breaking news
Veeramachaneni Ramakrishna
-
అట్లాంటాలో 'తామా' ఆహార ఆరోగ్య అవగాహనా సదస్సు
అట్లాంటా : అట్లాంటా తెలుగు సంఘం 'తామా' ఆధ్వర్యంలో ఆహార ఆరోగ్య అవగాహనా సదస్సు నిర్వహించారు. ఇండియా నుంచి ముఖ్య అతిథిగా విచ్చేసిన వీరమాచనేని రామకృష్ణారావు పాల్గొన్న ఈ సదస్సులో 250 మందికి పైగా పాల్గొన్నారు. వీఆర్కే డైట్ ద్వారా ఆహార నియమాల్లో తను తీసుకువచ్చిన విప్లవాత్మకమైన మార్పులు, ఆచరణ, వాటి ఫలితాల గురించి సుమారు 5 గంటలపాటు సుదీర్ఘంగా వివరించారు. ముఖాముఖిలో భాగంగా పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానాలందించి వారి సందేహాలను నివృత్తి చేశారు. ముందుగా అట్లాంటా తెలుగు సంఘం అధ్యక్షులు వెంకీ గద్దె స్వాగతోపన్యాసం చేస్తూ తామా నిర్వహిస్తున్న ఉచిత క్లినిక్, స్కాలర్షిప్స్, క్రీడా పోటీలు, సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలు, సిలికానాంధ్ర మనబడి, వివిధ సదస్సులు, తామా సభ్యత్వ ప్రయోజనాలు తదితర అంశాలను వివరించారు. తామా కార్యవర్గం, ఛైర్మన్ వినయ్ మద్దినేని ఆధ్వర్యంలో బోర్డు సభ్యులు వీరమాచనేనిని వేదికమీదకు ఆహ్వానించి సత్కరించబోగా ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఈ సదస్సుకు కమ్మింగ్ లోని శ్రీ కృష్ణ విలాస్ రెస్టారెంట్ ఈవెంట్ హాల్ తేనీటి విందు సమర్పించిన సతీష్ ముసునూరిని వీరమాచనేని శాలువాతో సత్కరించారు. సదస్సుకు విచ్చేసిన వీరమాచనేనికి, ఉచితంగా ఆడియో సహకారం అందించిన తామా బోర్డు సభ్యులు కమల్ సాతులూరుకి, విజయవంతం చేసిన అట్లాంటా ప్రజలకు, తోటి తామా కార్యవర్గ సభ్యులు ఇన్నయ్య ఎనుముల, సుబ్బారావు మద్దాళి, సాయిరాం కారుమంచి, ఆదిత్య గాలి, సురేష్ బండారు, భరత్ అవిర్నేని మరియు బోర్డు సభ్యులు వినయ్ మద్దినేని, రాజశేఖర్ చుండూరి, నగేష్ దొడ్డాక, మనోజ్ తాటికొండ, విజు చిలువేరులకు అలాగే వాలంటీర్స్ తదితరులకు తామా అధ్యక్షులు వెంకీ గద్దె ధన్యవాదాలు తెలిపారు. -
నిరూపిస్తే జైలుకెళ్తా : వీరమాచనేని
సాక్షి, హైదరాబాద్ : తాను వైద్యుడిని కానని సామాజిక చైతన్యం తీసుకొచ్చే కార్యకర్తను మాత్రమేనని డైట్ గురు వీరమాచనేని రామకృష్ణ అన్నారు. శనివారం జూబ్లీహిల్స్లోని దసపల్లా హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైద్య రంగంలో సంచలనం జరగడం ఖాయమని చెప్పారు. జీవన విధానం, వైద్య విధానం వేర్వేరు ప్రక్రియలన్నారు. కిడ్నీలు చెడిపోవడానికి మధుమేహం ఎంత మాత్రం కారణం కాదని చెప్పారు. దీని కోసం తీసుకునే ట్రీట్మెంట్తో అనేక సైడ్ ఎఫెక్ట్స్ సంక్రమిస్తాయని తెలిపారు. పేద, మధ్య తరగతి ప్రజలను డయాబెటిస్ పేరుతో దోచుకుంటున్నారని ఆరోపించారు. తాను చేసే ఆరోగ్య విధానం రోగాలను నయం చేస్తుందే తప్ప అనారోగ్యానికి గురి చేయదని స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా కిడ్నీ చెడిపోయిందని నిరూపిస్తే జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమేనని చెప్పారు. ఆదివారం మూసాపేట్ సమీపంలో ఉన్న కైతలాపూర్ గ్రౌండ్స్లో బహిరంగ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డైట్కు, వైద్య పద్ధతులకు సంబంధమే లేదని డైట్ విధానం ద్వారా లబ్ధి పొందిన అట్లూరి సుబ్బారావు, రామరాజు చెప్పారు.