
మసి పూసి మా..రేడు కాలేవు!
నయా సీన్: క్యాప్సూల్ ద్రాక్ష అవుతుందా?
ఇది ఏం కాలం? వేపకాయలు వెర్రిగా కాసే కాలం. అలాగే ఎలక్షన్స్ కాలం కూడా. అందుకే వేపనూ, ఎన్నికలనూ ముడేసి.. వేపకాయంత వెర్రిని ఎలక్షన్కూ ఎక్కించేస్తున్నారు కొందరు మహానుభావులు. అంతేనా యథాశక్తి ప్రజలకూ ఎక్కిద్దామని చూస్తున్నారు. అవ్విధంబెట్టిదనిన...
‘‘మసిపూసి మారేడు చేయడం అనే మాట ఎప్పుడైనా విన్నావా గురూ?’’
‘‘సరిగ్గా అలాంటి యవ్వారమే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతోంది’’
‘‘చూడ్డానికి సైజూ, గీజూ ఒకేలా ఉంటాయని తెలిసి పరమ వ్యాపారదృక్పథం ఉన్న ఒక మహానుభావుడు వాటిని క్యాప్సుల్ ద్రాక్ష అని అమ్ముతున్నాట్ట!’’
‘‘కొనేవాళ్లుంటారంటావా?’’
‘‘ఎందుక్కొనరూ? ఆయన వాణిజ్యాగ్రణీ.. పరమ వ్యాపరమణి అని పేరు కదా. అందుకే ఆయన వేపకాయలను పట్టుకుని క్యాప్సూల్ ద్రాక్ష అన్నా కొంటారు’’
‘‘అదెలా?’’
‘‘సీమాంధ్ర ప్రజలకు ఇప్పుడు కావల్సిందల్లా హైదరాబాద్లాంటి రాజధాని తప్ప మరోటి కాదనీ, అది నిర్మించిన అనుభవం ఉన్నందునా... సదరు ఔటరు రింగురోడ్డుకు కంకరకొట్టిన కూలీనే, హైటెక్ సిటీకి పునాది తవ్విన బేల్దారు బాబునే, హైటెక్సు భవనానికి సిమ్మెంటు, ఇసుకతో మాల్ కలి పిన మేస్త్రీనే ఏకగ్రీవంగా ఎన్నుకుంటార ని ఘంటాపథంగా పెడబొబ్బలు పెడుతున్నారు. తన అభిప్రాయాన్నే జనాభిప్రాయంగా చెబుతూ దానికి ప్రజాభిప్రాయ పరికల్పన రంగు పూస్తున్నారు. మన జాతీయంలో చెప్పాలంటే మసి పూసి మారేడుకాయ చేస్తున్నారు’’
‘‘అలాగా?’’
‘‘అవును. అయితే సీమాంధ్ర ప్రజలందరిదీ చాలా వ్యాపార మనస్తత్వమనీ, వాళ్లకు ఎలాంటి సెంటిమెంట్లూ ఉండవనీ.. గతంతోనూ నిమిత్తం లేదనీ, కావాల్సిందల్లా భవిష్యత్తే కాబట్టి... వర్తమానంలో వర్తకానికే ప్రాధాన్యమిచ్చి సదరు సుతారీరత్న గారి సుముఖానికే ఓటేస్తారంట. సదరు మేస్త్రీ మహాశయుడికే పట్టం కడతారంట. అయితే ఇక్కడ ఒక్క ప్రశ్న పుడుతోంది’’
‘‘ఏమిటదీ?’’
‘‘నిన్నటి వరకూ రాష్ట్రం విడిపోకూడదని కనీసం సీమాంధ్ర ప్రజల్లో కొంతమందైనా కోరుకున్నారా లేదా? విడిపోతే నష్టమని వారు వాపోయారా లేదా? ఇంతా చేసి తామంతా ఉద్యమించినంతసేపు పట్టలేదా వారు అన్నీ మరచిపోవడానికి! రాష్ట్ర విభజన నిర్ణయం లోక్సభలో తీసుకుని రెణ్ణెల్లయినా కాలేదే... దానికి ఆమోదముద్ర వేసిన ఆయనకే జనమంతా ఓటేస్తారని ఎలా చెప్పగలుగుతున్నారు? తమకూ, తమ నేతలకూ.. జరి గిన అవమానాన్ని అందరూ తేలిగ్గా మరచిపోతారంటూ ఎలా నమ్మబలుకగలుగుతున్నారు? కనీ సం వారి ఆగ్రహాన్నీ, ఆక్రోశాన్నీ చూపడానికి ఒక్క ఎలక్షన్నైనా ఎంచుకోరనీ.. తమ నిరసన చూపే చర్యకు ఒడిగట్టరని ఎలా అనుకోగలుగుతున్నారో అర్థం కావడం లేదు. సీమాంధ్ర సరే... ఇక తెలంగాణలోనూ ఆయనంత అభివృద్ధికారకుడూ, నిర్మాణ చతురుడూ లేనేలేడని కితాబిస్తూ... ఇచ్చి న, తెచ్చినవారి కంటే తెప్పించేలా చేసినవారికీ, ఇప్పించేలా చూసినవారికీ, లేఖ ఇచ్చి శ్రీకారం చుట్టినవారికీ లేదా ఆ ఘనత అంటూ ప్రశ్నిస్తున్నారు’’
‘‘ప్రజల జ్ఞాపకశక్తి తక్కువేనని ఈ ప్రబుద్దుల నమ్మకం. అది సరేగానీ జనాలంతా మరీ ఇంత షార్ట్ మెమరీ ఉన్న గజినీలంటూ ఎలా చెప్పగలుగుతున్నారు గురూ వీళ్లంతా?’’
‘‘నువ్వు చెప్పాక నాకు అర్థమైంది. ఈ రాజ గురువులూ, గురివింద గింజలూ ఎలా ఉన్నారంటే... ’’
‘‘ఎలా ఉన్నారు?’’
‘‘నువ్వన్నట్లు తమ వేపకాయ వెర్రిని ఆసరాగా చేసుకుని వేపకాయలను క్యాప్సూల్ ద్రాక్ష అని అమ్మడమే కాదు... ఆ వేపగుత్తులను అచ్చు సిరాలో ముంచి వాటినే మేలైన నల్ల ద్రాక్ష గుత్తులంటూ నమ్మబలుకుతున్నారు. తమ వాణిజ్య దృక్పథాన్నీ, తమ వ్యాపారనైజాలనూ సమస్త ప్రజలకూ అంటగడుతూ... తమలాగే వారికీ ఆత్మగౌరవం లేదంటూ అచ్చోసి చెబుతున్నారు. పిచ్చె క్కి కూస్తున్నారు. అదీ బాధాకరమైన విషయం.’’
‘‘అవును గురూ. నువ్వన్నది నిజం. ఢిల్లీ నేతల సంగతి సరే... నిత్యం ఉషోదయమైన వెంటనే... సమస్త ప్రజలందరికీ సెంటిమెంట్లే లేవంటూ, సకల జనమంతా పచ్చి అవకాశవాదులే అంటూ చిత్రీకరిస్తున్న ఈ మిథ్యాసత్యసంధుల వారి మాటేమిటి? వేపకాయ గుత్తులంతగా ఈ వైలేమిటి? గంగవైలేమిటీ?’’
- యాసీన్