కదం తొక్కిన చెరకు రైతులు | - | Sakshi
Sakshi News home page

కదం తొక్కిన చెరకు రైతులు

Mar 22 2025 12:49 AM | Updated on Mar 22 2025 12:49 AM

కదం త

కదం తొక్కిన చెరకు రైతులు

● గోవాడ ఫ్యాక్టరీ గేటు ముందు బీఎన్‌ రోడ్డుపై రాస్తారోకో ● కూటమి ప్రభుత్వం తమను విస్మరించిందని ఆగ్రహం ● బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ ● పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత

చోడవరం: గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీ వద్ద చెరకు రైతులు కదం తొక్కారు. కూటమి ప్రభుత్వం ఫ్యాక్టరీని, చెరకు రైతులను పూర్తిగా విస్మరించిందంటూ శుక్రవారం ఆందోళన చేశారు. ఒక దశలో ఈ ఆందోళన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. యాజమాన్యంపై రైతులు తిరుగుబాటుకు దిగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని సముదాయించారు. బీఎన్‌ రోడ్డుపై చోడవరం–అనకాపల్లి రోడ్డులో ఫ్యాక్టరీ గేటు వద్ద రైతులు రాస్తారోకో చేశారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. అనకాపల్లి, విశాఖపట్నం, చోడవరం, పాడేరు, మాడుగుల ప్రాంతాలకు ఇదే ప్రధాన రహదారి కావడంతో రోడ్డుకు ఇరుపక్కలా పెద్దసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఏపీ చెరకు రైతు సంఘం, ఏపీ రైతుసంఘం, ఏపీ రైతు కూలీసంఘం, ఏపీ వ్యవసాయ రైతు కూలీసంఘం, సీఐటీయూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ మహాధర్నాను నిర్వహించారు. సీఐ అప్పలరాజు తన సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందుగా గేటు వద్ద టెంటు వేసి ధర్నా చేశారు. అనంతరం బీఎన్‌రోడ్డుపై రాస్తారోకోకు దిగారు. ప్రభుత్వం వెంటనే చెరకు బకాయిలు చెల్లించాలని, ఫ్యాక్టరీకి రూ.9 కోట్లు తక్షణ సాయంగా అందించాలని, ఆధునికీకరణకు రూ.35 కోట్లు మంజూరు చేయాలని, ఈ ఏడాది చెరకు బకాయిలు వెంటనే చెల్లించాలని నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వం చెరకు రైతులను మోసం చేసిందని, ఫ్యాక్టరీని ఆదుకోవడంతోపాటు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పి 9 నెలలు దాటినా, క్రషింగ్‌ సీజన్‌ ముగుస్తున్నా నేటికి ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదని రైతు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతన్నారు.. ఇంతన్నారు..

స్థానిక ఎంపీ సీఎం రమేష్‌ కేంద్రంలో ఎంతో పలుకుబడి ఉందని గొప్పలు చెప్పడం కాదని, ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెరకు రైతులు డిమాండ్‌ చేశారు. చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు ఫ్యాక్టరీ ఇబ్బందులను, చెరకు రైతుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి కనీస సాయం కూడా తేలేకపోయారని, దీనివల్ల ఫ్యాక్టరీ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి పాత మిషనరీతో తరుచూ ఆగిపోతూ రైతులకు ఇబ్బందులకు గురి చేస్తోందని ధ్వజమెత్తారు. ఫ్యాక్టరీ ఎండీని కలిసేందుకు రైతులంతా ఒక్కసారిగా ఫ్యాక్టరీలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు గేట్లు వేసి వారిని ఆపడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో పోలీసులు, రైతు సంఘాల నాయకుల మధ్య కొంతసేపు వాగ్వివాదం జరిగింది. పరిస్థితి అదుపు తప్పేలా ఉండటంతో రైతులను ఫ్యాక్టరీ పరిపాలన భవనం వరకు అనుమతించారు. అక్కడకు ఎండీ సన్యాసినాయుడు వచ్చి రైతులతో మాట్లాడారు. ఆయనకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఇచ్చారు. ఈనెలాఖరులోగా ఈ ఏడాది చెరకు సరఫరా చేసిన రైతులకు టన్నుకు రూ. 3 వేల చొప్పున మొదటి పేమెంట్స్‌ ఇస్తామని, ఫ్యాక్టరీ ఆధునికీకరణ విషయం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని, పాతబకాయిలు కూడా త్వరలో చెలించేందుకు చర్యలు తీసుకుంటామని ఎండీ చెప్పారు. దీనితో రైతులు శాంతించి మహాధర్నాను విరమించారు. ఈ ఆందోళనలో ఏపీ చెరకు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ, సీఐటీయూ నాయకులు గూనూరు వరలక్ష్మి, ఎస్వీనాయుడు, సీపీఐ నాయకుడు రెడ్డిపల్లి అప్పలరాజు, వ్యవసాయ కార్మిక సంఘం, వ్యవసాయ కూలీ సంఘాల నాయకులు డి.వెంకన్న, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

కదం తొక్కిన చెరకు రైతులు 1
1/2

కదం తొక్కిన చెరకు రైతులు

కదం తొక్కిన చెరకు రైతులు 2
2/2

కదం తొక్కిన చెరకు రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement