Anakapalle District News
-
40 ఎకరాల్లో జీడి తోటలు దగ్ధం
బుచ్చెయ్యపేట : మండలంలో ఎల్బీపీ అగ్రహారం రెవెన్యూ పరిధిలో 20 కుటుంబాలకు చెందిన 40 ఎకరాల్లో జీడితోటలు శనివారం అర్ధరాత్రి దగ్ధమయ్యాయి. ప్రమాదవశాత్తూ జరిగిన ఆగ్ని ప్రమాదంలో పంట చేతికి వస్తుందని సమయంలో ఆగ్ని ప్రమాదంలో జీడితోటలు దగ్ధమవడం పట్ల రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాలిపోయిన జీడితోటలను ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు డి. వెంకన్న, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.వి.నాయుడు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి పి.సాంబశివరావు ఆదివారం పరిశీలించారు. నష్టపోయిన రైతులును ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. జీడితోటలు పంట సస్యరక్షణ చర్యలకు లక్షలాది రుపాయలు వ్యయం చేశారని, పంట చేతికొచ్చే సమయంలో ఈ సంఘటన జరగడం దురదృష్టకరమైన విషయమని వారు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు కాలిపోయిన తోటలు పరిశీలించి, జీడి రైతులను ఆదుకోవాలని వారు కోరారు. వీరి వెంట కురస శంకరావు, అనిమిరెడ్డి దొంగబాబు, బోడి కొండబాబు, గోరపల్లి వెంకయ్యమ్మ, సత్తిబాబు పాల్గొన్నారు. 20మంది రైతులకు రూ.లక్షలాదిగా నష్టం -
రూ.2.20 లక్షలు కాజేసింది మైనర్ కుర్రాడు
కోటవురట్ల : రామచంద్రపురం శివారు సన్యాసిరాజుపాలెంలో ఓ ఇంట్లో జరిగిన చోరీపై సాక్షిలో ‘సన్యాసిరాజుపాలెంలో చోరీ’ శీర్షికన కథనం వెలువడింది. బాధితుల వివరణతో రూ.2.50,000 నగదు, అరతులం బంగారం చోరీకి గురైనట్టు కథనం ఇవ్వగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ కేసులో ఎస్ఐ రమేష్ చేసిన దర్యాప్తులో పురోగతి సాధించి చోరీ సొత్తు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాలు ఇవి. సన్యాసిరాజుపాలేనికి చెందిన సింగంపల్లి వరలక్ష్మి ఇంట్లో ఈ నెల 14వ తేదీన దొంగతనం జరిగి రూ.2.20 లక్షల నగదు, అర తులం బంగారం అపహరణకు గురైంది. పోలీసులు మొదట రూ.20 వేలు నగదు, అరతులం బంగారం చోరీ జరిగినట్టుగా నమోదు చేశారు. పూర్తి విచారణలో రూ.2.20 లక్షలు నగదు, అరతులం బంగారంగా గుర్తించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో అదే గ్రామానికి చెందిన మైనర్ యువకుడు చోరీకి పాల్పడినట్టు గుర్తించారు. అతనిపై నిఘా పెట్టి ఆదివారం జల్లూరు జంక్షన్లో అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడి వద్ద నుంచి రూ.2,20,000 నగదు, అరతులం బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యువకుడిని జువైనల్ హోమ్కు తరలించినట్టు ఎస్ఐ తెలిపారు. నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్న పోలీసులు చోరీ సొత్తు స్వాధీనం -
బాల వికాస గురువులతో పిల్లలకు సనాతన ధర్మం
అనకాపల్లి టౌన్: పట్టణంలోని గాంధీనగరం సత్యసాయి మందిరంలో సత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాలోని బాల వికాస గురువులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సత్యసాయి సంస్థల జిల్లా అధ్యక్షుడు కసిరెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ బాల వికాస గురువులు ద్వారా పిల్లలకు సనాతన ధర్మం, రామాయణం, భారతం, సంస్కృతీ సంప్రదాయాలు వంటి వివిధ అంశాలపై పాటలు, కథలు వివిధ రూపాల ద్వారా అవగాహన కల్పించి, భవిష్యత్లో వారు ఉన్నత స్థానాలకు చేరుకునే విధంగా విషయాలు బోధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి విద్యా విభాగం జిల్లా సమన్వయకర్తలు శంకర్, శక్తిమూర్తి, యూత్ కో–ఆర్డినేటర్ భారతి, ఆధ్యాత్మిక సమన్వయకర్త కామరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఉల్లాస్ పరీక్ష కేంద్రం పరిశీలన
యలమంచిలి రూరల్: వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే ఉల్లాస్(అండర్ స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నిగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ) కార్యక్రమంలో భాగంగా ఆదివారం మండలంలోని పలు చోట్ల వయోజనులకు నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వయోజన విద్యా సంచాలకుడు డి.చిన్నికృష్ణ మండలంలోని లైనుకొత్తూరు కాలనీలో పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. పరీక్ష నిర్వహణ తీరును అయన తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన ఈ పరీక్షలో చదవడం, రాయడం, సంఖ్యా పరిజ్ఞానంపై ప్రశ్నలకు సమాధానాలు రాయించారు. యలమంచిలి ఏపీఎం జి.ఎస్తేరు రాణి ఆయన వెంట ఉన్నారు. -
ట్రాలీ లారీ బీభత్సం
మాడుగుల : మాడుగుల మండలం గాదిరాయి గ్రామంలో ట్రాలీ లారీ ఆదివారం సాయంకాలం మూడు ద్విచక్రవాహనాలను ఢీకొట్టడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, బాధితులు కథనం ప్రకారం చోడవరం నుంచి కింతలి వైపు వస్తున్న ట్రాలీ లారీ కింతలి వైపు నుంచి ఘాట్రోడ్ వైపు వస్తున్న మూడు ద్విచక్రవాహనాలను గాదిరాయి వద్ద ఢీకొట్టింది. దీంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. విశాఖకు చెందిన ఎపి31 టిహెచ్ 2469 అనే నెంబరుగల ట్రాలీ లారీని పెందుర్తికి చెందిన లారీ డ్రైవర్ పాకలపాటి పవన్ కుమార్ మద్యం మత్తులో అజాగ్రతగా నడుపుతూ గాదిరాయి వద్ద వాహనాలను ఢీకొట్టాడు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. చోడవరం మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఇల్లపు పల్లవికి తీవ్ర గాయాలు తగలడంలో విశాఖ కేజీహెచ్కు తరలించారు. చీడికాడ మండలం చెట్టుబిల్లి గ్రామానికి చెందిన కాకర కొండబాబు, (55) కాకర కొండమ్మ(50)తో పాటు మాడుగుల మండలం గొటివాడ అగ్రహారానికి చెందిన మాదాసి ఎర్రునాయుడు, పల్ల అప్పారావుకు తీవ్రగాయాలు తగిలాయి. వారిని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల బైక్లతో పాటు దగ్గరలో ఉన్న వ్యాపారదుకాణాన్ని లారీ ఢీకొట్టడంతో దుకాణం గోడలు దెబ్బతిన్నాయి. ఆ సమయంలో దుకాణంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కాగా బైక్లు నుజ్జునుజ్జు అయ్యి ఐదుగురు గాయపడ్డారు. స్థానిక 30 పడకల ఆసుపత్రికి వారిని తరలించగా అక్కడ వైద్యులు ప్రాథమిక వైద్యం అందించి తీవ్రంగా గాయపడిన పల్లవిని మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్కు రిపర్ చేశారు. మరో నలుగురిని అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్.ఐ నారాయణరావు సంఘటన స్థలానికి చేరుకుని, ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పవన్కుమార్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మూడు ద్విచక్ర వాహనాలకు ఢీ ఐదుగురికి తీవ్ర గాయాలు ఆస్పత్రికి తరలింపు -
ఆఖరి నిమిషంలో.. హంగామా
ఎంవీపీకాలనీ: ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న సమయంలో జిల్లా బీసీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలు మంజూరుకు దరఖాస్తులు ఆహ్వానించడం దుమారం రేపింది. 2024–2025 ఆర్థిక సంవత్సరానికి గానూ స్వయం ఉపాధి కోసం బీసీ, ఈబీసీ, కాపు, బ్రాహ్మణ, కమ్మ, ఆర్యవైశ్య ఇలా ఆ కార్పొరేషన్ పరిధిలోని అనేక అనుబంధ కార్పొరేషన్ల ద్వారా జిల్లాలోని వెనుకబడిన తరగతుల వారికి రుణాలు మంజూరు చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఈ నెల 11న నోటిఫికేషన్ విడుదల చేసి, తొలుత దరఖాస్తులకు 22వ తేదీని చివరి తేదీగా పేర్కొంది. అయితే, తాజాగా మరో మూడు రోజులు దరఖాస్తు గడువును పొడిగించింది. గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను నిలిపివేసిన కూటమి ప్రభుత్వం, ఏడాది మొత్తం వదిలేసి ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో రుణాల నోటిఫికేషన్ విడుదల చేయడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా, గడువును పొడిగించడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ రుణాలు లబ్ధిదారులకు అందుతాయా లేదా కేవలం ప్రచారం కోసమే కూటమి ప్రభుత్వం ఈ నోటిఫికేషన్తో హడావిడి చేస్తుందా అనే ప్రశ్నలు లబ్ధిదారుల నుంచి సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. 20,914 మంది దరఖాస్తులు స్వయం ఉపాధి, జనరిక్ ఫార్మసీలు, వివిధ కులవృత్తులకు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో 2024–2025 ఆర్థిక సంవత్సరానికి గానూ బీసీ కార్పొరేషన్ ఈ నోటిఫికేషన్ను విడుదల చేసింది. నోటిఫికేషన్ విడుదలైన 11 రోజుల్లోనే జిల్లా వ్యాప్తంగా 20,914 ఆన్లైన్ దరఖాస్తులు(శనివారం సాయంత్రం 4 గంటల వరకు) వచ్చినట్లు బీసీ కార్పొరేషన్ కార్యాలయం తెలిపింది. ప్రభుత్వం కేవలం 6,032 యూనిట్ల మంజూరు లక్ష్యాన్ని నిర్దేశించగా, వచ్చిన దరఖాస్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. మరోవైపు ఆర్థిక సంవత్సరం ముగియడానికి వారం రోజులే ఉండటంతో, ఈ భారీ సంఖ్యలో వచ్చిన దరఖాస్తుల పరిశీలన, అర్హుల ఎంపిక ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి కార్పొరేషన్ ద్వారా మంజూరు చేసే రుణాల ప్రక్రియ ప్రతి సంవత్సరం మార్చి నాటికి పూర్తవుతుంది. ఆ తర్వాత కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కొత్త నోటిఫికేషన్లు విడుదల చేస్తారు. అయితే ఈసారి మాత్రం 2024–2025 సంవత్సరానికి సంబంధించిన రుణాల ప్రక్రియను మార్చి చివరిలో ప్రారంభించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దీనికి తోడు, కేవలం 11 రోజుల వ్యవధిలో 20 వేలకు పైగా దరఖాస్తులు రావడం వెనుక కూటమి నాయకుల హస్తం ఉందనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ హడావుడి నోటిఫికేషన్ ద్వారా తమకు కావాల్సిన వారికే రుణాలు మంజూరు చేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ రుణాల మంజూరు ప్రక్రియలో పారదర్శకత లోపించే అవకాశం ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం పూర్తిచేస్తాం ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం రుణాల మంజూరు ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 27 నాటికి రుణాలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. మే 1 నాటికి మంజూరు ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలి. మే 11 నాటికి జియోట్యాగింగ్, మే 21 నాటికి వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలనే ఆదేశాలతో ముందుకు సాగుతున్నాం. ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో నోటిఫికేషన్ విడుదలైన విషయం వాస్తవమే. అందుకే రెండు నెలల్లో మొత్తం ప్రక్రియ పూర్తి చేసేలా ప్రభుత్వం షెడ్యూల్ రూపొందించింది. – శ్రీదేవి, ఈడీ బీసీ కార్పోరేషన్ బీసీ కార్పొరేషన్ రుణాల మంజూరులో గందరగోళం ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో హడావుడిగా నోటిఫికేషన్ 2024–25 ఏడాది సబ్సిడీ రుణాలంటూ దరఖాస్తుల ఆహ్వానం ప్రభుత్వ తీరు, రుణాల మంజూరుపై సర్వత్రా అనుమానాలు -
రోడ్డు విస్తరణకు నిర్వాసితుల ఆమోదం తప్పనిసరి
అచ్యుతాపురం రూరల్ : రోడ్డు విస్తరణకు నిర్వాసితుల ఆమోదం తప్పనిసరని, లేని పక్షంలో ఎటువంటి శంకుస్థాపనలు చేయొద్దని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు అన్నారు. భూములు, ఇళ్లు, షాపులు కోల్పోతున్న నిర్వాసితులతో చర్చించకుండా టీడీఆర్ బాండ్లు ఇప్పిస్తామని స్థానిక ఎమ్మెల్యే ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆదివారం స్థానిక విలేకర్లతో ఆయన మాట్లాడుతూ గ్రామసభలు నిర్వహించకుండా ఏకపక్షంగా టీడీఆర్ బాండ్లు ప్రకటించడం అన్యాయమన్నారు. నగదు రూపంలో చెల్లించి భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు పునరావాసం కల్పించి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 2013 భూసేకరణ చట్టం అమలు చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. రోడ్డు విస్తరణలో నష్టపోతున్న చిరు వ్యాపారులకు పరిహారం చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ రొంగలి రాము, పార్టీ నాయకులు కాండ్రేగుల రాము, సదాశివరావు, కర్రి అప్పారావు, బుద్ధ రంగారావు, చేపల తాతయ్య, కూండ్రపు సోమునాయుడు, రామ్కుమార్ పాల్గొన్నారు. -
కదం తొక్కిన ఉక్కు కాంట్రాక్టు కార్మికులు
గాజువాక : స్టీల్ప్లాంట్లో కాంట్రాక్టు కార్మికుల తొలగింపును నిరసిస్తూ ఆదివారం భారీ పాదయాత్ర నిర్వహించారు. ఉపాధి రక్షణ యాత్ర పేరుతో విశాఖ ఉక్కు అఖిలపక్ష కాంట్రాక్టు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పాదయాత్రలో కాంట్రాక్టు కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కొత్తగాజువాక జంక్షన్లో ప్రారంభమైన ఈ పాదయాత్ర గాజువాక మెయిన్రోడ్, పాతగాజువాక, శ్రీనగర్ మీదుగా కూర్మన్నపాలెంలోని ఉక్కు కార్మికుల దీక్షా శిబిరం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్రెడ్డి మాట్లాడుతూ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. కాంట్రాక్టు కార్మికులను తొలగించడం దారుణమని, వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి పార్టీలను నమ్మి పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చిన కార్మికులకు కూటమి ప్రజాప్రతినిధులు మద్దతు నిలవకపోవడం సరికాదన్నారు. కష్టంలో ఉన్న కాంట్రాక్టు కార్మికులకు అండగా నిలవాలని సూచించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ మాట్లాడుతూ స్టీల్ప్లాంట్ను అమ్మడానికి, కార్మికులను తొలగించడానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించిందన్నారు. స్టీల్ప్లాంట్లో పూర్తిస్థాయి ఉత్పత్తి సాధించడానికి ఆ ప్యాకేజీ వల్ల ఎలాంటి ఉపయోగంలేదన్నారు. స్టీల్ప్లాంట్ను కాపాడుతామని, నిర్వాసితులకు ఉపాధి ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన కూటమి నాయకులు ఎన్నికల్లో గెలిచిన తరువాత మొహం చాటేస్తున్నారన్నారు. ఉక్కు పరిరక్షణ కమిటీ కన్వీనర్ జె.అయోధ్యరామ్ మాట్లాడుతూ ప్లాంట్ కోసం కార్మికులు 1500 రోజుల నుంచి ఉద్యమం చేస్తే కేంద్ర ప్రభుత్వం రూ.11,400 కోట్లు ప్యాకేజీ ఇచ్చిందన్నారు. ఇప్పుడు ఐదు వేల మంది కాంట్రాక్టు కార్మికులను రోడ్డుపైకి నెట్టేయడం కోసం ప్రయత్నిస్తోందన్నారు. అందులోభాగంగా ఇప్పటికే వెయ్యి మందిని బయటకు పంపేసిందన్నారు. సెయిల్లో కలపడానికి గాని, సొంత గనులు కేటాయించడానికి గాని కేంద్ర ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదని, అయినప్పటికీ ప్రభుత్వం ఆ పని చేయకుండా ఉద్యోగులను తొలగిస్తోందన్నారు. కార్మికుల తొలగింపును ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, విశాఖ స్టీల్ప్లాంట్ అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. గాజువాక నుంచి కూర్మన్నపాలెం వరకు ఉపాధి రక్షణ పాదయాత్ర తొలగించిన కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ -
విశాఖ తీరంలో మరో ఆకర్షణ
ఏయూక్యాంపస్: సాగరతీరంలో మరో పర్యాటక ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది. బీచ్ రోడ్డులో ఇప్పటికే ఉన్న టీయూ–142 యుద్ధ విమాన మ్యూజియం పక్కనే యూహెచ్–3 హెచ్ హెలికాప్టర్ మ్యూజియం తుది మెరుగులు దిద్దుకుంటోంది. వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో దాదాపు రూ. 2.2 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. భారత నావికాదళంలో 17 ఏళ్లపాటు అవిరళంగా సేవలందించిన ఈ హెలికాప్టర్ను కొది నెలల కిందట విశ్రాంతినిచ్చారు. విపత్తుల సమయంలోనూ, తీర ప్రాంత భద్రతలోనూ ఇది ఎంతో కీలక పాత్ర పోషించింది. దీని ప్రాముఖ్యాన్ని గుర్తించి వీఎంఆర్డీఏ .. భారత నావికాదళ సత్తాను చాటి చెప్పేలా, పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచేలా ఈ మ్యూజియాన్ని తీర్చిదిద్దుతోంది. ప్రస్తుతం ఈ ప్రాంగణంలో సుందరీకరణ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. రానున్న రెండు వారాల్లో దీనిని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. హెలికాప్టర్ చుట్టూ పచ్చని లాన్లు, ప్రత్యేకమైన మొక్కలు, ఆకర్షణీయమైన నీటి ఫౌంటెన్లను ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో విద్యుత్ కాంతుల్లో మరింత అందంగా కనిపించేలా దీని చుట్టూ అద్దాల నిర్మాణం చేపట్టారు. త్వరలోనే సందర్శన వేళలు, టికెట్ ధరలకు సంబంధించిన వివరాలను వీఎంఆర్డీఏ ప్రకటించే అవకాశం ఉంది. నేటి యువతరం సెల్ఫీలు, ఫొటోల పట్ల చూపిస్తున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని మ్యూజియం లోపలి భాగాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. తుది దశకు హెలికాప్టర్ మ్యూజియం పనులు -
మౌలిక వసతుల కోసం గిరిజనుల నిరసన
రావికమతం: కనీస మౌలిక వసతులు కల్పించాలంటూ మండలంలో చీమలపాడు పంచాయతీ సామాలమ్మ కొండపై జీలుగులోవ గ్రామంలో పీవీటీజీ తెగకు చెందిన 8 గిరిజన కుటుంబాలు ఆదివారం ఆందోళనకు దిగాయి. కనీస సౌకర్యాలు లేవని గతంలో వివిధ పత్రికల్లో ప్రచురితమైన కథనాలకు జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు గిరిజన గ్రామాన్ని సందర్శించి కొండ కిందకు వస్తే అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీనికి గిరిజనులు అంగీకరించారు. వీరికి చీమలపాడు రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 169లో 30 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. అయితే ఇప్పటికీ పట్టాలు ఇవ్వలేదు. కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు. దీంతో చాలా ఇబ్బందులకు గురై గతంలో సీదరి వెంకట్రావు(50), కొర్రా బాబూరావు(45)మృతి చెందారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కనీస సౌకర్యాలు కల్పించానలి డిమాండ్ చేస్తూ ఆదివారం గిరిజనులు రోడ్డెక్కారు. మంగళవారం రావికమతం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు గోవిందరావు, కొర్రా బాలరాజు, సీదరి బాలరాజు తెలిపారు. -
ఆల్ట్రా డీలక్స్కే...వన్ మ్యాన్ సర్వీసు..
అనకాపల్లి టౌన్ : వన్ మ్యాన్ సర్వీసులను ఇతర డిపోల వలే ఆల్ట్రా డీలక్స్ సర్వీసు వరకు మాత్రమే పంపాలని ఎన్ఎంయూఏ రీజనల్ సెక్రటరీ పి. సుధాకర్ తెలిపారు. స్థానిక ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ఎదుట చేస్తున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 23వ రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ అకారణంగా సస్పెడ్ చేసిన ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలన్నారు. జోనల్ జాయింట్ కార్యదర్శి జి. శంకర్రావు మాట్లాడుతూ 1–2019 సర్క్యులర్ అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో బాబు, వేపాడ శ్రీను, ఈఎస్ఆర్ మూర్తి వర్మ, కార్మికులు పాల్గొన్నారు. -
జీవ వైవిధ్యాన్ని కాపాడాలి
అనకాపల్లి టౌన్ : ప్రతీ ఒక్కరూ సమస్త జీవవైవిధ్యాన్ని కాపాడాలని గ్రీన్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొణతాల ఫణిభూషణ్ శ్రీధర్ అన్నారు. పట్టణంలోని పలు దేవాలయాల్లో ఎండ తీవ్రత దృష్ట్యా పక్షులకు ధ్యాన్యపు కుంచెలు, మట్టి ప్రాతల్లో తాగునీరు, పక్షులకు గూళ్లు ఏర్పాటు చేసే కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ రెండో వారంలో పట్టణంలో పార్కుల్లో ఈ కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్దానిక ఎంపీ సీఎం రమేష్ వ్యక్తిగత సహాయకుడు విజయ్నాయుడు, దేవస్ధానాల చైర్మన్లు కాండ్రేగుల సత్యన్నారాయణ, బొడ్డేడ మురళి, బి.ఎం.ఎస్.కె జోగినాయుడు, పెంటకోట ఉమామహేశ్వరావు, యల్లపు సూరి అప్పారావు, వంకాయల ఈశ్వరావు పాల్గొన్నారు. -
ఒలింపియాడ్లో కీర్తనకు రెండో ర్యాంకు
రావికమతం : నేషనల్ ఇంగ్లీషు టాలెంట్ టెస్టులో మరుపాక మోడల్ స్కూల్ విద్యార్ధిని కె.కీర్తన రెండో ర్యాంక్ సాధించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 24 న ఆంధ్ర, తెలంగాణలో వివిధ పాఠశాలకు చెందిన విద్యార్ధులు ఒలింపియాడ్ నిర్వహించిన ఇంగ్లిష్ టాలెంట్ టెస్టులో పాల్గొన్నారు. వీటి ఫలితాలు ఆదివా రం విడుదల చేయగా వాటిలో మోడల్ స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతున్న కీర్తన రెండవ ర్యాంక్ సాధించింది. దీంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. కీర్తనను ఉపాధ్యాయులు ,తదితరులు అభినందించారు. -
రాష్ట్ర హాకీ జట్టు శిక్షణకు ఇద్దరు యలమంచిలి క్రీడాకారులు
యలమంచిలి రూరల్ : ప్రతిభావంతులైన హాకీ క్రీడాకారులకు నిలయమైన యలమంచిలి పట్టణానికి చెందిన ఇద్దరు క్రీడాకారులు రాష్ట్ర హాకీ సీనియర్ జట్టు ప్రాబబుల్స్ బృందంలోకి ఎంపికయ్యారు. పట్టణానికి చెందిన బి.కుసుమకుమార్, జి.ప్రసాద్లను జిల్లా నుంచి రాష్ట్ర జట్టు ప్రాబబుల్స్కు ఎంపిక చేస్తూ సెలెక్టర్లు నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 35 మంది ప్రతిభావంతులైన క్రీడాకారులను రాష్ట్ర హాకీ సీనియర్ల జట్టుకు ప్రాతినిధ్యం వహించడానికి రాష్ట్ర హాకీ అసోసియేషన్ అధికారులు ఎంపిక చేశారు. వీరందరికీ ఈ నెల 25 నుంచి కాకినాడలో ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో తర్ఫీదునిస్తారు. 10 రోజుల శిక్షణ అనంతరం 18 మంది క్రీడాకారులను జాతీయ పోటీల్లో పాల్గొనే జట్టులోకి ఎంపిక చేస్తారని జిల్లా హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కోఠారు నరేష్ ఆదివారం రాత్రి తెలిపారు. జిల్లా నుంచి ఎంపికై న క్రీడాకారులిద్దర్నీ నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ అభినందించారు. -
జోష్
నేడు లక్నో సూపర్ జెయింట్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ఐపీఎల్ప్రాక్టీస్ సెషన్లో ఎల్ఎస్జీ జట్టువిశాఖకు క్రికెట్ పండగ వచ్చేసింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ మ్యాచ్లకు నగరం సర్వం సిద్ధమైంది. రాష్ట్రానికి ఫ్రాంచైజీ లేకపోయినా.. ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) జట్టు వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంను తమ రెండో హోమ్ గ్రౌండ్గా ఎంచుకుంది. ఐపీఎల్ 18వ సీజన్లో భాగంలో సోమవారం రాత్రి 7.30 గంటలకు లక్నో సూపర్ జెయింట్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతుంది. ఈ సీజన్లో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం. గత సీజన్లలో విశాఖ వేదికగా ఆరు ఫ్రాంచైజీ జట్లు ఆడగా, లక్నో సూపర్ జెయింట్స్కు మాత్రం ఇదే తొలి మ్యాచ్. మ్యాచ్ ప్రీ సెషన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడం తమ ప్రణాళికగా చెప్పారు. దీనిని బట్టి చూస్తే టాస్ గెలిస్తే ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తానికి విశాఖ క్రికెట్ అభిమానులు ఈ ఉత్కంఠభరితమైన పోరు కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. – విశాఖ స్పోర్ట్స్ అల్లిపురం: పీఎంపాలెంలోని డాక్టర్ వైఎస్సార్ వీసీఏ–ఏడీసీఏ క్రికెట్ స్టేడియంలో సోమవారం జరిగే క్రికెట్ మ్యాచ్కు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఈ మేరకు ఏపీఎస్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. గాజువాక, పాత బస్టాండ్, సింహాచలం, కూర్మన్నపాలెం నుంచి సుమారు 30 బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. రద్దీకి అనుగుణంగా బస్సుల పెంపు, తగ్గింపు ఉంటుందన్నారు. పోలీసు శాఖ ఆదేశాలతో విజయనగరం, శ్రీకాకుళం వెళ్లే బస్సులను సాయంత్రం 5 గంటల తర్వాత హనుమంతువాక నుంచి బీచ్రోడ్డు వైపు మళ్లిస్తామన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. ఐపీఎల్ మ్యాచ్కు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు -
బలం లేకపోయినా అవిశ్వాసమా?
● మేయర్పై అవిశ్వాసం ఖండిస్తున్నాం ● దొడ్డి దారి రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య ● మా పార్టీ కార్పొరేటర్లను బెదిరింపులు, ప్రలోభాలకు గురిచేస్తున్నారు ● వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబుసాక్షి, విశాఖపట్నం : గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో కూటమికి సంఖ్యా బలం లేకపోయినా.. మేయర్ పీఠంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. ఆదివారం మద్దిలపాలెంలో గల పార్టీ కార్యాలయంలో శాసనమండలి విపక్షనేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అధ్యక్షతన వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, సమన్వయకర్తలు, ముఖ్యనేతలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటుచేశారు. అనంతరం కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ దొడ్డిదారిన రాజకీయాలు చేయడం చంద్రబాబుకు, ఆ పార్టీ నేతలకు వెన్నతో పెట్టిన విద్యని, వైఎస్సార్ సీపీ గుర్తుపై గెలిచిన కార్పొరేటర్లను ప్రలోభపెట్టి, లొంగకపోతే భయపెట్టి బలవంతంగా లాక్కొంటున్నారని మండిపడ్డారు. కూటమి ప్రజాప్రతినిధులు చెప్పేవన్నీ శ్రీరంగనీతులు.. చేసేవన్నీ పనికిమాలిన రాజకీయాలంటూ మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని, వైఎస్సార్ సీపీని అభిమానించే కార్పొరేటర్లంతా సమావేశానికి వచ్చారని.. కూటమి నేతలు ఎన్ని కుయుక్తులకు పన్నినా మేయర్ పీఠాన్ని కదపలేరన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాంటి కుళ్లు రాజకీయాలకు స్వస్తి పలకాలని చెప్పాలని హితవుపలికారు. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ జీవీఎంసీ ఎన్నికల్లో 58 స్థానాలను వైఎస్సార్ సీపీ కై వసం చేసుకుని మేయర్ పదవిని చేజిక్కించుకుందని, 30 స్థానాలు మాత్రమే గెలుచుకున్న టీడీపీ ఇప్పుడు మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలనే దురాలోచన మానుకోవాలని హితవుపలికారు. కూటమి పార్టీలకు మెజారిటీ లేకపోయినా అవిశ్వాసానికి నోటీసు ఇచ్చారంటే.. తమ పార్టీ కార్పొరేటర్లను ఏవిధంగా భయపెడుతున్నారో.. ప్రలోభపెడుతున్నారో అర్థమవుతుందన్నారు. మేయర్ పీఠం ఎలా కాపాడుకోవాలనే దానిపై వ్యూహ రచనలు చేశామని, తప్పనిసరిగా కాపాడే ప్రయత్నం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. -
కార్పొరేట్ గాలం
పదో తరగతి పరీక్షలు ముగియక ముందే కార్పొరేట్ విద్యాసంస్థల దందా మొదలైంది. హలో..సార్ మీ అమ్మాయి పదో తరగతిలో మంచి మార్కులు సాధిస్తుందని తెలుసుకున్నాం.. మా కళాశాలలో చేర్పించండి.. నాణ్యమైన బోధన ఉంటుంది..అంటూ తమ సిబ్బందితో విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ కాల్స్ చేసి వారిని అయోమయానికి గురి చేస్తున్నాయి. టెన్త్ వార్షిక పరీక్షలు పూర్తి కాకముందే పీఆర్ (పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్)లను రంగంలోకి దింపి విద్యార్థుల ఇళ్లకు పంపించి వారిని తమ కళాశాలల్లో ప్రవేశాలు తీసుకునేలా కార్యాచరణను గత మూడు నెలల నుంచే ముమ్మరం చేశాయి. విద్యార్థులకు● ప్రారంభమైన ఇంటర్ అడ్మిషన్ల దందా ● టెన్త్ విద్యార్థుల కోసం ప్రైవేటు కళాశాలల గాలం ● పది పరీక్షలు పూర్తి కాక ముందే తల్లిదండ్రులతో ఒప్పందాలు ● మెడికల్, ఇంజినీరింగ్ శిక్షణ ఇస్తామని ఎర ● నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్ల ప్రక్రియ ● ఉమ్మడి జిల్లాలో 63,735 మంది టెన్త్ విద్యార్థులు ● అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతల డిమాండ్ రూ.5వేలు నుంచి రూ.10 వేలు అడ్వాన్స్ కార్పొరేట్,పెద్ద ప్రైవేటు కళాశాలల్లో సీటు కావాలంటే కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కోర్సు, శిక్షణను బట్టి రూ.5 వేలు నుంచి రూ.10 వేలు వరకు అడ్వాన్సుగా చెల్లించాలని తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు సీటు దొరకదేమోనన్న ఆతృత, ఫీజులో రాయితీ ఇస్తారన్న ఆశతో ముందుగానే సీటు బుక్ చేసుకుంటున్నారు. ఏసీ గదుల్లో తరగతులు, వసతి కావాలంటే రూ.30 వేలు నుంచి రూ.50 వేలు అడ్వాన్సుగా కట్టించుకుంటున్నారు. ముందస్తు అడ్మిషన్లు చేసిన పీఆర్వోలకు, వారికి సహకరించిన కొన్ని పాఠశాలల యాజమాన్యాలకు, ట్యూషన్ సెంటర్ల నిర్వాహకులు, కొంతమంది ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు విందులు, నజరానాలు సైతం ఇస్తుండడం అడ్మిషన్ల దందా ఎలా కొనసాగుతోందో తెలియజేస్తోంది. యలమంచిలి రూరల్ : ఏఏ పాఠశాలల్లో ఎంత మంది విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాస్తున్నారో వారి సమాచారాన్ని ముందే సేకరించి కార్పొరేట్ కళా శాలలు అడ్మిషన్ల దందాకు తెర తీస్తు న్నాయి. ఆర్థిక స్థోమత బాగుండి, తమ కళాశాలలో చేరే అవకాశం ఉన్న వారికి గాలం వేస్తున్నారు. తమ కళాశాలల్లో చదివిన వారు డాక్టర్లు, ఇంజినీర్లు, ఐఏఎస్లు అయ్యారని ప్రచారం చేస్తున్నారు. పీఆర్ల సందడి జిల్లా, మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లో పీఆర్వోల సందడి కనిపిస్తోంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి తమ కార్పొరేట్ కళాశాలల గొప్పతనం, ఇతర వివరాలు తెలియజేస్తున్నారు. ప్రధానంగా ఎంపీసీ, బైపీసీ కోర్సులతో పాటు మొదటి సంవత్సరం నుంచి ఇంజినీరింగ్, మెడిసన్, ఎయిమ్స్, ఐఐటీ జేఈఈ, గ్రూప్స్కు సంబంధించిన శిక్షణ ఇస్తామని చెబుతున్నారు. ఒక్కసారి మా కళాశాలలో మీ అబ్బాయి లేదా అమ్మాయిని చేర్పిస్తే ఇక భవిష్యత్తుకు ఢోకా ఉండదని నమ్మబలుకుతున్నారు. ముందుగా బుక్ చేసుకుంటే ఫీజు రాయితీ ఉంటుందని, పదో తరగతి ఫలితాలు వచ్చిన తర్వాత ఫీజు పెరిగిపోతుందని, సీట్లు దొరుకుతాయో లేదో చెప్పలేమని తల్లిదండ్రులకు చెప్పి అడ్మిషన్లు చేయిస్తున్నారు. ముందుగా సీటు రిజర్వ్ చేసుకోకపోతే కోరిన బ్రాంచిలో సీటు దొరకదని తల్లిదండ్రులను బెదరగొడుతున్నారు. దీంతో కార్పొరేట్ స్కూళ్లలో చదువుతున్న చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు వంటి పట్టణాల్లో పేరు మోసిన కార్పొరేట్ కాలేజీల్లో ముందస్తు అడ్మిషన్లు పొందుతున్నారు. టెన్త్ పరీక్షలు కాక ముందే.. పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 17 నుంచి ప్రారంభమయ్యాయి. ఇంకా అవి పూర్తి కాకముందే కార్పొరేట్ కళాశాలలు ముందస్తు బుకింగ్లకు తెరతీశాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 63,735 మంది పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలకు హాజరవుతున్నారు. వాస్తవానికి ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం రాష్ట్ర ఇంటర్ బోర్డు ప్రతి ఏటా ప్రకటన విడుదల చేస్తుంది. ఆ ప్రకటనలో ప్రవేశాలకు సంబంధించి నిర్ణీత షెడ్యూల్ను ప్రకటిస్తారు. దీని ప్రకారం ప్రవేశాల కోసం దరఖాస్తులు అమ్మకం దగ్గర్నుంచి ఎన్ని దశల్లో ప్రవేశాలు చేపట్టాలనే నియమ నిబంధనలన్నీ తెలియజేస్తారు. రాష్ట్రంలో గుర్తింపు పొందిన కళాశాలలన్నీ ఈ ప్రవేశ ప్రకటనను అనుసరించాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో ఇవేమీ అమలు కావడంలేదు. కార్పొరేట్, బడా ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలన్నీ గడచిన మూడు, నాలుగు నెలల నుంచే అడ్మిషన్ల వేట కొనసాగిస్తున్నారు. ముందస్తు అడ్మిషన్ల కోసం జోరుగా అడ్వాన్సులు కూడా కట్టించేసుకుంటున్నారు. ఈ ముందస్తు అడ్మిషన్ల ప్రక్రియ నిబంధనలకు విరుద్ధమంటూ ఇంటర్ విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కానీ కార్పొరేట్ విద్యాసంస్థలు ముందస్తు అడ్మిషన్లు మొదలు పట్టినట్టు తెలిసినా సంబంధిత విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. త్వరపడొద్దు... అయితే తల్లిదండ్రులు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. కార్పొరేట్ కళాశాలల్లో చేర్పించే ముందు పిల్లల అభిప్రాయాలతో పాటు, సదరు కళాశాలల్లో వసతులు, విద్యా బోధన, అనుమతులకు సంబంధించి వీలైనంతగా తెలుసుకోవాలని సూచిస్తున్నారు. తమ వ్యాపారాభివృద్ధి, ర్యాంకుల కోసం నిత్యం విద్యార్థులను పుస్తకమే ప్రపంచంగా మార్చే కళాశాలలు కొన్ని ఉన్నాయని, వాటిలో చేర్పిస్తే విద్యార్థులు ఒత్తిడికి గురై మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలి కార్పొరేట్, కొన్ని ప్రైవేట్ కళాశాలలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పీఆర్వోలను నియమించుకుని ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం అన్వేషిస్తున్నారు. ఆఫర్ల పేరుతో తల్లిదండ్రులను మభ్యపెడుతున్నారు. ముందస్తు అడ్మిషన్లు చేయరాదని ప్రభుత్వ నిబంధనలున్నా వాటిని బేఖాతరు చేస్తూ విచ్చలవిడిగా అడ్మిషన్ల దందా కొనసాగిస్తున్నారు. అధికారులు నిబంధనలను పాటించని కార్పొరేట్ కళాశాలలను నియంత్రించాలి. – మామిడి రమణ, ఎస్ఎఫ్ఐ, జిల్లా ప్రధాన కార్యదర్శినిబంధనలకు విరుద్ధం నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టకూడదు. ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రవేశాల ప్రకటన జారీ చేసిన తర్వాతే ఆ షెడ్యూల్ ప్రకారం ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్లు చేపట్టాలి. ఎలాంటి ముందస్తు అడ్మిషన్లు చేయకూడదు. ముందస్తు అడ్మిషన్లపై విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. అలాంటి సమాచారం మాదృష్టికి తీసుకురావాలి. నిబంధనలు ఉల్లంఘించిన కళాశాలలపై చర్యలు తీసుకుంటాం. – బి సుజాత, జిల్లా ఇంటర్ విద్యాధికారి -
ఫ్లై ఓవర్ వద్దే..వద్దు
అచ్యుతాపురం రూరల్ : అచ్యుతాపురం కూడలిలో ఫ్లై–ఓవర్ నిర్మాణం చేయడం వల్ల మరింత కాలుష్యం పెరుగుతుందని అచ్యుతాపురం భవన నిర్మాణ యజమానుల సంఘం సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్లై–ఓవర్ కారణంగా అచ్యుతాపురం గ్రామం పూర్తిగా కాలుష్యానికి గురై ప్రజలు అనారోగ్య పాలౌతారని గృహ నిర్మాణ యజమాన సంఘం సభ్యులు ఆదివారం జరిగిన సమావేశంలో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ రహదారులు నిర్మాణాలు చేసేందుకు ప్రతిపాదనలు ఉన్నప్పటికీ వాటి జోలికి పోకుండా ప్రజల ఆరోగ్య స్థితిగతులపై దెబ్బ తీసేవిధంగా అధికార యంత్రాంగం వ్యవహరిస్తుందని ఆరోపించారు. గ్రామంలో ఇప్పటికే ఉన్న సుమారు 200 పైబడి పరిశ్రమలకు చెందిన వాహనాలు రాకపోకల కారణంగా స్థానిక ప్రజలు వాయు, శబ్ధ కాలుష్యంతో అనారోగ్య ఇబ్బందులకు గురి అయ్యారన్నారు. సెజ్లో ఉన్నటువంటి పరిశ్రమలకు వాహనాలు రాకపోకలూ చేసేందుకు అచ్యుతాపురం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణం చేపడితే అచ్యుతాపురంలో పూర్తి స్థాయిలో ట్రాఫిక్ నియంత్రణ చేయొచ్చునన్నారు. కోటి విద్యలు కూటి కోసమే అన్న చందాన ఎన్ని వ్యాపారాలు, ఉద్యోగాలు చేసినా ఆరోగ్యమైన జీవనం సాగించడానికే, అటువంటి ఆరోగ్యాన్ని అభివృద్ధి పేరుతో నిర్మిస్తున్న ఫ్లై–ఓవర్ కారణంగా ఛిద్రం చేయడం తగదన్నారు. సెజ్లో భూములు కోల్పోయిన నిర్వాసితులు ప్రభుత్వ పరిహారంతో ఎక్కువ శాతం అచ్యుతాపురంలో పూడిమడక రహదారిలో గృహ నిర్మాణాలు చేసుకున్నారని, ఇపుడు రెండోసారి అభివృద్ధి పేరుతో ఇక్కడి నిర్మాణాల కారణంగా కాలుష్యం పెరిగి వారంతా మరోచోటికి వెళ్లిపోయే పరిస్థితి నెలకొంటుందేమోనని ఆవేదన చెందారు. ఫ్లై–ఓవర్ కోసం చేస్తున్న విస్తరణల కారణంగా నివాస స్థలాలను, ఉపాధిని కోల్పోతామని భవన యజమానులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు పూర్తి స్థాయిలో పునరాలోచనతో స్థానిక ప్రజల స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ రహదారులపై దృష్టి సారించాలని కోరుతున్నారు. కార్యక్రమంలో భవన నిర్మాణాల సంఘం అధ్యక్షుడు దేశంశెట్టి అప్పలనాయుడు, ఉపాధ్యక్షుడు రాజాన సన్యాసినాయుడు, కార్యదర్శి బండారు కుమార్, గౌరవ అధ్యక్షుడు పల్లి శేషగిరిరావు, సహాయ కార్యదర్శి శరగడం శ్రీధర్, పంచదార్ల రవి, నీరుకొండ సూర్య చంద్రరావు, సీపీఎం నాయకులు జి.కోటేశ్వర్రావు, రొంగలి రాము, బుద్దా రంగారావు, మారిశెట్టి వెంకటప్పారావు సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పటికే కాలుష్యం బారిన అచ్యుతాపురం రింగు రోడ్డుతోనే ట్రాఫిక్ సమస్యపరిష్కారం భవన యజమానుల సంఘం నిరసన -
ప్రశ్నించే గొంతులపై దాడులను ఖండించాలి
నర్సీపట్నం : సామాజిక కార్యకర్త కె.శివనారాయణరాజుపై జరిగిన దాడిపై ఎంపీ సీఎం రమేష్ స్పందించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిఽ కోన గురవయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి ఇలాంటి చర్యలు చాలా సిగ్గుచేటన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బొట్టా నాగరాజు మాట్లాడుతూ ప్రశాంతమైన నర్సీపట్నంలో ఇలాంటి దాడులకు పాల్పడడం ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర రెల్లి హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు ఎర్రంశెట్టి పాపారావు మాట్లాడుతూ ప్రశ్నించే గొంతులపై జరుగుతున్న ఇలాంటి దాడులు ఖండించకపోతే ఇదే సంస్కృతి కొనసాగుతుందన్నారు. బాధితుడు శివనారాయణరాజుకు అండగా ఉంటామన్నారు. బీజేపీ నాయకుడు వెలగ జగనాథం మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో దాడులు దురదృష్టకరమన్నారు. టాక్స్ ఫెయిర్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.త్రిమూర్తులరెడ్డి మాట్లాడుతూ దాడులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమన్నారు. అనంతరం డీఎస్పీ శ్రీనివాసరావును కలిసి వినతిపత్రం అందజేశారు. -
బాలికా విద్యను ప్రోత్సహించడమే లక్ష్యం
మేము పుట్టిన గ్రామానికి చేతనైనంత సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. నిరుపేద బాలికల విద్యను ప్రోత్సహించడానికి గ్రామంలో వసతి గృహాన్ని దత్తత తీసుకుని వారికి అవసరమైన దుస్తులు ఉచితంగా అందజేస్తున్నాం. నాతో పాటు మరో ఇద్దరు స్నేహితులం సంయుక్తంగా విశాఖ సంపూర్ణ సంస్థ ద్వారా నెలకు రూ. 30 వేలు విలువ గల పేడ్ కాటన్ దుస్తులు ప్రతి నెలా అందిస్తున్నాం. ఇతర పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు కూడా అవసరమైన సామగ్రి అందజేయనున్నాం. అలాగే గ్రామాభివృద్ధికి కూడా మా వంతు సాయం అందించడానికి కృషి చేస్తాం. – రత్నకుమారి, ఎన్ఆర్ఐ -
సమ్మతి తెలిపిన వారినే స్పాట్ వాల్యుయేషన్కు నియమించాలి
అనకాపల్లి టౌన్ : పదో తరగతి బోధించడంలో మూడేళ్ల కంటే ఎక్కువ అనుభవం కలిగిన ఉపాధ్యాయులనే పరీక్షల స్పాట్ వాల్యుయేషన్లో నియమించాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయ్ కోరారు. ఈ మేరకు డీఈవో గిడ్డి అప్పారావు నాయుడుకు యూటీఎఫ్ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా చిన్నబ్బాయ్ మాట్లాడుతూ పదో తరగతి పరీక్ష మూల్యాంకానికి సమ్మతి తెలిపే వారినే ఎంపిక చేయాలన్నారు. అలాగే 58 సంవత్సరాల పైబడిన వయస్సు, దీర్ఘకాలిక వ్యాధులు కలవారు, 50 శాతం అంగవైకల్యం గల ఉపాధ్యాయులకు వారు కోరిన మేర మినహాయింపు ఇవ్వాలన్నారు. స్పాట్ వ్యాల్యూషన్కు ఆయా సబ్జెక్టులలో ఎంతమంది ఉపాధ్యాయులు అవసరం అవుతారో ఆ సీనియార్టీ లిస్టులను ముందుగా తెలియజేయాలన్నారు. ఆయా సెంటర్లలో తగు వసతులు కల్పించాలన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వత్సవాయి శ్రీలక్ష్మి, మండల ప్రధాన కార్యదర్శి నాతవరపు సతీష్, మునగపాక యూటీఎఫ్ నాయకులు ఆశ, రవి, కరుణ, జ్యోతి పాల్గొన్నారు. -
క్యాన్సర్పై పోరాటాన్ని వేగవంతం చేయాలి
మహారాణిపేట (విశాఖ): క్యాన్సర్పై పోరాటాన్ని వేగవంతం చేసి.. అంతర్జాతీయ సహకారం, పరిశోధన, పురోగతికి బలమైన వేదికగా నిలబడాలని ఓమేగా క్యాన్సర్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బెల్లాల రవిశంకర్ ఆకాంక్షించారు. శనివారం విశాఖలోని ఓ హోటల్లో ఓమేగా క్యాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో జరిగిన మాలిక్యులర్ అంకాలజీ సొసైటీ కాన్ఫరెన్స్–2025ను ఆయన జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాలిక్యులర్ అంకాలజీ సొసైటీ అనేది క్యాన్సర్ బయాలజీని లోతుగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. కొత్త క్యాన్సర్ చికిత్సా విధానాలను అభివృద్ధి చేయడానికి అంతర్జాతీయ సంస్థ పరిశోధకులు, వైద్యులు, ఆరోగ్య సంరక్షణ నిపుణుల మధ్య సహకారాన్ని అందిస్తుందన్నారు. ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవి మాట్లాడుతూ క్యాన్సర్ పరిశోధన, చికిత్సా విధానాల్లో నూతన ఆవిష్కరణలపై చర్చలు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో డాక్టర్ శిల్పా, డాక్టర్ ఎన్.రామకోటీశ్వరరావు, డాక్టర్ బి.వి.మాధవి తదితరులు పాల్గొన్నారు. ఆదివారం కూడా ఈ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో 100 మందికి పైగా ప్రముఖులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత మాలిక్యులర్ అంకాలజీ నిపుణులు, వైద్యులు, పరిశోధకులు పాల్గొంటున్నారు. ‘ప్రెసిషన్ మెడిసిన్ ద్వారా క్యాన్సర్ సంరక్షణలో విప్లవాత్మక మార్పులు‘ అనే ప్రధాన థీమ్తో ఈ ఏడాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి
కశింకోట : నూతలగుంటపాలెం శివారు త్రిపురవానిపాలెం కూడలి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందాడు. క్లీనర్ గాయపడ్డాడు. సీఐ అల్లు స్వామినాయుడు అందించిన వివరాల ప్రకారం.. అనకాపల్లి నుంచి యలమంచిలి వైపు వెళుతున్న లారీ డ్రైవర్ ఎటువంటి సిగ్నల్స్ ఇవ్వకుండా త్రిపురవానిపాలెం కూడలి వద్ద అవతలి రోడ్డుకు వెళ్లడానికి అకస్మాత్తుగా లారీని మలుపు తిప్పడంతో అదే మార్గంలో వస్తున్న మరో లారీ వెనుకగా ఢీ కొంది. దీంతో వెనుక లారీ డ్రైవర్ షేక్ మస్తాన్ వల్లి (62) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. క్లీనర్ కూడా స్వల్పంగా గాయపడ్డాడు. మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.క్లీనర్కు గాయాలు -
టీడీఆర్ బాండ్లు మాకొద్దంటూ ఆందోళన
మునగపాక : పూడిమడక రోడ్డు విస్తరణకు సంబంధించి పరిహారంగా నగదు అందించాలని, అంతే కాని టీడీఆర్ బాండ్లు తమ కొద్దంటూ శనివారం తహసీల్దార్ కార్యాలయం వద్ద బాధితులు ఆందోళన చేపట్టారు. గ్రామసభలు నిర్వహించి ప్రతి బాధితునికి తమ అకౌంట్లో పరిహారం జమ అవుతుందని చెప్పి నేడు టీడీఆర్ బాండ్లు ఇస్తామంటూ చెప్పడం తగదన్నారు. సీఐటీయూ నేత బ్రహ్మాజీ మాట్లాడుతూ పూడిమడక రోడ్డు విస్తరణలో ఇళ్లు, వ్యవసాయ భూములు కోల్పోతున్న వారికి చట్ట ప్రకారం పరిహారం అందిస్తామని అధికారులు చెప్పారన్నారు. అభివృద్ధికి తాము అడ్డంకి కాదని, ప్రభుత్వ పరిహారం మాత్రం నగదు రూపంలో అందించాలన్నారు. అనంతరం తహసీల్దార్ ఆదిమహేశ్వరరావుకు వినతి అందజేశారు. -
విద్యుత్ ఫిర్యాదులు పరిష్కారం కాకపోతే పరిహారం
తుమ్మపాల: విద్యుత్ ఫిర్యాదులు కాలపరిమితిలోగా పరిష్కారం కాకపోతే వినియోగదారులకు విద్యుత్ శాఖ పరిహారం చెల్లించాల్సి ఉంటుందని విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక (సీజీఆర్ఎఫ్) చైర్పర్సన్, విశ్రాంత న్యాయమూర్తి బి.సత్యనారాయణ స్పష్టం చేశారు. గవరపాలంలో గల గౌరీ గ్రంథాలయంలో నెహ్రూ యువ కేంద్రం, వినియోగదారుల ఆర్గనైజేషన్స్ ఫెడరేషన్, మండల వినియోగదారుల మండలి సహకారంతో ‘విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్ఎఫ్) ప్రయోజనాలు’ అంశంపై శనివారం జరిగిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్తు సరఫరాలో ఎలాంటి సేవా లోపం ఉన్నా సీజీఆర్ఎఫ్కు వ్యక్తిగతంగా గానీ, వాట్సాప్ నంబర్ 94936 81912 ద్వారా గానీ, chrper@ apeastern power.com ఈ మెయిల్ పోస్టు ద్వారా ఆన్లైన్లో గానీ ఫిర్యాదు చేయవచ్చన్నారు. వినియోగదారులు సమస్య ఉత్పన్నమైన నాటి నుంచి రెండేళ్లలోపు నిర్దేశిత దరఖాస్తులో రాతపూర్వకంగా సీజీఆర్ఎఫ్కు ఫిర్యాదు చేయవచ్చని, 60 రోజుల్లోపు తీర్పు వెలువడుతుందన్నారు. అయితే దీనికి ముందు 1912కు, క్షేత్ర స్థాయి విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసి తిరుగు రశీదులు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతకుముందు పలు సమస్యలపై విద్యుత్ వినియోగదారులు ఫిర్యాదులు చేశారు. రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ రాష్ట్ర సలహా కమిటీ సభ్యుడు కాండ్రేగుల వెంకటరమణ, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ గొర్లి మహేశ్వరరావు, సీజీఆర్ఎఫ్ సభ్యులు షైక్ బాబర్, వి.మురళీకృష్ణ, సమాచార హక్కు ఉద్యమకర్తలు కె.శ్రీరామకిషోర్, ఈపీడీసీఎల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ డి.వి.రామరెడ్డి, గౌరీ గ్రంథాలయ అధ్యక్షుడు డి.నూకఅప్పారావు వినియోగదారులు పాల్గొన్నారు. విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక చైర్పర్సన్ సత్యనారాయణ -
వంద కిలోల గంజాయి పట్టివేత
నర్సీపట్నం: ఆటోలో గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు అరెస్టు చేశామని, మరో ఇద్దరు వ్యక్తులు పరారయ్యారని డీఎస్పీ పి.శ్రీనివాసరావు తెలిపారు. పట్టుబడిన గంజాయి, నిందితులను మీడియా ముందుకు హాజరు పరిచారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ట్రైనీ డీఎస్పీ చైతన్య, ఎస్ఐ రమేష్, ఏఎస్ఐ సాంబశివ మున్సిపాలిటీ పరిధి పెదబొడ్డేపల్లి బాలుర గురుకుల పాఠశాల మెయిన్ రోడ్డులో శనివారం వాహన తనిఖీలు నిర్వహించారు. కె.డి.పేట నుంచి నర్సీపట్నం మీదగా తాళ్లపాలెం ఆటోలో గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆటో డ్రైవర్, నర్సీపట్నానికి చెందిన వ్యక్తి పరారయ్యారు. చింతపల్లి మండలం, కొరుకొండ గ్రామానికి చెందిన ఎం.గాంధీ, వంతు ల హరిబాబు, నర్సీపట్నానికి చెందిన రౌడీషీటర్ భార్గవను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామన్నారు. వీరి వద్ద నుండి మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. పరారైన వ్యక్తుల కోసం గాలిస్తున్నామన్నారు. ఆటోతో పాటు వంద కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో టౌన్ సీఐ గోవిందరావు పాల్గొన్నారు. ముగ్గురు వ్యక్తుల అరెస్టు ఇద్దరు పరార్ -
వైస్ ఎంపీపీ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా శరగడం లక్ష్మి ఎంపిక
చోడవరం : మండల పరిషత్ వైస్ ఎంపీపీ స్థానానికి వైఎస్సార్సీపీ నుంచి శరగడం లక్ష్మిని ఆ పార్టీ ఎంపిక చేసింది. చోడవరం మండల పరిషత్ వైస్ ఎంపీపీ బుద్ద గంగరాజు ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. మండల పరిషత్లో 25 ఎంపీటీసీ స్థానాలకు గాను 20ఎంపీటీసీలు వైఎస్సార్సీపీకి ఉన్నాయి. ముందస్తు ఒప్పందం మేరకు గంగరాజు రాజీనామా చేయడంతో ఆస్థానానికి జరుగుతున్న ఎన్నిక లాంఛనంగా వైఎస్సార్సీపీకే దక్కుతుంది. దీంతో పార్టీ ఎంపీటీసీలతో నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చోడవరంలో పార్టీ కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. గవర సామాజిక వర్గానికి చెందిన గంగరాజు రాజీనామాతోఅదే సామాజిక వర్గానికి చెందిన అంబేరుపురం ఎంపీటీసీ సభ్యురాలు శరగడం లక్ష్మికి ఆ పదవి ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్టు సమన్వయకర్త అమర్నాధ్ ప్రకటించారు. ఈ సమావేశానికి 18మంది ఎంపీటీసీలు హాజరయ్యారు. వీరంతా పార్టీ నిర్ణయానికి ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అమర్నాఽథ్ మాట్లాడుతూ అంకితభావంతో పనిచేసే కార్యకర్తలకు పార్టీలో ఎప్పుడూ సముచిత స్థానం ఉంటుందన్నారు. ఈనెల 27న ఎన్నిక జరుగుతుండడంతో పార్టీ ఎంపీటీసీలంతా ఒకే తాటిపై ఉండి ఏకగ్రీవంగా లక్ష్మిని ఎన్నుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఎంపీపీ గాడి కాసు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు, జిల్లా యువజన అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్, రైతు అధ్యక్షుడు బొడ్డేడ సూర్యనారాయణ పాల్గొన్నారు. -
‘కనీస వేతనాలు చెల్లించండి’
అనకాపల్లి టౌన్: తల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్ 102లో పనిచేస్తున్న కెప్టెన్స్కి కనీస వేతనాలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి వి.వి.శ్రీనివాస రావు కోరారు. స్ధానిక జిల్లా సీఐటీయూ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తొమ్మిది సంవత్సరాలు గా రూ.7,870 వేతనానికే పనిచేస్తున్నారన్నా రు. నేషనల్ హెల్త్ మిషన్లో గర్భిణులు, బాలింతలకు తల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల ద్వారా గమ్యస్థానాలకు చేర్చడం, అత్యంత నైపుణ్యం కలిగి ఉండాలని, తగిన విద్యార్హతలు ఉన్నా కనీస వేతనం లేకపోవడంతో దుర్భరమైన పరిస్థితుల్లో వారు జీవిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, అలాగే మార్చి 31వ తేదీతో కాంట్రాక్ట్ ముగిసిపోతున్న నేప థ్యంలో వీరికి రూ. 18,500 జీతాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని, బీమా, ఇతర అలవెన్స్ సదుపాయాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు పి.కృష్ణ, డి.శ్రీనివాసరావు, ఎ.నర్సింగ్రావు పాల్గొన్నారు. -
రసాయన పరిశ్రమలకు భూములిచ్చే ప్రసక్తి లేదు
నక్కపల్లి: తరతరాల నుంచి సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న భూములను రసాయన పరిశ్రమలకు ఇచ్చి ఆరోగ్యాలు పాడు చేసుకునే ప్రసక్తి లేదని పలువురు రైతులు ఏపీఐఐసీ అధికారులకు స్పష్టం చేశారు. శనివారం బల్క్డ్రగ్ పార్క్ కోసం అదనంగా భూములు సేకరించేందుకు ఏపీఐఐసీ, రెవెన్యూ అధికారులు జానకయ్యపేట, సిహెచ్ఎల్ పురం తదితర గ్రామాల్లో రైతులతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఐఐసీ ఎస్డీసీ అనిత, తహసీల్దార్ నర్సింహమూర్తి మాట్లాడుతూ బల్క్డ్రగ్ పార్క్ కోసం బీడీపీ ఫేజ్ 2 కింద ఈ రెండు గ్రామాల్లో భూములు గుర్తించామని, రైతులు సహకరించాలని కోరారు. దీనిపై రైతులు మాట్లాడుతూ మామిడి, జీడి, కొబ్బరి తోటలు వేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్న తమ భూములను ప్రమాదకర పరిశ్రమల కోసం సేకరించడం సమంజసం కాదన్నారు. ఇప్పటికే హెటెరో డ్రగ్స్ పరిశ్రమ వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే వారు ఆరోగ్యాలు పాడై ఆస్పత్రి పాలవుతున్నారన్నారు. తాజాగా ఈ ప్రాంతంలో బల్క్డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నారని, తమ నుంచి భూములు తీసుకుని తమ ప్రాణాలకు ముప్పు తెచ్చే పనులు చేయడం ఎంతవరకు సమంజసమని రైతులు ప్రశ్నించారు. దీనిపై ఎస్డీసీ అనిత మాట్లాడుతూ సమావేశంలో రైతులు తెలిపిన విషయాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. రైతుల అంగీకారంతోనే భూములు తీసుకుంటామని, ఆమోదకరమైన నష్టపరిహారం, ప్యాకేజీ ఇస్తామని చెప్పారు. ఈ సమావేశంలో రైతు నాయకులు కురందాసు నూకరాజు, కురందాసు సింహాచలం తదితరులు పాల్గొన్నారు. ఏపీఐఐసీ అఽధికారులకు స్పష్టం చేసిన రైతులు -
ఎన్ఆర్ఐ మహిళలు.. స్వగ్రామంలో సేవలు
మాడుగుల : ఉన్న ఊరు... కన్నతల్లిని మరిచిపోకూడదని పెద్దలు చెప్పిన మాటలు మదిలో పెట్టుకుని తాము పుట్టిన గ్రామానికి సేవ చేయాలని తలచారు. ముగ్గురు మహిళా స్నేహితులు. విదేశాలకు వెళ్లిన ముగ్గురు ఎన్నారై మహిళలు తమ ఊరిపై మమకారంతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా ఇక్కడి వసతి గృహాల్లో ఉండి చదువుతున్న బాలికలకు చేయూతనివ్వాలని నిశ్చయించుకున్నారు. గ్రామానికి చెందిన మహిళలు వాడపల్లి రత్న కుమారి, గడిమెల్ల రజని, అయ్యల బాల త్రిపుర సుందరి, జెర్రి వావణరెడ్డి ఉద్యోగ రీత్యా యుఎస్ఏలో ఉంటున్నారు. స్నేహితులైన వీరంతా కలిసి ప్రభుత్వ వసతి గృహాల్లో విద్య అభ్యసిస్తున్న పేద విద్యార్థినులకు నెలసరి సమయంలో వాడే కాటన్ పేడ్లతో పాటు ఇతర సామగ్రి ఉచితంగా అందజేస్తున్నారు. విశాఖకు చెందిన సంపూర్ణ సంస్థ ద్వారా నెలకు రూ.30 వేలు విలువ గల శానిటరీ కాటన్ ప్యాడ్స్ పంపిణీ చేస్తున్నారు. మాజీ ఎంపీపీ రామధర్మజ, సర్పంచ్ ఎడ్ల కళావతి, ఆద్వర్యంలో మాడుగుల బీసీ బాలికల వసతి గృహాన్ని దత్తత తీసుకుని వితరణ అందజేశారు. వారిని గ్రామస్తులు అభినందిస్తున్నారు. నిరుపేద బాలిక విద్యకు ప్రోత్సాహం స్ఫూర్తినిస్తున్న స్నేహితురాళ్లు -
గంజాయి కేసుల్లో నిందితుల ఆస్తుల జప్తు
● ఎస్పీలకు డీఐజీ ఆదేశం సాక్షి, అనకాపల్లి: గంజాయి రవాణా, వినియోగాన్ని నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, నిందితుల ఆస్తుల జప్తు, డీ–అడిక్షన్ కార్యక్రమాలపై విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి శనివారం ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గంజాయి రవాణాలో లబ్ధిదారులుగా ఉన్న వ్యక్తుల ఆస్తులను గుర్తించి త్వరితగతిన జప్తు చేయాలని ఆదేశించారు. గంజాయి వినియోగదారులను గుర్తించి, వారిని డీ–అడిక్షన్ సెంటర్లకు పంపించి చికిత్స అందిస్తున్నామన్నారు. పోక్సో కేసుల్లో బాధితులకు కలెక్టర్ల ద్వారా పరిహారం త్వరగా అందేటట్లు చర్యలు చేపట్టాలన్నారు. -
ఏపీఐఐసీ అధికారుల దౌర్జన్యం
నక్కపల్లి: డీ ఫారం రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా ఏపీఐఐసీ అధికారులు దౌర్జన్యంగా వ్యవహరించి రైతుల భూముల్లో రోడ్డు పనులు ప్రారంభించడాన్ని అఖిలపక్ష నాయకులు శనివారం అడ్డుకున్నారు. డి.ఎల్.పురంలో పోలీసులకు.. రైతులకు, అఖిలపక్ష నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. నష్టపరిహారం చెల్లించిన తర్వాతే పనులు ప్రారంభించాలంటూ రైతులు యంత్రాలకు అడ్డంగా నిలబడి పనులు అడ్డుకున్నారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.అప్పలరాజు, స్థానిక సర్పంచ్ కిల్లాడ కృష్ణ తదితరులు మాట్లాడుతూ డి.ఎల్.పురంలో సర్వే నెంబరు 193, 194, 195, 196, 197, 198, 199లలో సుమారు 64 ఎకరాల ప్రభుత్వ భూమిని 1967లో గ్రామానికి చెందిన పేదలకు డీ ఫారం పట్టాలుగా మంజూరు చేశారన్నారు. అప్పటి నుంచి రైతులంతా మధ్య భూములు సాగు చేసుకుంటూ జీవిస్తున్నారన్నారు. ఇటీవల ఇండస్ట్రియల్ కారిడార్ కోసం, బల్క్డ్రగ్ పార్క్ కోసం భూములు సేకరించిన ప్రభుత్వం జిరాయితీ రైతులకు నష్టపరిహారం చెల్లించి డీ ఫారం రైతులకు ఇవ్వలేదన్నారు. తాజాగా ఏపీఐఐసీ పనులు దక్కించుకున్న కాంట్రాక్టరు రైతులకు తెలియకుండా డీ ఫారం భూముల్లో బుల్డోజర్లు, జేసీబీల సాయంతో అక్రమంగా ప్రవేశించి చదును చేసి రోడ్లు నిర్మిస్తున్నారని ఆరోపించారు. అడ్డుకున్న రైతుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారన్నారు. విషయం తెలిసి తాము ఇక్కడకు వచ్చి రైతుల పక్షాన ప్రశ్నిస్తే తమపై కూడా దౌర్జన్యం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని రైతులకు చెందిన భూములను బలవంతంగా లాక్కోవడమే కాకుండా నష్టపరిహారం చెల్లించకుండా రోడ్డు పనులు ప్రారంభించడం తగదన్నారు. ఇరు పక్షాల వాదోపవాదాలు ఈ సందర్భంగా పోలీసులకు, అఖిలపక్ష నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. నష్టపరిహారం చె ల్లించేవరకు పనులు ప్రారంభించడానికి వీల్లేదని అఖిలపక్ష నాయకులు పట్టుబట్టారు. ఎస్ఐ కుమారస్వామి పనులు జరిగే ప్రాంతానికి వచ్చి రైతులు, ఆందోళనకారులతో చర్చలు జరిపారు. పరిహారం కోసం అఽధికారులను కలవాలని, అంతే తప్ప పను లు అడ్డుకోవడం తగదని సూచించారు. రైతులు బదులిస్తూ పనులు అడ్డుకోకపోతే నష్టపరిహారం చెల్లించే అవకాశం లేదని వివరించారు. 2013 భూసేకరణ చట్టానికి ప్రభుత్వం తూట్లు పొడిచిందన్నారు. నోటిఫికేషన్ సమయంలో ఒకలా భూసేకరణ సమయంలో మరోలా వ్యవహరించి రైతులను మోసం చేసిందని అప్పలరాజు ఆరోపించారు. తక్షణమే డీ ఫారం భూములు కలిగిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, కాని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. పరిహారం ఇవ్వకుండా రోడ్డు పనులు డి.ఎల్.పురంలో అడ్డగించిన రైతులు పోలీసుల మోహరింపు..రైతులతో వాగ్వాదం -
రెల్లీల వాటా పెంచాలి
నర్సీపట్నం: ఎస్పీ వర్గీకరణకు వ్యతిరేకంగా రెల్లి కులస్తులు శనివారం నర్సీపట్నంలో ధర్నా నిర్వహించారు. అబిద్ సెంటర్లోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, ర్యాలీగా బయలుదేరారు. ఒక శాతం వద్దు.. 5 శాతం ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని ధర్నా నిర్వహించారు. కార్యాలయ ఏవో సూర్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రెల్లి హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు యర్రంశెట్టి పాపారావు, గౌరవ అధ్యక్షుడు బంగారి వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు యర్రంశెట్టి అప్పన్నబాబు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ తీర్పుపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులస్తులకు తీరని అన్యాయం చేసిన కమిషన్ క్షేత్రస్థాయిలో పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. ఎ, బి, సి, డి వర్గీకరణలో రెల్లి కులస్తులకు 1 శాతం కేటాయించారని, ఇది ఎంతమాత్రం చాలదన్నారు. ఒకటి నుంచి ఐదు శాతం పెంచాలని డిమాండ్ చేశారు. రెల్లి కులస్తులు స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు అన్ని రంగాల్లో వెనుకబడే ఉన్నారన్నారు. రెల్లీలు రిజర్వేషన్ ఫలాలకు దూరమై అన్యాయానికి గురవుతున్నారన్నారు. రిజర్వేషన్ వర్గీకరణపై పునరాలోచన చేయాలన్నారు. ధర్నాలో రెల్లి సంఘం నాయకులు ఇల్లపు లోవరాజు, బంగారి సూరిబాబు, చెన్నా శ్రీనివాసరావు, మంగళగిరి భగీరథరావు, మంగళగిరి భాస్కరరావు, మజ్జి దినేష్, తదితరులు పాల్గొన్నారు. నర్సీపట్నంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ధర్నా -
మలేషియాలో చిక్కుకున్న జి.నగరంవాసి
మాకవరపాలెం: ఉపాధి కోసం వెళ్లిన ఓ వ్యక్తి మలేషియాలో చిక్కుకున్నాడు. మండలంలోని జి.నగరం గ్రామానికి చెందిన ఒమ్మి భూషణం ఉపాధి నిమిత్తం 2019లో మలేషియా వెళ్లాడు. మూడేళ్లపాటు బాగానే ఉన్నా.. అనంతరం ఇబ్బందులు మొదలయ్యాయి. స్వగ్రామానికి పంపాలని భూషణం ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. ఎనిమిది నెలల క్రితం తన కుమార్తె వివాహానికి వెళ్తానన్నా పంపించలేదని శనివారం వీడియో ద్వారా తెలియజేశాడు. తన పాస్పోర్ట్, వీసా తీసుకుని ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం స్పందించి తనను స్వగ్రామం తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని వీడియో ద్వారా కోరాడు. -
వరి గడ్డి
భగ్గుమన్న ● పశుగ్రాసం కొరతతో పాడి రైతులు సతమతం ● మూడింతలు పెరిగి ఆకాశాన్నంటిన గడ్డి ధరలు ● పెట్టుబడి సాయం అందకపోవడంతో తగ్గిన వరి సాగు ● కోత యంత్రాల వినియోగంతో వృథా అవుతున్న గడ్డి ● పొరుగు జిల్లాల నుంచి కొనుగోలు చేయాల్సిన దుస్థితి సాక్షి, అనకాపల్లి: పశువులకు మేతగా వాడే వరి గడ్డికి డిమాండ్ ఏర్పడింది. వరి పంట నూర్పుల సమయంలో గడ్డిని కుప్పలుగా వేసి భద్రపర్చుకుని, పాడి రైతులు వేసవిలో పశువులకు మేతగా వినియోగించుకుంటారు. ఈ ఏడాది కొరత ఏర్పడి ఇబ్బందులు పడుతున్నారు. రైతుకు పెట్టుబడుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందకపోవడంతో వరి సాగు తగ్గుముఖం పట్టింది. దీనికి తోడుగా వరి కోత యంత్రాల వినియోగం పెరగడంతో గడ్డి గణనీయంగా తగ్గింది. దీంతో పొరుగునున్న కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల నుంచి వరిగడ్డి కొనుగోలు చేసి తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. విద్యుత్ బోర్ల సదుపాయం ఉన్న పాడి రైతులు ప్రత్యామ్నాయంగా పచ్చగడ్డి పశుగ్రాసంగా వేస్తారు. వేసవిలో పచ్చగడ్డితోపాటు ఎండు వరి గడ్డి సమపాళ్లలో పశువులకు మేతగా వేస్తారు. కానీ ప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ను 9 గంటలకు బదులు 3 లేదా 4 గంటల పాటే ఇవ్వడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో వరి గడ్డి కొరత తీర్చేందుకు పచ్చగడ్డి అందించలేని పరిస్థితి నెలకొంది. ఎకరా గడ్డికి మూడింతల ధర జిల్లాలో 2.34 లక్షల కుటుంబాలు పశుపోషణ చేస్తున్నాయి. 1.85 లక్షల ఆవులు, 2.5 లక్షల గేదెల పశుసంపద ఉంది. వీటికి ఏడాదికి సగటున 5 నుంచి 6 లక్షల టన్నుల వరకు వరి గడ్డి అవసరం ఉంటుందని అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. గతంలో ఎకరా గడ్డి రూ.5 వేలకు కొనగా.. ఇప్పుడు రూ.13 వేల నుంచి రూ.16 వేలు పలుకుతోంది. మున్ముందు గ్రాసం ధర మరింత పెరిగే అవకాశం ఉండటంతో పశుపోషణపై ఆధారపడిన పలు కు టుంబాల వారు ముందస్తుగానే కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇక్కడకు తెచ్చుకుంటున్నారు. గణనీయంగా తగ్గిన వరి గడ్డి జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 1.32 లక్షల ఎకరాల్లో, రబీలో 39,564 ఎకరాల్లో వరి సాగు చేశారు. సాధారణంగా ఎకరా వరి పంట కోత కోస్తే ఐదారు టన్నుల గడ్డి వస్తుంది. కోత యంత్రాలు వినియోగిస్తే మూడు టన్నుల గడ్డి కూడా రావడం లేదు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సగం భూముల్లో వరి కోత యంత్రాల ద్వారా కోతలు జరిగాయి. రెండుసార్లు భారీ వర్షాలు పడి పంట మునిగిపోయింది. దీంతో డిసెంబర్ నెలలో పంట పూర్తయినా కుప్పలుగా వేసి సంక్రాంతి తరువాత నుంచి నూర్పులు చేశారు. వేసవిలో వరి గడ్డి లేకపోవడంతో ప్రతిరో జూ ట్రాక్టర్లలో గడ్డి పొరుగు ప్రాంతాల నుంచి కొనుగోలు చేసుకుంటున్నారు. కొందరు రైతులు నూర్పిడి ఖర్చులు పెట్టుకొని గడ్డిని తీసుకెళ్లాలని షరతు పెడుతున్నారు. ఎకరా పంట నూర్పిడికి రూ.11 వేలు ఖర్చవుతుండగా ఆ మొత్తాన్ని భరించేందుకు కూడా కొందరు ముందుకు వస్తున్నారు. వరి నూర్పు పనుల్లో నిమగ్నమైన రైతులుఎకరా గడ్డి ఇంటికి చేరేందుకు రూ.16 వేల ఖర్చు ఆక్సాహేబుపేట గ్రామంలో సగం పల్లం.. సగం మెట్ట భూములున్నాయి. తాండవ రిజర్వాయర్ ద్వారా కొంతమేర వరి పంట పండిస్తారు. మెట్ట ప్రాంతాల్లో జీడి మామిడి సాగు చేస్తాం. ఈ ఏడాది తాండవ రిజర్వాయర్ నుంచి నీరు ఎక్కువగా రాకపోవడంతో వరి సాగు తగ్గింది. దీంతో గడ్డి కొరత ఏర్పడింది. కాకినాడ జిల్లా చేబ్రోలులో వరి గడ్డి కొనుగోలు చేసి ట్రాక్టర్లో తెచ్చుకుంటున్నాం. ఎకరా వరి పంట నూర్పుకు అయ్యే ఖర్చు అక్కడ రైతుకు ఇస్తే మనకు ఎండు వరి గడ్డి ఇస్తారు. సుమారు 50 కి.మీ. దూరం నుంచి తీసుకొని వస్తున్నాం. ఎకరా గడ్డి మా గ్రామానికి తీసుకొచ్చేందుకు రూ.16 వేలు అవుతోంది. – అల్లు చిట్టిబాబు, రైతు, ఆక్సాహేబుపేట గ్రామం, కోటవురట్ల మండలం -
మోటారు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
కశింకోట: మండలంలోని తాళ్లపాలెంలో మోటారు కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ శుక్రవారం నిరసన తెలిపారు. ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శంకర్, జిల్లా నాయకుడు దాకారపు శ్రీనివాసరావు మాట్లాడుతూ మోటార్ కార్మికుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పరిష్కరించాలన్నారు. ఆటో, మోటారు కార్మికులకు వాహనాల కొనుగోలుకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేయాలన్నారు. విడి భాగాల ధరలు తగ్గించాలన్నారు. 50 ఏళ్లు దాటిన మోటారు కార్మికులకు పింఛన్ సదుపాయం కల్పించాలన్నారు. తమ సమస్యల పరిష్కారానికి మోటార్ కార్మికులు ఐక్యంగా పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 24న చలో ఢిల్లీ కార్యక్రమం జరగనుందని, ఈ కార్యక్రమానికి మోటారు కార్మికులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన కర పత్రాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు నాగేశ్వరరావు, కార్యదర్శి లోవరాజు, ప్రతినిధులు జి.నారాయణరావు, కె.శ్రీను, నాగేశ్వరరావు, ఎస్.రమణ, సూరిబాబు, పి.కొండలరావు, ఎస్.సురేష్, తదితరులు పాల్గొన్నారు. -
కాపర్ చోరీ కేసులో 8 మంది అరెస్ట్
ఎంవీపీకాలనీ: ఎంవీపీకాలనీలో పలు చోట్ల డ్రిల్లింగ్ చేసి కాపర్ దొంగతనానికి పాల్పడిన కేసులో 8 మందిని అరెస్ట్ చేసినట్లు ద్వారకా క్రైం సీఐ చక్రధరరావు తెలిపారు. ఈ వివరాలను శుక్రవారం ఎంవీపీ కాలనీ పోలీసుస్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నగరంలో ఎనిమిదేళ్ల కిందట జరిగిన బీఎస్ఎన్ఎల్ పనుల్లో పెందుర్తికి చెందిన ఆసనాల పిట్టోడు(ఏ1), ఏలూరుకు చెందిన బి.శ్రీను, జి.గోవర్ధన్, బి.ఏడుకొండలు, బి.రాజు, సీహెచ్ దుర్గాప్రసాద్, డి.రాజేష్, బి.ప్రసాద్ పాల్గొన్నారు. కాపర్ వైర్తో కూడిన పనులు చేపట్టారు. ప్రస్తుతం ల్యాండ్ లైన్ సేవలు నిలిచిపోవడంతో ఎవరూ పట్టించుకోరనే ఉద్దేశంతో కాపర్ వైర్ దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఎంవీపీకాలనీలో రాత్రి పూట అండర్ గ్రౌండ్ డ్రిల్లింగ్ చేసి.. 800 మీటర్ల కాపర్ వైరు చోరీ చేశారు. దీనిపై బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి చుట్టురి మురళీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారంపై బయటపడింది. ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. 300 కిలోల కాపర్ వైరుతో పాటు టాటా ఏస్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. -
రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ఉద్యోగి మృతి
సంఘటన స్థలంలో తాతీలు మృతదేహం మాకవరపాలెం: రోడ్డు ప్రమాదంలో ఓ రిటైర్డ్ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి మృతి చెందారు. మండలంలోని పెద్దిపాలెం గ్రామానికి చెందిన గుడివాడ తాతీలు(60) శుక్రవారం మధ్యాహ్నం నర్సీపట్నం నుంచి మోటార్ సైకిల్పై స్వగ్రామం వస్తున్నారు. మండలంలోని జి.గంగవరంలోని పెట్రోల్ బంక్ వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ప్రమాదవశాత్తూ ఢీకొట్టారు. తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే ఆయన మృతి చెందారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ దామోదర్నాయుడు తెలిపారు. -
సాధారణ భక్తులకు గంటలోపు దర్శనం
● నూకాంబిక అమ్మవారి జాతర రాష్ట్ర పండగ ● పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశం తుమ్మపాల: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు నూకాంబిక అమ్మవారి జాతరను ఈ ఏడాది రాష్ట్ర పండుగగా ప్రకటించినందున, అందుకు తగినట్లుగా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ దేవదాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 27 వరకు జరగనున్న అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం కలెక్టరేట్లో దేవదాయ శాఖ, పోలీసు, జీవీఎంసీ, ఎలక్ట్రికల్, ఎక్సైజ్, ఆర్టీసీ, తదితర శాఖల అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పండగ నిర్వహణలో ప్రొటోకాల్ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇచ్చి, గంటలోపు దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రతి శాఖ అధికారులు ముందుగానే ప్రణాళికతో పండగ నిర్వహణకు సిద్ధం కావాలన్నారు. గత సంవత్సరాల అనుభవాలతో సాధారణ రోజులు, ఆదివారం రోజుల్లో ఎంత మంది భక్తులు వస్తారో అంచనా వేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. భక్తులకు ఎండ తగులకుండా పందిర్లు, మంచినీరు అందుబాటులో ఉంచాలని చెప్పారు. శానిటేషన్ సక్రమంగా చేపట్టాలని, అదనపు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ పండగ జరిగినన్ని రోజులు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. చిన్నారులకు పాలిచ్చేందుకు ప్రత్యేక గది ఏర్పాటు చేయాలన్నారు. పార్కింగ్ నిర్వహణ పక్కాగా ఉండాలన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా, సురక్షితమైన ఏర్పాట్లు చేయాలన్నారు. అమ్మవారి ఆలయ సమీపంలో మద్యం అమ్మకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, డీఎస్పీ ఎం.శ్రావణి, పండగ నిర్వహణ ప్రత్యేకాధికారి కె.శోభారాణి, ఆలయ నిర్వహణాధికారి బి.రాంబాబు, జిల్లా వైద్య ఆరోగ్యఅధికారి డా. పి.రవికుమార్, జిల్లా అగ్నిమాపక, విపత్తుల నివారణ అధికారి ఆర్.వి.రమణ, జీవీఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు ఎస్.శేఖర్, జిల్లా సహాయ ఇంజినీరు ఎ.వి.వి.శివప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
స్థల వివాదంపై ఇరువర్గాల ఫిర్యాదు
గొలుగొండ: కొత్తమల్లంపేట గ్రామంలో ఇంటి స్థలం వివాదం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. గ్రామానికి చెందిన రొంగల సత్యవతి ఊరు శివారున రేకుల షెడ్డులో నివాసం ఉంటోంది. గురువారం రాత్రి దౌర్జన్యంగా ఇంటిలో నుంచి తనను బయటకు తీసుకువచ్చి సర్పంచ్ రాజుబాబు దౌర్జన్యం చేసి, ఇంటిని పొక్లెయిన్తో కూల్చివేశారని సత్యవతి ఆరోపిస్తోంది. కుటుంబ సభ్యుల గొడవలో స్థానిక సర్పంచ్ రాజుబాబు కలగజేసుకుని విద్యుత్ సరఫరా నిలిపివేసి, ఇంటిని నేలమట్టం చేశారని సత్యవతి గొలుగొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అటుగా వెళ్తున్న తనపై దౌర్జన్యం చేయడంతో గాయపడినట్లు రాజుబాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్యవతితో పాటు రాజుబాబు కూడా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇరువర్గాల ఇచ్చిన ఫిర్యాదులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గొలుగొండ ఎస్ఐ రామారావు తెలిపారు. -
పోక్సో చట్టంపై అవగాహన అవసరం
తేగాడ కేజీబీవీలో పోక్సో చట్టంపై విద్యార్థినులకు అవగాహన కలిగిస్తున్న అనకాపల్లి జిల్లా 12వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి విజయలక్ష్మి కశింకోట: పోక్సో చట్టంపై బాలికలు అవగాహన కలిగి ఉండాలని అనకాపల్లి జిల్లా 12వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి బి.వి.విజయలక్ష్మి అన్నారు. మండలంలోని తేగాడలోని కేజీబీవీలో హైకోర్టు ఆదేశాల మేరకు పోక్సో చట్టంపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 18 ఏళ్లలోపు బాలికలపై లైంగిక దాడికి పాల్పడే వారికి నేర తీవ్రత అనుసరించి 7 ఏళ్ల నుంచి జీవితాంతం వరకు కారాగార శిక్ష, ఒక్కొసారి ఉరి శిక్ష కూడా విధిస్తారన్నారు. బాలికలు, మహిళల భద్రత కోసం పలు చట్టాలున్నాయని, వాటి పై అవగాహన కలిగి ఆపద సమయంలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. గుడ్, బ్యాడ్ టచ్ల గురించి అవగాహన అవసరమన్నారు. అందొచ్చిన అవకాశాలు, ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి కృషి చేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చంద్రకళ, న్యాయవాదులు కె.కుసుమ, కె.వి.రోజా, తదితరులు పాల్గొన్నారు. -
విశాఖ ఉక్కు ఉద్యమం @1500
ఉక్కునగరం: విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెంలోని స్టీల్ప్లాంట్ ఆర్చ్ వద్ద ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఉద్యమం శనివారం నాటికి 1500 రోజులు పూర్తవుతుంది. స్టీల్ప్లాంట్ను నూరు శాతం వ్యూహాత్మక అమ్మకం చేయాలని 2021 జనవరి 27న కేంద్ర కేబినెట్ కమిటీ ఆన్ ఎకనమిక్ ఎఫైర్స్ కమిటీ నిర్ణయించింది. దీంతో ఉక్కు కార్మిక వర్గం భగ్గుమంది. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పటి నుంచి కార్మికులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో రెండు రోజులు ధర్నాలు చేశారు. జాతీయ రహదారిని పలుమార్లు దిగ్బంధించారు. స్టీల్ప్లాంట్ పరిపాలన భవనం ముట్టడి, గేట్ల ముట్టడి చేపట్టారు. ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో పార్లమెంట్లో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం వెనక్కు తగ్గేది లేదని తేల్చి చెప్పింది. ఉక్కు ఉద్యమానికి కార్మిక సంఘాలు, రచయితలు, మేధావులు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు ఇలా అన్ని వర్గాలకు చెందిన వారు మద్దతు ఇస్తూ దీక్షల్లో పాల్గొంటున్నారు. దీక్షలు ప్రారంభించిన నాటి నుంచి ముఖ్యమైన ఘట్టాలను పరిశీలిస్తే.. 2021 ఫిబ్రవరి 3న వేలాది మంది కార్మికులు ఉక్కు పరిపాలన భవనాన్ని ముట్టడించారు. ఫిబ్రవరి 5న స్టీల్ప్లాంట్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు బైక్ ర్యాలీ చేశారు. ఫిబ్రవరి 12న సీపీఐ కార్యదర్శి నారాయణ రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఫిబ్రవరి 17న నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖ విమానాశ్రయంలో పోరాట కమిటీ నాయకులతో సమావేశమై తమ సంఘీభావం తెలిపారు. ఆ తర్వాత అన్ని రాజకీయ పార్టీలతో భారీ బహిరంగ సభ, జాతీయ రహదారి రాస్తారోకో, రెండు రోజులపాటు జాతీయ రహదారి దిగ్బంధం, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేత, చలో కలెక్టరేట్, 36 గంటల నిరాహార దీక్షలు తదితర కార్యక్రమాలు చేపట్టారు. రైతు ఉద్యమానికి నాయకత్వం వహించిన రైతు సంఘం నాయకులు రాకేష్ తికాయిత్ విశాఖ వచ్చి ఉక్కు ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. ప్రముఖ సామాజిక వేత్త మేథా పాట్కర్ దీక్ష శిబిరానికి విచ్చేసి కేంద్ర ప్రభుత్వం వైఖరిని ఎండగట్టారు. అప్పటి నుంచి రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. నేడు మానవహారం దీక్షలు ప్రారంభించి 1500 రోజులు పూర్తవుతున్న సందర్భంగా శనివారం సాయంత్రం దీక్షా శిబిరం వద్ద మానవహారం నిర్వహించనున్నట్టు పోరాట కమిటీ ప్రకటించింది. స్టీల్ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని, నిర్వాసితులకు న్యాయం చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులను విధుల నుంచి తొలగించరాదన్న డిమాండ్లపై ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు నాయకులు తెలిపారు. 2021 నుంచి అలుపెరగని పోరాటం నేడు దీక్ష శిబిరం వద్ద మానవహారం -
మట్టిలో మాణిక్యం
● గేట్లో మెరిసిన మర్రివలస విద్యార్థి ● తల్లిదండ్రులు రైతు కూలీలు రావికమతం: తల్లిదండ్రులు అమ్మిరెడ్డి కోటేశ్వరరావు, లక్ష్మి సామాన్య రైతు కూలీలు.. పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు.. ఉన్నతాశయంతో నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీటు సాధించాడు.. ఇప్పడు గేట్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 12వ ర్యాంక్తో టాప్ లేపాడు.. ఇదీ మర్రివలస గ్రామానికి చెందిన అమ్మిరెడ్డి అశోక్ విజయ ప్రస్థానం. సామాన్య కుటుంబం నుంచి వచ్చినా మట్టిలో మాణిక్యంలా రాణించాడు. కొత్తకోట హైస్కూల్లో చదివి 10/10 సాధించడంతో నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చింది. ఇప్పుడు జాతీయ స్ధాయిలో నిర్వహించిన గేట్లో కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో 863 మార్కులతో 12వ ర్యాంక్ సాధించాడు. పేద కుటుంబంలో పుట్టి జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించిన అశోక్ను గ్రామ సర్పంచ్ పాత్రుడు, ఎంపీటీసీ సభ్యుడు లోవరాజు, గ్రామ పెద్దలు, యువకులు, ఉపాధ్యాయులు అభినందించారు. -
రైలు ఢీకొని గాయపడిన వ్యక్తి మృతి
పాయకరావుపేట: రైలు ఢీకొని గాయపడిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తుని రైల్వే పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. పట్టణంలోని రాజీవ్ కాలనీ ఎదురుగా ఉన్న రైల్వే గేట్ సమీపాన ఓ వ్యక్తి పట్టాలు దాటుతుండగా ఈనెల 17న రైలు బలంగా ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయమైంది. 108లో తుని ఏరియా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించగా.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడు పసగడుగుల సత్యనారాయణ(55) పి.కొత్తపల్లి గ్రామంగా తెలిసిందన్నారు. డి.పోలవరం గ్రామం వెళ్లేందుకు పట్టాలు దాటుతున్నట్లు తెలిపారు. మృతుడు కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. -
సూపర్ జెయింట్స్ వచ్చేశారు
విశాఖ స్పోర్ట్స్: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో తమ తొలి మ్యాచ్ ఆడేందుకు లక్నో సూపర్ జెయింట్స్(ఎల్ఎస్జీ) జట్టు విశాఖపట్నం చేరుకుంది. శుక్రవారం ప్రత్యేక విమానంలో లక్నో నుంచి జట్టు విశాఖకు వచ్చింది. వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఈ నెల 24వ తేదీ రాత్రి 7.30 గంటలకు ఎల్ఎస్జీ, ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కు కెప్టెన్గా వ్యవహరించిన రిషబ్ పంత్ విశాఖ స్టేడియంలో రెండు మ్యాచ్లు ఆడాడు. ఈసారి ఎల్ఎస్జీ జట్టుకు రిషబ్ పంత్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. తమ తొలి మ్యాచ్లో విజయం సాధించాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్రాక్టీస్ ప్రారంభించగా, ఎల్ఎస్జీ జట్టు శనివారం రాత్రి ప్రాక్టీస్ చేయనుంది. ఎల్ఎస్జీ జట్టుకు మెంటర్గా జహీర్ ఖాన్, హెడ్ కోచ్గా లాంగర్, సహాయ కోచ్లుగా జాంటీ రోడ్స్, ప్రవీణ్ తంబే, లాన్స్ క్లుసెనర్ వంటి వారు ఉన్నారు. జట్టులో వికెట్ కీపర్లుగా ఆర్యన్, నికోలస్ అందుబాటులో ఉన్నారు. ఆల్రౌండర్లుగా మార్క్రమ్, మార్ష్, షాబాజ్ ఉండగా, బ్యాటింగ్లో ఆయుష్, డేవిడ్ మిల్లర్, సమద్ తమ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. బౌలింగ్లో రవి బిష్ణోయ్, ఆవేష్, ఆకాష్తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్గా సిద్ధార్థ్ లేదా అర్షిన్ ఆడే అవకాశం ఉంది. అయితే మయాంక్, మోషిన్, ఆవేష్ గాయాల కారణంగా జట్టుకు అందుబాటులో ఉండటంపై సందేహాలు ఉన్నాయి. ప్రాక్టీస్ సెషన్ తర్వాత బౌలింగ్ విభాగంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇరు జట్లు గ్రూప్–2లో ఉన్నాయి. గత సీజన్లో ఇరు జట్లు కూడా లీగ్ దశలోనే నిష్క్రమించాయి. రాహుల్ రానట్టేనా? కాగా.. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆటగాడు కె.ఎల్.రాహుల్ ఇంకా విశాఖ చేరుకోలేదు. దీంతో ఆయన విశాఖలో జరిగే రెండు మ్యాచ్లకు అందుబాటులో ఉండటం అనుమానమే.. దీంతో లక్నో సూపర్ జెయింట్స్తో జరిగే తొలి మ్యాచ్లో ఢిల్లీ తరపున ఫెరీరా వికెట్ కీపర్గా బరిలోకి దిగే అవకాశం ఉంది. గత సీజన్లో రాహుల్ లక్నో జట్టుకు కెప్టెన్గా ఉన్నాడు. -
వ్యవసాయ, విద్యా రుణాలకు ప్రాధాన్యం
● డెయిరీ, పౌల్ట్రీ ఉపాధి రంగాలకు ఊతం ● మాంస, కూరగాయల క్లస్టరుగా జిల్లా ● రుణ ప్రణాళిక విడుదల చేసిన కలెక్టర్ తుమ్మపాల: జిల్లాను మాంస, కూరగాయల క్లస్టరుగా ప్రకటించినందున బ్యాంకులు వ్యవసాయ, డెయిరీ, పౌల్ట్రీ ఉపాధి రంగాలకు లక్ష్యాలకు మించి రుణాలు అందించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ (డీసీసీ), డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ (డీఎల్ఆర్సీ) త్రైమాసిక సమావేశం జరిగింది. 2025–26 పొటెన్షియల్ లింక్డ్ కార్యాచరణ ప్రణాళిక పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే సంవత్సరానికి 17 శాతం వృద్ధి రావాలని, అందుకు అనుగుణంగా యూనిట్లు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. గిరిజన ప్రాంతాలలో పశువులు, గొర్రెలు, నాటుకోళ్ల పెంపకం, మైదాన ప్రాంతంలో కూరగాయలు పెంపకం జరిగే విధంగా ప్రణాళిక వేసి, యూనిట్లు స్థాపించాలన్నారు. మాంస ఉత్పత్తుల యూనిట్లు, కూరగాయలు ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వ కేంద్రాలకు విరివిగా రుణాలు అందించాలన్నారు. పంటకోత అనంతరం నష్టాలు తగ్గించాలని తెలిపారు. ఉన్నత విద్యను అభ్యసించడానికి విద్యారుణాలు అందించాలని, రుణ మేళాలు, కళాశాలలలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలన్నారు. తోటలు, కూరగాయలు, పశు సంవర్ధక, డెయిరీ, మత్స్య పరిశ్రమలలో కాలానుగుణంగా ఉత్పత్తి సాధించే రంగాలకు ఆర్ధిక చేయూతనివ్వాలన్నారు. ఆయా శాఖల అధికారులు, బ్యాంకు అధికారులు సమన్వయంతో వ్యవసాయ, అనుబంధ రంగ రైతులను ప్రోత్సహించాలన్నారు. కౌలు రైతులకు కూడా వ్యవసాయ రుణాలు అందించాలని, ఈ క్రాప్ ఆధారంగా వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలని, వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలు అందించాలని తెలిపారు. జిల్లాలో ఉత్పత్తి అవుతున్న వస్తువులకు బ్రాండింగ్, మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని తెలిపారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ సత్యనారాయణ గత సమావేశంలో చర్చించిన విషయాలపై తీసుకున్న చర్యలను, రుణ ప్రణాళిక అమలు నివేదికను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ హెడ్ పి.నరేష్, ఆర్బీఐ ఎంజీఆర్ఎల్డీ ఒ.రాజేష్ కుమార్ కుంద్, నాబార్డ్ డీడీఎం సమంత్ కుమార్, డైరెక్టర్ ఎస్బీఐ బి.విజయకుమార్, డీఆర్డీఏ పీడీ కె.శచీదేవి, జిల్లా వ్యవసాయ అధికారి బి.మోహనరావు, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డా.బి.రామమోహనరావు, ఉద్యానవన శాఖ అధికారి జి.ప్రభాకర్రావు, ఇతర బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ పి–4 సర్వేకు సంబంధించి జిల్లా అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. జిల్లాలో సర్వే 99.86 శాతం పూర్తయిందని తెలిపారు. -
ముషిడిపల్లిలో టాస్క్ఫోర్స్ బృందం తనిఖీలు
ముషిడిపల్లిలో వైద్య సేవలపై ఆరా తీస్తున్న జిల్లా టాస్క్ఫోర్స్ సభ్యులు దేవరాపల్లి: ముషిడిపల్లి గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖ జిల్లా టాస్క్ఫోర్స్ బృందం శుక్రవారం పర్యటించింది. నలుగురు సభ్యులతో కూడిన జిల్లా టాస్క్ఫోర్స్ బృందం ముందుగా ఆయూష్ ఆరోగ్య మందిర్ (విలేజ్ హెల్త్ క్లినిక్)ను సందర్శించింది. డీపీఎంవో డా.ప్రశాంతి, డీపీవో జగదీష్, ఎస్వో రామచంద్ర, డేటా మేనేజర్ జనార్దన్ తదితర జిల్లా టాస్క్ఫోర్స్ బృందం సభ్యులు అక్కడ పలు రికార్డులను తనిఖీ చేశారు. స్థానికంగా అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం స్థానిక ప్రజలకు, విద్యార్థులకు అందించిన వైద్య సేవలను, యాప్లో నమోదు చేసిన వివరాలను సరిపోల్చి చూశారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి రోగుల ఇంటికి వెళ్లి కలిసి వైద్య సేవలు అందాయా లేదా అని ఆరా తీశారు. స్థానిక పీహెచ్సీ వైద్యాధికారి ఇ.పూజ్య మేఘన తదితర ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్పీలు, వైద్య సిబ్బంది ఉన్నారు. -
పట్టుబడిన మద్యం ధ్వంసం
మాడుగులలో గీత కార్మిక షాపు తనిఖీ చేస్తున్న ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రాజశేఖర్, తదితరులు మాడుగుల: వివిధ కేసుల్లో పట్టుబడిన మద్యం సీసాలను ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎం.రాజశేఖర్ ఆధ్వర్యంలో శుక్రవారం ధ్వంసం చేశామని స్థానిక ఎకై ్సజ్ సీఐ ప్రసాద్ తెలిపారు. అంతకు ముందు గీత కులాలకు కేటాయించిన మద్యం షాపులు నిబంధనలు ప్రకారం ఉన్నాయా? లేదా? అని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీఐ ప్రసాద్ మాట్లాడుతూ 22 ఐడీ కేసుల్లో పట్టుబడిన 144.25 లీటర్లు, ఐఎంఎల్ 26 కేసుల్లో 47.7 లీటర్లు, ఎన్డీపీఎల్ కేసులో పట్టుబడిన 7.44 లీటర్ల మద్యాన్ని ధ్వంసం చేశామన్నారు. -
రక్షణ చట్టం కోసం లాయర్ల నిరసన
అనకాపల్లి టౌన్: న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ఆమోదించాలని ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్, ఏపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఏపీ ఆదివాసీ సంఘం గౌరవ సలహాదారు పి.ఎస్.అజయ్ కుమార్ అన్నారు. స్ధానిక మెయిన్రోడ్ న్యాయస్ధానాల సముదాయం వద్ద తమ డిమాండ్లు ఆమోదించాలని శుక్రవారం పలువురు లాయర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల చట్టాన్ని దేశంలో అన్ని రాష్ట్రాల్లో తీసుకురావాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. 2022 జూలై నెలలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యాయవాదుల రక్షణ బిల్లు ముసాయిదాను తయారుచేసి రాష్ట్రాల్లోని అన్ని ప్రభుత్వాలకు పంపించిందన్నారు. ఈ ముసాయిదా బిల్లు ఆధారం చేసుకొని రాజస్ధాన్, కర్ణాటక రాష్ట్రాలు ఇప్పటికే చట్టాలు రూపొందించాయని, ఏపీ శాసనసభలో కూడా వెంటనే చట్టంగా మార్చాలని అన్నారు. సీనియర్ న్యాయవాది ఐఆర్ గంగాధర్, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు శేఖరమంత్రి సాయి లక్షణ్రావులు మాట్లాడుతూ దళిత బహుజన సామాజిక వర్గాలు, ఆదివాసీలు, మహిళల నుంచి న్యాయవాద వృత్తిలోకి వస్తున్న వారు తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నారని ఈ రక్షణ చట్టం వారి సమస్యలను పరిష్కరిస్తుందన్నారు. -
కరుణ కురిసింది..
మూగజీవులకు నీరు దొరికింది ఈ కాంక్రీట్ జంగిల్లో పక్కనున్న మనుషుల గురించే పట్టించుకోరు.. మరి పశు పక్ష్యాదుల గురించి ఆలోచించేదెవరు? వేసవిలో మూగజీవుల దాహార్తి ఎలా తీరుతుంది.. వాటికి నీటిని అందుబాటులో ఉంచితే ఎంతో బాగుంటుంది కదా.. ఈ ఆలోచనలను బాలల్లో రేకెత్తించేలా ఈనెల 22న ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకొని కె.కోటపాడులోని ఒక ప్రైవేట్ పాఠశాల వినూత్న కార్యక్రమం నిర్వహించింది. తమ విద్యార్థులతో శుక్రవారం పాఠశాల ఆవరణలో పక్షులకు ప్రత్యేకమైన పాత్రలలో నీటిని ఏర్పాటు చేయించారు. పశువులు, శునకాల దాహర్తిని తీర్చేందుకు తొట్టెలలో నీటిని అందుబాటులో ఉంచారు. చేపలకు నీటి వనరుల ప్రధాన అవసరాన్ని వివరించేందుకు.. నీటితో నింపిన ట్రేలలో చేపలను వేసి అయ్యన్న విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ ఎస్.కె.ఖాసిమ్ విద్యార్థులకు చూపించారు. మనకు ఎంతో మేలు చేసే మొక్కలు బతకడానికి నీరు ఎంత అవసరమో ఆచరణాత్మకంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. వరల్డ్ వాటర్ డేను పురస్కరించుకొని ఐక్యరాజ్యసమితి ప్రకటించిన గ్రేసియర్ ప్రిజర్వేషన్ థీమ్కు తగ్గట్టుగా విద్యార్థి గీసిన చిత్రం తోటి విద్యార్థులను ఆకట్టుకుంది. – కె.కోటపాడుపశువులకు తొట్టెలలో నీటిని అందిస్తున్న చిన్నారులు -
కదం తొక్కిన చెరకు రైతులు
● గోవాడ ఫ్యాక్టరీ గేటు ముందు బీఎన్ రోడ్డుపై రాస్తారోకో ● కూటమి ప్రభుత్వం తమను విస్మరించిందని ఆగ్రహం ● బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ ● పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తతచోడవరం: గోవాడ సుగర్ ఫ్యాక్టరీ వద్ద చెరకు రైతులు కదం తొక్కారు. కూటమి ప్రభుత్వం ఫ్యాక్టరీని, చెరకు రైతులను పూర్తిగా విస్మరించిందంటూ శుక్రవారం ఆందోళన చేశారు. ఒక దశలో ఈ ఆందోళన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. యాజమాన్యంపై రైతులు తిరుగుబాటుకు దిగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని సముదాయించారు. బీఎన్ రోడ్డుపై చోడవరం–అనకాపల్లి రోడ్డులో ఫ్యాక్టరీ గేటు వద్ద రైతులు రాస్తారోకో చేశారు. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. అనకాపల్లి, విశాఖపట్నం, చోడవరం, పాడేరు, మాడుగుల ప్రాంతాలకు ఇదే ప్రధాన రహదారి కావడంతో రోడ్డుకు ఇరుపక్కలా పెద్దసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఏపీ చెరకు రైతు సంఘం, ఏపీ రైతుసంఘం, ఏపీ రైతు కూలీసంఘం, ఏపీ వ్యవసాయ రైతు కూలీసంఘం, సీఐటీయూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ మహాధర్నాను నిర్వహించారు. సీఐ అప్పలరాజు తన సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందుగా గేటు వద్ద టెంటు వేసి ధర్నా చేశారు. అనంతరం బీఎన్రోడ్డుపై రాస్తారోకోకు దిగారు. ప్రభుత్వం వెంటనే చెరకు బకాయిలు చెల్లించాలని, ఫ్యాక్టరీకి రూ.9 కోట్లు తక్షణ సాయంగా అందించాలని, ఆధునికీకరణకు రూ.35 కోట్లు మంజూరు చేయాలని, ఈ ఏడాది చెరకు బకాయిలు వెంటనే చెల్లించాలని నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వం చెరకు రైతులను మోసం చేసిందని, ఫ్యాక్టరీని ఆదుకోవడంతోపాటు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పి 9 నెలలు దాటినా, క్రషింగ్ సీజన్ ముగుస్తున్నా నేటికి ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదని రైతు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతన్నారు.. ఇంతన్నారు.. స్థానిక ఎంపీ సీఎం రమేష్ కేంద్రంలో ఎంతో పలుకుబడి ఉందని గొప్పలు చెప్పడం కాదని, ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెరకు రైతులు డిమాండ్ చేశారు. చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు ఫ్యాక్టరీ ఇబ్బందులను, చెరకు రైతుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి కనీస సాయం కూడా తేలేకపోయారని, దీనివల్ల ఫ్యాక్టరీ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి పాత మిషనరీతో తరుచూ ఆగిపోతూ రైతులకు ఇబ్బందులకు గురి చేస్తోందని ధ్వజమెత్తారు. ఫ్యాక్టరీ ఎండీని కలిసేందుకు రైతులంతా ఒక్కసారిగా ఫ్యాక్టరీలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు గేట్లు వేసి వారిని ఆపడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో పోలీసులు, రైతు సంఘాల నాయకుల మధ్య కొంతసేపు వాగ్వివాదం జరిగింది. పరిస్థితి అదుపు తప్పేలా ఉండటంతో రైతులను ఫ్యాక్టరీ పరిపాలన భవనం వరకు అనుమతించారు. అక్కడకు ఎండీ సన్యాసినాయుడు వచ్చి రైతులతో మాట్లాడారు. ఆయనకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఇచ్చారు. ఈనెలాఖరులోగా ఈ ఏడాది చెరకు సరఫరా చేసిన రైతులకు టన్నుకు రూ. 3 వేల చొప్పున మొదటి పేమెంట్స్ ఇస్తామని, ఫ్యాక్టరీ ఆధునికీకరణ విషయం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని, పాతబకాయిలు కూడా త్వరలో చెలించేందుకు చర్యలు తీసుకుంటామని ఎండీ చెప్పారు. దీనితో రైతులు శాంతించి మహాధర్నాను విరమించారు. ఈ ఆందోళనలో ఏపీ చెరకు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ, సీఐటీయూ నాయకులు గూనూరు వరలక్ష్మి, ఎస్వీనాయుడు, సీపీఐ నాయకుడు రెడ్డిపల్లి అప్పలరాజు, వ్యవసాయ కార్మిక సంఘం, వ్యవసాయ కూలీ సంఘాల నాయకులు డి.వెంకన్న, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
బాలకార్మికులతో పనిచేయిస్తే కేసులు
● ఘాట్రోడ్డు జంక్షన్లో రెండు దుకాణాల్లో తనిఖీలు మాడుగుల రూరల్ : బాల కార్మికులతో పనులు చేయిస్తే అటువంటి యజమానులపై కేసులు నమోదు చేస్తామని, చోడవరం సహయ కార్మిక అధికారి పి. సూర్యనారాయణ అన్నారు. ఘాట్రోడ్డు జంక్షన్లో గల దుకాణాలను గురువారం తనిఖీ చేశారు. శ్రీ విజయలక్ష్మి ఇంజినీరింగ్ వర్కుషాపులో పనిచేస్తున్న బాలకార్మికుడు, క్రేజి జ్యూస్ సెంటర్లో పనిచేస్తున్న మరో బాలకార్మికుడిని ఈ తనిఖీల్లో గుర్తించారు. వారికి తక్కువ జీతం ఇస్తున్నట్టు తెలుసుకున్నారు. కనీస వేతనాల చట్టం 1948 కింద పై అధికారి వద్ద క్లయిమ్లకు దాఖలు చేస్తామని, 18 సంవత్సరాలు వయస్సు నిండని బాలలు చేత పని చేయించడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. -
అధికలోడుతో బండరాళ్ల రవాణా
● లారీని అడ్డుకున్న గ్రామస్తులుమునగపాక : ఒకవైపు భారీ వాహనాల రాకపోకలు సాగించొద్దంటూ అధికారులు చెబుతున్నా ఇవేమీ తమకు పట్టనట్లు లారీ యజమానులు వ్యవహరించడం విమర్శలకు తావిస్తుంది. ఒకవైపు పోలీసు ఉన్నతాధికారులు అధికలోడుతో వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా కొంతమంది లారీ డ్రైవర్లు అధికలోడుతో లారీలు నడుపుతున్నారు. గురువారం సాయంత్రం అనకాపల్లి నుంచి రాంబిల్లికి మునగపాక మీదుగా అధికలోడుతో బండరాళ్లతో వెళుతున్న లారీని స్థానికులు అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా అధికలోడుతో బండరాళ్లను ఎలా తీసుకువె వెళతావంటూ డ్రైవర్ను చుట్టుముట్టారు. భారీ వాహనాల రాకపోకల కారణంగా పలువురు గాయాలపాలవుతున్నా ఎందుకు స్పందించడం లేదంటూ స్థానికులు ముసిలినాయుడు, కొండలరావు తదితరులు డ్రైవర్ను నిలదీశారు. ఇప్పటికై నా లారీ డ్రైవర్లు ప్రభుత్వ నిబందనలను అనుసరించి వాహనాలు తిప్పాలని లేకుంటే సహించేదిలేదని హెచ్చరించారు. -
ఇరువర్గాల మధ్య ఘర్షణ
● ఇద్దరికి తీవ్ర గాయాలురావికమతం : పొలం మధ్యలోని పంటను ట్రాక్టర్తో తొక్కించుకెళ్లి పాడు చేయడంపై రైతుల మధ్య వివాదం తలెత్తి కొట్లాటకు దారితీసింది. ఇరు వర్గాలకు చెందిన రైతులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. రావికమతం ఎస్ఐ రఘువర్మ తెలిపిన వివరాలివి. మేడివాడకు చెందిన కేశంశెట్టి గణేష్, సీతిన చిరంజీవికి చెందిన వ్యవసాయ భూములు పక్కపక్కనే ఉన్నాయి. గురువారం సీతిన చిరంజీవికి చెందిన ట్రాక్టర్ను కేశంశెట్టి గణేష్ పొలంలోంచి తీసుకెళ్లి దాంట్లోని పంటను పాడు చేయడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సీతిన చిరంజీవి, సీతిన సంజీవి, సీతిన శ్రీను కర్రలు, కత్తులతో గణేష్, అతడి సోదరుడు శేషుబాబుపై దాడి చేశారు. ఈ దాడిలో గణేష్, శేషుబాబు తలపై బలమైన గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరినీ రావికమతం పీహెచ్సీకి తరలించి వైద్యం అందించారు. చిరంజీవి, అతని సోదరులుకు స్వల్ప గాయాలయ్యాయి. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ రఘువర్మ తెలిపారు. -
ఆల్ ఇండియా టోర్నమెంట్కు డిగ్రీ కాలేజీ విద్యార్థి
విద్యార్థి సోమేశ్వరరావును అభినందిస్తున్న ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.రాజు, అధ్యాపకులు నర్సీపట్నం : ఆంధ్ర యూనివర్శిటీలో బుధవారం జరిగిన యూనివర్శిటీ బేస్బాల్ సెలక్షన్లో యూనివర్శిటీ జట్టుకు నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ థర్డ్ ఇయర్ చదువుతున్న రావుల సోమేశ్వరరావు సెలెక్ట్ అయ్యాడు. యూనివర్శిటీ టీం తరపున త్వరలో పంజాబ్లో జరగనున్న ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్శిటీ బేస్బాల్ టోర్నమెంట్లో అడనున్నాడు. ఈ సందర్భంగా విద్యార్థి సోమేశ్వరరావును కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.రాజు, అధ్యాపకులు అభినందించారు. క్రీడల్లో రాణించే విద్యార్థులకు కాలేజీ తరపున అన్ని విధాలా సహకారం అందిస్తామని తెలిపారు. -
ప్రకృతి సేద్యంతో ఆరోగ్యకర ఉత్పత్తులు
తుమ్మపాల : ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులు వినియోగం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారం అందుతుందని జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగం ప్రాజెక్ట్ అధికారి సిహెచ్.లచ్చన్న అన్నారు. పట్టణంలో జీవీఎంసీ వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాచురల్ ఫార్మింగ్ వ్యవసాయ ఉత్పత్తులు, కూరగాయలు, ఆకుకూరలు స్టాల్ను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి ఉత్పత్తులను వినియోగించడం వల్ల ఎటువంటి అనారోగ్యాలకు గురికాకుండా, బీపీ షుగరు గుండుపాటి వంటి వ్యాధులు రాకుండా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి వర్మ, జిల్లా కోఆర్డినేటర్ గోవింద్, మార్కెటింగ్ మాస్టర్ ట్రైనర్ అప్పలరాజు, మోడల్ మేకర్స్, పకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. -
27న దేవరాపల్లి ఎంపీపీ ఎన్నిక
దేవరాపల్లి: దేవరాపల్లి ఎంపీపీ పదవికి ఈ నెల 27న ఎన్నిక నిర్వహించనున్నట్లు స్థానిక ఎంపీడీవో ఎం.వి.సువర్ణరాజు తెలిపారు. ఈ మేరకు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. మండల పరిషత్ అధ్యక్ష పదవి ఎన్నికకు సంబంధించి 23న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. 27న ఉదయం 10 గంటలకు నామినేషన్లు స్వీకరించి, 12 గంటలకు పరిశీలిస్తామన్నారు. ఒంటి గంటలోపు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించి వెంటనే అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. అనంతరం ఒంటి గంటకు ఎన్నిక ప్రక్రియ ప్రారంభించి పూర్తయిన వెంటనే ఫలితాన్ని ప్రకటిస్తామన్నారు. ఇది ఇలా ఉండగా గతేడాది ఏప్రిల్ 15న ఎంపీపీ పదవికి కిలపర్తి రాజేశ్వరి రాజీనామా చేశారు. దీంతో అప్పడు వైస్ ఎంపీపీగా ఉన్న చింతల బుల్లిలక్ష్మీని ఇన్చార్జ్ ఎంపీపీగా ఉన్నతాధికారులు నియమించడంతో ఇప్పటి వరకు ఆమె కొనసాగుతున్నారు. -
పునరావాసం కల్పించి పనులు చేపట్టండి
● బార్క్ పనులు అడ్డుకున్న రావిపాలెం గ్రామస్తులు ● మద్దతు తెలిపిన జెడ్పీటీసీ కో–ఆప్షన్ సభ్యుడు కుమార్ అచ్యుతాపురం రూరల్ : రావిపాలెంభూముల్లో తలపెట్టిన బార్క్ నిర్మాణ పనులను గురువారం గ్రామస్తులు అడ్డుకున్నారు. తమకు పునరావాసం కల్పించి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతులకు జెడ్పీటీసీ కో–ఆప్షన్ సభ్యుడు నర్మాల కుమార్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రావిపాలెం నిర్వాసిత భూసమస్యలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న తరుణంలో రైతుల భూముల్లో పొక్లెయిన్తో పనులు చేపట్టడం అన్యాయమన్నారు. రావిపాలెం చుట్టూ ఉన్న భూములన్నీ పోతున్నాయని, ఊరు మాత్రమే మిగిలిపోతోందన్నారు. గ్రామం చుట్టూ ప్రహరీ నిర్మించడం వల్ల అన్ని వర్గాల ప్రజలు ఉపాధి కోల్పోతున్నారన్నారు. అధికారులు స్పందించి గ్రామాన్ని తరలించి న్యాయం చేయాలని కోరారు. నేటికీ నష్టపరిహారం, పునరావాసం కల్పించకుండా రావిపాలెం రైతులపై అచ్యుతాపురం డీటీ దౌర్జన్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కలెక్టర్ స్పందించి రావిపాలెంలో గ్రామసభ నిర్వహించి సమస్యలపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. -
బాలకార్మికులతో పనిచేయిస్తే కేసులు
● ఘాట్రోడ్డు జంక్షన్లో రెండు దుకాణాల్లో తనిఖీలు మాడుగుల రూరల్ : బాల కార్మికులతో పనులు చేయిస్తే అటువంటి యజమానులపై కేసులు నమోదు చేస్తామని, చోడవరం సహయ కార్మిక అధికారి పి. సూర్యనారాయణ అన్నారు. ఘాట్రోడ్డు జంక్షన్లో గల దుకాణాలను గురువారం తనిఖీ చేశారు. శ్రీ విజయలక్ష్మి ఇంజినీరింగ్ వర్కుషాపులో పనిచేస్తున్న బాలకార్మికుడు, క్రేజి జ్యూస్ సెంటర్లో పనిచేస్తున్న మరో బాలకార్మికుడిని ఈ తనిఖీల్లో గుర్తించారు. వారికి తక్కువ జీతం ఇస్తున్నట్టు తెలుసుకున్నారు. కనీస వేతనాల చట్టం 1948 కింద పై అధికారి వద్ద క్లయిమ్లకు దాఖలు చేస్తామని, 18 సంవత్సరాలు వయస్సు నిండని బాలలు చేత పని చేయించడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. -
కట్టుకున్న వాడే.. కాలయముడు
● వీడిన ట్రాన్స్జెండర్ హత్య కేసు మిస్టరీ ● అనుమానం, రెండో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఘాతుకంకశింకోట: కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా చంపాడో భర్త. విషయం బయటపడితే జైలుకెళ్లాల్సి వస్తుందని భయపడి మృతదేహాన్ని మూడు ముక్కలుగా కత్తితో కోసి వేర్వేరు చోట్ల పడేశాడు. మీడియాలో వార్తలు రావడంతో పాటు హిజ్రాలు అందించిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. కశింకోట పోలీసు స్టేషన్లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండకు చెందిన బండి దుర్గాప్రసాద్ అలియాస్ బన్నీ(35) నాలుగేళ్ల కిందట అనకాపల్లికి చెందిన ట్రాన్స్జెండర్ దీపు అలియాస్ దిలీప్కుమార్(35)ను ఆలయంలో వివాహం చేసుకొని మునగపాక మండలం నాగులాపల్లిలో అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో దీపు ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆమె ఆభరణాలు కాజేయాలని నిందితుడు భావించాడు. అంతే కాకుండా రెండో వివాహం చేసుకోవాలని యోచించాడు. అందుకు దీపు అడ్డు పడింది. నాలుగైదు రోజులుగా ఈ విషయమై ఇద్దరూ ఘర్షణ పడుతున్నారు. దీంతో దీపును అడ్డు తొలగించుకోవాలని బన్నీ పన్నాగం పన్నాడు. హత్య చేయాలని కత్తి కూడా తెచ్చుకుని సిద్ధం చేసుకున్నాడు. ఈ నెల 17న గొడవ జరగడంతో మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో తువ్వాలుతో ఆమె పీక నులిమి హత్య చేశాడు. మృతదేహాన్ని ముక్కలు చేసి.. హత్య వార్త బయటకు పొక్కకుండా, ఆనవాళ్లు బయట పడకుండా దీపు మృతదేహాన్ని బన్నీ బాత్ రూంలోకి తీసుకెళ్లి మూడు భాగాలుగా క్రూరంగా కత్తితో కోశాడు. వాటిని అదే రోజు రాత్రి ఒక్కొక్క చోట పడేశాడు. కుడి చేయి, నడుం కింద భాగాన్ని దుప్పట్లో చుట్టి దర్జాగా స్కూటీలో తీసుకెళ్లి మండలంలోని బయ్యవరం వద్ద జాతీయ రహదారి వంతెన కింద పడవేసి వెళ్లిపోయాడు. అలాగే బులెట్పై తల భాగాన్ని సంచిలో ఉంచి అనకాపల్లి డైట్ కళాశాల సమీపంలోని కాలువలో పడేశాడు. తాళ్లపాలెంలో జాతీయ రహదారి వంతెన కింద గెడ్డలో మొండెం భాగాన్ని సంచిలో వేసి బుల్లెట్పై తీసుకెళ్లి పడవేశాడు. ముందుగా బయ్యవరంలో ట్రాన్స్జెండర్ నడుం దిగువ భాగాలు, కుడి చేయి లభ్యం కావడంతో హత్య సంఘటన వెలుగు చూసింది. అవి మహిళ శరీర భాగాలుగా గుర్తించి హత్య కేసు నమోదు చేసి 8 ప్రత్యేక బృందాలను నియమించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ట్రాన్స్జెండర్ ధరించిన ఆభరణాలు, గుర్తులతో పత్రికలు, మీడియాలో కథనాలు రావడంతో వాటిని చూసిన అనకాపల్లిలోని హిజ్రాలు పోలీసులకు మృతిరాలి ఆచూకి గురించి సమాచారం అందించారు. దీంతో పోలీసులు హత్యకు గురైనది ట్రాన్స్జెండర్ దీపుగా నిర్ధారించారు. అనకాపల్లి, తాళ్లపాలెం వద్ద పడవేసిన మృతదేహం మిగిలిన భాగాలను గుర్తించి అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. 8 పోలీస్ ప్రత్యేక బృందాలతో నిర్వహించిన విచారణలో హంతకుడు బన్నీగా గుర్తించారు. నిందితుడు పరారు కావడానికి ప్రయత్నించగా బుధవారం రాత్రి మండలంలోని విసన్నపేట గ్రామం వద్ద అరెస్ట్ చేశారు. నిందితుడికి ఫాస్ట్ ట్రాక్ కోర్డులో శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ఈ కేసు విషయంలో మరి ఎవరి ప్రమేయం ఉందా? లేదా? అనే విషయమై మున్ముందు దర్యాప్తులో తేలాల్సి ఉందన్నారు. ప్రస్తుతానికి బన్నీయే హత్య చేసినట్లు విచారణలో వెల్లడైందన్నారు. 24 గంటల్లోగా నిందితున్ని అరెస్ట్ చేశామన్నారు. ఈ సంఘటనలో మృతి చెందిన ట్రాన్స్జెండర్ కుటుంబానికి సహాయం అందించడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ ఘటనలో వాడిన బుల్లెట్, కత్తి, మృతురాలితో పాటు నిందితుడిని సెల్ఫోన్లు, సంఘటన స్థలంలో నిందితుడి నగదు, వస్త్రాలు, మృతురాలి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు మిస్టరీని త్వరితగతిన ఛేదించిన డీఎస్పీ ఎం.శ్రావణి, సీఐ అల్లు స్వామినాయుడు, ఎస్ఐలు మనోజ్కుమార్, లక్ష్మణరావు, ఇతర సిబ్బందిని ఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు. -
క్యాష్ కొట్టు.. స్టాఫ్ నర్స్ పోస్టు పట్టు
● నర్సింగ్ పోస్టులకు కూటమి నాయకుల బేరాలు ● పోస్టుకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూళ్లు ● రెండు రోజుల్లో మెరిట్ జాబితా.. 31లోగా తుది జాబితా మహారాణిపేట: స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీలో పైరవీలు జోరందుకున్నాయి. ఈ పోస్టులను కూటమి నేతలు ఆదాయ వనరుగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వంత పాడుతూ పైరవీలకు తెరతీస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ అనుకూలురికి పోస్టులు కట్టబెట్టేందుకు వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ డైరెక్టర్(ఆర్డీ) మీద తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వైపు సిఫార్సుల లేఖలు, మరో వైపు ప్రజాప్రతినిధులు, వారి పీఏలు ఫోన్లు మీద ఫోన్లతో ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. బేరసారాలు : ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల్లో 106 స్టాఫ్ నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని ఏడాది కాలానికి కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. 8,309 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో పోస్టుకు 88 మంది చొప్పున పోటీ నెలకొనడంతో కూటమి నేతల పంట పండినట్లయింది. ఒక్కో పోస్టు కోసం రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. వైద్య ఆరోగ్యశాఖ ఆర్డీ ఆధ్వర్యంలో ప్రొవిజినల్ జాబితా మీద వచ్చిన 1,530 అభ్యంతరాల వడపోత కార్యక్రమం జరుగుతోంది. రెండు రోజుల్లో మెరిట్ జాబితా వెల్లడికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 31 లోపు రోస్టర్ ప్రకారం పోస్టులను భర్తీ చేయాలని అధికారులు కసరత్తు చేపట్టారు. రంగంలోకి దళారులు : మరోవైపు దళారులు కూడా రంగంలోకి దిగారు. దరఖాస్తుదారుల్ని మాయ మాటలు చెప్పి నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే సిఫార్సు లేఖ ఇవ్వడంతోపాటు, కార్యాలయ సిబ్బందితో బేరాలకు దిగుతున్నారు. కార్యాలయంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. వారి ద్వారా పోస్టులకు ధర నిర్ణయిస్తున్నారు. వీరు కూడా పోస్టుకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులోనూ అడ్వాన్స్ ముడుపులిచ్చేవారికే పోస్టింగ్ అంటూ నమ్మబలుకుతున్నారట. దళారులను నమ్మొద్దు పోస్టుల భర్తీ మెరిట్ ప్రకారమే జరుగుతుంది. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు. అర్హత ప్రమాణాలు, మెరిట్, రోస్టర్ ప్రకారం ప్రాథమిక ఎంపిక జాబితా సిద్ధం చేస్తున్నాం. దీనిపై కూడా అభ్యంతరాలు స్వీకరించి, వాటిని పరిష్కరించాకే తుది ఎంపిక జాబితాను వెల్లడిస్తాం. – డాక్టర్ రాధారాణి, ఆర్డీ, వైద్య ఆరోగ్యశాఖ -
అధికలోడుతో బండరాళ్ల రవాణా
● లారీని అడ్డుకున్న గ్రామస్తులుమునగపాక : ఒకవైపు భారీ వాహనాల రాకపోకలు సాగించొద్దంటూ అధికారులు చెబుతున్నా ఇవేమీ తమకు పట్టనట్లు లారీ యజమానులు వ్యవహరించడం విమర్శలకు తావిస్తుంది. ఒకవైపు పోలీసు ఉన్నతాధికారులు అధికలోడుతో వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా కొంతమంది లారీ డ్రైవర్లు అధికలోడుతో లారీలు నడుపుతున్నారు. గురువారం సాయంత్రం అనకాపల్లి నుంచి రాంబిల్లికి మునగపాక మీదుగా అధికలోడుతో బండరాళ్లతో వెళుతున్న లారీని స్థానికులు అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా అధికలోడుతో బండరాళ్లను ఎలా తీసుకువె వెళతావంటూ డ్రైవర్ను చుట్టుముట్టారు. భారీ వాహనాల రాకపోకల కారణంగా పలువురు గాయాలపాలవుతున్నా ఎందుకు స్పందించడం లేదంటూ స్థానికులు ముసిలినాయుడు, కొండలరావు తదితరులు డ్రైవర్ను నిలదీశారు. ఇప్పటికై నా లారీ డ్రైవర్లు ప్రభుత్వ నిబందనలను అనుసరించి వాహనాలు తిప్పాలని లేకుంటే సహించేదిలేదని హెచ్చరించారు. -
ఓటరు జాబితాలో అభ్యంతరాలు ఉంటే తెలపండి
● రాజకీయపార్టీలతో డీఆర్వో సమావేశం తుమ్మపాల : ఓటరు జాబితాలో సమస్యలు, అభ్యంతరాలు ఉంటే బూత్ లెవెల్ అధికారికి గాని, అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారికి గాని, ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారికి తెలియజేయాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు జిల్లా రెవెన్యూ అధికారి వై. సూర్యనారాయణరావు సూచించారు. గురువారం ఆయన చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల నేతలతో ఓటరు జాబితాల సవరణలో భాగంగా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు జాబితాలో అసెంబ్లీ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలు, అభ్యంతరాలు, ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు నిరంతర ప్రక్రియ కానుక రాజకీయ పార్టీల ప్రతినిధులు జాబితాను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలన్నారు. ఓటరు జాబితాలోని సమస్యలను ఎన్నికల కమిషన్న్ దృష్టికి తీసుకువెళ్లాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని. ఎన్నికల ప్రక్రియను బలోపేతం చేసేందుకు, పరస్పర అనుకూలమైన సలహాలు, సూచనలు అందించేందుకు రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించిందన్నారు. ఎన్నికల సంఘం కల్పించిన ఈ అవకాశాన్ని రాజకీయ పార్టీలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. బూత్ స్థాయి అధికారుల నియామకం, ఓటరు జాబితాలను నాణ్యతగా తయారు చేసేందుకు, మెరుగుపరిచేందుకు మరింత మంది బూత్ స్థాయి అధికారులు, ఎలక్టోరల్ అధికారుల నియామకానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ఎస్.ఎస్.వి.నాయుడు, రాజకీయ పార్టీల నాయకులు బొలిశెట్టి శ్రీనివాసరావు, కె.ఎం.నాయుడు, వి.వి.సంతోష్ కుమార్, గంట శ్రీరాము, మీసాల సుబ్బన్న, మల్లపాటి కోటేశ్వరరావు, హరినాథబాబు పాల్గొన్నారు. -
ఇరువర్గాల మధ్య ఘర్షణ
● ఇద్దరికి తీవ్ర గాయాలురావికమతం : పొలం మధ్యలోని పంటను ట్రాక్టర్తో తొక్కించుకెళ్లి పాడు చేయడంపై రైతుల మధ్య వివాదం తలెత్తి కొట్లాటకు దారితీసింది. ఇరు వర్గాలకు చెందిన రైతులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. రావికమతం ఎస్ఐ రఘువర్మ తెలిపిన వివరాలివి. మేడివాడకు చెందిన కేశంశెట్టి గణేష్, సీతిన చిరంజీవికి చెందిన వ్యవసాయ భూములు పక్కపక్కనే ఉన్నాయి. గురువారం సీతిన చిరంజీవికి చెందిన ట్రాక్టర్ను కేశంశెట్టి గణేష్ పొలంలోంచి తీసుకెళ్లి దాంట్లోని పంటను పాడు చేయడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సీతిన చిరంజీవి, సీతిన సంజీవి, సీతిన శ్రీను కర్రలు, కత్తులతో గణేష్, అతడి సోదరుడు శేషుబాబుపై దాడి చేశారు. ఈ దాడిలో గణేష్, శేషుబాబు తలపై బలమైన గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరినీ రావికమతం పీహెచ్సీకి తరలించి వైద్యం అందించారు. చిరంజీవి, అతని సోదరులుకు స్వల్ప గాయాలయ్యాయి. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ రఘువర్మ తెలిపారు. -
కల్లుపాకల వద్ద వ్యక్తి మృతి
పాత గొడవలతో వ్యక్తిపై కత్తితో దాడి మునగపాక : మండలంలోని గొల్లలపాలెంలో గురువారం రాత్రి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామానికి చెందిన పక్కుర్తి నూకరాజుకు అదే గ్రామానికి చెందిన శీరా తాతబాబుకు గతంలో పాత గొడవలు ఉండేవి. దీనిలో భాగంగా గురువారం రాత్రి ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో పక్కనే ఉన్న కల్లుగీత కార్మికునికి చెందిన కత్తితో తాతబాబుపై నూకరాజు దాడి చేశాడు. ఈ సంఘటనలో తాతబాబుకు తీవ్రగాయాలు కావడంతో అతనిని అనకాపల్లి వందపడకల ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన నూకరాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ మేరకు హత్యాయత్నం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఐఐఎంవీలో నూరుశాతం ప్లేస్మెంట్స్
తగరపువలస: ఐఐఎంవీ 2024–2026 బ్యాచ్ నూరుశాతం నియామకాలతో వేసవిని విజయవంతంగా ముగించినట్టు ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ ఎం.చంద్రశేఖర్ మాట్లాడుతూ గత రికార్డులు అధిగమించి విద్యార్థులకు ఏమి అవసరమో అదే బోధించబడుతుందన్నారు. ఇందుకు తమ అధ్యాపకులు అభినందనీయులన్నారు. దేశంలోని ప్రముఖ రిక్రూటర్లు తమ విద్యార్థుల సామర్ాధ్యలను గుర్తించడం తమకు గర్వకారణమన్నారు. వేసవి ప్లేస్మెంట్ ప్రక్రియలో 344 మంది విద్యార్థులు పాల్గొన్నారన్నారు. 130 మంది రిక్రూటర్లు తమ నియామక జాబితాలో చేరారన్నారు. వీరిలో 77 మంది కొత్తగా తమతో భాగస్వామ్యం పొందారన్నారు. కెరీర్ డెవలప్మెంట్ సర్వీసెస్ చైర్పర్సన్ దీపికాగుప్తా మాట్లాడుతూ ప్రపంచ వాతావరణంలో కొనసాగుతున్న అనిశ్చితి, సందిగ్ధత కారణంగా ఈ వేసవి ఆందోళన కలిగించినా అంచనాలు అధిగమించి నూరు శాతం ఫలితాలు సాధించామన్నారు. గత ఏడాదితో పోలిస్తే స్లయిఫండ్లో 45.83 శాతం పెరిగిందన్నారు. -
వైఎస్సార్ పేరు తొలగింపులో
● క్రికెట్ స్టేడియం వద్ద వైఎస్సార్ సీపీ ధర్నా ● ఏసీఏ 48 గంటల్లో సమాధానం చెప్పాలని డిమాండ్సాక్షి, విశాఖపట్నం : పీఎంపాలెంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును తొలగించేందుకు చేస్తున్న కుట్రను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. స్టేడియం ఆధునీకరణ పనుల్లో భాగంగా ఏర్పాటుచేసిన ఎంట్రన్స్ ఆర్చ్పై వైఎస్సార్ పేరు తొలగింపునకు నిరసిస్తూ గురువారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. తొలుత మేయర్ గొలగాని హరివెంకటకుమారి, జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, అరకు మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, మాజీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్పొరేటర్లతో కలిసి ఆయన స్టేడియం వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నల్ల రిబ్బన్లతో ఆందోళన చేశారు. అక్కడ ఆయన మాట్లాడుతూ మహానేత వైఎస్సార్ ఆనవాళ్లను తుడిచేయాలని సీఎం చంద్రబాబు అనుకోవడం ఆయన అవివేకానికి నిదర్శనమని మండిపడ్డారు. 2009 సెప్టెంబర్ 14న అప్పటి ఏసీఏ అధ్యక్షుడు గోకరాజు గంగారాజు ఆధ్వర్యంలో ఏసీఏ–వీడీసీఏ స్టేడియాన్ని వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంగా మార్చినట్లు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ మార్క్, బ్రాండ్ కనబడకూడదనే కుట్రతోనే పేరును తొలగిస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసిన సీతకొండ వ్యూ పాయింట్కు వైఎస్సార్ పేరు పెడితే దాన్ని తొలగించారని మండిపడ్డారు. విశాఖ ఫిల్మ్నగర్ క్లబ్ లాన్కు వైఎస్సార్ పేరు తొలగించారని, ఇవే కాకుండా ఉమ్మడి విశాఖ జిల్లాలో అనేక చోట్ల వైఎస్సార్ విగ్రహాలు ధ్వంసం చేశారన్నారు. ముఖ్య నాయకులకు బెదిరింపు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద వైఎస్సార్ సీపీ ఆందోళన చేయనున్న నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి నుంచే వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు, కార్పొరేటర్లకు పోలీసులు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. నిరసన కార్యక్రమానికి ఎవరినైనా తీసుకెళ్తే అరెస్ట్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నిరసనలో మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకటరామయ్య, అన్నంరెడ్డి అదీప్రాజ్, కె.భాగ్యలక్ష్మి, శోభా హైమావతి, నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి, డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్, కటుమూరి సతీష్, పార్టీ కార్యాలయ పర్యవేక్షకుడు రవిరెడ్డి, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు బొల్లవరపు జాన్వెస్లీ, పేర్ల విజయచంద్ర, పార్టీ ముఖ్య నాయకులు రొంగలి జగన్నాఽథం, కొండా రాజీవ్గాంధీ, మొల్లి అప్పారావు, వుడా రవి, జహీర్ అహ్మద్, గండి రవి, శోభాస్వాతి రాణి, కార్పొరేటర్లు రెయ్యి వెంకట రమణ, అక్కరమాని పద్మరాము నాయుడు, డౌలపల్లి ఏడుకొండలరావు, కోరుకోడ వెంకట రత్న స్వాతి దాస్, పద్మా రెడ్డి, బిపిన్ కుమార్ జైన్, కె.వి.శశికళ, గుడివాడ అనూష, ఇమ్రాన్, జిల్లా కార్యవర్గం కమిటీ, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు బోని బంగారు నాయుడు, నడింపల్లి కృష్ణంరాజు, చెన్నా జానకీరామ్, మువ్వల సురేష్, ద్రోణంరాజు శ్రీవాస్తవ్, బింగి హరి కిరణ్ రెడ్డి, పల్లా దుర్గారావు, మనలత జాబ్దాస్ (చిన్ని), పేడాడ రమణి కుమారి, వంకాయల మారుతీ ప్రసాద్, పీలా కిరణ్ జగదీష్, రామారెడ్డి, రాయపు అనిల్ కుమార్, లావణ్య చిమట, శెట్టి రోహిణి, పిల్లి సుజాత, పిల్లా సుజాత, అల్లంపల్లి రాజబాబు, మాధవీవర్మ, మజ్జి వెంకట రావు, బంకు సత్య, పోలిరెడ్డి, శ్రీదేవి వర్మ, రాజేశ్వరి, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఏసీసీలో తిష్ట వేసిన టీడీపీ ఎంపీల ఒత్తిడితోనే.. వైఎస్సార్ పేరును ఏసీఏ తొలగించిందా? లేదంటే కూటమి ప్రభుత్వం ఒత్తిడితో తొలగించారా? 48 గంటల్లో సమాధానం చెప్పాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ను డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఏసీఏలో రెండు కీలక పదవుల్లో టీడీపీకి చెందిన ఎంపీలు ఉన్నందునే ఈ దుర్మార్గానికి ఒడిగట్టారనేది స్పష్టంగా అర్థమవుతుందని తెలిపారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం రాజకీయ పదవుల్లో ఉన్నవారు క్రికెట్ అసోసియేషన్లకు బాధ్యత వహించకూడదనేది ఉందని, దానిని కూడా ఉల్లంఘించి టీడీపీ ఎంపీలు ఏసీఏలో తిష్టవేశారన్నారు. -
పన్నుకు ఎగనామం
● రైతుల పేరిట సరకు రవాణా ● చెక్ పోస్టుల్లో కొరవడిన నిఘా నర్సీపట్నం : వ్యవసాయ ఉత్పత్తులు దొడ్డిదారిన సరిహద్దు దాటిస్తున్నారు. వ్యాపారులే రైతుల అవతారమెత్తి సెస్సుకు ఎగనామం పెడుతున్నారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన పంటలకు మార్కెట్ ఫీజుగా వ్యాపారి 1 శాతం చెల్లించాలి. అప్పుడే ఇతర ప్రాంతాలకు తరలించడానికి వీలుంటుంది. రైతుల పేరుతో తీసుకెళ్లే సరుకుకు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. దీంతో రెవెన్యూ సిబ్బంది చేయి తడిపి పంట ధ్రువీకరణ పత్రం తీసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. వరి ధాన్యం, అపరాల పంటలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. పంట ఉత్పత్తులను తరలిస్తున్న వాహనాలను చెక్ పోస్టుల వద్ద పక్కాగా తనిఖీ చేయాలి. వాహనంలో ఎంత విలువైన సరకు ఉందో అంచనా వేయాలి. కానీ తనిఖీ కేంద్రాల వద్ద సిబ్బంది ఇవేవీ పట్టించుకోవడం లేదు. రూ.2 కోట్ల సెస్ వసూళ్లు లక్ష్యం.. నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ నుంచి రూ.2 కోట్లు సెస్సు వసూలు చేయాలనేది లక్ష్యం. దీనిపై సిబ్బంది దృష్టి సారించడం లేదు. మార్కెట్ యార్డు పరిధిలో ఎనిమిది చెక్పోస్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 2024–25 ఆర్ధిక సంవత్సరానికి రూ.2 కోట్లు సెస్సు వసూలు చేయాల్సి ఉంది. ఈ నెల 17 నాటికి రూ. 1.24 కోట్లు ఆదాయం గతేడాది ఇదే సమయానికి రూ.1.56 కోట్ల ఆదాయం వచ్చింది. వీటి నుంచి సెస్సు వసూలు చేయాల్సి ఉండగా రూ.1.24 కోట్లు వసూలు చేయడం గమనార్హం. ఆయా తనిఖీ కేంద్రాల్లో వద్ద సిబ్బంది ఇవేవీ పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. సిబ్బంది కొరత... ఈ విషయమై మార్కెట్ కార్యదర్శి భువనేశ్వరిని వివరణ కోరగా మార్కెట్ పరిధిలో బలిఘట్టం, గన్నవరంమెట్ట, రాజుపేట వద్ద చెక్పోస్టులు ఉన్నాయని, ప్రతి చెక్పోస్టును క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చామని అన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడితే ఊరుకునేదిలేదని చెప్పారు. సిబ్బంది కొరత ఉందని, దొడ్డిదారిన ఉత్పత్తులు తరలింపును ఆరికట్టేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. -
వీఆర్పీగా కొనసాగాలంటే రూ. 5 లక్షలివ్వాలన్నారు...!
● కూటమి నాయకులు నన్ను తొలగించాలని చూస్తున్నారు.. ● పీడీకి మొరపెట్టుకున్న బట్లపూడి వీఆర్పీ లలిత తుమ్మపాల : ఉపాధి హామీ పథకంలో వీఆర్పీగా కొనసాగాలంటే రూ.5 లక్షల మామూళ్లు ఇవ్వాలని కూటమి నాయకులు వత్తిడి చేసి తనను తొలగించాలని చూస్తున్నారని బట్లపూడి వీఆర్పీ లలిత డ్వామా పీడీ పూర్ణిమదేవి, ఏపీడీ మణికుమార్, ఎంపీపీ గొర్లి సూరిబాబు, ఎంపీడీవో నరసింహరావు, ఇతర అధికారులు ముందు మొరపెట్టుకుంది. ఉపాధి హామీ పథకం మండల స్ధాయి సామాజిక తనిఖీ సమావేశం గురువారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన తనిఖీల వివరాలను డీఆర్పీలు బహిరంగంగా చదివి వినిపించారు. బట్లపూడిలో జరిగిన 2023–24 ఉపాధి హామీ పనులపై పలు ఆరోపణలను డీఆర్పీ చదవడంతో పీడీ పూర్ణిమాదేవి వీఆర్పీని ప్రశ్నించారు. దీంతో వీఆర్పీ లలిత సమాధానం చెప్తూ కూటమి నాయకుల వత్తిడితోనే ఉపాధి కూలీలు తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని, కూటమి నాయకులు చెప్పినట్టు చేస్తే తనపై ఎటువంటి ఆరోపణలు లేకుండా చేస్తామన్నారని, వారు అడిగినంత ఇవ్వలేకపోవడంతో తనపై కక్ష కట్టి తొలగించాలని చూస్తున్నారని బహిరంగంగా తెలిపింది. దీంతో పీడీ కల్పించుకుని ఇలాంటి అంశాలు తమ వద్ద ప్రస్తావించవద్దని హెచ్చరించి ఆ గ్రామ అంశాలను ముగించారు. మండలంలో మారేడుపూడి, దిబ్బపాలెం, ఊడేరు పలు గ్రామాల్లో వేతనదారుల మస్తర్ రిజిస్టర్లో దిద్దుబాట్లు చేసినట్టు గుర్తించామన్నారు. గైర్హాజరు వివరాలను హాజరైనట్టు దిద్దుబాట్లు చేశారని, కొన్ని చోట్ల చేసిన పనుల వివరాలపై నోటీస్ బోర్డులు లేవన్నారు. గృహ నిర్మాణాలకు సంబంధించి ఎం.బుక్ లేకుండానే పేమెంట్లు చేసినట్టు గుర్తించామని డీఆర్పీలు చదివి వినిపించారు. రేబాకలో ఉపాధి పనుల వివరాలను డీఆర్పీ చదవడం మొదలు పెట్టిన వెంటనే వీఆర్పీ రమాదేవి కళ్లు తిరిగి సొమ్మసిల్లిపోయింది. మధ్యాహ్నం వరకు జరిగిన సభలో ఏపీఎం సుప్రియతో పాటు పంచాయతీరాజ్ ఏఈ బాలాజీ, పలు శాఖల అధికారులు, సర్పంచ్, ఎంపీటీసీలు, వేతనదారులు పాల్గొన్నారు. -
తియ్యని మాటలు... చెరిగిన బాసలు
● కూటమి పాలకుల నిర్లక్ష్యం..‘గోవాడ’కు శాపం ● నిధులు తెస్తామని ముఖం చాటేసిన ఎంపీ, ఎమ్మెల్యేలు ● ఒక్క రూపాయి కూడా సాయం చేయని కూటమి ప్రభుత్వం ● ఫ్యాక్టరీ మనుగడపై చెరకు రైతులు, కార్మికుల్లో ఆందోళన ● నేడు రైతు సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నా●చక్కెర ఫ్యాక్టరీ చేదైందా..! చోడవరం : గోవాడ సుగర్ ప్యాక్టరీ మనుగడపై రైతులు, కార్మికుల్లో ఆందోళన నెలకొంది. సాయం చేస్తుందనుకున్న ప్రభుత్వం ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా సాయం చేయకపోగా ఫ్యాక్టరీని అభివృద్ధి చేసేస్తామని చెప్పిన కూటమి ఎంపీ, ఎమ్మెల్యేలు, నాయకులు ఫ్యాక్టరీ చుట్టుపక్కలకే కనిపించకుండా పోయారు. ఇంతటి దయనీయ పరిస్థితుల మధ్య మేము ఈ చెరకు పంట వేయలేమంటూ తన పొలంలో సొంతంగా వేసుకున్న చెరకు పంటనే దేవరాపల్లి మండలంలో ఒక రైతు తోటకు నిప్పంటించుకుని తన నిస్సహాయతను వ్యక్తం చేసిన సంఘటనలూ చోటుచేసుకున్నాయి. ఈ పరిిస్థితుల్లో ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు, ప్రభుత్వ నిరంకుశ పాలనను ఎత్తిచూపేందుకు రైతు సంఘాలు ఆందోళన బాట పట్టాయి. దీనిలో భాగంగా ఈనెల 21వ తేదీన శుక్రవారం ఫ్యాక్టరీ వద్ద మహాధర్నాకు రైతన్నలకు పిలుపు నిచ్చాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమౌతున్న గోవాడ సుగర్ ఫ్యాక్టరీకి ఈ ఏడాది క్రషింగ్ సీజన్లో ఎదురవుతున్న సమస్యలు మరింతగా కుంగదీస్తున్నాయి. మరో పక్క ఫ్యాక్టరీని, చెరకు రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, నాయకులు చేతులెత్తేయడంతో ఇప్పుడు ఫ్యాక్టరీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రైతులకు చెరకు పేమెంట్స్ ఇవ్వలేక, కార్మికులకు జీతభత్యాలు చెల్లించలేక, పాత బకాయిలు చెల్లించలేక, క్రషింగ్కు కావలసిన సామాగ్రికి అవసరమైన ఆర్థిక స్థోమత లేక ఫ్యాక్టరీ చాలా దయనీయంగా ఉంది. 23, 450 మంది సభ్యరైతులు ఉన్న ఈ ఫ్యాక్టరీ నేడో రేపో మూసివేసే దుస్థితికి రావడం రైతులను, కార్మికులను ఆందోళనకు గురిచేస్తుంది. 2019 సంవత్సరానికి ముందు గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ఫ్యాక్టరీ పాలకమండలిలో ఉన్న టీడీపీ పాలకవర్గం సుమారు రూ. 150 కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టింది. అప్పట్లో అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కనీసం ఒక్క రూపాయి కూడా ఫ్యాక్టరీకి ఆర్థిక సాయం అందించలేదు. దీంతో ఫ్యాక్టరీ పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా ఫ్యాక్టరీని ఆదుకుంది. ప్రభుత్వ విప్ హోదాలో అప్పటి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, ఉపముఖ్యమంత్రిగా బూడి ముత్యాలనాయుడు, పరిశ్రమల శాఖామంత్రిగా గుడివాడ అమర్నాఽథ్ ఈ ఫ్యాక్టరీని కాపాడటానికి ఎంతో కృషిచేశారు. అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కూడా సానుకూలంగా స్పందించి ఐదేళ్లలో రూ. 89 కోట్లు ఆర్థిక సాయం అందించారు. ఎక్కడా అప్పుతేకుండా ఉత్పత్తి అయిన పంచదార, ఇతర ఉత్పత్తులు అమ్మకాలతో వచ్చిన డబ్బులతో రైతులకు పేమెంట్స్ ఇచ్చి కొత్త అప్పులు లేకుండా గడిచిన ఐదేళ్లలో ఫ్యాక్టరీని నడిపారు. దీంతో పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన గోవాడ ప్యాక్టరీ నెమ్మదిగా అప్పుల ఊబిలోంచి కొంతమేర బయటపడింది. అయితే 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫ్యాక్టరీకి మళ్లీ గడ్డు పరిస్థితులు మొదలయ్యాయి. గత ప్రభుత్వం ఎనలేని ‘సహకారం’ రాష్ట్ర సహకార రంగంలో 11 సుగర్ ఫ్యాక్టరీల్లో అన్నీ ఇప్పటికే మూతబడి పోగా ఒక్క గోవాడ ఫ్యాక్టరీ మాత్రమే నడుస్తోంది. ఈ ఫ్యాక్టరీకి కనీసం రూ.9 కోట్లు సాయం అందించి, ఫ్యాక్టరీని, రైతులను ఈ కూటమి ప్రభుత్వం ఆదుకోలేకపోవడంపై చెరకు రైతులు ఆగ్రహంతో ఉన్నారు. గత జగన్ ప్రభుత్వ పాలనలో 4 ఫ్యాక్టరీలకు సుమారు రూ.200 కోట్లు వరకూ ఆర్థికసాయం అందించి, కార్మికులు, రైతుల పాతబకాయిలన్నీ చెల్లించారు. కానీ కూటమి ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీ విషయంలో అయినా ఎందుకు స్పందించడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీస్తున్నారు...ఫ్యాక్టరీ మనుగడ కోసం, ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతులంతా ఆందోళనకు సిద్ధం అవుతున్నారు. ‘మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గోవాడ సుగర్ ఫ్యాక్టరీని ఆర్థికంగా ఆదుకుంటాం.. ఉప ఉత్పత్తుల యూనిట్లు నెలకొల్పి ఫ్యాక్టరీని ఆధునికీకరిస్తాం...చెరకు టన్నుకి రూ.4 వేలు గిట్టుబాటు ధర కల్పిస్తాం...’ అంటూ ఎన్నికల నాడు ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు కె.ఎస్.ఎన్ఎ.స్ రాజు, బండారు సత్యనారాయణమూర్తి చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో మీటింగ్లు పెట్టి మరీ చెప్పారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన సాయం కంటే ఒక రూపాయి అయినా ఎక్కువ తెస్తామని గత సెప్టెంబర్లో జరిగిన ఫ్యాక్టరీ మహాజనసభలో ప్రకటించారు. హామీలు కోటలు దాటాయి...కానీ...చేతలు ఫ్యాక్టరీ గేటు కూడా దాటలేదు. గడిచిన పదినెలల్లో కూటమి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఫ్యాక్టరీకి సాయం అందివ్వలేదు. నేడు చెరకు రైతుల మహాధర్నా: ఫ్యాక్టరీని, చెరకు రైతులను ఆదుకోవాలని కోరుతూ రైతు సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 21వ తేదీన చెరకు రైతులు ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారు. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ వద్ద శుక్రవారం ఉదయం 10 గంటలకు ఏపీ చెరకు రైతు సంఘం, ఏపీ రైతుసంఘం, ఏపీ రైతు కూలీ సంఘం, ఏపీ వ్యవసాయ రైతు కూలీసంఘం, సీఐటీయూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టనున్నారు. ఈ ఆందోళనలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు పాల్గొననున్నారు. ఇప్పటికే తమ ప్రచార బృందాలతో ఆటోలతో ఫ్యాక్టరీ పరిధిలో ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. ఫ్యాక్టరీ గోడు పట్టదా?..ఇప్పుడు జనవరి నెలలో ఫ్యాక్టరీ క్రషింగ్ సీజన్ ప్రారంభమైంది. ఎప్పుడో 1962లో 1000 టన్నుల కెపాసిటీతో స్థాపించిన ఈ ఫ్యాక్టరీ దశలవారీగా కెపాసిటీ స్థాయి పెంచుకుంటూ ప్రస్తుతం 5.2లక్షల టన్నుల క్రషింగ్ కెపాసిటీకి వచ్చింది. కానీ మిషనరీ అంతా 30, 40యేళ్ల కిందటిది కావడంతో పాత మిషనరీతో తరచూ క్రషింగ్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఓవర్హాలింగ్ సమయంలో అవసరమైన కొత్తమిషనరీ పార్టులు తెచ్చి బిగించే వారు. ఈ ఏడాది నిధులు లేక నామమాత్రంగా ఉన్నంతలో ఓవర్హాలింగ్ పూర్తి చేసి క్రషింగ్కు దిగారు. దీంతో క్రషింగ్లో పాత మిషనరీ పరికరాలు ఒక్కొక్కటిగా మరమ్మతులకు గురై తరుచూ అంతరాయం కలుగుతోంది. రైతులు తెచ్చిన చెరకు కాటాల వద్ద ఎండిపోయి బరువు తగ్గిపోయి రైతులకు టన్నేజీ తగ్గిపోయి నష్టం కలుతుతోంది. అత్యవసరంలో రూ. 9 కోట్లు ప్రభుత్వం సాయంగా అందిస్తే తప్ప తాత్కాలికంగా ఫ్యాక్టరీ ఆర్థిక ఇబ్బంది నుంచి గట్టెక్కలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చెరకు రైతులంతా కూటమి నేతల వంచనపై ఆందోళనకు సిద్ధం అవుతున్నారు. -
మళ్లీ వడ్డాది వెంకన్న హుండీల లెక్కింపు
● బయటపడిన భక్తుడు సమర్పించిన బంగారం ఆభరణాలను లెక్కిస్తున్న అధికారులు బుచ్చెయ్యపేట: భక్తులు సమర్పించిన బంగారు, వెండి వస్తువుల వివరాలు వెల్లడించలేదని అభ్యంతరం వ్యక్తం కావడంతో వడ్డాది వేంకటేశ్వరస్వామి హుండీలను బుధవారం మరోసారి లెక్కించారు. ఈనెల 17వ తేదీన హుండీలను తెరిచి రూ.12,75,666 ఆదాయం వచ్చి నట్లు ఈవో శర్మ దేవస్ధానం వంశపారంపర్య ధర్మకర్త దొండా కన్నబాబు సమక్షంలో ప్రకటించారు. కేవలం డబ్బులు మాత్రమే ప్రకటించి బంగారు కానుకలు వెల్లడించకపోవడంపై వడ్డాదికి చెందిన భక్తుడు కె.రమణ అభ్యంతరం వ్యక్తం చేశారు. బంగారు వస్తువులు, వెండి వస్తువులు హుండీలో వేసి, నిలువు దోపిడీ చేశామని, ఆ వస్తువులు ఏమయ్యాయని వారు ప్రశ్నించారు. దీంతో బుధవారం దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ వసంత, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి మురళి, ఈవో శర్మలు హుండీలు తెరిచి ఆభరణాలను లెక్కించారు. ఈ ఏడాది ఉత్సవాల సందర్భంగా 13.5 గ్రాముల బంగారం,138 గ్రాముల వెండి వస్తువులు వచ్చినట్లు ప్రకటించారు. అలాగే గత 28 ఏళ్లలో కేజీ 600 గ్రాముల వెండి వస్తువులు, 0.8 గ్రాముల బంగారు వస్తువులు వచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. దీంతో పలువురు భక్తులు అనుమానాలు వ్యక్తం చేశారు. గత 28 ఏళ్లలో వచ్చిన వస్తువులు ఇంతేనాఅని ప్రశ్నించారు. ఇకపై దేవస్ధానంలో భక్తులు అందించిన కానుకలను సక్రమంగా వెల్లడించకపోతే పై అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. -
వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయ వార్షికోత్సవం
దేవరాపల్లి: ముషిడిపల్లి వాసవి కన్యకా పరమేశ్వరీ పంచాయతన ఆలయ ప్రథమ వార్షికోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఆలయ అర్చకులు సూర్యకుమార్ శర్మ తదితరుల మంత్రోఛ్ఛారణల నడుమ అమ్మవారికి పంచామృతాభిషేకం జరిపారు. మండల వ్యాప్తంగా పలు గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు 108 కలశాలతో అమ్మవారికి జలాభిషేకం చేశారు. ఆలయ ఆవరణలో హోమంతో పాటు అష్టోత్తర సామూహిక కుంకమార్చనలు జరిపారు. మహిళల కోలాట ప్రదర్శనలు, భజన కార్యక్రమాలతో సందడి నెలకొంది. మధ్యాహ్నం ఆలయ ఆవరణలో నిర్వహించిన భారీ అన్నసమారాధనకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారి మహా ప్రసాదాన్ని స్వీకరించారు. పెదనందిపల్లి వాసవీ క్లబ్, వాసవీ కన్యకా పరమేశ్వరీ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆలయ స్థల దాత రాయవరపు విజయలక్ష్మి పాల్గొన్నారు. -
కిచ్ కిచ్..కిచ్..కిచ్..కిచ్కిచ్ ఈ శబ్ధాలతో ఒకప్పుడు పట్టణాలు, గ్రామాలల్లో తెల్లవారేది. పొద్దున్నే లేచే సరికి ఇళ్ల ముందు పిచ్చుకలు చప్పుడు చేసుకుంటూ ఇంటా బయటా తిరిగేవి. ఇలా ఎక్కడ చూసినా కాకులు, పిచ్చుకల కిలకిలరావాలు ప్రకృతికి నిలయాలుగా నిలిచేవి. కానీ
అనకాపల్లి టౌన్ : ఒకనాడు మనిషికి పిచ్చుక కూడా నేస్తమే. పిచ్చుకతో మనిషికి ఉన్న సంబంధం 10 వేల సంవత్సరాల నాటిది. మానవుడు వ్యవసాయం ప్రారంభించిన తొలి రోజులలో తమకు ఉపకరించే పశుపక్ష్యాదుల పట్ల శ్రద్ద వహించేవారు. ప్రధానంగా మన ఇంటి పిచ్చుకగా పిలువబడే ఈ పక్షి తాటాకు ఇళ్ల చూరుల్లో గూళ్ళు పెట్టుకొని తమ సంతతిని వృద్ది చేసుకొనేవి. అదే సమయంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే వారంతా తమ ఇళ్ల చూరుకు ధాన్యం కుంకుల గుత్తులు వేలాడదీసేవారు. దీంతో పిచ్చుకలు ఆహారం తీసుకొని ఆ ఇంటి చుట్టుపక్కల కిచుకిచు మంటూ తిరుగుతుండేవి. పిచ్చుకలు పంటను ఆశించే క్రిమికీటకాలను తినడంలో ప్రముఖపాత్ర పోషిస్తాయి. నేడు పొలాల్లో చల్లే రసాయిన క్రిమి సంహారక మందులు పిచ్చుకలను వాటి తిండికి దూరం చేశాయి. పిచ్చుకల సంరక్షణకు గ్రీన్ క్లబ్ సభ్యుల కృషి గ్రీన్క్లబ్ వ్యవస్థాపకుడైన కొణతాల ఫణిభూషణ్ శ్రీధర్ వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. జంతు, వృక్ష ప్రేమికుడైన ఈయన పర్యావరణ పరిరక్షణలో ముందు ఉంటారు. గ్రీన్క్లబ్ అనే సంస్థ్ధను 2014 జూన్ ఐదున ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు ప్రారంభించారు. చెట్లు పెంచాలని, పిచ్చుకలను రక్షించాలని గత 12 ఏళ్ల నుంచి పెద్ద ఉద్యమమే చేస్తున్నారు. కొంత నిధులు వెచ్చించి, సమీకరించి ఈ ప్రకియకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేక కార్యక్రమాల ద్వారా వేసవి వచ్చిందంటే చాలు మట్టి పాత్రలకు బాటిళ్లను అమర్చి ఇంటి పరిసర ప్రాంతాలలోను, చెట్ల తొర్రలకు, వీటిని ఏర్పాటు చేస్తుంటారు. దేవాలయాల ఆవరణలో వరి కంకులను కడుతుంటారు. పక్షి జాతిని కాపాడుకుంటేనే మానవ మనుగడ బాగుంటుందని, మన పిచ్చుకను మనమే రక్షించుకుందాం అంటూ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. జీవ వైవిధ్యం కాపాడుకోవాలి.. కొన్ని పక్షి జాతులు అంతరించిపోతే జీవవైవిధ్యం సమతుల్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. మానవుడి ఆధునిక జీవన శైలి వల్ల, సౌండ్, ఎయిర్ పొల్యూషన్, సెల్టవర్స్ వల్ల పిచ్చుకలు కనుమరుగైపోయాయి. మానవ మనుగడకు పిచ్చుకల సంతతిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. –భవానీ, ప్రధాన శాస్త్రవేత్త, కీటక విభాగం, ఆర్ఏఆర్ఎస్ అనకాపల్లి కనుమరుగవుతున్న పిచ్చుకలుసడి లేని గిజిగాడు... చిన్ని పొట్టకు తిండి, గూడూ కరువే పచ్చదనం లేక నీడ కరువై... ఆధునికీకరణలో భాగంగా పచ్చని రావి, మర్రి చెట్లను నిర్ధాక్షణంగా తొలగించేశారు. పోనీ మానవుడు నిర్మిస్తున్న ఆకాశహర్మ్యాలలో కాస్తంత చోటు కూడా పక్షులకు లేకుండా పొయిది. వాటి గూడుకు కనీసం చెట్లు కూడా లేవు. చిన్ని పొట్టకు ఇంత తిండి కూడా దొరకని పరిస్థితి ఉంది. వాస్తవానికి పిచ్చుకలలో అనేక జాతులు ఉండేవి. పిచ్చుక జాతి అంతరించిపోవడానికి రేడియోధార్మికత విడుదల చేసే సెల్ టవర్లే ప్రధాన కారణంగా పర్యావరణవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల పిచ్చుకలలో సంతానోత్పత్తి సామర్ధ్యం దెబ్బతింటుంది. పిచ్చుకలు సాధారణంగా చెట్లు, పూరిపాకల పైకప్పు కింద గూళ్లు ఏర్పాటు చేసుకుంటాయి. ఇవి కనుమరుగు అయిపోవడంతో వీటి ఆవాసం కరువైంది. -
లేటరైట్పై నోరు మెదపరేం?
● స్పీకర్, ఎంపీ స్పందించాలి ● సీపీఎం నాయకుల డిమాండ్ మాట్లాడుతున్న సీపీఎం నాయకుడు అడిగర్ల రాజు నర్సీపట్నం: లేటరైట్ తవ్వకాలపై వస్తున్న వార్త కథనాలపై కూటమి వైఖరి వెల్లడించాలని సీపీఎం నాయకుడు అడిగర్ల రాజు డిమాండ్ చేశారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నాతవరం మండలం, సుందరకోట పంచాయతీ భమిడికలొద్దులో లేటరైట్ తవ్వకాలకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోందన్నారు. స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు, ఎంపీ సీఎం రమేష్ దీనిపై స్పందించాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేటరైట్ తవ్వకాలు, అక్రమాలపై ప్రశ్నించిన కూటమి నేతలు నేడు స్పందించాలన్నారు. అధికారంలో ఉన్న కూటమి నేతలు గిరిజనుల మనుగడకు, పర్యావరణానికి ప్రమాదం తలపెట్టే లేటరైట్ తవ్వకాలను వ్యతిరేకించి ప్రజ ల పక్షాన నిలబడాలన్నారు. బినామీల పేరున ఇచ్చిన మైనింగ్ అనుమతులు రద్దు చేయించాలన్నారు. గిరిజన చట్టాలను ఉల్లంఘించి లేటరైట్ తవ్వకాలకు పాల్పడడం తగదన్నారు. గిరిజన గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేయాలన్నారు. లేటరైట్ పేరుతో గిరిజను ల మనుగడకు విఘాతం కలిగిస్తే ప్రజల తరుపున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకుడు చిరంజీవి పాల్గొన్నారు. -
స్పీకర్ అయితే ఎవరికి గొప్ప..!
● గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి ● లేట‘రైట్ రైట్’ అంటున్నారెందుకో! ● మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్నర్సీపట్నం : స్పీకర్ అయితే ఎవరికి గొప్ప.. నీ పార్టీ నాయకులకు గొప్పేమో.. మాకేంటి అని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ స్పీకర్ అయ్యన్నపాత్రుడి తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నూకాలమ్మ తల్లి గుడికి సంబంధించిన విరాళం విషయంపై ‘గౌరవ స్పీకర్’ అని అయ్యన్నపాత్రుడిని సంభోదిస్తే..అయ్యన్నపాత్రుడు ఒక పోరంబోకు చేత తనపై విమర్శలు చేయించారన్నారు. తమకు గౌరవం ఇస్తే తాము గౌరవిస్తామన్నారు. స్పీకర్ అయితే ఎవరికి గొప్ప? అని ధ్వజమెత్తారు. 2019 డిసెంబరు తర్వాత టెండర్లు పిలిచి నూకాలమ్మ తల్లి గుడి కడితే తమ హయాంలో కట్టామని స్పీకర్ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. రూ.10 లక్షలు సీఎంఆర్ అధినేత ఇస్తే ఆలయ చైర్మన్ ప్రతి ఫైసా గుడి కోసం ఖర్చు పెట్టారని, దానిపై అయ్యన్నపాత్రుడు ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. శ్మశానం సుందరీకరణకు సీఎంఆర్ అధినేత రూ.20 లక్షలు ఇస్తే దానిపై మాట్లాడరన్నారు. మీరు చేస్తే నీతి మేము చేస్తే అవినీతా? అని ప్రశ్నించారు. ఏపీ టాక్స్...వసూళ్ల మాటేమిటో? రోలుగుంట మండలంలో క్వారీల్లో లక్షల రూపాయలు దండుకుంటున్నారని విమర్శించారు. ఎవరని అడిగితే ఏపీ ట్యాక్స్ అంటున్నారని, త్వరలో ఏ అంటే ఏంటో..పీ అంటే ఏంటో బయటకు వస్తుందన్నారు. అనాడు అధికారంలోకి రాకముందు లేటరైట్ అడ్డుకుంటామని బిల్డప్ ఇచ్చారని, ఇప్పుడు లేటరైట్ రైట్ రైట్ అంటున్నారని మండిపడ్డారు. ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు తరిమి తరిమి కొడతారని అయ్యన్నపాత్రుడుని హెచ్చరించారు. -
నిబంధనలు పాటించని క్వారీ వాహనాలు సీజ్
తుమ్మపాల: నిబంధనలు పాటించని క్వారీ వాహ నాలను సీజ్ చేస్తామని కలెక్టర్ విజయ కృష్ణన్ హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులు, క్వారీలు, లారీల యజమానుల అసోసియేషన్లతో రోడ్డు ప్రమాదాలపై స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల కాలంలో క్వారీ లారీల వల్ల దారుణమైన ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కో ల్పోయారని, అధిక లోడుతో వెళ్లి రైల్వే అండర్ బ్రి డ్జిని ఢీకొనడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగిందని, ఇకముందు ఇటువంటివి జరిగితే వా హనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. నిబంధ నల ప్రకారం నడుచుకోకపోతే జిల్లాలో క్వారీ వాహనాలను పూర్తిగా నిలిపివేస్తామన్నారు. భారీ వాహనాలు నిబంధనల మేరకు మాత్రమే సరకులు తీసుకువెళ్లాలని, అధిక లోడు, మితిమీరిన వేగం అనుమతించబోమన్నారు. క్వారీలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే పనిచేయాలన్నారు. అధికారులే నియంత్రించాలి.. రాంబిల్లి నేవల్ బేస్, జాతీయ రహదారుల అధికారులు.. వారికి అవసరమైన మెటీరియల్ తీసుకుని అధిక లోడుతో వచ్చే వాహనాలను నియంత్రించాలని కలెక్టర్ ఆదేశించారు. అనుమతి లేని మైనింగ్పై విజిలెన్స్ దాడులు నిర్వహించాలని గనులశాఖ అధికారులను ఆదేశించారు. అక్రమ మైనింగ్ సమాచారం అందించని క్షేత్ర స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు చెప్పారు. అధిక లోడు, అధిక వేగం, రాంగ్ రూట్లో ప్రయాణించే వాహనాలపై చర్యలు తీసుకోవాలని పోలీసుశాఖ, రవాణాశాఖ అధికారులకు ఆదేశించారు. తీసుకున్న చర్యలపై వారం రోజులలో నివేదిక సమర్పించాలన్నారు. డీఆర్వో వై.సత్యనారాయణరావు, ఆర్డీవో షేక్ ఆయిషా, డీఎస్పీ వి.మోహనరావు, ఆర్టీవో మనోహర్, పంచాయతీరాజ్ ఈఈ కె.వి.నాయుడు, మైన్స్ అండ్ జియా లజీ సహాయ సంచాలకుడు ఎం.శ్రీనివాసరావు, క్వారీలు, లారీల యజమానుల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. అధిక లోడు, మితిమీరిన వేగానికి కళ్లెం కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశం -
అభివృద్ధి మాది...డప్పు మీది...?
● వై.ఎస్ జగన్ హయాంలోనే మైదాన, గిరిజన ప్రాంతాలకు రోడ్లు ● నాటి నిధులతో పనులు చేపడుతూ నేడు కొత్తగా మంజూరైనట్టు కూటమి నేతలు చెప్పడం సరికాదు ● మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడుదేవరాపల్లి: మాడుగుల నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సహకారంతో మైదాన, గిరిజన అవాస ప్రాంతాలకు సైతం రోడ్డు సౌకర్యం కల్పిన ఘనత తమకే దక్కుతుందని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు గవరవరం నుంచి ఎ.కోడూరు వరకు నిర్మించిన తారురోడ్డును ఆయన బుధవారం పరిశీలించారు. గవరవరం–ఎ.కోడూరు రోడ్డుకు రూ. 2 కోట్లు, ఘాట్రోడ్డు–కింతలి రోడ్డుకు రూ. 9 కోట్లు నిధులను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి ఒకే ప్రొసీడింగ్లో మంజూరు చేయించానన్నారు. అప్పట్లో వర్షాకాలం, ఆ తర్వాత ఎన్నికల రావడంతో ప్రభుత్వం మారిందన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత కూటమి ప్రభుత్వం తాము మంజూరు చేసిన నిధులతో పనులు చేపడుతుందని, అయితే ఈ నిధులు కొత్తగా మంజూరు చేసినట్టు చెప్పుకోవడం సరికాదని హితవు పలికారు. గవరవరం–కాశీపురం రోడ్డు విస్తరణకు సైతం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే రూ. 20 కోట్లు మంజూరు చేసి 90 శాతం మేర కల్వర్టు పనులు సైతం పూర్తి చేశామన్నారు. మిగిలిన పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు. చింతలపూడి పంచాయతీ శివారు దట్టమైన అటవీ ప్రాంతంలో కొండలు, గెడ్డల మధ్య ఉన్న బోడిగరువు, నేరెళ్లపూడి గిరి గ్రామాలకు స్వాతంత్య్రం వచ్చాక ఏ రాజకీయ నాయుకుడు వెళ్లలేదన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో సుమారు 5 కిలోమీటర్ల మేర కాలినడకన చేరుకొని వారి కష్టాలను స్వయంగా చూశానన్నారు. ఆయా గ్రామాలకు 25 అడుగుల వెడల్పున మట్టి రోడ్డు, కల్వర్టులు పూర్తి చేసి కారులో వెళ్లానని గుర్తు చేశారు. ఈ రోడ్డును రెండు వర్కులుగా విభజించి మట్టి రోడ్డుతో పాటు తారు రోడ్డు నిర్మాణానికి సైతం రూ. 3.50 కోట్లు నిధులు మంజూరు చేసినట్టు వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వారు పనులు చేపట్టడం శుభ పరిణామమేనని, అయితే ఆ నిధులు కొత్తగా మంజూరు చేసినట్టు ప్రచారం చేసుకొని మళ్లీ శంకుస్థాపన చేయడం విడ్డూరమని అన్నారు. ఈ వర్కులకు సంబంధించిన ప్రొసీడింగ్ సైతం తమ వద్ద ఉన్నాయని ఆయన చెప్పారు. తాను నాడు మంత్రి హోదాలో చేసిన అభివృద్ధిని చూస్తే సంతోషం కలుగుతుందన్నారు. ఆయన వెంట ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మి, జెడ్పీటీసీ కర్రి సత్యం, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు బూరె బాబురావు, స్థానిక సర్పంచ్ రొంగలి వెంకటరావు, ఎ. కొత్తపల్లి సర్పంచ్ చింతల సత్య వెంకటరమణ ఉన్నారు. -
● ఏలేరు–తాండవ ఎత్తిపోతల పథకంపై నీలినీడలు ● శ్రద్ధ చూపని కూటమి సర్కారు ● నెలలు గడుస్తున్నా పురోగతి శూన్యం ● ఆయకట్టు రైతుల్లో నైరాశ్యం
నర్సీపట్నం: ఏలేరు–తాండవ ఎత్తిపోతల పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. కూటమి ప్రభుత్వం కొలువుతీరి తొమ్మిది నెలలు దాటినా ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చిరకాల స్వప్నం నెరవేరుతుందా లేదా అని ఆయకట్టు రైతులు మల్లగుల్లాలు పడుతున్నారు. తాండవ ప్రాజెక్టును 4,400 ఎంసీఎఫ్టీల నీటి నిల్వ సామర్ధ్యంతో 1977లో నిర్మించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్రెడ్డి హయాంలో రూ.50 కోట్లతో కాలువలు, జలాశయం ఆధునికీకరణ చేపట్టారు. వైఎస్సార్ పుణ్యమాని చివరి ఆయకట్టు భూములకు నీరు అందుతోంది. మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఒక అడుగు ముందుకేసి మరింత సస్యశ్యామలం చేసేందుకు ఏలేరు కాలువకు 68 కిలోమీటర్ల మేర లైనింగ్ను ఆధునికీకరించి ఎత్తిపోతల పథకాల ద్వారా రెండు పంటలకు సమృద్ధిగా నీరందించేందుకు రూ.470.05 కోట్లు కేటాయించారు. ఏలేరు ఇంజినీరింగ్ విభాగం సర్వే పూర్తి చేశారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టడం ఆలస్యమైంది. ఇంతలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఎత్తిపోతల పథకానికి బ్రేక్ పడింది. కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. 20 శాతం కూడా పనులు పూర్తి కాని ప్రాజెక్టు వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఎత్తిపోతల పథకాన్ని పర్యవేక్షిస్తున్న ఇంజనీరింగ్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. పథకం నిర్మాణంపై కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రాజెక్టు నిర్మాణంపై రైతాంగంలో సందిగ్ధత నెలకొంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. ఎత్తిపోతల పథకం పూర్తయితే.. అనకాపల్లి, కాకినాడ జిల్లాల పరిధిలోని ఆరు మండలాల రైతులకు మేలు చేకూరుతుంది. మొత్తం 77 గ్రామాల్లో 51,467 ఎకరాలకు సాగునీటికి ఢోకా లేకుండా, 5600 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరిచ్చేలా ఏలేరు ఎడమ కాలువపై నాలుగుచోట్ల ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేసేందుకు గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొదటి ఎత్తిపోతల ద్వారా కోటనందూరుకు 135 రోజులు, రెండో ఎత్తిపోతల ద్వారా గొలుగొండపేటకు 135 రోజులు, మూడో ఎత్తిపోతల ద్వారా తాండవ కాలువకు 135 రోజులు, నాలుగో ఎత్తిపోతల ద్వారా గునిపూడి నుంచి తాండవ జలాశయానికి 90 రోజులపాటు 200 క్యూసెక్కుల చొప్పున నీరు అందించేందుకు పథకాన్ని రూపొందించారు. ఇదే విధంగా ఏలేరు కాలువకు 68 కిలోమీటర్ల వరకు ఆధునికీకరణ, చింతలూరు వద్ద 1100 ఎకరాల కొత్త ఆయకట్టుకు 135 రోజులపాటు 25 క్యూసెక్కుల నీరు, అచ్చంపేట వద్ద 2100 ఎకరాలకు 25 క్యూసెక్కుల చొప్పున 135 రోజులపాటు 0.238 టీఎంసీల నీరు, ములపూడి ప్రాంతానికి 2400 ఎకరాలకు 25 క్యూసెక్కుల చొప్పున 135 రోజులపాటు 0.292 టీఎంసీల నీరు అందించేందుకు ఆలోచన చేశారు. -
చెరకు రైతులను నట్టేట ముంచారు..
● ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గోవాడ సుగర్ ఫ్యాక్టరీకి అధోగతి ● గిట్టుబాటు ధర కల్పించక, పేమెంట్లు చెల్లించక రైతన్న కష్టాలపాలు ● అసలే ఆలస్యం, తరచూ క్రషింగ్కు అంతరాయం ● సాగు చేసిన రైతే చెరకు పంటకు నిప్పు పెట్టిన దయనీయ స్థితి ● వైఎస్ జగన్ హయాంలో గోవాడ ఫ్యాక్టరీకి రూ.90 కోట్లు విడుదల ● మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు దేవరాపల్లి: గోవాడ సుగర్ ఫ్యాక్టరీని, చెరకు రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. దేవరాపల్లి మండలం మేడిచెర్ల రెవెన్యూ పరిధిలో చెరకు పంటకు రైతు నిప్పు పెట్టిన పొలాన్ని బుధవారం ఆయన స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. కొత్తపెంట గ్రామానికి చెందిన బాధిత రైతు రొంగలి వెంకటరావును ఆయన పరామర్శించి, అతడి కష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక విలేకర్లతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో ఫ్యాక్టరీ ఎప్పుడు ఆగిపోతుందో తెలియని పరిస్థితికి దిగజారిందని విమర్శించారు. ఫ్యాక్టరీపై ఆధారపడి చెరకు సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. జిల్లాకు కొత్త పరిశ్రమలు తెస్తామంటూ ప్రచారం చేస్తున్న కూటమి నేతలు, ముందు సహకార రంగంలో ఉన్న గోవాడ సుగర్ ఫ్యాక్టరీని కాపాడాలన్నారు. నవంబర్ నెలాఖరులో ప్రారంభించాల్సిన ఫ్యాక్టరీ క్రషింగ్ను సంక్రాంతి దాటాక ఆలస్యంగా ప్రారంభించడం నిర్లక్ష్యం కాదా అని ప్రశ్నించారు. అసలే ఆలస్యం.. ఆపై తరుచూ అంతరాయంతో రోజుల తరబడి కాటా వద్ద, ఫ్యాక్టరీ వద్ద చెరకు నిలిచిపోయి ఎండిపోవడంతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలోనే యాజమాన్యం, ప్రభుత్వం తీరుపై ఆగ్రహించిన రైతులు ఇటీవల ఫ్యాక్టరీ వద్ద స్వచ్ఛందంగా ప్రత్యక్ష ఆందోళన చేశారన్నారు. తాజాగా ప్రభుత్వ తీరు పట్ల కలత చెందిన కొత్తపెంట రైతు తన చెరకు పంటకు తానే నిప్పు పెట్టుకున్నారని, ఈ ఘటనతోనైనా కూటమికి కనువిప్పు కలగాలని ఆకాంక్షించారు. చంద్రబాబు ఎప్పుడు గద్దెనెక్కినా అన్నదాతలకు అగచాట్లేనన్నారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు దాటినా అన్నదాత సుఖీభవ పేరిట రూ.20 వేలు పెట్టుబడి సహాయం ఊసెత్తకపోవడం రైతులను మోసగించడమేనన్నారు. గోవాడను ఆదుకున్నది వైఎస్సార్, వైఎస్ జగన్లే.. 2004లో నాటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి టన్నుకు ఒకేసారి రూ.1100 గిట్టుబాటు ధర పెంచి గోవాడ రైతులకు అండగా నిలవగా, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.90 కోట్లు విడుదల చేసి చెరకు రైతులను ఆదుకున్నారని ముత్యాలనాయుడు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే గత ఐదేళ్లలో రైతులు, కార్మికులు సుభిక్షంగా ఉన్నారన్నారు. ఇప్పటికై నా చెరకు రైతుల బకాయిలు చెల్లించేందుకు తక్షణమే రూ.35 కోట్లు విడుదల చేయాలని, ఫ్యాక్టరీ ఆధునికీకరణకు రూ.350 కోట్లు మేర మంజూరు చేయాలని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు డిమాండ్ చేశారు. ఆయన వెంట స్థానిక ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మి, జెడ్పీటీసీ కర్రి సత్యం, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు బూరె బాబురావు, స్థానిక సర్పంచ్ రొంగలి వెంకటరావు (నీలిమ), ఎ.కొత్తపల్లి సర్పంచ్ చింతల సత్య వెంకటరమణ, మాజీ సర్పంచ్ రొంగలి శంకరరావు, రెడ్డి అప్పారావు ఉన్నారు. -
‘వైఎస్సార్’ పేరు చూస్తే ‘కూటమి’లో కలవరం
● ప్రతిచోటా ఆయన పేరును తొలగిస్తున్నారు ● ప్రజల గుండెల్లో మాత్రం ఆయన స్థానాన్ని చెరపలేరు ● విశాఖ స్టేడియానికి ఉన్న వైఎస్సార్ పేరు తొలగించడం దుర్మార్గం ● ఈనెల 20న స్టేడియం వద్ద వైఎస్సార్సీపీ నిరసన ● మీడియాతో మాజీమంత్రి అమర్నాథ్సాక్షి, విశాఖపట్నం : ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి పేరును చూసి టీడీపీ కూటమి సర్కారు కలవరపడుతోందని వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. రాష్ట్రంలో వైఎస్సార్ పేరు లేకుండా చేయాలనే దుర్మార్గమైన ఆలోచనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్ పేరు ఎక్కడ ఉంటే అక్కడ వరుసగా తొలగిస్తూ వస్తున్నారన్నారు. వైఎస్సార్ పేరు అయితే చెరిపేయగలరుగానీ.. ప్రపంచవ్యాప్తంగా అభిమానుల గుండెల్లో ఉన్న ఆ పేరును చెరిపేయగలరా అని ప్రశ్నించారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైఎస్సార్సీపీని లేకుండా చేయాలని.. వైఎస్సార్ అనే బ్రాండ్ కనిపించకుండా చేయాలన్న కుతంత్రమే కనిపిస్తోంది. నాగార్జున యూనివర్సిటీలోని వైఎస్సార్ విగ్రహాన్ని నేలమట్టం చేశారు.. బాపట్ల జిల్లా వేమూరులో వైఎస్సార్ విగ్రహానికి నిప్పంటించారు.. విజయవాడ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరును తీసేశారు.. వైఎస్సార్ జిల్లా పేరును మార్చేశారు. జగన్ పేరునూ తీసేశారు.. ఇక వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉండగా విజయవాడ నడిబొడ్డున 150 అడుగుల అంబేడ్కర్ విగ్రహం, మ్యూజియం నిర్మిస్తే దానిపైన వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరును తీసేశారు. వైఎస్సార్ పేరు కనపడితేనే ఓర్చుకోలేకపోతున్న చంద్రబాబు.. గతంలో మూడుసార్లు సీఎంగా పనిచేసి కూడా కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టలేకపోయారు? వైఎస్ జగన్ సీఎం అయ్యాకే ఎన్టీఆర్కు సమున్నత గౌరవం కల్పించారు. విశాఖ వీడీసీఏ క్రికెట్ స్టేడియానికున్న వైఎస్సార్ పేరును తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 20న స్టేడి యం వద్ద శాంతియుతంగా నిరసన చేపడతాం. -
కాలిన చెరకు సుగర్ ఫ్యాక్టరీకి తరలింపు
● కలెక్టర్ ఆదేశాలతో నరికించి తీసుకెళ్లిన ఫ్యాక్టరీ అధికారులుదేవరాపల్లి: కొత్తపెంట రైతు రొంగలి వెంకటరావు నిప్పు పెట్టిన చెరకు పంటను కలెక్టర్ ఆదేశాలతో ఫ్యాక్టరీ సిబ్బంది బుధవారం నరికించుకొని తీసువెళ్లారు. కష్టపడి సాగు చేసిన చెరకు పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో కలత చెందిన రైతు తన పంటకు తానే నిప్పు పెట్టుకున్న సంగతి విదితమే. కాలిన పంటను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ జాహ్నవి మిగిలిన పంటను నరికించి ఫ్యాక్టరీకి తరలించాలని గోవాడ సుగర్ ఫ్యాక్టరీ సిబ్బందికి ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఫ్యాక్టరీ సిబ్బంది బుధవారం కూలీలను పెట్టి దగ్గరుండి నరికించి, కాలిపోగా మిగిలిన పంటను లారీలో ఫ్యాక్టరీకి తరలించారు. పంటకు సంబంధించి కటింగ్ ఆర్డర్ను సైతం బాధిత రైతు వెంకటరావు ఫ్యాక్టరీ వ్యవసాయ అధికారి కృష్ణమూర్తి అందజేశారు. -
తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలి
అనకాపల్లి టౌన్ : అత్యాచారం కేసులో సస్పెండ్ అయి శిక్ష అనుభవించిన వారికి నిబంధనలకు విరుద్ధంగా రీజాయినింగ్ ఆర్డర్ ఇచ్చిన రెవెన్యు అధికారిపై చర్యలు తీసుకోవాలని ఆర్టీఐ విజిల్ బ్లోవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కో కన్వీనర్ కోన బాబురావు కోరారు. గత సోమవారం కలెక్టర్ విజయకృష్ణన్కు పీజీపీఆర్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ సంబంధిత రెవెన్యూ అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ సందర్భంగా కోన బాబురావు మాట్లాడుతూ కొరుప్రోలు గ్రామ వీఆర్ఏ చిన్నబ్బాయికి రీజాయినింగ్ ఆర్డర్ ఇచ్చిన, అవినీతి, అక్రమాలతో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా లింగరాజుపాలెం వీఆర్ఏగా చిందాడ సత్యనారాయణకు ఉద్యోగం ఇచ్చిన గత తహసీల్దార్ విజయ్కుమార్పై సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలి కోరారు. కొరుప్రోలు వీఆర్ఏ చిన్నబ్బాయిపై 2023 ఏడాది డిసెంబర్ 11న ఎఫ్ఐఆర్ నెం.445/2023 సెక్షన్ ఐపీసీ 376(2)ఎన్ కింద అత్యాచారం కేసు నమోదైందని పేర్కొన్నారు. దీంతో రిమాండ్ నిమిత్తం 3 నెలల కాలంలో సస్పెండ్ అయి మూడు నెలలు జైలు శిక్ష అనుభవించారని, గుట్టుచప్పుడు కాకుండా డబ్బులు తీసుకుని అతనికి రీజాయినింగ్ ఆర్డర్ ఇచ్చారని తెలిపారు. అదేవిధంగా లింగరాజుపాలెం వీఆర్ఏ చిందాడ అప్పారావు మరణాంతరం ఆయన కుమారుడికి వీఆర్ఏ ఉద్యోగం అర్హత లేకున్నా సత్యనారాయణకు అర్హత లేకున్నా..46 ఏళ్లు ఉన్న ఆయనకు ఉద్యోగం ఇచ్చారని, తొలుత అర్హత లేకపోవడంతో తిరస్కరించిన తరువాత కూడా ఆర్ఐ వినయ్, సీనియర్ అసిస్టెంట్ మణికంఠ లంచం తీసుకుని అప్పటి తహసీల్దార్ విజయకుమార్ ద్వారా ఉద్యోగాలు కల్పించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే రెండుమూడు సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా తహసీల్దార్పై చర్యలు తీసుకోలేదని, తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
జల కళ కలగా మిగిలేనా..?
ఏలేరు–తాండవ జలాశయాల పరిధిలో ఆయకట్టు అనకాపల్లి జిల్లాలో 34,518 ఎకరాలు కాకినాడ జిల్లాలో...16,947 ఎకరాలు వీటి పరిధిలో చెరువులు: 198 చెరువుల కింద ఆయకట్టు: 17 వేల ఎకరాలు జలాశయం నీటిమట్టం: 4,400 ఎంసీఎఫ్టీలు ఎడమ ప్రధాన కాలువ పొడవు: 19.8 కిలోమీటర్లు కుడి ప్రధాన కాలువ పొడవు: 15.4 కిలోమీటర్లు రెండు జిల్లాలు సస్యశ్యామలం రైతుల శ్రేయస్సు దృష్ట్యా ఏలేరు–తాండవ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలి. గత ప్రభుత్వంలో ఈ పథకానికి అడుగులు పడినప్పటికీ, పనులు ప్రారంభం కాలేదు. కూటమి ప్రభుత్వం ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించి రైతులకు మేలు చేకూర్చాలి. ఈ పథకం పూర్తయితే రెండు జిల్లాలు సస్యశ్యామలవుతాయి. పథకాన్ని పూర్తి చేసి తాండవ జలాశయం ఆయకట్టు రైతుల చిరకాలను నెరవేర్చాలి. –అడిగర్ల రాజు, సీఐటీయూ నాయకుడు రైతులకు మేలు ఒక్కొక్కసారి వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా వర్షాలు పడకపోవటం వల్ల జలాశయంలో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు ఉండటం లేదు. పంటకు నీరు అందక ఇబ్బందులు తలెత్తున్నాయి. ఆయకట్టు రైతులకు భరోసా కల్పించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. రాజకీయాలకు అతీతంగా కూటమి పథకాన్ని పూర్తి చేసి రైతులను ఆదుకోవాలి –తాతాజీ, రైతు, మెట్టపాలెంతాండవ జలాశయం● -
వరకట్న వేధింపులకు మహిళ బలి
కశింకోట: మండలంలోని కన్నూరుపాలెంలో భర్త, అత్తమామల వరకట్న వేధింపులు భరించలేక బావిలో పడి మహిళ ఆత్మహత్య చేసుకుంది. దీనిపై సీఐ అల్లు స్వామినాయుడు బుధవారం రాత్రి అందించిన వివరాలివి. కన్నురుపాలేనికి చెందిన పెయింటర్ గులిమి శివకు, గాజువాకకు చెందిన కుసుమ (25)కు 2019 ఫిబ్రవరి 13న వివాహం జరిగింది. ఆమెకు వివాహ సమయంలో రూ.2.50 లక్షల నగదు, ఐదు తులాల బంగారు ఆభరణాలు, బైక్ కట్నంగా ఇచ్చారు. వివాహం అనంతరం వారికి చరణ్ తేజ(5), యోక్సో వర్థన్ (3) జన్మించారు. అయితే కొంత కాలంగా భర్త శివ, అత్త అమరావతి, మామ శ్రీనివాస్, బావ రామకృష్ణలు కలిసి రూ.లక్ష అదనపు కట్నం కోసం తరచుగా వేధిస్తూ మానసికంగా, శారీరకంగా వేధించసాగారు. వీటిని తాళలేక మంగళవారం సాయంత్రం కుసుమ సమీపంలోని బావిలో పడి మృతి చెందింది. ఈ మేరకు తండ్రి గోలుకొండ కొండబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్టు సీఐ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందన్నారు. ఇదిలా ఉండగా తన కుమార్తె కుసుమను అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధించి చంపేసారని ఆరోపిస్తూ పోలీసు స్టేషన్ వద్ద తల్లి నాగమణి రోధించగా బంధువులు ఓదార్చారు. -
హాకీ జాతీయ జట్టులో యలమంచిలి క్రీడాకారిణి
యలమంచిలి రూరల్: పట్టణానికి చెందిన లొట్ల మేరీ హాకీ మహిళల సీనియర్ జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన ఎంపిక ల్లో హాకీ ఇండియా సెలెక్టర్లు ఆమెను జాతీయ జట్టు ప్రోబబుల్స్ జాబితాలోకి ఎంపిక చేశారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 65 మంది ప్రతిభావంతులైన మహిళా క్రీడాకారులను ఎంపిక చేశా రు. వీరందరికీ ఈ నెల 23 నుంచి 30 వరకు బెంగళూరు ఎస్ఏఐ కేంద్రంలో తర్ఫీదునివ్వను న్నారు. శిక్షణ అనంతరం 40 మంది క్రీడాకారి ణులను తుది జట్టులోకి ఎంపిక చేస్తారు. హాకీ మహిళల జాతీయ ప్రోబబుల్స్ బృందంలో ఏపీ నుంచి యలమంచిలికి చెందిన లొట్ల మేరీ మాత్రమే చోటు దక్కించుకున్నారు. పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్డుకు చెందిన ద్విచక్రవాహనాల మెకానిక్ లొట్ల సంజీవి కుమార్తె మేరీ చిన్నప్పట్నుంచి హాకీలో విశేష ప్రతిభ కనబరుస్తూ వివిధ సందర్భాల్లో పతకాలు, బహుమతులు అందుకున్నారు. ఇదే క్రమంలో క్రీడల కోటాలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖలో ఉద్యోగం కూడా సాధించారు. హాకీ జాతీయ జట్టు ప్రోబబుల్స్ జాబితాలో స్థానం పొందిన మేరీని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్, యలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ పిల్లా రమాకుమారి, అనకాపల్లి జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి కొఠారు నరేష్, పలువురు సీనియర్ హాకీ క్రీడాకారులు అభినందించారు. -
24, 25 తేదీల్లో బ్యాంకు ఉద్యోగుల సమ్మె
గోడపత్రికను ఆవిష్కరిస్తున్న సీఐటీయూ నాయకులు తుమ్మపాల: ఈ నెల 24, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు చేపట్టే సమ్మెకు మద్దతిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో గోడ పత్రిక ఆవిష్కరించినట్లు జిల్లా అధ్యక్షుడు ఆర్.శంకరరావు తెలిపారు. పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల్లో ఖాళీలను భర్తీ చేయడం లేదని, కొత్తగా భర్తీ చేసే ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియమించాలని ప్రయత్నిస్తోందన్నారు. బ్యాంకుల సంఖ్యను తగ్గించి ఉద్యోగులపై పనిభారం విపరీతంగా పెంచుతుందని, పారిశ్రామికవేత్తల అప్పులు మాఫీ చేస్తూ బ్యాంకుల నెత్తిన భారం మోపుతుందని తెలిపారు. ఈ చర్యలకు నిరసనగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తున్నారన్నారు. ద్వైపాక్షిక ఒప్పందాలకు తూట్లు పొడుస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆదేశాలను ఉపసంహరించాలని, పలు డిమాండ్లతో యూఎఫ్ఏయూ నాయకత్వంలో ఉద్యోగులు, అధికారులు ఐక్యంగా సమ్మె చేస్తున్నారని తెలిపారు. -
సబ్బవరంలో భారీగా గంజాయి పట్టివేత
సబ్బవరం: మండలంలోని ఆనందపురం–అనకాపల్లి జాతీయ రహదారిపై బాటజంగాలపాలెం టోల్గేట్ వద్ద కారులో పెద్ద ఎత్తున తరలిస్తున్న గంజాయిని సబ్బవరం పోలీసులు పట్టుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ పిన్నింటి రమణతో కలిసి డీఎస్పీ వళ్లెం విష్ణుస్వరూప్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆంధ్ర–ఒడిశా బోర్డర్లో ఏజెన్సీ ప్రాంతం నుంచి మహరాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న రూ.18.19 లక్షల విలువ చేసే 363.8 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు సీఐ పిన్నింటి రమణ ఆధ్వర్యంలో ఎస్ఐ సింహాచలం తన సిబ్బందితో కలిసి గంజాయి తరలిస్తున్న కారుతో పాటు పైలెట్ వాహనంగా వస్తున్న మరో కారును తనిఖీ చేసి, గంజాయిని పట్టుకున్నారు. రెండు కార్లను సీజ్ చేశారు. 7గురిని అదుపులోకి తీసుకోగా, మరో ముగ్గురు పరారయ్యారైనట్లు తెలిపారు. వారి నుంచి రూ.50 వేలు నగదు, 5 సెల్ఫోన్లతో కలిపి ఈ కేసులో మొత్తం రూ.57.10 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఏవోబీ బోర్డర్లో కోనుగోలుచేసి చింతపల్లిలో లోడ్చేసి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు తెలిసిందన్నారు. గంజాయి తరలింపులో వినియోగించిన వాహనాలు తప్పుడు రిజిస్ట్రేషన్ నంబర్లతో ఉన్నాయని, వీటిపై దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. పట్టుబడిన వ్యక్తుల్లో ఏఎస్ఆర్ జిల్లాకు చెందిన వారు ఆరుగురు, ఒడిశాకు చెందిన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఏ1గా సామిరెడ్డి విజయ్(31), ఏ2 వంతల హరీష్బాబు(30), ఏ3 మాడబత్తుల అరుణ్కుమార్(38), ఏ4 సాగర్ శివాజీ గోపనీ(32), ఏ5 కొర్రా మహేష్బాబు(32), ఏ6 ఎన్.రమణ(40), ఏ7గా సరమంద అనిల్కుమార్(25)లపై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ పిన్నింటి రమణ, ఎస్ఐలు సింహాచలం, టి.దివ్య పాల్గొన్నారు. ఏవోబీ నుంచి మహారాష్ట్రకు కారులో తరలిస్తుండగా.. రూ.18.19 లక్షల విలువైన 363.8 కిలోల గంజాయి స్వాధీనం 2 కార్లు, ఐదు మొబైళ్లు, రూ.50 వేలు నగదు సీజ్ ఏడుగురి అరెస్ట్, ముగ్గురు పరార్ -
ఇందిరా మార్కెట్లో చోరీ
నర్సీపట్నం : మున్సిపాలిటీ ఇందిరా మార్కెట్లోని శ్రీనివాస్ ట్రేడింగ్ కిరాణా దుకాణంలో ఈ నెల 17వ తేదీ అర్ధరాత్రి చోరీ జరిగింది. షాపు పైకప్పు సిమెంట్ రేకును కట్ చేసి లోపలికి ప్రవేశించి కిరాణా సామాన్లతో పాటు కౌంటర్లోని కొంత నగదును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించుకుపోయారు. షాపు యజమాని అంజూరి శ్రీనివాసరావు ఉదయం షాపు తెరిచి చూసేసరికి పైకప్పు రంధ్రం చేసి ఉండడంతో షాపులోని ఆయిల్ డబ్బాలు, సబ్బులు, కిరాణా సామాన్లు పట్టుకుపోవడాన్ని గుర్తించి లబోదిబోమన్నాడు. మొత్తం కిరాణా సామాన్లు, నగదు కలిపి రూ.లక్ష వరకు చోరీ జరిగిందని షాపు యజమానికి తెలిపాడు. రెండు నెలల కాలంలో వరుసగా మార్కెట్లో నాలుగు దొంగతనాలు జరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. చోరీలను ఆరికట్టి వ్యాపారులకు రక్షణ కల్పించాలని వారు వేడుకున్నారు. చోరీపై టౌన్ పోలీసులు విచారణ చేస్తున్నారు. -
ఆటోలో నగల బ్యాగ్ మరిచిపోయిన మహిళ
● నిజాయితీగా తిరిగి అప్పగించిన డ్రైవర్పోలీసుల సమక్షంలో బాధితురాలికి అప్పగిస్తున్న డ్రైవర్ నక్కపల్లి : నక్కపల్లికి చెందిన ఓ మహిళ ఆటోలో మర్చిపోయిన బంగారం బ్యాగ్ను డ్రైవర్ నిజాయితీగా తిరిగి అప్పగించిన ఘటన మంగళవారం జరిగింది. సీఐ కుమారస్వామి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నక్కపల్లికి చెందిన శిరీష అనే మహిళ తుని వెళ్లేందుకు నక్కపల్లిలో ఆటో ఎక్కింది. తనతో తీసుకెళ్తున్న బ్యాగ్ను ఆటోలో మర్చిపోయింది. ఆందులో సుమారు రూ.7లక్షలు విలువైన ఎనిమిది తులాల బంగారు ఆభరణాలను ఉన్నాయి. దీంతో ఆమె నక్కపల్లి పోలీస్స్టేషన్నో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేసేలోపు తునికి చెందిన ఆటోడ్రైవర్ గెడ్డమూరి అంజి నిజాయితీగా నక్కపల్లి మహిళ తన ఆటోలో మర్చిపోయిన బ్యాగ్ ను, అందులో ఉన్న బంగారాన్ని నక్కపల్లి పోలీస్స్టేషన్కు తీసుకు వచ్చాడు. పోలీసుల సమక్షంలో బాధితురాలి ఇంటి వద్దకు తీసుకెళ్లి అందజేశాడు. డ్రైవర్ నిజాయితీకి మెచ్చి అతనికి కొంత నగదు ను కానుకగా అందజేశారు. సీఐ కుమార స్వామి ఆటోడ్రైవర్ను ప్రత్యేకంగా అభినందించారు. 28న తపాలా అదాలత్ మహారాణిపేట: విశాఖ పోస్టల్ రీజియన్ పరిధిలోని తపాలా వినియోగదారుల వ్యక్తిగత ఫిర్యాదులు, సమస్యలు పరిష్కారం కోసం ఈనెల 28న 117వ తపాలా అదాలత్ నిర్వహిస్తున్నారు. ఎంవీపీ కాలనీలోని పోస్టు మాస్టర్ జనరల్ కార్యాలయంలో ఈ అదాలత్ జరుగుతుందని తపాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె.వి.డి.సాగర్ తెలిపారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లా, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల పరిధిలోని తపాలా వినియోగదారులు తమ సమస్యలు, ఫిర్యాదులను ఈనెల 24వ తేదీలోగా పోస్టు మాస్టర్ జనరల్ కార్యాలయం, విశాఖపట్నం–530017 చిరునామాకు పంపించాలని కోరారు. -
సీఐఎస్ఎఫ్ సైకిల్ ర్యాలీ ప్రారంభం
ఏయూక్యాంపస్: తీరప్రాంత భద్రత ప్రాధాన్యతను వివరిస్తూ సీఐఎస్ఎఫ్ చేపట్టిన సైకిల్ థాన్ను మంగళవారం ఉదయం విశాఖ పోర్ట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు జెండా ఊపి ప్రారంభించారు. విశ్వప్రియ ఫంక్షన్ హాలు వద్ద ఈ కార్యక్రమం జరిగింది. శ్రీకాకుళం నుంచి సైకిల్థాన్ బృందం సోమవారం విశాఖ చేరుకున్న విషయం తెలిసిందే. తిరిగి విశాఖ నుంచి మంగళవారం తమ ప్రయాణాన్ని ప్రారంభించింది. సైకిల్థాన్కు మద్దతుగా పలువురు చిన్నారులు సైకిళ్లపై వారి వెంట కొంత దూరం ప్రయాణించారు. కార్యక్రమంలో పీపీఏ సెక్రటరీ టి.వేణు గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
కూటమి కు‘తంత్రం’
● మేయర్ పీఠం కోసం కుయుక్తులు ● రంగంలోకి దిగిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ● కార్పొరేటర్కు రూ.25 లక్షల చొప్పున బేరం ● ససేమిరా అంటున్న వారికి ఎక్కువ ఆఫర్లు ● లొంగని వారికి బెదిరింపులు డాబాగార్డెన్స్ (విశాఖ): విశాఖలో కూటమి కుట్రలు తారస్థాయికి చేరుకున్నాయి. ఎలాగైనా మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలనే దుర్బుద్ధితో తెర వెనుక అప్రజాస్వామిక ప్రయత్నాలు సాగిస్తున్నారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అవసరమైన సంఖ్యా బలాన్ని కూడగట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా వైఎస్సార్ సీపీకి చెందిన కార్పొరేటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు కోట్లాది రూపాయలు సిద్ధం చేశారు. ఒక్కొక్క కార్పొరేటర్కు ఏకంగా రూ.25 లక్షలు వెలకట్టి, వారిని కొనుగోలు చేసేందుకు తెగబడినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో కూటమికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం నేరుగా రంగంలోకి దిగడం గమనార్హం. కొందరికి భారీ మొత్తంలో డబ్బు ఆఫర్ చేస్తూ, మరికొందరి వ్యాపారాలను అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఎవరైనా లొంగకపోతే వారి ఆస్తులను ధ్వంసం చేస్తామని బహిరంగంగానే హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ ఇదే తరహా అప్రజాస్వామిక విధానాలను అవలంబించి స్థానిక సంస్థలను చేజిక్కించుకున్న కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు విశాఖ నగర పీఠాన్ని కూడా తమ గుప్పిట్లో పెట్టుకోవాలని కుట్రలు పన్నుతోంది. గ్రేటర్లో బలం లేకపోయినా.. గ్రేటర్లో కూటమికి సంఖ్యా బలం లేదు. మహా విశాఖ నగరపాలక సంస్థలోని 98 వార్డులకు కార్పొరేటర్లు ఎన్నికయ్యారు. ప్రస్తుతం 19వ వార్డు మినహాయిస్తే 97 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వైఎస్సార్ సీపీ 58, తెలుగుదేశం 29, జనసేన 3, సీపీఐ, సీపీఎం, భాజపాకు ఒక్కొక్కరు, నలుగురు స్వతంత్ర కార్పొరేటర్లు గెలుపొందారు. అయినప్పటికీ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లను నయానో భయానో తమకు మద్దతు తెలిపేలా స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రలోభాలు, బెదిరింపులకు దిగుతున్నారు. ఇందుకోసం అవసరమైతే క్యాంపు రాజకీయాలకు కూడా సిద్ధమవుతున్నారు. కూటమిలో చేరితే రూ.25 లక్షలు ఇస్తామని ఎర వేస్తున్నట్టు తెలిసింది. అక్కడికీ లొంగకపోతే మరింత ఎక్కువ ఇస్తామని నమ్మబలుకుతున్నారు. వార్డుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేయిస్తాం.. వచ్చే ఎన్నికల్లో సీటు మీదే.. ఇలా పలు విధాలుగా లొంగదీసుకునేందుకు శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. లొంగని కార్పొరేటర్లకు బెదిరింపులు కూటమి నేతల ఆఫర్లకు తలొగ్గని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లపై బెదిరింపులు దిగుతున్నారు. మద్దతు తెలపని కార్పొరేటర్లను ‘మీ అంతు చూస్తాం’అంటూ కూటమి నేతలు హెచ్చరిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా వార్డుల్లో అభివృద్ధి పనులు జరగనివ్వబోమని, వ్యాపారాలు, ఇతర పనులు సాఫీగా సాగనివ్వమని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ‘రాష్ట్రంలో మా ప్రభుత్వమే ఉంది. మా నాయకుడు ఇప్పటికే వైఎస్సార్ సీపీకి ఎటువంటి పనులు చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు.’ అంటూ కూటమి నేతలు బెది రింపులకు పాల్పడుతున్నారని పలువురు వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి ద్రోహం చేయలేను ‘నాకు వైఎస్సార్ సీపీ రాజకీయ భిక్ష పెట్టింది. పార్టీకి ద్రోహం చేయలేను. ఇప్పటికే జనసేన, టీడీపీల నుంచి నాకు ఫోన్లు వచ్చాయి. వాళ్లు ఎన్నో ప్రలోభాలు పెట్టారు. వచ్చే ఎన్నికల్లో నా వార్డు నుంచి నేనే కార్పొరేటర్గా ఉంటానని హామీ ఇచ్చారు. నా వార్డు అభివృద్ధికి మరింత సహకారం అందిస్తామని చెప్పారు. వార్డులో జనసేన, టీడీపీ కార్యకర్తలు నా వెంటే ఉంటారని తెలిపారు. అంతేకాదు నాకు మరిన్ని పదవులు ఇస్తామని ఎన్నో వాగ్దానాలు చేశారు. డబ్బు కూడా ఇస్తామన్నారు.’అంటూ ఓ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ ఆవేదన వ్యక్తం చేశారు. -
రైతన్న గుండె మండింది..
దేవరాపల్లి: విత్తు నాటాడు.. నీరు పోశాడు.. బాగా ఎదగాలని ఎరువులు వేశాడు.. పండిన చెరకు గడలను చూసి మురిసిపోయాడు.. లాభాల తీపి ఊహించుకొని ఆనందపడ్డాడు.. కానీ పెట్టుబడులకు సరిపడా గిట్టుబాటు ధర లేకపోవడం, గోవాడ సుగర్ ఫ్యాక్టరీలో సక్రమంగా క్రషింగ్ జరపకపోవడంతో కలత చెందిన రైతు తన పంటకు తానే నిప్పంటించుకున్నాడు. దేవరాపల్లి మండలం కొత్తపెంట గ్రామానికి చెందిన రైతు రొంగలి వెంకటరావు కన్నీటి కథ ఇది. కె.కోటపాడు మండలం మేడిచెర్ల గ్రామ రెవెన్యూ పరిధిలో వెంకటరావు 80 సెంట్ల విస్తీర్ణంలో చెరకు పంటను సాగు చేస్తున్నాడు. పంట కోత దశకు చేరుకున్న తరుణంలో గిట్టుబాటు ధర లేకపోగా, గోవాడ సుగర్ ఫ్యాక్టరీలో తరచూ క్రషింగ్ నిలిచిపోతుండటంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ పంటను ఫ్యాక్టరీకి తరలించినా సకాలంలో పేమెంట్లు రాక.. కనీసం కోత కూలి, రవాణా చార్జీలు చెల్లించే పరిస్థితి లేదని భావించిన రైతు గత్యంతరం లేక బాధతో పంటకు నిప్పంటించాడు. గతంలో 50 టన్నుల వరకు ఫ్యాక్టరీకి చెరకు సరఫరా చేసేవాడినని, అప్పట్లో ప్రతి 15 రోజులకోసారి పేమెంట్లు ఇచ్చేవారని వెంకటరావు తెలిపాడు. ప్రస్తుతం చెరకుతో రోజుల తరబడి కాటా, ఫ్యాక్టరీ వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడిందని, దీంతో చెరకు ఎండిపోయి బరువు తగ్గి మరింత నష్టం వాటిల్లుతుందని, సాగు చేసిన పంటకు పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో నిప్పు పెట్టానని చెప్పాడు. ఈ చర్యతోనైనా కూటమి ప్రభుత్వానికి రైతుల కష్టాలపై కనువిప్పు కలగాలన్నాడు. కలెక్టర్ ఆదేశాలతో జేసీ విచారణ రైతు స్వయానా చెరకు తోటకు నిప్పు పెట్టిన ఘటనపై కలెక్టర్ విజయ కృష్ణన్ స్పందించి విచారణకు ఆదేశించారు. ఆమె ఆదేశాలతో జేసీ జాహ్నవి గోవాడ సుగర్ ఫ్యాక్టరీ ఎండీ, రెవెన్యూ అధికార్లతో కలిసి సంఘటన ప్రాంతాన్ని సందర్శించి బాధిత రైతు వెంకటరావుతో మాట్లాడారు. చెరకు పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో పాటు ఫ్యాక్టరీ సక్రమంగా క్రషింగ్ జరపక పోవడం పట్ల ఆవేదనతో తానే పంటకు నిప్పు పెట్టినట్లు రైతు తెలియజేశారు. వెంటనే రైతుకు జరిగిన పంట నష్టంపై నివేదిక ఇవ్వాలని రెవెన్యూ అధికార్లను జేసీ ఆదేశించారు. పంటను వెంటనే ఫ్యాక్టరీకి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఫ్యాక్టరీ ఎండీని ఆదేశించారు. ఫ్యాక్టరీ పరిధిలో చెరకు మొత్తం తీసుకోవడం జరుగుతుందని, 2600 ఎకరాలలో చెరకు క్రషింగ్ రెండు వారాలలో పూర్తి చేస్తామన్నారు. చెరకు బకాయిలు చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని, రైతులు ఆందోళన చెందవద్దని తెలిపారు. జేసీ వెంట దేవరాపల్లి, కె.కోటపాడు రెవెన్యూ అధికార్లు, స్థానిక ఏవో వై. కాంతమ్మ, కొత్తపెంట సర్పంచ్ రొంగలి వెంకటరావు తదితర్లు ఉన్నారు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే చెరకు రైతుకు ఈ దుస్థితి : సీపీఎం నేత వెంకన్న కొత్తపెంటలో చెరకు రైతు తన పంటకు నిప్పు అంటించుకున్నారని విషయం తెలుసుకున్న సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న సంఘటన స్థలాన్ని పరిశీలించి, బాధిత రైతును ఓదార్చారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గోవాడ సుగర్ ఫ్యాక్టరీ పరిధిలోని చెరకు రైతులకు ఈ దుస్థితి దాపురించిందన్నారు. ఎన్నికలకు ముందు ఫ్యాక్టరీని ఆధునీకరిస్తామని చెప్పిన ఎంపీ సీఎం రమేష్, చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు గెలుపొందాక కన్నెత్తి చూడకపోవడం దారుణమన్నారు. ప్రధాన మోడి వద్ద తనకు పలుకుబడి ఉందని ఊదరగొట్టిన ఎంపీ సీఎం రమేష్ ఫ్యాక్టరీని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. -
క్వారీ లారీలు
●పడగ విప్పిన మైనింగ్ మాఫియాకూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత క్వారీ లారీలు పెరిగాయి. విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. ప్రజల ప్రాణాలంటే, ప్రభుత్వ ఆస్తులంటే లెక్కలేని రీతిలో ఏది ఎదురుపడితే దానిని ఢీకొట్టి వెళ్లిపోతున్నాయి. పరిమితికి మించి అధిక లోడ్తో వెళ్లడమే ఇందుకు కారణం. రాంబిల్లి మండలంలో నేవల్ పనుల కోసం ప్రైవేటు ఆపరేటర్లు పెద్ద పెద్ద బండరాళ్లను, నల్లరాయిని, రోడ్డు మెటల్ను పెద్ద స్థాయిలో రవాణా చేస్తున్నారు. దీని వెనుక ఓ బడా ప్రజాప్రతినిధి ఉండడమే నిర్వాహకులు చెలరేగిపోవడానికి కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మునగపాక మెయిన్రోడ్డులో మితిమీరిన వేగంతో వచ్చిన క్వారీ లారీ ఢీకొని కొద్ది రోజుల క్రితం మాడా కన్నారావు అనే ఎల్ఐసీ ఏజెంట్ మృతి చెందారు. సోమవారం అనకాపల్లి టౌన్లో విజయరామరాజు పేట వద్ద గల రైల్వే అండర్ బ్రిడ్జి గడ్డర్ను క్వారీ లారీ ఢీకొనడంతో విరిగిపోయింది. సకాలంలో రైల్వే సిబ్బంది స్పందించడంతో భారీ ప్రమాదం తప్పింది. కాటేస్తున్న ● కూటమి ప్రభుత్వంలో పెరిగిన మైనింగ్ అక్రమ తవ్వకాలు ● ప్రజా ప్రతినిధుల అండతో చెలరేగిపోతున్న క్వారీ యాజమాన్యాలు ● పరిమితి మించి అధిక లోడ్తోనే ప్రమాదాలు ● రోజుకు 300 –350 క్వారీ లారీల రాకపోకలు ● కమిషన్ కోసం అతి వేగంగా వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు ● మొన్న మునగపాకలో క్వారీ లారీ ఢీకొని ఎల్ఐసీ ఏజెంట్ మృతి ● నిన్న క్వారీ లారీ ఢీకొనడంతో దెబ్బతిన్న రైల్వే గడ్డర్ సాక్షి, అనకాపల్లి: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత జిల్లాలో మైనింగ్ మాఫియా పెరిగింది. కొండలను పిండి చేసి నల్లరాయిని దర్జాగా అమ్ముకుంటున్నారు. కూటమి ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనూ అనుమతులకు మించి, పరిధి దాటి రాయి తవ్వకాలు చేపట్టడమే కాకుండా.. నిబంధనలకు విరుద్ధంగా వాటిని తరలిస్తున్నారు. పెద్ద పెద్ద బండరాళ్లను, నల్లరాయిని, రోడ్డు మెటల్ను రాంబిల్లి మండలంలో నేవీ ప్రత్యామ్నాయ ఆపరేషన్ బేస్కు రవాణా చేస్తున్నారు. సముద్ర తీరంలో జెట్టీ నిర్మాణానికి, బ్రేక్ వాటర్స్ కోసం భారీ ఎత్తున నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులకు పెద్ద పరిమాణంలో వుండే బండరాళ్ల అవసరం ఏర్పడింది. ఇదే అదునుగా మైనింగ్ అధికారుల సహకారంతో అనకాపల్లి, రోలుగుంట, కె.కోటపాడు, దేవరాపల్లి మండలాల్లో రాయి క్వారీల నిర్వాహకులు నేవల్ బేస్ పనులకు బండరాళ్ల సరఫరా కోసం సంబంధిత కాంట్రాక్టర్లతో ఒప్పందాలు చేసుకున్నారు. చాలా వరకు అనుమతులు లేకుండానే ఇవి జరిగిపోయాయి. ఆయా మండలాల్లోని క్వారీల నుంచి నిత్యం వందలాది టిప్పర్లలో పెద్ద పెద్ద బండరాళ్లను తరలిస్తున్నారు. అనుమతి లేనివే ఎక్కువ జిల్లాలో గనుల శాఖ అనుమతి వున్న రాయి/కంకర క్వారీలు 60 మాత్రమే ఉన్నాయి. కానీ ఒక్క అనకాపల్లి డివిజన్లోనే ఎటువంటి అనుమతులు లేకుండా 150కి పైగా క్వారీలు నడుస్తున్నాయి. అనకాపల్లి మండలంలోని మార్టూరు, మామిడిపాలెం, మాకవరం, ఊడేరు, కుంచంగి, కూండ్రం పరిసరాల్లో అనుమతి లేని రాయి క్వారీలు పదుల సంఖ్యలో ఉన్నాయి. రోలుగుంట, రావికమతం, మాకవరపాలెం మండలాల్లో కూడా క్వారీలు అక్రమంగా నడుస్తున్నాయి. అనకాపల్లి మండలంలోని క్వారీల నుంచి నిత్యం వందల సంఖ్యలో టిప్పర్లు, లారీల్లో బండరాళ్లను తరలిస్తున్నారు. ఒకటి, రెండు ప్రముఖ సంస్థల పేరున ఉన్న లీజు పత్రాల ఆధారంగా నకిలీ వేబిల్లులతో అనధికార క్వారీల నుంచి కంకర, నల్లరాయి రవాణా చేస్తున్నారు. గనులు, రవాణా, పోలీసు శాఖల తనిఖీలు నామమాత్రం కావడం, కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు అండగా వుండడంతో అక్రమ క్వారీల నిర్వాహకుల వ్యాపారం మూడు టిప్పర్లు, ఆరు లారీల చందంగా సాగిపోతున్నది. స్థానికులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. గనుల శాఖ విజిలెన్స్, ఎన్ఫోర్సుమెంట్ అధికారులు అప్పుడప్పుడు క్వారీల్లో తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నారు. కొన్ని వాహనాలను స్వాధీనం చేసుకొని మొక్కుబడిగా అపరాధ రుసుం విధించి వదిలేస్తున్నారు. అక్రమంగా తరలిపోతున్న దానిలో అధికారులు పట్టుకుంటున్నది పట్టుమని పది శాతం కూడా ఉండడంలేదు. క్వారీ లారీలను అడ్డుకున్న రైతులు, స్థానిక ప్రజలు రోజు రోజుకూ క్వారీ యాజమాన్యాలకు, స్థానిక రైతుల మధ్య వివాదాలు తీవ్రతరం అవుతున్నాయి. మా మాట వినండి, మాకు నష్టం చేకూర్చే క్యారీలు ఆపండని బాధిత రైతులు కోరుతున్నా.. మైనింగ్, పోలీస్ శాఖల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. స్థానిక కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు అండతో క్వారీ యాజమాన్యాలు చెలరేగిపోతున్నారు. దీంతో రెండు రోజుల క్రితమే క్వారీ లారీలను శరభవరం, రాజన్నపేట, గొల్లపేట, వడ్డిపె గ్రామాల్లో రైతులు అడ్డుకున్నారు. ఆందోళనలు కూడా చేశారు. వారం రోజుల క్రితం వరకూ సుమారు 25 రోజుల పాటు నల్లరాయి రవాణా ఆపిన యజమాన్యం మరలా ఈ రవాణా కొనసాగించింది. దీంతో పై గ్రామాలవారు క్వారీ నిర్వహణ ప్రాంతం సమీపంలో రవాణా ఆపాలి, కొండలు పేల్చడం ఆపాలంటూ యాజమాన్యాన్ని కోరారు. వినకపోవడంతో అడ్డుకున్నారు. తమకు కూటమి ప్రభుత్వ నేతలు అండగా ఉన్నారని బహిరంగంగా చెబుతున్నారు. ఈ నేపథ్యలో శరభవరం గ్రామానికి చెందిన జలుమూరి సత్తిబాబు అనే రైతు మానసిక వ్యధతో మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అదేవిధంగా రోలుగుంట నుంచి మాకవరపాలెంలో ఆన్రాక్ కంపెనీకి వచ్చే లోడ్ లారీలను స్థానికులు అడ్డుకున్నారు. డ్రైవర్లు నిర్లక్ష్యంగా వాహనాలు నడపడంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రోడ్లు దెబ్బతింటున్నాయి. కూటమి నేతల అక్రమ వసూళ్లు రోజుకు 1000 ట్రిప్లు.. అనకాపల్లి రూరల్ పరిధిలో మార్టూరు, మామిడపాలెం, మావవరం, బౌలువాడ, కుంచంగి, వేట జంగాలపాలెం, వెంకుపాలెం గ్రామాల నుంచి రాంబిల్లి మండలంలో నావెల్ బేస్ ప్రాజెక్టుకు బండరాళ్లు సరఫరా అవుతున్నాయి. అనకాపల్లి రూరల్ ప్రాంతంలో మాకవరం, మామిడిపాలెం, మార్టూరు గ్రామాల్లో, బౌలువాడ, కుంచంగి, వేటజంగాలపాలెం, వెంకుపాలెం గ్రామాల సమీపంలో ఉన్న క్వారీల నుంచి రవాణా చేస్తున్నారు. చోడవరం నియోజకవర్గంలో రోలుగుంట, రావికమతం, కాకినాడ జిల్లాలో రౌతులపూడి, కోటనందూరు మండలాల నుంచి క్వారీ లారీల్లో రవాణా జరుగుతున్నాయి. రోజుకు సుమారుగా 300 నుంచి 350 వరకూ క్వారీ లారీల ద్వారా 1000 ట్రిప్లు వెళుతున్నాయి. రోజుకు సుమారు 12,000 నుంచి 13,000 టన్నుల స్టోన్ రవాణా జరుగుతోంది. మైనింగ్ పేరిట కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు లక్షలు ఆర్జిస్తున్నారు. టన్నుకు రూ.30 చొప్పున నెలకు సగటున రూ.కోటి 8 లక్షల అక్రమ వసూళ్లు చేస్తున్నారు. అదేవిధంగా ట్రాన్స్పోర్టు పరంగా చూస్తే ఒక లారీ రోజుకు రెండు నుంచి మూడు ట్రిప్పులు వేస్తుంది. రెండు లోడ్లకు 80 టన్నులు, మూడు లోడ్లు అయితే 120 టన్నులు రవాణా జరుగుతుంది. ఒక టన్నుకు రూ.500 చొప్పున నెలకు రూ.12 లక్షలు వసూలు చేస్తారు. 300 నుంచి 350 లారీలకు రూ.36 కోట్ల నుంచి రూ.40 కోట్లు వసూలవువుతాయి. కూటమి ప్రజాప్రతినిధులైన స్థానిక ఎంపీ, స్థానిక ఎమ్మెల్యేలు ఈ దందా నడిపిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. అందుకే అధిక లోడ్తో రవాణా చేసినా .. ప్రమాదాలు జరిగినా అధికారులు, పోలీసులు చోద్యం చూస్తున్నారే తప్ప చర్యలు ఉండడం లేదు. అక్రమ మైనింగ్ దందాలన్నీ పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని, అనకాపల్లిలో రైల్వే బ్రిడ్జి ప్రమాదానికి ఆయనే బాధ్యత వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కె.లోకనాథం నేతృత్వంలోని బృందం సభ్యులు సోమవారం విమర్శించిన విషయం తెలిసిందే. -
లైన్ ఇన్స్పెక్టర్కు ఘనసత్కారం
మాణిక్యాలరావు దంపతులను సత్కరిస్తున్న డీఈ, ఇతర సిబ్బంది మాకవరపాలెం : జాతీయ అవార్డు అందుకున్న విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్ బొంతు మాణిక్యాలరావును ఘనంగా సత్కరించారు. స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్లో రెండున్నరేళ్లుగా లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న మాణిక్యాలరావు జాతీయ లైన్మెన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నెల 4న ఢిల్లీలో కేంద్ర విద్యుత్శాఖ మంత్రి చేతుల మీదుగా మాణిక్యాలరావు అవార్డు అందుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి డివిజన్ పరిధిలోని విద్యుత్శాఖ అధికారులు, సిబ్బంది సబ్ స్టేషన్ వద్ద సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాణిక్యాలరావు దంపతులను నర్సీపట్నం డీఈ రామకృష్ణ, ఏడి త్రినాథరావు, స్థానిక ఏఈ బాలకృష్ణ, ఇతర సిబ్బంది ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వివిద మండలాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
తాండవ కాలువల అభివృద్ధికి భూమిపూజ
నాతవరం: ఖరీఫ్ సీజన్లో తాండవ రిజర్వాయరు నీరు శివారు ఆయకట్టుకు అందించాలంటే కాలువలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తేనే సాధ్య పడుతుందని ప్రాజెక్టు డీఈ ఆనురాధ అన్నారు, తాండవ ఆయకట్టు పరిధిలో నాతవరం నర్సీపట్నం మండలాల మధ్య బలిఘట్టం మేజరు కాలువను అభివృద్ధికి రూ.11.70 లక్షలతో మంగళవారం భూమి పూజ చేశారు. ఆమె మాట్లాడుతూ తాండవ ఆయకట్టు పరిధిలో కాలువలు అభివృద్ధి చేసేందుకు 18పనులు రూ.2.10 కోట్లతో టెండర్లు ఖరారు చేశామన్నారు. వాటిలో ప్రస్తుతం కొన్ని పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. మిగతా పనులు కూడా త్వరలో ప్రారంభించి సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో తాండవ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కరక సత్యనారాయణ, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ, ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ జోగుబాబు, తాండవ ప్రాజెక్టు నాతవరం సెక్షన్ జేఈ శ్యామ్కుమార్, నీటి సంఘాల అధ్యక్షులు, రైతులు పాల్గొన్నారు. -
రసాయన పరిశ్రమల్లో రక్షణ వ్యవస్థలపై నిరంతర పర్యవేక్షణ
సాక్షి, అనకాపల్లి : పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా కర్మాగారాల లోపల, వెలుపల కూడా రక్షణ వ్యవస్థలను సక్రమంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా సంక్షోభ నిర్వహణ కమిటీ చైర్మన్ విజయ కృష్ణన్ తెలిపారు. మంగళవారం కలెక్టరు కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఫ్యాక్టరీలలో ఏర్పాటు చేసిన రక్షణ వ్యవస్థల గూర్చి సమీక్ష చేశారు. ఫ్యాక్టరీ లోపల, వెలుపల కూడా రసాయనాలు లీకేజీలను గుర్తించే సెన్సార్లను అమర్చాలని తెలిపారు. ఫ్యాక్టరీలలో అమర్చిన రక్షణ పరికరాలకు, జాతీయ సేఫ్టీ కౌన్సిల్ ఆమోదం ఉండాలని తెలిపారు. ఫ్యాక్టరీ వెలుపల ప్రమాదాలకు సంబంధించిన రక్షణ వ్యవస్థల నివేదికలను 20 రోజుల్లో అందజేయాలని తెలిపారు. కంపెనీలలో శిక్షణ పొందిన కార్మికులను నియమించుకోవాలని ఆదేశించారు. జిల్లాలో గల 12 రసాయన కర్మాగారాల్లో మాక్ డ్రిల్ను కూడా నిర్వహించాలని సూచించారు. రసాయనాలను రవాణా చేసే వాహనాలకు కూడా రసాయనాల లీకేజీలను గుర్తించే సెన్సార్లు అమర్చాలని తెలిపారు. సమావేశంలో రెవిన్యూ డివిజినల్ అధికారి షేక్ ఆయిషా, ఫ్యాక్టరీల జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టరు జె. శివశంకర్ రెడ్డి, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ జి.వి.ఎస్.ఎస్. నారాయణ, జిల్లా పరిశ్రమల అధికారి నాగరాజారావు, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ● జిల్లా కలెక్టరు విజయ కృష్ణన్ -
సైక్లోథాన్కు ఘనస్వాగతం
యలమంచిలి రూరల్: సీఐఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం 2025 సందర్భంగా తీర ప్రాంత ‘సైక్లోథాన్–2025’ మంగళవారం యలమంచిలి చేరుకుంది. తీరప్రాంత భద్రత గురించి అవగాహన పెంపొందించడం, స్మగ్లింగ్, మాదక ద్రవ్యాల రవాణా వంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ యాత్ర కొనసాగుతోంది. మంగళవారం పట్టణానికి చేరుకున్న సైక్లోథాన్కు విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈనెల 31వ తేదీన కన్యాకుమారి చేరుకోవడంతో సైక్లోథాన్ 2025 ముగుస్తుంది. కార్యక్రమంలో కమాండెంట్ సతీష్ కుమార్ బాజ్పాయ్, డిప్యూటీ కమాండెంట్ వికాష్ కుమార్ సాహు, సహాయ కమాండెంట్ అమిత్ కుమార్, ఇన్స్పెక్టర్ కె.కుమార్, మున్సిపల్ కమిషనర్ బీజేఎస్ ప్రసాదరాజు, తహసీల్దార్ కె.వరహాలు, పట్టణ ప్రణాళికాధికారి వై.శ్రీలక్ష్మి, పట్టణ ఎస్సై కె.సావిత్రి, పీడీ వై.పోలిరెడ్డి, వీరభద్రరావు, సత్యనారాయణ పాల్గొన్నారు. -
విరాళ సొమ్ము దోచుకోవాల్సిన అవసరం లేదు
● వైఎస్సార్సీపీ హయాంలోనే ఆలయ నిర్మాణం ● స్పీకర్ ఆరోపణలను తిప్పికొట్టిన మాజీ ఎమ్మెల్యే గణేష్నర్సీపట్నం : నూకాలమ్మ ఆలయ నిర్మాణానికి విరాళంగా ఇచ్చిన నిధులను దోచుకోవాల్సిన అవసరం తనకు లేదని, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తప్పుడు ఆరోపణలు మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ హితవు పలికారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవుడి సొమ్ము తినాలని ఎవరూ అనుకోరన్న విషయాన్ని స్పీకర్ గ్రహించాలన్నారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి టీడీపీ ప్రభుత్వ హయాంలో కంట్రిబ్యూషన్ కింద రూ.10 లక్షలు చెల్లించారు. ఎన్నికలు మూడు నెలలు ఉండగా ఆలయ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ అప్పలనాయుడు 2019 డిసెంబరులో నిర్మాణానికి అనుమతులు ఇచ్చామన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రూ.40 లక్షల వ్యయంతో నూతన గుడిని నిర్మిస్తే తానే కట్టానని స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.40 లక్షలు, కంట్రిబ్యూషన్ రూ.10 లక్షలు మొత్తం రూ.50 లక్షలతో ఆలయ నిర్మాణం చేపట్టామన్నారు. ఆలయ పనులు అసంపూర్తిగా ఉండడంతో నూకాలమ్మ ఆలయానికి సీఎంఆర్ అధినేత మావూరు వెంకటరమణను ఆర్ధిక సాయం కోరడం జరిగిందన్నారు. సీఎంఆర్ అధినేత అమ్మవారి ఆలయానికి రూ.10 లక్షలు విరాళం ప్రకటించారు. సీఎంఆర్ సంస్థ వ్యాపారంతో పాటు అనేక సేవా కార్యక్రమాలకు విరాళాలు ద్వారా తోడ్పాటునందించడంతో పాటు వారి సంస్థలో ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారన్నారు. సమాజ శ్రేయస్సు కోసం ఇచ్చిన విరాళం నిధులను దోచుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. సీఎంఆర్ సంస్థ ప్రకటించిన రూ.10 లక్షల విరాళానికి సంబంధించి లావాదేవీలన్ని సీఎంఆర్ సంస్థ మేనేజర్, నూకాలమ్మ టెంపుల్ చైర్మన్ ధనిమిరెడ్డి నాగు మధ్య జరిగాయన్నారు. ఏ పనికి ఎంత ఖర్చు పెట్టారన్నది పక్కాగా వివరాలు ఉన్నాయన్నారు. సీఎంఆర్ సంస్థ, చైర్మన్ మధ్య లావాదేవీలు జరిగితే తనపై బురదజల్లడం స్పీకర్కు తగదన్నారు. నూకాలమ్మ ఆలయంలో నూతన విగ్రహం ఏర్పాటుకు ఎంత అవుతుందని శిల్పిని సంప్రదిస్తే రూ.లక్షా 50 వేలు అవుతుందన్నారు. అమ్మవారి విగ్రహం కోసం తాను స్వయంగా రూ.లక్ష విరాళంగా ఇచ్చి విగ్రహం తయారు చేయించానన్నారు. విరాళాలను అకౌంట్కు ఎలా జమ చేస్తారని ప్రశ్నించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెప్పిందే నిజమైతే ఇదే సీఎంఆర్ అధినేత సుమారు రూ.20 లక్షల విరాళంతో నర్సీపట్నం శ్మశాన వాటికను సుందరీకరణ చేశారు. ఆ నిధులను మున్సిపాలిటీ అకౌంట్కు ఎందుకు జమ చేయలేదని మాజీ ఎమ్మెల్యే గణేష్ ప్రశ్నించారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్చైర్మన్ కోనేటి రామకృష్ణ, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఏకా శివ పాల్గొన్నారు. -
మూటలో మహిళ శరీర భాగాలు
ఎవరు అంతమొందించారో..కశింకోట మండలం బయ్యవరంలో సంచలనంకశింకోట: ఆ మహిళకు సుమారు 35 ఏళ్ల వయసు ఉండవచ్చు.. చేతికి గాజులు.. కాలికి మట్టెలు.. ఆమె వివాహిత అని చెప్పకనే చెబుతున్నాయి.. కొద్ది గంటల క్రితమే హత్య జరిగి ఉండవచ్చని వైద్యులు ధ్రువీకరించారు.. కశింకోట మండలం బయ్యవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై రెండు మందుల మధ్య ఖాళీ స్థలం దొరికిన ఒక మూటలో మొల దిగువ భాగం కాళ్లు, ఒక చేయి ఉన్నాయి.. మంగళవారం ఉదయం స్థానికులు అందించిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మూట విప్పి.. ఆ దృశ్యాన్ని చూసి హతాశులయ్యారు. అనకాపల్లి డీఎస్పీ ఎం. శ్రావణి అభిప్రాయం ప్రకారం.. సోమవారం రాత్రి మహిళను హత్య చేసి శరీర భాగాలను ముక్కలుగా కోసి మూటగట్టి సోమవారం రాత్రి తెచ్చి ఇక్కడ పడేసి ఉంటారు. సీఐ అల్లు స్వామినాయుడు తదితర సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని ఆమె సందర్శించారు. మృతురాలి శరీర భాగాలపై వస్త్రాలు గాని, మరే ఆధారాలుగాని లేవు. గాజులు, మట్టెలు మాత్రం దొరికాయి. మిగిలిన మృతదేహ భాగం లభ్యమయితే తప్ప ఎవరో గుర్తించే అవకాశం లేదు. అయితే కాలి భాగంలో ఒక పుట్టు మచ్చ ఉంది. మిగిలిన శరీర భాగాన్ని మరోచోట పడేయడం గాని, పూడ్చి వేయడం గాని చేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసు జాగిలం యలమంచిలి మార్గం వైపు వెళ్లింది. మృతదేహం శరీర భాగాలను అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రపరిచారు. 8 ప్రత్యేక బృందాల ఏర్పాటు మహిళ హత్య కేసును ఛేదించడానికి 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. అనకాపల్లి ఎస్పీ సెలవులో ఉండటంతో ఆయన ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. సంఘటన స్థలాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచిన శరీర భాగాలను కూడా ఆయన పరిశీలించారు. సీసీ టీవీ పుటేజి, స్థానికుల సమాచారాన్ని విశ్లేషించి నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్టు చేస్తామని చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించి ఏ విధమైన సమాచారంగాని, అద్యశ్యమైన మహిళల వివరాలు గాని తెలిసిన వారు తక్షణమే పోలీసు అధికారుల దృష్టికి తీసుకు రావాలన్నారు. కశింకోట సీఐ అల్లు స్వామినాయుడు సెల్ నెంబర్ 9440796088కు గాని, 100, 112 నెంబర్లకు గాని సమాచారాన్ని తెలియజేయాలన్నారు. వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఆయన వెంట అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహనరావు, అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఎం.శ్రావణి, సీఐలు విజయకుమార్, అశోక్కుమార్, కోటేశ్వరరావు, పైడపు నాయుడు, అప్పలరాజు, అప్పలనాయుడు తదితరులు ఉన్నారు. -
సీఐపీఈటీ సహకారంతో ఎన్టీపీసీలో ఉపాధికి శిక్షణ
పరవాడ: విజయవాడలోని సీఐపీఈటీ సహకారంతో సింహాద్రి ఎన్టీపీసీ యాజమాన్యం కల్పిస్తున్న ఉపాధి శిక్షణ కార్యక్రమాన్ని ఉమ్మడి విశాఖ జిల్లా నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సంస్థ ఈడీ సమీర్శర్మ కోరారు. విజయవాడలోని సీఐపీఈటీని ఈడీ సమీర్శర్మ, సంస్థ అధికారులు మంగళవారం సందర్శించారు. శిక్షణ పొందుతున్న నిరుద్యోగులను కలిసి, వారి సాధక బాధలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈడీ సమీర్ శర్మ మాట్లాడుతూ సీఐపీఈటీ సహకారంతో సింహాద్రి ఎన్టీపీసీ శతశాతం ఉద్యోగ నియామక హామీపై మెషిన్ ఆపరేటర్, ప్లాస్టిక్ ప్రాసెసింగ్, మెషిన్ ఆపరేటర్–ఇంజెక్షన్ మోల్డింగ్లో ఆరు నెలల శిక్షణ అందిస్తోందన్నారు. ఇప్పటి వరకు నాలుగు బ్యాచ్లలో 120 మంది నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించామన్నారు. ప్రస్తుతం మరో 60 మంది నిరుద్యోగులు శిక్షణ పొందుతున్నారని పేర్కొన్నారు. -
విద్యుత్ స్తంభం మార్పుపై ఇరువర్గాల వివాదం
నాతవరం: ఇంటి వద్ద ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని పక్కకు మార్పు చేయడంపై ఇరువర్గాల మధ్య వివాదం నెలకొంది. జిల్లేడుపూడి గ్రామంలో లాలం నూకరాజు కొత్తగా నిర్మించిన ఇంటి గేటు ముందు విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా దర్శనమిస్తుంది. ఈ స్తంభం మార్పు చేయడం కోసం విద్యుత్ శాఖ అధికారుల ఆదేశాల ప్రకారం గత నెల 25వ తేదీన లాలం నూకరాజు విద్యుత్శాఖకు రూ.69,500 ఆన్లైన్లో చెల్లింపులు చేశారు. ఈనెల 16వ తేదీన విద్యుత్ స్తంభం మార్పు చేసేందుకు జిల్లేడుపూడిలో నూకరాజు ఇంటి వద్ద సిబ్బంది పనులు ప్రారంభించారు. కొత్తగా స్తంభం ఏర్పాటుకు పాత స్తంభం తొలగించేందుకు గొయ్యి తీశారు. అయితే ఆ సమయంలో సర్పంచ్ లాలం రమణ, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు ద్వారా పనులు నిలుపుదల చేయించారు. కొత్తగా విద్యుత్ స్తంభం వేసే ప్రదేశంలో పంచాయతీ డ్రైనేజీ నిర్మిస్తామంటూ పనులను అడ్డుకున్నారు. పంచాయతీకి సమాచారం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు విద్యుత్ స్తంభం మార్చుకుంటే ఎలా ఊరుకుంటామని సర్పంచ్ రమణ భీిష్మించారు. విద్యుత్ స్తంభం మార్పు కోసం ఆదివారం వైర్లు తొలగించడంతో గ్రామంలో సోమవారం సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో నర్సీపట్నం విద్యుత్ శాఖ ఏడీ సునీల్కుమార్, నాతవరం జేఈ చంద్రమౌళి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అధికారుల ఎదుట ఇరుపార్టీల నాయకులు వివాదానికి దిగారు. విద్యుత్ స్తంభం వేయరాదని సర్పంచ్ రమణ, నిబంధనల మేరకు ప్రభుత్వానికి డబ్బు చెల్లించాం కాబట్టి గొయ్యి తీసిన స్థలంలో స్తంభం వేయాలని మాజీ సర్పంచ్ లోవ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో గత్యంతరం లేక అధికారులు విద్యుత్ స్తంభం మార్పును వారం రోజుల పాటు వాయిదా వేసి విద్యుత్ పునరుద్ధరించి వెళ్లిపోయారు. ఈ విషయమై ఏడీ సునీల్కుమార్ మాట్లాడుతూ స్తంభం మార్పుకు వినియోగదారుడు డబ్బులు కట్టారని, ఈనెల 25వ తేదీ వరకు స్తంభం మార్పుకు సమయం ఉందన్నారు. రాజకీయ నాయకులు సమస్య సృష్టిస్తే పని చేయడం కష్టమన్నారు. -
23న ఫ్లాంట్ పరీక్ష నిర్వహణ
తుమ్మపాల : ఈ నెల 23న జరిగే ఫ్లాంట్ (ఫౌండేషన్ లిటరసీ, న్యూమరసీ – ఎసెస్మెంట్ టెస్ట్) పరీక్షను జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. ఫ్లాంట్ పరీక్ష నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సోమవారం కలెక్టరేట్లో ఆమెతో పాటు జేసీ ఎం.జాహ్నవి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉల్లాస్ అక్షరాస్యతా కార్యక్రమంలో భాగంగా, జిల్లాలో మహిళా స్వయంశక్తి సంఘాల్లో గల నిరక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులను చేయడానికి మొదటి దశలో 11,900 మంది అభ్యాసకులను నమోదు చేసి, 1,190 మంది అక్షరాస్యులతో అక్షరాస్యతా కేంద్రాలను ఏర్పాటు చేసి వాలంటరీ టీచర్ల ద్వారా చదువు నేర్పడం జరిగిందన్నారు. ఆయా అభ్యాసకులకు ఈ నెల 23న అంగన్వాడీ కేంద్రాలలో పాఠశాలో ఫ్లాంట్ పరీక్ష నిర్వహించాలన్నారు. అంగన్వాడీ టీచర్, సెకండరీ గ్రేడు టీచర్ పరీక్ష నిర్వాహకులుగా వ్యవహరించాలన్నారు. వయోజన విద్యాశాఖ నుంచి పరీక్ష పేపర్లు, సంబంధిత సామగ్రి అందజేయనున్నట్టు తెలిపారు. జిల్లా, మండల స్థాయిలో సంబంధిత శాఖలు సమన్వయంతోని ఫ్లాంటు పరీక్షను నిర్వహించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో వై.సత్యనారాయణరావు, వయోజన విద్య ఉప సంచాలకుడు ఎస్.ఎస్.వర్మ, నోడల్ అధికారి డి.చిన్నికృష్ణ, డీఆర్డీఏ పీడీ కె.శచీదేవి, ఐసీడీఎస్ పీడీ కె.అనంతలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు. -
కశింకోటలో సినిమా షూటింగ్ సందడి
కశింకోట: కశింకోటలోని ఆర్ఈసీఎస్ ప్రధాన కార్యాలయం ఆవరణలో ‘అనకాపల్లి’ పేరిట నిర్మిస్తున్న సినిమా చిత్రీకరణ జరుగుతోంది. నూతన నటీనటులు, దర్శకులతో దీన్ని నిర్మిస్తున్నారు. లగడపాటి విక్రం, సంధ్య హీరో, హీరోయిన్లగా దర్శకుడు కాగేష్ తొలి ప్రయత్నంగా నిర్మాణం చేపట్టారు. సినిమాలో కొంత మేర క్లైమాక్స్ దృశ్యాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఆర్ఈసీఎస్ కార్యాలయం వెనుక భాగంలో బెల్లం దిమ్మెల శ్రేణి, చెరకు గడలు, బెల్లం తయారీ పెనం ఏర్పాటు చేయడంతోపాటు పొగాకు తోరణాలతో అలంకరించిన గుడిసెల సెట్ వేశారు. వాటిలో రొమాన్స్కు సంబంధించిన దృశ్యాలను చిత్రీకరించనున్నట్టు సమాచారం. కొంత కాలంగా అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్ చేస్తున్నామని, నెలాఖరుకు పూర్తి కానుందని మేనేజర్ తెలిపారు. -
ముసుగుదొంగలను పట్టుకోవాలి..
ముషిడిపల్లి నుంచి జంక్షన్కు వెళ్లే మార్గంలో గుర్తు తెలియని వ్యక్తులు దారి కాచి దాడులు చేస్తున్నారు. మా గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలపై దాడి చేసి బంగారు నగలు, డబ్బు దోచుకోవడానికి ప్రయత్నించారు. పట్ట పగలే ఇలా దాడులు చేయడంతో జంక్షన్కు వెళ్లాలంటే మహిళలంతా భయాందోళనలు చెందుతున్నాం. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదు. పోలీస్లు స్పందించి అటువంటి వ్యక్తులపై నిఘా ఉంచి అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలి. –పిల్లి పద్మ, మహిళ, ముషిడిపల్లి. ఒంటరిగా వెళ్లొద్దని చెప్పాను... ముషిడిపల్లి జంక్షన్కు వెళ్లే మార్గంలో చెరువు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేస్తునట్లు మా దృష్టికి వచ్చింది. ఈ దాడుల విషయమై ఐదుగురు తనకు సమాచారం అందించారు. ముషిడిపల్లి మీదుగా ప్రయాణించే ఎ.కొత్తపల్లి వాసులను కూడా అడ్డగించినట్లు మా దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని దేవరాపల్లి ఎస్ఐ గారి దృష్టికి తీసుకెళ్లాను. కానిస్టేబుల్స్ను పంపించారు. ఒంటరిగా వెళ్లోద్దని గ్రామస్తులకు తెలియజేశాను. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని గ్రామ పెద్దలకు కూడా తెలియజేశాను. –లావణ్య, గ్రామ మహిళ సంరక్షణ కార్యదర్శి, ముషిడిపల్లి. దొంగల పనిపడతాం ముషిడిపల్లిలో రాకపోకలు సాగించే వారిని అడ్డగించి దోపిడికి యత్నిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. స్థానిక గ్రామ సచివాలయ సంరక్షణ కార్యదర్శి కూడా మా దృష్టికి తీసుకువచ్చారు. ప్రత్యేక నిఘా పెట్టి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఆచూకీ లభించడం లేదు. మరింత నిఘా పెట్టి అటువంటి వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షిస్తాం. –టి.మల్లేశ్వరరావు, ఎస్ఐ, దేవరాపల్లి -
ముషిడిపల్లిలో ఆక్రమణలు తొలగించాలని రైతుల బైఠాయింపు
దేవరాపల్లి : మండలంలోని ముషిడిపల్లి రెవెన్యూ పరిధిలోని దుబిరెడ్డి బందతో పాటు చెరువు వాగులో అక్రమ నిర్మాణాలను తక్షణమే తొలగించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. సదరు ఆక్రమణ స్థలంలో నిర్మించిన వైన్ షాపు తదితర నిర్మాణాల ఎదుట వి.సంతపాలెం, గుడిపాల, నీలకంఠరాజుపురం, జమ్మాదేవిపేట, ఆనందపురం, పోతనవలస, ఉగ్గినవలస, కృష్ణారాయుడుపేట తదితర గ్రామాల రైతులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. రెవెన్యూ అధికారులు కాసులకు కక్కుర్తి పడి తప్పుడు రికార్డులను సృష్టించారని వేచలపూడి అగ్రహానికి చెందిన వేపాడ మాజీ ఎంపీపీ వేచలపు చినరామునాయుడు ఆరోపించారు. రాజుగారి చెరువు నుంచి దుబిరెడ్డి బందకు ఇరువైపులా నీరు వెళ్లేందుకు గతంలో నిర్మించిన మదుములను కబ్జా చేశారన్నారు. చెరువు పక్కన ఉన్న గోర్జు అన్యాక్రాంతం చేశారన్నారు. రెవెన్యూ సిబ్బంది ఆక్రమణదారులతో కుమ్మక్కవ్వడంతో పలు గ్రామాలకు చెందిన రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు.ఆందోళనలో వి.ఎస్.నాయుడు, బోజంకి అచ్యుతరామయ్య, సూర్యనారాయణ, చిరికి వెంకటరమణ, సింహాద్రప్పడు పాల్గొన్నారు. ‘ఆరోపణలు నిరాధారం’ ముషిడిపల్లికి చెందిన సర్వసిద్ది నాగేశ్వరరావు నుంచి 2013లో శ్రీకాకుళానికి చెందిన మహిళ జహర్న్ఖాన్ సర్వే నెంబర్ 580–2లో గల 30 సెంట్ల భూమిని కొనుగోలు చేయగా ఆమె నుంచి తాము 2022లో కొనుగోలు చేసినట్టు సోమిరెడ్డి గోవింద, గండి దేవి వివరణ ఇచ్చారు. దీనిపై రైతులు ఆర్డీవో కోర్టులో అప్పీలుకెళ్లగా విచారణ అనంతరం తిరస్కరించారన్నారు. ఆ తర్వాత 8 మంది రైతుల మీద తాము చోడవరం కోర్టుకి వెళ్లగా ఆ భూమిపై తాము తప్ప ఇతరులెవరూ వెళ్లకూడదని కోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం తాము భూమిని కొనుగోలు చేసుకుంటే, కొందరు రైతులను రెచ్చకొట్టి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. -
● జంక్షన్కు వెళ్లే దారిలో పట్టపగలే రెచ్చిపోతున్న దొంగలు ● ఒంటరి మహిళలే టార్గెట్ ● ముఖాలకు ముసుగు వేసుకొని దాడులు ● ఇప్పటి వరకూ ఆరు ఘటనలు ● బెంబేలెత్తుతున్న జనం
దేవరాపల్లి : ముషిడిపల్లి గ్రామం నుంచి జమ్మాదేవిపేట జంక్షన్ వైపు వెళ్లే రహదారిలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా వెళ్తున్న మహిళలతో పాటు పురుషులను సైతం టార్గెట్గా చేసుకొని పట్టపగలే దోపిడీకి పాల్పడుతున్నారు. గ్రామం నుంచి ఈ జంక్షన్ సుమారు రెండు కిలోమీటర్ల మేర దూరం ఉండడంతో పాటు జన సంచారం తక్కువగా ఉండడంతో ఈ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని అటుగా వచ్చేవారిపై దాడి చేసి దోపిడీకి పాల్పడుతున్నారు. నాగారాయుడు చెరువు సమీపంలోని మలుపుల వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ముఖాలకు ముసుగు వేసుకొని అటుగా వచ్చే వారిని అడ్డగించి బ్యాగుల్లో నగదుతో పాటు ఒంటిపై గల ఆభరణాలను దోచుకునేందుకు యత్నిస్తున్నారు. ప్రతిఘటించే వారిపై భౌతిక దాడులకు తెగబడుతున్నారు. సుమారు రెండు నెలల నుంచి ఈ తరహా సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకు ఆరుగురిపై ఈ తరహా దాడులు జరిగినట్టు సమాచారం. తాజాగా ఈనెల 11న రాత్రి 10 గంటల ప్రాంతంలో బైక్పై వస్తున్న యువకుడిని అడ్డుకొని దోపిడీ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ముషిడిపల్లి నుంచి జమ్మాదేవిపేట జంక్షన్ వైపు వెళ్లేందుకు మహిళలతో పాటు గ్రామస్తులు భయాందోళనలు చెందుతున్నారు. ముషిడిపల్లితో పాటు కె.ఎం.పాలెం, ఎ.కొత్తపల్లి గ్రామాల ప్రజలు ఈ రహదారి మీదుగానే ఇటు దేవరాపల్లి, అటు ఆనందపురం, అనకాపల్లి, విశాఖపట్నం వెళ్లేందుకు రాకపోకలు సాగిస్తుంటారు. ఇపుడు ఈ రహదారిలో దారిదోపిడీ ఘటనలతో ఆయా గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు. కాగా ఆయా ఘటనల నుంచి తప్పించుకున్న ముషిడిపల్లి గ్రామానికి చెందిన బాధితుల తెలిపిన వివరాలిలా ఉన్నాయి.ముషిడిపల్లిలో దారి దోపిడీల కలకలం -
బైక్ను అడ్డగించారు..
ఈ నెల 11న రాత్రి 10 గంటల సమయంలో ఆనందపురం నుంచి ముషిడిపల్లికి బైక్పై ఒంటరిగా వస్తుండగా నాగారాయుడు చెరువు సమీపంలోని మలుపు వద్ద అకస్మాత్తుగా ఇద్దరు వ్యక్తులు బైక్కు అడ్డంగా వచ్చి ఆపేందుకు ప్రయత్నించారు. బైక్ను మరింత వేగంగా నడిపి తృటిలో వారు నుండి తప్పించుకున్నాను. వెంటనే గ్రామంలోకి ఫోన్ చేయగా మూడు బైక్లపై యువకులు వచ్చారు. ఇలా రావడాన్ని గుర్తించిన దుండగులు స్కూటీపై పరారయ్యారు. చాలా దూరం వరకు వెంబడించిన వారి ఆచూకి లభించలేదు. వెంటనే దేవరాపల్లి ఎస్ఐకు ఫోన్ చేసి జరిగిన ఘటనను వివరించాను. –రెడ్డి మహేష్, బాధితుడు, ముషిడిపల్లి. ● -
ఈవీఎం గోడౌన్ తనిఖీ
తుమ్మపాల: ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలో గల ఈవీఎం గోడౌన్ను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి విజయ కృష్ణన్ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సోమవారం తనిఖీ చేశారు. త్రైమాసిక తనిఖీలలో భాగంగా గోదాములో భద్రపరచిన ఈవీఎం మెషీన్లను, సీసీ కెమెరాలు, అగ్నిమాపక పరికరాలు, భద్రతా ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. జిల్లా రెవిన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, ఆర్డీవో షేక్ ఆయిషా, ఎలక్షన్ సెక్టన్ సూపరింటెండెంట్ ఎస్.ఎస్.వి.నాయుడు, రాజకీయపార్టీల ప్రతినిధులు టి.షణ్ముఖ్, బి.శ్రీనివాసరావు, కె.హరినాథబాబు, మీసాల సుబ్బన్న, జి.శ్రీరామ్, అగ్నిమాపక అధికారులు పాల్గొన్నారు. -
విద్యుత్ స్తంభం మార్పుపై ఇరువర్గాల వివాదం
నాతవరం: ఇంటి వద్ద ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని పక్కకు మార్పు చేయడంపై ఇరువర్గాల మధ్య వివాదం నెలకొంది. జిల్లేడుపూడి గ్రామంలో లాలం నూకరాజు కొత్తగా నిర్మించిన ఇంటి గేటు ముందు విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా దర్శనమిస్తుంది. ఈ స్తంభం మార్పు చేయడం కోసం విద్యుత్ శాఖ అధికారుల ఆదేశాల ప్రకారం గత నెల 25వ తేదీన లాలం నూకరాజు విద్యుత్శాఖకు రూ.69,500 ఆన్లైన్లో చెల్లింపులు చేశారు. ఈనెల 16వ తేదీన విద్యుత్ స్తంభం మార్పు చేసేందుకు జిల్లేడుపూడిలో నూకరాజు ఇంటి వద్ద సిబ్బంది పనులు ప్రారంభించారు. కొత్తగా స్తంభం ఏర్పాటుకు పాత స్తంభం తొలగించేందుకు గొయ్యి తీశారు. అయితే ఆ సమయంలో సర్పంచ్ లాలం రమణ, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు ద్వారా పనులు నిలుపుదల చేయించారు. కొత్తగా విద్యుత్ స్తంభం వేసే ప్రదేశంలో పంచాయతీ డ్రైనేజీ నిర్మిస్తామంటూ పనులను అడ్డుకున్నారు. పంచాయతీకి సమాచారం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు విద్యుత్ స్తంభం మార్చుకుంటే ఎలా ఊరుకుంటామని సర్పంచ్ రమణ భీిష్మించారు. విద్యుత్ స్తంభం మార్పు కోసం ఆదివారం వైర్లు తొలగించడంతో గ్రామంలో సోమవారం సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో నర్సీపట్నం విద్యుత్ శాఖ ఏడీ సునీల్కుమార్, నాతవరం జేఈ చంద్రమౌళి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అధికారుల ఎదుట ఇరుపార్టీల నాయకులు వివాదానికి దిగారు. విద్యుత్ స్తంభం వేయరాదని సర్పంచ్ రమణ, నిబంధనల మేరకు ప్రభుత్వానికి డబ్బు చెల్లించాం కాబట్టి గొయ్యి తీసిన స్థలంలో స్తంభం వేయాలని మాజీ సర్పంచ్ లోవ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో గత్యంతరం లేక అధికారులు విద్యుత్ స్తంభం మార్పును వారం రోజుల పాటు వాయిదా వేసి విద్యుత్ పునరుద్ధరించి వెళ్లిపోయారు. ఈ విషయమై ఏడీ సునీల్కుమార్ మాట్లాడుతూ స్తంభం మార్పుకు వినియోగదారుడు డబ్బులు కట్టారని, ఈనెల 25వ తేదీ వరకు స్తంభం మార్పుకు సమయం ఉందన్నారు. రాజకీయ నాయకులు సమస్య సృష్టిస్తే పని చేయడం కష్టమన్నారు. -
బావిలో దూకి యువకుడి ఆత్మహత్య
మాకవరపాలెం: వ్యవసాయ బావిలో దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలాఉన్నాయి. మండలంలోని చామంతిపురం గ్రామానికి చెందిన దుంగల దుర్గాప్రసాద్ (17) గ్రామంలో వైరింగ్ పనులు చేస్తుంటాడు. అయితే బుచ్చియ్యపేట మండలం పంగిడి గ్రామానికి చెందిన వివాహితతో దుర్గాప్రసాద్కు పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ మాట్లాడుకుంటున్న విషయం వివాహిత భర్తకు తెలియడంతో దుర్గాప్రసాద్పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఫోన్ చేసి రమ్మనడంతో భయపడిన దుర్గాప్రసాద్ ఆదివారం రాత్రి గ్రామ సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయమై మృతుడు తల్లి రాజేశ్వరి ఇచ్చిని ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ దామోదర్నాయుడు తెలిపారు. మృతదేహాన్ని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. -
పట్టపగలే దోపిడీ యత్నం
నెల రోజుల క్రితం ముషిడిపల్లి నుండి ఆనందపురంలోని బట్టల షాపునకు వెళ్లేందుకు జంక్షన్ వరకు కాలినడకన బయలుదేరాను. ఉదయం 10 గంటల ప్రాంతంలో నాగారాయుడు చెరువు మలుపు వద్దకు చేరుకోగానే వెనుక నుంచి బైక్పై ఇద్దరు వ్యక్తులు ముఖానికి గుడ్డలు కట్టుకొని జంక్షన్ వరకు తమ బండి ఎక్కాలని కోరగా తిరస్కరించాను. దీంతో బైక్పై ముందున్న వ్యక్తి నా మెడలోని అర తులం బంగారు మంగళ సూత్రాలను లాగి తెంచేందుకు ప్రయత్నించాడు. వెంటనే తేరుకొని మంగళసూత్రాలను గట్టిగా పట్టుకున్నాను. బైక్ ఉన్న మరో వ్యక్తి తన చెవులకు ఉన్న బంగారు రింగ్లను లాగేందుకు ప్రయత్నించగా గట్టిగా చేతి గోర్లతో రక్కేయడంతో విడిచి పెట్టాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ఆటో డ్రైవర్ ఇది గమనించి గట్టిగా హారన్ కొట్టుకుంటూ వేగంగా రావడంతో ఇద్దరు దుండగులు బైక్పై పరారయ్యారు. నాకు మెడపైన, బుగ్గపై చిన్నపాటి గాయాలయ్యాయి. ప్రాణాలతో బయటపడతానని ఆనుకోలేదు. –బత్తిన మంగ, బాధిత మహిళ, ముషిడిపల్లి. -
ఉపాధి కూలీలపై రాజకీయ కక్ష, వివక్ష
నీలిగుంటలో ఉపాధి పని కల్పించలేదని ఆరోపిస్తున్న కూలీలు కోటవురట్ల: కూటమి ప్రభుత్వంలో ఉపాధి కూలీలపై రాజకీయ కక్ష, వివక్ష చూపిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. లింగాపురంలో పలువురు కూటమి కార్యకర్తలకు పనికి రాకుండానే మస్తర్లు పడుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా నీలిగుంటలో టీడీపీ కార్యకర్తలు ఉన్న గ్రూపులకు మాత్రమే పని కల్పించారంటూ కూలీలు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. నీలిగుంట, శివారు గ్రామం సన్యాసిరాజుపాలెంలో మొత్తం 18 గ్రూపులు ఉండగా అందులో ఏరికోరి టీడీపీ కార్యకర్తలున్న 4 గ్రూపులకు మాత్రమే పని కల్పించారని కూలీలు ఆరోపించారు. తమకు పని ఎందుకు కల్పించరంటూ ఉపాధి సిబ్బందిని ప్రశ్నించారు. సర్పంచ్ వరహాలబాబు మాట్లాడుతూ కూలీలపై రాజకీయం రుద్ది, పనుల కల్పనలో వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. గతంలో కూడా మండల సర్వ సభ్య సమావేశంలో ఇదే అంశంపై అధికారులకు ఫిర్యాదు చేశామని అయినా ఉపాధి సిబ్బంది పనితీరు మారలేదని ఆరోపించారు. వెంటనే అన్ని గ్రూపులకు పని కల్పించకపోతే కూలీలతో మండల పరిషత్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. -
వడ్డాది వెంకన్న హుండీ ఆదాయం లెక్కింపు
వడ్దాది వేంకటేశ్వరస్వామి ఆలయంలో కానుకలు లెక్కిస్తున్న సిబ్బంది బుచ్చెయ్యపేట : వడ్దాది వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన 152 కల్యాణోత్సవాలు ఘనంగా ముగిసాయి. ఈ ఉత్సవాలు సందర్బంగా ఈ నెల 10 వ తేది నుంచి 15 వరకు భక్తులు సమర్పించిన హుండీ లెక్కింపులు సోమవారం నిర్వహించారు. ఆలయ ఈవో శర్మ వారి సిబ్బందితో కలిసి లెక్కించిన హూండీ ఆదాయంలో గత ఏడాది కంటే స్వామి వారికి రూ 2,67,640 ఆదాయం అధికంగా వచ్చింది. హుండీల్లో రూ.7,86,406 నగదు వచ్చింది. టిక్కెట్ల ద్వారా రూ 4,08,665, తలనీలాల ద్వారా రూ.25వేలు, కొబ్బరి చిప్పలు వేలం ద్వారా రూ 38వేలు, ఆశీలు ద్వారా రూ 9,160, విరాళాలు ద్వారా రూ. 8435, మెత్తం రూ.12,75,666 ఆదాయం వచ్చిందని ఈవో శర్మ తెలిపారు. హుండీ లెక్కింపులో ఆలయ వంశపారంపర ధర్మకర్త దొండా కన్నబాబు, ఎస్ఐ శ్రీనివాసరావుతో పాటు స్థానిక పెద్దలు దొండా సన్యాసిరావు, దేవదాయ సిబ్బంది పాల్గొన్నారు. -
బుచ్చింపేటలో పశువుల పాక దగ్ధం
కాలిపోయిన పశువుల పాకను ఆర్పుతున్న రైతులు రోలుగుంట : మండలంలోని బుచ్చింపేట గ్రామంలో సోమవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన పాటూరి శ్రీరాముకు చెందిన పశువుల పాక దగ్ధమైంది. వివరాలివి. పశువుల పాక యజమాని సోమవారం మధ్యాహ్నం పొలం పాకల వద్ద పనులు ముగించుకొని భోజనానికి ఇంటికి వచ్చేశాడు. గంట తరువాత ఇతని పొలం పాకల నుంచి మంటలు వ్యాపించడంతో కుటుంబీకులతో కలసి పాక వద్దకు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చుకున్నారు. ఇక్కడ ఏ విధమైన ప్రాణ నష్టం జరగలేదు, అయితే ఈ పాక సమీపంలో గల మేకల దొడ్డు కూడా కాలిపోయింది. సంబంధిత అధికారులు ఘటనా స్థలానికి వచ్చి నష్టాన్ని అంచనా వేసి పరిహారం ఇప్పించాలని బాధితుడు కోరారు. -
ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోరా?
● పూడిమడక రోడ్డులో భారీ వాహనాలను కట్టడి చేయాలి ● వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన మునగపాక : తరచూ పూడిమడక రోడ్డులో భారీ వాహానాల (క్వారీ లారీల) రాకపోకల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం తగదని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఽఈ మార్గంలో అధికలోడులతో వాహనాలు ప్రయాణిస్తున్నాయన్నారు. అధికారుల ఉదాసీనత తగదంటూ మండిపడ్డారు. సోమవారం మునగపాక రెవెన్యూ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళన నిర్వహించారు. రాంబిల్లిలోని నేవల్బేస్ నిర్మాణంలో భాగంగా పరిమితికి మించి భారీ బండరాళ్లతో లారీలు తిరగడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. పగలు,రాత్రి తేడా లేకుండా వాహనాలు విచ్చల విడిగా తిరుగుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోలేదన్నారు. ఇటీవల కాలంలో పూడిమడక రోడ్డులో భారీ వాహనాల కారణంగా కొంతమంది మృత్యువాతకు గురికావడం ఆందోళనకు గురిచేస్తుందన్నారు. వాహన డ్రైవర్లు నిర్లక్ష్యంగా నడపడం వల్ల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయన్నారు. ఈ విషయమై అచ్యుతాపురం, మునగపాక మండలాలకు చెందిన ప్రజా ప్రతినిధులతో కలిసి గత ఏడాది నవంబర్ 4వతేదీన జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్కు వినతి అందజేసినా ఫలితం కనిపించలేదన్నారు. తక్షణమే ప్రభుత్వ ఉన్నతాధికారులు, పాలకులు స్పందించి ప్రమాదాలు జరగకుండా చూడాలని లేకుంటే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ ఎస్.ఆదిమహేశ్వరరావుకు వినతి అందజేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు, పార్టీ నేతలు మారిశెట్టి సూర్యనారాయణ, మలసాల కిషోర్,దాసరి అప్పారావు, మళ్ల సంజీవరావు, నరాలశెట్టి సూర్యనారాయణ, ఆడారి కాశీబాబు, దిమ్మల అప్పారావు, కోనపల్లి రామ్మోహనరావు, కాండ్రేగుల జగన్, ఈత బాబూరావు, నాగేశ్వరరావు, పెదబ్బాయి, బొడ్డేడ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మోసం
నా కుమారుడు ఇంటి రాకేష్ డిగ్రీ పూర్తిచేశాడు. గాజువాకలో పెదగంట్యాడ బీసీ కాలనీకి చెందిన దుంగి దౌపది ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తానని రూ.8 లక్షలు కాజేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆమె వారిని మ్యానేజ్ చేస్తోంది. గతంలో రెండుసార్లు కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో ఫిర్యాదు చేశాం. అప్పుడు రావికమతం ఎస్ఐ పిలిపించి మాట్లాడారు. తరువాత దాని గురించి పట్టించుకోలేదు. కూలీ నాలీ చేసుకుని సంపాదించిన డబ్బులవి. నా కుమారుడికి ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఆ డబ్బంతా ఇచ్చేశాను. కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాను. న్యాయం చేస్తామన్నారు. – ఇంటి భాగ్యవతి, మత్సపురం గ్రామం, రావికమతం మండలం పాసు పుస్తకం కోసం డబ్బులు అడిగారు.. మాకు గునిపూడి రెవెన్యూ పరిధిలో సర్వే నెం.44–5లో 0.45 సెంట్ల భూమి ఉంది. నా భర్త ఏడాది 3 నెలల క్రితం చనిపోయాడు. ఆ భూమిని నా పేరు మీదకు మార్చుకునేందుకు కాళ్లరిగేలా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాను. నా పేరు మీదకు మార్చుకోవడానికి మ్యుటేషన్ పెడితే.. అది చెల్లదని వీఆర్వో చెప్పారు. డబ్బులు ఇస్తేనే పని అవుతుందంటున్నారు. పేదరాలిని.. ఇచ్చుకోలేనని చెబితే ఇప్పటికీ పని చేయడం లేదు. స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాను. – వానపల్లి సత్యవతి, గునిపూడి గ్రామం, నక్కపల్లి మండలం ఆక్రమణదారుడికి రెవెన్యూ అధికారుల వత్తాసు చేతమెట్ట గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెం.292లో 4.10 ఎకరాల అసైన్డ్ భూమిని 1975లో నా భర్త కట్టా కొండయ్యకు ప్రభుత్వం డి–ఫారం పట్టా మంజూరు చేసింది. ఆయన మరణాంతరం నాకు, నా కుమారుడికి స్వాధీన అనుభవ హక్కు ఉంది. అయితే లాలంకోడూరుకు చెందిన మోతుబరి రైతు లాలం గణేష్ ఆర్థిక, రాజకీయ బలంతో రాంబిల్లి రెవెన్యూ అధికారులతో కుమ్ముకై ్క 1 బీ అడంగల్లో ఆ భూమిని తన తండ్రి పేరున నమోదు చేసుకుని ఆక్రమిస్తున్నాడు. దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. వీఆర్వో రూ.లక్షా 50 వేలు లంచం తీసుకుని మోసం చేశాడు. ఆర్టీఐ యాక్టు ప్రకారం విచారించి వీఆర్వోపైన, అతనికి సహకరించిన రెవెన్యూ అధికారులపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. –కట్టా ఆదమ్మ, ఆమె కుమారుడు, లాలం కోడూరు, రాంబిల్లి మండలం -
డ్రైవర్కు నిద్ర కరువై..
● బోల్తా పడ్డ ప్రైవేటు కంపెనీ బస్సు ● 22మందికి గాయాలు ఎస్.రాయవరం: కేవలం మూడు గంటల విశ్రాంతి అనంతరం అదే డ్రైవర్ బస్సు నడపాల్సి రావడంతో నిద్ర సరిపోక ప్రమాదానికి దారి తీసింది. 32 మంది కార్మికులతో వస్తున్న సీసీఎల్ ప్రాసెసింగ్ పరిశ్రమకు చెందిన బస్సు సోమవారం తెల్లవారుజామున బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 22 మందికి గాయాలయ్యాయి. స్థానికులు, ఎస్.రాయవరం పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. కోటవురట్ల మండలం లింగాపురం గ్రామం నుంచి వేకువజామున సుమారు 3 గంటల ప్రాంతంలో ఈ బస్సు బయలుదేరింది. ఊరూరా కార్మికులను ఎక్కించుకొని వస్తున్న ఈ బస్సు అడ్డురోడ్డు–నర్సీపట్నం ఆర్అండ్బీ రోడ్డుపై పెదగుమ్ములూరు సమీపంలో పెట్రోల్ బంక్ వద్ద అదుపుతప్పి రోడ్డుపక్కన బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 22మంది గాయపడగా 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన ప్రయాణికులందరినీ నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. తీవ్రంగా గాయపడిన 13 మందిని అనకాపల్లి ఉషా ప్రైమ్ ఆస్పత్రికి తరలించారు. గాయాలైన 9మందికి నక్కపల్లి ఆస్పత్రిలో చికిత్స అందించారు. స్వల్పగాయాలతో బయటపడిన 10మందికి చికిత్స అందించి ఇళ్లకు పంపారు. క్షతగాత్రులు వీరే.. కోటవురట్ల మండలం పందూరు గ్రామానికి చెందిన మానేపల్లి సత్యవతి, గొన్నాబత్తుల స్వాతి, చింతల సాయిలక్ష్మి, యర్రంశెట్టి మంగ, మారిశెట్టి భారతి, చీకట్ల నూకరాజు, సమర్శి మహాలక్ష్మి, సరపాక సంతోషి, మారిశెట్టి హేమలత, సరమశెట్టి వరలక్ష్మి, ఎస్.రాయవరం మండలం చినగుమ్ములూరు గ్రామానికి చెందిన కోసూరి తులసి, హనుమంతు లక్ష్మి, వీరితోపాటు డ్రైవర్ షేక్ సత్తార్ తీవ్రంగా గాయపడ్డారు. నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో కాండ్రకోట నాగమ్మ దేవి, కంటే పార్వతి, చుక్క చిట్టమ్మ, బోదెపు సంధ్య, రాజపతి హిమబిందు, ఆకేటి కుమారి, షేక్ హుస్సేన్, మోటూరి నారాయణమ్మ, మానేపల్లి సత్యవతి చికిత్స పొందుతున్నారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే ఎస్.రాయవరం తహసీల్దార్ జె.రమేష్బాబు సంఘటన స్థలానికి చేరుకొని, ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. నక్కపల్లి ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. అడిషనల్ ఎస్పీ దేవప్రసాద్, నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు, అడ్డురోడ్డు సీఐ రామకృష్ణ అనకాపల్లి ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. బస్సు డ్రైవర్ బి షిఫ్ట్ కార్మికులను గడిచిన రాత్రి 11–12 గంటల సమయంలో ఇళ్ల వద్ద దించి, మళ్లీ తెల్లవారుజామున ఏ షిఫ్ట్ కార్మికులను తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యారు. కేవలం మూడు గంటలు మాత్రమే వ్యవధి ఉండడంతో డ్రైవర్కు నిద్ర సరిపోక ప్రమాదానికి దారి తీసిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. -
కాళ్లరిగేలా తిరిగినా..
నా వయసు 76 సంవత్సరాలు. మా భూమిని ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్నాం. వృద్ధాప్యంలో ఒంటరిగా జీవిస్తున్న నా భూమిని ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోమని రెండు నెలలుగా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నాను. కలెక్టరమ్మ ఆదేశించినా మండలంలోని అధికారులు నాకు న్యాయం చేయలేదు. అందుకే మళ్లీ ఫిర్యాదు చేయడానికి వచ్చాను. – చెన్నా సత్యవతి, చిన్నగుమ్మలూరు, ఎస్.రాయవరం మండలం పాసు పుస్తకం ఆన్లైన్ చేయాలి పట్టాదారు పాసు పుస్తకాన్ని ఆన్లైన్ చేయాలని కోరుతూ పీజీఆర్ఎస్లో వినతి అందించాను. నిరుపేద దళితులమైన మాకు 1998లో తుమ్మపాల సర్వే నెం.708–1లో ఒక ఎకరం భూమి డీపట్టా మంజూరు చేశారు. జీడీ మామిడి తోటలు సాగుచేసుకుని జీవిస్తున్నాం. నా పేరున పట్టాదారు పాసుపుస్తకం కూడా మంజూరు చేశారు. దీని ఆధారంగా ఆన్లైన్ చేసి డిజిటల్ పుస్తకం మంజూరు చేయాలని కోరాను. –వెలుసూరి ప్రకాశరావు, తుమ్మపాల, అనకాపల్లి మండలం పింఛన్ తొలగించారు.. నా కుమారుడు ఆదాయ పన్ను కడుతున్నాడని నాకు పింఛన్ తొలగించారు. అతనికి వివాహమై ఇప్పుడు వేరుగా జీవిస్తున్నాడు. ఇప్పుడు నా కుమారుడు కూడా ఆదాయ పన్ను పరిధిలో లేడు. పైగా వేరుగా జీవిస్తున్నాడు. అందువల్ల దివ్యాంగుడనైన నా మొర ఆలకించి, పింఛన్ పునరుద్ధరించవలసిందిగా కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించాను. –జెట్టి సత్యారావు, పరశురాంపేట, అనకాపల్లి -
మైనింగ్ మాఫియా వికృత రూపం
అనకాపల్లి టౌన్: కూటమి పాలనలో మైనింగ్ అక్రమ రవాణా రోజురోజుకు పెరిగిపోతోందని, దీనిపై తక్షణమే జిల్లా అధికార యంత్రాంగం చర్య లు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ డిమాండ్ చేశారు. విజయరామరాజుపేట రైల్వే అండర్ బ్రిడ్జిని క్వారీ లారీ ఢీకొట్టిన ప్రదేశాన్ని వైఎస్సార్ సీపీ నాయకులు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా బొడ్డేడ మాట్లాడు తూ పగలు, రాత్రి తేడా లేకుండా మండలం నుంచి నిత్యం అధిక లోడ్తో క్వారీ లారీలు వెళుతున్నాయన్నారు. నెలకు 15 లక్షల టన్నుల రాయి రాంబిల్లికి రవాణా అవుతోందన్నారు. కూటమి పెద్దలు నిర్వహిస్తున్న మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోయిందని, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి మరీ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. తెల్లవారుజామున పెద్దగా జనసంచారం లేని సమయంలో గూడ్స్ ట్రైన్ వెళ్లబట్టి పెద్ద ప్రమాదం తప్పిందని, అదే ఏదైనా ఎక్స్ప్రెస్ వెళితే భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చేదన్నారు. మైనింగ్ దందాపై స్వయంగా స్థానిక అధికార పార్టీ శాసన సభ్యులు ఫిర్యాదు చేసినా అధికార యంత్రాంగం కనీస చర్యలు తీసుకోలేదంటే.. ఈ వ్యాపారంలో పెద్దలు ఉన్నారనేది స్పష్టమవుతోందన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, జిల్లా కార్యదర్శి జాజుల రమేష్ , పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు–2 వేగి త్రినాథ్, పార్టీ సీనియర్ నేత మలసాల కుమార్ రాజా పాల్గొన్నారు. నిర్లక్ష్యంగా నడిపితే కఠిన చర్యలు తుమ్మపాల: అధిక లోడుతో ప్రయాణించే క్వారీ లారీల యజమానులు, నిర్లక్ష్యంగా నడిపే డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శ్రావణి హెచ్చరించారు. పట్టణంలో పోలీస్ గెస్ట్హౌస్లో ఏర్పాటు చేసిన లారీ యాజమానుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పట్టణంలో తెల్లవారుజామున రైల్వే అండర్ బ్రిడ్జి ప్రమాదం క్వారీ లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే జరిగిందన్నారు. నిర్లక్ష్యం వల్ల ప్రమాదా లు జరగకుండా లారీ యజమానులు డ్రైవర్లకు కౌన్సెలింగ్ నిర్వహించి రవాణా నిబంధనలు, రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రమాదాలు నివారించేందుకు పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలన్నారు. గంటకు పైగా నిలిచిన ఎక్స్ప్రెస్ రైలు యలమంచిలి రూరల్: క్వారీ లారీ బీభత్సంతో అనకాపల్లిలో రైల్వేట్రాక్ దెబ్బతినడంతో యలమంచిలి రైల్వేస్టేషన్లో పలు ఎక్స్ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. మహబూబ్నగర్ ఎక్స్ప్రెస్ రైలు గంటకు పైగా ఇక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు రైళ్లు ఆలస్యంగా నడవడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు తమ కార్యాలయాలకు చేరుకోవడానికి తీవ్ర హైరానా పాడాల్సి వచ్చింది. రైల్వే అండర్ బ్రిడ్జి ప్రమాదానికి ఇదే సంకేతం తక్షణమే అధికారులు చర్య తీసుకోవాలి వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ డిమాండ్ -
లెక్కలు సరే.. తిప్పల మాటేమిటి?
ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య.. భూ వివాదం, ఇంటి సమస్య, దారి సమస్య, భూ సర్వే, అందని పింఛన్, ఉద్యోగాల పేరిట మోసం, పాసు పుస్తకం కోసం మామూళ్లు వసూలు.. ఇలా వందలు, వేల ఫిర్యాదులతో బాధితులు కలెక్టరేట్ మెట్లు ఎక్కుతున్నారు. అధికారుల లెక్కలు చూస్తే సమస్యలు ఇట్టే పరిష్కారమైనట్టు కనిపిస్తోంది. కానీ క్షేత్ర స్థాయిలో చాలా సమస్యలు బాధితులను వేధిస్తూనే ఉన్నాయి. ‘సాక్షి’ బృందం సోమవారం పలువురు అర్జీదారులను పలకరించింది. ప్రజా సమస్యల అపరిష్కృత వేదికగా పీజీఆర్ఎస్తమ పరిధిలో లేదని చెప్పినా.. పరిష్కరించినట్లే.!క్షేత్రస్థాయిలో మాత్రం పరిష్కారం శూన్యమే..రెవెన్యూ పరిధిలోనే అత్యధిక ఫిర్యాదులు అర్జీదారుల సమస్యలు ఆలకిస్తున్న కలెక్టర్ విజయ కృష్ణన్, జాయింట్ కలెక్టర్ జాహ్నవి సాక్షి, అనకాపల్లి: ఉన్నతాధికారులకు తమ గోడు చెప్పుకుంటే బాధ తీరుతుందని సామాన్య ప్రజలు ఆశిస్తారు. సోమవారం కలెక్టర్ సహా జిల్లా అధికారులు స్వయంగా తమ అర్జీలు స్వీకరిస్తారు కాబట్టి ఇక తమ కష్టం తీరినట్టేనని భావిస్తారు. ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) పనితీరుపై నిరంతరం సమీక్షలు జరుగుతున్నాయి. కానీ ఆశించిన రీతిలో బాధితులకు పరిష్కారం లభించడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక జూన్ నుంచి ఇప్పటి వరకు 45,346 ఫిర్యాదులు రాగా వీటిలో 42 వేల అర్జీలను క్లోజ్ చేసినట్టు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ‘క్లోజ్’ చేయడమంటే పరిష్కరించినట్టేనా?.. ఈ ప్రశ్నకు అధికారులే బదులివ్వాలి. ‘ఈ సమస్య మా పరిధిలో లేదు’ అని కొన్ని అర్జీలకు సమాధానం ఇస్తారు. వాటిని కూడా పరిష్కరించినట్టే భావిస్తే.. ఇక సామాన్యుల సమస్యలు తీర్చేదెవరు? కలెక్టర్, ఆర్డీవోల ఆదేశాలు బేఖాతర్ ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలని అక్కడికక్కడే సంబంధిత శాఖాధికారులకు, మండల స్థాయి అధికారులకు కలెక్టర్ తదితర ఉన్నతాధికారులు ఆదేశాలిస్తున్నారు. అయితే ఆదేశాలు అమలు చేస్తున్నారా లేదా అని పరిశీలించే వ్యవస్థ లేకపోవడంతో.. బాధితులు పలుమార్లు తిరగాల్సి వస్తోంది. ఒకే సమస్యపై నెలల తరబడి పీజీఆర్ఎస్లో పదే పదే ఫిర్యాదులు చేస్తున్నవారు ఎందరో ఉన్నారు. అర్జీలు ఇవ్వడానికి వచ్చిన బాధితులను ఎవరిని కదిలించినా.. తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. సమస్యలను పరిష్కరించినట్లు అధికారులు ఆన్లైన్లో చూపిస్తున్నారని, సగానికి పైగా అర్జీలను ఆన్లైన్లో అసలు నమోదే చేయడం లేదని మరికొంతమంది వాపోతున్నారు. కలెక్టర్, ఆర్డీవో స్థాయి అధికారులు జారీ చేసే ఆదేశాలను క్షేత్ర స్థాయిలో పట్టించుకోవడంలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. వెల్లువగా వినతులు.. అరకొర పరిష్కారం.. జిల్లాలో జూన్ నెల నుంచి నేటి వరకూ 45,346 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో 42,237 ఫిర్యాదులను క్లోజ్ చేసినట్లు, 3,109 ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నట్లు అధికారుల గణాంకాలు తెలుపుతున్నాయి. అయితే ఫిర్యాదు చేసిన బాధితులు మాత్రం తమ సమస్యలు పరిష్కారం కావడంలేదని, తాము ఇచ్చిన ఫిర్యాదుకు ఆయా సంబంధిత అధికారి ఫోన్ చేసి మీ సమస్య పరిష్కార యోగ్యమైనది కాదు..అని ఏదో ఒక కారణం చెప్పి వివరణ మాత్రమే ఇస్తున్నారని చెబుతున్నారు. అలాంటి కేసులను కూడా క్లోజ్ చేసినట్లు చూపుతున్నారని, వచ్చిన ఫిర్యాదుల్లో పరిష్కారమైనవి సగం కూడా లేవని బాధితులు వాపోతున్నారు. సోమవారం 340 వినతులు సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్ విజయ కృష్ణన్, జేసీ ఎం.జాహ్నవి, డీఆర్వో వై.సత్యనారాయణరావు, కేఆర్సీపీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్వీఎస్ సుబ్బలక్ష్మి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల నుంచి వివిధ సమస్యలపై 340 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ శాఖకు చెందినవి 209 ఉండగా, పోలీసు శాఖ 23, పంచాయతీరాజ్ శాఖ 27, సర్వే సెటిల్ మెంట్ 11, హౌసింగ్ 10, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం 8, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 5, కార్పొరేషన్ 5, రూరల్ డెవలప్మెంట్కు సంబంధించినవి 10 ఫిర్యాదులున్నాయి. అలాగే ఇతర విభాగాలకు సంబంధించి 33 వినతులు వచ్చాయి. -
విశాఖకు ఆగ్నేయ దేశాల బౌద్ధ పర్యాటకులు
విశాఖలో బౌద్ధ క్షేత్రంలో విదేశీ బౌద్ధ పర్యాటకులు విశాఖ సిటీ: ఆగ్నేయ దేశాల నుంచి బౌద్ధ పర్యాటకుల తొలి బ్యాచ్ విశాఖకు చేరుకుంది. సోమవారం వీరిని కలెక్టర్ హరేందిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, వీఎంఆర్డీఏ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్లు స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం ఫోరం అధ్యక్షుడు విజయ్మోహన్ ఆధ్వర్యంలో ఈ పర్యాటక బృందం బావికొండ, తొట్లకొండ, పావురాలకొండ, బొజ్జన్నకొండలను సందర్శించింది. ఇక్కడి నుంచి థాయ్లాండ్, మలేషియా, సింగపూర్లకు విమాన సర్వీసులు ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆగ్నేయ దేశాల పర్యాటకులే లక్ష్యంగా ఇన్బౌండ్ టూరిజంకు శ్రీకారం చుట్టింది. -
గోవాడ సుగర్స్లో మళ్లీ నిలిచిన క్రషింగ్
చోడవరం: గోవాడ సుగర్స్ క్రషింగ్కు మళ్లీ అంతరాయం కలిగింది. బాయిలర్ హౌస్లో సమస్య తలెత్తడంతో ఆదివారం క్రషింగ్ నిలిచిపోయింది. ఆర్థిక ఇబ్బందులు, కార్మికుల సమ్మెలతో ఈ ఏడాది క్రషింగ్ ప్రారంభించడమే ఆలస్యంగా జరిగింది. ఇప్పటికే అనేక సార్లు బెగాస్ కొరత, బాయిలర్ హౌస్లో సమస్యలతో క్రషింగ్కు అంతరాయం కలుగగా మరలా బాయిలర్ ఈటీపీ ప్లాంట్లో సమస్య తలెత్తడంతో మరోసారి క్రషింగ్ నిలిచిపోయింది. రాత్రి అయినా క్రషింగ్ ప్రారంభం కాకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇదిలావుండగా క్రషింగ్ నిలిచిపోవడంతో మరలా యథావిధిగా ఫ్యాక్టరీ యార్డుల వద్ద చెరకు కాటాల వద్ద పెద్ద సంఖ్యలో చెరకు లోడుతో వాహనాలు నిలిచిపోయాయి. తరుచూ ఉత్పన్నమౌతున్న అంతరాయం సమస్యతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ పరిధిలో చెరకు లేక క్రషింగ్ ఆశించిన మేర జరగదని ముందు భావించినప్పటికీ చెరకు పుష్కలంగా సరఫరా అవుతుండడంతో ఇప్పటికే 80వేల టన్నులు దాటి క్రషింగ్ కూడా జోరుగానే సాగుతుంది. ఈ పరిస్థితుల్లో ఫ్యాక్టరీలో తరుచూ మరమ్మతుల సమస్యలు తలెత్తుతుండడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్లో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. -
నిబంధనలు పక్కాగా అమలు చేయాలి
● డీఈవో గిడ్డి అప్పారావు నాయుడు ● పరీక్షల నిర్వహణ అధికారులు, స్క్వాడ్ బృందాలతో సమావేశం అనకాపల్లి టౌన్: జిల్లాలో పదో తరగతి పరీక్షలు నిర్వహణలో నిబంధనలన్నీ పక్కాగా పాటించాల్సిందేనని జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావునాయుడు పేర్కొన్నారు. స్ధానిక బీఆర్ అంబేడ్కర్ ఉన్నత పాఠశాలలో ఆదివారం పదో తరగతి పరీక్షల నిర్వహణ అధికారులు, స్క్వాడ్ బృందాల సభ్యులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా, ఏ రూపంలో ఎవరు భాగస్వాములైనా కఠిన చర్యలకు బాధ్యులు అవుతారని హెచ్చరించారు. ఉద్యోగాలతో పాటు క్రిమినల్ చర్యలకు బాధ్యులవుతారన్నారు. పరీక్షా కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలని, కేంద్రాల పరిసర ప్రాంతాలను కూడా పరిశీలించాలన్నారు. ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకొని పరీక్ష కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, వాచ్లు తదితర పరికరాలు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అందరూ హాల్ టికెట్లు ముందుగా తనిఖీ చేసి అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించాలన్నారు. పదో తరగతి బోర్డు, ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని, అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ఉప విధ్యాశాఖాధికారి పి.అప్పారావు, పరీక్షల విభాగం సహాయ సంచాలకులు ఎ.శ్రీధర్రెడ్డి, విద్యాశాఖ, రెవిన్యూ, పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
రసవత్తరంగా రాష్ట్రస్థాయి చెస్ పోటీలు
మాకవరపాలెం: రాష్ట్రస్థాయి చెస్ పోటీలు రసవత్తరంగా సాగాయి. జిల్లా చెస్ అసోసియేషన్, ప్రగతి చెస్ అకాడమీ సంయుక్తంగా తామరం అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు వివిధ జిల్లాలకు చెందిన 180 మంది హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చెస్ పోటీలు ఎంతో రసవత్తరంగా కొనసాగాయి. ఈ పోటీల్లో విశాఖ జిల్లాకు చెందిన అఖిలప్రసాద్ ప్రథమ, ప్రకాశం జిల్లాకు చెందిన జె.కె.రాజు ద్వితీయ, అనకాపల్లి జిల్లాకు చెందిన బి.సాకేత్ తృతీయ స్థానాలను కై వసం చేసుకున్నారు. వీరికి ప్రథమ బహుమతిగా రూ.5,100, ద్వితీయ రూ.4000, తృతీయ రూ.3000 నగదు బహుమతులను నిర్వాహకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అవంతి కళాశాల మెకానికల్ విభాగం హెడ్ హరికిరణ్, ప్రగతి చెస్ అకాడమీ వ్యవస్థాపకుడు సుదీర్, ఏిపీటీఎఫ్ మండల అధ్యక్షుడు శ్రీరామ్మూర్తి, గౌతమి లలిత కళా కేంద్రం అధ్యక్ష, కార్యదర్శులు రంగరాజు, శేషగిరిరావు పాల్గొన్నారు. -
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
తుమ్మపాల: ఈ నెల 17 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు ఏప్రిల్ 1 వరకు రాత పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలో మొత్తం 107 పరీక్ష కేంద్రాల్లో 22,042 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. విద్యార్థులు సరిగ్గా 9 గంటలకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, పరీక్ష పూర్తయ్యే వరకు అభ్యర్థులు పరీక్ష కేంద్రం నుంచి బయటికి వెళ్లడానికి అనుమతి లేదన్నారు. సున్నితమైన పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. మొబైల్ ఫోన్ తీసుకురాకూడదని, అలాగే క్యాలిక్యులేటర్లు, బ్లూటూత్ డివైజులు, స్మార్ట్ వాచ్లు వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిలేదన్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని జెరాక్స్, ఇంటర్నెట్ షాపులు మూసివేయాలని ఆదేశించామని తెలిపారు. అలాగే పరీక్ష కేంద్రాల వద్ద గుమికూడడం నిషేధమని, 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. -
ఈ ప్లేట్లు...
క్లీన్ అండ్ గ్రీన్ వంద గ్రాములుగడ్డితో 3 ప్లేట్లు ఎండు గడ్డిని నీటితో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేయాలి. వీటిలో 1 కేజీ గడ్డి ముక్కలు తీసుకుని వాటిని బాగా ఎండబెట్టాలి. సగటున 100 గ్రాముల వరి గడ్డిలో 7 లీటర్ వాటర్ వేసి మరిగించాలి.15 నిమిషాల పాటు బాగా ఉడికించిన తరువాత అందులో సోడియం హైడ్రాక్స్డ్ క్రిష్టల్ను వేసి గంటన్నర పాటు ఉడికించాలి. ఆ తరువాత జల్లెడలో వేసి వరిగడ్డి నుంచి నీరును సెపరేట్ చేయాలి. మిగిలిన వరి గడ్డిని మిక్సీలో వేసి పేస్ట్లా చేయాలి. ఈ పేస్ట్ను ప్లేట్ సైజ్ కన్నా పెద్దగా స్కీన్ లేదా గాజు గ్లాస్పై వేసి 24 గంటల పాటు ఎండబెట్టాలి. ఎండిన తరువాత షీట్గా ఏర్పడుతుంది. దీనిని హైడ్రాలిక్ ప్రెస్ యంత్రంలో పెట్టి ప్రెస్ చేస్తే ప్లేట్ ఏర్పడుతుంది. ఈ ప్లేట్కు పైన విస్తరాకు గానీ లేదా నేలలో కలిసిపోయేలా బయోగ్రెడిబుల్ ఫిల్మ్గాని వేస్తారు. దీంతో డిస్పోజల్ ప్లేట్ తయారు అవుతుంది. సగటున 100 గ్రాముల వరి గడ్డికి 3 నుంచి 4 ప్లేట్లు తయారవుతాయి. సాక్షి, అనకాపల్లి: అధిక పెట్టుబడులతో ఆశించిన దిగుబడి లేక రైతు నష్టాల బాట పడుతున్నాడు. వాతావరణ మార్పులు, ఇతర పరిస్థితుల కారణంగా పంట నష్టపోయి లాభాలార్జించలేని పరిస్థితిలో రైతు ఉన్నాడు. దేశంలోనే వరి పంట పండిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ టాప్ టెన్లో ఉంది. రైతు మీదే యావత్ దేశం ఆధారపడుతుంది. అందుకే రైతుకు మేలు చేకూరేలా..అదే విధంగా పర్యావరణాన్ని పరిరక్షించేలా.. అనకాపల్లి ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్తలు, అగ్రికల్చర్ విద్యార్థులు ప్రయోగాత్మకంగా ఎండు గడ్డి, అరటి కాండంతో డిస్పోజల్ ప్లేట్ల తయారు చేశారు. రైతుకు అదనపు ఆదాయం సంపాదించుకునేలా సరికొత్తగా ప్రాజెక్టు చేసి చూపించారు. ఆర్ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి.వి.కె.జగన్నాథరావు, డాక్టర్ ఎ.కేశవకుమార్, ఈవీఎస్ కుమారి పర్యవేక్షణలో అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ థర్డ్ ఇయర్ విద్యార్థులు రక్షిత, ఎం.కీర్తి స్వరూప, పి.గురుసాయి, ఆర్.ఉదయ్కుమార్ ఈ ప్రయోగం ద్వారా డిస్పోజల్ ప్లేట్లు తయారు చేయవచ్చని చేసి చూపించారు. వరి పంట వేసే రైతు నూర్పు తరువాత ఎండు గడ్డిని కొంతమేర పశువులకు మేతగా ఉపయోగిస్తాడు..పశువులు తినగా మిగిలిన మరికొంత గడ్డి పశువుల పాకలుగా వాడుతుంటారు. తరువాత కూడా మిగిలి వృధాగా పడి ఉన్న ఎండు గడ్డిని కాల్చివేస్తుంటారు. ఇలా వృధా చేసేకంటే ఆ గడ్డితో డిస్పోజల్ ప్లేట్లు తయారీ చేసుకుని అదనపు ఆదాయం ఆర్జించవచ్చని ఆర్ఏఆర్ఏస్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్ని చోట్ల మిగిలిపోయిన ఎండు గడ్డి కాల్చడం ద్వారా కార్బన్ డైఆకై ్సడ్ విడుదలై పర్యవరణం కూడా కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. ఈ పొగ ద్వారా ఆస్తమా, శ్వాసకోస వ్యాధులు వాటిల్లే అవకాశం ఉంటుంది. ఇలా వృథాగా పడి ఉన్న వరిగడ్డిని ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో అగ్రికల్చర్ విద్యార్థులు డిస్పోజబుల్ ప్లేట్లుగా తయారు చేశారు. సరికొత్త ప్రయోగానికి నాంది పలికారు. ఎండు గడ్డి, అరటి బెరడుతో డిస్పోజబుల్ ప్లేట్ల తయారీ పర్యావరణ హితం, ఆరోగ్య దాయకం రైతుకు అదనపు ఆదాయం ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్తలు, వ్యవసాయ విద్యార్థుల వినూత్న ఆవిష్కరణ అరటిడొప్పతో... అరటి మొక్క నుంచి గెల కాసిన తరువాత దాన్ని నరికేస్తారు. అలా నరికేసిన అరటి కాండం నుంచి చెట్టు డొప్పల నుంచి ఫైబర్ను తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా ఎండబెట్టాలి. ఇందులో సోడియం హైడ్రాకై ్సడ్ క్రిస్టల్ను వేసి ఒక గంట పాటు బాయిల్ చేస్తారు. ఆ పేస్ట్ను జల్లెడలో వేసి వాటర్ తీసేస్తారు. షీట్ను ప్లేట్ మౌల్డింగ్ మిషన్ దగ్గరకు తీసుకెళతాం. 100 గ్రాములు కాండం నుంచి 5 నుంచి 6 ప్లేట్లు తయారు చేయవచ్చు. రైతుకు ఎంతో మేలు.. నేను అగ్రికల్చర్ యూనివర్శిటీ పరిధిలో గల అనకాపల్లి పాలిటెక్నిక్ ఇంజినీరింగ్లో థర్డ్ ఇయర్ చదువుతున్నాను. మూడు నెలల పాటు నేను చేసిన ప్రాజెక్ట్లో భాగంగా పర్యావరణాన్ని కాపాడుతూ..రైతుకు మేలు చేకూర్చేలా ఈ ప్రయోగ విధానం చేశాం. రైతుకు పంట దిగుబడి అనంతరం వృధాగా పడేసే గడ్డితో డిస్పోజబుల్ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు.సోడియం హైడ్రాక్స్డ్ క్రిష్టల్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ప్లేట్ మౌల్డింగ్ మిషన్ ఒక్కటే కొనుగోలు చేసుకుంటే వారంతట వారే డిస్పోజబుల్ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఆర్ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త జగన్నాధరావు సహకారంతో డిస్పోజబుల్ ప్లేట్లు ప్రాజెక్టు చేశాం. –కీర్తి స్వరూప, థర్డ్ ఇయర్ విద్యార్థిని, పాలిటెక్నికల్ ఇంజినీరింగ్.ప్లాస్టిక్కుప్రత్యామ్నాయంగా... ప్లాస్టిక్ వినియోగం పెరగడంతో పర్యావరణం దెబ్బతింటుంది. ఎక్కువగా వినియోగించే డిస్పోజబుల్ ప్లేట్లతో మరింతగా పర్యావరణం దెబ్బతింటుంది. అంతేకాకుండా రైతులు పండించే వరిలో వృధాగా పడేసే ఎండుగడ్డి వంటివి కాల్చడం ద్వారా కార్బన్డైఆకై ్సడ్ విడుదల అవుతుంది. అందుకే మా విద్యార్థులతో కలిసి ఎకో ఫ్రెండ్లీ డిస్పోజబుల్ ప్లేట్లు ప్రయోగాత్మకంగా తయారీ చేశాం.పర్యావరణాన్ని కాపాడడంతో పాటు రైతులకు అదనంగా ఆదాయం వచ్చేలా ఉపయోగపడేలా రూపొందించాం. –డాక్టర్ ఎ. కేశవ్కుమార్, టీచింగ్ అసోసియేట్, పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్. అనకాపల్లి -
విజయోస్తు..
రెగ్యులర్తుమ్మపాల: విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసే విధంగా పరీక్ష కేంద్రాల్లో అన్ని సౌకర్యాలను కల్పించాలని, పదో తరగతి పరీక్షల రాష్ట్ర పరిశీలకుడు, విద్యాశాఖ రాష్ట్ర అదనపు సంచాలకుడు పి. శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం పట్టణంలో పలు పరీక్ష కేంద్రాలను ఆయనతో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావునాయుడు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలు రాయడానికి అనుకూలంగా బెంచీలు ఉండాలని, ఫ్యాన్లు తిరిగేలా చూడాలని, సురక్షిత తాగునీటిని అందుబాటులో ఉంచాలని సూచించారు. అంతకుముందు ఆయన పరీక్షల నిర్వహణ, పర్యవేక్షణ, స్క్వాడ్ బృందాల అధికారులతో మాట్లాడుతూ ఎక్కడ ఏ లోపాలున్నా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు మాట్లాడుతూ జిల్లాలో 107 పరీక్ష కేంద్రాల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. వీటిలో ఏడు సెంటర్లలో ఎస్ఎస్సీ బోర్డు విద్యార్థులతో పాటు ఓపెన్ స్కూల్ విద్యార్థులు కూడా పరీక్షలు రాస్తారన్నారు. 22 వేల 42 మంది రెగ్యులర్, 1258 ప్రైవేటు విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. అలాగే 667 మంది ఓపెన్ స్కూల్ అభ్యర్థులు పరీక్షలు రాస్తారన్నారు. పరీక్షల కోసం ప్రతి కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు, అవసరం మేరకు ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. ఏడు ప్రత్యేక స్క్వాడ్ బృందాలను నియమించమన్నారు. జిల్లా కలెక్టర్తో సహా జిల్లా స్థాయి, డివిజన్ స్థాయి, మండల స్థాయి అధికారులు పరీక్షల నిర్వహణను ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తారని వివరించారు. పరీక్ష కేంద్రాల ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించడం జరిగిందన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, సర్వీసులు ఏర్పాటు చేసిందన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సహకారంతో ప్రతి పరీక్ష కేంద్రంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతున్నందున విద్యార్థులంతా ఒక గంట ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. కార్యక్రమంలో పీఆర్వో వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు కృష్ణంరాజు, జనార్ధన్ పాల్గొన్నారు. హాజరుకానున్న విద్యార్థులుపరీక్షలు ఎప్పటివరకంటే : సోమవారం నుంచి ఏప్రిల్ 1వ తేదీ జిల్లాలో 107 పరీక్ష కేంద్రాలు ఏడు ప్రత్యేక స్క్వాడ్ బృందాలు ఏర్పాట్లు పరిశీలించిన విద్యాశాఖ రాష్ట్ర అదనపు సంచాలకుడు శ్రీనివాసరావు -
నేడు విశాఖకు ‘ఢిల్లీ క్యాపిటల్స్’
విశాఖ స్పోర్ట్స్: ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) కెప్టెన్గా వ్యవహరిస్తున్న అక్షర్ పటేల్ తన జట్టుతో కలిసి సోమవారం విశాఖపట్నం చేరుకోనున్నారు. విశాఖలోని వైఎస్సార్ స్టేడియాన్ని తమ రెండో హోం గ్రౌండ్గా ఎంచుకున్న డీసీ ఈ సీజన్ను ఇక్కడే ప్రారంభించనుంది. చాంపియన్ ట్రోఫీ విజేతగా నిలిచిన భారత్ జట్టులోని డీసీ సభ్యులంతా వారి ఇంటి నుంచి నేరుగా విశాఖకు చేరుకుంటారు. మంగళవారం నుంచి వైఎస్సార్ స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొంటారు. గతంలో పంజాబ్ తరఫున ఆడిన అక్షర్ 2016లో హాట్రిక్ సాధించాడు. 2020లో రన్నరప్గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సారి ట్రోఫీ గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. విశాఖలో జరిగే తొలి మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్(ఎల్ఎస్జీ)తో తలపడనుంది. హెడ్ కోచ్ హేమంగ్ బదాని, సహాయ కోచ్ మాథ్యూ, బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్ పర్యవేక్షణలో అక్షర్ పటేల్, ఇతర ఆటగాళ్లు మంగళవారం నుంచి నెట్స్లో సాధన చేస్తారు. జట్టులో స్టార్క్, చమీరా వంటి విదేశీ బౌలర్లు, డ్యూ, బ్రూక్ వంటి బ్యాటర్లు, కేఎల్ రాహుల్, ఫెరీరా వంటి వికెట్ కీపర్లు ఉన్నారు. దేశవాళీ క్రికెట్లో సెంచరీలతో చెలరేగిపోయిన కరుణ్ నాయర్తో పాటు పోరెల్, స్టబ్స్, అశుతోష్, కుల్దీప్ కూడా ప్రాక్టీస్లో పాల్గొంటారు. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తన జట్టుతో ఈ నెల 22న విశాఖ చేరుకోనున్నారు. గత సీజన్లో రిషబ్ డీసీకి కెప్టెన్గా ఉన్నారు. ఎల్ఎస్జీ 23న నెట్స్లో ప్రాక్టీస్ చేయనుంది. డీసీ, ఎల్ఎస్జీ మధ్య తొలి మ్యాచ్ ఈ నెల 24న విశాఖలో జరగనుంది. రేపటి నుంచి ప్రాక్టీస్ -
పెదపూడిలో మూడు పాకలు దగ్ధం
● 10 మేకలు సజీవ దహనం ● రూ.4 లక్షల ఆస్తి నష్టం బుచ్చెయ్యపేట: పెదపూడి శివారు రాజుపాలెం గ్రామంలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో మూడు పాకలు దగ్ధమవగా 10 మేకలు సజీవ దహనమయ్యాయి. గ్రామానికి చెందిన తండ్రికొడుకులు నమ్మి పైడయ్య, చిలుకులు మేకలు మేపుకొంటూ జీవనం సాగిస్తున్నారు. గ్రామానికి దూరంగా మూడు పాకలు వేసుకుని మేకలపై ఆధారపడి జీవిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు పాల్చిపారేసిన సిగరెట్టు కారణంగా ఈ అగ్నిప్రమాదం జరగ్గా మూడు పాకలతో పాటు పాకల్లో ఈనిన మేకలు, పిల్లలు పది సజీవ దహనమయ్యాయి. సాయంత్రం పాకకు వచ్చిన పైడయ్య, చిలుకులు కాలిపోయిన పాకలు, మేకలను చూసి భోరున విలపించారు. సుమారు రూ.4 లక్షలు ఆస్తి నష్టం జరిగినట్టు బాధితులు వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. -
తాటిపూడి వద్ద ‘భూమాత’ సరికొత్త వెంచర్
కొమ్మాది: భూమాత గ్రూప్, ఎస్విఎన్ గ్రూప్ సంయుక్తంగా తాటిపూడి వద్ద 200 ఎకరాల్లో భూమాతాస్ ఎస్వీఎన్ స్వప్నలోక్ పేరుతో వెంచర్ వేస్తున్నట్లు భూమాత గ్రూప్ ఎండీ తాళ్లూరి పూర్ణచంద్రరావు తెలిపారు. బీచ్రోడ్డులోని ఓ రిసార్ట్లో ఆదివారం సాయంత్రం దీనికి సంబంధించిన బ్రోచర్ను ఎస్విఎన్ ప్రతినిధులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 200 ఎకరాల్లో 5 ఫేజ్ల్లో.. 1650 ఫ్లాట్లు వీఎంఆర్డీఏ అనుమతులతో అందరికి అందుబాటు ధరల్లో నిర్మించినట్లు తెలిపారు. ఈ వెంచర్లో ఇంతవరకు రియల్ఎస్టేట్ చరిత్రలో ఎవరు ఇవ్వని సౌకర్యాలు, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ సదుపాయాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. థీమ్డ్ ప్రీమియం రెసిడెన్షియల్ మెగా ప్రాజెక్టుగా కస్టమర్లకు విశ్రాంతి, వినోదం ఇచ్చే ఇలాంటి భారీ రెసిడెన్షియల్ ప్రాజెక్టు ఆంధ్రలో ఇదే మొదటిదని తెలిపారు. ఈ వెంచర్కు సమీపంలోని తాటిపూడి రిజర్వాయర్ను ప్రభుత్వం టూరిజం స్పాట్గా అభివృద్ధి చేస్తుండడంతోపాటు 500 ఎకరాల్లో జిందాల్ కంపెనీ టూరిస్ట్ స్పాట్గా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారని పేర్కొన్నారు. ఈ వెంచర్ మీదుగా 4 లైన్ల హైవే పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ తాళ్లూరి శివాజి, కిరణ్ శంకర్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్ర రాష్ట్రం.. పొట్టి శ్రీరాముల త్యాగఫలం
తుమ్మపాల : అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్వర్గీయ పొట్టి శ్రీరాములుకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసు, జార్జిటౌన్, అణ్ణాపిళ్ళే వీధిలోని 165వ నంబరు ఇంటిలో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారని తెలిపారు. వారి పూర్వీకులది ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని కనిగిరి ప్రాంతంలోని పడమటిపల్లె గ్రామమని, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనకు గాంధేయ మార్గంలో నిరాహారదీక్ష చేసి ఆశయసాధన కోసం ప్రాణాలను తృణప్రాయంగా వదిలి అమరజీవిగా నిలిచారని తెలిపారు. ఆయన స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎడ్ల పోటీల్లో పాము హల్చల్
కశింకోట: కశింకోటలోని కస్పావీఽధిలో జరిగిన పడమటమ్మ తీర్థ మహోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఎడ్లబళ్ల పోటీలో ఓ పాము హల్చల్ చేయడం కలకలం సృష్టించింది. ఒక వ్యక్తి భయం లేకుండా జెర్రిగొడ్డుగా పిలిచే సుమారు 5 అడుగుల పొడవు ఉన్న పెద్ద పామును తోక పట్టుకుని తెచ్చి చూపుతూ, కొంతసేపు నేలపై విడిచి పెట్టి దాన్ని పరుగులు పెట్టిస్తూ కలియదిరిగాడు. దీంతో పోటీలు చూడడానికి వచ్చిన వారు పరుగులు తీసి వెళ్లి పామును ఆసక్తిగా వీక్షించారు.అయితే ఇది విష పూరితమైనది కాదని, దూరంగా పొలాల వైపు తీసుకెళ్లి ఆ వ్యక్తి విడిచిపెట్టారు. -
ప్రాణం తీసిన క్వారీ లారీ
● డ్రైవర్ నిర్లక్ష్యంతో మునగపాకకు చెందిన ఎల్ఐసీ ఏజెంటు మృతి ● బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రామస్తుల ఆందోళన మునగపాక: క్వారీ లారీ వ్యక్తిని బలి తీసుకుంది. పూడిమడక రోడ్డులో భారీ వాహనాలు రాకపోకలకు అనుమతులు లేకున్నా ఇవేమీ పట్టనట్టు వాహన యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పూడిమడక రోడ్డులో భారీ వాహనాలను అనుమతించవద్దంటూ పలు మార్లు స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఫలితం కనిపించడం లేదు. దీనికి తోడు లారీ డ్రైవర్లు కూడా ట్రిప్పులకు కక్కుర్తి పడి నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్నారు. కొంతకాలంగా రాంబిల్లి మండలంలోని నేవల్ బేస్కు బండరాళ్లను లారీలపై తరలిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో రాళ్లు రహదారిపై పడిపోతున్నాయి. ఈ రోడ్డుపై రాకపోకలు సాగించేవారు నిత్యం భయాందోళనకు గురవుతున్నా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో ఆదివారం మునగపాకకు చెందిన ఎల్ఐసీ ఏజెంట్ మాడా కన్నారావు(53) రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. మునగపాక గ్రామానికి చెందిన మాడా కన్నారావు ఎల్ఐసీ ఏజెంట్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం ఉదయం కన్నారావు తన బైక్పై గుడికి వెళ్లేందుకు అవసరమయ్యే సామగ్రి కొనుగోలు కోసం వెళుతుండగా ఇదే సమయంలో రాంబిల్లి మండలం నేవల్ బేస్కు రాయి తరలించి తిరిగి అనకాపల్లి వైపు వస్తున్న భారీ లారీ వెనుక నుంచి బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో కన్నారావు బైక్పై నుంచి కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలంలో భోరున విలపించారు. కుటుంబానికి పెద్దదిక్కుగా నిలిచిన కన్నారావు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఈ దుర్ఘటన విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ పూడిమడక రోడ్డులో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమస్య జటిలం కావడంతో కశింకోట సీఐ స్వామినాయుడు, మునగపాక పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన కారులతో చర్చించారు. పూడిమడక రోడ్డులో పగటిపూట భారీ వాహనాలు రాకుండా చూడాలని , అలాగే ప్రమాదాలకు నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. అనంతరం కన్నారావు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అనకాపల్లి వందపడకల ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీని స్టేషన్కు తరలించగా సంబంధిత డ్రైవర్ పోలీసులకు లొంగిపోయాడు. ఈ మేరకు మునగపాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నేత్రపర్వంగా పవళింపు సేవ
నక్కపల్లి: జో అచ్చుతానంద, జోజో ముకుందా అంటూ ఉపమాకలో స్వామివారి పవళింపు సేవలు (పుష్పయాగోత్సవాలు) ఘనంగా జరుగుతున్నాయి. కల్యాణోత్సవాల అనంతరం స్వామివారికి మూడు రోజుల పాటు పవళింపు సేవలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం స్వామివారి మూలవిరాట్కు, ఉత్సవమూర్తులకు, గోదాదేవి అమ్మవారికి క్షేత్ర పాలకుడు వేణుగోపాలస్వామికి నిత్యపూజలు, ఆరాధనలు నిర్వహించారు. రాత్రి నిత్య సేవాకాలం, విశేష ప్రసాద నివేదనలు తీర్థగోష్టి , భక్తులందరికీ ప్రసాద వినియోగం నిర్వహించారు. తదుపరి స్వామివారి పుష్పయాగోత్సవం రెండోరోజు కార్యక్రమంలో భాగంగా అద్దాల మండపం వద్దకు తీసుకెళ్లి ఉత్సవమూర్తులను ఉయ్యాలలో ఉంచి ప్రత్యేక పూజలు, షోడోపచార పూజలు నిర్వహించారు. పండ్లు, పాలు నివేదన చేసి భక్తుల సమక్షంలో నీరాజనాలు సమర్పించారు. శ్రీవైష్ణవ దంపతులకు తాంబూలాలు అందజేసి నీరాట్టం సేవాకాలంతో స్వామివారికి పుష్పయాగోత్సవం పవళింపు సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమాలను తిలకించేందుకు భక్తులు తరలివచ్చారు. పుష్పయాగోత్సవాల్లో ప్రధానార్చకులు వరప్రసాదాచార్యులు, కృష్ణమాచార్యులు, శేషాచార్యులు, శ్రీనివాసాచార్యులు, రాజగోపాలాచార్యులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో వివిధ ప్రాంతాలనుంచి స్వామివారిని దర్సించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. సుగంధ ద్రవ్యాల కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. -
ఆరు ఎకరాల్లో జీడి, మామిడి తోటలు దగ్ధం
రోలుగుంట: కూసుర్లపూడి గ్రామానికి చెందిన రైతుల జీడితోటల్లో ఆదివారం మధ్యాహ్నం సంభవించిన అగ్నిప్రమాదంలో సుమారు ఆరు ఎకరాల విస్తీర్ణంలో జీడి, మామిడి తోటలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన పచ్చిగోళ్ల భవన్నారాయణకు చెందిన ఎకరా యాకలిప్టస్, మటం బెన్నయ్య, కూండ్రపు శ్రీను, గున్నంపల్లి కొండ, సియాద్రి అప్పారావుకి చెందిన జీడి, మామిడి తోటలు అయిదెకరాలు కాలి బూడిదయ్యాయి. దీనిపై బాధితులు తమకు ఎవరిపైనా అనుమానం లేదని తెలిపారు. ప్రమాదంలో వాటిల్లిన నష్టాన్ని సంబంధిత అధికారలు అంచనా వేసి పరిహారం ఇప్పించాలని కోరుతున్నారు. -
చింతపండుకు భలే డిమాండ్
● దేవరాపల్లి వారపు సంతలో హాట్కేకుల్లా విక్రయాలు ● మణుగు రూ.550 నుంచి రూ.650 వరకు పలికిన ధరలు ● ఈ ఏడాది దిగుబడి తగ్గడంతో ధరలకు రెక్కలు దేవరాపల్లి: ఈ ఏడాది దిగుబడి అంతంత మాత్రంగా ఉండడంతో చింత పండుకు డిమాండ్ ఏర్పడింది. ధర పెరిగినా దేవరాపల్లిలో ఆదివారం జరిగిన వారపు సంతలో హాట్కేకుల్లా విక్రయాలు జరిగాయి. దేవరాపల్లిలో నాణ్యమైన చింతపండుతో పాటు అందుబాటు ధరలో లభిస్తుందని నమ్మకంతో విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాల నుంచి ఇక్కడి సంతకు వచ్చి కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ ఏడాది దిగుబడి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సంతకు చింతపండు అరకొరగా వచ్చింది. సమీప గిరిజన ప్రాంత నుంచి కూడా తక్కువ మొత్తంలోనే చింతపండు వచ్చింది. కొనుగోలుదారులు అధిక సంఖ్యలో వచ్చినప్పటికి అందుకు తగ్గట్టుగా చింతపండు లేక పోవడంతో డిమాండ్ ఏర్పడింది. కొనుగోలుదారులు పోటీ పడడంతో గంటల వ్యవధిలోనే హాట్కేకుల్లా అమ్ముడుపోయింది. మణుగు(10 కేజీలు) చింతపండు నాణ్యత ఆధారంగా రూ. 550 నుంచి రూ.650 వరకు ధర పలికింది. సాధారణంగా చింతపండు ధరలు రూ.400 నుంచి రూ.500 వరకు ఉంటాయి. అయితే దిగుబడి తగ్గిపోవడంతోనే అమాంతం ధరలు పెరిగాయని పలువురు అభిప్రాయపడ్డారు. వచ్చే వారం జరిగే సంతకు చింతపండు మరింత తక్కువగా రానుండడంతో ధరలు పెరిగే అవకాశం ఉంటుందని పలువురు కొనుగోలుదారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దేవరాపల్లిలో చింతపండు కొనుగోలుదారులతో కిక్కిరిసిన వారపు సంత దేవరాపల్లిలో చింతపండు కనుగోలుదారులతో కిక్కిరిసిన వారపు సంత -
అలరిస్తున్న విభిన్న వాతావరణం
ఖైదీకి ఫోన్ ఇచ్చిన భార్యాభర్తల అరెస్టు ఆరిలోవ : విశాఖ కేంద్ర కారాగారంలో ఖైదీలకు ఫోన్ ఇచ్చిన భార్యాభర్తలను ఆదివారం అరెస్టు చేశారు. ఇటీవల జైలులో ఖైదీల వద్ద ఫోన్లు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రభుత్వం విచారణ కమిటీ వేయగా జైలులో ఫార్మసిస్ట్గా పనిచేసిన కడియం శ్రీనివాసరావు, అతని భార్య పుష్పలతలు నాగమల్లేశ్వరరావు అనే ముద్దాయికి ఫోన్ ఇచ్చినట్లు విచారణలో తేలింది. దీంతో విచారణ అధికారి, ఎస్ఐ కృష్ణ వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. గతంలో శ్రీనివాసరావు ఖైదీలకు గంజాయి సరఫరా చేయడంతో విధుల నుంచి తొలగించారు. ఖైదీలకు ఫోన్ అందించే ఘటనలో కూడా శ్రీనివాసరావు నిందితుడిగా నిర్ధారణ కావడం చర్చనీయాంశమైంది. అనకాపల్లి టౌన్: అనకాపల్లి ప్రజలు అధిక మంచు, ఎండ తీవ్రత రెండింటిని చవి చూస్తున్నారు. పట్టణం, మండలంలో అధిక మంచు కురుస్తోంది. ఆదివారం ఉదయం ఏడు గంటలైనా మంచుతెరలు వీడలేదు. కనీసం వంద మీటర్ల దూరంలోని రోడ్డు కూడా సరిగ్గా కనిపించలేదు. దీంతో ప్రకృతి ప్రేమికులు మంచును ఆస్వాదిస్తూ దైనందిన కార్యక్రమాల్లో లీనమవుతున్నారు. కాస్త సమయం గడిచి తొమ్మిది గంటలయ్యేసరికి ఎండ ప్రతాపం చూపించింది. మధ్యాహ్నం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. సెలవు దినం కావడంతో ఎక్కువ శాతం ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. తప్పనిసరి పనులపై వచ్చేవారు ప్రత్యామ్నాయ మార్గాలతో ఉపశమనం పొందారు. ఇంటర్ మూల్యాంకనం వేళల మార్పు విశాఖ విద్య: ఇంటర్మీడియెట్ తెలుగు, ఇంగ్లిష్, హిందీ, గణితం, సివిక్స్ సబ్జెక్టులకు సంబంధించి మూల్యాంకనం వేళలు మార్పు చేసినట్లు ఆర్ఐవో మురళీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. స్పాట్ వాల్యుయేషన్ కేంద్రమైన ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో ఈనెల 17, 18 తేదీల్లో ఉదయం ఇంటర్ ఒకేషనల్ పరీక్షలు ఉన్నందున మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూల్యాంకనానికి ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. -
పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం
ఆరిలోవ(విశాఖ): ఆంధ్ర రాష్ట్ర అవతరణలో పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసి చిరస్మరణీయుడిగా నిలిచారని అనకాపల్లి జిల్లా అదనపు ఎస్పీ ఎం.దేవప్రసాద్ అన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆదివారం విశాఖ జిల్లా విశాలాక్షినగర్లోని ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పోలీస్ అధికారులతో కలిసి ఆయన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ భాషా ప్రయుక్త్త రాష్ట్రాల ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు ఎనలేని కృషి చేశారన్నారు. మహాత్మా గాంధీ సిద్ధాంతాలను అనుసరించారని, దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారని, హరిజోద్ధరణ కోసం జీవితాంతం కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ పి.నాగేశ్వరరావు, ఇన్స్పెక్టర్లు రామకృష్ణారావు, మన్మధరావు, ఆర్ఎస్ఐ ఆదినారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆర్మీలో అగ్నివీర్ అవుతారా?
● అగ్నివీర్ రిక్రూట్మెంట్లో భారీ మార్పులు ● 13 భాషల్లో ప్రవేశ పరీక్ష రాసే అవకాశం ● ఎన్సీసీ, ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లమో అభ్యర్థులకు బోనస్ మార్కులు ● విశాఖలో మరోసారి ర్యాలీ ● ఏప్రిల్ 10 వరకు రిజిస్ట్రేషన్కు అవకాశం సాక్షి, విశాఖపట్నం: దేశ రక్షణ కోసం సైన్యంలో చేరాలనుకునే యువతకు శుభవార్త. అగ్నివీర్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రిక్రూట్మెంట్ చరిత్రలో తొలిసారిగా ప్రవేశ పరీక్షను ఏకంగా 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు. ఇది తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఎంతో ఉపయుక్తంగా మారనుంది. మరోవైపు రాష్ట్రంలోని 13 జిల్లాల అభ్యర్థుల కోసం ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీకి విశాఖపట్నం మరోసారి వేదిక కానుంది. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇటీవలే విడుదలైంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ అంబేడ్కర్, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ కృష్ణా, మచిలీపట్నం జిల్లాల అభ్యర్థులకు విశాఖలో ఎంపికలు నిర్వహించాలని ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయం నిర్ణయించింది. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు ఏప్రిల్ 10వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ ట్రేడ్స్ మెన్ కేటగిరీల కోసం ఈ రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నారు. అగ్నివీర్ ట్రేడ్స్మెన్కు 8వ తరగతి, జనరల్ డ్యూటీ కేటగిరీలకు 10వ తరగతి అర్హతగా నిర్ణయించారు. అలాగే 17.5 నుంచి 21 సంవత్సరాల వయసు ఉన్న అభ్యర్థులే అర్హులు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేవారు మాత్రమే ఈ రిక్రూట్మెంట్కు హాజరు కావాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఏడాది కీలక మార్పులు ఈ సారి అగ్నివీర్ రిక్రూట్మెంట్లో పలు ముఖ్యమైన మార్పులు చేశారు. గతంలో అభ్యర్థులు ఒక కేటగిరీకి మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా, ఈసారి రెండు కేటగిరీల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఎన్సీసీ, ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లమో వంటి అదనపు విద్యార్హతలు కలిగిన వారికి బోనస్ మార్కులు లభిస్తాయి. గతంలో హిందీ, ఇంగ్లిష్ భాషల్లో మాత్రమే నిర్వహించిన కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (సీఈఈ)ను ఇప్పుడు తెలుగుతో సహా 13 భాషల్లో రాసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది. రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించిన అడ్మిట్ కార్డులను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అడ్మిట్ కార్డులో ర్యాలీకి హాజరుకావాల్సిన తేదీ, సమయం వంటి వివరాలు ఉంటాయి. అభ్యర్థుల సౌకర్యం కోసం రిక్రూట్మెంట్ జరిగే ప్రదేశంలో ప్రత్యేక రిపోర్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటెడ్ విధానంలో పారదర్శకంగా జరుగుతుందని రక్షణ శాఖ తెలిపింది. అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం లైవ్ చాట్ సదుపాయంతో పాటు ‘ఆర్మీ కాలింగ్’అనే ఆన్లైన్ మొబైల్ అప్లికేషన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మరింత సమాచారం కోసం www. joinindianarmy.nic.in వెబ్సైట్ను సందర్శించవచ్చు లేదా విశాఖపట్నంలోని ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయాన్ని 0891–2756959, 0891–2754680 నంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. -
జో అచ్యుతానంద.. జోజో ముకుందా..
నక్కపల్లి: ఉపమాక వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల అనంతరం మూడు రోజుల పాటు జరిగే పుష్పయాగోత్సవాలు శనివారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఉత్సవ మూర్తులను ముందుగానే అలంకరించిన అద్దాల మండపంలో గల ఉయ్యాలలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండ్లు, పాలు నివేదనలు చేసి భక్తుల సమక్షంలో విశేష నీరాజనాలు సమర్పించారు. శ్రీవైష్ణవ స్వాములకు తాంబూలాలు అందజేసి నీరాట్టం సేవాకాలంలో స్వామివారికి పుష్పయాగోత్సవం (పవళింపు సేవ) మొదటిరోజు కార్యక్రమం పూర్తి చేశారు. అర్చకస్వాములు కృష్ణమాచార్యులు, శేషాచార్యులు, రాజగోపాలాచార్యులు, సాయి ఆచార్యులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. ఘనంగా డోలోత్సవం శుక్రవారం రాత్రి స్వామివారి డోలోత్సవం (అద్దపు సేవ) కన్నుల పండువగా జరిగింది. మధ్యాహ్నం స్వామివారికి రాజయ్యపేట సముద్రతీరంలో అవబృందం కార్యక్రమం నిర్వహించారు. సముద్ర జలాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారికి రాత్రి రథోత్సవం జరిపారు. తదుపరి ఆలయానికి తీసుకువచ్చి అద్దపుసేవ నిర్వహించారు. కల్యాణం అనంతరం స్వామివారు కొత్త కళతో వెలిగిపోతూ ఉంటారు. నేరుగా చూస్తే భక్తులకు దృష్టి దోషం కలుగుతుందనే ఉద్దేశంతో ఉభయ దేవేరులతో కూడిన స్వామివారిని ఊయలలో ఉంచి అద్దంలో చూపిస్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని అద్దంలో చూసి పరవశులయ్యారు. అనంతరం మాడవీధుల్లో తిరువీధి సేవ (దొంగల దోపు ఉత్సవం) నిర్వహించారు. తదుపరి ఆస్థాన మండపంలో లక్ష్మీ సంవాద కార్యక్రమం జరిగింది. దీంతో స్వామివారికి ఐదు రోజులపాటు నిర్వహించిన కల్యాణోత్సవాలు పరిసమాప్తమయ్యాయని ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు తెలిపారు. వడ్డాది వెంకన్నకు పుష్పాంజలి సేవ బుచ్చెయ్యపేట: ప్రసిద్ధి చెందిన వడ్డాది వేంకటేశ్వరస్వామి 152వ కల్యాణ మహోత్సవాలు ముగిశాయి. కల్యాణ వేడుకల్లో ఆఖరి రోజు వేంకటేశ్వరస్వామికి ఇష్టమైన శనివారం రావడంతో ఉదయం నుంచి రాత్రి వరకు వేలాదిమంది భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. రాత్రికి ఆలయ మండపంలో ప్రత్యేకంగా తయారు చేసిన ఊయలలో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను ఉంచి జోలపాటలతో పుష్పాంజలి (పవళింపు) సేవ చేశారు. వేలాది మంది భక్తులు పాల్గొని బుగ్గన పెళ్లి చుక్కతో శ్రీదేవి, భూదేవి నడుమ ఇమిడిపోయిన వేంకటేశ్వరస్వామి అందాన్ని చూసి పరవశించిపోయారు. ఛలోక్తులతో కూడిన జోల పాటలు, భక్తి గీతాలు పాడుతూ ఉత్సాహంగా ఊయల సేవ చేశారు. పలు గ్రామాల నుండి అధిక సంఖ్యలో వచ్చిన మహిళలు స్వామికి జోల పాడేందుకు పోటీ పడ్డారు. రాత్రికి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తుల్ని అలరించాయి. వెంకన్న పవళింపు సేవలో పాల్గొని తరించిన భక్తజనం ఉపమాకలో పుష్పయాగోత్సవాలు ప్రారంభం -
నూకాంబిక హుండీ ఆదాయం రూ.44.66 లక్షలు
హుండీ లెక్కిస్తున్న సిబ్బంది, శ్రీవారి సేవా సభ్యులు అనకాపల్లి టౌన్: నూకాంబిక అమ్మవారి హుండీ లెక్కింపు దేవస్థానం ఉత్సవ మండపం ఆవరణలో శనివారం జరిగింది. గత ఏడాది అక్టోబర్ 28వ తేదీ నుంచి శనివారం వరకు 138 రోజులలో భక్తులు సమర్పించిన ముడుపులు, మొక్కుబడులను లెక్కించారు. రూ.44,65,787 నగదు, 20.500 మిల్లీగ్రాముల బంగారం, కేజీ 925 గ్రాముల వెండి హుండీల ద్వారా వచ్చినట్లు ఎండోమెంట్ సహాయ కమిషనర్, ఆలయ కార్యనిర్వహణాధికారి వెంపలి రాంబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏసీ సుధారాణి, దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ వసంతకుమార్, శ్రీవారి సేవ సభ్యులు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టౌన్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ఐదు ఎకరాల్లో యూకలిప్టస్ తోటలు దగ్ధం
దేవరాపల్లి: కొత్తూరు ముత్యాలమ్మపాలెంలో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో 5 ఎకరాల మేర యూకలిఫ్టస్ తోటలు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన సిరసపల్లి రాము, సిరసపల్లి దేముడమ్మ, సిరసపల్లి రాములమ్మ, చౌడువాడ లక్ష్మీ, చౌడువాడ అప్పలనర్స, చౌడువాడ అప్పలనాయుడు, బోను సింహాచలంనాయుడు, లక్కరాజు భూషణంకు చెందిన తోటలు అగ్నికి ఆహుతయ్యాయి. గ్రామస్తులంతా పొలం పనులకు వెళ్లిన సమయంలో కోళ్ల ఫారంకు ఎదురుగా ఉన్న యూకలిప్టస్ తోటల నుంచి మంటలు కనిపించడంతో స్థానికులు అక్కడుకు చేరుకున్నారు. అగ్ని కీలలు ఎగిసి పడడంతో మంటలను అదుపు చేయడం సాధ్యం కాలేదు. వెంటనే చోడవరం అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేసి రప్పించామని, అప్పటికే తోటంతా కాలిపోయిందని స్థానిక సర్పంచ్ గంధం రామకృష్ణ తెలిపారు. మిగతా తోటలకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది కృషి చేశారన్నారు. కాగా ఈ అగ్ని ప్రమాదంలో సుమారు రూ. 5 లక్షలు విలువ చేసే తోటలు దగ్ధమయ్యాయి. ప్రభుత్వం తమకు నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. దిబ్బిడిలో ఆరు ఎకరాల్లో సరుగుడు తోట దగ్ధం బుచ్చెయ్యపేట : దిబ్బిడి గ్రామంలో విద్యుత్ సార్ట్ సర్క్యూట్ కారణంగా ఆరు ఎకరాల్లో సరుగుడు తోటలు కాలిపోగా సుమారు రూ.నాలుగు లక్షలు ఆస్తి నష్టం జరిగింది. గ్రామంలో గల జర్తా వారి పొలాల్లో శనివారం విద్యుత్ వైర్లు కలిసిపోయి అగ్గినిప్పులు పడగా గాలికి రాజుకుని మంటలు వ్యాపించినట్టు బాధిత రైతులు తెలియజేస్తున్నారు. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన ముమ్మిన నాగరాజు, పాతాళ శ్రీనివాసరావు, కందికొండ శ్రీను, సేనాపతి సూరిబాబు, దేవుడమ్మ,బోధ అమ్మాజీ, ముమ్మిన నూకరాజులకు చెందిన సరుగుడు తోటలు కాలిపోయాయి. స్ధానికుల సమాచారం మేరకు చోడవరం అగ్పిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. మూడేళ్ల సరుగుడు తోటలు కాలిపోవడంతో రూ.4 లక్షలకు పైగా ఆస్తినష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు కోరారు. -
నేల నుంచి నీటిలోకి..
సముద్రంలోకి ఆలివ్ రిడ్లే తాబేలు పిల్లలు కొమ్మాది: బుల్లి ఆలివ్ రిడ్లే తాబేళ్లు బుడిబుడి అడుగులు వేసుకుంటూ తమ సహజ ఆవాసమైన సముద్రంలోకి చేరుకున్నాయి. ఈ మనోహరమైన దృశ్యం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది. జోడుగుళ్లపాలెం, చేపలుప్పాడ, పెదనాగమయపాలెం ప్రాంతాల్లో ఆలివ్ రిడ్లే తాబేళ్లు పెట్టిన గుడ్లను అటవీ శాఖ అధికారులు సేకరించి సాగర్నగర్లోని తాబేళ్ల సంరక్షణ కేంద్రంలో సంరక్షించారు. వీటి నుంచి వచ్చిన పిల్లలను డీఎఫ్వో శ్రీవాణి శనివారం సముద్రంలోకి విడిచిపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జోడుగుళ్లపాలెం నుంచి పెదనాగమయపాలెం వరకు మొత్తం 57,372 గుడ్లను సేకరించి సంరక్షించినట్లు తెలిపారు. తొలి దశలో శనివారం ఉదయం 237 తాబేలు పిల్లలను సముద్రంలో విడిచిపెట్టినట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లోనూ విడతల వారీగా మరిన్ని తాబేలు పిల్లలను సముద్రంలోకి విడుదల చేస్తామని ఆమె వివరించారు. కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
పోడు భూములకు పట్టాలివ్వండి
నిరసన తెలుపుతున్న సీపీఎం నాయకులు వెంకన్న, నరసింహమూర్తితో ఆదివాసీ గిరి రైతులు మాడుగుల : మైదాన ఆదివాసీ గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములుకు పట్టాలివ్వాలని, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న అన్నారు. శనివారం శంకరం పంచాయితీలో కృష్ణంపాలెం, బొడ్డరేవు, మామిడిపాలెం, తాడివలస, గొప్పూరు, వెలగలపాడు గిరిజన గ్రామాల్లో సీపీఎం పాదయాత్ర నిర్వహించి గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొంత మంది గిరిజనులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నా సరే వాటిలో పేర్లు తప్పుగా నమోదు జరిగిందన్నారు. సంబంధిత అధికారులు స్పందించి గిరిజనుల భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి ఇరటా నరసింహమూర్తి, సీపీఎం సభ్యురా లు, కార్లి భవానీ, రైతులు పాల్గొన్నారు. -
పర్యావరణానికి ప్లాస్టిక్ పెద్ద సవాలు
● దుకాణదారులు పాలిథిన్ కవర్లు విక్రయించరాదు ● వ్యాపారులకు నోటీసులు జారీ చేయాలని స్పీకర్ ఆదేశంనర్సీపట్నం: ప్లాస్టిక్ వినియోగాన్ని పకడ్బందీగా కట్టడి చేయాలని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ప్లాస్టిక్ పర్యావరణానికి పెద్ద సవాలుగా పరిణమించిందన్నారు. నర్సీపట్నంలో ఉన్న దుకాణదారులకు ప్లాస్టిక్ కవర్లు విక్రయించవద్దని నోటీసులు జారీ చేయాలని మున్సిపల్ కమిషనర్ సురేంద్రను ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. ఆదేశాలు బేఖాతరు చేస్తే షాపుల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించాలన్నారు. ఇటీవల కాలంలో నర్సీపట్నంలో నాటు వైద్యులు పెరిగారని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. కొంతమంది డాక్టర్లు మత్తు ఇంజక్షన్లు కూడా ఇవ్వకుండా ఆపరేషన్లు చేస్తున్నారని ఆరోపించారు. పట్టణంలో రూ.14.11 కోట్లతో త్వరలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. టిడ్కో ఇళ్లను పూర్తి చేసి త్వరలోనే లబ్ధిదారులు అందజేస్తామన్నారు. అనంతరం అధికారులు, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, ఆర్డీవో వి.వి.రమణ, తహసీల్దార్ రామారావు, కౌన్సిలర్లు సిహెచ్.పద్మావతి, రాజేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం అచ్యుతాపురం రూరల్: పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యం కాపాడుకోగలమని కలెక్టర్ విజయ్ కృష్ణన్ అన్నారు. శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మెలుపాక జగన్నాథపురంలో పర్యటించారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్తో కలిసి ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగానికి స్వస్తి పలుకుదాం’ అనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు. జేసీ జాహ్నవి, ఆర్డీవో, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
పది పరీక్షలకు పక్కా ఏర్పాట్లు
● విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చర్యలు ● పరీక్ష కేంద్రాల్లో సకల సౌకర్యాలు ● రేపటి నుంచి 31 వరకు నిర్వహణసాక్షి, అనకాపల్లి: పదో తరగతి పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. జిల్లావ్యాప్తంగా మొత్తం107 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 17న ప్రారంభమై 31వ తేదీతో ముగుస్తాయి. 31వ తేదీ రంజాన్ సెలవు ప్రకటిస్తే.. ఆ రోజు జరగాల్సిన పరీక్షను ఏప్రిల్ 1వ తేదీన నిర్వహిస్తారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష సమయం. అరగంట ముందుగానే పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తారు. పరీక్ష సమయం ముగిసేవరకు విద్యార్థులు బయటకు రాకూడదు. పరీక్ష కేంద్రాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు గానీ, సెల్ఫోన్లు గానీ, స్మార్ట్ వాచీలు గానీ అనుమతించరు. మాస్ కాపీయింగ్కు ఎలాంటి అవకాశాలు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలందాయి. టెన్త్ విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేలా అన్ని చర్యలు తీసుకున్నారు. విద్యార్థి హాల్టికెట్ చూపిస్తే చాలు.. టిక్కెట్ లేకుండానే ప్రయాణించవచ్చు. పరీక్ష కేంద్రాల వద్ద మెడికల్ క్యాంప్లు ఎండ తీవ్రత దృష్ట్యా ప్రతి పరీక్ష కేంద్రంలో మెడికల్ క్యాంప్లు ఏర్పాటు చేసి.. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉంచుతున్నారు. తాగునీటి సౌకర్యం, పరీక్ష గదిలో ఫ్యాన్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. టేబుళ్లు, మరుగుదొడ్లు తదితర వసతులు అందుబాటులో ఉన్న పరీక్ష కేంద్రాలనే ఎంపిక చేశారు. ఏర్పాట్లు పూర్తి పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాటు పూర్తిచేశాం. విద్యార్థులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా పరీక్ష కేంద్రానికి చేరుకోవచ్చు. వారికి అందుబాటులో ఉండేలా స్టాప్లు ఏర్పాటు చేయాలని ప్రజారవాణా శాఖ వారిని కోరాం. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తాగునీటి సదుపాయం కల్పించి, పరీక్ష గదుల్లో ఫ్యాన్లు పనిచేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వెలుతురు బాగా ఉన్న గదులను ఎంపిక చేశాం. – అప్పారావునాయుడు, జిల్లా విద్యాశాఖాధికారి ● -
కొత్త పింఛన్లు ఎప్పుడు?
● ఆత్రుతగా ఎదురుచూస్తున్న అర్హులు ● కూటమి ప్రభుత్వం 9 నెలల్లో ఒక్కరికై నా కొత్తగా పెన్షన్ ఇచ్చిందా? ● నిలదీసిన జెడ్పీటీసీ సభ్యులు ● మన్యంలో చిన్నారుల మృత్యు ఘోషపై వాడీవేడి చర్చ ● గరంగరంగా జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశాలుమహారాణిపేట (విశాఖ): కూటమి ప్రభుత్వంలో కొత్తగా పింఛన్లు మంజూరు కాకపోవడంపై పలువురు జెడ్పీటీసీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో అనేక ప్రాంతాల్లో పింఛన్లు తీసుకుంటూ చనిపోయిన వారి కుటుంబ సభ్యుల్లో అర్హులుంటే కొత్త పింఛన్లు మంజూరు చేయాలని కోరుతున్నారని, దరఖాస్తు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని వారన్నారు. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో చైర్పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన పలు స్థాయీ సంఘాల సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవరాపల్లి జెడ్పీటీసీ కర్రి సత్యం, గొలుగొండ జెడ్పీటీసీ సుర్ల వెంకట గిరిబాబు మాట్లాడుతూ పింఛన్లు తీసుకుంటూ చనిపోయిన కుటుంబ సభ్యులకు పింఛన్లు ఇస్తామని ప్రకటించారని, కానీ జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదన్నారు. అలాగే అర్హులకు పింఛన్లు ఇస్తామని చెప్పారని, కానీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 9 నెలలు అవుతున్నా ఎక్కడా కొత్త పింఛన్లు ఇవ్వలేదని, ఇది అన్యాయమన్నారు. ఏజెన్సీలో పిల్లల మృతిపై ఆందోళన ఏజెన్సీలో వైద్య సదుపాయాలపై, పిల్లల మరణాలపై చర్చ జరిగింది. తొలుత అరకు జెడ్పీటీసీ చెట్టి రోష్ని మాట్లాడుతూ అరకు మండలం బస్కి గ్రామంలో పిల్లలు ఆకస్మికంగా మృతి చెందారని, ఈ విషయం గురించి మాట్లాడడానికి తాను హెల్త్ సబ్ సెంటర్కు కాల్ చేసినా ఎవరూ ఫోన్ ఎత్తడం లేదన్నారు. గిన్నెల, మాడగూడ తదితర ప్రాంతాల్లో చిన్న పిల్లలు వరుసగా చనిపోయారని, కారణం తెలియక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని, ఈ విషయంపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వివరణ ఇవ్వాలని చైర్పర్సన్ జె.సుభద్ర కోరారు. కానీ అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఒక్క అధికారి కూడా రాలేదని, జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశాలకు రాని అధికారులను గుర్తించి నోటీసులు జారీ చేయాలని ఆమె సీఈవోను కోరారు. జెడ్పీటీసీలను పట్టించుకోని హౌసింగ్ అధికారులు హౌసింగ్ అధికారులు జెడ్పీటీసీలు, మండల అధ్యక్షులను పట్టించుకోవడం లేదని పలువురు చైర్పర్సన్ దృష్టికి తెచ్చారు. తమ మండలాల్లో గృహ నిర్మాణ అధికారులు సర్వే చేస్తున్న సమయంలో, కొత్త పేర్ల నమోదు చేసేటప్పుడు తమను సంప్రదించడం లేదని, దీనివల్ల స్థానికంగా తాము ఇబ్బంది పడుతున్నామని, గతంలో ఎప్పుడూ ఇలా లేదని వారన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని చైర్పర్సన్ కోరారు. ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకొని వస్తామని అధికారులు చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల డ్రాపవుట్స్ పెరుగుతున్నాయని, వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మహిళా స్థాయీ సంఘం చైర్పర్సన్ ఈర్లె అనురాధ కోరారు. పాయరావుపేట నుంచి అనకాపల్లి వరకు ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరిగాయని, అందువల్ల అనకాపల్లిలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని మునగపాక జెడ్పీటీసీ పెంటకోట సోమ సత్యనారాయణ కోరారు. అనకాపల్లి నుంచి మామిడిపాలెం వెళ్లే రహదారిలో నాణ్యత లోపించిందని జెడ్పీ కోఆప్షెన్ సభ్యుడు పెతకంశెట్టి శివ సత్యనారాయణ ఆరోపించారు. ఈ పనులకు రూ.30 లక్షల మేరకు నిధులు ఖర్చయినట్టు పత్రికల్లో వార్తలు వచ్చాయని, గుంతల్లో డస్ట్తో పూడ్చడం వలన నాణ్యత లోపించిందని అన్నారు. అక్రమ ఇసుక తవ్వకాలు కనిపించలేదా..! కోటవురట్ల మండలంలో ఇసుక అక్రమ తవ్వకాలపై జెడ్పీటీసీ సభ్యురాలు సిద్ధాబత్తుల ఉమాదేవి ధ్వజమెత్తారు. వరాహనదిలో పైలట్ ప్రాజెక్టు సమీపంలోనే అక్రమ ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని, దీనివల్ల భూగర్భ జలాలు అడుగంటితే నక్కపల్లి, ఎస్.రాయవరం, కోటవురట్ల మండలాలకు సంబంధించి 36 గ్రామాలకు తాగునీటి సమస్య వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. సమావేశంలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, జిల్లా పరిషత్ సీఈవో పి.నారాయణమూర్తితోపాటు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా గౌర పూర్ణిమ ఉత్సవాలు
కొమ్మాది : బీచ్రోడ్డు సాగర్నగర్ ఇస్కాన్ టెంపుల్లో శుక్రవారం గౌర పూర్ణిమ ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. గౌర పూర్ణిమ శ్రీ కృష్ణభగవానుని భక్త అవతారమైన శ్రీ చైతన్య మహా ప్రభు ఆవిర్భావ దినోత్సవంగా నిర్వహించే సందర్భంగా సాయంత్రం 5 గంటల నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీ కృష్ణుని భజన సంకీర్తనలు, పుష్పాభిషేకం నిర్వహించారు. గౌర పూర్ణిమ ఉత్సవాల్లో భాగంగా చైతన్య లీలల్లో ఒకటైన చాంద్కాజీ ఉద్ధరణ నాటకం అద్భుతంగా ప్రదర్శిచారు. కార్యక్రమంలో ఇస్కాన్ అధ్యక్షుడు సాంబాదాస్ ప్రభూజీ, మాతాజీ నితాయి సేవిని, వంశీకృష్ణ ప్రభు, భక్తులు పాల్గొన్నారు. -
అధికారుల నిర్లక్ష్యమే కారణం..
చోడవరం దగ్గర బంకులో పెట్రోల్ కొట్టించాను. కొంచెం దూరం వెళ్లి ఇంజిన్ ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా స్టార్ట్ కాకపోవడంతో మెకానిక్ షెడ్కు తెచ్చాను. ఆయిల్ కల్తీ వల్లే ఇంజిన్ పట్టేసిందని మెకానిక్ చెప్పారు. పెట్రోల్ బంకుల్లో కల్తీని నివారించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం వల్లే మా వాహనాలు పాడవుతున్నాయి. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలి. – అప్పలనాయుడు, వాహదారుడు, చోడవరం ఆయిల్ కల్తీని అరికట్టాలి.. నేను కుటుంబ సభ్యులతో కలిసి విశాఖపట్నం బయలుదేరాను. వెంకన్నపాలెం సమీపంలోని ఒక బంకులో నా బైక్లో 2 లీటర్ల పెట్రోల్ కొట్టించాను. ఇక్కడ ఆయిల్ వేయించిన తర్వాత సైలెన్సర్ నుంచి పొగ ఎక్కువగా వచ్చింది. మెకానిక్ షెడ్కు తీసుకెళ్తే కల్తీ ఆయిలే కారణమని అన్నారు. రీడింగ్లో కూడా మోసం జరుగుతోంది. లీటర్ ఆయిల్ పూర్తిగా రావడం లేదు. బంకుల్లో ఆయిల్ కల్తీ, కొలతల్లో మోసాలను అరికట్టాలి. – సీహెచ్ శ్రీనివాసరావు, వాహనదారుడు, చోడవరం -
ల్యాబ్ టెక్నీషియన్లకు పదోన్నతులు కల్పించాలి
తుమ్మపాల: గ్రేడ్–2 ల్యాబ్ టెక్నీషియన్గా ప్రభుత్వ సర్వీస్లో చేరిన ఉద్యోగి ఎటువంటి పదోన్నతి లేకుండానే రిటైర్ అవుతున్నాడని, ల్యాబ్ టెక్నీషియన్లకు ప్రమోషన్లు కల్పించాలని మెడికల్ లేబొరేటరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గీతారాణి డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ ఆస్పత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డీఎంహెచ్వో రవికుమార్, డీసీహెచ్ఎస్ శ్రీనివాసరావు, సీఎస్ ఆర్ఎంవో గౌతమ్, అల్లూరి జిల్లా డీసీహెచ్ఎస్ కృష్ణారావు విచ్చేసి ల్యాబ్ టెక్నిషియన్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గీతారాణి మాట్లాడుతూ ల్యాబ్ టెక్నీషియన్ల సమస్యలపై అధికారులకు వివరించారు. వారికి పని భారం తగ్గించే విధంగా ప్రతి పీహెచ్సీలో అదనంగా మరో పోస్టు భర్తీ చేయాలన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు భరోసాగా క్రమబద్ధీకరణ కొనసాగించాలన్నారు. అన్ని విభాగాల్లో ల్యాబ్ టెక్నీషియన్లకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఎంఎస్ శంకరరావు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.