మహారాణిపేట (విశాఖ) : నర్సుల పోస్టుల భర్తీ ప్రక్రియలో నకిలీ సర్టిఫికెట్లు వెలుగులోకి వచ్చాయి. కొందరు నర్సింగ్ అభ్యర్థులు అదనంగా 15 మార్కులు పొందడానికి కరోనా సమయంలో పనిచేసినట్లుగా నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారు. అలాగే.. ప్రభుత్వ ఆసుపత్రులు లేదా కళాశాలల్లో పనిచేస్తున్న నర్సులు కూడా తిరిగి ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రాథమిక జాబితాపై వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం ఉన్నతాధికారుల తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. దీంతో సంబంధిత అభ్యర్థుల దరఖాస్తులను అధికారులు పక్కన పెట్టారు. దీని కారణంగా నర్సింగ్ అభ్యర్థుల మెరిట్ జాబితా విడుదల ఆలస్యమవుతోందని అధికారులు తెలిపారు.
ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మొదట 106 నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. తర్వాత మరో 264 పోస్టులు అదనంగా చేరడంతో మొత్తం 370 పోస్టుల భర్తీ చేపట్టారు. ఈ పోస్టుల కోసం గతంలో ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా 8,300 దరఖాస్తులు వచ్చాయి. జనవరి 27న ప్రాథమిక జాబితా విడుదల చేయగా, దానిపై 1,570 అభ్యంతరాలు వచ్చాయి. ఈ అభ్యంతరాలను పరిశీలించిన అధికారులు..నకిలీ సర్టిఫికెట్లు సమర్పించిన వారు, ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకున్నట్లు గుర్తించారు. కరోనా సమయంలో పని చేసిన వారికి 15 అదనపు మార్కులు ఇస్తుండటంతో చాలా మంది నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు తేలింది. వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ సంచాలకురాలు డాక్టర్ రాధారాణి ఆధ్వర్యంలో దరఖాస్తులను పరిశీలిస్తున్న అధికారులు.. వివిధ ప్రొగ్రామ్ల కింద పనిచేసిన వారి దరఖాస్తులను తిరస్కరించారు. సరైన వివరాలు సమర్పించని వారి దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు. కాగా.. మరో మూడు రోజుల్లో నర్సుల పోస్టులకు సంబంధించిన తుది జాబితాను విడుదల చేస్తామని డాక్టర్ రాధారాణి సోమవారం ‘సాక్షి’కి తెలిపారు. ఈ జాబితాపై కూడా అభ్యంతరాలు స్వీకరించి, అనంతరం రోస్టర్ ప్రకారం ఎంపిక జాబితాను ప్రకటిస్తామని ఆమె వివరించారు.
కరోనా సమయంలో పనిచేసినట్లు
నకిలీ సర్టిఫికెట్లు సమర్పించిన అభ్యర్థులు
అదనంగా 15 మార్కుల కోసం అడ్డదారులు
ఉన్నతాధికారుల తనిఖీల్లో బండారం బట్టబయలు
నర్సుల పోస్టులకు ‘నకిలీ’ పత్రాలు