
సాక్షి, కృష్ణా జిల్లా: పెడన నియోజకవర్గం నీటి సంఘం ఎన్నికల్లో టీడీపీలో ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల్లో ఓడిపోవడంతో ఎలక్షన్ ఆఫీసర్పై కత్తితో దాడికి యత్నించారు. పామర్తి వెంకటేశ్వరావును పెడన మండల పార్టీ అధ్యక్షుడు చల్లపాటి ప్రసాద్ బలపరచగా, పామర్తి బ్రహ్మయ్యను నందిగామ సర్పంచ్ బొడ్డు సీతయ్య (చినబాబు) బలపర్చారు. ఎన్నికల్లో బ్రహ్మయ్యకు 10 ఓట్లు, వెంకటేశ్వరరావుకు 2 ఓట్లు వచ్చాయి.
ఎన్నిక పూర్తయిన తర్వాత ఓటమిని తట్టుకోలేకపోయిన పామర్తి వెంకటేశ్వరరావు.. ఇంటికెళ్లి కత్తి తీసుకొచ్చారు. ఎన్నికల అధికారి వద్ద ఉన్న పత్రాలు లాక్కునేందుకు యత్నించారు. పత్రాలు ఇవ్వకపోవడంతో ఎన్నికల అధికారి జి.మధుశేఖర్పై కత్తితో దాడికి యత్నించారు. దాడిని అడ్డుకోవడంతో మధుశేఖర్ చేతికి స్వల్పగాయమైంది. దాడి అనంతరం తన చేతిని గాయపరచుకుని పామర్తి వెంకటేశ్వరరావు కిందపడిపోయారు. పామర్తి వెంకటేశ్వరరావుపై ఎన్నికల అధికారి మధుశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Comments
Please login to add a commentAdd a comment