breaking news
Water Board elections
-
పెడన టీడీపీలో ఆధిపత్య పోరు.. ఎన్నికల అధికారిపై కత్తితో దాడికి యత్నం
సాక్షి, కృష్ణా జిల్లా: పెడన నియోజకవర్గం నీటి సంఘం ఎన్నికల్లో టీడీపీలో ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల్లో ఓడిపోవడంతో ఎలక్షన్ ఆఫీసర్పై కత్తితో దాడికి యత్నించారు. పామర్తి వెంకటేశ్వరావును పెడన మండల పార్టీ అధ్యక్షుడు చల్లపాటి ప్రసాద్ బలపరచగా, పామర్తి బ్రహ్మయ్యను నందిగామ సర్పంచ్ బొడ్డు సీతయ్య (చినబాబు) బలపర్చారు. ఎన్నికల్లో బ్రహ్మయ్యకు 10 ఓట్లు, వెంకటేశ్వరరావుకు 2 ఓట్లు వచ్చాయి.ఎన్నిక పూర్తయిన తర్వాత ఓటమిని తట్టుకోలేకపోయిన పామర్తి వెంకటేశ్వరరావు.. ఇంటికెళ్లి కత్తి తీసుకొచ్చారు. ఎన్నికల అధికారి వద్ద ఉన్న పత్రాలు లాక్కునేందుకు యత్నించారు. పత్రాలు ఇవ్వకపోవడంతో ఎన్నికల అధికారి జి.మధుశేఖర్పై కత్తితో దాడికి యత్నించారు. దాడిని అడ్డుకోవడంతో మధుశేఖర్ చేతికి స్వల్పగాయమైంది. దాడి అనంతరం తన చేతిని గాయపరచుకుని పామర్తి వెంకటేశ్వరరావు కిందపడిపోయారు. పామర్తి వెంకటేశ్వరరావుపై ఎన్నికల అధికారి మధుశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
అడుగడుగునా తమ్ముళ్ల పెత్తనం
అన్నదాతల మధ్య చిచ్చు రేపుతున్న నీటి సంఘం ఎన్నికలు ఉద్రిక్తంగా మారుతున్న గ్రామాలు టీడీపీ నేతల మాటే చెల్లుబాటు సాక్షి, విశాఖపట్నం : అన్నదాతల మధ్య తెలుగుదేశం పార్టీ నేతలు చిచ్చురేపుతున్నారు. ప్రశాంతమైన పచ్చని పల్లెల్లో కక్షలు.. కార్పణ్యాలకు ఆజ్యం పోస్తున్నారు. ఏకాభిప్రాయం మాటున దొడ్డి దారిన నీటిసంఘాల్లో పాగా వేసేందుకు సర్కార్ వ్యూహం పన్నుతున్నారు. జిల్లాలోని మైనర్ ఇరిగేషన్ సెక్టార్ పరిధిలోని 327, మీడియం ఇరిగేషన్ సెక్టార్ పరిధిలోని18, మేజర్ ఇరిగేషన్ పరిధిలోని 23 సంఘాలతో పాటు తాండవ పరిధిలో ఉన్న ఐదు డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, తాండవ, కోనం,రైవాడ పరిధిలో ఉన్న ఒక్కొక్క పీసీ ఎంపికకు ఇటీవలే నోటిఫికేషన్ జారీ చేశారు. శుక్రవారం సాయంత్రానికి 198 సంఘాల ఎంపిక ప్రక్రియ జరిగింది. ఇప్పటివరకు 144 సంఘాలకు మాత్రమే ఏకాభిప్రాయంతో ఎన్నికలు జరిగినట్టుగా అధికారులు ప్రకటిం చారు. మిగిలిన కమిటీల ఎంపికలో ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని చెబుతున్నారు. పాయకరావుపేట మండలం గోపాలపట్నంలో జరిగిన ఆవ నీటివినియోగదారుల సంఘ ఎన్నికలు వాగ్వాదాలు. తోపులాటలతో రసాభాసగా మారాయి. సభ్యులు కాని వార్ని ఎందుకు అనుమతించారంటూ వైఎస్సార్సిపికి చెందిన జెడ్పీ ప్లోర్ లీడర్ చిక్కాల రామారావు అధికారులను నిలదీయగా టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ నేతలతో బాహాబాహీకి దిగారు. పరిస్థితి చేజారడంతో పోలీసులు వార్ని చెదరొగట్టారు. అనంతరం కార్యాలయం వెలుపల సమావేశం నిర్వహించి మెజార్టీ రైతుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని లేకపోతే ఎంపికను వాయిదా వేయాలని వైఎస్సార్ సీపీ నేతలు పట్టుబట్టడంతో చేసేదిలేక చివరకు అధికారులు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. రోలుగుంట మండలం కొవ్వూరు సంఘం ఎంపికను మెజార్టీ రైతుల అభిప్రాయానికనుగుణంగా చేయాలని వైఎస్సార్సీపీ నేతలు పట్టుబట్టగా టీడీపీ నేతలు తమ ఇచ్ఛానుసారం చేస్తామని చెప్పడంతో ఘర్షణకు దారితీసింది. అయితే టీడీపీ నేతలిచ్చిన జాబితాకు ఎన్నికల అధికారులు ఆమోదముద్ర వేశారు. వడ్డాది సంఘం ఎన్నిక టీడీపీలో అంతర్గత విబేధాలకు వేదికైంది. చెరో ప్యానల్ను ప్రతిపాదించడంతో ఇరువర్గాలు నానా దుర్భాషలాడుకుంటూ ఘర్షణకు దిగారు. పోలీసులు వార్ని చెదరగొట్టారు. మరొక పక్క ఈ ఎంపిక విధానం చెల్లదంటూ వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ శ్రేణులు ధర్నాకు దిగారు. పరిస్థితికి ఉద్రిక్తంగా మారడంతో ఓటర్లు కూడా అక్కడ నుంచి పరుగులు తీశారు. దీంతో ఎంపికను వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల అధికారులు ప్రకటించగా..అదేం కాదు..ఎన్నిక జరిగిపోయిందంటూ టీడీపీ నేతలు జాబితానుకూడా ప్రకటించారు. కె.కోటపాడు పైడమ్మచెరువునీటి సంఘం ఎంపికలో టీడీపీ రెండు గ్రూపులకు చెందిన అధ్యక్ష స్ధానానికి పోటీపడ్డారు. ఇరువర్గాలు ప్రతిపాదించిన పేర్లను ప్రకటించకుండా అధికారులు వెళ్లిపోయారు. కొయ్యూరు మండలం గుడ్లపల్లి నీటి సంఘం ఎన్నిక రద్దయింది. రైతులు పేర్లు లేవన్న కారణంగా ఎంపీపీ గొలిసింగి సత్య నారాయణ ఎన్నికలు నిర్వహించేందుకు అభ్యంతరం చెప్పడంతో ఎన్నిక రద్దయింది. గోవాడ గెడ్డ చానల్కు మెజార్టీ రైతుల అభిప్రాయం మేరకు వైఎస్సార్సీపీ తరపున ప్రతిపాదించిన ప్యానల్ను ప్రకటించాల్సి ఉండగా, అధికారులు మాత్రం టీడీపీ ప్యానల్కు అనుకూలంగా వ్యవహరించడం వివాదస్పదమైంది. ఎన్నికల అధికారుల తీరుపై మాజీ ఎమ్మెల్సీ డి.వి.ఎస్.ఎన్.రాజు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.