
మద్యం మత్తులో స్కూల్ ఆటో డ్రైవర్ బీభత్సం
అక్కిరెడ్డిపాలెం: మద్యం మత్తులో స్కూల్ ఆటోడ్రైవర్ డివైడర్ను ఢీకొట్టడంతో.. ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. గాజువాక ట్రాఫిక్ సీఐ కోటేశ్వరరావు తెలిపిన వివరాలివి.. గాజువాక చైతన్యనగర్లోని చైతన్య స్కూల్, చినగంట్యాడలోని ఏవీకే స్కూల్కు చెందిన ఆరుగురు విద్యార్థులను మిందికి చెందిన డ్రైవర్ ఎర్రునాయుడు మంగళవారం మధ్యాహ్నం 1.20 సమయంలో ఆటోలో ఎక్కించుకున్నాడు. అప్పటికే పూటుగా మద్యం సేవించి ఉన్న ఆయన మింది నుంచి పాతగాజువాక వైపు వెళ్తున్నాడు. భెల్ సిగ్నల్ పాయింట్ వద్ద నుంచి సర్వీసు రోడ్డులో కాకుండా.. మద్యంమత్తులో అతివేగంగా జాతీయ రహదారి ఎక్కేశాడు. పాత గాజువాక సమీపిస్తుండగా బజాజ్ షోరూం వద్దకు వచ్చే సరికి ముందు వెళ్తున్న ఫార్మా కంపెనీ బస్సును ఓవర్ టేక్ చేయబోయి డివైడర్ను ఢీ కొట్టాడు. దీంతో ఆటో బోల్తా పడింది. ఆటోలో ఉన్న సీహెచ్ భార్గవ్(2వ తరగతి, శ్రీ చైతన్య స్కూల్), సీహెచ్.నిమిష(8వ తరగతి, శ్రీ చైతన్య స్కూల్), సీహెచ్.భువనదీప్(5వ తరగతి, శ్రీ చైతన్య స్కూల్), కె.సాహితీ(8వ తరగతి, ఏవీకే స్కూల్), అభిరామ్(7వ తరగతి, ఏవీకే స్కూల్), మౌనిక(4వ తరగతి, శ్రీ చైతన్య స్కూల్)లకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి.. విద్యార్థులను అక్కడే ఉన్న చిన్నపిల్లల ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ ఏసీపీ వాసుదేవరావు ఆస్పత్రికి వెళ్లి.. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. గాయాలపాలైన వారిని పరిశీలించారు. ఆటో డ్రైవర్ ఎర్రునాయుడును బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయగా 550గా నమోదైందని సీఐ తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుగా నమోదు చేసి, ప్రమాదానికి కారణమైన ఆటోడ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
డివైడర్ను ఢీకొనడంతో ఆటో బోల్తా
ఆరుగురు విద్యార్థులకు గాయాలు

మద్యం మత్తులో స్కూల్ ఆటో డ్రైవర్ బీభత్సం

మద్యం మత్తులో స్కూల్ ఆటో డ్రైవర్ బీభత్సం