on woman
-
వివాహితపై లైంగిక వేధింపులు
బుక్కపట్నం: మండలంలోని పాముదుర్తి వెంకటాపురంలో ఓ వివాహితపై అదే గ్రామానికి చెందిన పరశురాం లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు స్థానిక పోలీస్స్టేషన్లో కేసు నమోదయింది. వివరాలు. పొలం పనులకు వెళ్లినప్పుడు పరుశురాం అక్కడికి వచ్చి తన భార్యపై లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నాడని బాధిత మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయనపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలన్నాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
ఒంటరి మహిళపై టీడీపీ నేతల దాడి
అనంతపురం సెంట్రల్ : అనంతపురం రూరల్ మండలం పూలకుంట గ్రామంలో అధికారపార్టీ నాయకులు రెచ్చిపోయారు. ఒంటరిగా నివసిస్తున్న మహిళను విచక్షణా రహితంగా దాడి చేశారు. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు... గ్రామంలో నివాసముంటున్న కవిత అనే మహిళపై బుధవారం కొంతమంది టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. కవిత భర్త కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. కుమార్తెతో కలిసి నివాసముంటోంది. అదే గ్రామానికి చెందిన స్టోర్ డీలర్ శంకర్రెడ్డి కవిత సోదరుడిపై మంగళవారం చేయి చేసుకున్నాడు. ఈ అంశంపై శంకర్రెడ్డితో కవిత ఫోన్లో వాగ్వాదానికి దిగింది. దీన్ని జీర్ణించుకోలేని ఆయన నాగిరెడ్డి, రాము, తిరుపాల్ తదితరులతో కలిసి బుధవారం గ్రామ నడిబొడ్డున దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు చికిత్స నిమిత్తం ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో చేరారు. కాగా ఈ విషయంపై మంగళవారమే బాధితురాలు ఇటుకలపల్లి పోలీసులను ఆశ్రయించింది. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే నిందితులపై పోలీసులు చర్యలు తీసుకోకుండా దుప్పటి పంచాయితీ చేసి చేతులు దులుపుకున్నారు. తనకు ప్రాణహాని ఉందని కూడా పోలీసులు ఎదుట వాపోయానని, అయినా కూడా పోలీసులు వినకుండా రాజీ చేసి పంపారని బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యారు. న్యాయం చేయాలని బాధితురాలు వాపోయారు. ప్రస్తుతం ఈ ఘటనపై ఇటుకలపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలిని మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు వరలక్ష్మి, కార్యదర్శి పద్మావతి, గౌరవాధ్యక్షురాలు చిరంజీవమ్మ, నగర కార్యదర్శి జయలక్ష్మి తదితరులు పరామర్శించారు. -
మళ్లీ రెచ్చిపోయిన టీడీపీ నాయకులు
- ఇంటి స్థలం విషయై మహిళపై దాడి - కపటనింగనపల్లిలో ఘటన కళ్యాణదుర్గం : టీడీపీ నాయకుల ఆగడాలు శ్రుతిమించిపోతున్నాయి. జిల్లాలో ఎక్కడో ఒక చోట మహిళలపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా బ్రహ్మసముద్రం మండలం కపట నింగనపల్లిలో చంద్రమ్మ అనే మహిళపై టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. ఇంటి స్థల విషయంలో ఆమెను నిలదీస్తూ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన గురువారం జరిగింది. బాధితురాలి కథనం మేరకు... గ్రామ సర్వే నంంబర్ 249–5లో స్థలం దశాబ్దాలుగా చంద్రమ్మ కుటుంబం ఆధీనంలో ఉంది. ఆ స్థలానికి సంబంధించి గతంలో రెవెన్యూ అధికారులు ఇంటి పట్టా కూడా మంజూరు చేశారు. గతంలో ఆ స్థలంలో మగ్గం వేసుకుని ఉపాధి చేసుకునే వారు. కరువు కారణంగా ఉపాధి కోసం బెంగళూరుకు వలస వెళ్లారు. తిరిగి గ్రామానికి వచ్చి ఖాళీ స్థలంలో మగ్గం వేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఆ స్థలం తమదంటూ గ్రామంలో టీడీపీకి చెందిన ఉప సర్పంచ్ మంజునాథ అభ్యంతరం తెలిపారు. సమస్య రెవెన్యూ అధికారుల దృష్టికీ వెళ్లింది. విచారణలో భాగంగా తహసీల్దార్ సుబ్రహ్మణ్యం, ఆర్ఐ నాయక్, సర్వేయర్ సూర్యనారాయణరెడ్డి, వీఆర్ఓ స్వామి వివాద స్థలాన్ని పరిశీలించి, సమస్య పరిష్కరించేందుకు వెళ్లారు. అధికారులకు ఆధారాలు చూపుతుండగా, ఒక్కసారిగా ఉపసర్పంచు మంజునాథ, వారి కుటుంబ సభ్యులు మంజమ్మ, పుష్పావతి, ఆది తదితరులు చంద్రమ్మపై దాడి చేసి కిందపడేసి తొక్కారు. ఘటనలో ఆమె రవిక సైతం చిరిగిపోయింది. వెంటనే కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రిలో చేరి బాధితురాలు చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ బ్రహ్మసముద్రం మండల కన్వీనర్ రామాంజినేయులు, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కుళ్లాయప్ప, తాలూకా అధ్యక్షుడు నాగరాజు, మండల కార్యదర్శి తిప్పేస్వామి, మండల నాయకుడు గోవిందు, తాలూకా కార్యదర్శి దొణస్వామి, మండల ఉపాధ్యక్షుడు రవి తదితరులు బాధితురాలిని పరామర్శించారు.