మహిళా కండక్టర్ను చంపి తగులబెట్టారు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ ఆర్టీసీ)లో కండక్టర్గా పనిచేస్తోన్న కల్యాణి అనే మహిళ దారుణహత్యకు గురైంది. రెండు రోజుల కిందట అదృశ్యమైన ఆమె.. ప్రాణాలు కోల్పోయి, సగం కాలిన స్థితిలో కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి..
ఆర్టీసీ కండక్టర్ అయిన కల్యాణి తన భర్త వెంకట రాఘవయ్యతో కలిసి గుంటూరు నగరంలోని సంపత్ నగర్లో నివసించేది. మూడు రోజుల కిందట కల్యాణి అనూహ్యంగా అదృశ్యమైంది. దీంతో కల్యాణి సోదరి రెండు రోజుల కిందట లాలాపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేసింది. పోలీసులు కల్యాణి గురించి గాలిస్తుండగానే.. సోమవారం గుంటూరు శివారు బొంతపాడులో సగం కాలిపోయిన మహిళ శవాన్ని స్థానికులు గుర్తించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ శవం కల్యాణిదేనని నిర్ధారించారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఎవరు చంపారు?: కల్యాణిని భర్త రాఘవయ్యే చంపేసి ఉంటాడని ఆమె కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. సంపత్ నగర్లోని ఇంట్లోనే రోకలి బండతోమోది కల్యాణిని చంపేసి, వాహనంలో శవాన్ని బొంతపాడుకు తీసుకొచ్చి తగులబెట్టి ఉంటారని పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం రాఘవయ్యను విచారిస్తున్నామన్న పోలీసులు నిందితులను వదిలిపెట్టబోమని చెప్పారు.
కుటుంబ కలహాలు?: మృతురాలు కల్యాణికి భర్త రాఘవయ్యకు మధ్య ఇటీవల విభేదాలు తలెత్తాయని, ఈ నేపథ్యంలోనే భర్త దారుణానికి పాల్పడి ఉంటాడని పలువురు అనుమానిస్తున్నారు.