
రెల్లీల వాటా పెంచాలి
నర్సీపట్నం: ఎస్పీ వర్గీకరణకు వ్యతిరేకంగా రెల్లి కులస్తులు శనివారం నర్సీపట్నంలో ధర్నా నిర్వహించారు. అబిద్ సెంటర్లోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, ర్యాలీగా బయలుదేరారు. ఒక శాతం వద్దు.. 5 శాతం ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని ధర్నా నిర్వహించారు. కార్యాలయ ఏవో సూర్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రెల్లి హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు యర్రంశెట్టి పాపారావు, గౌరవ అధ్యక్షుడు బంగారి వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు యర్రంశెట్టి అప్పన్నబాబు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ తీర్పుపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులస్తులకు తీరని అన్యాయం చేసిన కమిషన్ క్షేత్రస్థాయిలో పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. ఎ, బి, సి, డి వర్గీకరణలో రెల్లి కులస్తులకు 1 శాతం కేటాయించారని, ఇది ఎంతమాత్రం చాలదన్నారు. ఒకటి నుంచి ఐదు శాతం పెంచాలని డిమాండ్ చేశారు. రెల్లి కులస్తులు స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు అన్ని రంగాల్లో వెనుకబడే ఉన్నారన్నారు. రెల్లీలు రిజర్వేషన్ ఫలాలకు దూరమై అన్యాయానికి గురవుతున్నారన్నారు. రిజర్వేషన్ వర్గీకరణపై పునరాలోచన చేయాలన్నారు. ధర్నాలో రెల్లి సంఘం నాయకులు ఇల్లపు లోవరాజు, బంగారి సూరిబాబు, చెన్నా శ్రీనివాసరావు, మంగళగిరి భగీరథరావు, మంగళగిరి భాస్కరరావు, మజ్జి దినేష్, తదితరులు పాల్గొన్నారు.
నర్సీపట్నంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ధర్నా