Department of Power
-
విద్యుత్ రంగానికీ పీఎల్ఐ!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ప్రసార(పవర్ ట్రాన్స్మిషన్) రంగానికి సైతం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) చివరికల్లా పీఎల్ఐను వర్తింపచేయాలని చూస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రపంచస్థాయిలో ట్రాన్స్మిషన్ పరికరాల కొరత కారణంగా ధరలు పెరిగిపోతుండటంతో తాజా యోచనకు తెరతీస్తున్నట్లు తెలియజేశారు. మరోవైపు ప్రభుత్వం పునరుత్పాదక(రెనెవబుల్) ఇంధనాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో వేగవంతంగా విద్యుత్ ప్రసార లైన్లను ఏర్పాటు చేయడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. దేశీయంగా విద్యుత్ ప్రసార పరికరాల కోసం అత్యధిక శాతం దిగుమతులపైనే ఆధారపడుతుండటంతో పీఎల్ఐకు ప్రభుత్వం తెరతీస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలియజేశాయి. తద్వారా దేశీయంగా ట్రాన్స్మిషన్ పరికరాల తయారీకి ప్రభుత్వం దన్నునివ్వనున్నట్లు వెల్లడించాయి. దీంతో విదేశీ మారక నిల్వలను సైతం ప్రభుత్వం ఆదా చేసుకోనుంది. దిగుమతులే అధికం ప్రధానంగా ట్రాన్స్ఫార్మర్లు, సర్క్యూట్ బ్రేకర్లు, స్విచ్గేర్లు తదితర విద్యుత్ ప్రసార పరికరాల కోసం భారత్ విదేశాలపై అధికంగా ఆధారపడుతోంది. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం 2023లో భా రత్ 33.8 కోట్ల డాలర్ల (సుమారు రూ.2,840 కో ట్లు) విలువైన పరికరాలను దిగుమతి చేసుకుంది. -
జలకళ ఉన్నా హై‘డల్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కృష్ణా పరీవాహకంలోని జలాశయాలన్నీ పూర్తిగా నిండటంతో రోజూ లక్షల క్యూసెక్కుల వరదను కిందకు విడుదల చేస్తున్నా పూర్తి స్థాపిత సామర్థ్యం మేరకు జలవిద్యుదుత్పత్తి చేసుకొనే అవకాశం లేకుండా పోయింది. ఎగువ జూరాల, దిగువ జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ జలవిద్యుత్ కేంద్రాలకు మరమ్మతులు నిర్వహించకుండా ఏడాదిగా తాత్సారం చేయడంతో రోజుకు రూ. 4 కోట్ల విలువ చేసే 7.93 మిలియన్ యూనిట్ల జలవిద్యుదుత్పత్తికి గండిపడుతోంది. వర్షాకాలం ప్రారంభానికి ముందే మరమ్మతులు నిర్వహించాల్సి ఉండగా సత్వర నిర్ణయాలు తీసుకోకుండా తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) గత, ప్రస్తుత సీఎండీలు, డైరెక్టర్లు తీవ్ర తాత్సారం చేయడం, సకాలంలో టెండర్లు నిర్వహించకపోవడంతో సంస్థకు భారీ ఆదాయనష్టం కలుగుతోంది. సుమారు రూ. 30 కోట్లు ఖర్చు చేస్తే నాలుగు జలవిద్యుత్ కేంద్రాలకూ మరమ్మతులు పూర్తయ్యేవని జెన్కో అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కృష్ణా బేసిన్లోని జలాశయాలకు కనీసం నెల రోజులు వరద కొనసాగినా ఈ ఏడాది రూ. 120 కోట్ల విలువ చేసే విద్యుత్ను జెన్కో నష్టపోయే అవకాశం కనిపిస్తోంది. గరిష్టంగా మూడు నెలలు వరద కొనసాగితే రూ. 300 కోట్ల నుంచి రూ. 420 కోట్ల విలువ చేసే విద్యుత్ను నష్టపోనుంది. 330.8 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తికి గండి.. రాష్ట్రంలో మొత్తం 2,441.76 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంగల జలవిద్యుత్ కేంద్రాలుండగా మరమ్మతులకు నోచుకోక ఏడాదికిపైగా 330.8 మెగావాట్ల సామర్థ్యంగల జలవిద్యుత్ కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. ప్రధానంగా శ్రీశైలం, నాగార్జునసాగర్, ఎగువ జూరాల, దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రాల్లో కనీసం ఒక్కో యూనిట్ పనిచేయడం లేదు. వర్షాలు, వరదలు మొదలవడంతో ఇప్పుడు టెండర్లు పిలిచినా ఇప్పట్లో మరమ్మతులు నిర్వహించే పరిస్థితి లేదు. వర్షాకాలం ముగిశాకే పనులు చేసేందుకు వీలు కలగనుంది. రాష్ట్రంలోని జలవిద్యుత్ కేంద్రాలు ఏటా కనీసం 3,000 మిలియన్ యూనిట్ల జలవిద్యుత్ను ఉత్పత్తి చేయాల్సి ఉండగా వాటికి మరమ్మతులు జరగక లక్ష్యం నెరవేరట్లేదు. విద్యుత్ సంస్థలపై పర్యవేక్షణ లోపం రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శినే జెన్కో, ట్రాన్స్కోకు ఇన్చార్జి సీఎండీగా అదనపు బాధ్యతల్లో నియమించడంతో విద్యుత్ సంస్థలపై పూర్తి పర్యవేక్షణ లేకుండాపోయింది. ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్ 15 రోజులపాటు సెలవులో వెళ్లడంతో ఆయన స్థానంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియాకు అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఆయన సచివాలయం నుంచే పనిచేస్తుండటంతో విద్యుత్సౌధలో రోజువారీ పాలనా వ్యవహారాల పర్యవేక్షణ గాడి తప్పిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరమ్మతులకు నోచుకోని జలవిద్యుత్ కేంద్రాల యూనిట్లు ఇవే.. – శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం స్థాపిత సామర్థ్యం 900 (6150) మెగావాట్లు కాగా అందులో 150 మెగావాట్ల సామర్థ్యంగల 4వ యూనిట్ గతేడాది ఆగస్టు 17 నుంచి పనిచేయట్లేదు. స్టేటర్ వైండింగ్ కాలిపోవడంతోపాటు రోటర్ పోల్లో ఫాల్ట్ రాగా ఏడాదిగా మరమ్మతులు చేయలేదు. – నాగార్జునసాగర్ జలవిద్యుత్ కేంద్రం స్థాపిత సామర్థ్యం 815.6 (1110 + 7100.8) మెగావాట్లు కాగా అందులో 100.8 మెగావాట్ల సామర్థ్యంగల రెండో యూనిట్కు సంబంధించిన రోటర్ స్పైడర్ ఆర్మ్కు పగుళ్లు వచ్చాయి. దీంతో గతేడాది నవంబర్ 10 నుంచి అది వినియోగంలో లేదు. జపాన్ నుంచి ఇంజనీర్లు వస్తేనే దానికి మరమ్మతులు జరుగుతాయని 9 నెలలుగా కాలయాపన చేస్తున్నారు. – ఎగువ జూరాల జలవిద్యుత్ కేంద్రం స్థాపిత సామర్థ్యం 234 (639) మెగావాట్లు కాగా అందులో 39 మెగావాట్ల సామర్థ్యంగల మూడో యూనిట్లో స్టేటర్ వైండింగ్ కాలిపోవడంతో గతేడాది ఆగస్టు 7 నుంచి వినియోగంలో లేదు. – దిగువ జూరాల విద్యుత్ కేంద్రం స్థాపిత సామర్థ్యం 240 (640) మెగావాట్లు కాగా అందులోని అన్ని యూనిట్లలో సీల్ లీకవుతోంది. అన్ని యూనిట్లలో నిరంతర విద్యుదుత్పత్తి కొనసాగించే పరిస్థితి లేదు. – పులిచింతల జలవిద్యుత్ కేంద్రం స్థాపిత సామర్థ్యం 120 (430) మెగావాట్లు కాగా 2022 అక్టోబర్ 1 నుంచి 30 మెగావాట్ల సామర్థ్యంగల మూడో యూనిట్ నిరుపయోగంగా మారింది. దాదాపుగా రెండేళ్లు గడుస్తున్నా చెడిపోయిన రన్నర్ బ్లేడ్ను మార్చలేదు. – నిజాంసాగర్ జలవిద్యుత్ కేంద్రం 10 (25) మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉండగా మరమ్మతులు చేయకపోవడంతో 2022 నవంబర్ 9 నుంచి మొత్తం విద్యుత్ కేంద్రం నిరుపయోగంగా ఉంది. – పాలేరు మినీ హైడ్రో పవర్ స్టేషన్ సామర్థ్యం 2 (12) మెగావాట్లు కాగా మెగావాట్ల సామర్థ్యంగల ఒకటో యూనిట్ గత మార్చి 6 నుంచి నిరుపయోగంగా ఉంది. రన్నర్ హబ్కు మరమ్మతులు చేయాల్సి ఉంది. -
త్వరలో మరింత విద్యుత్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే నెల 15వ తేదీ నుంచి పవన విద్యుదుత్పత్తిని పెంచుతున్నామని, దీంతో త్వరలోనే మరింత విద్యుత్ అందుబాటులోకొస్తుందని ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితిపై ఆదివారం ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. శాశ్వత ప్రాతిపదికన నిరంతర విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ సంస్థలు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని మంత్రి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. అనూహ్యంగా విద్యుత్ కొరత ఏర్పడినా, భవిష్యత్లో భారీగా డిమాండ్ ఏర్పడినా తట్టుకునేలా విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న విద్యుత్ కొరత తాత్కాలికమేనని మరోసారి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పునరుద్ఘాటించారు. పవర్ ఎక్సే్చంజ్లో యూనిట్ రూ.12 నుంచి 16 వరకు ఉండగా, వ్యవసాయానికి పగటిపూట 9 గంటల చొప్పున పాతికేళ్ల పాటు ఉచిత విద్యుత్ అందించడం కోసం ‘సెకీ’ ద్వారా యూనిట్ కేవలం రూ.2.49కే కొనుగోలు చేయనున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు. నేడు టెండర్లకు ఆహ్వానం కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంట్లో(800 మెగావాట్లు) ఉత్పత్తిని పెంచేందుకు ఏపీ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇప్పటికే లక్ష టన్నులు దిగుమతి చేసుకున్న (ఇంపోర్టెడ్) మెరుగైన గ్రేడ్ బొగ్గు కోసం టెండర్లు పిలిచినట్టు ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్ వెల్లడించారు. అలాగే కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాల మేరకు ఏపీజెన్కో 18 లక్షల టన్నుల దిగుమతి చేసుకున్న బొగ్గు కోసం, ఏపీపీడీసీఎల్ 13 లక్షల టన్నుల బొగ్గు కోసం టెండర్లను సోమవారం ఆహ్వానించే అవకాశం ఉందని చెప్పారు. ఈ ప్రక్రియను నెలలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కృష్ణపట్నం ఫేజ్–2 ప్లాంట్ను ఈ నెలాఖరుకుగానీ, జూన్ మొదటి వారానికి గానీ ప్రారంభించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించినట్లు బి.శ్రీధర్ చెప్పారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమీక్షలో ఏపీ ట్రాన్స్ కో జేఎండీ ఐ.పృథ్వితేజ్, డిస్కంల సీఎండీలు హెచ్.హరనాథరావు, జె.పద్మజనార్దన్ రెడ్డి, కె.సంతోషరావు, ట్రాన్స్ కో డైరెక్టర్ ఏవీకే భాస్కర్, జెన్ కో డైరెక్టర్లు పాల్గొన్నారు. -
ఇంటి కరెంట్ బిల్లు రూ.76లక్షలు! మరోసారి రీడింగ్ తీస్తే..
మధిర: ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని పలు ఇళ్లలో విద్యుత్ మీటర్ల రీడింగ్ తప్పులతడకగా మారడంతో వినియోగదారులు గందరగోళానికి గురవుతున్నారు. మధిరలోని వర్తక సంఘం సమీపాన నివసిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు తమ్మారపు నాగమణి ఇంట్లో సోమవారం విద్యుత్శాఖ సిబ్బంది మీటర్ రీడింగ్ తీశారు. స్కానింగ్ మిషన్ ద్వారా రీడింగ్ తీసే క్రమంలో పక్కనే ఉన్న మరో మీటర్ రీడింగ్ కూడా చేరడంతో 3090110116 సర్వీస్కు రూ.76,46,657గా బిల్లు వచ్చింది. రెండు మీటర్లు కలిసినా 76 లక్షలకు పైగా బిల్లు రావడమేమిటని బాధితులు ఆందోళన చెం దారు. దీంతో సిబ్బం ది మరో స్కా నింగ్ మిషన్ తీసుకొచ్చి రీడింగ్ తీస్తే బిల్లు రూ.58 మాత్రమే వచ్చింది. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. స్కానింగ్మిషన్లలో అవకతవకలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
విద్యుత్ వినియోగదారులకు భారీ ఊరట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు భారీ ఊరట లభించింది. ఇంధన సర్దుబాటు చార్జీల (ట్రూఅప్) కింద వసూలు చేసిన సొమ్మును విద్యుత్ పంపిణీ సంస్థలు వినియోగదారులకు తిరిగిచ్చేస్తున్నాయి. డిసెంబర్ నెల (నవంబర్లో వినియోగానికి సంబంధించి) బిల్లుల్లో ఆ మేరకు చార్జీలు తగ్గాయి. ట్రూఅప్ చార్జీల కింద వసులు చేసిన మొత్తాన్ని విద్యుత్ బిల్లులో సర్దుబాటు చేస్తున్నారు. తాజాగా విద్యుత్ బిల్లులను పరిశీలించిన వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీఈఆర్సీ ఆదేశాలతో వెనక్కి.. 2014–15 నుంచి 2018–19 కాలానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్), ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) సమర్పించిన రూ.7,224 కోట్ల ట్రూఅప్ చార్జీల పిటిషన్ల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) గత ఆగష్టు 27న రూ.3,669 కోట్ల ఇంధన సర్దుబాటు చార్జీల వసూలుకు అనుమతినిచ్చింది. ఏపీఎస్పీడీసీఎల్ రూ.3,060 కోట్లు, ఏపీఈపీడీసీఎల్ రూ.609 కోట్ల మేర ట్రూఅప్ చార్జీలను ఎనిమిది నెలల్లో వసూలు చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. సెప్టెంబర్, అక్టోబర్ బిల్లులలో ఆ మేరకు చార్జీలు విధించాయి. అయితే పలు న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తడంతో ఏపీఈఆర్సీ తన ఆదేశాలను వెనక్కి తీసుకుంది. దీంతో విద్యుత్ బిల్లులు ట్రూఅప్ చార్జీలు లేకుండానే వినియోగదారులకు అందుతున్నాయి. వినియోగదారులు ఇప్పటికే చెల్లించిన ట్రూఅప్ చార్జీలను బిల్లులో సర్దుబాటు చేస్తున్నారు. వినియోగదారులకు రూ.196.28 కోట్లు ట్రూఅప్ చార్జీలను ఏపీఈపీడీసీఎల్ పరిధిలో యూనిట్కు రూ.0.45 పైసలు ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో రూ.1.27 పైసలు చొప్పున వినియోగదారుల నుంచి వసూలు చేశారు. ఇలా ఏపీఈపీడీసీఎల్ రూ.126 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్ రూ.70 కోట్లు చొప్పున ట్రూఅప్ కింద వసూలు చేశాయి. ఐదేళ్ల క్రితం నాటి ట్రూఅప్ చార్జీలు కావడంతో అప్పటికి ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్న సర్వీసులు కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ మధ్యప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) పరిధిలోకి వచ్చాయి. వీటికి ఏపీసీపీడీసీఎల్ బాధ్యత తీసుకుని రూ.28 లక్షలు వసూలు చేసింది. ఈ క్రమంలో మొత్తం రూ.196.28 కోట్లను వినియోగదారులకు డిస్కంలు వెనక్కి ఇస్తూ విద్యుత్ బిల్లుల్లో సర్దుబాటు చేస్తున్నాయి. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో నవంబర్ నెల బిల్లుల నుంచే ట్రూఅప్ చార్జీలను వినియోగదారులకు తిరిగి వెనక్కి చెల్లిస్తూ సర్దుబాటు ప్రక్రియ ప్రారంభం కాగా ఏపీఈపీడీసీఎల్ డిసెంబర్ నుంచి చేపట్టింది. ఫలితంగా రాష్ట్రంలో 1.86 కోట్ల మంది వినియోగదారులకు ఊరట దక్కింది. -
సీలేరులో మరో విద్యుత్ ప్రాజెక్ట్
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉత్పత్తి రంగంలో మరో మైలురాయిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా ఎదురైన బొగ్గు సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలో జల విద్యుత్ ఉత్పత్తి పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యుత్ శాఖ సమీక్షలో ఇటీవల ఆదేశించారు. 6,300 మెగావాట్ల సామర్థ్యంతో రివర్స్ పంపింగ్ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా సీలేరులో 1,350 మెగావాట్ల రివర్స్ పంపింగ్ ప్రాజెక్టుపై తక్షణమే దృష్టి సారించాలని ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాలోని ఎగువ సీలేరు వద్ద పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్ట్ పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. సీలేరులో రివర్సబుల్ పంపులను వ్యవస్థాపించడంపై ప్రధానంగా దృష్టి సారించాలని ఏపీ జెన్కోను ప్రభుత్వం ఆదేశించింది. గ్రిడ్ స్థిరీకరణ, సౌర, పవన విద్యుత్తో అనుసంధానం చేయడం, వినియోగదారులకు నిరంతరం విద్యుత్ అందించడం, భవిష్యత్లో ఇంధన డిమాండ్ను తీర్చడానికి చర్యలు తీసుకోవాలని సూచించింది. గ్రిడ్పై భారం తగ్గుతుంది ఎగువ సీలేరు వద్ద ఉన్న గుంటవాడ రిజర్వాయర్ (ఎగువ) నుంచి 1.70 టీఎంసీల నీటిని వినియోగించడం ద్వారా పీక్ అవర్స్లో 1,350 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయడం, డొంకరాయి రిజర్వాయర్ (దిగువ) నుంచి 1.70 టీఎంసీల నీటిని గుంటవాడ రిజర్వాయర్కు ఆఫ్ పీక్ వేళల్లో పంప్ చేయడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు. గ్రిడ్లో అందుబాటులో ఉన్న మిగులు విద్యుత్ను ఉపయోగించడం ద్వారా ఆకస్మిక హెచ్చుతగ్గుల కారణంగా గ్రిడ్పై భారం పడి సమస్యలు తలెత్తకుండా స్థిరంగా ఉంచేందుకు ఈ ప్రాజెక్ట్ సహాయపడుతుందని ఆయన వివరించారు. శ్రీశైలం, పోలవరం తర్వాత ఇదే పెద్దది 1,350 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్ట్ను స్థాపించడానికి దాదాపు 410 హెక్టార్ల భూమి అవసరమవుతుందని ఏపీజెన్కో మేనేజింగ్ డైరెక్టర్ బి.శ్రీధర్ పేర్కొన్నారు. టోపోగ్రాఫికల్ సర్వే, హైడ్రోగ్రాఫిక్ సర్వే, 76.9 శాతం జియోటెక్నికల్ పరిశోధనలు పూర్తయ్యాయని తెలిపారు. శ్రీశైలం, పోలవరం హైడ్రో ప్రాజెక్టుల తర్వాత ప్రతిష్టాత్మక ఎగువ సీలేరు ప్రాజెక్ట్ రాష్ట్రంలోనే అతి పెద్దదిగా పరిగణిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ స్థాపనకు అన్ని అనుమతులను పొందడంతోపాటు డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారుచేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం వాప్కాస్ లిమిటెడ్కు అప్పగించిందన్నారు. -
విపత్తుల్లోనూ 'పవర్'ఫుల్
సాక్షి, అమరావతి: ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా ఏపీ విద్యుత్ సంస్థలు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నాయి. భౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్)తో విద్యుత్ శాఖ సమగ్ర సమాచారాన్ని క్రోడీకరించడం ద్వారా దక్షిణాది పవర్ గ్రిడ్కు అనుసంధానం చేసే దిశగా అడుగులు పడతున్నాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని కేంద్ర పవర్ గ్రిడ్ పర్యవేక్షిస్తోంది. దీనిపై ఇటీవల కేంద్రంతో రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లితో కలిసి రాష్ట్ర అధికారులు చర్చించారు. ఈ వివరాలను రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్రెడ్డి ఆదివారం మీడియాకు వివరించారు. రియల్ టైమ్ పద్ధతిలో పర్యవేక్షించేలా.. రాష్ట్రంలో వేలాది కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లు విస్తరించి ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా సబ్ స్టేషన్లతో విద్యుత్ నెట్వర్క్ ఉంది. ఇది ఇతర రాష్ట్రాలకు అనుసంధానమై ఉంటుంది. అవసరమైనప్పుడు మనం విద్యుత్ ఇవ్వడం, తీసుకోవడానికి ఈ లైన్లు ఉపయోగపడతాయి. అయితే, అటవీ ప్రాంతాలు, జలాశయాలు, కొండల్లో విద్యుత్ నెట్వర్క్ విస్తరించి ఉంది. ఈ సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపరుస్తారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎక్కడ ఏ లైన్కు ఇబ్బంది ఉంది? ఆ ప్రాంతంలో ఎన్ని సర్వీసులకు సమస్య రావచ్చు? ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యుత్ అందించడం ఎలా? వరదలొస్తే ఏ సబ్ స్టేషన్లకు ముప్పు ఉంటుంది? ఇలా అనేక రకాల సమాచారాన్ని భౌగోళిక సమాచార వ్యవస్థ ద్వారా అందిస్తారు. అవసరమైనప్పుడు కేవలం మౌస్ క్లిక్ ద్వారా క్షేత్రస్థాయి సమాచారం తేలికగా తెలుసుకునే వీలుంది. ఓవర్ లోడింగ్ సహా అన్ని అంశాలను రియల్ టైం పద్ధతిలో పర్యవేక్షించేందుకు పవర్ గ్రిడ్లకు ఇది తోడ్పడుతుంది. ఈ నేపథ్యంలో విద్యుత్ నెట్వర్క్ను మ్యాపింగ్ చేసే కార్యక్రమానికి ట్రాన్స్కో శ్రీకారం చుట్టింది. సదరన్ గ్రిడ్లో అమలు చేసేలా.. ఈ విధానానికి సంబంధించిన సమగ్ర వివరాలను అందించాలని బెంగళూరులోని సదరన్ రీజినల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఆర్ఎల్డీసీ), కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ సిస్టం ఆపరేషన్స్ కార్పొరేషన్ (పీవోఎస్వోసీవో)లు ఏపీ ట్రాన్స్కోను కోరాయి. దీన్ని మరో ఐదు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కలిపే సదరన్ గ్రిడ్లో అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. గత ఏడాది ఫిబ్రవరిలోనే ఏపీ ట్రాన్స్కో ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. సబ్ స్టేషన్ల జియో ట్యాగింగ్, సరఫరా లైన్లు, డిస్ట్రిబ్యూషన్ లైన్ల భౌతిక పరిస్థితి, ఏపీ ట్రాన్స్కో, డిస్కంలకు సంబంధించిన సరఫరా, పంపిణీ నెట్వర్క్ వెరసి ఏపీ గ్రిడ్ మొత్తాన్ని రియల్ టైం పద్ధతిలో పర్యవేక్షించవచ్చు. ఏపీ నెట్వర్క్ మొత్తాన్ని సదరన్ గ్రిడ్ మ్యాపింగ్ చేస్తుంది. దీనివల్ల రియల్ టైం పద్ధతిలో లైన్ల ఓవర్ లోడింగ్, అండర్ లోడింగ్తో పాటు వాతావరణం, లోడ్ షెడ్యూలింగ్ను ముందుగానే అంచనా వేయడం, ప్రకృతి విపత్తుల సమయంలో బాధిత ప్రాంతాలను పరిశీలించడం, రియల్ టైం పద్ధతిలో లైన్లను తనిఖీ చేయడం వంటి అనేక ఉపయోగాలు ఉంటాయి. -
ప్రాణ వాయువుకు ఫుల్‘పవర్’
సాక్షి, అమరావతి: కరోనా రోగులకు ప్రాణ వాయువు అందించే ఆక్సిజన్ తయారీ యూనిట్లకు నిరంతర విద్యుత్ ఇచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ స్పష్టం చేసింది. ఇందుకోసం తమ సిబ్బంది రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. ఆస్పత్రులు, ఆక్సిజన్ ప్లాంట్లు, ఇళ్లకు, మంచినీటి సరఫరా పథకాలకు విద్యుత్ సరఫరాపై ఆయన శుక్రవారం క్షేత్రస్థాయి అధికారులతో సమీక్ష జరిపారు. ఆ వివరాలను ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్రెడ్డి మీడియాకు వివరించారు. ఒక్కో ఆక్సిజన్ కేంద్రానికి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ను నోడల్ అధికారిగా నియమించారు. రాష్ట్రంలోని మూడు విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలో 22 ఆక్సిజన్ ప్లాంట్లు ఉన్నాయి. వాటికి 2,49,196 కేవీఏ(కిలో వోల్ట్ ఎంపియర్) మేర విద్యుత్ డిమాండ్ ఉంది. విద్యుత్ సిబ్బందికీ వ్యాక్సినేషన్ నిరంతర విద్యుత్ కోసం వేలాది మంది ఇంజినీర్లు, సిబ్బంది, ప్రత్యేకించి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సిబ్బంది అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. విద్యుత్ సరఫరా, ఇతర నిర్వహణ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు సీఎండీ నుంచి సీఈల వరకు పలువురు ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా జిల్లా, మండల కార్యాలయాలను సందర్శిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా రోజూ క్షేత్ర స్థాయిలో విద్యుత్ సరఫరాపై సమీక్షించుకోవాలని సిబ్బందికి సూచిస్తున్నారు. విద్యుత్ సిబ్బందికి దశల వారీగా ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు ట్రాన్స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ కె.శ్రీధర్రెడ్డి తెలిపారు. -
కావాల్సినంత 'కరెంట్'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ ఏడాది పొడవునా విద్యుత్కు ఢోకా ఉండదు. కోతల్లేని సరఫరా కోసం ఇప్పటికే విద్యుత్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి వరకు విద్యుత్ లభ్యత, డిమాండ్ అంచనాలను డిస్కంలు.. విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 68,368.43 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరముండగా.. 71,380.95 మిలియన్ యూనిట్లు లభిస్తుందని అంచనా వేశారు. ఈసారి మొత్తంగా 3,012.52 మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్ ఉండబోతోంది. అక్టోబర్, నవంబర్లలో మాత్రం డిమాండ్ కన్నా 392.81 మిలియన్ యూనిట్ల తక్కువ విద్యుత్ లభిస్తోంది. ఈ రెండు నెలల్లో పవన, సౌర విద్యుదుత్పత్తి తగ్గడమే ఇందుకు కారణంగా అధికారులు భావిస్తున్నారు. పక్కాగా లెక్క.. అంచనాల రూపకల్పనకు విద్యుత్ సంస్థలు సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాయి. గత ఐదేళ్ల డిమాండ్, లభ్యతను ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్వేర్కు అనుసంధానం చేశారు. దీని ఆధారంగా ఏ నెలలో.. ఏ ఉత్పత్తి సంస్థ ద్వారా ఎంత విద్యుత్ లభిస్తుంది? ఏ ప్రాంతంలో ఎంత మేర విద్యుత్ వాడకం ఉంటుందనే దానిపై శాస్త్రీయ కోణంలో అంచనాలు తయారు చేశారు. ఉచిత వ్యవసాయ విద్యుత్ విషయంలో మరింత పక్కాగా లెక్కలేశామని కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ పద్మా జనార్థన్రెడ్డి తెలిపారు. ఏ సామర్థ్యంతో వాడినా పంపుసెట్లకు నాణ్యమైన విద్యుత్ అందించే ఏర్పాట్లు చేశామని వివరించారు. విద్యుత్ లోటు ఉండే అక్టోబర్, నవంబర్ నెలల కోసం మార్కెట్లో విద్యుత్ కొనుగోలుకు ముందుస్తు వ్యూహాన్ని రూపొందిస్తున్నామని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడాది పొడవునా కోతల్లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పారు. -
వేసవిలో విద్యుత్ కొరత రాకూడదు
సాక్షి, అమరావతి: వేసవి దృష్ట్యా వచ్చే మూడు నాలుగు నెలల్లో విద్యుత్ కొరత లేకుండా చూసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. అవసరాలకు అనుగుణంగా ఎంత మేరకు విద్యుత్ కావాలో ఆ మేరకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వేసవి దృష్ట్యా విద్యుత్ ఉత్పత్తితో పాటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, పంపిణీ సంస్థల పనితీరుపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఇంధన శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రైతులకు ఉచితంగా, ఆక్వా రైతులకు సబ్సిడీపై.. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తున్న విద్యుత్పై సీఎం చర్చించారు. ఈ రంగాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిధులను సకాలంలో విడుదల చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రణాళిక రూపొందించుకోవాలని ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. కృష్ణపట్నం, విజయవాడలో నిర్మాణంలో ఉన్న థర్మల్ యూనిట్లను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ యూనిట్ల నిర్మాణం దీర్ఘకాలంపాటు కొనసాగితే.. అవి భారంగా తయారవుతాయన్నారు. సత్వరమే నిర్మాణాలు పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మేలు జరుగుతుందని పేర్కొన్నారు. జెన్ కో ఆధ్వర్యంలో నడుస్తున్న 15 యూనిట్లకు ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసుకోవాలని, బొగ్గు సరఫరాపై నిరంతరం సమీక్ష చేసి అవసరాలకు అనుగుణంగా సమకూర్చుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఇంధన శాఖ ఎక్స్ అఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీ జి సాయి ప్రసాద్, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్ శ్రీకాంత్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
విద్యుత్ రంగంపై డ్రాగన్ ఆగడాలకు చెక్
సాక్షి, అమరావతి: చైనా కేంద్రంగా విద్యుత్ నెట్వర్క్పై సైబర్ దాడికి అవకాశాలున్నాయని రాష్ట్ర విద్యుత్ సంస్థలను కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో రాష్ట్ర విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. ఈ వ్యవహారంపై ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి నేతృత్వంలో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్, ట్రాన్స్కో, నెట్వర్క్ విభాగాల ఉన్నతాధికారులు తాజా పరిస్థితిపై చర్చించారు. విద్యుత్ సరఫరాలో కీలక భూమిక పోషిస్తున్న ఏపీ ట్రాన్స్కోకు చెందిన 400 కేవీ సబ్ స్టేషన్లలో సాంకేతిక అంశాలపై నిశితంగా దృష్టి పెట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. గత ఏడాది ముంబై విద్యుత్ సంస్థలపై చైనా ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న హ్యాకింగ్ గ్రూప్లు సైబర్ అటాక్ చేశాయని, దీనివల్ల కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడిందని అమెరికాకు చెందిన ఓ సంస్థ అధ్యయనంలో వెల్లడించింది. కేంద్రానికి చెందిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీజీసీఎల్)తో విద్యుత్ సరఫరా వ్యవస్థ అనుసంధానమై ఉండటం వల్ల ఏపీలోనూ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థతి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. ఏ తరహా దాడి జరగొచ్చు! రాష్ట్రంలో 400 కేవీ సబ్ స్టేషన్లు, లోడ్ డిస్పాచ్ సెంటర్ పూర్తిగా ఇంటర్నెట్తో అనుసంధానమై ఉన్నాయి. వీటిలో వాడే ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలన్నీ ఎక్కువగా చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నారు. ఇందులో వాడే సాఫ్ట్వేర్ మొత్తం తయారీ సంస్థలకు తెలిసే వీలుంది. 400 కేవీ సబ్ స్టేషన్ను చైనా హ్యాకర్లు కమాండ్ ద్వారా నియంత్రించి విద్యుత్ సరఫరాను అడ్డుకునే వీలుంది. ఇదే జరిగితే పారిశ్రామిక, రైల్వే, వాణిజ్య వ్యవస్థలతో పాటు అత్యంత కీలకమైన వైద్య రంగానికి విద్యుత్ నిలిచిపోతుంది. సమాచార వ్యవస్థ కుప్పకూలి, గ్రిడ్ ఇబ్బందుల్లో పడుతుంది. దీనివల్ల పెద్దఎత్తున ఆర్ధిక నష్టం కలగడమే కాకుండా, గందరగోళానికి ఆస్కారం ఉంటుంది. కౌంటర్ అటాక్ సబ్ స్టేషన్లలో మాడ్యూల్స్ను నడిపించే సాఫ్ట్వేర్ భాష ఆయా ఉపకరణాల బ్లాక్ బాక్స్లో నిక్షిప్తమై ఉంటుంది. ఇది ఆంగ్లంలో ఉంటే తెలుసుకునే వీలుంటుంది. కానీ చైనా నుంచి దిగుమతి అయ్యే వాటిల్లో చైనా లిపినే వాడుతున్నారు. దీన్ని పూర్తిగా డీకోడ్ చేయడం సాధ్యం కావడం లేదని శ్రీకాంత్ నాగులాపల్లి చెబుతున్నారు. చైనా సాఫ్ట్వేర్ను వీలైనంత వరకూ డీకోడ్ చేయాలని అధికారులు ఆదేశించారు. మరీ కష్టంగా ఉన్న సబ్ స్టేషన్లలో ప్రత్యామ్నాయ సమాచార వ్యవస్థపై ఆధారపడాలని సూచించారు. కేంద్ర మార్గదర్శకాల నేపథ్యంలో గడచిన కొన్ని నెలలుగా చైనా నుంచి దిగుమతి అయ్యే ప్రతీ ఉపకరణాన్ని కేంద్ర సంస్థలు పరిశీలిస్తున్నాయి. అంతకు ముందు దిగుమతి చేసుకున్న ఉపకరణాలను నిశితంగా తనిఖీ చేసేందుకు ట్రాన్స్కో ఐటీ విభాగంతో ప్రత్యేక బృందాలను సిద్ధం చేశామని ట్రాన్స్ సీఎండీ శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. ఎస్ఎల్డీసీలోనూ ఐటీ పరంగా పటిష్టమైన తనిఖీ చేస్తున్నామని లోడ్ డిస్పాచ్ సెంటర్ ఇంజనీర్ భాస్కర్ తెలిపారు. సైబర్ నేరాలను ముందే పసిగట్టే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తున్నామని అధికార వర్గాలు తెలిపాయి. -
సెంట్రల్ డిస్కం వెబ్సైట్, యాప్ ప్రారంభం
ఒంగోలు: సెంట్రల్ డిస్కం నూతనంగా అభివృద్ధి చేసిన శాప్ అండ్ ఐటీ అప్లికేషన్, వెబ్సైట్ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. బుధవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో బాలినేని మాట్లాడుతూ.. సెంట్రల్ డిస్కం అధునాతన సాంకేతిక విలువలతో వినియోగదారులకు సత్వర సేవలందించే దిశగా ముందుకెళ్లడం అభినందనీయమన్నారు. 2019 డిసెంబర్లో సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజలకు, వినియోగదారులకు మరింత మేలు జరిగేలా ఏపీఎస్పీడీసీఎల్ను విభజించి ఏపీసీపీడీసీఎల్ను ఏర్పాటు చేశామన్నారు. డిసెంబర్ 28 నుంచి కొత్తగా ఏర్పడ్డ సెంట్రల్ డిస్కం సొంతంగా కార్యకలాపాలు ప్రారంభించిందన్నారు. నేడు ప్రారంభించిన అప్లికేషన్ ద్వారా సెంట్రల్ డిస్కంలోని ఉద్యోగుల దైనందిన కార్యకలాపాలను పారదర్శకతతో చేయడానికి వీలవుతుందన్నారు. అత్యుత్తమ, నాణ్యమైన, కచి్చతమైన సమాచారం ఉంటుందని, ఏ సమయంలో అయినా అందుబాటులో ఉండటం వల్ల ఉద్యోగులకు, వినియోగదారులకు సౌకర్యంగా ఉంటుందన్నారు. -
చైనా టెక్నాలజీకి చెక్
సాక్షి,అమరావతి: విద్యుత్ శాఖలో ఉన్న చైనా సాంకేతికతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కేంద్రం మార్గదర్శకాలివ్వడంతో రాష్ట్ర ఇంధన శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నెట్వర్క్తో అనుసంధానమైన ప్రతి విభాగాన్ని తనిఖీ చేయాలని నిర్ణయించినట్టు ట్రాన్స్కో అధికారులు తెలిపారు. రాష్ట్ర ఇంధన సాంకేతిక విభాగం ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తుందని ట్రాన్స్కో జేఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు చెప్పారు. కొత్తగా దిగుమతి చేసుకునే విద్యుత్ మాడ్యుల్స్ వివరాలను కేంద్రానికి తెలపడమే కాకుండా, ఇప్పటికే సబ్ స్టేషన్లలో వాడుతున్న టెక్నాలజీని జల్లెడ పట్టడానికి రాష్ట్ర సాంకేతిక సర్వీస్ విభాగం (ఏపీటీఎస్) సహకారం తీసుకుంటున్నామని తెలిపారు. అనుమానాలేంటి? ఏపీ విద్యుత్ సంస్థల్లో కొన్ని చోట్ల చైనా ప్యానల్స్ వాడుతున్నారు. ఇవి ఇంటర్నెట్ ఆధారంగా పనిచేస్తాయి. చైనా వీటిని నియంత్రించే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. అదే జరిగితే.. ► ఫైర్వాల్స్ను నెట్టేసుకుని అసంబద్ధ సంకేతాలు వచ్చే వీలుంది. ► రాష్ట్రంలో డిమాండ్ ఎంత? ఉత్పత్తి ఎంత? ఏ సమయంలో ఎలా వ్యవహరించాలి? అనేది రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) చూస్తుంది. తప్పుడు సంకేతాలు వెళ్తే గ్రిడ్ నియంత్రణ ఒక్కసారిగా దారి తప్పి విద్యుత్ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని అధికారులు అంటున్నారు. ► విద్యుత్ పాలన వ్యవస్థ మొత్తం డిజిటల్ చేశారు. హ్యాక్ చేసే పరిస్థితే వస్తే డేటా మొత్తం ఇతరుల చేతుల్లోకి వెళ్తుంది. కాబట్టి ప్రతి విభాగాన్ని ఆడిటింగ్ చేయాల్సిన అవసరం ఉందని టెక్నికల్ విభాగం స్పష్టం చేసింది. ► విద్యుత్ వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని హైదరాబాద్లోని క్లౌడ్ (సమాచార నిధిని భద్రతపర్చే డిజిటల్ కేంద్రం)లో నిక్షిప్తం చేశారు. ఎప్పుడైనా దీన్ని నెట్ ద్వారా వినియోగించుకునే వీలుంది. ప్రస్తుత పరిస్థితుల్లో దీని భద్రతను పరిశీలించనున్నారు. ► విద్యుత్ గ్రిడ్, సబ్ స్టేషన్లను ఆటోమేషన్ చేశారు. విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతోనే రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తున్నారు. సిబ్బందితో నిమిత్తం లేకుండానే వీటి ద్వారా క్షేత్రస్థాయి సమాచారం తెలుసుకునే వీలుంది. కాబట్టి వీటి సెక్యూరిటీని పెంచాలని నిర్ణయించారు. ఇక నుంచి.. ► కొత్తగా విదేశాలు, ప్రత్యేకంగా చైనా నుంచి దిగుమతి అయ్యే విద్యుత్ ఉపకరణాలు, మాడ్యుల్స్, టెక్నాలజీని నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ పరిశీలిస్తుంది. నష్టం కలిగించే మాల్వేర్ లేదని నిర్ధారించుకున్నాకే అనుమతిస్తుంది. ► రాష్ట్ర స్థాయిలో ఏపీటీఎస్ సాంకేతిక ఆడిటింగ్ నిర్వహిస్తుంది. విద్యుత్ వ్యవస్థలో వాడే ప్రతి టెక్నాలజీలో హానికర సాఫ్ట్వేర్లు, వైరస్లను గుర్తించి వాటిని తొలగించే ప్రయత్నం చేస్తుంది. క్షుణ్నంగా పరిశీలిస్తున్నాం కేంద్ర సమాచారం మేరకు రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ సాంకేతికతను పటిష్టం చేస్తున్నాం. చైనా టెక్నాలజీని వాడుతున్న సబ్ స్టేషన్లను గుర్తించి క్షుణ్నంగా పరిశీలిస్తున్నాం. –కేవీఎన్ చక్రధర్ బాబు, జేఎండీ ట్రాన్స్కో ప్రత్యేక శిక్షణ పొందాం విద్యుత్ రంగం టెక్నాలజీతోనే నడుస్తోండటంతో సైబర్ దాడులకు అవకాశం ఉంది. వీటిని గుర్తించి, తిప్పికొట్టేందుకు ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాం. – సి.కామేశ్వర దేవ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ -
‘కోత’లకు కత్తెర
సాక్షి, అమరావతి: విద్యుత్ అంతరాయాల నియంత్రణలో రాష్ట్రం పురోగతి సాధించింది. కచ్చితమైన ప్రణాళికతో ఏడాది కాలంలోనే అంతరాయాలను 37 శాతం తగ్గించగలిగింది. అధికారంలోకొచ్చిన తొలి రోజుల్లోనే విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష జరిపారు. అప్పటి వరకూ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్ కోతలుండేవి. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చాలని అధికారులకు సీఎం సూచించారు. ఆ మేరకు ఇంధన శాఖ ముందుకెళ్లి ఈ ఘనత సాధించింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి బుధవారం విడుదల చేశారు. ► ట్రాన్స్కో 400, 200, 132 కేవీ సబ్స్టేషన్లు నిర్మించింది. ఇందుకోసం రూ.382.18 కోట్లు ఖర్చు చేశారు. రూ.85.40 కోట్లతో 389.75 కి.మీ మేర కొత్తగా ట్రాన్స్కో లైన్లు వేశారు. ► ఏపీ డిస్కమ్ల పరిధిలో ఏడాదిలో 77 నూతన సబ్ స్టేషన్లు నిర్మించారు. 19,502.57 కి.మీ మేర కొత్త లైన్లు వేశారు. దీనికి రూ.524.11 కోట్లు వెచ్చించారు. ► ఫలితంగా విద్యుత్ పంపిణీ, సరఫరా వ్యవస్థ మరింత బలోపేతమైంది. అధిక లోడును తట్టుకునే శక్తి విద్యుత్ శాఖకు వచ్చింది. ఈ కారణంగా విద్యుత్ అంతరాయాలు గణనీయంగా తగ్గాయి. ► నాణ్యమైన విద్యుత్ సరఫరాలో రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) కీలకపాత్ర పోషిస్తోంది. ఈ విభాగంలోనూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారు. విద్యుత్ డిమాండ్ను ముందే గుర్తించి, అందుకు తగ్గట్టుగా ఉత్పత్తి కేంద్రాలకు, పంపిణీ సంస్థలకు సరైన సమయంలో ఆదేశాలిస్తున్నారు. దీనివల్ల గ్రిడ్పై లోడ్ను అదుపులో ఉంచడం సాధ్యమవుతోంది. మౌలిక సదుపాయాలను మెరుగు పర్చడం వల్ల ట్రాన్స్కో, డిస్కమ్ల నష్టాలు తగ్గాయి. 2018–19తో పోలిస్తే ట్రాన్స్కో నష్టాలు 2019–20లో 2.91 శాతానికి తగ్గాయి. డిస్కమ్ల నష్టాలు 6.21 శాతానికి తగ్గాయి. -
సెప్టెంబర్ 8న కూడా సచివాలయాల పరీక్ష
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు శుభవార్త. అర్హతలు ఉన్నవారు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు పోటీ పడేందుకు వీలుగా కొన్ని పోస్టులకు సెప్టెంబర్ 8న రాత పరీక్ష నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ నియామకాల ప్రక్రియలో విద్యుత్ శాఖ భర్తీ చేసే లైన్మెన్ ఉద్యోగాలతో కలిపి మొత్తం 20 రకాల ఉద్యోగాలన్నింటికీ సెప్టెంబర్ 1న రాతపరీక్ష నిర్వహించాలని మొదట ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఒకే అభ్యర్థి రెండు రకాల పోస్టుల పరీక్షలకు హాజరయ్యేలా సెప్టెంబర్ 1న ఉదయం, సాయంత్రం పరీక్షలు పెట్టడానికి నిర్ణయించింది. అయితే, ఇలా కూడా కొందరు అర్హతలు ఉండి కొన్ని పోస్టులకు పరీక్ష రాయడానికి అవకాశం కోల్పోతున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో కొన్ని పోస్టులకు సెప్టెంబర్ 8న ఉదయం, సాయంత్రం పరీక్ష నిర్వహించనున్నామని పురపాలక పరిపాలన శాఖ కమిషనర్ జీఎస్ఆర్కేఆర్ విజయ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రాతపరీక్ష తెలుగు, ఇంగ్లిష్లో ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడటంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఉద్యోగాన్ని సాధించాలన్న కసితో ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటున్నారు. మార్కెట్లోకి వెల్లువలా వచ్చిపడిన పుస్తకాలను కొనుగోలు చేసేందుకు వస్తున్న అభ్యర్థులతో బుక్స్టాళ్లు రద్దీగా మారిపోయాయి. విజయవాడ లెనిన్ సెంటర్లోని పుస్తకాల షాపులు యువతీయువకులతో నిత్యం కిటకిటలాడుతున్నాయి.. – సాక్షి, విజయవాడ పంచాయతీరాజ్ కమిషనర్తో నేడు సాక్షి టీవీ లైవ్ షో రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో నిరుద్యోగ యువత కోసం శనివారం ‘సాక్షి’ టీవీ ప్రత్యేక లైవ్ షో కార్యక్రమం నిర్వహించనుంది. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్తో ‘సాక్షి’ టీవీ శనివారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించే లైవ్ షో ద్వారా అభ్యర్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఫోన్ చేయాల్సిన నంబర్లు: 040–23310680, 23310726. కేటగిరీ–1 1. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–5 2. మహిళా పోలీస్, మహిళా శిశు సంక్షేమ అసిస్టెంట్(లేదా) వార్డు మహిళా ప్రొటెక్షన్ సెక్రటరీ 3. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ 4. వార్డు అడ్మిన్స్ట్రేటివ్ సెక్రటరీ రాతపరీక్ష: సెప్టెంబర్ 1 ఉదయం కేటగిరీ– 2 (గ్రూప్–ఏ) 1. ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్–2 2. వార్డు ఎమినిటీస్ సెక్రటరీ గ్రేడ్–2 కేటగిరీ–2 (గ్రూప్–బి) 1. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గ్రేడ్–2 2. విలేజ్ సర్వేయర్ గ్రేడ్–3 రాతపరీక్ష: సెప్టెంబర్ 1 సాయంత్రం కేటగిరీ–3 1. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (గ్రేడ్–2) 2. విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ 3. విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ 4. డిజిటల్ అసిస్టెంట్ (పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–6) 5. పశుసంవర్ధక శాఖ సహాయకుడు 6. ఏఎన్ఎం లేదా వార్డు హెల్త్ సెక్రటరీ (గ్రేడ్–3) 7. విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ రాతపరీక్ష: సెప్టెంబర్ 1 సాయంత్రం 8. వార్డు శానిటేషన్, ఎన్విరాన్మెంట్ సెక్రటరీ (గ్రేడ్–2) 9. వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్–2) 10. వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ రాత పరీక్ష: సెప్టెంబర్ 8 ఉదయం 11. వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ పరీక్ష: సెప్టెంబర్ 8 సాయంత్రం -
రైతన్న కోసం ఎంతైనా ఖర్చు
సాక్షి, అమరావతి: చౌకగా నాణ్యమైన విద్యుత్ను ప్రజలకు అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు. ఖరీదైన విద్యుత్ కొనుగోళ్లకు స్వస్తి చెప్పి, విద్యుత్ రంగాన్ని ఐదేళ్లుగా పట్టి పీడిస్తున్న జాడ్యాన్ని వదిలించాలని అధికారులకు పిలుపునిచ్చారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఆదివారం సచివాలయం నుంచి టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ వివరాలను ఇంధన పొదుపు సంస్థ అధికారి చంద్రశేఖర్రెడ్డి మీడియాకు విడుదల చేశారు. రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉందని మంత్రి బాలినేని చెప్పారు. తొమ్మిది గంటల పగటి విద్యుత్ సరఫరాను శాశ్వతం చేస్తామన్నారు. ఇందు కోసం రూ. 2,780 కోట్లు (రూ. 1,700 కోట్లు అదనపు మౌలిక సదుపాయాలకు, రూ. 1,080 కోట్లు అదనంగా 2 గంటలు సరఫరా చేసేందుకు) ఖర్చు చేయనున్నట్లు వివరించారు. దీనివల్ల సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగానికి కొత్త ఊపునిస్తుందనేది ముఖ్యమంత్రి ప్రగాఢ విశ్వాసమని తెలిపారు. ఉచిత విద్యుత్ను సమర్థంగా అమలు చేసేందుకుగాను 18 లక్షల మంది రైతుల అభిప్రాయాలను సేకరించనున్నట్లు చెప్పారు. విద్యుత్ శాఖలో లొసుగులు లేకుండా కఠినంగా వ్యవహరించాలని, పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావాలని మంత్రి ఆదేశించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఎంతమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండును తీర్చే స్థాయిలో ఏపీ జెన్కో సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. జెన్కోను బలోపేతం చేద్దాం: ఇంధన శాఖ కార్యదర్శి ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ జెన్కోను బలోపేతం చేసే దిశగా ఉద్యోగులు శ్రమించాలని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి సిబ్బందిని కోరారు. సరఫరా, పంపిణీ నష్టాలను తగ్గించడం, విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, ప్రజా భాగస్వామ్యాన్ని పెంచడం, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉదయ్, డీడీయూజీజేవై, ఐపీడీఎస్ వంటి వాటిని గరిష్టంగా వినియోగించుకోవడంపై నిర్దేశిత గడువుతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ముఖ్యమంత్రికి సమర్పించనున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,995 మెగావాట్ల డిమాండ్ ఉందని, 2023–24 కల్లా ఇది 15,015 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ తలసరి విద్యుత్ వినియోగం 1,147 కిలోవాట్లుగా ఉందని, జాతీయ స్థాయిలో ఇది 1,149 కిలోవాట్లని తెలిపారు. విద్యుత్ డిమాండ్ ఏ స్థాయిలో ఉన్నప్పటికీ దాన్ని చేరుకునే దిశగా ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని, చౌక విద్యుత్ కొనుగోలుకే ప్రాధాన్యం ఇవ్వాలని శ్రీకాంత్ సూచించారు. గడువులోగా జెన్కో పవర్ ప్రాజెక్టులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టినట్లు ఏపీ జెన్కో ఎండీ బి.శ్రీధర్ పేర్కొన్నారు. ఎన్టీటీపీఎస్ ఐదో దశ (800 మెగావాట్లు), కృష్ణపట్నం (800 మెగావాట్లు) థర్మల్ ప్రాజెక్టులను ఆర్నెల్లలో పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. -
ఆర్టిజన్లకు ఆనందం
ఆదిలాబాద్టౌన్: విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న (ఆర్జిజన్లకు) తీపికబురు అందింది. ఆర్టీజన్ల క్రమబద్దీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతేడాది ప్రభుత్వం విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను విద్యుత్ శాఖలో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. అయితే కొంతమంది నిరుద్యోగులు ఈ విషయమై హైకోర్టులో కేసు వేయడంతో స్టే విధించింది. ఏడాదిగా తీర్పు కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు మంగళవారం ఊరట లభించింది. ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 200 మంది ఉద్యోగులకు మేలు జరగనుంది. ఎస్ఈ కార్యాలయంలో, సబ్స్టేషన్లో, డీఈ కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్లు, వాచ్మెన్లు, సబ్స్టేషన్ ఆపరేటర్లు రెగ్యులరైజ్ కానున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 815 మందికి లబ్ది చేకూరనుంది. కరెంటోళ్ల జీవితాల్లో వెలుగు.. విద్యుత్ శాఖలో కొన్నేళ్లుగా చాలీచాలని వేతనాలతో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే ప్రభుత్వం 2017 జూలై 29న వీరిని రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరుసటి రోజు కొంతమంది నిరుద్యోగులు ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో కేసు వేయడంతో అప్పటినుంచి ప్రక్రియ నిలిచిపోయింది. ఈ ఉద్యోగుల్లో స్కీల్డ్ పర్సన్లకు రూ.15వేల వరకు, సెమిస్కిల్డ్ పర్సన్లు రూ.13వేల వరకు, అన్స్కిల్డ్ పర్సన్లు రూ.12వేల వరకు వేతనాలు పొందేవారు. ప్రభుత్వ నిర్ణయంతో తమకు వేతనాలు పెరుగుతాయని, రెగ్యులరైజ్ అయ్యామని సంబరాలు జరుపుకున్న వారికి అప్పట్లో ఒక్కరోజు కూడా సంతోషం నిలవలేదు. దీంతో ప్రభుత్వం ఆర్టిజన్–2 స్థాయి వారికి రూ.25,042, ఆర్టిజన్–3 స్థాయి వారికి రూ.21,719, ఆర్టిజన్–4 స్థాయి వారికి రూ.19,548 వేతనం ప్రస్తుతం చెల్లిస్తున్నారు. హైకోర్టు పిటిషన్ను కొట్టివేయడంతో వీరికి పేస్కేల్, పీఆర్సీ వర్తించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో.. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 136 విద్యుత్ సబ్స్టేషన్లు, ఏఈ, డీఈ, ఎస్ఈ కార్యాలయాల్లో 815 మంది వరకు కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్లు, వాచ్మెన్లు, సబ్ష్టేషన్ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. ఎస్ఈ, డీఈ, ఎలక్ట్రిసిటీ రెవెన్యూ కార్యాలయాల్లో 88 మంది, సబ్స్టేషన్లో 727 మంది పనిచేస్తున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కాగజ్నగర్, భైంసాలో కార్యాలయాలు ఉన్నాయి. ఆయా మండల కేంద్రాలు, గ్రామాల్లో సబ్స్టేషన్లు ఉన్నాయి. 2017 డిసెంబర్ 4వరకు ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేసిన వారిని ప్రభుత్వం విద్యుత్ శాఖలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది. వీరందరు 1994 నుంచి పనిచేస్తున్న వారు ఉన్నారు. అప్పట్లో కేవలం రూ.320 వేతనంతో పనిచేయగా, ప్రస్తుతం రూ.19వేల నుంచి రూ.25వేల వరకు వేతనం పొందుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో వేతనాలు కూడా మరింతగా పెరగనున్నాయి. ఏళ్ల నుంచి ఎదురుచూశాం.. విద్యుత్ శాఖలో గత కొన్నేళ్లుగా కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. మొదట్లో తక్కువ వేతనంతో పనిచేశారు. ప్రస్తుతం రూ.15వేల వరకు వేతనం వస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ వేతనాలు ఎటూ సరిపోవడంలేదు. ప్రభుత్వం గతేడాది రెగ్యులరైజ్ చేస్తూ నిర్ణయం తీసుకోగా కొంతమంది కోర్టును ఆశ్రయించడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా హైకోర్టు ఆ స్టేను కొట్టివేయడంతో ఉద్యోగులకు ఊరట లభించింది. – గణేష్, కంప్యూటర్ ఆపరేటర్, ఆదిలాబాద్ పర్మినెంట్ అయితదనే పనిచేశాం.. తక్కువ వేతనంతో విద్యుత్ శాఖలో చేరాను. చాలీచాలని వేతనాలతోనే కాలం వెళ్లదీస్తూ వచ్చాం. ప్రభుత్వం ఎప్పటికైనా రెగ్యులర్ చేస్తుందనే ఆశతోనే పనిచేస్తూ వచ్చారు. అప్పట్లో సమయానికి వేతనాలు కూడా వచ్చేవి కావు. అయినప్పటికీ కుటుంబాలను నెట్టుకొచ్చాం. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో మా సమస్యలు తీరనున్నాయి. – నిశికాంత్, ఉద్యోగి -
అసెంబ్లీ తర్వాతే ‘విద్యుత్ చార్జీ’
టారిఫ్ ప్రతిపాదనల సమర్పణకు నేటితో గడువు ముగింపు మూడోసారి పొడిగింపు కోరనున్న డిస్కంలు 7.5 శాతం చార్జీల పెంపునకు సూత్రప్రాయ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపునకు సంబంధించి కొత్త టారీఫ్ను ప్రతిపాదించేందుకు మూడోసారి గడువు పొడిగించాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)ని కోరాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు నిర్ణయించాయి. ఈ నెల 17 నుంచి 19 వరకు జరగనున్న అసెంబ్లీ సమావేశాలు ముగిశాకే కొత్త టారీఫ్ ప్రతిపాదనలను ఈఆర్సీకి సమర్పిస్తామని విద్యుత్ శాఖ వర్గాలు తెలిపాయి. విద్యుత్ చట్టం ప్రకారం డిస్కంలు తమ వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)తో కొత్త టారీఫ్ను గత నవంబర్ చివరిలోపే ఈఆర్సీకి సమర్పించాల్సి ఉండగా, అప్పట్లో డిసెంబర్ నెలాఖరులోగా గడువు పొడిగింపు కోరాయి. ఆ తర్వాత కూడా గడువు పొడిగించాలని కోరగా, జనవరి 16 వరకు ఈఆర్సీ గడువు పెంచింది. సోమవారంతో ఈ గడువు ముగుస్తున్నా అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా చార్జీల పెంపు ప్రతిపాదనలను మళ్లీ వాయిదా వేసుకోవాలని డిస్కంలు భావిస్తున్నాయి. జనవరి 31 వరకు ఈ గడువు పొడిగింపు కోరే అవకాశాలున్నాయి. దాదాపు రూ.2 వేల కోట్ల పెంపు.. రాష్ట్రంలో గృహాలు, పరిశ్రమలు, వాణిజ్య, తదితర కేటగిరీల వినియోగదారులపై సగటున 7.5 శాతం విద్యుత్ చార్జీలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకుంది. ఈ లెక్కన దాదాపు రూ.1500 కోట్ల నుంచి రూ.2000 కోట్ల వరకు చార్జీల భారం పడనుంది. ఉజ్వల్ డిస్కం అష్యూరెన్స్ యోజన (ఉదయ్) పథకానికి సంబంధించి ఈ నెల 4న కేంద్ర విద్యుత్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంల మధ్య కుదిరిన ఒప్పందంలో కూడా విద్యుత్ చార్జీల పెంపుపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా వాస్తవ వ్యయం, వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్ఆర్) మధ్య అంతరాన్ని 2019–20లోగా పూర్తిగా నిర్మూలించాలని, ఇందుకు ఏటా విద్యుత్ చార్జీలు, రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ సబ్సిడీలను పెంచాలని ఈ ఒప్పందంలో ప్రత్యేక నిబంధనను కేంద్రం చేర్చింది. ఈ మేరకు 2017లో 7.5 శాతం, 2018లో 8 శాతం, 2019లో 6 శాతం విద్యుత్ చార్జీలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉదయ్ ఒప్పందంలో అంగీకరించింది. -
ప్రకృతి సాగే రైతుకు అండ
‘సాగుబడి’ పుస్తకావిష్కరణలో జగదీశ్రెడ్డి హైదరాబాద్: ప్రతి రైతు రసాయన ఎరువులకు దూరంగా ఉండి ప్రకృతి సాగుబడి చేస్తేనే దేశం సుభిక్షంగా ఉంటుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సాక్షి దినపత్రిక సాగుబడి డెస్క్ ఇన్చార్జి పంతంగి రాంబాబు రాసిన ‘సాగుబడి’ పుస్తకాన్ని ఆదివారం హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న నేషనల్ బుక్ ఫెయిర్లో ఆవిష్కరించారు. కార్యక్రమానికి మంత్రి జగదీశ్రెడ్డి, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రసాయనిక ఎరువులొచ్చి పల్లెల్లో ఊర పిచ్చుకలను చంపేశాయని, అలా పల్లెల్లో సాగు దెబ్బ తిన్నదని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. ప్రపంచీకరణ ఫలితంగా మన దేశంలో ప్రకృతి నుంచి దూరమైన వ్యవసాయాన్ని తిరిగి ప్రకృతి ఒడిలోకి చేర్చేందుకు తెలుగులోకి వచ్చిన పుస్తకంగా ‘సాగుబడి’ని కొనియాడారు. ప్రకృతి సాగుకు ప్రభుత్వ సహకారం ఉంటుందని చెప్పారు. రైతులు సేంద్రియ ఎరువులతో సాగు చేస్తే అప్పుల బాధతో ఏ రైతూ ఆత్మహత్యకు పాల్పడాల్సిన అవసరముండదని ‘సాక్షి’ ఈడీ రామచంద్రమూర్తి అన్నారు. ప్రభుత్వం ప్రకృతి సాగును ప్రోత్సహించి ఒక ఉద్యమంలా చైతన్యపరిస్తేనే సత్ఫలితాలుంటాయని చెప్పారు. కార్యక్రమంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరిశంకర్, నాబార్డ్ మాజీ సీజీఎం మోహనయ్య, బుక్ ఫెయిర్ కార్యదర్శి చంద్రమోహన్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. -
ఖజానాకు ‘పెద్ద నోట్ల’ కళ
- డిస్కంకు రూ.202 కోట్లు... జలమండలికి రూ.30 కోట్లు - జీహెచ్ఎంసీకి రూ.157 కోట్ల ఆదాయం - రద్దు నోట్లతో చెల్లింపునకు 24 వరకు గడువు పొడిగింపు సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో సర్కారు ఖజానా గలగల లాడుతోంది. రద్దరుున రూ.500, రూ.1,000 నోట్లతో ప్రభుత్వ విభాగాల బిల్లులు, బకారుులు చెల్లించవచ్చన్న వెసులుబాటుతో కోట్లకు కోట్లు వచ్చిపడుతున్నారుు. జీహెచ్ఎంసీ తదితర విభాగాలకు మొత్తం నాలుగు రోజుల్లో సుమారు రూ.389 కోట్ల వరకు ఆదాయం సమకూరింది. ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తున్న నేపథ్యంలో రద్దరుు న నోట్లతో వివిధ పన్నులు, చార్జీలు, జరిమానాలు చెల్లిం పు గడు వును ప్రభుత్వం ఈ నెల 24 వరకు పొడిగిం చింది. గ్రేటర్ హైదరాబా ద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కి రికార్డు స్థారుులో ఆదాయం సమకూరుతుండగా, డిస్కం, జలమండలిలకు భారీగా బకారుు వసూలవుతున్నారుు. ట్రాఫిక్ ఈ-చలాన్ కూడా పెద్దఎత్తున చెల్లింపులు జరుగుతున్నారుు. జీహెచ్ఎంసీకి రికార్డు ఆదాయం... జీహెచ్ఎంసీకి గత నాలుగు రోజుల్లో ఆస్తి పన్ను, ఎల్ఆర్ఎస్ ఫీజుల రూ పంలో రికార్డు స్థారుు లో దాదాపు రూ.157 కోట్లు వసూల య్యారుు. సోమవారం ఒక్కరోజే రూ.55 కోట్లు రాగా, అందులో ఆస్తి పన్ను కింద రూ.19 కోట్లు, లేఅవుట్ల క్రమ బద్ధీకరణ కింద రూ.36 కోట్ల వరకు పన్ను వసూ లైంది. కొందరు ముందస్తు ఆస్తి పన్ను, ఎల్ఆర్ఎస్ కూడా చెల్లిస్తుండటం విశేషం. పెరిగిన బకారుుల చెల్లింపులు: పెద్ద నోట్ల రద్దుతో జలమండలికి బకారుులు పెద్ద ఎత్తున వసూలవుతున్నారుు. 4 రోజుల్లో రూ.30 కోట్ల వర కు ఆదాయం సమకూరింది. సోమవారం రూ.4.44 కోట్లు చార్జీల రూపేణా చెల్లింపులు జరిగారుు. భారీగా వసూలైన విద్యుత్ చార్జీలు విద్యుత్ శాఖకు కూడా భారీగా ఆదాయం సమకూరుతోంది. గత నాలుగు రోజుల్లో సుమారు రూ.202 కోట్లు వసూలయ్యారుు. సెలవు దినమైనప్పటికీ విద్యుత్ శాఖ కౌంటర్లు పనిచేయడంతో సుమారు రూ.20 కోట్ల వరకు చార్జీలు వసూలయ్యారుు. కొందరు విని యోగదారులు ముందస్తు చార్జీలు కూడా చెల్లిస్తున్నారు. ట్రాఫిక్ ఈ-చలాన్ చెల్లింపులు ఇక ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ ఈ-చలాన్లను కూడా వాహనదారులు రద్దరుున నోట్లతో క్లియర్ చేసుకొంటున్నారు. మీ-సేవ, ఈ-సేవా కేంద్రాల ద్వారా పెద్దఎత్తున చెల్లింపులు జరిపారు. సోమవారం సుమారు రూ.13 లక్షలకు పైగా పోలీసు యంత్రాంగానికి ఆదాయం సమకూరింది. -
విద్యుత్శాఖలో అవినీతిని ఉపేక్షించం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ అధికారులు, సిబ్బంది అవినీతి, నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదని విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి హెచ్చరించారు. వ్యవసాయ కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్ల మంజూరులో పారదర్శకంగా ఉండాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలపై ఫిర్యాదులొచ్చిన వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ ఉద్యోగుల పనితీరుపై ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్, సబ్ స్టేషన్ల నిర్మాణం, వ్యవసాయ కనెక్షన్ల మం జూరు తదితర అంశాలపై సోమవారం టీఎస్ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ట్రాన్స్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ సంస్థల సీఎండీలు డి.ప్రభాకర్రావు, జి.రఘుమారెడ్డి, కె.వెంకటనారాయణతో మంత్రి సమీక్ష నిర్వహించారు. లైన్మెన్లు, సబ్ ఇంజనీర్లు, డీఈలు, ఏఈలు, ఏడీఈలు, ఎస్ఈలు, ఇతర అధికారులందరూ పనిచేసే చోటే నివాసముంటూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా సమీక్షిస్తుండాలని ఆదేశించారు. ఎస్ఈలు సైతం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సిబ్బంది పనితీరుపై నిఘా పెట్టాలని సూచించారు. ఖరీఫ్లో రైతులకు పగటి పూట 9 గంటల విద్యుత్ సరఫరాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. 33 కేవీ లైన్ల నిర్మాణం, అదనపు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, పవర్ ట్రాన్స్ఫార్మర్ల పెంపు పనులను సకాలంలో పూర్తి చేయాలని కోరారు. వ్యవసాయ పనులు ముమ్మరం అయ్యాక 9 గంటల విద్యుత్కు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని, ఆ మేరకు సరఫరా, పంపిణీ వ్యవస్థలను సిద్ధం చేయాలన్నారు. సబ్ స్టేషన్ల నిర్మాణంలో జాప్యాన్ని నివారించడానికి మరింత మంది కాంట్రాక్టర్లను ప్రోత్సహించాలని మంత్రి సూచించారు. పనుల నాణ్యతలో రాజీపడొద్దని స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న వ్యవసాయ కనెక్షన్లపై నెల రోజుల్లో నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం సిబ్బంది రైతుల వద్దకు వెళ్లాలని మంత్రి సూచించారు. -
దొంగల చేతిలో ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం
గోరంట్ల : మండల పరిధిలోని కదిరి- హిందూపురం ప్రధాన రహదారి లోని చింతమానుపల్లి సమీపంలో వ్యవసాయ బోర్లకు ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ను గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి ధ్వంసం చేసి , రాగి వైరును చోరీ చేశారు. 25కెవీ ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేయడంతో అందులో ఉన్న సుమారు 60 లీటర్ల మేర ఆయిల్ కింద పారబోసి, ట్రాన్స్ఫార్మర్లో అమర్చిన 55కిలోల రాగి తీగలను తీసుకె ళ్లిపోయారు. దీంతో రూ. 24 వేలరూపాయల మేర ఆస్ధినష్టంతో పాటు బోరుకింద సుమారు 5 ఎకరాల్లో స్ప్రింక్లర్ల సౌకర్యంతో సాగు చేసిన వేరుశనగ పంట దెబ్బతినే ప్రమాదం ఉందని బాధిత రైతు చింతమానుపల్లి ముత్యాలప్ప తెలిపారు. ఈ మేరకు ఆయన కుటుంబసభ్యులు మంగళవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. -
దళితులపై విద్యుత్ చౌర్యం కేసులు
► ఎల్లుట్ల ఎస్సీకాలనీలో విజిలెన్స్ అధికారుల నిర్వాకం ► తీవ్ర ఆందోళన చెందుతున్న బాధితులు పుట్లూరు : పుట్లూరు మండలం ఎల్లుట్ల ఎస్సీకాలనీలో విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. విద్యుత్ చౌర్యం చేస్తున్నారంటూ 42 మందిపై కేసులు నమోదు చేశారు. ఒక్కో కుటుంబంపై రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు అపరాధ రుసుం విధించారు. డబ్బు చెల్లించకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో ఎస్సీ కాలనీ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొందరు అప్పుచేసి మరీ అపరాధ రుసుం చెల్లించారు. సీపీఎం నాయకుల నిరసన దళితుల ఇళ్లకు విద్యుత్ మీటర్లు లేవని అపరాధ రుసుం వేయడంపై సీపీఎం మండల కార్యదర్శి రామాంజినేయులు అధికారుల ముందు నిరసన తెలిపారు. వెంటనే కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. -
ఇంకా అలాగే..
తొలగని గాలివాన కష్టాలు అంధకారంలో పలు కాలనీలు సిటీబ్యూరో: నగరంలో శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షంతో తలెత్తిన పరిస్థితులు ఇంకా చక్కబడలేదు. జీహెచ్ఎంసీ ప్రధాన రహదారులకు ప్రాధాన్యమిచ్చి పనులు చేసినప్పటికీ, కాలనీలు, బస్తీలు, సబ్లైన్లలో కూలిన చెట్లను ఇంకా తొలగించలేదు. ఆయా విభాగాల మధ్య సమన్వయలేమి వల్ల పనుల్లో జాప్యం జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో కూలిన చెట్లు తొలగిస్తే కానీ తాము విద్యుత్ లైన్లు బాగుచేయలేమని విద్యుత్శాఖ సిబ్బంది వెనుదిరుగుతున్నారు. కూలిన భారీ చెట్ల తరలింపు పనులు బైలైన్లలో ఇంకా పూర్తికాలేదు. దాంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం వచ్చిన గాలివాన వల్ల ఏర్పడ్డ ఇబ్బందులపై శుక్ర, శనివారాల్లో జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్కు 564 ఫిర్యాదులు అందాయి. వాటిలో కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు తదితరమైనవి ఉన్నాయి. కాగా, మూడురోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రాజేంద్రనగర్లోని ఇబ్రహీంబాగ్లో ప్రజలు ఆదివారం స్థానిక సబ్స్టేష న్ ముందు ఆందోళనకు దిగారు. అందిన ఫిర్యాదుల్లో ప్రధానమైనవి.. కూలిన చెట్లు : 266 విద్యుత్లేని ప్రాంతాలు : 176 కూలిన విద్యుత్ స్తంభాలు : 47 డ్రైనేజి సమస్య ఉన్న ప్రాంతాలు : 16 -
పేదరాలి ఇంటికి రూ.30 వేల విద్యుత్ బిల్లు
వాకాడు : రెక్కాడితేగాని డొక్కాడని ఓ పేదరాలి ఇంటికి రూ. 30 వేలు విద్యుత్ బిల్లు వచ్చింది. మండలంలోని నెల్లిపూడి గ్రామం దళితవాడకు చెందిన కావలి గున్నమ్మ ఇంటి ఉన్న విద్యుత్ మీటర్ సర్వీస్ నంబర్ 352. మార్చి, ఏప్రిల్కు సంబంధించి రూ.29,943 తిరిగినట్లు బిల్లు రావడంతో ఆ పేదరాలు ఖంగుతింది. మార్చి రీడింగు 226 యూనిట్లు ఉండగా ఏప్రిల్కు 276 యూనిట్లుగా ఉంది. దీని ప్రకారం ఆమె ఖర్చుచేసిన కరెంటు 50 యూనిట్లు మాత్రమే. కాని బిల్లు మాత్రం రూ. వేలల్లో వచ్చిపడింది. ఈ మొత్తాన్ని తప్పనిసరిగా కట్టాలని విద్యుత్శాఖ వారు చెప్పడంతో ఇంత డబ్బు తాను ఎలా కట్టలని ఆ పేదరాలు కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది. ఇలా విద్యుత్శాఖ వారు నిర్లక్ష్యం కారణంగా గ్రామంలో దాదాపు 50 ఇళ్లకు పైగా అధిక విద్యుత్ బిల్లు వచ్చి ఆ కుటుంబ సభ్యులు అల్లాడిపోతున్నారు. -
భారం ప్రభుత్వమే భరించాలి
విద్యుత్ చార్జీల పెంపుపై ప్రజా సంఘాల డిమాండ్ సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై వివిధ సంఘాల నాయకులు, ప్రతినిధులు భగ్గుమన్నారు. చార్జీల భారాన్ని ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. బుధవారమిక్కడ తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) ఆధ్వర్యంలో సర్చార్జీ, అదనపు సర్చార్జీ ధరలు తదితర అంశాలపై బహిరంగ విచారణ జరిగింది. ఉదయం 10.30 గంటల నుంచి రా త్రి 9.30 గంటల వరకు సుదీర్ఘంగా ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చార్జీల పెంపు ప్రతిపాదనలపై టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీ ఖాన్, సభ్యులు హెచ్.శ్రీనివాసులు, ఎల్.మనోహర్రెడ్డి సమక్షంలో వివిధ సంఘాల నేతలు, నిపుణులు తమ వాదనలను వినిపించారు. ఎన్నికల తర్వాత పెంపు ప్రతిపాదనలా? ఉప ఎన్నికలు, హైదరాబాద్, ఇతర కార్పొరేషన్లలో ఎన్నికలు ముగిశాకే చార్జీలను వడ్డించే ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుకు తెచ్చిందని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్కు చెందిన వేణుగోపాలరావు పేర్కొన్నారు. గృహోపయోగ కనెక్షన్లకు 200 యూనిట్లు దాటితే 20 శాతం, 400 యూనిట్లు దాటితే 35 శాతం చార్జీల పెంపుదల భారం అన్ని వర్గాల ప్రజలపై వేయడం సరికాదన్నారు. సమగ్ర ఆదాయ, అవసరాల నివేదిక(ఏఆర్ఆర్)లో పేర్కొన్న మిగులు విద్యుత్ కనిపించడం లేదని, ఇందుకు సంబంధించిన వివరాలేవి డిస్కం ఇవ్వలేదన్నారు. మణుగురులో సబ్క్రిటికల్ బాయిలర్ టెక్నాలజీతో విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడం సరికాదన్నారు. రాష్ట్రాలకు కేంద్రం అవసరమైనంత మేర సహజ వాయువు, బొగ్గు సరఫరా చేయడం లేదని విమర్శించారు. రైతులకు పరిహారం ఇవ్వాలి టీపీసీసీ కిసాన్సెల్ నేత ఎం.కోదండరెడ్డి మాట్లాడుతూ... 2004లో వైఎస్ హయాంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్తో పాటు రైతుల పాత బకాయిలను మాఫీ చేసి, వారిపై పెట్టిన కేసులు ఎత్తేసినట్లు గుర్తుచేశారు. పంట పొలాల్లో 400 కేవీ లైన్లు, టవర్లు వేస్తే రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యుత్ వినియోగం పెరిగినట్లుగా డిస్కంలు చూపడం నమ్మదగినదిగా లేదని పీపుల్స్ మానిటరింగ్ గ్రూపు కన్వీనర్ తిమ్మారెడ్డి అన్నారు. జెన్కో ద్వారా తక్కువ ధరకు కాకుండా స్వల్ప కాలిక ఒప్పందాలతో ఎక్కువ ధరకు విద్యుత్ కొనడం వల్లే అదనపు భారం పడుతోందన్నారు. గ్రామానికి ఒక లైన్మెన్ను నియమించాలన్నారు. కొత్త కనెక్షన్ల కోసం 75 వేల దరఖాస్తులుంటే అందుల మహబూబ్నగర్ జిల్లాలోనే సగం ఉన్నాయని చెప్పారు. డిస్కంలకు ప్రభుత్వం అందించే సహాయానికి సంబంధించి ముందుగానే ప్రభుత్వం అఫిడివిట్ సమర్పించేలా చూడాలని పీపుల్ మానిటరింగ్ గ్రూప్కు చెందిన డి.నర్సింహారెడ్డి అన్నారు. కరెంట్ బిల్లును సులభతరం చేసి, అందులో పేర్కొన్న అంశాలన్నీ అందరికీ అర్థమయ్యేలా చూడాలన్నారు. కరెంట్ వైర్లు, షాకు ఇతరత్రా కారణాలతో మృత్యువాత పడుతున్న వారిని వారిని ఆదుకోవాలని మానవ హక్కుల వేదిక నేత ఎస్.జీవన్కుమార్ సూచించారు. ‘మా వాళ్లను ఏసీబీకి పట్టివ్వండి’ విద్యుత్ శాఖలో అవినీతి గురించి అందరూ మాట్లాడుతున్నారని, దీన్ని ఉపేక్షించొద్దని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి సూచించారు. రూ.10 అవినీతి జరిగినా ఏసీబీని ఆశ్రయించాలని ఆయన సూచించారు. తాను సీఎండీగా అన్ని అంశాలపై స్పందించలేనని, కొందరి వల్ల శాఖకు చెడ్డపేరు వస్తోందని వ్యాఖ్యానించారు. ఏసీబీని ఆశ్రయిస్తే తాను కూడా వినియోగదారులకు సహకరిస్తానని చెప్పారు. ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు, లైన్లు ఇలా అన్నింటి కోసం జనవరి 1 నుంచి ఒక లిస్ట్ను పెట్టామని, దాని ప్రకారమే అవి వస్తాయని చెప్పారు. అందువల్ల నిబంధనల ప్రకా రం దరఖాస్తు చేసుకోవాలని సూచిం చారు. జాతీయ ఎక్స్ఛేంజ్ ద్వారా వెంట నే విద్యుత్ వస్తుందనే నమ్మకం లేకే స్వ ల్పకాలిక విద్యుత్ ఒప్పందాలకు మొగ్గు చూపుతున్నట్లు ఆయన వెల్లడించారు. -
వచ్చే అసెంబ్లీలో రెండే పార్టీలుంటాయి
సాక్షి, హైదరాబాద్: వచ్చే శాసన సభలో కేవలం రెండు పార్టీలు మాత్రమే ఉంటాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి జోస్యం చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్లోని ఏడెనిమిది స్థానాలు మినహాయిస్తే మిగిలిన అన్ని స్థానాలనూ ఒకే పార్టీ గెలుచుకుంటుందని, అది తామేనని పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో ఆయన ముచ్చటించారు. 2018 లోనే సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు పోతారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన వద్ద ప్రస్తావించగా.. ‘2018 నుంచి చెట్టూ.. పుట్టా.. ఊరూ.. వాడా తిరుగుతానని అన్న ప్రకటిస్తడు.. తమ్ముడేమో 2018 లోనే ఎన్నికలు అంటడు.. వారిది పిచ్చివాళ్ల స్వర్గం’ అని మంత్రి జగదీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. -
మున్సిపాలిటీలకు ‘ఎల్ఈడీ’ వెలుగులు
తొలి దశలో 25 మున్సిపాల్టీల్లో ప్రారంభం 6 లక్షల కుటుంబాలకు 12 లక్షల బల్బులు: కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 25 మున్సిపాలిటీల్లో ఎల్ఈడీ ధగధగలు క నువిందు చేయనున్నాయి. రాబోయే 100 రోజుల్లోగా ఎల్ఈడీ బల్బుల బిగింపు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశం అనంతరం మున్సిపల్మంత్రి కె.తారకరామారావు, విద్యుత్ మంత్రి జగదీశ్వర్రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. మున్సిపల్, డిస్కంల అధికారులతో జరిగిన సమావేశంలో ఎల్ఈడీ బల్బులను సరఫరా చేసే ఈఎస్ఎస్ఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు. మొత్తం 25 మున్సిపాల్టీల్లోని ఆరు లక్షల కుటుంబాలకు సుమారు 12 లక్షల ఎల్ఈడీ బల్బులను సరఫరా చేయనున్నామని, సాధ్యమైనంత తక్కువ ధరకు అందించాలని ఈఎస్ఎస్ఎల్ ప్రతినిధులను మంత్రి కోరారు. గ్రామ పంచాయతీల్లోనూ ఈ తరహా ప్రయత్నానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. రెండో దశలో భాగంగా త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వీధి దీపాలకు, మూడో దశలో ప్రజలందరికీ సబ్సిడీపై ఎల్ఈడీ బల్బులను సరఫరా చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు. ఇంధన పొదుపే లక్ష్యం... విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇంధన పొదుపు లక్ష్యంగా పెద్దెత్తున ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోందన్నారు. త్వరలోనే నల్గొండ, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో ఎల్ఈడీ బల్బుల బిగింపు కార్యక్రమాన్ని విద్యుత్ శాఖ చేపడుతుందన్నారు. ప్రతి ఇంటికి 9 వాట్ల ఎల్ఈడీ బల్బులను ప్రజలకు ఉచితంగా సరఫరా చేయనున్నామన్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, డిస్కం, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
పేద రైతులకు ‘సూర్య’ గ్రహణం
మహబూబ్నగర్ జిల్లాలో సోలార్ పార్కు కోసం పచ్చని భూములపై ‘బీడు’ ముద్ర గట్టు నుంచి సాక్షి ప్రతినిధులు మహమ్మద్ ఫసియొద్దీన్, జి.ప్రతాప్రెడ్డి రాష్ట్రంలోనే అత్యల్ప వర్షపాతం గల మండలంగా గట్టు రికార్డులకెక్కింది. దశాబ్దాల కిందటి వరకు ఈ మండలంలో కనుచూపు మేర పచ్చదమే కనిపించేది కాదు. అప్పట్లో తొండలు గూడు పెట్టని భూములవి. ఇక్కడి రైతులకు వలసలే దిక్కు. 1950 నుంచి దశల వారీగా జరిగిన అసైన్డ్ భూముల కేటాయింపులతో ఇక్కడి ప్రజలకు వ్యవసాయమే ప్రధాన జీవనోపాధిగా మారింది. రాళ్లు రప్పలతో నిండిన భూములను చదును చేసి ఇక్కడి కుటుంబాలు ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాయి. వారసత్వంగా ఈ భూములు రెండు మూడు తరాల చేతులు మారాయి. ప్రస్తుతం ఆ భూముల్లో బోరు, బావులు ఏర్పాటు చేసుకుని బిందు సేద్యం పరిజ్ఞానంతో సాగుచేస్తున్నారు. సూర్య కిరణాలు తీవ్రత ఎక్కువగా ఉండే గట్టు మండలం సౌర విద్యుదుత్పత్తికి రాష్ట్రంలో అత్యంత అనువైన ప్రాంతమని ఓ సర్వేలో తేలింది. ఇక్కడ 1000 మెగావాట్ల సోలార్ పార్కు మంజూరైంది. ఇప్పుడిదే ఆ రైతుల పాలిట శాపంగా మారింది. సంజాయిషీ కూడా లేకుండా రద్దు కేటాయించిన మూడేళ్లలోపు సాగులోకి తీసుకోరాకపోతే అసైన్డ్ భూముల కేటాయింపును ప్రభుత్వం రద్దు చేయవచ్చని అసెన్డ్ భూముల చట్టం పేర్కొంటోంది. ఈ ని‘బంధ’నల్లోనే అన్యాయంగా రైతులను ఇరికించారు. గతేడాది స్థానిక వీఆర్వోలు ఈ గ్రామాల్లో సర్వే నిర్వహించారు. వారి నివేదిక ఆధారంగానే.. బీడుగా పడి ఉన్న ఆ భూముల కేటాయింపులను ఎందుకు రద్దు చేయవద్దో చెప్పాలంటూ గత సెప్టెంబ ర్లో రైతులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కానీ ఏప్రిల్ 2015న జారీ చేసినట్టు నోటీసులపై పాత తేదీలు వేశారు. కొందరు రైతులకు షోకాజ్తో పాటే భూ కేటాయింపుల రద్దు ఉత్తర్వులను ఒకేసారి ఇచ్చారు. ఆందోళనకు గురైన కొందరు రైతులు ఈ నోటీసులు స్వీకరించ లేదు. రైతుల సంజాయిషీ వినకుండానే సోలార్ పార్కు కోసం నాలుగు గ్రామాల్లో ఇప్పటి వరకు 3,354.37 ఎకరాల అసైన్డ్ భూముల కేటాయింపులు రద్దు చేసేశారు. ఇందులో పడావుగా పెట్టడం వల్ల 2,130 ఎకరాలను, మిగులుగా ఉండడంతో 1,226.26 ఎకరాల అసైన్డ్ భూముల కేటాయింపులను రద్దు చేశామని గట్టు మండల రెవెన్యూ అధికారులు రికార్డుల్లో నమోదు చేశారు. ఆ రెండు గ్రామాలు ఇక ఎడారేనా.. సోలార్ పార్కు కోసం రైతుల నుంచి అసైన్డ్ భూములు లాక్కుంటే సగానికి పైగా వ్యవసాయం ఆగిపోయి కుచినేర్ల, కాలూర్ తిమ్మన్దొడ్డి గ్రామాలు ఎడారిగా మారే ప్రమాదం ఉంది. జీవనోపాధి కోసం బెంగళూరు, రాయచూరు, హైదరాబాద్కు వలస వెళ్లక తప్పదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుచినేర్ల జనాభా 7,259 ఉండగా 10,099 ఎకరాల భూములున్నాయి. ఇందులో 1,146 ఎకరాల తరి, 6,568 ఎకరాలు మెట్ట భూములు మాత్రమే సాగుకు యోగ్యమైనవి. సోలార్ పార్కు కోసం ఈ గ్రామం నుంచి 2,072.05 ఎకరాలు సేకరించాలని నిర్ణయించిన ప్రభుత్వం... ఇప్పటివరకు 1,586.35 ఎకరాలను లాగేసుకుంది. ఇక కాలూర్తిమ్మన్దొడ్డిలో జనాభా 2,625 ఉండగా కేవలం 5,131 ఎకరా ల భూములే ఉన్నాయి. ఉన్నాయి. ఇందులో 679 ఎకరాల తరి, 2,911 ఎకరాల మెట్ట భూ ములు సాగుకు అనుకూలంగా ఉన్నాయి. ఈ గ్రామం నుంచి 2,524.13 కరాలను సేకరిం చాలని నిర్ణయించిన అధికారులు ఇప్పటి వర కు 1204.14 ఎకరాలను తీసేసుకున్నారు. వీటితోపాటు మరో రెండు గ్రామాలైన రాయపురంలో 246.24 ఎకరాలు, ఆలూరులో 317.02 ఎకరాల అసైన్డ్ భూముల కేటాయింపులను సైతం అధికారులు రద్దు చేశారు. పరిహారం ఎగ్గొటేందుకు ‘బీడు’ అంటున్నారు.. సోలార్ పార్కు కోసం గట్టు మండల పరిధిలోని కాలూర్తిమ్మన్దొడ్డి, ఆలూరు, కుచినేర్ల, రాయపురంలల్లో 5,622 ఎకరాల భూములను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూసేకరణ చట్టం-2013 కింద ఈ భూములు సేకరిస్తే మార్కెట్ రేటుకు మూడింతల పరిహారంతోపాటు పునరావాస ప్యాకేజీ కింద ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాల్సి ఉంది. ఈ గ్రామాల్లో ఎకరా విలువ రూ.3 లక్షల వరకు ఉండగా... భూసేకరణ చట్టం కింద ఒక్కో ఎకరాకు రూ.9 లక్షల చొప్పున మొత్తం రూ.505 కోట్ల వరకు పరిహారం చెల్లించాల్సి ఉం టుంది. అయితే పరిహారం ఎగ్గొట్టేందుకు స్థానిక అధికారులు భూ సేకరణ చట్టాన్ని పక్కనపెట్టారు. వాటిని బీడు భూములుగా చూపి, కేటాయింపులు రద్దు చేస్తున్నామంటూ నోటీసులు ఇచ్చి అసైన్డ్దారులు భూములను సాగు చేసుకోవడం లేదు కాబట్టి స్వాధీనం చేసుకుంటున్నామంటూ అందులో పేర్కొన్నారు. ఈ నోటీసుల వెంటనే కేటాయింపు రద్దు ఉత్తర్వులు జారీ చేసేశారు. బిందు సేద్యంతో మామిడి, వరి సాగు కుచినేర్లకు చెందిన ఈ రైతు పేరు ముత్త వేమారెడ్డి(60). ఈయనకు ఐదెకరాల అసైన్డ్ భూమి ఉంటే మూడెకరాల్లో ఏడేళ్లుగా మామిడి తోట, రెండెకరాల్లో వరి సాగు చేస్తున్నారు. బిందు సేద్యం ద్వారా మామిడి తోటకు నీళ్లు పెట్టుతున్నారు. విద్యుత్ శాఖకు డబ్బులు కట్టి పొలంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసుకున్నారు. బావి సైతం తవ్వించారు. వేమారెడ్డి గతేడాది పంట నష్టపరిహారం కూడా అందుకున్నారు. ఇప్పుడు ఈయన సాగు చేస్తున్న భూముల్ని బీడుగా పేర్కొంటూ అధికారులు కేటాయింపులు రద్దు చేశారు. చనిపోయిన రైతుకు షోకాజ్ నోటీసు కుచినేర్లకు చెందిన ఉట్టి బాబు(24) అనే రైతు 2011 డిసెంబర్ 20న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వారసత్వంగా బాబుకు సంక్రమించిన 2.5 ఎకరాల అసైన్డ్ భూముల కేటాయింపులను రద్దు చేస్తూ అతడి పేరుతో అధికారులు గత సెప్టెంబర్లో కుటుంబ సభ్యులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. పరిహారం ఇప్పించండి కాలూర్ తిమ్మన్దొడ్డికి చెందిన దళిత రైతు దొమ్మరి శేషాద్రి కుటుంబానికి 15 ఎకరాల అసైన్డ్ భూములు ఉండగా, పదెకరాల్లో మామిడి, నిమ్మ, దానిమ్మ తోటలు సాగు చేస్తున్నారు. ఇందుకు 5 బోర్లు వేశారు. ఈ భూములనే బ్యాంకులో తనఖా పెట్టి తీసుకున్న రుణంతో ట్రాక్టర్ కొనుగోలు చేశారు. బ్యాంకు రుణం తీసుకున్నట్లు పాసుపుస్తకాల్లో నమోదై ఉంది. ఈ 15 ఎకరాల అసైన్డ్ భూమికి పరిహారంగా కనీసం 5 ఎకరాల పట్టా భూమి ఇప్పించాలని శేషాద్రి కోరుతున్నారు. -
క్రీమీలేయర్ అమలు చేయాలా? వద్దా?
♦ ప్రభుత్వ స్పష్టత కోసం ఎదురుచూపులు ♦ డైలమాలో నియామక సంస్థలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో బీసీ క్రీమీలేయర్ (సంపన్నవర్గాలు)ను అమలు చేయాలా? వద్దా? అన్న స్పష్టత లేకుండాపోయింది. బీసీ క్రీమీలేయర్ అమలును నిలిపివేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న గతంలోనే ప్రకటించారు. అయితే ఇంతవరకు ఉత్తర్వులు మాత్రం జారీ కాలేదు. ఈక్రమంలో టీఎస్పీఎస్సీ ఏఈ, ఏఈఈ వంటి పోస్టుల భర్తీకి ఉద్యోగ పరీక్షలను నిర్వహించింది. అలాగే విద్యుత్ శాఖ కూడా పలు ఇంజనీర్ పోస్టులకు రాత పరీక్షలను నిర్వహించింది. కానీ ఫలితాలు ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో అటు విద్యుత్ శాఖ, ఇటు టీఎస్పీఎస్సీ ఇంటర్వ్యూలు నిర్వహించడానికి ముందే క్రీమీలేయర్పై స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నోటిఫికేషన్లో మాత్రం అభ్యర్థులు క్రీమీలేయర్ సర్టిఫికెట్లు తెచ్చుకోవాలని ప్రకటించించింది. ఇంటర్వ్యూల నిర్వహణ కంటే ముందే అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో క్రీమీలేయరా, నాన్ క్రీమీలేయరా అన్న సర్టిఫికెట్ను అందజేయాల్సి ఉంటుంది. వాటి ఆధారంగానే బీసీ రిజర్వేషన్ కోటాలో తీసుకురావాలా? ఓపెన్ కోటాలో పరిగణనలోకి తీసుకోవాలా? అన్న నిర్ణయం తీసుకుంటాయి. అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. 6 లక్షల లోపు ఉంటే వారిని నాన్ క్రీమీలేయర్ అభ్యర్థులుగా రిజర్వేషన్ కోటా లో, అదే రూ. 6 లక్షలకు పైగా ఉన్న వారిని వెనుకబడిన వర్గాల్లో సంపన్న శ్రేణులుగా గుర్తించి, ఓపెన్ కేటగిరీలోనే పరిగణనలోకి తీసుకుంటాయి. ప్రభుత్వం క్రీమీలేయర్ అమలును నిలిపివే స్తామని మౌఖి కంగా పలుమార్లు పేర్కొన్న నేపథ్యంలో నియామక సంస్థలు ఆలోచనలో పడ్డాయి. సర్కారు నుంచి దీనిపై స్పష్టత కోసం ఎదురుచూస్తున్నాయి. -
విద్యుత్ ఉద్యోగులకు దసరా ధమాకా!
సాక్షి, హైదరాబాద్: విజయదశమి కానుకగా విద్యుత్ శాఖలో భారీ ఎత్తున పదోన్నతులు జరిగాయి. తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో, డిస్కంలలో పనిచేస్తున్న 1,200 మందికి పైగా ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇంజనీరింగ్, అకౌంట్స్, పీఅండ్జీ తదితర విభాగాల్లో పనిచేస్తున్న అధికారులకు పదోన్నతి కల్పించారు. సెలవు రోజులైనప్పటికీ మంగళ, బుధవారాల్లో విద్యుత్ సంస్థల యాజమాన్యాలు రాత్రింబవళ్లు కసరత్తు జరిపి ఎట్టకేలకు పదోన్నతుల ఉత్తర్వులు జారీ చేశాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో రికార్డులు లభించక ఉద్యోగుల సర్వీసుకు సంబంధించిన సమాచారం లభించక తొలుత గందరగోళం ఏర్పడినా, పూర్తి స్థాయి వివరాలు సేకరించిన తర్వాతే పకడ్బందీగా పదోన్నతులు కల్పించామని అధికారులు పేర్కొంటున్నారు. పదోన్నతుల వ్యవహారం వివాదాస్పదం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతోనే ఆలస్యం జరిగింది. రిలీవైన ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న ఎత్తుగడ వల్ల అనూహ్య పదోన్నతులు రావడంతో టీ విద్యుత్ ఉద్యోగుల్లో పండుగ ఆనందం రెట్టింపైంది. పదోన్నతి కల్పించిన వారికి కొత్త పోస్టింగ్లు ఇంకా కేటాయించలేదు. ఏపీ స్థానికత ఉద్యోగుల తొలగింపు ద్వారా ఖాళీ అయిన పోస్టులన్నింటినీ ఈ పదోన్నతుల ద్వారా భార్తీ చేయనున్నారు. అసిస్టెంట్ ఇంజనీర్ నుంచి చీఫ్ ఇంజనీర్ వరకు ఖాళీ పోస్టులు భర్తీ కానున్నాయి. ఆ తర్వాతే రిలీవైన ఏపీ స్థానికత ఉద్యోగులను తిరిగి విధుల్లో చేర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. మాకూ పదోన్నతులు కావాలి: రిలీవైన ఉద్యోగులు రిలీవైన ఉద్యోగులు సైతం తమకు పదోన్నతులు కల్పించాలనే డిమాండ్ను తెరపైకి తెచ్చారు. ఇప్పటికే కొందరు ఉద్యోగులు తెలంగాణ విద్యుత్ సంస్థలకు జాయినింగ్ రిపోర్టులు సైతం అందజేశారు. తమను సైతం పదోన్నతుల్లో పరిగణించాలని విజ్ఞప్తి చేసుకున్నారు. మరోవైపు రిలీవైన ఉద్యోగులు సాంకేతికంగా తెలంగాణ ప్రభుత్వంలో తిరిగి చేరినట్లేనని రాష్ట్ర విద్యుత్ సంస్థల యాజమాన్యాలు చెబుతున్నాయి. హైకోర్టు మధ్యంతర ఆదేశాల మేరకు ఇప్పటికే వారి రాష్ట్ర వాటా కింద 42 శాతం జీతభత్యాలను విడుదల చేసేశామని, దీంతో ఆ ఉద్యోగులు ప్రస్తుతం విధుల్లో ఉన్నట్లు పరిగణిస్తామని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. -
విద్యుత్ కంచెకు కూలీ బలి
అక్కగారిపేట (పెళ్లకూరు) : విద్యుత్శాఖ అధికారుల అనుమతి లేకుండా వరి పైరు పొలానికి ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు కూరపాటి దాసు (48) అనే వ్యవసాయ కూలి బలైపోయాడు. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు.. చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం క్రైస్తవమిట్ట గ్రామానికి చెందిన దాసు ట్రాక్టర్ డ్రైవర్గా వ్యవసాయ పనులు చేస్తుంటాడు. గ్రామానికి చెందిన తూపిలి సురేంద్రరావు తన వరి పొలాలకు పందుల బెడద కోసం విద్యుత్ కంచె ఏర్పాటు చేసుకున్నాడు. శనివారం సాయంత్రం పొలానికి వెళ్లిన దాసు చీకటి పడినా ఇంటికి తిరిగి రాలేదు. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు వ్యవసాయ పొలాల్లో గాలించగా విద్యుత్ కంచె తగిలి మృతి చెంది ఉండడాన్ని గుర్తించారు. రైతు నిర్లక్ష్యం వల్లే వ్యవసాయ కూలీ దాసు బలైపోయాడంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావాలనే చంపేశారు : కుటుంబ సభ్యులు వ్యవసాయ కూలీ దాసును గ్రామానికి చెందిన సురేంద్రరావు పాత కక్షలతోనే కావాలనే విద్యుత్ తీగలు ఏర్పాటు చేసి చంపేశారంటూ మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నోఏళ్లుగా ఇరు కుటుంబాల మధ్య వివాదాలు ఉన్నాయని, మృతుడి భార్య లత తెలియజేసింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివశంకరరావు తెలిపారు. అనాథలైన ఆడపిల్లలు దాసు మృతితో ముగ్గురు ఆడ పిల్లలు అనాథలయ్యారు. రోజూ వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. దాసు మృతితో ఆ కుటుంబం ఆధారం కోల్పోయింది. -
చర్చల ద్వారా పరిష్కరించుకోండి
పురోగతి లేకుంటే మాకు చెప్పండి ♦ అప్పుడు మేమే తగిన ఆదేశాలు జారీ చేస్తాం ♦ విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదంపై ♦ ఇరు రాష్ట్రాలకూ హైకోర్టు స్పష్టీకరణ ♦ తదుపరి విచారణ 9వ తేదీకి వాయిదా సాక్షి, హైదరాబాద్ : విద్యుత్ ఉద్యోగుల విభజన వ్యవహారంలో తలెత్తిన వివాదాన్ని చర్చలద్వారా పరిష్కరించుకోవాలని ఇరు రాష్ట్రప్రభుత్వాలకు హైకోర్టు స్పష్టం చేసింది. రెండురాష్ట్రాల విద్యుత్ అధికారులు చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం కనుగొనాలని సూచించింది. చర్చల్లో పురోగతి లేకుంటే పూర్తిస్థాయి విచారణ అనంతరం తామే తగిన ఆదేశాలు జారీ చేస్తామంది. ఉద్యోగుల విభజన ప్రక్రియను కొలిక్కితెచ్చే బాధ్యతను షీలాభిడే కమిటీకి అప్పగించాలా? లేదా ఇరురాష్ట్రాల అంగీకారంతో కోర్టు పర్యవేక్షణలో కమిటీని ఏర్పాటు చేయాలా? అన్నదానిపై అభిప్రాయం చెప్పాలని ఉభయరాష్ట్రాల అడ్వొకేట్ జనరల్స్(ఏజీ)ను ఆదేశించింది. వచ్చే విచారణ నాటికి ఏ విషయం చెబితే తదనుగుణంగా ఆదేశాలిస్తామంది. తదుపరి విచారణను ఈనెల 9కి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ ఆర్.సుభాష్రెడ్డి, జస్టిస్ ఎ.శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఏపీ స్థానికత ఆధారంగా విద్యుత్ ఉద్యోగుల విభజన మార్గదర్శకాలకు తెలంగాణ విద్యుత్శాఖ ముఖ్య కార్యదర్శి ఆమోదముద్ర వేస్తూ జారీచేసిన ఉత్తర్వుల్ని, వాటికనుగుణంగా టీఎస్ ట్రాన్స్కో చైర్మన్ రూపొందించిన తుదిజాబితాను సవాలుచేస్తూ పలువురు ఉద్యోగులు పిటిషన్లు వేయడం తెలిసిందే. వీటిని జస్టిస్ సుభాష్రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. చట్ట నిబంధనలమేరకే విభజన: తెలంగాణ ఏజీ స్థానికత ఆధారంగా చేపట్టిన ఉద్యోగుల విభజన ప్రక్రియ పునర్విభజన చట్టం మేరకే జరిగిందని తెలంగాణ ఏజీ కె.రామకృష్ణారెడ్డి వాదించారు. నిబంధనలకు అనుగుణంగా లేదు: ఏపీ ఏజీ ఏపీ స్థానికత ఆధారంగా విద్యుత్ ఉద్యోగుల విభజనకు సంబంధించిన మార్గదర్శకాలు, తదనుగుణంగా తెలంగాణ విద్యుత్శాఖ ముఖ్యకార్యదర్శి జారీచేసిన ఉత్తర్వులు, వాటికనుగుణంగా టీఎస్ ట్రాన్స్కో చైర్మన్ రూపొందించిన తుది జాబితా నిబంధనలకు అనుగుణంగా లేదని ఏపీ ఏజీ పి.వేణుగోపాల్ తెలిపారు. ఇదేసమయంలో గతవారం ధర్మాసనం జారీచేసిన ఆదేశాల మేరకు కేంద్రప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. పునర్విభజన చట్టంలోని సెక్షన్-82 ప్రకారం ఆ సంస్థలే ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తిచేయాలని తెలిపింది. వివాద పరిష్కార బాధ్యతను షీలాబిడే కమిటీకి అప్పగించే ఉద్దేశం తమకుందని, దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. వాదనలు విన్న ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. -
మా కొద్దు ప్లీజ్...!
నల్లగొండ : జిల్లా విద్యుత్ శాఖ బదిలీల్లో వింతపోకడలు చోటుచేసుకున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఈలు, ఏడీఈలు తమ రూటు మార్చారు. వీరితో పాటు రాజకీయ ఒత్తిళ్లు భరించలేని కొందరు ఉద్యోగులు కూడా ఆపరేషన్ వింగ్ వదిలేసి లూప్లైన్ బాట పట్టారు. జిల్లాలో ఏఈలు, ఏడీఈలు భారీ స్థాయిలో ఖాళీలు ఏర్పడడంతో ఉద్యోగుల ఆప్షన్ మేరకు వారు కోరుకున్న స్థానాలకే బదిలీ అయినప్పటికీ ప్రత్యేకంగా కొందరు ఉద్యోగులు మాత్రం తమ సేవలను కార్యాలయాలకే పరిమితం చేయాలని నిర్ణయించుకున్నారు. ఏఈ, ఏడీఈ పోస్టులతో పాటు లూప్లైన్లో కూడా ఖాళీలు భారీగానే ఉండటంతో ఎక్కువ మంది సీనియర్లు అదే బాట పట్టారు. ప్రధానంగా నకిరేకల్, నల్లగొండ సర్కిల్ పరిధిలో పనిచేసేందుకు వెనుకాడుతున్న ఉద్యోగులు ఈసారి లూప్లైన్ వైపే మొగ్గుచూపారు. విద్యుత్ శాఖ ఎస్ఈ భిక్షపతి కూడా ఉద్యోగుల ఆప్షన్లకే ప్రాధాన్యత ఇచ్చారు. రాజకీయ పైరవీలు, ఉద్యోగ సంఘాల అభీష్టం మేరకు ఒకరిద్దరు అధికారులకు తాము కోరుకున్న స్థానాలకు బదిలీ చేశారు. మంగళవారం రాత్రి పొద్దు పోయే వరకు బదిలీ ఉత్తర్వులు జారీ చేయడంలో విద్యుత్శాఖ తీవ్ర కసరత్తు చేసింది. ఎస్ఈ తెలిపిన వివరాల మేరకు ఏడీఈలు 22, ఏఈలు 51, సబ్ఇంజినీర్లు 57 మందిని వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేసినట్లు తెలిపారు. వీరిలో హైదరాబాద్ నుంచి జిల్లాకు బదిలీపై వచ్చిన వారు కూడా ఉన్నారు. ఇంత మందిని సర్దుబాటు చేసినప్పటికీ జిల్లాలో ఏఈ పోస్టులు 30 నుంచి 40 వరకు ఖాళీగానే ఉన్నాయి. అలాగే ఏడీఈలు 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనిని బట్టి బదిలీ అయిన వారిలో ఎక్కువ మంది బయట పనిచేసేందుకు అయిష్టత వ్యక్తం చేయడంతోనే చాలా మంది ఉద్యోగులు కార్యాలయంలో పనిచేసేందుకు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. అయితే ఈ మొత్తం బదిలీల్లో ఆపరేషన్ వింగ్లో పనిచేసేందుకు ఏఈలు, ఏఈడీలు బయపడుతున్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లు భరించలే ని కొందరు ఉద్యోగులను బలవంతంగా మండలాలకు పంపించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలిసింది. కరెంట్స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల కోసం అధికార పార్టీకి చెందిన వ్యక్తుల నుంచి బెదిరింపు ధోరణిలో హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో ప్రత్యక్ష సేవలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. రామన్నపేట, మునుగోడు ఏడీఈ లను హైదరాబాద్కు బదిలీ చేసినప్పటికీ వారు మళ్లీ నల్లగొండకు తిరిగి వచ్చారు. రామన్నపేట ఏడీఈని ప్రజలతో సంబంధం లేని ఎంఆర్టీ వింగ్కు బదిలీ చేస్తూ హుజూర్నగర్కు పంపించారు. అలాగే మునుగోడు ఏడీఈని నల్లగొండ రూరల్కు నియమించారు. నల్లగొండ ఏఈడీ నాగిరెడ్డిని రామన్నపేటకు బదిలీ చేయగా...ఆయన స్థానంలో హైదరాబాద్ నుంచి వచ్చిన సంగెం వెంకటేశ్వర్లును నియమించారు. -
అధికార షాక్
సాక్షి, గుంటూరు : మాచర్ల ప్రాంతంలో ప్రభుత్వ భూములు కాజేయాలని చూసి ఆనక చేతులు కాల్చుకున్న సదరు నేత తాజాగా తన తనయుడి పేరుతో ఏర్పాటు చేసిన కేబుల్ నెట్వర్క్కు బహిరంగంగానే విద్యుత్ను అక్రమంగా వినియోగిస్తున్నారు. ఆ నేతకు చెందిన కేబుల్ నోడ్లు బహిరంగంగా విద్యుత్ స్తంభాలకు వేలాడుతూ కనిపిస్తున్నా ఆ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. వివరాల్లోకి వెళితే... మాచర్ల నియోజకవర్గ అధికారపార్టీకి చెందిన నేత తన తనయుడి పేరుతో ఆరు నెలల క్రితం ఓ కేబుల్ నెట్వర్క్ను ఏర్పాటు చేసి మాచర్ల, రెంటచింతల, వెల్దుర్తి, దుర్గి మండలాల్లోని పలు గ్రామాల్లో తక్కువ ధరలకు కనెక్షన్లు ఇచ్చారు. సహజంగా జిల్లాలోని కేబుల్ నెట్వర్క్లు తమ కనెక్షన్ నోడ్లను ప్రైవేటు స్థలాలు లేదా ఇళ్లల్లో ఏర్పాటు చేసుకుని విద్యుత్ చార్జీలు చెల్లిస్తుంటారు. నోడ్ల నుంచి ఇళ్లకు కనెక్షన్లు ఇస్తారు. సదరు టీడీపీ నేత మాత్రం బహిరంగంగా విద్యుత్ స్తంభాలకే ఈ నోడ్లను బిగించి మెయిన్లైను నుంచి నేరుగా విద్యుత్ను అక్రమంగా వాడుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. విద్యుత్ శాఖ ఆదాయానికి గండి.. ఆరు నెలలుగా నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో కేబుల్ నెట్వర్క్ కోసం విద్యుత్ను అక్రమంగా వాడుకుంటున్నారు. సుమారు 250 నుంచి 300 వరకు విద్యుత్ స్తంభాలపై నోడ్లను బిగించారు. రోజుకు ఒక్కో నోడ్కు 1 నుంచి 2 యూనిట్ల విద్యుత్ అవసరం అవుతుంది. దీన్ని బట్టి చూస్తే నెలకు 12 వేల యూనిట్లకు పైగా విద్యుత్ను అక్రమంగా వాడుకుంటున్నట్టు అర్థమవుతోంది. అంటే నెలకు సుమారు రూ. లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు విద్యుత్ శాఖ ఆదాయనికి గండిపడినట్టు తెలుస్తోంది. మాచర్ల పట్టణంలో విద్యుత్ శాఖలో డీఈ స్థాయి అధికారి ఉన్నప్పటికీ దీనిపై ఎలాంటి చర్య తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. విజిలెన్స్ దాడులు నిర్వహించి చర్యలు తీసుకుంటాం మాచర్ల నియోజకవర్గంలో అధికార పార్టీ నేత కేబుల్ నెట్వర్క్కు విద్యుత్ను అక్రమంగా వినియోగిస్తున్న విషయం నా దృష్టికి రాలేదు. అక్కడి విద్యుత్ అధికారులను అడిగి వివరాలు సేకరిస్తా. మంగళవారం గుంటూరు నుంచి విజిలెన్స్ అధికారులను పంపి దాడులు నిర్వహిస్తాం. విద్యుత్ అక్రమ వినియోగం జరిగినట్లు తేలితే కేసులు పెట్టి, పెనాల్టీలు వేస్తాం. - జయభారత్రావు, విద్యుత్శాఖ ఎస్ఈ కేబుల్ నోడ్లను తొలగిస్తాం.. విద్యుత్ స్తంభాలపై కేబుల్ నోడ్లను ఉంచిన విషయం సోమవారమే నా దృష్టికి వచ్చింది. సిబ్బందిని పంపి కొన్ని స్తంభాలపై ఉన్న నోడ్లను తొలగించాం, మంగళవారం విద్యుత్ అధికారులు, సిబ్బందితో కలిసి మిగిలిన స్తంభాలపై ఉన్న కేబుల్ నోడ్లను పూర్తిగా తొలగిస్తాం. వీటిని ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. కేబుల్ వైర్లకు మాత్రం 176 స్తంభాలకు నెలకు రూ. 1700 చొప్పున పన్ను వసూలు చేస్తున్నాం. వీటిలో కూడా ఏమైనా తేడా ఉంటే పరిశీలించి చర్యలు చేపడతాం. - భాస్కర్బాబు, విద్యుత్ డీఈ, మాచర్ల -
కాంట్రాక్ట్ ఉద్యోగ వ్యవస్థను రద్దు చేయాలి
ద్వారకాతిరుమల : విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగ వ్యవస్థను ప్రభుత్వం ప్రోత్సహిస్తూ విద్యుత్ సంస్థను ఆర్థికంగా దిగజారుస్తోందని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్కుమార్ అన్నారు. ద్వారకాతిరుమలలోని ఓ కల్యాణమండపంలో గురువారం విద్యుత్ ఉద్యోగ సంఘం నేతల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన అశోక్కుమార్ మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ వ్యవస్థను తక్షణమే రద్దు చేయాలని, అదనపు పోస్టులను కేటాయించాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్లకు ఒకసారి చేసే వేతన సవరణను ప్రభుత్వం సక్రమ పద్ధతిలో నిర్వహించాలన్నారు. కాంట్రాక్టు కార్మికుల అర్హత ప్రకారం వారిని రెగ్యులర్ చేయాలన్నారు. రాష్ట్రంలో కోటి 65 లక్షల విద్యుత్ సర్వీసులు ఉండగా, ఇవి గణనీయంగా పెరుగుతున్నాయన్నారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీలకు 35 వేల మంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారని, దీంతో పనిభారం పెరిగిపోయిందన్నారు. వెయ్యి మంది వినియోగదారులకు నిబంధనల ప్రకారం నలుగురు ఉద్యోగులు పనిచేయాల్సి ఉండగా, ప్రస్తుతం 1.91 మంది మాత్రమే ఉన్నారన్నారు. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ఆర్కే గణపతి మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాన్ని 15 శాతం పెంచుతామని చెప్పిన ప్రభుత్వం ఇంత వరకు దాన్ని అమలు చేయలేదన్నారు. యాజమాన్యం ప్రభుత్వానికి తప్పుడు సూచనలిస్తోందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన 60 ఏళ్ల పదవీ విరమణ వయసును తమకు వర్తింప చేయకపోవడం బాధాకరమన్నారు. దీనిపై ముఖ్యమంత్రితో మాట్లా డి 8 నెలలు గడిచినా అమలు చేయలేదన్నారు. దీనిపై స్పందించకుంటే ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. డ్రైవర్లకు ప్రమాద బీమా రూ.5 లక్షలు ప్రకటించిన ప్రభుత్వం, నిత్యం ప్రమాదపుటంచున పని చేస్తున్న తమ శాఖ ఉద్యోగులను చిన్నచూపు చూస్తోందన్నారు. విద్యుత్శాఖలో ఖాళీ అయిన పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థల్లో పనిచేసే అన్స్కిల్డ్ కార్మికులకు రూ. 2,500 పెంచిన ప్రభుత్వం, తమ శాఖలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులకు రూ. 3,500 లను పెంచి కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలన్నారు. సంఘ రాష్ట్ర సలహాదారుడు ఎస్.శోభనాద్రి, రాష్ట్ర, జిల్లా ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొన్నారు. -
విద్యుత్ శాఖలో బదిలీల రాజకీయం
- వర్గాలుగా విడిపోయిన ‘ఈపీడీసీఎల్’ ఉద్యోగులు - నిబంధనలు మార్చిన సీఎండీ ముత్యాలరాజు - హైదరాబాద్కు పంచాయతీ సాక్షి,విశాఖపట్నం: ఈపీడీసీఎల్ ఉద్యోగుల బదిలీల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. యూనియన్లు ఒకరిపై మరొకరు రాజకీయాలు చేసుకుంటున్నారు. బదిలీల నిబంధనల్లో సంస్థ సీఎండీ ఆర్.ముత్యాలరాజు చేసిన మార్పులు భారీ వివాదానికి దారితీశాయి. హైదరాబాద్ వెళ్లి తన నిర్ణయాన్ని ఉన్నతాధికారులకు ముత్యాలరాజు స్పష్టం చేసొచ్చారు. ట్రాన్స్కో సీఎండీ కె.విజయానంద్ను పలువురు యూనియన్ నాయకులు కలవడంతో శుక్రవారం కూడా మరోసారి చర్చించాలని నిర్ణయించారు. రాత్రి వరకూ ఎలాంటి మార్పులు జరగలేదు. ఈపీడీసీఎల్పరిధిలో 7800 మంది ఉద్యోగులున్నాయి. నిబంధనల ప్రకారం 3 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వాళ్లు, 5ఏళ్లు ఒకే ప్రాంతంలో ఉన్న వాళ్లను బదిలీ చేయాలి. వీటి ప్రకారం 1500 మందికి సాధారణ బదిలీలు జరిగే అవకాశం ఉంది. ఈనెల 13వ తేదీన ఈపీడీసీఎల్ సీఎండీ ఆర్ ముత్యాలరాజు పలు ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు బదిలీ నిబంధనల్లో కొన్ని మార్పులు చేశారు. దాని ప్రకారం స్టేషన్ సీనియారిటీని ప్రాతిపధికగా తీసుకోవాలనుకున్నారు. విశాఖలో కొన్నేళ్లు పనిచేసి మధ్యలో శ్రీకాకుళం వెళ్లి అక్కడ కొన్నేళ్లు పనిచేసి తిరిగి విశాఖ వచ్చి ఇప్పుడు విశాఖలో పనిచేస్తుంటే ఆ ఉద్యోగి గతంలోనూ పనిచేసిన కాలాన్ని ప్రస్తుత కాలాన్ని కలిపి లెక్కిస్తారు. ఉద్యోగుల్లో విభజన తమలో ఎవరికి కష్టం వచ్చినా ఏక తాటిపైకి వచ్చి యాజమాన్యంతో పోరాడే విద్యుత్ యూనియన్లు బదిలీల నిబంధనలపై అనుకూల వ్యతిరేఖ వర్గాలుగా చీలిపోయాయి. నిబంధనల మార్పు సరికాదని కొందరు ఉద్యోగులు అంటున్నారు. జిల్లా దాటివెళ్లిన ఆరు నెలలకు పాత సర్వీసు పోతుందని, ఎక్కడ పనిచేస్తుంటే అక్కడి సర్వీసు మొదలవుతుందని ఈ లెక్కన పాత సర్వీసును ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సీఎండీ నిర్ణయమే సరైనదని, దానివల్ల గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లోనే ఎన్నో ఏళ్లుగా ఉండిపోతున్న వారికి నగరాలు, పట్టణ ప్రాంతాల్లో పనిచేసే అవకాశం వస్తుందని మరికొంతమంది ఉద్యోగులు చెబుతున్నారు. 5 ఏళ్లు ఒకే ప్రాంతంలో పనిచేసిన వారు 360 మంది ఉన్నట్లుగా గుర్తించారు. వీరిలో ఎక్కువ సంవత్సరాలు సర్వీసు ఒకే చోట ఎవరికి ఉందో చూస్తారు. ఉద్యోగుల్లో 20 శాతం మందిని లెక్కించి వారిలో ఎక్కువ సర్వీసు ఉన్నవారిని బదిలీ చేస్తారు. అందులోనూ యూనియన్ నాయకులకు మినహాయింపు ఇచ్చారు. మరి కొందరికి, ముఖ్యంగా విశాఖ సిటీలో పనిచేస్తున్న వారిని కూడా ఈ నిబంధన నుంచి తప్పించాలని యూనియన్లు కోరుతున్నాయి. -
రైతన్నల ఉసురు తీస్తున్న కరెంట్
- విద్యుత్ శాఖ తప్పిదాల ఫలితం.. - రెండు నెలల్లో ముగ్గురు రైతుల బలి - తాజాగా మిన్పూర్ గిరిజన తండాలో ఘటన పుల్కల్ : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం గడచిన రెండు నెలల కాలంలో ముగ్గురు అన్నదాతలను పొట్టునపెట్టుకుంది. మండలంలో వరుసగా విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకుంటున్న ఆ శాఖ అధికారులు ఎలాంటి నివారణ చర్యలు తీసుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. అన్నదాతల మృతికి పరోక్షంగా అధికారుల వైఫల్యాలే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇం దుకు తాజాగా ఆదివారం ఉదయం మిన్పూర్ గిరిజన తండాలో మరో ఘటన చోటు చేసుకుంది. తండాకు చెందిన రామవత్ శ్రావణ్ (50) తనకున్న మూడెకరా ల్లో పొద్దుతిరుగుడు పంటలను సాగు చేశాడు. అయితే ఇటీవల కాలంలో లో ఓల్టేజీ కారణంగా పంటకు నీటిని అందించలేకపోయాడు. దీంతో పంట ఎండిపోతుండడంతో ఆవేదనకు గురయ్యాడు. తెల్లవారు జామున వచ్చే కరెంట్తో పంటకు నీటిని అందించాలనుకున్నాడు. అనుకున్నదే తడువుగా ఆదివారం తెల్లవారుజామున పొలానికి వెళ్లాడు. అయితే వ్యవసాయ బో ర్లకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా అవడంతో బోర్ మో టార్ వేసిన స్టార్ట కాలేదు. దీంతో పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి బోర్లకు వెళ్లే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తే తన బోరు నడుస్తుందని భావించి ఆఫ్ చేసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.. అదేవిధంగా గతనెలలో ఇసోజిపేటకు చెందిన వడ్ల ఈశ్వరయ్య బోరు మోటార్ను ఆన్ చేసేందుకు వెళ్తుం డగా తెగిపడిన విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడకక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన జరిగిన రెండు రోజులకే మండల పరిధిలోని సుల్తాన్పూర్లో రైతు బ్యాగరి జానయ్య విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడ్డాడు. ఇలా నెల, రెండు నెలల కాలంలోనే ముగ్గురు రైతులు మృత్యువాత పడడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై వివరణ కోరేందుకు ట్రాన్స్కో డీఈని ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదు. లైన్మెన్లకు సహాయకులు : విద్యుత్ శాఖలో పనిచేస్తున్న లైన్మెన్లకు సహాయకులను నియమించుకుని వారితోనే పనులు చేయిస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా గతంలో మండల కేంద్రమైన పుల్కల్లో ఒకరి ఇంటికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో లైన్మన్కు సమాచారం ఇచ్చాడు. అందుకు తన సహాయకుడు రాంరెడ్డిని పంపాడు. అయితే విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన కోపిల చంద్రయ్య సైతం బోర్ మోటార్కు విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు వెళ్లి శాశ్వతంగా వికలాం గుడిగా మారడంతో ఆయన కుటుంబం రోడ్డున పడిం ది. ఇలా సంఘటనలు తరచుగా జరుగుతున్న విద్యుత్ శాఖ అధికారులు తమ నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. -
వేసవిలో రోజంతా విద్యుత్ సరఫరా
వ్యవసాయ కనెక్షన్లకు ఏడు గంటలు రెండువేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు సిద్ధం ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్వై దొర విజయవాడ : సదరన్ పవర్ డిస్కం పరిధిలోని 8 జిల్లాలకు ఈ వేసవిలో 24 గంటలు విద్యుత్ సరఫరా ఇవ్వటానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్వై దొర చెప్పారు. శుక్రవారం విజయవాడలోని ఎస్ఈ కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో ఆయన సమావేశమై క్షేత్రస్థాయిలో అమలవుతున్న ఆర్ఏపీడీఏఆర్పీ పథకం తీరుతెన్నులపై సమీక్షించారు. అనంతరం సాక్షితో మాట్లాడారు. ఈ వేసవిలో వ్యవసాయానికి 7 గంటలు, పరిశ్రమలతోపాటు గ్రామీణ ప్రాంతాలకు 24 గంటలు విద్యుత్ సరఫరా ఇస్తామని చెప్పారు. దీనిలో భాగంగా రూరల్ ప్రాంతంలో ఒక ఫేజ్పై 17 గంటలు , మిగిలిన ఏడు గంటలు రెండు ఫేజ్ల ద్వారా అందిస్తామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకి 4100 మెగావాట్ల డిమాండ్ ఉందని, మే నెల నాటికి ఇది 4700 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేసి ఆ మేరకు విద్యుత్ సరపరా చేయటానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు. షార్ట్టైం పవర్ పేరుతో 2 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేయడానికి ఆయా ఏజెన్సీలతో ఒప్పందాలు చేసుకున్నామని చెప్పారు. కృష్ణపట్నం పోర్టులోని రెండు యూనిట్లలో కొద్ది రోజుల్లో విద్యుదుత్పత్తి మొదలవుతుందన్నారు. రాష్ట్రంలో సోలార్ సబ్స్టేషన్ల ద్వారా 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుందని, సీజన్లో విండ్పవర్ ద్వారా 700 మెగావాట్లు ఉత్పత్తి అవుతుందన్నారు. 8 జిల్లాల్లో 4 వేల సోలార్ పంపుసెట్లు పంపిణీ చేయనున్నామన్నారు. రూ.5 లక్షల విలువ చేసే పంపుసెట్లను రూ.55 వేలకే రైతుకు అందించనున్నామని, ఇందులో డిస్కం సగానికి పైగా రాయితీ భరిస్తుందన్నారు. రాష్ట్రంలో 2016 మార్చి నాటికి ఎల్ఈడీ బల్బుల పంపిణీ పూర్తి చేస్తామన్నారు. ఇప్పటివరకు గుంటూరులో 18 లక్షలు, అనంతపురంలో 12 లక్షల బల్బుల పంపిణీ పూర్తయిందన్నారు. ఈ నెల 20 లోగా ఆర్ఏపీడీఏఆర్పీ పథకం అమలుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేస్తామని పేర్కొన్నారు. -
సమ్మెబాట
గుంటూరు సిటీ : అందరికీ వెలుగులు పంచే వారి జీవితాల్లో మాత్రం చీకట్లు తొలగిపోవడం లేదు. రోజంతా కష్టపడినా బతుకులు మారడం లేదు. సెలవులు లేకుండా పనిచేస్తున్నా ఉద్యోగ భరోసా లేదు. అందుకే వారంతా సమ్మెకు సమాయత్తమవుతున్నారు. మంగళవారం తిరుపతిలో జరగనున్న రాష్ట్రసదస్సులో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. విద్యుత్శాఖలో టెక్నికల్, నాన్ టెక్నికల్ కలిపి మొత్తం 70 రకాల విభాగాలు ఉన్నారుు. నవ్యాంధ్రప్రదేశ్లో అన్ని విభాగాల్లో కలిపి రమారమి 18 వేల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే రెండు వేల మంది వరకు కాంట్రాక్ట్ పద్ధతిన విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ఒక పండగనీ, పబ్బమనీ అధికారికంగా ఒక్క సెలవు కూడా మంజూరు కాదు. పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా దక్కేది అంతంత మాత్రం వేతనమే. పెపైచ్చు తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి ఉద్యోగం. అయినా, ఏనాటికైనా పర్మనెంట్ కాకపోతుందా అన్న ఆశతో ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు గత హయాంలో ఈ ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిన నియూమకాలు చేపట్టి వారి హక్కులను హరించారు. గతంలో ప్రభుత్వ, కార్మిక యజమానుల ప్రతినిధులతో కాంట్రాక్ట్ లేబర్ అడ్వయిజరీ పేరిట ఒక బోర్డు ఉంది. కాంట్రాక్ట్ కార్మికుల చట్టం అమలు కాకపోతే కార్మికులు అప్పట్లో దానికి ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు ఉండేది. అయితే ఇప్పుడా అవకాశం లేకుండా చేశారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి దీనిపై దీనిపై ప్రత్యేకంగా జీవో నంబర్ 649 జారీ చేసి మళ్లీ కాంట్రాక్టు కార్మికుల్లో కొత్త ఆశలు చిగురింపజేశారు. ఆయన హఠాన్మరణంతో మళ్లీ సమస్య మొదటికొచ్చింది. ఎన్నికల్లో కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరిస్తానని చంద్రబాబు హామీఇచ్చినా అది నేరవేరలేదు. దీంతో వారు సమ్మె బాట పట్టేందుకు సమాయత్తమవుతున్నారు. సమ్మె తప్పదు.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని కోరుతూ ఇప్పటికే పలు రూపాల్లో దశలవారీ ఆందోళనలు నిర్వహించాం. పాలకులకు మహాజరులు సమర్పించుకున్నాం. ప్రజాప్రతినిధులను వేడుకున్నాం. అయినా గడచిన 18 సంవత్సరాలుగా ఈ సమస్య సజీవంగానే ఉంది. విసిగెత్తిపోయూం. ఇక ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని భావించాం. అందులో భాగంగానే ప్రభుత్వానికి ఇప్పటికే సమ్మె నోటీసు కూడా ఇచ్చాం. డిసెంబర్ 15లోగా దీనిపై సముచిత నిర్ణయం తీసుకోవాలని కోరాం. డిసెంబర్ 2న తిరుపతిలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నాం. 15లోగా ప్రభుత్వం స్పందించకుంటే సమ్మె తప్పదు. - సీహెచ్.నాగబ్రహ్మాచారి, యునెటైడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. -
విద్యుత్ శాఖలో హుదూ‘దుమారం’ !
విజయనగరం మున్సిపాలిటీ: హుద్హుద్ తుపాను కారణంగా విద్యుత్ శాఖకు భారీ మొత్తంలో నష్టం వాటిల్లింది. అత్యవసర సేవల్లో ప్రధానమైన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంలో అధికారులు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఎంత మొత్తంలోనైనా ఖర్చు చేసేందుకు వెనకాడలేదు. సాధ్యమైనంత త్వరగా సరఫరాను పునరుద్ధరించాలనే ఉద్ధేశ్యంతో పనులు చేపట్టారు. ఇదే అదునుగా తీసుకున్న పలువురు అధికారులు నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. పనులు ముగిసిన అనంతరం అధికారులు చెబుతున్న లెక్కలు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్మేలా ఉన్నాయి. విద్యుత్ పునరుద్ధరణకు రూ 10.59 కోట్లు ఖర్చు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు గత నెల రోజుల్లో మొత్తం రూ.10.59 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు తేల్చారు. సబ్స్టేషన్ల వారీగా కేటాయించిన నోడల్ అధికారులు, ఏఈల చేతుల మీదుగా ఈ మొత్తాన్ని ఖర్చు చేశారు. విద్యుత్ సామాగ్రి మినహాయించి, ఇతర జిల్లాల నుంచి వచ్చిన సిబ్బంది వేతనాలు, పునరుద్ధరణ పనులకు వినియోగించిన వాహనాల అద్దె చెల్లింపు, పనులు చేపట్టిన సిబ్బంది, అధికారుల భోజనాల కోసం ఈ మొత్తాన్ని ఖర్చుచేశారు. పనులు దాదాపు పూర్తికావడంతో ఖర్చుల లెక్కలు తెప్పించేపనిలో పడ్డారు. విశాఖలో ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి వచ్చిన చీఫ్ జనరల్మేనేజర్ పి.ఎస్.కుమార్, అకౌంట్స్ అధికారి శ్రీనివాసరావు, జూనియర్ అకౌంట్స్ అధికారి కాశినాయుడులు మూడు రోజులుగా ఇదే పనిలో ఉన్నారు. శుక్రవారం నాటికి పూర్తి స్థాయిలో లెక్కలు అందించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో లెక్కలు సర్దుబాటు చేసి ఓచర్లు అందించే పనిలో సంబంధిత అధికారులు తలమునకలై ఉన్నారు. వాస్తవమెంత ? అధికారులు చూపుతున్న లెక్కల్లో వాస్తమెంతో అన్న విషయమై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పునరుద్ధరణ పనుల కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సిబ్బందికి మొదటిగా... రూ.400 వేతనంతో పాటు భోజన ఖర్చుగా రూ.100 చెల్లించారు. అయితే ఆ మొత్తం చాలదని సిబ్బంది డిమాండ్చేయడంతో రూ.600 వేతనంలో పాటు భోజనం కోసం మరో రూ.150 చెల్లించినట్లు లెక్కల్లో పేర్కొన్నారు. ఆ మొత్తమూ చాలదని వేతనం పెంచకుంటే వెళ్లిపోతామని బెదిరించడంతో భోజనంతో కలిపి రూ.813 మొత్తం చెల్లించిననట్టు పేర్కొన్నారు. ఇదీ చాలదనడంతో పనుల చివరి దశలో రోజుకు రూ.813 వేతనంతో పాటు అదనంగా భోజనం కోసం రూ. 150 మొత్తాన్ని అందజేశారు. ఇలా ఎప్పటికప్పుడు సిబ్బంది వేతనాలు పెంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిర్ధేశించిన దాని కన్నా రూ. 200 వేతనం తక్కువ ఇస్తున్నారనంటూ పనులు జరగుతున్న సమయంలో పలువురు సిబ్బంది ఆరోపించారు. ఇదే విషయమై అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో వేతనాలు చెల్లింపులపై ప్రత్యేక విచారణ కమిటీని నియమించారు. అయితే ఆ కమిటీ విచారణలో ఏం తేలిందన్న విషయం బయటకు రాలేదు. ఈ విషయంలోనే నోడల్ అధికారుల, ఏఈలు చేతి వాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా వాహనాల అద్దెల చెల్లింపులోనూ అవకతవకలు జరిగినట్టు ఆరోపణలున్నాయి. ఇందులో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తెప్పించిన జేసీబీలకు డ్రైవర్ బేటాతో సహా రూ.9వేలు ఇచ్చినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. అదేవిధంగా విద్యుత్ స్తంభాల పునరుద్ధరణ పనుల్లో భాగంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి తెప్పించిన వాహనాలకు రోజుకు రూ. 8 వేలు ఇవ్వగా.. ఒడిశా రాష్ట్రం నుంచి తెప్పించిన వాహనాలకు రూ. 12 వేల వరకు చెల్లించారు. అయితే ఈ వాహనాలు రోజులో ఎంత మేర పని చేశాయి... ఎంత డీజిల్ ఖర్చయిందన్న విషయాల్లోనూ స్పష్టలేదు.సిబ్బందికి భోజనాలు తరలించేందుకు వినియోగించిన వాహనాలు విషయంలోనూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. అత్యవసర సేవలు కావడంతో ఎటువంటి ముందస్తుప్రణాళికలు లేకుండానే చేపట్టిన పనులకు సంబంధించి కొంతమంది అధికారులు చేతివాటం ప్రదర్శించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యుత్ పునరుద్ధరణ పనులకు ఖర్చు చేసిన రూ. 10.59 కోట్లలో ఎంతమేర నిధులు దుర్వినియోగమయ్యాయి అన్న విషయమై అధికారులు దృష్టి సారించాల్సి ఉంది. -
‘పవర్’ పంచాయితీ
ఇందూరు: పాలకులు, ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామపంచాయతీలకు సంబంధించిన కరెంటు బిల్లుల పంచాయితీ ముదురుతోంది. బిల్లులు కట్టకుంటే గ్రామాలలో విద్యుత్ కనెక్షన్ తొలగిస్తామని నోటీసులు జారీ చేసిన విద్యుత్ శాఖను తప్పుబట్టాలో, లేదా బకాయిలు కట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వాన్ని నిలదీయాలో తెలియక 718 గ్రామాల సర్పంచులు అయోమయంలో పడిపోయారు. విద్యుత్ అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఏ ఒక్క పంచాయతీ పరిధిలో విద్యుత్ కనెక్షన్ తొలగించినా ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. పరిష్కారం లభించకపోతే న్యాయం కోసం కోర్టుకు వెళతామని స్పష్టం చేస్తున్నారు. ఏం జరిగింది ఎప్పటి మాదిరిగా కరెంటు బిల్లుల బకాయిలను ప్రభుత్వమే భరిస్తుందని సర్పంచులు భావించారు. కానీ, ప్రభుత్వం బిల్లుల విషయాన్ని పట్టించుకోకపోవడంతో జిల్లాలో రూ.117 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. చాలా రోజులు వేచి చూసిన విద్యుత్ అధికారులు, వెంటనే బకాయిలు చెల్లించాలని, లేదంటే కనెక్షన్లు తొ లగిస్తామని 718 పంచాయతీల సర్పంచులకు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం కొన్ని గ్రామాలలో కనెక్షన్లు తొలగిస్తున్నారు కూడా. మీటర్ రీడింగ్ ప్రకారం కాకుండా అడ్డగోలుగా బిల్లులు వేశారని, విద్యుత్ చౌర్యం బిల్లులు కూడా అందులో కలిపారని సర్పంచులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ చౌర్యాన్ని అరికట్టాల్సిన అధికారులు తమను తాము తప్పించుకోవడానికి పంచాయతీలపై భారం మోపడం సరికాదని విమర్శిస్తున్నారు. ఇపుడు ఏకంగా కనెక్షన్లు తొలగిస్తే, గ్రామాలు అంధకారంలో మునిగిపోతా యని, మంచినీటి పథకాలకు ఆటంకం కలుగుతుందని చెబుతున్నారు. ఆదాయం లేదు... ఆసరా లేదు జిల్లాలో 718 పంచాయతీలున్నాయి. ఇందులో 74 మేజర్, 644 మైనర్ పంచాయతీలు. మేజర్ పంచాయతీలు రూ.53 కోట్లు, మైనర్ పంచాయతీలు రూ.63.88 కోట్లు బకాయి పడినట్లుగా విద్యుత్ అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. గత ప్రభుత్వాలు పంచాయతీలకు సంబంధించిన కరెంట్ బకాయిలు చెల్లించేది. రెండు సంవత్సరాలుగా కట్టకపోవడంతో ఆ భారం పంచాయతీలపై పడింది. ఆ మధ్య మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించిన బకాయిలు తామే చెల్లిస్తామని, మైనర్ పంచాయతీలు వారే కట్టుకోవాల్సి ఉంటుందని చెప్పారు. కానీ, ఆధికారికంగా ఆదేశాలు ఇవ్వలేదు. రోజులు గడిచిన కొద్దీ బకాయిలు పెరుగుతూనే ఉన్నాయి. గతంలో ఓసారి బిల్లు లు చెల్లించకపోతే కనెక్షన్ కట్ చేస్తామని విద్యుత్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రుల సాయంతో విద్యుత్ అధికారులకు నచ్చజెప్పారు. ప్రస్తుతం విద్యుత్ అధికారులు ఎవరి మాటా వినడం లేదు. ఫలితంగా పంచాయతీలకు బకాయిల సమస్య తీవ్రమైంది. పంచాయతీల నుంచైన చెల్లిద్దామంటే అంతగా ఆదా యం లేదు. వచ్చిన నిధులు, పన్నులు కార్మికుల జీతాలు, పంచాయతీ నిర్వహణ, ఇతర ఖర్చులకే సరిపోతున్నాయి. నేడు కలెక్టర్ చెంతకు పంచాయితీ బకాయిలు చెల్లించాలని విద్యుత్ అధికారులు ఒత్తిడి తేవడం, ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సోమవారం కలెక్టర్ రోనాల్డ్ రోస్ను కలవాలని నిర్ణయించుకున్నామని జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గోర్త రాజేందర్ ‘సాక్షి’కి తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీఓ నం 80ని ఆయన దృష్టికి తెస్తామన్నారు. అందులో పేర్కొ న్న విధంగా బకాయిలను సర్కారు చెల్లించే విధంగా చూడాలని కోరతామన్నారు. -
నువ్వు సీఎం స్థాయి మనిషివి!
నర్సాపూర్ మండల సమావేశంలో విద్యుత్ ఏఈపై ఎమ్మెల్యే మదన్రెడ్డి ఆగ్రహం నర్సాపూర్: నర్సాపూర్ విద్యుత్ శాఖ ఏఈ ఆదినారాయణరావుపై బుధవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ అధ్యక్షుడు శ్రీనివాసుగుప్తా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విద్యుత్ శాఖపై చర్చ జరుగుతున్న సమయంలో ఏఈ ఆదినారాయణరావు మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా ఎమ్మెల్యే మదన్రెడ్డి ఏఈని ఉద్దేశించి ‘ నీది ఎమ్మెల్యేల కన్నా చాలా పెద్ద స్థాయి, నీవు సీఎం స్థాయి మనిషివి, నీవు ఎవరికి అందుబాటులో ఉండవు, నీవు ఎక్కడుంటావో మాకే తెలియదు, నీకు ప్రజల సమస్యలు పట్టవని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయానికి ఆరు గంటల కరెంటు సరఫరా చేయాలని ఎమ్మెల్యే మదన్రెడ్డి విద్యుత్ శాఖ డీఈ కృష్ణయ్యను ఆదేశించారు. కరెంటు లేక పంటలు ఎండిపోతే మీదే బాధ్యత అంటూ హెచ్చరించారు. కాగా పలువురు సభ్యులు రాజేందర్, సురేష్, మహమ్మద్ షరీఫ్ మాట్లాడుతూ తాము ఏఈని చూడడం ఇదే మొదటిసారన్నారు. మీసేవ కేంద్రాల్లో ఆధార్ కార్డుల కోసం వెళితే ఒక్కో కార్డు కోసం రూ.ఐదువందలు వసూలు చేస్తున్నారని, అధిక మొత్తంలో ఇస్తే వెంటనే ఇస్తున్నారని, లేనిపక్షంలో 15 నుంచి నెల రోజుల గడువు విధిస్తున్నారని సభ్యులు జితేందర్రెడ్డి ఆరోపించగా ఆధారాలతో ఫిర్యాదు చేస్తే మీసేవ కేంద్రాలపై చర్యలు తీసుకుంటానని తహశీల్దార్ పేర్కొన్నారు. నర్సాపూర్ సర్పంచ్ వెంకటరమణారావు మాట్లాడుతూ నర్సాపూర్లో డంప్ యార్డుకు స్థలం చూపాలని కోరగా త్వరలో స్థలం చూపుతామని తహశీల్దార్ చెప్పారు. కాగా బ్యాంకుల్లో రుణాలు ఇస్తలేరని సభ్యులు భరత్గౌడ్, జితేందర్రెడ్డి ఫిర్యాదు చేయగా త్వరలో అందరికీ రుణాలు అందుతాయని తహశీల్దార్ పేర్కొన్నారు. జెడ్పీ చైర్పర్సన్ రాజమణి మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉన్నం దున అందరూ సహకరించాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి మాట్లాడుతూ అందరూ సమైక్యంగా అభివృద్ధికి పాటుపడాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓ లక్ష్మీబాయి, పలువురు అధికారులు పాల్గొని మాట్లాడారు. ఉద్యోగులకు చర్చ పట్టదా...? మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న పలువురు అధికారులు, గ్రామ స్థాయి ఉద్యోగులు సభలో చర్చ జరుగుతండగా మొబైల్ ఫోన్లలో ఆటలాడుతూ కూర్చోవడం గమనార్హం. మూడు నెలలకోసారి జరిగే సభలో ప్రజల సమస్యలపై ఆసక్తి చూపక పోవడం గమనార్హం. -
విద్యుత్ పునరుద్ధరణకు యుద్ధప్రాతిపదికన చర్యలు
‘సాక్షి’తో ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ సాక్షి, హైదరాబాద్: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ శాఖకు అపార నష్టం వాటిల్లిందని ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఆదివారం రాత్రి ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్ సరఫరా చాలా వరకూ నిలిచిపోయిందన్నారు. నష్టాన్ని అంచనా వేసేందుకు క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నామని చెప్పారు. గంటకు 160 కిలో మీటర్ల వేగమైన గాలిని తట్టుకునే స్థాయిలోనే పోల్స్ ఉన్నాయని, ప్రస్తుతం అక్కడ 200 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, దీంతో నష్టం భారీగా ఉందని వెల్లడించారు. ట్రాన్స్, జెన్కో సీఎండీ విజయానంద్ నేతృత్వంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. ఇప్పటికే తమ బృందాలు కొన్ని ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్నాయని, మరికొన్ని రాజమండ్రి సమీపంలో ఉన్నాయని, సోమవారం నాటికి విశాఖకు చేరుకుంటాయని చెప్పారు. ముందుగా విశాఖపట్నంలో విద్యుత్ పునరుద్ధరణకు ప్రయత్నిస్తామని, ఆ తర్వాత జిల్లాల్లో చర్యలు చేపడతామని తెలిపారు. కొన్ని యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తికి కూడా తీవ్ర అంతరాయం ఉందన్నారు. డిమాండ్ తగ్గడం వల్ల ఇది పెద్ద ఇబ్బంది కావడం లేదన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. పోల్స్, ట్రాన్స్ ఫార్మర్లు, ఇన్సులేటర్స్, కండక్టర్ వైర్స్, పవర్ కేబుల్స్ సిద్ధం చేసినట్టు వివరించారు. జిల్లా అధికారులతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఉత్తరాంధ్రలో అనేక చోట్ల రోగులు, పిల్లలు ఇబ్బంది పడుతున్నట్టు జిల్లాల నుంచి ఫిర్యాదులొస్తున్నాయి. -
‘కాంట్రాక్టు’ వ్యవస్థను రద్దుచేయండి
నిజామాబాద్ నాగారం : విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్చేస్తూ శనివారం తెలంగాణ విద్యుత్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు ర్యాలీ, ధర్నా నిర్వహించారు. కాంట్రాక్టు వ్య వస్థను రద్దు చేసి యాజమాన్యమే కార్మికులకు నేరుగా వేతనాలు ఇవ్వాలని కోరారు. స్థానిక ఆర్యనగర్లోని ట్రాన్స్కో కార్యాలయం ఎదుట నిరసన తెలిపి, అక్కడి నుంచి వినాయక్నగర్, పు లాంగ్మీదుగా క లెక్టరేట్ చేరుకున్నారు. అక్కడినుంచి బస్టాండ్, గాంధీచౌక్, ఆర్ఆర్చౌరస్తా నుం చి వర్ని చౌరస్తా మీదుగా ఖిల్లాలోని జిల్లా విద్యుత్కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కాం ట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేస్తామన్న టీఆర్ ఎస్ ప్రభుత్వం మాట మార్చవద్దన్నారు. యాజ మాన్యం సైతం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.సాయిలు మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థను నమ్ముకొని 20 ఏళ్ల నుంచి కష్టాలు అనుభవిస్తూ సంస్థ అభివృద్ధికి పని చేస్తున్నామన్నారు. శ్రమకు తగ్గ ప్రతిఫలం రాకున్నా, ఎప్పటికైనా పర్మినెంట్ అవుతుందని ఆశతో ఎదు రు చూస్తు విధులు నిర్వహిస్తున్నామన్నారు. కార్మికులకు ఇచ్చే వేతనాల్లో కాంట్రాక్టర్లు కార్మికుల నుంచి రూ. వెయ్యి నుంచి రూ. రెండువేల వరకు ముందుగా తీసుకున్న తర్వాతే వేతనాలు బ్యాంకు ఖాతాలలో వేస్తున్నారని ఆరోపించారు. కొంత మంది కాంట్రాక్టర్లు తెగించి ఏటీఎం కార్డులు వారి వద్ద ఉంచుకొని కార్మికులపై దౌర్జన్యం చేస్తున్నారని అన్నారు. కార్మిక శాఖ ఆదేశాల మేరకు 2005 నుంచి ఈఎస్ఐ, ఈపీఎఫ్ కార్మికులకు కట్టాలని ఆదేశాలు ఉన్నా కాంట్రాక్టర్లు పట్టించుకోకుండా జేబుల్లో వేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిగ్గా వేతనాలు ఇవ్వకుండా కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.ముఖ్యంగా కాంట్రాక్టర్లు, అధికారు లు కుమ్మక్కై కార్మికులకు చెల్లించాల్సిన డీఏలను చెల్లించడం లేదన్నారు. కొంతమంది కార్మికులను అకారణంగా తొలగిస్తున్నారని అన్నారు. అన్ని అర్హతలున్నా, పర్మినెంట్ చేస్తామని కార్మికుల నుంచి రూ.లక్షలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారు లు పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులను క్రమద్ధీకరించాలని, లేకుంటే సమ్మెచేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా అధ్యక్షుడు మెట్టు జాషువ, కార్యదర్శి మల్లయ్య, సభ్యులు బీర్రాథోడ్, తిరుపతి, విజయ్, రమేష్, గోపీ, ముస్తాప, సతీష్,సుమారు 600మంది కార్మికులు పాల్గొన్నారు. -
బదిలీల జ్వరం
ఏలూరు : జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయూలకు బదిలీల జ్వరం పట్టుకుంది. ఇప్పటికే సాంఘిక సంక్షేమ, విద్యుత్ శాఖల్లో బదిలీల పర్వం మొదలైంది. పోలీస్ శాఖలో రెండు, మూడు రోజుల్లో బదిలీలు చేపట్టనున్నారు. తొలుత డీఎస్పీలు, ఆ తర్వాత సీఐ, ఎస్సైలకు స్థానభ్రంశం కల్పించేందుకు కసరత్తు సాగుతోంది. ఇతర శాఖల్లోనూ అధికారుల బదిలీలు ఉంటాయనే ప్రచారం సాగుతోం ది. జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయు డు ఇక్కడ విధుల్లో చేరి మూడేళ్లు పూర్తరుున నేపథ్యంలో ఆయన కూడా బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూ వర్గాల భోగట్టా. ఇదిలావుండగా ఆయనకు కలెక్టర్గా పదోన్నతి రావాల్సి ఉంది. ఎటూకాని వేళ ఎలా.. బదిలీలపై ఈ నెలాఖరు వరకు నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో అన్ని శాఖల్లోనూ బదిలీల ప్రక్రియ ఊపందుకుంటోంది. సంవత్సరం మధ్యలో వేరే ప్రాంతానికి బదిలీపై వెళ్లాల్సి వస్తుందన్న ఆవేదనలో అధికారులు ఉన్నారు. అన్ని శాఖల్లోని అధికార పీఠాలను కదపాలని నిర్ణరుుంచిన ప్రభుత్వం ఈ ప్రక్రియ అంతా స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రుల కనుసన్నల్లోనే సాగేలా చూడాలంటూ మౌఖిక ఆదేశాలిచ్చినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకుల సిఫార్సుల కోసం అధికారులు వారిచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇందుకోసం సెలవు పెట్టి మరీ వెళ్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో కొద్దినెలల క్రితం ఇతర జిల్లాల నుంచి ఇక్కడకు వచ్చి కీలక స్థానాల్లో చేరిన అధికారులు సైతం సొంత జిల్లాలకు సమీపంలోని ప్రాంతాలకు బదిలీపై వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నారు. విజయవాడపై కన్ను విజయవాడలో రాజధాని ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించడంతో అక్కడ కీలక కొలువుల్లో చేరేందుకు కొందరు అధికారులు ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకోసం తెరవెనుక ప్రయత్నాలు మొదలుపెట్టారు. కీలక పోస్టులు భర్తీ అయ్యేనా? జిల్లాలో డీఎంహెచ్వో, డెప్యూటీ డీఎంఎహెచ్వో, ఉద్యాన శాఖ ఏడీ-1, ఐటీడీఏ పీవో, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి, జెడ్పీ డెప్యూటీ సీఈవో, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డెరైక్టర్, జిల్లా సహకార అధికారి, మెప్మా ప్రాజెక్ట్ డెరైక్టర్, నాలుగు డివిజన్లలో ఉప విద్యాశాఖాధికారుల పోస్టులతోపాటు బీసీ సంక్షేమాధికారి, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్, ఏలూరు, కాళ్ల ఎంపీడీవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుత బదిలీల్లో ఈ పోస్టులు భర్తీ అవుతాయో లేదో వేచి చూడాల్సిందే. తెలంగాణ అధికారుల సంగతేంటో తెలంగాణకు చెందిన అధికారులు జిల్లాలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్నారు. వీరు ఇక్కడ నుంచి బదిలీ అవుతారా లేక ఇక్కడే కొనసాగుతారా అన్నది ఎటూ తేలలేదు. ప్రస్తుత బదిలీల్లో వారిని ఇక్కడినుంచి కదపకపోరుునా ఉద్యోగుల విభజన తర్వాత అరుునా వారిని బదిలీ చేసే అవకాశాలు లేకపోలేదు. పంచాయతీరాజ్ పీఐయూ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పీఏ వేణుగోపాల్, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ బి.రమణ, సోషల్ వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బి.నాగశేషు, ఎస్సీ కార్పొరేషన్ ఈవో శర్మ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు. -
రూ.48 కోట్లతో పుష్కరాల పనులు
ఏపీఈపీడీసీఎల్ సీఎండీ శేషగిరిబాబు ప్రకాశంనగర్ (రాజమండ్రి) : గోదావరి పుష్కరాల సందర్భంగా విద్యుత్ శాఖలో రూ.48 కోట్లతో పనులు చేస్తున్నట్టు ఏపీఈపీడీసీఎల్ సీఎండీ శేషగిరిబాబు వెల్లడించారు. పుష్కరాల పనులపై తమ శాఖకు చెందిన ఉభయ గోదావరి జిల్లాల అధికారులతో ఆయన రాజమండ్రి ఎస్ఈ కార్యాలయంలో గురువారం సమీక్షించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లాలో రూ.30 కోట్లతో, పశ్చిమగోదావరిలో రూ.18 కోట్లతో పనులు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా తూర్పుగోదావరిలో 5, పశ్చిమ గోదావరిలో 6 కొత్త సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నట్టు తెలిపారు. పుష్కరాలు జరిగే ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా 33 కేవీ లైన్ల ఇంటర్ లింక్, 11 కేవీ, ఎల్టీ లైన్లను పూర్తిగా మారుస్తామన్నారు. పుష్కరాల పనులకు ఇన్చార్జిగా లక్ష్మీనారాయణ (హెచ్ఆర్) వ్యవహరిస్తారన్నారు. ఇద్దరు సీజీఎంలు ఆయనకు సహాయకులుగా ఉంటారని, ఈ ముగ్గురూ ఎప్పటికప్పుడు పనులను సమీక్షిస్తారని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్ఈ గంగాధర్, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్ఈ టీవీ సూర్యప్రకాశ్, డీఈ శ్యామ్బాబు, ఏడీఈ సామ్యూల్ పాల్గొన్నారు. -
‘లైన్’ కలెక్షన్!
శ్రీకాకుళం: చిన్నదైనా, పెద్దదైనా.. ఎంత శ్రమ తో కూడుకున్నదైనా ప్రభుత్వ ఉద్యోగమంటే ఎవరికైనా ఆశే. అందుకోసం ఎన్ని కష్టనష్టాలైనా భరించి.. అప్పో సప్పో చేసి ముడుపులు కట్టేందకు వెనుకాడరు. రాజకీయ పలుకుబడి ఉంటే ఇక తిరుగే లేదు. సరిగ్గా ఈ అంశన్నే అక్రమార్కులు అందిపుచ్చుకున్నారు. రాత్రికి రాత్రి కార్లు వేసుకొని మరీ జిల్లా అంతా తిరిగి వసూ ళ్లు కానిచ్చేశారు. ఇంకొందరు రాజకీయ సిఫారసులతో పని చేయించుకున్నారు. వెరసి ఇటీవల విద్యుత్ శాఖ నిర్వహించిన జూనియర్ లైన్మెన్ నియామక ప్రక్రియ అక్రమాల పుట్టగా మారిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నా యి. తక్కువ మార్కులు వచ్చిన, అర్హత పరీక్ష లో విఫలమైన వారికి ఉద్యోగాలు దక్కడం, అన్ని రకాలుగా అర్హత సాధించినవారికి మొండి చెయ్యి చూపడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చుతున్నాయి. ఇదే నిదర్శనం ఈ ఆరోపణలకు బలం చేకూర్చే ఒక ఉదాహరణను పరిశీలిస్తే.. బీసీ-డి కేటగిరీలో ఎస్కెఎల్జీ 472 నెంబరు కలిగిన అభ్యర్ధి 64.33, ఎస్కెఎల్జీ 485 నెంబరు కలిగిన అభ్యర్ధి 64.55, ఎస్కెఎల్జీ 488 నెంబరు కలిగిన అభ్యర్ధి 64.25 శాతంతో మార్కులతో అర్హత పరీక్షకు హాజరయ్యారు. 472 నెంబర్ అభ్యర్థి స్తంభం ఎక్కడంలోనూ విఫలం కాగా.. 64.55 మార్కులతో ఉన్న అభ్యర్థి పోల్ ఎక్కడంలోనూ, మీటర్ రీడింగ్ తీయడంలోనూ, సైక్లింగ్లోనూ సఫలీకృతులయ్యారు. మార్కులు ఎక్కువ వచ్చి, అన్ని పోటీల్లో విజయం సాధించిన ఇతనికి ఉద్యోగం రాకపోగా అంతకంటే తక్కువ మార్కులు వచ్చిన 472, 488 నెంబర్ల అభ్యర్థులు మాత్రం ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ట్రాన్స్కోలోని ఓ ఉన్నతాధికారి సిఫారసు మేరకే అనర్హులకు ఉద్యోగాలు దక్కాయన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇటువంటి ఉదంతాలు మరిన్ని ఉన్నాయన్న వాదన కూడా విన్పిస్తోంది. కొందరు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల సిఫారసులకు తలొగ్గి అధికారులు కొన్ని అక్రమాలు చేయగా, కొందరు అధికారుల ప్రమేయంతో మరికొన్ని అక్రమ ఎంపికలు జరిగాయన్న విమర్శలు ఉన్నాయి. వీడియో చిత్రీకరణ ద్వారా ఈ పరీక్షలను జరిపినందున వాటిని పరిశీలిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని పలువురు సూచిస్తున్నారు. రాత్రికి రాత్రే వసూళ్లు ఇదిలా ఉంటే ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను అర్ధరాత్రి వేళ విడుదల చేస్తామని అధికారులు చెప్పిన రోజున కొందరు ట్రాన్స్కో ఉద్యోగులు విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడినట్లు తెలిసింది. ఎంపికైన అభ్యర్థుల వివరాలు వీరికి కాస్త ముందుగానే తెలియడంతో రెండు కార్లలో జిల్లా వ్యాప్తంగా తిరిగి ఉదయానికల్లా ఉద్యోగం ఇప్పిస్తామని, అందుకు కొంత ముట్టజెప్పాలని చెప్పడంతో ఉద్యోగం వస్తుందన్న ఆశతో పలువురు అభ్యర్థులు పెద్ద మొత్తాల్లోనే చెల్లించినట్టు భోగట్టా. ఉదయం విడుదలైన జాబితాలో తమ పేర్లు ఉండడంతో తమ నుంచి డబ్బు తీసుకున్న వారి వల్లే ఉద్యోగం వచ్చిందని పలువురు అభ్యర్థులు ఆనందపడిపోయారు. వాస్తవానికి జరిగింది వేరని వారికి తెలియదు. కాగా ముందుగానే జాబితాలోని పేర్లు లీక్ చేయడం వెనుక కొందరు అధికారుల హస్తం ఉండి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పారదర్శకంగా ఎంపికలు జరుగుతాయని అధికారులు, ప్రజాప్రతినిధులు పదేపదే చెప్పినా అక్రమాలు జరగడంపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి లోతుగా దర్యాప్తు జరిపిస్తే వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంది. వివరాలు ఇస్తే పరిశీలిస్తాం:ఎస్ఈ ఈ విషయాన్ని ట్రాన్స్కో ఎస్ఈ సత్యనారాయణ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా తక్కువ మార్కులు వచ్చిన వారికి, అర్హత పరీక్షల్లో విఫలమైన వారికి ఉద్యోగం వచ్చే అవకాశం లేదంటూనే, వివరాలు తనకిస్తే పరిశీలిస్తానన్నారు. జాబితా విడుదలైన ముందు రోజున వసూళ్లు జరిగినట్టు తన దృష్టికి రాలేదన్నారు. ఎవరైనా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపిస్తామని తెలిపారు. ఎంపికైన వారి పేర్లు ముందుగా తెలిసే అవకాశమే లేదని వేకువజామున తానే ఆన్లైన్లో పొందుపరిచానని పేర్కొన్నారు. -
ట్రాన్స్కోకు బకాయిల షాక్
నల్లగొండ : జిల్లా విద్యుత్ శాఖకు బకాయిల షాక్ తగులుతోంది. ప్రతినెలా సుమారుగా రూ.43 కోట్ల విద్యుత్చార్జీలు వసూలు చేయాల్సి ఉండగా కేవలం 37 కోట్ల రూపాయలు మాత్రమే వసూలవుతున్నాయి. దీంతో ప్రతినెలా బకాయిల జాబితాలోకి ఆరు కోట్ల రూపాయలు చేరుతున్నాయి. జిల్లాలో అన్ని రకాల విద్యుత్ కనెక్షన్లు 11,70,414 ఉండగా వాటికి సంబంధించి ఇప్పటివరకు 238.15 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. వీటిని వసూలు చేయడం.. అధికారులకు తలకు మించిన భారమైంది. వసూలుకు ప్రత్యేక చర్యలేవీ? విద్యుత్ బకాయిల వసూళ్లకు విద్యుత్శాఖ అధికారులు ఎలాంటి ప్రత్యేక చర్యలూ చేపట్టడం లేదు. గృహ అవసరాలకు సంబంధించిన వాటితోపాటు పరిశ్రమలు, కమర్షియల్ భవనాలకు కూడా విద్యుత్ బిల్లుల బకాయిలు భారీగా ఉన్నా అధికారులు మాత్రం వసూలు చేయలేకపోతున్నారు. స్పెషల్ డ్రైవ్ చేపడితే తప్ప బిల్లులు వసూలు చేసే పరిస్థితి లేదు. బకాయి బిల్లులు మొత్తం చెల్లించాల్సిందే : బాలస్వామి, ట్రాన్స్కో ఎస్ఈ, నల్లగొండ విద్యుత్ చార్జీల బకాయిలు ఉన్న వారంతా పూర్తిస్థాయిలో చెల్లించాల్సిందే. బకాయిలు ఎక్కువగా ఉన్న వారిపై దృష్టి పెడతాం. పూర్తిస్థాయిలో వసూలు చేస్తాం. -
కడగండ్లు
సాక్షి, ఏలూరు:వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. భూమిపై ఉపరి తల అవర్తనం.. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్న నేపథ్యంలో జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు అక్కడక్కడా ఇళ్లు నేలకొరిగాయి. శివారు పల్లెలు, లంక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఆకివీడులో వెంకయ్య వయ్యేరు కాలువకు రెండుచోట్ల గండ్లు పడ్డాయి. దీంతో 6 వేల ఎకరాల్లో వరినాట్లు, నారుమడులు నీటమునిగాయి. కాలువలు, డ్రెయిన్లు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు కాలనీలు, కార్యాలయాల్లోకి వర్షం నీరు చేరింది. గడచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా 95.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. బియ్యం, కిరోసిన్ను సిద్ధంగా ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు. విద్యుత్ శాఖ ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్లు ఏర్పా టు చేసింది. ఆచంట మండలంలో కూలిన 10 విద్యుత్ స్తంభాలను తిరిగి నిలబెట్టారు. ఆదివారం ఆరు గ్రామాలకు నిలిచిన విద్యుత్ సరఫరాను సోమవారం ఉదయం పునరుద్ధరించారు. ఏలూరులోని పవర్పేట, శ్రీనివాస థియేటర్ రోడ్డు, చాటపర్రు చంద్రబాబునాయుడు కాలనీలో భారీగా వర్షం నీరు నిలిచిపోయింది. దేవరపల్లిలో దళితవాడ, స్టేట్బ్యాంక్ కాలనీ ముంపునకు గురయ్యాయి. దాదాపు 100 కుటుంబాల వారు ముంపుబారిన పడ్డారు. ప్రధాన రహదారిపై భారీగా వర్షం నీరు ప్రవహించడంతో కార్లు కొట్టుకుపోయూయి. గంటలకొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది. డ్రెయిన్ ఏర్పాటుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. భీమవరంలో ఉదయం నుంచీ వర్షం కురుస్తూనే ఉంది. ఆక్సిజన్ లోపం తలెత్తి రొయ్యలు మృత్యువాత పడే ప్రమా దం ఏర్పడింది. ద్వారకాతిరుమలలో ప్రహరీ గోడ కూలింది. రెడ్డికోపల్లి దగ్గర కొవ్వాడ కాలువ, ముదునూరు సమీపంలో ఆరిసెల కాలువ, పద్మవారిగూడెంలోని అల్లికాలువ పొంగుతున్నాయి. పోలవరం మండలం కొత్తూరులో లో-లెవెల్ కాలువ నీరు రోడ్డెక్కి ప్రవహిస్తుండటంతో 25 గ్రామాలకు రాకపోకలు స్తంభించా యి. చాగల్లు మండలం ఊనగట్ల బీసీ కాలనీ, ఊనగట్ల-చిక్కాల మధ్య, కల వలపల్లి ఎస్సీ కాలనీ, గరప్పాడులో వర్షం నీరు చేరింది. నిడదవోలు-ఐ.పంగిడి రహదారి మీదుగా నీరు ప్రవహించింది. లోతట్టు ప్రాంతాలకు తహసిల్దార్లు వెళ్లి పరిశీలించారు. కొవ్వూరులో కోర్టు ప్రాంగణం ముని గిపోయింది. తాళ్లపూడి మండలం పైడిమెట్ట, అన్నదేవరపేట, గజ్జరం, తిరుగుడుమెట్ట, పెద్దేవం, వేగేశ్వరపురం గ్రామాల్లో వరిచేలు ముంపుబారిన పడ్డాయి. కొవ్వూరు-దొమ్మేరు మధ్య కుమారదేవం, నందమూరు ప్రాంతాల్లో పొలాలు మునిగాయి. ఇందిరమ్మ కాలనీ ముంపునకు గురైంది. నరసాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శ్లాబ్ నుంచి వర్షం నీరు కారడంతో ఉద్యోగులు గొడుగులు వేసుకుని మరీ రిజిస్ట్రేషన్లు చేశా రు. మునిసిపల్ కార్యాలయం రోడ్డులో భారీగా నీరు చేరింది. నారుమళ్లు నీట మునిగాయి. గొంతేరు, నక్కల, భగ్గేశ్వరం, కాజ డ్రెయిన్లు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉండిలో నారుమళ్లు మునిగాయి. ఉంగుటూరు మండలం కైకరం, నాచుగుంట, నారాయణపురం, సీతారాం పురం, తల్లాపురం, యల్లమిలి, బాదంపూడిలో వరిచేలు నీటమునిగాయి. తోకలపల్లి డ్రెయిన్ పొంగిపొర్లుతోంది. నిడదవోలులో ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. పెరవలి మం డలం లోతట్టు ప్రాంతాల్లో చేరింది. నిడదవోలు-తిమ్మరాజుపాలెం మధ్య ఆర్అండ్బీ రహదారిపైకి నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. తణుకులో ఇరగవరం కాలనీ, పైడిపర్రు ప్రాంతాల్లో నీరుచేరింది. పంట చేలు నీట మునిగాయి. కిరోసిన్ సిద్ధం ముంపుబారిన పడే అవకాశం ఉన్న 9 మండలాల్లోని 56 గ్రామాలకు 1,004 టన్నుల బియ్యంతోపాటు అమ్మహస్తం సరుకులు మూడు నెలలకు అడ్వా న్స్ కోటా ఇచ్చామని, 40 వేల లీటర్ల కిరోసిన్ అందుబాటులోనే ఉందని జిల్లా పౌర సరఫరాల అధికారి డి.శివశంకరరెడ్డి తెలిపారు. అవసరమైతే వెంటనే సహాయక చర్యలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అల్పపీడనం నేపథ్యంలో ఈపీడీసీఎల్ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. తుపాను సమయంలో సహాయం కోసం జిల్లా కార్యాలయంతోపాటు అన్ని డివిజన్ కార్యాలయూల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్టు ఏలూరు ఆపరేషన్ సర్కిల్ పర్యవేక్షక ఇంజినీర్ టీవీ సూర్యప్రకాష్ తెలిపారు. విద్యుత్ వైర్లు తెగిపడినా, స్తంభాలు పడిపోయినా వాటి సమీపానికి వెళ్లకుండా విద్యుత్ సబ్స్టేషన్కు లేదా కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి తెలియజేయూలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
కనెక్షన్..కరెప్షన్!
కర్నూలు(రాజ్విహార్): విద్యుత్ శాఖలో అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఏపీ ఎస్పీడీసీఎల్లో ప్రతి పనికీ ఓ రేటు కట్టి వినియోగదారుల నుంచి దండుకుంటున్నారు. ఈ శాఖలో పనిచేసే సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగుల కంటే రెట్టింపు వేతనాలు అందుతాయి. అయితే కొందరి దృష్టి మామూళ్లపై పడింది. అసలు కంటే వడ్డీపైనే ప్రేమ ఎక్కువ అన్న చందంగా కొందరు విద్యుత్ ఉద్యోగులకు జీతం ఎంత ఉన్న అక్రమార్జనే ధ్యేయంగా విధులు నిర్వహిస్తున్నారు. మొన్న నందవరంలో, నిన్న మిడ్తూరులో ఏఈలు ఏసీబీ వలలో చిక్కుకోగా, బుధవారం లైన్ ఇన్స్పెక్టర్పై సస్పెషన్ వేటు పడిన విషయం విధితమే. కరెంటు కనెక్షన్, మీటరు బిగించడం, స్తంభం, తీగలు మార్చడం, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు, పేరు, అడ్రస్ మార్పించడం, ఎస్టిమేట్ల వేయడం ఇలా పని ఏదైనా సిబ్బందికి మామూళ్లు ఇవ్వాల్సిందే. అడిగినంత ముట్టజెప్పితేనే ఫైల్ త్వరగా కదులుతుంది. లేదంటే నెలల తరబడి తిరిగినా అడ్డమైన నిబంధనలు, అభ్యంతరాల పేరుతో కాలయాపన చేస్తారు. మామూళ్లకు అలవాటు పడ్డ కొందరు కిందిస్థాయి ఉద్యోగుల నుంచి ఇంజనీర్ల వరకు ఇదే తంతు కొనసాగుతోంది. దీనిపై ఉన్నతాధికారులు, యూనియన్ నాయకులు అక్షింతలు వేస్తున్నా అక్రమార్కుల తీరు మారడం లేదు. దరఖాస్తు చేసుకునే సమయం నుంచే మామూళ్ల ప్రక్రియ ప్రారంభం అవుతోందని వినియోగదారులు వాపోతున్నారు. ఈక్రమంలో కొందరు ఏసీబీ వలలో చిక్కి జైలు జీవితం అనుభవించిన సందర్భాలున్నాయి. పనిని బట్టి రేటు: విద్యుత్ శాఖలో ప్రతి పనికీ ఓ రేటుంది. సంస్థ నిర్ణిత మొత్తాన్ని డీడీ రూపంలో చెల్లించినా.. పని పూర్తి కావాలంటే అడిగినంత ఇచ్చుకోవాల్సిందే. ఇంటి కనెక్షన్కు రూ.వెయ్యి, త్రీఫేస్ మీటర్ బిగించేందుకు రూ.2వేలు (ఇందులో కొందరు ఏఈతో పాటు ఏడీఈకి వాటా ఉంటుందని సమాచారం), వ్యవసాయ కనెక్షన్ రూ.10 వేల వరకు, అదనపు విద్యుత్ స్ధంబాల ఏర్పాటుకు రూ.25 వేల వరకు, ట్రాన్స్ఫార్మర్కు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు (రైతుల సంఖ్య, అవసరాలను బట్టి) వసూలు చేస్తారు. పట్టణాల్లో నిర్మించే అపార్ట్మెంట్ కనెక్షన్లకు ఏఈకి రూ.5వేల నుంచి రూ.10వేలు, ఏడీఈకి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు, డీఈ కార్యాలయల్లో వర్క్ ఆర్డర్లు, ఎస్టిమేట్లు పొందేందుకు రూ.5 వేలు, ఎస్ఈ కార్యాలయంలో కొందరికి అడిగినంత ఇచ్చుకోవాలి. పరిశ్రమల కనెక్షన్ పొందాలంటే రూ. 20 వేల వరకు ఇచ్చుకోవాలి. వ్యాపార దుకాణం కనెక్షన్ రూ.3 వేలు, విద్యుత్ స్తంభం మార్చేందుకు రూ.5వేలు, మీటర్ మార్చేందుకు రూ.2వేల వరకు మమూళ్లు వసూలు చేస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. కొన్ని సంఘటనలు కర్నూలు సెంట్రల్ సెక్షన్లో పనిచేస్తున్న లైన్ ఇన్స్పెక్టర్ రంగస్వామి మీటర్ బిగించేందుకు మామూళ్లు అడిగి, వినియోగదారుడి ఫిర్యాదు మేరకు ఈనెల 18వ తేదిన సస్పెన్షన్కు గురయ్యారు. ఈయన గతంలో జిల్లా పరిషత్ వద్ద ఉన్న షాపులకు నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేసేందుకు రూ. 5 వేలు లంచం తీసుకున్నట్లు విజిలెన్స్ అధికారుల విచారణలో తేలడంతో రెండు ఇంక్రిమెంట్లు కోత పెట్టారు. అప్పట్లో ఓ పోల్టూపోల్ వర్కర్ను సర్వీసు నుంచి తొలగించారు. కర్నూలు మండలం గొందిపర్ల లైన్మెన్ అబ్దుల్లా విద్యుత్ కనెక్షన్ కోసం రూ.23,500 పుచ్చుకున్నట్లు ఫిర్యాదు చేయడంతో ఏడీఈ విజయసారధి విచారణ జరిపారు. ఇంటి నిర్మాణానికి అడ్డుగా ఉన్న విద్యుత్ తీగలను తొలగించేందుకు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి నుంచి రూ.8 వేల లంచం తీసుకుంటూ మే 28వ తేదిన మిడుతూరు ఏఈ శ్రీనివాసుల నాయుడు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. మార్చిలో నందవరం ఏఈ గురునాథ్ రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. గతేడాది దేవనకొండ సెక్షన్లో వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ కోసం రూ. 50వేలు, వ్యవసాయ కనెక్షన్ కోసం 16 వేలు మామూళ్లు లైన్మెన్, ఏఈకి అందించామని కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన రైతులు విద్యుత్ వినియోగదారుల ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు చేశారు. కృష్ణగిరి మండలానికి చెందిన మాధవస్వామి అనే రైతు ట్రాన్స్పార్మర్ కోసం అధికారులకు రూ.60 వేలు అదనంగా చెల్లించానని, అయినా పనులు పూర్తి చేయలేదని కోర్టులో ఫిర్యాదు చేశారు. 2012 డిసెంబరు 31న బనగానపల్లె ఏడీఈ, మార్చిలో డోన్ డీఈ లంచం తీసుకొని ఏసీబీ అధికారులకు పట్టుపడ్డాడు. రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు: టి. బసయ్య, ఎస్ఈ, కర్నూలు పనుల చేసేందుకు మామూళ్ల అడిగి వేధించే సిబ్బందిపై రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. విద్యుత్ కనెక్షన్తోపాటు ఇరత పనుల కోసం నిర్ణిత మొత్తన్ని డీడీ రూపంలో చెల్లించాలి. కిందిస్థాయి సిబ్బంది, అధికారులు అదనంగా అడిగితే ఇవ్వాల్సిన అవసరం లేదు. సబ్ డివిజన్ కేంద్రలోని కస్టమర్ సర్వీసు సెంటర్లో (సీఎస్సీ)లో సంప్రదించి సిటిజన్ చార్ట్ ప్రకారం సేవలు పొందవచ్చు. లైన్మెన్, ఏఈ, ఏడీఈల సంతకాల కోసం వినియోగదారులు తిరగాల్సిన అవసరం లేదు. -
విద్యుత్ బకాయిలు వసూలు చేయండి
నల్లగొండ :పేరుకు పోతున్న విద్యుత్ బకాయిలను వసూలు చేయాలని టీజీఎస్పీసీడీసీఎల్ డెరైక్టర్లు రఘుమారెడ్డి, శ్రీనివాస్రావు ఆదేశించారు. బుధవారం నల్లగొండలో విద్యుత్ శాఖ వసతి గృహంలో నిర్వహించిన నెలవారీ సమీక్షలో భాగంగా అధికారులు బకాయిల పై ప్రధానంగా చర్చించారు. తెలంగాణ సదరన్ పవర్ సెంట్రల్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ (టీజీఎస్పీసీడీసీఎల్) పరిధిలోని నల్లగొండ, మెదక్, రంగారెడ్డి, మహబూబ్నగర్, హైదరాబాద్ జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీల విద్యుత్ బకాయిలు రూ. 2,510 కోట్ల మేర ఉన్నాయని, వాటిని వసూలు చేయడంలో జిల్లా అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేయడం పట్ల వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బకాయిల మొత్తంలో నల్లగొండ జిల్లా నుంచే రూ. 500 కోట్లు వసూలు చేయాల్సి ఉందని వారు తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం 50 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ అందిస్తుందని, అయితే అంతకు మించి విద్యుత్ వాడుకున్న వారి నుంచి కూడా అధికారులు బిల్లులు వసూలు చేయడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉందని పక్క రాష్ట్రాల నుంచి యూనిట్కు రూ.13ల చొప్పున కొనుగోలు చేసి ప్రజలకు యూనిట్కు రూ.1.50 చొప్పున ఇస్తున్నామన్నారు. మంగళవారం పొరుగు రాష్ట్రాల నుంచి 900 యూనిట్లు కొనుగోలు చేసినట్లు వారు తెలిపారు. శాఖాపరంగా రెవెన్యూ లోటు తీవ్రంగా ఉందని ప్రస్తుతం రూ.45 కోట్లకు మించి ఆదాయం రావట్లేదన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం వచ్చే నెల నుంచి విద్యుత్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా కష్టసాధ్యమవుతుందని డెరైక్టర్లు పేర్కొన్నారు. ఉద్యోగుల పనిగంటలు పెంచి అ హర్నిశలు శ్రమిస్తే తప్ప విద్యుత్ శాఖ కష్టాల నుంచి బయటపడటం సాధ్యంకాదన్నారు. పనితీరు మార్చుకోవాలి. నెలవారీ సమీక్షలు నిర్వహిస్తున్నా ఉద్యోగుల పనితీరులో ఎలాంటి మార్పురావడం లేదని డెరైక్టర్లు విచారం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా లేనట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యుత్ చౌర్యం కేసులు పెంచాలని, గాలివానలు, వర్షాలు వస్తున్నందున ఏఈలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏఈలు స్థానికంగా నివాసం ఉండాలని, ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాలని ఆదేశించారు. స్తంభాలు విరిగిపోవడం, విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అలాంటి పరిస్థితులు ఉన్న చోట చెట్లను తొలగించాలన్నారు. అయితే ఈ సమావేశం జరుగుతున్న సమయంలో రైతు సంఘం నేత రాంరెడ్డి హాల్లోకి ప్రవేశించి అధికారుల పనితీరుపై ఫిర్యాదు చేశారు. సబ్ స్టేషన్ల వద్ద సిబ్బంది మద్యం సేవిస్తున్నారని, దీంతో నాణ్యమైన విద్యుత్ అందడం లేదని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కాంట్రాక్టు ఉద్యోగులను ఆదుకుంటాం.. ఇటీవల తొలగించిన 16 మంది కాంట్రాక్టు ఉద్యోగులను ఆదుకుంటామని డెరైక్టర్లు హామీ ఇచ్చారు. విద్యుత్ శాఖ నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండానే కాంట్రాక్టు ఏజెన్సీలు అభ్యర్థుల నుంచి లక్షలు వసూలు చేసి ఉద్యోగాల్లో నియమించినట్లు డెరైక్టర్లకు ఫిర్యాదు చేశారు. తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేస్తామని ఏజెన్సీలు నమ్మబలికాయని తెలిపారు. అయితే కాంట్రాక్టు ఉద్యోగులు లేకుండా విద్యుత్ సేవలు అందించడం కుదరదు కాబట్టి ఉన్నతాధికారులతో మాట్లాడి వారిని ఆదుకుంటామని డెరైక్టర్లు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ట్రాన్స్కో ఎస్ఈ బాలస్వామి, విజిలెన్స్ ఎస్ఐ సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్మార్ట్గా చెక్
స్మార్ట్ మీటర్ల ప్రయోగంతో సిబ్బంది అక్రమాలకు అడ్డుకట్ట జిల్లా వ్యాప్తంగా విద్యుత్ శాఖ సరికొత్తగా ప్రవేశపెట్టిన స్మార్ట్ మీటర్ల ‘షాక్’కు ఉద్యోగులు హడలెత్తిపోతున్నారు. నెలవారీ మీటర్ రీడింగ్ లెక్కింపులో అక్రమాలకు పాల్పడుతున్న విద్యుత్ సిబ్బందికి స్మార్ట్ మీటర్లు కొరకరాని కొయ్యగా మారాయి. ఈ కొత్త విధానం అమల్లోకి తీసుకురావడం వల్ల విద్యుత్ శాఖ రెవెన్యూ ఒక్క నెలలోనే రూ.40 లక్షలకు పెరిగిందంటే ఆశ్చర్యం కలగక మానదు. దీనిని బట్టి గమనిస్తే విద్యుత్ సిబ్బంది మీటర్ రీడింగ్ సమయంలో వినియోగదారులతో ఏ స్థాయిలో లాలూచీ పడుతున్నారో ఇట్టే తెలిసిపోతుంది. నల్లగొండ, న్యూస్లైన్, జిల్లాలో గృహ, వ్యవసాయం, పరిశ్రమలకు కలిపి మొత్తం 5 లక్షల 40 వేల విద్యుత్ కనెక్షన్లున్నాయి. అయితే స్మార్ట్ మీటర్లు మాత్రం విద్యుత్ కనెక్షన్లు ఎక్కువగా ఉన్న మండల, పట్టణ కేంద్రాల్లోనే అమరస్తున్నారు. ఇప్పటి వరకు 2.33 లక్షల స్మార్ట్ మీటర్లు గృహాలకు అమర్చారు. దీంట్లో 1.72 లక్షల మీటర్ల నుంచి ఐఆర్ పోర్టు (ఇన్ఫ్రా పోర్టు రీడింగ్) మిషన్ ద్వారా మీటర్ రీడింగ్ నమోదు చేస్తున్నారు. అన్ని కేటగిరీల్లో కలుపుకుని నెలవారీ బిల్లుల వసూళ్లు రూ.36 కోట్లు ఉండగా..ఐఆర్ పోర్టు మిషన్ల ద్వారానే నెలకు రూ. పది కోట్ల వరకు బిల్లులు నమోదు చేస్తున్నారు. అంటే విద్యుత్ శాఖ నెలవారీ రెవెన్యూలో పది శాతం ఐఆర్ పోర్టు విధానం ద్వారానే వసూలవుతోంది. పెరిగిన ఆదాయం.. స్మార్ట్ మీటర్ల విధానాన్ని ఆరు మాసాల క్రితమే ప్రవేశపెట్టారు. కానీ సీఎండీ రిజ్వీ బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఈ విధానం అత్యంత పకడ్బందీగా అమలవుతోంది. మూడు మాసాల నుంచి పట్టణ, మండల కేంద్రాల్లో గృహాలకు స్మార్ట్ మీటర్లు అమర్చడం మొదలుపెట్టారు. ఇప్పటి వరకు ఈ మీటర్లు అమర్చి ఐఆర్పోర్టు మిషన్ల సహాయంతో మీటర్ రీడింగ్ నమోదు చేయడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని పరిశీలిస్తే.. ఏప్రిల్లో విద్యుత్ శాఖకు రూ.75 లక్షల 27వేల రాబడి వస్తే...మే నెలకు వచ్చే సరికి అది కాస్తా రూ.కోటి 16 లక్షలకు పెరిగింది. నెల వ్యవధిలో విద్యుత్ శాఖ రాబడి రూ.40 లక్షల 73 వేలకు పెరిగిందన్నమాట. ఈ విధానాన్ని అమలు చేయడంలో హుజూర్నగర్ డివిజన్ ప్రథమ స్థానంలో ఉండగా, భువనగిరి, దేవరకొండ డివిజన్లు చివరి స్థానంలో ఉన్నాయి. హుజూర్నగర్ డివిజన్లో ఒక నెలలో రూ.12.58 లక్షల ఆదాయం పెరిగింది. దేవరకొండలో రూ.2.37 లక్షలు, భువనగిరిలో రూ.3.16లక్షల ఆదాయం మాత్రమే వచ్చింది. ఈ డివిజన్లలో స్మార్ట్ మీటర్ల అమర్చే కార్యక్రమం నత్తనడకన సాగుతోంది. దీనిపై అధికారులు పలు సమీక్షల్లో హెచ్చరించినా మార్పు కనబడటం లేదు. అక్రమాలకు తెర గతంలో విద్యుత్ శాఖ వినియోగించిన మెకానిక్ మీటర్లు సిబ్బందికి కాసులు కురిపించాయి. ఈ మీటర్ల సహాయంతో మీటర్ రీడింగ్కు వెళ్లినప్పుడు సిబ్బంది, వినియోగదారులతో లాలూచీ పడి యూనిట్ల సంఖ్యను తక్కువగా నమోదు చేయడం జరిగేది. ఉదాహరణకు ఒక సర్వీసులో 200 యూనిట్లు విద్యుత్ వినియోగిస్తే..దానిని 199 యూనిట్లుగా నమోదు చేస్తూ అక్రమాలకు పాల్పడిన సంఘటనలు విద్యుత్ శాఖ దృష్టికి వెళ్లాయి. దీనివల్ల నెలవారీ బిల్లుల్లో లక్షల రూపాయల సొమ్ము సిబ్బంది జేబుల్లోకి వెళుతున్నట్లు విద్యుత్ అధికారుల నిఘాలో వెల్లడైంది. దీనికి అడ్డుక ట్ట వేసేందుకు స్మార్ట్ మీటర్లు, ఐఆర్ పోర్ట్ విధానాన్ని తెరమీదకు తెచ్చారు. కలిసొస్తున్న సమయం.. అక్రమాలు నియంత్రించడంతో పాటు విద్యుత్ సిబ్బందికి సమయం కూడా కలిసొస్తుంది. గతంలో మీటర్లో నమోదైన రీడింగ్ను సిబ్బంది తమ చేతి సహాయంతో మెకానిక్ మీటర్లపై నమోదు చేయడం జరిగేది. కానీ ప్రస్తుతం అలా కాకుండా ఐఆర్ పోర్టు మిషన్లు మీటరు ఎదుట పెడితే దానంతట అదే మీటర్ రీడింగ్ నమోదు చేస్తుంది. దీంతో గతంలో విద్యుత్ శాఖ షెడ్యూల్ ప్రకారం బిల్లులు ప్రతి నెల నమోదు చేస్తున్న 16,17 తేదీల నుంచి ప్రస్తుతం 13,14 తేదీలలోపే బిల్లింగ్ ప్రక్రియ ముగుస్తుంది. -
ప్రకాశంను ప్రగతి పథాన నడిపిద్దాం
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్లైన్: ప్రకాశం జిల్లాను ప్రగతిపథంలో నడిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందించి రాష్ట్రంలోనే జిల్లాను అగ్రగామిగా నిలపాలని అధికారులకు ఉద్బోధించారు. 65వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్లో అధికారులు, ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. అంతకు ముందుగా జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరించారు. 6588 ఎకరాల భూమి పంపిణీ: జిల్లాలో ఏడో విడత భూ పంపిణీ కింద 4400 కుటుంబాలకు 6588 ఎకరాల భూమిని పంపిణీ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. మరో 1364 కుటుంబాలకు 1028 ఎకరాల భూమిని పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఖరీఫ్, రబీ సీజన్లలో 6 లక్షల 69 వేల 972 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికిగాను ఇప్పటి వరకు 6 లక్షల 66 వేల 516 హెక్టార్లలో సాగైనట్లు తెలిపారు. గత ఏడాది అక్టోబర్లో కురిసిన భారీ వర్షాలకు 25,642 హెక్టార్లలో వివిధ రకాల పంటలకు నష్టం జరిగిందని, 25.14 కోట్ల రూపాయల నష్టపరిహారం కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. జిల్లాలో రూ 206 కోట్లతో 2.6 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటివరకు రూ30.50 కోట్లతో 68,427 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించినట్లు తెలిపారు. జిల్లాలో 6 లక్షల 15 వేల 330 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రకాశం అక్షర విజయం కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. 17,424 మందికి రూ 450.39 కోట్ల రుణాలు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇందిరా క్రాంతి పథం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 24,476 గ్రూపులకు రూ 604.30 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు 17,424 మందికి రూ450.39 కోట్ల రుణాలు అందించినట్లు కలెక్టర్ వివరించారు. ఇందిరా క్రాంతి పథం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 40,459 మందికి రూ41.7 కోట్ల వడ్డీలేని రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు 39,750 మందికి రూ41.25 కోట్ల రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. డీఆర్డీఏ ద్వారా స్త్రీ నిధి కింద 2 లక్షల 89 వేల 260 మందికి రూ 106.99 కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు లక్షా 43 వేల 179 మందికి రూ 70.98 కోట్లు అందించినట్లు చెప్పారు. వ్యవసాయశాఖ ద్వారా వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద 1055 మందికి రూ 1.49 కోట్ల విలువైన పరికరాలు ఇచ్చినట్లు తెలిపారు. 7556 పంపుసెట్లకు విద్యుత్ సౌకర్యం: విద్యుత్ శాఖ ద్వారా జిల్లాలో 16343 పంపుసెట్లకు రూ 81.72 కోట్ల విలువైన విద్యుత్ సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు 7556 పంపుసెట్లకు రూ37.78 కోట్ల విలువైన విద్యుత్ సౌకర్యం కల్పించినట్లు కలెక్టర్ వెల్లడించారు. 157.79 కోట్లతో 50 విద్యుత్ ఉప కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు రూ53.31 కోట్లతో 24 సబ్స్టేషన్లు నిర్మించినట్లు తెలిపారు. గృహనిర్మాణ శాఖ ద్వారా 23,132 ఇళ్లను రూ183.47 కోట్లతో నిర్మించాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు రూ70.41 కోట్లతో 8710 గృహాలు నిర్మించినట్లు తెలిపారు. వివిధ రకాల సహకార సంస్థల ద్వారా 24, 512 మందికి రూ 72.67 కోట్లు అందించాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు 6,125 మందికి రూ 7.08 కోట్లు అందించినట్లు చెప్పారు. వివిధ సంక్షేమ శాఖల ద్వారా 6లక్షల 21 వేల 153 మందికి 728 కోట్లు ఉపకార వేతనాలు, తదితరాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు 2 లక్షల 85 వేల 135 మందికి రూ270.65 కోట్లు అందించినట్లు వివరించారు. రూ257.14 కోట్లతో 887 కిలోమీటర్ల రోడ్లు: రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో రూ257.14 కోట్లతో 887 కిలోమీటర్ల మేర 122 రోడ్డు పనులు చేపట్టాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు రూ132.31 కోట్లతో 79 పనులు చేపట్టినట్లు కలెక్టర్ వెల్లడించారు. రూ56.71 కోట్లతో 24 భవనాలు, వంతెనలు నిర్మించాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు రూ15.80 కోట్లతో 7 భవనాలు నిర్మించినట్లు చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 504 కిలోమీటర్లను 259.67 కోట్లతో 939 పనులు చేపట్టాలని నిర్ణయించగా ఇప్పటి వరకు రూ79.43 కోట్ల విలువైన 159 పనులు చేపట్టారన్నారు. రూ 56.90 కోట్లతో 458 భవనాలు నిర్మించాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు రూ15.86 కోట్లతో 111 భవనాలు నిర్మించినట్లు వివరించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ49.70 కోట్లతో 413 పనులు చేపట్టాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు రూ15.86 కోట్లతో 111 పనులు చేసినట్లు వివరించారు. గ్రామీణ నీటిపారుదల శాఖ ద్వారా రూ541.49 కోట్లతో 3039 పనులు చేపట్టాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు రూ166.05 కోట్ల విలువైన 2201 పనులు చేపట్టారన్నారు. తాగునీరు, పారిశుధ్యంకు సంబంధించి రూ8.06 కోట్లతో 2022 పనులు చేపట్టాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు రూ4.90 కోట్లతో 1675 పనులు చేసినట్లు కలెక్టర్ వివరించారు. రూ 949.22 కోట్లతో నీటిపారుదల ప్రాజెక్టులు జిల్లాలో నీటిపారుదల శాఖ ద్వారా రూ949.22 కోట్లతో 28 పనులు చేయాలని నిర్ణయించగా, రూ487.21 కోట్లతో 28 పనులు పూర్తిచేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఇందులో నాగార్జునసాగర్ కాలువలు, మధ్యతరహా ప్రాజెక్టుల ఆధునికీకరణకు రూ 476.22 కోట్లు కేటాయించగా, ఇప్పటి వరకు రూ313.71 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు రూ 473 కోట్లతో చేపట్టాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు రూ173 కోట్ల విలువైన పనులు జరిగినట్లు తెలిపారు. పట్టణాభివృద్ధికి రూ39.18 కోట్ల విలువైన 459 పనులు చేపట్టాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు రూ 13.10 కోట్లతో 149 పనులు పూర్తి చేసినట్లు కలెక్టర్ విజయకుమార్ వివరించారు. కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎస్పీ ప్రమోద్కుమార్, జిల్లా జడ్జి రాధాకృష్ణ, జాయింట్ కలెక్టర్ యాకూబ్నాయక్, జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాద ఘంటికలు
సాక్షి, గుంటూరు: చేతికందే ఎత్తులో వేలాడుతున్న విద్యుత్తు తీగలు.. ఒరిగిపోయి ఎప్పుడు కూలతాయో తెలియని స్తంభాలు.. రక్షణ లేని ట్రాన్సఫార్మర్లు.. తెరచి ఉన్న ఫ్యూజు బాక్సులు..జిల్లాలో ఏ మూల చూసినా ఇవే దృశ్యాలు. విద్యుత్శాఖ నిర్లక్ష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. వినియోగదారుల నుంచి ముక్కు పిండి బిల్లులు వసూలు చేసే అధికారులు తదనుగుణమైన సేవలు అందించడంలో పూర్తి నిర్లక్ష్యం కనబరుస్తున్నారు. చిన్నపాటి మరమ్మతులు చే సి సకాలంలో సమస్య పరిష్కరించే వీలున్నా.. సిబ్బంది ఆదిశగా ప్రయత్నం చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మంగళగిరి మండలం కాజలో కిందకు వేలాడుతున్న విద్యుత్తు తీగలను తప్పించబోయి ఇటీవల నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన విద్యుత్శాఖ నిర్లక్ష్యాన్ని కళ్లకు కట్టినా అధికారుల వైఖరిలో మాత్రం మార్పు రాలేదు. కొత్తగా ఏర్పాటు చేసే స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నాణ్యత లేవని విజిలెన్స్ విభాగం నిర్ధరించి నివేదికలిస్తూనే ఉంది. గతంలో ట్రాన్స్ఫార్మర్లు దిమ్మెలపై ఉంచి తక్కువ ఎత్తులో ఉంచారు. రోడ్ల అభివృద్ధిలో ట్రాన్స్ఫార్మర్ల దిమ్మెలు కింద వరకు ఉండటంతో వీటి వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పర్యవేక్షణ లేకే ప్రమాదాలు.. జిల్లాలో విద్యుత్తు బిల్లుల రూపేణా నెలకు రూ.169 కోట్ల డిమాండ్ ఉండగా రూ.165 కోట్ల వరకు వసూలు చేస్తున్నారు. కరెంటు బిల్లుల వసూలుపై చూపిస్తున్న శ్రద్ధ సేవలు అందించడంలో మాత్రం కనబర్చడం లేదు. జిల్లాలో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు 30,058 ఉంటే పది వేల ట్రాన్స్ఫార్మర్లకు అసలు కంచెలే లేవు. 11 కేవీ ఫీడర్లు 584 ఉంటే, వీటిలో ఎక్కువ భాగం నిత్యం మరమ్మతులకు గురవుతున్నాయి. ఫ్యూజు బాక్సులు తెరచి ప్రమాదకరంగా ఉన్నాయి. కార్యాలయాల్లో బాక్సులు ఖాళీగా ఉన్నా వాటిని బిగించేందుకు సిబ్బంది చొరవ చూపడం లేదు. పనుల్ని కాంట్రాక్టర్లకు అప్పగించడం, వాటిపై పర్యవేక్షణ లేకపోవడం వల్లే అధిక శాతం ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గుంటూరు నగరంతో పాటు, జిల్లాలోని మునిసిపాలిటీల్లో విద్యుత్తు సేవలు అథమంగా ఉన్నాయి. -
జనావాసాల్లో మృత్యువు
కర్నూలు(రాజ్విహార్), న్యూస్లైన్: విద్యుత్ శాఖ నిర్లక్ష్యం ప్రజలకు శాపమవుతోంది. ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ గోడ నిర్మాణంలో ఆ శాఖ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ప్రజలు వృుత్యువుతో సహజీవనం చేస్తున్నారు. అక్కడ.. ఇక్కడ అనే తేడా లేకుండా.. పాఠశాలలు, ప్రధాన రహదారుల్లో వెలసిన ట్రాన్స్ఫార్మర్లు ఎప్పుడు ప్రమాదానికి కారణమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ బాధ్యతను విద్యుత్ అధికారులు పూర్తిగా విస్మరించడం విమర్శలకు తావిస్తోంది. ఇందుకోసం గత 15 సంవత్సరాలుగా పైసా నిధులు విడుదల చేయకపోవడం గమనార్హం. ప్రమాదాలు చోటు చేసుకున్న సమయంలో హడావుడి చేయడం.. ఆ తర్వాత విస్మరించడం వీరికే చెల్లింది. కనీసం ఆరు అడుగుల ఎత్తులో దిమ్మె కట్టి దానిపై ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలనే నిబంధన చాలా ప్రాంతాల్లో అమలుకు నోచుకోలేదు. ఇక చుట్టూ రక్షణ గోడ నిర్మించాల్సిన బాధ్యత విద్యుత్ శాఖదే అయినా ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఒక్కో ట్రాన్స్ఫార్మర్కు పటిష్ట ఫెన్సింగ్ ఏర్పాటుకు రూ.20వేలు ఖర్చవుతుందని అంచనా. 15 సంవత్సరాల క్రితం వరకు రెన్యువేషన్ అండ్ మోడ్రనైజేషన్ స్కీం పేరిట ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ కల్పించినా.. ఆ తర్వాత నుంచి నిధుల విడుదల నిలిచిపోయింది. వినియోగదారుల భద్రత తమ పరిధిలోని అంశం కాదనే భావన ఆ శాఖ అధికారుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఫలితంగా ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కనీసం రద్దీ ప్రాంతాల్లోని ట్రాన్స్ఫార్మర్లకు సైతం కంచె ఏర్పాటుకు ముందుకు రాకపోవడం ప్రజల రక్షణ పట్ల ఆ శాఖ చిత్తశుద్ధికి నిదర్శనం. జిల్లాలోని 37,927 ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ గోడుల నిర్మాణానికి రూ.75.40 కోట్ల నిధులు అవసరం కాగా.. పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఆదోని పట్టణంలోని మున్సిపల్ రోడ్డు, పెద్ద మసీదు ప్రాంతాలు నిత్యం ప్రజలతో రద్దీగా ఉంటాయి. ఈ ప్రాంతాల్లో రోడ్డు పక్కగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ల సమీపంలో చాలా మంది వ్యాపారులు నిర్వహిస్తున్నారు. వీటిని కొనుగోలు చేసే సమయంలో ప్రజలు ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా.. ట్రాన్స్ఫార్మర్కు బలికాక తప్పదనే విషయం అధికారులకు తెలియనిది కాదు. అయితే కొన్నేళ్లుగా అక్కడ రక్షణ చర్యలు చేపట్టిన పాపాన పోవడం లేదు. ఆళ్లగడ్డలో ఎస్సీ హాస్టల్ ముందున్న ట్రాన్స్ఫార్మర్తో విద్యార్థులతో పాటు ప్రయాణికులకు ప్రమాదం పొంచి ఉంది. చాగలమర్రిలోని మహర్షి పాఠశాల రహదారిలో ఇళ్ల మధ్య ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ తక్కువ ఎత్తులో ఉండటంతో కాలనీవాసుల దినదిన గండంగా జీవనం సాగిస్తున్నారు. ఆస్పరి మండలంలోని వెంగళాయిదొడ్డి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల వద్ద పిల్లలను సంచరించే ప్రాంతంలోని ట్రాన్స్ఫార్మర్ ఎప్పుడు తమను విషాదంలోకి నెడుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చిప్పగిరిలో రెండేళ్ల నుంచి ట్రాన్స్ఫార్మర్కు రక్షణ గోడ నిర్మించాలని స్థానికులు కోరుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ఆత్మకూరులో ఐదేళ్ల క్రితం విజయవాడ నుంచి కర్నూలుకు వెళ్తున్న ఓ లారీ రోడ్డుపక్కనున్న ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టినా.. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తుగ్గలి మండలంలోని మారెళ్ల గ్రామంలో గత ఏడాది ప్రమాదవశాత్తు ఓ బాలుడు ట్రాన్స్ఫార్మర్ను తగిలి వృుత్యువాతపడ్డాడు. ఈ పరిస్థితుల్లో కూడా అధికారులు మేల్కొనకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.