undertrial
-
విచారణ ఖైదీలు జైళ్లలో మగ్గాల్సిందేనా?
ముంబై: దేశవ్యాప్తంగా ఎంతోమంది అండర్ ట్రయల్ ఖైదీలు అనేక ఏళ్లపాటు జైళ్లలోనే మగ్గిపోతున్నారని బాంబే హైకోర్టు పేర్కొంది. విలువైన వారి జీవిత కాలం విచారణ కోసం ఎదురు చూడటంతోనే సరిపోతోందని వెల్లడించింది. ఈ విషయంలో గిరిజన హక్కుల ఉద్యమకారుడు దివంగత స్టాన్ స్వామి చేసిన కృషిని న్యాయస్థానం ప్రశంసించింది. విచారణ లేకుండా అండర్ ట్రయల్ ఖైదీలను ఎన్నాళ్లపాటు జైళ్లకే పరిమితం చేస్తారని ప్రభుత్వాలను ప్రశ్నించింది. ఇలాంటి ఖైదీలకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తు త్వరగా పూర్తి చేయాలని కోరుతూ స్టాన్ స్వామి గతంలో దాఖలు చేసిన పిటిషన్పై బాంబే హైకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. స్టాన్ స్వామి అద్భుతమైన వ్యక్తి అని, సమాజానికి గొప్ప సేవలు అందించారని కొనియాడింది. ఆయన సేవల పట్ల తమకు ఎంతో గౌరవం ఉందని పేర్కొంది. చట్టపరంగా ఆయనకు వ్యతిరేకంగా ఆరోపణలు ఉండొచ్చు.. కానీ, అది వేరే విషయం అని తెలిపింది. స్టాన్ స్వామి కస్టడీలోనే చనిపోతారని ఊహించలేదంది. ఎల్గార్ పరిషత్– మావోయిస్టులతో సంబంధాల కేసులో స్టాన్ స్వామిని 2020 అక్టోబర్లో రాంచీలో ఎన్ఐఏ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాల రీత్యా తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ కోర్టులో పెండింగ్లో ఉండగానే స్టాన్ స్వామి ఇటీవల మృతి చెందారు. -
అచ్చం సూర్య భాయ్లాగే హత్య చేశారు...
న్యూఢిల్లీ: బిజినెస్మెన్ సినిమాలో సూర్య భాయ్ క్యారెక్టర్ గుర్తుండే ఉందిగా...అందులో జైలులో ఉన్న ఖైదీని తన మాస్టర్ ప్లాన్తో ఎలా హత్య చేస్తారో అదే స్టైల్లో నలుగురు ఖైదీలు కలిసి ఒక విచారణలో ఉన్న ఖైదీని హత్య చేశారు. ఈ సంఘటన తిహార్ జైలులోని అత్యంత కట్టుదిట్టమైన కట్టదిట్టమైన వార్డులో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. డబ్బు విషయంలో ముదిరిన గొడవ కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. విచారణలో ఉన్న ఖైదీ దీపక్ను కిటికీ రాడ్డుతో అతనితో పాటు ఉంటున్న నలుగురు ఖైదీలు కొట్టి చంపారని జైలు అధికారు తెలిపారు. సప్తల్ బేడి, మన్ప్రీత్ సింగ్, రియాజ్, సూరజ్లు కలిసి దీపక్ను డబ్బు విషయమై అతని పై దాడికి దిగారు. దాడిలో తీవ్రగాయాలైన దీపక్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించే సమయంలోనే మరణించాడు. జైలు అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు హరీనగర్ పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు.