృతి చెందాడు. పోలీసులు, గ్రామస్తు లు తెలిపిన వివరాల ప్రకా రం.. దేవునల్తాడకు చెందిన బుడగట్ల కేశవులు, గుణసరణమ్మ కుమారుడు చినబాబుకు నాలుగు నెలల క్రితం ఒడిశా రాష్ట్రం పూరీకి చెందిన నారాయణమ్మతో వివాహం జరిగింది. జీవనోపాధిలో భాగంగా గురువారం వేకువజామున తోటి మత్స్యకారులతో కలిసి సముద్రంలో చేపల వేటకు వెళ్లాడు. ఉదయం 8 గంటల సమయంలో వలను లాగే ప్రయత్నంలో అలలు ఎగసిపడటంతో చినబాబు తెప్ప నుంచి జారి పడి మృతి చెందాడు. విషయాన్ని సర్పంచ్ టి.వరదరాజులు, ఎంపీటీసీ సభ్యుడు ఎస్.వెంకన్న, గ్రామ పెద్దలు వజ్రపుకొత్తూరు పోలీసులకు తెలియజేయడంతో సిబ్బంది తీరానికి చేరుకున్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి బుడగట్ల గుణసరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వజ్రపుకొత్తూ రు హెచ్సీ కె.ఈశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మాస్టర్ప్లాన్లో మార్పు!
● సర్వే చేస్తున్న నగరపాలక సంస్థ ప్రణాళికా విభాగం ● ప్రభుత్వానికి త్వరలో నివేదిక శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం మేరకు శ్రీకాకుళంలో అమలు చేయాలనుకుంటున్న కొత్త మాస్టర్ ప్లాన్ విషయంలో జిల్లా అధికారులు పునరాలోచనలో పడ్డారు. ‘మాస్టర్ ప్లాన్తో గుండెల్లో గుబులు’ పేరిట రెండు రోజుల క్రితం సాక్షిలో ప్రచురితమైన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. 150 అడుగులు రోడ్డును నిర్మిస్తే ఏయే ప్రాంతాలు దెబ్బతింటాయో పరిశీలించాలని నగరపాలక సంస్థ, సుడా అధికారులను ఆదేశించారు. దీంతో ఆయా శాఖలోని ప్రణాళికా విభాగం అధికారులు మంగళ, బుధవారాల్లో సర్వే నిర్వహించారు. ఈ రోడ్డు పరిధిలో ఏయే భవనాలు దెబ్బతింటాయో పరిశీలించి నివేదించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. దీని ఆధారంగా మాస్టర్ ప్లాన్లో మార్పులు చేసి, ప్రభుత్వానికి నివేదించాలని నిశ్చయించారు. అటు తర్వాత మాస్టర్ ప్లాన్ వల్ల ఆలయాలు, అపార్ట్మెంట్లు, భవనాలు, ఆస్పత్రులు దెబ్బతింటాయని జిల్లా ప్రజా ప్రతినిధుల ద్వారా ప్రభుత్వానికి నివేదించి, కొత్తగా చేసిన మార్పుల మేరకు ప్రభుత్వం ఆమోదించేలా చేయాలని నిర్ణయించారు. అయితే ఈ రోడ్డు వేయాలనుకునే ప్రాంతంలో ఖాళీ స్థలాలు ఉన్న పక్షంలో వాటిలో మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా, కేవలం నగరపాలక సంస్థ అనుమతితో నిర్మించిన భవనాలను ఉంటే వాటిని పరిగణలోనికి తీసుకుంటారని సమాచారం. మాస్టర్ ప్లాన్లో చిన్న చిన్న మార్పులు చేయాలని జిల్లా అధికారుల నుంచి వచ్చిన ఆదేశాలు మేరకే సర్వే చేస్తున్నాం. ప్రజలు ఇబ్బందిపడకుండా ఉండే లా మాస్టర్ ప్లాన్ను రూపొందిస్తాం. గతంలో ఆమోదించిన మాస్టర్ ప్లాన్లో స్వల్ప మార్పులు చేసి భవనాలు లేని ప్రాంతం నుంచి 150 అడుగుల రోడ్లు, ఇతర రోడ్లు నిర్మాణం అయ్యేలా కొత్తప్లాన్ రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తాం. జిల్లా అధి కారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా కొత్తగా ప్లాన్ తయారుచేసి తమ దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. – ప్రసాదరావు, శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ -
‘స్పిరిట్ కలపలేదు’
శ్రీకాకుళం క్రైమ్ : సారవకోట మండలం ఆవలంగి గ్రామంలో ఎకై ్సజ్ పోలీసులు గత నెల 3న పట్టుకున్న నకిలీ మద్యం కేసుపై పాతపట్న సీఐ కోటు కృష్ణారావు గురువారం వివరణ ఇచ్చారు. రోడ్డుపై ఖాళీ మద్యం బాటిళ్లు ఏరుకుంటున్న వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఆ రోజున 211.90 లీటర్ల నకిలీ మద్యం పట్టుకున్నామని, దుర్గా వైన్షాపులో అనధికారికంగా అమ్మకాలు జరుపుతున్న ఐదుగురు ముద్దాయిలను గుర్తించామన్నారు. స్పాట్లోనే ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా, షాపు లైసెన్సుదారున్ని అదే నెల 15న అరెస్టు చేసి రిమాండ్కు పంపించామన్నారు. లేబ్ రిపోర్టు ప్రకారం మద్యంలో ఎటువంటి స్పిరిట్ ఉపయోగించలేదని చెప్పారు. కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి జాతరకు వచ్చే లక్షలాది ప్రజల డిమాండ్ దృష్ట్యా రూ.99బాటిళ్లలోని మద్యాన్ని నీటితో కలిపి రూ.160 మద్యం సీసాలలో నింపుతున్న సమయంలో పట్టుకున్నట్లు వివరించారు. ముద్దాయిలు సకలాభక్తుల నీలకంఠేశ్వరరావు, పిట్ట పైడిరాజు హైకోర్టు నుంచి ఏంటిసిపేటరి బెయిల్ తెచ్చుకున్నారు తప్ప ఈ కేసు నుంచి ఎవరినీ తప్పించలేదన్నారు. సోంపేట: తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేందుకు పట్టుదలతో చదవాలని బిగ్బాస్ ఫేం, సినీ నటుడు సొహైల్ అన్నారు. గురువా రం సోంపేటలోని మహర్షి విద్యానికేతన్ను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. ముందుగా కంచిలిలో కంచమ్మ తల్లిని దర్శనం చేసుకున్నారు. అనంతరం సోంపేట మహర్షి విద్యానికేతన్ యాజమాన్యంతో ఉన్న పరిచ యం మేరకు పాఠశాలకు వచ్చి చిన్నారులతో సందడి చేశారు. శ్రీకాకుళం రూరల్: ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసిన బీఎస్సీ ఎలైడ్ అండ్ హెల్త్ కేర్ ఫలితాల్లో మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు గురువారం తెలిపారు. డిస్టింక్షన్లో 15 మంది, ప్రథమ శ్రేణిలో 43 మంది, ద్వితీయ శ్రేణిలో ఏడుగురు ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. అకడమిక్ డైరెక్టర్ లక్ష్మీపద్మజ మాట్లాడుతూ తమ విద్యార్థులు ప్రతీ ఏడాది ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నట్లు తెలిపారు. -
మసిబారుతున్న బతుకులు
రంగు మారిన కార్మికురాలి చేతులు మేం మత్స్యకారులమైనా చేపలు అమ్మకాలు చేయలేం. ఊరిలోనే ఉపాధి దొరకటంతో జీడి పరిశ్రమలో చేరాం. రోజుకు 20 కేజీల వరకు జీడి తొక్క తీస్తాం. కేజీ పిక్క తీయడానికి రూ. 28 ఇస్తున్నారు. చేతికి రక్షణ కోసం మేమే గ్లౌజ్లు కొనుక్కున్నాం. – మువ్వల తొపే, జీడి కార్మికురాలు, నువ్వలరేవు వజ్రపుకొత్తూరు రూరల్: ఉద్దాన ప్రాంతంలో లక్షలాది మంది రైతులు జీడి పంటను సాగు చేస్తూ జీవనోపాధి సాగిస్తుంటే.. పరోక్షంగా వేలాది మంది కార్మికులు జీడి పరిశ్రమల ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఇదంతా అంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. వేలాది మంది మహిళలు ఉపాధి మార్గాలు లేక తమ సంప్రదాయ వృత్తులను వీడి జీడి కార్మికులుగా మారుతున్నారు. పిక్కలను కట్ చేసేటప్పుడు, పిక్క నుంచి జీడి గుడ్డును వేరు చేసేటప్పుడు హానికరమైన జీడి చేతు లకు తగిలి ఎంతోమంది మహిళలు అనారోగ్యానికి గురవుతున్నారు. పల్లెలకు పాకిన జీడి పరిశ్రమలు: ఒకప్పుడు కాశీబుగ్గ, పలాస పట్టణాలకు పరిమత మై జీడి పరిశ్రమలు నేడు పల్లెలకు పాకుతున్నాయి. కాశీబుగ్గ ఇండస్ట్రీయల్ ఏరియాతో పాటు పలాస, టెక్కలిపట్నం రోడ్డు, గరుడబద్ర, అక్కుపల్లి, పాతటెక్కలి, అమలపాడు పరిసర ప్రాంతాల్లో దాదాపు గా 150 పరిశ్రమలు ఉన్నాయి. తాజాగా, నువ్వలరేవు, డోకులపాడు, చినడోకులపాడు, కొండవూరు, చినవంక,మందస మండలంలో గల మారు మూల ప్రాంతాలలో అదనంగా సుమారు 200 జీడి పరిశ్రమలను నెలకొల్పారు. కష్టానికి ఏదీ ప్రతిఫలం.. కొందరు జీడి పరిశ్రమ యజమానులు, వ్యాపారు లు తమ లాభార్జన చూసుకుంటున్నారే తప్పా పరిశ్రమలలో పని చేస్తున్న కార్మికుల సంక్షేమం, భద్రత పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నా యి. నువ్వలరేవులో వందలాది మంది మత్స్యకార మహిళలు సంప్రదాయ చేపల వృత్తిని వదిలి జీడి కార్మికులుగా మారారు. రోజుకు 10 –15 కిలోల జీ డి పిక్కలు వలుస్తుంటారు. కేజీ పిక్కలను రూ. 24 మాత్రమే ఇస్తుండటంలో కూలీ సరిపోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, కార్మిక అధికారులు స్పందించి తమకు భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. జీడి పరిశ్రమలలో కార్మిక చట్టాలను అతిక్రమిస్తే యజమానులపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిశీలిస్తున్నాం. ప్రతి కార్మికుడు ఈ–శ్రామిక్ కార్డు కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. – పి.విజయ్కుమార్, కార్మిక శాఖాధికారి, పలాస కార్మికులు పని చేసే చోట మరుగుదొడ్లు వంటి కనీ స వసతులు లేకపోవడంతో మహిళా కార్మికులకు ఇబ్బందులు తప్పడం లేదు. చేతులకు గాయాలు కాకుండా కనీసం రక్షణ సామగ్రి సమకూర్చడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నా యి. కార్మికులు అనారోగ్యానికి గురైనా యజమానులు నుంచి ఎలాంటి సహాయం అందడం లేదని పలువురు వాపోతున్నారు. చేతికి రక్షణ లేకుండా పని చేయడం వల్ల వేలి ముద్రలు అరిగిపోవడంతో ప్రభుత్వ పథకాల సమయంలో ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
గ్రామీణ బ్యాంకు సేవలకు బ్రేక్
● నాలుగు రోజుల పాటు అంతరాయం ● బ్యాంకుల విలీన ప్రక్రియే కారణం ● 13న తిరిగి సేవలు ప్రారంభం హిరమండలం: జిల్లాలో ఏపీ గ్రామీణ బ్యాంకు సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. గురువారం సాయంత్రం 6 గంటల నుంచి అన్ని రకాల ఆఫ్లైన్, ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని ఖాతాదారులకు వివిధ మాధ్యమాల ద్వారా ఇప్పటికే బ్యాంకు అధికారులు తెలియజే శారు. మళ్లీ ఈ నెల 13న ఉదయం 10 గంటలకు సేవలు ప్రారంభంకానున్నాయి. గ్రామీణ బ్యాంకుల విలీన ప్రక్రియ ఇందుకు కారణం. కొద్దిరోజు ల కిందట నాలుగో విడత బ్యాంకుల విలీన ప్రక్రి యకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఒక రాష్ట్రంలో ఒక గ్రామీణ బ్యాంకు మాత్రమే ఉండాలని సూచించింది. దీంతో రాష్ట్రంలో ఉన్న ఆంధప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంకులన్నీ విలీనం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా మారనున్నాయి. 4 గ్రామీణ బ్యాంకు లను విలీనం చేసే ప్రక్రియలో భాగంగానే సాంకేతిక అంశాలను సరిచేసేందుకు సేవలు నిలిపివేసినట్టు బ్యాంకు వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఏడు జిల్లా ల్లో విస్తరించి ఉంది. ఉత్తరాంధ్రలోని ఉమ్మడి జిల్లాలతో పాటు ఏలూరు జిల్లాలో 278 శాఖలు ఉన్నాయి. మన జిల్లాకు సంబంధించి 80 శాఖలు ఉన్నాయి. ఈ నెల 13 నుంచి ఈ శాఖలన్నీ ఏపీ గ్రామీణ బ్యాంక్గా సేవలందించనున్నాయి. మరోవైపు ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్ సేవలు సైతం నిలిచిపోయాయి. మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ఐఎంపీఎస్, ఏటీఎం సేవ లు, బ్యాంక్ మిత్ర సేవలు కూడా నిలిచిపోయా యి. దీంతో అత్యవసర పనులు ఉన్న ఖాతాదారు లు అసౌకర్యానికి గురయ్యారు. ముఖ్యంగా ఏపీజీవీబీల్లో స్వయం సహాయక సంఘాలు, గ్రామీణ ప్రజల సేవలు ఉంటాయి. ఇప్పటికే ఖాతాదారులకు బ్యాంకు వర్గాలు సమాచారం ఇచ్చినా, కొందరికి విషయం తెలియక అసౌకర్యానికి గురయ్యారు.గ్రామీణ బ్యాంకుల్లో సేవలు నిలిపివేతపై ఇప్పటికే ఖాతాదారుల కు సమాచారం ఇచ్చాం. విలీన ప్రక్రియలో భాగంగానే సాంకేతిక అంశాలను సరిచేస్తున్నారు. ఖాతాదారులు ఈ విషయంలో సహకరించాలి. 13న తిరిగి సేవలు ప్రారంభం కానున్నాయి. – పి.వెంకటనారాయణ, బ్రాంచి మేనేజర్, ఏపీజీబీ, ఎల్ఎన్పేట -
రెవెన్యూ సిబ్బంది తీరుపై కలెక్టర్ ఆగ్రహం
కవిటి: బల్లిపుట్టుగ రైతుల జాయింట్ ఎల్పీఎం, వన్బీ, అడంగల్ తదితర భూముల సమస్యలపై రెవెన్యూ సిబ్బంది వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తీవ్ర స్థాయిలోఆగ్రహం వ్యక్తం చేశారు. పలాస ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం జరిగిన నెలవారీ సమీక్షలో రైతుల సమస్యలపై తహసీల్దార్ మురళీమోహనరావును కలెక్టర్ ప్రశ్నించగా స్పందన లేకపోవడంతో సమావేశాన్ని అర్ధంతరంగా ముగించేశారు. నేరుగా బల్లిపుట్టుగ విచ్చేసి క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడారు. వీఆర్ఓ నుంచి మండల స్థాయి అధికారి వరకు ఎవరూ తమ గ్రామానికి సమస్య పరిష్కారం కోసం రాలేదని చెప్పడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో 220 ఖాతాలకు సంబంధించి జాయింట్ ఎల్పీఎంలో నమోదైన రైతులందరి నోటీసులు జారీ చేసి నోషనల్ ఖాతాలుగా మార్చి డీఆర్ఓ ఎం.వెంకటేశ్వరరావు, పలాస ఆర్డీఓ వెంకటేష్ పర్యవేక్షణలో రైతులకు భూమి హక్కు కల్పించేందుకు చర్యలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. దీనిపై ప్రతి రెండుగంటలకోసారి ఫోన్లో రివ్యూచేస్తానని తెలియజేసి వెనుదిరిగారు. -
కాసుల వరద
ఇసుకాసురులకు.. నరసన్నపేట : ఇసుక ధరలకు రెక్కలొచ్చాయి. పేరుకు ఉచితమైనా ట్రాక్టర్ ద్వారా తీసుకొచ్చేందుకు అమాంతం ధరలు పెంచేశారు. వంశధార నదిలో నీటి ఉద్ధతి పెరిగి నదీతీర గ్రామాల్లో వరద రావడం, ప్రస్తుతం నదిలో నీరు అధికంగా ప్రవహిస్తుండటంతో ఇసుకాసురులు ఇదే అదునుగా ధరలు పెంచేశారు. నదిలో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయంటూ ఉచిత ఇసుక ధరలను అమాంతం పెంచేసి సామాన్యులను దోపిడీకి గురిచేస్తున్నారు. పేరుకే ఉచితం.. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తొమ్మిది నెలలు తర్వాత ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చారు. ఇసుకను ఎవరైనా ఉచితంగా నది నుంచి తీసుకువెళ్లవచ్చని ప్రభుత్వం చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. వేసవిలో ట్రాక్టర్ ఇసుక ధర రూ.900 నుంచి రూ.3 వేలు వరకూ జిల్లాలో విక్రయాలు సాగాయి. అదే ఆగస్టులో ఈ ధరలు కొంత పెంచారు. వర్షాకాలం వచ్చింది.. నదిలోనికి ట్రాక్టర్లు వెల్లడం లేదు.. ఇసుక తవ్వకాలకు ఇబ్బంది అవుతుందని ట్రాక్టర్లు యజమానులు, ఇసుకాసురులు ధరలు నాలుగైదు వందలు పెంచారు. తాజాగా వారం రోజులుగా వంశధార నదిలో నీటి ఉద్ధృతి పెరిగింది. సమీపం గ్రామాలు ముంపునకు గురయ్యాయి. దీనిని అలుసుగా తీసుకొని ఇసుకాసురులు ఉచిత ఇసుక ధరలను అమాంతంగా పెంచేశారు. ముందే నిల్వలు.. వరద పరిస్థితి ఏర్పడుతుందని ముందుగా ఊహించిన ఇసుకాసురులు ఇప్పటికే జీడి తోటలు, తమ సొంత స్థలాలు, ఇళ్ల వద్ద భారీగా ఇసుక నిల్వ చేశారు. ఇదే ఇసుకను ఇప్పుడు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ట్రాక్టర్ ఇసుక నరసన్నపేట ప్రాంతంలో రూ.2300 పలుకుతోంది. దూరం బట్టి ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఉచిత ఇసుక ధరలు ప్రస్తుతం జిల్లాలో రూ.5 వేలు వరకూ ఉన్నట్లు సమాచారం. లారీల్లో విశాఖకు తరలించే ఇసుక ధరలు కూడా బాగా పెరిగాయి. లారీ ఇసుక ప్రస్తుతం రూ.25వేల వరకూ విక్రయాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఉచిత ఇసుకకు ఇంత ధరా అని గృహ నిర్మాణదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా అధికారులు దృష్టి సారించి ఇసుక ధరలను అదుపు చేయాలని పలువురు కోరుతున్నారు. ట్రాక్టర్లో అమ్మకానికి తీసుకువెళ్తున్న ఇసుక రూ.2400 చెల్లిస్తేనే.. ఇంటి పని చేస్తున్నాం. ఇసుక అవసరమని ప్రయత్నిస్తే ట్రాక్టర్ ఇసుక రూ.2400 అంటున్నారు. ఎందుకు ఇంత ధర అని ప్రశ్నిస్తే.. నదిలో నీరు వస్తుందమ్మా.. ఏదో మీరు అడుగుతున్నారు కాబట్టి ఈ ధరకు ఇస్తున్నాం.. లేకపోతే ఇంకా ఎక్కువ ధరే ఉంటుంది.. అని ట్రాక్టర్ డ్రైవర్ అంటున్నారు. అత్యవసరమై కొన్నాం. – బోగి పద్మజ, అనుపోజు అరుణకుమారి, జగనన్న కాలనీ, గడ్డెయ్యపేట -
చీటింగ్ కేసులో ఇద్దరు అరెస్టు
పాతపట్నం: చీటింగ్ కేసులో ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు. ఎస్ఐ కె.మధుసూదనరావు బుధవారం కేసు వివరాలు వెల్లడించారు. పాతపట్నం మండలం చిన్నపద్మాపురం గ్రామానికి చెందిన బి.వెంకట్రావు, సారవకోట మండలం గోవర్ధనపురం గ్రామానికి చెందిన జి.రమేష్లు పాతపట్నం నీలమణిదుర్గ అమ్మవారి ఆలయం సమీపంలో శేషారావు పేరిట భూమికి సంబంధించి ఫోర్జరీ సంతకాలతో తప్పుడు పత్రాలను సృష్టించారు. ఆ భూమిని పాతపట్నం శాంతినగర్కు చెందిన సీహెచ్ శ్రీనివాసరావుకు అమ్మచూపి, రూ.13.50 లక్షలు తీసుకుని మోసం చేశారు. తిరిగి డబ్బులు అడిగితే టెక్కలి మండలం లింగాలవలసకు చెందిన వై.గోపితో పాటు మరికొందరితో బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు సీహెచ్ శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంకట్రావు, రమేష్లపై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించామని ఎస్ఐ తెలిపారు. -
13 నుంచి ఐద్వా రాష్ట్ర మహాసభలు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): అనంతపురంలో ఈ నెల 13, 14, 15 తేదీల్లో జరగనున్న అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యులు బి.పద్మ పిలుపునిచ్చారు. బుధవారం ఎన్జీవో హోమ్లో ఐద్వా జిల్లా కన్వీనర్ అల్లాడ లక్ష్మి అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం విపరీతంగా పెరగడంతో యువత జీవితాలు సర్వనాశనం అవుతున్నాయన్నారు. మహిళా ఓట్లతో గెలిచిన ప్రభుత్వాలు మహిళా సాధికారత గాలికొదిలేశారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళా ఉద్యమాన్ని బలోపేతం చేసి, మహిళా హక్కుల సాధన దిశగా ఈ మహాసభలు మార్గదర్శకత్వం కానున్నాయన్నారు. కార్యక్రమంలో శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ కె.నాగమణి, సీఐటీయూ ఉపాధ్యక్షులు మహాలక్ష్మి, అంగన్వాడీ జిల్లా నాయకులు లతాదేవి, టి.ప్రవీణ, జి.అనురాధ, ఎం.లక్ష్మి, పి.శ్రీదేవి, జానకి, ఎం.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
కూర్మాలు, గోవులను చంపే సంస్కృతి మంచిది కాదు
గార: జిల్లాలోని పవిత్ర శ్రీకూర్మ క్షేత్రంలో కూర్మాలు, సింహాచలంలో గోవులను చంపే సంస్కృతి మంచిది కాదని గోవా గవర్నర్, శ్రీకూర్మనాథాలయం ధర్మకర్త పూసపాటి ఆశోకగజపతిరాజు అన్నారు. బుధవారం శ్రీకూర్మనాథాలయ ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణస్వీకారం కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్త హోదాలో ఆయన పాల్గొన్నారు. గవర్నర్ మాట్లాడుతూ సభ్యులు దైవ సేవ చేసేందుకే వచ్చామని భావించాలని, దేవునికి బాధ్యతతో పనిచేయాలన్నారు. చట్టరీత్యా ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేశారన్నారు. దేవస్థానంలోని ఆకుపసర చిత్రాలు (మ్యూరల్స్) వేసిన పూర్వీకుల నైపుణ్యాలను భావితరాలకు అందించాల్సి ఉందన్నారు. ట్రస్టు బోర్డు సభ్యులకు గైడ్లైన్స్ ఉన్న పత్రాలను ఇవ్వకపోవడంతో ఈఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు. అనంతరం స్వామిని దర్శించుకొని ఆలయంలో రాతి స్తంభాలు, ఆకుపసర చిత్రాలు, కాశీద్వారం పరిశీలించారు. శాలిహుండం బౌద్ధారామాలను సందర్శించి, కొండపై ఉన్న ఆరామాలను పరిశీలించారు. కార్యక్రమంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, దేవదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్పట్నాయిక్, అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు, ఎక్స్ అఫీషియో మెంబర్గా ఆలయ ప్రధానార్చకులు చామర్ల సీతారామనృసింహాచార్యులు, సభ్యులుగా కై బాడి కుసుమకుమారి, పల్ల పెంటయ్య, గొండు శ్రీనివాసరావు, అంధవరపు మౌనిక, ఆరవెల్లి శ్వేతబిందు, తాన్ని సూరిబాబు, మళ్లా కల్యాణచక్రవర్తి, జమ్ము లక్ష్మీతో ఆలయ ఈవో కోట నరసింహానాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. -
రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్ మృతి
గార: సతివాడ పంచాయతీ మాజీ సర్పంచ్ గంగు ప్రభాకరరావు (రమణ)() బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శుభకార్యం నిమిత్తం గార వైపు వెళ్తుండగా నిజామాబాద్ –తూలుగు జంక్షన్ మధ్య బైక్ అదుపు తప్పడంతో కింద పడిపోయారు. ఈ ఘటనలో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రభాకరరావుకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మాజీ సర్పంచ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. 13 నుంచి ఎఫ్ఏ –2 పరీక్షలు నరసన్నపేట: పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యం తెలుసుకొనేందుకు ఎఫ్ఏ–2 పరీక్షలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 13 నుంచి ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు స్కూల్స్లో విద్యార్థులు ఈ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రశ్న పత్రాలు ఆయా మండలాల ఎంఆర్సీలకు వచ్చాయి. ఒకటి నుంచి ఐదు తరగతులకు చెందిన విద్యార్థులు 13న ఉదయం తెలుగు(మొదటి లాంగ్వేజ్), సాయంత్రం గణితం, 14న ఉదయం ఇంగ్లీషు, సాయంత్రం ఎన్విరాల్మెంటల్ సైన్స్, 15న ఓఎస్ఎస్సీ పరీక్షలు రాయనున్నారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు 13న ఉదయం తెలుగు, సాయంత్రం గణితం, 14న ఉదయం హిందీ, సాయంత్రం జనరల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ రాయాల్సి ఉంటుంది. 15న ఉదయం ఇంగ్లీషు, సాయంత్రం సోషల్, 16న బయోలాజికల్ సైన్స్, సాయంత్రం ఓఎస్ఎస్సీ పరీక్షలు రాయనున్నారు. ఈమేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నరసన్నపేట ఎంఈఓ శాంతారావు తెలిపారు. -
నేత్రం.. జరభద్రం!
● చిన్నప్పటి నుంచే పెరుగుతున్న కంటి సమస్యలు ● తీవ్రంగా ప్రభావం చూపుతున్న ఫోన్ వినియోగం ● నేడు ప్రపంచ దృష్టి దినోత్సవం శ్రీకాకుళం కల్చరల్: సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. అంతటి ప్రాముఖ్యత కలిగిన నేత్రాలపై కొందరు అశ్రద్ధ వహిస్తున్నారు. ఫలితంగా చిన్నప్పటి నుంచే దృష్టి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కళ్ల సంరక్షణపై అవగాహన పెంచేందుకు ఏటా అక్టోబర్లో వచ్చే రెండో గురువారాన్ని ‘ప్రపంచ దృష్టి దినోత్సవం’గా జరుపుకుంటున్నారు. అంధత్వం, దృష్టిలోపం కలగకుండా ప్రజలను చైతన్యపరిచేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలా వద్దు.. ● నిద్రలేవగానే సెల్ చూడడం వల్ల ఒత్తిడి పెరిగి శరీరంలో అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిద్రపోయే ముందు మొబైల్ వాడటం వల్ల నిద్రలేమి కలుగుతుంది. ● స్మార్ట్ ఫోన్ ఎక్కువ సమయం వాడితే కళ్లు పొడిబారి, మసకబారి తలనొప్పి మొదలవుతుంది. ‘డ్రై ఐ సిండ్రోమ్’ అనే కంటి వ్యాధికి గురవుతారు. ● విద్యార్థులు స్మార్ట్ ఫోన్లో ఎక్కువ సమయం అనుచితమైన విషయాలు, వీడియోలు చూడటం వల్ల నేర ప్రవృత్తికి మరలే ప్రమాదం ఉంది. ● కళ్లకు సరైన విశ్రాంతి లేకపోవతే చూపు మందగిస్తుంది. కళ్లు సరిగా కనపడక చిన్నతనంలోనే కళ్లద్దాలు వస్తాయి. ఇలా ముద్దు.. ● స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ స్క్రీన్కు కంటికి మధ్య కనీసం 25 అంగుళాల దూరం ఉండాలి. ● ప్రతి 20 నిమిషాలకు కళ్లకు విశ్రాంతి ఇవ్వాలి. నేత్రాలను క్రమపద్ధతి ప్రకారం మూసి తెరవడం వల్ల కళ్లు తేమగా మారి ప్రకాశవంతంగా ఉంటాయి. ● దృష్టిలోపం ఉన్నట్లు భావిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి కళ్లద్దాలు ధరించాలి. ● బ్లూరే కట్, యాంటీ గ్లేర్ గ్లాసెస్ ఉపయోగించడం మంచిది. ● ఆహారంలో పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అవగాహన కల్పిస్తున్నాం.. జాతీయ అంధత్వ, దృష్టిలోప నివారణ కార్యక్రమంలో భాగంగా అంధత్వ నివారణ సంస్థ సౌజన్యంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎన్జీవో కంటి ఆసుపత్రుల్లో కంటి వైద్య సేవలు ఉచితంగా అందజేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలో అవగాహన సదస్సులు నిర్వహించి విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాం. – డాక్టర్ ఎస్.పుష్పలత, ప్రోగ్రాం మేనేజర్, జిల్లా అంధత్వ నివారణ సంస్థ, శ్రీకాకుళం నేత్రాలపై శ్రద్ధ అవసరం.. కళ్లపై శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా చిన్నారుల కంటి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. స్కూల్లో చేర్చే ముందే కంటిపరీక్షలు చేయించాలి. మధుమేహం, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, 40 ఏళ్లు పైబడిన వారి ప్రతి ఏడాది తప్పని సరిగా నేత్రవైద్య నిపుణులను సంప్రదించడం వల్ల శాశ్వత అంధత్వం నుంచి తప్పించుకోవచ్చు. – ఎం.ఆర్.కె.దాస్, ఆప్తాలమిక్ అధికారి -
శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి ప్రత్యేక గుర్తింపు
ఎచ్చెర్ల: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అగ్రశేణి విశ్వవిద్యాలయాల్లో నిర్వహించే ఐబీఎం క్వాంటమ్ క్యూస్కిట్ పాల్ ఫెస్ట్–2025లో భాగంగా ఆర్జీయూకేటీ (ఐఐఐటీ) శ్రీకాకుళంను ఐబీఎం క్వాంటమ్ ప్రత్యేకంగా ఎంపిక చేసింది. మన దేశం నుంచి కేవలం పది వర్సిటీలకు మాత్రమే ఈ అవకాశం రాగా మన రాష్ట్రం నుంచి ఆర్జీయూకేటీ మాత్రమే ఉండడం విశేషం. ఆర్జీయూకేటీ విద్యార్థులు కాటం నిఖిల్, తేజ, కాశీం వాలీ, దూదేకుల ప్రవీణ్కుమార్, చెరుకూరి జాన్బాబు, చదువులు గురుశ్రీకిమ్మిడి ఇచ్చిన ప్రజెంటేషన్ ద్వారా ఈ ఘనత సాధ్యమైంది. ఈ ఫెస్ట్ అక్టోబర్ 21 నుంచి 27 వరకూ ఆర్జీయూకేటీ నాలుగు క్యాంపస్లు శ్రీకాకుళం, నూజివీడు, ఒంగోలు, ఆర్.కె వ్యాలీలలో జరగనుంది. దేశవ్యాప్తంగా విద్యార్థులు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులు ఆన్లైన్లో పాల్గొంటారు. ఈ ఫెస్ట్లో క్వాంటమ్ కంప్యూటింగ్ అభివృద్ధి, ఈ రంగంలో ఉన్న అవకాశాలపై అవగాహన పెంపొందించేందుకు వర్క్షాప్లు, నిపుణుల ఉపన్యాసాలు, హ్యాక్థాన్ నిర్వహిస్తారు. వర్సిటీకి ఇది గర్వకారణమని శ్రీకాకుళం క్యాంపస్ డైరెక్టర్ కేవీజీడీ బాలాజీ తెలిపారు. ఈ టెక్నికల్ ఫెస్ట్కు డీన్ ఎకడమిక్స్ డాక్టర్ ఎం. శివరామకృష్ణ కన్వీనర్గా, విద్యార్థుల కో ఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు. -
న్యాయ పోరాటం చేద్దాం
● రైతు సంఘం నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు పలాస: పచ్చటి ఉద్దానంలో నిర్మించతలపెట్టిన కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా న్యాయ పోరా టం చేయాలని మాజీ మంత్రి, రైతు సంఘం నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు పిలుపునిచ్చారు. మందస మండలం ఎం.గంగువాడ గ్రామంలో బుధవారం కార్గో ఎయిర్పోర్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ బహిరంగ సభ నిర్వహించా రు. కార్గో ఎయిర్ పోర్టు నిర్మాణ కమిటీ అధ్యక్షుడు కొమర వాసు అధ్యక్షతన జరిగిన ఈ సభలో శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ జిల్లాకు పోరాటాల్లో ఘనమైన చరిత్ర ఉందన్నారు. ఆంధ్ర ఉద్యమాల ఐక్య వేదిక కన్వీనర్ మహదేవ్ మాట్లాడుతూ పోలీసు నిర్బంధం పైన హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తామన్నారు. అడుగడుగునా ఆంక్షలేమందస: మందస మండలం ఎం.గంగువాడ గ్రామంలో కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా రైతులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పోలీసులు అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. ఎక్కడికక్కడ పోలీసు వాహనాలు పెట్టి బహిరంగ సభ అడ్డుకోవడానికి ప్రయత్నించారు. చివరకు తోటలో నిర్వహించుకోవడానికి షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. వ్యతిరేకంగా పోరాటం చేస్తాం.. కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా 15 నెలల నుంచి పోరాటం చేశాం. దానిపై ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పుడు బహిరంగ సభ ఏర్పాటు చేస్తే పోలీసులతో నిలిపివేయించారు. ఇలాంటి కుతంత్రపు రాజకీయాలు ఎందుకు..? – బత్తిన లక్ష్మణరావు, భేతాళపురం ఉద్దానాన్ని వదులుకోబోము.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా కార్గో ఎయిర్పోర్టును నిలిపి తీరుతాం. మా పచ్చటి ఉద్దానాన్ని వదులుకోవడానికి మేం సిద్ధంగా లేము. – కె.మోహన్రావు, సీపీఎం కార్యదర్శి -
ఆకాశ దీపం వెలిగింది
జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగం ఆలయంపైన బుధవారం ఆకాశ దీపం వెలిగించారు. ఒడిశా సంప్రదాయం ప్రకారం ఆశ్వ యుజ మాసం పౌర్ణమి అనంతరం బహుళ పాఢ్యమి నుంచి కార్తీక పౌర్ణమి వరకూ ఇలా ప్రతి రోజూ అర్చకులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి దీపాన్ని వెలిగిస్తారు. పాఢ్యమి నుంచి కార్తీక పౌర్ణమి వరకూ ఒడిశా నుంచి భక్తుల తాకిడి ఉంటుందని అర్చకులు తెలిపారు. అలాగే ఒడిశా వాసులు గౌరీపౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకూ కార్తీక మాసంగా పాటిస్తారు. నాడు కాదని.. నేడు అదే పని! శ్రీకాకుళం: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేస్తున్న ప్రకటనలకు చేపడుతున్న పనులకు పొంతన లేకుండా పోతోంది. గతంలో వైఎస్సార్సీపీ హయాంలో కొందరు టీచర్లకు రాష్ట్రస్థాయిలో బదిలీలను చేశారు. అయితే విద్యా సంవత్సరం పూర్తయ్యే నాటికి ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారడంతో వీరిని రిలీవ్ చేయలేదు. అప్పట్లో నారా లోకేష్ రాష్ట్రస్థాయి బదిలీలపై విమర్శలు గుప్పించారు. అధికారంలోకి రాగానే ఆ బదిలీలను రద్దు చేశారు. ఇప్పు డు తాజాగా కూటమి ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో బదిలీలు చేయడం గమనార్హం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటివరకు ఓ ఉపాధ్యాయురాలికి ఇలా బదిలీ జరిగింది. ఈమె భర్త ఓ ప్రజా ప్రతినిధి వద్ద పీఏగా పనిచేస్తున్నట్లు సమాచా రం. పైగా దీన్ని రహస్యంగా ఉంచేందుకు ప్రయత్నించడం విమర్శలకు తావిస్తోంది. బదిలీల ఉత్తర్వులు సహజంగా మెయిల్స్ ద్వారా విద్యా శాఖకు వస్తుంటాయి. ఈసారి మాత్రం బదిలీల ఉత్తర్వులు జిల్లా విద్యాశాఖ అధికారుల వాట్సాప్కు పంపడాన్ని ఉపా ధ్యాయ వర్గాలు తప్పుపడుతున్నాయి. సువర్ణభూషిత కూర్మనాథుడు ● దశాబ్దాల తర్వాత కూర్మనాథునికి ఆభరణాల అలంకరింపు ● 80 ఏళ్లుగా సింహాచలం దేవస్థానంలో భద్రపరిచిన వైనం గార: ఎనభై ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కూర్మనాథుని సువర్ణ ఆభరణాలు మళ్లీ స్వామి విగ్రహాన్ని అలంకరించాయి. ఎనిమిది దశాబ్దాల పాటు సింహాచలంలోనే ఉండిపోయిన ఆభరణాలు మళ్లీ ఇన్నాళ్లకు అవి శ్రీకూర్మం చేరాయి. శ్రీకూర్మనాథుని ఉత్సవమూర్తులు శ్రీదేవి, భూదేవి, గోవిందరాజస్వామి, శ్రీరామ, లక్ష్మణస్వామి, సీతమ్మ వార్లకు బంగారు ఆభరణాలను బుధవారం అలంకరించారు. సుమారు 3 కిలోల బంగారం కలిగిన ఆభరణాల్లో గోవిందరాజస్వామి, శ్రీరామ, లక్ష్మణ విగ్రహాలకు వక్ష స్థలం, కవచాలు, కంటెలు, భుజ కీర్తులు వంటివి ఉండగా, అమ్మవార్ల విగ్రహాలకు కిరీటాలతో పాటు మెడలో వేసుకున్న శేరులు వంటివి ఉన్నాయి. 80 ఏళ్ల కిందట ఆభరణాలకు ఆలయంలో రక్షణం కల్పించలేమని అప్పటి అధికారుల అభ్యర్థనతో సింహాచలం దేవస్థానంలో భద్రపరిచారు. అప్పటి నుంచి శ్రీకూర్మనాథాలయంలో జరిగే ప్రధాన ఉత్సవాలైన డోలోత్సవం, కల్యాణోత్సవం, శ్రీకూర్మనాథుని జయంత్యుత్సవాలకు సైతం వీటిని తీసుకురాలేదు. ఆలయంలో పనిచేస్తున్న వైదిక సిబ్బంది, అధికారులు చాలా మంది వీటిని ఇప్పటివరకు చూడలేదు. దేవస్థానం ధర్మకర్త పూసపాటి అశోకగజపతిరాజు గోవా గవర్నర్గా బాధ్యతలు తీసుకోవడానికి ముందు ఆలయానికి వచ్చి దీనిపై లేఖ రాస్తానని చెప్పారు. గురువారం ఉదయం భద్రత నడుమ తీసుకువచ్చి గర్భగుడి సమీపంలోని అద్దాల మంటపంలోని స్వామి ఉత్సవ మూర్తులకు అలకరింపజేసి భక్తుల దర్శనార్థం ఉంచారు. -
శ్రీకాకుళం
సారవకోట మండలం అవలింగి సమీపంలోని దుర్గా వైన్ షాపులో, సమీపంలోని ఇంట్లో సెప్టెంబర్ 2వ తేదీన నకిలీ మద్యం దొరికింది. మందుబాబుల ప్రాణాలు తీసే మద్యంగా అనుమానాలు ఉన్నాయి. ఒడిశా, చత్తీస్గఢ్ నుంచి తీసుకొచ్చిన ఆల్కహాల్కు కలర్ కలిపి నకిలీ మద్యం తయారు చేసి, బాటిలింగ్ చేసి విక్రయిస్తున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. దానికోసమే ఏకంగా ఇళ్లు అద్దెకు తీసుకుని, ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ ఇంట్లో వేలల్లో ఖాళీ సీసాలు, నకిలీ మూతలు, బ్యాచ్ నంబర్ స్టాంపింగ్ మిషన్ వంటివి దొరికాయి. అంతకుముందు టెక్కలి ఆర్టీసీ డిపో సమీపంలో ఓ మద్యం దుకాణంలో కొన్న సీసా సీల్లో తేడా ఉండటాన్ని గుర్తించారు. మూతతీసి చూసి మద్యం కల్తీ అయిందని గుర్తించారు. రెగ్యులర్గా అదే బ్రాండ్ తాగే వ్యక్తికి తేడా తెలియడంతో కల్తీ అయిందని గోల పెట్టారు. గురువారం శ్రీ 9 శ్రీ అక్టోబర్ శ్రీ 2025 -
● క్షతగాత్రులకు పరామర్శ
టెక్కలి: మెళియాపుట్టి మండలం గంగరాజపురం సమీపంలో రాజయోగి గ్రానైట్ క్వా రీలో జరిగిన సంఘటనలో తీవ్రంగా గాయపడి టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను బుధవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తదితరులు పరామర్శించారు. సంఘటన వివరాలను క్షతగాత్రులను అడిగి తెలుసుకున్నారు. అలాగే వారి ఆరోగ్య పరిస్థితులపై ఆస్పత్రి సూపరింటెండెంట్ సూర్యారావును అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున మెరుగైన వైద్యం అందజేస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ భరోసా ఇచ్చారు. -
బెల్టుషాపులకే కల్తీ మద్యం..
జిల్లాలో తయారవుతున్న కల్తీ మద్యం బాటిల్స్ ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోని బెల్ట్షాపులకే వెళ్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో సిండికేట్ నడుస్తోంది. ఒకవైపు కౌంటర్లో ఎమ్మార్పీకి మించి విక్రయాలు చేపడుతుండగా, మరోవైపు పర్మిట్, బెల్ట్షాపులను ప్రోత్సహిస్తోంది. సిండికేట్ అంతా టీడీపీ నాయకుల చేతుల్లోనే ఉంది. వారు ఏం చెబితే అదే జరుగుతోంది. ఫలితంగా బెల్ట్షాపుల్లో తనిఖీలు, పట్టుకోవడాలు జరగడం లేదు. ముడుపులు నడుస్తుండటంతో అంతా గుట్టుగా సాగిపోతోంది. రాజకీయ విభేదాలు తలెత్తితేనే గుట్టు బయటపడుతోంది. -
గిరిజనులకు శాపం
ప్రకృతి ప్రకోపం.. నాణ్యతా లోపం.. ● ఇటీవల వర్షాలకు ఛిద్రమైన ఏజెన్సీ రోడ్లు ● రాకపోకలకు తప్పని పాట్లు మెళియాపుట్టి: ప్రకృతి ప్రకోపానికి తోడు పనుల్లో నాణ్యత లేకపోవడంతో గిరిజన రహదారులు అధ్వానంగా మారాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పలుచోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. ఉత్తరాంధ్రలోనే ఎత్తయిన గిరిజన గ్రామాలైన మెళియాపుట్టి మండలం కేరాసింగి, గూడ గ్రామాలకు వెళ్లే రహదారులు కనీసం నడవటానికి కూడా అవకాశం లేని స్థితికి చేరుకున్నాయి. కేరాసింగి రహదారిలో కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. కొత్తూరు వెళ్లే రహదారితో పాటు పలురోడ్లు కోతకు గురికావడంతో గిరిజనులు అవస్థలు పడుతున్నారు. అధికారులు పరిశీలనకు వచ్చి చూసి వెళ్లిపోతున్నారు తప్ప రహదారుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి రహదారులకు మరమ్మతులు చేయించాలని గిరిజనులు కోరుతున్నారు. -
జిల్లాకూ నకిలీ మకిలి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాష్ట్రాన్ని కుదిపేస్తున్న నకిలీ మద్యం ఆనవాళ్లు జిల్లాలోనూ కనిపించాయి. నిజానికి రాష్ట్రంలోని మిగతా చోట కంటే ముందే శ్రీకాకుళం జిల్లాలో ఈ బాగోతం బయటపడింది. ఇందులో టీడీపీ నాయకుడు మీసాల నీలకంఠం పాత్ర ఉన్నట్టు తేలింది. ఇప్పుడాయన ముందస్తు బెయిల్ కోసం యత్నిస్తున్నారు. ఒడిశాకు ఆనుకుని ఉన్న టెక్కలి, ఉద్దానం వంటి ప్రాంతాల్లో చీప్ లిక్కర్కు ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్(స్పిరిట్), కెరామల్ వంటి రసాయనాలు కలిపి ఏకంగా బాటిల్స్ తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఆంధ్రాలోని ఖరీదైన వైన్లో కూడా చీప్ లిక్కర్, వాటర్ మిక్సింగ్ చేసి బాటిల్స్ తయారు చేస్తున్నారు. ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో కల్తీ మద్యం దందా నడుస్తోంది. ముఖ్యంగా తీర ప్రాంతాలకు పడవలపై ఒడిశా నుంచి చీప్ లిక్కర్, సారా వస్తోంది. అక్కడి నుంచి వచ్చిన లిక్కర్ను జిల్లాలోని రహస్య ప్రాంతాలకు తరలించి బ్రాండ్ మిక్సింగ్ చేస్తున్నట్టుగా సమాచారం. దానికోసం ప్రత్యేకంగా ఖాళీ సీసాలు, నకిలీ మూతలు, బ్యాచ్ నంబర్ స్టాంపింగ్ మిషన్లను అక్రమార్కులు సమకూర్చుకున్నారు. సారవకోట మండలం అవలింగిలో ఇప్పటికే ఇవన్నీ దొరికాయి. రాజకీయ విభేదాల కారణంగా అక్కడ గుట్టు రట్టయ్యింది. లేదంటే గుట్టు చప్పుడుగా సాగిపోయేదే. మిగతా ప్రాంతాల్లోనూ ఈ రకమైన డెన్లు నడుస్తున్నట్టు తెలుస్తోంది. గుర్తించలేనంతగా.. జిల్లాలో నిపుణుల చేత కల్తీ చేయిస్తూ అసలేదో, కల్తీ ఏదో గుర్తించలేనంతగా మందుబాబులను మోసం చేస్తున్నారు. ఈ కల్తీ చాలా చోట్ల అనుభవం ఉన్న నౌకర్ నామాలే చేస్తున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. అందుకనే దాదాపు వైన్ షాపుల నిర్వాహకులు అనుభవం ఉన్న నౌకర్ నామాలను పెట్టుకుంటారు. దీనికి తోడు పర్మిట్ రూమ్లకు కూడా అనుమతి ఇవ్వడంతో కల్తీ మరింత సులభం అవుతోంది. లూజు అమ్మకాలు జరుగుతుండటంతో అక్కడికక్కడే బ్రాండ్ మిక్సింగ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కల్తీ మద్యంతోనే ప్రమాదం ఒడిశాకు అనుకుని సరిహద్దు ప్రాంతాలు జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఇచ్ఛాపురం, పలాస, పాతపట్నం, టెక్కలి తదితర నియోజకవర్గాలు ఒడిశాకు దగ్గరలో ఉన్నాయి. ఒడిశాలో ప్రస్తుతం చీప్ లిక్కర్ క్వార్టర్ బాటిల్ ధర రూ.70నుంచి రూ.150వరకు ఉంది. అదే ఆంధ్ర ప్రదేశ్లోనైతే రూ. 99నుంచి రూ.220వరకు ఉంది. ఇక్కడ కంటే ఒడిశా చీప్ లిక్కర్ క్వాలిటీ బాగుం ఒడిశా సరిహద్దు నియోజకవర్గాల్లో నకిలీ మద్యం తయారీ సారవకోట మండలం అవలింగిలో బయటపడిన నకిలీ మద్యం బాగోతం నకిలీ మద్యం కేసులో పరారీలో టీడీపీ నాయకుడు నీలకంఠం టెక్కలిలో బయటపడ్డ రెండు మూడు పరిణామాలు టీడీపీ నాయకుల చేతుల్లోనే సిండికేట్ నకిలీ, కల్తీ మద్యమంతా బెల్ట్షాపులకే వెళ్తున్న వైనం -
బుడ్డేపుపేటలో కార్డన్ సెర్చ్
ఇచ్ఛాపురం రూరల్: మండలంలోని బుడ్డేపుపేటలో రూరల్ ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తు లు, సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. తనిఖీల్లో ధ్రువీకరణ పత్రాలు లేని 16 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నా రు.గ్రామంలో నాటుసారా, గుట్కా, గంజాయి వినియోగం వలన కలిగే అనర్థాలను వివరించారు. ఇచ్ఛాపురం రూరల్: గ్రామాల్లో అధిక ధరలకు మద్యం అమ్ముతూ బెల్టు షాపులు నిర్వహిస్తున్నవారిపై దాడులు చేసి కేసులు నమోదు చేస్తామని రూరల్ ఎస్ఐ ఈ.శ్రీనివాస్ మంగళ వారం హెచ్చరించారు. మండలంలోని పాయి తారి గ్రామానికి చెందిన ఇండుగు భీమారావు తన ఇంట్లో బెల్టు షాపు నిర్వహిస్తున్నట్లు వచ్చి న సమాచారం మేరకు సోమవారం రాత్రి తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. దీనిలో భాగంగా మద్యం బాటిళ్లతో పాటు భీమారావును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. కంచిలి: మండలంలోని సిర్తలి గ్రామంలో కొత్త చెరువు గట్టుపై సోమవారం రాత్రి 11.30 గంట ల సమయంలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. దీనిలో భాగంగా ఏడుగురిపై కేసులు నమోదు చేసి, వారి నుంచి రూ.41 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ పి.పారినాయుడు మంగళవారం తెలియజేశారు. నరసన్నపేట: మండలంలోని మాకివలసలో పేకాట శిబిరంపై నరసన్నపేట పోలీసులు మంగళవారం దాడి చేశారు. గ్రామంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో నిఘా వేసి దాడి చేశామని, 16 మందిని అరెస్టు చేసి.. రూ.4,800లు సీజ్ చేసినట్లు ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ తెలిపారు. గ్రామాల్లో పేకాట ఆడితే ప్రజలు సమాచారం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చినవారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని పొట్టి శ్రీరాములు కూడలి వద్ద మద్యం మత్తులో ఒక యువకుడు రోడ్డుపై వీరంగం సృష్టించాడు. ఫలితంగా జిల్లా న్యాయస్థానం మంగళవారం 45 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ట్రాఫిక్ సీఐ నాగరాజు తెలిపిన వివరాల మేరకు.. సోమవారం సాయంత్రం నగరంలోని దమ్మలవీధికి చెందిన తమిరి సాయి మద్యం మత్తులో ద్విచక్ర వాహనంపై వస్తూ, పొట్టి శ్రీరాములు కూడలి వద్ద ట్రాఫిక్ పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డాడు. అక్కడే ఉన్న ఎస్ఐ సోమశేఖర్ నిలువరించినా వినకుండా రోడ్డుపైనే వీరంగం చేశాడు. అప్పటికే సమాచారం అందుకున్న సీఐ నాగరాజు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం రిమాండ్ నిమిత్తం కోర్టు ముందు హాజరుపర్చగా.. శ్రీకాకుళం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ 45 రోజుల జైలు శిక్ష విధించారు. వెంటనే సాయిని అంపోలు జైలుకు ట్రాఫిక్ పోలీసులు తరలించారు. -
పోడు పంట.. ఆరోగ్యకరమంట..!
మెళియాపుట్టి: ప్రస్తుతం మనం తీసుకునే ఆహార పదార్థాల్లో అత్యధిక శాతం రసాయనిక ఎరువులు వినియోగించి పండించినవే. మార్కెట్లో రసాయనిక ఎరువు లు లేకుండా పండిన కూరగాయలు, పండ్లు దొరక డం ఈరోజుల్లో గగనమైపోయింది. అయితే ఇటువంటి తరుణంలో మండలంలోని సవర జాడుపల్లి గ్రామానికి చెందిన గిరిజనులు పోడు భూముల్లో సేంద్రియ పద్ధతిలో పంటలు, పండ్లను పండిస్తూ ఆరోగ్యానికి భరోసానిస్తున్నారు. వారికి ఉన్నటువంటి పోడు భూముల్లో నిత్యం పనులు చేసుకుంటూ ఆరోగ్యకరమైన పంటలకు ప్రాధాన్యమిస్తూ జీవన భృతిని కొనసాగిస్తున్నారు. సీతాఫలం, జామ, అర టి, పనస, అనాస, బొప్పాయి, మామిడి, జీడి వంటి పంటలను పండిస్తూ గ్రామ సమీపంలోని రహ దారి వద్ద విక్రయిస్తుంటారు. సహజ సిద్ధంగా పండి స్తున్న పంటలు కావడంతో రాహదారిలో రాకపోక లు సాగించేవారు అధికంగా కొనుగోలు చేస్తుంటా రు. అయితే ప్రభుత్వ సహకారం అందిస్తే మరిన్ని రకాలైన కమలా, బత్తాయి, దానిమ్మ, నిమ్మ లాంటి తోటలు పెంపకానికి అవకాశం ఉంటుందని అక్కడి గిరిజనులు చెబుతున్నారు. -
సీజనల్ వ్యాధుల కట్టడికి చర్యలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఇటీవ కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల అధికారులతో వివిధ శాఖల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో ఎక్కడా వృథా నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. కాలువల శుభ్రపరిచే పనులను నిరంతరం కొనసాగించాలని సూచించారు. విద్యార్థులు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలో 16 మండలాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. సంతబొమ్మాళిలో 400 హెక్టార్లు, పాతపట్నంలో 250 హెక్టార్లు, కొత్తూరు, హిరమండలంలో 100 హెక్టార్ల చొప్పున నష్టం సంభవించినట్లు పేర్కొన్నారు. ధాన్యం మొలకెత్తడం, ధాన్యం పొట్టు దశలో నీరు చేరడం, పూత రాలిపోవడం వంటి నష్టం జరిగినట్లు తెలిపారు. దీనిపై తక్షణమే ప్రభుత్వానికి సమగ్ర నివేది క పంపిస్తామని కలెక్టర్ తెలిపారు. ఇంజినీరింగ్ పనుల్లో పూర్తయిన వాటికి బిల్లులు పెండింగ్లో ఉంచితే సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం ఇంటింటికీ జీఎస్టీ ఫలాల ప్రచారంపై సమీక్షించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, ప్రత్యేక ఉప కలెక్టర్లు బి.పద్మావతి, జయదేవి, ఇతర శాఖల అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. -
క్రైమ్ కార్నర్
కవిటి: మండలంలోని సహలాలపుట్టుగలో ఈనెల 1వ తేదీన జరిగిన అనుమానాస్పద మృతి కేసు వివరాలను కవిటి పోలీసులు మంగళవారం ఆలస్యంగా మీడియాకు తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గొనియా సురేష్ ప్రధాన్(25) ఈనెల 1వ తేదీన తన జీడితోటలో జీడిచెట్టుకు టవల్తో ఉరివేసుకుని వేలాడుతుండడంతో అతని అక్క కె.పద్మ చూసింది. వెంటనే గ్రామస్తులు కవిటి పోలీసులకు తెలిపారు. దీంతో 2వ తేదీ ఉదయం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అయితే అనుమానాస్పద మృతిగా నమోదు చేసి, విచారణ చేపడుతున్నట్టు కవిటి ఎస్ఐ వి.రవివర్మ తెలిపారు. ఈ విషయం ఎందుకు ఇన్ని రోజులు మీడియాకు వెల్లడించలేదని ప్రశ్నించగా.. తాను బందోబస్తు డ్యూటీకి వెళ్లిపోయినందువల్ల ఆలస్యం జరిగిందన్నారు. కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. మందస: లగేజీ ఆటో ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన మందస మండలంలో చోటుచేసుకుంది. తంగరపుట్టి గ్రామానికి చెందిన సవర విజయ్(25) సోమవారం మందస వచ్చి తిరిగి తమ గ్రామానికి వెళ్తుండగా రాయికోల గ్రామం వద్ద లగేజీ ఆటో ఢీకొంది. దీంతో తీవ్రగాయాలుపాలైన యువకుడిని వైద్యం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువకుడు మరణించారు. ఘటనపై మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంతబొమ్మాళి: మండలంలోని వడ్డితాండ్ర రైల్వే గేటు సమీపంలో ట్రాక్పై పడి ఒక గుర్తు తెలియని వ్యక్తి మంగళవారం రాత్రి మృతి చెందారు. వ్యక్తిపై నుంచి ట్రైన్ వెళ్లడంతో శరీరభాగాలు ముక్కలుగా పడి ఉన్నాయి. దీనిని గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని రైల్వే ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వ్యక్తికి సుమారు 30 సంవత్సరాలు ఉంటాయని స్థానికులు అంటున్నారు. రణస్థలం: మండలంలోని జీరుపాలెం పంచాయతీ జగన్నాథపురం గ్రామానికి చెందిన అంబటి యర్రయ్య (47) పడవ బోల్తాపడి మృతి చెందారు. జేఆర్పురం పోలీసులు, స్థానిక మత్స్యకారులు తెలిపిన వివరాల మేరకు.. అంబటి యర్రయ్యతో పాటు మరో ముగ్గురు వాసుపల్లి పోతయ్య, దుమ్ము అప్పన్న, సూరాడ లక్ష్మణలు సముద్రంలో మంగళవారం ఉదయం వేటకు వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం 2.30 గంటలకు ఒడ్డుకు వస్తున్న సమయంలో భారీ కెరటాలకు పడవ బోల్తా పడి నలుగురూ సముద్రంలో పడిపోయారు. వారిలో దురదృష్టవశాత్తు అంబటి యర్రయ్య సముద్రంలో మునిగిపోయి చనిపోయాడు. మిగతా ముగ్గురు ఒడ్డుకు క్షేమంగా చేరుకున్నారు. మృతుడికి భార్య యర్రమ్మ, ఇద్దరు కుమారుడు, కూతురు ఉన్నారు. జేఆర్పురం ఎస్ఐ ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.