yaasin
-
30 రోజుల్లోనే ఇరవై నగరాలు కట్టడం ఎలా,..?
సాక్షి, అమరావతి : బాబుగారు తన సెక్రటరీలనూ, నమ్మకమైన అనుచరులనూ, క్లోజ్గా ఉండే కొందరు కొలీగ్స్ను పిలిపించే సీక్రెట్గా ఓ శిఖరాగ్ర సమావేశం ఏర్పాటు చేశారు. శిఖరాగ్ర సమావేశం కాబట్టి మొదట గాంధీకొండ మీదే ఏర్పాటు చేద్దామనుకున్నారు గానీ.. టైమ్ లేకపోవడంతో కాన్ఫరెన్స్ హాలుకే కన్ఫైన్ అయ్యారు. ‘‘ఉద్వేగంతో ఊగిపోతూ ఏదో ఎమోషన్లో హైదరాబాద్ లాంటివి 20 నగరాలు కట్టేస్తానన్నాను. కాబట్టి అర్జెంట్గా అవన్నీ ఎలా కట్టేయాలో సలహాలివ్వండి’’ అని అడిగారు. ఎంత అర్జెంట్గానైనా ఒకేసారి 20 నగరాలు కట్టడమంటే మాటలా! ఏదో ఒకటీ, రెండు నగరాలంటే ఫర్లేదుగానీ.. 20 నగరాలు ఎలా అని వాళ్ల మనసుల్లో అనిపించింది. అదెంత అసాధ్యమో గుర్తొచ్చి అందరూ నిశ్శబ్ధంగా ఉండిపోయారు. ‘‘మీ చిన్నప్పటి రోజుల్లో అంబడిపూడి పుస్తకాలని బోల్డన్ని ఉండేవన్నారు కదా నాన్నారూ.. ‘ముప్పై రోజుల్లో కొంకణీ నేర్చుకోవడం ఎలా?’, ‘ఉపన్యాసం ఇవ్వడం ఎలా?’, ‘మీరు కోటీశ్వరులైపోండి’ లాంటివి అనేకం దొరికేవని మీరోసారి చెప్పారు కదా. అలాంటి పాత పుస్తకాలు ఎక్కడైనా ఫుట్పాత్ల మీద దొరుకుతున్నాయేమో చూడమని పురమాయిద్దాం. ‘30 రోజుల్లో 20 నగరాలు కట్టడం ఎలా?’ లాంటి పుస్తకాలేవైనా దొరికితే ఇక మన పని అయిపోయినట్టే. ఎలాగూ వెతుకుతున్నారు కాబట్టి.. పనిలో పనిగా ‘పోర్టులను తరలించకుండా ఆపడం ఎలా?’ లాంటివి కూడా అంబడిపూడి సిరీస్లో ఎక్కడైనా దొరుకుతాయేమో చూడమని కూడా చెబ్దాం నాన్నారూ మనవాళ్లకు’’ సలహా ఇచ్చాడు లోకేశం. ‘‘బావా.. అలాగే.. ‘నోరూ, చెయ్యీ అదుపు చేసుకోవడం ఎలా’ లాంటి పుస్తకం కూడా ఏదైనా దొరికితే చూడమను బావా. స్పీచులప్పుడు నేను కొడుతున్న కొటేషన్లన్నీ పాతబడిపోయాయి. ‘సారేజహా.. బుల్ బుల్.. బుల్ బుల్’’ లాంటి కొటేషన్ల పుస్తకాలు కూడా దొరికేతే బాగుణ్ణు’’ అల్లుడిగారి సలహాకు కొనసాగింపుగా మరో సలహా ఇచ్చారు బావమరిదిగారు. ఇవేమీ వర్కవుట్ అయ్యేలా లేవని కాస్తంత డొక్కశుద్ధీ, చదువూ సంధ్యా ఉన్న ఒక సెక్రటరీని సలహా అడిగారు బాబుగారు. ‘‘సార్.. దాదాపు 500 ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ లాంటి నగరాలు 20 కట్టడం అంటే మాటలు కాదు. అందునా ఇంత అర్జెంటుగా. అందుకని ఓ పని చేద్దాం. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 20 నగరాలను సెలక్ట్ చేద్దాం. ఆ నగరాల్లోని ఏరియా పేర్లకు దగ్గరగా ఉన్న హైదరాబాద్ కాలనీల పేర్లు పెడదాం’’ అన్నాడా సెక్రటరీ. ‘‘అదెలా?’’ ‘‘ఉదాహరణకు ఇప్పుడు మన విజయవాడనే తీసుకుందాం. లబ్బీపేట పేరును ఎల్బీనగర్ అని మారుద్దాం. దుర్గాపురం ఏరియాను దుర్గంచెరువు అందాం. కామకోటినగర్ పేరులో మొదటిదీ, చివరదీ కొట్టేసి.. సింపుల్గా ‘కోఠి’ అందాం. కొండపల్లిని కూకట్పల్లి అనీ, ఆజంపూడిని ఆజమాబాద్ అని, ఏసీ కంపెనీని ఏసీగార్డ్స్ అని, గన్నవరాన్ని గండిపేట అని.. అన్నీ ఇలా చేంజింగ్ చేసేద్దాం సార్. గన్నవరంలో ఎయిర్పోర్టు ఉంది కాబట్టి దానిపేరు శంషాబాద్ అని మారుద్దాం. ఇక్కడ మనకు మరో సౌలభ్యం కూడా ఉంది సార్. ఇబ్రహీంపట్నం, మారుతీనగర్, హౌజింగ్బోర్డు కాలనీ లాంటి వాటిని మార్చక్కర్లేదు. ఇదేవిధంగా... ఆల్రెడీ మనకున్న 20 పట్టణాల్లోనూ అన్ని పేటలూ, బస్తీలు, కాలనీల పేర్లను ఇలా మార్చేస్తే చాలు. దీనికి పెద్దగా టైమ్ కూడా పట్టదు సార్. పట్టణానికి ఒకటి చొప్పున 20 జీవోలు ఇస్తే సరిపోతుంది’’ సలహా ఇచ్చాడు బాబుగారి వర్కింగ్ స్టైల్ మీద పూర్తిగా అవగాహన ఉన్న సెక్రటరీ. ఈ సలహా పట్ల అందరూ ఆసక్తి కనబర్చారు. ‘‘అవును.. దీనికి తోడు ఇంకో పని చేయండి. ఒక ప్రపంచపటం కొనేయండి. ఈ 20 నగరాలనూ దాన్లో రెడ్ ఇంక్తో మార్క్ చేసి, వీటన్నింటినీ నేనే ప్రపంచపటంలో పెట్టానంటూ ఊదరగొట్టమని మన గొట్టాలవారికీ, ఆస్థాన న్యూస్ పేపర్ల వారికి చెప్పండి. ఇంత కొద్ది టైమ్లోనే ఇన్ని నగరాలు కట్టినందుకు కృతజ్ఞతగా ‘థ్యాంక్యూ సీఎం సార్’ అంటూ హోర్డింగులూ, బోర్డులూ ఆయా నగరాల్లో ఏర్పాటు చేయండి’’ అంటూ ఆదేశాలు జారీచేసి, మీటింగ్ ముగించారు బాబుగారు. -
మసి పూసి మా..రేడు కాలేవు!
నయా సీన్: క్యాప్సూల్ ద్రాక్ష అవుతుందా? ఇది ఏం కాలం? వేపకాయలు వెర్రిగా కాసే కాలం. అలాగే ఎలక్షన్స్ కాలం కూడా. అందుకే వేపనూ, ఎన్నికలనూ ముడేసి.. వేపకాయంత వెర్రిని ఎలక్షన్కూ ఎక్కించేస్తున్నారు కొందరు మహానుభావులు. అంతేనా యథాశక్తి ప్రజలకూ ఎక్కిద్దామని చూస్తున్నారు. అవ్విధంబెట్టిదనిన... ‘‘మసిపూసి మారేడు చేయడం అనే మాట ఎప్పుడైనా విన్నావా గురూ?’’ ‘‘సరిగ్గా అలాంటి యవ్వారమే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతోంది’’ ‘‘చూడ్డానికి సైజూ, గీజూ ఒకేలా ఉంటాయని తెలిసి పరమ వ్యాపారదృక్పథం ఉన్న ఒక మహానుభావుడు వాటిని క్యాప్సుల్ ద్రాక్ష అని అమ్ముతున్నాట్ట!’’ ‘‘కొనేవాళ్లుంటారంటావా?’’ ‘‘ఎందుక్కొనరూ? ఆయన వాణిజ్యాగ్రణీ.. పరమ వ్యాపరమణి అని పేరు కదా. అందుకే ఆయన వేపకాయలను పట్టుకుని క్యాప్సూల్ ద్రాక్ష అన్నా కొంటారు’’ ‘‘అదెలా?’’ ‘‘సీమాంధ్ర ప్రజలకు ఇప్పుడు కావల్సిందల్లా హైదరాబాద్లాంటి రాజధాని తప్ప మరోటి కాదనీ, అది నిర్మించిన అనుభవం ఉన్నందునా... సదరు ఔటరు రింగురోడ్డుకు కంకరకొట్టిన కూలీనే, హైటెక్ సిటీకి పునాది తవ్విన బేల్దారు బాబునే, హైటెక్సు భవనానికి సిమ్మెంటు, ఇసుకతో మాల్ కలి పిన మేస్త్రీనే ఏకగ్రీవంగా ఎన్నుకుంటార ని ఘంటాపథంగా పెడబొబ్బలు పెడుతున్నారు. తన అభిప్రాయాన్నే జనాభిప్రాయంగా చెబుతూ దానికి ప్రజాభిప్రాయ పరికల్పన రంగు పూస్తున్నారు. మన జాతీయంలో చెప్పాలంటే మసి పూసి మారేడుకాయ చేస్తున్నారు’’ ‘‘అలాగా?’’ ‘‘అవును. అయితే సీమాంధ్ర ప్రజలందరిదీ చాలా వ్యాపార మనస్తత్వమనీ, వాళ్లకు ఎలాంటి సెంటిమెంట్లూ ఉండవనీ.. గతంతోనూ నిమిత్తం లేదనీ, కావాల్సిందల్లా భవిష్యత్తే కాబట్టి... వర్తమానంలో వర్తకానికే ప్రాధాన్యమిచ్చి సదరు సుతారీరత్న గారి సుముఖానికే ఓటేస్తారంట. సదరు మేస్త్రీ మహాశయుడికే పట్టం కడతారంట. అయితే ఇక్కడ ఒక్క ప్రశ్న పుడుతోంది’’ ‘‘ఏమిటదీ?’’ ‘‘నిన్నటి వరకూ రాష్ట్రం విడిపోకూడదని కనీసం సీమాంధ్ర ప్రజల్లో కొంతమందైనా కోరుకున్నారా లేదా? విడిపోతే నష్టమని వారు వాపోయారా లేదా? ఇంతా చేసి తామంతా ఉద్యమించినంతసేపు పట్టలేదా వారు అన్నీ మరచిపోవడానికి! రాష్ట్ర విభజన నిర్ణయం లోక్సభలో తీసుకుని రెణ్ణెల్లయినా కాలేదే... దానికి ఆమోదముద్ర వేసిన ఆయనకే జనమంతా ఓటేస్తారని ఎలా చెప్పగలుగుతున్నారు? తమకూ, తమ నేతలకూ.. జరి గిన అవమానాన్ని అందరూ తేలిగ్గా మరచిపోతారంటూ ఎలా నమ్మబలుకగలుగుతున్నారు? కనీ సం వారి ఆగ్రహాన్నీ, ఆక్రోశాన్నీ చూపడానికి ఒక్క ఎలక్షన్నైనా ఎంచుకోరనీ.. తమ నిరసన చూపే చర్యకు ఒడిగట్టరని ఎలా అనుకోగలుగుతున్నారో అర్థం కావడం లేదు. సీమాంధ్ర సరే... ఇక తెలంగాణలోనూ ఆయనంత అభివృద్ధికారకుడూ, నిర్మాణ చతురుడూ లేనేలేడని కితాబిస్తూ... ఇచ్చి న, తెచ్చినవారి కంటే తెప్పించేలా చేసినవారికీ, ఇప్పించేలా చూసినవారికీ, లేఖ ఇచ్చి శ్రీకారం చుట్టినవారికీ లేదా ఆ ఘనత అంటూ ప్రశ్నిస్తున్నారు’’ ‘‘ప్రజల జ్ఞాపకశక్తి తక్కువేనని ఈ ప్రబుద్దుల నమ్మకం. అది సరేగానీ జనాలంతా మరీ ఇంత షార్ట్ మెమరీ ఉన్న గజినీలంటూ ఎలా చెప్పగలుగుతున్నారు గురూ వీళ్లంతా?’’ ‘‘నువ్వు చెప్పాక నాకు అర్థమైంది. ఈ రాజ గురువులూ, గురివింద గింజలూ ఎలా ఉన్నారంటే... ’’ ‘‘ఎలా ఉన్నారు?’’ ‘‘నువ్వన్నట్లు తమ వేపకాయ వెర్రిని ఆసరాగా చేసుకుని వేపకాయలను క్యాప్సూల్ ద్రాక్ష అని అమ్మడమే కాదు... ఆ వేపగుత్తులను అచ్చు సిరాలో ముంచి వాటినే మేలైన నల్ల ద్రాక్ష గుత్తులంటూ నమ్మబలుకుతున్నారు. తమ వాణిజ్య దృక్పథాన్నీ, తమ వ్యాపారనైజాలనూ సమస్త ప్రజలకూ అంటగడుతూ... తమలాగే వారికీ ఆత్మగౌరవం లేదంటూ అచ్చోసి చెబుతున్నారు. పిచ్చె క్కి కూస్తున్నారు. అదీ బాధాకరమైన విషయం.’’ ‘‘అవును గురూ. నువ్వన్నది నిజం. ఢిల్లీ నేతల సంగతి సరే... నిత్యం ఉషోదయమైన వెంటనే... సమస్త ప్రజలందరికీ సెంటిమెంట్లే లేవంటూ, సకల జనమంతా పచ్చి అవకాశవాదులే అంటూ చిత్రీకరిస్తున్న ఈ మిథ్యాసత్యసంధుల వారి మాటేమిటి? వేపకాయ గుత్తులంతగా ఈ వైలేమిటి? గంగవైలేమిటీ?’’ - యాసీన్