
సాక్షి, అమరావతి: వరుసగా రెండో ఏడాది ‘వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్, వైఎస్సార్ అచీవ్ మెంట్ – 2022’ అత్యున్నత పురస్కారాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను హైపవర్ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు శుక్రవారం ప్రకటించనున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
వ్యవసాయం, కళలు, సాహిత్యం, విద్య, జర్నలిజం, వైద్యం, సామాజిక సేవ వంటి వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన దాదాపు 25 మంది వ్యక్తులు, సంస్థలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా నవంబర్ 1న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవార్డులు ప్రదానం చేస్తారని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారాల తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పురస్కారాలను అందజేస్తోందని తెలిపారు. వివిధ రంగాల్లో అసాధారణ నైపుణ్యాలు, ప్రతిభా పాటవాలు కలిగి సమాజాన్ని విశేషంగా ప్రభావితం చేసిన అర్హులైన వ్యక్తులు, సంస్థలను గుర్తించి, క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే రాష్ట్రస్థాయి హైపవర్ స్క్రీనింగ్ కమిటీ అవార్డుల ఎంపికకు జాబితాను సిద్ధం చేసిందని పేర్కొన్నారు.
వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కింద ఎంపికైన వారికి రూ.10 లక్షలు, వైఎస్సార్ కాంస్య విగ్రహం, జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందజేస్తారని తెలిపారు. అదే విధంగా వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డు కింద ఎంపికైన వారికి రూ.5 లక్షలు, జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందజేస్తారని విజయ్కుమార్ రెడ్డి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment