రూ. 1,500 కోట్ల నికర లాభం !
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,500 కోట్ల నికర లాభం ఆర్జించగలమని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) చైర్మన్ వి.పి. అగర్వాల్ అంచనా వేస్తున్నారు. ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ (ఏఈఆర్ఏ) ఎయిర్పోర్ట్ టారిఫ్లను సవరించడం వల్ల ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. ఇక్కడ ఏఏఐ ఆఫీసర్స్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆరు విమానాశ్రయాలను ప్రైవేటీకరణ చేయడం వల్ల సంస్థకు ఎలాంటి నష్టాలు వచ్చే అవకాశాల్లేవని వివరించారు. తమకు ఎయిర్ ఇండియా నుంచి రూ.1,800 కోట్ల బకాయిలు రావల్సి ఉందని, జెట్ ఎయిర్వేస్, స్పైస్జెట్లు చెరో రూ.100 కోట్ల చెల్లించాల్సి ఉందని చెప్పారు. కాగా ఈ సమావేశంలో భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్ కూడా పాల్గొన్నారు. దేశంలో మౌలిక సదుపాయాలను పటిష్టం చేయడానికి స్వావలంబన ముఖ్యమని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. విమానయాన పరిశ్రమకు ఎయిర్ నావిగేషన్ సర్వీసెస్(ఏఎన్ఎస్), కమ్యూనికేషన్, నావిగేషన్ అండ్ సర్వైలెన్స్(సీఎన్ఎస్) సర్వీసులు కీలకమని పేర్కొన్నారు.