19న రాజమండ్రిలో దళిత, గిరిజన మహాగర్జన
విజయవాడ(గాంధీనగర్): ఎస్సీ,ఎస్టీల సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 19న రాజమండ్రిలో దళిత, గిరిజన మహాగర్జన సభ నిర్వహిస్తున్నట్లు మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు ప్రత్తిపాటి ప్రసాదరావు తెలిపారు. స్థానిక ఐలాపురం హోటల్లో మాల మహానాడు కార్యకర్తల సమావేశం శుక్రవారం జరిగింది. ఆయన సభ వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు కృషిచేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీకి అనుకూలంగా హైకోర్టు తీర్పు వస్తుందని భావించినట్లు చెప్పారు. అనంతరం మాలమహానాడు అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రత్తిపాటి ప్రసాదరావును కార్యకర్తలు సత్కరించారు. సమావేశంలో మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి జోనీ కుమారి, యానాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుడుముల రామచంద్రయ్య, వై కొండలరావు , కెఈ శాస్త్రి, ఎల్వీ ప్రసాదరావు, తమ్మిశెట్టి నాగేశ్వరరావు పాల్గొన్నారు.