అనకాపల్లి టౌన్ : పదో తరగతి బోధించడంలో మూడేళ్ల కంటే ఎక్కువ అనుభవం కలిగిన ఉపాధ్యాయులనే పరీక్షల స్పాట్ వాల్యుయేషన్లో నియమించాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయ్ కోరారు. ఈ మేరకు డీఈవో గిడ్డి అప్పారావు నాయుడుకు యూటీఎఫ్ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా చిన్నబ్బాయ్ మాట్లాడుతూ పదో తరగతి పరీక్ష మూల్యాంకానికి సమ్మతి తెలిపే వారినే ఎంపిక చేయాలన్నారు. అలాగే 58 సంవత్సరాల పైబడిన వయస్సు, దీర్ఘకాలిక వ్యాధులు కలవారు, 50 శాతం అంగవైకల్యం గల ఉపాధ్యాయులకు వారు కోరిన మేర మినహాయింపు ఇవ్వాలన్నారు. స్పాట్ వ్యాల్యూషన్కు ఆయా సబ్జెక్టులలో ఎంతమంది ఉపాధ్యాయులు అవసరం అవుతారో ఆ సీనియార్టీ లిస్టులను ముందుగా తెలియజేయాలన్నారు. ఆయా సెంటర్లలో తగు వసతులు కల్పించాలన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వత్సవాయి శ్రీలక్ష్మి, మండల ప్రధాన కార్యదర్శి నాతవరపు సతీష్, మునగపాక యూటీఎఫ్ నాయకులు ఆశ, రవి, కరుణ, జ్యోతి పాల్గొన్నారు.