● బార్క్ పనులు అడ్డుకున్న రావిపాలెం గ్రామస్తులు ● మద్దతు తెలిపిన జెడ్పీటీసీ కో–ఆప్షన్ సభ్యుడు కుమార్
అచ్యుతాపురం రూరల్ : రావిపాలెంభూముల్లో తలపెట్టిన బార్క్ నిర్మాణ పనులను గురువారం గ్రామస్తులు అడ్డుకున్నారు. తమకు పునరావాసం కల్పించి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతులకు జెడ్పీటీసీ కో–ఆప్షన్ సభ్యుడు నర్మాల కుమార్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రావిపాలెం నిర్వాసిత భూసమస్యలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న తరుణంలో రైతుల భూముల్లో పొక్లెయిన్తో పనులు చేపట్టడం అన్యాయమన్నారు. రావిపాలెం చుట్టూ ఉన్న భూములన్నీ పోతున్నాయని, ఊరు మాత్రమే మిగిలిపోతోందన్నారు. గ్రామం చుట్టూ ప్రహరీ నిర్మించడం వల్ల అన్ని వర్గాల ప్రజలు ఉపాధి కోల్పోతున్నారన్నారు. అధికారులు స్పందించి గ్రామాన్ని తరలించి న్యాయం చేయాలని కోరారు. నేటికీ నష్టపరిహారం, పునరావాసం కల్పించకుండా రావిపాలెం రైతులపై అచ్యుతాపురం డీటీ దౌర్జన్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కలెక్టర్ స్పందించి రావిపాలెంలో గ్రామసభ నిర్వహించి సమస్యలపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.