కొండపై వైభవంగా లక్ష పుష్పార్చన
యాదగిరికొండ, న్యూస్లైన్: శ్రావణమాసం పురస్కరించుకుని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం అమ్మవారికి లక్షపుష్పార్చన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకించి పట్టు వస్త్రాలను ధరింపజేశారు. వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక పీఠంపై అధిష్టింపజేసి మల్లే, జాజి మల్లే, మందారం, గులాబీ, బంతి, చామంతి, ఎర్రచామంతి, తెల్లచామంతి, విరజాజి తదితర లక్ష పుష్పాలతో మూడు గంటల పాటు సహస్రనామ పఠనం చేస్తూ అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ కృష్ణవేణి, ఆలయ అధికారులు దోర్భాల భాస్కరశర్మ, ఆలయ ప్రధానార్చకులు నల్లందీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నరసింహాచార్యులు, యాదగిరి స్వామి, నరిసింహాచార్యులు, రంగాచార్యులు, జూశెట్టి కృష్ణ, రామారావు నాయక్, లక్ష్మణ్ పాల్గొన్నారు.
అమ్మవారికి విశేష పూజలు
గుట్ట దేవస్థానంలో శుక్రవారం అమ్మవారికి విశేషపూజలు నిర్వహించారు. ఉదయం పంచామృతాలతో అభిషేకించి పట్టు వస్త్రాలు ధరింపజేశారు. వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించి గజవాహన సేవలో ఆలయ తిరువీధులలో ఊరేగించారు. అనంతరం ఉత్సవ మండపంలో ఊంజల్ సేవ కోసం అధిష్టింపజేశారు. సేవకు ముందు మహిళలు అందమైన ముగ్గులు వేసి మంగళహారతులతో స్వాగతం పలికారు. అంతకుముందు అమ్మవారికి 108బంగారు పుష్పాలతో సహస్రనామార్చన నిర్వహించారు.