
ఉదయం 9 గంటలకు అసెంబ్లీ
సీఎం చాంబర్లో కేబినెట్ భేటీ
సాక్షి, అమరావతి: ఆర్థిక సంవత్సరం మరో నాలుగు నెలల్లో ముగస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు చంద్రబాబు ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. సాధారణంగా ఎన్నికల సంవత్సరం ఏ ప్రభుత్వం ఉన్నా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఆ తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతుంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం జూన్లోనే అధికారంలోకి వచ్చినప్పటికీ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా మరో నాలుగు నెలలకు అంటే.. నవంబర్ వరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ఆర్డినెన్స్ జారీ చేసింది.
సూపర్ సిక్స్ వంటి పథకాల అమలు నుంచి తప్పించుకోవడానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ జారీ చేశారనే విమర్శలు కూడా వచ్చాయి. డిసెంబర్ నుంచి మార్చి వరకు ఖర్చులకు అసెంబ్లీ ఆమోదం పొందాల్సి ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో సోమవారం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని సీఎం చాంబర్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశమై బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది. అనంతరం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2024–25 ఆర్థిక ఏడాదికి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment