ఫోన్ ఆర్డర్ చేస్తే విమ్బార్ పంపారు!
మంగళగిరి: ఆన్లైన్లో మొబైల్ ఫోన్ ఆర్డరు చేసిన ఓ వ్యక్తి సబ్బు బిళ్ల అందటంతో లబోదిబోమంటున్నాడు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పట్టణానికి చెందిన జొన్నాదుల హేమవరప్రసాద్ ఈనెల ఒకటో తేదీన పానసోనిక్ ఏ2 స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేందుకు అమెజాన్ కంపెనీకి ఆన్లైన్లో ఆర్డర్ చేశాడు. ఫోన్ ఖరీదు రూ.9,800 ఆన్లైన్లోనే చెల్లించాడు.
బ్లూడాట్ కొరియర్ సర్వీస్ నుంచి శుక్రవారం డెలివరీ బాయ్ వచ్చి ప్యాకెట్ను అందజేశాడు. ఓపెన్ చేసి చూడగా విమ్బార్ సబ్బు ఉంది. కంగుతిన్న అతడు కొరియర్బాయ్ను నిలదీయగా తనకెలాంటి సంబంధం లేదని చెప్పాడు. కంపెనీపై కేసు పెట్టాలని, తాను పార్శిల్ వచ్చినట్లు సాక్ష్యం మాత్రం ఇవ్వగలనని అతడు స్పష్టం చేశాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సీఐ బి.బ్రహ్మయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.