assembly elections 2014
-
సెప్టెంబర్లోనే..అసెంబ్లీ ఎన్నికలు
సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికలను సెప్టెంబర్లో ప్రారంభించి, అక్టోబర్ మూడో వారంలోగా పూర్తిచేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు ప్రారంభించింది. ఈ నెల 31న ఓటర్ల తుది జాబితా విడుదలచేసి ఆగస్టు ఐదో తేదీలోగా రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి (కోడ్)ని అమలులోకి తేవాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల సమావేశంలో ఆమోద ముద్రవేసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. వచ్చే శాసనసభ ఎన్నికల గురించి ఆరా తీసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్లు వి.ఎస్.సంపత్, బ్రహ్మే, ఝులీ తదితరులు ముంబై పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లను, ఎన్నికల అధికారులను ముంబైకి ఆహ్వానించారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి, చేపట్టాల్సిన ఏర్పాట్లపై సుదీర్గ చర్చలు జరిపారు. కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను ఈ నెల 15 లోపు పూర్తిచేయాలని ఇదివరకే అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఆ మేరకు ప్రస్తుతం 90 శాతానిపైగా డేటా ఎంట్రీ పనులు పూర్తయ్యాయి. ఈ నెలాఖరు వరకు తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. ఆ తర్వాత ఆగస్టు ఐదో తేదీలోపు ఎన్నికల కోడ్ జారీచేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం యోచిస్తోంది. ఆగస్టు 15-20వ తేదీలోపు ఎన్నికల షెడ్యూలు విడుదల చేసి సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 15 వరకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి అదనంగా పోలీసు బలగాలను రప్పించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ముంబై రీజియన్లో ఉన్న ముంబై, ఠాణే, రాయ్గఢ్ ప్రాంతాల్లో ఎన్నికలకు సంబంధించిన పనులు దాదాపు పూర్తయ్యాయి. కేవలం వసయి, నాలాసొపార ప్రాంతాల్లో ఓటర్ల పేర్ల డాటా ఎంట్రీ పనులు మిగిలిపోయాయి. అవి కూడా త్వరలో పూర్తికానున్నాయి. త్వరలో జరగనున్న తుది సమావేశంలో ఎన్నికలు కచ్చితంగా ఎప్పుడు నిర్వహించాలి...? ఎన్నికల కోడ్ ఎప్పటి నుంచి అమలు చేయాలి..? అనే అంశాలపై ఆమోద ముద్రవేస్తారు. ఆ తర్వాత ఎన్నికల నామినేషన్లు దాఖలు, ఉపసంహరణ, ఎన్నికల గుర్తులు తదితర విషయాలతో సమగ్ర షెడ్యూల్ విడుదలవుతుందని అధికారులు చెప్పారు. -
ఇక రొటీన్ !
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాజకీయం ముగిసింది... ఎన్నికలు అయిపోయాయి... వాటి ఫలితాలూ వచ్చేశాయి. దీంతో జిల్లా ప్రజలు మళ్లీ యథాతథ జీవనంపై దృష్టి సారించారు. ఒకేసారి దూసుకొచ్చిన మూడు ఎన్నికలలో వివిధ పార్టీల తరఫున పనిచేసిన కార్యకర్తలు, సాధారణ ప్రజలు ఇప్పుడు రిలాక్స్గా ఫీలవుతున్నారు. ఇన్నాళ్లూ రాజకీయ బిజీతో పెండింగ్లో పెట్టిన పనులను పూర్తి చేసుకోవడంపై దృష్టి సారించారు. ఇప్పటిదాకా రాజకీయ చర్చలతో కాలం గడిపిన వారంతా ఇక సొంత పనులు చక్కబెట్టుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక, ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు కూడా తమ పాత వృత్తుల్లో నిమగ్నమైపోయారు. అధికార యంత్రాంగం విషయానికి వస్తే... ఎన్నికల కారణంగా పెండింగ్లో పెట్టిన పనులపై కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా తాత్కాలికంగా రద్దు చేసిన గ్రీవెన్స్డే సోమవారం తిరిగి ప్రారంభమయింది. సాధారణ పనులు మొదలు పెట్టినప్పటికీ.. అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం కావడానికి మాత్రం మరో నెల రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాసనసభ తొలి సమావేశాలు ప్రారంభమై ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసేందుకు కొంత సమయం పడుతుందని, ఆ తర్వాతే పెండింగ్లో ఉన్న వాటితో పాటు నూతన అభివృద్ధి పనులు ముందుకు సాగుతాయని చెపుతున్నారు. ప్రస్తుతానికి విభజన లెక్కలు... ఇన్నాళ్లూ ఎన్నికల నిర్వహణలో తలమునకలై ఉన్న జిల్లా యంత్రాంగం ఇప్పుడు రాష్ట్ర విభజన లెక్కలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. మూడు రకాల ఎన్నికల నిర్వహణ, వాటి ఫలితాల వెల్లడి ఘట్టాలు విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర లెక్కల్లో అధికారులు బిజీగా ఉన్నారు. ఉద్యోగుల పంపిణీతో పాటు నూతన రాష్ట్రంలో అమలయ్యే అభివృద్ధి కార్యక్రమాల కోసం అవసరమయ్యే నిధులు, వార్షిక బడ్జెట్ ప్రణాళికలకు అనుగుణంగా నిధులు వ్యయం చేయాల్సిన తీరుపై ఉన్నతాధికారులు అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే అన్ని శాఖల నుంచి ఉద్యోగుల వివరాలు సేకరించిన యంత్రాంగం ఏ శాఖలో ఎవరు తెలంగాణలో ఉండాలి, ఎవరు ఆంధ్రప్రదేశ్కు వెళ్లాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అపాయింటెడ్ డే వరకు ఈ విభజన లెక్కల్లోనే ఉంటామని అధికారులు చెపుతున్నారు. పోలవరం ముంపు ప్రాంతంలోని గ్రామాలను సీమాంధ్రలో కలపాల్సిన నేపథ్యంలో సరిహద్దుల ఏర్పాటు, నిర్వాసితుల పరిహారం ఫైళ్లు కూడా పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నాయి. ఇంకా కొన్ని పూర్తి కావాలి... విభజన లెక్కల పరిస్థితి అలా ఉంటే... జిల్లాలో మళ్లీ అభివృద్ధి పనులు పూర్తిస్థాయిలో ప్రారంభించడానికి మరో నెలరోజులు పట్టే అవకాశముందని అధికార వర్గాలంటున్నాయి. ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసేంతవరకు జిల్లాలో కొత్త అభివృద్ధి పనులు ప్రారంభం కావని వారు చెపుతున్నారు. మరోవైపు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు పాలకవర్గాల ఏర్పాటు, జడ్పీ చైర్పర్సన్, ఎంపీపీ ఎన్నికలాంటి కార్యక్రమాలు పూర్తయిన తర్వాతే ప్రజాప్రతినిధులు కొత్త పనుల ప్రారంభంపై దృష్టి సారించనున్నారు. ఇప్పటికే ప్రారంభించిన పనులు కొనసాగుతున్నప్పటికీ.. కొత్తగా ప్రారంభించాల్సిన వాటికి మాత్రం కొంత సమయం పట్టనుంది. అలా వెళ్లొద్దామా..! దాదాపు మూడు నెలలుగా రాజకీయాలతో బిజీగా గడిపిన వారంతా ఇప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఎండాకాలం కావడంతో ఇప్పటికే చాలా మంది ఊర్లకు వెళ్లిపోగా, పాఠశాల సెలవులు కూడా ముగిసే సమయం వస్తుండడంతో వీలున్నంత త్వరగా టూర్లకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక, ప్రత్యక్షంగా రాజకీయాలతో సంబంధం ఉన్న చోటా మోటా నాయకులు పుణ్యక్షేత్రాల బాట పట్టారు. గెలిచిన వారు మొక్కులు తీర్చుకునేందుకు బయలుదేరగా, ఓడిన పార్టీ వారు కుటుంబాలతో కలిసి వెళుతున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, పోలీసులు కూడా వరుస సెలవులు పెట్టి విహారయాత్రలకు పయనమవుతున్నారు. -
టీడీపీలో వెన్నుపోటుదారులెవరు..?
గిద్దలూరు, న్యూస్లైన్ : టీడీపీలో వెన్నుపోటుదారులున్నారని ఆ పార్టీ తరఫున గిద్దలూరు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలైన అన్నా రాంబాబు అనడంతో.. వారెవరా..? అని నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. స్థానిక విఠా సుబ్బరత్నం కల్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అన్నా రాంబాబు.. కార్యకర్తలపై విరుచుకుపడ్డారు. తన ఓటమికి పార్టీలో ఉన్న వెన్నుపోటుదారులే కారణమని, వారంతా సభ నుంచి ఇప్పుడే వెళ్లిపోవాలని అనడంతో కార్యకర్తలంతా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఎవరా వెన్నుపోటుదారులనుకుంటూ చర్చించుకున్నారు.రాంబాబు మాటలకు వేదికపై కూర్చున్న ఇద్దరుముగ్గురు నాయకులు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు వారి మొహాల్లో కనిపించింది. దీంతో వారినుద్దేశించే రాంబాబు అలా మాట్లాడారేమోనని అక్కడున్నవారంతా అనుకున్నారు. అప్పులు తీర్చుకున్నసీజనల్ నాయకులు... రాచర్ల మండలంలోని రెండు గ్రామాలకు చెందిన సీజనల్ నాయకులు, గిద్దలూరు పట్టణానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి ఎన్నికల సీజన్లోనే ప్రజలకు కనిపిస్తారు. వీరెంతటి వారంటే.. పోటీలో ఉన్న అభ్యర్థులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. కోట్ల రూపాయలు తమ చేతిలో పెట్టి నిశ్చంతగా ఉండమంటారు. కానీ, ఈసారి ఎన్నికల్లో ఎన్ని కోట్ల రూపాయలిచ్చినా వారి జేబులు నిండలేదు. అన్నా రాంబాబుకు సంబంధించి ఓటర్లకు చేరాల్సిన నగదును ఈ సీజనల్ నాయకులే దిగమింగారన్న వార్తలు నియోజకవర్గంలో గుప్పుమంటున్నాయి. తన ఓటమికి కారణం అదేనని రాంబాబు మనసులోనూ తట్టబట్టే వందలాది మంది కార్యకర్తల ముందు వెన్నుపోటుదారుల గురించి మాట్లాడారని ప్రజలు చెప్పుకుంటున్నారు. భారీగా నగదుతో ఓ లాడ్జిలో ఉన్న రాంబాబు వర్గీయులను అదే పార్టీలో ఉన్న రాచర్లకు చెందిన ఓ సీజనల్ నాయకుడు పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి పట్టించినట్లు తెలిసింది. అనంతరం ఈ విషయం బయటకు పొక్కకుండా రాంబాబు మాఫీ చేసుకున్నట్లు సమాచారం. కేవలం తనకు కోటి రూపాయల ప్యాకేజీ ఇవ్వలేదనే అక్కసుతోనే రాచర్లకు చెందిన ఆ సీజనల్ నాయకుడు ఇలా చేశాడని టీడీపీ వర్గాల్లో చర్చ ఊపందుకుంది. హాస్యాస్పదంగా రాంబాబు మాటలు... టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సాక్షాత్తూ తన సొంత మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచి అప్పట్లో అధికారంలోకి వచ్చాడని యావత్ రాష్ర్టం కోడై కూస్తోంది. అలాంటి పార్టీ తరఫున పోటీచేసిన రాంబాబు.. తన ఓటమికి పార్టీలోని వెన్నుపోటుదారులే కారణమని అనడం హాస్యాస్పదంగా ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. అలాంటి పార్టీలో ఉంటూ వెన్నుపోటుదారులు బయటకు వెళ్లాలని మాట్లాడటం చూస్తే..చంద్రబాబును కూడా బయటకు పొమ్మన్నట్లుగా రాంబాబు మాటల తీరు ఉందని అభిప్రాయపడుతున్నారు. ఓటమికి కారణాలేవైనప్పటికీ పార్టీ కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలందరినీ రాంబాబు అనుమానించి దూషించడం సరికాదని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఈవీఎంలపై రగడ
చీరాల, న్యూస్లైన్: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చీరాల నియోజకవర్గంలో ఈవీఎంలను మార్చి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఒక కాలేజీలో భద్రపరిచిన ఈవీఎంలను రాత్రివేళ గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు అధికారులు ప్రయత్నించిన వ్యవహారం చినికి చినికి గాలివానలా మారింది. చీరాలలోని వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కాలేజీలో భద్రపరిచిన ఈవీఎంలను రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సోమవారం రాత్రి తరలించేందుకు ప్రయత్నించగా..సమాచారం అందుకున్న టీడీపీ, వైఎస్సార్ సీపీ శ్రేణులు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. వారిని చూసి అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అప్పటి నుంచి కాలేజీ వ ద్దకు ఇరుపార్టీల కార్యకర్తలు వేలాదిగా తరలిరావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు, కార్యకర్తల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు ప్రత్యేక బలగాలను మోహరించారు. ఏ క్షణంలో అయినా ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం ఉండడంతో టియర్గ్యాస్, ప్రత్యేక బలగాలను తరలించారు. మంగళవారం స్థానిక తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్తో కలిసి ఈవీఎంలు ఉంచిన గదిని పరిశీలించేందుకు వచ్చిన ఆర్డీవోను సైతం టీడీపీ, వైఎస్సార్ సీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. అధికారులు వ్యవహరించిన తీరు అనుమానాస్పదంగా ఉందని..ఈవీఎంలు ఉంచిన గది వద్ద ఎటువంటి సెక్యూరిటీ లేకపోవడం..రాత్రివేళ ఈవీఎంలను తరలించేందుకు ప్రయత్నించడం..స్ట్రాంగ్ రూం కిటికీలు తెరచి ఉంచడంపై తమకు సమాధానం ఇవ్వాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యడం బాలాజీ, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీత భర్త పోతుల సురేష్ నిలదీశారు. స్థానిక అధికారులు ముందుగా గదిలో ఉన్న ఈవీఎంల నంబర్లు తమకు ఇవ్వలేదని, ఇందులో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని రిటర్నింగ్ అధికారి పద్మజపై ఆరోపణలు చేశారు. స్థానిక అధికారులపై తమకు నమ్మకం లేదని..ఎన్నికల అధికారి భన్వర్లాల్ పర్యవేక్షణలో ఈవీఎంల అక్రమ తరలింపుపై విచారణకు నాయకులు డిమాండ్ చేశారు. స్ట్రాంగ్రూంలో ట్రైనింగ్, రిజర్వ్ ఈవీఎంలే ఉన్నాయని డీఆర్వో, ఆర్డీవోతో పాటు స్థానిక అధికారులు చెప్పినా టీడీపీ, వైఎస్సార్ సీపీ నాయకులు ఒప్పుకోలేదు. ఇతర జిల్లాల నుంచి అధికారులను రప్పించి విచారణ జరిపించాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి ట్రైనింగ్, రిజర్వ్ ఈవీఎంలను జిల్లా కేంద్రానికి తరలించగా చీరాలలో ఉంచిన ఈవీఎంలను తరలించపోవడం వెనుక రెవెన్యూ అధికారుల వైఖరిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ నరహర ఆధ్వర్యంలో బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. వీడిన అనుమానం.. ఈవీఎంల వ్యవహారంపై స్థానిక, జిల్లా అధికారులతో కాకుండా ఇతర అధికారులతో విచారణ చేయించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్లాల్ను టీడీపీ అభ్యర్ధి పోతుల సునీత, పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్తో కలిసి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎన్నికల సంఘం విచారణాధికారులుగా గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్, తెనాలి ఆర్డోఓ శ్రీనివాసమూర్తి, బాపట్ల తహశీల్దార్ వెంకటేశ్వర్లును నియమించింది. సాయంత్రానికి చీరాల వచ్చిన విచారణాధికారులు పార్టీల నాయకులతో చర్చించారు. అనుమానం ఉన్న ఈవీఎంలను అభ్యర్థుల సమక్షంలోనే సీలు తీసి పరిశీలించారు. మొత్తం అందులో ఉన్న 71 ఈవీఎంలను తనిఖీ చేశారు. అన్ని ఈవీఎంలలో రిజల్ట్ సున్నాలు రావడంతో అది రిజర్వ్, ట్రైనింగ్ ఈవీఎంలుగా విచారణాధికారులు నిర్ధారించారు. ఆ ఈవీఎంలలో అవకతవకలు లేవు కాలేజీలో భద్రపరచిన ఈవీఎంల పరిశీలన అనంతరం విచారణాధికారి, గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్ విలేకరులతో మాట్లాడారు. ఈవీఎంలలో ఎటువంటి పోలు కాలేదని, అవి రిజర్వ్లో ఉంచినవని చెప్పారు. అయితే ఈవీఎంలను భద్రపరిచే విషయంలో స్థానిక ఎన్నికల, రెవెన్యూ అధికారులు నిబంధనలు విస్మరించారని, స్ట్రాంగ్ రూంల వద్ద ఎటువంటి సెక్యూరిటీ లేకపోవడం వలనే వివాదం తలెత్తిందని తమ పరిశీలనలో తేలిందన్నారు. దీనిపై అన్ని వివరాలను ఎలక్షన్ కమిషన్కు నివేదించనున్నామన్నారు. దీంతో 24 గంటలుగా చీరాలలో ఉద్రిక్తతకు కారణమైన ఈవీఎంల వివాదానికి తెరపడింది. -
ఏం చేద్దాం!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికలు ఇచ్చిన చేదు ఫలితాలను కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఊహిం చని ఫలితాల దిగ్భ్రమ నుంచి ఆ పార్టీ దిగ్గజా లు ఇంకా తేరుకోవడం లేదు. ‘తెలంగాణ’ ఏ ర్పాటును సా నుకూలంగా మార్చుకోలేకపోయామన్న బాధతోపాటు, రాజకీయ భవిష్యత్ ఏమిటన్న చర్చ ఆ పార్టీ నేతలలో సాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ఏర్పాటు చేయనుండగా, తమ వ్యూ హం ఏమిటో తేల్చుకోలేకపోతున్నారు. ప్రతికూల పరిస్థితులు, ఫలితాల నేపథ్యంలో ఏం చేయాలనే ఆలోచనలో వారు పడిపోయారు. రెండు లోక్సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలలో ఘోర పరాజయం పొందడంపై కాంగ్రెస్లో అంతర్మథనం సాగుతుండగా, కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపేందుకు విస్తృతస్థాయి సమావేశం నిర్వహించేందుకు డీసీసీ సన్నాహాలు చేస్తోంది. ఇంతటి ఘోర పరాజయమా! సార్వత్రిక ఎన్నికలలో ఊహించని ఫలి తాల నుంచి కాంగ్రెస్ సీనియర్లు ఇంకా తేరుకోలేదు. అన్ని స్థానాలలో ఘోర పరాజయం పొందడంపై ఇంకా ‘పోస్టుమార్టం’ సాగుతోంది. నిజామాబాద్, జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న మధుయాష్కీ, సురేశ్ షెట్కార్ ఓటమి కూడా వారిని ఆలోచనలో పడవేసింది. కొద్దిగా ప్రశాంతత కోసం కేడర్కు కూడా దూరంగా ఉంటున్న పరిస్థితి. వరుసగా మూడుసార్లు ఓటమి చెందిన ధర్మపురి శ్రీనివాస్(డీఎస్), మహ్మద్ షబ్బీర్అలీతోపాటు మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి ‘అసలేం జరిగిందో’నని ఫలితాలను విశ్లేషిస్తున్నారు. గెలుపు ధీమాలో ఉన్న ఈ ముగ్గురు నేతలకు ఓటమితో ఊహించని షాక్ తగిలింది. బాల్కొండ నుంచి ఆర్మూరుకు మారడంతో మాజీ స్పీకర్ సురేశ్రెడ్డికి కలిసి రావడం లేదు. ఆయన కూడా వరుసగా రెండు పర్యాయాలు ఓటమి చెందడాన్ని జీర్ణించుకోవడం లేదు. ఈరవత్రి అనిల్ సైతం ఓటమికి కారణాలను విశ్లేషిస్తున్నారు. గ్రూపుల పోరూ కొంప ముంచింది. జిల్లాలో కాంగ్రెస్కు ప్రతికూల ఫలితా లు రావడంతో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రె స్ కమిటీపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక, ప్రచార సరళి, సరైన మార్గదర్శనం, ప్లానింగ్ లేకపోవడంతోనే ఫలితాలు దారుణం గా వచ్చాయంటున్నారు. టీపీసీసీ తీరుపై మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్యవహరించిన తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘తెలంగాణ’కు కాంగ్రెస్ అధిష్టానం అనుకూలంగా వ్యవహరిం చిన అంశాన్ని ప్రచారంలో సానుకూలం గా మార్చుకోవడంలో టీపీసీసీ వైఫల్యం చెందిందన్న ఆరోపణలున్నాయి. ఇది లా ఉంటే జిల్లా కాంగ్రెస్లో ఉన్న గ్రూపు ల పోరు, ప్రత్యర్థులకు కలిసొచ్చిందన్న చర్చ జరుగుతోంది. ‘తెలంగాణ ’ ప్రకటన సందర్భంగా పలు జిల్లాల్లో నేతలం తా కలిసికట్టుగా ‘కృతజ్ఞత’సదస్సులు నిర్వహించగా.. జిల్లాలో మాత్రం గ్రూపు రాజకీయాల నడుమ సంబరాలు జరుపుకోవడం అప్పట్లో చర్చనీయాం శం అయ్యింది. డీఎస్, సుదర్శన్రెడ్డి, షబ్బీర్అలీ, సురేశ్రెడ్డి, ఈరవత్రి అనిల్ వేర్వేరుగా సదస్సులు నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్లో నాలుగు స్తంభాలాట నడుస్తుందని ప్రచారం కూడ జరిగింది. ఇవన్నీ సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపగా.. ఇప్పటికైనా గ్రూపులు వీడుతారా? అన్న చర్చ కూడ జరుగుతోంది. -
ఆశీర్వదించారు.. అందల మెక్కుతున్నారు
వినాయక్నగర్, న్యూస్లైన్ : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ప్రధాని అభ్యర్థి దేశవ్యాప్తంగా ప్రచార సభలను నిర్వహించారు. ఇందులో భాగంగా గత నెల 22 వ తేదీన నగరంలోని గిరిరాజ్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభకు ముఖ్యఅతిథిగా ఆయన వచ్చారు. ఈ సభకు బంజారాల గురువు రామారావు మహారాజ్ మహారాష్ట్ర నుంచి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సభావేదికపై నరేంద్రమోడీకి మహారాజ్ ‘విజయోస్తూ’ అంటూ ఆశీర్వదిం చారు. దేశంలో మోడీని ప్రధానిగా చూడాలని కాంక్షించిన నేపథ్యంలో ఇందూరు గడ్డపై మహారాష్ట్ర మహారాజ్ ఆశీర్వదం ఎంతగానో తోడైందని బంజారవర్గాలు చెప్పుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనంతో బీజేపీకి దేశప్రజలు అఖండ మెజారిటీని అందించారు. దీంతో ఆయన నవభారత నిర్మాణానికి పూనుకునేందకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 26న సాయంత్రం 6 గంటలకు ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. -
నీతి, నిజాయతీతో వ్యవహరిస్తాం
బెల్లంపల్లి, న్యూస్లైన్ : ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు నీతి, నిజాయతీతో పనిచేసి ఉత్తమ సేవలు అందిస్తామని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ అన్నారు. మంగళవారం పట్టణంలోని పద్మశాలి భవన్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీల ప్రజా వ్యతిరేక పాలనకు విసిగిపోయి ప్రజలు టీఆర్ఎస్కు పట్టం కట్టారని తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటామని పేర్కొన్నారు. అభివృద్ధికి తగిన ప్రాధాన్యం ఇస్తామన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను తీర్చడానికి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తామన్నారు. ప్రణాళికబద్ధంగా అభివృద్ధి పనులు నిర్వహిస్తామని తెలిపారు. రహదారులు, వాగులపై వంతెనలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తామని పేర్కొన్నారు. సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను రద్దుకు తోడ్పడతానన్నారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేయిస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇద్దరు పేద బిడ్డలను గెలిపించి గుండెలకు హద్దుకున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన 1200 మంది విద్యార్థి యువజనుల త్యాగఫలితంగానే తాము ఎన్నికల్లో విజయం సాధించామని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారిగా బెల్లంపల్లికి వచ్చిన ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యలకు టీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆర్.ప్రవీణ్, రాష్ట్ర నాయకులు ఎస్.నర్సింగం, జెడ్పీటీసీ సభ్యులు ఎం.సురేశ్బాబు, కొడిపె భారతి, అల్లి మోహన్, ఆర్.సత్తయ్య, బెల్లంపల్లి పట్టణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు పి.సురేశ్, బి.అర్జయ్య పాల్గొన్నారు. -
తొలిసారి ఎదురుగాలి
చేవెళ్ల, న్యూస్లైన్: మూడు దశాబ్దాలపాటు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన పట్లోళ్ల కుంటుంబానికి తొలిసారి ప్రజల నుంచి ఎదురుగాలి వీచింది. 1985 నుంచి తెలుగుదేశం పార్టీలో, 1999 నుంచి 2014వరకు కాంగ్రెస్ పార్టీలో అన్నీ తామై నడిపిన ఆ కుంటుబానికి నేడు ప్రాతినిథ్యం కరువైంది. 30 ఏళ్లుగా ఆదరిస్తూ వచ్చిన ప్రజల నుంచి మొదటిసారి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఒక కుటుంబం నుంచి ఒకేసీటు అనే నినాదాన్ని ఏఐసీసీ అమలుచేయడంతో మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా జిల్లాలో ఆధిపత్యం చలాయించిన మాజీ హోంమంత్రి పి.సబితారెడ్డి తన కుమారుడు కార్తీక్రెడ్డి కోసం పోటీనుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో అధిష్టానం చేవెళ్ల ఎంపీ టికెట్ను కార్తీక్రెడ్డికి కేటాయించింది. అయితే కార్తిక్రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 26,685 ఓట్ల భారీ ఆధిక్యాన్ని సాధించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా ఖంగుతిన్నాయి. 1985లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఇంద్రారెడ్డి అఖండ మెజార్టీతో విజయం సాధించారు. 1989, 1994 ఎన్నికల్లోనూ అదే పార్టీ నుంచి పోటీచేసి గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 1999లో ఇంద్రారెడ్డి కాంగ్రెస్పార్టీలో చేరినా ప్రజలు ఆదరించారు. 2000 సంవత్సరంలో ఇంద్రారెడ్డి ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన సతీమణి సబితారెడ్డి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. 2004లో సైతం ఆమె విజయం సాధించారు. ఇలా ఇంద్రారెడ్డి చేవెళ్ల ఎమ్మెల్యేగా నాలుగు సార్లు, సబితారెడ్డి రెండు సార్లు గెలిచారు. 2009 వరకు పట్లోళ్ల కుటుంబ ఆధిపత్యం కొనసాగింది. ఆ ఏడాది నియోజకవర్గాల పునర్విభజనలో చేవెళ్ల అసెంబ్లీ స్థానం ఎస్సీకి రిజర్వ కావటంతో సబితారెడ్డి మహేశ్వరం జనరల్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. నిరాశలో కార్యకర్తలు.. ఈ సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభకు పోటీచేయాలన్న ఉద్దేశంతో నాలుగైదేళ్లుగా క్షేత్ర స్థాయిలో కార్తిక్రెడ్డి పనిచేశారు. నిరంతరం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ క్యాడర్ను కాపాడుకున్నారు. ఈ ఏడాది జనవరిలో తెలంగాణ నవనిర్మాణ పాదయాత్ర పేరుతో రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని బండ్లగూడ వద్దగల ఆరెమైసమ్మ దేవాలయం నుంచి చేవెళ్ల, వికారాబాద్ నియోజకవర్గాల మీదుగా తాండూరు వరకు 101 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. దీనికి విశేష స్పందన రావడంతో ఎంపీ టికెట్ ఇస్తే సునాయాసంగా గెలుస్తారని భావించారు. రాహుల్ దూతలు కూడా ఇదే విషయాన్ని అధిష్టానానికి వివరించారు. ఎంపీ టికెట్ ఇచ్చే విషయంలో పోటీ నెలకొన్నప్పటికి కార్తిక్రెడ్డి అధిష్టానం నుంచి టికెట్ సాధించగలిగారు. చేవెళ్ల నియోజకవర్గంలో భారీ మెజార్టీ వస్తుందని కార్యకర్తలు ఊహించారు. అనూహ్యంగా కార్తిక్రెడ్డి కంటే తెరాస అభ్యర్థికి ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. నియోజకవర్గ పరిధిలోని చే వెళ్లతో పాటు నవాబుపేట, శంకర్పల్లి, షాబాద్, మొయినాబాద్ మండ లాల్లో ఏ ఒక్క చోటా కార్తిక్రెడ్డికి ఆధిక్యం రాలేదు. అన్ని మండలాల్లోనూ వెనుకబడి పోవటం ఆ పార్టీ కార్యకర్తలను నిరాశకు గురిచేసింది. ఇలా ఎందుకు జరిగిందంటూ అంతర్మథనంలో పడిపోయారు. చేవెళ్ల అసెంబ్లీ పరిధిలో లోక్సభకు మొత్తం 1,61,971 ఓట్లు పోలవగా అందులో టీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డికి అత్యధికంగా 79,781 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 53,096 ఓట్లు పడ్డాయి. దీంతో కాంగ్రెస్ శ్రేణులు, ముఖ్యంగా సబితాఇంద్రారెడ్డి అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. -
ఈసారి 150 : గతంలో కంటే అధిక స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్న బీజేపీ
సాక్షి, ముంబై: సార్వత్రిక ఎన్నికల్లో మహా గెలుపును సాధించిన బీజేపీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ మిత్రపక్షాలతో కలిసి సత్తా చాటాలనుకుంటోంది. ఇప్పటి నుంచే కనీసం 150 స్థానాలకు తక్కువ కాకుండా పోటీ చేయాలనుకుంటోంది. 288 అసెంబ్లీ సీట్లున్న రాష్ట్రంలో గత ఎన్నికల్లో శివసేన 171 స్థానాలు, బీజేపీ 117 స్థానాల్లో పోటీ చేసింది. శివసేన 45 సీట్లలో విజయం సాధించగా, బీజేపీ 46 స్థానాలు దక్కించుకుంది. దీంతో శివసేనకంటే ఒక్క స్థానం అధికంగా లభించడంతో ప్రతిపక్ష హోదా బీజేపీకి దక్కింది. 1994లో అధిక స్థానాలు దక్కించుకున్న శివసేనకు ముఖ్యమంత్రి పదవి, బీజేపీకి ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నారు. అనంతరం ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా అధిక స్థానాలున్న శివసేనకే ప్రతిపక్ష నాయకుడి పదవి లభించింది. అయితే 2009లో ఒక్కసీటు కారణంగా ప్రతిపక్ష హోదా బీజేపీకి దక్కింది. అయితే ఈసారి లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు సీన్ మరింతమారేలా చేసింది. అధిక స్థానాలతోపాటు ఓటింగ్ శాతం కూడా పెరిగింది. మహాకూటమికి మొత్తం 51 శాతం ఓట్లు వచ్చాయి. వీటిలో బీజేపీకి 27.57 శాతం, శివసేనకు 20.82 శాతం ఓట్లు లభించాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవిని కూడా చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ అధిక స్థానాల్లో పోటీ చేయాలని యోచిస్తోంది. మారనున్న ఫార్ములా..? సీట్ల పంపకాలలో కొత్త ఫార్ములాతో పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. గత 20 సంవత్సరాలకుపైగా శివసేన, బీజేపీల కూటమి కొనసాగుతోంది. దివంగత శివసేన అధినేత బాల్ఠాక్రే, దివంగత బీజేపీ నాయకులు ప్రమోద్ మహాజన్ల హాయాంలో లోక్సభలో బీజేపీకి అధికంగా, అసెంబ్లీలో శివసేనకు అధిక సీట్లు కేటాయించాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని 48 లోక్సభ నియోజకవర్గాల్లో బీజేపీ కోటాలోకి 26 రాగా, శివసేనకు 22 స్థానాలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రాష్ట్రంలోని మొత్తం 288 స్థానాల్లో శివసేన కోటాలో 171, బీజేపీ కోటాలో 117 స్థానాలున్నాయి. అయితే గతంలో శివసేన, బీజేపీలే మిత్రపక్షాలుగా ఉండగా, ఈసారి మహాకూటమిగా మారిన ఈ కూటమిలో ఆర్పీఐ, శివసంగ్రామ్, స్వాభిమాని షేత్కారీ పార్టీ తదితరాలున్నాయి. దీంతో ఫార్ములా మార్చాల్సి రానుంది. శివసేన, లేకపోతే బీజేపీ నుంచి కొన్ని స్థానాలను వీరికి కేటాయించాల్సిన అవసరం ఏర్పడింది. మరోవైపు బలం పెరగడంతో బీజేపీ 150 స్థానాల్లో పోటీచేస్తే శివసేన, ఇతర పార్టీలకు ఎన్ని స్థానాలు కేటాయించనున్నారనే విషయమై చర్చలు జరుగుతున్నట్టు సమచారం. అయితే కొత్తఫార్ములాకు శివసేన ససేమిరా అంటుంది. పాతఫార్ములాతోనే పోటీ చేసినా కొన్ని స్థానాలను తమ మిత్రపక్షాలకు కేటాయిస్తామని శివసేన పేర్కొంటున్నట్టు తెలుస్తోంది. మారుతున్న సీన్...? కాషాయ కూటమిలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దివంగత నేత బాల్ఠాక్రే హాయాంలో ఏ నిర్ణయమైన ఆయనతో సంప్రదింపుల అనంతరమే తీసుకునేవారు. శివసేనకు అంతటి ప్రాధాన్యత ఉండేది. అయితే బాల్ఠాక్రే మరణానంతరం మార్పువచ్చిందని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. సామ్నా దినపత్రికలో బాల్ఠాక్రే తనదైన శైలిలో ప్రత్యర్థులతోపాటు అవసరమైన సమయంలో మిత్రపక్షమైన బీజేపీపై కూడా విమర్శలు సంధించి తమ ప్రాధాన్యత ఏమిటన్నది చాటుకునేవారు. ఇటీవలే గుజరాతీయుల అంశంపై ప్రచురితమైన సామ్నా సంపాదకీయంపై నరేంద్ర మోడీ నిరసన తెలిపినట్టు సమాచారం. దీంతో వెంటనే ఉద్ధవ్ఠాక్రేతోపాటు ఇతర నాయకులు సామ్నా పత్రికలో రాసిన సంపాదకీయంతో పార్టీ నాయకత్వానికి సంబంధం లేదని ప్రకటించాల్సి వచ్చింది. ఈ ప్రభావంతో సంజయ్ రావుత్ అధికారాలను కూడా కొంచెం తగ్గించారు. దీన్నిబట్టి కాషాయకూటమి(మహాకూటమి)లో కొంత సీన్ మారిందని చెబుతున్నారు. అయితే అలాంటిదేమి లేదని శివసేన, బీజేపీలు పేర్కొంటున్నాయి. పాత పద్ధతిలోనే పోటీ: ఉద్ధవ్ సాక్షి, ముంబై: రాష్ట్రంలో త్వరలో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో బీజేపీ కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తామని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో మహాకూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో మంగళవారం ఉద్ధవ్ఠాక్రే ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ఎన్డీయేతో సమావేశం తర్వాత ఉద్ధవ్ మీడియాతో మాట్లాడారు. దేశాన్ని పటిష్టం చేసేందుకు బీజేపీతో కలిసి పని చేస్తామని, మంత్రి పదవులపై ప్రస్తుతం ఎలాంటి చర్చ జరగలేదన్నారు. శాసనసభ ఎన్నికల్లో సీట్ల పంపకంలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. మంత్రి పదవులపై శివసేన తొందరపడడం లేదని, మోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాతే చర్చిస్తామని అన్నారు. బీజేపీ ప్రభుత్వానికి తమ వంతుగా పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఎలాంటి నిర్ణయాలైన కలిసే తీసుకుంటామని అన్నారు. ఇది ఒక చారిత్రాత్మక విజయమని, దీంతో తమ కల నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. ఇదే ఐకమత్యంతో శాసనసభ ఎన్నికలకు వెళతామని అన్నారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పాలనను ఏ విధంగా తిరస్కరించారో లోక్సభ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైందని, ఓటమి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జైతాపూర్ అణు విద్యుత్ ప్రాజెక్టును ఇప్పటికీ తాము వ్యతిరేకిస్తున్నామన్నారు, ఒకవేళ అది మంచిది, సురక్షితమే అయితే దేశంలోని ఇతర ఏ రాష్ట్రాలకైనా తరలించాలి. కానీ ఈ ప్రాజెక్టు మాకొద్దు అని స్పష్టం చేశారు. ఒకవేళ విద్యుత్ అవసరమైతే ఈ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉందో అక్కడి నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. ‘మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయిన తర్వాత మహాకూటమి ఎంపీలు అపాయింట్మెంట్ తీసుకుంటారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలవల్ల నష్టపోయిన రైతుల అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళతార’న్నారు. ఇతర అంశాలతోపాటు నష్టపరిహారం గురించి చర్చించి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే గురించి విలేకరులడిగిన ప్రశ్నకు ఉద్ధవ్ నోరు విప్పలేదు. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక పాకిస్తాన్ ఏదైన అఘాయిత్యానికి పాల్పడితే తగిన బుద్ధి చెప్పాల్సిందేనన్నారు. -
రచ్చ గెలిచి.. ఇంట గెలవకున్నా..
* పద్ధతి మార్చుకోని కందుకూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు * ఇక్కడ ఓడినా రాష్ట్రంలో అధికారం వచ్చిందంటూ రెచ్చగొట్టే ర్యాలీ * పట్టణంలో ఓ సామాజికవర్గమే లక్ష్యంగా షాపులపై దాడులు * భయంతో షాపులు మూసి పరుగులు తీసిన వ్యాపారులు * తెలుగు తమ్ముళ్ల అత్యుత్సాహంపై వెల్లువెత్తుతున్న విమర్శలు కందుకూరు, న్యూస్లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పును జీర్ణించుకోలేక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భౌతిక దాడులకు తెగబడుతున్నారు. ఓడామన్న బాధను బయటకు కనిపించకుండా రాష్ట్రంలో అధికారం వచ్చిందంటూ నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీలు చేస్తూ సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. వివరాలు.. ఇటీవల నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన దివి శివరాం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోతుల రామారావు చేతిలో ఘోర ఓటమిని చవిచూశారు. నియోజకవర్గంలో ఓటమిపాలైనా రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిందంటూ పట్టణంలో సోమవారం ర్యాలీ చేపట్టారు. కోటారెడ్డినగర్లోని దివి శివరాం ఇంటి నుంచి ఓవీరోడ్, పోస్టాఫీసు సెంటర్, పామూరు రోడ్, ఎన్టీఆర్ బొమ్మ సెంటర్ మీదుగా ర్యాలీ కొనసాగింది. ర్యాలీకి ముందు కొందరు టీడీపీ కార్యకర్తలు ద్విచక్ర వాహనాలపై హల్చల్ చేశారు. తమకు ఓట్లు వేయలేదని భావిస్తున్న ఓ సామాజిక వర్గానికి చెందిన వారి షాపులను టార్గెట్ చేశారు. పోస్టాఫీసు సెంటర్ లో ఉన్న వేముల పాపయ్యగుప్తా జ్యూయలర్స్ (వీపీజీ జ్యూలయర్స్) ఎదుట కొందరు ద్విచక్ర వాహనాలు ఆపి హంగామా చేశారు. అనంతరం ఆ జ్యుయలరీ షాపును టార్గెట్ చేస్తూ దాడులకు దిగారు. షాపు అద్దాలు పగలగొట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. వీలు కాకపోవడంతో పక్కనే ఉన్న సైకిల్ను బలంగా విసరడంతో షాపు అద్దాలు ధ్వసమయ్యాయి. దీంతో అప్పటికే షాపులో బంగారం కొనుగోలు చేసేందుకు వచ్చిన మహిళతో పాటు కూలీలు, యజమాని గజగజలాడిపోయారు. భయభ్రాంతులకు గురై షాపు షెట్టర్ వేసుకుని లోపలే ఉండిపోయారు. ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యాపారులు మొత్తం భయంతో తమ షాపులు మూసివేసి పరుగులు తీశారు. ర్యాలీ పామూరురోడ్డులోకి వచ్చే సరికి వ్యాపార సంస్థలన్నీ మూతబడ్డాయి. కొద్దిసేపటి తర్వాత దాడి జరిగిన వీపీజీ జ్యుయలరీ వద్దకు వచ్చిన దివి శివరాం.. షాపు యజమానితో మాట్లాడారు. ఏదో పొరపాటున అద్దాలు ధ్వంసమయ్యాయని సర్దిచెప్పే ప్రయత్నం చేయడం గమనార్హం. ఓట్లు పడలేదని నిర్ధారించుకునేదాడులు గెలుపు కోసం టీడీపీ నాయకుల ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వరుసగా మూడోసారి శివరాం ఓటమి పాలుకావడాన్ని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఎన్నికలకు ముందు నుంచే తమకు వ్యతిరేకంగా ఉన్న సామాజిక వర్గాలన్నిటినీ తమ వైపు తిప్పుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. పట్టణంలో అధిక సంఖ్య లో ఓటర్లు ఉన్న ఓ సామాజికవర్గానికి చెందిన కొందరు నేతలను తమ వైపునకు తిప్పుకున్నారు. ఆ సామాజిక వర్గం ఓట్లన్నీ తమకే వస్తాయని భావించగా ఎన్నికల్లో వారికి ఊహించని షాక్ తగిలింది. పట్టణంలో అధిక మంది ఓటర్లు వైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపారు. తాము ఎంతో నమ్మకం పెట్టుకున్న ఓట్లు సైతం తమకు పడలేదనే బాధ టీడీపీ నేతల్లో ఉంది. ఓటమికి గల కారణాలను అన్వేషించిన టీడీపీ నేతలు పట్టణంలో ఆ సామాజికవర్గం వారి షాపులను టార్గెట్ చేసుకుని దాడులకు దిగారు. పాత సంప్రదాయం పునరావృతం కందుకూరు అర్బన్, న్యూస్లైన్ : కందుకూరులో పాత సంప్రదాయం పునరావృతమైంది. నియోజకవర్గంలో ఓటమి తట్టుకోలేని టీడీపీ శ్రేణులు స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంపై అక్కసు వెల్లగక్కాయి. నియోజకవర్గంలో టీడీపీ గెలిచిన ఓడినా ఆ పార్టీ కార్యకర్తలు పాత సంప్రదాయాన్ని కొనసాగిస్తారని అందరూ ముందుగా ఊహించిన విధంగానే జరిగింది. టీడీపీ ఓటమిని తట్టుకోలేని ఆ పార్టీ కార్యకర్తలు తొలి రెండు రోజలు మౌనం వహించారు. తమ ఉనికిని ఏ విధంగానైనా చాటుకోవాలని భావించి చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారన్న పేరుతో కందుకూరులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కోవూరు రోడ్డులో ఉన్న వైఎస్సార్ సీపీ కార్యాలయం మీదుగా కావాలనే సాగించారు. అక్కడ ఉన్న ఆ పార్టీ కార్యాలయంపై దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేగా గెలిచిన పోతుల రామారావు ఫ్లెక్సీలను చించేసి బీభత్సం సృష్టించారు. కార్యాలయంలో ఉన్న వైఎస్సార్ సీపీ నాయకులు భయంతో తలుపులు ముసికొని లోపలే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో మరింత రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు మీ అంతు చస్తామంటూ.. హెచ్చరికలు జారీ చేశారు. అంతటితో ఆగని టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ సీపీ యువజన విభాగం పట్టణ కన్వీనర్ రఫీ పూల కొట్టు ఎదురుగా తారాజువ్వలు కాలుస్తూ భయనక వాతావరణం సృష్టించారు. రఫీపై దాడి చేసేందుకు పక్కనే ఉన్న దేవాల యంలో 20 మంది టీడీపీ యువకులు సిద్ధంగా ఉన్నారు. విషయం తెలుసుకున్న సీఐ మధుబాబు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ ఉన్న వారిని చెదరగొట్టారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు విజయోత్సవ ర్యాలీ సందర్భంగా టీడీపీ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన జ్యుయలరీ షాపును పోలీసులు పరిశీలించారు. సీఐ ఎం.మధుబాబు, పట్టణ ఎస్సై రమణయ్యలు సంఘటన స్థలాన్ని పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. స్టేషన్లో ఫిర్యాదు చేయాలని షాపు యజమానికి సూచించారు. నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
వైఎస్సార్ సీపీ దూకుడు
సాక్షి, ఒంగోలు: జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాదులు పడ్డాయి. పరిషత్పోరులో ఇప్పటికే ఆధిక్యత చాటుకుని జెడ్పీపీఠాన్ని కైవసం చేసుకున్న ఆపార్టీ ... సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత బలీయమైన శక్తిగా అవతరించింది. క్షేత్రస్థాయి నుంచి పార్టీ మరింత బలోపేతమైంది. అన్నివర్గాల ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్కు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఇటు లోక్సభ, అటు శాసనసభ ఎన్నికల్లోనూ ఆపార్టీకి ఓట్లశాతం కూడా గణనీయంగా పెరిగింది. అసెంబ్లీ కంటే లోక్సభ ఎన్నికల్లో 10 నుంచి 14 శాతం ఓట్లు అధికంగా వైఎస్సార్ సీపీకి నమోదుకావడం విశేషం. మొత్తంమీద జిల్లాలో ఓట్లశాతంలో, సీట్ల సాధనలో వైఎస్సార్ సీపీ దూసుకుపోయింది. గిరగిరమంటూ ‘ఫ్యాన్’గాలి జిల్లాలో ఒంగోలు, బాపట్ల లోక్సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీలు, నెల్లూరు కిందనున్న కందుకూరు అసెంబ్లీలో వైఎస్సార్ సీపీకి పోలైన ఓట్లను పరిశీలిస్తే.. 49.06 శాతం మంది ఓటర్లు వైఎస్సార్ సీపీకి జేజేలు పలికారు. జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 24.5 లక్షల మంది ఓటర్లున్నారు. ఎన్నికల్లో 20,85,923 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. వారిలో వైఎస్సార్ సీపీకి 9,80133, టీడీపీకి 9,72,310, కాంగ్రెస్కు 16,837 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీకి పోలయిన ఓట్లలో వైఎస్సార్ సీపీకి 46.98 శాతం, టీడీపీకి 45.99, కాంగ్రెస్కు 0.76 శాతం ఓట్లు లభించాయి. లోక్సభ అభ్యర్థులకు పోలయిన ఓట్లలో వైఎస్సార్ సీపీకే అధికంగా 49.06 శాతం నమోదుకావడం విశేషం. ఆధిక్యతల విషయంలోనూ టీడీపీ కంటే వైఎస్సార్ కాంగ్రెస్ మంచి రికార్డు సాధించింది. జిల్లాలోని 12 అసెంబ్లీలకు గాను 6 స్థానాల్లో పార్టీ పాగా వేసింది. యర్రగొండపాలెంలో పోలైన ఓట్లు మొత్తం 1,57,090 కాగా, ఇందులో 85,417 ఓట్లు వైఎస్సార్ సీపీ అభ్యర్థి పాలపర్తి డేవిడ్రాజుకు అనుకూలంగా పడ్డాయి. సమీప టీడీపీ ప్రత్యర్థి బూదాల అజితారావు కంటే 19,150 ఓట్లు అధికంగా డేవిడ్రాజుకు మెజార్టీ రావడం విశేషం. గిద్దలూరు నుంచి ముత్తుముల అశోక్రెడ్డి 12,893 ఓట్ల మెజార్టీ సాధించారు. మిగిలిన నాలుగుస్థానాల్లో 10 వేలలోపు మెజార్టీ వచ్చింది. ఇదే ఉత్సాహం.. ఊపును భవిష్యత్లోనూ చూపేందుకు ఉద్యమ చైతన్యాన్ని పార్టీకేడర్లో నూరిపోసేందుకు నాయకులు కసరత్తు చేస్తున్నారు. -
మాగుంట నిర్వేదం
సాక్షి, ఒంగోలు: చేతులు కాలాక.. ఆకులు పట్టుకున్న చందంగా మారింది జిల్లాలో టీడీపీ నేతల పరిస్థితి. ఓటమితో కొందరు నేతల్లో నిర్వేదం మొదలైంది. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిన మాగుంట శ్రీనివాసులురెడ్డి తన రాజకీయ భవిష్యత్పై అంతర్మథనంలో ఉన్నారు. ఆయన ఓటర్లకు పంపిణీ చేయాలని అందించిన డబ్బును సక్రమంగా వినియోగించకపోవడమే ఓటమికి కారణమని సహచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు చర్చ జరుగుతోంది. కాంగ్రెస్కు గుడ్బై..చెప్పిన తర్వాత కొంతకాలం పార్టీ మార్పుపై సుదీర్ఘ మంతనాలు జరిపి టీడీపీ లోకొస్తే, పార్టీశ్రేణుల వైఖరి కారణంగా తనకెదురైన పరాభవాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఆయన ఎన్నికల కార్యాలయంలో సాంకేతిక సిబ్బందిని ఇతర పనులకు ఉపయోగించాలని... ఎన్నికల హంగులన్నీ తొలగించాలని నిర్వాహకులను ఆదేశించినట్లు తెలిసింది. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుపై చివరి వరకు ఆశతో ఎదురుచూసిన మాగుంట ...ఫలితం అనుకూలంగా రాకపోవడంతో ఓటమిని జీర్ణించుకోలేక తీవ్ర నిర్వేదానికి లోనై టీడీపీ శ్రేణులపై అలకబూనినట్లు సహచరవర్గాల ద్వారా తెలుస్తోంది. మాగుంట ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఎన్నికల్లో భారీ మొత్తంలో డబ్బుపంపిణీ చేశారు. ఒంగోలు లోక్సభ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులకు కూడా ఆర్థిక సహకారం భారీగానే సమర్పించుకున్నట్లు వినికిడి. అయితే, అందులో సగం కూడా ఓటర్లకు పంపిణీ చేయకపోవడమే తన ఓటమికి కారణమైందనే నిర్ణయానికి ఆయన వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒంగోలు లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపులో వైవీ సుబ్బారెడ్డికి 5,84,209 ఓట్లు పడగా, మాగుంటకు మాత్రం 5,69,118 ఓట్లు పోలైనట్లు తేలింది. వైవీ సుబ్బారెడ్డి 15,095 ఓట్ల ఆధిక్యత సాధించారు. దీంతో తనకు తక్కువ ఓట్లు వచ్చిన ప్రాంతాల్లో అనుచరుల ద్వారా విచారణ చేయించగా, అక్కడ డబ్బు పంపిణీ సరిగ్గా చేయలేదనే విషయం బయటపడింది. రాజ్యసభ పదవికి ప్రయత్నాలు.. పార్టీని నమ్ముకుని రావడమే కాకుండా.. ఆర్థిక ఆసరా కల్పించిన మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఏదో ఒకటి నామినేటెడ్ పదవి కట్టబెట్టాలని జిల్లా టీడీపీ పెద్దలు నడుంకట్టారు. ఇందులో భాగంగానే పలువురు నేతలు మాగుంటను కలిసి.. ఓటమిపై దిగులుపడొద్దని ఓదార్చినట్లు తెలిసింది. మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు నేదురుమల్లి జనార్దన్రెడ్డి మృతితో రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. ఆయన పదవీకాలం 2016 ఏప్రిల్ వరకు ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ పదవిని భర్తీచేసే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీకి ఈస్థానం దక్కొచ్చు. నెల్లూరు జిల్లాతో సత్సంబంధాలు నడిపే మాగుంట శ్రీనివాసులరెడ్డి రాజ్యసభ పదవిపై కన్నేశారు. ఎలాగైనా, ఆ పదవినైనా తనకు ఇప్పించాలని ఇప్పటికే పలువురు పార్టీపెద్దల వద్ద ప్రతిపాదన ఉంచినట్లు తెలిసింది. ఆయనకు సుజనాచౌదరి మద్దతు ఉండటంతో .. జిల్లా నుంచి కరణం బలరాంతో పాటు పలువురు నేతలు గట్టిహామీనిచ్చారు. దీంతో కొందరు ఇదే విషయంపై చంద్రబాబుతో మాట్లాడేందుకు సోమవారం హైదరాబాద్కు పయనమై వెళ్లారు. అయితే, చంద్రబాబు మాత్రం ఈపదవిని ఎవరికి కట్టబెట్టాలనే విషయంపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు...మాగుంటకు ఎంత వరకు అవకాశాలుంటాయనేది చెప్పలేమంటూ అధిష్టాన వర్గాలు చెబుతున్నాయి. -
చీరాలలో ఈవీఎంల కలకలం
చీరాల, న్యూస్లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చీరాల నియోజకవర్గంలో ఈవీఎంలు మార్చి అక్రమాలకు పాల్పడ్డారని, అందుకు అధికారులు ఓ అభ్యర్థికి పూర్తిగా సహకరించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సోమవారం రాత్రి గుట్టుచప్పుడు కాకుండా అధికారుల ఈవీఎంల తరలింపు ప్రయత్నం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. సార్వత్రిక ఎన్నికల లెక్కింపు సందర్భంగా అధికారులు ఓ స్వతంత్ర అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరించి అతని గెలుపునకు కారణమయ్యారంటూ ఫలితాల అనంతరం నుంచి చీరాలలో టీడీపీ నేతలు ఆందోళనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం పట్టణ బంద్కు కూడా పిలుపునిచ్చారు. వివరాలు.. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది సోమవారం రాత్రి గుట్టుచప్పుడు కాకుండా స్థానిక వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాలలో ఈవీఎంలను తరలించేందుకు ప్రయత్నించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దీనికి తోడు టీడీపీ, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు రావడంతో అప్పటి వరకు అక్కడే ఉన్న రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది వాహనాల్లో వెళ్లిపోవడం అనుమానాలకు మరింత బలం చేకూరింది. ఎన్నికల కోసం తెచ్చిన ఈవీఎంలను ఇప్పటి వరకు చీరాలలో ఉంచడంతో పాటు వాటిని అందరికీ అనుమానం వచ్చే రీతిలో రాత్రి వేళలో పోటీ చేసిన అభ్యర్థులకు సమాచారం కూడా ఇవ్వకుండా రహస్యంగా తరలించడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది.ఈవీఎంల తరలింపు వ్యవహారం బయటకు పొక్కడంతో పాటు టీడీపీ, వైఎస్సార్ సీపీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళనకు దిగారు. ఈవీఎంలు భద్రపరిచిన వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులెవ్వరూ అక్కడకు రాకపోవడం గమనార్హం. అసలేం జరిగిందంటే.. సార్వత్రిక ఎన్నికల్లో చీరాల నియోజకవర్గ ఫలితాలపై ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తం కావడంతో పాటు ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీ రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టింది. సోమవారం రాత్రి రెవెన్యూ శాఖకు చెందిన ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్, పోలింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న వ్యక్తి, మున్సిపల్ సిబ్బంది కలిసి వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాలలో భద్రపరిచిన ఈవీఎంలను తరలించేందుకు ప్రయత్నం చేశారు. గది సీల్ తీసే ప్రయత్నం చేస్తుండగా అక్కడ ఉన్న కళాశాల వాచ్మెన్ తమ ప్రిన్సిపాల్ అనుమతి లేకుండా ఈ సమయంలో తీసుకెళ్తే తనకు ఇబ్బంది అవుతుందని, ప్రిన్సిపాల్ అనుమతి తీసుకోవాలన్నాడు. ఎన్నికల డీటీ ఝాన్సీరాణి కూడా వాటిని తీసుకెళ్లేందుకు అంగీకరించనట్లు సమాచారం. మిగిలిన వారు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో తీసుకెళ్లాలని ప్రయత్నించారు. ఈ విషయం టీడీపీ, వైఎస్సార్ కార్యకర్తలకు తెలిసింది. పెద్ద ఎత్తున చేరుకున్న కార్యకర్తలు, నాయకులను చూసి రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది రెండు కార్లలో అక్కడి నుంచి జారుకున్నారు. టీడీపీ కార్యకర్తలు తమ వాహనాల్లో వెంబడించినా వారు కనిపించకుండా వెళ్లిపోవడం గమనార్హం. -
ప్రజలకు అందుబాటులో ఉంటా..
జనగామ, న్యూస్లైన్ : తనను ఆదరించిన జనం రుణం తీర్చుకోలేనిది.. వారికి నిత్యం అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి పాటుపడతానని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొందిన తదుపరి సోమవా రం ఆయన తొలిసారి జనగామకు వచ్చా రు. ఈ సందర్భంగా తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ను గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో తమ అభిమానాన్ని ఉద్యమం రూపంలో చూపిన ప్రజలు ఇప్పుడు ఓటు రూపంలో చూపి బ్రహ్మరథం పట్టారని పేర్కొన్నారు. గెలుపు ఆనందం కన్నా హామీల బాధ్యతలు ఎక్కువయ్యాయని, వాటిని నెరవేర్చడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పా రు. కేబినెట్ ప్రారంభమైన వారం రోజుల్లో రైతు రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలిపారు. సమావేశంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బండా యాదగిరిరెడ్డి, నాయకులు కన్నా పరుశరాములు, రంగారెడ్డి, చేవెల్ల సంపత్, పసుల ఏబెల్, తిప్పారపు ఆనంద్, ఆలూరి రమేష్, ఆకునూరి వెంకన్న, నీల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
పొత్తుతో నష్టపోయాం
హన్మకొండ సిటీ, న్యూస్లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తీవ్రంగా నష్టపోయామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్రెడ్డి అన్నారు. సోమవారం హన్మకొండ ఎన్జీవోస్ కాలనీలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీతో పొత్తు వద్దని పార్టీ శ్రేణులన్నీ మొత్తుకున్నా జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తమ ఓట్లు టీడీపీకి లాభించాయని, ఆ పార్టీ ఓట్లను తమకు అనుకూలంగా మలచుకోవాలని చూసిన వారి నాయకులు సహకరించలేదని ఆరోపించారు. మునిసిపల్, పరిషత్ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు గెలిచామని, జిల్లాలో టీడీపీ గెలిచిన పరకాల, పాలకుర్తి సీట్లు తమ పార్టీ నాయకులు, కార్యకర్తల కృషితోనే సాధ్యమయిందని చెప్పారు. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నా వారి నుంచి సహకారం అందలేదని, ఈ పరిస్థితి పునరావృతమైందని అన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తామని తెలిపారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలను కష్టాలకు గురి చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రబీ సీజన్లో మూడు సార్లు అకాల వర్షాలు పడి రైతులు తీవ్రంగా నష్టపోయారని వారికి పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు కొత్త దశరథం, కాసర్ల రాంరెడ్డి, కుమారస్వామి, గాదె రాంబాబు, రావు అమరేందర్రెడ్డి, ఏదునూరి భవాని, కూచన రవళి పాల్గొన్నారు. -
ఎన్నికల్లో గెలుపోటములు సహజమే
అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్లైన్: ఎవ్వరూ అధైర్యపడవద్దు... ఓటమి కి కుంగిపోవద్దు... ఎన్నికలన్నాక గెలుపోటములు సహజమే... ప్రజాతీర్పును శిరసావహించి ధైర్యంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే బి.గురునాథ్రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. సోమవారం తన నివాసంలో అర్బన్ నియోజక వర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో ఓటమికి కారణాలను విశ్లేషించారు. ప్రజాతీర్పును గౌరవించాలని సూచించా రు. ఓడిపోయినంత మాత్రాన కుంగిపోవద్దని, ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆదుకునేందుకు తన ఇంటి తలుపులు తెరచి ఉంటాయని భరోసా ఇచ్చారు. 30 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీతో మూడేళ్ల క్రితం పుట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడిందన్నారు. ఇరుపార్టీల నడుమ ఓట్ల శాతం అతి స్వల్పమేనన్నారు. 67 ఎమ్మెల్యే స్థానాలు దక్కించుకుని సమర్థవంతమైన ప్రతిపక్షంగా నిలిచామన్నారు. పాలనలో ప్రభుత్వానికి సహకరిస్తూనే ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి పోరుబాట పడతామన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో ప్రజాసమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా... పదేళ్లు ప్రతిపక్షనేతగా పనిచేసినా ఏనా డూ ప్రజాసంక్షేమాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలను నమ్మి ప్రజలు ఓట్లు వేశారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసమస్యలపై ఎన్నో దీక్షలు, ధర్నాలు, పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును ఎవరైనా శిరసావహించాల్సిందేనన్నారు. ఈ ఐదేళ్లు ప్రజ ల మధ్యలో ఉండి, వారి సమస్యల పరి ష్కారానికి కలసికట్టుగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఆదరిస్తారని సూచించారు. సమావేశంలో మైనార్టీ నేత సాలార్బాషా, పార్టీ నగర కమిటీ అధ్యక్షుడు రంగంపేట గోపాల్రెడ్డి, సిటీ యూ త్ అధ్యక్షుడు మారుతీనాయుడుతో పా టు గెలుపొందిన కార్పొరేటర్లు, డివిజన్ కమిటీ నాయకులు, మహిళా విభాగం, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -
టీడీపీకి ఓటేయలేదని పొట్ట కొడుతున్నారు!
సాక్షి, అనంతపురం : ఎన్నికల హడావుడి ముగిసిందో, లేదో అప్పుడే గ్రామాల్లో ‘రాజకీయాలు’ మొదలయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారన్న నెపంతో పలుచోట్ల టీడీపీకి చెందిన సర్పంచులు ఉపాధి హామీ పథకం కూలీల పొట్టకొడుతున్నారు. పనులకు అనుమతి నిరాకరిస్తూ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని కూలీలు ఉన్నతాధికారులకు వివరిస్తున్నా లాభం లేకుండా పోతోంది. కరువు కాటకాలకు నిలయమైన జిల్లాలో పనుల కోసం కూలీలు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లడం ఆనవాయితీ. అయితే.. స్థానికంగానే పనులు కల్పించి వ లసలు ఆపాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద గ్రామాల్లో పనులు మంజూరు చేయాలంటే సర్పంచ్ ఆధ్వర్యంలో సమావేశమై తీర్మానం చేయాల్సి ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకొని టీడీపీకి చెందిన సర్పంచులు కక్ష సాధిస్తున్నారు. ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకిమద్దతు తెలిపారనే నెపంతో పనులకు ఆమోదం తెలపకుండా వాయిదా వేస్తున్నారు. రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. రాప్తాడు మండలం గాండ్లపర్తిలో ఉపాధి పనులు కావాలని కూలీలు రెండు నెలలుగా అడుగుతున్నా గ్రామ సర్పంచ్ శకుంతలమ్మ అనుమతి ఇవ్వడం లేదు. స్థానికసంస్థలు, సార్వత్రిక ఎన్నికల్లో తాము చెప్పిన పార్టీకి కాదని.. మరో పార్టీకి మద్దతు తెలిపారనే కారణంతో కూలీలను ఇబ్బంది పెడుతున్నారు. దీంతో చేసేది లేక పలువురు కూలీలు వలస వెళ్తున్నారు. ఉపాధి హామీ పథకం కింద ప్రస్తుతం జిల్లాలోని 838 గ్రామ పంచాయతీల్లో 3,173 పనులు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంతకంటే రెట్టింపు పనులు కావాలని కూలీలు అడుగుతున్నా గ్రామాల్లోని రాజకీయ పరిస్థితుల కారణంగా ఎక్కడికక్కడ బ్రేక్ వేస్తున్నారు. ఇంతకుముందు ఎన్ని పనులు అడిగితే అన్ని మంజూరు చేసేవారని, ప్రస్తుతం అందుకు విరుద్ధంగా జరుగుతోందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఫీల్డ్ అసిస్టెంట్లను సైతం తొలగించి.. వారి స్థానంలో టీడీపీ సర్పంచులకు అనుకూలంగా ఉండే వారిని నియమించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు నెలల పాటు గ్రామాల్లో పనులు కల్పించకపోతే ఫీల్డ్ అసిస్టెంట్లకు వేతనాలు నిలిపివేసే పరిస్థితి ఉంది. అప్పుడు వారంతట వారే వెళ్లిపోయేలా వ్యూహాలు రచిస్తున్నారు. మా దృష్టికి వచ్చింది కొన్ని గ్రామాల్లో సర్పంచులు ఉపాధి పనులకు ఆమోదం తెలపడం లేదని మా దృష్టికి వచ్చింది. అయితే.. రాజకీయాలు వేరు, పనులు వేరని ఇప్పటికే ఎంపీడీఓల ద్వారా సర్పంచులకు తెలియజేశాం. ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతాం. - సంజయ్ ప్రభాకర్, పీడీ, డీడబ్ల్యూఎంఏ -
బదిలీల గుబులు
సాక్షి, రాజమండ్రి: అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు తిరగబడ్డాయి. కాంగ్రెస్ పాలన పూర్తిగా అంతరించింది. పదేళ్ల విరామం తర్వాత జిల్లాలో సింహభాగం సీట్లు గెలిచిన తెలుగు తమ్ముళ్లు ఇక నుంచి రాజ్యమేలనున్నారు. ఈ నేపథ్యంలో నేతల కు ఓటమి దిగులు పట్టుకుంటే.. అధికారుల్లో బదిలీల గుబులు పుట్టుకొస్తోంది. కొత్తగా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనవారు అనుకూలంగా ఉండే అధికారులను తమ ప్రాంతాల్లో నియమించుకునేందుకు చర్యలు చేపట్టే అవకాశాలు ఉండడంతో జిల్లావ్యాప్తంగా అధికారుల్లో బదిలీలపై ఉత్కంఠ నెలకొంది. ‘ఎస్.. సర్’ అనేవారి కోసం అధికారులకు ప్రతినిధులే ముఖ్యం కానీ రాజకీయ పార్టీలు కాదు. కానీ ఇంతవరకూ కాంగ్రెస్ పాలనలో పనిచేసిన అధికారులను మాత్రం కొత్తగా ఏర్పడుతున్న టీడీపీ ప్రతినిధులు సాగనంపాలని చూస్తున్నట్టు సమాచారం. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే, ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత ఈ దిశగా కొత్త ఎమ్మెల్యేలు రంగంలోకి దిగాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో ఐదుగురు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలువగా, 12 మంది తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు. ఒకరు ఇండిపెండెంట్, ఒకరు బీజేపీ తరఫున స్థానం దక్కించుకున్నారు. కాగా టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలిచినవారిలో మాత్రం ఉన్న అధికారులను సాగనంపి అనుకూలంగా పనిచేసేవారిని రప్పించుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. కలెక్టర్ స్థాయి అధికారులతో పాటు, ఆర్డీలు, మున్సిపల్ కమిషనర్లు, ఎస్సీ, బీసీ కార్పొరేషన్, డీఆర్డీఏ, డ్వామా ప్రాజెక్టుల ఉన్నతాధికారుల నుంచి మండల స్థాయి అధికారులపై కూడా నేతల వత్తిడి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రత్యర్థులను చిక్కుల్లో పెట్టాలంటే పోలీసు శాఖలో అనుయాయులు ఉండాల్సిందే. అందుకే ఎస్పీ నుంచి డీఎస్పీ, ఇన్స్పెక్టర్ల స్థాయి అధికారుల వరకూ తమ మాటకు ‘ఎస్.. సర్’ అనే వారిని రప్పించుకోవాలని కొత్త నేతలు ఉబలాటపడుతున్నారు. సీనియర్లే చక్రం తిప్పనున్నారు కొత్తవాళ్లకు పరిపాలనా పరమైన అనుభవం ఉండదు కాబట్టి వీరు అధికారుల జోలికి పోకపోవచ్చు. టీడీపీ ప్రభుత్వం కావడంతో ఇతర పార్టీలు అధికారుల జోలికి వెళ్లే అవకాశాలు లేవు. తెలుగుదేశం ప్రభుత్వంలో గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన అనుభవం ఉన్నవారు, సిట్టింగులు ప్రధానంగా అధికారులపై దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా నెగ్గిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి 1999 వరకూ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి మంత్రి పదవిని కూడా నిర్వహించారు. ఈయన కొన్ని శాఖల అధికారులపై గుర్రుగా ఉన్నారు. గత ఏడాది రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు గృహ నిర్మాణ శాఖ అధికారులకు బహిరంగంగా హెచ్చరికలు జారీచేశారు. రాజానగరం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పెందుర్తి వెంకటేష్ రెండోసారి గెలిచారు. ప్రతి పక్ష ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో అధికారులు తన నియోజకవర్గంలో సహకరించలేదని అసంతృప్తితో ఉన్నారు. రాజోలు ఎమ్మెల్యేగా గెలిచిన గొల్లపల్లి సూర్యారావు టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పనిచేశారు. ఈయన గతం నుంచి జిల్లా యంత్రాంగంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కూడా సిట్టింగ్ స్థానం నుంచి గెలిచారు. కాకినాడ సిటీ నుంచి గెలిచిన వనమాడి వెంకటేశ్వరరావు 1999లో ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2004, 2009లో వరుసగా కాంగ్రెస్ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు మళ్లీ పదవి వరించడంతో తన పనులు సవ్యంగా పూర్తవ్వాలంటే తమకు కావల్సిన అధికారులను నియమించుకోవాలనే భావనతో ఉన్నట్టు సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. పనులవ్వాలంటే మనవారే ఉండాలి అభివృద్ధి పనులు, కాంట్రాక్టులు తమ ఆదేశానుసారం జరిగేలా సహకరించే అధికారులు తమ వద్ద ఉంటే తమకు ఎదురు ఉండదని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఇందుకోసం అవసరమైతే ఐఏఎస్లను కూడా గతంలో తమకు అనుకూలంగా ఉన్నవారిని జిల్లాకు రప్పించుకునేందుకు సమాలోచనలు జరుపుతున్నారని తెలుస్తోంది. -
గజ్వేల్ లో కాంగ్రెస్కు కోలుకోలేని దెబ్బ
గజ్వేల్, న్యూస్లైన్: జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్కు గజ్వేల్ నియోజకవర్గంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు 13 సార్లు ఎన్నికలు జరిగితే ఏడుసార్లు కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. ఓ రకంగా గజ్వేల్ కాంగ్రెస్కు కంచుకోటగా మారింది. అయితే తాజాగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ దాదాపుగా ఖాళీ అయ్యే పరిస్థితికి చేరుకుంది. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితోపాటు పార్టీ తరఫున ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సహకార సంఘాల చైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచ్లు, ముఖ్యనాయకులు సోమవారం హైదరాబాద్లోనితెలంగాణ భవన్లో టీఆర్ఎస్లో చేరడం అందరిని ఆశ్చర్యపరిచింది. నియోజక వర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్పూర్, కొండపాక మండలాలకు చెందిన పార్టీ శ్రేణులు బస్సులు, డీసీఎం, సుమోలు, ఇతర వాహనాల్లో నర్సారెడ్డి ఆధ్వర్యంలో భారీగా తరలివెళ్లారు. వీరంతా తెలంగాణ భవన్కు చేరుకున్నారు. కేసీఆర్ అందుబాటులో లేకపోవడంతో ఆ పార్టీ అగ్రనేతలు కేకే, హరీష్రావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఆర్.సత్యనారాయణల సమక్షంలో గులాబీ కండువాలను ధరించి టీఆర్ఎస్లో చేరిపోయారు. చేరికలు ముగిశాక కేసీఆర్ను ఆయన నివాసంలో కలుసుకున్నట్టు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ‘న్యూస్లైన్’కు తెలిపారు. టీఆర్ఎస్లో చేరిన నేతలు వీరే.. కాంగ్రెస్కు చెందిన డీసీసీబీ వైస్ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, గజ్వేల్, వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్లు జి.ప్రతాప్రెడ్డి, సలీం, వంటిమామిడి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట ముత్యాలు, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ జనార్దన్రెడ్డి, ములుగు, తూప్రాన్, కొండపాక జెడ్పీటీసీ సభ్యులు సింగం సత్తయ్య, సుమన, చిట్టి మాధురి, నియోజకవర్గంలోని సహకార సంఘాల చైర్మన్లు వెంకట్నర్సింహారెడ్డి, పోచిరెడ్డి, నరేందర్రెడ్డి, వెంకట్రెడ్డి, మహీపాల్రెడ్డి, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు విజయభాస్కర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, అనంతుల నరేందర్, విద్యాకుమార్తోపాటు నియోజకవర్గంలోని ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లతోపాటు ముఖ్యనాయకులు ఇటిక్యాల లక్ష్మారెడ్డి, నిమ్మ రంగారెడ్డి, నాయిని యాదగిరి, ఊడెం కృష్ణారెడ్డి తదితరులు టీఆర్ఎస్లో చేరారు. అభివృద్ధి కోసమే చేరిక: నర్సారెడ్డి గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి కేసీఆర్ గెలుపొందడమే కాకుండా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న తరుణంలో... ఈ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి టీఆర్ఎస్లో చేరినట్టు తాజా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ‘న్యూస్లైన్’కు తెలిపారు. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు.కేసీఆర్ నాయకత్వంలో గజ్వేల్ ప్రాంత రూపురేఖలు మారిపోతాయని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్కు కొందరు నాయకులు నియోజకవర్గంలో మిగిలి ఉన్నారని, వారిని కూడా త్వరలోనే టీఆర్ఎస్లో చేర్చుకుంటామని ఆయన తెలిపారు. -
సిద్దిపేట జిల్లా ఏర్పాటు తథ్యం!
సిద్దిపేట టౌన్, న్యూస్లైన్: సిద్దిపేట ప్రాంత వాసుల దశాబ్దాల ఆకాంక్ష త్వరలో నెరవేరనుంది. ప్రత్యేక జిల్లా ఆవిర్భావానికి మార్గం సుగమం కానుంది. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ మెజార్టీ అసెంబ్లీ స్థానాలు గెలుపొంది అధికారం చేపట్టనుండడంతో కొత్త జిల్లా ఏర్పాటుపై ఈ ప్రాంత వాసుల్లో ఆశలు చిగురించాయి. మెదక్ జిల్లాలో సిద్దిపేట అతి పెద్ద పట్టణం. ఇది జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి145 కిలో మీటర్ల దూరంలో ఉండడంతో ఈ ప్రాం తంలోని నిరుద్యోగులు, ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు, కార్మికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ ప్రాంత వాసులు జిల్లా కేంద్రానికి వెళ్లి రావాలంటే అనేక వ్యయప్రయాసాలకు ఓర్చుకోవాల్సి వస్తోంది. జిల్లాస్థాయి అన్ని కార్యాలయాలు సంగారెడ్డిలోనే ఉండడంతో వివిధ పనులపై అక్కడికి వెళ్లడ ం అనివార్యం. కష్టనష్టాలను భరించి అక్కడికి వెళ్తే సంబంధిత అధికారి అందుబాటులో లేకపోతే మరింత వ్యధ. ఈ పరిస్థితిని దూరం చేసుకోవాలని నాలుగు దశాబ్దాలుగా పాదయాత్రలు, ఆందోళనలు, ప్రముఖులకు విజ్ఞాపనపత్రాలు సమర్పిస్తూ వస్తున్నారు. ఎన్నికల ముందు ఈ నినాదం మార్మోగి ఆశలను రేపిం ది. గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సైతం సిద్దిపేట కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చారు. కాగా ఆయన మరణంతో అది కార్యరూపం దాల్చలేదు. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ హామీ.. 2001 సంవత్సరం నుంచి ప్రతి ప్రధాన ఎన్నికలు, ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తామంటూ హమీలిస్తున్నారు. తెలంగాణలో 24 జిల్లాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ స్పష్టమైన మెజార్టీని సాధించడంతో చిరకాల స్వప్నం సాకారమయ్యే అవకాశం ఏర్పడింది. జిల్లా కేంద్రం నుంచి దూరంగా ఉండడం.. తెలంగాణలో రెండో స్థానంలో సిద్దిపేట ఉండడం, సిద్దిపేట గడ్డ కేసీఆర్, హరీష్రావు రాజకీయ ఎదుగుదలకు కీలకంగా మారడంతో సిద్దిపేట జిల్లా తథ్యమని భావిస్తున్నారు. ప్రతిపాదిత సిద్దిపేట జిల్లా.. సిద్దిపేటతోపాటు కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాలు సైతం జిల్లా కేంద్రాలకు దూరంగా ఉండి ఇబ్బందులకు గురవుతున్నాయి. ఈ క్రమంలో మెదక్ జిల్లాలోని సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు, దుబ్బాక, రామాయంపేట, తుప్రాన్, గజ్వేల్, కరీంనగర్ జిల్లా ముస్తాబాద్, సిరిసిల్లా, హుస్నాబాద్, బెజ్జంకి, ఇల్లంతకుంట, నల్గొండ జిల్లా రాజాపేట, వరంగల్ జిల్లా చేర్యాల ప్రాంతాలను కలిపి సిద్దిపేట కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని స్పష్టమైన ప్రతిపాదనలను ఇప్పటికే రూపొందించారు. కేసీఆర్ స్వయంగా ఈ ప్రతిపాదనలు పరిశీలించి యథాతథంగా లేదా స్వల్ప మార్పులతో ఆమోదిస్తే దశాబ్దాల కల కొన్ని నెలల్లోనే నిజం కానుంది. -
అటు కారు.. ఇటు ఆటో...
సాక్షి, హన్మకొండ: అనుకున్నట్లే అయింది... ఊహిం చిందే జరిగింది. ఎన్నికలకు ముందు చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు కేంద్ర మాజీ మంత్రి బలరాం విజ యావకాశాలకు దెబ్బకొట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిన కారు జోరుకు ఆటో వేగం సైతం తోడయ్యింది. ఫలి తంగా ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో అనూహ్యంగా ఓటమి పాలయ్యూరు. గత ఎన్నికల సమయానికి జిల్లాలో పెద్దగా ఎవరికి పరిచయం లేకుం డా చివరి నిమిషంలో మహబూబాబాద్ పార్లమెం ట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిల్చున్న బలరాం నాయక్... ఏకంగా కేంద్ర మం త్రి పదవిని దక్కించుకున్నారు. 2014 మార్చిలో ఎన్నికల సీజన్ మొదలయ్యే నాటికి మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకర్గాల్లో కాంగ్రెస్ నుంచే కాకుండా ప్రత్యర్థి పార్టీ ల్లో సైతం ఆయనకు గట్టిపోటీ ఇచ్చే నాయకులు కనుచూపుమేరలో ఎవరూ లేరు. మానుకోట, నర్సంపేట, ములుగు, డోర్నకల్, ఇల్లందు, భద్రాచలం, పినపాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఆయన హవానే కొనసాగింది. ఈ ఎన్నికల్లో బలరాంనాయక్ గెలుపు నల్లేరుపై న డకే అన్నట్టుగా పరిస్థితి ఉండేది. తీరా... ఎన్నికలు జరిగి ఫలితాలు ప్రకటించే సరికి ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి అజ్మీర సీతారాంనాయక్ చేతిలో 30,654 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. దొంతి దెబ్బ ఎన్నికలు సమీపించే నాటికి కేంద్రమంత్రి బలరాంనాయక్, డీసీసీ మాజీ అధ్యక్షుడు దొంతిమాధవరెడ్డి మధ్య సత్సంబంధా లు ఉండేవి. కాంగ్రెస్ చివరి నిమిషంలో దొంతిని కాదని నర్సంపేటలో కత్తి వెంకటస్వామిని బరిలో నిలిపింది. దీంతో దొంతి మాధవరెడ్డి రెబల్గా బరిలో నిలి చి ఆటో గుర్తుపై పోటీ చేశారు. ఆటో, కా రు రెండు గుర్తులు పోలి ఉన్న నేపథ్యం లో ఓటర్లు పొరబడే అవకాశముండడం తో దొంతి మాధవరెడ్డి తన ప్రచారంలో రెండు ఓట్లూ ఆటోకే వేయాలని ముమ్మర ప్రచారం చేశారు. దీర్ఘకాలంపాటు నర్సం పేట కేంద్రంగా రాజకీయాలు నెరిపిన దొంతి తనకంటూ సొంత వర్గాన్ని తయా రు చేసుకున్నారు. పైగా చివరి నిమిషం లో టికెట్ నిరాకరించడంతో ఆయనకు సానుభూతి కూడా తోడయింది. ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు సైతం దొంతి వెంట న డిచాయి. ఫలితంగా నర్సంపేటలో దొం తి ప్రచారం చేసిన ఆటో గుర్తుకు భారీగా ఓట్లు వచ్చి పడ్డాయి. అసెంబ్లీకి పోటీ చేసిన దొంతి మాధవరెడ్డికి 76,144 ఓట్లు రాగా... కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కత్తి వెంకటస్వామికి కేవలం 6,638 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ పార్లమెంట్కు సంబంధించి బలరాంనాయక్కు కేవలం 13,404 ఓట్లే వచ్చాయి. 2009 ఎన్నికల్లో ఇక్కడ అసెంబ్లీకి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డికి 66,777 ఓట్లు రాగా... టీడీపీ అభ్యర్థి రేవూరి ప్రకాశ్రెడ్డి 75,400 ఓట్లు వచ్చాయి. కానీ... పార్లమెంటుకు వచ్చే సరికి క్రాస్ఓటింగ్ జరిగి బలరాంనాయక్కు 5,633 ఓట్ల ఆ ధిక్యం వచ్చింది. ఈసారి పరిస్థితి తారుమారై కాంగ్రెస్ ఓట్లు పార్లమెంటు పరిధి లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పా యం చందర్రావుకు పడ్డాయి. ఇక్కడ ఆ యనకు కేటాయించిన ఆటో గుర్తుకు మొ త్తం 60,583 ఓట్లు పోలయ్యాయి. ఈ ఓట్లలో తొంభై శాతం దొంతి సానుభూతి పరులవే. ఈ ఓట్లన్నీ బలరాంనాయక్కు వచ్చి ఉంటే విజయం ఆయన పక్షానే నిలిచేది. చీలిన లంబాడ ఓట్లు గత ఎన్నికల సందర్భంగా మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ లంబాడ సామాజిక వర్గానికి చెందిన బల రాంనాయక్కు టికెట్ ఇవ్వగా... మహా కూటమి తరఫున కోయ సామాజికవర్గానికి చెందిన శ్రీనివాస్ బరిలో ఉన్నారు. అ ప్పుడు చాలా నియోజకవర్గాల్లో లంబాడ ఓట్లు చీలి బలరాంనాయక్కు పడ్డాయి. ఇల్లందు, ములుగులో అసెంబ్లీకి సంబంధించి టీడీపీకి చెందిన కోయ ఎమ్మెల్యే గెలుపొందగా... ఈ రెండు చోట్ల పార్లమెంట్ మెజార్టీ కాంగ్రెస్కు వచ్చింది. కానీ... ఈసారి కాంగ్రెస్తోపా టు టీఆర్ఎస్ లంబాడ వర్గానికి సీట్లు కేటాయించడం బలరాంకు కలిసిరాలేదు. -
ఒకే ఒక్కడు: సీతారాం
వరంగల్, న్యూస్లైన్: జిల్లాలో తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేసిన ప్రొఫెసర్ సీతారాం నాయక్ మినహా... తొలి ఎన్నికల అనుభవం పలువురికి చేదుజ్ఞాపకాలనే మిగిల్చింది. సార్వత్రిక ఎన్నికల్లో సంచలనాత్మక తీర్పునిచ్చిన జిల్లా ఓటర్లు... కొత్త నేతలకు మాత్రం చాన్స్ ఇవ్వలేదు. తొలిసారి ఎన్నికల్లో పోటీచేసిన నేతలకు అవకాశం కల్పించలేదు. జిల్లాలో 12 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాలున్నారుు. ఈ ఎన్నికల్లో గెలిచిన ఒక ఎంపీ, 12 మంది ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 13 మంది ప్రజాప్రతినిధులు ఇంతకు ముందు ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉన్న వారే. గత ఎన్నికల్లో పోటీచేసిన అనుభవంతోనే తొలిసారి ఎమ్మెల్యేలుగా విజయం సాధించడం వారికి సులువైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో జరిగిన తొలి ఎన్నికల్లో గులాబీ గాలి వీయడంతో జిల్లాలో మెజార్టీ స్థానాలు ఆ పార్టీకి దక్కారుు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రజలు గట్టి షాకిచ్చి మార్పును కోరుకున్నారు. తొలిసారి పోటీచేసిన వారికి అవకాశం కల్పించకుండా అనుభవానికి, పాతనేతలకే పట్టం కట్టారు. తొలి పోటీ చేదు జ్ఞాపకం ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి తొలిసారి ఎన్నికల బరిలో దిగిన నేతలందరికీ చేదు అనుభవమే మిగిలింది. ఒకే ఒక్కరికి మాత్రం పదవీయోగం దక్కింది. మహబూబాబాద్ ఎంపీగా టీఆర్ఎస్ నుంచి పోటీచేసిన ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ను విజయం వరించింది. ఈయన తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి గెలిచారు. ఇక జిల్లాలో పరకాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇనుగాల వెంకట్రాంరెడ్డి, టీఆర్ఎస్ తరఫున ముద్దసాని సహోదర్రెడ్డి తొలిసారి ఎన్నికల బరిలో దిగి ఓటమిపాలయ్యారు.గతంలో ఎమ్మెల్సీగా పోటీచేసి విజయం సాధించినప్పటికీ వరంగల్ పశ్చిమ నుంచి ఆర్ఎల్డీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తొలి పర్యాయం పోటీచేసిన కపిలవాయి దిలీప్కుమార్ ఓటమి చవిచూశారు. భూపాలపల్లి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన గండ్ర సత్యనారాయణరావును జనం ఆదరించలేదు. నర్సంపేటలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన పెద్ది సుదర్శన్రెడ్డి, కత్తి వెంకటస్వామిలకు ఓటమి తప్పలేదు. మహబూబాబాద్ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన బానోతు మోహన్లాల్, మహబూబూబాద్, డోర్నకల్ నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా తొలిసారి పోటీచేసిన బాలుచౌహాన్, రామచంద్రునాయక్ మూడో స్థానానికే పరిమితమయ్యారు. వరంగల్ తూర్పు నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీచేసిన రావు పద్మకు ఇదే పరిస్థితి ఏర్పడింది. ఓటమి నుంచి తొలి గెలుపు తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారందరూ గతంలో పోటీచేసి ఓడిపోయినవారే. జనగామ నుంచి గెలిచిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గతంలో వర్ధన్నపేట నుంచి పోటీచేసి ఓడిపోయారు. పరకాల నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన చల్లా ధర్మారెడ్డి గతంలో పరకాల నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. నర్సంపేట నుంచి విజయం సాధించిన దొంతి మాధవరెడ్డి గతంలో ఇక్కడే ఓడిపోయారు. మహబూబాబాద్ నుంచి గెలిచిన బానోత్ శంకర్నాయక్ గతంలో ఇక్కడే పోటీచేసి ఓటమి చవిచూశారు. వర్ధన్నపేట నుంచి గెలిచిన ఆరూరి రమేష్ గత ఎన్నికల్లో స్టేషన్ఘన్పూర్లో పోటీచేసి ఓడారు. పాతవారికే పట్టం జిల్లా ప్రజలు ఈ సారి సిట్టింగ్లకు కోలుకోలేని షాకిచ్చారు. ఇద్దరు టీఆర్ఎస్, ఒక టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు తప్ప, కాంగ్రెస్కు చెం దిన సిట్టింగ్లందరూ ఓటమిబాటపట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో డాక్టర్ రాజయ్య, వినయ్, ఎర్రబెల్లి మాత్రమే విజయం సాధించా రు. అరుుతే జిల్లా ఓటర్లు సిట్టింగ్ల మార్పు కోరుకున్నప్పటికీ... పా తవారికే పట్టం కట్టారు. భూపాలపల్లి, ములుగు, డోర్నకల్, వరంగల్ తూర్పులో గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్న మధుసూదనాచారి, చందూలాల్, రెడ్యానాయక్, కొండా సురేఖకు అవకాశం కల్పించా రు. వరంగల్ ఎంపీగా మాజీ మంత్రి శ్రీహరిని గెలిపించారు. -
మా స్వయంకృతాపరాధమే
దేవరకొండ, న్యూస్లైన్: ‘నిజాలను చెప్పలేకపోయాం.. అబద్దాలను ఆడలేకపోయాం.. ఆచరణ సాధ్యం కాని హామీలను ఇవ్వలేకపోయాం.. ప్రజలను మోసగించలేకపోయాం.. అందుకే ఓటమి పాలయ్యాం.. ఇది మా స్వయంకృతాపరాధమే..’ అని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. ఆదివారం దేవరకొండ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరంతరం తెలంగాణ సాధన కోసం కష్టించి పని చేసిన సహచర పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రులను ప్రజలు న్యాయంగా గెలిపించాల్సి ఉందని అన్నారు. కానీ, ప్రజల తీర్పును గౌరవించాలని, తన గెలుపు సంతోషకరమే అయినా మిత్రుల ఓటమి బాధ కలిగిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, జాతీయ ఉపాధి హామీ, ఆహార భద్రత చట్టం, భూపంపిణీ, నిర్బంధ విద్యా చట్టం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. తనను అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎప్పుడూ ప్రజలకు సేవకుడిగా ఉంటానన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు ఆలంపల్లి నర్సింహ్మ, ఆ పార్టీ నగర అధ్యక్షుడు పున్న వెంకటేశ్వర్లు, పార్టీ దేవరకొండ మండల అధ్యక్షుడు మేకల శ్రీను, చం దంపేట మండల అధ్యక్షుడు గోవిందు, పార్టీ నాయకులు గిరిశేఖర్, జావీద్, ఇద్రిస్, ఆప్కో సత్తయ్య, సైదులు, దేవేందర్, మంజ్యనాయక్, బిక్కునాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఆశల పందిరి
ఏలూరు, న్యూస్లైన్ : జిల్లాలో చాలా ఏళ్ల తరువాత టీడీపీకి పూర్వ వైభవం వచ్చింది. ఆ పార్టీ రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టనుండటంతో ఎమ్మెల్యేలుగా గెలిచిన పలువురు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావటానికి ఈ జిల్లా ప్రధాన భూమిక పోషించింది. ఆ పార్టీకి చెందిన 14మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. పొత్తులో భాగంగా తాడేపల్లిగూడెం నుంచి బీజేపీ అభ్యర్థి పైడికొండల మాణిక్యాలరావు ఎమ్మెల్యేగా విజయం సాధించిన విషయం తెల్సిందే. దీంతో మంత్రి పదవులను ఆశిస్తున్న ఆశావహుల జాబితా కూడా పెద్దగా ఉంది. ఈ నేపధ్యంలో మంత్రి పదవులు ఎవరిని వరించనున్నాయన్నదానిపై ఆసక్తికరమైన చర్చలు జోరందుకున్నాయి. అయితే సీనియర్లకే మంత్రి పదవులు దక్కనున్నాయని ఆ పార్టీ వర్గాల భోగట్టా. దీంతోపాటు సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. జిల్లాలో ఇద్దరిని తప్పకుండా మంత్రి పదువులు వరిస్తాయనే ఆశాభావంతో పార్టీ శ్రేణులు ఉన్నాయి. రెండో సారి విజయం సాధించిన ఉండి ఎమ్మెల్యే వేటకూరి శివరామరాజు(శివ), నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, చింతలపూడి నుంచి గెలిచిన పీతల సుజాతకు అవకాశాలున్నాయనే చర్చ సాగుతోంది. సామాజిక వర్గాల పరంగా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన శివకు మంత్రి పదవి ఇవ్వటం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఉండి నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన శివ ప్రజా సమస్యల పరిష్కారానికి ఆందోళనలు చేశారని, పా ర్టీ అధినేత చంద్రబాబునాయుడు దగ్గర మంచి మార్కులు కొట్టేశారని చెబుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెంది న బూరుగుపల్లి శేషారావుకు కూడా అవకాశం ఉందనే పార్టీ వర్గాలు భావిస్తున్నా యి. మంత్రి వర్గంలో ఈ సామాజిక వర్గానికి చెందిన వారి సంఖ్యపై ఇది ఆధారపడి ఉంటుందని వినిపిస్తోంది. ఎస్సీ సా మాజిక వర్గానికి చెందిన పీతల సుజాత గతంలో ఆచంట నుంచి విజయం సాధించారు. తాజాగా చింతలపూడి నుంచి అనూహ్యంగా గెలుపొందారు. ఈ సామాజిక వర్గం కోటా కింద ఆమెకు మంత్రి పదవి వచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. హైదరాబాద్లో ఈ నెల 27 నుంచి 29 వరకు నిర్వహించే మహానాడు తర్వాత మంత్రి పదవుల విషయమై చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాల భోగట్టా. -
నంద్యాల ఓటరు లెక్కతప్పింది!
నంద్యాల, న్యూస్లైన్ : మూడు దశాబ్ధాల తర్వాత నంద్యాల ఓటర్ల లెక్కతప్పింది. ప్రతిసారి నంద్యాల నియోజకవర్గంలో అధికార పక్షానికి పట్టం కట్టడం సంప్రదాయంగా వస్తుండేది. అయితే ఈ సారి మాత్రం ఓటర్లు భిన్నంగా తీర్పు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నియోజకవర్గంలో ఎన్నికలు రెండు ప్రధాన సెంటిమెంట్లు ఉన్నాయి. ఈసారి అందులో ఒకటి విఫలం కాగా మరొకటి సఫలమైంది. ఫలితం తారుమారైంది నంద్యాల ఎమ్మెల్యేగా ఏ పార్టీకి చెందిన వారు గెలుపొందితే అదే పార్టీనే రాష్ట్రంలో అధికారం చేపడుతుండేది. 1983, 1985, 1994, 1999 ఎన్నికల్లో నంద్యాల నుంచి టీడీపీ అభ్యర్థులు సంజీవరెడ్డి, ఫరూక్ గెలుపొందగా రాష్ట్రంలో ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రులుగా కొనసాగారు. 1989, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు స్థానికంగా గెలుపొందగా రాష్ట్రంలో కూడా ఇదే పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏడు ఎన్నికలు తర్వాత మొదటి సారి సెంటిమెంట్ను స్థానిక ఓటర్లు తిరగరాశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోగా నంద్యాలలో మాత్రం వైఎస్సార్సీపీ అభ్యర్థి భూమానాగిరెడ్డి విజయం సాధించారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యే లేనేలేడు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యేనే లేడు. నియోజకవర్గం మొదటి ఎమ్మెల్యే మల్లు రామచంద్రారెడ్డి, ఫరూక్, బొజ్జా వెంకటరెడ్డి రెండు సార్లు వరుసగా గెలుపొంది మూడోసారి ఓడిపోయారు. ఈ సారి చరిత్ర తిరగరాయాలని శిల్పామోహన్రెడ్డి ప్రయత్నం చేశారు. ఆయన రెండుసార్లు వరుసగా గెలుపొందారు. అయినా మూడోసారి ఓటమి చూడక తప్పలేదు. దీంతో హ్యాట్రిక్ మిస్ అయినా నాయకుల్లో శిల్పా కూడా చేరారు. -
ఆమెకు ఎదురులేదు!
కర్నూలు(అర్బన్), న్యూస్లైన్: వంటింటికే పరిమితమైన మహిళలు ఇప్పుడు అన్ని విషయాల్లో ప్రతిభ చాటుతున్నారు. ఈ పనులు పురుషులు మాత్రమే చేయగలరనే భావనను చెరిపేస్తూ.. అవకాశమిస్తే తాము దూసుకుపోతామని నిరూపిస్తున్నారు. అవనిలోనే కాదు.. అంతరిక్షంలోనూ ‘ఆమె’ ఎదురులేదని నిరూపిస్తోంది. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన నేపథ్యంలో రాజకీయాల్లోనూ వీరి ప్రాతినిధ్యం పెరుగుతోంది. ఇటీవల ముగిసిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో వీరి సంఖ్య అమాంతం పెరిగిపోవడమే అందుకు నిదర్శనం. 2006కు ముందు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ మాత్రమే ఉండటంతో జిల్లాలోని 53 జెడ్పీటీసీ స్థానాల్లో 17 స్థానాలను మహిళలు కైవసం చేసుకున్నారు. అప్పటి రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు.. బీసీలు ఏడుగురు.. అన్ రిజర్వు కింద ఏడుగురు మహిళలు ఎన్నికయ్యారు. ప్రస్తుతం రిజర్వేషన్ 50 శాతానికి చేరుకున్న నేపథ్యంలో 27 మంది మహిళలు జెడ్పీటీసీ స్థానాల్లో పాగా వేశారు. రిజర్వేషన్ ప్రకారం ఎస్టీలు 1, ఎస్సీలు 5, బీసీలు 11, అన్ రిజర్వు కింద 10 స్థానాలను మహిళలకే కేటాయించారు. గత నెల 6, 11 తేదీల్లో నిర్వహించిన ప్రాదేశిక ఎన్నికల్లో ఈ స్థానాల్లో మహిళలు విజయఢంకా మోగించారు. వీరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అత్యధికంగా 14 మంది మహిళలు.. టీడీపీ తరఫున 11, కాంగ్రెస్ తరఫున 1, ఆర్పీసీ తరఫున ఒకరు జెడ్పీ పాలనలో భాగస్వాములు కానుండటం విశేషం. టీడీపీ మహిళా జెడ్పీటీసీలు వి.సరస్వతి(కల్లూరు), ఎం.లక్ష్మిదేవి(క్రిష్ణగిరి), పి.జగదీశ్వరమ్మ(గోస్పాడు), నారాయణమ్మ(పాణ్యం), వెంకటలక్ష్మమ్మ(రుద్రవరం), పి.సుశీలమ్మ(ఆస్పరి), సరస్వతి(దేవనకొండ), లక్ష్మి(కౌతాళం), పుష్పావతి(నందవరం), ఈ.సుకన్య (పత్తికొండ), కె.వరలక్ష్మి(తుగ్గలి). కాంగ్రెస్, ఆర్పీఎస్ మహిళా జెడ్పీటీసీలు జి.శారదమ్మ(కోడుమూరు), రాధమ్మ(పగిడ్యాల). వైఎస్సార్సీపీ మహిళా జెడ్పీటీసీలు ఎం.పద్మావతమ్మ(బేతంచెర్ల), బి.కె.నాగజ్యోతి(గూడూరు), ఎం.కె.మాధవి(కర్నూలు), చింతకుంట లక్ష్మి(నందికొట్కూరు), బి.అశ్వర్థమ్మ(బండిఆత్మకూరు), టి.నాగమ్మ(చాగలమర్రి), వై.సరస్వతి(కొలిమిగుండ్ల), ఎం.లక్ష్మిదేవి(నంద్యాల), గోపిరెడ్డి సుభద్రమ్మ(ఉయ్యాలవాడ), రాములమ్మ(గోనెగండ్ల), కె.గంగమ్మ (హొళగుంద), దళవాయి మంగమ్మ(కోసిగి), రేణుకాదేవి(పెద్దకడుబూరు), జయమ్మ(ఎమ్మిగనూరు). -
టీజీ నిర్వేదం
కర్నూలు, న్యూస్లైన్: ఓటమితో టీడీపీ నేతల్లో నిర్వేదం నెలకొంటోంది. ఓటర్లకు పంపిణీ చేయమని అందించిన డబ్బు సక్రమంగా పంపిణీ చేయకపోవడమే తన ఓటమికి కారణమంటూ కర్నూలు నియోజకవర్గ ‘దేశం’ అభ్యర్థి టి.జి.వెంకటేష్ సహచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు చర్చ జరుగుతోంది. నగరంలోని మౌర్యఇన్ హోటల్లో ఎమ్మెల్యే కార్యాలయం పేరిట సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యాలయాన్ని ఎత్తేసి అందులోని కంప్యూటర్ ఆపరేటర్లు, ఇతర సిబ్బందిని తొలగించాలని నిర్వాహకులను ఆదేశించినట్లు తెలిసింది. ఇకపై సేవలకు స్వస్తి పలుకుతూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలు వెలువడే చివరి నిముషం వరకు గెలుపు ఆశతో ఉన్న టీజీ.. ఫలితం ఆయనకు అనుకూలంగా రాకపోవడంతో నగర ప్రజలు ఝలక్ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్.వి.మోహన్రెడ్డికి ప్రజలు పట్టంకట్టారు. ఓటమిని జీర్ణించుకోలేని టీజీ తీవ్ర నిర్వేదానికి లోనై తన పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులపైనా ఆగ్రహంతో ఊగిపోయినట్లు తెలుస్తోంది. ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఈ ఎన్నికల్లో భారీ మొత్తంలో డబ్బు పంపిణీ చేశారు. దాదాపు 25 మంది మాజీ కార్పొరేటర్లు టీజీకి అనుచరులుగా ఉన్నారు. ఓటర్లకు పంపిణీ చేసేందుకు వారికి భారీ మొత్తమే అందజేసినట్లు వినికిడి. అయితే అందులో సగం కూడా పంపిణీ చేయకపోవడమే తన ఓటమికి కారణమైందనే నిర్ణయానికి టీజీ వచ్చినట్లు ఆ పార్టీ వర్గీయులు చెబుతున్నారు. ఇప్పటికే పాతబస్తీలోని నలుగురు మాజీ కార్పొరేటర్లపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. కర్నూలు నియోజకవర్గంలో మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టగా 9 రౌండ్లలో ఎస్వీకి ఆధిక్యం లభించగా.. 7 రౌండ్లలో టీజీ ముందున్నారు. తక్కువ ఓట్లు వచ్చిన ప్రాంతాల్లో అనుచరులపై విచారణ జరిపించగా.. అక్కడ డబ్బు పంపిణీ జరగలేదనే విషయం బయటపడటంతో ఆయా ప్రాంతాల ద్వితీయ శ్రేణి నాయకులపై టీజీ మండిపడినట్లు సమాచారం. ప్రకాష్నగర్, ఎన్.ఆర్.పేట, బుధవారపేట, జొహరాపురం, గరీబ్నగర్, జమ్మిచెట్టు ప్రాంతం, గాంధీ నగర్, కప్పల్నగర్, డాక్టర్ గఫార్ వీధి ప్రాంతాల్లో ఎస్వీ కంటే టీజీకి తక్కువ ఓట్లు పోలయ్యాయి. 2, 3, 5, 8, 12, 13, 14 రౌండ్లలో మాత్రమే టీజీకి మెజార్టీ లభించింది. 1, 4, 6, 7, 9, 10, 11, 15, 16 రౌండ్లలో ఎస్వీ హవా నడిచింది. ఆయా ప్రాంతాల్లో డబ్బు ఎవరికి పంపిణీ చేశారు.. వారి జాబితాతో ఫోన్ నెంబర్లు ఇవ్వండి.. స్వయంగా నేనే మాట్లాడతానంటూ ద్వితీయ శ్రేణి నాయకులు, మాజీ కార్పొరేటర్లను టీజీ నిలదీస్తున్నట్లు తెలిసింది. అదేవిధంగా కొందరు కేబుల్ ఆపరేటర్లు కూడా డబ్బు సక్రమంగా పంపిణీ చేయలేదని అనుచరుల వద్ద మండిపడినట్లు సమాచారం. -
వీరవరం గరంగరం
కిర్లంపూడి, న్యూస్లైన్ : తనకు ఓట్లు తక్కువ పడ్డాయనే అక్కసుతో స్వగ్రామంలో దాడులకు బరి తెగించిన మాజీ మంత్రి, కాకినాడ ఎంపీ తోట నరసింహంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఆదివారం నిరశన దీక్షలు చేపట్టారు. తోట స్వగ్రామమైన తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం వీరవరంలో టీడీపీ కన్నా వైఎస్సార్ సీపీకి ఎక్కువ ఓట్లు రావడంతో విచక్షణ కోల్పోయిన నరసింహం, ఆయన వర్గీయులు శుక్రవారం రాత్రి విజ యోత్సవ ర్యాలీలో, శనివారం వైఎస్సార్ సీపీ నాయకుల ఇళ్లపై దాడులకు దిగి, గాయపరిచారు. అది జరిగి 24 గంటలైనా పోలీసులు నరసింహంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధితులైన తోట గాంధీ, గొల్లపల్లి సూరిబాబు, గరగా భీమరాజు, గంగారావు ఆదివారం గ్రామకూడలిలో రోడ్డుకు అడ్డంగా టెంట్ వేసి నిరశన దీక్ష చేపట్టారు. పలువురు గ్రామస్తులు వారికి మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. జగ్గంపేట సీఐ సుంకర మురళీమోహన్, కిర్లంపూడి ఎస్సై సి.హెచ్.విద్యాసాగర్ ఆందోళన విరమించాలని నచ్చచెప్పబోయారు. అయితే తమ ఇళ్లపైకి వచ్చి దాడి చేసిన ఎంపీ తోటపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని బాధితులు తేల్చిచెప్పారు. వైఎస్సార్ సీపీ నేతలు, జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు, దాడిశెట్టి రాజా వీరవరం చేరుకుని ఆందోళనకారులకు సంఘీభావం వ్యక్తం చేశారు. ఒకానొక సమయంలో గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. గ్రామంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన సీఐ పరిస్థితిని ఉన్నతాధికారులకు తెలిపారు. చివరికి రెండురోజులు వ్యవధి ఇస్తే ఎంపీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ హామీ ఇచ్చారు. దాంతో జ్యోతుల ఆందోళనకారులకు నచ్చచెప్పి శాంతింపజేశారు. ఈ ఆందోళనలో తోట ఈశ్వరరావు, తోట సర్వారాయుడు, వీర వెంకట సత్యనారాయణమూర్తి, తోట రామస్వామి తదితరులు పాల్గొన్నారు. హామీ నెరవేర్చకపోతే తీవ్ర పరిణామాలు : జ్యోతుల ఆందోళన విరమణ అనంతరం జ్యోతుల విలేకరులతో మాట్లాడుతూ పోలీసు వ్యవస్థపై గౌరవం, నమ్మకం ఉన్న తాము సీఐ హామీతో తాత్కాలికంగా ఆందోళన విరమించామన్నారు. రెండు రోజుల్లో నరసింహంపై చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. మెట్ట ప్రాంతంలో వైఎస్సార్ సీపీ నేతలు సీమ సంస్కృతిని తెస్తున్నారన్న ఎంపీ నరసింహం ఆరోపణను ఖండించారు. ఓట్లు వేయలేదనే కక్షతో ఫ్యాక్షనిస్టుగా వ్యవహరించినది ఆయనేనని అందరికీ తెలుసన్నారు. భారీగా పోలీసు బలగాల మోహరింపు ఎలాంటి ఉద్రిక్తతలూ చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యగా వీరవరంలో భారీగా పోలీసు బలగాలను మోహరించినట్టు సీఐ మురళీమోహన్ తెలిపారు. ఇరు వర్గాల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేశామన్నారు. జరిగిన సంఘటనలపై పూర్తి స్థాయిలో విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. -
హామీలను నెరవేరుస్తాం : యనమల
కోటగుమ్మం (రాజమండ్రి), న్యూస్లైన్ : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజల ఆశలను, ఆకాంక్షలను సాకారం చేస్తామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. పార్టీ అధికార ప్రతినిధి గన్ని కృష్ణను పరామర్శించేందుకు ఆదివారం రాజమండ్రి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీపై నమ్మకంతో సీమాంధ్ర ప్రజలు తమకు అధికారం ఇచ్చారని, ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమేనని, అయినప్పటికీ ప్రణాళికాబద్ధంగా హామీలను నెరవే రుస్తామని పునరుద్ఘాటించారు. అన్ని అంశాలను పరిశీలించాకే హామీలు ఇచ్చామని, ఉత్తుత్తి హామీలు ఇవ్వలేదన్నారు. రైతు రుణాల మాఫీ, డ్వాక్రా మహిళల రుణాల మాఫీ, యువతకు ఉపాధి, పింఛను పెంపు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అమలు చేస్తామన్నారు. గన్ని కృష్ణకు పరామర్శ అనారోగ్య సమస్యలతో స్వతంత్ర హాస్పటల్లో చికిత్స పొందుతున్న గన్ని కృష్ణను యనమల పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ గన్ని భాస్కరరావు వివరించారు. గన్ని కృష్ణ త్వరగా కోలుకోవాలని యనమల ఆకాంక్షించారు. యనమల వెంట రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ, రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, నాయకులు గంగుమళ్ల సత్యనారాయణ, పట్టపగలు వెంకట్రావు, దండుమేను వెంకటసుబ్బారావు, నిమ్మలపూడి గోవింద్, మొల్లి చిన్నియాదవ్ తదితరులు ఉన్నారు. -
గిరిజనుల సంక్షేమానికి పాటుపడతా
అరకు ఎంపీ కొత్తపల్లి గీత విజయోత్సవ సభకు తరలివెళ్లిన ఎమ్మెల్యే రాజేశ్వరి, అనంత బాబు అడుగడుగునా ఘన స్వాగతం రంపచోడవరం/గంగవరం, న్యూస్లైన్ : గిరిజనుల సంక్షేమానికి నిరంత రం పాటుపడతానని వైఎస్సార్ సీపీ అరకు ఎంపీ కొత్తపల్లి గీత పేర్కొన్నారు. ఆదివారం రంపచోడవరంలోని లెనోరా విద్యా సంస్థల ప్రాంగణంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ అనంత ఉదయభాస్కర్ (బాబు) అధ్యక్షతన విజయోత్సవ సభ నిర్వహించారు. ఇది సమష్టి విజయమని ఎంపీ గీత, ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, అనంత బాబు పేర్కొన్నారు. ఏజెన్సీ అభివృద్ధికి అవసరమైన నిధులు సాధించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే రాజేశ్వరి అన్నారు. అన్న య్య అనంత బాబు అందించిన సహకారం జీవితంలో మరువలేన న్నారు. అనంత బాబు మాట్లాడుతూ ఎంపీపీగా పనిచేసి, ఉపాధి కూలీగా కూడా చేసిన రాజేశ్వరికి పేదల కష్టాలు తెలుసని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతుందని తెలి పారు. రాబోయే రోజుల్లో ప్రతి వైఎస్సార్ సీపీ కార్యకర్త, నాయకుడు పోరాటాలు చేయడానికి ిసిద్ధంగా ఉండాలని, జనంతో కలిసి పనిచేయాలని ఎంపీ కొత్తపల్లి గీత, రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి కోరారు. అనంత బాబు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేయాలని సూచించారు. కార్యకర్తలకు ఇబ్బందులు కలగ కుండా చూడాలన్నారు. తన చివరి రక్తపు బొట్టు వరకు పార్టీ, ఏజెన్సీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమానికి వేలాదిగా కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కొమ్మిశెట్టి బాలకృష్ణ, మండల కన్వీనర్ మంగరౌతు వీరబాబు పాల్గొన్నారు. సభకు ర్యాలీగా తరలివెళ్లిన నేతలు రంపచోడవరంలో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభకు ఎల్లవరం నుంచి రంపచోడవరం వరకు ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, నియోజకవర్గ కన్వీనర్ అనంత బాబు అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ర్యాలీగా తరలివెళ్లారు. ఎల్లవరం మొదలు కొని రంపచోడవరం చేరుకునే వరకు ప్రతి గ్రామం లో ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే రాజేశ్వరి, అనంత బాబుకు మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. మండల కేంద్రమైన గంగవరంలో మండల యువజన అధ్యక్షుడు దిండి నాగమహేష్ , జెడ్పీటీసీ అభ్యర్థిని రామతులసి, సర్పంచ్ అక్కమ్మ తదితరులు స్వాగతం పలికారు. అలాగే రంపచోడవరం మండలంలో బి. వెలమలకోట గ్రామంలో గ్రామస్తులు, వైఎస్సార్ సీపీ నాయకులు గ్రామ శివారులో స్వాగతం పలకగా, గ్రామంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఎమ్మెల్యే రాజేశ్వరి ఆవిష్కరించారు. ఇక్కడ కొద్దిసేపు కార్యకర్తలను ఉద్దేశించి అనంత బాబు ప్రసంగించారు. అనంతరం ఐ.పోలవరం గ్రామంలో ఎమ్మెల్యే రాజేశ్వరికి, అనంత బాబుకు అపూర్వ స్వాగతం పలికారు. ఇక్కడ నుంచి నాయకులు, కార్యకర్తలు జేజేలు కొడుతూ రంపచోడవరం వరకు భారీ బైకు ర్యాలీ నిర్వహించారు. పందిరి మామిడి నుంచి సభాప్రాంగణం వరకు ఎంపీ కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే రాజేశ్వరి, అనంత బాబులు ప్రజలకు అభివాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. రంపచోడవరం వారపు సంతలోని ఆలయం లో కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకున్నారు. -
సజావుగా ఎన్నికల నిర్వహణపై అభినందనలు
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్లైన్: జిల్లాలో ఎంపీటీసీ ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు సమర్థవంతంగా నిర్వర్తించిన కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ప్రమోద్కుమార్లను ఏపీఎన్జీఓ అసోసియేషన్ జిల్లా శాఖ వారి చాంబర్లలో కలిసి అభినందించింది. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఓటింగ్ విషయంలో జిల్లాను ముందు వరుసలో ఉంచారన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వర్తించారన్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు గంటన్నరలోపు పూర్తిచేసి ఫలితాలను ప్రకటించి జిల్లాను దేశంలోనే మొదటి స్థానంలో నిలిపిన కలెక్టర్ విజయకుమార్ ప్రత్యేక చొరవను ప్రశంసించారు. పోస్టల్ బ్యాలెట్స్ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడాన్ని అభినందించారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న రెవెన్యూ, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు బండి శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు. ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే శరత్బాబు మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో పోలీసుశాఖ ప్రత్యేక చొరవ తీసుకుందన్నారు. శాంతిభద్రతలను పర్యవేక్షించడంలో కీలకపాత్ర పోషించిందన్నారు. కలెక్టర్, ఎస్పీలను కలిసిన వారిలో అసోసియేషన్ నాయకులు ఏ స్వాములు, పీ మదన్మోహన్, ఆర్సీహెచ్ కృష్ణారెడ్డి, ఎస్ఎన్ఎం వలి, ఐసీహెచ్ మాలకొండయ్య, కే శివకుమార్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కే పద్మకుమారి,కార్యదర్శి ఎన్వీ విజయలక్ష్మి తదితరులున్నారు. -
హస్తం అదృశ్యం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కాంగ్రెస్ పార్టీ జిల్లాలో నామరూపాలు లేకుండాపోయింది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో గత ఎన్నికల్లో విజయపతాకం ఎగురవేసిన ఆ పార్టీ ఈ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. జిల్లాలో 12 శాసనసభా నియోజకవర్గాలుండగా..నాడు 10 చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. గతమెంతో ఘనకీర్తి కలిగిన ఆ పార్టీకి ఈ సార్వత్రిక ఎన్నికల్లో డిపాజిట్లు కూడా గల్లంతవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ పార్టీ నాయకులు చిరంజీవి, రఘువీరారెడ్డి, పనబాక లక్ష్మి వంటి వాళ్లు అనేక మంది వచ్చి ప్రచారం చేశారు. అంత చేసినా..కనిగిరి తప్ప ఏ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ అభ్యర్థులు రెండు వేల ఓట్లు కూడా సంపాదించలేకపోయారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా కనిగిరిలో 2603 ఓట్లు పోలవ్వగా.. కనిష్టంగా కందుకూరులో 641 ఓట్లు వచ్చాయి. ఒంగోలులో 1424, అద్దంకిలో 1387, గిద్దలూరులో 1933, దర్శిలో 1177, మార్కాపురంలో 1550, యర్రగొండపాలెంలో 1322, కొండపిలో 1081, పర్చూరులో 1275 ఓట్లు, సంతనూతలపాడులో 1263, చీరాలలో 974 ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇటువంటి ఓటింగ్ పొందిన దాఖలాలు లేవని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. నిజానికి కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కూడా కరువయ్యారు. పోటీ చేసిన వారికి ప్రచారం కోసం నిధులిస్తారని భావించి కొంత మంది ముందుకొచ్చారు. అయితే అదికూడా ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ప్రచారం సైతం చేయకుండా ఇంట్లో కూర్చున్నారు. ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన చిరంజీవి గత ఎన్నికల సమయంలో ప్రచారానికి వస్తే ఇసుకేస్తే రాలనంత మంది జనం ఆయన సభలకు వచ్చారు. ఈ ఎన్నికలకు జనం లేక కొన్ని సభలను రద్దు చేసుకుని చిరంజీవి వెళ్లిపోయారు. అయితే తమ పార్టీ పుంజుకుంటుందని, ఈ ఎన్నికల్లో సమస్యలేర్పడినా..వచ్చే ఎన్నికల సమయానికి ఊపందుకుంటుందని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. టీడీపీ పాలనకు ప్రజలు భయపడే రోజులు దగ్గరలోనే ఉందని, దీంతో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం తెచ్చుకుంటుందని అంటున్నారు. -
సైకిల్ స్పీడుకు పడమటి గాలి బ్రేక్
మార్కాపురం, న్యూస్లైన్ : ఎన్నికలు ఏవైనా.. అభ్యర్థులు ఎవరైనా.. గెలుపు మాత్రం వైఎస్సార్ సీపీదే. పశ్చిమ ప్రకాశం ప్రజల్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిపై, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఉన్న అభిమానాన్ని ప్రజలు ఓట్ల రూపంలో కనబరిచారు. మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో గతేడాది మేలో జరిగిన సొసైటీ ఎన్నికలు, జూన్లో జరిగిన పంచాయతీ ఎన్నికలు, ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు గెలుపొందారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఈ మూడు నియోజకవర్గాల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన జంకె వెంకటరెడ్డి, ముత్తుముల అశోక్రెడ్డి, పాలపర్తి డేవిడ్రాజులు ఎమ్మెల్యేలుగా ఘన విజయం సాధించారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్ సీపీ అభ్యర్థులకే పట్టం కట్టారు. ఒంగోలు ఎంపీగా వైఎస్సార్ సీపీ నుంచి పోటీ చేసిన వైవీ సుబ్బారెడ్డికి ప్రజలు మంచి మెజారిటీ అందించారు. మార్కాపురం నియోజకవర్గంలో వైవీ సుబ్బారెడ్డికి 81,347 ఓట్లు రాగా, టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డికి 73,038 ఓట్లు వచ్చాయి. దీంతో వైవీ మార్కాపురం నియోజకవర్గంలో 8,309 ఓట్ల మెజారిటీ సాధించారు. గిద్దలూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థికి 91,881 ఓట్లు రాగా టీడీపీకి 79,985 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ నియోజకవర్గంలో 11,896 ఓట్ల మెజారిటీ వైవీ సుబ్బారెడ్డికి లభించింది. యర్రగొండపాలెం నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థికి 85,123ఓట్లురాగా టీడీపీ అభ్యర్థికి 65,467 ఓట్లు వచ్చాయి. ఇక్కడ వైవీకి 19,656 ఓట్ల మెజారిటీ వచ్చింది. పశ్చిమ ప్రాంతంలో ఫ్యాన్ స్పీడుకు సైకిల్ బ్రేకులు వేయలేకపోయింది. ఎన్నికలు ఏవైనా ప్రజలు మాత్రం వైఎస్సార్ సీపీ అభ్యర్థులను సగర్వంగా గెలిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. -
అది ప్రజా తీర్పుకాదు...
చీరాల, న్యూస్లైన్: చీరాల నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల్లో నవోదయం పార్టీ తరుఫున పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ గెలుపు ప్రజాతీర్పు కాదని టీడీపీ నాయకులు పోతుల సునీత, పాలేటి రామారావు ఆరోపించారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల నామినేషన్ నాటి నుంచి చీరాల నియోజకవర్గ ఎన్నికల అధికారి, డీఆర్డీఏ పీడీ పద్మజ ఏకపక్షంగా వ్యవహరించారన్నారు. ఎన్నికల కౌంటింగ్లో ప్రతి రౌండు ఫలితం వెల్లడించాల్సి ఉండగా ఎనిమిది రౌండ్ల వరకు మాత్రమే ప్రకటించారన్నారు. ముందు ఒక మెజార్టీని ప్రకటించి కొంత సమయం తరువాత 11వేల మెజార్టీ ఆటో గుర్తు అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్కు వచ్చినట్లుగా చెప్పడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. అలానే పోస్టల్ బ్యాలెట్ బాక్సుకు తాళాలు లేకుండా తెచ్చారని ఆరోపించారు. అందులో 200 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఆటో గుర్తుకే వచ్చాయని, ఇది ఎలా సాధ్యపడిందన్నారు. ఇదే విషయాన్ని ఆర్వోకు చెప్పినా పట్టించుకోలేదన్నారు. 60 ఈవీఎంలు తారుమారు అయ్యాయని, ఇవి టీడీపీకి పట్టున్న పాపాయిపాలెం, దేవాంగపురి, ఈపూరుపాలెం గ్రామాలవని అన్నారు. అందులో టీడీపీకి అతి తక్కువ ఓట్లు రావడం అనుమానాలకు తావిస్తుందన్నా రు. ఈవీఎంలకు ఉండాల్సిన నంబర్లు, చీటీల నంబర్లు, ఎన్నిక జరిగిన రోజు ఉన్న నంబర్లుకు తేడా ఉందన్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న కలెక్టర్ ఆర్వోపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఎన్నికల కౌంటింగ్లో చోటుచేసుకున్న అవకతవకలపై విచారణ చేపట్టి రీ పోలింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారి భన్వర్లాల్కు ఫిర్యాదు చేశామన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉద్రిక్త పరిస్థితులు చీరాల అర్బన్, న్యూస్లైన్: చీరాలలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద సంఖ్యలో టీడీపీ వర్గీయులు గడియారం స్తంభం సెంటర్కు చేరుకున్నారు. చీరాల అసెంబ్లీ నుంచి ఆమంచి కృష్ణమోహన్ గెలుపుపై అనేక అనుమానాలు ఉన్నాయంటూ కార్యకర్తలు బాహాటంగా విమర్శలకు దిగారు. దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉండడంతో వెంటనే ఒన్ టౌన్, టూ టౌన్ సీఐలు రంగప్రవేశం చేసి ధర్నాలు, ర్యాలీలు చేయకూడదంటూ పరిస్థితిని అదుపుచేశారు. అనంతరం టీడీపీ వర్గీయులు తహశీల్దార్కు వినతిపత్రం అందజేశారు. -
మోదం..ఖేదం
సాక్షి,ఒంగోలు:సార్వత్రిక ఎన్నికల్లో గెలుపోటములకు దారితీసిన అంశాలను రాజకీయ పార్టీలు అంతర్గతంగా విశ్లేషించుకుంటున్నాయి. ఓడిపోవడానికి కారణమైన అంశాలను ఆరాతీస్తూ.. ప్రధాన రాజకీయ పార్టీలు కుమిలిపోతున్నాయి. నేతల మధ్య సమన్వయ లోపం..గెలుపుధీమాపై మితిమీరిన ఆత్మవిశ్వాసం వంటి అంశాలే అభ్యర్థుల ఓటమికి కారణమని సీనియర్లు తేల్చిచెబుతుండగా... సామాజికవర్గ ఓట్ల ప్రభావంతో అందివచ్చే గెలుపు అవకాశాలను కూడా చేజార్చుకున్నామని బాధిత అభ్యర్థులు పశ్చాత్తాప పడుతున్నారు. ఇదేక్రమంలో నియోజకవర్గాల్లో తమ విజయానికి కలిసొచ్చే అంశాల్ని సైతం తెలిసిమరీ విస్మరించారనే వాస్తవాల్ని ప్రధాన రాజకీయ పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. జిల్లా పరిధిలోని రెండు లోక్సభ, 12 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, వాటిల్లో ఒక లోక్సభ వైఎస్సార్ కాంగ్రెస్కు దక్కగా.. మరొకటి టీడీపీ కైవసం చేసుకుంది. అసెంబ్లీల్లో ఆరు నియోజకవర్గాలను వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు గెలుచుకోగా, టీడీపీ మాత్రం ఐదు స్థానాలకు పరిమితమైంది. ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి పాగావేశాడు. ఆయా రాజకీయ పార్టీలు గెలుపోటములు సహజమని భావిస్తున్నప్పటికీ, నియోజకవర్గాల ఓటర్లు ఇచ్చిన తీర్పును ఎవరికి వారు విశ్లేషించుకోవడంలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగానే శనివారం నేతలంతా కలిసి ప్రయివేటు సమావేశాలు ఏర్పాటు చేసుకుని.. తాము పోటీ చేసిన నియోజకవర్గాల్లో పోలింగ్బూత్ల వారీగా.. పోలయిన ఓట్లతో పాటు రౌండ్లవారీ ఫలితాలను సమీక్షించుకుంటున్నారు. ఈ ప్రకారంగా ఏఏ ప్రాంతాల పోలింగ్బూత్ల్లో తమకు పడిన అనుకూల, ప్రతికూల ఓటింగ్ను బట్టి ఓటమికి దారితీసిన పరిస్థితులను అన్వేషిస్తున్నారు. అయితే, జిల్లా ఓటర్లు మాత్రం సార్వత్రిక ఎన్నికల్లో ‘నువ్వా..నేనా..?’ అని పోటీపడిన వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీలకు పెద్ద రాజకీయ అనుభవం నేర్పాయని..అంశాలవారీగా గుణపాఠం చెప్పినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సత్తా చాటిన వైఎస్సార్ సీపీ.. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా సాధారణ ఎన్నికల బరిలో నిల్చొన్న వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లాలో తన సత్తా చాటుకుంది. 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను సగం స్థానాలు (సంతనూతలపాడు, అద్దంకి, యర్రగొండపాలెం, మార్కాపురం, కందుకూరు, గిద్దలూరు) కైవసం చేసుకుంది. దర్శి, పర్చూరు, చీరాల, కొండపి, ఒంగోలు, కనిగిరి స్థానాల్లో ఓటమి పాలైంది. ఇప్పటికే జిల్లాపరిషత్ చైర్మన్ పీఠాన్ని అధిరోహించిన వైఎస్సార్ కాంగ్రెస్ తాజాగా, ఆరు స్థానాల్లో పార్టీ జెండాను రెపరెపలాడించడంతో జిల్లాలో ఆ పార్టీ అధికార బలం పెరిగింది. ఇదిలాఉంటే, ఓటమికి దారి తీసిన అంశాల్లోకొస్తే.. కొన్నిచోట్ల అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లినప్పటికీ, ఓటర్లను ప్రలోభపెట్టడంలో టీడీపీతో పోటీ పడలేకపోయామని అంగీకరిస్తున్నారు. ఆర్థిక బలం చాలకపోవడం.. ప్రత్యర్థులు కొన్నిప్రాంతాల ఓటర్లను ఎంచుకుని మరీ భారీగా మద్యం పంపిణీ చేయించినట్లు తెలుసుకుని బాధపడుతున్నారు. దీంతోపాటు వైఎస్సార్ సీపీ నేతలు ఎవరికి వారు తాము ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల ప్రచారానికే పరిమితమవడం... ఇతరుల గెలుపునకు సహకరించకపోవడం పెద్దసమస్యగా పరిణమించిందని పరిశీలకులు వివరిస్తున్నారు. పశ్చిమాన్ని వదిలేసి చేతులెత్తేసిన టీడీపీ జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో టీడీపీ సత్తా చాటకపోవడం స్వయంకృతాపరాధమేనంటున్నాయి ఆ పార్టీ శ్రేణులు. ఆ ప్రాంత నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టతకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం..ఎవరికి వారు తమకేం పట్టిందని నిర్లక్ష్యం వహించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా అక్కడ నాయకత్వ లోపమే ఓటమికి పనిచేసింది. ఫలితంగా మార్కాపురం సహా పశ్చిమప్రాంతమంతా టీడీపీ తుడిచిపెట్టుకుపోయిందనేది పార్టీవర్గాల వాదన. పరిషత్ ఎన్నికల్లో గెలుపు అవకాశాలను దెబ్బతీసింది కూడా పార్టీ నేతల వైఖరేనని ఘంటాపథంగా చెబుతుండటం గమనార్హం. సంతనూతలపాడు టీడీపీ అభ్యర్థిగా బీఎన్ విజయ్కుమార్ కాంగ్రెస్ను కాదని వచ్చినా ఫలితం దక్కలేదు. అతనికి సీటిచ్చినట్లు ప్రకటించిన మరుసటిరోజే.. ఆ నియోజకవర్గాన్ని బీజేపీకి పొత్తుల్లో భాగంగా కట్టబెట్టామనడం.. మరలా అతను పోటీలో ఉంటారనడం ఓటర్లను గందరగోళానికి గురిచేసింది. అతనికి పార్టీసహకారం అందించలేదు. యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల్లో నేతల మధ్య అంతర్గత విభేదాలు తెలిసిందే. కందుకూరులోనూ ఓటర్లను ఆకర్షించలేకపోయారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి పోటీచేసిన కందుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్టణంలోని ప్రతికూల ఓటింగ్ను గుర్తించకపోవడం ఓటమికి దారి తీసిందని అంచనావేస్తున్నారు. చీరాలను చేజేతులా స్వతంత్ర అభ్యర్థికి కట్టబెట్టడంలో పోతుల సునీతకు స్థానిక పార్టీ నాయకత్వం వెన్నుపోటు పొడిచిందని చెబుతున్నారు. -
మాజీ స్పీకర్కు కలిసి రాని ఆర్మూర్
ఆర్మూర్, న్యూస్లైన్ : ‘బాల్కొండలో పోటీ చేసినప్పుడు గెల్సిన సురేశ్రెడ్డి.. ఆర్మూర్కు వచ్చేసరికి ఓడిపోతున్నడు.. ఆయనకిక్కడ కలిసొస్తలేదు..’ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పటి నుంచి బా ల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల్లో శాసనసభ మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్రెడ్డి గురించి ఇవే మాట లు వినిపిస్తున్నాయి. నాలుగు పర్యాయాలు బా ల్కొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలి చిన చరిత్ర.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకునిగా ఎదిగిన అనుభవం.. కానీ 2009 నియోజకవర్గ పునర్విభజన అనంతరం కీలక సమయాల్లో ఆయన తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల కాంగ్రెస్ శ్రేణుల్లో, ఆయన అనుచరుల్లోనే ఆయనపై అపనమ్మకాన్ని పెంచాయి. ఇలాంటి తరుణంలో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు పోటీ చేసిన సురేశ్రెడ్డికి ఇక్కడి ఓటర్లు చేదు అనుభవాన్నే మిగిల్చారు. ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్రెడ్డి చిన్ననాటి మిత్రుడే అయినా ఆర్మూర్ అభివృద్ధికి నిధులు రాబట్టడంలో విఫలమయ్యా రనే అపవాదు ఉంది.బాల్కొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 1989 నుంచి 2004 శాసన సభ ఎన్నికల వరకు వరుసగా నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొంది, శాసన సభ స్పీకర్ కూడా అయ్యారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో బాల్కొండ నియోజకవర్గ పరిధిలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గ పునర్విభజన అనంతరం 2009 శాసనసభ ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి పోటీ చేశారు. ఆయన నిర్ణయం తీసుకున్నంత వేగంగా పార్టీలో పరిస్థితులు మారకపోవడంతో ఓటమి తప్పలేదు. ప్రజారాజ్యం విలీనంతో 2009లో బాల్కొండ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి ఈరవత్రి అనిల్, ఆర్మూర్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో సురేశ్రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుకు ఆర్మూర్ సరైంది కాదని, తిరిగి బాల్కొండకు వెల్లిపోవాలని నిర్ణయించుకున్నారు. మాజీ మంత్రి శనిగరం సంతోష్రెడ్డి, అప్పటి కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గం ఇన్చార్జి శనిగరం శ్రీనివాస్రెడ్డితో సురేశ్రెడ్డి చర్చలు జరిపారు. బాల్కొండ మండలం పోచంపాడ్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తాము నియోజకవర్గాల మార్పు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక నుంచి తాను మళ్లీ బాల్కొండ నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటానని సురేశ్రెడ్డి ప్రకటించారు. ఇంతలో రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ మార్పులతో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. దీంతో బాల్కొండ నియోజకవర్గం ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మారిపోయారు. ప్రభుత్వ విప్ పదవి సైతం దక్కింది. చేసేది లేక సురేశ్రెడ్డి మళ్లీ ఆర్మూర్బాట పట్టారు. మళ్లీ ఓడారు. చేసిందేమి లేదు వివాదరహితుడిగా పేరున్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధికి సురేశ్రెడ్డి చేసింది పెద్దగా ఏంలేదనే విమర్శలు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులే చేస్తుంటారు. మొన్న ఆర్మూర్ మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ప్రదర్శించినప్పటికీ అవి స్థానికంగా పోటీలో నిలిచిన వ్యక్తులకు ఉన్న పలుకుబడితో పడ్డ ఓట్లేనని చెబుతున్నారు. -
విజయం అమరులకు అంకితం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో మొత్తం ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించి టీఆర్ఎస్కు పట్టం కట్టిన ఇందూరు ప్రజలకు రుణపడి ఉంటామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. రెండు ఎంపీ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలలో పూర్తి మెజార్టీ ఇచ్చి తమపై విశ్వాసం ఉంచిన జిల్లా ప్రజలకు కృతజ్ఞతగా ఉంటామన్నారు. ఈ అఖండ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటిం చారు. శనివారం నిజామాబాద్లోని టీఆర్ఎస్ జిల్లా కేంద్ర కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో కవిత మాట్లాడారు. 1984 తర్వాత సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అధికారం చేపట్టేందుకు వీలుగా తెలంగాణ ప్రజలు మెజార్టీ ఇచ్చారన్నారు.ప్రజల దీవెనలు పార్టీ అధినేత కేసీఆర్కు ఉండటంతోనే ఇది సాధ్యమైందని, జిల్లా సమగ్రాభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తుందన్నారు. షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, గల్ఫ్ బాధితులు, బీడీకార్మికులు, తాగునీరు, సాగునీరు, ఇలా జిల్లాలో చాలా సమస్యలున్నాయని, ప్రజలు ఇచ్చిన స్వీప్ మెజార్టీని వివరించి అవసరమైతే కేసీఆర్ను 10 శాతం అదనపు నిధులు జిల్లాకు కేటాయించాలని కోరుతామన్నారు. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను ఐదేళ్లలో అమలు చేసి తీరు తామని స్పష్టం చేశారు.ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రజల కిచ్చిన హామీలను నెరవేర్చుతారన్నారు. తెలంగాణ జిల్లాలలోనే ఇందూరును ఆదర్శంగా ఉండేలా అభివృద్ది చేసేందుకు కృషి చేస్తామన్నారు. నిజామాబాద్ జిల్లా కేం ద్రంలో హైదరాబాద్కు పార్టీ కార్యాలయానికి తీసిపోకుండా ‘తెలంగాణ భవన్’ను నిర్మిస్తామని, జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఆమె పేర్కొన్నారు. అభివృద్ధి నిరోధకుడు డీఎస్ నిజామాబాద్ జిల్లాలో అభివృద్ధిని అడ్డుకున్న డీఎస్కు ప్రజలు మరోసారి తగిన గుణపాఠం చెప్పారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. అ భివృద్ది నిరోధకుడైన ధర్మపురి శ్రీనివాస్ను ఓడించాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉండేదని, అయితే టీఆర్ఎస్, కేసీఆర్ ద్వారా ఆ కోరిక నెరవేరిందన్నారు. నిజామాబాద్ రూరల్ ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. సమస్యలపై అవగాహన ఉన్న నాయకులను ప్రజలు ఎన్నుకున్నారని, జిల్లా అభివృద్ధికి ఇక ఢోకా ఉండదని అన్నారు. పట్టం కట్టిన ప్రజలను మరవలేం ప్రత్యేక తెలంగాణ కోసం ఎన్ని ఉద్యమాలు జరిగినా, చివరకు కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ఉద్యమంపైనే ప్రజలు విశ్వాసం ఉంచారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పేర్కొన్నారు. గాంధేయవాద ఉద్యమంతో కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చిన కేసీఆర్తోనే ‘తెలంగాణ’ సాధ్యమైందని భావించిన ప్రజలు ఇతర పార్టీలను పట్టించుకోలేదన్నారు. నిజామాబాద్ అర్బన్లో అసలు టీఆర్ఎస్కు పట్టు లేదని, గెలుపు కష్టమని కొందరు చేసిన వ్యాఖ్యలకు ప్రజలు తనను గెలిపించి దీటైన జవాబు చెప్పారన్నారు. ఇక్కడి ప్రజలకు సర్వత్రా రుణపడి ఉంటానని, ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజలకు అండగా ఉంటానని చెప్పారు. విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, జిల్లా పరిశీలకులు బాపూరావు, పొలిట్బ్యూరో సభ్యుడు ఏఎస్ పోశెట్టి పాల్గొన్నారు. -
సచివులు ఎవరో?
గులాబీ దళపతి కేసీఆర్ కొలువులో అమాత్యులు ఎవరు? తెలంగాణ రాష్ట్రం తొలి కేబినెట్లో జిల్లా నుంచి ఎవరికి అవకాశం దక్కుతుంది? 18 మంది మంత్రివర్గ సహచరులతో కేసీఆర్ ప్రమాణస్వీకారం చేయనున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఈ చర్చ సర్వత్రా సాగుతోంది. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సార్వత్రిక ఎన్నికల ఫలితా లు వెలువడిందే తడువుగా శనివారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం, ఎల్పీ నేతగా కేసీఆర్ ఎన్నిక జరిగింది. ఈ నేపథ్యంలో కొత్తగా కొలువుదీరే కేసీఆర్ మంత్రివర్గంలో జిల్లా నుంచి మంత్రిగా ఎవరికీ అవకాశం దక్కుతుందనే అంశం చర్చనీయాంశగా మారింది. రెండు లోక్సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలతో ఘనవిజయం సాధించిన టీఆర్ఎస్లో ఇప్పుడు మంత్రి పదవి ఎవరికి దక్కుతుందనేది హాట్ టాపిక్గా మారింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే కొందరు సీనియర్ల పేర్లను ప్రకటించారు. మోతె గ్రామంలో మట్టిముడు పు విప్పిన ఆయన రాబోయే టీఆర్ఎస్ ప్రభుత్వంలో పోచారం శ్రీనివాస్రెడ్డిలాంటి సీనియర్లకు మంత్రిగా అవకాశం ఇచ్చి జిల్లాను అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నా రు. డిచ్పల్లిలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారసభలో బాజిరెడ్డి గోవర్ధన్ను డైనమిక్ లీడర్గా పేర్కొ న్న కేసీఆర్ ఆయనను గెలిపిస్తే తెలంగాణ స్థాయిలో పెద్ద పదవి కట్టబెట్టబెడతానని హామీ ఇచ్చారు. గోవర్ధన్కు కూడ సీనియర్ నేతగా రాజకీయ అనుభవం, జిల్లా మీద మంచి పట్టు కూడా ఉంది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతున్న ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి నాలుగోసారి ఎల్లారెడ్డి నుంచి గెలుపొందారు. ఆయన పేరు కూడ మం త్రి పదవులు ఆశిస్తున్న వారి జాబితాలో ఉంది. రేసులో గంప గోవర్ధన్, హన్మంత్ సింధే జిల్లాలో మొత్తం స్థానాల నుంచి ఎమ్మెల్యేలు గెలుపొందడటం, పలువురు మంత్రి పదవిని ఆశిస్తుండడం పార్టీలో తర్జనభర్జనలకు కారణమవుతోంది. పోచారం శ్రీనివాస్రెడ్డి, గోవర్ధన్, రవీందర్రెడ్డితో పాటు రెండుసార్లు కామారెడ్డి, జుక్కల్ నుంచి గెలుపొందిన గంప గోవర్ధన్, హన్మంత్ సింధే కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా బరిలో దిగిన ఈ ఇద్దరు నేతలు కూడ భారీ ఆధిక్యత నే సాధించారు. తొమ్మిదింటికి తొమ్మిది స్థానాలు గెలి చిన నేపథ్యంలో జిల్లాలో ఇద్దరికీ మంత్రి పదవి ఇ వ్వాలని అధినేత భావిస్తే, అగ్రవర్ణాల నుంచి ఒకరికి, ఇతర సామాజికవర్గాల నుంచి మరొకరికి అవకాశం ఉంటుందంటున్నారు. ఇదే జరిగితే నాలుగు పర్యా యాలు టీఆర్ఎస్ నుంచి గెలిచిన రవీందర్రెడ్డి, లేదా పోచారం శ్రీనివాస్రెడ్డిలో ఒకరికి దక్కితే, ఎస్సీ రిజ ర్వుడు నియోజకవర్గం జుక్కల్ నుంచి గెలుపొందిన హన్మంత్ సింధే పేరును పరిశీలించే అవకాశం లేకపోలేదన్న చర్చ జరుగుతోంది. మైనార్టీ నుంచి అవకాశం దక్కితే బోధన్ ఎమ్మెల్యే షకీల్కు, వైశ్య సామాజికి వర్గానికి ఇవ్వాలను కుంటే అర్బన్ ఎమ్మెల్యే బిగాల కు అవకాశం రావచ్చు. ఇవేమీ ప్రాతిపదిక కా దు, భవిష్యత్లో తెలంగాణ పునర్నిర్మాణం, పార్టీ ప టిష్టం నేపథ్యంలో చురుకైన పాత్రను పోషించే యువకులకు కూడ కేసీఆర్ అవకాశం కల్పించవచ్చన్న చర్చ కూడ ఉంది. ఏదేమైనా శనివారం టీఆర్ఎస్ఎల్పీ సమావేశం అనంతరం చోటు చేసుకున్న పరిణామా ల నేపథ్యంలో మంత్రి పదవులు ఎవరికీ దక్కుతాయ న్న ఊహాగానాలు జోరందుకున్నాయి. -
కూడికలు... తీసివేతలు
ఖమ్మం, న్యూస్లైన్: సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై జిల్లాలోని ప్రధాన రాజకీయ పక్షాలు పోస్టుమార్టం మొదలుపెట్టాయి. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా జిల్లా ప్రజలు ఎక్కువ పార్టీలకు విజయం కట్టబెట్టడంతో పాటు ఎన్నికలో వైవిధ్యాన్ని చూపడంతో ఓటింగ్ సరళిపై వివిధ పార్టీల నేతలు ఆరా తీస్తున్నారు. ఎక్కడ, ఎన్ని ఓట్లు వచ్చాయి... పార్టీకి పట్టున్న చోట్ల ఎంత మెజార్టీ వచ్చింది... పట్టు లేని చోట పుంజుకున్నామా.... గణనీయ ఓట్లొచ్చింది ఎక్కడ... వెనుకబడింది ఎక్కడ అని కూడికలు, తీసివేతలు వేస్తూ విశ్లేషణలో మునిగిపోయారు. పొత్తు పొడిచిందా? సార్వత్రిక ఎన్నికల్లో సీపీఐతో కాంగ్రెస్..., బీజేపీతో టీడీపీ పొత్తులు పెట్టుకున్నాయి. వైఎస్సార్సీపీ, సీపీఎం అవగాహన కుదుర్చుకుని పోటీ చేశాయి. పొత్తులో భాగంగా ఖమ్మం పార్లమెంట్ స్థానంతోపాటు వైరా, పినపాక, కొత్తగూడెం అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ సీపీఐకి కేటాయించింది. అదేవిధంగా పినపాక స్థానం బీజేపీకి కేటాయించి మిగిలిన తొమ్మిది అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానంలో టీడీపీ అభ్యర్థులను నిలబెట్టింది. వైఎస్సార్సీపీ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో.., ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలో పోటీలో నిలిచి మధిర, భద్రాచలం, పాలేరు నియోజకవర్గాలను సీపీఎంకు కేటాయించింది. ఫలితాలు చూస్తే... జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పాలేరు, మధిర, ఇల్లెందు, ఖమ్మం అసెంబ్లీలు గెల్చుకుంది. అదేవిధంగా వైఎస్సార్స్సార్ కాంగ్రెస్ పార్టీ మూడు అసెంబ్లీ స్థానాలు, టీడీపీ, టీఆర్ఎస్, సీపీఎంలు ఒక్కొక్క స్థానంలో గెల్చుకున్నాయి. ఈ సందర్భంలో అసలు పొత్తుల మూలంగా ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీకి లాభం జరిగింది... ఎక్కడ కొంప ముంచింది.. అనే విషయంపై అభ్యర్థులు, వారి మద్దతు దారులు ఆరా తీస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పలు చోట్ల ఎంపీ అభ్యర్థికి పూర్తి స్థాయిలో మద్దతు తెలుపలేదని సీపీఐ శ్రేణులు అంటుంటే.. సీపీఐ నాయకులు కూడా తమ అభ్యర్థులకు సహకరించలేదని కాంగ్రెస్ నాయకులు ప్రత్యారోపణ చేస్తున్నారు. అదేవిధంగా బీజేపీతో పొత్తుపెట్టుకున్న టీడీపీ పినపాకలో అక్కడి అభ్యర్థికి అనుకూలంగా పనిచేయలేదని బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ‘హ్యాండి’చ్చారా? ఎన్నికలకు ముందుగా కుదుర్చుకున్న పొత్తులకు అనుగుణంగా పనిచేసిందెవరనేది జిల్లాలో చర్చగా మారింది. పొత్తులు కుదుర్చుకున్నా కొన్ని పార్టీలు పొత్తు ధర్మానికి భిన్నంగా పనిచేసినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, సీపీఐల మధ్య సయోధ్య లేదనే అంచనాకు వస్తున్నారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మూడు స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ మద్దతుతో అత్యధిక ఓట్లు రావాల్సిన సీపీఐ అభ్యర్థి నారాయణకు తక్కువ ఓట్లు రావడం, కష్టంగా సత్తుపల్లి నియోజకవర్గం గెల్చుకున్న టీడీపీకి ఎక్కువ ఓట్లు రావడంపై చర్చ జరుగుతోంది. మొత్తం ఓట్లలో సీపీఐ అభ్యర్థి నారాయణకు 1,87,702 ఓట్లు రాగా అదే నామా నాగేశ్వరరావుకు 4,10,230 ఓట్లు రావడంతో మిత్ర ధర్మంలో ఏదో మోసం జరిగిందనే చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగా సీపీఐతో పొత్తు పెట్టుకోవడంతోనే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిందని, సునాయసంగా గెల్చుకునే స్థానాలు వారికి వదిలేయాల్సి వచ్చిందని, వారు పోటీచేసిన చోట్ల కనీస ఓటు బ్యాంకును పొందలేకపోయారని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తుండడం గమనార్హం. -
ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయను
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్లైన్: ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలుపొందిన పొంగులేటి శనివారం జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ నుంచి ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.... ఎంపీగా తనను గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉంటానని, జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. ఈ విజయం ప్రజలదేనని, ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామన్నారు. తనతో పాటు ముగ్గురు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను, ఒక సీపీఎం ఎమ్మెల్యేను జిల్లా ప్రజలు గెలిపించారని, జగనన్న బలపరిచిన తమను జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, దివంగత నేత వైఎస్.రాజశేఖర్రెడ్డి అభిమానులు ఆదరించారని పేర్కొన్నారు. తన గెలుపునకు కృషిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు ఏ ఆలోచనతో తమను గెలిపించారో వారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేసేందుకు పాటుపడతామని చెప్పారు. కలెక్టర్ అభినందనలు... ధ్రువీకరణ పత్రం అందుకునేందుకు కలెక్టరేట్కు వచ్చిన పొంగులేటిని ముందుగా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిక్లరేషన్ను పొంగులేటికి అందించి ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించామని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఉండేందుకు పలుమార్లు పరిశీలించడం వల్ల లెక్కింపులో కొంత ఆలస్యం జరిగిందని కలెక్టర్ వివరించారు. మీ హయాం లో సూర్యాపేట, దేవరపల్లి రహదారిని అభివృద్ధి చేయాలని కలెక్టర్ పొంగులేటికి సూచిం చారు. కొత్తగూడెం నుంచి జగదల్పూర్ వరకు ఫోర్లైన్ నిర్మాణానికి జీవో వచ్చిందని, ఎన్నికల కోడ్ వల్ల పనులు ప్రారంభించలేదన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి విశేష కృషిచేస్తానన్నారు. అనంతరం వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు కలెక్టరేట్లో స్వీట్లు పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్రెడ్డి, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ తోట రామారావు, యువజన విభాగం మూడు జిల్లాల కోఆర్డినేటర్ సాదు రమేష్రెడ్డి, పార్టీ నాయకుడు పొంగులేటి ప్రసాదరెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, వైఎస్సార్సీపీ టీచర్స్ విభాగం కన్వీనర్ గురుప్రసాద్, నాయకులు ఐలూరి వెంకటేశ్వరరెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ముస్తఫా, ఖమ్మం నగర అధ్యక్షుడు అశోక్రెడ్డి,జిల్లేపల్లి సైదులు,వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ సీపీ గెలుపునకు సహకరించిన..అందరికీ కృతజ్ఞతలు
మణుగూరు, న్యూస్లైన్: జిల్లాలో వైఎస్ఆర్ సీపీని గెలిపించిన అందరికీ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన శనివారం మణుగూరులోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... జిల్లాలో వైఎస్ఆర్ సీపీని బలమైన శక్తిగా తీర్చిదిద్దేందుకు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంతగానో కృషి చేశారని అన్నారు. ఆయన సహాయ సహకారాలతో నవ తెలంగాణ నిర్మాణంలో వైఎస్ఆర్ సీపీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ప్రజలు వైఎస్ఆర్ సీపీని అమితంగా ఆదరించారని అన్నారు. జిల్లాలో సీపీఎం, వైఎస్ఆర్ సీపీ పొత్తు మంచి ఫలితాన్నిచ్చిందని అన్నారు. ఈ రెండు పార్టీల నాయకులు సమన్వయంతో పనిచేశారని, ఫలితంగానే పినపాక నియోజకవర్గంలో ఊహించినదానికంటే ఎక్కువ మెజార్టీ తనకు వచ్చిందనిఅన్నారు. తనను గెలిపించిన ప్రజలకు, సహకరించిన వైఎస్ఆర్ సీపీ, సీపీఎం శ్రేణులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల సమయంలో వైఎస్.జగన్మోహన్రెడ్డి, విజయమ్మ, షర్మిలమ్మ పర్యటనతో పార్టీకి మరింతగా కలిసొచ్చిందని అన్నారు. ప్రధానంగా పినపాక నియోజకవర్గంలో తన గెలుపునకు షర్మిలమ్మ పర్యటన నాంది పలికిందన్నారు. నియోజకవర్గ ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. రెండున్నర దశాబ్దాలుగా ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ, ప్రజల మధ్యన ఉంటున్న తనకు నియోజకవర్గ సమస్యలపై పూర్తి అవగాహన ఉందని అన్నారు. వీటి పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తానన్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో కొన్ని సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని, వాటి పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తానని అన్నారు. ఖమ్మాన్ని ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్దడంలో వైఎస్ఆర్ సీపీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. తన విజయానికి అన్నివిధాల సహాయ సహకారాలందించిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, పినపాక నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జిగా వ్యవహరించిన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పాకాలపాటి చంద్రశేఖర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పాకాలపాటి చంద్రశేఖర్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యు లు కీసర శ్రీనివాసరెడ్డి, వట్టం రాంబాబు, ఉడుముల లక్ష్మారెడ్డి, వీరంరెడ్డి శ్రీనివాసరెడ్డి, నాయకులు భూపల్లి నర్సింహారావు, కుర్రి నాగేశ్వరరా వు, మాదినేని రాంబాబు, గంగిరెడ్డి వెంకటరెడ్డి, బిజ్జం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైరా నియోజకవర్గాన్ని..మోడల్గా తీర్చిదిద్దుతా
కొణిజర్ల, న్యూస్లైన్: నవ తెలంగాణ రాష్ట్రంలో వైరా నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని, మోడల్గా తీర్చిదిద్దుతానని వైరా ఎమ్మెల్యే బాణోత్ మదన్లాల్ అన్నారు. ఎమ్మెల్యేగా గెలుపొం దిన తరువాత మొదటిసారిగా శనివారం కొణిజర్ల వచ్చిన ఆయనకు పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. కొణిజర్ల సెంటర్లోని వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం, విలేకరులతో ఆయన మా ట్లాడుతూ... అధిక మెజార్టీతో తనను గెలిపించిన వైరా నియోజకవర్గ ప్రజలకు, వైఎస్ఆర్సీపీ-సీపీఎం శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. తనను వెనుక ఉండి నడిపించిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వైరా నియోజకవర్గ ప్రజలందరి తరఫున రుణపడి ఉంటానన్నారు. పొంగులేటి శ్రీనన్న నాయకత్వంలో, ఆయన సహాయ సహకారాలతో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. నియోజకవర్గ కేంద్రమైన వైరాలో అగ్నిమాపక కేంద్రం, సబ్ట్రెజరీ కార్యాలయం ఏర్పా టు చేయిస్తానని; వైరా రిజర్వాయర్ ద్వారా అన్ని మండలాల్లోకు తాగునీరందేలా కృషి చేస్తానని అన్నారు. అభివృద్ధికి ఆమడ దూరంలోగల గిరిజన తండాలు వైరా నియోజకవర్గం లో అనేకం ఉన్నాయన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని, తం డాల్లోని సమస్యలు తనకు తెలుసునని అన్నారు. వీటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. వ్యవసాయ సమస్యలపై దృష్టి పెడతానని; ఏన్కూర్, జూలూరుపాడు, కారేపల్లి మండలాలకు సాగు నీరందించేందుకు కృషి చేస్తానని అన్నారు. జూలూరుపాడు మండలంలోని పోలారం చెరువును పునర్నిర్మిస్తే సుమారు 14వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. ప్రజలందరికీ రుణపడి ఉంటా... కారేపల్లి: తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలందరికీ రుణపడి ఉంటానని ఎమ్మెల్యే మదన్లాల్ అన్నారు. ఆయన శనివారం కారేపల్లిలోని ఎస్ఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... రాజకీయాలకు అతీతంగా అందరి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కారేపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ప్రయత్నిస్తానని అన్నారు. తొలుత, మదన్లాల్కు ఎస్ఆర్ఆర్ కళాశాల సెక్రటరీ కె.ఉపేందర్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో వైఎస్ఆర్ సీపీ మండల కన్వీనర్ రావూరి శ్రీనివాసరావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గుమ్మా రోషయ్య, ఇమ్మడి తిరుపతిరావు పాల్గొన్నారు. ఘన స్వాగతం గొల్లెనపాడు (వైరా): ఎమ్మెల్యేగా ఎన్నికైనం అనంతరం శనివారం గొల్లెనపాడుకు తొలిసారిగా వచ్చిన బాణోత్ మదన్లాల్కు వైఎస్ఆర్ సీపీ, సీపీఎం నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు భారీ ర్యాలీతో ఘనస్వాగతం పలికారు. గ్రామంలోని ఇంటింటికీ మదన్లాల్ వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆర్సీఎం చర్చిలో ప్రార్థన చేశారు. గ్రామంలోని డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ గ్రామస్తులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ... తనను గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు చెప్పారు. తొలి వినతిపత్రం స్వీకరణ ఎమ్మెల్యేగా తొలి వినతిపత్రాన్ని మదన్లాల్ స్వీకరించారు. స్థానిక ఇబ్బందులను, అంగన్వాడీ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామస్తులు వినతిపత్రం ఇచ్చా రు. వీటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హమీ ఇచ్చారు. సీపీఎం నాయకులతో సమావేశం వైరాలోని సీపీఎం కార్యాలయంలో ఆ పార్టీ నాయకులతో మదన్లాల్ సమావేశమయ్యారు. తన విజయానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో వైఎస్ఆర్ సీపీ ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థి కూరాకుల నాగభూషణం, మండల కన్వీనర్ షేక్ లాల్మహ్మద్, నాయకులు గుమ్మా రోషయ్య, తన్నీరు నాగేశ్వరరావు, తేలప్రోలు నర్సింహా రావు, తాతా నిర్మల, వెంపటి చంద్రశేఖర్, వెంకటయ్య, ఏసు, సీపీఎం నాయకులు ఆళ్ళ వెంకట్రావ్, చిత్తారి రాంబాబు, మేకల వెంకటేశ్వర్లు, ఈరుపార్శపు భాస్కర్రావు, ఖాసీం, ఖానాపురం మారుబొయిన ఏడుకొండలు, వేమిరెడ్డి వెంకటకోటరెడ్డి, విజయలక్ష్మి, వేల్పుల రామారావు, ప్రగడవరపు పాపయ్య, యాదయ్య, వెంకటనారాయణ, గొల్లపూడి సర్పంచ్ ముత్తారపు కళావతి తదితరులు పాల్గొన్నారు. -
నల్లసూరీళ్ల తెలం‘గానం’..
వారు నిత్యం చీకటి గుహల్లో పనిచేసే కార్మికులు.. ఏదైనా సమస్య వచ్చినా దాన్ని పోరాడి సాధించుకునే పోరాట పటిమ వారిది.. ఇచ్చి న మాటకు కట్టుబడే తత్వం వారి సొంతం.. అలాంటి సింగరేణి కార్మికులు కట్టుబడినట్లుగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిపెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితిని అక్కున చేర్చుకున్నారు. నాలుగు జిల్లాల కోల్బెల్ట్ పరిధిలో అనూహ్య ఫలితాలు అందించి తమ ఐకమత్యాన్ని చాటారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు బుద్ధిచెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనీ ఆదరించారు. కోల్బెల్ట్ పరిధిలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో 5 పార్లమెంటు, 11 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటిలో టీఆర్ఎస్కు నాలుగు పార్లమెంటు స్థానాలు, 8 అసెంబ్లీ స్థానాలు కట్టబెట్టారు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒకటి పార్లమెంటు, ఒకటి అసెంబ్లీ సీటు అప్పగించారు. కాంగ్రెస్, టీడీపీ ఒక్కో ఎమ్మెల్యే స్థానాన్ని గెలుచుకున్నాయి. మంచిర్యాల సిటీ, న్యూస్లైన్ : తెలంగాణ రాష్ట్రానికి తొలిసారిగా జరి గిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో నా లుగు జిల్లాలోని సింగరేణి బొగ్గు గని కార్మికులు తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులకే పట్టం కట్టారు. కోల్బెల్ట్ లోని అత్యధిక పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకుని ప్రధాన పార్టీల కంటే ముందంజలో ఉంది. మొదటిసారి కార్మికులు ఒక పార్లమెంట్, ఒక అసెంబ్లీ స్థానాన్ని వైఎస్ఆర్ పార్టీ చేతిలో పెట్టి ఆదరించారు. ఒంటరిగా పోటీ చేసినా తెలంగాణ పోరులో రెండు స్థానాలు గెలుపొందడం విశేషం. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ఒక్కో స్థానానికే పరిమిత మయ్యాయి. కమ్యూనిస్టులు మూడు ప్రాంతాల్లో పొత్తుతో పోటీ చేసినా ఒక్క స్థానంలో కూడా వారిని కార్మికులు ఆదరించలేదు. ఆదిలాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాలో రామగుండం, మంథని, వరంగల్ జిల్లాలో భూపాలపల్లి, ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం, పినపాక, సత్తుపల్లి, ఇల్లందు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాలు కూడా బెల్ట్లోనే ఉన్నాయి. వైఎస్ఆర్ సీపీకి ఆదరణ.. కోల్బె ల్ట్ ప్రాంతాల్లో మొదటి సారిగా కార్మికులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులను పక్కకు తోసి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం పార్లమెంటు స్థానంలో పి.శ్రీనివాస్రెడ్డిని, పినపాక అసెంబ్లీ స్థానానికి పి.వెంకటేశ్వర్లును గెలిపించారు. ఇప్పటికే ఆ పార్టీ తరఫున సత్తుపల్లి, కొత్తగూడెం మున్సిపాలిటీల్లో సైతం కౌన్సిలర్లను కార్మికులు ఆదరించారు. ఒంటరిగా బరిలోకి దిగి జాతీయ పార్టీల కంటే తామే గొప్ప అని ఈ పార్టీ నిరూపించింది. భవిష్యత్తులో సింగరేణిలో కీలక బాధ్యతలు వీరికి అప్పగించే అవకాశాలూ లేకపోలేదు. టీఆర్ఎస్ హవా.. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటమంటూ కార్మికుల కాలనీలతోపాటు గనులపై టీఆర్ఎస్ మొదటి నుంచీ విసృ్తత ప్రచారం చేపట్టింది. సకల జనుల సమ్మెలో కార్మికులను నెల రోజులపాటు భాగస్వాములను చేసింది. ఎన్నికల హామీలో కార్మికులను ఆకట్టుకుంది. దీంతో కోల్బెల్ట్లోని ఐదు పార్లమెంటు, పదకొండు అసెంబ్లీ స్థానాలకు ఒంటరిగా పోటీ చేసింది. అందులో.. నాలుగు పార్లమెంటు, ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో కార్మికులు ఆ పార్టీని ఆదరించారు. మహబూబాబాద్లో సీతారాంనాయక్, వరంగల్లో కడియం శ్రీహరి, పెదపల్లిలో బాల్క సుమన్, ఆదిలాబాద్లో జి.నగేష్ పార్లమెంటు అభ్యర్థులుగా గెలుపొందారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా మంథనిలో పుట్ట మధు, రామగుండంలో సత్యనారాయణ, ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్లో కోవ లక్ష్మి, మంచిర్యాలలో దివాకర్రావు, బెల్లంపల్లిలో చిన్నయ్య, చెన్నూర్లో ఓదెలు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. తెలుగుదేశం+బీజేపీకి నామమాత్రం.. తెలుగుదేశం, భారతీయ జన తా పార్టీలు పొత్తు పెట్టుకొని కోల్బె ల్ట్లోని అన్ని స్థానాలకు పోటీ పడ్డాయి. బీజేపీ ఒక ఎంపీ, నాలుగు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయగా ఒక్కటి కూడా దక్కించుకోలేదు. తెలుగుదేశం పార్టీ ఆరు ఎమ్మెల్యే, నాలుగు ఎంపీ స్థానాలకు పోటీచేయగా సత్తుపల్లి అసెంబ్లీని కాపాడుకోగలిగింది. కాంగ్రెస్+సీపీఐ.. ఒకటికే పరిమితం.. కాంగ్రెస్, సీపీఐలు జాతీయ పార్టీలు. వీటికి సింగరేణిలో కార్మిక అనుబంధ సంఘాలు కూడా ఉన్నాయి. వాటిని బలోపేతం చేయడంలో రెండు పార్టీలూ విఫలం కావడం నేటి ఫలితాలకు తార్కాణం. నిత్యం కార్మిక సమస్యలపై పోరాటం చేసే అనుబంధ సంఘాలు ఉన్నా కార్మికులను సార్వత్రిక ఎన్నికల్లో ఆకట్టుకోలేకపోయారు. రెండు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్నా ఆశించిన ఫలితాలు దక్కలేదు. పొత్తులో సీపీఐ మూడు ఎమ్మెల్యే, ఒక పార్లమెంటు స్థానానికి పోటీ చేయగా ఏ ఒక్క స్థానాన్నీ దక్కించుకోలేదు. అదేవిధంగా కాంగ్రెస్ ఎనిమిది ఎమ్మెల్యే, నాలుగు ఎంపీ స్థానాలకు పోటీ పడగా ఇల్లందు అసెంబ్లీ స్థానం నుంచి కనకయ్య గెలుపొందారు. -
ఒంటరి పోరు.. కారుదే జోరు
మంచిర్యాల సిటీ, న్యూస్లైన్ : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఒంటరి పోరు తో 2014లో జిల్లాలో అత్యధిక స్థానాల్లో గెలుపొందడంతో పాటు కొత్త రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకోవడంలో సఫలమైంది. తాజా ఎన్నికల్లో జిల్లాలో పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా ఏడు స్థానాల్లో అతి సులభంగా గెలుపొందింది. అదే విధంగా ఆది లాబాద్ పార్లమెంటు స్థానాన్ని సైతం భారీ మెజార్టీ తో దక్కించుకొని తిరుగులేని పార్టీగా జిల్లాలో నిల బడింది. 2004లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పె ట్టుకొని జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ముథోల్, బోథ్, ఖానాపూర్ అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని తూ ర్పు ప్రాంతంలోని చెన్నూర్, మంచిర్యాల, సిర్పూర్(టి) అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. తాజా ఎన్నికల్లో గెలిచిన ఏడుగురిలో నలుగురు కొత్తవారు కావడం విశేషం. మరో ముగ్గురు సీనియర్లు ఉన్నారు. బోథ్ నుంచి గెలిచిన రాథోడ్ బాపురావు ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చి తన కం టే రాజకీయాల్లో సీనియర్, అదే ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన సోయం బాపురావును ఓడించారు. బెల్లంపల్లి నుంచి రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేని దుర్గం చిన్నయ్య తనకంటే సీనియర్, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మల్లేశ్పై భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆసిఫాబాద్ నుంచి గెలిచిన కోవ లక్ష్మి కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, సి ట్టింగ్ ఎమ్మెల్యే, పెద్ద నాయకుని అండ ఉన్న సక్కు ను ఓడించి సత్తా చాటుకున్నారు. ఖానాపూర్ నుంచి గెలిచిన రేఖానాయక్ కూడా రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన రాథోడ్ రమేశ్ కుమారుడు రితీశ్ రాథోడ్ను ఎదుర్కొని విజయాన్ని అందుకొంది. పాతవారిలో ఆదిలాబాద్ నుంచి గతంలో రెండుసార్లు గెలుపొందిన జోగు రామన్న ఈసారి సులువుగానే బయట పడ్డారు. చెన్నూర్ నుంచి మూడో సారి గెలుపొందిన నల్లాల ఓదెలు కూడా స్థానిక అంశం, కార్మికుల అండ కలిసిరావడం కలిసి వచ్చింది. మంచిర్యాల నుంచి మూడో సారి గెలుపొందిన దివాకర్రావు చివరి సమయంలో టీఆర్ఎస్లో చేరి పార్టీలో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. -
ప్రచారం సరే.. ఫలితం ఏది?
సాక్షి, మంచిర్యాల : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీల అగ్రనేతలతోపాటు పలువురు ప్రముఖుల ప్రచారంపై సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. ఆయా ప్రచార ఏర్పాట్లు చూసుకునే సమయాన్ని ఓటర్ల దగ్గరికి చేరువయ్యేందుకు ఉపయోగించినా మరిం త బాగుండేదని సణుగుతున్నారు. స్థూలంగా నాయకుల ప్రచారంతో తమకు లాభం లేకుండాపోయిందని వాపోతున్నారు. ఈ ఆవేదన ముఖ్యంగా టీడీపీ నాయకుల్లో బలంగా ఉంది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన పార్టీల ప్రముఖ నాయకులంతా జిల్లాను చుట్టివచ్చారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండు ధపాలుగా జిల్లాలో పర్యటించారు. గులాబీ బాస్ పర్యటనకు తప్ప మిగతా నాయకులెవ్వరి ప్రచారానికి పెద్దగా ఫలితం దక్కలేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఒక్కరోజులోనే జిల్లాలో పర్యటించారు. బీజేపీతో పొత్తు ఉన్నా కేవలం టీడీపీ అభ్యర్థులు పోటీచేసిన స్థానాల్లోనే బాబు ప్రచారం నిర్వహించారు. కాని ఏ ఒక్కస్థానంలోనూ పార్టీ అభ్యర్థులు గెలువలేదు. సాక్షాత్తు పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు, సిట్టింగ్ ఎంపీ రాథోడ్ రమేశ్ మూడో స్థానంలో నిలవడం ప్రచారం ఫలితానికి నిదర్శన మని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. తూతుమంత్రపు ప్రచారం చేస్తే ఫలితాలు ఇలా కాకుండా ఇంకెలా ఉంటాయని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ శ్రేణుల ఆవేదన ఇందుకు మరింత భిన్నంగా ఉంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డితోపాటు సినీ నటుడు రాజశేఖర్తో సైతం ఆ పార్టీ ప్రచారం చేయించింది. అయినా చేదు ఫలితమే దక్కింది. కిషన్రెడ్డి పర్యటించిన సమయంలోనూ కేవలం బీజేపీ నేతలు బరిలో ఉన్న స్థానాల్లోనే ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి సైతం ఇందుకు భిన్నమైన రీతిలో ఏమీలేదు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను అన్నీ తానై చూసిన కేంద్రమంత్రి జైరాం రమేశ్ జిల్లాలో పలు దఫాలుగా పర ్యటించి పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. పలుచోట్ల బహిరంగ సభల్లో ప్రసంగించి, కొన్నిచోట్ల పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. అయినా ఒక్క ముథోల్లో తప్ప ఏ ఒక్క స్థానంలోనూ ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించలేదు. ఆసిఫాబాద్లో నిర్వహించిన బహిరంగ సభకు రాష్ట్ర కాంగ్రెస్ అగ్రనేతలు పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి హాజరయ్యారు. కాని ఆ నియోజకవర్గ అభ్యర్థి విజయానికి సదరు నేతల ప్రచారం అండగా నిలవలేకపోయింది. ఇదిలా ఉండగా..నిర్మల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలేటి మహేశ్వరరెడ్డి సీరియల్ నటుడు టార్జాన్తో ప్రచారం చేయించినా ఫలితం లేకపోయింది. కేసీఆర్ జోష్.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన బహిరంగ సభల ద్వారా పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. జిల్లాలో మొదటి విడత ప్రచారం చేసినపుడు తొమ్మిది బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. రెండో దఫా వచ్చినపుడు మందమర్రి సభలో మాట్లాడారు. కేసీఆర్ ప్రచార పర్వంతో టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలన్న ఆలోచన జనాల్లో కలిగించేందుకు బలమైన కారణాలను ప్రస్తావించిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నారు. ఆయన ప్రచారమే ఆ పార్టీ అభ్యర్థులు అధిక మెజార్టీ సాధించేందుకు తోడ్పడిందని వ్యాఖ్యానిస్తున్నారు. బీఎస్పీ అభ్యర్థులే భేష్!! బడానేతల ప్రచార సహకారం లేకుండా ఒంటిచేత్తో విజయదుందుభి మోగించిన బీఎస్పీ అభ్యర్థులు ఎ.ఇంద్రకరణ్రెడ్డి, కోనేరు కోనప్పలే భేష్ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తమ సొంత చరిష్మా ఆధారంగానే వారు విజయతీరాలు చేరుకున్నారని పేర్కొంటున్నారు. -
వ్యూహం ఫలించింది.. విజయం వరించింది
సాక్షి, రంగారెడ్డి జిల్లా : కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఇరువురు నేతలు.. అనూహ్యంగా పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. కొండా విశ్వేశ్వర్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి... జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాల నుంచి ఎంపీలుగా ఎన్నికయ్యారు. అయితే వారి గెలుపు వెనుక ఉన్న శ్రమ అంతా ఇంతా కాదు. చేవెళ్ల పార్లమెంట్ నుంచి బరిలో దిగిన టీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి గతేడాది చివర్లో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ అంతకు ఏడాది ముందు నుంచే పరోక్షంగా రాజకీయాల్లో ఉండి పరిస్థితులను సమీక్షిస్తూ వచ్చారు. అంతేకాకుండా చేవెళ్ల తన సొంతగడ్డ అంటూ ప్రజల్లోకి వెళ్లి స్థానిక నేతలతో మమేకం కావడంతో పాటు ప్రత్యేకించి కొందరు యువకులతో క్షేత్రస్థాయి పరిస్థితులపై అధ్యయనం చేయించారు. ఇలా ఎన్నికలకు ముందే పార్లమెంటు సెగ్మెంటులోని ప్రాంతాలపై అవగాహన పెంచుకున్న విశ్వేశ్వర్.. చేవెళ్లలో గులాభి దళపతి సమక్షంలో పార్టీలో చేరారు. అదే సమయంలో కేసీఆర్ టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించడంతో గెలుపు కోసం క్షేత్రస్థాయిలో కార్యాచరణకు దిగారు. ఆ తర్వాత ఎన్నికల సమయంలో సతీమణితో పాటు బంధువర్గాన్ని ప్రచారంలోకి దింపి ఓటర్లను ఆకర్షించడంతో సఫలీకృతులయ్యారు. పెద్దగా ప్రభావం లేని టీఆర్ఎస్ పార్టీని పటిష్టపరుస్తూ తన గెలుపునకు బాటలు వేసుకున్నారు. మరోవైపు తెలంగాణ సెంటిమెంటు కలిసి రావడంతో పాటు సోషల్ మీడియా తదితర టెక్నాలజీని విస్తృతంగా వినియోగించుకున్నారు. చివరకు అనుకున్నట్లుగా భారీ మెజార్టీతో బలమైన పార్టీలకు చెందిన ప్రత్యర్థులను మట్టికరిపించారు. సమన్వయం మల్లారెడ్డి విజయ రహస్యం... మల్కాజిగిరి పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందిన చామకూర మల్లారెడ్డి సీఎంఆర్ విద్యాసంస్థల చైర్మన్. ఈ నేపథ్యంలో కొన్ని వర్గాలకు సుపరిచితులైనప్పటికీ రాజకీయాల్లోకి రావడం కొత్తే. అనూహ్యంగా టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. పూర్తిగా పట్టణ నియోజకవర్గం కావడం.. టీడీపీకి పట్టున్న ప్రాంతం.. మరోవైపు మోడీ గాలి.. వెరసి మల్లారెడ్డి విజయానికి మార్గం సుగమమైంది. అయితే ఇక్కడ పోటీచేసిన అభ్యర్థులంతా బడా నేతలే. స్థానికంగా బలమైన నేత మైనంపల్లి హన్మంతరావు, మాజీ డీజీపీ దినేష్రెడ్డి, లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి ప్రముఖుల ఎదుర్కొని చివరకు మల్లారెడ్డి విజయం సాధించారు. పార్టీకి కొత్త అయినప్పటికీ.. నియోజకవర్గంలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అధినేతతో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం ఆయనకు కలిసివచ్చిన అంశం. మరో వైపు పార్టీ శ్రేణులను, అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ అభ్యర్థులను సమన్వయం చేసుకుంటూ పనిచేశారు. మొత్తంమీద 30వేల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు. -
స్వయంకృతం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : అతివిశ్వాసం కాంగ్రెస్ పుట్టిముంచింది. మెజార్టీ సీట్లు గెలుచుకుంటామని బీరాలు పలికిన ఆ పార్టీని చావుదెబ్బతీసింది. కేవలం రెండు సీట్లకే పరిమితం కావడం... అవి కూడా అత్తెసరు ఓట్లతో గట్టెక్కడం చూస్తే ఆ పార్టీ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. 2009లో కాంగ్రెస్ ఎనిమిది చోట్ల విజయం సాధించింది. ఈ సారి ఆ స్థాయిలో సీట్లు దక్కకపోగా.. చాలాచోట్ల మూడో స్థానానికి దిగజారింది. మల్కాజిగిరి, ఉప్పల్, ఇబ్రహీంపట్నం, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, మేడ్చల్, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో ప్రత్యర్థుల చేతిలో కాంగ్రెస్ మట్టికరిచింది. ఈ స్థానాల్లో ఓటమి పాలవడమే కాకుండా టీఆర్ఎస్ / స్వతంత్ర అభ్యర్థుల కంటే వెనుకబడింది. పార్టీ గ్రాఫ్ ఈ స్థాయిలో పడిపోవడానికి ప్రధాన కారణం సమన్వయలేమి, నేతల అంతర్గత కలహాలే. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలను బుజ్జగించాల్సిన అధిష్టానం... పట్టించుకోకపోవడంతో పార్టీ నడ్డివిరిగింది. కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో సీట్లు ఆశించిన ఆశావహులు టికెట్ రాకపోవడంతో ఇతర పార్టీల్లోకి జంప్ చేయడమేగాకుండా ఆ పార్టీ తరఫున బరిలో దిగారు. దీంతో చాలా స్థానాల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకుకే చిల్లు పడింది. మరోవైపు అసంతుష్టులను దారిలో తెచ్చేందుకు కూడా పార్టీ నాయకత్వం చొరవచూపలేదు. ప్రజా వ్యతిరేకత తీవ్రంగా మూటగట్టుకోవడం, టీఆర్ఎస్, మోడీ హవా ఉందని పసిగట్టినా దాన్ని నివారించే ప్రయత్నం చేయకపోవడంతో ఘోర పరాజయాన్ని మూటగ ట్టుకుంది. ఇబ్రహీంపట్నంలో పార్టీ ఓడిపోవడానికిప్రధాన కారణం తిరుగుబాటు అభ్యర్థి. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన మల్రెడ్డి రాంరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే కావడం, ఆయనకు మరికొందరు పార్టీ నేతలు సహకరించడంతో పార్టీ అభ్యర్థి క్యామ మల్లేశ్ పరాజయానికి దారితీసింది. కాంగ్రెస్ ఓట్లే స్వతంత్ర అభ్యర్థి ఖాతాలోకి వెళ్లడంతో టీడీపీ ఇక్కడ సలువుగా విజయం సాధించింది. మల్కాజిగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, ఎల్బీ నగర్లో ఎం.రామ్మోహన్గౌడ్, కుత్బుల్లాపూర్లో హన్మంతరెడ్డి టికెట్టు రాకపోవడంతో చివరి నిమిషంలో కారెక్కారు. ఆ పార్టీ తరఫున బరిలోకి దిగడం కాంగ్రెస్ ఓట్లలో చీలిక తెచ్చింది. ఇది ప్రత్యర్థి పార్టీని విజయతీరాలకు చేర్చింది. వికారాబాద్లోను ఒకవర్గం వ్యతిరేకంగా పనిచేయడం కూడా మాజీ మంత్రి ప్రసాద్కుమార్ ఓటమి కారణంగా విశ్లేషించుకోవచ్చు. ఇదే పరిస్థితి పార్లమెంటు స్థానాల్లోను స్పష్టమైంది. అటు మల్కాజిగిరి, ఇటు చేవెళ్ల లోక్సభ స్థానాల్లో భారీ క్రాస్ ఓటింగ్ జరిగింది. స్థానికంగా ఎంపీ అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకత వారికి పోలైన ఓట్లలో స్పష్టమైంది. వైరం... గెలుపునకు దూరం! తెలుగుదేశం జిల్లాలో ప్రభంజనం సృష్టించినా.. కొన్ని నియోజకవర్గాలు చేజారేందుకు సీనియర్ల వ్యవహారశైలే కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మల్కాజిగిరిలో బీజేపీ, మేడ్చల్లో పార్టీ పరాజయం చవిచూసేందుకు దారితీసింది. తనకు టికెట్ దక్కకుండా రాజ్యసభ సభ్యుడు దేవేందర్గౌడ్ పావు లు కదపడాన్ని జీర్ణించుకోలేక మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు రాత్రికి రాత్రే పార్టీకి గుడ్బై చెప్పడమేగాక.. మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేశారు. మైనంపల్లికి అనుచరుడిగా పేరున్న నక్కా ప్రభాకర్గౌడ్కు కూడా టికెట్ ఇవ్వకుండా అడ్డుకట్ట వేశారు. దీంతో రెబల్గా బరిలో దిగిన న క్కా.. చివరి నిమిషంలో తన బాస్ మైనంపల్లిని అనుసరిం చారు. దీంతో అటు మల్కాజిగిరి, ఇటు మేడ్చల్లోని వీరి ప్రధాన అనుచరగణం పూర్తిగా గులాబీ పంచన చేరింది. ఈ పరిణామంతో నామమాత్రపు పోటీ ఇస్తుందనుకున్న టీఆర్ఎస్.. వీరి చేరికతో అనూహ్యంగా పుంజకుంది. ఈ రెండు స్థానాల్లో విజయబావుటా ఎగురవేసింది. చేవెళ్ల, పరిగి, తాండూరు, వికారాబాద్లలో పార్టీ కేడర్ పక్కచూపులు చూస్తోందని తెలుస్తున్నా జిల్లా నాయకత్వం నష్టనివారణ చర్యలకు దిగకపోవడంతో చేవెళ్ల ఎంపీ స్థానం చేజారింది. కమలం శల్య సారథ్యం! పొత్తులో భాగంగా జిల్లాలో నాలుగు సీట్లు దక్కించుకున్న బీజేపీ.. వీటిలో ఒకదాన్ని మాత్రమే గెలుచుకోగలిగింది. వికారాబాద్, పరిగిలలో మాజీ మంత్రులకు టికెట్లు ఇచ్చినా, వారి తరఫున జిల్లా నాయకత్వం కనీసం ప్రచారంచేసిన దాఖలాలు కూడా లేవు. సీనియర్లను కాదని, వలసనేతలకు సీట్లు కట్టబెట్టడంపై అసంతృప్తితోనే ప్రచారానికి దూరంగా వ్యవహరించారు. దీంతో ఈ రెండు స్థానాల్లో పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. వికారాబాద్లో ఐతే నాలుగో స్థానం తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పరిగిలో మూడో స్థానానికే పరిమితమైనా, ఉప్పల్లో గెలుపొందడం, మల్కాజిగిరిలో దాదాపు గెలుపు దాకా వెళ్లడం పార్టీకి ఊరట కలిగించింది. ఏది ఏమైనా నాయకత్వ వైఫల్యం అభ్యర్థుల ఓటమిలో ప్రధానభూమిక పోషించిందనడం నిర్వివాదాంశం. దేశవ్యాప్తంగా నమో జపం న డుస్తున్నా దాన్ని సొమ్ము చేసుకోవడంలో స్థానిక నాయకత్వం నిర్లక్ష్యం ప్రదర్శించింది. -
టీఆర్ఎస్ కొంపముంచిన ‘రెబల్’
చేవెళ్ల, న్యూస్లైన్: చేవెళ్లలో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి ఆ పార్టీ ఓటమికి కారణమయ్యారు. సునాయాసంగా గెలవాల్సిన చోట కేఎస్ రత్నం రెబల్ అభ్యర్థి దేశమోళ్ల ఆంజనేయులు మూలంగా ఓటమి పాలు కావాల్సి వచ్చింది. రెబల్ అభ్యర్థి రంగంలో లేకపోతే రత్నం సుమారు 5వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించేవారని పార్టీ శ్రేణులు విశ్లేషిస్తున్నారు. దేశమోళ్ల ఆంజనేయులు దశాబ్ధకాలంగా నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జిగా వ్యవహరించారు. జిల్లాలో తెలంగాణ ఉద్యమం అంతంత మాత్రంగా ఉన్న సమయంలో గులాబీ జెండాను చేతపట్టుకొని గ్రామగ్రామాన తిరుగుతూ రాష్ట్ర ఆవశ్యకతను తెలియజెప్పేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ టికెట్ తనకే వస్తుందని ఆశించారు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న దశలో సిట్టింగ్ ఎమ్మెల్యే కేఎస్ రత్నం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆంజనేయులు ఆశలు అడియాసలయ్యాయి. గులాబీ బాస్ కేసీఆర్, రాష్ట్ర నాయకులు హరీష్రావు, కేటీఆర్ల వద్దకు వెళ్లి టికెట్ కోసం చివరి నిమిషం దాకా విశ్వప్రయత్నం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని టికెట్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నందున ఎమ్మెల్సీ ఇప్పిస్తామని కేసీఆర్తో హామీ ఇప్పించారు. అయితే, ఉద్యమం కోసం దశాబ్ధకాలంగా నియోజకవర్గంలో ఒంటరి పోరాటం చేసిన తనను కాదని ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చినవారికి ఎలా టికెట్ ఇస్తారని ఆంజనేయులు వాదించినా పట్టించుకోలేదు. దీంతో చేసేది లేక రెబల్గా బరిలోకి దిగారు. ఓట్ల చీలికతో గట్టెక్కిన ‘కాలె’.. ఫలితాల్లో రౌండ్లవారీగా కౌంటింగ్ సరళిని పరిశీలిస్తే ఆంజనేయులు గెలుపునకు ఆమడదూరంలో ఉన్నా టీఆర్ఎస్ ఓట్లను చీల్చడంలో సఫలీకృతులయ్యారు. ఆంజనేయులుకు 6,799 ఓట్లు వచ్చాయి. ఆయనకు వచ్చిన ఓట్లు రత్నంను ఓడించడానికి దోహదపడ్డాయి. ఉద్యమ ద్రోహులు, అవకాశవాదం, స్వార్థంతో పార్టీలు మారేవారికి టికెట్లు ఇచ్చి చిరకాలంగా పార్టీని నమ్ముకున్న వారి తీరని అన్యాయం చేశారని గ్రామాల్లో ఆంజనేయులు చేసిన ప్రచారం కాస్తోకూస్తో పనిచేసిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కాలె యాదయ్య చేతిలో రత్నం కేవలం 781 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. చివరి రౌండ్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన కౌంటింగ్లో చివరికి రెబల్ అభ్యర్థి చీల్చిన ఓట్ల పుణ్యమా అని కాలె యాదయ్య స్వల్ప మెజార్టీతో బయటపడ్డారు. -
15 ఏళ్లుగా ప్రతిపక్షమే..!
కుల్కచర్ల, న్యూస్లైన్: మరోసారి పరిగి ఓటర్లు రాష్ట్ర ప్రజల అభిప్రాయానికి భిన్నమైన తీర్పునిచ్చారు. గత 15 సంవత్సరాలుగా పరిగి శాసన సభ్యుడు ప్రతిపక్షానికే పరిమితమవుతున్నాడు. ఈసారి కూడా కాంగ్రెస్ అభ్యర్థి టి.రామ్మోహన్రెడ్డిని గెలిపించి ఓటర్లు అదే తీర్పును పునరావృతం చేశారు. రాష్ట్రం మొత్తం టీఆర్ఎస్ గాలి వీచినా పరిగి నియెజకవర్గం ప్రజలు అందుకు విరుద్ధమైన తీర్పునిచ్చారు. ఈసారి సర్పంచ్, ప్రాదేశిక ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు వరుసగా వచ్చాయి. పరిగి నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికలు, ప్రాదేశిక ఎన్నికల్లోనూ ప్రజలు టీఆర్ఎస్కు పట్టం కట్టారు. నియెజవర్గంలో ఐదు మండలాలు దోమ, కుల్కచర్ల, పరిగి, గండేడ్, పూడూరుల్లో ప్రాదేశిక ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఇక సార్వత్రిక ఎన్నికల్లోనూ టీఆర్ఎస్కే ఓటు వేసి ఉంటారని, హరీశ్వర్రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందనున్నారని టీఆర్ఎస్ శ్రేణులు భావించాయి. ఫలితాలు మాత్రం విభిన్నంగా వచ్చి అందరికీ షాకినిచ్చాయి. పరిగి నియోజకవర్గం పరిధిలో తెలంగాణ సెంటిమెంట్ బలంగానే ఉంది. పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికల్లోనూ ఇదే రుజువైంది. అయితే సార్వత్రికానికి వచ్చే సరికి తీర్పు మారడంతో టీఆర్ఎస్ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి. అయితే వరుసగా ఐదుసార్లు హరీశ్వర్రెడ్డికే అవకాశం ఇవ్వడంతో ఈసారి ఇతరులకు అవకాశం ఇవ్వాలని ఓటర్లు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో టీఆర్ఆర్ గెలవగా హరీశ్వర్రెడ్డి మాత్రం ఓటమి పాలయ్యారు. నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలిస్తే హరీశ్వర్రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని, కనీసం ఈసారైనా నియోజకవర్గానికి న్యాయం జరిగి అభివృద్ధి జరుగుతుందని ఆశించిన వారికి భంగపాటు తప్పలేదు. ఇక ఎమ్మెల్యేగా గెలిచిన టీఆర్ఆర్ను ఆ పార్టీ నాయకులు అభినందిస్తున్నారు. ప్రతి గ్రామం నుంచి కాంగ్రెస్ నాయకులు వెళ్లి ఆయన్ను కలుసుకొని శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
సునీతకు స్వగ్రామంలో ఎదురు దెబ్బ
నర్సాపూర్, న్యూస్లైన్: నర్సాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్కు అనుకూల పవనాలు వీచగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీచినట్లు ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. నర్సాపూర్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్రమంత్రిగా బాధ్యతలు నిర్వహించి ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచి ఓటమి చెందిన మాజీ మంత్రి సునీతారెడ్డికి స్వగ్రామంలో సైతం వ్యతిరేక పవనాలు వీచాయి. గతంలో ఆమె చేతిలో రెండుసార్లు ఓటమి చవిచూసి మూడో సారి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన చిలుముల మదన్రెడ్డి కారు జోరుతో విజయం సాధించారు. అయితే సునీతారెడ్డి స్వగ్రామమైన గోమారంలో మూడు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా ఒకే పోలింగ్ స్టేషన్లో ఆమెకు ఆధిక్యత వచ్చింది. 239 పోలింగ్ స్టేషన్లో ఆమెకు 469 ఓట్లు రాగా టీఆర్ఎస్ అభ్యర్థి చిలుముల మదన్రెడ్డికి 336ఓట్లు వచ్చాయి. 240 పోలింగ్ స్టేషన్లో కాంగ్రెస్కు 135 ఓట్లు మాత్రమే రాగా టీఆర్స్కు 366 ఓట్లు,240(ఎ) పీఎస్లో కాంగ్రెస్కు 284 ఓట్లు, టీఆర్ఎస్కు 311ఓట్లు రావడంతో అక్కడ సైతం టీఆర్ఎస్ హవా కొనసాగిందని స్పష్టమవుతుంది. అలాగు గోమారం పక్క గ్రామాలైన బిజిలీపూర్లో స్వల్ప ఆధిక్యత రాగా నవాబుపేట గ్రామంలో సుమారు నాల్గు వందల ఓట్ల ఆధిక్యత లభించింది. కాగా మండలానికి చెందిన మాజీ జెడ్పీటీసీ సభ్యులైన నారాగౌడ్, ఉమాదేవి, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు శ్రీరాంరెడ్డి స్వగ్రామాల్లో టీఆర్ఎస్కే ఆధిక్యత లభించింది. మదన్రెడ్డి స్వగ్రామమైన కౌడిపల్లిలో మూడు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా మూడింటిలో టీఆర్ఎస్కు 1328ఓట్లు రాగా కాంగ్రెస్కు 560 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సీడీసీ చైర్మన్ చిలుముల దుర్గారెడ్డి కౌడిపల్లికి చెందిన వారే అయినప్పటికీ అక్కడ టీఆర్ఎస్కు భారీగానే ఓట్లు వచ్చాయి. కాగా నర్సాపూర్ మాజీ వ్యవసాయ మార్కెట్ కమీటీ చైర్మన్ నారాయణరెడ్డి స్వగ్రామమైన చిట్కుల్లో, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు మాణిక్యరెడ్డి స్వగ్రామమైన గౌతాపూర్లో, మరో సీనియర్ నాయకుడు విశ్వంబరస్వామి స్వగ్రామమైన సోమక్కపేటలలో సైతం టీఆర్ఎస్కు ఆధిక్యత లభించింది. నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్లో కాంగ్రెస్ సర్పంచ్ ఉన్నప్పటికీ టీఆర్ఎస్కు ఆధిక్యత లభించింది. ఇక్కడ కాంగ్రెస్కు 3558 ఓట్లు రాగా టీఆర్ఎస్కు 4320ఓట్లు లభించాయి. కొన్ని నెలల క్రితం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నర్సాపూర్ పంచాయతీ సర్పంచ్గా రమణారావును గెలిపించుకుని పంచాయతీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆత్మకమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు గౌడ్ స్వగ్రామమైన రెడ్డిపల్లిలో టీఆర్ఎస్కు సుమారు రెండు వందల ఓట్లు అధికంగా వచ్చాయి. మాజీ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్గుప్తా స్వగ్రామంలో కాంగ్రెస్కు టీఆర్ఎస్కన్నా 94 ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఇదిలాఉండగా కొల్చారం మండలంలోని కాంగ్రెస్ నాయకులు ఇంద్రసేనారెడ్డి, మల్లారెడ్డి గ్రామాల్లో టీఆర్ఎస్కు స్వల్ప ఆధిక్యత రాగా ఇతర నాయకులు శ్రీనివాస్రెడ్డి, రమేష్, నరేందర్రెడ్డి తదితరులు తమ గ్రామాల్లో కాంగ్రెస్కు ఆధిక్యత సంపాదించిపెట్టారు. అలాగే వెల్దుర్తి మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు అనంతరెడ్డి స్వగ్రామమైన బండపోసాన్పల్లిలో కాంగ్రెస్కు 69ఓట్ల ఆధిక్యత లభించింది. రామాయంపేట ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్రెడ్డి స్వగ్రామమైన రామాంతపూర్లో టీఆర్ఎస్కు కాంగ్రెస్ కన్నా 188ఓట్లు అధికంగా వచ్చాయి. మండల కేంద్రమైన వెల్దుర్తిలో కాంగ్రెస్ నాయకుడు శంకర్గౌడ్ ఊరిలో ఆరు పీఎస్లు ఏర్పాటు చేయగా సుమారు 350ఓట్ల ఆధిక్యత టీఆర్ఎస్కు లభించింది. హత్నూర మండల కేంద్రంలో కాంగ్రెస్కన్నా టీఆర్ఎస్కు ఐదు వందల ఓట్లు అధికంగా వచ్చాయి. గతంలో హత్నూర జెడ్పీటీసీ,ఎంపీపీ అధ్యక్ష పదవులు కాంగ్రెస్ అధీనంలో ఉన్నప్పటికీ టీఆర్ఎస్కు ఆధిక్యత రావడం గమనార్హం. హత్నూర మాజీ జెడ్పీటీసీ ఆంజనేయులు స్వగ్రామమైన బోర్పట్లలో 323 ఓట్లు, మరో నాయకుడు అళ్వారయ్య స్వగ్రామంలో కాసాలలో టీఆర్ఎస్కు 288ఓట్లు అధికంగా వచ్చాయి. అదే మండలంలోని డాక్టర్ గోవర్దన్రావు, నర్సింహారెడ్డి స్వగ్రామాల్లో టీఆర్ఎస్కు స్వల్ప ఆధిక్యత లభించింది. -
ప్రత్యేక రాష్ట్రంలోనూ పోరాటమే
సిద్దిపేట టౌన్, న్యూస్లైన్: తెలంగాణలో జరిగి ఎన్నికల్లో ప్రజలు పోరాట స్ఫూర్తిని కొనసాగించి అర్థవంతమైన తీర్పునిచ్చారని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. శనివారం ఆయన సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు అద్భుతమనీ, అయితే ఇంకా సంక్షోభాలు పొంచి ఉన్నాయన్నారు. వీటిని తెలంగాణ ప్రజలంతా సంఘటితంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నేరవేరుతాయన్నారు. తెలంగాణ జేఏసీ ఇక ముందు ప్రజలతో కలిసి నడుస్తుందన్నారు. విభజన నేపథ్యంలో జరిగే పంపకాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వలసీకరణ కు వ్యతిరేకంగా ఉద్యమాలు అనివార్యమన్నారు. ప్రస్తుతం సర్కార్ను బలోపేతం చేయడంతో పాటు తెలంగాణ వ్యతిరేక శక్తులను ఎదుర్కోవాల్సిన అవసరముందన్నారు. ఉద్యోగుల విభజన అంశంలో ఆప్షన్స్ చట్టంలో లేవన్నారు. 610జీవో, గిర్గ్లానీ కమిషన్ ప్రతిపాదన ఆధారంగా, విభజన మార్గదర్శకాలు, స్థానిక రిజర్వేషన్లు, ఆర్టికల్ 371డీ లోబడి ఉద్యోగుల విభజన జరిగినప్పుడే తెలంగాణకు న్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ జేఏసీ అభివృద్ధికి, పౌర సమాజానికి అండగా ఉంటుందన్నారు. కోదండరాం వెంట టీజేఏసీ తూర్పుజిల్లా అధ్యక్షులు డా. పాపయ్య, వెంకట్రాంరెడ్డి ఉన్నారు. -
ఆల్ రికార్డ్స్ హరీష్ సొంతం
పార్టీలో గానీ ఇతరత్రా ఎలాంటి సమస్యనైనా ఇట్టే పరిష్కరిస్తూ ట్రబుల్ షూటర్గా పేరొందాడు సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్రావు. సిద్దిపేట నియోజకవర్గంలోని పరిస్థితులను దశాబ్ద కాలంగా తనకు అనుకూలంగా మలుచుకుని ప్రత్యర్థుల డిపాజిట్లను గల్లంతు చేస్తున్నారు. అదీగాక మెజార్టీని పెంచుకుంటూ రికార్డులు బద్దలు కొడుతున్నారు. గత ఉప ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక మెజార్టీని సాధించిన హరీష్రావు ఈ సార్వత్రిక ఎన్నికల్లో స్పల్ప తేడాతో తెలంగాణ ప్రాంతంలో ఆధిక్యం సాధించడంలో ఈయన ద్వితీయ స్థానంలో నిలిచారు. - న్యూస్లైన్, సిద్దిపేట జోన్ టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు రాజకీయపరంగా ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదురైనా వాటికి చక్కదిద్దడానికి పార్టీ అధినేత కేసీఆర్ ట్రబుల్ షూటర్గా హరీష్రావునే పురమాయిస్తారు. గతంలో సిరిసిల్ల, స్టేషన్ఘనపూర్, పరకాల, సిర్పూర్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను అధిష్టానం హరీష్రావుపైనే మోపింది. మరోవైపు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గ బాధ్యతలతోపాటు ప్రతికూల పరిస్థితులు నెలకొన్న దుబ్బాక, మెదక్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో ఆయన స్థానిక అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. సిద్దిపేట నియోజకవర్గంలో 2004 ఉప ఎన్నిక ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన హరీష్రావుకు ఐదుసార్లు సిద్దిపేట ఓటర్లు సానుకూల తీర్పునిచ్చారు. ప్రత్యర్థి పార్టీల్లోని నాయకత్వ లోపాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటూనే ప్రతి ఎన్నికల్లో మెజార్టీని పెంచుకుంటున్నారు. ప్రత్యర్థుల డిపాజిట్లను కొల్లగొట్టే విధంగా రాజకీయ చతురత తో ఎన్నికల బరిలో దూసుకుపోతున్నారు. 2004లో జరిగిన ఉప ఎన్నికలో సమీప ప్రత్యర్థిపై 24.827 ఓట్ల మెజార్టీని సాధించారు. 2008 ఉప ఎన్నికలో 58,935 మెజార్టీ తెచ్చుకొని బరిలో ఉన్న వారందరి డిపాజిట్లు జప్తు చేశారు. 2009 జమిలీ ఎన్నికల్లో 64,014 మెజార్టీతోపాటు పోటీలో ఉన్న 13 మంది డిపాజిట్లు గల్లంతయ్యేలా దూసుకుపోయారు. ఈ క్రమంలో 2010లో జరిగిన ఉప ఎన్నికలో 95,858 భారీ మెజార్టీని సాధించి రాష్ట్ర స్థాయిలోనే రికార్డ్ నమోదు చేయడంతోపాటు ఇక్కడ పోటీ చేసిన పదిమంది డిపాజిట్లను జప్తు చేశారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 93,328 ఓట్ల మెజార్టీని సాధించి తెలంగాణలోనే రెండో స్థానంలో నిలిచి పదిమంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేశారు. -
ఇక లాంఛనమే..
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా మెతుకు సీమ బిడ్డ, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చరిత్ర పుటల్లోకి ఎక్కనున్నారు. శనివారం సమావేశమైన టీఆర్ఎస్ శాసనసభాపక్షం తమ పార్టీ శాసనసభపక్ష నేతగా కేసీఆర్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. టీఆర్ఎస్ఎల్పీ నేతగా కేసీఆర్ను ఎన్నుకున్నట్లు ఆదివారం ఆ పార్టీ నేతలు రాష్ట్ర గవర్నర్కు ధ్రువీకరణ పత్రాన్ని అందజేయనున్నారు. దీంతో కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం లాంఛనమేనని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ జూన్ 2న ఏర్పాటు కానున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ఆవిర్భావం వెంటనే కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేలా టీఆర్ఎస్ నేతలు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రస్తుతం మంత్రివర్గం కూర్పుపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణలోని అన్నీ సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించేందుకు కేసీఆర్ తర్జనభర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా నుంచి ముగ్గురు మంత్రివర్గం రేసులో జిల్లా నుంచి సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీష్ రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, అందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్లు ఉన్నారు. గరిష్టంగా 18 మందితోనే కేబినెట్ ఏర్పాటుకు అవకాశముండడం.. కాబోయే సీఎం కేసీఆర్ సైతం ఇదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో మంత్రివర్గంలో జిల్లా నుంచి ఒకరిద్దరికి మించి అవకాశం రాకపోవచ్చు. అయినా సామాజిక సమీకరణాలు కలిసివస్తే మంత్రివర్గంలో చోటు లభించవచ్చని జిల్లా నుంచి కొత్తగా ఎన్నికైన కొందరు ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం..మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహను మట్టికరిపించడం ద్వారా మాజీ మంత్రి బాబూమోహన్ మంత్రివర్గ రేసులో ముందుంజలో ఉన్నారు. మహిళా కోటా కింద పద్మా దేవేందర్ రెడ్డి పేరు సైతం వినిపిస్తోంది. పార్టీ వ్యవహారాల్లో కేసీఆర్కు అండదండగా ఉండే హరీష్ రావుకు మంత్రివర్గంలో తీసుకుంటే పాలన వ్యవహారాల్లో సహకారం లభించే అవకాశాలున్నాయి. ఈ ముగ్గురిలో ఎంత మందికి మంత్రివర్గంలో స్థానం దక్కుతుందన్నది ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశమైంది. -
నవ శకానికి నాంది
మెతుకు సీమలో దశాబ్దాలుగా కొనసాగిన కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యానికి ఈ ఎన్నికల్లో గండిపడింది. గతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా జిల్లాలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీ సాటిలేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది. జిల్లా రాజకీయ చరిత్రను తిరగేసి చూస్తే అంతా కాంగ్రెస్ హవానే కనిపిస్తుంది. 2009 సార్వత్రిక ఎన్నికల వరకు చెక్కు చెదరని ఈ ఆధిపత్యానికి ఈ ఎన్నికల్లో ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ అడ్డుకట్ట వేసింది. రెండు లోక్సభ, 8 అసెంబ్లీ స్థానాలల్లో విజయం సాధించడం ద్వారా టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. దీంతో జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్ మునుపటి ప్రభావాన్ని కోల్పోగా, టీఆర్ఎస్ శకం ఆరంభమైందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. సాక్షి, సంగారెడ్డి: ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సామెతను ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ తిరగరాసింది. రచ్చ గెలిచి ఇంట గెలవచ్చని రుజువు చేసి చూపింది. తాజా సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో జిల్లాపై ఆ పార్టీ సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించి ‘పురిటిగడ్డపై టీఆర్ఎస్ బలహీనం’ అనే విమర్శలకు చెక్ పెట్టింది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో కేవలం మెదక్ లోక్సభ, సిద్దిపేట అసెంబ్లీ స్థానంతో సరిపెట్టుకున్న ఉద్యమ పార్టీ.. ఈ ఎన్నికల్లో మెదక్, జహీరాబాద్ లోక్సభ స్థానాలతో పాటు జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో 8 స్థానాలను కైవసం చేసుకుని జిల్లా రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలికింది. నడిపించే నాయకుడు లేకే.. 2009 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రమంతా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గాలి వీచడంతో కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ లోక్సభతో పాటు జిల్లాలోని 8 అసెంబ్లీ స్థానాలను సునాయాసంగా గెలుచుకోగలిగింది. వైఎస్ మరణం తర్వాత ఆ లోటును పూడ్చే నేతలెవరూ లేక కాంగ్రెస్ బలహీనపడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయడం ద్వారా జిల్లాలో టీఆర్ఎస్ అనూహ్యంగా పుంజుకుంది. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుపై ఏళ్లతరబడి తమ నిర్ణయాన్ని నాన్చుతూ వచ్చింది. ఎట్టకేలకు సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు పచ్చ జెండా ఊపినా, అప్పటికే పరిస్థితులు ‘చెయ్యి’ దాటిపోయాయి. తెలంగాణ ఇచ్చింది తెచ్చింది తామేననే నినాదంతో ఆ పార్టీ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసుకున్నా ఓటర్లు మాత్రం నమ్మలేదనే తెలుస్తోంది. టీ-కాంగ్రెస్ ‘ముఖ్య’నేతగా గుర్తింపు తెచ్చుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డితో పాటు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డిలతో సహా జిల్లాలో ఆ పార్టీకి చెందిన 6 మంది సిట్టింగ్ శాసన సభ్యులు ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ చేతిలో మట్టి కరవడం దీనికి అద్దం పడుతోంది. బొటాబొటి ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ జిల్లాలోని రెండు అసెంబ్లీ స్థానాలను నిలుపుకున్నా..ఆ రెండు చోట్ల కూడా టీఆర్ఎస్ అభ్యర్థుల నుంచి హోరాహోరీ పోటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. జహీరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి మాజీ మంత్రి జెట్టి గీతారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి కే మాణిక్ రావుపై 842 ఓట్ల స్వల్ప మెజారిటీతో నెగ్గి బతుకు జీవుడా అంటూ గట్టెక్కారు. ఓట్లు రాల్చిన ‘ప్రత్యేక’ పోరాటం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని టీఆర్ఎస్ అభ్యర్థులు చేసుకున్న ప్రచారం ఓట్ల వర్షాన్ని కురిపించింది. మెతుకు సీమ ఓటర్లు సైతం తెలంగాణవాదానికే ఓటేయడంతో గెలుపొందిన టీఆర్ఎస్ అభ్యర్థులందరూ రికార్డు మెజారిటీని సాధించారు. తుడిచిపెట్టుకుపోయిన పచ్చపార్టీ ఇక 2009 ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ స్థానాన్ని దక్కించుకున్న టీడీపీ ఈ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయింది. టీడీపీ-బీజేపీ కూటమిని సైతం జిల్లా ఓటర్లు తిరస్కరించడంతో ఎన్నికల్లో ఇరు పార్టీల అభ్యర్థులు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. మొత్తానికి 2014 ఎన్నికలు జిల్లా రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేశాయని చెప్పవచ్చు. -
తెలంగాణా లో గెలిచిన అభ్యర్టులు వీరే(3)
తెలంగాణా లో గెలిచిన అబ్యర్టులు వీరే(3) -
తెలంగాణాలో గెలిచిన అభ్యర్ధులు వీరే(1)
తెలంగాణా లో గెలిచిన అబ్యర్టులు వీరే -
తెలంగాణాలో గెలిచిన అభ్యర్ధులు వీరే(2)
తెలంగాణాలో గెలిచిన అభ్యర్ధులు వీరే (2) -
తారలు హిట్!.. ఫట్!!
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల సమరంలో వివిధ పార్టీల తరఫున ఎంపీ స్థానాల్లో పోటీకి దిగిన సినీతారల్లో కొందరిని విజయం వరించగా, మరి కొందరు అపజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. విజయం వరించిన తారలు: హేమమాలిని, శతృఘ్నసిన్హా, పరేశ్ రావల్, వినోద్ ఖన్నా, కిరణ్ఖేర్, మనోజ్ తివారీ(బీజేపీ), మూన్మూన్సేన్ (తృణమూల్), ఇన్నోసెంట్ (స్వతంత్ర). ఓడినతారలు: నగ్మా, కునాల్సింగ్, రాజ్ బబ్బర్(కాంగ్రెస్), స్మృతి ఇరానీ(బీజేపీ), జయప్రద(ఆర్ఎల్డీ), రాఖీసావంత్ (రాష్ట్రీయ ఆమ్ పార్టీ), -
వార్ వన్ సైడే!
దుమ్ము దులిపిన బీజేపీ....రాష్ట్రాలకు రాష్ట్రాలే స్వీప్ న్యూఢిల్లీ: ‘నమో’ మంత్రం రామబాణంలా పని చేసింది. ఆ దెబ్బకు గుజరాత్ (26), రాజస్థాన్ (25), ఢిల్లీ (7), ఉత్తరాఖండ్ (5), హిమాచల్ప్రదేశ్ (4), గోవా (2)... ఇలా రాష్ట్రాలకు రాష్ట్రాలే గుండుగుత్తగా బీజేపీ ఖాతాలో చేరిపోయాయి. మధ్యప్రదేశ్ (29)లోనూ రెండు మినహా అన్ని సీట్లనూ కైవసం చేసుకుంది. అంతేకాదు... జార్ఖండ్, ఛత్తీస్గఢ్, హర్యానా తదితర రాష్ట్రాల్లో అత్యధిక స్థానాలను చేజిక్కిం చుకుంది. వీటికి తోడు బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి పలు రాష్ట్రాల్లోనూ అద్భుత ఫలితాలు రాబట్టింది. ఇవన్నీ ఒక ఎత్తయితే ఉత్తరప్రదేశ్లో ఒక్క దాంట్లోనే బీజేపీ సృష్టించిన ప్రభంజనం ఒక్కటీ ఒకెత్తు! రాష్ట్రంలోని 80 లోక్సభ స్థానాలకు గాను ఏకంగా 73 చోట్ల కాషాయ జెండా రెపరెపలాడిందంటే బీజేపీ ఎంతటి ఏకపక్ష విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. అస్సాం వంటి కాంగ్రెస్ కంచుకోటలనూ బద్దలు కొట్టింది. జమ్మూ కాశ్మీర్తో పాటు తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనూ పాగా వేసింది. మోడీ గాలిలో కాంగ్రెస్ అక్షరాలా కొట్టుకుపోయింది. అన్ని రాష్ట్రాల్లోనూ అత్తెసరు సీట్లతో కుదేలైంది... గుజరాత్ మోడీ నామ జపంతో గుజరాత్ ఊగిపోయింది. రాష్ట్రంలోని మొత్తం 26 లోక్సభ సీట్లూ బీజేపీ వశమయ్యాయి. వారిలోనూ 24 మంది ఏకంగా లక్షకు పై చిలుకు మెజారిటీతో విజయబావుటా ఎగురవేయడం మరో విశేషం! రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేక చతికిలపడింది. కేంద్ర మంత్రులు దిన్షా పటేల్, తుషార్ చౌదరి, భరత్ సోలంకీ వంటివారంతా మట్టికరిచారు. ఉత్తరాఖండ్ కాంగ్రెస్ పాలిత ఉత్తరాఖండ్లో ఐదుకు ఐదు స్థానాలనూ బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. 2009లో అన్ని సీట్లనూ కాంగ్రెస్ గెలుచుకోగా, ఈసారి తాను ఆ ఫీట్ సాధించి చూపించింది. అందులోనూ నాలుగు స్థానాల్లోనైతే భారీ మెజారిటీతో విజయం సాధించింది. రాజస్థాన్ రాజస్థాన్లో మొత్తం 25 లోక్సభ స్థానాలూ బీజేపీ ఖాతాలో పడ్డాయి. అక్కడ కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోవడం 1989 తర్వాత ఇదే తొలి సారి. అప్పుడు బీజేపీ 13, జనతాదళ్ 11, సీపీఎం ఒక స్థానం గెలిచా యి. అప్పుడెప్పుడో 1977లో చౌధురీ చరణ్సింగ్ నేతృత్వంలోని భారతీయ లోక్దళ్ రాజస్థాన్లో ఏకంగా 24 సీట్లలో నెగ్గగా కాంగ్రెస్ ఒక్క స్థానం (నగౌర్)తో సరిపెట్టుకుంది. సచిన్ పైలట్, జితేంద్ర సింగ్, చంద్రేశ్ కుమారి, నమో నారాయణ్ మీనా, గిరిజా వ్యాస్ వంటి కాంగ్రెస్ కేంద్ర మంత్రులంతా మట్టికరిచారు. బీజేపీపై తిరుగుబాటు చేసి స్వతంత్రుడిగా బరిలో దిగిన జశ్వంత్సింగ్ వంటి దిగ్గజం కూడా ఏకంగా 87 వేల ఓట్ల తేడాతో ఓటమి చవిచూడటం విశేషం. ఢిల్లీ హస్తిన అధికార పీఠంతో అక్కడి లోక్సభ సీట్లన్నింటినీ కమల దళమే చేజిక్కించుకుంది. ఢిల్లీలోని మొత్తం 7 స్థానాల్లోనూ విజయ దుందుభి మోగించింది. ఐదు నెలల క్రితం ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కళ్లు చెదిరే విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి ఖాతా కూడా తెరవలేక చతికిలపడింది. కాంగ్రెస్ అభ్యర్థులంతా భారీ ఓట్ల తేడాతో మట్టికరిచారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు హర్షవర్ధన్ తదితరులు భారీ మెజారిటీతో విజయం సాధించారు. ప్రతిష్టాత్మకమైన న్యూఢిల్లీ స్థానంలో ఆప్ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి మీనాక్షీ లేఖీ 1.62 లక్షల ఓట్ల మెజారిటీతో నెగ్గారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ మూడో స్థానానికి పడిపోవడం విశేషం. కృష్ణ తీరథ్ వంటి కాంగ్రెస్కు చెందిన కేంద్ర మంత్రులంతా మట్టికరిచారు. హిమాచల్ప్రదేశ్ కాంగ్రెస్ పాలిత హిమాచల్ప్రదేశ్లోని నాలుగు లోక్సభ స్థానాలనూ బీజేపీ కైవసం చేసుకుంది. సీఎం వీరభద్రసింగ్ భార్య ప్రతిభాసింగ్ కూడా ఓటమి పాలవడం విశేషం! ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఓటమి చవిచడటం ఇదే తొలిసారి. యూటీల్లోనూ మోడీ జోరే కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ మోడీ హవాయే కన్పించింది. మొత్తం 6 స్థానాలకు గాను ఏకంగా నాలుగింటిని బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. అండమాన్ నికోబార్, దాద్రా-నగర్ హవేలీ, డామన్-దియూ, చండీగఢ్లలో మంచి మెజారిటీలతో నెగ్గింది. లక్షద్వీప్లో మాత్రం ఎన్సీపీ అభ్యర్థి మహ్మద్ ఫైజల్ తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ సిటింగ్ ఎంపీ హందుల్లా సయీద్ను ఓడించారు. ఇక పుదుచ్చేరిలో ప్రధాని కార్యాలయ సహాయ మంత్రి వి.నారాయణస్వామి తన సమీప ప్రత్యర్థి ఆర్.రాధాకృష్ణన్ (ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్) చేతిలో ఏకంగా 60,854 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు! -
ఒడిశాలో నవీన్ మేజిక్
అసెంబ్లీ ఎన్నికల్లో 115 సీట్లలో బీజేడీ విజయ దుందుభి భువనేశ్వర్: దేశమంతా ఓవైపు నరేంద్ర మోడీ హవా కొనసాగుతున్నా ఒడిశాలో మాత్రం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మ్యాజిక్ పనిచేసింది. లోక్సభ ఎన్నికలతోపాటు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సారథ్యంలోని అధికార బీజేడీ వరుసగా నాలుగోసారి అధికార పీఠాన్ని దక్కించుకొని విజయదుందుభి మోగించింది. మొత్తం 147 సీట్లకుగానూ మూడింట రెండొంతుల మెజారిటీతో 115 చోట్ల గెలుపొందింది. కాంగ్రెస్ 18, బీజేపీ 11, సమతా క్రాంతి దళ్ 1 సీటు గెలుచుకోగా రెండు చోట్ల స్వతంత్రులు గెలిచారు. అరుణాచల్ మళ్లీ కాంగ్రెస్దే ఇటానగర్: దేశవ్యాప్తంగా పేలవ ఫలితాలు కనబరిచినప్పటికీ అరుణాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకుంది. 60 సీట్లున్న అరుణాచల్ అసెంబ్లీలో 11 సీట్లు ఏకగ్రీవంకాగా మిగిలిన 49 సీట్లకు ఎన్నికలు జరిగాయి. అధికార కాంగ్రెస్ 42 సీట్లతో (ఆ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచిన 11 సీట్లతో కలుపుకొని) విజయఢంకా మోగించింది. సిక్కింలో ఎస్డీఎఫ్కే: సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో అధికార సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎస్డీఎఫ్)కే ప్రజలు పట్టం కట్టారు. మొత్తం 32 సీట్లుగల సిక్కిం అసెంబ్లీలో ఎస్డీఎఫ్ 23 సీట్లలో గెలుపొందగా సిక్కిం క్రాంతికారీ మోర్చా 9 సీట్లు గెలుచుకుంది -
నమో ఉత్తరప్రదేశ్
లక్నో: అద్భుతం. అపూర్వం. అనితరసాధ్యం. ఉత్తరప్రదేశ్లో బీజేపీ సాధించిన ఘన విజయాన్ని వర్ణించేందుకు ఇలాంటి ఎన్ని విశేషణాలు వాడినా తక్కువే. ‘హస్తినకు దగ్గరి దారి’గా చెప్పే యూపీని కమల దళం గుండుగుత్తగా కొల్లగొట్టి చరిత్రాత్మక విజయం సాధిం చింది. 80 సీట్లకు గాను ఏకంగా 73 చోట్ల విజయబావుటా ఎగురవేసి చరిత్ర సష్టించింది. అధికార సమాజ్వాదీ పార్టీ ఐదు సీట్లకు, కాంగ్రెస్ పార్టీ రెండింటికి పరిమితం కాగా బహుజన్ సమాజ్ పార్టీ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. కల్యాణ్సింగ్ జమానాలోనూ, వాజ్పేయి, అద్వానీ వంటి హేమాహేమీలతోనూ సాధ్యపడని ఘనతను నరేంద్ర మోడీ(నమో) సాధించి చూపించారు. వారణాసి నుంచి బరిలో దిగాలన్న ఆయన వ్యూహం దిగ్విజయంగా ఫలించినట్టు పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు దేశానికి తొలి దళిత ప్రధాని కావాలని కలలుగన్న బహుజన్ సమాజ్ పార్టీకి యూపీ ఓటర్లు ఎన్నటికీ మర్చిపోలేని పరాభవాన్ని మిగిల్చారు. 2009లో 20 లోక్సభ స్థానాలు గెలుచుకోవడమే గాక మరో 33 చోట్ల రెండో స్థానంలో నిలిచిన బీఎస్పీ ఈ దఫా కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి కూడా దారుణంగానే ఉంది. 2009లో 26 స్థానాలు గెలిచిన చోట ఈసారి తల్లీ కొడుకులు సోనియా, రాహుల్గాంధీ మాత్రమే గెలుపు ముఖం చూడగలిగారు!అందులోనూ రాహుల్ అయితే కేవలం లక్ష ఓట్ల మెజారిటీతో బయటపడ్డారు. -
తృణమూల్ ప్రభంజనం
కోల్కతా: మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్లో కామ్రేడ్ల కంచుకోటలను నేలమట్టం చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి పూర్తిస్థాయిలో సత్తా చాటి రాష్ట్రంలోని మొత్తం 42 లోక్సభ స్థానాల్లో 34 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రస్తుత లోక్సభలో 19 సీట్లున్న తృణమూల్ వామపక్షాల ఖాతాలోని మొత్తం 15 సీట్లనూ కొల్లగొట్టి తన బలాన్ని 34కు చేర్చింది. సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ఫ్రంట్ రాష్ట్రంలో ఈసారి గతంలో ఎన్నడూలేనంత ఘోరంగా దెబ్బతిని కాంగ్రెస్ ఖాతాలోని రెండే స్థానాల్లో(రాయ్గంజ్, ముర్షీదాబాద్) గెలిచింది. శారదా చిట్ స్కాంపై సాగిన వ్యతిరేక ప్రచారాన్ని తట్టుకుని ‘దీదీ’ పార్టీ 2011 అసెంబ్లీ ఎన్నిక ల నాటి తన చారిత్రక విజయాన్ని పునరావృతం చేసింది. తనకు పట్టున్న దక్షిణ బెంగాల్లోని 31 సీట్లలో 30 సీట్లను కొల్లగొట్టి, లెఫ్ట్ స్థావరమైన ఉత్తర బెంగాల్లోకి దూసుకుపోయి వామపక్షాలను దాదాపుగా తుడుచిపెట్టేసింది. కాగా, 2009లో ఆరు స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ ఈసారి వాటిలో నాలుగింటిని కాపాడుకోగలింది. -
మోడీకి వైట్హౌస్ స్వాగతం
ప్రపంచ నేతల నుంచి అభినందనల వెల్లువ వాషింగ్టన్/లండన్/ఇస్లామాబాద్: భారత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం నేపథ్యంలో ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి వివిధ దేశాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీని అమెరికా అభినందించింది. అమెరికా వచ్చేందుకు మోడీని స్వాగతిస్తున్నట్లు వైట్హౌస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. గుజరాత్లో 2002 నాటి అల్లర్ల నేపథ్యంలో దాదాపు పదేళ్ల కిందట అప్పటి బుష్ ప్రభుత్వం మోడీకి వీసా నిరాకరించిన దరిమిలా, అమెరికా ఆయనకు వీసా మంజూరు చేసేందుకు సానుకూలంగా స్పందించడం గమనార్హం. మోడీ నేతృత్వంలో భారత్లో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వంతో కలసి ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషి చేస్తామని వైట్హౌస్ ప్రెస్ సెక్రెటరీ జే కార్నే చెప్పారు. బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్, శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబోట్ మోడీకి ఫోన్చేసి స్వయంగా అభినందనలు తెలిపారు. తమ దేశాలకు రావాల్సిందిగా వారు మోడీని ఆహ్వానించారు. మోడీపై పదేళ్లు బహిష్కరణ విధించిన బ్రిటన్, రెండేళ్ల కిందట ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో కామెరాన్ మోడీని బ్రిటన్ రావాల్సిందిగా ఆహ్వానించడం విశేషం. మోడీని ఆహ్వానించిన తొలి యూరోపియన్ దేశం బ్రిటన్ కావడం గమనార్హం. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, విపక్ష నాయకురాలు ఖలీదా జియా కూడా మోడీకి అభినందనలు తెలిపారు. భారత్లో కొత్తగా ఏర్పడనున్న ప్రభుత్వం కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చైనా ప్రకటించింది. అమెరికాలోని భారత సంతతి ప్రజల అభినందనలు అమెరికాలోని భారత సంతతి ప్రజలు మోడీని అభినందనలతో ముంచెత్తారు. మోడీ విజయానికి సూచికగా ఇళ్లలో, ఆలయాల్లో, సామాజిక కేంద్రాల్లో మూడు రోజుల పాటు దీపాలు వెలిగించాలని ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పటేల్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అమెరికా విభాగం కూడా మోడీని అభినందించింది. అమెరికాలోని భారత సంతతి ప్రజల తరఫున, భారత మిత్రుల తరఫున యూఎస్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ మోడీకి అభినందనలు తెలిపింది. మోడీ విజయాన్ని అంతర్జాతీయ మీడియా స్వాగతించింది. -
‘మూడు’ ఆశలు గల్లంతు!
మోడీ గాలికి చతికిలబడిన కూటమిలోని పార్టీలు చావుదెబ్బతిన్న ఎస్పీ, జేడీయూ, డీఎంకే సత్తా చాటుకున్న జయ, నవీన్ పట్నాయక్ సాక్షి, న్యూఢిల్లీ: మోడీ సృష్టించిన పెనుగాలికి మూడో కూటమి ఆశలు కొట్టుకుపోయాయి. సార్వత్రిక ఎన్నికల్లో బలీయమైన శక్తిగా ఎదిగి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న కూటమిలోని పార్టీల ఆశలు గల్లంతయ్యాయి. కాంగ్రెస్, బీజేపీయేతర ప్రత్యామ్నాయం అంటూ వామపక్షాలు, ఎస్పీ, జేడీయూ తదితర 11 పార్టీలు కలసి ఈ ఏడాది ఫిబ్రవరిలో మూడో కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. కూటమిలోని సీపీఎం గతంతో పోలిస్తే సగం స్థానాలను కోల్పోయి 9కిపరిమితం కాగా, సీపీఐ ఖాతానే తెరవలేదు. ముఖ్యంగా పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ ధాటికి కమ్యూనిస్టులు చేతులెత్తేశారు. ఆర్ఎస్పీ ఒక స్థానంతో సరిపెట్టుకోగా, ఫార్వర్డ్ బ్లాక్, అస్సాం గణపరిషత్, జార్ఖండ్ వికాస్ మోర్చా విజయానికి దూరంగా ఉండిపోయాయి. డీఎంకే 18 సిట్టింగ్ స్థానాల్లో 17 చోట్ల ఓటమితో చావు దెబ్బతిన్నది. ఈ పారీ ఒకే ఒక స్థానంతో సరిపెట్టుకుంది. మూడో కూటమి ప్రధాని అభ్యర్థిగా తెరపైకి వచ్చిన ములాయం సింగ్ యాదవ్కు చెందిన ఎస్పీ కూడా 5 స్థానాల దగ్గరే ఆగిపోయింది. 2009 ఎన్నికల్లో ఈ పార్టీ 23 స్థానాలను దక్కించుకోవడం గమనార్హం. ములాయం, ఆయన కుమారుడు, యూపీ సీఎం అఖిలేశ్ చేసిన విమర్శలు మోడీ మంత్రాంగం ముందు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాయి. ప్రధాని పీఠంపై కన్నేసిన జేడీయూ నేత, బీహార్ సీఎం నితీశ్కుమార్ ఆశ కూడా అడియాశే అయింది. మోడీతో విభేదించి, బీజేపీతో దీర్ఘకాలిక మిత్ర బంధాన్ని కాలదన్ని ఒంటరి పోరుకు వెళ్లిన జేడీయూ బీహార్లో రెండే స్థానాలకు పరిమితం అయింది. 2009 ఎన్నికల్లో ఈ పార్టీకి 20 ఎంపీ సీట్లు లభించాయి. బీజేపీతో దూరం అయినందుకు జేడీయూ మూల్యాన్ని చెల్లించుకుంది. కూటమిలోని అన్నాడీఎంకే, బీజేడీ మాత్రమే చక్కటి విజయాలను నమోదు చేశాయి. ప్రధాని పదవిని ఆశించిన జయలలితకు తమిళనాడులో ఓటర్లు ఘన విజయాన్ని అందించారు. 2009 ఎన్నికల్లో మొత్తం 40 సీట్లకు కేవలం 9 సీట్లకే పరిమితమైన జయ... ఈ ఎన్నికల్లో 37 ఎంపీ సీట్లు రాబట్టుకున్నారు. ఒడిశాలో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ మొత్తం 21 స్థానాలకు గానూ 17 ఎంపీ స్థానాలను రాబట్టుకుంది. ఇక మూడో కూటమిలో చేరాలనుకున్న పార్టీల్లో బీఎస్పీ గత ఎన్నికల్లో 21 స్థానాలతో అగ్రస్థానంలో ఉండగా... ఈ సారి మోడీ హవాతో ఒక్క స్థానంలోనూ విజయం దక్కించుకోలేకపోయింది. టీఆర్ఎస్ మాత్రమే చెప్పుకోతగినన్ని స్థానాలను గెలుచుకుంది. -
భన్వర్లాల్పై ఫిర్యాదు చేస్తాం
టీడీపీ ఎంపీ సి.ఎం. రమేశ్ వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్లాల్ సార్వత్రిక ఎన్నికలను నిజారుుతీగా నిర్వహించలేదని టీడీపీ పార్లమెంటు సభ్యుడు సీఎం రమేశ్ ధ్వజమెత్తారు. ఆయనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీలోని తన నివాసంలో రమేశ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రాత్రింబవళ్లు కష్టపడాల్సింది పోయి భన్వర్లాల్ మధ్యాహ్నం ఒంటిగంటకు కార్యాలయానికి వచ్చేవారని ఆరోపించారు. మీడియా సమావేశాలు నిర్వహించడం మినహా ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా ఇద్దరు ఐపీఎస్ అధికారులపై కొందరు ఫ్యాక్షన్ నాయకులు దాడులు చేసినా పోలీసులు చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. దీనిపై దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు. సీమాంధ్రలో టీడీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించిన ఓటర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
ఏటిసేస్తాం.. పోనాది!
పీసీసీ మాజీ చీఫ్ బొత్స ఓటమి చీపురుపల్లి, న్యూస్లైన్: రాష్ట్రంలో రాజకీయ చతురతకు దర్పణంగా నిలిచి, విజయనగరం జిల్లాను తన కన్నుసన్నల్లో పెట్టుకుని పదేళ్ల పాటు ఇటు జిల్లా, అటు రాష్ట్రంలో చక్రం తిప్పిన పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తాజా ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. టీడీపీ అభ్యర్థి కిమిడి మృణాళిని చేతిలో 20 వేల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. తన కుటుంబంలోనే 3 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ పదవిని పెట్టుకుని జిల్లాను శాసించిన బొత్సకు ఈసారి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవకపోవడంతో ఆయన ప్రతిష్ట పూర్తిగా మసకబారిపోయింది. పీసీసీ అధ్యక్షుడిగా, పదేళ్ల పాటు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన కేవలం పదిహేను రోజుల్లో టికెట్టు సంపాదించుకుని టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన కిమిడి మృణాళిని చేతిలో ఓటమి పాలయ్యారు. నియోజకవర్గంలో ఆది నుంచి ప్రతికూల పవనాలు వీస్తున్నప్పటికీ బొత్సతో పాటు ఆయన మేనల్లుడు చిన్న శ్రీను సైతం విజయం కోసం రేయింబవళ్లు శ్రమించారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. ప్రధానంగా చీపురు పల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. -
కంగు తిన్న కేంద్రమంత్రులు
* సీమాంధ్రలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులంతా ఓటమిపాలు *ఓడిపోయిన వారిలో పలువురు కేంద్ర మంత్రులు, సిట్టింగ్ ఎంపీలు *ఒక్క స్థానంలోనూ గెలవని కాంగ్రెస్ సాక్షి, హైదరాబాద్: రెండుసార్లు కాంగ్రెస్ను కేంద్రంలో అధికారంలోకి తెచ్చిన సీమాంధ్ర ప్రజలు ఈసారి ఆ పార్టీని పూర్తిగా తిరస్కరించారు. రాష్ట్ర విభజన, కేంద్ర అప్రజాస్వామిక విధానాలతో ఆ పార్టీ తీవ్ర ప్రజావ్యతిరేకతను చవిచూసింది. సీమాంధ్రలోని 25 లోక్సభ స్థానాల్లో ఒక్కటి కూడా ఆ పార్టీ గెలుచుకోలేకపోయింది. కనీసం ఒక్క నియోజకవర్గంలో కూడా గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఇక్కడ పోటీ చేసిన కేంద్ర మంత్రులు సహా సిట్టింగ్ ఎంపీలంతా ఘోర పరాజయం పాలయ్యారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి 2004లో 22 స్థానాలు, 2009లో 21 స్థానాలను ప్రజలందించారు. ఇక్కడి మెజార్టీతోనే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ రెండుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అలాంటి ప్రాంతంలో ఈ సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీ కనీస పోటీలో కూడా కనిపించకుండా పోయింది. కేంద్ర మంత్రులు కిల్లి కృపారాణి, వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్, ఎం.ఎం.పళ్లంరాజు, పనబాక లక్ష్మి, కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి ఓటమిపాలయ్యారు. మరో కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ఇటీవలే కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన దగ్గుబాటి పురందేశ్వరి కూడా కడప జిల్లా రాజంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మిగతా ఎంపీలలో విజయనగరంలో బొత్స ఝాన్సీ, నర్సాపురంలో కనుమూరి బాపిరాజు, తిరుపతిలో చింతామోహన్ ఓటమిపాలయ్యారు. కేంద్ర మాజీ మంత్రి ఎ.సాయిప్రతాప్ను కాంగ్రెస్ నుంచి బహిష్కరించినా నామినేషన్లకు ముందు తిరిగి పార్టీలోకి రప్పించి హస్తం గుర్తుపై పోటీచేయించారు. ఆయన కూడా ఓటమిచెందారు. పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోనిల్చిన కొత్త అభ్యర్థుల పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. బొలిశెట్టి సత్యనారాయణ (విశాఖ), తోట విజయలక్ష్మి (అనకాపల్లి), బుచ్చి మహేశ్వరరావు (అమలాపురం), ముసునూరు నాగేశ్వరరావు (ఏలూరు), శిష్ట్లా రమేష్ (మచిలీపట్నం), దేవినేని అవినాష్ (విజయవాడ), వహీద్ (గుంటూరు), దర్శి పవన్కుమార్ (ఒంగోలు), కొండపల్లి వెంకటేశ్వర్లు (గుంటూరు), వాకాటి నారాయణరెడ్డి (నెల్లూరు), బీవై రామయ్య (నంద్యాల), పీవీ అనిల్చౌదరి (అనంతపురం), చిన్న వెంకట్రాముడు (హిందూపురం), వి.అజయ్కుమార్ (కడప), బి.రాజగోపాల్ (చిత్తూరు)లు ఘోరంగా పరాజయం పాలయ్యారు. పరిటాల రవి అనుచ రుడు, చిన్నవెంకట్రాముడిని హిందూపురం ఎంపీ అభ్యర్థిగా తెచ్చుకుంటే పెనుకొండలో తనకూ కలసి వస్తుందని ఆశించిన పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆశ ఫలించలేదు. అటు ఎంపీ, ఇటు ఎమ్మెల్యే రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ ఓడిపోయింది. -
చంద్రబాబు, కేసీఆర్లకు భద్రత పెంపు
* సమీక్షించిన ఐఎస్డబ్ల్యూ,సిటీ పోలీసులు * అధినేతలకు డీజీపీ,అదనపు డీజీపీ శుభాకాంక్షలు సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ, తెలంగాణలో టీఆర్ఎస్ విజయం సాధించడంతో రెండు పార్టీల అధ్యక్షులు, ముఖ్యమంత్రి అభ్యర్థులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ల భద్రతను పోలీసు విభాగం సమీక్షించింది. రాష్ట్ర నిఘా విభాగం అధీనంలోని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్డబ్ల్యూ), హైదరాబాద్ పోలీసులు సంయుక్తంగా ఇద్దరినీ కలసి మాట్లాడారు. వారికి కల్పిస్తున్న భద్రతను శుక్రవారం పెంచారు. ప్రస్తుతం చంద్రబాబు ‘జెడ్ +’ కేటరిగీలో ఉండటంతో పాటు అదనంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ) భద్రత కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే తాత్కాలికంగా అదనపు సిబ్బందిని కేటాయించారు. ‘జెడ్’ కేటగిరీలో ఉన్న కేసీఆర్కు ప్రస్తుతం ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి భద్రతాధికారిగా ఉన్నారు. ఈ స్థానంలో డీఎస్పీ ర్యాంక్ అధికారితో పాటు అదనంగా ఇద్దరు ఇన్స్పెక్టర్లను కేటాయించారు. ప్రస్తుతం ఉన్న ఎస్కార్టు వాహనాలకు అదనంగా మరొకటి చేర్చారు. ఇటు చంద్రబాబు, అటు కేసీఆర్ నివాసాలు, పార్టీ కార్యాలయాల వద్ద ప్రత్యేక పోలీసు పికెట్ల ఏర్పాటు చేయడంతో పాటు వాటిలో సాయుధుల సంఖ్యను పెంచారు. వీరిద్దరూ ప్రమాణ స్వీకారం చేసిన తరవాత మరోసారి భద్రతను పూర్తిస్థాయిలో సమీక్షించనున్నారు. డీజీపీ డాక్టర్ బయ్యారపు ప్రసాదరావు, అదనపు డీజీపీ (శాంతిభద్రతలు) వీఎస్కే కౌముది, అదనపు డీజీ (ఇంటెలిజెన్స్) ఎం.మహేందర్రెడ్డి శుక్రవారం రాత్రి టీడీపీ, టీఆర్ఎస్ పార్టీ అధినేతలను కలసి శుభాకాంక్షలు తెలిపారు. సీమాంధ్ర పోలీసు అధికారుల సంఘం కూడా శుక్రవారం చంద్రబాబును మర్యాద పూర్వకంగా ఆయన నివాసంలో కలిసింది. సంఘం అధ్యక్షుడు జె.శ్రీనివాసరావు నేతృత్వంలో కార్యవర్గ సభ్యులు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. -
మట్టి కరిచిన దిగ్గజాలు
కాంగ్రెస్కు ఊహించని ఎదురుదెబ్బ * పరాజితుల్లో డీఎస్, పొన్నాల, దామోదరతోపాటు ముగ్గురు కేంద్ర మంత్రులు *ఇతర పార్టీల్లోని ముఖ్య నేతలకూ *షాక్ ఇచ్చిన ఓటర్లు సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్కు చెందిన దిగ్గజ నేతలు ఎన్నికల్లో మట్టికరిచారు. ముఖ్యమంత్రి అభ్యర్థులతో పాటు ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు, ప్రచార కమిటీ చైర్మన్, పార్టీ మాజీ అధ్యక్షుడు, మంత్రుల వంటి పలువురు ఓడిన వారిలో ఉన్నారు. టీఆర్ఎస్ దెబ్బకు హేమాహేమీలు సైతం కొట్టుకుపోయారు. జిల్లాలకు జిల్లాలు ఖాళీ అయ్యాయి. అధికారంలోకి రాకున్నా... మెజారిటీ దగ్గరలోకి వస్తామని భావించిన కాంగ్రెస్కు ఊహించని దెబ్బ తగిలింది. పరాజయంపాలైనవారిలో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, కేంద్ర మంత్రులు జైపాల్రెడ్డి, బలరాం నాయక్, సర్వే సత్యనారాయణలతోపాటు పార్టీ సీనియర్ నేతలు మర్రి శశిధర్రెడ్డి, విజయశాంతి, సురేష్రెడ్డి, జగ్గారెడ్డి, జయసుధ, ముఖేష్గౌడ్, గండ్ర వెంకటరమణారెడ్డి, శ్రీధర్బాబు, వి.హనుమంతరావు, సుదర్శన్రెడ్డి, దానం నాగేందర్, ప్రసాద్కుమార్, షబ్బీర్ అలీ, సునీతా లక్ష్మారెడ్డిలతో పాటు పార్లమెంట్ కు పోటీ చేసిన జైపాల్రెడ్డి, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, రాజగోపాల్రెడ్డి, అంజన్కుమార్ యాదవ్లు ఉన్నారు. ఇతర పార్టీల్లో కూడా.. ఇతర పార్టీల్లో కూడా కొందరు ప్రముఖులు ఓటమిపాలయ్యారు. ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వస్తున్న పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్రెడ్డి ఈసారి ఓడిపోయారు. తెలంగాణలో టీఆర్ఎస్ గాలి వీస్తుంటే.. ఇక్కడ మాత్రం ఆయన పరాజయం చవిచూశారు. అలాగే ఆదిలాబాద్ జిల్లాలోని ముధోల్ నుంచి పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి వేణుగోపాలాచారి కూడా ఓట మిని చవిచూశారు. టీఆర్ఎస్ తరఫున నాగర్కర్నూలు పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన మందా జగన్నాధం కూడా ఓటమిపాలయ్యారు. టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిన ప్రముఖుల్లో తుమ్మల నాగేశ్వరరావు, మోత్కుపల్లి నర్సింహులు, ఎల్.రమణ, రేవూరి ప్రకాశ్రెడ్డి, రావుల చంద్రశేఖరరెడ్డి ఉన్నారు. బీజేపీ నుంచి కూడా సీహెచ్ విద్యాసాగర్రావు, బద్దం బాల్రెడ్డి, నల్లు ఇంద్రసేనారెడ్డి వంటివారు ఓటమి చవిచూశారు. ఓటమి ఎరుగని నేతగా పేరు తెచ్చుకున్న నాగం జనార్దన్రెడ్డికి కూడా ఈసారి భంగపాటు తప్పలేదు. నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానాన్ని వదిలి పెట్టి బీజేపీ నుంచి మహబూబ్నగర్ పార్లమెంట్కు పోటీ చేసి ఆయన ఓడిపోయారు. నారాయణ.. నారాయణ.. ఖమ్మం లోక్సభకు పోటీ చేసిన సీపీఐ నేత కె.నారాయణ పరాజయం పాలయ్యారు. కనీసం రెండో స్థానం కాకుండా మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. పోలింగ్ ముగిసిన ఆయన సీపీఎంపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఒకే ఒక్కడు.. వరంగల్ జిల్లా నర్సంపేట నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా రంగంలోకి దిగిన దొంతు మాధవరెడ్డి విజయదుందుభి మోగించారు. తెలంగాణలో స్వతంత్య్ర అభ్యర్థిగా గెలిచింది ఆయన ఒక్కరే కావడం విశేషం. కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చి తిరిగి రద్దు చేయడంతో మాధవరెడ్డి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేశారు. సుమారు 19 వేల మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి కత్తి వెంకటస్వామి ఇక్కడ నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. నోటాకు ఓటు.. సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా ప్రవేశపెట్టిన నోటాకు భారీగా ఓట్లు పడ్డాయి. ముఖ్యంగా పార్లమెంట్ స్థానంలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. భువనగిరి, నల్లగొండ, మెదక్, చేవెళ్ల, మల్కాజిగిరి, జహీరాబాద్, వరంగల్ వంటి స్థానాల్లో సుమారు 10 వేలకు పైగా ఓట్లు నోటాకు పడ్డాయి. కేసీఆర్ పోటీ చేసిన గజ్వేల్ అసెంబ్లీ స్థానంలో 1592 మంది ఓటర్లు నోటా మీట నొక్కారు. -
టీ-టీడీఎల్పీ నేత ఎవరు?
* ఆర్. కృష్ణయ్యకు సీనియార్టీ సమస్య * రేసులో తలసాని, సాయన్న * ఎర్రబెల్లి, సండ్రకు సామాజికవర్గం అడ్డంకి * నేడు బాబుతో కొత్త ఎమ్మెల్యేల సమావేశం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టీడీపీ శాసనసభాపక్ష నేత ఎవరన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ ప్రాంతంలో బీసీ నేత ఆర్. కృష్ణయ్యను పార్టీ సీఎం అభ్యర్థిగా అధ్యక్షుడు చంద్రబాబు ఎన్నికల ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ తరఫున ఎల్బీనగర్ నుంచి పోటీ చేసిన కృష్ణయ్యతో పాటు 15 మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా నెగ్గారు. వీరంతా కలిసి రేపో మాపో శాసనసభాపక్ష నేతను ఎన్నుకోవాల్సి ఉం టుంది. నిజానికి పార్టీ సీఎం అభ్యర్థిగా చంద్రబాబు అత్యంత ప్రాధాన్యతనిచ్చిన ఆర్. కృష్ణయ్యనే టీడీఎల్పీ నాయకుడిని చేయాలి. అయితే ఎన్నికల ముందే పార్టీలో చేరి, తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆర్. కృష్ణయ్యను ఇప్పుడు శాసనసభలో తమ నేతగా అంగీకరించేందుకు తాజాగా ఎమ్మెల్యేలైన సీనియర్ నేతలు సిద్ధంగా లేరు. కొత్తగా గెలిచిన తెలంగాణ ఎమ్మెల్యేలు శనివారం చంద్రబాబుతో సమావేశమయ్యే అవకాశముంది. చంద్రబాబు ఎవరి పేరు చెబితే ఆయన్నే టీ-టీడీఎల్పీ నేతగా ఎన్నుకునే అవకాశమున్నప్పటికీ సీనియర్లు మాత్రం తమ అభిప్రాయాలను అధినేతకు చెప్పనున్నట్లు సమాచారం. బీసీ నేతనే టీడీఎల్పీ నేతగా ఎన్నుకోవాలని భావిస్తే సనత్నగర్ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్యాదవ్ ముందు వరుసలో నిలిచే అవకాశముంది. ఆయనకు ఇది నాలుగో విజయం. అలాగే కంటోన్మెంట్ నుంచి నాలుగోసారి గెలిచిన సాయన్న కూడా అర్హుడే. విద్యావంతుడైన సాయన్న గతంలో టీడీఎల్పీ కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి కూడా దక్కలేదు. ఎస్పీ వర్గానికి చెందిన ఆయనకు అవకాశమిస్తే సామాజిక సమతుల్యత విషయంలోనూ ఇబ్బం దులు ఉండవు. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర పోటీలోనూ పాలకుర్తి నుంచి విజయం సాధించగా, సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్య గెలుపొందారు. అయితే వారి సామాజికవర్గమే వారికి అడ్డంకి కావచ్చు. -
ఉత్తర తెలంగాణలో ఉత్తిదే
ఐదు జిల్లాల్లో కానరాని టీడీపీ ... 72చోట్ల పోటీ.. 15సీట్లతో సరి * పనిచేయని బీసీ సీఎం నినాదం * నల్లగొండలో జీరో..ఖమ్మంలో గెలిచింది ఒక్కటే * తెలంగాణ వ్యతిరేక పార్టీగా తిరస్కరించిన జనం * టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణకు మూడో స్థానం * ఓడిన తుమ్మల, మోత్కుపల్లి, రేవూరి, రావుల తదితరులు సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీని తెలంగాణ ప్రజానీకం తిరస్కరించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చివరి వరకు అడ్డుకున్నారన్న కోపంతో చంద్రబాబునాయుడు పార్టీని ఇక్కడి ఓటర్లు ఓడించారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చింది తామేనని టీడీపీ అభ్యర్థులు చెప్పుకున్నా, వారి మాటలను ఓటర్లు నమ్మలేదు. బీజేపీ పొత్తుతో తెలంగాణలోని 72 సీట్లలో పోటీచే సిన టీడీపీ కేవలం 15 సీట్లలోనే గెలుపొందింది. 9 లోక్సభ సీట్లకు పోటీ చేసిన ఆ పార్టీ కేవలం మల్కాజిగిరిలోనే పోటీ ఇవ్వగలిగింది. గత లోక్సభలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్య వహించిన రమేష్ రాథోడ్ (ఆదిలాబాద్), నామా నాగేశ్వర్రావు (ఖమ్మం)పరాజయం పాలయ్యారు. రమేష్ రాథోడ్ మూడో స్థానంలో నిలవగా, నామా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి గట్టిపోటీ ఇచ్చినా, చివరికి ఓడిపోయారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సీమాంధ్ర సెటిలర్ల ఓట్లు, మోడీ ప్రభావంతో 10అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న ఆ పార్టీ మిగతా జిల్లాలన్నీ కలిపి ఐదు సీట్లకే పరిమితమైంది. తెలంగాణలోని సగం జిల్లాల్లో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. మహబూబ్నగర్, వరంగల్ జిల్లాల్లో రెండేసి సీట్ల చొప్పున గెలుచుకున్న టీడీపీ.. ఖమ్మంలో సత్తుపల్లిలో మాత్రమే విజయం సాధించింది. అయితే ఈ ఐదు సీట్లు కూడా అభ్యర్థుల వ్యక్తిగత బలంతోనే విజయం సాధించడం గమనార్హం. గత శాసనసభలో టీడీపీ తరుపున సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్రావు (పాలకుర్తి), సండ్ర వెంకట వీరయ్య (సత్తుపల్లి), మంచిరెడ్డి కిషన్రెడ్డి (ఇబ్రహీంపట్నం), రేవంత్రెడ్డి (కొడంగ ల్), ప్రకాశ్గౌడ్ (రాజేంద్రనగర్) తెలంగాణ వాదాన్ని తట్టుకొని సొంతబలంతో మళ్లీ విజయం సాధించగలిగారు. నారాయణపేటలో ఓట్ల చీలిక టీడీపీకి అనుకూలించి విజయాన్ని అందించగా, పరకాలలో ఉప ఎన్నికల్లో ఓడిపోయిన ధర్మారెడ్డి సానుభూతితో ఈసారి విజయాన్ని అందుకున్నారు. గత ఎన్నికల్లో నల్లగొండ జిల్లా తుంగతుర్తి నుంచి విజయం సాధించి ఈసారి ఖమ్మం జిల్లా మధిరకు వలస పోయిన టీటీడీపీ ఎన్నికల కమిటీ కన్వీనర్ మోత్కుపల్లి నర్సింహులుకు అక్కడ నిరాశే ఎదురైంది. ఆయన కాంగ్రెస్ చేతిలో ఓడిపోయారు. టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ జగిత్యాలలో మూడోస్థానానికి పరిమిత మయ్యారు. టీడీపీ సీనియర్లు, గత శాసనసభలో ప్రాతినిధ్యం వహించిన తుమ్మల నాగేశ్వరరావు (ఖమ్మం), రేవూరి ప్రకాశ్రెడ్డి (నర్సంపేట), రావుల చంద్రశేఖర్ రెడ్డి (వనపర్తి), కొత్తకోట దయాకర్ రెడ్డి (మక్తల్), సీతాదయాకర్ రెడ్డి (దేవరకద్ర), సీతక్క (ములుగు), విజయ రమణారావు ( పెద్దపల్లి), ఉమా మాధవరెడ్డి (భువనగిరి) తదితరులు ఓటమి పాలయ్యారు. ఉత్తర తెలంగాణలో రెండే సీట్లు ఉత్తర తెలంగాణ ప్రాంతమైన కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, మెదక్ జిల్లాల్లోని 50కి పైగా ఉన్న సీట్లలో టీడీపీ గెలిచిన సీట్లు రెండు మాత్రమే. వరంగల్ జిల్లాలోని పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు, పరకాలలో ధర్మారెడ్డి తమకున్న వ్యక్తిగత బలంతోనే విజయం సాధించగలిగారు. వారు కూడా నెగ్గకుంటే ఉత్తర తెలంగాణలో ఆపార్టీ ప్రాతి నిధ్యమే సున్నా అయ్యేది. అలాగే జిల్లా పరిషత్, మునిసిపల్ ఎన్నికల్లో అంతో ఇంతో ప్రభావం చూపిన నల్లగొండ జిల్లాలో టీడీపీకి చోటు లభించలేదు. ఇక సీమాంధ్ర ప్రభావం ఉంటుందని టీడీపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీకి కళ్లు బైర్లు గొలిపేలా తీర్పునిచ్చింది. ఇక్కడి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వర్రావు, సిట్టింగ్ ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావులిద్దరు పట్టుపట్టి సీట్లిప్పించుకున్న అభ్యర్థులను జనం ఓడగొట్టారు. ఒక్క సత్తుపల్లిలో మాత్రమే సండ్ర వెంకటవీరయ్య తన పలుకుబడితో విజయం సాధించారు. సీమాంధ్రుల ఓట్లతోనే గ్రేటర్లో పది సీట్లు సీమాంధ్రలో అధికారం కోసం చంద్రబాబు చేసిన ప్రచారంతో ఆ ప్రాంత ప్రజలు అధికంగా ఉన్న హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో 10సీట్లను టీడీపీ గెలుచుకుంది. తెలంగాణను వ్యతిరేకించిన పార్టీగానే టీడీపీని భావించిన సెటిలర్లు రంగారెడ్డి జిల్లాలోని అర్బన్ నియోజకవర్గాల్లోని ఏడింటిని గెలిపించారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను ఎల్బీనగర్ నుంచి పోటీ చేయించి గెలిపించడం కూడా అందులో భాగమేనని చెపుతున్నారు. రంగారెడ్డి జిల్లా గ్రామప్రాంతాల్లో వికారాబాద్, మేడ్చల్, తాండూరు, చేవెళ్ల, పరిగి వంటి తెలంగాణ ప్రజల ప్రాబల్యం అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ ఓడిపోయింది. -
కేసీఆర్కు అభినందనల వెల్లువ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో తిరుగులేని ఆధిక్యతను సాధించిన సందర్భంగా టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావును వివిధ పార్టీల నేతలు, అధికారులు, ఉద్యోగసంఘాల నేతలు కలసి అభినందనలు తెలిపారు. కేసీఆర్ నివాసం, తెలంగాణభవన్ వద్ద శుక్రవారం ఉదయం నుండే కోలాహలం కనిపించింది. ఐఏఎస్ అధికారులు కృష్ణప్రసాద్, హూడా, రిటైర్డు ఐఏఎస్ అధికారులు కేసీఆర్ను కలిశారు. పోలీసు అధికారుల సంక్షేమ సంఘం నేత రాంనరసింహారెడ్డి, టీఎన్జీవో నేతలు దేవీప్రసాద్, కారెం రవీందర్ రెడ్డి, విఠల్, ఏ. పద్మాచారి,వర్కింగ్ ప్రెసెడెంట్ లచ్చిరెడ్డి, గోపాల్రెడ్డి,ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి తదితరులు అభినందనలు తెలిపారు. తెలంగాణ భవన్లో మిన్నంటిన సంబురాలు: టీఆర్ఎస్ గెలుపుతో తెలంగాణభవన్ సంబురాలతో మిన్నంటింది. తెలంగాణ భవన్లో పెద్ద టీవీస్క్రీన్ ఏర్పాటు చేశారు. ఫలితాలను ఎప్పటి కప్పుడు అందించారు. టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచినప్పుడల్లా కేరింతలు కొడుతూ తమ హర్షం వ్యక్తం చేశారు. బ్యాండు మేళాలు, పెద్ద ఎత్తున బాణాసంచా, నినాదాలు వంటివాటితో తెలంగాణ భవన్ దద్దరిల్లింది. -
సొంతంగా దిగి...సత్తా చాటారు!
గణనీయంగా ప్రభావం చూపిన స్వతంత్రులు సాక్షి, హైదరాబాద్: ఈ ఎన్నికల్లో స్వతంత్రులు గణనీయ ప్రభావాన్ని చూపారు. ఒక స్థానంలో గెలవడంతో పాటు పలు స్థానాల్లో రెండవస్థానంలో నిలిచారు. అనేక చోట్ల ప్రధాన పార్టీల అభ్యర్థుల ఓటమికి కారకుల య్యారు. వరంగల్ జిల్లా నర్సంపేట అసెంబ్లీ స్థానంలో స్వంత్రుడిగా పోటీచేసిన కాంగ్రెస్ రెబల్ దొంతి మాధవరెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిపైనే గెలిచి తన సత్తా నిరూపించుకున్నారు. పలు నియోజకవర్గాల్లో స్వతంత్రులుగా రంగంలోకి దిగి రెండవ స్థానాన్ని దక్కించుకున్న వారిలో జువ్వాడి నర్సింగరావు (కోరుట్ల), చందర్ (రామగుండం), సంకినేని వెంకటేశ్వరరావు (సూర్యాపేట), భూపాల్రెడ్డి (నల్లగొండ), స్రవంతి (మునుగోడు), జిట్టా బాలకృష్ణారెడ్డి (భువనగిరి) ఉన్నారు. కాంగ్రెస్ టికెట్లు దక్కకపోవడంతో బీఎస్పీ తరఫున బరిలో నిలిచి నిర్మల్ నుంచి ఇంద్రకరణ్రెడ్డి, సిర్పూర్ - కాగజ్నగర్ నుంచి కోణప్ప గెలిచి ప్రధానపార్టీలకు షాక్ ఇచ్చారు. -
ఇది మా వైఫల్యమే: ఉత్తమ్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘మా పార్టీ జాతీయ అధ్యక్షురాలు తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు... ఈ విషయాన్ని గడప గడపకూ తీసుకెళ్లడంలో వైఫల్యం చెందాం..’ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నో ఏళ్ల తెలంగాణ ప్రజల కల నెరవేరిన సందర్భంగా.. ఎన్నికల్లో వచ్చిన తీర్పు బాధ కలిగించిందన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా సీమాంధ్రలో పార్టీని త్యాగం చేసి తెలంగాణ ఇచ్చినా, దాన్ని తాము ప్రజల్లోకి తీసకువెళ్లలేక పోయామని భావిస్తున్నట్లు తెలిపారు. జరిగిన పొరపాట్లు, వైఫల్యాలను విశ్లేషించుకుని కాంగ్రెస్ను బలోపేతం చేయడానికి సమష్టిగా కృషి చేస్తామన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నందున కొంత వ్యతిరేకత కూడా ఉంటుందని వివరించారు. ఓటమికి తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం సమష్టి బాధ్యత వహిస్తుందని అన్నారు. -
వైఎస్సార్సీపీకి మూడు అసెంబ్లీ, ఒక ఎంపీ
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలోనూ ప్రాతినిధ్యం లభించింది. ఒక పార్లమెంట్ స్థానంతో పాటు, మూడు అసెంబ్లీ సెగ్మెంట్లను ఆ పార్టీ కైవసం చేసుకుంది. ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తన సమీప ప్రత్యర్థి నామా నాగేశ్వరరావు(టీడీపీ)పై 17వేలకు పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధిం చారు. అదే విధంగా ఖమ్మం జిల్లాలోని పినపాక, వైరా, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడింది. పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట నుంచి తాటి వెంకటేశ్వర్లు, వైరా నుంచి బానోతు మదన్లాల్లు ఘన విజయం సాధించారు. -
రాహుల్ అడుగుపెడితే అంతేనా!
సోనియా, రాహుల్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో అభ్యర్థుల ఓటమి సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ ఎన్నికల ప్రచారం చేసిన ప్రాంతంలో పార్టీ అభ్యర్థులు ఓడిపోతారనే సెంటిమెంట్ మరోసారి రుజువైంది. ప్రస్తుత ఎన్నికల్లో సోనియా, రాహుల్గాంధీలు ప్రచారం చేసిన ప్రాంతాల్లో పార్టీ అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. కరీంనగర్, చేవెళ్ల, మెదక్లోని ఆందోల్ నియోజకవర్గ పరిధిలో సోనియా ప్రచారం చేశారు. అయితే కరీంనగర్లో పార్లమెంట్తోపాటు అసెంబ్లీ స్థానంలో కూడా కాంగ్రెస్ ఓడిపోయింది. ఈ జిల్లాలో ఒక్క జగిత్యాల లోనే పార్టీ అభ్యర్థి గెలిచారు. అలాగే చేవేళ్లలో కూడా పార్లమెంట్ సభ్యుడు ఓడిపోయారు. ఆందోల్ అభ్యర్థి దామోదర సైతం పరాజయం పాలయ్యారు. ఇక రాహుల్ ప్రచారం చేసిన మహబూబ్నగర్, నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్లలో కూడా పార్టీ ఓడిపోయింది. కాగా, ప్రధాని మన్మోహన్సింగ్ ప్రచారం చేసిన భువనగిరి స్థానంలో కూడా పార్టీ అభ్యర్థి రాజగోపాలరెడ్డి పరాజయం పాలయ్యారు. -
ఇచ్చింది....అయినా పోయింది!
తెలంగాణలో కాంగ్రెస్కు ఘోర పరాభవం ‘‘తెలంగాణ తెచ్చేది, ఇచ్చేది కాంగ్రెస్సే.. ఒకవేళ తెలంగాణ రాకపోతే చచ్చేది కూడా కాంగ్రెస్సే’’- పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందే వరకు టీ-కాంగ్రెస్ నేతలు పదేపదే చెప్పిన మాటలివి. అయితే ఇప్పుడు తెలంగాణ వచ్చినా.. ఈ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ చచ్చినంత పనైంది. చేయి విరగ్గొట్టిన ప్రజలు * అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి * బిత్తరపోయిన టీ-కాంగ్ నేతలు * ఓటమికి కారణాలపై అంతర్మథనం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ ప్రభావం, సొంత పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు రాష్ర్ట విభజనకు ఆమోదించింది. ఈ దెబ్బతో సెంటిమెంట్ పండుతుందని.. కనీసం ఒక ప్రాంతంలోనైనా అధికారం దక్కుతుందని భావించింది. కానీ జరిగింది మరొకటి! ఎవరూ ఊహించని రీతిలో ఆ పార్టీని ప్రజలు కసిదీరా ఓడించారు. సూటిగా చెప్పాలంటే కాంగ్రెస్ పేరు వింటేనే జనం ఛీకొట్టిన విధంగా తీర్పును వెలువరించారు. ఏ నియోజకవర్గంలో చూసినా కాం గ్రెస్ లోక్సభ అభ్యర్థులు లక్షల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. అదే సమయంలో అసెంబ్లీ అభ్యర్థులు సైతం ఘోరంగా పరాజ యం పాలయ్యారు. ఫలితంగా 119 అసెంబ్లీ స్థానాల్లో కనాకష్టంగా రెండు పదులకే కాంగ్రెస్ పరిమితమైంది. ఇక పార్లమెంట్ విషయంలో అత్యంత హీనమైన ఫలితాలను చవిచూసింది. మొత్తం 17 ఎంపీ సీట్లకుగాను రెండింటికే పరిమితమైంది. తెలంగాణలో ఇంతటి దారుణమైన ఫలితాలు వస్తాయని ఆ పార్టీ నేతలెవరూ ఊహించలేదు. ఎన్నికల్లో హంగ్ ఏర్పడుతుం దని, పెద్ద పార్టీగా కాంగ్రెస్సే అవతరిస్తుందని అంచనా వేసిన టీ-కాంగ్ నేతలు తాజా ఫలితాలతో బిత్తరపోయారు.పార్టీ సంస్థాగత లోపాలతో పాటు ప్రభుత్వ వ్యతిరేకత వంటి పలు అంశాలు కాంగ్రెస్ ఘోర పరాజయానికి కారణమయ్యాయి. సెంటిమెంట్ ఆదుకోలేదు పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను, ఐదేళ్ల రాజకీయ సంక్షోభాన్ని తెలంగాణ సెంటిమెంట్తో అధిగమించవచ్చని భావించిన కాంగ్రెస్ను ప్రజలు ఏ మాత్రం కనికరించలేదు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ను ముంచినట్లే తెలంగా ణలోనూ ఇంచుమించు అదే స్థాయిలో తీర్పునిచ్చారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కంటే.. సాధించిన పార్టీయే మిన్న అని తమ ఓటుతో జనం స్పష్టంచేశారు. రాష్ట్రంలో ఐదేళ్ల అస్తవ్యస్థ పాలన, రాజకీయ సంక్షోభం, అధిక ధరలు.. ఇలా ఒక్కటేమిటి? కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లుగా అనేక ప్రతికూల అంశాలు కాంగ్రెస్ను చుట్టుముట్టాయి. వెరసి హస్తానికి అధికారం దూరమైంది. నాయకత్వ వైఫల్యమూ కారణమే పార్టీ ఓటమికి నాయకత్వ లేమి కూడా ప్రధాన కారణమైంది. తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత విజయోత్సవాలు జరుపుకోవడంలో, ఇదంతా తమ ఘనతేనని చెప్పుకోవడంలోనూ టీ-కాంగ్రెస్ నాయకత్వం దారుణంగా విఫలమైంది. బిల్లు ఆమోదం తర్వాత నుంచి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు తెలంగాణలో ఒక్క బహిరంగ సభను కూడా నిర్వహించలేక పోయారంటే వారి వైఫల్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికితోడు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ చాంపియన్గా దూసుకుపోతుంటే ఆయనను ఢీకొనే నాయకుడే కాంగ్రెస్లో లేకుండా పోయాడు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక కూడా పార్టీని గెలిపించే బాధ్యతను భుజాన వేసుకునేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. ఎవరికి వారే తాము గెలిస్తే చాలు, సీఎం కావచ్చుననే భావనలో సొంత నియోజకవర్గానికే పరిమితమయ్యారు. తెలంగాణవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేసిన నాయకుడు ఒక్కరూ లేకపోవడం ఆ పార్టీకి పెద్ద లోపంగా మారింది. చివరకు సీఎం రేసులో ఉన్న నాయకులు సైతం తాము గెలుస్తామో లేదోనన్న భయంతో కాంగ్రెస్ అతిరథులు సోనియా, రాహుల్ గాంధీలను తమ నియోజకవర్గానికే పిలిపించుకుని ప్రచారం చేయించుకోవడం గమనార్హం. టీ-కాంగ్రెస్ ముఖ్య నేతల్లోని అభద్రతాభావానికి ఇదే పెద్ద నిదర్శనంగా మారింది. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సైతం ఓడిపోతాననే భయం తో సినీ నటులు విజయశాంతి, జయప్రద, జయసుధలతో తన నియోజకవర్గంలో ప్రచారం చేయించడం టీ-కాంగ్రెస్ దుస్థితికి అద్దం పట్టినట్లయింది. అంతా హైకమాండే చేసింది !! పార్టీ ఘోర పరాభవానికి అధిష్టానం పెద్దలూ కారణమని చెప్పుకోవచ్చు. తెలంగాణ అంశం మొదలు పార్టీలో బాధ్యతలు అప్పగించడం, ఎన్నికల్లో ప్రచారం వరకు అన్నింట్లోనూ హైకమాండ్ పెద్దల జోక్యం ఎక్కువైంది. టీ-కాంగ్రెస్ నాయకులు, శ్రేణుల అభీష్టానికి భిన్నంగా టీపీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్యను నియమించడంతోనే ఈ ప్రాంత నేతల్లో అసంతృప్తి మొదలైంది. అభ్యర్థులకు నిధులు, ప్రచార సామగ్రి, ఎన్నికల ప్రచార సభల నిర్వహణలో హైకమాండ్ జోక్యం పెరగడంతో తెలంగాణ నాయకత్వమంతా ఎన్నికల్లో అంటీముట్టనట్లుగానే వ్యవహరించింది. అంతా వారి వల్లే! తెలంగాణ విషయంలో కీలకంగా వ్యవహరించిన హైకమాండ్ పెద్దల్లో దిగ్విజయ్సింగ్, ఏఐసీసీ ఎస్సీసెల్ చైర్మన్ కొప్పుల రాజు, కేంద్ర మంత్రి జైరాం రమేశ్ ముఖ్యులు. తెలంగాణ ప్రాంత బాధ్యతలను సోనియా గాంధీ వీరికే అప్పగించారు. పార్టీ పదవులు, అభ్యర్థుల ఎంపిక మొదలు ఎన్నికల ప్రచారం వరకు.. అన్నిం ట్లోనూ వీరి మాటకే అధినేత్రి విలువనిచ్చారు. తెలంగాణ జేఏసీ నేతలెవరూ గెలిచే పరిస్థితి లేదని కాంగ్రెస్ శ్రేణులు కోడైకూసినా దిగ్విజయ్ త్రయం వినిపించుకోలేదు. తెలంగాణలో రాజకీయంగా బలం గా ఉన్న రెడ్డి సామాజికవర్గానికి నాయకత్వం అప్పగించకూడదనే ఉద్దేశంతో ఈ ముగ్గురు నేతలు చేసిన ప్రయత్నం వికటించింది. ఎన్నికల్లో ఓడిపోయిన టీ-కాంగ్ ప్రముఖులంతా దిగ్విజయ్, జైరాం, కొప్పుల రాజు వల్లే ఈ దుస్థితి వచ్చిందని మండిపడుతున్నారు. -
కొడాలి నాని హ్యాట్రిక్ రికార్డు
'గుడివాడ ఎవడబ్బ సొత్తూ కాదు' అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొడాలి నాని నిరూపించారు. చంద్రబాబు విశ్వాస ఘాతుకాన్ని, అవకాశవాదాన్ని తూర్పారబడుతూ టీడీపీకి గుడ్బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగిన కొడాలి నాని భారీ మెజార్టీతో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రావి వెంకటేశ్వరరావుపై ...ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇప్పటికే రెండు పర్యాయాలు గెలిచిన ఆయన మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించారు. ఎన్టీఆర్ కుటుంబానికి అత్యంత ఇష్టుడిగా, జూనియర్ ఎన్టీఆర్కు మిత్రుడిగా మెలిగిన నానికి గుడివాడ నియోజకవర్గంలో మంచి పట్టుంది. కృష్ణాజిల్లా వైఎస్సార్సీపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న నాని గతం కంటే బాగా ప్రజలతో మమేకమై ముందుకు సాగడంతో గుడివాడలో హ్యాట్రిక్ రికార్డును సొంతం చేసుకున్నారు. ఇక ఓ పర్యాయం ఎమ్మెల్యే చేసిన రావి వెంకటేశ్వరరావు ఆ తర్వాత నియోజకవర్గ ప్రజలకు దూరంగానే గడిపారు. పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తల సమస్యలపై సానుకూలంగా స్పందించకపోవడంతో వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. నియోజకవర్గంలో అటు కాంగ్రెస్ బలహీనపడటం, ఇటు సైకిల్ హవా తగ్గిపోవడంతో వైఎస్సార్ సీపీ గెలుపు నల్లేరుపై నడకే అయ్యింది. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన అట్లూరి సుబ్బారావు నామమాత్రంగానే నిలిచారు. -
అందరి చూపు.. ఖమ్మం వైపు
* జిల్లాలో ఎవరు గెలుస్తారన్న దానిపై చర్చ * ప్రతిష్టాత్మకంగా పార్లమెంటు స్థానం * పొంగులేటి, నామా, నారాయణ నడుమ ఆసక్తికర పోరు సాక్షి ప్రతినిధి, ఖమ్మం : సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో తెలంగాణలో అందరి దృష్టి ఖమ్మం జిల్లా వైపు పడుతోంది. రాజకీయంగా చైతన్యం ఉన్న జిల్లా ఓటరు ఏం చేస్తాడో? తెలంగాణ గుమ్మం ఖమ్మంలో ఏ పార్టీ ప్రభంజనం ఉంటుందో అన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. తెలంగాణలోనే వైఎస్సార్సీపీ ఈ జిల్లాలో బలంగా ఉండడం, ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రచారం జరుగుతున్న టీఆర్ఎస్కు ఇక్కడ పెద్దగా బలం లేకపోవడం, అధికార కాంగ్రెస్తోపాటు తెలుగుదేశం పార్టీ, కమ్యూనిస్టులు ప్రబలంగానే ఉండడంతో ఈ జిల్లా ఫలితం ఎలా ఉంటుందోనన్నది ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న ఈ జిల్లాలో ఓటరు దేవుడు ఎలాంటి తీర్పునిస్తాడోనన్న దానిపై జోరుగా బెట్టింగ్సాగుతుండడం గమనార్హం. బలీయ శక్తిగా ఉన్న వైఎస్సార్సీపీ ఖమ్మం జిల్లాలో మొదటి నుంచీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది. జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ పార్టీకి కేడర్ ఉంది. దీంతో పాటు సర్పంచ్ ఎన్నికల నుంచి తాజాగా వెలువడిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాల వరకు తెలంగాణలోనే వైఎస్సార్సీపీ ఎక్కువ స్థానాలను ఈ జిల్లాలో గెలుచుకుంది. దీంతో వైఎస్సార్సీపీ మంచి ఫలితాలు సాధిస్తుందనే అభిప్రాయం ఇక్కడ వ్యక్తమవుతోంది. మరోవైపు కాంగ్రెస్, టీడీపీ కూడా జిల్లాలో బలంగానే ఉన్నాయి. అయితే, కాంగ్రెస్ను నడిపించే సమర్థ నాయకుడు లేకపోవడం, టీడీపీలో గ్రూపు తగాదాలు ఆయా పార్టీల విజయావకాశాలను దెబ్బతీస్తాయని రాజకీయ విశ్లేషకులంటున్నారు. ఇక కమ్యూనిస్టు పార్టీలకు మంచి పట్టు ఉన్న ఖమ్మంలో సీపీఐ కాంగ్రెస్తో, సీపీఎం వైఎస్సార్సీపీతో కలిసి పోటీచేశాయి. వైఎస్సార్సీపీ, సీపీఎం మధ్య ఎన్నికల అవగాహన కూడా బాగానే కుదిరింది. మరోవైపు ఖమ్మం ఎంపీ, మూడు అసెంబ్లీ స్థానాల్లో పోటీలో ఉన్న సీపీఐకు కాంగ్రెస్ సరిగా సహకరించలేదనే ప్రచారం కూడా జరిగింది. ఈ పార్టీల పరిస్థితి ఉంటే తెలంగాణలో మిగిలిన చోట్ల గట్టిపోటీ ఇస్తున్న టీఆర్ఎస్కు ఈ జిల్లాలో సంస్థాగతంగా బలం లేదని సర్పంచ్, మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పార్టీ నుంచి పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం ఏమిటి? ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఎలాంటి ఫలితాలు సాధిస్తుందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తెలంగాణవాదులు తమవైపే నిలిచారని టీఆర్ఎస్ ధీమాలో ఉంది. ఈ పరిస్థితుల్లో టీఆర్ఎస్ ఇక్కడ సాధించే ఫలితాలపైనే ఇక్కడ అన్ని పార్టీల దృష్టి ఉంది. ఖిల్లాపై ఎగిరేది ఏ జెండా? ముఖ్యంగా ఖమ్మం పార్లమెంటు స్థానంలో ఏ పార్టీ విజయం సాధిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎవరు విజేతగా నిలుస్తారనేది ఇప్పుడు ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణలోనే కీలకాంశంగా మారింది. రాజకీయాల్లోకి వచ్చిన తక్కువ కాలంలోనే తనదైన శైలిలో గుర్తింపు పొందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడి నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆ పార్టీ తరఫున తెలంగాణలో మొదట అభ్యర్థిగా స్వయంగా జగన్మోహన్రెడ్డే ఈయనను ప్రకటించారు. జిల్లా ప్రజలు గెలిపిస్తే కేంద్రమంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో ఖమ్మం పార్లమెంటు స్థానం ‘ఫ్యాన్’దేనని జోరుగా ప్రచారం జరిగింది. ఇక్కడి నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న డాక్టర్ కె.నారాయణ బరిలో నిలవడంతో ఈ స్థానానికి మరింత ప్రాధాన్యం లభించింది. మరోవైపు సిట్టింగ్ ఎంపీ, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావు ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా మరోసారి బరిలోకి దిగారు. ఈ ముగ్గురు ఉద్ధండుల నడుమ జరిగిన రసవత్తర పోరులో ఎవరు విజయం సాధిస్తారనేది చర్చ జరుగుతున్నా, పొంగులేటి గెలుపు ఖాయమేనని జిల్లాలో ఇప్పటికీ జోరుగా ప్రచారం సాగుతుండగా, ఆయనకు లభించే మెజార్టీపైనే చర్చలు జరుగుతున్నాయి. భట్టి, మోత్కుపల్లి, రాంరెడ్డి, వనమా భవితవ్యం ఏమిటో? జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన పలువురు నేతలు బరిలో ఉన్న నేపథ్యంలో వారి భవితవ్యంపై కూడా జోరుగా అంచనాలు సాగుతున్నాయి. ముఖ్యంగా నల్లగొండ జిల్లా నుంచి వలస వచ్చిన టీడీ పీ సీనియర్ నేత రాజకీయ భవితవ్యాన్ని జిల్లా ఓటర్లు తేల్చనున్నారు. ఆయన జిల్లాలోని మధిర నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క కూడా ఇక్కడి నుంచి కాంగ్రెస్ పక్షాన నిలబడ్డారు. వీరిద్దరికీ వైఎస్సార్సీపీ మద్దతుతో పోటీచేసిన సీపీఎం అభ్యర్థి లింగాల కమల్రాజ్ గట్టిపోటీ ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో ఆ ఇద్దరి రాజకీయ ప్రముఖుల భవిష్యత్ శుక్రవారం తేలనుంది. మాజీమంత్రులు వనమా వెంకటేశ్వరరావు, రాంరెడ్డి వెంకటరెడ్డి, టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్లిన ఊకె అబ్బయ్య, సీపీఐ నుంచి కారెక్కిన బానోతు చంద్రావతి, టీడీపీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావులాంటి నాయకులు కూడా ఎలాంటి ఫలితం సాధిస్తారో అనేది తేలడానికి మరికొద్ది సమయమే ఉంది. -
ప్రజా తీర్పు నేడే
* దేశవ్యాప్తంగా 989 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు * ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్ అసెంబ్లీల కౌంటింగ్ కూడా ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని ఏలేదెవరన్న ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. అత్యంత సుదీర్ఘంగా తొమ్మిది దశల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాతీర్పు ఏమిటో నేడే తేలనుంది. దేశ ఎన్నికల చరిత్రలో తొలిసారి రికార్డు స్థాయిలో 66.38 శాతం పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే. 543 లోక్సభ స్థానాలకు 8,251 మంది అభ్యర్థులు హోరాహోరీగా తలపడ్డారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికే అధికార పీఠం దక్కవచ్చన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. లోక్సభ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్ అసెంబ్లీల ఓట్ల లెక్కింపు కూడా ఒకేసారి జరగనుంది. ఇందుకోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య దేశవ్యాప్తంగా 989 కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరిగేలా చూసేందుకు ఎన్నికల కమిషన్ అన్ని కౌంటింగ్ టేబుళ్ల వద్ద సూక్ష్మ పరిశీలకులను నియమించింది. ఆంధ్రప్రదేశ్ -
కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత
* తొలి అంచెలో కేంద్ర సాయుధ బలగాలు * తనిఖీ చేశాకే లోపలకు అనుమతి * ప్రాంగణంలోకి వాహనాల ప్రవేశం నిషేధం * రెండు కిలోమీటర్ల పరిధిలో ప్రత్యేక గస్తీ సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం జరగనున్న కౌంటింగ్కు రాష్ట్ర పోలీసు విభాగం విసృ్తత స్థాయి భద్రత, బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది. వీటిని రాష్ట్ర డీజీపీ డాక్టర్ బయ్యారపు ప్రసాదరావు గురువారం సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్పీలు, కమిషనర్లను ఆదేశించారు. ఎలాంటి ఏమరుపాటుకు తావులేకుండా ఉన్నతాధికారి మొదలు కిందిస్థాయి సిబ్బందివరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. పోలింగ్ నేపథ్యంలో చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్న ప్రాంతాలతో పాటు ఫ్యాక్షన్ ప్రభావిత, సున్నితమైన చోట్ల ప్రత్యేక చర్యలు తీసుకుంటూ సాధారణం కంటే అదనంగా సిబ్బంది మోహరించాలని ఆదేశించారు. తొలిదశలో తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాలకు 14,213 ప్రాంతాల్లోని 26,135 పోలింగ్ స్టేషన్లలో, రెండో దశలో సీమాంధ్రలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు 42,794 ప్రాంతాల్లో ఉన్న 68,678 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. వీటి కౌంటింగ్ రాష్ట్రంలోని 168 కేంద్రాల్లో జరుగనుంది. బందోబస్తు చర్యల్లో భాగంగా పోలీసులు కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రం లోపల, అతి సమీపంలో ఉండే తొలి అంచెలో కేంద్ర సాయుధ బలగాలకు చెందిన సిబ్బంది ఉంటారు. ఈవీఎమ్లను స్ట్రాంగ్రూమ్స్ నుంచి కౌంటింగ్ హాల్కు తీసుకువచ్చే మార్గం వీరి ఆధీనంలోనే ఉంటుంది. దీంతోపాటు ఇతర బందోబస్తు, రిజర్వ్ అవసరాల కోసం 37 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలను రాష్ట్రవ్యాప్తంగా మోహరించారు. ప్రాంగణం, చుట్టుపక్కల ఉండే రెండు, మూడు అంచెల్లో ఏపీఎస్పీ సాయుధ పోలీసులు, జిల్లా సాయుధ బలగాలను మోహరిస్తున్నారు. విధుల్లో ఉండే సిబ్బంది, ఏజెంట్ల సహా కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరవాతే అనుమతించాలని పోలీసులు నిర్ణయించారు. సెల్ఫోన్లు, ల్యాప్టాప్లు, వాకీటాకీలు వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలతో పాటు మండే స్వభావమున్న వస్తువులు, రంగులు, పూలదండలు, మంచినీళ్ల బాటిళ్లు తదితరాలు కౌంటింగ్ కేంద్రంలోకి తీసుకురావడాన్ని ఎన్నికల సంఘం నిషేధించిన నేపథ్యంలో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. వీలున్న ప్రతిచోటా ప్రవేశ ద్వారాల వద్ద మెటల్డిటెక్టర్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్థానిక పరిస్థితుల ఆధారంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలతో పాటు 144వ సెక్షన్ కూడా విధిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల నుంచి ర్యాలీ తీయడం, బాణాసంచా పేల్చడం తదితరాలను నిషేధించిన నేపథ్యంలో ప్రాంగణంతో పాటు చుట్టూ రెండు కిలోమీటర్ల పరిధిలో గస్తీ కోసం ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దింపుతున్నారు. వీరు పెద్ద సంఖ్యలో ఎవరూ గుమిగూడకుండా చర్యలు తీసుకుంటారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్దా కనిష్టంగా 200 మంది పోలీసులు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. -
పార్టీ ముఖ్యులతో కేసీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్కు కీలకమైన ఈ ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని, సమీక్షించడానికి వీలుగా ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్రావు మెదక్ జిల్లాలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి గురువారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. ఫలితాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు. పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులంతా కౌంటింగ్ కేంద్రాల వద్దనే అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ సూచించారు. కె.కేశవరావు, నాయిని నర్సింహారెడ్డి, రిటైర్డు ఐఏఎస్ అధికారులు కె.వి.రమణాచారి, ఎ.కె.గోయల్, రామలక్ష్మణ్ వంటి వారిని ఉదయమే తన వద్దకు రావాలని కోరారు. -
తెలంగాణలో హంగే!
* అధికారాన్ని చేపట్టేది మేమే * తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ధీమా సాక్షి, హైదరాబాద్: మరికొద్ది గంటల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితికి మెజారిటీ స్థానాలు దక్కుతాయని సర్వే ఫలితాలు, ఎగ్టిట్పోల్స్ చెబుతుండగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం కొత్త రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీ కాంగ్రెస్సేనని ధీమాతో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సోనియాగాంధీకి ప్రజలు ఓట్ల ద్వారా కృతజ్ఞత తెలిపారని చెబుతున్నారు. ఎగ్జిట్పోల్స్, సర్వే నివేదికలను ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదని, గత ఎన్నికల్లో వెల్లడైన ఎగ్జిట్పోల్స్ ఇందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మొదలు తెలంగాణ ముఖ్యమంత్రి రేసులో ఉన్న ప్రముఖులంతా అధికారం తమదేననే ఆశల్లో ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్తోపాటు మరే ఇతర పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశమే లేదని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. హంగ్ ఏర్పడినా 45 నుంచి 50 స్థానాలు దక్కించుకుని అతిపెద్ద పార్టీగా అవతరించేది కాంగ్రెస్సేననే ధీమాతో ఉన్నారు. తమకు గట్టి పోటీదారుగా ఉన్న టీఆర్ఎస్ 35 నుంచి 45 స్థానాలకే పరిమితం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్ఎస్కు స్పష్టమైన అవకాశం ఉండదని బల్లగుద్ది చెబుతున్నారు. మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్కు మరింత మెరుగైన ఫలితాలు రావడం ఖాయమని భావిస్తున్నారు. ఎన్నికల ఫలితాల తరువాత మజ్లిస్, సీపీఐలు కాంగ్రెస్కే మద్దతిచ్చేందుకు అంతర్గత ఒప్పందం జరిగిందని కూడా చెబుతున్నారు. ఒకవేళ తమ అంచనాలు తప్పి టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా అవతరించినా ఆ రెండు పార్టీలు టీఆర్ఎస్కు మద్దతిచ్చే అవకాశం ఎంతమాత్రమూ లేదని అభిప్రాయపడుతున్నారు. సీపీఐ, మజ్లిస్ పార్టీలు కాంగ్రెస్కు మద్దతిచ్చినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మరికొన్ని సీట్లు అవసరమైతే ఇతర రాజకీయ పార్టీల సహకారాన్ని కోరేందుకూ వెనుకాడబోమన్నారు. కేసీఆర్ జాతకాలు చెప్పుకోవాల్సిందే: దానం టీఆర్ఎస్ అధికారంలోకి రావడం అసాధ్యమని మాజీ మంత్రి దానం నాగేందర్ వ్యాఖ్యానించారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇక జాతకాలు చెప్పుకుంటూ తిరగాల్సిందేనని ఎద్దేవా చేశారు. గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘టీఆర్ఎస్ అధికారంలోకి వస్తదని కేసీఆర్ కలగంటున్నడు. కేబినెట్ జాబితా కూడా రడీ చేసుకుంటున్నడట. ఆయనకు అంత సీన్ లేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది కాంగ్రెసే’’అని పేర్కొన్నారు. -
లగడపాటి సర్వే వట్టిదే..
* వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు * ఆయన ఎలాంటి సర్వే చేరుుంచలేదు.. * టీడీపీ, కాంగ్రెస్ నేతలు * ఆయనతో అలా చెప్పించారు * జగన్ వెంటే జనం.. * జగన్ సీఎం కావడం ఖాయం సాక్షి, గుంటూరు: సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ సరళిపై లగడపాటి రాజగోపాల్ ఎలాంటి సర్వే చేయించలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఆయన ప్రతిసారీ ఒక ఏజెన్సీతో సర్వే చేయించేవారని, కానీ ఈసారి మాత్రం ఆయన అసలు సర్వే చేయించలేదని తెలిపారు. తాను చెప్పేది అవాస్తవమైతే లగడపాటి వెంటనే స్పందించాలని అంబటి సవాల్ చేశారు. గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఉన్న కక్షతో, జగన్ సీమాంధ్రకు ముఖ్యమంత్రి కాకూడదనే దుగ్ధతో టీడీపీ, కాంగ్రెస్ నాయకులు లగడపాటిని మేనేజ్ చేసి ఆయనతో ఆ విధంగా చెప్పించారని మండిపడ్డారు. లగడపాటి నిజంగా సర్వే చేయించి ఉంటే వైఎస్సార్సీపీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయి, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు ఎంత శాతం చొప్పున ఓట్లు వచ్చారుు అనే విషయాలు ఎందుకు చెప్పలేదని అంబటి నిలదీశారు. ఇవేవీ చెప్పకుండా టీడీపీకి అన్ని స్థానాలు వస్తాయి, ఇన్ని స్థానాలు వస్తాయంటూ లగడపాటి తన మనస్సులోని కోరికను ప్రజలపై రుద్దాలని చూస్తున్నారని విమర్శించారు. నిన్న, మొన్న వెలువడిన మున్సిపల్, జెడ్పీ, మండల పరిషత్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి వైఎస్సార్సీపీ కంటే అత్యధిక సీట్లు వచ్చాయి కానీ, అత్యధిక ఓట్లు మాత్రం రాలేదని ఆయన స్పష్టం చేశారు. అరుునప్పటికీ ఆ ఫలితాలను చూపుతూ కొందరు వైఎస్సార్సీపీ ఓడిపోతుందని, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతున్నాడంటూ ఊదర గొడుతున్నారని, కానీ అది ఎట్టి పరిస్థితుల్లో జరగదని తేల్చి చెప్పారు. మున్సిపల్, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు ముగిసిన నెలరోజుల తర్వాత సార్వత్రిక ఎన్నికలు జరిగాయని, ఈ నెల రోజుల్లో అనేకమైన రాజకీయ మార్పులు, పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో ప్రజలు జగన్ను చూసో, చంద్రబాబును చూసో ఓట్లు వేయలేదని, స్థానిక వ్యక్తులకు, అక్కడి సమస్యలకు ప్రాధాన్యం ఇచ్చి ఓట్లు వేశారని వివరించారు. ఈనెల 7వ తేదీన జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం.. ఈ రాష్ట్రానికి జగన్ సీఎం కావాలో, లేక చంద్రబాబు సీఎం కావాలో ఆలోచించుకుని మరీ ఓటర్లు ఈవీఎం బటన్ నొక్కారని తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజలు స్పష్టంగా వైఎస్సార్సీపీ వైపే మొగ్గు చూపారని అంబటి వెల్లడించారు. ఇదే విషయాన్ని నీల్సన్ మార్గ్ సర్వే కూడా వెల్లడించిందని, గతంలో ఈ సంస్థ చేసిన అనేక సర్వేలు నూటికి నూరు శాతం నిజం అయ్యూయని ఆయన చెప్పారు. శుక్రవారం వెలువడే ఫలితాల్లో వైఎస్సార్సీపీ 110 అసెంబ్లీ సీట్లు, 20కి పైగా పార్లమెంటు సీట్లు గెలుచుకోబోతుందని, సీమాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన తెలిపారు. ఇతర అనేక సర్వేలు కూడా సీమాంధ్ర తొలి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డేనని స్పష్టం చేస్తున్నాయన్నారు. అరుుతే చంద్రబాబు, టీడీపీ నాయకులు ఉత్సాహంగా ఉన్నట్లు నటిస్తున్నారని, వారి ఉత్సాహంపై శుక్రవారం వెలువడే ఫలితాలు నీళ్ళు చల్లనున్నాయని అంబటి చెప్పారు. లగడపాటి సర్వేను చూసి కొంతమంది అమాయకులు చట్ట వ్యతిరేకంగా పందేలు కాస్తున్నారని, వారు నష్టపోయే ప్రతి పైసాకు లగడపాటే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆ సర్వేను నమ్మి మోసపోవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
కొద్ది గంటల్లో ఓటరు తీర్పు
* తేలనున్న నేతలు, పార్టీల భవిష్యత్తు * నేటి ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభం * 8.30 గంటల నుంచి ఈవీఎంల్లోని ఓట్ల కౌంటింగ్.. 11 గంటలకల్లా ట్రెండ్స్! * అత్యధికంగా 45 రౌండ్లలో మల్కాజిగిరి లోక్సభ, కూకట్పల్లి అసెంబ్లీ ఓట్ల లెక్కింపు * అతి తక్కువగా అనకాపల్లి లోక్సభకు 18 రౌండ్లు, చార్మినార్ అసెంబ్లీకి 13 రౌండ్లు * 17వ తేదీ ఉదయం 10 గంటల వరకు మద్యం విక్రయాలపై నిషేధం * లెక్కింపు కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు నిషేధం సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. తీవ్ర ఉత్కంఠ రేపుతున్న లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం ఉదయం ప్రారంభం కానుంది. తొలుత ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత 8.30 గంటల నుంచి ఈవీఎంలలోని ఓట్లను లెక్కించడం ప్రారంభిస్తారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) వినియోగం కారణంగా.. ఈ ప్రక్రియ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. తెలంగాణలో ఏప్రిల్ 30వ తేదీన, సీమాంధ్రలో ఈ నెల 7వ తేదీన పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. కాగా 4.82 కోట్ల మంది ఓటర్లు ఇచ్చిన తీర్పు శుక్రవారం వెలువడనుంది. రాష్ట్రంలోని 42 లోక్సభ స్థానాలకు 598 మంది పోటీ పడగా, 294 అసెంబ్లీ స్థానాలకు 3,910 మంది పోటీ పడ్డారు. ఉదయం 11 గంటలకల్లా తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో ఏ పార్టీలు అధికారంలోకి రానున్నాయో (ట్రెండ్స్) తెలిసిపోయే అవకాశం ఉంది. కౌంటింగ్కు 25 వేల మంది సిబ్బంది రాష్ట్రంలోని 78 ప్రాంతాల్లో 168 కేంద్రాల్లోని 437 హాళ్లలో ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్ తెలిపారు. ఉదయం 8 గంటల కల్లా అభ్యర్థుల ఏజెంట్లందరూ కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను గురువారం భన్వర్లాల్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 437 కౌంటింగ్ హాళ్లలో 6,955 టేబుళ్లను ఏర్పాటు చేశామన్నారు. ఓట్ల లెక్కింపునకు మొత్తం 25,000 మందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భద్రత నిమిత్తం 75,000 మంది పోలీసులను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఒక కౌంటింగ్ టేబుల్కు ఒకరు చొప్పున సూక్ష్మ పరిశీలకుడిని నియమించడంతో పాటు ప్రతి కేంద్రంలోను అదనపు సూక్ష్మ పరిశీలకులను నియమిస్తున్నట్లు చెప్పారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ 189 మంది పరిశీలకులను నియమించిందన్నారు. ఈవీఎంలన్నీ భద్రం ఈవీఎంలన్నీ స్ట్రాంగ్ రూమ్లలో భద్రంగా ఉన్నాయని, ఎవరూ ఈవీఎంల దగ్గరకు వెళ్లలేదని, ఎవరూ ఈవీఎంలను ఇళ్లకు తీసుకువెళ్లలేదని భన్వర్లాల్ స్పష్టం చేశారు. ప్రింటర్ ఆర్గనైజర్ డిస్ప్లేను భద్రపరచడంలో అలసత్వంగా వ్యవహరించిన అధికారులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద ప్రజలకు ఫలితం తెలియజేసేందుకు తెరలను ఏర్పాటు చేశారు. అతి పెద్ద లోక్సభ స్థానం అయిన మల్కాజిగిరి ఓట్లను అత్యధికంగా 45 రౌండ్లలో లెక్కిస్తారు. అనకాపల్లి లోక్సభ స్థానం కౌంటింగ్ 18 రౌండ్లలోనే పూర్తి కానుంది. అలాగే కూకట్పల్లి అసెంబ్లీ ఓట్లను కూడా అత్యధికంగా 45 రౌండ్లలో లెక్కించనున్నారు. చార్మినార్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు మాత్రం 13 రౌండ్లలోనే పూర్తి కానుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాత ఎన్నికల సిబ్బంది ‘బ్యాలెట్ యూనిట్’లను ఆన్ చేస్తారు. ప్రతిరౌండ్ లెక్కింపు తర్వాత ప్రింట్అవుట్ను అభ్యర్థుల తరఫు ఏజెంట్లకు అందజేస్తారు. ఫలితాలను ఠీఠీఠీ.ఛిౌ్ఛ్చఛీజిట్చ.జీఛి.జీ వెబ్సైట్లో చూడవచ్చు. గురువారం అర్ధరాత్రి నుంచి 17వ తేదీ ఉదయం వరకు రాష్ట్రంలో మద్యం విక్రయాలను నిషేధించారు. అలాగే కౌంటింగ్ కేంద్రాల్లోకి సెల్ఫోన్లు తీసుకురావడంపైనా నిషేధం విధించారు. -
పోలీసుల అదుపులోఎన్నికల బుకీలు
11.17 లక్షల నగదు, 5 సెల్ఫోన్లు స్వాధీనం గుంతకల్లు, న్యూస్లైన్: సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్స్కు పాల్పడుతున్న ఇద్దరు బుకీలు సహా మొత్తం ఐదుగురిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.11,17,500 నగదు, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుంతకల్లు డీఎస్పీ సీహెచ్.రవికుమార్ వివరాలు వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్స్ నిర్వహిస్తున్న బుకీలు ఉరవకొండ నియోజకవర్గం జనార్దనపల్లికి చెందిన సుధాకర్, గుంతకల్లుకు చెందిన నారాయణతో పాటు బెట్టింగ్స్ కట్టిన అనంతపురానికి చెందిన సూర్యనారాయణ, ప్రసాద్, కర్నూలు జిల్లా పెరవలి గ్రామస్తుడు రాజేష్చౌదరిని అరెస్టు చేశారు. ఉరవకొండ ఎమ్మెల్యేగా ఏ పార్టీ అభ్యర్థి గెలుపొందుతాడు? సీమాంధ్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీ ఏది? అనే అంశాలపై బుకీలు ఫోన్లలోనే బెట్టింగ్స్ నిర్వహిస్తుండడంతో.. సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ ఎస్ఐ రాగిరి రామయ్య, సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఇద్దరు బుకీలు, ముగ్గురు బెట్టింగ్ రాయుళ్లను అరెస్టు చేశారు. వారి నుంచి భారీగా నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. రాయలసీమ స్థాయిలో ప్రప్రథమంగా రాజకీయ బెట్టింగ్ రాయుళ్లను అరెస్టు చేశామని డీఎస్పీ చెప్పారు. -
అభ్యర్ధుల్లో క్రాస్ ఓటింగ్ భయం
-
ప్రశాంతంగా రీపోలింగ్
లక్ష్మీదేవిపల్లి(కొత్తగూడెం), న్యూస్లైన్: కొత్తగూడెం నియోజకవర్గంలోని కొత్తగూడెం పట్టణం పాత కొత్తగూడెంలో మంగళవారం జరిగిన రీపోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు కొనసాగింది. 81.35శాతం ఓట్లు పోలయ్యాయి. మొత్తం 1008 మంది ఓటర్లకుగాను 820 ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 188 మంది ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఏప్రిల్ 30వ తేదీన జరిగిన పోలింగ్లో ఈ బూత్లో 785 ఓట్లు మాత్రమే పోల్ కాగా ఈసారి 820కి పెరిగాయి. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఓటర్లు భారీ సంఖ్యలో బారులు తీరి ఓటేశారు. అనంతరం ఎండ పెరుగుతుండడంతో మందకొడిగా పోలింగ్ నమోదైంది. తిరిగి సాయంత్రం సమయంలో ఓటర్లు తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు. పోలీసులు పహారా నడుమ ఈ రీపోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగునా పోలీసులు పెట్రోలింగ్ చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూశారు. పోలింగ్ కేంద్రం సమీపంలో అభ్యర్ధుల పాట్లు... పోలింగ్ కేంద్రం సమీపంలో ఉదయం నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో అభ్యర్ధులు, పోలింగ్ ఏజెంట్లు ప్రచారం చేసుకోవాల్సి ఉండగా నిబంధనలు అతిక్రమించారని ఒకరిపై మరొకరు పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకునే పరిస్థితి నెలకొంది. చివరికి పోలీసుల సూచనలు పాటిస్తూ అక్కడి నుంచి దూరంగా వెళ్లారు. జల్లివారిగూడెంలో ప్రశాంతంగా.. వీఆర్పురం : మండలంలోని జల్లివారిగూడెంలో మంగళవారం నిర్వహించిన రీపోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. మొత్తం 488 మంది ఓటర్లకు 423 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 86 శాతం పోలింగ్ నమోదైనట్లు తహశీల్దార్ మారుతీరావు తెలిపారు. గత నెల 30వ తేదీన స్థానిక పోలింగ్ కేంద్రంలో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లోని ఎమ్మెల్యే అభ్యర్థికి చెందిన ఈవీఎంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో రీపోలింగ్కు ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో మంగళవారం ఎమ్మెల్యే అభ్యర్థికి మాత్రమే స్థానిక పోలింగ్ కేద్రంలో రీపోలింగ్ నిర్వహించారు. ఈ కేంద్రంలో మొదటిసారి నిర్వహించిన ఎన్నికల్లో 488 మంది ఓటర్లు ఉండగా 217 మంది పురుషులు, 209 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. తొలిసారి 87 శాతం ఓటింగ్ నమోదు కాగా ఈ సారి 86 శాతం నమోదైంది. పోలింగ్ కేంద్రానికి అభ్యర్థుల తాకిడి జల్లివారిగూడెం కేంద్రంలో మంగళవారం నిర్వహించిన రీపోలింగ్కు బరిలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులందరూ వచ్చారు. ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ కేంద్రంలో సుమారు 488 ఓట్లు ఉండటంతో అవి తమ మెజార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావించి ఆయా పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు ఉదయాన్నే ఈ గ్రామానికి చేరుకున్నారు. సీపీఎం అభ్యర్థి సున్నం రాజయ్య, టీడీపీ అభ్యర్థిని ఫణీశ్వరమ్మ, కాంగ్రెస్ అభ్యర్థిని కుంజా సత్యవతి, టీఆర్ఎస్ అభ్యర్ధి మానె రామకృష్ణ, స్వతంత్ర అభ్యర్థి సున్నం వెంకట రమణ తదితరులు ఈ ఎన్నికల కేంద్రాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు. -
సార్వత్రిక రీ పోలింగ్ ప్రశాంతం
మచిలీపట్నం, న్యూస్లైన్ : సార్వత్రిక ఎన్నికల రీ పోలింగ్ జిల్లాలో మంగళవారం ప్రశాంతంగా జరిగింది. ఈవీఎంలలో సాంకేతిక లోపం ఏర్పడటంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 10 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్కు ఎన్నికల కమిషన్ ఆదేశించింది. రీ పోలింగ్ జరిగిన కేంద్రాల్లో మొత్తంగా 73.30 శాతం పోలింగ్ నమోదైనట్లు కలెక్టర్ ఎం.రఘునందన్రావు తెలిపారు. ఈవీఎంలను కట్టుదిట్టమైన భద్రత మధ్య స్ట్రాంగ్రూమ్లకు తరలించారు. -
గంగమ్మా.. జగనన్న సీఎం కావాలమ్మా
తిరుపతి(మంగళం), న్యూస్లైన్ : శాసనసభ, లోక్సభ ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీ సాధించి వైఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేలా ఆశీర్వదించు గంగమ్మతల్లీ అని వైఎస్ఆర్ సీపీ నాయకులు వేడుకున్నారు. మంగళవారం తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా పార్టీ నాయకుడు పోతిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో గంగమ్మగుడి వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రజాసంక్షేమాన్ని కోరుకునే జగనన్నను ముఖ్యమంత్రిని చేయి గంగమ్మతల్లీ అంటూ వేడుకున్నారు. అనంతరం గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పోతిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కుట్రలు కుతంత్రాలతో రాష్ట్రాన్ని ముక్కలు చేసి, ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేసిన చంద్రబాబు తిరిగి ప్రతిపక్షంలోనే ఉండేలా చూడాల ని గంగమ్మ తల్లికి మొక్కుకున్నామన్నారు. నిత్యం ప్రజాసంక్షేమం కోసం కృషి చేస్తున్న జగనన్న పాలనలో ఐతేనే ప్రజలంతా సుభిక్షంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, టి.రాజేంద్ర, ఆదికేశవులురెడ్డి, కొండారెడ్డి, రవిచంద్ర, గఫూర్, పవన్ పాల్గొన్నారు. -
ప్రశాంతంగా రీపోలింగ్
కొయ్యూరు, న్యూస్లైన్ : పలకజీడిలో రీపోలింగ్ మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. మావోయిస్టులు ఈవీఎంలు,ఎన్నికల సిబ్బంది వాహనాన్ని దగ్ధం చేయడంతో ఈ నేల 7న ఇక్కడ పోలింగ్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈమేరకు ఎన్నికల కమిషన్ ఆదేశాలతో రీపోలింగ్ చేపట్టారు. ముందు జాగ్రత్తగా ఆదివారం సాయంత్రానికే ఎన్నికల సిబ్బంది, ఈవీఎంలను ఇక్కడికి తరలించారు. ఈ పోలింగ్ కేంద్రం పరిధిలో 468 మందికి 326 మంది ఓటేశారు. మావోయిస్టులు మరోసారి దాడి చేస్తారన్న సమాచారంతో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఆ ప్రాంతంలోని 20 గ్రామాల్లో గ్రేహౌండ్స్ బాలగాలచే కూంబింగ్ చేపట్టారు. మావోయిస్టుల ముందస్తు హెచ్చరికలతో ఓటర్లు కొంత వరకు భయాందోళనలకు గురయ్యారు. పోలీసులు ఇచ్చిన ధైర్యంతో ఎక్కువ మంది వచ్చి ఓటేశారు. కొయ్యూరు సీఐ సోమశేఖర్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించారు. తహశీల్దారు ఉమామహేశ్వరరరావు పాల్గొన్నారు. పలకజీడి నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రధాన రోడ్డు పనసలపాలెం వరకు పోలీసు బందోబస్తు నడుమ ఈవీఎంలను తరలించారు. అక్కడి నుంచి నేరుగా విశాఖపట్నం తీసుకొచ్చారు. బ్యాలెట్తోనే అభివృద్ధి విశాఖపట్నం : బుల్లెట్తో కాకుండా బ్యాలెట్ ద్వారానే అభివృద్ధి సాధ్యమని గిరిజనులు చాటిచెప్పారని జిల్లా ఎస్పీ విక్రమ్జిత్ దుగ్గల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంగళవారం కొయ్యూరు మండలం పలకజీడిలో జరిగిన రీ పోలింగ్ దీనికి అద్దం పట్టిందన్నారు. 70శాతం మంది ఓటేయడం విశేషమన్నారు. మావోయిస్టుల హెచ్చరికలను ఖాతరు చేయకుండా గిరిజనులంతా స్వచ్ఛందంగా పాల్గొన్నారన్నారు. ఇది మంచి పరిణామమని, ఇప్పటికైనా మావోయిస్టులు ప్రజాభీష్టం మేరకు నడుచుకోవాలన్నారు. ఏజెన్సీలో ప్రశాంతంగా ఎన్నికలకు గిరిజనుల సహకారం మరువలేనిదన్నారు. -
అందరి దృష్టి ఆమెపైనే..!
జయసుధ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ సికింద్రాబాద్, న్యూస్లైన్: గత శాసనసభ(2009) ఎన్నికల్లో అనూహ్యంగా రాజకీయ అరంగేట్రం చేసి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా విజయ దుందుభి మోగించిన ప్రసిద్ధ సినీనటి, తాజా మాజీ ఎమ్మెల్యే జయసుధ భవిష్యత్తు రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో సహకరించిన లష్కర్లోని కాంగ్రెస్ నేతలు తాజా ఎన్నికల్లో ఆమెకు దూరంగా ఉన్నారు. అయినా ఆమె విజయం తనదేనన్న ధీమాను వ్యక్తం చేస్తుండడం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఆమె గెలిచినట్టయితే, గ్రేటర్ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా తెలంగాణ శాసనసభలో అడుగిడనున్నారు. గత ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి చలవతో నియోజకవర్గంలోని నాయకులందరూ ఆమె పక్షాన నిలిచారు. కాంగ్రెస్ టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేసిన ఆశావహులు సైతం పక్కన్నే ఉండి విజయంలో భాగస్వాములయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో ఆశావహులు ఎన్నికల ప్రచారంలో కనిపించకపోగా, కార్పొరేటర్లు ప్రచారానికి దూరంగా ఉన్నారు. కనిపించని ఆశావహులు.. సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పీసీసీ నాయకులుగా కొనసాగుతున్న పిట్ల కృష్ణ, ఆదం సంతోష్కుమార్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. టికెట్ రాలేదని కొద్దిరోజులు ప్రచారానికి దూరంగా ఉన్న మాజీ మేయర్ బండ కార్తీకారెడ్డి దంపతులు కేంద్రమంత్రి జైరామ్మ్రేష్ రాకతో ప్రచారంలో పాల్గొన్నారు. జయసుధ ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని ఆరు డివిజన్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులే కార్పొరేటర్లుగా విజయం సాధించి రికార్డు సృష్టించారు. వైఎస్సార్సీపీ ప్రారంభంలోనే పార్టీలో చేరిన సీతాఫల్మండి కార్పొరేటర్ ఆదం విజయ్కుమార్ తాజా ఎన్నికల్లో అదేపార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచి జయసుధకు ప్రత్యర్థిగా మారారు. తన భర్తకు కాంగ్రెస్ టికెట్ లభించకపోవడంతో నిరాశకు గురైన బౌద్దనగర్ కార్పొరేటర్ ఆదం ఉమాదేవి ప్రచారానికి దూరంగా ఉన్నారు. మెట్టుగూడ కార్పొరేటర్ ఎంఆర్.శ్రీనివాస్రావు, అడ్డగుట్ట కార్పొరేటర్ గంటా రత్నకుమారి మాత్రమే జయసుధకు అండగా నిలిచారు. గెలిస్తే రికార్డే.. రాజకీల్లోకి వచ్చిన సినిమా నటులు ఎక్కడా రెండు మార్లు గెలిచిన దాఖలాలు లేవని కొందరు, ఆమె నిజాయతీ పనితీరుకు పెద్దసంఖ్యలో ఓటర్లు అండగా నిలిచారని, మైనారిటీల మద్దతు జయసుధకే ఉందని మరికొందరు చెబుతున్నారు. వీరి అంచనాలకు తగ్గట్టు జయసుధ విజయం సాధిస్తే ఈ నియోజకవర్గం నుంచి రెండోమారు గెలిచిన తొలి మహిళగా రికార్డు సొంతం చేసుకోనున్నారు. -
ఇంతే ఖర్చు పెట్టారట..!
* భారీ ఎత్తున ప్రచారం * ఎన్నికల వ్యయం మాత్రం బహు స్వల్పం.. ఇదీ అభ్యర్థుల లెక్క సాక్షి, సిటీబ్యూరో : మైకుల హోరు.. జెండాల జోరు.. లెక్కలేనన్ని కటౌట్లు.. వందలాది వాహనాలు.. ఖరీదైన ప్రచార రథం.. వెంట అనుచరగణం.. రోడ్ షోలు.. భారీ బహిరంగ సభలు.. ‘బహు’మతుల పంపకం.. నోట్ల కట్టల ప్రవాహం.. ఏరులై పారిన మద్యం.. ఇదీ సార్వత్రిక ఎన్నికల సీన్. ఏ లోక్సభ నియోజకవర్గం చూసినా.. ఎలాంటి అభ్యర్థి అయినా తార స్థాయి ప్రచారం.. పెద్ద ఎత్తున పబ్లి‘సిటీ’ కామన్గా కనిపించింది. వెరసి అభ్యర్థులు ఓట్ల కొనుగోలుకు రూ.కోట్లు ఖర్చు పెట్టారు. కానీ వారిని ఎన్నికల వ్యయం గురించి అడిగితే మాత్రం ‘అబ్బే.. మేమేం ఖర్చు చేయలేద’ంటున్నారు. లోక్సభకు పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల వ్యయంగా రూ.70 లక్షలు ఖర్చు చేసుకునే సౌలభ్యాన్ని ఎన్నికల సంఘం కల్పించినా.. మాకంత సీన్ లేదంటున్నారు. గత నెల 30న జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాల్లో బరిలో నిలిచిన వివిధ పార్టీల అభ్యర్థులు ఎన్నికల రోజు వరకు తమ ఎన్నికల వ్యయానికి సంబంధించిన లెక్కలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. ఎన్నికల అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అభ్యర్థుల ఎన్నికల వ్యయాలివీ... -
మందకొడిగా రీపోలింగ్
కేపీహెచ్బీ కాలనీ, న్యూస్లైన్: కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని 371/ఏ కేంద్రంలో రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 53.89 పోలింగ్ శాతం నమోదైంది. గత నెల 30న నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ పోలింగ్ కేంద్రంలోని ఈవీఎం మొరాయించింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో మంగళవారం రీపోలింగ్ నిర్వహించారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు మందకొడిగా జరిగిన పోలింగ్లో 450 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ కేంద్రం పరిధిలోని మొత్తం 835 ఓట్లు ఉన్నాయి. వీరిలో 210 మంది మహిళలు, 240 మంది పురుషులు ఓటు వేశారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి గంగాధర్రెడ్డి తెలిపారు. గత నెల 30న పోలైన ఓట్లకంటే 12 తగ్గాయని అధికారులు వెల్లడించారు. కాగా, కూకట్పల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో 29 మంది అభ్యర్థులు నిలిచారు. అయితే, ప్రధానంగా ముగ్గురి మధ్యనే పోటీ ఉంది. జంపన ప్రతాప్ (వైఎస్సార్సీపీ), గొట్టిముక్కల పద్మారావు (టీఆర్ఎస్), ముద్దం నర్సింహయాదవ్ (కాంగ్రెస్) మంగళవారం పోలింగ్ సరళిని పరిశీలించారు. రీపోలింగ్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థులు రీపోలింగ్లో నమోదైన ఓట్లపై అంచనాలు వేసుకోవడంతో మునిగిపోయారు. -
ఎప్పటికప్పుడు తెరపై ఫలితం
సాక్షి, సిటీబ్యూరో: ఈసారి కౌంటింగ్కు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం తోడు కానుంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఒక్కో అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో రౌండ్ల వారీగా, టేబుళ్ల వారీగా ఎప్పటికప్పుడు డిస్ప్లే అవుతుంది. కావాలనుకుంటే ఈ వివరాల ప్రింట్ కాపీని కూడా పొందవచ్చు. ఈవీఎంలకు అనుసంధానిస్తున్న ‘ప్రింటర్ కమ్ ఆగ్జిలరీ డిస్ప్లే యూనిట్ (పాడు)’ ద్వారా ఈవీఎంలలోని ఓట్ల వివరాలను ఎప్పటికప్పుడు డిస్ప్లే అవుతాయి. ఓట్లను లెక్కించే అధికారులతోపాటు ఎన్నికల పరిశీలకులు, రాజకీయపార్టీల ఏజెంట్లు ‘పాడు’ డిస్ప్లే ద్వారా ఎప్పటికప్పుడు కౌంటింగ్ తీరును.. ఓట్ల వివరాలను చూడవచ్చు. ఈ వివరాలకు సంబంధించిన కాపీ కావాలంటే ప్రింటర్ను అనుసంధానించి పొందవచ్చు. గతంలో ఈ విధానం లేదు. ఈసారి కొత్తగా ప్రవేశపెడుతున్న ఈ విధానం గురించి పోటీ చేసిన అభ్యర్థులందరికీ తెలియజేయాల్సిందిగా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. అందుకుగాను ఈ నెల 14న పోటీ చేసిన అభ్యర్థులతో సమావేశాలు నిర్వహించాల్సిందిగా రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కేంద్ర ఎన్నికల సంఘంతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కమిషనర్ సోమేశ్కుమార్ రిటర్నింగ్ అధికారులతో జీహెచ్ఎంసీలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 211 టేబుళ్లు.. పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి 211 టేబుళ్లు వెరసి మొత్తం 422 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నందున ఒక్కో టేబుల్కు ఒక్కో యూనిట్ వంతున 422 ‘పాడు’ యూనిట్లు అవసరమన్నారు. ప్రతి కౌంటింగ్ కేంద్రంలో ఒక అబ్జర్వర్ ఉంటారని, ఓట్ల లెక్కింపు తీరును పరిశీలించడంతోపాటు ప్రతి రౌండ్ ఫలితాన్ని ప్రకటిస్తారన్నారు. ప్రతి రౌండ్ ఫలితంపై అబ్జర్వర్ సంతకం చేస్తారని, రిటర్నింగ్ అధికారులు ఈ అంశాల్ని దృష్టిలో ఉంచుకొని ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి గందరగోళానికి తావులేకుండా లెక్కింపు ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలన్నారు. ఉదయం 8 నుంచి ఓట్ల లెక్కింపు అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో ఎన్నికల అబ్జర్వర్లకు ప్రత్యేక రూమ్ కేటాయించడంతోపాటు ఎప్పటికప్పుడు ఎన్నికల సరళి.. రౌండ్ల వారీగా ఓట్ల వివరాలు తెలియజేసేందుకు మీడియాసెంటర్ ఏర్పాటు చేయాలని సోమేశ్కుమార్ సూచించారు. 16న కౌంటింగ్ జరుగనున్నందున 15వ తేదీ మధ్యాహ్నం కౌంటింగ్లో పాల్గొనే సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేయాలని, అదే సమావేశంలో వారికి గుర్తింపు కార్డులు అందజేయాలని ఆదేశించారు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా.. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి 8.30 నుంచి ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభించాలన్నారు. ఈ అంశానికి సంబంధించి ఎలాంటి జాప్యాన్ని సహించేది లేదన్నారు. అప్పటిలోగా పోస్టల్బ్యాలెట్ల లెక్కింపు పూర్తికాని పక్షంలో వాటిని రిటర్నింగ్ ఆఫీసర్ టేబుల్ వద్దకు పంపించాలని సూచించారు. ఏజెంట్లు బయటకు వెళ్తే తిరిగి రానీయరు కౌంటింగ్కు హాజరయ్యే రాజకీయ పార్టీల ఏజెంట్లు లోనికి ప్రవేశించాక బయటకు వెళ్తే తిరిగి లోనికి రానీయరని సోమేశ్కుమార్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలోనే క్యాంటీన్ ఏర్పాట్లు చేయాలి తప్ప ఎవరినీ ఆహార పదార్థాలు లోనికి తేనీయవద్దని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. కౌంటింగ్ రోజున అభ్యర్థుల సమక్షంలో ఉదయం 6.30 గంటలకే స్ట్రాంగ్రూమ్లు తెరవాలన్నారు. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం దాదాపు రెండు వేల మంది విధులు నిర్వహించనున్నారు. ఒక్కో టేబుల్ వద్ద ముగ్గురు వంతున (కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్లతో పాటు కేంద్రం నుంచి వచ్చిన మైక్రో అబ్జర్వర్) 1266 మంది, ఇతరత్రా అధికారులు, సిబ్బంది వెరసి మరో 600 మంది, రిజర్వులో దాదాపు 200 మంది వెరసి దాదాపు 2066 మంది విధుల్లో పాల్గొననున్నారు. -
పోస్టల్ బ్యాలెట్తోనే లెక్కింపు
కలెక్టరేట్, న్యూస్లైన్ : సాధారణ ఎన్నికల కౌంటింగ్ను ముందుగా పోస్టల్ బ్యాలెట్లతోనే ప్రారంభించాలని కేంద్ర ఎన్నికల కమిషనర్ జిల్లా అధికారులకు సూచించారు. సోమవారం ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం లెక్కింపు చేపట్టాలని, దీనికోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ నెల 16న ఉదయం 8 గంటల నుంచి కౌం టింగ్ ప్రక్రియ ప్రారంభించాలని, ముం దుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించాలని, కౌంటింగ్ సిబ్బందిని రాండమైజేషన్ ద్వారా కేటాయించాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రంలో మైక్రో అబ్జర్వర్లను నియమించాలని, అభ్యర్థులు, ఏజెంట్లు, అధికారులు సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు కౌంటింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేయాలన్నారు. ఫలితాన్ని ప్రకటించిన తరువాత మా త్రమే ఈవీఎంలకు సీల్ వేయాలని అన్నారు. సమావేశంలో కలెక్టర్ జి.కిషన్, జేసీ పౌసుమిబసు, ట్రెయినీ కలెక్టర్ హన్మంతు, ఆర్డీఓ సురేంద్రకరణ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాదేశిక ఫలితాలు నేడే
మచిలీపట్నం, న్యూస్లైన్ : ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. జిల్లాలోని 49 జెడ్పీటీసీ, 812 ఎంపీటీసీ స్థానాలకు గత నెలలో రెండు విడతలుగా ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. బ్యాలెట్ పత్రాల ద్వారా ఈ ఎన్నికల పోలింగ్ నిర్వహించారు. వీటి లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. జిల్లాలో 49 జెడ్పీటీసీ స్థానాలకు 177 మంది, 812 ఎంపీటీసీ రీ-పోలింగ్ నేడే మచిలీపట్నం, న్యూస్లైన్ : సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని జిల్లాలోని ఐదు అసెంబ్లీ, ఐదు లోక్సభ స్థానాల పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో మంగళవారం రీ-పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల ఏడో తేదీన నిర్వహించిన సాధారణ ఎన్నికల పోలింగ్లో ఈవీఎంలలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో రీ-పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఎం.రఘునందన్రావు తెలిపారు. జిల్లాలో పది పోలింగ్ కేంద్రాల్లో రీ-పోలింగ్ జరుగుతున్నందున 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఒపీనియన్ పోల్స్ ప్రకటించటంపై నిషేదం విధించినట్లు కలెక్టర్ చెప్పారు. -
మళ్లీ ప్రచార హోరు
కేపీహెచ్బీ కాలనీ, న్యూస్లైన్ : ఎన్నికల పోరు.. ప్రచార హోరు.. మళ్లీ మొదలైంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కూకట్పల్లి నియోజకవర్గంలో 13న రీపోలింగ్ నిర్వహించనుండటంతో ఆయా ప్రాంతాల్లో మళ్లీ ఎన్నికల సందడి నె ల కొంది. ‘ఎన్నికలు ముగిశాయి.. ఫలితాలు రాబోతున్నాయి.. నేనే గెలుపొందే అభ్యర్థిన ని’ కూకట్పల్లి నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన అభ్యర్థులు ఆశల పల్లకిలో ఊరేగుతుండగా... నియోజకవర్గంలోని 371/ఎ కేంద్రంలో రీ పోలీంగ్ అంటూ ఎన్నికల కమిషన్ చేసిన ప్రక టించడంతో అభ్యర్థులు మళ్లీ ప్రచార బాట పట్టారు. ఆదివారం ఉదయమే రీ పోలింగ్లో పాల్గొనే కాలనీల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. కాలనీలకు చెందిన సంక్షేమ సంఘం నాయకులను, మహిళా సంఘం నాయకురాళ్లను, యువజన సంఘాలను కలిసి ఓట్లను అభ్యర్థించారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి జంపన ప్రతాప్ ఓటర్లను కలవడంలో ముందంజలో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ అభ్యర్థి మాదవరం కృష్ణారావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముద్దం నర్సింహ్మ యాదవ్, తెలంగాణ సెటిలర్స్ ఫ్రంట్ అభ్యర్థి కూరపాటి శ్రీనివాసరాజు తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. సోమవారం అధికారుల నుంచి అనుమతి పొంది పెద్ద ఎత్తున కార్యకర్తలతో ప్రచారం నిర్వహించనున్నారు. సోమవారం ఒక్కరోజే రీ పోలీంగ్ ప్రాంతాలలో ప్రచారం చేసుకోవడానికి గడువుంది. ఓటర్లంతా ఓటేయాలి కూకట్పల్లి, న్యూస్లైన్: కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని పోటీలో గల అభ్యర్థులు, ఏజెంట్లతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి బి.వి. గంగాధర్రెడ్డి ఆదివారం సమావేశం నిర్వహించారు. 13వ తేదీన నిర్వహించే రీ పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వసంత్నగర్ కాలనీలోని ఐడీపీఎల్ ఎంప్లాయీస్ సొసైటీ లైబ్రరీ హాల్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రీ పోలింగ్ పరిధిలో గల ఓటర్లంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అభ్యర్థులు రీపోలింగ్కు సహకరించాలని కోరారు. -
తెలంగాణలో తొలి ప్రభుత్వం మాదే
పాలకుర్తి, న్యూస్లైన్ : తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం ఖాయమైంద ని ఆ పార్టీ రాష్ట్ర పరిశీలకుడు రాపోలు జయప్రకాశ్ అన్నారు. పార్టీ నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులుగా పోటీ చేసిన వారిని ఆదివా రం నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే అభ్యర్థి దుగ్యాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సన్మానిం చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో జయప్రకాశ్ మాట్లాడుతూ పూటకో మాట మాట్లాడుతున్న కేసీఆర్ను ప్రజ లు విశ్వసించడం లేదన్నారు. ఎంఐఎం, సీపీఐ మద్దతుతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తొలి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు. పాలకుర్తిలో దుగ్యాలతోపాటు జిల్లాలో 11 స్థానాల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందన్నారు. 10 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందాయని, ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటిం చిన విధంగా రైతులు, మహిళా రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. పరిపాలన అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ పునర్నిర్మా ణం సాధ్యమని స్పష్టం చేశారు. దుగ్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ తనతోపాటు ఎంపీటీసీ, జెడీపీటీసీ అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందనున్నారని తెలిపారు. సమావేశంలో పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు సుధీర్రెడ్డి, రాపాక సత్యనారాయణ, చిలువేరు సత్యనారాయణ, సొసైటీ చైర్మన్ యాకాంతరావు, మాజీ చైర్మన్ అడ్డూరి రవీందర్రావు, పసునూరి నవీన్, ఎండీ.సలీం, బండి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
జగన్ సీఎం కావడం ఖాయం
నక్కపల్లి,న్యూస్లైన్ : రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి కావడం తధ్యమని, చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నాయకుడుగానే మిగిలిపోతారని అనకాపల్లి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి గుడివాడ అమర్ అన్నారు. నక్కపల్లిలో ఆదివారం ఆయన ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలో మూడు ఎంపీ స్థానాలతో పాటు మెజార్టీ ఎమ్మెల్యే సీట్లను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంటుందన్నారు. రాష్ట్రంలోను, జిల్లాలోను తమపార్టీ క్లీన్స్వీప్ చేస్తుందన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితీరుతారన్నారు. జగన్ సీఎం కావాలని కోట్లాదిమంది కోరుకుంటున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ మేనిఫేస్టోలో ప్రకటించిన విధంగా అన్ని పథకాలు అమలు చేయడంతో పాటు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారన్నారు. మరో ఐదురోజుల్లో రాజన్న రాజ్యం రాబోతోందన్నారు. టీడీపీ వారు ఓటమి భయంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. టీడీపీ నాయకులు ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలనే ఉద్దేశ్యంతో మద్యాన్ని ఏరులా పారించారని, డబ్బును విచ్చలవిడిగా ఖర్చుచేశారని అన్నారు. అయితే ప్రజలు మాత్రం వి శ్వసనీయతకే పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారన్నారు. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ఓటర్లు మాత్రం వైఎస్సార్సీపీ వైపే మొగ్గుచూపారన్నారు. స్థానికేతరులను గెలిపించడంవల్ల అభివృద్ధి కుంటుపడుతోందని ప్రజలు గ్రహించారన్నారు. గతంలో ఇలాగే స్థానికేతరులకు పట్టం కడితే ఇక్కడ అభివృద్ధిని నాశనం చేశారని, ప్రాజెక్టులు తరలిపోతున్నా నోరు మూసుకుని చేతకాని వారిలా కూర్చొన్నారన్నారు. జిల్లా అభివృద్ధి విషయంలో ప్రజలకు తాము అండ గా ఉంటామని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ సీజీసీ సభ్యుడు వీసం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కౌంటింగ్కు పక్కా ఏర్పాట్లు
కడప కలెక్టరేట్, న్యూస్లైన్: ఈనెల 13న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శశిధర్ శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. రాజంపేట డివిజన్కు కడపలోని శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో, జమ్మలమడుగు డివిజన్కు మదీనా ఇంజనీరింగ్ కళాశాలలో, కడప డివిజన్కు కేశవరెడ్డి స్కూలులో కౌంటింగ్ జరుగుతుందన్నారు. బ్యాలెట్ బాక్సులను డీజీటీ వాహనాల్లో కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తామని, ఈ సమాచారాన్ని అభ్యర్థులకు తెలపాలని సూచించారు. కౌంటింగ్ శిక్షణ తరగతులు ఆదివారం ఉదయం 10 గంటలకు కౌంటింగ్ కేంద్రాల్లోనే నిర్వహిస్తారన్నారు. అలాగే పార్లమెంటు, అసెంబ్లీ ఓట్ల లెక్కింపు శిక్షణ కార్యక్రమం ఈ నెల 14 ఉదయం 10 గంటలకు మున్సిపల్ హైస్కూలులో నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ రామారావు, ఏజేసీ సుదర్శన్రెడ్డి, ట్రైనీ కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్, ఏఓ గుణభూషణ్ తదితరులు పాల్గొన్నారు. కౌంటింగ్ తేదీల్లో మద్యం విక్రయాలు బంద్ కడప అర్బన్: జిల్లా కేంద్రంలో ఈనెల 12, 13, 16 తేదీల్లో నిర్వహించే ఆయా ఎన్నికల కౌంటింగ్ల ఈ నేపధ్యంలో జిల్లా కేంద్రంలో కార్పొరేషన్ పరిధితోపాటు చుట్టు ఐదు కిలోమీటర్ల మేరకు మద్యం షాపులను మూసి వేయనున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయకుమారి తెలిపారు. శనివారం కడప ఎక్సైజ్ పోలీసుస్టేషన్లో ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఎన్నికల నేపధ్యంలో ఎన్నికల కోడ్ వెలువడినప్పటి నుంచి ఎక్సైజ్ అధికారులు ముమ్మరంగా దాడులు నిర్వహించారన్నారు. ఎన్నికలు జరిగే రోజుల్లో కూడా 48 గంటలపాటు మద్యంషాపులను మూసి వేయించామన్నారు. అలాగే కౌంటింగ్ జరగనున్న తేదీలలో కూడా ఈ నిబంధన వర్తిస్తుందన్నారు. 12వ తేదీ ఉదయం 6 నుంచి 13వ తేది సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి వేయాలన్నారు. అలాగే 16న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఆ రోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు మద్యం షాపులను మూసి వేయాలని కోరారు. నిబంధనలకు వ్యతిరేకంగా మద్యం విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీసీతోపాటు కడప ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్ పాల్గొన్నారు. గట్టి బందోబస్తు కడప అర్బన్, న్యూస్లైన్: జిల్లాలో ఈనెల 12న మున్సిపల్,13న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, 16న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్తోపాటు నగరంలో 30 పోలీసు యాక్టు అమలులో ఉంటుందన్నారు. విజయోత్సవ ర్యాలీలు, డప్పులు లేదా బ్యాండులతో ఊరేగింపులు, బాణసంచా కాల్చడం నిషిద్ధమన్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం సమీపంలో పార్కింగ్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నాగార్జున మహిళా డిగ్రీ కళాశాల సమీపంలో వాహనాలకు పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జీవీజీ అశోక్కుమార్ తెలిపారు. కొత్త బస్టాండు ఎదురుగా ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్లో వాహనాలను పార్కింగ్ చేసుకోవాలని ఎస్పీ సూచించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్కు సంబంధించి వాహనాలను నగర శివార్లలో పార్కింగ్ చేయాలన్నారు. అభ్యర్థులు తమ ఏజెంట్లను మాత్రమే కౌంటింగ్ కేంద్రాలకు తీసుకు రావాలని పేర్కొన్నారు. -
చీప్ ట్రిక్స్
సాక్షి ప్రతినిధి, కడప: ప్రజావిశ్వాసం కోల్పోయిన తెలుగుదేశం పార్టీ చీప్ట్రిక్స్కు పాల్పడుతోంది. పోలింగ్ ఏజెంట్లు లేకపోయినా పోలీసులను అడ్డుపెట్టుకుని దేవగుడి గ్రామంలో రీపోలింగ్కు ఆదేశాలు తీసుకువచ్చారు. శాంతిభద్రతల సమస్యను బూచిగా చూపి కేంద్ర ఎన్నికల కమిషన్ రీపోలింగ్ ఆదేశాలు జారీ చేసింది. జమ్మలమడుగు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పి. రామసుబ్బారెడ్డి స్వగ్రామం గుండ్లకుంటలో వైఎస్సార్సీపీ అభ్యర్థి సి. ఆదినారాయణరెడ్డికి పోలింగ్ ఏజెంటు లేరు. అలాగే వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి స్వగ్రామమైన దేవగుడిలో టీడీపీ అభ్యర్థి రామసుబ్బారెడ్డికి పోలింగ్ ఏజెంటు లేరు. ఆ రెండు గ్రామాలు దశాబ్దాల తరబడి ఆయా నేతలకు ఏకపక్షంగా నిలుస్తున్నాయి. అందులో భాగంగా ఈనెల 7న నిర్వహించిన పోలింగ్ సందర్భంగా ఆయా గ్రామాల్లో పాత చరిత్ర పునరావృతమైంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తున్న టీడీపీ.. ఓటమి తప్పదని భావించిన తెలుగుదేశం పార్టీ గత కొద్ది రోజుల నుంచి వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. ముందస్తు వ్యూహంలో భాగంగా కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. జమ్మలమడుగు, లింగాల, పులివెందుల మండలాల పరిధిలో పోలింగ్ ఏజెంట్లను మండల పరిధిలో అనుమతించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ నేతల అభ్యర్థన పరిగణలోకి తీసుకున్న ఎన్నికల కమిషన్ మండల పరిధిలోని ఓటరు పోలింగ్ ఏజెంటుగా కూర్చోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. దీంతో జమ్మలమడుగు చెందిన రామకృష్ణారెడ్డి, అవినాష్ దేశాయ్ అనే వ్యక్తులు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను ఛాలెంజ్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు జస్టిస్ ఆర్. సుభాషన్రెడ్డి, జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తిల ధర్మాసనం ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను రద్దు చేసింది. ఎన్నికల నియమావళి ఆధారంగా బూత్ పరిధిలోని వారినే పోలింగ్ ఏజెంటుగా నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో దేవగుడి గ్రామంలో తెలుగుదేశం పార్టీకి పోలింగ్ ఏజెంటు లభించలేదని తెలుస్తోంది. దేవగుడి పరిధిలోని మూడు బూత్లలో 93 శాతం పోలింగ్ నమోదైంది. పావుగా ఉపయోగపడిన ఏఎస్పీ నాయుడు... తెలుగుదేశం పార్టీ ఎత్తుగడలకు జమ్మలమడుగు ఏఎస్పీ వెంకటఅప్పలనాయుడు పావుగా ఉపయోగపడ్డారని విశ్లేషకుల అభిప్రాయం. పోలింగ్ బూత్లలోకి పోలీసు అధికారులు వెళ్లరాదని నిబంధలు ఉన్నాయి. అయినప్పటికీ దేవగుడి పోలింగ్ బూత్లోకి ఏఎస్పీ నాయుడు వెళ్లారు. పోలింగ్ బూత్లోకి మీకేంపని అంటూ వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి తనయుడు సుధీర్కుమార్రెడ్డి ప్రశ్నించారు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఆయన ఒక్కమారుగా సుధీర్ను చొక్కాపట్టుకొని లాక్కొచ్చినట్లు సమాచారం. ఆ పరంపరలో దేవగుడిలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసు వాహనాలు ధ్వంసం కావడం, ఏఎస్పీ నాయుడు గాలిలోకి కాల్పులు జరపడం లాంటి సంఘటనలు జరిగాయి. అదే అంశాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు జిల్లా కలెక్టర్,ఎన్నికల అధికారి కోన శశిధర్ను నివేదిక కోరారు. దేవగుడి గ్రామంలో నిబంధనల మేరకు పోలింగ్ ముగిసిందని ఎన్నికల కమిషన్కు ఆయన నివేదికలు అందజేసినట్లు సమాచారం. అయితే శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కావడంతోనే దేవగుడిలోని 80, 81, 82 పోలింగ్ బూత్లలో రీ పోలింగ్కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. పోలింగ్ శాతం తగ్గించాలనే ఎత్తుగడ.. దేవగుడి గ్రామంలో మూడు పోలింగ్ బూత్లలో 2784 ఓట్లు పోలయ్యాయి. రీపోలింగ్ నిర్వహించడం ద్వారా పోలింగ్ శాతాన్ని భారీగా తగ్గించవచ్చనే అంచనాతోనే తెలుగుదేశం పార్టీ అడుగులు వే సినట్లు విశ్లేషకుల భావన. ఓటమి తప్పదని భావించిన ఆ పార్టీ నేతలు రాజ్యసభసభ్యుడు సీఎం రమేష్ నేతృత్వంలో దింపుడు కళ్లెం ఆశలో ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగానే జమ్మలమడుగు, చాపాడులో రీపోలింగ్ జరిపిస్తామని ప్రకటించి ఆ మేరకు ఆదేశాలు ఇప్పించారని తెలుగుతమ్ముళ్లు పేర్కొంటున్నారు. చీప్ట్రిక్స్ వల్ల పెద్దగా ఉపయోగం లేకపోయినప్పటికి ఓవైపు అధినేత, మరోవైపు జిల్లాలోని తెలుగుతమ్ముళ్ల మెప్పుకోసం సీఎం రమేష్ తాపత్రయపడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 13న దేవగుడిలో రీ పోలింగ్ జమ్మలమడుగు, న్యూస్లైన్: జమ్మలమడుగు మండల పరిధిలోని దేవగుడి గ్రామంలో 80,81,82 పోలింగ్ కేంద్రాల్లో 13వతేదీన రీ పోలింగ్ నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జి.రఘునాథరెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ మూడు పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7గంటలనుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామన్నారు. 80వ పోలింగ్ కేంద్రంలో 1017 మంది ఓటర్లు, 81లో 1006 మంది, 82వ పోలింగ్ కేంద్రంలో 959 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. -
గెలిచేదెవరో..
కడప కార్పొరేషన్, న్యూస్లైన్: పురసమరంలో విజేతలెవరో తేలే సమయం ఆసన్నమైంది. కడప కార్పొరేషన్తో పాటు ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాయచోటి, బద్వేల్, మైదుకూరు, పులివెందుల, యర్రగుంట్లలో 236 వార్డులకు పోటీపడిన 1183 మంది అభ్యర్థుల భవితవ్యం ఈ నెల 12వ తేదీ సోమవారం తేటతెల్లం కానుంది. ఆరోజు మున్సిపల్ ఎన్నికల ఓట్లను లెక్కించనున్నారు. జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ను కడప నగరంలోని నాగార్జున మహిళా డి గ్రీ కళాశాలలోనే నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మార్చి 30వ తేదిన కడప కార్పొరేషన్తో పాటు జిల్లాలోని 7 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరిగాయి. కడప నగర పాలక సంస్థలో 2,71,532 మంది ఓటర్లు ఉండగా 62.67 శాతం అంటే 1,70,169 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. 2005లో ఇక్కడ 59.69 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. అలాగే ప్రొద్దుటూరులో 1,23,481 మంది ఓటర్లు ఉండగా 75.82 శాతం, జమ్మలమడుగులో 35,485 మంది ఓటర్లు ఉండగా 80.65 శాతం, రాయచోటిలో 62,054 మంది ఉండగా 68.60 శాతం, పులివెందులలో 55,159 మంది ఓటర్లు ఉండగా 62.43 శాతం, బద్వేలులో 52,401 మంది ఓటర్లు ఉండగా 73.38 శాతం, మైదుకూరులో 33,318 మంది ఓటర్లు ఉండగా 76.03 శాతం, ఎర్రగుంట్లలో 23,368 మంది ఓటర్లు ఉండగా 82.16 శాతం ఓట్లు పోలయ్యాయి. కడప కార్పొరేషన్లో 50 వార్డులకు 311 మంది, బద్వేలులో 26 వార్డులకు 145 మంది, ఎర్రగుంట్లలో 20 వార్డులకు 54 మంది, ప్రొద్దుటూరులో 40 వార్డులకు 244 మంది, జమ్మలమడుగులో 20 వార్డులకు 98 మంది, పులివెందులలో 26 వార్డులకు 87 మంది, మైదుకూరులో 23 వార్డులకు 110 మంది, రాయచోటిలో 31 వార్డులకు 134 మంది కలిపి మొత్తం 236 వార్డులకు 1183 మంది బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీలలో వైఎస్సార్సీపీ నుంచి 232 మంది, టీడీపీ నుంచి 225 మంది బరిలో ఉన్నారు. అందరికంటే ఎక్కువగా 629 మంది స్వతంత్రులు పోటీ పడ్డారు. వీరందరి భవితవ్యం సోమవారంతో తేలిపోనుంది.ఎన్నికల కమిషన్ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 2న మున్సిపల్ ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. అయితే పురపాలక ఎన్నికల ఫలితాల ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై పడుతుందని కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ వాయిదా పడింది. స్థానిక సంస్థల ఎన్నికలు ముగియగానే ఎన్నికల కమిషన్ మే 12న మున్సిపల్ ఎన్నికలు, 13న స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ప్రకటించాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓట్ల లెక్కింపు ఇలా! నగర పాలక ఎన్నికల కౌంటింగ్ కోసం నాలుగు టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిపై నాలుగు డివిజన్ల ఓట్లను లెక్కిస్తారు. నాలుగు డివిజన్ల ఓట్ల లెక్కింపు పూర్తయితే తొలిరౌండ్ ఫలితాలు ప్రకటిస్తారు. కడపలో ఒక్కో రౌండుకు నాలుగు డివిజన్లు చొప్పున 50 డివిజన్ల ఫలితాలను 13 రౌండ్లలో లెక్కిస్తారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ను కూడా ఇదే పద్ధతిలో నిర్వహించనున్నారు. 12వ తేది ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. టేబుల్ వద్దకు ఒకరికే అనుమతి - కమిషనర్ చల్లా ఓబులేశు కడప కార్పొరేషన్, మున్సిపల్ ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి పోటీ చేసిన అభ్యర్థి, జనరల్ ఏజెంటును మాత్రమే అనుమతిస్తామని నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేశు తెలిపారు. అయితే ఆ ఇద్దరిలో ఒకరు మాత్రమే కౌంటింగ్ టేబుల్ దగ్గర ఉండాలన్నారు. ఎన్నికల కౌంటింగ్ పాసులకు దరఖాస్తు చేసుకున్న వారికి ఆదివారం పాసులను జారీ చేస్తామన్నారు. 12వ తేది తెల్లవారుజామున 4 గంటలకు కొత్త కలెక్టర్ కార్యాలయంలోని స్ట్రాంగ్రూము నుంచి ఈవీఎంలను భారీ బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు కేంద్రమైన నాగార్జున మహిళా డిగ్రీ కళాశాలకు తరలించనున్నామని తెలిపారు. ఈవీఎంల తరలింపు ప్రక్రియను పరిశీలించాలనుకుంటే అభ్యర్థులు రావచ్చని కమిషనర్ సూచించారు. ఓట్ల లెక్కింపులో తొలుత డివిజన్ల వారీగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి, ఆ తర్వాత ఈవీఎంలోని ఓట్లను లెక్కిస్తామని వివరించారు. -
టెన్షన్.. టెన్షన్
నేతలు గెలుపోటముల అంచనాల్లో మునిగిపోయారు.. సమస్మాత్మక గ్రామాల ప్రజలు భయాందోళనతో బిక్కుబిక్కుమంటున్నారు. ఈ నెల 12 నుంచి 16 వరకూ వరుసగా మునిసిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ప్రధాన పార్టీల నేతలు, గ్రామస్థాయి నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపు కోసం పోటీపడ్డారు. పలుచోట్ల ఘర్షణలకు దిగారు. ఫలితాల ప్రభావం తమను ఎలాంటి ఇబ్బందులకు గురిచేస్తుందోనని సామాన్యులు భయపడుతున్నారు. సాక్షి, కడప: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల సమరం ముగిశాక అందరి దృష్టి ఎన్నికల ఫలితాలపై ఉంది. ఈనెల 12 నుంచి 16 వరకు వరుసగా మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఓటమి పాలైన అభ్యర్థులు గొడవలకు ఆజ్యం పోస్తారేమోననే అనుమానం వివిధ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కడప లోక్సభ పరిధిలోనే ఎక్కువగా సమస్మాత్మక ప్రాంతాలు ఉన్నాయి. ముఖ్యంగా జమ్మలమడుగు, కమలాపురం, మైదుకూరు నియోజకవర్గాల పరిధిలో పోలీసు యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు. పోలీసుల తీరుపై అనుమానాలు: జిల్లాలో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడంలో జిల్లా ఎస్పీ అశోక్కుమార్ విజయం సాధించారు. అయినా పలుచోట్ల గొడవలు జరిగాయి. కిందిస్థాయిలోని కొందరు అధికారులు సమర్థంగా పనిచేస్తుంటే, ఇంకొందరు ఏకపక్షంగా వ్యవహరించి ఓ వర్గానికి అండగా నిలుస్తున్నారనే విమర్శలున్నాయి. ఎన్నికలకు ముందు సమస్మాత్మక వ్యక్తులను ముందస్తుగా అరెస్టు చేయకపోవడం, కోట్ల రూపాయలు ఇంటింటికి వెళ్లి పంచుతున్నా అదుపు చేయకపోవడం, దాడులకు పాల్పడుతున్నా షాడోపార్టీలు అడ్డుకోకపోవడం వంటి ఘటనలు పోలీసుల పనితీరుపై అనుమానాలకు తావిస్తున్నాయి. కొందరు భారీగా డబ్బులు తీసుకుని ఓ వర్గానికి వత్తాసు పలికారని కొందరు పోలీసులే బాహాటంగా చర్చించుకుంటున్నారు. మైదుకూరుపై ప్రత్యేక దృష్టి సారించాల్సిందే: సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో అత్యధికంగా గొడవలు జరిగింది మైదుకూరు నియోజకవర్గంలోనే. మైదుకూరు మండలంలో టీడీపీ అరాచకాలను అడ్డుకోవడంలో పోలీసులు విఫలమాయ్యరు. ఓ అధికారి టీడీపీ నేత నుంచి భారీగా ముడుపులు తీసుకోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని తెలుస్తోంది. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం వరకూ టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్యాదవ్ అనుమతి లేకుండా నాలుగు వాహనాల్లో రౌడీలను వేసుకుని హల్చల్ చేశారు. ఎన్. ఎర్రబల్లి, నాగసానిపల్లి, నంద్యాలంపేటతో పాటు చాలా గ్రామాల్లో వైఎస్సార్సీపీ ఏజెంట్లపై దాడి చేసి రిగ్గింగ్కు యత్నించారు. అయినా పుట్టా అరాచకాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించలేదు. నిజాయితీ, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసు అధికారుల్లో కొందరు ఇలా వ్యవహరించడం ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో ఉన్నతాధికారులు ముం దస్తు చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది. -
అందరి చూపు ఫలితాల వైపే
సాక్షి, నెల్లూరు: ఎన్నికలు జరిగిన 42 రో జుల తర్వాత ఫలితాలు వెలువడనుండడంతో జిల్లాలో అందరి దృష్టి వాటిపై ప డింది. సోమవారం ఓట్ల లెక్కింపు జరగనుండడంతో ఫలితాలు ఎలా ఉంటాయోన ని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నా రు. నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు కావలి, గూడూరు, వెంకటగిరి, ఆత్మకూరు, సూళ్లూరుపేట మున్సిపాలిటీలు, నాయుడుపేట నగర పంచాయతీకి మార్చి 30న పోలింగ్ జరిగింది. సాధారణంగా పోలింగ్ జరిగిన రెండు రోజుల్లో ఓట్ల లెక్కింపు జరిగేది. ఈ సారి మాత్రం ఎన్నడూలేని విధంగా వరుసగా వివిధ ఎన్నికలు రా వడం, వాటి ఫలితాలు సార్వత్రిక ఎన్నికలపై చూపుతాయని కొం దరు కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు ఫలితాలను సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అయిన తర్వాత మున్సిపల్ ఓట్ల లెక్కింపు చేపట్టాలని ఆదేశించిన సంగతితెలిసిందే. ఈ క్రమంలో సోమవారం లెక్కింపు జరుగుతుండడంతో అభ్యర్థులతో పాటు అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు వాటి కోసం నిరీక్షిస్తున్నారు. మరోవైపు అభ్యర్థుల గెలుపోటములపై పందేలు కాసిన వారు సైతం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ ఫలితాలు వెలువడిన తెల్లారే(మంగళవారం) ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు, శుక్రవారం సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అందరి దృష్టి అధికారంపైనే నెల్లూరు మున్సిపాలిటీ కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయిన తర్వాత 2005 సెప్టెంబర్లో మొదటిసారిగా ఎన్నికలు జరిగాయి. మళ్లీ 2010లో ఎన్నికలు జరగాల్సి ఉండగా వివిధ కారణాలతో నాలుగేళ్లుగా వాయిదా వేస్తూ వచ్చారు. ఈ క్రమంలో పలువురు సుదీర్ఘకాలం పాటు పదవులు లేక రాజకీయ నిరుద్యోగులుగా మారారు. మున్సిపాలిటీల్లోనూ అదే పరిస్థితి. దీంతో ప్రస్తుత ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టడంపైనే అందరూ దృష్టి పెట్టారు. గతంలో పదవులు అనుభవించిన వారితో పాటు తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన వారు కూడా ఈ విషయంలో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మేజర్ పంచాయతీల నుంచి అప్గ్రేడ్ అయిన ఆత్మకూరు, నాయుడుపేట, సూళ్లూరుపేటలో తొలిసారిగా మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఆయా ప్రాంతాల్లో తొలిసారిగా కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్ల పీఠాలను అధిష్టించడాన్ని పలువురు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరోవైపు నెల్లూరు నగరపాలక సంస్థకు నూతన భవనం నిర్మించినప్పటి నుంచి మేయర్ చాంబర్తో పాటు కార్పొరేషన్ సమావేశం మందిరంలోని కార్పొరేటర్ సీట్లు ఖాళీగానే ఉన్నాయి. ఈ క్రమంలో ఎన్నికల్లో విజేతలై అధికారం చేపట్టాలని పలువురు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ అదృష్టం ఎవరికి దక్కుతుందో మరో 24 గంటల్లో తేలిపోనుంది. -
ఎన్నికల మత్తు.. రూ.213 కోట్లు
ఎన్నికల్లో ఏరులై పారిన మద్యం కర్నూలు, న్యూస్లైన్: అసలే ఎండాకాలం.. ఆపై ఎన్నికల కాలం.. ఇక మందుబాబులకు పండగే పండగ. మున్సిపాలిటీలు.. జెడ్పీటీసీ, ఎంపీటీసీలు.. ఇదే సమయంలో సార్వత్రిక ఎన్నికలు ఒకే సమయంలో రావడంతో తాగినోళ్లకు తాగినంత. రెండు నెలల పాటు మద్యం ఏరులై పారింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే కష్టమని తెలుసుకున్న వ్యాపారాలు.. అంతకుముందే భారీగా మద్యం నిల్వ చేసుకున్నారు. ఆ తర్వాత అధిక రేట్లకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈ విడత అభ్యర్థులు పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ చేయడంతో మందుబాబులు ముప్పూటలా మందులో మునిగితేలారు. జిల్లాలో 170 మద్యం దుకాణాలు, 35 బార్లు, 7 ప్రభుత్వ దుకాణాలు, రెండు క్లబ్లు ఉన్నాయి. వీటి ద్వారా మార్చి ఒకటి నుంచి మే 7వ తేదీ వరకు దాదాపు రూ.113 కోట్ల విలువ చేసే విక్రయాలు చేపట్టారు. కోడ్ అమల్లోకి వస్తే మద్యం విక్రయాలపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధిస్తుందనే ముందుచూపుతో ఫిబ్రవరిలోనే భారీ మోతాదులో సరుకును నిల్వ చేసుకున్నారు. 28 రోజుల్లో మొత్తం రూ.57.04 కోట్లు విలువ చేసే 1,41,625 కేసుల మద్యం, లక్ష బీరు కేసులను ముందుగానే నిల్వ చేయడం గమనార్హం. 28వ తేదీ ఒక్క రోజే 8.29 కోట్ల రూపాయల మద్యం కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు. మార్చి నెలలో 1,20,328 కేసుల మద్యం, 96,337 కేసుల బీరు, ఏప్రిల్లో 1,16,437 కేసుల మద్యం, 1,23,757 కేసుల బీరు.. మే మొదటి వారంలో 24,880 కేసుల మద్యం, 21,108 కేసుల బీరు అమ్మకాలు చేపట్టారు. మద్యం అమ్మకాలపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించడంతో కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున దిగుమతి చేసుకున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థులు భారీ ఎత్తున కర్ణాటక మద్యాన్ని ఏరులై పారించారు. ఏప్రిల్ నెలాఖరున వారం రోజుల పాటు మద్యం కొరత ఏర్పడటంతో వ్యాపారులు కూడా కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున తరలించి విక్రయాలు జరిపారు. అధికారిక లెక్కల ప్రకారం రూ.113 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా.. అనధికార లెక్కల ప్రకారం మరో వంద కోట్ల విలువ చేసే మద్యం విక్రయించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా నాటుసారా విక్రయాలు కూడా జోరుగా సాగాయి. జిల్లాలో నాటుసారా వ్యాపారం కుటీర పరిశ్రమగా మారింది. 200 పైగా స్థావరాలు ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా పట్టణ ప్రాంతాలకు పెద్ద ఎత్తున తరలించారు. రూ.50 కోట్లకు పైగా నాటుసారా అమ్మకాలు జరిగినట్లు అనధికారిక అంచనా. వరుస ఎన్నికలు.. ప్రతి ఎన్నికకు పోలింగ్ ముందు రెండు రోజులు మద్యం దుకాణాలు సీల్ చేయడంతో నిల్వ చేసుకున్న మద్యాన్ని వ్యాపారులు అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకోవడం గమనార్హం. -
గుబుల్.. గుబుల్ !
సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు కౌంట్డౌన్ మొదలైంది. మరో ఐదు రోజులు గడిస్తే ఎవరి జాతకం ఏమిటో తేలిపోతుంది. పోలింగ్ ముగిసి ఇప్పటికే పది రోజులు గడిచిపోయాయి. ఇన్ని రోజులపాటు రకరకాల సమీకరణలు, అంచనాలు, విశ్లేషణలు చేస్తూ వచ్చిన వారు స్వతంత్ర అభ్యర్థులు ఇచ్చిన పోటీపై భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రధానంగా నాలుగు నియోజకవర్గాల ఫలితాలపై వీరి ప్రభావం ఉంటుందన్న చర్చ జరుగుతోంది..!! సాక్షిప్రతినిధి, నల్లగొండ: ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులకు దీటుగా ప్రచారంలో దూసుకుపోయిన నలుగురు స్వతంత్ర అభ్యర్థుల విషయంలోనూ గెలుపు అంచనాలు ఉన్నాయి. వీరు గెలుస్తారా..? వీరు చీల్చే ఓట్ల వల్ల ఏ పార్టీ అభ్యర్థి లాభ పడతారు..? అన్న అంశాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. వాస్తవానికి జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ, బహుముఖ పోటీలే జరిగాయి. భువనగిరి, మునుగోడు, నల్లగొండ, సూర్యాపేట నియోజకవర్గాల్లో ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులకు తోడు స్వతంత్ర అభ్యర్థులూ గట్టి పోటీలో ఉండడంతో ఇప్పుడు అందరి దృష్టి వీరిపైనే ఉంది. ఈ నాలుగు నియోజకవర్గాల ఫలితాల గురించి చర్చించే వారు విధిగా ఇక్కడ పోటీలో ఉన్న స్వతంత్రులను పరిగణనలోకి తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. జిట్టా .. ఎట్టెట్టా ! భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో సుదీర్ఘ కాలంగా టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఒక్కసారి కూడా కోల్పోని నియోజకవర్గం ఇదే. కానీ, ఈసారి పరిస్థితి తారుమారవుతోందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఇక్కడ టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్తో పాటు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న జిట్టా బాలకృష్ణారెడ్డిల మధ్యనే గట్టి పోటీ నడిచింది. పోలింగ్ ముగిశాక, సరళిని బట్టి అంచనా వేస్తున్న వారు జిట్టా చీల్చుకునే ఓట్లే కీలకం కానున్నాయన్న వాదన వినిపిస్తున్నారు. ఒక దశలో పోటీ స్వతంత్ర అభ్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి మధ్యనే సాగిందన్న ప్రచారమూ తెరపైకి వచ్చింది. తెలంగాణ సెంటిమెంట్ ఓటు కీలకమైన ఈ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి జిట్టా సహా మిగిలిన మూడు పార్టీలూ ఈ ఓటునే నమ్ముకున్నాయి. ఈ కారణంగానే నలుగురు అభ్యర్థుల మధ్య ఓట్లు భారీగా చీలిపోతాయని అంచనా వేస్తున్నారు. సిట్టింగ్ పార్టీ అయిన టీడీపీ వ్యతిరేక ఓటును ఎవరు ఎక్కువగా తీసుకుంటే వారికే గెలుపు అవకాశాలు ఉంటాయన్న చర్చా జరుగుతోంది. దీంతో ఇక్కడ జిట్టా చీల్చుకునే ఓట్లపైనే భువనగిరి ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపోటములు ఆధారపడి ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కంచర్లతో .. కంగారు టీడీపీ, బీజేపీ పొత్తువల్ల టికెట్ దక్కని ్గ టీడీపీ నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జ్ కంచర్ల భూపాల్రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఒకింత దూకుడును ప్రదర్శించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య ద్విముఖం అనుకున్న పోటీని త్రిముఖ పోటీగా మార్చారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు తక్కువ కాకుండా ప్రచారానికి, ఇతరత్రా ఆర్థిక వనరులను బాగానే వినియోగించారు. నల్లగొండ మున్సిపాలిటీలో కంచర్ల చీల్చుకునే ఓట్లే కీలకం కానున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థి దుబ్బాక నర్సింహారెడ్డి పూర్తిగా తెలంగాణ సెంటిమెంట్ ఓటుపై ఆధారపడగా, సిట్టింగ్ అభ్యర్థి కోమటిరెడ్డి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా కూడా పనిచేసిన కాలంలో చేపట్టిన అభివృద్ధి, తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవిని వదులుకుని చేసిన త్యాగంపై ఆశపెట్టుకున్నారు. ఒక విధంగా కాంగ్రెస్, టీఆర్ఎస్లు తెలంగాణ ఓటును చీల్చుకున్నాయి. కాగా, టీడీపీ టికెట్ రాని సానుభూతిని ఓటు చేసుకునేందుకు ఇండిపెండెంట్గా పోటీలోకి దిగిన కంచర్ల భూపాల్రెడ్డి ఎవరి ఓట్లు చీల్చారు..? అది ఎవరికి లాభిస్తుందన్న చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. సంకినేనితో.. సంకటం సూర్యాపేట నియోజవర్గంలోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ బరిలో ఉండగా, టీడీపీ మిత్రపక్షం బీజేపీకి చెందిన సంకినేని వెంకటేశ్వరరావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక్కడా టీడీపీ, బీజేపీ పొత్తు ఫలించలేదు. దీంతో సంకినేని చీల్చే ఓట్లు మొదట టీడీపీని దెబ్బతీసినా, మొత్తంగా ఫలితాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే అంచనా వేయలేకపోతున్నారు. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమైన సూర్యాపేటలో భిన్నమైన రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్లు పూర్తిగా తెలంగాణ వాదం ఓటుపైనే ఆశలు పెట్టుకున్నాయి. కాంగ్రెస్ వ్యతిరేక ఓటు కూడా కీలకం కానుంది. ఈ దశలో స్వతంత్ర అభ్యర్థి ఎవరి ఓట్లు చీల్చుకున్నారు..? ఇది ఎవరికి లాభిస్తుంది..? అన్న అంశాలపై చర్చ నడుస్తోంది. స్రవంతి .. ముంచేదెవరిని..? మునుగోడు నియోజకవర్గంలో ముందునుంచీ టికెట్ ఆశించి భంగపడిన ఏఐసీసీ సభ్యురాలు పాల్వాయి స్రవంతి ఇండిపెండెంటుగా పోటీకి దిగారు. కాంగ్రెస్, సీపీఐల మధ్య కుదిరిన ఎన్నికల పొత్తులో భాగంగా సీపీఐ సిట్టింగ్ స్థానమైన మునుగోడును ఆ పార్టీకే వదిలేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన స్రవంతి తమ మిత్రపక్షం అభ్యర్థిపైనే రెబల్గా పోటీకి దిగాల్సి వచ్చింది. కాంగ్రెస్ ఓట్లు దాదాపు సీపీఐకి బదిలీ కాలేదన్న అభిప్రాయం ఉంది. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఫలించనట్లే కనిపిస్తోంది. ఈపరిణామం టీఆర్ఎస్కు వరంగా మారిందన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. సీపీఐ తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటుందా..? లేక స్వతంత్ర అభ్యర్థి సొంతం చేసుకున్న కాంగ్రెస్ ఓట్లు (సీపీఐకి బదిలీ కానివి) టీఆర్ఎస్ను గట్టెక్కిస్తాయా..? అన్న ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి. మొత్తంగా జిల్లాలో ఈ నాలుగు నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులు కీలకం అయ్యారు. వీరు రాబట్టుకునే ఓట్లే అభ్యర్థుల గెలుపోటములను నిర్ధేశించనున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
కేసీఆరే సీఎం
సంగారెడ్డి డివిజన్, న్యూస్లైన్: టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఆ పార్టీ అధినేత కేసీఆరే ముఖ్యమంత్రి పదవి చేపట్టాలంటూ సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కేసీఆర్ ఒక్కరితోనే సాధ్యమని ఆయనే కొత్త రాష్ర్ట సీఎం బాధ్యతలు చేపట్టాలని ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్తోపాటు పలువురు నియోజకవర్గ నాయకులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. శనివారం టీఆర్ఎస్ జిల్లా నాయకుడు నరహరిరెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ టీఆర్ఎస్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్ అభ్యర్థుల సమావేశం జరిగింది. సమావేశానికి చింతా ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో పాల్గొన్న నాయకులు, స్థానిక సంస్థల అభ్యర్థులు కేసీఆర్ సీఎం పదవిచేపట్టాలంటూ తీర్మానం చేశారు. అంతకుముందు సమావేశంలో చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు 12, 13 తేదీల్లో జరగనున్నట్లు చెప్పారు. ఎన్నికల కౌంటింగ్ సంబంధించి ఏజెంట్ల నియామకాలు పూర్తి చేయాలని, ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అభ్యర్థులు, ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఎక్కడ ఎలాంటి చిన్నపొరపాటు కనిపించినా వెంటనే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకవెళ్లాలని సూచించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అభ్యర్థులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఫలితాలు వెలువడిన వెంటనే అభ్యర్థులు తనను కలవాలన్నారు. అలాగే సమావేశంలో ప్రసంగించిన పలువురు అభ్యర్థులు ఎమ్మెల్యేగా గెలుపొందనున్న చింతా ప్రభాకర్కు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేయటం చర్చనీయాంశమైంది. సమావేశంలో పార్టీ నాయకులు విజయేందర్రెడ్డి, జలాలుద్దీన్బాబా, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్చారి, కసిని విజయ్కుమార్, హరికిషన్, సాయికుమార్, రాజేందర్నాయక్, నాని, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్కే పట్టం.. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి రావటం ఖాయమని చింతా ప్రభాకర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నాయకులు సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎం అయితేనే బంగారు తెలంగాణ నిర్మాణం సాధ్యమన్నారు. పార్టీ మేనిఫెస్టోకు అనుగుణంగా ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలతోపాటు తెలంగాణ అభివృద్ధికి తమ పార్టీ అధినేత కట్టుబడి ఉంటారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ సంగారెడ్డి నియోజకవర్గంలోని మెజార్టీ స్థానాల్లో గెలుపొందటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. -
17న ఓటరు పండుగ విజేతలకు బహుమతులు
కలెక్టరేట్, న్యూస్లైన్: సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కలెక్టర్ స్మితా సబర్వాల్ నిర్వహించిన ‘ఓటరు పండుగ’లో విజేతలుగా నిలిచిన వారికి ఈనెల 17న బహుమతులు ప్రదానం చేయనున్నారు. పోలింగ్ 95 శాతం నమోదైన గ్రామాలకు రూ.2 లక్షల నగదు ప్రోత్సాహకాలు అందజేయడానికి ప్రణాళిక రూపొందించి ఆ మేరకు ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ఓటరు పండగను ఘనంగా నిర్వహించారు. గత నెల 30న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 92 శాతానికిపైగా పోలింగ్ నమోదైన గ్రామాలు జిల్లా వ్యాప్తంగా 102 ఉన్నాయి. ఆయా గ్రామాల్లో పది మంది చొప్పున లక్కీడిప్ ద్వారా విజేతలను ఈనెల 8న కలెక్టరేట్లోని ఆడిటోరియంలో ఎంపిక చేశారు. కలెక్టర్ స్మితా సబర్వాల్ సమక్షంలో జిల్లా ఉపాధి కల్పనాధికారి రజనీప్రియ ఓటర్ల సమక్షంలో డ్రా తీశారు. డ్రాలో ఎంపికైన వారికి సుమారు రూ.1,300 నుంచి రూ.1,400 విలువ చేసే బహుమతులను ఈనెల 17న సంగారెడ్డిలోని కలెక్టరేట్ ఆడిటోరియలో నిర్వహించే ఓటరు పండుగ కార్యక్రమంలో అందజేస్తారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,020 మంది విజేతలుగా ఎంపికయ్యారు. ఇందులో ఐదుగురికి బంపర్ బహుమతులతోపాటు ఒకరికి మెగా బహుమతి కింద నానో కారు అందజేస్తారు. నియోజకవర్గాల వారీగా ఓటింగ్ శాతం వివరాలు.. సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నియోజకవర్గాల వారిగా పోలైన ఓట్ల వివరాలు రిటర్నింగ్ అ‘దికారుల నుంచి శనివారం రాష్ట్ర ఎన్నికల ప్ర‘దాన కార్యాలయూనికి అందార వివరాలు ఇలా ఉన్నార. మెదక్ జిల్లా 1. సిద్ధిపేట 74.20 2. మెదక్ 77.57 3. నారాయుణఖేడ్ 77.18 4. ఆం‘దోల్(ఎస్సీ) 79.35 5. నర్సాపూర్ 85.97 6. జహిరాబాద్(ఎస్సీ) 70.66 7. సంగారెడ్డి 73.68 8. పటాన్చెరు 67.67 9. దుబ్బాక 82.52 10. గజ్వేల్ 83.85 -
ఎన్నికల సమీక్షకు కాంగ్రెస్ నేతల డుమ్మా
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్లైన్: స్థానిక సంస్థలు, మున్సిపల్, సాధారణ ఎన్నికల్లో విజయావకాశాలపై సమీక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ శనివారం ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా ముఖ్య నేతలు డుమ్మా కొట్టారు. దీంతో సమావేశం మొక్కుబడిగా సాగింది. డీసీసీ అధ్యక్షులు భూపాల్రెడ్డి విదేశీ పర్యటన లో ఉన్నందున సమావేశానికి రాలేకపోయారని డీసీసీ ప్రధాన కార్యదర్శి జగన్మోహన్రెడ్డి సమావేశంలో తెలిపారు. అసెంబ్లీ అభ్యర్థులైన మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ, మాజీ మంత్రులు గీతారెడ్డి, సునీతారెడ్డితోపాటు తాజా మాజీ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, పి.కిష్టారెడ్డి, నందీశ్వర్గౌడ్, మెదక్ ఎమ్మెల్యే అభ్యర్థి విజయశాంతి, సిద్దిపేట ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్గౌడ్ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఇదిలావుంటే జహీరాబాద్, మెదక్ లోక్సభ అభ్యర్థులు సురేశ్ షెట్కార్, శ్రావణ్కుమార్రెడ్డిలు సైతం డుమ్మా కొట్టారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే సమావేశానికి హాజరు కాలేదనే విమర్శలు ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతుండడం వల్లే వీరు సమావేశానికి హాజరు కాలేదని తెలుస్తోంది. సమావేశం సాగింది ఇలా.. డీసీసీ ప్రధాన కార్యదర్శి జగన్మోహన్రెడ్డి అధ్యక్షత మధ్యాహ్నం 3 గంటలకు సంగారెడ్డిలోని ఇందిర భవన్లో సమావే శం కొనసాగింది. ఈ సమావేశంలో పోలింగ్ సరళిపై చర్చించారు. ఈ సందర్భంగా గజ్వేల్ తాజా మాజీ ఎమ్మెల్యే టి.నర్సారెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు అత్యధిక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక తాజా మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎన్నికలను మూడేళ్ల క్రితమే నిర్వహించి ఉంటే జిల్లాకు రూ.3,500 కోట్లు వచ్చి ఉండేవన్నారు. జెడ్పీ పీఠాన్ని సైతం దక్కించుకునేందుకు సమష్టిగా పని చే యాలని సూచించారు. -
రాజకీయ పార్టీల్లో గుబులు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఈ నెల 12న మునిసిపల్, 13న మండల, జిల్లా ప్రాదేశిక, 16న అసెంబ్లీ, పార్లమెంట్ ...ఇలా వరుసగా ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే ఘడియ సమీపిస్తుండడంతో అన్ని రాజకీయ పార్టీల్లో గుబులు నెలకొంది. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులతో పాటు ప్రధాన నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రత్యర్థులను చిత్తు చేసే వ్యూహాలతో వరుస ఎన్నికలను ఎదుర్కొన్న రాజకీయ పార్టీల అభ్యర్థులకు ఫలితాల గడువు సమీపించే కొద్దీ.. పల్స్ రేటు పెరుగుతోంది. ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆలోచనలతో అభ్యర్థులు రోజులను భారంగా గడుపుతున్నారు. ఫలితాల టెన్షన్ నుంచి బయటపడేందుకు ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుంటున్నారు. కుటుంబంతో గడపడం, కార్యక్రమాలకు వెళ్లడం చేస్తున్నారు. అయితే అభ్యర్థులు ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లినా... ఫలితాల ప్రస్తావనే వెంటాడుతోంది. ‘పుర’ పరీక్షే.. గతంలో ఎప్పుడూ లేనివిధంగా సాధారణ ఎన్నికలకు ముందు వచ్చిన మునిసిపల్, పరిషత్ ఎన్నికల ఫలితాలు ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారాయి. జిల్లాలో జనగామ, మహబూబాబాద్ మునిసిపాలిటీలు, పరకాల, నర్సంపేట, భూపాలపల్లి నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. వీటి ఫలితాలు ఈ నెల 12న వెలువడనున్నారుు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సొంత నియోజకవర్గం కావడంతో జనగామ మునిసిపల్ ఎన్నికల ఫలితం ఆసక్తికరంగా ఉండనుంది. గత ఎన్నికల్లో మాదిరిగానే ప్రస్తుత సాధారణ ఎన్నికల్లోనూ పొన్నాల లక్ష్మయ్యకు టీఆర్ఎస్ అభ్య ర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి మధ్య హోరాహోరీగా పోరు సాగింది. గెలుపుపై రెండు పార్టీలు ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఫలితాలు రావడానికి నాలుగు రోజుల ముం దు వెల్లడయ్యే జనగామ మునిసిపల్ ఫలి తంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భూపాల పల్లి నగరపంచాయతీ ఎన్నికల ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల తీర్పును ప్రభావితం చేస్తుందనే వాదనలు వినపడుతున్నారుు. మునిసిపల్ ఎన్నికల తర్వాత ఇక్కడి రాజ కీయ పరిస్థితులు మారిపోగా... గండ్ర వెంకట రమణారెడ్డి భవితవ్యాన్ని తేల్చనున్నట్లు శ్రేణు లు భావిస్తున్నారుు. మానుకోట మునిసిపల్ ఎన్నికల ఫలితం ఇదే తీరుగా ఆసక్తిని పెంచుతోంది. నర్సంపేట, పరకాల నగర పంచాయతీల ఎన్నికల ఫలితాలు ఇక్కడి రాజకీయ పార్టీల అభ్యర్థులకు పరీక్షగానే మారాయి. ‘పరిషత్’ ప్రామాణికం... సాధారణ ఎన్నికలకు ముందు జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలపైనే అన్ని పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఈ ఎన్నికల్లో మెజారిటీ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడంతోపాటు వీటి ఫలితాలు, ఎమ్మెల్యే ఎన్నికల ఫలితాలకు దగ్గరగా ఉంటాయనే అభిప్రాయం నేతల్లో ఉంది. ఎంపీటీసీ ఎన్నికలు ఆయా గ్రామాల్లోని స్థాని క సమీకరణలపై జరిగినా... జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు మాత్రం సాధారణ ఎన్నికల ఫలితాలకు దగ్గరగా ఉంటాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 13న వెల్లడ య్యే పరిషత్ ఫలితాలను ఎమ్మెల్యే అభ్యర్థులు తమ గెలుపోటములకు ప్రామాణికంగా తీసుకుంటున్నారు. నర్సంపేట, భూపాలపల్లి, పరకాల నియోజకవర్గాల్లో పరిషత్, సాధారణ ఎన్నికల మధ్య రాజకీయ పరిస్థితుల్లో తేడా ఉంది. అప్పటివరకు నర్సంపేట కాంగ్రెస్ ఇన్చార్జ్గా స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దొంతి మాధవరెడ్డికి ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. భూపాలపల్లి నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జ్గా ఉన్న గండ్ర సత్యనారాయణరావు... బీజేపీ అభ్యర్థిగా సాధారణ ఎన్నికల బరిలోకి దిగారు. పరకాల నియోజకవర్గం లో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ దక్కలేదు. ఆయన స్థానంలో సహోదర్రెడ్డి పోటీ లో ఉన్నారు. ఇలా మూడు సెగ్మెంట్లు మినహాయిస్తే... మిగిలిన అన్నింటిలోనూ స్థానిక, సాధారణ ఎన్నికలను ఆయా పార్టీల నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నేపథ్యం లో స్థానిక ఫలితాలు వచ్చిన తర్వాత మూడో రోజు సాధారణ తీర్పు వెలువడుతుండడం అభ్యర్థుల్లో టెన్షన్ పెంచుతోంది. -
కాంగ్రెస్తోనే సామాజిక న్యాయం సాధ్యం
తిరుమలగిరి, న్యూస్లైన్: సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం తథ్యమని ఆ పార్టీ తుంగతుర్తి అసెంబ్లీ అభ్యర్థి అద్దంకి దయాకర్ అన్నారు. తిరుమలగిరి మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీతోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ప్రజలంతా నమ్మారని అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యమని, బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం ఇచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిందని, కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో సంకెపల్లి పద్మనాభరెడ్డి, ఎస్.రఘునందన్రెడ్డి, మల్లయ్య, నరోత్తమ్రెడ్డి, సుజన్, సతీశ్రెడ్డి, కె.సతీశ, రవీందర్, రామ్మూర్తిగౌడ్, సల్ల వెంకన్న, ఉప్పలయ్య, శ్రీనివాస్రెడ్డి, షకీల్, నాని పాల్గొన్నారు. తడిసిన ధాన్యం పరిశీలించిన దయాకర్ మోత్కూరు : అకాలవర్షంతో మోత్కూరు మార్కెట్లో తడిసిన ధాన్యం రాశులను కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి అసెంబ్లీ అభ్యర్థి అద్దంకి దయాకర్ శుక్రవారం పరిశీలించారు. ఆయన వెంట నాయకులు పైళ్ల సోమిరెడ్డి, బుం గపట్ల యాకయ్య, బయ్యని పిచ్చయ్య, గుర్రం లక్ష్మీనర్సింహారెడ్డి, వంగాల సత్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, చింతల ఉపేందర్రెడ్డి, ఎండీ సమీర్ ఉన్నారు. -
అంతా సిద్ధం ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
నల్లగొండ, న్యూస్లైన్: వరుస ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మున్సిపల్ ఓట్ల లెక్కింపు 12న, ప్రాదేశికం 13న, సార్వత్రిక ఫలితాలు 16వ తేదీన వెలువరించేందుకు అంతా రెడీ అయ్యింది. మున్సిపల్ ఓట్లను జిల్లా కేంద్రంలో లెక్కిస్తుండగా, సార్వత్రిక కౌంటింగ్ను నల్లగొండ, భువనగిరి, మిర్యాలగూడ, సూర్యాపేట, దేవరకొండలలో చేపట్టనున్నారు. ఇక, ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల ఓట్ల లెక్కింపును నల్లగొండ పట్టణంలో నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపునకు నియమించిన సిబ్బందితో పాటు అభ్యర్థులకు కూడా కౌంటింగ్లో పాటించాల్సిన నియమాలపై శిక్షణనిచ్చారు. సార్వత్రిక ఓట్ల లెక్కింపుపై శుక్రవారం అభ్యర్థులు, ఏజెంట్లకు సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీ జిల్లాలోని ఐదు మున్సిపాలిటీ, రెండు నగర పంచాయతీలకు 12న నల్లగొండలోని డాన్బోస్కో పాఠ శాలలో ఓట్లు లెక్కిస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. లెక్కింపునకు మొత్తం 37టేబుళ్లు ఏర్పాటు చేశారు. 148మంది సిబ్బందిని కేటాయించి వారికి శిక్షణ కూడా ఇచ్చారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలలోని ఓట్లు లెక్కిసారు. వీటి ఫలితాలు మధ్యాహ్నం 12గంటల వరకు వెలువడే అవకాశం ఉంది. ప్రాదేశికం... ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో జరిగాయి. తొలివిడత ఏప్రిల్ 6న సూర్యాపేట, మిర్యాలగూడ, దేవరకొండ డివిజన్ల పరిధిలోని మండలాల్లో నిర్వహించారు. రెండో విడత 11న నల్లగొండ, భువనగిరి డివిజన్లలో ఎన్నికలు జరి గాయి. ఈ ఎన్నికల్లో 86.41శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 835ఎంపీటీసీ స్థానాలకు 3,311 మంది అభ్యర్థులు పోటీచేశారు. 59జెడ్పీటీసీ స్థానాలకు 392మంది పోటీ చేశారు. 13న ఈ ఓట్ల లెక్కింపునకు 2వేల మంది సిబ్బందిని నియమించారు. వారికి శిక్షణ ఇచ్చారు. అలాగే 483 టేబుళ్లను సిద్ధం చేశారు. ప్రతి టేబుల్కు మూడు రౌండ్ల లెక్కింపు చేస్తారు. జిల్లాలో అధికంగా చౌటుప్పల్ మండలానికి 12టేబుళ్లు కేటాయిం చారు. యాదగిరిగుట్ట, వలిగొండ, భువనగిరి, బీబీనగర్ మండలాలకు 10టేబుళ్లు, చిన్న మండలాలకు 6నుంచి 8టేబుళ్లు కేటాయించారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు మొదలవుతుంది. బాక్సుల్లోనుంచి తీసిన ఓట్లనుంచి జెడ్పీటీసీకి కేటాయించిన తెల్లరంగు బ్యాలెట్, ఎంపీటీసీకి కేటాయించిన గులా బీ రంగు బ్యాలెట్లను వేరు చేస్తారు. వాటిని ఆయా గుర్తులతో ముందుగానే సిద్ధం చేసిన ట్రేల ల్లో వేస్తారు. ఎంపీటీసీ స్థానం లెక్కింపు మూడు రౌండ్లుగా జరుగుతుంది. ఒక్కో రౌండ్కు సుమా రు వెయ్యి ఓట్లను లెక్కపెడతారు. మధ్యాహ్నం 3 గంటవరకు ఎంపీటీసీల ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. జెడ్పీటీసీల లెక్కింపు రాత్రి వరకు పూర్తికావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 25 ఓట్లను ఒక కట్టగా కట్టి ఓట్లను లెక్కపెడతారు. సార్వత్రిక కౌంటింగ్ రెండుచోట్ల.. సార్వత్రిక ఎన్నిక ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు 161, స్వతంత్రులు 67మంది పోటీ చేశారు. చిన్నా చితకా కలిపి 19పార్టీలు బరిలో నిలిచాయి. ఒక్కో నియోజకవర్గం నుంచి 15మంది అభ్యర్థులకు తగ్గకుండా పోటీ చేయగా, మునుగోడు, కోదాడ నియోజకవర్గాల్లో మాత్రం 17మంది చొప్పున పోటీ చేశారు. సార్వత్రిక ఓట్ల లెక్కింపు నల్లగొండ పట్టణంలోని రెండు కేంద్రా ల్లో జరుగుతుంది. నల్లగొండ పార్లమెంట్ సెగ్మెం ట్ పరిధిలోని 7నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు గొల్లగూడలోని భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ)లో, భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 5నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు దుప్పల పల్లి సమీపంలో ఉన్న రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాముల్లో నిర్వహించనున్నారు. 16వ తేదీ (శుక్రవారం) ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుంది. దీని నిర్వహణకు ఒక్కో నియోజక వర్గానికి 24 టేబుళ్లను ఏర్పాటు చేయనున్నారు. దీంట్లో ఎమ్మెల్యే అభ్యర్థులకు 12, ఎంపీ అభ్యర్థులకు 12టేబుళ్లు ఉంటాయి. కౌంటింగ్లో ఈవీఎంలు తెరవడానికి ముందు జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో పోస్టల్ బ్యాలె ట్ ఓట్లను లెక్కిస్తారు. ఈ లెక్కింపు 6వ టేబుల్పై జరుగుతుంది. తర్వాత ఈవీఎం లెక్కింపులోని అన్ని రౌండ్ల ఫలితాలను ప్రకటిస్తారు. రిటర్నింగ్ అధికారి టేబుల్ మీద బ్యాలెట్ పత్రాల గణన జరుగుతుండగానే పోలింగ్ స్టేషన్ నుంచి వచ్చిన ఓటింగ్ యంత్రాల కంట్రోల్ యూనిట్లను లెక్కిం పు టేబుళ్లకు పంపిణీ చేస్తారు. ప్రతి టేబుల్ వద్ద ఒక పోలింగ్ స్టేషన్లో పోలైన ఓట్లు లెక్కింపు ఒకే సారి చేపట్టడం జరగుతుంది. లెక్కింపు టేబుళ్లను బట్టి అన్ని పోలింగ్ స్టేషన్ల ఓట్ల లెక్కింపు ఏక కాలంలో మొదటి రౌండ్ లెక్కింపుగా చేపడతారు. ఈ విధంగా 18నుంచి 20 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. మధ్యాహ్నం 3 గంటల్లోగా ఓట్ల లెక్క పూర్తిచేసి ఫలితాలు వెల్లడిస్తారు. దీనికి సంబంధించిన మాక్ కౌంటింగ్ను 15వ తేదీన నిర్వహిస్తారు. లెక్కింపు కేంద్రంలోకి ఇవి నిషేధం.. కౌంటింగ్ హాల్లోకి ప్రవేశించే అభ్యర్థులు, ఏజెం ట్లు తమతో పాటు పేలుడు పదార్థాలు, మారణాయుధాలు, కెమెరాలు, సిగరెట్లు, గుట్కాలు, పాన్లు, ఇతర మత్తు పదార్థాలు, సెల్ఫోన్లు తీసుకురావడాన్ని నిషేధించారు. -
కౌంటింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్లైన్: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తి అయినందున కౌటింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టిసారించాలని జిల్లా అధికారులను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్లాల్ ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కౌంటింగ్ ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా నిర్వహించడానికి కృషి చేసిన కలెక్టర్, జాయింట్కలెక్టర్, రిటర్నింగ్ అధికారులను అభినందించారు. అదే తరహాలో కౌంటింగ్ను పకడ్బందీగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని వివరించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యే సమయానికి వచ్చే పోస్టల్ బ్యాలెట్లను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. ఆలోపు వచ్చే పోస్టల్ బ్యాలెట్లను పకడ్బందీగా భద్ర పరచాలని తెలిపారు. కౌంటింగ్ రోజు ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాలని తెలిపారు. పార్లమెంట్ ఓట్ల లెక్కింపు కేంద్రంలోనే ప్రత్యేక టేబుళ్లను తగినన్ని ఏర్పాటు చేసుకొని పోస్టల్ బ్యాలెట్లు లెక్కించాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఫొటోలతో కూడిన డాక్యుమెంటేషన్ తయారు చేసి పంపాలని తెలిపారు. పత్రికల్లో వచ్చిన చెల్లింపు వార్తలకు సంబంధించి అభ్యర్థులకు నోటీసులు ఇచ్చి ఫైనలైజ్ చేయాలని తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద విద్యుత్ సరఫరాకు ఎటువంటి అంతరాయం లేకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కర్నూలు నుంచి కలెక్టర్ సి.సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ.. కౌంటింగ్ కేంద్రాలను ఎస్పీతో కలిసి సందర్శిస్తూ ఏర్పాట్లు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచి తగిన బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కౌంటింగ్ సందర్భంగా జిల్లాకు మరో ఐదుగురు పరిశీలకులు అవసరమని పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున 28 మంది మైక్రో పరిశీలకులను నియమించుకుంటున్నట్లు తెలిపారు. కర్నూలు నుంచి వీడియో కాన్ఫరెన్స్లో జేసీ కన్నబాబు, ఎస్పీ రఘురామిరెడ్డి, ఏజేసీ రామస్వామి, రిటర్నింగ్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. -
7,98,892 బద్ధకస్తులు
సాక్షి, కర్నూలు: ఓటు వజ్రాయుధం వంటిది. రాజ్యాంగం కల్పించిన ఈ హక్కును ప్రతి ఒక్కరూ తప్పని సరిగా వినియోగించుకోవాలి. మంచి నాయకున్ని ఎన్నుకోవాలి.. అంటూ జిల్లా అధికారులు చేసిన ప్రచారం ఫలించలేదు. పోలింగ్ శాతం పెరిగితే ఓటర్లకు సెల్ఫోన్లు ఇస్తామని ఆశ చూపినా ప్రయోజనం లేకపోయింది. కళా జాతాలు, చైతన్య కార్యక్రమాలు నిర్వహించి ఓటింగ్ శాతం 80 నుంచి 85 వరకు రాబట్టాలని జిల్లా ఎన్నికల అధికారులు యత్నించారు. అయితే వారి అంచనాలు తారుమారయ్యాయి. 2009 కంటే స్వల్పంగా నాలుగు శాతం పోలింగ్ పెరిగి 74తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జిల్లా కేంద్రమైన కర్నూలు నియోజకవర్గంలో అత్యల్పంగా 58 శాతం నమోదైంది. అత్యధికంగా శ్రీశైలం నియోజకవర్గంలో 81 శాతం పోలింగ్ జరిగింది. ఈ సారి పట్టణ ఓటర్ల కంటే మారుమూల ప్రాంతాల్లోని వారే ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కర్నూలు, ఆదోని నియోజకవర్గాలు మినహా మిగిలిన 12 నియోజకవర్గాల్లో 70 శాతానికి మించి పోలింగ్ నమోదు కావడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా 30,56,867 మంది ఓటర్లుండగా 22,57,975 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిగిలిన 7,98,892 మంది ఓటర్లు తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోలేదు. పురుషుల్లో 11,40,336 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోగా.. జిల్లాలో అత్యధిక ఓటర్లుగా ఉన్న మహిళలు 11,17,619 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళ, పురుష ఓటర్ల మధ్య తేడా 38,431 ఓట్లు ఉండటం విశేషం. అయితే బనగానపల్లె నియోజకవర్గంలో మహిళలు 87,598 మంది ఓటు హక్కు వినియోగించుకోగా.. పురుషులు 85,570 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషులకంటే 2,028 మంది మహిళలు అదనంగా ఓటు హక్కును వినియోగించుకోవడం గమనార్హం. ఓటింగ్ తగ్గడానికి కారణాలు ఇవే.. విద్యా సంస్థలకు పది రోజుల ముందే వేసవి సెలవులు ఇచ్చేయడం.. చాలా మంది స్వస్థలాలకు వెళ్లడంతో వీరు పోలింగ్కు గైర్హాజరయ్యారని తెలుస్తోంది. నివాస ప్రాంతాలకు దూరంగా ఉన్న పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి చూపలేదు. జిల్లాలో వందకు పైగా పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో బారులు తీరిన ఓటర్లు వేచిచూడలేక వెనుదిరిగారు. ఓటరు చిట్టీల పంపిణీ చాలా చోట్ల సరిగా జరగలేదు. కొన్ని కేంద్రాల్లో స్త్రీ, పురుషులకు వేర్వేరు ఏర్పాట్లు లేకపోవడంతో పలువురు ఓటేయకుండా వెనుదిరిగారు. నెల రోజుల కిందట జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో ఆయా ప్రాంతాల్లోనే ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను మార్చడంతో ఓటర్లు తికమక పడ్డారు. -
ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
ఏలూరు, న్యూస్లైన్ : జిల్లాలో ఈ నెల 16న ఉదయం 8 గంటలకు మూడు ప్రాంతాల్లో అసెంబ్లీ, లోక్సభ ఓట్ల లెక్కింపును మొదలుపెట్టాలని నిర్ణయించినట్లు కలెక్టర్ సిద్ధార్థజైన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వట్లూరులోని సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును నిర్వహిస్తారు. సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాల మొదటి అంతస్తులో కొవ్వూరు, రెండో అంతస్తులో నిడదవోలు, గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ, లోక్సభ ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. వట్లూరులోని రామచంద్ర ఇంజినీరింగ్ కళాశాలలో ఏలూరు పార్లమెంట్ పరిధిలోని ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, చింతల పూడి అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుతో పాటు లోక్సభ ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహిస్తామని పేర్కొన్నారు. నరసాపురం లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ లోక్సభ ఓట్ల లెక్కింపును భీమవరంలోని విష్ణు కళాశాలలో చేపట్టనున్నామన్నారు. అలాగే ఇదే కళాశాల ప్రాంగణంలోని బి.సీత పాలిటెక్నిక్ కళాశాలలో ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం అసెంబ్లీ, లోక్సభ ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. పరిషత్ ఓట్ల లెక్కింపు ఈ పట్టణాల్లో.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపును ఏలూరు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, తణుకు, భీమవరంలలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ సిద్ధార్థజైన్ తెలిపారు. ఏలూరులో టి.నరసాపురం, కామవరపుకోట, లింగపాలెం, ఉంగుటూరు, గణపవరం, పెదపాడు, పెదవేగి, దెందులూరు, భీమడోలు, టి.నరసాపురం, చింతలపూడి, ద్వారకాతిరుమల, ఏలూరు మండలాల ఓట్లను లెక్కిస్తామన్నారు. అలాగే తాడేపల్లిగూడెంలో పెంటపాడు, నల్లజర్ల, తాడేపల్లిగూడెం మండలాలకు సంబంధించినవి, జంగారెడ్డిగూడెంలో పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం మండలాలివి, తణుకులో ఉండ్రాజవరం, అత్తిలి, పెనుమంట్ర, పెనుగొండ, కొవ్వూరు, చాగల్లు, దేవరపల్లి, నిడదవోలు, ఇరగవరం, తాళ్లపూడి, పెరవలి, తణుకు, మండలాలు, భీమవరంలో నరసాపురం, పాలకొల్లు, మొగల్తూరు, యలమంచిలి, ఆచంట, పోడూరు, వీరవాసరం, ఆకివీడు, ఉండి, కాళ్ల, పాలకోడేరు, భీమవరం, మండలాలకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తారని పేర్కొన్నారు. పెయిడ్ న్యూస్పై 97 నోటీసులు జారీ ఎన్నికల నేపథ్యంలో పెయిడ్ న్యూస్పై జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల నేతలకు 97 నోటీసులు జారీ చేశామని కలెక్టర్ సిద్ధార్థజైన్ చెప్పారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్ హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపును ఈ నెల 16న ఉదయం 8 గంటలకు ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు 17,883 పోస్టల్ బ్యాలెట్లు, పార్లమెంట్ నియోజకవర్గాలకు 16,882 పోస్టల్ బ్యాలెట్లు ఇప్పటివరకు అందాయన్నారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లకు మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. భన్వర్లాల్ మాట్లాడుతూ 16న ఉదయం 7 గంటలకు అందిన పోస్టల్ బ్యాలెట్లను పరిగణన లోకి తీసుకుని లెక్కించాలని కలెక్టర్లకు సూచించారు. ఎన్నికల నిర్వహణకు సంబధించిన అన్ని అంశాలకు సంబంధించిన ఫొటోలను పంపించాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు మంజూరు చేసిన బడ్జెట్కు త్వరితగతిన చెల్లింపులు చేసి నివేదికలను అందజేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ హరికృష్ణ, జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు, అదనపు జేసీ సీహెచ్ నరసింగరావు, డీఆర్వో కె.ప్రభాకర్రావు, జెడ్పీ సీఈవో డి.వెంకటరెడ్డి పాల్గొన్నారు. -
ఫలితాలపై ఉత్కంఠ
సాక్షి, ఏలూరు: సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసినా ఫలితాలు ఇం కా తేలకపోవడంతో గెలిచేదెవరనే అంశంపై చర్చ జరుగుతోంది. పార్టీ నాయకుల నుంచి సామాన్యుల వరకు అందరూ ఫలితాల కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. అభ్యర్థులు ఎవరికి వారు గెలుపు తమదంటే తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్య నేతల్లో మాత్రం ఒకింత ఆందోళన నెల కొంది. ఓటమి పాలైతే తమ భవిష్యత్ ఏమిటనే భయం వారిని వెంటాడుతోంది. పోలింగ్ సరళిపై లెక్కలు వేసుకున్న టీడీపీ నేతలు తాము ఊహించిన దానికి, వాస్తవ పరిస్థితికి పొంతన కుదరకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. ఫలానా సామాజిక వర్గం ఓట్లు కచ్చితంగా తమకే వస్తాయని, ఫలానా ఊరిలో, వార్డులో జనం తమకే అనుకూలంగా ఓటేస్తారని పెట్టుకున్న నమ్మకం కాస్తా లెక్కలు తేలాక తారుమారు కావడంతో నేతల అంచనాలు తలకిందులయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కోటలుగా భావించే ప్రాంతాల్లో ప్రాభవం కోల్పోతోంది. ఆ పార్టీ ప్రాభవం పడిపోతోంది. వాస్తవ పరిస్థితి కళ్లముందు కనిపిస్తున్నా టీడీపీ నేతలు మరోసారి గోబెల్స్ ప్రచారానికి తెరతీశారు. పోలింగ్కు ముందు తమ పార్టీకే అనుకూల పవనాలు వీస్తున్నాయంటూ తప్పుడు ప్రచారం చేయించిన ఆ పార్టీ పెద్దలు మరోసారి అదే చేస్తున్నారు. వారి కుట్రను అప్పుడు జనం పసిగట్టడంతో చివరి క్షణంలో ఆ ప్రచారాన్ని ఆపేశారు. ఎన్నికలు ముగియడంతో ఓటమి తప్పదని తెలిసినా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ జిల్లాలో అధిక స్థానాలు టీడీపీ గెలుచుకుంటుందనే ప్రచారం చేయిస్తున్నారు. తద్వారా ప్రజల్లో గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారు. అయితే లోలోన మాత్రం అభ్యర్థులు వణికిపోతున్నారు. ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు చేసిన కోట్లాది రూపాయల సొమ్ము పదవి దక్కకపోతే నష్టపోవడం ఖాయం. ఆస్తులు అమ్మి, అప్పులు చేసి తెచ్చింది పోగొట్టుకుని రాజకీయాల్లో కొనసాగలేని పరిస్థితిని టీడీపీ నేతలకు ఊహించుకోలేకపోతున్నారు. అప్పులిచ్చిన వారు ఒత్తిడి చేయకుండా ఉండేందుకు తామే గెలుస్తామనే గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
సర్వేల దూకుడు.. ఎస్ఎంఎస్ల బాదుడు
అమలాపురం, న్యూస్లైన్ : సార్వత్రిక ఎన్నికల ముందు హల్‘సెల్’ చేసిన సర్వే మెసేజ్లు.. ఎన్నికల పూర్తయ్యాకరెట్టింపయ్యాయి. ఎన్నికల ముందు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశముందో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల పేరున వచ్చిన ఎగ్జిట్పోల్, సర్వేలు.. ఎన్నికలు పూర్తయ్యాక మరింత జోరందుకున్నాయి. అరా, నీల్సన్, ఆజ్తక్, ఎన్డీ టీవీ, సీఎన్ఎన్-ఐబీఎన్ వంటి ప్రఖ్యాత మీడియా సంస్థలతో పాటు సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో, స్టేట్ ఇంటెలిజెన్స్, గవర్నర్, లగడపాటి సర్వేలు, ఎగ్జిట్పోల్ రిజల్ట్ అంటూ సెల్ఫోన్లకు ఎస్ఎంఎస్లు వరదలా వస్తున్నాయి. ఏ పార్టీకి ఎన్ని ఎంపీలు, ఎన్ని ఎమ్మెల్యే స్థానాలు వస్తాయంటూ ఎస్ఎంఎస్లు వెల్లువెత్తుతున్నాయి. పోలింగ్ రోజున ఉదయం 9, ఉదయం 11, మధ్యాహ్నం ఒంటి గంట, మధ్యాహ్నం 3, సాయంత్రం ఐదు గంటలకు జరిగిన పోలింగ్ ఆధారంగా సర్వే ఫలితాలంటూ ఎస్ఎంఎస్లు వచ్చిపడ్డాయి. తాజాగా మోస్ట్ కాన్ఫిడెన్షియల్ సర్వే అంటూ జిల్లాల వారీగా ఎంపీ, ఎమ్మెల్యేల స్థానాలు ఏ పార్టీ ఎన్ని గెలుచుకుంటుందనే సమాచారంతోఎస్ఎంఎస్లు పోటెత్తుతున్నాయి. ఎన్నికల ముందు మీడియా, ఇంటెలిజెన్స్ సర్వేలంటూ పార్టీల నాయకులే ఈ ఎస్ఎంఎస్లు పంపి ఓటర్లను తమ పార్టీ వైపు లాక్కునేందుకు ఇటువంటి పనులు చేస్తున్నారనే విమర్శలున్నాయి. అయితే ఎన్నికలు పూర్తయ్యాక కూడా పాత లెక్కలతోనే కొత్తగా సర్వేలు వస్తుండడంతో ప్రజలు విస్తుపోతున్నారు. ఒక్కొక్క ఎస్ఎంఎస్.. ఒక్కొక్క పార్టీకి అనుకూలంగా వస్తుండడంతో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు, పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు. తమకు అనుకూలంగా ఉన్న సర్వేలను వారి పార్టీ నాయకులు, అభిమానులకు పంపుతూ సంతోషిస్తుంటే, తమకు అనుకూలంగా రాని వాటిని చెరిపేస్తున్నారు. సెల్ఫోన్లలో వాటి దూకుడు చూస్తుంటే ఒకటి, రెండు రోజుల్లో ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడో, ఎంత మెజారిటీ వస్తుందో కూడా ఎస్ఎంఎస్లు వచ్చే అవకాశముందని చెబుతున్నారు. అలాగే సోషల్ వెబ్సైట్లలో కూడా ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఏ జిల్లాకు ఎన్ని, ప్రభుత్వం ఫలానా పార్టీ ఏర్పాటు చేస్తుందనే సర్వేల పేరుతో ప్రచారం జోరుగా జరుగుతోంది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో పార్టీల గెలుపోటములు, ఆధిక్యం, సాధించే స్థానాలపై లక్షల్లో పందాలు వేసిన పందెంరాయుళ్లు గంటకో పార్టీకి అనుకూలంగా వస్తున్న సర్వేలు నిద్రపట్టకుండా చేస్తున్నాయి. సర్వేల ఫలితాలు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. -
స్ట్రాంగ్రూంలను రోజూ సందర్శించండి
సాక్షి, కాకినాడ : సార్వత్రిక ఎన్నికల ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను ఆయా జిల్లాల కలెక్టర్లు రోజూ సందర్శించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ ఆదేశించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ఈ నెల 16న జరిగే ఓట్ల లెక్కింపునకు సంబంధించి సూచనలు చేశారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినందుకు ఆర్వోలను, కలెక్టర్లను, ఎన్నికల సిబ్బందిని అభినందించారు. స్ట్రాంగ్ రూంల వద్ద ఇరవైనాలుగు గంటలూ భద్రత ఉండేలా చూడాలన్నారు. స్ట్రాంగ్ రూంల వద్ద సీసీటీవీలు ఏర్పాటు చేసి రాజకీయ పార్టీల ప్రతినిధులు పరిశీలించుకునేందుకు వీలుగా షామియానాల వంటివి ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన చోట రీ పోలింగ్ను నెల 12 న నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేస్తుందన్నారు. లెక్కింపునకు సంబంధించి ప్రతి టేబుల్కు మైక్రో అబ్జర్వర్లుగా కేంద్ర ఉద్యోగులను, కౌంటింగు సూపర్వైజర్లుగా గెజిటెడ్ అధికారులను, కౌంటింగ్ సహాయకులుగా ఇతర ఉద్యోగులను నియమించుకోవాలన్నారు. కలెక్టర్ నీతూ ప్రసాద్ మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లాలో లెక్కింపునకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ చేస్తున్నామన్నారు. లెక్కింపు సిబ్బందికి ఈ నెల 14న, మైక్రో అబ్జర్వర్లకు 15న శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఈవీఎంల నిమిత్తం గొడౌన్ నిర్మాణానికి ఇంతవరకూ రూ.50 లక్షలు ఖర్చు చేశామని, ఇంకా రూ.50 లక్షలు అవసరం వుందన్నారు. నిధులు ఇస్తే జూలై నెలాఖరు నాటికి పూర్తి కాగలదన్నారు. ఎన్నికల తనిఖీల్లో ఇంతవరకూ రూ.9.12 కోట్ల నగదు, రూ.2 కోట్ల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. -
పోటాపోటీ సమీక్షలు
వరంగల్, న్యూస్లైన్: ఎన్నికలు ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ తమ రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో తమకే ప్రజలు అనుకూలంగా తీర్పునిస్తారని ఈ రెండు పక్షాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. రెండు పార్టీల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ తమదే విజయమంటే తమదే అని పోటాపోటీగా ప్రకటనలు చేస్తున్నారు. ఒకరికొకరు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ మాటల గారడీ చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలతోపాటు స్థానిక పోరు ఫలితాల నేపథ్యంలో ఆ రెండు పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మునిసిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జిల్లాపరిషత్ చైర్పర్సన్ పదవులను దక్కిం చుకునేలా ఇరు పార్టీల నేతలు మైండ్గేమ్కు తెరతీశారు. కాం గ్రెస్, టీఆర్ఎస్ ప్రధాన నే తలు పొన్నాల, కేసీఆర్ ఎవరికివారు ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేలుగా పోటీచేసిన అభ్యర్థులతో ఇప్పటికే ప్రత్యేక సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ నెల ఐదో తేదీన హైదరాబాద్లోని గాంధీభవన్లో కాంగ్రెస్ సమీక్ష సమావేశం నిర్వహించి నేతలను అప్రమత్తం చేసింది. సమావేశంలో పోరిక బలరామ్నాయక్, కత్తి వెంకటస్వామి మధ్య వాగ్వాదం జరిగినప్పటికీ... స్థానిక, సార్వత్రిక ఎన్నికల ఫలితాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు వస్తాయనే ధీమాతో ఉన్నారు. మునిసిపల్, జెడ్పీ ఎన్నికల్లో ఎక్కడైనా అటుఇటుగా కొంత తేడా వస్తే చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునే విధంగా పావులు కదపాలని నిర్ణయం తీసుకున్నారు. అవసరమైన మేరకు క్యాంపులు ఏర్పాటు చేయాలని నిర్ణరుుంచారు. ఈ దిశలోనే శుక్రవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ అభ్యర్థులతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ సమీక్షించనున్నారు. కాంగ్రెస్ ఎత్తులకు పై ఎత్తు వేస్తూ.... చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు అమలు చేయూల్సిన వ్యూహాలపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. మొత్తానికీ... ఇరుపార్టీల దృష్టి స్వతంత్రులపైనే ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా.. తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే అంచనాతో ఉన్న కేసీఆర్.. ముందస్తు కసరత్తులో భాగంగా సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అరుుతే... పోలింగ్ సరళిపై రోజురోజుకూ వ్యక్తమవుతున్న భిన్న స్వరాలు పోటీచేసిన అభ్యర్థుల్లో గుబులు పెంచుతున్నారుు. అరుునప్పటికీ... తెలంగాణలో తొలి ప్రభుత్వం తామే ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు ఎవరికివారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే తమకే మంత్రి పదవులు అనే స్థాయికి చేరుకోవడం గమనార్హం. -
ఫలితాల మేళా ఎదురుచూపులు
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఎన్నికల ఫలితాల కోసం ఏకంగా రెండువారాలు ఎదురు చూడాల్సి రావడంతో అటు అభ్యర్థులు, ఇటు ఆయా పార్టీల నేతలు ఉత్కంఠకు గురవుతున్నారు. సార్వత్రిక ఎన్నికల కంటే ముందే పూర్తయిన మున్సిపల్, స్థానిక ఎన్నికల ఫలితాలూ వెలువడక పోవడంతో ఓ అంచనాకు రాలేక పోతున్నారు. ఈ నెల 12న మున్సిపల్, 13వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ మేరకు అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లలో తలమునకలైంది. ఈ ఫలితాల ఆధారంగా తమ గెలుపోటములపై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం ఎమ్మెల్యే అభ్యర్థుల్లో వ్యక్తం అవుతోంది. జిల్లాలో ఏడు నియోజకవర్గ కేంద్రాల్లో ఐదు మున్సిపాలిటీలు, మరో రెండు నగర పంచాయతీలు ఉన్నాయి. స్థానిక అంశాలు ప్రభావితం చేసినా, మున్సిపాలిటీ ఎన్నికల్లో పట్టణ ఓటరు ఏ పార్టీ వైపు మొగ్గుచూపాడో, సార్వత్రిక ఎన్నికల్లోనూ దాదాపు అదే పార్టీ అభ్యర్థి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందన్న అంచనాలతో ఎమ్మెల్యే అభ్యర్థులు మున్సిపల్ ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. ఇక, మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో రూరల్ ఓటరు కీలకం కానున్నాడు. ఈ కారణంగానే 16వ తేదీన వెలువడనున్న సార్వత్రిక ఫలితాల కంటే ముందే 12,13 తేదీల్లో వెలువడే మున్సిపల్, ప్రాదేశిక ఫలితాల కోసం ఎదురుచూసే వారి సంఖ్య పెరిగిపోయింది. ఇదీ ... లెక్క నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో 2.21లక్షల పైచిలుకు ఓటర్లు ఉంటే, ఒక్క నల్లగొండ మున్సిపాలిటీలోనే 1.21లక్షల పైచిలుకు ఓట్లున్నాయి. అంటే సగానికి సగం ఓట్లు పట్టణ ఓటర్లవే. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయో తెలిస్తే, సార్వత్రిక ఎన్నికల్లోనూ దాదాపు ఇదే తరహాలో ఓటింగ్ సరళి ఉంటుంది కాబట్టి ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచే అవకాశం ఉందో ఇట్టే ఓ అవగాహనకు రావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే తరహాలో మిర్యాలగూడ నియోజకవర్గంలో 2.07లక్షల ఓట్టుంటే, మున్సిపాలిటీలో 75,364, సూర్యాపేట నియోజకవర్గంలో 2.16లక్షల ఓట్లకు గాను, మున్సిపాలిటీలో 77,638 ఓట్లున్నాయి. భువనగిరి, కోదాడ మున్సిపాలిటీలు, హుజూర్నగర్, దేవరకొండ నగర పంచాయతీల్లోనూ చెప్పుకోదగిన రీతిలోనే పట్టణ ఓటర్లు ఉన్నారు. మొత్తంగా జిల్లాలో 3.96లక్షల పైచిలుకు పట్టణ ఓటర్లు ఉన్నారు. ఇరవై అయిదు లక్షల పైచిలుకు జిల్లాలో ఉన్న ఓట్లలో మిగిలినవ న్నీ రూరల్ ఓట్లే. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఫలితాలు వెలువడితే ఏ పార్టీ ఎన్ని జెడ్పీటీసీ, ఎన్ని ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుందో తెలిస్తే, రూరల్ ఓటు ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థికి పడ్డాయో అంచానా వేసే వీలుంది. అందుకే సార్వత్రిక ఎన్నికల ఫలితాల కంటే ముందే వెలువడుతున్న మున్సిపల్, స్థానిక సంస్థల ఫలితాల కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికలు ముగిశాక ఫలితాల కోసం రెండువారాలు ఎదురు చూడాల్సి రావడంతో ఉత్కంఠకు గురవుతున్న ఆయా పార్టీల అభ్యర్థులు, పార్టీల నేతలు కనీసం మున్సిపల్, స్థానిక ఫలితాలతో అంచనాకు రావచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే ఆయా నియోకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములపై రకరకాల సమీకరణలు, అంచనాలు తెరపైకి వచ్చాయి. కొన్నిచోట్ల ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ కూడా సాగుతోందని సమాచారం. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో బహుముఖ పోటీలే జరగడంతో అభ్యర్థుల గెలుపుపై స్పష్టమైన ఓ అంచనాకు రాలేకపోతున్నామని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
రాజకీయ నాయకుల హైరానా
సాక్షి, ఖమ్మం: పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది...ఇక కౌంటింగే అనుకునే లోపే రాష్ట్రవిభజన ప్రక్రియ మొదలైంది. దీంతో అటు అధికారులు, ఇటు రాజకీయ నాయకులు కూడా హైరానా పడుతున్నారు. విభజనకు సంబంధించిన పనులు త్వరగా పూర్తి చేయాలంటూ ప్రభుత్వం నుంచి కలెక్టర్కు ఆదేశాలు రాగా, మరోవైపు కౌంటింగ్ ఉండడంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక రాజకీయ నాయకులైతే ఫలితం ఎలా ఉంటుంది, కొత్త రాష్ట్రంలో ఏపార్టీ అధికారంలోకి వస్తుంది, ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయోనని గుబులుగుబులుగా ఉన్నారు. పరిషత్, మున్సిపల్, సార్వత్రిక ఎన్నికలను జిల్లా యంత్రాంగం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముగించింది. ఎన్నికలను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న అధికారులు ఆ వెంటనే కౌంటింగ్ ప్రక్రియకు సిద్ధముయ్యారు. ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులు ఈ మూడు ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లపై ఇతర సిబ్బందితో పలుధపాలు సమావేశాలు నిర్వహించారు. 12న మున్సిపల్, 13న పరిషత్, 16న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు ఇప్పటికే ప్రాథమికంగా ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అధికారులు దృష్టి అంతా కౌంటింగ్పై పెట్టగా.... గవర్నర్ ఈనెల 15లోపే విభజనకు సంబంధించిన పనులు అంతా పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. దీంతో జిల్లా అధికారులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. జిల్లాలో ఎంత మంది ఉద్యోగులు ఉన్నారు, ఇందులో నాన్లోకల్ కింద ఉన్న రాష్ట్ర స్థాయి కేడర్, జిల్లా స్థాయి కేడర్ ఎంతమందో అధికారులు లెక్కల్లో మునిగారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆస్తులు, పద్దులు లెక్కిస్తున్నారు. ఈనెల 24నే ఉద్యోగులకు వేతనాలు ఇవ్వనుండడంతో సంబంధిత అధికారులు ఈ పనుల్లో బిజీ అయ్యారు. జిల్లాకు నూతనంగా ఏర్పాటయ్యే రాష్ట్రంలోని తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు సరిహద్దుగా ఉండడంతో ఇక్కడ సరిహద్దు బోర్డులు ఏర్పాటు చేయడం తప్పనిసరి. అయితే జిల్లాలోని ఏగ్రామాలు ఈ జిల్లాలకు సరిహద్దున ఉన్నాయి, ఎక్కడ ఈబోర్డులు ఏర్పాటు చేయాలన్న విషయమై కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు. అలాగే భద్రాచలంలో ఉన్న ఐటీడీఏ, అక్కడ ఉద్యోగులు, పోలవరం ముంపు మండలాలు, గిరిజన జాతులు తదితర వివరాలన్నీ జిల్లా అధికారులు రాజధానికి పంపించాలి. గవర్నర్ ఆదేశించినట్లుగా ఇవన్నీ గడువులోపే పూర్తి చేసేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. ఉన్న సిబ్బందితోనే విభజన పనులు..., మూడు ఎన్నికల ఓట్ల కౌంటింగ్కు అధికారులు ఉపక్రమించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహాయిస్తే తెలంగాణలో మన జిల్లాలోనే విభజన ప్రక్రియకు సంబంధించి పనులు ఎక్కువగా ఉండడంతో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. కొత్త రాష్ట్రం...ఫలితాలు.... నూతన రాష్ట్రం ఏర్పాటు కానున్న తరుణంలో....వరుసగా వచ్చే ఫలితాలపై బరిలో ఉన్న అభ్యర్థులు, పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. తొలి ఫలితాల శంఖారావం మున్సిపల్ నుంచి ప్రారంభమవుతుండడంతో ఇక్కడ ఎవరు విజయకేతనం ఎగురవేస్తారోనని అందరూ ఆశతో ఎదురుచూస్తున్నారు. ఆవెంటనే పరిషత్ ఎన్నికలు, రెండు రోజుల తేడాతో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కొన్ని పార్టీలు తొలి ఫలితాలతోనే తమ ప్రభంజనం కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తుండగా.. మరికొన్ని పార్టీలు నైరాశ్యంలో ఉన్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించి కొత్తగా ఏర్పాటు అయ్యే తొలి తెలంగాణ ప్రభుత్వంలో చక్రం తిప్పాలని ప్రతిపార్టీ ఊవ్విళ్లూరుతోంది. అనుకూలమా.. ప్రతికూలమా..? ప్రధానంగా అసెంబ్లీ ఫలితాలకు సంబంధించి తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆయా పార్టీల అధినేతలు జోస్యం చెబుతున్నా... ఈవీఎంలలో నిక్షిప్తమైన తమ భవితవ్యం ఏమవుతుందోనని అభ్యర్థులు ఆందోళనచెందుతున్నారు. అయితే ఎన్నికల ఫలితాలు రాకముందే కొందరు అభ్యర్థులు తమకు కొత్త రాష్ట్రంలో లభించే పదవులపై ఆశల పల్లకిలో విహరిస్తుండడం గమనార్హం. విజయం సాధిస్తే మంత్రి వర్గంలో తప్పకుండా బెర్తు దక్కుతుందని వారు తమ అనుంగుల వద్ద ప్రస్తావిస్తున్నట్లు తెలిసింది. మొత్తంగా... విభజన ప్రక్రియ, కౌంటింగ్ ఏర్పాట్లలో అధికారులు తలమునకలైతే.. ఎన్నికల ఫలితాలు, కొత్త రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటయ్యే ప్రభుత్వంపై పార్టీల నేతలు, అభ్యర్థులు అంచనాల్లో తేలియాడుతున్నారు. -
ఫలితాల మేళా
12న మున్సిపల్, 13న ‘ప్రాదేశికం’ కౌంటింగ్ 16న తేలనున్న అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల భవితవ్యం ఆ తర్వాత ‘పది’ పరీక్ష ఫలితాలు కర్నూలు(అర్బన్), న్యూస్లైన్: ఎన్నికల సంగ్రామం ముగిసింది. మూడు రోజులు గడిస్తే.. ఇక ఫలితాల జాతర మొదలవనుంది. వార్డు కౌన్సిలర్ మొదలుకొని పార్లమెంట్కు పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం ఈ నెల 16వ తేదీ నాటితో తేలిపోనుంది. మున్సిపాలిటీ, ప్రాదేశిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో పాటు 10వ తరగతి పరీక్షల ఫలితాలు కూడా ఈ నెలలోనే వెలువడనుండటం ‘ఫలితాల మేళా’ను తలపిస్తోంది. ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు వెల్లడి కాగా.. పదో తరగతి విద్యార్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, నాలుగు నగర పంచాయతీలకు మార్చి నెల 30న ఎన్నికలు నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారమైతే ఏప్రిల్ 2న ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. ఆ రోజే ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తే వాటి ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై చూపుతుందనే పిటిషన్ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఫలితాల విడుదలపై స్టే విధించింది. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం మే 12న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించాలని ఆదేశించింది. దీంతో అభ్యర్థులు 76 రోజులు నిరీక్షించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అదేవిధంగా జిల్లాలో 53 జెడ్పీటీసీ, 815 ఎంపీటీసీ స్థానాలకు ఏప్రిల్ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ఫలితాలను మే 13న ప్రకటించాలని న్యాయస్థానం ఆదేశించడంతో దాదాపు 35 రోజుల నుంచి ప్రాదేశిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక జిల్లాలోని 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలకు ఈ నెల 7న పోలింగ్ ముగిసింది. ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 16వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా.. అదే రోజు విజేతలను ప్రకటించనున్నారు. ఇకపోతే జిల్లాలో 47 వేల మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాశారు. మార్చి నెలలో ప్రారంభమైన పరీక్షలు ఏప్రిల్ 6వ తేదీ వరకు నిర్వహించారు. పరీక్ష పేపర్ల మూల్యాంకనం కూడా ముగిసింది. సార్వత్రిక ఎన్నికల ఫలి తాలు వెలువడిన వారం రోజుల్లోనే పదో తరగతి పరీక్షల ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సేమ్ ‘డే’ 2009లో ఏప్రిల్ 16న సాధారణ ఎన్నికల పోలింగ్ జరగ్గా, సరిగ్గా నెల రోజుల వ్యవధిలో మే 16న ఓట్లను లెక్కించారు. ఈ సారి మే 7న పోలింగ్ జరగ్గా, 16వ తేదీనే ఓట్లను లెక్కించనుండటం విశేషం. -
తిరుగులేని ఫ్యాన్
సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం కర్నూలు(కలెక్టరేట్), న్యూస్లైన్: పెరిగిన పోలింగ్ శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు నిదర్శనంగా నిలుస్తోంది. ఆ పార్టీ మేనిఫెస్టో.. వైఎస్ రాజశేఖర్రెడ్డి సంక్షేమ పాలన.. వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాట పటిమ ఓటర్లను విశేషంగా ఆకట్టుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం రెండు పార్లమెంట్, 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫ్యాన్ గాలి ఉద్ధృతంగా వీచినట్లు స్పష్టమవుతోంది. జిల్లాలో మొత్తం ఓటర్లు 30,56,867 కాగా.. బుధవారం నిర్వహించిన పోలింగ్లో 22,55,975 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికార యంత్రాంగం దాదాపు నెల రోజుల ముందు నుంచే ఓటరు చైతన్య కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టింది. ఇందుకోసం లక్షలాది రూపాయలను వ్యయం చేశారు. అయితే 2009 ఎన్నికలతో పోలిస్తే కేవలం 3.79 శాతం మాత్రమే పోలింగ్ పెరగడం గమనార్హం. 2009 ఎన్నికల్లో 70.27 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈ విడత 74 శాతం నమోదైంది. జిల్లా అంతటా ఫ్యాన్ గాలి నేపథ్యంలో టీడీపీ శ్రేణుల్లో నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయి. యువత.. మహిళలు.. రైతులు అధికంగా ఓటు హక్కును వినియోగించుకోవడంతో వైఎస్ఆర్సీపీ విజయం నల్లేరుపై నడకేననే చర్చ జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన ఓటింగ్ శాతం కూడా ఇందుకు బలం చేకూరుస్తోంది. కర్నూలులో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికార యంత్రాంగం ఎన్ని రకాలుగా శ్రమించినా.. అసంతృప్తే మిగిలింది. 2009లో ఇక్కడ 52.71 శాతం పోలింగ్ నమోదవగా.. ఈ ఎన్నికల్లో 58.11 శాతానికి మాత్రమే చేరుకోగలిగారు. కర్నూలులో ముస్లింలు భారీగా పోలింగ్కు తరలిరావడాన్ని పరిశీలిస్తే వైఎస్సార్సీపీ విజయం ఖాయమనే సంకేతాలిస్తోంది. కర్నూలులో 18 నుంచి 25 ఏళ్లలోపు యువత ఓటింగ్కు తరలిరావడం కూడా వైఎస్సార్సీపీకి అనుకూలం కానుంది. ఆళ్లగడ్డ, శ్రీశైలం, నంద్యాల, బనగానపల్లె నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా పోలింగ్లో పాల్గొనడం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి పట్ల ప్రేమాభిమానాలకు నిదర్శనం. నందికొట్కూరు, కర్నూలు, పాణ్యం, డోన్, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరుల్లో పురుషులే ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 22,55,975 మంది ఓటు హక్కు వినియోగించుకోగా ఇందులో పురుషులు 11,40,336.. స్త్రీలు 11,17,619, ఇతరులు 20 మంది ఉన్నారు. పురుషుల్లో 75 శాతం మంది, మహిళల్లో 72.76 శాతం, ఇతరుల్లో 5.01 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. బుధవారం పోలింగ్ రోజున వాతావరణం చల్లగా ఉండడం.. గురువారం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురవడం రాజన్న పాలన మొదలైందనేందుకు సంకేతమనే అభిప్రాయం వ్యక్తమైంది. -
రిటర్నింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్లైన్: పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన 24 గంటల తర్వాత కూడా జిల్లా కేంద్రానికి వివరాలు అందకపోవడంపై జిల్లా కలెక్టర్ సంబంధిత రిటర్నింగ్ అధికారుల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ ముగిసిన తర్వాత వివరాలను అంచనా మీద తెలిపారు. కచ్చితమైన వివరాలు గురువారం మధ్యాహ్నానికి అందాల్సి ఉండగా.. ఒకటి, రెండు నియోజకవర్గాల నుంచి రాత్రి 7 గంటలకు రాకపోవడం కలెక్టర్ మండిపడ్డారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్లాల్ పోలింగ్ వివరాలు సత్వరం పంపాలని సాయంత్రం నుంచి కలెక్టర్ వెంటపడుతుండగా.. పలువురు ఆర్ఓలు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేకపోవడం గమనార్హం. ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి పూర్తిగా వివరాలు మధ్యాహ్నానికి తయారు చేశారు. అయితే కలెక్టర్ కార్యాలయానికి మాత్రం వివరాలను ఏడు గంటలకు అందజేశారు. పాణ్యం రిటర్నింగ్ అధికారిపై జిల్లా అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వివరాలు ఇవ్వడానికి కరెంటు లేదని చెప్పడాన్ని కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో చివరకు డీఆర్ఓ, జెడ్పీ సీఈఓ తదితరులు లైన్లోకి వెళ్లి గట్టిగా అడగటంతో నింపాదిగా వివరాలు అందజేశారు. కర్నూలు, శ్రీశైలం, ఆర్ఓలు కూడా వివరాలు ఇవ్వడంలో అలసత్వం వహించారు. -
తప్పును ప్రశ్నించాడని.. వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ వర్గీయుల దాడి
ఆలూరు రూరల్, న్యూస్లైన్ : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా తప్పును ఎత్తి చూపాడనే కక్షతో వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆయన పోలీసులను ఆశ్రయించాడు. బాధితులు తెలిపిన వివరాల మేరకు... మండలంలోని చాకిబండలో బుధవారం మధ్యాహ్నం ఓటు వేసేందు కు దేవమ్మ అనే వృద్ధురాలు పోలింగ్ కేంద్రానికి వచ్చింది. ఆమె పేరు జా బితాలో తప్పుగా ఉండడంతో ఎన్నికల సిబ్బంది ఓటు వేయనీయకుం డా వెనక్కు పంపారు. గంట తర్వాత టీడీపీ వర్గీయులు అదే దేవమ్మను తీసుకుని వచ్చి ఓటు వేయించారు. ఈ విషయంపై పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్త సూర్యనారాయణ ఎన్నికల సిబ్బందిని ప్రశ్నించారు. మొదట ఓటర్ జాబితా లో పేరు తప్పు ఉందని వెనక్కు పం పి, ఇప్పుడు ఎలా ఓటు వేయించారని నిలదీశాడు. దీనిని జీర్ణియించుకోలేని టీడీపీ వర్గీయులు సుధాకర్, రామిరెడ్డి, ఆనంద్గౌడ్, నాగప్ప తది తరులు బుధవారం అర్ధరాత్రి సూర్యనారాయణ ఇంటి వద్దకు వెళ్లి ఆయనపై దాడి చేశారు. ఈ దాడిలో సూర్యనారాయణ తలకు తీవ్రగాయాలయ్యాయి. గ్రామ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు జరిగిన విషయాన్ని హాలహర్వి ఎస్ఐ రమేష్బాబుకు తెలిపారు. వెంటనే పోలీ సులు గ్రామానికి చేరుకుని దాడికి సంబంధించిన వివరాలను సేకరిం చారు. గురువారం ఆరుగురు నింది తులపై కేసు నమోదు చేశారు. -
ఆటోలో ఈవీఎంల తరలింపును అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు
పెరవలి, న్యూస్లైన్ : ఈవీఎం బాక్సుల తరలింపునకు అధికారులు టీడీపీ అభ్యర్థికి చెందిన విద్యా సంస్థ బస్సును వినియోగించటంపై వైఎస్సార్ కాంగ్రె స్ పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కానూరులో 149వ పోలింగ్ కేంద్రానికి బుధవారం సాయంత్రం 5గంటలకు ఓటర్లు అధిక సంఖ్యలో రావటంతో ఇక్కడ రాత్రి 8 గంటల వరకు పోలింగ్ జరిగింది. అనంతరం ఈవీఎంలను తరలించేందుకు శశి విద్యాసంస్థకు చెందిన బస్సు రావడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో ఒక్కసారిగా ఆవేశం కట్టలు తెంచుకుంది. ఈ బస్సులో ఈవీఎంలను తరలించడానికి అంగీకరించబోమని రోడ్డుపై బైఠాయించారు. ఎస్సై డి.రవికుమార్ ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో వారు కలెక్టర్తో మాట్లాడి ఆ బస్సును రద్దుచేయించారు. మరో బస్సు రాకపోవడంతో ఈవీఎంలు తరలించటానికి పోలీసులు ఆటో ఏర్పాటు చేశారు. ఈవీఎంల తరలింపులో ఇంత నిర్లక్ష్యం వహిస్తే ఎలాగని వైసీపీ నాయకులు పోలీసులను నిల దీశారు. పెరవలి పోలీస్స్టేషన్ వరకు ఆటోలో తీసుకెళతామని, అక్కడకు ఆర్టీసీ బస్సు వస్తుం దని, మీరు కూడా రావచ్చని సీఐ గోవిందరాజు వారికి నచ్చజెప్పారు. ఈవీఎంలు తీసుకెళుతున్న ఆటోను అనుసరిస్తూ వైసీపీ నాయకులు పోలీస్స్టేషన్కు వచ్చారు. స్టేషన్కు వచ్చిన తరువాత అదే వాహనంలో వాటిని ఏలూరు తరలిస్తామని చెప్పడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహోదగ్రులయ్యా రు. తమ విధులకు ఆటంకం కలిగిస్తే కేసులు పెడతామని, అవసరమైతే లాఠీ చార్జి చేస్తామని సీఐ హెచ్చరించారు. దీంతో కోపం వచ్చిన వైసీపీ కార్యకర్తలు ఈవీఎంలకు భద్రత కల్పించాలంటూ రోడ్డుపై నినాదాలు చేశారు. వైసీపీ నాయకులు కార్చెర్ల ప్రసాద్, కోర్ల ఉదయభాస్కరరావు, కొమ్మిశెట్టి సత్యనారాయణ, నేదునూరి గంగరాజు, వెంకటేశ్వరరావు, యర్రంశెట్టి బుజ్జి, కొమ్మిశెట్టి రాము, వీరమళ్ల సత్యనారాయణలు కార్యకర్తలకు సర్దిచెప్పారు. భద్రత కలిగిన ప్రభుత్వ వాహనంలోనే ఈవీఎంలను తరలించాలని, అంతవరకు తాము ఇక్కడ నుంచి కదిలేది లేదని తెలపడంతో పోలీసు ఉన్నతాధికారులకు సీఐ సమాచారం అందించారు. రాత్రి 11గంటలకు పెరవలి పోలీస్స్టేషన్కు చేరిన ఈవీఎంలు అర్ధరాత్రి ఒంటి గంట వరకు అక్కడే ఉండిపోయాయి. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజీవ్కృష్ణ పోలీస్స్టేషన్కు వచ్చి కార్యకర్తలతో మాట్లాడారు. తరువాత ఆయన పోలీసు ఉన్నతాధికారులు, కలెక్టర్ దృష్టికి ఇక్కడి విషయం తీసుకెళ్లారు. ఈవీఎంల తరలింపులో ఎటువంటి తేడాలు వచ్చినా పూర్తి బాధ్యత తమదేనని వారు హామీ ఇచ్చారు. ఈవీఎంలు తరలించే ఆటోను వైసీపీ నాయకుల వాహనాలు అనుసరించేందుకు అనుమతించారు. దీంతో వైసీపీ నాయకులు రెండు వాహనాల్లో ఆ ఆటో వెనుక ఏలూరు వరకు వెళ్లారు. సమస్య పరిష్కారానికి సహకరించిన రాజీవ్కృష్ణను సీఐ గోవిందరాజు అభినందించారు. -
వచ్చిందెంత.. పోయేదెంత
సాక్షి, ఏలూరు : సార్వత్రిక సమరం ముగిసింది. వంచనకు, విశ్వసనీయతకు మధ్యే ప్రధానంగా పోటీ జరిగింది. ఓటరు తీర్పు స్ట్రాంగ్ రూము ల్లో పదిలంగా ఉంది. అది బట్టబయలయ్యేందుకు ఇంకా వారం రోజుల గడువుంది. ఈలోగా ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థులకు పడిన ఓట్లు ఎన్ని అనే దానిపై లెక్కలు వేసుకునే పనుల్లో నిమగ్నమయ్యాయి. ఏ ప్రాంతంలో.. ఏ వర్గం ఓట్లు అనుకూలంగా వచ్చాయో, ఎవరు వ్యతిరేకంగా పనిచేశారోననే విషయాలపై అభ్యర్థులు, నాయకులు సమాచారం సేకరిస్తున్నారు. గెలుపు పవనాలు వీస్తున్నందున వైఎస్సార్ సీపీ అభ్యర్థులు తమకు ఎంత మెజారిటీ వస్తుందనే దానిపై విశ్లేషణ జరుపుతుంటే.. ఓటమి అంచున ఉన్న టీడీపీ అభ్యర్థులు తమ ఓటమికి కారణాలను వెతుక్కుంటున్నారు. మారిన రాజకీయ ముఖచిత్రం జిల్లాలోని 2 లోక్సభ, 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు నిర్వహించిన పోలింగ్ జిల్లా రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేసింది. కాంగ్రెస్ పార్టీతో పాటు మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి నెలకొల్పిన జై సమైక్యాంధ్ర పార్టీ ఈ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయూరుు. వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంతో చిన్నాచితకా పార్టీలు కనుమరుగయ్యాయి. ప్రధానంగా వైఎస్సార్ సీపీ, టీడీపీ మధ్యే పోటీ జరి గింది. బీజేపీ ఓ లోక్సభ, ఒక అసెంబ్లీ స్థానంలో పోటీ చేయగా, టీడీపీ రెబెల్ అభ్యర్థులు మూడు అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీచేశారు. ఓటింగ్ సరళిని చూస్తే గెలుపు ఓటములపై టీడీపీ, బీజేపీ కచ్చితమైన నిర్థారణకు రాలేకపోతున్నారుు. వైఎస్సార్ సీపీ అన్ని స్థానాల్లోనూ ప్రత్యర్థులను తలదన్నేలా ఓట్లు సంపాదించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. దీంతో ఆ పార్టీ శ్రేణులు తమ అభ్యర్థుల గెలుపోట ములపై కాకుండా మెజారిటీ ఏమేరకు వస్తుందనే విషయంపైనే చర్చలు జరుపుతున్నాయి. భారీ మెజారీటీలతో జిల్లాలోని అన్ని స్థానాలు గెలుచుకుంటామనే గట్టి నమ్మకం వారిలో కనిపిస్తోంది. మేకపోతు గాంభీర్యం ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. కొన్నిచోట్ల తక్కువ మెజారిటీతోనైనా తమ అభ్యర్థులు బయటపడతారనే భ్రమలు కల్పిస్తోంది. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న టీడీపీ అభ్యర్థులు గురువారం నిద్రలేచింది మొదలు నిద్రపోయేవరకు పోలింగ్పై విశ్లేషణలు ప్రారంభించారు. కార్యకర్తలను ఇళ్లకు, కార్యాల యాలకు రప్పించుకుంటున్నారు. వారినుంచి సమాచారం సేకరిస్తున్నారు. మండలాల వారీగా, బూత్ల వారీగా తమకు పోలైన ఓట్లపై అంచనాలు వేస్తున్నారు. అనుకూలంగా వ్యవహరించిన వర్గాలేమిటి, చివరి నిమిషంలో దెబ్బకొట్టిన వారెవరు, ఓడిపోతే ప్రజలకు, కార్యకర్తలకు చెప్పాల్సిన కారణాలేమిటి అనే అంశాలపై చర్చిస్తున్నారు. పోలింగ్కు ముందు ఓటర్లను ప్రలోభపెట్టే పనిని ద్వితీయ శ్రేణి నాయకులకు అప్పగించిన టీడీపీ ఆ సొమ్ముకు లెక్కలు కూడా సేకరిస్తోంది. ఎవరికి ఎంత ఇచ్చాం, ఎంత పంపిణీ చేశారు. పక్కదారి పట్టించారా అనే విషయాలపై కూపీ లాగుతున్నారు. -
కాయ్ రాజా.. కాయ్
సాక్షి, ఏలూరు : సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై జిల్లాలో బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి. ఈసారి ఓటర్లు అత్యంత గుంభనంగా వ్యవహరించడంతో వారి నాడి పట్టుకోవడం కష్టంగా మారింది. ప్రతి అభ్యర్థి గెలుపు తనదేనని చెబుతున్నారు. వారి ధీమాపై పందెం కట్టే పనిలో బెట్టింగ్రాయుళ్లు నిమగ్నమయ్యారు. ఈ ఎన్నికల్లో గ్రామస్థాయిలో బెట్టింగ్లు జోరుగా సాగడం విశేషం. జిల్లాలో సంక్రాంతికి రూ.కోట్లలో బెట్టింగ్లు జరుగుతుంటాయి. ఎన్ని హెచ్చరికలు చేసినా ఆరోజు వచ్చేసరికి అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తుంటుంది. దీనికోసం వారికి బెట్టింగ్ ముఠాల నుంచి అందాల్సినవి అందుతుంటాయి. ఇదే సంప్రదాయాన్ని ఎన్నికల బెట్టింగ్ల విషయంలోనూ అధికారులు అనుసరిస్తున్నారు. జిల్లాలో కోట్లాది రూపాయల బెట్టిం గ్లు జరుగుతున్నా అధికారుల్లో చలనం లేదు. పక్కా ప్రణాళిక నియోజకవర్గాల వారీగా బెట్టింగ్ల తీరును పరిశీలిస్తే.. జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపైనే ప్రధానంగా పందాలు కడుతున్నారు. లోక్సభ నియోజక వర్గాల్లో ఏ సెగ్మెంట్లో ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఏ పార్టీకి వస్తాయనే దానిపైనా పందాలు నడుస్తున్నాయి. పందెం సొమ్ముకు పక్కాగా డాక్యుమెంట్లు రాసుకుంటున్నారు. డబ్బులు ముందుగానే మధ్యవర్తి దగ్గర పెడుతున్నారు. అతనికి కొంత కమిషన్ ఇచ్చి గెలిచిన వారికి మొత్తం సొమ్ము అప్పగించేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. కోడి పందాల్లో ముందుండే డెల్టాకు చెందిన ప్రముఖులు ఎన్నికల బెట్టింగ్లలోనూ ముందున్నట్లు తెలుస్తోంది. వీరు జిల్లా వ్యాప్తంగా పందాలు కాస్తున్నారు. రూపాయికి రూపాయిన్నర ఇస్తామంటూ కోసు పందాలు వేస్తున్నారు. కచ్చితంగా తామనుకున్న అభ్యర్థి గెలుస్తాడనుకున్న చోట కోసు పందాలు నడుస్తున్నాయి. నియోజకర్గాల్లో ఇలా... ఆచంటలో భారీగా బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. ఉండి, భీమవరం పట్టణాల్లో ప్రతి వార్డులోనూ బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. చింతలపూడిలో టీడీపీ నాయకులు తమ అభ్యర్థిపై రూ.25 లక్షల పందెం కట్టారు. పోలవరంలో రూ.50 వేల నుంచి రూ.50 లక్షల వరకూ బెట్టింగ్లు జరుగుతున్నాయి. నరసాపురంలో ఎంపీ సీటు, ఎమ్మెల్యే సీట్లపై బెట్టింగ్లు వేస్తున్నారు. ఇక్కడ కూడా కోసు పందాలే ఎక్కువగా ఉన్నాయి. నిడదవోలులో రూ.50 వేల నుంచి రూ.5లక్షల వరకూ బెట్టింగ్లు జరుగుతున్నాయి. తణుకులో రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకూ బెట్టింగ్లు నడుస్తున్నాయి. ఉంగుటూరులో వైసీపీ అభ్యర్థికి లభించే మెజార్టీపై కోసు పందెం కాస్తున్నారు. ఇక్కడ రూ.50 లక్షల వరకూ బెట్టింగ్లు జరుగుతున్నాయి. దెందులూరులో బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి. ఈ సీటుపై బెట్టిం గ్ కాసిన రూ.22 లక్షలను పోలింగ్ రోజు రాత్రి ఏలూరులో పోలీసులు పట్టుకోవడంతో పందెంరాయుళ్లు జాగ్రత్తపడుతున్నారు. కౌంటింగ్ సమయం దగ్గరపడే కొద్దీ బెట్టింగ్లు ఊపందుకునే అవకాశం ఉంది. -
ఔను.. పోలింగ్ తగ్గింది
ఏలూరు, న్యూస్లైన్ : జిల్లా ఓటర్లలో చైతన్యం పెరిగింది. కానీ.. గతంతో పోలిస్తే పోలింగ్ శాతం స్వల్పంగా తగ్గింది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో సగటు పోలింగ్ శాతం 83.99 కాగా, 2014 సార్వత్రిక ఎన్నికల్లో 82.74 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. గతంకంటే ఈసారి 1.25 శాతం పోలింగ్ తగ్గింది. ఈసారి ఎన్నికలలో 5.04 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోలేదు. పోలైన ఓట్లలో సంఖ్యాపరంగా చూస్తే పురుషుల కంటే మహిళల ఓట్లే ఎక్కువగా ఉన్నప్పటికీ, పురుషులు, మహిళల ఓట్ల శాతంతో పోలిస్తే ఎక్కువ మంది పురుషులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో మొత్తంగా 2,33,671 మంది పురుషులు పోలింగ్కు దూరంగా ఉండగా, 2,70,299 మంది మహిళలు ఓటుహక్కు వినియోగించుకోలేదు. జిల్లాలోని 3,055 పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం 29,21,520 మంది ఓటర్లు ఉండగా, 24,17,337 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో పురుష ఓటర్లు 14,40,403 మంది కాగా, 12,06,732 మంది ఓటు వేశారు. మహిళా ఓటర్లు 14,80,902 మంది కాగా, 12,10,603 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. 15 నియోజకవర్గాలకు గాను 13 నియోజకవర్గాల్లో 80 శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి. అత్యధికంగా గోపాలపురం నియోజకవర్గంలో 86.60 శాతం పోలింగ్ నమోదుకాగా, అత్యల్పంగా ఏలూరు అసెంబ్లీ సెగ్మెంట్లో 70.45 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. 1.25 శాతం తగ్గిన పోలింగ్ సగటు జిల్లాలో 2009 ఎన్నిక ల కంటే ఈ విడత ఎన్నికల్లో సగటు పోలింగ్ 1.25 శాతం తగ్గింది. అప్పటి ఎన్నికల్లో మొత్తం 25,95,269 మంది ఓటర్లకు గాను 21,79,663 మంది ఓటేశారు. ఇందులో పురుషు ఓటర్లు 10,73,278 మంది కాగా, మహిళా ఓటర్లు 11,06,385 మంది ఉన్నారు. అప్పట్లో జిల్లా సగటు పోలింగ్ శాతం 83.99గా నమోదైంది. ఈ ఎన్నికల్లో 82.74 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి. ఓట్లు పెరిగినా.. శాతం తగ్గింది జిల్లాలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక కూడా మూడుసార్లు కొత్తగా ఓటర్ల చేరికకు అవకాశం కల్పిం చారు. ఆ రకంగా 81వేల మందికి పైగా ఓటర్లు పెరి గినప్పటికీ ఓటింగ్ శాతం పెరగకపోవడం అధికారులను అయోమయూనికి గురిచేసింది. గత ఎన్నికలతో పోలిస్తే ఏలూరు, భీమవరం అసెంబ్లీ సెగ్మెంట్లలో సుమారు 10 శాతం మేర పోలింగ్ తగ్గింది. అధికారులు ఓటర్లలో చైతన్యం పెంపొందించే కార్యక్రమాలు చేపట్టినప్పటికీ వారిని పోలింగ్ బూత్ వరకు తీసుకురావటంలో విఫలమయ్యారు. ఏలూరు ఎంపీ స్థానం పరిధిలో... ఏలూరు లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో సగటున 83.62 శాతం పోలింగ్ నమోదైంది. 1,544 పోలింగ్ కేంద్రాల పరిధిలో 14,27,300 మంది ఓటర్లు ఉండగా, 11,93,449 ఓట్లు పోలయ్యాయి. పురుష ఓటర్లు 7,06,616 మంది కాగా, 6,00,426 మంది ఓటు వేశారు. 7,20,610 మంది మహిళా ఓటర్లు ఉండగా, వారిలో 5,93,018 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ వినియోగించుకున్న వారిలో ఇక్కడా పురుషులదే పైచేరుుగా నిలచింది. 0.47 శాతం తగ్గిన పోలింగ్ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో 2009 ఎన్నికలతో పోలిస్తే.. తాజా ఎన్నికల్లో 0.47 శాతం పోలింగ్ తగ్గింది. అప్పట్లో 84.09 శాతం ఓట్లు పోలవ్వగా, ఇప్పుడు 83.62 శాతం ఓట్లు పోలయ్యాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం 1.50 లక్షల మంది ఓటర్లు పెరిగినా.. పోలింగ్ శాతం మాత్రం పెరగలేదు. 2009 ఎన్నికల్లో మొత్తం ఓటర్లు 12,75,165 మంది ఉండగా, 10,72,225 మంది ఓటేశారు. -
ఓటర్ల తీర్పు పదిలం
సాక్షి, కాకినాడ : ఎన్నికల యజ్ఞం ముగిసింది. అన్నివర్గాలు... ఓటర్ల తీర్పు ఎలా వుంటుందోనన్న ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. జిల్లాలో బుధవారం ఎన్నికలు జరుగగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు అర్ధరాత్రికి కాకినాడ చేరుకున్నాయి. కాకినాడ, అమలాపురం, రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 4056 పోలింగు స్టేషన్ల పరిధిలోని 37 లక్షల 73 వేల 332 మంది ఓటర్ల తీర్పు వీటిలో నిక్షిప్తమై ఉంది. పార్లమెంట్ నియోజవర్గాల వారీగా కేటాయించిన ప్రాంతాల్లో వీటిని ఉంచారు. ఈవీఎంలు దాచిన మూడుచోట్లా అత్యంత కట్టుదిట్టమైన మూడంచెల భారీ భద్రతను ఏర్పాటు చేశారు. షిప్టుల వారీగా ఆర్ముడు ఫోర్సును విధుల్లో వుంచారు. తరలివచ్చిన ఈవీఎంలను కాకినాడ జేఎన్టీయూకే ఆవరణలో బుధవారం రాత్రి ఎన్నికల పరిశీలకులు గౌతమ్ఘోష్తో కలసి జిల్లా ఎన్నికల అధికారి నీతూప్రసాద్ పరిశీలించారు. కాకినాడ లోక్సభ స్థానానికి జేఎన్టీయూకే ఆవరణలో కాకినాడ లోక్సభ నియోజకవర్గం పరిధిలో 1491 పోలింగుస్టేషన్లకు చెందిన 14 లక్షల 17 వేల 977 మంది ఓటర్లున్నారు. వీటిలో తుని, పిఠాపురం, పెద్దాపురం, ప్రత్తిపాడు, కాకినాడ సిటీ, జగ్గంపేట, కాకినాడ రూరల్ అసెంబ్లీల ఈవీఎంలు కాకినాడ జేఎన్టీయూకే ఆవరణలోని డిపార్టుమెంటు ఆఫ్ పెట్రోలియం ఇంజనీరింగ్ అండ్ పెట్రో కెమికల్ ఇంజనీరింగు బ్లాక్, స్కూల్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ బ్లాక్లోని హాల్స్లో భద్రపరిచారు. వాటికి ఆనుకుని వున్న గదుల్లోనే ఈ నెల 16 వ తేదీనపై ఏడు అసెంబ్లీల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం పన్నెండు లేదా ఒంటిగంట లోపు ఫలితాలు వెల్లడించే అవకాశం వుంది. విద్యుత్నగర్ ఐడియల్ ఇంజనీరింగ్లో అమలాపురం కౌంటింగ్ అమలాపురం లోక్సభ నియోజకవర్గ పరిధిలోని 1500 పోలింగు స్టేషన్లకు చెందిన 13 లక్షల 57 475 మంది ఓటర్లున్నారు. వీటిలో రామచంద్రపురం, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, పి.గన్నవరం, కొత్తపేట, మండపేట అసెంబ్లీల ఈవీఎంలు కాకినాడ విద్యుత్ నగర్లోని ఐడియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల ఆవరణలో భద్రపరిచారు. విశాఖ జిల్లా అరకు పార్లమెంటు పరిధిలో వుండి మన జిల్లాలో వున్న రంపచోడవరం అసెంబ్లీ పరిధిలో 212 పోలింగ్ స్టేషన్లుండగా లక్షా యాభై వేల 830 మంది ఓటర్లున్నారు. ఈ నియోజకవర్గ ఈవీఎంలు సైతం ఇక్కడే భద్రపరిచారు. వాటిని సివిల్ బ్లాక్కు చెందిన ఫస్టు ఫ్లోర్లోని ఎడమవైపున్న 14,16 నెంబర్ గదుల్లో భద్రపరిచారు. కుడివైపున్న 13 వ నెంబర్ రూమ్లో ఓట్లు లెక్కించి ఫలితాన్ని విశాఖ పంపుతారు. రాజమండ్రి లోక్సభ స్థానానికి ఆర్ఎంసీ ఆవరణలో... ఇక రాజమండ్రి పరిధిలోని 853 పోలింగు స్టేషన్లకు చెందిన 8 లక్షల 47 వేల 40 మంది ఓటర్లున్నారు. వీటిలో అనపర్తి, రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలు కాకినాడలోని రంగరాయ మెడికల్ కళాశాల ఆవరణలోని డిపార్టుమెంట్ ఆఫ్ హ్యూమన్ ఫిజియాలజీ, అనాటమీ, పరీక్షా కేంద్రాలలో లెక్కిస్తారు, వీటిని చేర్చివున్న విభాగాల్లోని గరల్స్, బాయిస్ వెయిటింగు రూమ్స్ తదితర చోట్ల ఆయా నియోజక వర్గాల ఈవీఎంలు భద్రపరిచారు. పశ్చిమగోదావరిలో వున్న మిగిలిన మూడు నియోజవర్గాలు గోపాలపురం, నిడదవోలు, కొవ్వూరు అసెంబ్లీల ఓట్ల లెక్కింపు ఆ జిల్లాలో పూర్తిచేసి ఫలితాలు అందించాక పార్లమెంటు ఫలితం మొత్తంగా ప్రకటిస్తారు. -
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పళ్లంరాజుపై కేసు
గడువు ముగిసినా ప్రచారం చేయడంపై ఫిర్యాదు తీవ్రంగా పరిగణించిన ఎన్నికల కమిషన్ కాకినాడ క్రైం, న్యూస్లైన్ : గడువు ముగిసిన తరువాత కూడా కేంద్ర మంత్రి మల్లిపూడి మంగపతి పళ్లంరాజు ఈ నెల ఆరున ప్రచారం చేయడాన్ని ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు ఆయనపై కేసు నమోదు చేయాల్సిందిగా వన్ టౌన్ పోలీసులకు ఎన్నికల అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న పళ్లంరాజు ఈ నెల ఆరున కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో తెలిసినవారిని పలుకరించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా తనకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా రోగులు, వారి సహాయకులను అభ్యర్థించారు. దీనిపై మీడియాలో వార్తలు రావడమే కాకుండా, విషయం ఎన్నికల అధికారుల దృష్టికి వెళ్లింది. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక అందించాల్సిందిగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నీతూ ప్రసాద్ కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాంబాబును ఆదేశించారు. ఆయన బుధవారం కాకినాడ జీజీహెచ్లో విచారణ నిర్వహించారు. పళ్లంరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించినట్టు విచారణలో రుజువవడంతో ఆయనపై కేసు నమోదు చేయాల్సిందిగా వన్టౌన్ పోలీసులకు బుధవారం రాత్రి ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల నిబంధనలు అతిక్రమించారంటూ పళ్లంరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆస్పత్రి ఆవరణలో పళ్లంరాజు ప్రచారం చేసినా, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.వెంకటబుద్ధ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడంలో విఫలమయ్యారని, ఆయనపై కూడా చర్యలు తీసుకోవాలని రాంబాబు ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. -
‘క్రాస్’ ఓటు.. టీడీపీకి చేటు!
అమలాపురం, న్యూస్లైన్ : ‘క్రాస్ ఓటింగ్..’- జిల్లాలో రాజకీయవర్గాల్లో చర్చంతా ఇప్పుడు దీనిపైనే. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బుధవారం జరిగిన పోలింగ్లో దీని ప్రభావం ఎక్కువగా ఉందని ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు, రాజకీయ విశ్లేషకులు గట్టిగా చెబుతున్నారు. జిల్లాలో ఏజెన్సీ, మెట్ట, మైదానం, కోనసీమ అనే తేడా లేకుండా ప్రతి నియోజకవర్గంలో క్రాస్ ఓటింగ్ అంచనాలకు మించి ఉందని అంచనా వేస్తున్నారు. పార్లమెంట్ అభ్యర్థులు కొన్నిచోట్ల, అసెంబ్లీ అభ్యర్థులు మరికొన్ని చోట్ల పనిగట్టుకుని క్రాస్ ఓటింగ్ను ప్రోత్సహించారని సమాచారం. ఈ ధోరణి ఎక్కువగా తెలుగుదేశం పార్టీలో కనిపించిందంటున్నారు. ఈ కారణంగా ఆ పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులనే క్రాస్ ఓటింగ్ గుబులు ఎక్కువగా పట్టి పీడిస్తోంది. ఆ పార్టీకి ఎంతో కొంత ఆధిక్యత వస్తుందనుకున్న ప్రాంతాల్లో జరిగిన క్రాస్ ఓటింగ్ వల్ల తమ కొంప కొల్లేరవుతుందని ఆ పార్టీ అభ్యర్థులు, నాయకులు ఆందోళనకు గురవుతున్నారు. టీడీపీ పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులు కేవలం తమ ఒక్కరికీ ఓటు వేస్తే చాలని, రెండో ఓటు మీకు నచ్చినవారికి వేసుకోండని బహిరంగంగా నిర్వహించిన ప్రచారం ఆ పార్టీ గెలుపు అవకాశాలను దెబ్బ తీసింది. పార్టీకి ఎంతో కొంత ఓటింగ్ పడే చోట కూడా రెండు ఓట్లు పార్టీకి వేయాలని కోరిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఒకరిద్దరు మాత్రమే కావడం గమనార్హం. ఎక్కడికక్కడ చీలిన టీడీపీ ఓట్లు.. క్రాస్ ఓటింగ్ ప్రభావం ప్రధానంగా అమలాపురం నియోజకవర్గంలో కనిపించింది. ఇక్కడ నుంచి పార్లమెంట్ బరిలో నిలిచిన పండుల రవీంద్రబాబు నామినేషన్ వేసే వరకు స్థానికంగా ఎవరికీ తెలియనే తెలియరు. దీనికి తోడు ఆయనను బరిలో నిలపడం వల్ల ఈ స్థానం ఆశించిన గొల్లపల్లి సూర్యారావు అవకాశం కోల్పోయి రాజోలు అసెంబ్లీ బరిలో నిలవాల్సి వచ్చింది. దీనితో అమలాపురం అసెంబ్లీ పరిధిలోని గొల్లపల్లి అభిమానులు క్రాస్ ఓటింగ్ చేశారని తెలుస్తోంది. అమలాపురం పట్టణంలో టీడీపీ ఆధిక్యత ఉన్న వార్డుల్లో సైతం ఆ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పండులకు ఆశించిన స్థాయిలో ఓట్లు పడలేదని టీడీపీ నాయకులే అంగీకరిస్తున్నారు. ఉప్పలగుప్తం మండలంలో ఆ పార్టీ అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు సొంత గ్రామమైన ఎస్.యానాం, దాని చుట్టుపక్కల గ్రామాల్లో సైతం ఆ పార్టీ నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు పార్లమెంట్ అభ్యర్థికి మొండిచేయి చూపినట్టు తెలుస్తోంది. మండపేట, పి.గన్నవరం, రాజోలు, కొత్తపేట, మండపేటల్లో టీడీపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో కొన్నిచోట్ల పార్లమెంట్కు, మరికొన్ని చోట్ల అసెంబ్లీ అభ్యర్థులకు క్రాస్ ఓటింగ్ పడినట్టు ఆ పార్టీ నాయకులు గుర్తించారు. కాకినాడ పార్లమెంట్ పరిధిలో తుని, జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురాల్లో సైతం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులు కేవలం తమ విజయం పైనే దృష్టి పెట్టారు. దీనితో పార్టీకి గంపగుత్తగా పడాల్సిన ఓటింగ్లో కూడా చీలిక కనిపించిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ టీడీపీ నుంచి పార్లమెంట్కు పోటీ చేస్తున్న తోట నరసింహానికి అసెంబ్లీ అభ్యర్థులతో సమానంగా ఓట్లు పడలేదని చెబుతున్నారు. తనకు ఎంతో కొంత బలం ఉన్న చోట నరసింహం కూడా తనకు పడే ఓట్ల పైనే దృష్టి పెట్టడం ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థులను కలవరానికి గురి చేస్తోంది. రాజమండ్రిలో టీడీపీకి బలమైన ఓటింగ్ ఉన్న ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల గెలుపుపై తొలి నుంచీ పెద్దగా నమ్మకం లేని పార్లమెంట్ అభ్యర్థి మురళీమోహన్ తనకు పడే ఓట్ల పైనే దృష్టి కేంద్రీకరించడం ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తోంది. అసలే ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్కు అంచనాలకు మించి ఓటింగ్ పడడం, మరోవైపు సొంత పార్టీలోనే అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులు క్రాస్ ఓటింగ్ను ప్రోత్సహించడం టీడీపీలో మినుకుమినుకుమంటున్న గెలుపు ఆశను కూడా ఆరిపోయేలా చేస్తోంది. -
రేసులో‘సైకిల్’ కుదేలే..!
సాక్షి ప్రతినిధి, కాకినాడ : పోలింగ్కు ముందు జిల్లాలో 15 స్థానాలు తమవేనని చెబుతూ వచ్చిన టీడీపీ నేతలు.. పోలింగ్ అనంతరం తమ లెక్కలు తప్పాయని దిగాలు పడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సరళి ఆధారంగా వేస్తున్న అంచనాలు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణుల ఉత్సాహాన్ని ఇనుమడింపజేస్తున్నాయి. మూడు పార్లమెంటు, 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘ఫ్యాన్’కు స్పష్టమైన ఆధిక్యత లభిస్తుందన్న అంచనాలతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్లో ‘పండగ ముందు’ ఉండే జోష్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అదే సమయంలో టీడీపీ నాయకులు లోలోపల జావగారిపోతున్నా.. పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. తమ అంచనాలు తల్లకిందులై పార్టీ బలంగా ఉందనుకున్న నియోజకవర్గాల్లోనూ గడ్డు పరిస్థితి తప్పకపోవచ్చని తెలుగుతమ్ముళ్లు ప్రైవేటు సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. 19 అసెంబ్లీ స్థానాల్లో తుని, పెద్దాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, ప్రత్తిపాడు, రాజానగరం, రాజమండ్రి రూరల్, మండపేట, ముమ్మిడివరం, రామచంద్రపురం, కొత్తపేట, రాజమండ్రి రూరల్, రంపచోడవరం, పి.గన్నవరం, అమలాపురం ఖాయంగా తమవేనని వేసుకున్న లెక్క తప్పుతుందని అంటున్నారు. ఖాయమనుకున్నచోటా ‘ఖాయిలా’యే.. తునిలో టీడీపీకి మళ్లీ ఎదురు దెబ్బ ఖాయమని రాజకీయాలతో ఆట్టే సంబంధం లేని వారు కూడా అంటున్నారు. పెద్దాపురం సీటుపై ఆశ పెట్టుకున్న స్థానిక నేతలను నిరాశపరుస్తూ స్థానికేతరునికి టిక్కెట్టు ఇవ్వడంతో టీడీపీ శ్రేణుల్లోనే వ్యతిరేకత పెరిగిందని, ఈ పరిణామం వైఎస్సార్ సీపీకి అదనపు అవకాశంగా కలిసి వచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాకినాడ సిటీలో ఒక ప్రాంతంలో తమకు అనుకూలంగా ఓటింగ్ జరిగిందని టీడీపీ నేతలు సంబరపడుతున్నా.. తక్కిన చోట్ల వారి సంబరంపై నీళ్లు చల్లేలా ఓటర్లు తీర్పునిచ్చారని పరిశీలకులు భావిస్తున్నారు. ఇక కాకినాడ రూరల్లో అసలు టీడీపీ సోదిలోకే ఉండదని, అక్కడ వైఎస్సార్సీపీ గెలుపు నల్లేరుపై నడకేనంటున్నారు. నిట్టనిలువునా చీలిపోయిన ఓట్లతో ప్రత్తిపాడులో టీడీపీ నష్టపోతుందని, దీనివల్ల వైఎస్సార్సీపీ విజయావకాశాలు గణనీయంగా మెరుగు పడ్డాయని అంచనా వేస్తున్నారు. తిరిగి తమ ఖాతాలోనే పడుతుందని టీడీపీ ఆశపడుతున్న రాజానగరంలో వైఎస్సార్ సీపీ హవా ముందు కుదేలు కాక తప్పదంటున్నారు. ఎంతో కొంత అవకాశాలు ఉంటాయని పార్టీ వర్గాలు ఆశించిన రాజమండ్రి సిటీని బీజేపీకి విడిచి పెట్టడం, సిటీ అభ్యర్థిత్వాన్ని ఆశించిన సీనియర్ నేతను ఆయనకు పట్టులేని రూరల్ నియోజకవర్గానికి మార్చడం.. ఆ రెండు స్థానాల్లో ప్రతికూలాంశాలు అవుతాయని, దాంతో అక్కడ వైఎస్సార్ సీపీ విజయం అనాయాసమేనని అంటున్నారు. టీడీపీ తనకు కంచుకోటగా పరిగణించిన మండపేటలోనూ ఎదురీదాల్సి వచ్చిందని, అక్కడున్న సామాజిక సమీకరణలు, వైఎస్సార్ సీపీపై ఎస్సీ, బీసీల్లో ఉన్న ఆదరణ ముందు టీడీపీ కురిపించిన కోట్లు కొట్టుకు పోక తప్పదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దాదాపు ఇదే పరిస్థితి ముమ్మిడివరం నియోజకవర్గంలో సైతం కనిపిస్తోందని టీడీపీ నాయకులే నిట్టూరుస్తున్నారు. తాజా మాజీలపై సొంత సామాజికవర్గాల నిరసన ఇక రామచంద్రపురం, కొత్తపేటల్లో తాజా మాజీ ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చి పార్టీని పటిష్టం చేసుకున్నామని టీడీపీ మురిసినా..ఆ నిర్ణయమే ఆ రెండు చోట్లా పార్టీకి అశనిపాతంలా పరిణమించిందంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై సహజంగా ఉండే వ్యతిరేకతకు తోడు సొంత సామాజికవర్గానికి చేసిందేమీ లేదనే నిరసన అక్కడ టీడీపీ ఆశలను తలకిందులు చేసిందంటున్నారు. పి.గన్నవరం, అమలాపురం తమవేనన్న టీడీపీ లెక్క పోలింగ్ అనంతరం అందుకున్న క్షేత్రస్థాయి సమాచారంతో తప్పిందంటున్నారు. మొత్తం మీద టీడీపీ తన ఖాతాలో వేసుకున్న స్థానాలన్నింటా వైఎస్సార్ సీపీ సానుకూల పవనాలు వీచాయని, దాంతో ‘సైకిల్’ ఎక్కడా గెలుపు మజిలీ చేరే అవకాశం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. -
‘పోరు’ ఫలితాలపై.. పందేల హోరు
హోరాహోరీగా సాగిన సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. నరాలు తెగే ఉత్కంఠతో జరిగిన పోరులో ఓటర్లు ఇచ్చిన తీర్పు ‘ఈవీఎం’లలో భద్రంగా ఉంది. వారి తీర్పు ఏమిటి, తమ అదృష్టం ఎలా ఉండబోతోంది అన్న ఆదుర్దాతో అభ్యర్థుల కంటికి కునుకు దూరమవుతోంది. అదే సమయంలో పందేలరాయుళ్లు అదే తీర్పుపై తమ అదృష్టాన్నీ పరీక్షించుకుంటున్నారు. ‘కాయ్ రాజా కాయ్’ అంటూ జోరుగా పందేలు కాస్తున్నారు. రాజకీయ నాయకులు, కార్యకర్తలే కాదు..రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న పలువురు పందేల బరిలో ‘సై’ అంటున్నారు. సాక్షి, కాకినాడ : క్రికెట్ బెట్టింగ్ నుంచి రాజకీయ బెట్టింగ్ వరకు ఉభయగోదావరి జిల్లాలు పెట్టింది పేరు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ కొనసాగుతోంది. ఈ పొట్టి క్రికెట్లో వందల కోట్లు ఇక్కడ చేతులు మారుతుంటాయి. ఈసారి క్రికెట్ కంటే ఎన్నికల బెట్టింగ్లే ఇక్కడ జోరుగా సాగుతున్నాయి. ముందెన్నడూ లేని రీతిలో స్థానిక ఎన్నికల నుంచి పార్లమెంటు పోరు వరకు వరుసగా జరిగాయి. గతనెలలో సెమీఫైనల్స్ స్థాయిలో జరిగిన మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై జిల్లాలో ఇప్పటికే వందల కోట్ల రూపాయల పందేలు జరిగాయి. ఇప్పుడు సార్వత్రిక సమరంలో గెలుపోటములపైనా జోరుగా పందాలు సాగుతున్నాయి. పోలింగ్ సరళిపై వారి వారి అంచనాలను బట్టి పందేలరాయుళ్లు పందేలకు శ్రీకారం చుట్టారు. బుధవారమే మొదలైన పందేలు గురువారం మరింత జోరందుకున్నాయి. ఫలితాల వెల్లడికి మరో 8 రోజులు గడువుండడంతో ఆనాటికి పందేలు మరింత ముమ్మరం అయ్యే అవకాశముంది. ‘ఫ్యాన్’ తుపాన్ వీచిందంటున్న సర్వేలు రాష్ర్టవ్యాప్తంగా ‘ఫ్యాన్’ గాలి పెనుతుపానుగా వీచిందని పోలింగ్ సరళిని బట్టి ఇప్పటికే సర్వేలన్నీ ఘోషిస్తున్నాయి. జాతీయ, రాష్ర్టస్థాయి పత్రికలు, చానళ్లు, రాజకీయ విశ్లేషకులు సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ ఘన విజయం తథ్యమని అంచనా వేస్తుండగా.. రాజకీయ చైతన్యం కల్గిన గోదావరి జిల్లాల్లోనూ అదే ఒరవడి కొనసాగే అవకాశం పుష్కలంగా ఉండడంతో పందేలరాయుళ్లు ఎక్కువగా ఆ పార్టీతోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆరాటపడుతున్నారు. జిల్లాలో మూడు ఎంపీలతో పాటు 14 అసెంబ్లీ స్థానాలు కచ్చితంగా వైఎస్సార్ సీపీ ఖాతాలో జమ కానున్నాయని, మిగిలిన స్థానాల్లో కూడా ఆ పార్టీకే ఎక్కువగా మొగ్గుందని అంచనా వేస్తున్నారు. కాగా తెలుగుతమ్ముళ్లు సైతం.. తమ పార్టీ అధికారం లోకి వస్తుందని కానీ, ఫలానా నియోజకవర్గంలో తమ అభ్యర్థి గెలిచి తీరుతాడని కానీ పందెం కాసేందుకు సాహసించలేకపోతున్నారు. హాట్ ఫేవరెట్గా బరిలో నిలిచిన వైఎస్సార్ సీపీ వైపు పందెం పట్టడానికే పలువురు ఉత్సాహపడుతున్నారు. రాష్ర్టంలో 15 నుంచి 20 ఎంపీ స్థానాలతో పాటు వందకు పైగా అసెంబ్లీ సీట్లు వైఎస్సార్ సీపీ గెలుచుకుంటుందని, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త ఆంధ్రప్రదేశ్కు తొలి ముఖ్యమంత్రి అవుతారని పందెం కాయడానికి ముందుకు వచ్చే వారి సంఖ్య జిల్లాలో ఎక్కువగా ఉంది. కొంతమంది మరో అడుగుముందుకేసి వైఎస్సార్ సీపీ 22కు పైగా ఎంపీ స్థానాలతో పాటు 130కి పైగా అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందని సైతం పందేలకు సై అంటున్నారు. పందేల కోసం కొందరు ఇళ్లు, పొలాలు, ఇతర ఆస్తులను పణంగా పెడుతున్నారు. మొత్తం మీద ఈనెల 16వ తేదీ.. పదవులు దక్కిన వారికీ, పందేలు గెలిచిన వారికీ పండగ కానుండగా.. ఎన్నికల పోరులో చతికిలబడిన వారికీ, పందేలు కోల్పోయిన వారికీ దుర్దినం కానుంది. వైఎస్సార్ సీపీపై కోసు పందేలు.. జిలాలో మూడు పార్లమెంటు, 12 నుంచి 15 వరకు అసెంబ్లీ స్థానాలు వైఎస్సార్ సీపీ గెలుచుకుంటుందని పలువురు పందేలకు ముందుకు వస్తున్నారు. కాగా విజయం ఖాయమనుకుంటున్న అభ్యర్థులు సాధించే మెజారిటీలపైనా పందేలు జోరుగా సాగుతున్నాయి. వైఎస్సార్ సీపీ కాకినాడ, అమలాపురం ఎంపీ అభ్యర్థులు చలమలశెట్టి సునీల్, పినిపే విశ్వరూప్లతో పాటు జగ్గంపేట, తుని, ప్రత్తిపాడు, అనపర్తి, రాజమండ్రి రూరల్, రాజోలు, అమలాపురం, రంపచోడవరం, కాకినాడ సిటీ వంటి నియోజక వర్గాల్లో అభ్యర్థుల మెజారిటీలపై పందేలు జోరుగా సాగుతున్నాయి. కాకినాడ ఎంపీగా సునీల్ లక్ష ఓట్ల మెజార్టీతో గెలుపొందుతారని, అనపర్తిలో డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి పాతికవేలకు పైగా మెజారిటీ వస్తుందని, జగ్గంపేట, తునిలలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు 15 వేలకు తక్కువ కాకుండా మెజారిటీ వస్తుందంటూ పందేలు కాస్తున్నారు. పిఠాపురం, కాకినాడ రూరల్లలో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల స్థాయిలోనే స్వతంత్రులపై పందేలు కాస్తున్నారు. సామాజిక సమీకరణల్లో కీలక నియోజకవర్గాలైన కొత్తపేట, రామచంద్రపురం, మండపేటల్లో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో పందేలు జరుగుతున్నాయి. రామచంద్రపురం, మండపేటల్లో అయితే వైఎస్సార్ సీపీ తరఫున పందేలకు ముందుకు వచ్చే వారు ఒకటికి మూడింతలు ఇచ్చే విధంగా ‘కోసు’ పందేలు కాస్తున్నారు. -
సీమాంధ్రలో వైఎస్సార్ సీపీదే ప్రభంజనం
* ఆ పార్టీకి 150కిపైగా ఎమ్మెల్యే సీట్లు, 22కుపైగా ఎంపీ సీట్లు వస్తాయి * 2019 కల్లా తెలంగాణలో మరింత బలోపేతమవుతాం * వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ ఈసీ శేఖర్గౌడ్ యాచారం, న్యూస్లైన్: సార్వత్రిక ఎన్నికల్లో సీమాంధ్రలో వైఎస్సా ర్ సీపీ ప్రభంజనం సృష్టిస్తుందని, ఆ పార్టీకి 150కి పైగా ఎమ్మెల్యే, 22కుపైగా ఎంపీ సీట్లు రావడం ఖాయమని, తద్వారా వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అవుతారని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ ఈసీ శేఖర్గౌడ్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని నక్కర్తమేడిపల్లిలో జరిగిన ఓ విలేకరి వివాహానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈసీ శేఖర్గౌడ్ విలేకరులతో మాట్లాడారు. పేదల సంక్షేమం కోసం కృషి చేసే శక్తి కేవలం జగన్మోహన్రెడ్డికే మాత్రమే ఉందన్నారు. అధికారం కోసం చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్లు ఒక్కటై ఎంత ప్రచారం చేసినా సీమాంధ్ర ప్రజలు జగన్ నాయకత్వానికే పట్టం కట్టనున్నారని తెలిపారు. చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదని అన్నారు. కాంగ్రెస్పై విశ్వాసం పోయిందని పేర్కొన్నారు. పవన్ మళ్లీ సినిమాలు చేసుకోవాల్సిందేనని చెప్పారు. దివంగత మఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల కోసం స్థాపించిన వైఎస్సార్ సీపీ కేవ లం పేదల సంక్షేమం కోసం మా త్రమే పనిచేస్తుందని అన్నారు. సీమాంధ్రలో జగన్మోహన్రెడ్డి సీఎం అయితే తెలంగాణలోనూ పార్టీ బలోపేతమవుతుంద ని తెలిపారు. 2019 కల్లా తెలంగాణలో వైఎస్సార్ సీపీని మరింత బలోపేతం చేస్తామన్నారు. కూలీలతో వరి కోతలు కోయించండి జిల్లాలో ఎక్కడా లేని విధంగా యాచారం మండలంలో వడగళ్ల వర్షానికి రైతులు వందలాది ఎకరాల వరి పంట నష్టపోయారని ఈసీ శేఖర్గౌడ్ అన్నారు. నష్టపోయిన వరిని ఉపాధి కూలీల ద్వారా కోయించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. గురువారం పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు నాయిని సుదర్శన్రెడ్డి, నాయకుడు దార నర్సింహతో కలిసి ఎంపీడీఓ నాగలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. వడగళ్ల వల్ల గింజ కూడా పంటపై లేదని కూలీల ద్వారా కోయిస్తే రైతులకు పశుగ్రాసమైనా దక్కుతుందన్నారు. నష్టపోయిన పంటల వివరాలను త్వరగా పూర్తి చేసేలా చొరవ తీసుకోవాలని కోరారు. -
ఓటేమాతరం
ఓటర్లూ ఈ రోజు మీదే.. ఐదేళ్లకొకసారి వచ్చే ఈ రోజును వినియోగించుకోండి.. మీ సత్తా చూపండి.. మీ వద్ద ఉన్న ఓటు ఆయుధాన్ని సంధించండి.. స్వార్థ చింతన, స్వలాభం చూసుకునే నాయకులను దూరం పెట్టండి.. ఓటేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి.. డబ్బులు ఇచ్చాడనో.. మద్యం తాగించాడనో ఐదేళ్ల కాలాన్ని వారి చేతిలో పెట్టొద్దు.. మనకు ఎవరైతే న్యాయం చేస్తారో.. సమాజాన్ని బాగు చేస్తారో వారికే ఓటేసి తలరాతను మార్చుకోండి..! సాక్షి, ఒంగోలు: ఓటర్స్ డే రానే వచ్చింది. బుధవారం జిల్లాలోని 12 అసెంబ్లీ, మూడు లోక్సభ స్థానాలకు సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ స్థానాలకు 187 మంది, లోక్సభ స్థానాలకు 29 మంది బరిలో వున్నారు. పోలింగ్కు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఒంగోలు లోక్సభ స్థానం పరిధిలో ఒంగోలు, దర్శి, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం(ఎస్సీ), కొండపి(ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గాలు న్నాయి. అలాగే బాపట్ల లోక్సభ స్థానం పరిధిలో అద్దంకి, పర్చూరు, చీరాల, సంతనూతలపాడు అసెంబ్లీ సెగ్మెంట్లు వుండగా, జిల్లాలోని కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం మాత్రం నెల్లూరు పార్లమెంటరీ స్థానం పరిధిలో వుంది. ఆయా స్థానాల్లో ప్రధాన పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం, కాంగ్రెస్తో పాటు భారతీయ జనతా పార్టీ ఒకచోట, జై సమైక్యాంధ్ర పార్టీ, లోక్సత్తా, ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. * జిల్లాలో మొత్తం 24,84,109 మంది ఓటర్లు వున్నారు. * 12, 34,660 మంది పురుషులు కాగా, 12,49,285 మంది మహిళా ఓటర్లు వున్నారు. * వీరంతా బుధవారం జరిగే పోలింగ్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. * ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. * జిల్లాలోని 1885 ప్రాంతాల్లో 2,881 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. * ఆయా కేంద్రాల వద్ద తాగునీరు, టాయిలెట్లు, విద్యుత్ సౌకర్యంతో పాటు వికలాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. * జిల్లాలో 1022 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా, 559 కేంద్రాలను అతిసమస్యాత్మకంగా గుర్తించారు. * తీవ్రవాద ప్రాబల్య ప్రాంతాలు 38 ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో పోలింగ్ సరళిని వీడియో తీయించేందుకు ఏర్పాట్లు చేశారు. * నిరంతరం ఎన్నికలను పర్యవేక్షించేందుకు 659 కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. వీటికి అనుసంధానంగా కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. పోలింగ్కు సంబంధించి ఫిర్యాదులు వుంటే టోల్ ఫ్రీ నంబర్ 1077 కు ఫోన్ చేయవచ్చు. * 922 పోలింగ్ కేంద్రాల్లో పరిశీలనకు 720 సూక్ష్మపరిశీలకులను నియమించారు. మంగళవారం రాత్రికే పోలింగ్ సామగ్రి తరలింపు * జిల్లాలోని 12 నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ నిర్వహణకు 20, 041 మంది ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకుంటున్నారు. * వీరందరికీ శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆయా నియోజకవర్గాల్లోని సమీప కళాశాలల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేసి మాక్ పోలింగ్ నిర్వహించి శిక్షణ ఇచ్చారు. * మంగళవారం రాత్రికే ఎన్నికల సామగ్రిని సిబ్బందికి అప్పగించారు. వారిని ప్రత్యేక బస్సుల్లో పోలింగ్ కేంద్రాలకు పంపారు. * ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. అంతకు అర్ధగంట ముందుగానే రాజకీయ పార్టీల ఎన్నికల, బూత్ ఏజెంట్లు హాజరుకావాల్సి ఉంది. అందరి వద్ద సంతకాలు తీసుకున్న తర్వాత వారి సమక్షంలోనే ప్రిసైడింగ్ అధికారులు ఈవీఎం యంత్రాల సీల్ను తొలగిస్తారు. * పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల పనితీరులో ఇబ్బందులు తలెత్తితే, వెంటనే మార్పు చేసేందుకు సెక్టోరల్ అధికారుల వద్ద అసెంబ్లీకి రెండు, పార్లమెంట్కు మరో రెండు ఈవీఎంలు రిజర్వులో ఉంచారు. * కేంద్రాల వద్ద ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 9,545 పోలీసు అధికారులు, సిబ్బంది విధుల్లో ఉన్నారు. * పోలింగ్ ప్రక్రియను జిల్లాప్రధాన ఎన్నికల అధికారి కలెక్టర్ విజయ్కుమార్, ఎస్పీ ప్రమోద్కుమార్ పర్యవేక్షిస్తారు. -
ఆఖరి ప్రయత్నం
కలెక్టరేట్, న్యూస్లైన్ : ఒక్క ఓటు.. నేతల తలరాతలు మార్చేస్తుంది. గెలుపోటములను తారుమారు చేస్తుంది. అందుకే తమవారందరితో ఓటు వేయించేందుకు అభ్యర్థులు విశ్వప్రయత్నం చేస్తుంటా రు. గత నెల 30వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగుల్లో చాలా మంది ఇంకా తమ పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోలేదు. ఈ ఓట్లను 15వ తేదీ వరకు వినియోగించుకోవచ్చు. జిల్లాలో పోరు హోరాహోరీగా సాగిందని భావిస్తున్న చోట అభ్యర్థులు ఈ ఓట్లపై దృష్టి సారించారు. ఆయా నియోజకవర్గాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో ఎంతమంది పోస్టల్ బ్యాలెట్లు పొందారు, ఎంత మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు అన్న వివరాలు సేకరించిన అభ్యర్థులు.. ఇంకా ఓటు హక్కు వినియోగించుకోనివారిని కలుస్తూ తమకే ఓటేయాలని కోరుతున్నారు. ఆ ఓట్లను సొంతం చేసుకోవడానికి పోటీపడుతున్నారు. జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల పరిధిలో 19,659 మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 14,599 మందికి జిల్లా ఎన్నికల యంత్రాంగం పోస్టల్ బ్యాలెట్ పత్రాలను జారీ చేసింది. నిజామాబాద్ అర్బన్లో అత్యధికంగా 2,740 మందికి పోస్టల్ బ్యాలెట్లను జారీ చేయగా జుక్కల్ నియోజకవర్గంలో అత్యల్పంగా 1,214 మందికి పోస్టల్ బ్యాలెట్లు జారీ అయ్యాయి. కామారెడ్డిలో 1,902, నిజామాబాద్రూరల్లో 1,621, ఆర్మూర్లో 1,547, బాల్కొండలో 1,437, బాన్సువాడలో 1,400, బోధన్లో 1,393, ఎల్లారెడ్డిలో 1,345 పోస్టల్ బ్యాలెట్ ఓట్లున్నాయి. జిల్లాలో ఇప్పటివర కు 8 వేల మంది పోస్టల్ బ్యాలెట్లు ఉపయోగించుకున్నారు. ఇంకా ఆరు వేల పైచిలుకు ఓట్లు వినియోగించుకోవాల్సి ఉంది. పలు నియోజకవర్గాల్లో ఈ ఓట్లు కీలకం కావడంతో వీటిని సొంతం చేసుకోవడానికి అభ్యర్థులు ప్రయాస పడుతున్నారు. సాధారణ పోలింగ్ ముగిసిన తర్వాత కూడా వీటిని వినియోగించుకోవడానికి పక్షం సమయంలో ఉండడంతో సదరు ఓటర్లకు సైతం గిరాకీ పెరిగింది. అయితే అభ్యర్థులు నేరుగా కాకుండా ద్వితీయ శ్రేణి నాయకులను, తమకు అనుకూలమైన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలను రంగంలోకి దింపి బేరసారాలు సాగిస్తున్నట్లు తెలిసింది. కొందరు అభ్యర్థులు ఫోన్ నంబర్లు సేకరించి, సదరు ఓటర్లతో మాట్లాడుతున్నారు. తమకే ఓటు వేయాలని కోరుతున్నారు. ప్రలోభాలకూ పాల్పడుతున్నట్లు తెలిసింది. పోస్టల్ బ్యాలెట్లు ఎందరి తలరాతలు మారుస్తాయో వేచి చూడాలి. -
వైఎస్సార్సీపీని గెలిపించండి.. ప్రగతికి పట్టం కట్టండి
ఒంగోలు అర్బన్, న్యూస్లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించి ప్రగతికి పట్టం కట్టాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మోడీ నాయకత్వంలో బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ రాష్ట్రం దేశంలోని పలు రాష్ట్రాలతో పోలిస్తే ఎన్నో అంశాల్లో వెనుకబడిఉందని చెప్పారు. గతంలో చంద్రబాబు బీజేపీతో పొత్తు చారిత్రక తప్పిదమని చెప్పి ఇప్పుడు ఎలా పొత్తు పెట్టుకున్నారని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీని ప్రజలు తప్పక తిరస్కరిస్తారన్నారు. దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు కేవలం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అమలయ్యాయన్నారు. ఎంతో మంది పేదలకు ప్రాణం పోసిన ఆరోగ్యశ్రీ పథకం కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఉందన్నారు. అలాంటి మహోన్నత పథకాన్ని మహానేత మరణం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఎందుకు సక్రమంగా కొనసాగించలేకపోయారని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి రాష్ట్రం మొత్తం తిరిగి పేదల కష్టాలు తెలుసుకుని వారి సంక్షేమమే ధ్యేయంగా మేనిఫెస్టో తయారు చేశారని తెలిపారు. వైఎస్సార్సీపీ మేనిఫెస్టో అన్నివర్గాల ప్రజలకు చేయూతనిస్తుందని స్పష్టం చేశారు. అమ్మఒడి పథకం పేద తల్లిదండ్రులు, బిడ్డలకు ఆసరాగా నిలుస్తుందని చెప్పారు. ఆరోగ్యశ్రీతో కార్పొరేట్ వైద్యంతో పాటు రోగి విశ్రాంతి కాలానికి నెలకు రూ.3 వేల చొప్పున ఇస్తామని చెప్పడంతో జగన్ను పేదలకు మరింత అక్కున చేర్చిందన్నారు. ఈ ఎన్నికల్లో జిల్లాలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో కీలకపాత్ర పోషించే ఒంగోలు ఎంపీ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి జిల్లాకు చెందిన నాయకులు కావడంతో వీరి గెలుపుతో అభివృద్ధి పరుగులు తీస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు. జిల్లాలో వైఎస్సార్సీపీ అభ్యర్థులందరూ అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. -
జిల్లా అంతా ఒకే ‘గాలి’
ఎన్నికల వేళ హడావుడి చేస్తున్న ప్రశాంత్ని సముదాయించబోయిన పార్వతమ్మతో ‘ మాటల్లేవ్.. మాట్లాడుకోవటాల్లేవ్’ అంటూ గాల్లో చూపుడు వేలు తిప్పుతూ సమాధానం చెప్పకనే చెప్పాడు ఆ కుర్రాడు. 19 ఏళ్ల అతనికి ఇటీవలే ఓటు హక్కు వచ్చింది.పదిమంది డ్వాక్రా మహిళలు ఓ చోట చేరారు. ఈ సారి ఎవరికి ఓటేయాలబ్బా అనుకున్నారు. అంతలో అక్కడున్న మూడేళ్ల బుడతడు ‘ ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యండి.. దుమ్ముదులపండి’ అనే యాడ్ను పలికాడు. అంతే అక్కడున్న డ్వాక్రా మహిళలు డిసైడయ్యారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే రుణాలన్నీ మాఫీ అవుతాయన్న నిజాన్ని గ్రహించారు. ఇలా జిల్లాలో ఎటు చూసినా.. ఏవర్గాన్ని పలకరించినా ఒకే మాట.. ఒకే గాలి. 12 అసెంబ్లీ నియోజకవర్గాలు.. ఆయా పరిధిలో ఉన్న ఒంగోలు.. బాపట్ల పార్లమెంటు ఓటర్లు కూడా ప్రజాభిమానం సంపాదించుకున్న వైఎస్సార్ సీపీ గురించే తీవ్రంగా చర్చించుకుంటున్నారు. దీనికి ఎన్నో కారణాలు ఉదాహ రణ గా నిలుస్తున్నాయి. ఆ పార్టీ స్థాపన నుంచి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సమస్యలపై ఎన్నో దీక్షలు చేయడం.. సమైక్యాంధ్ర ఉద్యమంలో జైలులో ఉండి కూడా నిరవధిక నిరాహార దీక్ష చేయడం.. ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, కుమార్తె షర్మిల కూడా ఉమ్మడి రాష్ర్టం కోసం పోరాడటాన్ని జిల్లా ప్రజానీకం గుర్తు చేసుకుంటోంది. ఇక వైఎస్ రాష్ట్రానికి చేసిన సేవలను ప్రతి ఒక్కరూ జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. ప్రజా సంక్షేమం కోసం ఆయన ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, పావలా వడ్డీ వంటి ఎన్నో పథకాల వల్ల ఎంతోమంది జిల్లా వాసులు లబ్ధిపొందారు. ఆయన తర్వాత వైఎస్ కుటుంబంపై కాంగ్రెస్, టీడీపీలు పన్నిన కుట్రలకు చలించారు. అందుకే ఇప్పుడు సమాధానం చెప్పేందుకు సన్నద్ధులయ్యారు. దీనికి తోడు జగన్మోహన్రెడ్డి రూపొందించిన మేనిఫెస్టో ప్రతి ఒక్కరికీ ఉపయోగపడేలా ఉండటంపై ప్రజలు ఆలోచిస్తున్నారు. ఐదు సంతకాలతో పాటు.. ఇతర ముఖ్యమైన పనులను కూడా వెంటనే చేస్తానంటూ జగన్ హామీ ఇవ్వడంతో ఆ పార్టీని బలపరిచేందుకు సిద్ధమవుతున్నారు. పవన్ పర్యటించినా.. టీడీపీలో నిరుత్సాహం చావుతప్పి కన్నులొట్టపోయిన విధంగా తయారైన టీడీపీ జిల్లాలో తన ఉనికి కోసం సినీనటుడు పవన్ కల్యాణ్ను ప్రచారం కోసం ఒంగోలు తె ప్పించినా.. ఆ పార్టీ క్యాడర్లో ఉత్సాహం ఏమాత్రం రాలేదు. పసలేని పవన్ ప్రసంగాలు.. జిల్లాలో వేధిస్తున్న ఆధిపత్య పోరాటాలు కార్యకర్తలను ఇంకా గందరగోళంలోనే ఉంచాయి. బాబు హయాంలో జిల్లాలోని రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, డ్వాక్రా మహిళలు, విద్యార్థులు పడిన కష్టాన్ని ఇంకా ఎవరూ మరచిపోలేదు. రెండెకరాల పొలంతో జీవితాన్ని ప్రారంభించిన చంద్రబాబుకు కోట్ల ఆస్తులు, స్విస్బ్యాంకు ఖాతాలు, హెరిటేజ్ వంటి సంస్థలు ఎక్కడ్నుంచి వచ్చాయని రైతులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర విభజనకు సై అనడం.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడటం వంటి కారణాల వల్ల ఇటీవల దర్శి, పర్చూరు, మార్కాపురం, గిద్దలూరులోని టీడీపీ బహిరంగ సభలు బోసిపోయాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. కందుకూరు, కనిగిరి, మార్కాపురం, ఒంగోలు, అద్దంకి తదితర చోట్ల అధికంగా ఉన్న బీసీలతో పాటు కాపు సామాజికవర్గంలోని మెజార్టీ ప్రజలు పవన్కల్యాణ్ ప్రసంగంపై మండిపడ్డారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న గ్రామాల్లోనూ ఈసారి వైఎస్ఆర్ సీపీ జెండాలు రెపరెపలాడుతుండటం విశేషం. టీడీపీ నేతలు ఇళ్లకే పరిమితమై.. తమ అనుచరులతో డబ్బు, మద్యం భారీగా పంపిణీ చేసినప్పటీకీ ఓటర్లు మాత్రం ‘ఫ్యాన్’కే తమ మద్దతని బహిరంగంగా చెబుతున్నారు. - సాక్షి, ఒంగోలు -
ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
గిద్దలూరు రూరల్, న్యూస్లైన్: గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్ విజయకుమార్ పరిశీలించారు. పట్టణంలోని సెయింట్ పాల్స్ బీఈడీ కళాశాల ఆవరణలో పోలింగ్ అధికారులకు ఈవీఎంల పంపిణీ కార్యక్రమాలను ఆయన పరిశీలించి అధికారులకు తగు సూచనలిచ్చారు. ఎన్నికల సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ అందాయాలేదా అన్న విషయాల గురించి ఆర్వో సత్యంను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్నివిధాలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు. ఆయన వెంట తహ సీల్దార్ సుధాకర్రావు, ఇతర అధికారులు ఉన్నారు. -
ఓటరు స్లిప్పుల పంపిణీలో గందరగోళం
కురిచేడు, న్యూస్లైన్ : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓటర్లకు స్లిప్పుల పంపిణీలో గందరగోళం నెలకొంది. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రక్రియ ద్వారా ఓటర్లందరికీ ఓటేసేందుకు అవసరమైన స్లిప్పులు పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ బూత్లెవల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అనేక మందికి అందలేదు. కురిచేడు మండలంలోని 58వ నంబర్ పోలింగ్ కేంద్రం పరిధిలో మొత్తం 1,030 మంది ఓటర్లుండగా, వారిలో 460 మందికి ఓటర్ స్లిప్పులు అందలేదు. 570 మందికి మాత్రమే స్లిప్పులు పంపిణీ చేశారు. అంతేగాకుండా పంపిణీ చేసిన స్లిప్పుల్లో కూడా 476 నుంచి 570 సంఖ్య వరకూ గల 94 మంది ఓటర్లకు పర్చూరు నియోజకవర్గం పర్చూరు మండలం చింతపల్లిపాడులోని 58వ నంబర్ పోలింగ్ కేంద్రంలోని ఓటర్లకు సంబంధించిన స్లిప్పులు అందజేశారు. ఆ స్లిప్పులు అందుకున్న.. మండలంలోని గొల్లపాలెం ఎస్సీకాలనీ ఓటర్లంతా అయోమయానికి గురయ్యారు. వీరితో పాటు అసలు స్లిప్పులే అందనివారు కూడా ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి బుధవారం తామంతా ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
టెన్షన్.. టెన్షన్..
సాక్షి, ఖమ్మం : పరిషత్, మున్సిపల్ ఫలితాల సమయం దగ్గరపడుతున్న కొద్దీ బరిలో ఉన్న గెలుపా.. ఓటమా.. అని అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. గెలుస్తామని ధీమా ఉన్న అభ్యర్థులు మున్సిపల్, జెడ్పీ, మండల పరిషత్ చైర్మన్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ పదవుల ఎన్నికకు సంబంధించి ఈసీ నోటిఫికేషన్ వెలువరించకపోవడంతో కొత్త రాష్ట్రం ఏర్పాటు తర్వాతే ఎన్నిక ఉంటుందని ఆయా పార్టీల నేతలు సంకేతాలు ఇస్తున్నారు. దీంతో చాలా రోజుల పాటు క్యాంప్లు నిర్వహించడం కష్టమేనని ఈ పదవుల రేసులో ఉన్న అభ్యర్థులతో పాటు పార్టీ నేతలు బెంబేలెత్తుతున్నారు. మళ్లీ వేడెక్కుతున్న రాజకీయం.. ‘స్థానిక’ ఓట్ల లెక్కింపు ఫలితాల తేదీ సమీపించడంతో మళ్లీ పల్లెలు, పట్టణాల్లో రాజకీయం వేడెక్కింది. ఎవరు గెలుస్తారన్న విషయమై చిన్నాచితక పందేలు గ్రామాల్లో ఉపందుకున్నాయి. ఇన్నాళ్లు సార్వత్రిక ఎన్నికల మాటున మరిచిపోయిన అభ్యర్థుల్లో మళ్లీ ఉత్కంఠ మొదలైంది. నెల రోజుల నిరీక్షణ అనంతరం ఫలితాలు వస్తున్నాయని అభ్యర్థులు ఊపిరి పీల్చుకుంటుండగా, మున్సిపల్, జెడ్పీ, మండల పరిషత్ చైర్మన్ ఎన్నికలపై మళ్లీ ఉత్కంఠే నెలకొంది. ఈ పదవుల ఎన్నికకు ఎలక్షన్ కమిషన్ ఇంకా ఎలాంటి అధికార ఆదేశాలు ఇవ్వకపోవడం, జూన్ 2న తెలంగాణ రాష్ట్రం అవతరించనుండడంతో సందిగ్ధం నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత ఈ పదవులకు పరోక్ష ఎన్నిక ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సమయంలో అవసరమైతే స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ఓటు కీలకం కానుంది. ప్రస్తుతం శాసనసభ రద్దు కావడం, జూన్ 2 వరకు కొత్త ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రమాణ స్వీకారం చేసే అవకాశం లేకపోవడంతో వారు ఓటు వేసే పరిస్థితి లేదు. అందుకే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే పరోక్ష ఎన్నికలు ఉంటాయని రాజకీయ పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో ఫలితం వెలువడిన తర్వాత కూడా మరికొన్ని రోజులు మున్సిపల్, పరిషత్ చైర్మన్లపై ఆశపెట్టుకున్న వారికి నిరీక్షణ తప్పడం లేదు. వెంటనే చైర్మన్ల ఎన్నిక ఉంటే ఆందోళన ఉండదని అభ్యర్థులు భావిస్తున్నారు. చైర్మన్ల పీఠంపై పార్టీల గురి.. వరుసగా మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలు వెలువడుతుండడంతో ఇప్పడు అన్ని పార్టీలు చైర్మన్ల పీఠంపై గురి పెట్టాయి. ఈ పదవులను కైవసం చేసుకోవడానికి ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. తమ అభ్యర్థులను బరిలో నిలిపిన అన్ని పార్టీలు ఆ దిశగా పావులు కదుపుతున్నాయి. తమకు ఎన్ని స్థానాలు వస్తాయి.. స్పష్టమైన మెజారిటీకి ఇంకా ఎన్ని స్థానాలు అవసరమవుతాయి.. స్వతంత్రులు ఎంతమంది గెలుస్తారు.. చిన్న పార్టీలకు ఎన్ని స్థానాలు వస్తాయి.. వారిని తమవైపు ఎలా తిప్పుకోవాలి.. అనే అంశాలపై చర్చల్లో మునిగారు. జెడ్పీ, మున్సిపల్, పరిషత్ చైర్మన్ అభ్యర్థులుగా ప్రచారంలో ఉన్న నాయకులు గెలుస్తారనే నమ్మకం ఉన్న అభ్యర్థులను ఇప్పటి నుంచే మచ్చిక చేసుకొనే పనిలో పడ్డారు. చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడమే ధ్యేయంగా తమ నేతలను కాకా పడుతున్నారు. అయితే తమకు అనుకూలంగా ఏ అభ్యర్థి ఉంటాడు, అతను చైర్మన్ పీఠం కోసం ఖర్చు పెడతారా..? అని ఆయా నేతలు అన్వేషణలో పడ్డారు. క్యాంపులంటేనే బెంబేలు.. మున్సిపల్, జెడ్పీ, మండల పరిషత్ చైర్మన్ ఎన్నికకు ఇంకా నోటిఫికేషన్ రాకపోవడంతో ఫలితాలు వెలువడిన తర్వాత కాం్యపులంటేనే ఈ పదవులు ఆశిస్తున్న అభ్యర్థులు బెంబేలెత్తిపోతున్నారు. ఫలితాలు వెల్లడైన పదిరోజుల్లోగా పరోక్ష ఎన్నికలు నిర్వహిస్తే క్యాంప్ల నిర్వహణ పెద్ద భారం కాదు. కానీ ఈసారి ఫలితాలు వెలువడిన చాలా రోజుల తర్వాత పరోక్ష ఎన్నికలు జరుగనుండడంతో క్యాంప్లు అంటేనే ఇటు పార్టీల నేతలు అటు ఈ పదవులు ఆశించే వారు హడలెత్తిపోతున్నారు. ఫలితాలు వెలువడిన వెంటనే క్యాంప్లు నిర్వహించకపోతే ప్రత్యర్థి పార్టీలు తమ మద్దతుదారులను ఎగురేసుకుపోతారనే భయం ఓవైపు ఉండగా..ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో తెలియకుండా ఇన్ని రోజులు క్యాంప్లు నిర్వహిస్తే ఖర్చు తడిసి మోపెడవుతుందన్న ఆందోళన వారిలో నెలకొంది. క్యాంప్లు వేయకపోతే ప్రత్యర్థి నుంచి ముప్పు పొంచి ఉండడంతో పాటు గెలిచిన వారి మనసు కూడా మారుతుందేమోనన్న అనుమానం వారిని వేధిస్తోంది. ఖర్చు పెడితే తమకే పదవులు దక్కుతాయా..? అని రేసులో ఉన్న వారు క్యాంప్లకు వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. అయితే ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు.. మున్సిపల్, పరిషత్ చైర్మన్ల ఎన్నికను ఆపరని, సార్వత్రిక ఎన్నికలకు ముందే చైర్మన్ల ఎన్నిక నోటిఫికేషన్ వెలువడనుందని కొంతమంది నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితులతో చైర్మన్ పీఠం రేసులో ఉన్న అభ్యర్థులు పరోక్ష ఎన్నికల తేదీ, క్యాంప్ల విషయంలో పరేషాన్ అవుతున్నారు. -
ఓటు పడలేదా..? వేటు పడుద్ది..!
మంచిర్యాలసిటీ, న్యూస్లైన్ : నెల రోజులకు పైగా గ్రామ, పట్టణాల్లోని ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థుల వద్ద హంగామా సృష్టించారు. ‘అన్నా గెలుపు మనదే.. మన చేతిలో ఊరు, వాడా, గల్లీవాసులు ఉన్నారు..’ అంటూ ఊదరగొట్టారు. ‘ఓట్లన్నీ మనకే పడుతాయి, నువ్వేం ఫికర్ జేయకు, నన్ను కాదని నా వోళ్లంతా ఎటూ పోరు..’ అంటూ భరోసానిచ్చారు. మాయమాటలతో డబ్బులు లాగిన నాయకులకు గుబులు మొదలైంది. మరో తొమ్మిది రోజుల్లో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈవీఎంలు కావడంతో వార్డుల వారీగా లెక్క తేలనుంది. ఏ వార్డులో ఎన్ని ఓట్లు పోలయ్యాయనే విషయమూ అభ్యర్థులకు తెలిసిపోనుంది. ప్రగల్భాలు పలికిన మేరకు ఓట్లు రాలకపోతే పరిస్థితి ఏమిటనే విషయమై తర్జన భర్జన పడుతున్నారు. ఓట్లు పడితే భవిష్యత్ ఉంటుంది, లేదంటే వేటు పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బ్యాలెట్ ద్వారా ఓటు వేసినప్పుడు అన్ని కలిపి లెక్కించేవారు. ప్రస్తుతం ఈవీఎం కావడంతో పరిస్థితి మారిపోయింది. తమ ఊళ్లో.. వార్డులో ఆధిక్యం మనదే, ప్రత్యర్థులకు ఓట్లు పడలేదు అని చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది. ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రాల వారీగా కమిటీలు వేసి గెలుపు కోసం కృషి చేయాలని అభ్యర్థులు ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులను కోరారు. దీంతో ఎన్నో మాటలు చెప్పి మూటలు పట్టుకెళ్లారు. మనసులో ఉన్న కోరికలు సాధించుకున్నారు. తీరా ఫలితాల సమయం ఆసన్నం కావడంతో రోజు రోజుకు గుబులు రెట్టింపవుతోంది. నాయకులు కూడా కూడికలు, తీసివేతల్లో నిమగ్నమయ్యారు. ఏ వార్డులో ఎన్ని ఓట్లు ఉన్నాయని, ఎవరు ఎంత పట్టుకెళ్లారో నాయకుల వివరాలతో లెక్కలేస్తున్నారు. ఫలానా చోట ఇంత ఇచ్చాం.. ఇన్ని ఓట్లు రావాలని తేల్చేస్తున్నారు. ఆశించిన మేరకు ఓట్లు రాని చోట అక్కడి నాయకులు డబ్బు, మద్యం పంచలేదనే అభిప్రాయానికి అభ్యర్థులు రాక తప్పదు. దీంతో అక్కడి నాయకులపై వేటు తప్పదు మరీ. -
కాయ్ రాజా కాయ్..
ఆదిలాబాద్ క్రైం, న్యూస్లైన్ : సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడి సమయం సమీపిస్తోంది. అభ్యర్థుల భవితవ్యంపై బెట్టింగ్ జోరందుకుంది. నువ్వా.. నేనా అన్నట్లు సాగిన పోటీలో ఎవరు గెలుస్తారనే దానిపై బెట్టింగ్ నడుస్తోంది. కాయ్ రాజా కాయ్ అంటూ రూ.లక్షల్లో పందెం కాస్తున్నారు. ఫలానా నాయకుడు గెలుస్తాడని కొందరు.. ఇన్ని వేల మెజార్టీ వస్తుందని మరికొందరు.. అభ్యర్థుల గెలుపోటములపై ఎవరికి తోచినట్లుగా వారు పందెం కాస్తున్నారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల విజేతలపై పందెం కాసే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఫలితాలపై ఉత్కంఠ జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో సార్వత్రిక ఎన్నికల పోరు రసవత్తరంగా సాగింది. దీంతో ఫలానా పార్టీ గెలుస్తుందని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, చెన్నూర్, సిర్పూర్, ముథోల్ స్థానాల్లో నువ్వా.. నేనా అన్నట్లుగా పోటీ సాగింది. దీంతో ఈ స్థానాలపైనే ఎక్కువగా బెట్టింగ్ నడుస్తోంది. ఒక అభ్యర్థిపై రూ.వందకు రూ.200, మరొకరిపై రూ.200కు రూ.300 పందెం కాస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓట్ల ఆధిక్యతపై పందెం సాగుతోంది. పది వేల మెజార్టీ వస్తే ఓ రేటు, 20వేల మెజార్టీపై ఓ రేటు ఇలా బెట్టింగ్ నడుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.5వేల నుంచి రూ.50 వేల వరకు, పట్టణ ప్రాంతాల్లో రూ.50 వేల నుంచి రూ.3లక్షల వరకు బెట్టింగ్లు సాగుతున్నాయి. ఈ బెట్టింగ్ల్లో మధ్యవర్తులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. పందెం కాస్తున్న ఇద్దరి వద్ద ముందే డబ్బులు తీసుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తమ కమీషన్ పోను మిగితా డబ్బులు గెలిచిన వారికి అప్పగించడం వారి బాధ్యత. బరిలో ఉన్న అభ్యర్థులతోపాటు పందెంరాయుళ్లు, మధ్యవర్తులు ఉత్కంఠగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఎంపీ అభ్యర్థులపై భారీగా పందెం జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల గెలుపోటములపై భారీగా బెట్టింగ్ సాగుతోంది. రియల్టర్లు, బడా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు బెట్టింగ్లో పాలు పంచుకుంటున్నారు. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి రాథోడ్ రమేశ్(టీడీపీ), గోడాం నగేష్(టీఆర్ఎస్), నరేష్జాదవ్(కాంగ్రెస్), పెద్దపల్లి స్థానంలో వివేకా(కాంగ్రెస్), బాల్క సుమన్(టీఆర్ఎస్) మధ్య తీవ్ర పోటీ నెలకొంది. తమ నాయకుడే గెలుస్తాడని, తమకే మెజార్టీ వస్తుందని అభ్యర్థుల అనుచరులు రూ.లక్షల్లో పందెం కాస్తున్నారు. సుమారు రూ.3లక్షల నుంచి రూ.5లక్షల బెట్టింగ్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. మెజార్టీ విషయాన్ని పక్కన పెడితే రెండు ఎంపీ స్థానాల్లో గెలుపెవరిదనే దానిపై చర్చ సాగుతోంది. అభ్యర్థులు మాత్రం ఈసారి గెలిస్తే చాలనుకునే పరిస్థితి నెలకొంది. గ్రామాల్లోనూ... గ్రామాల్లోని యువత ఎక్కువగా పందెం కాస్తోంది. రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు పందెం కాస్తున్నారు. కొందరు నగదు రూపంలో కాకుండా నజరానాల రూపంలో బెట్టింగ్ కడుతున్నారు. సెల్ఫోన్లు, కెమెరాలు, చిన్నపాటి మందు పార్టీలు, విందులపై బెట్టింగ్ నడుస్తోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు కావడంతోనే బెట్టింగ్లు పెద్ద ఎత్తున కాస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా మరో తొమ్మిది రోజుల్లో జిల్లాలో రూ.కోట్లు చేతులు మారనున్నాయి. -
వైఎస్సార్ సీపీ వ్యతిరేక శక్తుల ఓటమి ఖాయం
సిద్దిపేటఅర్బన్, న్యూస్లైన్: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఒకతీరుగా, సీమాంధ్రలో మరోతీరుగా మాట్లాడుతూ ప్రజలను వంచిస్తున్నారని, సీమాంధ్రలో జరిగే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ వ్యతిరేక శక్తుల ఓటమి ఖాయమని ఆ పార్టీ సిద్దిపేట అసెంబ్లీ అభ్యర్థి తడ్క జగదీశ్వర్ గుప్తా పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతుల సమస్యలపై మొసలి కన్నీరు కారుస్తున్న చంద్రబాబు తన హయంలో విద్యుత్ను సక్రమంగా సరఫరా చేయాలని అడిగిన పాపానికి రైతులను గుర్రాలతో తొక్కించి, పోలీసులను ఉసిగొలిపి, తుపాకులతో కాల్చి చంపించారన్నారు. చంద్రబాబు అవలంబించిన రెండు కళ్ల సిద్ధాంతంతో తెలంగాణలో, సీమాంధ్రలో టీడీపీ ఓటమి పాలవడం తథ్యమన్నారు. సినీ నటుడు పవన్ కళ్యాణ్ జనసేనను బీజేపీకి, టీడీపీకి అమ్మేశాడని వైఎస్సార్ సీపీని విమర్శించే హక్కు ఆయనకు లేదన్నారు. కాంగ్రెస్ హఠాఓ, దేశ్ బచావో అంటున్న పవన్ తన సోదరుడు చిరంజీవిని ఎందుకు విమర్శించడం లేదని ప్రశ్నించారు. నేతల వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, వారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని గుణపాఠం చెబుతారన్నారు. సమావేశంలో ఆ పార్టీ నాయకులు పిడిశెట్టి దుర్గాప్రసాద్, ఎండీ అఖిల్ తదితరులు పాల్గొన్నారు. -
‘అందోల్’ పైనే ఆందోళన
క్రాస్ ఓటింగ్ ఎవరి పుట్టి ముంచుతుందోనని నేతల గుండెల్లో గుబులు! జోగిపేట, న్యూస్లైన్: అందోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు ప్రచారం జరుగుతుండంతో అభ్యర్థుల్లో గుండెల్లో గుబులు పుడుతోంది. ఎన్నికల్లో ఓటర్లు చతురత చూపారు. ఒకేపార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు కాకుండా వేర్వేరు పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఓటరు ఏ పార్టీవైపు మొగ్గు చూపాడో తేల్చుకోలేక అభ్యర్ధులు ఆందోళన చెందుతున్నారు. జహీరాబాద్ లోక్సభ నియోజకవ ర్గంలో టీడీపీ అభ్యర్థికి కొంతమంది పార్టీ నాయకులు బహిరంగంగా మద్దతు ఇచ్చినా ఎమ్మెల్యే విషయానికి వచ్చే సరికి ఎవరికి వారు క్రాస్ ఓటింగ్ పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందోల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, అభ్యర్థికి, పుల్కల్లో కాంగ్రెస్ అభ్యర్థికి, అల్లాదుర్గం, మునిపల్లి, రాయికోడ్లలో కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులకు, టేక్మాల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు సమాచారం. టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పోటీలో ఉన్నప్పటికీ ఎమ్మెల్యే విషయంలో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు అనుమానిస్తున్నారు. మాజీ మంత్రి బాబూమోహన్ టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని కేడర్ అంతా ఆయన వెంట వచ్చినా పుల్కల్, అల్లాదుర్గం, అందోల్లో కొంత మంది నాయకులు టీడీపీలోనే ఉండిపోయారు. మిగతా వారు టీఆర్ఎస్కు ఏకపక్షంగా ఓటువేశారు. టీఆర్ఎస్లో చేరని టీడీపీ నాయకులకు టీడీపీ ఎంపీ అభ్యర్థి నియోజకవర్గ ప్రచార బాధ్యతలను అప్పగించారు. నియోజకవర్గం కేంద్రంలో ఒక సామాజిక వర్గానికి చెందిన వారు టీడీపీ ఎంపీ అభ్యర్థికి బహిరంగంగా మద్దతు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో పార్టీలకతీతంగా ఓట్లు క్రాస్ అయినట్లు భావిస్తున్నారు. అభ్యర్థుల గుణ గణాలు, సామాజిక నేపథ్యం, పార్టీ వ్యవహరశైలిపై ఒక అంచనాకు వచ్చిన మెజార్టీ ఓటర్లు ఒకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు కాకుండా వేర్వేరు అభ్యర్థులకు ఓట్లు వేశారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామం అభ్యర్థులను కలవరపరుస్తోంది. క్రాస్ ఓటింగ్ ఏ మేరకు జరిగిందనే అంశంపైనే అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. మండలాలు, గ్రామాల వారీగా ఓటింగ్ సరళిపై సమాచారం సేకరించిన ఆయా పార్టీల అభ్యర్థులు క్రాస్ ఓటింగ్పై బూత్ల వారీగా ఆరా తీస్తున్నారు. ఓటర్ల వ్యవహర శైలి లోక్సభ అభ్యర్థుల్లో గుబులు రేపుతుంది. ఎమ్మెల్యే అభ్యర్థికి మొగ్గు చూపిన ఓటర్లు ఎంపీ విషయంలో మరో పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసినట్లు తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో బహుముఖ పోటీ ఉండడంతో ఓటర్లు తమకు ఇష్టం వచ్చిన అభ్యర్థికి వారికి ఓటు వేశారు. నియోజకవర్గంలో క్రాస్ ఓటింగ్ ఎవరికి లాభం..ఎవరికి నష్టం కల్గిస్తుందో 16వ తేదీ వరకు వేచి చూడాల్సి ఉంది. -
‘క్రాస్’ గుబులు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పోలింగ్ సరళిపై సమీక్షిస్తూ గెలుపోటములపై లెక్కలు వేసుకుంటున్న అభ్యర్థులంతా ఇపుడు ఫలితాల కోసం ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు. జిల్లాలోని 10 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో కొన్ని చోట్ల ఓ పార్టీ హవా సాగినా, మరి కొన్ని స్థానాల్లో మాత్రం ఏ పార్టీవైపు ఓటర్లు మొగ్గుచూపారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో క్రాస్ ఓటింగ్ జరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో 16న వెలువడనున్న ఫలితాలకోసం అభ్యర్థులం తా ఎదురుచూస్తున్నారు. ఎవరికివారు విజయం తమదంటే తమదంటూ పైకి బీరాలు పలుకుతున్నా, లోలోన మాత్రం ఏమైతదోనంటూ ఆందోళన చెందుతున్నారు. రూ. కోట్లకు కో ట్లు గుమ్మరించినా ఓటరు‘నాడి’ దొరకక పోవడం..తీర్పు వెలువడానికి ఇంకా 10 రోజులు సమయం ఉండడంతో నేతలకు నిద్రపట్టడం లేదు. ఈ టెన్షన్ తట్టుకోలేక కొందరు నాయకులు తీర్థ యాత్రలకు వెళ్లిపోగా, మరికొంత మం ది నాయకులు గ్రామాల్లోని తమ నాయకులకు రప్పిం చుకుని ఓట్లపై లెక్కలు వేస్తూ కాలం గడుపుతున్నారు. రోటీన్కు భిన్నంగా.... రోటీన్కు భిన్నంగా ఓటర్లు స్పందించారు. సంప్రదాయక ఓటింగ్కు ‘స్వస్తి’ చెప్పారు. క్రాస్ ఓటింగ్కు తెరలేపారు. ఏ ఓటు ఎవరికి పడిందో సర్వేలకు కూడా అందని విధంగా ఓటర్లు తీర్పు చెప్పారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మద్యం, డబ్బు సగటు ఓటరు ఇచ్చే ‘తీర్పు’ మీద ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిందని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. రాజకీయ చైతన్యం ఉన్న మెదక్ జిల్లాలో ప్రతి పార్టీకి సంప్రదాయక ఓట్లు ఉన్నాయి. ముఖ్యంగా పల్లె ప్రాంతంలో ప్రజలు తమ కులానికి ఎంతగా ప్రాధాన్యత ఇస్తారో... రాజకీయ పార్టీకి అంతే ప్రాధాన్యత ఇస్తారు. ఒక పార్టీకి చెందిన కార్యకర్త ఇంటికి మరో పార్టీ వాళ్లు వచ్చి ఓటు అడిగితే అవమానంగా భావించి, గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టిన సందార్భాలు పల్లెల్లో అనేకం ఉన్నాయి. మరోవైపు నాయకులే ఓటరు ఇంటి గుమ్మం తొక్కి బతిమిలాడి డబ్బు చేతుల్లో పెట్టి తనకే ఓటు వేసే విధంగా ఒట్టు పెట్టించుకున్న సందర్భాలూ ఉన్నాయి. అయితే తీరా పోలింగ్ రోజున మాత్రం సగటు ఓటరు ఒట్టు తీసి గట్టున పెట్టాడు, సంప్రదాయ ఓటింగ్ పద్ధతిని పక్కనబెట్టి తమకు నచ్చిన నేతకే ఓటు వేసుకున్నారు. దీంతో ఈ సారి ఎవరు ఓడిపోతారో.. ఎవరు గెలుస్తారో అంచనా వేయలేని పరిస్థితి ఏర్పడింది. ‘క్రాస్’ భయం జిల్లాలోని 10 అసెంబ్లీ , 2 పార్లమెంటు నియోజకవర్గాలుండగా అన్నిచోట్లా క్రాస్ ఓటింగ్ జరిగినట్టు సమాచారం. అందువల్లే గెలుపుపై నమ్మకం పెట్టుకున్న నేతలు కూడా క్షేత్రస్థాయిలోని కార్యకర్తలను పిలిపించుకుని పోలింగ్ సరళిపై క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. అయినప్పటికీ ఓటరు నాడి అందకపోవడంతో అభ్యర్థులంతా టెన్షన్ పడుతున్నారు. ముఖ్యంగా పటాన్చెరు, సంగారెడ్డి, నర్సాపూర్, జహీరాబాద్, ఆందోల్ నియోజకవర్గాలకు చెందిన నేతల్లో తీవ్రమైన ఉత్కంఠత నెలకొని ఉంది. ఈ ఐదు నియోజకవర్గాల్లో సగటు ‘ఓటరు నాడి’ నేతలకు దొరకడం లేదు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు ఎవరికి వారిగా లెక్కలు గడుతూ గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మెదక్ పార్లమెంటు విషయంలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. అన్ని పార్టీలకు చెందిన కార్యకర్తలు, ఓటర్లు ‘గేరు’ మార్చినట్లు సమాచారం. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి వైపుకూడా ఓటర్లు మొగ్గు చూపినట్టు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. -
మనమే విజేతలం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘జిల్లాలో అత్యధిక స్థానాలు మనవే. కనిష్టంగా సగం సీట్లన్నా గెలుచుకుంటాం. అధికారంలోకి రాబోయేది మనమే. మంత్రి పదవులపై అందరం ఆలోచిద్దాం’. తెలంగాణలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీల అంతర్గత చర్చల సారాంశం ఇది. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికలపై ఏ పార్టీకి ఆ పార్టీ అంతులేని ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తున్నాయి. జిల్లాలో అత్యధిక స్థానాలు మావంటే మావేనని ధీమాను వ్యక్తపరుస్తున్నాయి. ఆయా పార్టీలు నిర్వహిస్తున్న అంతర్గత సమీక్షల్లో పోలింగ్ సరళిని సూక్ష్మంగా విశ్లేషిస్తున్నాయి. విజయావకాశాలున్న స్థానాలెన్ని.. గెలిచేదెవరు అనే అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్న పార్టీలు... ఓటింగ్ జరిగిన తీరును క్షేత్రస్థాయి నుంచి వచ్చిన నివేదికలతో పోల్చుకుంటున్నాయి. సోమవారం టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య నిర్వహించిన సమీక్షా సమావేశంలో మెజార్టీ స్థానాలు మనవేనని కాంగ్రెస్ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేయగా, టీఆర్ఎస్ నేత పి.మహేందర్రెడ్డి ఇంట్లో మంగళవారం రాత్రి జరిగిన సమావేశంలోనూ జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుచుకుంటామనే విశ్వాసం వ్యక్తమైంది. ఎవరికి వారు.. కారు జోరుతో ఒడిదుడుకులు ఎదుర్కొన్న కాంగ్రెస్... సార్వత్రిక సమరంలో పైచేయి మాదేననే గట్టినమ్మకంతో ఉంది. టీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, ఆ పార్టీ విజయతీరాలకు చేరడం కష్టమని.. దాదాపు ఏడు సీట్లు తమ ఖాతాలో పడతాయని భరోసాతో ఉంది. ఇదే విషయాన్ని గాంధీభవన్లో టీపీసీసీ చీఫ్ పొన్నాల సమక్షంలో జరిగిన సమావేశంలో సైతం జిల్లా నేతలు కుండబద్దలు కొట్టారు. మరిన్ని సీట్లు గెలుచుకునేందుకు అవకాశమున్నప్పటికీ, తిరుగుబాటు అభ్యర్థులు, వెన్నుపోటు దారులతో పార్టీకి నష్టం వాటిల్లిందనే అభిప్రాయం వ్యక్తమైంది. అదేసమయంలో కేంద్రంలో మోడీ హవా, బలమైన అభ్యర్థులను బరిలోకి దింపకపోవడంతో పార్లమెంటు స్థానాల్లో క్రాస్ ఓటింగ్కు దారితీసినట్లు తెలుస్తోందని స్పష్టం చేశారు. ఇదిలావుండగా, మంగళవారం టీఆర్ఎస్ కూడా పోలింగ్ సరళిపై విశ్లేషించింది. ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు తొలిసారి భేటీ అయి.. విజయావకాశాలను బేరీజు వేసుకున్నారు. జిల్లాలో వికారాబాద్, తాండూరు, చేవెళ్ల, పరిగి, మల్కాజ్గిరి, మేడ్చల్, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయాకాశాలు మెండుగా ఉన్నాయని, హీనపక్షంగా ఆరు స్థానాలు తథ్యమనే విశ్వాసం వ్యక్తమైంది. గ్రామీణ నియోజకవర్గాల్లో అధిక పోలింగ్ శాతం నమోదవడం పార్టీకి అనుకూలమైన పరిణామంగా చెప్పుకొచ్చారు. చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి విజయం ఖాయమని, మల్కాజ్గిరిలోను గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయని విశ్లేషించారు. ఇక తెలంగాణలో అధికారంపై ఏ మాత్రం విశ్వాసం లేని తెలుగుదేశం కూడా జిల్లాలో మాత్రం తమ ఆధిపత్యం కొనసాగుతుందని భావిస్తోంది. ఆది నుంచి పార్టీకి కంచుకోటగా భావిస్తున్న స్థానాల్లో పార్టీ ప్రాభవాన్ని నిలబెట్టుకుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని పార్టీ అధినేతకు జిల్లా నాయకులు వివరించారు. కనీసం 6 స్థానాలైన జిల్లాలో గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇలా ఎవరికివారు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. ఓటర్లు ఎవరి వైపు మొగ్గారో తేలాలంటే మరో తొమ్మిది రోజులు ఆగాల్సిందే..! -
తక్కువలో తక్కువ!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు జిల్లా అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశించిన ఫలితం దక్కలేదు. గతంలో ఎన్నడూ లేనంతగా అవగాహన కార్యక్రమాలు చేపట్టినా 2009 నాటి ఓటింగ్ శాతాన్ని కూడా అందుకోలేదు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో కేవలం 25 శాతం కంటే తక్కువ ఓటింగ్ జరిగింది. బూత్లు వారీగా ఓటింగ్ సరళిని అధికారులు సమీక్షించగా ఈ వివరాలు బయటపడ్డాయి. మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్లోని 213బైఏ పోలింగ్ కేంద్రంలో అత్యల్పంగా 16.6 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక్కడ మొత్తం 891 ఓట్లుండగా 149 మాత్రమే పోలయ్యాయి. శేరిలింగంపల్లిలోని 266 కేంద్రంలో 19 శాతం ఓటింగ్ జరిగింది. ఈ పోలింగ్ స్టేషన్లో మొత్తం 1,007 ఓట్లుంటే కేవలం 192 మాత్రమే పోలయ్యాయి. ఉప్పల్ డీఏఈ కాలనీ 81 బూత్లో 22.50 శాతం పోలింగ్ నమోదైంది. మేడ్చల్ నియోజకవర్గం జవహర్నగర్లోని 161, 160 పోలింగ్ కేంద్రాల్లో 25 శాతం కంటే తక్కువగా పోలింగ్ నమోదైంది. నియోజకవర్గాల వారీగా అత్యధిక, అత్యల్ప పోలింగ్ నమోదైన కేంద్రాల వివరాలు కొన్ని.. * ఇబ్రహీంపట్నం పరిధిలోని 152 కేంద్రంలో అత్యల్పంగా 515 ఓట్లకు 169 పోలయ్యాయి. అత్యధికంగా 197 బూత్లో 1553 ఓట్లకు 1261 పోలయ్యాయి. 200వ కేంద్రంలో 1,410 ఓట్లకు 1,214 పోలయ్యాయి. * మేడ్చల్లో నియోజకవర్గంలో అత్యధికంగా కేంద్రం 236 కేంద్రంలో అత్యధికంగా 1,594 ఓట్లకు 1,269, కొండాపూర్లోని 246 కేంద్రంలో 1,344 ఓట్లలో 1,118 ఓట్లు పోలయ్యాయి. జవహర్నగర్లో అత్యల్పంగా 161 బూత్లో 1,439 ఓట్లకు 358 ఓట్లయ్యాయి. * కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం వీకర్ సెక్షన్ కాలనీలో 168 కేంద్రంలో 1,616 ఓట్లకు 1,009 ఓట్లు పోలయ్యాయి. అత్యల్పంగా ఎస్.ఆర్ నాయక్నగర్లోని 194 కేంద్రంలో 133 ఓట్లకు 47 ఓట్లు పోలయ్యాయి. గాంధీనగర్ 361 బూతులో 251 ఓట్లకు 95 మాత్రమే పోలయ్యాయి. * కూకట్పల్లి నియోజకవర్గంలో 35 కేంద్రంలో అత్యధికంగా 1చ626 ఓట్లకు 920 ఓట్లు పోలయ్యాయి. 253 బూత్లో 377 ఓట్లకు 205 పోలయ్యాయి. 70 కేంద్రంలో 1,065 ఓట్లకు 298 పోలయ్యాయి. * మహేశ్వరం నియోజకవర్గంలో మల్లాపూర్ 168 కేంద్రంలో అత్యధికంగా 1,621 ఓట్లకు 1,178 పోలయ్యాయి. పెండ్యాల 253 కేంద్రంలో 1,376 ఓట్లలో 1,175 పోలయ్యాయి. అత్యల్పంగా బాలాపూర్లోని 213 కేంద్రంలో 891 ఓట్లలో 149 పోలయ్యాయి. 211 కేంద్రంలో 890 ఓట్లకు 200 పోలయ్యాయి. * చేవెళ్ల నియోజకవర్గంలో అత్యధికంగా బుద్వేల్ 73 కేంద్రంలో 1,598 ఓట్లకు 1,341 పోలయ్యాయి. 69 కేంద్రంలో 1,233 కేంద్రంలోని 1,233 ఓట్లకు 1,092 పోలయ్యాయి. అత్యల్పంగా గగన్పహాడ్లోని 253 కేంద్రంలో 1,028 ఓట్లకు 354 పోలయ్యాయి. * వికారాబాద్ స్థానంలో గిర్గిట్పల్లిలోని 87 కేంద్రంలో 1,420 ఓట్లకు 1,161 పోలయ్యాయి. మదన్పల్లి 83 కేంద్రంలో 1,344 ఓట్లకు 1,132 పోలయ్యాయి. అత్యల్పంగా వికారాబాద్ 114 కేంద్రంలో 1,114 ఓట్లకు 369 పోలయ్యాయి. * తాండూరులో అత్యల్పంగా 192 బూతులో 604 ఓట్లకు 395 పోలయ్యాయి. అత్యధికంగా 60 కేంద్రంలో 1,386 ఓట్లకు 1096 పోలయ్యాయి. * ఉప్పల్లో చిల్కానగర్ అత్యధికంగా 309 కేంద్రంలో 1,584 ఓట్లకు 990 పోలయ్యాయి. అత్యల్పంగా డీఏఈ కాలనీ 81 కేంద్రంలో 840 ఓట్లకు 189 మాత్రమే పోలయ్యాయి. * శేరిలింగంపల్లిలో అత్యధికంగా 12 బూత్లో 1,596 ఓట్లకు 945 పోలయ్యాయి. 386 కేంద్రంలో 1,490 ఓట్లకు 906 పోలయ్యాయి. అత్యల్పంగా 266 కేంద్రంలో 1,007 ఓట్లకు 192 పోలయ్యాయి.