Tamil film director
-
ఆస్పత్రిపాలైన ప్రముఖ హీరో తండ్రి!
కొట్టాయం(కేరళ): ప్రముఖ తమిళ హీరో విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ తీవ్ర అస్వస్థతతో బుధవారం ఆస్పత్రిలో చేరారు. 71 ఏళ్ల వయస్సున్న ఆయన ఒక్కసారిగా పడిపోవడంతో గాయాలయ్యాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కుమారకుమ్లోని ఓ రిసార్ట్లో ఆయన పడిపోయారని, దీంతో ఆయన తలకు, వెన్నెముకకు గాయాలయ్యాయని ఆ వర్గాలు వివరించాయి. దీంతో ఆయనకు అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించినట్టు తెలిపాయి. ఎస్ఏ చంద్రశేఖర్ తమిళంలో పేరొందిన దర్శకుడు- నిర్మాత. ఆయన ఎన్నో హిట్ సినిమాలను తెరకెక్కించారు. ఆయన వారసుడిగా తమిళ సినీ పరిశ్రమలో ప్రవేశించిన విజయ్ ప్రస్తుతం టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. విజయ్ తాజా సినిమా తెలుగులో 'పోలీసోడు'గా డబ్ అయిన సంగతి తెలిసిందే. -
దర్శకుడు త్రిలోకచందర్ ఇక లేరు!
నివాళి ఎన్టీయార్, ఎమ్జీయార్, శివాజీ గణేశన్, సూపర్స్టార్ కృష్ణ, రజనీకాంత్లతో పని చేసిన నిన్నటి తరం దర్శకుడు డాక్టర్ ఎ.సి. త్రిలోకచందర్ ఇక లేరు. ఆరు దశాబ్దాలుగా సినీ రంగంతో అనుబంధమున్న ఆయన బుధవారం మధ్యాహ్నం 2.45 గంటలకు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. తమిళనాడులోని వెల్లూరు జిల్లా ఆర్కాట్ ప్రాంతానికి చెందిన త్రిలోకచందర్ పూర్తి పేరు - ఎ. చెంగల్వరాయ ముదలియార్ త్రిలోకచందర్. తమిళ, తెలుగు, హిందీల్లో 65 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఎ.వి.ఎం.తో అనుబంధం! త్రిలోకచందర్ పేరు చెప్పగానే ఎన్టీయార్ ‘రాము’, ‘నాదీ ఆడజన్మే’, హీరో కృష్ణ ‘అవే కళ్ళు’ సహా పలు హిట్స్ గుర్తొస్తాయి. విద్యావంతులు సినిమాల్లోకి రావడమనే ధోరణికి తొలి ఆనవాళ్ళలో ఒకరు - త్రిలోకచందర్. ఆ రోజుల్లో ఎకనామిక్స్లో ఎం.ఏ చేసి, సివిల్ సర్వీస్ పరీక్షలు రాయడానికి సిద్ధమవుతూ, సినిమాల్లోకొచ్చారు. షేక్స్పియర్ లాంటి ప్రసిద్ధుల రచనల తమిళ అనువాదాలు తల్లి ద్వారా చిన్న నాటే పరిచయమయ్యాయి. దాంతో ఊహాశక్తి, సృజనాత్మకత పెరిగాయి. మిత్రుడైన నటుడు ఎస్.ఎ. అశోకన్ ద్వారా ఏ.వి.ఎం. అధినేత ఏ.వి. మెయ్యప్ప చెట్టియార్ కుమారుడు ఎం. శరవణన్తో జరిగిన పరిచయంతో త్రిలోక్ ప్రస్థానం మారిపోయింది. ఏ.వి.ఎం. కుటుంబంలో అందరితో ఆయనకు చివరి దాకా సాన్నిహిత్యం. తెలుగులో... ఇళయరాజా పరిచయకర్త! దక్షిణాది సినీరంగంలో తొలితరం మార్గదర్శకులైన ఆర్. పద్మనాభన్, కె. రామనాథ్ లాంటి వారితో కలసి పనిచేసిన అరుదైన అనుభవం త్రిలోకచందర్ది. మొదట్లో ‘ఎ.సి.టి. చందర్’ అనే పేరుతో కథ, స్క్రీన్ప్లే రచయితగా, ఆ పైన సహాయ దర్శకుడిగా ఆయన ప్రస్థానం సాగింది. ఎ.వి.ఎం ‘వీర తిరుమగన్’ (1962)తో దర్శకులయ్యారు. ‘మాయాబజార్’లో చిన్ననాటి శశిరేఖ పాత్ర దారిణి సచ్చుకి నాయికగా ఇదే తొలి చిత్రం. తమిళ నటుడు శివకుమార్ (హీరో సూర్య తండ్రి)ని ‘కాక్కుమ్ కరంగళ్’ ద్వారా పరిచయం చేసిందీ త్రిలోకే! ‘భద్రకాళి’(’77) ద్వారా మ్యూజిక్ డెరైక్టర్ ఇళయరాజాకు తెలుగు తెరంగేట్రం చేసిందీ ఆయనే. అటు శివాజీ... ఇటు ఎమ్జీయార్... తమిళ రంగంలో రెండు భిన్న ధ్రువాలైన అగ్రనటులు శివాజీ గణేశన్, ఎమ్జీయార్లు - ఇద్దరితో పనిచేసిన ఘనత త్రిలోకచందర్ది. శివాజీతో 25 సినిమాలు రూపొందించారు. ఎ.వి.ఎం. సంస్థ ఎమ్జీయార్తో తీసిన ఒకే చిత్రం ‘అన్బే వా’కు త్రిలోకే దర్శకుడు. సాహిత్య ప్రభావంతో... ‘అవే కళ్ళు’! బ్రిటీషు రచయిత సర్ ఆర్థర్ కానన్ డాయల్ సృష్టించిన ప్రైవేట్ డిటెక్టివ్ పాత్ర షెర్లాక్ హోమ్స్ అపరాధ పరిశోధనల తమిళ అనువాదాల్ని ఇష్టంగా విన్న, చదివిన అనుభవం త్రిలోకచందర్ది. చిన్నప్పటి ఆ డిటెక్టివ్ సాహిత్యపు పోకడల వల్లే ఆయన తెలుగులో కృష్ణ, కాంచన నటించిన ‘అవే కళ్ళు’(’67) కథ సొంతంగా రాసుకొన్నట్లు కనిపిస్తుంది. అపరాధ పరిశోధన చిత్రాల్లో ఇవాళ్టికీ ‘అవే కళ్ళు’ ప్రత్యేకంగా నిలిచిందంటే అందుకు త్రిలోక్ ప్రతిభే కారణం. ఎల్వీ ప్రసాద్కు ఏకలవ్య శిష్యుడు! ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో ‘ఆస్కార్’ అవార్డులకు మన దేశం పక్షాన ఎంట్రీగా వెళ్ళిన తొలి దక్షిణ భారత సినిమా ‘దైవ మగన్’ కూడా త్రిలోకచందర్ దర్శకత్వం వహించినదే! తెలుగు దర్శక - నిర్మాత ఎల్.వి. ప్రసాద్కి ఏకలవ్య శిష్యుడినని చెప్పుకొ న్నారు. కథ, స్క్రీన్ప్లే, సంగీతం - ఈ విభాగాల్ని బలంగా నమ్మిన త్రిలోక్ 5సార్లు ‘ఫిల్మ్ఫేర్’ అవార్డులు, తమిళనాడు ప్రభుత్వ ‘కలైమామణి’ బిరుదు అందుకున్నారు. అనుభవాలే ఉపాధ్యాయులన్న సూత్రాన్ని నమ్మిన ఆయన ఎవరి జీవితం నుంచి వారు పాఠాలు నేర్చుకోవాల్సిందే అనేవారు. కానీ, స్వీయానుభవాలు ఎన్ని ఉన్నా, సాహిత్యంతో అనుబంధం త్రిలోక్ను దర్శకుడిగా ప్రత్యేకంగా నిలిపిందన్నది నేటి సినీ తరం తెలుసుకోవాల్సిన పాఠం! - రెంటాల -
ఆ విషయంలో...ఆయనే నాకు స్ఫూర్తి: దాసరి
బాలచందర్ గారి లాంటి ఒక మహాదర్శకుడు కన్నుమూయడంతో భారతదేశంలో ఒక గొప్ప క్రియేటివ్ మ్యాన్ తన శకం ముగించినట్లయింది. నాకు ఆనాటి మద్రాసులో మొట్టమొదటి దర్శక మిత్రుడు బాలచందర్ గారు. మేము ఎప్పుడు కలసి మాట్లాడుకున్నా మా కబుర్లు నాటకాలు, సినిమాల గురించే సాగేవి. నిజానికి, మా ఇద్దరి జీవితాలూ చాలా ప్యారలల్గా నడిచాయి. సినిమాల కోసం ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. నేనూ అలాగే సినిమా కోసం నా ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఇద్దరం నాటకాల నుంచి సినిమాల్లోకి వచ్చినవాళ్ళమే. రంగస్థలంపై నటుడిగా, దర్శకుడిగా కొన్ని వందల ప్రదర్శనలు చేశారాయన. నేనూ అలాగే చేశాను. సినిమాల్లో ఆయన మొదట మాటల రచయితగా ప్రారంభించి ఆ తరువాత దర్శకుడయ్యారు. నేనూ అంతే! అందుకే, నా కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథి అయితే, ఆయన కార్యక్రమాలకు నేను ముఖ్య అతిథిగా వెళ్ళేవాణ్ణి. ఆయనను చివరిసారిగా శిల్పకళావేదికలో మా కార్యక్రమానికి వచ్చినప్పుడు కలిశాను. ఆయన చాలాసార్లు ‘నారాయణరావు గారూ! మీరంటే నాకు చాలా ఇష్టం’ అనేవారు. కారణం ఏమిటని అడిగితే... ‘మీరూ స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇష్టపడరు. నేనూ స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇష్టపడను. ఇద్దరం కొత్తవాళ్ళ కోసం, చిన్నవాళ్ళ కోసం కథలు రాసుకొని సినిమాలు తీస్తుంటాం. అలాగే తీసుకుందాం’ అనేవారు. నిజం చెప్పాలంటే, అలా కొత్తవాళ్ళతో, చిన్నవాళ్ళతో కొత్త తరహా కథలు రాసుకొని సినిమాలు తీయడంలో నాకు స్ఫూర్తి ఆయనే! బాలచందర్ సినీ జీవితాన్ని గమనిస్తే, ఆయన తీసుకొచ్చిన నటీనటులు స్టార్స్ అయ్యేవారు. అలా తన స్కూల్ నుంచి వచ్చిన స్టార్స్తో ఆయన సినిమాలు తీశారే తప్ప, ఒక్క శివాజీ గణేశన్ మినహా పెద్ద స్టార్లతో ఎప్పుడూ తీయలేదు! గమనిస్తే - ఆయన తీసుకొచ్చిన నటులు రజనీకాంత్, కమలహాసన్లు భారతదేశానికే సూపర్స్టార్లయ్యారు. అలాగే, ప్రకాశ్రాజ్ కూడా! ఇలా ఎంతోమంది ఆర్టిస్టుల్ని స్టార్స్ను చేశారాయన. సమాజంలో జరుగుతున్న అంశాలనూ, కొన్ని చేదు నిజాలనూ మనం సినిమా ద్వారా చెప్పాలని బాలచందర్ గారు నాతో ఎప్పుడూ అంటూ ఉండేవారు. నా సినిమాల్లో నేనూ ఆ పని చేస్తుండేవాణ్ణి కాబట్టి, ఆయన సంతోషించేవారు. మనిద్దరి కోణాలూ ఒకేలా ఉన్నాయనేవారు. ఆయన నాటకాలు ‘మేజర్ చంద్రకాంత్’ లాంటివి ఆయనతో కలసి కూర్చొని, చూసేవాణ్ణి. నా ప్రతి సినిమా ఆయనకు చూపించేవాణ్ణి. నాకు బాగా గుర్తు. నా ‘మేఘసందేశం’ చిత్రం చూసిన ఆయన ‘నారాయణరావ్! నేను ఇన్సై్పర్ అయ్యాను’ అన్నారు. ఒక దర్శకుడి నుంచి మరో దర్శకుడికి దక్కే అరుదైన ప్రశంస అది. ఆ మాటతో ఆగకుండా ఆయన ఆ కథలోని ఆత్మ తీసుకొని, తమిళంలో ‘సింధుభైరవి’ చిత్రం తీశారు. ‘మేఘసందేశం’ మోడల్లో, దానికి బాగా దగ్గరగా ఉండేలా ఆ సినిమా తీయడమే కాక, ఆ మాట చెప్పే చేయడం దర్శకుడిగా ఆయన సంస్కారం, గొప్పదనం. ఇక, ఆయన సినిమాల్లో నాకు బాగా నచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా, ఆయన తొలి రోజుల్లో తమిళంలో తీసిన సంచలనాత్మక ‘అరంగేట్రం’ చిత్రం చాలా బాగుంటుంది. ఇక, ఆయన సినిమా చూసి, ఆ కథ తెలుగులో నేను చేయాలనుకున్న సందర్భాలూ ఒకటి రెండు లేకపోలేదు. ఆయన అద్భుతంగా తీసిన తమిళ చిత్రం ‘అపూర్వ రాగంగళ్’ను తెలుగులో నేను ‘తూర్పు - పడమర’గా తీశా. పోస్టర్ మీద దర్శకుడి పేరు ప్రత్యేకంగా కనిపించేలా వేయడమనే సంస్కృతిని ఆయన తమిళంలో, నేను తెలుగులో తెచ్చాం. ఆయన మాత్రం సెంటిమెంట్గా తన పేరును కిందే వేసుకొనేవారు. నేను మాత్రం ‘అందరి కన్నా డెరైక్టరే టాప్ కాబట్టి, నా పేరు పోస్టర్లో పైనే వేసుకుంటా’ అని ఆయనతో అంటుండేవాణ్ణి. ఆయననూ, నన్నూ, కన్నడ దిగ్దర్శకుడు పుట్టణ్ణ కణగల్నూ ‘డెరైక్టర్స్ ఆఫ్ ది సౌత్’ అంటూ అప్పట్లో అందరూ గొప్పగా ప్రస్తావించేవారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా... ఒక పెద్ద హీరోకు ఉండేంత క్రేజున్న దర్శకుడు - బాలచందర్ గారు. ఆయనను చూసి ఈ తరం ఏం నేర్చుకోవాలంటే... దర్శకుడనేవాడు ఎప్పుడూ ఏ హీరో మోకాళ్ళ దగ్గరా ఉండకూడదని నేర్చుకోవాలి. మొదటి నుంచి చివరి దాకా అలాగే సింహంలా జీవించిన అలాంటి ఒక మహా వ్యక్తి ఈ రోజున లేరన్న నిజాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ చిత్ర పరిశ్రమలు జీర్ణించుకోలేవు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. (సంభాషణ - రెంటాల జయదేవ) -
ఆయన నుంచి...ఎవరూ సరిగ్గా నేర్చుకోలేదేమో!
సి. మృణాళిని ప్రముఖ రచయిత్రి, విశ్లేషకురాలు తెలుగు సినిమాల్లో స్త్రీలను బాగా చూపించడం (అంటే అందంగా కాదు) అనేది ఎవరూ పెద్దగా ఆశించే విషయం కాదు. అలా ఆశించిన వారికి ఆశాభంగమే. కాకపోతే ‘‘స్త్రీలను కంటతడి పెట్టించే సినిమాల’’నే స్త్రీ ప్రాధాన్య సినిమాలుగా భావించే సంప్రదాయం మనది. అలా ఏడ్పించే సినిమాలకు ఏమీ కొదవలేదు. అయితే, అలా ఏడిపించడం కంటే, దుఃఖించే సందర్భాల్లోనూ మనోనిబ్బరంతో, పరిణతితో ప్రవర్తించే స్త్రీలను సృష్టించిన అపురూప దర్శకుడు కె. బాలచందర్. ఆయన సినిమాలన్నిటిలోనూ ఆధునిక స్త్రీలో ఉన్న ఆత్మవిశ్వాసం, పరిణతితో కూడిన ఆలోచనా విధానం కనిపిస్తాయి. బాలచందర్గారికి స్త్రీల పట్ల అపారమైన గౌరవం, స్త్రీలకు ఈ సమాజంలో ఎదురవుతున్న పరిస్థితుల పట్ల అసహనం, వారి పట్ల సానుభూతి పుష్కలంగా ఉన్నాయి. అయితే, బహుశా ఆ సానుభూతి మాత్రమే ఉండి ఉంటే, ఈ రోజు మహిళా ప్రేక్షకులు ఆయన్ని అంతగా గుర్తు పెట్టుకోనవసరం లేదు. కానీ స్త్రీలను వ్యక్తులుగా చూసిన, అర్థం చేసుకున్న ఒక అపూర్వమైన దృష్టి ఆయనలో ఉంది. స్త్రీలలోని సున్నితత్వాన్ని ఇతరులు బలహీనతగా చూపిస్తే, ఆయన అదే సున్నితత్వాన్ని ఆమె బలంగా చూపారు. ఇతర దర్శకులకూ, ఆయనకూ బహుశా తేడా ఇక్కడే ఉంది. ముఖ్యంగా అంతులేని కథ, ఇది కథకాదు, గుప్పెడు మనసు, మరో చరిత్ర (మాధవి పాత్ర) మొదలైన సినిమాలు చూసినప్పుడు ఈ అభిప్రాయం బలపడుతుంది.స్త్రీ పాత్రల చిత్రణలో ఆయన ప్రత్యేకత వారిని దేవతలుగా కాక మనుషులుగా చూపడం. 1976లో వచ్చిన ‘అంతులేని కథ’ ఆనాటి స్త్రీలెందరి జీవితాలకో ప్రాతినిధ్యం వహించిన చిత్రం. అప్పుడప్పుడే స్త్రీలు కుటుంబ భారాన్ని మోయడం ప్రారంభమైంది. బహుశా మరో దర్శకుడైతే ఆ స్త్రీ (జయప్రద)ని సంపూర్ణ విషాదజీవిగా, స్వీయకరుణతో కుమిలిపోయేదానిగా, ఇంటిల్లిపాదినీ ఒక్క మాటా అనని సహనశీలిగా... అంటే అతిమానుష జీవిగా (లార్జర్ దేన్ లైఫ్) చూపించేవారేమో. కానీ బాలచందర్ ఆమెను రక్తమాంసాలున్న, ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన స్త్రీగా, అత్యంత సహజంగా చిత్రించారు. ఇంట్లో వాళ్లకు ఆమె ‘పెద్ద పులి’, పిల్లలకైతే ‘రాక్షసి’ కూడా. బయటకు వెళ్లి పదిమందిలో కూర్చుని పని చేసే తనకు మంచి దుస్తులు వేసుకోవాల్సిన అవసరం, హక్కూ కూడా ఉన్నాయని భావించే వాస్తవిక దృష్టిని చూపడం మరవలేదు దర్శకుడు. ఇంతకూ ఆమె చేసిన త్యాగాలు చిన్నవేమీ కాదు. తన ప్రేమను, వివాహాన్ని, విరామాన్ని అన్నిటినీ కోల్పోతుంది; తన శ్రమను సునాయాసంగా తక్కిన వాళ్ల కోసం ఖర్చు చేస్తుంది. కానీ ఒక త్యాగమూర్తిలాగా ప్రవర్తించదు; కుటుంబం పట్ల తన బాధ్యతను స్వీకరించాలని నిర్ణయించుకున్నాక, దాని నిర్వహణలో కలిగే మనస్తాపాలు వంటివి కూడా ప్రతి స్త్రీ అనుభవిస్తుందనీ, కుటుంబం, తన జీవితం - ఈ రెండింటి మధ్య ఉన్న సంఘర్షణను మనో నిబ్బరంతో ఎదుర్కొంటుందనీ చిత్రించడం ఆయన చేసిన గొప్ప పని. అంతేకానీ, స్త్రీ అంటే భూదేవి వంటి సహనమూర్తి అనే టైప్స్ లాగా ఆయన చిత్రించలేదు.ఇదే దృక్పథం ‘గుప్పెడు మనసు’ చిత్రంలో సుజాత పాత్రలో కూడ కనిపిస్తుంది. సుజాత ప్రసిద్ధ రచయిత్రి. తన నవలల్లో స్త్రీ పాత్రలకు ఆమె పేరు పొందింది. అభిమానులు కూడా చాలా మందే ఉన్నారు. కానీ నిజ జీవితంలో సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు తనలోని రచయిత్రి, తనూ వేర్వేరేమో అనుకుంటుంది. తను ఎంతగానో ప్రేమించే భర్త, తామిద్దరు కూతురిగా భావిస్తున్న యువతితో క్షణాకావేశంలో దైహిక సంబంధం పెట్టుకోవడాన్ని సహించలేకపోతుంది. క్షమించలేకపోతుంది. అతనితో కాపురం చేయలేకపోతుంది. అయితే సుజాతలో ఉన్న రచయిత్రి, సరితను మాత్రం అర్థం చేసుకోగలుగుతుంది. ఆ అమ్మాయి తప్పులేదనీ, తప్పంతా తన భర్తదేననీ భావిస్తుంది. తన కలలో సరితను చనిపోయినట్లుగా ఊహించుకుని ఆనందించినందుకు జాగ్రదావస్థలో తనని తానే అసహ్యించుకుంటుంది. సరితలో కూడ సుజాత పట్ల గౌరవం అమితంగా ఉన్నందువల్లే, శరత్బాబుతో ఒక్కరాత్రి సంబంధం వల్ల తనకు పుట్టిన పాపకు విద్య (సుజాత పేరు) అని పేరు పెట్టుకుంటుంది. అన్నిటికంటే ఇక్కడ చెప్పదగ్గ విషయం సరిత పాత్ర. తన తండ్రి వయస్సుగలిగిన వ్యక్తి అతను; అతను తనను లోబరచుకోవడానికి పూనుకున్నప్పుడు లొంగిపోయింది. అది పరిపక్వత లేని తన తప్పు కాదని ఇతరులు చెప్పినా, ఒప్పుకోదు. తనకు కూడ మనసులో ఎక్కడో అతని పట్ల కోరిక లేకపోతే వ్యతిరేకించి ఉండేది కదా. కానీ ఎందుకు ఆనందంగా లొంగిపోయింది? కనక తప్పు తనలోనూ ఉందని అనుకుంటుంది. అందుకే ఈ సంఘటనను పట్టించుకోకుండా తనని వివాహం చేసుకుంటానని వచ్చిన సుజాత తమ్ముడిని తిరస్కరిస్తుంది. అందరూ మంచి వాళ్లే. కానీ ఒకే బలహీన క్షణం ఇంతమంది జీవితాలనూ నాశనం చేసింది. పితృస్వామ్య వ్యవస్థలో సహజంగానే ఏ ఆపద జరి గినా, ఎక్కువ బాధపడేది స్త్రీలే. కానీ ఆ స్త్రీలిద్దరూ ఈ దుర్భరమైన సన్నివేశంలోనూ, ఎంత హుందాగా ప్రవర్తిస్తారో చూసినపుడు, బాలచందర్ వంటి దర్శకులు మనకెంత అవసరం కదా అనిపిస్తుంది. ఇక మూడో చిత్రం ‘ఇది కథ కాదు’. ఇది నిజంగా సంచలనాత్మక చిత్రమే అన్ని విధాలా. పురుషులతో స్త్రీ సంబంధాల్లో ఎన్ని సంక్షిష్టతలున్నాయో అన్నిటినీ చూపిస్తూ (చిరంజీవి, శరత్బాబు, కమల్హాసన్లతో జయసుధ అనుబంధం), స్త్రీల మధ్య అత్యంత సహజంగా ఉండ గలిగిన స్నేహబంధాన్ని (ముఖ్యంగా జయసుధ, అత్తగారి మధ్య) మనకు గుర్తు చేస్తూ, అత్యంత ఆలోచనాత్మకమైన సినిమాగా దీన్ని రూపొందించారు. ఇక్కడ కూడ జయసుధ పాత్ర కరుణాస్పదమై మాత్రమే ఉండేది మరో దర్శకుడి చేతిలో. కానీ బాలచందర్ చేతుల్లో మనందరి గౌరవం పొందేలా ఆమె ఉంటుంది. అసాధారణమైన ఇందులోని అత్తగారి పాత్ర ఈనాడు స్త్రీవాదులు చెప్పే ‘స్త్రీల ఐక్యత’కు ప్రోటోటైపా అన్నట్టుంటుంది. జయసుధ కృంగిపోయే పరిస్థితులు ఇందులో చాలానే వస్తాయి. కానీ ప్రతి సన్నివేశం నుంచీ మళ్లీ తనని తాను పునరుజ్జీవింపజేసుకునే ఒక సహజమైన ధైర్యం ఆమెలో చూపించి, ఆమె పట్ల మనకు అపారమైన గౌరవం కలిగిస్తారు దర్శకుడు. బహుశా మరో రకం దర్శకుడైతే, తనని ఎంతగానో ప్రేమించే కమలహాసన్ను ఆమె జీవిత భాగస్వామిని చేసుకున్నట్టు చిత్రించేవారేమో. కానీ, ఏ మగవాడూ అక్కర్లేకుండా తన జీవితాన్ని కొనసాగించగలనన్న ఆత్మ విశ్వాసాన్ని ఈమెలో చూపించి, ఒక ఆధునిక స్త్రీ ఎలా ఉండగలదో ఆయన మనకు చెప్పారు. చివర అత్తగారు ఆమెకు తోడుగా నిలవడంతో బంగారానికి తావి అబ్బినట్టే అయింది. ‘మరో చరిత్ర’లో మాధవి పాత్రలోనూ, ‘ఆకలిరాజ్యం’లో శ్రీదేవి పాత్రలోనూ ఒక ఆధునిక స్త్రీ జీవితంలోని సంఘర్షణ, దాన్ని ఆమె సంయమనంతో, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్న తీరు ఆయనకు స్త్రీల పట్ల ఎంత గౌరవం, నమ్మకం ఉన్నాయో తెలియజేసేవే. సింధుభైరవి, అపూర్వ రాగంగళ్ (తెలు గులో దాసరి గారి ‘తూర్పు పడమర’), ఆడవాళ్లూ మీకు జోహార్లు, జీవితరంగం మొదలైన మరెన్నో సినిమాలు ఆయన స్త్రీలను తను ఎంత వాస్తవిక దృష్టితో, అవగాహనతో చిత్రించారో రుజువు చేస్తాయి. సినిమాల్లో నాయికల ఆహార్యంలో కూడ ఆయన ఎంత సహజత్వాన్ని, హుందాతనాన్ని పాటించడానికి శ్రద్ధ తీసుకునేవారో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.బాలచందర్గారిని అభిమానించేవారు, గురువుగా భావించేవారూ చాలా మందే ఉన్నారు. కానీ ఆయన నుంచి, స్త్రీలను ఎలా చిత్రించాలో మాత్రం బహుశా ఎవ్వరూ సరిగ్గా నేర్చుకోలేదేమో! ఆయన ఓ చరిత్ర! ‘‘సినీ రంగంలో ఆయన కన్నా ఎంతో సీనియర్నైన నన్ను ఏరికోరి తన అసోసియేట్గా తీసుకున్నారు. నన్ను ‘తమ్ముడి లాంటి వాడు’ అనేవారు. తమిళ పత్రికలూ మా గురించి అన్నదమ్ములని ప్రస్తావిస్తూ రాసేవి. ‘భలే కోడళ్ళు’ మొదలు ‘మూణ్రామ్ ముడిచ్చు’ దాకా 16 చిత్రాలకు ఆయన దగ్గర పనిచేశా. రొటీన్కు భిన్నమైన చిత్రాలు చేయడం ఆయన గొప్పదనం. అందుకే, ఆయన పేరు అంతగా దేశవ్యాప్తమైంది. ఆయన గ్రేట్ లెజెండ్. మళ్ళీ అలాంటి మేధావి కానీ, అంత క్రియేటివ్ జీనియస్లు కానీ సినిమా రంగానికి రావడం కష్టం.’’ - ఈరంకి శర్మ, ‘చిలకమ్మ చెప్పింది’ దర్శకుడు - బాలచందర్కు సన్నిహితుడు ‘‘బాలచందర్గారి మరణం భారతీయ చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు.’’- కె. రాఘవేంద్రరావు, దర్శకుడు ‘‘దక్షిణాది దిగ్గజ దర్శకుల్లో కె. బాలచందర్ ముందు వరుసలో ఉంటారు. సినీ రంగానికి తన దర్శకత్వ ప్రతిభతో కొత్త మార్గం చూపించిన - మార్గదర్శకుడు.’’ఙ- మోహన్బాబు, నటుడు, నిర్మాత ‘‘మధ్యతరగతి జీవిత చీకటి కోణాల్ని అద్భుతంగా తెరకెక్కించిన par ఘనుడాయన.’- త్రివిక్రమ్ , దర్శకుడు, రచయిత ‘‘బాలచందర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.’’- రామ్చరణ్, నటుడు ‘‘చిరంజీవిగారితో ‘రుద్రవీణ’లాంటి సందేశాత్మక చిత్రం చేశారు బాలచందర్. ఎందరో నటీనటుల్ని స్టార్స్ చేసిన ఘనులు.’’ - అల్లు అర్జున్, నటుడు ‘‘సినీ సీమకు ఆయనో అద్భుతం’’ - బోయపాటి శ్రీను, దర్శకుడు ‘‘బాలచందర్ గారి ‘డ్యూయట్’ చిత్రానికీ,‘గుప్పెడు మనసు’ సహా అనేక టీవీ సీరియల్స్కూ తెలుగులో డబ్బింగ్ రచన చేసే అదృష్టం నాకు వచ్చింది. నా పని తీరు నచ్చి, ఆయన తన ‘కల్కి’ చిత్రాన్ని తెలుగులోకి స్వీయ నిర్మాణంలో డబ్ చేస్తూ ప్రత్యేకంగా నాకప్పగించారు. అలాగే, కమలహాసన్ ‘అవ్వై షణ్ముఖి’ చిత్రం తెలుగు అనువాదం ‘భామనే సత్యభామనే’ చూసిన బాలచందర్ ఆ చిత్ర శతదినోత్సవంలో వేదికపై అందరి ఎదుటా నన్ను ప్రత్యేకంగా మెచ్చుకొన్నారు. అది నాకు అత్యుత్తమ అవార్డు. ఆయనన్నా, ఆయన సృజన అన్నా నాకు అపార గౌరవం. అలాంటి మహానుభావుడు మళ్ళీ పుట్టడు!’’ - వెన్నెలకంటి, సినీ రచయిత -
దర్శకుడు రామనారాయణన్ ఇక లేరు
తమిళం, తెలుగుతో పాటు అనేక భాషల్లో సినిమాలు తీసిన శతాధిక చిత్ర దర్శకుడు రామనారాయణన్ (66) ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో సింగపూర్లో కన్నుమూశారు. గత కొంత కాలంగా మూత్ర పిండాల సమస్యతో బాధపడుతున్నారాయన. గత ఏడాది సింగపూర్లో చికిత్స పొందారు. ఇటీవల మళ్ళీ మూత్ర పిండాల సమస్య తలెత్తడంతో సింగపూర్లోని ఆస్పత్రిలో చేరి అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందారు. అయితే చికిత్స ఫలించక ఆయన ఆదివారం రాత్రి అక్కడే కన్నుమూశారు. రామనారాయణన్ భార్య రాధ గత ఏడాదే కన్నుమూశారు. వీరికి కొడుకు మురళి, కూతుళ్ళు అణ్బు, ఉమ ఉన్నారు. దక్షిణాదిన నూటికి పైగా సినిమాలు తీసిన దర్శకుల్లో రామనారాయణన్ ఒకరు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడం, ఒరియా, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, భోజ్పురి భాషల్లో 120 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇన్ని భాషల్లో సినిమాలు తీసిన ఏకైక దక్షిణాది దర్శకుడు రామనారాయణన్ ఒక్కరే. ఆయన దర్శకత్వంలో తమిళంలో ఎక్కువ చిత్రాలు వచ్చాయి. ‘నాగదేవత, లక్ష్మీదుర్గ, శ్రావణ శుక్రవారం, నాగమ్మ’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకూ చేరువయ్యారు. ఆయన చివరిగా తెలుగులో రూపొందించిన చిత్రం ‘కారా మజాకా’. ఆయన పార్థివ శరీరాన్ని సోమవారం రాత్రి చెన్నైకి తెచ్చారు. అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం చెన్నైలో జరగనున్నాయి.