
రియల్.. కుదేల్
రిజిస్ట్రార్ కార్యాలయాలు కళ తప్పాయి. స్థిరాస్తి వ్యాపారం పతనం కావడంతో క్రయవిక్రయాలు క్షీణించాయి. కూటమి ప్రభుత్వ హయాంలో తమ కార్యకలాపాలు కుప్పకూలిపోయాయని రియల్టర్లు వాపోతున్నారు. పెట్టిన పెట్టుబడి రాకపోగా వడ్డీలు కట్టలేక అప్పుల పాలై గగ్గోలు పెడుతున్నారు.
2023–24లో లక్ష్యం రూ.370.57 కోట్లు.. ఆదాయం రూ.278.46 కోట్లు అచీవ్మెంట్ 75.14 శాతం
స్థిరాస్తి వ్యాపారం నేల చూపులు
కూటమి ప్రభుత్వంలో కుప్పకూలిన రియల్ ఎస్టేట్ రంగం
భూముల విలువ పెంచినా.. తగ్గిన ఆదాయం
క్షీణించిన క్రయవిక్రయాలు.. వ్యాపారులకు ఇబ్బందులు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విశాఖకు బహుళ జాతి కంపెనీలు క్యూలు కడతాయని ఎన్నికలకు ముందు ఊదరగొట్టారు. ఐటీ, ఐటీయేతర, ఫార్మా, డేటా సెంటర్ల పెట్టుబడుల వరద ముంచెత్తుతుందని చెవులకు చిల్లులు పడేలా బాకాలు ఊదారు. సంపద సృష్టించి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి మించిన సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రజల నోట్లో బూర్లు వండేశారు. అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 10 నెలల కాలంలోనే అన్ని ప్రభుత్వ కార్యాలయాల సంపద ఆవిరైపోతోంది. అన్ని వ్యాపార రంగాలు తిరోగమన బాట పడుతున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. మార్కెట్లు డీలా పడిపోయాయి. ఈ ప్రభావం జిల్లాలో స్థిరాస్తి రంగంపై పడింది.
సాక్షి, అనకాపల్లి:
రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడడంతోనే రియల్ ఎస్టేట్ రంగానికి గ్రహణం పట్టింది. పది నెలల కాలంలో క్రమంగా క్షీణించి.. భూముల విలువ ఇబ్బడి ముబ్బడిగా పెంచినా ఫలితం లేకపోయింది. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు తన విధానాలతో అన్ని రంగాల వారిని వెనక్కు నెట్టడంతో ఆ ప్రభావం.. డబ్బులతో ముడిపడిన స్థిరాస్తి రంగంపై పడింది. అనకాపల్లి జిల్లాలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.408.25 కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం టార్గెట్ విధించింది. కానీ వచ్చింది కేవలం రూ.270.73 కోట్లు మాత్రమే. అంటే కేవలం 66. 3 శాతం మేరకే లక్ష్యాన్ని సాధించగలిగారు. సాధారణంగా గత ఏడాది వచ్చిన నికర ఆదాయాన్ని బట్టి ఈ ఏడాది టార్గెట్ నిర్ణయిస్తారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో అచీవ్మెంట్ 75.14 శాతం ఉంది. దాని ప్రకారమే ఈ ఏడాది రూ.408.25 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. భూముల విలువ పెంచినా గత ఏడాది వచ్చినంత కూడా రాక పోవడాన్ని బట్టి స్థిరాస్తి విక్రయాలు ఏ స్థాయికి పడిపోయాయో అర్థం చేసుకోవచ్చు. రాబడిని పెంచేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించలేదు. రియల్ రంగానికి ఎప్పుడు మంచి రోజులు వస్తాయోనని వ్యాపారులు, మధ్యవర్తులు, ఈ రంగంపై పరోక్షంగా ఆధారపడినవారు ఆశగా ఎదురుచూస్తున్నారు.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో స్థిరాస్తి రంగం పుంజుకుంది. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించిన తరువాత రియల్ ఎస్టేట్ పరుగులు తీసింది. శివారు ప్రాంతాల్లో సైతం భూములకు డిమాండ్ పెరిగింది. కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత జీవీఎంసీ పరిధిలోని అనకాపల్లితోపాటు జిల్లాలోని యలమంచిలి, పరవాడ, చోడవరం, నర్సీపట్నం, పాయకరావుపేట ప్రాంతాల్లో ‘రియల్’ రంగం బాగా పుంజుకుంది. 16వ నంబరు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న భూములు, ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటైన అచ్యుతాపురంలో భూములు, ఇళ్ల ధరలు పెరిగాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు బాగా గడించారు. వారిని చూసి మరికొందరు ఈ వ్యాపారంలో దిగారు. ప్రైవేటుగా ఫైనాన్స్ తెచ్చి పెట్టుబడులు పెట్టారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.
విశాఖ రాజధానిగా అయ్యే అవకాశం లేదని అందరూ భావించడంతో.. రియల్ ఎస్టేట్ పూర్తిగా కుదేలైంది. ప్రస్తుతమున్న ప్రాజెక్టుల్లోనే ఫ్లాట్లు, వెంచర్లలో ప్లాట్ల విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. కొత్తగా వెంచర్లు, నిర్మాణాలకు ఎవరూ సాహసించడం లేదు. దీంతో జిల్లాలో ఆస్తుల క్రయ, విక్రయాలు తగ్గిపోయాయి.
2024–25లో లక్ష్యం రూ.408.25 కోట్లు ఆదాయం రూ.270.73 కోట్లు భూముల విలువ రెట్టింపు చేసినా లక్ష్యంలో 66.3 శాతమే వచ్చింది.
వైఎస్సార్సీపీ హయాంలో పెరిగిన రియల్ ఎస్టేట్..
సంపద ఏది
బాబూ..

రియల్.. కుదేల్

రియల్.. కుదేల్

రియల్.. కుదేల్

రియల్.. కుదేల్