బస్సుకు మంటలు.. చిన్నారి మృతి
కర్ణాటకలో ఘోరం జరిగింది. హుమ్నాబాద్ ప్రాంతంలో ఒక స్లీపర్ బస్సులో మంటలు చెలరేగి.. మూడేళ్ల చిన్నారి సజీవ దహనం అయిపోయాడు. పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన విహాన్ అనే చిన్నారి ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగే సమయానికి బస్సులో 36 మంది ప్రయాణిస్తున్నారు. వారిలో 8 మంది పిల్లలు ఉన్నారని ప్రమాదానికి సజీవ సాక్షి అయిన ప్రభాకరరెడ్డి 'సాక్షి'కి తెలిపారు. కావేరి ట్రావెల్స్కు చెందిన ఈ బస్సు ముందు భాగంలో మంటలు చెలరేగడంతో బస్సు డ్రైవర్, క్లీనర్ మంటలు వచ్చాయని అరుచుకుంటూ దిగి పారిపోయారు. షిర్డీ నుంచి హైదరాబాద్కు బయల్దేరిన ఈ బస్సు తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో హుమ్నాబాద్ సమీపంలోకి చేరుకున్నప్పుడు ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దాంతో ఏం చేయాలో అర్థంకాని స్థితిలో కొంతమంది మాత్రం కిందకు దూకేశారు.
దగ్గరలో ఉన్న రాళ్లు తీసుకుని అద్దాలు పగలగొట్టి మిగిలిన వాళ్లను కిందకు తీసుకురావడానికి ప్రయత్నించారు. అందరూ కిందకు వచ్చినట్లు ప్రయాణికులు భావించారు గానీ వాళ్లు దిగే సమయానికి మూడేళ్ల చిన్నారి విహాన్ మాత్రం బస్సులోనే ఉండిపోయాడు. దాంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. దాంతో అతడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రయాణికులంతా కట్టుబట్టలతో మిగిలిపోయారు.