
సాక్షి, అమరావతి: వేసవి దృష్ట్యా వచ్చే మూడు నాలుగు నెలల్లో విద్యుత్ కొరత లేకుండా చూసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. అవసరాలకు అనుగుణంగా ఎంత మేరకు విద్యుత్ కావాలో ఆ మేరకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వేసవి దృష్ట్యా విద్యుత్ ఉత్పత్తితో పాటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, పంపిణీ సంస్థల పనితీరుపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఇంధన శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రైతులకు ఉచితంగా, ఆక్వా రైతులకు సబ్సిడీపై.. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తున్న విద్యుత్పై సీఎం చర్చించారు.
ఈ రంగాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిధులను సకాలంలో విడుదల చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రణాళిక రూపొందించుకోవాలని ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. కృష్ణపట్నం, విజయవాడలో నిర్మాణంలో ఉన్న థర్మల్ యూనిట్లను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ యూనిట్ల నిర్మాణం దీర్ఘకాలంపాటు కొనసాగితే.. అవి భారంగా తయారవుతాయన్నారు.
సత్వరమే నిర్మాణాలు పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మేలు జరుగుతుందని పేర్కొన్నారు. జెన్ కో ఆధ్వర్యంలో నడుస్తున్న 15 యూనిట్లకు ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసుకోవాలని, బొగ్గు సరఫరాపై నిరంతరం సమీక్ష చేసి అవసరాలకు అనుగుణంగా సమకూర్చుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఇంధన శాఖ ఎక్స్ అఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీ జి సాయి ప్రసాద్, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్ శ్రీకాంత్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment