veluru CMC hospital
-
స్నేహం కోసం జోలె పట్టిన స్నేహితులు
నెల్లూరు, సోమశిల: వారంతా స్నేహితులు. వారిలోని ఓ నిరుపేద యువకుడికి ప్రాణాంతకమైన వ్యాధి సోకింది. వైద్యానికి భారీగా నగదు వెచ్చించాల్సి రావడంతో కుటుంబ సభ్యులు నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. స్నేహితుడ్ని ఎలాగైనా కాపాడుకోవాలని మిగిలిన స్నేహితులు జోలె పట్టారు. ఇంటింటికి తిరిగి నగదు సాయం చేయాలని వేడుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా దాతల సాయం కోసం ఆర్ధిస్తున్నారు. అనంతసాగరానికి చెందిన అల్లీ ఇమామ్షా, కాలేబీలకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమారుడు షేక్ ఖాజావలీ పదో తరగతి వరకు చదువుకున్నాడు. కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో చదువు మానేశాడు. సెంట్రింగ్ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఏడాది క్రితం హసీనాను వివాహం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతుండగా ప్రాణాంతకమైన బోన్ మ్యారో వ్యాధి సోకింది. వైద్యులను సంప్రదించగా వైద్యానికి రూ.25లక్షలకుపైగా ఖర్చవుతుందని తెలిపారు. రెక్కాడితే డొక్కాడని కుటుంబం కావడంతో కుటుంబ సభ్యులు నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ప్రస్తుతం ఖాజావలీ తమిళనాడులోని వేలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మెరుగైన చికిత్సకు దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. దాతలు స్పందించి సాయం చేసి ఆదుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. స్నేహం కోసం జోలె పట్టిన స్నేహితులు తమతో పాటు తిరిగే స్నేహితుడు ప్రాణాంతకమైన బోన్ మ్యారో వ్యాధి బారిన పడడం స్నేహితులను కలచివేసింది. స్నేహితుడి ప్రాణాలను కాపాడుకునేందుకు స్నేహితులందరూ ఒక్కటై జోలె పట్టారు. రెండ్రోజులుగా గ్రామంలో ఇంటింటికి తిరిగి సాయం అందించాలని వేడుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా దాతల సాయం కోసం ఆర్ధిస్తున్నారు. ఎవరైనా సాయం చేయాలనుకునే దాతలు షేక్ జావీద్ 77994 47137, నియాజ్ 9676 517112 నంబర్లలో సంప్రదించాలని కోరుతున్నారు. -
కత్తితో దాడి.. ఒకరి మృతి
చిత్తూరు (అర్బన్): చిత్తూరు పట్టణంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న గొడవ ముగ్గురు యువకుల ప్రాణాలపైకి వచ్చింది. ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి... నగరంలోని తోటపాళ్యంకు చెందిన మణి (25), నాగాలమ్మ గుడికి చెందిన తులసీ (26), ప్రకాష్ (26)లు స్నేహితులు. మణి పనిపై రాత్రి 10.30 గంటల తర్వాత సంతపేటవైపు వెళుతున్నాడు. ఇక్కడ మేస్త్రీ పనిచేసే నాగరాజు అనే వ్యక్తికి, మణికి గొడవ రావడంతో నాగరాజు మణి కడుపులో కత్తితో పొడిచాడు. విషయం తెలుసుకున్న మణి స్నేహితులు తులసీ, ప్రకాష్లు దీనిపై ప్రశ్నించడానికి నాగరాజు ఇంటి వద్దకు వెళ్లారు. దీంతో వీరిపై కూడా నాగరాజు కత్తితో దాడి చేశాడు. ముగ్గురికీ కడుపు, వీపు, ఛాతీ భాగంలో కత్తిపోట్లు బలంగా ఉన్నాయని సమాచారం. వెంటనే ఆ ముగ్గుర్నీ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషమించడతో వారిని వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో తులసి మృతి చెందాడు. తగాదాల వెనుక వివాహేతర సంబంధం ఉందని కొందరు, ప్రేమ వ్యవహారమని మరికొందరు చెప్పుకుంటున్నారు. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.