
రసాయన పరిశ్రమలకు భూములిచ్చే ప్రసక్తి లేదు
నక్కపల్లి: తరతరాల నుంచి సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న భూములను రసాయన పరిశ్రమలకు ఇచ్చి ఆరోగ్యాలు పాడు చేసుకునే ప్రసక్తి లేదని పలువురు రైతులు ఏపీఐఐసీ అధికారులకు స్పష్టం చేశారు. శనివారం బల్క్డ్రగ్ పార్క్ కోసం అదనంగా భూములు సేకరించేందుకు ఏపీఐఐసీ, రెవెన్యూ అధికారులు జానకయ్యపేట, సిహెచ్ఎల్ పురం తదితర గ్రామాల్లో రైతులతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఐఐసీ ఎస్డీసీ అనిత, తహసీల్దార్ నర్సింహమూర్తి మాట్లాడుతూ బల్క్డ్రగ్ పార్క్ కోసం బీడీపీ ఫేజ్ 2 కింద ఈ రెండు గ్రామాల్లో భూములు గుర్తించామని, రైతులు సహకరించాలని కోరారు. దీనిపై రైతులు మాట్లాడుతూ మామిడి, జీడి, కొబ్బరి తోటలు వేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్న తమ భూములను ప్రమాదకర పరిశ్రమల కోసం సేకరించడం సమంజసం కాదన్నారు. ఇప్పటికే హెటెరో డ్రగ్స్ పరిశ్రమ వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే వారు ఆరోగ్యాలు పాడై ఆస్పత్రి పాలవుతున్నారన్నారు. తాజాగా ఈ ప్రాంతంలో బల్క్డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నారని, తమ నుంచి భూములు తీసుకుని తమ ప్రాణాలకు ముప్పు తెచ్చే పనులు చేయడం ఎంతవరకు సమంజసమని రైతులు ప్రశ్నించారు. దీనిపై ఎస్డీసీ అనిత మాట్లాడుతూ సమావేశంలో రైతులు తెలిపిన విషయాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. రైతుల అంగీకారంతోనే భూములు తీసుకుంటామని, ఆమోదకరమైన నష్టపరిహారం, ప్యాకేజీ ఇస్తామని చెప్పారు. ఈ సమావేశంలో రైతు నాయకులు కురందాసు నూకరాజు, కురందాసు సింహాచలం తదితరులు పాల్గొన్నారు.
ఏపీఐఐసీ అఽధికారులకు స్పష్టం చేసిన రైతులు