
ఏసీబీ వలలో నక్కపల్లి ఆర్ఐ
● వ్యవసాయ బోరు అనుమతి కోసం రూ.12 వేలు డిమాండ్ ● తహసీల్దార్ కార్యాలయంలో రెడ్హ్యాండెడ్గా పట్టివేత
వివరాలు వెల్లడిస్తున్న ఏసీబీ డీఎస్పీ రమ్య
నక్కపల్లి: వ్యవసాయ బోరు అనుమతి మంజూరుకు రూ.12 వేలు లంచం డిమాండ్ చేసిన నక్కపల్లి ఇన్చార్జ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) ఎం.కన్నబాబు ఏసీబీకి చిక్కారు. తహసీల్దార్ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా ఆయనను ఏసీబీ అధికారులు శుక్రవారం రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ఎన్.రమ్య తెలిపిన వివరాలు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన రైతు తన పొలంలో మూడు వ్యవసాయ బోర్లు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేశాడు. బోరు ఏర్పాటుకు అనుమతి మంజూరు చేయాలంటే ఒక్కొక్క దరఖాస్తుకు రూ.5 వేలు చొప్పున మొత్తం రూ.15 వేలు ఇవ్వాలని ఇన్చార్జ్ ఆర్ఐ కన్నబాబు డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనంటూ బాధితుడు ఆర్ఐతో రూ.12 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని బాధిత రైతు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆర్ఐతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు తహసీల్దార్ కార్యాలయంలో రూ.12 వేలు నగదు అందిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఆర్ఐపై కేసు నమోదు చేశామన్నారు. శనివారం రిమాండ్కు తరలించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న ఏసీబీ అధికారులు మధ్యాహ్నం 3 గంటలకు వరకు ఆర్ఐని విచారించారు. తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై మరింత లోతుగా విచారించినట్లు సమాచారం. విచారణ సమయంలో కార్యాలయంలోకి ఎవరినీ రానివ్వలేదు. ఈ దాడుల్లో సీఐలు వై.కె.కిషోర్కుమార్, సీహెచ్ లక్ష్మణరావు, పి.శ్రీనివాసరావు, బి.సుప్రియ తదితరులు పాల్గొన్నారు.
నక్కపల్లి రెవెన్యూలో కృష్ణ లీలలు
స్థానిక తహసీల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. ఏడాదిన్నర నుంచి ఈ కార్యాలయంలో ఒక ప్రైవేటు వ్యక్తి హవా కొనసాగుతోంది. ఈ బ్రోకర్ చెప్పిందే వేదమని, శ్రీకృష్ణ భగవానుడి గీతా బోధలా ఆయన చెప్పినట్టే రెవెన్యూ సిబ్బంది నడుచుకుంటారని, అందుకు వారికి బాగానే మామూళ్లు అందుతున్నాయన్న విమర్శ ఉంది. ఇతనితోపాటు మెరక గ్రామాల్లో పనిచేస్తున్న ఒక వీఆర్వో కూడా ఇదే పంథాను కొనసాగిస్తున్నాడు. తనకు సంబంధం లేని గ్రామాల మ్యుటేషన్లను కూడా ఇతనే పూర్తిచేస్తాడు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. నక్కపల్లి రెవెన్యూ చరిత్రలో ఉద్యోగి ఏసీబీ అధికారులకు పట్టుబడటం ఇదే తొలిసారి. శుక్రవారం పట్టుబడిన కేసును మించిన పెద్ద పెద్ద అవినీతి పనులెన్నో గతంలో జరిగాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కార్యాలయంలో ఏడాది క్రితం వరకు పనిచేసిన పెద్ద పెద్ద తిమింగలాలు కోర్టు వివాదాల్లో ఉన్న భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయడం, వెబ్ల్యాండ్లో నమోదు చేయడం, డీ ఫారం, సాగులో ఉన్న భూములకు ఏపీఐఐసీ నుంచి నష్టపరిహారం చెల్లించడం కోసం సిఫార్సులు చేయడం వంటి కార్యకలాపాలెన్నో అడ్డగోలుగా చేశారన్న ప్రచారం జరుగుతోంది. గత రెండేళ్ల నుంచి కార్యాలయంలో మ్యుటేషన్లు, ఏపీఐఐసీ నష్టపరిహారం చెల్లింపుల ఫైళ్లు, పేమెంట్లను, జారీ చేసిన పట్టాదారు పాసుపుస్తకాలను పరిశీలిస్తే లబ్ధి పొందిన వారి నుంచి ఎంతెంత దండుకున్నారో తెలుస్తుందంటున్నారు.
ట్రాన్స్కో సిబ్బంది గుండెల్లో గుబులు!
ఏసీబీ దాడి వార్త తెలియడంతో కొంతమంది ట్రాన్స్కో సిబ్బంది గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. వ్యవసాయ బోరు కోసం రెవెన్యూ శా ఎన్వోసీ ఇచ్చిన తర్వాత ట్రాన్స్కో వారు లైను వేసి కనెక్షన్ ఇచ్చి మీటరు ఏర్పాటు చేస్తారు. దీనికోసం వారు రైతుల నుంచి వేలాది రూపాయలు గుంజుతున్నారు. నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లో ఈ అవినీతి పరాకాష్టకు చేరుకుంది. శుక్రవారం నక్కపల్లి రెవెన్యూ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారన్న సమాచారంతో ఈ రెండు మండలాల్లో ట్రాన్స్కో సిబ్బంది కార్యాలయాలు మూసిసి దరిదాపుల్లో కనిపించలేదని సమాచారం.

ఏసీబీ వలలో నక్కపల్లి ఆర్ఐ