ఎలా ఆపాలో మాకు తెలుసు
మా వ్యూహం మాకుంది సీపీ యోగానంద్
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): విశాఖ బీచ్లో ఆందోళనకు దిగితే చూస్తు ఊరుకోం.. ఆందోళనను ఎలా ఆపాలో మాకు తెలుసు అని నగర పోలీస్ కమిషనర్ టి.యోగానంద్ చెప్పారు. నగర పోలీస్ కమిషనరేట్లో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఏం చేయాలి అనేదానిపై మా వ్యూహం మాకుందని చెప్పారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, లేదా ఇతర రాజకీయ, రాజకీయేతర పార్టీల నేతలు వచ్చినా సాగరతీరంలో ఎటువంటి ఆందోళనలు చేసేందుకు అనుమతి ఇవ్వమన్నారు. ఒకవేళ అక్రమంగా సాగరతీరంలో చొరబడి ఆందోళనకు దిగితే సహించేది లేదని హెచ్చరించారు. 26న గణతంత్ర దినోత్సవం కావడంతో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దేశమంతా రెడ్అలర్ట్ ఉందని పేర్కొన్నారు. విశాఖపట్నం కీలకమైన ప్రాంతమని ఇక్కడ తూర్పు నావికాదళంతో పాటు ప్రతిష్టాత్మకమైన సంస్థలు, కర్మాగారాలు ఉన్న నేపథ్యంలో ప్రత్యేక హోదా కావాలంటూ సాగర తీరాన నిరసనలు, ఆందోళనలు చేపట్టడానికి కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నించడం సరికాదన్నా రు.
కొవ్వొత్తుల ర్యాలీలు, మౌన, జలదీక్షలు వంటివి చేపడతామని సిద్ధం అవుతున్న వారెవ్వరికి అనుమతులు ఇవ్వలేదన్నారు. భద్రత దృష్ట్యా ఈనెల 26, 27, 28 తేదీల్లో ఇటువంటి నిరసనలు, ఆందోళనను అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే ఏ కార్యక్రమాన్ని అనుమతించమన్నారు. నిరసనలు, ధర్నాలపై అన్ని రాజకీయ పార్టీలు మరోసారి సమాలోచన చేయడం మంచిదని చెప్పారు. దీనిపై ఇప్పటికే రాజకీయ, రాజకీయేతర పార్టీలను హెచ్చరించడం జరిగిందన్నారు. నగరంలోకి ప్రవేశించే అన్ని రహదారుల్లో పటిష్టమైన చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. పక్క జిల్లాల నుంచి తరలివచ్చే వారిని నియంత్రించడంలో ప్రత్యేక వ్యూహాన్ని అనుసరిస్తామని తెలిపారు. అన్ని ప్రధాన కూడళ్లతో పాటు పలు సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని పోలీస్ కంట్రోల్ రూంకు అనుసంధానించామని వెల్లడించారు. aతీర ప్రాంతంలో నివసించేవారు తమ గుర్తింపు కార్డు, నివాసధ్రువ పత్రం తమతో పాటు ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. నగరంలో ఉన్న మూడు వేల మంది పోలీసు సిబ్బందితో పాటు అదనంగా ప్రత్యేక దళాలను రప్పిస్తున్నామని అన్నారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కమిషనర్ యోగానంద్ చెప్పారు.