visakha ZP meeting
-
మూడు రాజధానులతోనే సమాన అభివృద్ధి
మహారాణిపేట (విశాఖ దక్షిణ): రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని కోరుతూ విశాఖ జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో తీర్మానం ఆమోదించారు. పాలకవర్గం ఏర్పడిన తరువాత మొదటిసారి ఆదివారం జిల్లా పరిషత్ సమావేశం చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జరిగింది. మూడు రాజధానులపై తీర్మానం చేయాలని అరకు ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ ప్రతిపాదించగా.. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మద్దతు తెలిపారు. సభ్యులంతా ఆమోదించారు. మంత్రి మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందాలన్నదే సీఎం జగన్ ఆకాంక్ష అన్నారు. అలాగే విశాఖ స్టీల్ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరో తీర్మానాన్ని మంత్రి ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదం తెలిపారు. తొలి సమావేశంలో ఏడు స్థాయీ సంఘం సభ్యుల ఎన్నిక నిర్వహించారు. మొదటి స్థాయి సంఘంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఏడో స్థాయి సంఘంలో మంత్రి ముత్తంశెట్టి సభ్యులుగా ఎన్నికైనట్టు చైర్పర్సన్ సుభద్ర ప్రకటించారు. మాజీ సీఎం రోశయ్య, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ బిపిన్ రావత్, విశాఖ జిల్లాకు చెందిన ప్రముఖ సినీ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతికి సభ సంతాపం తెలిపింది. -
జెడ్పీని కుదిపేసిన బాక్సైట్
-
జెడ్పీని కుదిపేసిన బాక్సైట్
విశాఖపట్నం: 2015లో విశాఖ జిల్లా చరిత్రలో ఇది చీకటి దినం అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు వ్యాఖ్యానించారు. విశాఖ జెడ్పీ సమావేశంలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై టీడీపీ నేతలు దౌర్జన్యం చేశారు. బాక్సైట్ అంశంపై బుధవారం జరిగిన సమావేశం దద్దరిల్లింది. సమావేశం ప్రారంభం కాగానే అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మాట్లాడుతూ... బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని పట్టుబట్టారు. దీనికి టీడీపీ ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పీలా గోవింద్తోపాటు ఆ పార్టీకి చెందిన ఇతర సభ్యులు అడ్డుతగిలారు. ప్రతిపక్ష నేతలకు మైకులు ఇవ్వడానికి అధికార పార్టీ నేతలు నిరాకరించారు. ఎమ్మెల్యే కిడారికి మైక్ ఇవ్వడానికి వీల్లేదంటూ దౌర్జన్యానికి దిగారు. ఆయన మాట్లాడుతుంగా చేతిలో ఉన్న మైక్ను లాక్కున్నారు. దీంతో కిడారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు మాట్లాడే అవకాశం ఇవ్వరా అని ఆవేదన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. ఏపీ అసెంబ్లీలో మైకులు కట్ చేశారు.. ఇప్పుడు జడ్పీ సమావేశంలో మైకులు ఇవ్వకపోవడం ప్రతిపక్షం గొంతు నొక్కడమేనంటూ కిడారి సర్వేశ్వరరావు వ్యాఖ్యానించారు. ప్రతిపక్షానికి మైకులు ఇవ్వకపోవడం దుర్మార్గమని, టీడీపీ నేతల తీరుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ ఆగ్రహం వ్యక్తం చేశారు.