అనకాపల్లి టౌన్: పట్టణంలోని గాంధీనగరం సత్యసాయి మందిరంలో సత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాలోని బాల వికాస గురువులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సత్యసాయి సంస్థల జిల్లా అధ్యక్షుడు కసిరెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ బాల వికాస గురువులు ద్వారా పిల్లలకు సనాతన ధర్మం, రామాయణం, భారతం, సంస్కృతీ సంప్రదాయాలు వంటి వివిధ అంశాలపై పాటలు, కథలు వివిధ రూపాల ద్వారా అవగాహన కల్పించి, భవిష్యత్లో వారు ఉన్నత స్థానాలకు చేరుకునే విధంగా విషయాలు బోధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి విద్యా విభాగం జిల్లా సమన్వయకర్తలు శంకర్, శక్తిమూర్తి, యూత్ కో–ఆర్డినేటర్ భారతి, ఆధ్యాత్మిక సమన్వయకర్త కామరాజు తదితరులు పాల్గొన్నారు.