ఏపీవాసులకు అలర్ట్‌.. మరో మూడు రోజలు భారీ వర్షాలు | Heavy Rains In Next Three Days In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీవాసులకు అలర్ట్‌.. మరో మూడు రోజలు భారీ వర్షాలు

Published Thu, Aug 8 2024 10:59 AM | Last Updated on Thu, Aug 8 2024 11:41 AM

Heavy Rains In Next Three Days In Andhra Pradesh

సాక్షి, ఏలూరు జిల్లా: కుక్కనూరు, వేలేరుపాడు మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉధృతంగా వాగులు, వంకలు ప్రవహిస్తున్నాయి. గుండేటి వాగు ఉధృతితో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలవరం ప్రాజెక్ట్‌ వద్ద గోదావరి నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. స్పిల్‌వే ఎగువ నీటిమట్టం 31.315, దిగువ నీటిమట్టం 22.47 మీటర్లు. 48 గేట్ల ద్వారా 7,20,875 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.

చింతలపూడి మండలం నాగిరెడ్డి గూడెం తమ్మిలేరు రిజర్వాయర్‌లోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. రిజర్వాయర్ పూర్తి నీటి మట్టం 355 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం తమ్మిలేరు బేసిన్ 349.49 అడుగులుగా కొనసాగుతోంది. గోనెల వాగు బేసిన్ 349.23 అడుగులు కాగా, పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 3 టీఎంసీలు..  ప్రస్తుత నీటి నిల్వ 2.014 టీఎంసీలు. కాచ్ మెంట్ ఏరియాలో ఎగువ నుంచి వరదనీరు చేరుతోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తమ్మిలేరు ప్రవాహ ప్రాంతంలో గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

రాయలసీమ, తమిళనాడు పరిసరాలపై ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాలపై విస్తరించి ఉన్న మరో ద్రోణి వచ్చే 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ఏర్పడినా దాని ప్రభావం ఒడిశాపైనే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

కానీ రాయలసీమపై ఉన్న ద్రోణి ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, బుధవారం గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, పార్వతీపురం మన్యం, కర్నూలు, నంద్యాల తదితర జిల్లాల్లో ఎడతెగని వర్షాలు కురిశాయి.

భారీ వర్షాలకు రాజధాని అమరావతి ప్రాంతం జలమయమైంది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకూ తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో 9.7 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లా చేబ్రోలులో 9.3 సెంటీమీటర్లు, నంద్యాల జిల్లా డోన్‌లో 8.8, శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి, పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలో 8.4, చిత్తూరు జిల్లా వెంకటగిరి కోటలో 8.3 సెంటీమీటర్లు, విజయవాడలో 7.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement